31, డిసెంబర్ 2022, శనివారం

కథలపోటీలో సంపుటాలు

1. 2001లో భార్గవి రావు నూరు మంది రచయిత్రులకథలతో నూరేళ్ళపంటవేసేటప్పుడు కొంత కష్టపడవలసి వచ్చింది. 2.ఆరోజుల్లో రచయిత్రులు రచయితలకు తీసిపోకుండా కథాంశాలు ఎన్నుకొని రాసినవారు ఉండేవారు. 3.ఇటీవల సమాజం లోని లోతులకు వెళ్ళి పాఠకులు ఊహించలేని కొత్త కొత్త అంశాలను తీసుకుని కథలు రాస్తున్నారు. 4.రచయిత్రుల సంఖ్య కూడా బాగా పెరిగింది ఇప్పుడు సంకలనం చేయాలంటే సులభంగా రెండు వందలకు పైగా మంచి రచయిత్రుల కథలను సంకలనం చేసేయవచ్చు. 5.దానికి ఉదాహరణే శాంతినారాయణ గారి పురస్కార ప్రకటనకు వచ్చిన పుస్తకాలు.అరవైనాలుగు పుస్తకాల్లో పాతతరం రచయిత్రులు అతి తక్కువ మంది.ఇంతమంది గత పదిపదిహేనుఏళ్ళుగా రాస్తున్న వారే అధికం అది సంతోషించ వలసిన విషయం. కథలురాయాలంటే కథలవర్కషాపు పెట్టి నేర్పించనక్కరలేదు.పుట్టినదగ్గరనుంచి ఎదుర్కొన్న అనుభవాలూ,అవమానాలూ మూలాలు మర్చిపోని వాళ్ళ కథని రాసేలా చేస్తుంది. 6. పంపిన పుస్తకాలు చదివి ఏపుస్తకాన్ని ఎంపిక చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది.కథాంశం,భాషా, రచనా విధానం, ముగింపు వీటిని పరిగణలోనికి తీసుకుని పదేపదే చదవాల్సివచ్చింది. 7.పురస్కారం అందుకున్నఎండపల్లి భారతి శ్రామిక మహిళల దృష్టికోణం నుంచి బలంగా రాసిన కథలు. ఈ కథలు బతుకీత లో మునుగీతలు కొడుతున్నవాళ్ళు తప్ప ఒడ్డును కూర్చున్న వాళ్ళు రాయలేని కథలు. భారతి కథలు ఉత్తమ పురుష లోనే రాసిన కథలు కావటాన ఆమెనడిచే ముళ్ళదారుల్లోకి మనల్ని చెయ్యిపట్టుకొని కథ వెంట లాక్కెళ్ళతుంది .ఆ తర్వాత చెయ్యి వదిలినా,పుస్తకం మూసినా ఆ దుఃఖాలు మనల్ని వదలవు. 8.పల్లె జీవితంలో మమేకమయి పోయి వాటినే తన కథా నేపథ్యాలుగా మన ముందుకు తెచ్చింది. కథలన్నీ చిత్తూరు యాసలో సాగుతూ మన ముందు కొత్త జీవితాలను పరిచయం చేస్తాయి. ఏ కథకు తగ్గట్టు ఆయా పాత్రల్ని చిత్రించటం పుస్తకంలో మరో ప్రత్యేక ఆకర్షణ. వాస్తవ జీవితానికి దగ్గరగా ఉన్న కథ చదివగానే జీవమున్న కథఅని అనుకోవడమే కాక మనల్ని వెంటాడుతాయి అలాంటి కథలు ఒకేసారి చదివితే అవే ఎండ్లపల్లి భారతి ఎదురీత కథలు. 9.పద్దం అనసూయ చప్పుడు కథలన్నీ కోయ జీవితాన్ని ఆవిష్కరించినవే. అందులోనూ మృత్యువు నేపథ్యంలోనివి. మృత్యువు నేపథ్యంలోనే సాగిన ఈ కథలు చదువుతుంటే కోయ జీవితం అడవి నుంచి దూరమై ఆధునిక పోకడలకు బలైపోయిన అస్థిత్వాన్ని కోల్పోతున్న సందర్భాన్ని తెలిపే ఈ నాలుగు కథలు సంస్కృతి, ఆచారాలు, పధ్ధతులు కనుమరుగైపోతున్న తీరుకు రచయిత్రి ఘర్షణ పడుతుందో అనిపిస్తుంది. ఓకే అంశాన్ని నాలుగు దృక్కోణంలో రాసిన ఈ నాలుగు కథల్లో కోయల ఆత్మ మనకు దర్శనమిస్తుంది. అందులోనూ స్త్రీహృదయం తో చెప్పిన కథలు.

నేనున్నాను కనకే

~~ నేనున్నాను కనుకే..." “ఏమిటి కరుణా మరీ అంత బేలగా ఐపో తున్నావు? పిల్లలన్నాకా ఏదో ఒకటి వస్తునే వుంటాయి కంగారు పడకు నేను అరగంటలో బయలుదేరి వస్తున్నాను” అంటూ ఫోన్ పెట్టేసింది రాధ . గబగబా వంట పూర్తిచేసి టిఫిన్ ,కూరా అన్నం కారియర్ లో సర్ది తయారై పోయింది .బీరువాలోంచి కొంత డబ్బు తీసి పర్స్ లో పెట్టుకొని ఆఫీసుకి లీవ్ లెటర్ రాసి భర్త రఘు కి ఇచ్చి అతను వెళ్ళేటప్పుడు దార్లో మా ఆఫీస్ లో ఇచ్చేయమని చెప్పి హడావుడి గా బయలుదేరింది . కరుణావాళ్ళు.రాధా వాళ్ళు చిన్నప్పటినుండీ ఇరుగు పొరుగునే వుండే వాళ్ళు. ఇద్దరు బాల్య స్నేహితులు పెళ్ళిళ్ళు అయ్యేక కూడా ఒకే వూర్లో వుండటంతో వారి స్నేహానికి ఆటంకాలు రాలేదు. కరుణకి ఇద్దరు పిల్లలు పుట్టాక,అన్యోన్యంగా పచ్చగా వుండే ఆమె జీవితం అనుకోని సంఘటనతో చిన్నాభిన్నం అయ్యింది .ఆమె భర్త రోడ్డు ప్రమాదం లొ చనిపోయాడు .అతను పని చేసే ఆఫీస్ లోనే ఆమెకు వుద్యోగం ఇచ్చారు.ఆమె భర్త నా అనే వాళ్ళు లేని అనాధ. కరుణకి దారి తోచలేదు.పిల్లలిని ఒంటరిగా ఎలాపెంచాలి అనే దిగులు తో కృశించి పోతున్న ఆమె గుండెలో జీవం నింపి మామూలు మనిషిని చేయటానికి చాలా ప్రయత్నమే చేయాల్సి వచ్చింది.అంతవరకు ఆసరాగా వుండే కరుణ తల్లిదండ్రులు కూడా కొంతకాలం క్రితమే ఏడాది తేడాతో చనిపోయారు వున్న ఒక్క అన్నా ఎక్కడ ఈమె భారం తనపై పడుతుందో అని అంటి ముట్టనట్లు గానే వుంటాడు . కరుణకు అండగా వుండేదల్లా స్నేహితులే. ఆటోవాడికి దారిగుర్తులు చెప్తూనే కరుణజీవితం గూర్చి ఆలోచిస్తు వచ్చింది రాధ .గుమ్మంకి దగ్గర గానే బాబుని ఒళ్ళో వేసుకుని కన్నీళ్ళతో కూర్చుని వుంది కరుణ.పాప దిగులుగా తల్లికి చేరబడి కూర్చుని వుంది.రాధకి ఆ దృశ్యం చూసేసరికి గుండెకరిగి నీరై నట్లైంది. ఆటోని కాసేపు ఆగమని చెప్పి బాబీని రాధ ఎత్తుకుని కరుణని చీర మార్చుకొని బయల్దేరమంది.పాపకి గౌను మార్చి ఫ్లాస్క్ లో పాలునింపి బయల్దేరింది కరుణ. రాత్రి నుండీ జ్వరం వాంతులతో తోటకూరకాడలా వేలాడి పోతున్నాడు బాబు. హాస్పటల్ కి వెళ్ళగానే తొందరగానే చేర్చుకుని సెలైన్ బాటెల్ అమర్చారు.సెలైన్ లొనే మందు కూడా చేర్చి ఎక్కించటం మొదలెట్టడం తో వాంతులు క్రమంగా తగ్గినా టెంపరేచర్ మాత్రం ఎక్కువగానే వుంది. రాధ తను తెచ్చిన టిఫిన్ పాపకి తినిపించి కరుణని కూడా తినమంది.అంత సేపూ బాబు దగ్గర రాధ కూర్చొని వార్డ్ ని అంతా కలయ చూసింది.అది పిల్లల హాస్పటల్ కాక పోవటంతో అన్ని బెడ్లూ పూర్తిగా నిండి .చిన్నపిల్లలు దగ్గరనుండి అన్నివయసుల వాళ్ళూ వున్నారు. బాబు ముఖాన్ని ఒంటిని మధ్యమధ్య తడిబట్ట తో తుడుస్తూ దగ్గరకూర్చుంది కరుణ.పాపని తీసుకొని బైట వరండాలోకి నడచి అక్కడ కుర్చీలుంటే కూర్చొని పాపతో కబుర్లు చెబుతూ వుంది రాధ. వార్డ్ లోంచి బైటకి వచ్చిన ఒకామె పక్కనే కూర్చొని రాధతో మాట కలిపింది. ఆమె భర్త కి కామెర్లు తిరగబెట్టటం తో ఆస్పత్రిలో చేర్చారట.ఆవిడకి స్కూల్లో చదువుతోన్న ఇద్దరు ఆడపిల్లలు వున్నారట.భర్త ప్రైవేటు కంపెనీలో వుద్యోగం చేస్తాడట.ఆవిడ విషయాలన్నీ అడగకుండానే ఏకరువు పెట్టిన తర్వాత “బాబుకి ఏమైంది దగ్గరనుండి అన్ని కూపీ లాగటానికి మొదలెట్టింది. కొంతమంది అనవసర విషయాలతో అతి చనువు తీసుకుని చొచ్చుకు పోవాలని చూస్తారు రాధ ముక్తసరిగా మాట్లాడు తోన్నా ఆవిడ ఒదలటం లేదు. రాధ సరిగా మాట్లాడక పోయేసరికి పాపని ముద్దులాడి ‘నాన్న ఆఫీస్ కి పోయాడా . పాపా ‘ అంది దానికి పాప అమాయకంగా ”నాన్ననాకు లేడుగా” అంది.. రాధ ఆప బోయే లోగానే కరుణకి భర్త లేడని తెలియగానే “నేను ముందే అనుకున్నానులే ఈ రోజుల్లో మొగుడు పోయినా టింగురంగడిలా అలంకరించుకుని వుద్యోగాలంటూ వూరేగుతున్నారు…..” అంది. ఇంకా ఏదేదో అనేదే రాధ ఆమెని కాల్చేసేలా కోపం గా చూసి అక్కడనుండి పాపని తీసుకుని లేచేసరికి ఆపేసింది. 'కరుణ ని రోజంతా సతాయించేలా వుందే ఈవిడ ‘అనుకుంది రాధ . ఏదో మాటకిమాట అనేయడం సులువే కానీ హాస్పటల్ వాతావరణంలో అలాంటి వాళ్ళతో వాగ్వివాదం అనవసరం సాయంత్రం వరకూ కరుణతోనే వుండి కావలసినవేవో కొని తీసుకొచ్చి మర్నాడు వుదయమే వస్తానని ధైర్యం చెప్పి పాపని తీసుకొని ఇంటికి వచ్చేసింది రాధ . ఒక రెండు రోజులకి గాని టెంపరేచర్ నార్మల్ కు రాలేదు.పగలు రాధ కూడా కరుణకు సాయంగా వుంది. బాబు అనారోగ్యం ఒక వంతైతే కరుణకి రెండు బెడ్ల అవతల వున్న ఆమె మరొక బాధగా అయిందట. కరుణ కళ్ళనీళ్ళు పెట్టుకుని చెప్పింది. వుదయం లేస్తునే కరుణ ముఖం చూడాల్సి వస్తుందని భర్తతో రెండో వైపు ముఖం పెట్టుకోమని దేవుడి ముఖం చూడమని అతని పక్కని దేవుడిపటం ఒకటి పెట్టి పెద్ద గొంతుతో చెప్పిందట. ఆవిడ పోనీ భర్తతో ప్రేమగా వ్యవహరిస్తుందా అంటే అదీ లేదు.జబ్బుతో వున్న మనిషని చూడకుండా ఏదో ఒకటి సాధిస్తున్నట్లే మాట్లాడుతోంది.వార్డునంతటిని న్యూసెన్స్ చేసి పెడ్తోందట .విసుక్కుంటూచెప్పింది కరుణ. రాధ తప్పించుకు తిరుగుతోన్నా ఒక్కొక్కప్పుడు ఆవిడకి దొరికి పోక తప్పలేదు. ఒకసారి మాటలలో “పసుపు కుంకుమాలకి దూరమై బతికే కన్నా చావటం మేలు” అంది. రాధ ఆమెని జాలిగా చూసింది. ఆమెకి నరనరాన్నా స్లో పొయిజన్లా చిన్నప్పటినుండీ సౌభాగ్యవ్రతాలు ప్రవహించి ప్రవహించి శరీరమంతటా, ఆలోచన్లనిండా వ్యాప్తి చెందాయేమో .ఆమె నిజానికి భర్తకన్నా ముత్తైదువుగా వుండటాన్నే ప్రేమిస్తుందేమో. అసలు నిజానికి ఏమైనా సైకిక్ ప్రొబ్లెం వుందేమో అని రాధ మనసులో ఏమూలో సంశయం మొలకెత్తింది. మూడో రోజు బాబుకి టెంపరేచర్ పూర్తిగా తగ్గిందని ఇంటికి పంపించారు. కరుణ ముఖం బెంగతీరి తేట గా ఐంది ఓ రెండు వారాలు పోయాక ఒక శనివారం ఫోన్ చేసింది రాధకి కరుణ. “నా గురించి నాలుగు రోజులు ఆఫీస్ కి సెలవు పెట్టి మరీ శ్రమ తీసుకున్నావు.రేపు మీరుఇద్దరూ మా యింటికి భోజనానికి రండి .అంతకన్నా నీరుణం తీర్చటానికి ఇంకేమీ మీకు చేయాలేను.’ అంది “ఇప్పుడవన్నీఎందుకు "అన్న రాధ మాటలకు కరుణ ఒప్పుకోక పోయేసరికి ‘ సరేనంటు ‘అంగీకరించింది. "నువ్వు వెళ్తే ఉదయమే వెళ్ళు మీరిద్దరూ కబుర్లకు దిగితే నాకు తోచదు.నేను భోజనం సమయానికి వస్తాలే ” అన్నాడు రఘు. మర్నాడు ఉదయమే టిఫిన్ చేసి రఘుని పన్నెండింటికి రమ్మని చెప్పి రాధ కరుణావాళ్ళ యింటికి బయలు దేరింది . ముందు గది లో ఆడుకుంటున్న పిల్లలికి రాధ తను తెచ్చిన మిఠాయిలు పళ్ళు ఇచ్చి పలకరించి లోపలికి నడిచింది. కరుణ ఎదురై పలకరించింది కాని ఆ నవ్వులో జీవం లేదు. “ఏమిటోయ్ అలా వున్నావు.ఒంట్లో బాగు లేదా ఇటువంటప్పుడు ఈ భోజనాలవీ పెట్టుకోక పోతే ఏవైంది “ఆతృత గా అడిగింది రాధ కరుణ జీవం లేని నవ్వు నవ్వి పక్కనే టేబుల్ మీది వార్తా పత్రిక తీసి చూపించింది . “భర్త మరణానికి తట్టుకోలేక ప్రాణత్యాగం చేసిన సతీమతల్లి” పెద్ద అక్షరాలతో వున్న వార్త !!ఆత్రుతగా చదివింది రాధ “కామెర్లతో కొంతకాలంగా వైద్యం చేయించుకుంటున్న భర్త అకస్మాత్తుగా అపస్మారకం లోకి వెళ్లి కన్నుమూసిన మరుక్షణం అతని భార్య ఆ వియోగం తట్టుకోలేక అదే హాస్పటల్ పై అంతస్తు నుండి కిందకి దూకి భర్తని చేరుకుంది.. “అని దాన్లో వివరాలతో బాటు రాయబడివుంది . కరుణ వెక్కిళ్ళు వినిపించి చటుక్కున పేపర్ అవతల విసిరి తలెత్తింది రాధ. కరుణ మోకాళ్ళలో తల దూర్చి కుమిలి కుమిలి ఏడుస్తోంది. . ఏమిటి కరుణ “మందలింపుగా అంది . “నే నెంత మొండిదాన్ని అంతగా ప్రేమించిన భర్త పోయినా ఎలా బతికి వు న్నాను.”వెక్కిళ్ళు పెట్టింది. "ఈ పేపర్లవాళ్ళకీ మీడియా వాళ్ళకీ వాస్తవాన్ని వాస్తవంగా చెప్పడం కన్నా ఆ వార్తని ఆసక్తికరం గా,ఆకర్షణీయం గా చెప్పాలన్న తాపత్రయం ఎక్కువ. ఆ ప్రయత్నం లో అతిగా మషాలా గుప్పించి చెప్పడం ,రాయడం చేస్తుంటారు. అందువలన ఎంతమందికి బాధ కలిగిస్తున్నామన్న ఆలోచన వుండదు. ఇదీ అలాంటిదే కావచ్చు”అంటూ కరుణని కోప్పడింది రాధ. ఇంకా కరుణ ఏడుస్తూనే వుంది . ” కరుణా నీకు మతి ఉందా లేదా? ఎవరో సైకిక్ పేషెంటు ఆత్మహత్య చేసుకుంటే అది భర్త మీద ప్రేమ వున్నట్లునిర్ణయించుకోవటమేనా?వార్తల్ని వినే జనం మనసుల్ని విషభరితం చేయడం కాదా? ఒక్కసారి ఆలోచించు ఇద్దరూ పోవటంతో ఆ పిల్లలు అనాధలై ఆ ఇంటా ఈ ఇంటా దేవిరించుకొని వీధులు పట్టేలా చేయటం గొప్పా? మొన్న బాబుకి అంత అనారోగ్యం చేస్తే తల్లివి నువ్వు వున్నావు కనుక కంటిపాపలా కాచుకున్నావు.లేకపోతే …..”పూర్తి చేయలేకపోయింది రాధ అప్పుడే లోపలికి వచ్చి తల్లి కొంగు పట్టుకొని దిగులు ముఖాలతో నిలబడ్డ పిల్లలిద్దరిని చటుక్కున కౌగిలిలోకి తీసుకుని “అవును నేనున్నాను కనుకే…” ఆర్తిగా హత్తుకుంది పిల్లలు ఇద్దరూ ఆమె మెడ చుట్టూ చేతులు వేసి కావలించుకున్నారు.

24, అక్టోబర్ 2022, సోమవారం

నడక దారిలో --20

 నడక దారిలో --20


          ఎలాగైతేనేం మళ్ళా విజయనగరం చేరాను.కనుచీకటి పడుతుండటం వలన సన్నజాజులు పందిరంతా విరబూసి స్వాగతించాయి."నాలుగునెలలుగా మామయ్య పిల్లలు వచ్చి మొగ్గలు కోసుకెళ్ళేవారు "అందిఅమ్మ.స్నానం చేసి వచ్చి మొగ్గలు ఒడినింపుకొని మాలకడుతుంటే వీర్రాజు గుర్తు వచ్చి పెదాలమీద కూడా సన్నజాజి విరిసింది . ముందుగా ఉత్తరం రాయటం వలన ఉషా మర్నాడు ఉదయమే కాలేజీకి వెళ్ళటానికి ఇంటికి వచ్చింది.

         కాలేజీ లో అడుగు పెడుతుంటే మనసంతా ఉద్వేగంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. మిత్రులు అందరూ నా చుట్టూ చేరి విశేషాలు అడిగారు."సన్నబడ్డావు కానీ మంచి రంగు వచ్చావు సుభద్రా" అంటూ అందరూ ఆటపట్టించారు.

       ఫిజిక్స్ క్లాస్ కి వచ్చిన ప్రిన్సిపాల్ సీతాకుమారి గారు “ నువ్వు చదువు మానేసావేమో అనుకున్నాను “అన్నారు ప్రేమగా కళ్ళల్లోకి చూపులు కలుపుతూ.

       నన్ను ఎంతో ఎంతగానో ఇష్టపడే మేథ్స్ లెక్చరర్ ఉమాకుమారిగారు నన్ను చూసి” ఓహ్.

 మొత్తంమీద వచ్చేసావా?” అని ఆత్మీయంగా నవ్వారు.

    కాలేజీ చదువు కోసం సంసారబంధాన్ని వదిలించుకుని వచ్చాను.కానీ ఈ ఏడాదంతా కాలేజీ సరీగా జరగానే లేదు.

          ముల్కీ నిబంధనలు రాజ్యాంగ బధ్ధమేనని

1971 అక్టోబరులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అన్యాయమని, తమ రాష్ట్ర రాజధానిలోనే తాము రెండవ తరగతి పౌరులుగా మారామనే ఆవేదనతో ఆంధ్రా ప్రాంతంలో అంతకుముందు కేవలం విశ్వవిద్యాలయాల పరిధిలోనే సాగిన జైఆంధ్రా ఉద్యమం ఇప్పుడు ప్రతీ కాలేజీ దగ్గరా జరిగినట్లే మాకాలేజీ దగ్గరకి కూడా విద్యార్థులు వచ్చి నినాదాలు ఇవ్వటం,వారితో మేము కూడా గొంతుకలపటం జరిగింది.ఒక్కొక్కప్పుడు వారం రోజులు పైగానే క్లాసులు జరిగేవి కావు.

      ఈ ఏడాది అక్టోబర్ జ్యోతి సంచికలో నా రెండో కథ ' దీపశిఖ' ప్రచురితం అయ్యింది.మరోసారి మా కాలేజీ లో గొప్పగా చెప్పుకున్నారు.మా తెలుగు లెక్చరర్ ప్రత్యేకంగా నన్ను అభినందించారు.

      మొదటి పండుగ అని దీపావళికి వీర్రాజు గారు రెండురోజుల కోసం విజయనగరం వచ్చారు.ఉన్నది రెండురోజులు కోసమే అయితేనేం ఆ రెండు రోజులూ మరపురాని విధంగా కథలూ,కబుర్లూ సినీమాలతోనూ గడిపాము.డాబామీద చిరుచలిగాలితో కలిసి జాజులు మమ్మల్ని పరిమళభరితం చేస్తుంటే,నాఒళ్ళో తలపెట్టుకుని నేను పాడే లలిత గీతాలు వీర్రాజు వింటూంటే ఈ క్షణం శాశ్వతమైతే బాగుండుననిపించేది.

     అంతలోనే హైదరాబాద్ లోస్వంత ఇంటిలోనే పరాయివాడిలా నాకు దూరంగా ఉండటం గుర్తు వచ్చి భలే కోపం వచ్చేది.

       ఆంధ్ర,తెలంగాణా ఉద్యమం గురించి కొంత ఆందోళన చెందేవాళ్ళం. ఎవరు కలుసుకున్నా ముఖ్యసంభాషణగా చోటుచేసుకునేది ఈ విషయమే.

      ఎలక్షన్ ఫలితాలను బట్టి ఆంధ్రప్రదేశ్ విభజన ఆధారపడుతుంది అని ప్రజలు భావించారు.1971 సాధారణ ఎన్నికల్లో, ప్రజలను ఇందిరా గాంధీ ఇచ్చిన 'గరీబీ హఠావో!' అన్న నినాదం ఉత్తేజపరిచటంతో ఆ ఎన్నికల్లో ఆమెకు భారీ ఆధిక్యత లభించింది.ఏకారణం వల్లనైతేమి ఉద్యమం తాత్కాలికంగా చల్లబడి విభజన విషయం వెనుకబడింది.

     డిసెంబర్ 13 రాత్రి శ్రీనగర్ అమృతసర్ ప్రాంతంలో పాకిస్థాన్ బాంబు దాడి జరిగింది.ఆ రాత్రి 12 గంటలకు ఆకాశవాణి లో ఇందిరా గాంధీ ప్రజలతో మాట్లాడారు.యుధ్ధం తీవ్రం అయ్యింది.మర్నాడు విశాఖజిల్లా కలెక్టర్ ఆకాశవాణిలో బాంబింగ్ అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియజేసారు.విశాఖలో నౌకాశ్రయం, నౌకా నిర్మాణ కేంద్రం ఉండటంవలన ఎప్పుడు యుధ్ధం జరిగినా ఆ ప్రాంతం అప్రమత్తం అవుతూఉండేది.

      అయితే 13 రోజులు మాత్రమే నడిచిన ఈ యుద్ధాన్ని చరిత్రలోని అతి తక్కువ కాలం జరిగిన యుద్ధాలలో ఒకటిగా అందరూ చెప్పుకునేవారు.1971 డిసెంబరు 16న లొంగుబాటు అనంతరం, తూర్పు పాకిస్తాన్, స్వతంత్ర బంగ్లాదేశ్‌గా విడిపోయింది.

      అప్పట్లోనే అన్నయ్యకు రాజమండ్రి కాలేజీకి బదిలీ కావటంతో బంధువుల ఇంట్లో ఉన్నాడు.వీర్రాజుకి రాజమండ్రి లోని వాళ్ళ ఇంట్లో ఖాళీఉందేమో కనుక్కోమని ఉత్తరం రాయమంటే రాసాను.కానీ మళ్ళా ప్రయత్నం మీద కొన్నాళ్ళకే తిరిగి విజయనగరం కాలేజీకి బదిలీ అయింది.

        జనవరి సంక్రాంతి సెలవులకు చిన్నన్నయ్య,నేను హైదరాబాద్ బయలుదేరాము.అతను ఓ నాలుగు రోజులు ఉండి తిరిగి విజయనగరం వెళ్ళిపోయాడు.

         నేను కాపురానికి వచ్చేలోగా కుట్టు మిషను కొనమని వీర్రాజు గారిని కోరటంతో విద్యామిషన్ కొని ఉంచారు.నేను చిరుగు పట్టని పాతచీరలు,దుప్పట్లతో కిటికీలకు,వంటగదికీ హాలుకు మధ్యగల ద్వారానికి కర్టెన్లు కుట్టాను. తలగడలకు గలేబులు కుట్టాను. నాకూ,మా ఆడబడుచుకూ పండుగకి లేస్ బోర్డర్ వేసి చీరల్ని డిజైన్ చేసాను.సెలవులుగడచిపోయినా తిరిగి నా ప్రయాణం సంగతి తెలియలేదు.ఇంట్లో ఎవ్వరికీ నేను చదువు కొనసాగించటం అంతగా ఇష్టంలేదు కానీ వాళ్ళ అన్నయ్య మాటల్ని కాదనలేక మాత్రమే మౌనం వహించారనేది తెలుస్తోంది.వీర్రాజు కూడా ఆ విషయం ఎత్తటం లేదు.మాటిమాటికీ గుర్తు చేయడం ఇష్టం లేక నేనూ మౌనం వహించాను.

       నేను పండగ వెళ్ళాక రిపబ్లిక్ దినోత్సవం తర్వాత వరకూ ఉండాల్సి వచ్చింది.నాతో ఉత్తరాల్లో "జనవరి లో జరిగే ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కి మనిద్దరం వెళ్ళి సరదాగా తిరుగుదాం " అని కబుర్లు చెప్పిన వీర్రాజు గారు తీరా నేను వచ్చాక ఎప్పుడు ఎగ్జిబిషన్ వెళ్ళాలన్నా ఇంటిల్లిపాదినీ ఎప్పటిలాగే బయలుదేరదీసేవారు.

       చిన్న మరిదికి ఒక్కోసారి నైట్ షిఫ్ట్ లు ఉంటాయి.పెద్దమరిది టూర్లు కన్నా వెళ్తాడు.లేదా ఇంట్లో ఉంటాడు.ఎప్పుడూ లేనిది మా ఆడబడుచు "కృష్ణ తాగి వస్తాడు నాకు ఒక్కదాన్నీ పడుకోవటానికి భయం" అనటం మొదలెట్టింది."చెల్లెలివి నీకే భయం అంటే తర్వాత మరి నేనూ ఒక్కదాన్నే ఉండాలి కదా " అన్నాను కానీ తప్పని సరి కావటంతో నేను ఆమె పక్కనే ఒక్కొక్కసారి పడుకోవాల్సివచ్చేది.

     ఇక్కడ ఉన్నా నా మనసంతా కాలేజీ మీదే ఉండేది.మాటిమాటికీ కాలేజీ డుమ్మాలు కొట్టటంతో ఈ ఏడాది పాసవుతానన్న ఆశపోయింది.

      రత్నం వాళ్ళు వేరే ఇంటికి వెళ్ళిపోయారు.ఒకరోజు వాళ్ళింటికి నేనూ , ఆడబడుచు వెళ్ళాము.రత్నంతో " వదిన మళ్ళా వెళ్ళిపోతే ఒక్కదాన్ని అయిపోతాను"అంది మా ఆడబడుచు.మరొక్క మూడు నెలల్లో నా చదువు అయిపోతుంది.కదా.అంతవరకూ ఓపిక పట్టలేదా అని మనసులోనే అనుకున్నాను.

      నేను తిరిగి విజయనగరం వెళ్ళాలనుకునేసరికి చిన్నాడబడుచు అదే పాట మొదలెట్టేసరికి ఆమెని తీసుకునే బయలుదేరాను. ఓ వారం రోజులైనా తర్వాత మాపెద్దాడబడుచు ఏదో పనిమీద విజయనగరం వస్తే వాళ్ళతో కలిసి భువనేశ్వర్ వెళ్ళింది.

          ఈ లోపునే నేను కాలేజీకి వెళ్ళాక అమ్మకూ,చిన్నన్నయ్య కూ నా మీద చాలా ఫిర్యాదులు చేసింది.నా మనస్తత్వం తెలిసినవారు కావటాన వాళ్ళు నాతోనే చెప్పేసారు.

"మీ చిన్నన్నయ్య హైదరాబాద్ లో ఉద్యోగానికి ప్రయత్నం చేస్తే బాగుండు" అని ఒకసారి తను నాతో అన్నప్పుడు " ప్రస్తుతం ఇక్కడ ముల్కీ గొడవ ఎక్కువ గా ఉంది కనుక ఇక్కడ ఉద్యోగం సంపాదించటం కష్టమేమో" అన్నాను.

ఆ మాటల్నే" మా వదినకు మీరు హైదరాబాద్ లో ఉద్యోగానికి రావటం ఇష్టం లేదు" అని చిన్నన్నయ్య తో చెప్పిందట.నిజానికి వాళ్ళు హైదరాబాద్ కి వస్తే నాకే లాభం కదా అని నవ్వుకున్నాను.

       "పెళ్ళి అయ్యేలోపున సత్యవతిని మొండితనం ,మంకుపట్టు తగ్గేలా కొంచెం మార్చు" అన్నాడు చిన్నన్నయ్య.ఇన్నాళ్ళ మొండితనాన్ని ఏడాది లో మార్చటం అంతసులువా? ఆ మార్చేదేదో పెళ్ళైయ్యాక నువ్వే మార్చుకో బాబూ అనుకున్నాను.

      ఫిబ్రవరి లో మా మొదటి వివాహ వార్షికోత్సవానికి వీర్రాజు విజయనగరం వచ్చారు.పెళ్ళికి పూలజడ వేసుకోలేదుగానీ ఉషా వాళ్ళమ్మ బలవంతంగా నన్ను ఒప్పించి మల్లెపూలజడ వేసారు.ఎప్పుడూ మా పందిరి సన్నజాజులమాలని జడకి చుట్టుకోవటం నాకు అలవాటే కానీ ఇలా ప్రత్యేకంగా వేసిన మల్లె పూలజడ నాకు ఇబ్బందికరంగానే కాక కాస్త సిగ్గుగా అనిపించింది.వీర్రాజు కూడా నవ్వుతూ" ఇప్పుడు నిజంగా కొత్త పెళ్ళికూతురులా ఉన్నావు.నీ బొమ్మ వేస్తాను అలానే ఉండు" అంటూ స్కెచ్ బుక్ తీసి వేసారు.

      ఈ ఏడాది M R కాలేజీ శతవార్షికోత్సవాలు ప్రారంభించారు.ఆ సందర్భంలో వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు.అందులో మా మహిళా కాలేజీ తరపున రామన్ ఎఫెక్ట్ నేపధ్యంలో రంగులగురించి ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ కి తెలుగు లో నన్నూ, ఇంగ్లీష్ లో ఉషని వివరించటానికి ఎంపిక చేసారు.ఒకరోజు అన్నయ్యా వాళ్ళూ కూడా చూడటానికి వచ్చీ నన్ను వివరించమన్నారు.రెండురోజులుగా చెప్పి చెప్పి బొంగురు పోయిన గొంతుకతో వివరించటం చూసి అన్నయ్య నవ్వి స్టెప్సిల్ బిళ్ళలు తీసుకువచ్చి ఇచ్చాడు.అది నాకు ఎంతో సంతోషం కలిగించింది.

        మరోసంతోషకరమైన విషయం మా కాలేజీ మాగజైన్లో ప్రచురితమైన నా రచనను ఎంపిక చేసుకొని శతవార్షికోత్సవ సావనీర్ లో పునః ప్రచురణకి తీసుకున్నారని తెలిసి ఎంతగా పొంగిపోయానో!! అయితే పరీక్షలు కాగానే హైదరాబాద్ వెళ్ళిపోవటం తో ఆ కాపీ నాకు అందనేలేదు.

      శతవార్షికోత్సవాల సందర్భంగా సంగీతం, సాహిత్యం, నృత్యం కి చెందిన కార్యక్రమాలు వారంరోజుల పాటు జరిగాయి.బాలమురళీకృష్ణ,టి.ఆర్ మహాలింగం ఫ్లూట్ కచేరీలకు అక్కయ్యతో కలిసి వెళ్ళాను.

     నేను మరింత ఆసక్తి గా హాజరైంది ఆరుద్ర, కృష్ణశాస్త్రి పాల్గొన్న సాహిత్య కార్యక్రమం.అప్పటికే కృష్ణశాస్త్రికి గొంతు మూగపోయింది.ఆయన ఉపన్యాసాన్ని నాయని కృష్ణకుమారిగారు చదివి వినిపించారు.అప్పుడు వాళ్ళచేత ఆటోగ్రాఫ్ చేయించుకోవడానికి పుస్తకం లేక చేతిలో నోట్బుక్ ఉంటే అందులోనే చేయించుకున్నాను.ఆ తర్వాత నాయని కృష్ణకుమారి గారితో అనేక సమ్మేళనాలలో పాల్గొనడమే కాక , ముఖచిత్రాలకు ఆమెరావటం వలన కావచ్చు ,స్నేహంపెరిగి అనేకసార్లు రాకపోకలతో మేము దగ్గరయ్యాము.

         ఎమ్మార్ కాలేజీ శతవార్షికోత్సవాలు పూర్తికాగానే మాకాలేజీ వార్షికోత్సవం జరిగింది.నా సహాధ్యాయి సత్యవతి అనే అమ్మాయి నెమలినృత్యం అద్భుతంగా చేసింది.ఆ అమ్మాయి తర్వాత సత్యప్రియ పేరుతో సినీతారగా చాలా తెలుగు,తమిళ సినీమాలలో నటించింది.

       ఇలా అనేక కారణాలతో క్లాసులు సరీగా జరగకపోవడంతో ప్రైవేటు కాసులు ప్రతీ ఆదివారం పెట్టేవారు.అమ్మకి ఏమీ సాయం చేయటానికి కుదరకపోవటంతో అమ్మకూడా అలసిపోయి అప్పుడప్పుడు విసుక్కునేసరికి నాకు చదువుకోసం ఇక్కడ ఉంటున్నందుకు చిన్నబుచ్చుకునేదాన్ని,మళ్ళా అమ్మపరిస్థితి అర్థం చేసుకుని సరిపుచ్చుకునేదాన్ని. 

      మొత్తంమీద పరీక్షలు ఏదోలా పూర్తి చేసాను.ప్రాక్టికల్స్ మేనెల మొదటివారంలో ఉన్నాయి.వీర్రాజుముందే వచ్చేసారు.నా ప్రాక్టికల్ పరీక్షలు అయ్యేలోపున ఒకసారి శ్రీకాకుళం లోని బాల్యమిత్రుని ఇంటికీ, అక్కడినుంచి బరంపురం లో ఉప్పల లక్ష్మణరావు గారి అధ్యక్షతన జరిగే వికాసం అనే సాహిత్య సంస్థ సమావేశాలకు వెళ్ళి వచ్చారు.

       నా పరీక్షలు అయ్యాక మేమిద్దరం విజయనగరం నుంచి హైదరాబాద్ బయలుదేరాము.ఇకపై విజయనగరం వస్తే నేను ఇక్కడ అతిథినే కదా అనుకుంటూ కదులుతున్న రైలు నుండి దూరమౌతోన్న ఊరికి వీడ్కోలు చెప్తూ కళ్ళనీళ్ళతో పరికించాను.


రంగు వెలిసిన చిత్రం/ఓట్ల పండుగ లో పదనిసలు

 ~~ రంగు వెలిసిన చిత్రం ~~


అలలుఅలలు గా ముడతలు పడిన దేహమంతా

 డెబ్బైఅయిదేళ్ళ వసంతాలలో తడిసి ముద్దై

 ఏడు దశాబ్దాల గ్రీష్మాలలో

 ఎండి నెర్రెలు విచ్చిన చర్మమూ

 ఇదే నేటి మాత చిత్రం!

 

 ఒకనాటి వసంతాల పులకింతల్నో

 ఆనాటిహేమంతాలమంచు పలకరింపుల్నో

 మదికి తెచ్చుకుంటూ

 భారంగా అడుగులో అడుగేసుకుంటూ 

 అలసిన చూపుల్ని నలుదెసలా ఎగరేస్తూ 

 ఏమూలనుంచైనా తనచూపందుకునే కంటికొసమో

 తనకోసం ఆలోచించే మనసుకోసమో

 తన కోసం

 తన మాట కోసం

 ఒక పలకరింపు కోసం

 నిర్విరామ నిరీక్షణలతో

 చిట్లిన కలల్ని ఏరుకొని

సొమ్మసిల్లుతున్న రెప్పల్లో నింపుకొని

ఈదేశమంతా తడుముకుంటూ తలుచుకుంటూ

తిరిగి తిరిగి ఎంత తిరిగినా ఎంతచుట్టినా

ఏం మిగిలింది నిర్వేదం నిరుత్సాహం తప్ప


ఒకప్పుడు తన పుట్టినరోజున

బాహ్యదేహాన్ని పులకరింపజేసిన క్షణాలు

అంతటా పండుగ వాతావరణం

రంగుల తోరణాల అలంకరణలు

కీర్తినిచాటే ఉద్విగ్నగీతాలు

ఉప్పొంగే ఉత్సాహ భరిత నృత్యహేలలూ

ఊరంతా ఊగే పూలహారాల సయ్యాటలూ

రెపరెపలాడే పతాకాల మనోహరవిలాసాలూ

గాలినిండా పుష్పవర్షాల సురభిళాలూ

వీధుల నిండా హర్షాతిరేకాల ప్రాంగణాలు

కాని ఇప్పుడంతా మొక్కుబడి సంబరాలేకదా

తూతూమంత్రాల ఉపన్యాసాల హోరులేకదా

ఎవరి గోల వారిదిప్పుడు

కన్నతల్లి నే ఏడాదికో మాటు

తలచుకొనే కాలం కదా ఇది

ఇక ఈ తల్లిఊసు  ఎవరిక్కావాలి!?


చేతుల మీద సంకెళ్ళగాట్లు

గుండెల్లో గుచ్చుకున్న కత్తిపోట్లు

ఉండుండి సలుపుతూనే ఉన్నాయ్

స్వేచ్చా పోరాటోద్యమంలో చేదుజ్ణాపకాలు

మరకలుమరకలుగా యింకా నిలిచే ఉన్నాయ్

దేహం శక్తిని పుంజుకొని యింకా తేజోవంతం కానేలేదు 

ఎప్పటికప్పుడు మతదాడులతోనో 

కులకుంపట్ల కొట్లాటలతోనో

రేగిన గాయాలు బాధిస్తూనేవున్నాయ్

ఉండుండి రక్తం మరిగి చెమటై ఇగిరిపోతూనే వుంది

నిలువునా కొల్లగొట్టిన సాంస్కృతిక చైతన్యం

నివురుగప్పిన నిస్తేజమైపోతూనేవుంది

తల్లిని మరచిపోతున్న పిల్లల్ని చూసి

కుమిలి కుమిలి నలిగి నలిగి

 డెబ్బైఅయిదేళ్ళ శరీరం వడలిపోతూనే వుంది

 దుఃఖం దేహమంతా అల్లుకు పోతూ

 ఇంటిదొంగల దాడితో మరింత కృశించి పోతూనే వుంది

 చూస్తూ చూస్తుండగానే కళ్ళముందే

 వర్తమాన సామాజిక చిత్రపటం 

 యింకా యింకా మరింత గా మసకబారిపోతుంది

27, సెప్టెంబర్ 2022, మంగళవారం

యువభారతి తో నా అనుబంధం

 ~ యువభారతి తో నా అనుబంధం~~


  స్వాతి ప్రారంభసంచికలో గౌరవసంపాదకునిగా శీలా వీర్రాజు గారి పేరు చూసి అభిమానిగా ఆయన రచనలగురించి నేను ఉత్తరం రాస్తే నాకు వారి కవితా సంపుటాలతో పాటు యువభారతి ప్రచురణ అయిన పంచవటి అనే అయిదుగురు కథకుల సంకలనాన్ని పంపించారు.అదే యువభారతితో పరోక్షంగా నామొదటిపరిచయం.

       తర్వాత "చుట్టూరా ఆవరించుకుని వున్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ప్రయత్నించి ఎంత చిన్న దీపాన్నయినా వెలిగించడం మంచిది" అనే యువభారతి ఆశయం నన్ను ఆకర్షించింది.

         మంచి ఆశయంతో ధ్యేయంతో 1963లో విజయదశమి అక్టోబరు 27 నాడు ఇరివెంటి కృష్ణమూర్తిగారు దీనిని స్థాపించి అధ్యక్షుడిగా యువభారతి ఆవిర్భవించిందనే విషయాన్ని వివాహానంతరం ఆయన ద్వారా విన్నాను.

      యువతరంలో సమాజహితం , సాహిత్య అభ్యుదయం పెంపొందింప చేయటానికి ప్రతీనెలా మొదటి ఆదివారం కృషిచేస్తుండేదని వీర్రాజు గారు చెప్తూఉండేవారు.సాహిత్యంపట్ల,ఆసక్తీ,పఠనాభిలాషని పెంపొందించే విధంగా అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించటమే కాకుండా ముఖ్యంగా తెలుగు భాషా విద్యార్థులకు సౌమనస్యం, సౌజన్యం , ఉన్నత భావాలను, నిర్మాణాత్మకమైన రీతిలో వ్యక్తిత్వాన్ని రూపొందించుకునేలా ప్రోత్సహిస్తుండేదనేది విని మరింత పులకించాను.

          వీర్రాజు గారు ఉత్తరాల్లో ఎప్పటికప్పుడు యువభారతి కి వేయాల్సిన ముఖచిత్రాల గురించి చెప్తుండేవారు

     

      వేసవి సెలవులకు హైదరాబాద్ వచ్చినరోజుల్లో నాకు చాలా సంతోషం కలిగించేదీ ఎదురుచూసేది ఆదివారం సాయంత్రం.ఎందుకంటే ఆదివారం రోజు ఆంధ్ర సారస్వత పరిషత్తులో యువభారతి నిర్వహించే కావ్యలహరి ఉపన్యాస పరంపర ఉంటుండేది. ఎప్పుడూ సాహిత్యసభలకు వెళ్ళలేదేమో నాకు ఉత్సాహంగా ఉండేది. కావ్యలహరి పేరిట మనుచరిత్ర ,పారిజాతాపహరణము ,వసుచరిత్రము ,విజయవిలాస కావ్యాలపై ఉపన్యాస పరంపరగా ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారితో ఉపన్యాసాలను యువభారతి సారథులు ఇరివెంటి కృష్ణమూర్తి గారు,వంగపల్లి విశ్వనాధం గారూ నిర్వహించేవారు. 

       ప్రాచీన సాహిత్యం మీదే ఉపన్యాసాలు ఉన్నా గంభీరస్వరంతో ఆయన పద్యాలు చదువుతూ వివరించటం అద్భుతంగా అనిపించేది.మొదట్లో పరిషత్తు హాలులోనే జరిగే సభలకు తర్వాత్తర్వాత అశేషంగా జనం వచ్చి వరండాలోను బయటా నిండిపోవటమేకాక ముందు ఖాళీ ప్రదేశం లోనూ నిలబడి వినేవారు.దాంతో పరిషత్తు వెనుక ఓపెన్ వేదిక పై ఏర్పాటు చేయటం మొదలుపెట్టారు.

          ఉపన్యాసాలు సరేకానీ వాలంటీర్లుగా ఆ సమావేశం ఆవరణంతా గలగలా సందడిగా ఉత్సాహంగా ఎగిరే సీతాకోక చిలుకల్లా తిరిగే యువతీయువకులను చూస్తుంటే నాకు నా కాలేజీ గుర్తువచ్చి గుబులుఅయ్యేది.వాళ్ళంతా కూడా సుమారుగా నా వయసు వాళ్ళు కావటం వలన వాళ్లలో నన్ను చూసుకుని మళ్ళా అలా తిరగ్గలనా అనిపించేది.చెవులు ఉపన్యాసం వింటున్నా ,నా చూపులు వారి వెనకెనకే తిరిగేవి.

           తర్వాత్తర్వాత ఆ యువభారతీయులైన 

సుధామ,నాగినేని భాస్కర్రావు,కె.బి.లక్ష్మి, కామేశ్వరరావు,రత్నమాల మొదలైన వారంతా మాకు కుటుంబమిత్రులు అయ్యారు.

     యువభారతి ప్రచురణలు వందకి పైగానే ముఖచిత్రాలు వీర్రాజే వేసారు.మాపరిచయం అనంతరం మొదలుపెట్టిన వచన

కావ్యం వివాహం తర్వాత పూర్తి చేసారు.అదే వీర్రాజుగారు రాసిన తొలి దీర్ఘ కావ్యం” మళ్ళీవెలుగు “నాకే అంకితం చేసారు. యువభారతి ప్రచురించిన మళ్ళీ వెలుగు కావ్యం ఉగాది రోజున జరిగింది. ఈ పుస్తకావిష్కరణ సభ కి 1973 లో మూడునెలల పసిపాప పల్లవిని తీసుకొని హాజరయ్యాను.మాదంపతులకు యువభారతి సంస్థతో చిరకాల అనుబంధం నేటికీ కొనసాగుతూనే ఉంది.

    1980 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం దూరవిద్య ద్వారా నేను తెలుగు ఎమ్మే చేసినప్పుడు యువభారతి ప్రచురణలే నన్ను ఆదుకున్నాయి.ఎందుకంటే అప్పట్లో మూడేళ్ళ మానసిక వికలాంగుడైన బాబుతో అంతర్ముఖీనమై ఒత్తిడికి గురైన స్థితిలో నేను బయటకు వెళ్ళలేక వీర్రాజు గారు ఇచ్చిన యువభారతి పుస్తకాలు, ఆరుద్ర సమగ్ర సాహిత్యం మాత్రమే చదివి రెండవ తరగతిలో ఉత్తీర్ణత సాధించానంటే యువభారతి ప్రచురణలు తెలుగు సాహిత్యానికి ఎంతటి సమగ్రమైన గ్రంథాలు అందించాయో అర్థమౌతుంది..


     వీర్రాజు గారు యువభారతి ముఖచిత్రాలు వేస్తున్నప్పుడు ఎంతో తపోనిష్టతో వేయటం నేను చూసాను. అందులోనూ కావ్యాలహరికి శిల్పవిన్యాసంలా అర్థవలయాకృతిలో వేసిన ముఖచిత్రం మర్చిపోలేనిది.అది నాకెంతో నచ్చిన ముఖచిత్రం.సాహితీవేత్తలకూ,సావనీర్లకూ,ప్రభుత్వసంస్థలకూ చాలానే వేసినా యువభారతి అనే ఒకేఒక సాహిత్యసంస్థకు వందకి పైగా ముఖచిత్రాలు వేయటం అన్నది ఒక రికార్డుగా చెప్పుకోదగినది.

  అటువంటి యువభారతి సంస్థ ఈనాడు షష్ట్యబ్ది ఉత్సవం చేసుకొంటున్న సందర్భంలో ఈసంస్థతో విడదీయరాని బంధం గల శీలా వీర్రాజు గారి స్థానంలో నేను ఈ నాలుగు మాటలు రాస్తున్నందుకు ఒక కంట కన్నీటితో,మరోకంట ఆనందంతో హృదయపూర్వక అభినందనలు 

  తెలియజేస్తున్నాను.

7, సెప్టెంబర్ 2022, బుధవారం

నడక దారిలో,19

నడక దారిలో -- 19


      నా కొత్త కాపురం యథాతథంగా కొనసాగుతోంది.

మా ఇంట్లో కూడా నాకు మాఅన్నయ్యలతో ఎక్కువగా మాట్లాడే అలవాటు లేదు.ఎవరిపనులు వాళ్ళు చేసుకోవటమే.అమ్మకి ఇంటిపనుల్లో ఏదైనా సాయం అవసరం అయితే చేయటం తర్వాత చదువుకోవటం లేకుంటే బొమ్మలు వేసుకోవటం చేసేదాన్ని.ఇంట్లో రేడియోలో ఏదోఒకటి వస్తూనే ఉంటుంది.అదే సందడి.లేదా నేను తీసే రాగాలే ఇల్లంతా తీగలు సాగుతూ ఉంటాయి.

        ఇక్కడ మా ఇంటికాంపౌండ్ లో మాఇల్లే పక్కా ఇల్లు.మాది కాకుండా మరో నాలుగు వాటాలు రెండు గదుల రేకుల ఇళ్ళు ఉండేవి.వాటిలో ఒకటి రామకృష్ణ శర్మ అనే మాష్టారి కుటుంబం ఉంటుంది. మరోదాంట్లో మహరాష్ట్రియనులకుటుంబం భార్యాభర్తలు ముగ్గురు పిల్లలు కాక ఇంట్లో తల్లితండ్రులు, తమ్ముడు రెండు గదుల్లో సర్దుకుని ఉండేవారు.అంతమంది అంతా చిన్న ఇంట్లో ఎలా సర్దుకునే వారో అనిపించింది. అప్పట్లోనే అతని తమ్ముడికి పెళ్ళి జరగటం గృహహింస అనేది ప్రత్యక్షంగా వాళ్ళింట్లో చూసాను ఆ కుటుంబం నేపథ్యంగా "కంచికి పోని కథ" పేరుతో1980లో ఒక కథ కూడా రాసాను.

        మావంటిల్లు ఆనుకొనిఉన్న వాటాలో చిన్న కుటుంబం కాపురం ఉండేది.వాళ్ళు ఖాళీ చేయాలనుకుంటున్నారు అనీ నేను చదువు ముగించి కొని వచ్చేనాటికి ఆ వాటా కూడా మనం అద్దెకి తీసుకుంటే మనకి వంటింట్లో పడుకునే బాధ తప్పుతుంది అని వీర్రాజు చెప్పేవారు. ఇంకొక వాటాలో రత్నం అనే ఆమె,భర్తా,కొడుకు కాపురం ఉండేవారు.

     పైన వాటాలో సింధీ కుటుంబం అద్దెకి ఉండేవారు.

నాకు వచ్చిన సమస్య రత్నం తో.అత్త పోయినప్పుడు.,ఆ తర్వాత వీళ్ళకు సాయం చేసి ఉంటుంది.అందుకని వీళ్ళంతా ఆమె అంటే అభిమానం పెంచుకున్నారు.దానిని అలుసుగా తీసుకుని ఇంట్లో పెత్తనం చేసేది.

          వీర్రాజు ఉన్నప్పుడు రత్నం అంతగా వచ్చేది కాదు.ఆయన వెళ్ళగానే వచ్చి నేను ఏ పుస్తకమో పట్టుకుని ఉంటే "కాలేజీ స్టూడెంట్ వదిన గారూ చదువు కుంటున్నారా “ అనేది.ఆ అనటం లోని వెటకారానికి మళ్ళా పుస్తకం తీయాలనిపించేది కాదు.

      నేను అప్పుడే బయటగదిలో ఉండి ఆడబడుచు ఒక్కతే వంటింట్లో గానీ ఉందంటే “ ఏంటి సత్యవతీ వదిన వచ్చినా ఆమెని కూర్చోబెట్టి నువ్వే పనంతా చేస్తున్నావా “ అనేది.దాంతో నేను పనంతా పూర్తయ్యే వరకూ వంటింట్లోనే పని ఉన్నా లేకపోయినా ఆడబడుచు తోనే వుండేదాన్ని.

   నేను మొదటినుంచీ బలహీనంగా ఉండి బరువైన ఇంటిపనులు చేయలేకపోయేదాన్ని.అందుకని నేను చదువుకి విజయనగరం వెళ్ళినా ఇబ్బంది లేకుండా చివరి ఇంట్లోని మాస్టారి ఇంటికి వచ్చే చాకలిని దుప్పట్లు.మగవారి బట్టలు ఉతికేందుకు మాట్లాడాను.వారానికిఒకసారి తీసుకువెళ్ళి ఉతికి ఇచ్చేవాడు.

      అలాగే పనిమనిషిని బాసాన్లు తోమించటానికి మాట్లాడాను.ఇంట్లో మగవాళ్ళకి ఆడవాళ్ళు చేసేఇంటిపని మీద అవగాహన లేకపోవటంతో అంతకుముందు పనంతా ఆడబడుచు మీద పడింది.అందుకు కూడా రత్నం “ కొత్త కోడలు రాగానే పనిమనిషిని కుదిర్చారే అన్న “అని వెటకారం చేసింది.అదేమీ నేను పట్టించుకోలేదు.

       నా చదువు గురించి ఎక్కడా చదవాలనే తర్జన భర్జనల నేపధ్యంలో పక్కింటి రత్నం మా ఆడబడుచును " నేను కూడా చదువుకుంటాను అని మీ అన్నయ్యని అడుగు" అని ఎగసిన దోసింది.నేను కూడా చదవమనే ప్రోత్సహించాను.కానీ ఆమెకే ఆసక్తి లేనందున ముందుకు సాగలేదు."ఇంట్లో వీణ ఉంది, సంగీత కళాశాల దగ్గర లోనే ఉంది కదా అదన్నా నేర్చుకోమ"ని చెప్పాను.అదీ చేయలేదు.

        అన్నిటి కన్నా పెద్ద సమస్యే మరొకటి.

వంటింట్లోనే ఒక మూల దేవుడి పీఠం ఉంది .మా పెద్దమరిది కృష్ణ రోజూ దీపం పెడతాడు.ఐతే మేము వంటింట్లోనే పడుకోవటం వలన చీకటిలో కాలు దేవుడి పీఠానికి తగులు తుందేమో అని ఒక స్టాండ్ కొని ఆ మూలే గోడలకి కొట్టించి దేవుణ్ణి పైకి ఎక్కించాను.

        మా ఆడబడుచు బహిష్టు ఐనప్పుడు వంటింట్లోకి వెళ్ళేది కాదు.దాంతో పక్కింటి రత్నం వచ్చి అన్నం మా స్టౌ మీదే వండి కూరలు తెచ్చి ఇచ్చేదిట.నాకు అలా విడిగా ఉండటమూ నచ్చదూ,ఒకరిమీద ఆధారపడటమూ నచ్చదు.అంతే కాక అందరికీ అడ్వర్టైజ్ చేసేటట్లు నేనైతే ఉండను అని చెప్పి మా ఆడబడుచును ఇప్పుడు దేవుడు పైకే ఉన్నాడు కదా అని కోప్పడి మామూలుగా ఇంట్లోను తిరగటం అలవాటు చేసాను.తన మీద ఆధారపడకుండా చేసానని రత్నం నామీద కోపం పెంచుకుంది.

ఇదిగో ఇలాంటి వారి వల్లే అత్తాకోడళ్ళ మధ్యా, వదినామరదళ్ల మధ్యా,తోటికోడళ్ళ మధ్యా సంబంధాలు చెడిపోతాయి అనిపించింది.

         మరొక సమస్య మావాళ్ళు ఒకషాపులో అవసరమైన వెచ్చాలు అరువుగా తెచ్చుకుని జీతం వచ్చాక ఎంతో కొంత చెల్లు పెట్టేవారు.నాకు నచ్చని విషయం అదొక్కటి. దీనివల్ల వచ్చిన డబ్బుని పొదుపుగా వాడటం తెలియకుండా అవుతుంది.మేము తెచ్చుకున్న వస్తువుల బిల్లు అంతకన్నా రెట్టింపుగా అవుతూ ఎప్పుడూ బాకీ తీరకుండా ఉండటం గమనించాను.బహుశా మా అరువు అక్కౌంటులోనే ఎవరో తీసుకుంటున్నారని నాకు అనుమానం వచ్చింది.ఇప్పుడు నేనున్న ఈ రెండు మూడు నెలలకు దాన్ని పట్టించుకోవటం ఎందుకని ఊరుకున్నాను

      నిర్విరామంగా నానోట ఏదో ఒక పాట కూనిరాగాలుగా తీగెలు సాగుతూ

 వెలువడుతూనే ఉండేది.ఒక్కొక్కప్పుడు కాలేజీలో ప్రాక్టికల్స్ చేసేటప్పుడు కూడా లాబ్ లో కూనిరాగాలు తీసేదాన్ని.అటువంటిది ఇక్కడికి వచ్చాక నా కంఠానికి తాళం పడింది.

       రాత్రిపూట వీర్రాజు పడుకోవటానికి వచ్చేవరకూ ఓగంటో రెండుగంటలో నేను చదువుకోటానికైనా,రాసుకోటానికైనా,బొమ్మలేసుకోటానికైనా నాదైన సమయం ఉండేది.ఇంట్లో బాపు బొమ్మలతో జనార్దనాష్టకం చూసీ భలే ఆనందం అనిపించింది.ఆ తీరిక సమయంలోనే ఆ బొమ్మలను చూసి అన్నీ వేసాను. అవి చూసి వీర్రాజే కాకుండా మిత్రులు కూడా అచ్చం బాపు చిత్రాలు లాగే ఉన్నాయని అనేవారు.ఒకసారి హైస్కూల్ లో చదివే రోజుల్లో విజయనగరం కోటలోని రౌండ్ మహాల్ లో బాపూ బొమ్మలు ప్రదర్శించారు.అవి చూసిన దగ్గర నుండి సీరియల్స్ కి వేసిన చిత్రాలు వేయటం అలవాటు.జనార్దనాష్టకం లోని నేను వేసిన చిత్రాన్ని ఒకనెల స్వాతి పత్రిక ముఖచిత్రం గా కూడా వేసారు.

      నాకు చాలా సంతోషం కలిగించేదీ ఎదురుచూసేది ఆదివారం సాయంత్రం.ఎందుకంటే ఆదివారం రోజు ఆంధ్ర సారస్వత పరిషత్తులో యువభారతి నిర్వహించే కావ్యలహరి ఉపన్యాస పరంపర ఉంటుంది.దానికి మాత్రం ఇంట్లో వాళ్ళనందరిని బయల్దేరదీయరు.అయితే మేమిద్దరమే వెళ్ళేదీ తక్కువే.ఎందుకంటే సెలవురోజు కనుక మధ్యాహ్నమే సాహితీ మిత్రులు వచ్చి ఉండేవారు.ఎప్పుడూ సాహిత్యసభలకు వెళ్ళలేదేమో కావ్యలహరి పేరిట

మనుచరిత్ర ,పారిజాతాపహరణము ,వసుచరిత్రము ,విజయవిలాస కావ్యాలపై ఉపన్యాస పరంపరగా ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారి తో ఉపన్యాసాలను  యువభారతి సారథులు ఇరివెంటి కృష్ణమూర్తి గారు,వంగపల్లి విశ్వనాధం గారూ నిర్వహించేవారు. 
       ప్రాచీన సాహిత్యం మీదే ఉపన్యాసాలు ఉన్నా గంభీరస్వరంతో ఆయన పద్యాలు చదువుతూ వివరించటం అద్భుతంగా అనిపించేది.మొదట్లో పరిషత్తు హాలులోనే జరిగేవి. కానీ సభకు అశేషంగా జనం వచ్చి వరండాలోను బయటా నిండిపోవటమేకాక ముందు ఖాళీ ప్రదేశం లోనూ నిలబడి వినేవారు.దాంతో తర్వాత్తర్వాత పరిషత్తు వెనుక ఓపెన్ వేదిక పై ఏర్పాటు చేయటం మొదలుపెట్టారు.
          ఉపన్యాసాలు సరేకానీ వాలంటీర్లుగా ఆ సమావేశం ఆవరణంతా గలగలా సందడిగా ఉత్సాహం గా ఎగిరే సీతాకోక చిలుకల్లా తిరిగే యువతీయువకులను చూస్తుంటే నాకు నా కాలేజీ గుర్తువచ్చి గుబులుఅయ్యేది.వాళ్ళంతా కూడా సుమారుగా నా వయసు వాళ్ళు కావటం వలన వాళ్లలో నన్ను చూసుకుని మళ్ళా అలా తిరగ్గలనా అనిపించేది.చెవులు ఉపన్యాసం వింటున్నా ,నా చూపులు వారి వెనకెనకే తిరిగేవి.
           తర్వాత్తర్వాత ఆ యువభారతీయులైన 
సుధామ,నాగినేని భాస్కర్రావు,కె.బి.లక్ష్మి, కామేశ్వరరావు,రత్నమాల మొదలైన వారంతా మాకు కుటుంబమిత్రులు అయ్యారు.
     యువభారతి ప్రచురణలు వందకి పైగానే ముఖచిత్రాలు వీర్రాజే వేసారు.నా పరిచయం, వివాహం తర్వాత  వీర్రాజుగారు రాసిన తొలి దీర్ఘ కావ్యం” మళ్ళీవెలుగు “ యువభారతి ప్రచురణే.నాకు అంకితం ఇచ్చిన ఈ పుస్తకావిష్కరణ సభ కి 1973 లో మూడునెలల పసిపాప పల్లవిని తీసుకొని హాజరయ్యాను.మాకు యువభారతి సంస్థతో చిరకాల అనుబంధం కొనసాగుతూనే ఉంది.
          రాజధాని నగరం కావటాన ఆఫీసు పనులమీదో,చుట్టపు చూపుగానో,స్నేహంగానో,మరే అవసరార్ధం వలనో  మాయింటికి వచ్చే పోయే అతిథులు చాలా ఎక్కువ.వీళ్ళుకాక ముఖచిత్రాలు కోసం వచ్చేకూడా వేసారు.
      నాకు చాలా సంతోషం కలిగించేదీ ఎదురుచూసేది ఆదివారం సాయంత్రం.ఎందుకంటే ఆదివారం రోజు ఆంధ్ర సారస్వత పరిషత్తులో యువభారతి నిర్వహించే కావ్యలహరి ఉపన్యాస పరంపర ఉంటుంది.దానికి మాత్రం ఇంట్లో వాళ్ళనందరిని బయల్దేరదీయరు.అయితే మేమిద్దరమే వెళ్ళేదీ తక్కువే.ఎందుకంటే సెలవురోజు కనుక మధ్యాహ్నమే సాహితీ మిత్రులు వచ్చి ఉండేవారు.ఎప్పుడూ సాహిత్యసభలకు వెళ్ళలేదేమో కావ్యలహరి పేరిట మనుచరిత్ర ,పారిజాతాపహరణము ,వసుచరిత్రము ,విజయవిలాస కావ్యాలపై ఉపన్యాస పరంపరగా ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారి తో ఉపన్యాసాలను  యువభారతి సారథులు ఇరివెంటి కృష్ణమూర్తి గారు,వంగపల్లి విశ్వనాధం గారూ నిర్వహించేవారు. 
       ప్రాచీన సాహిత్యం మీదే ఉపన్యాసాలు ఉన్నా గంభీరస్వరంతో ఆయన పద్యాలు చదువుతూ వివరించటం అద్భుతంగా అనిపించేది.మొదట్లో పరిషత్తు హాలులోనే జరిగేవి. కానీ సభకు అశేషంగా జనం వచ్చి వరండాలోను బయటా నిండిపోవటమేకాక ముందు ఖాళీ ప్రదేశం లోనూ నిలబడి వినేవారు.దాంతో తర్వాత్తర్వాత పరిషత్తు వెనుక ఓపెన్ వేదిక పై ఏర్పాటు చేయటం మొదలుపెట్టారు.
          ఉపన్యాసాలు సరేకానీ వాలంటీర్లుగా ఆ సమావేశం ఆవరణంతా గలగలా సందడిగా ఉత్సాహం గా ఎగిరే సీతాకోక చిలుకల్లా తిరిగే యువతీయువకులను చూస్తుంటే నాకు నా కాలేజీ గుర్తువచ్చి గుబులుఅయ్యేది.వాళ్ళంతా కూడా సుమారుగా నా వయసు వాళ్ళు కావటం వలన వాళ్లలో నన్ను చూసుకుని మళ్ళా అలా తిరగ్గలనా అనిపించేది.చెవులు ఉపన్యాసం వింటున్నా ,నా చూపులు వారి వెనకెనకే తిరిగేవి.
           తర్వాత్తర్వాత ఆ యువభారతీయులైన 
సుధామ,నాగినేని భాస్కర్రావు,కె.బి.లక్ష్మి, కామేశ్వరరావు,రత్నమాల మొదలైన వారంతా మాకు కుటుంబమిత్రులు అయ్యారు.
     యువభారతి ప్రచురణలు వందకి పైగానే ముఖచిత్రాలు వీర్రాజే వేసారు.నా పరిచయం, వివాహం తర్వాత  వీర్రాజుగారు రాసిన తొలి దీర్ఘ కావ్యం” మళ్ళీవెలుగు “ యువభారతి ప్రచురణే.నాకు అంకితం ఇచ్చిన ఈ పుస్తకావిష్కరణ సభ కి 1973 లో మూడునెలల పసిపాప పల్లవిని తీసుకొని హాజరయ్యాను.మాకు యువభారతి సంస్థతో చిరకాల అనుబంధం కొనసాగుతూనే ఉంది.
          రాజధాని నగరం కావటాన ఆఫీసు పనులమీదో,చుట్టపు చూపుగానో,స్నేహంగానో,మరే అవసరార్ధం వలనో  మాయింటికి వచ్చే పోయే అతిథులు చాలా ఎక్కువ.వీళ్ళుకాక ముఖచిత్రాలు కోసం వచ్చేవాళ్ళు సరేసరి.ఇంట్లో అందరికీ బంధుప్రీతి, అతిథి మర్యాదలు ఎక్కువే.అందువలన రోజంతా టీ పొయ్యి మీద మరుగుతూనే ఉండేది. రాత్రి అయినా సరే ఎవరైనా వస్తే మా పెద్దమరిది  అప్పు చేసైనా చికెన్ కొనుక్కొచ్చేసేవాడు.ఓపిక లేకపోయినా దేవుడా అనుకుని స్టౌ వెలిగించి కూర ,అన్నం చేయాల్సి వచ్చేది.ఒక్కొక్కప్పుడు ఓపిక లేకపోతే వచ్చిన వారికి ఉన్నది పెట్టేసి అడుగుబొడుగుతో కడుపు నింపు కోవటం కూడా జరిగేది.ఇటువంటివన్నీ ఇంట్లో ఉన్నవాళ్ళే ఆడవాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవాలి కానీ ఏం చెప్పుకుంటాం.
       అందుకే 'నిన్ను గ్రాడ్యుయేట్ చేసే పూచీ నాదీ'అని వీర్రాజు అంటున్నా ఒకవేళ ఇక్కడే చదివేటట్లైతే నేను అక్షరం ముక్కైనా చదవగలనా అని బెంగ పెట్టుకున్నాను .
       అయితే వీర్రాజు మిత్రులు  అందరూ ఈ ఏడాది విజయనగరం లో చదివించటమే మంచిది అనటంవల్లకావచ్చు,నాస్నేహితురాలు ఉషా " కాలేజీలో పాఠాలు మొదలయ్యాయి.లెక్చరర్లు సుభద్ర చదువు మానేసిందా అని అడుగు తున్నారు.మరి ఏం నిర్ణయించుకున్నావు?"అంటూ ఉత్తరం రాయటం వల్ల కావచ్చు,.అన్నయ్య కూడా"సుభద్రను విజయనగరం లోనే చదివిస్తారా? కాలేజీలు మొదలైనాయి"అని రాయటం వలన కావచ్చు,నాకు ఇచ్చిన మాట వలన కావచ్చు  నాకు విజయనగరానికి రిజర్వేషన్ చేయించారు.
         చదువు మీద మోహంతో విజయనగరానికి బయల్దేరినా ఒంటరిగా రైలెక్కి ఫ్లాట్ ఫాం మీద దిగులు పరుచుకున్న ముఖంతో ఉన్న వీర్రాజును చూసి దుఃఖం పొంగుకు వచ్చింది.రైలు బయల్దేరటంవలనో చూపుకు అడ్డంగా ఉన్న కన్నీటి పొరవలనో ఆయన రూపం మసకబారింది.చదువు పూర్తి చేయాలనే నా కోరిక కన్నీటి పొరను తుడిచేసింది.వాళ్ళు సరేసరి.ఇంట్లో అందరికీ బంధుప్రీతి, అతిథి మర్యాదలు ఎక్కువే.అందువలన రోజంతా టీ పొయ్యి మీద మరుగుతూనే ఉండేది. రాత్రి అయినా సరే ఎవరైనా వస్తే మా పెద్దమరిది  అప్పు చేసైనా చికెన్ కొనుక్కొచ్చేసేవాడు.ఓపిక లేకపోయినా దేవుడా అనుకుని స్టౌ వెలిగించి కూర ,అన్నం చేయాల్సి వచ్చేది.ఒక్కొక్కప్పుడు ఓపిక లేకపోతే వచ్చిన వారికి ఉన్నది పెట్టేసి అడుగుబొడుగుతో కడుపు నింపు కోవటం కూడా జరిగేది.ఇటువంటివన్నీ ఇంట్లో ఉన్నవాళ్ళే ఆడవాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవాలి కానీ ఏం చెప్పుకుంటాం.
       అందుకే 'నిన్ను గ్రాడ్యుయేట్ చేసే పూచీ నాదీ'అని వీర్రాజు అంటున్నా ఒకవేళ ఇక్కడే చదివేటట్లైతే నేను అక్షరం ముక్కైనా చదవగలనా అని బెంగ పెట్టుకున్నాను .
       అయితే వీర్రాజు మిత్రులు  అందరూ ఈ ఏడాది విజయనగరం లో చదివించటమే మంచిది అనటంవల్లకావచ్చు,నాస్నేహితురాలు ఉషా " కాలేజీలో పాఠాలు మొదలయ్యాయి.లెక్చరర్లు సుభద్ర చదువు మానేసిందా అని అడుగు తున్నారు.మరి ఏం నిర్ణయించుకున్నావు?"అంటూ ఉత్తరం రాయటం వల్ల కావచ్చు,.అన్నయ్య కూడా"సుభద్రను విజయనగరం లోనే చదివిస్తారా? కాలేజీలు మొదలైనాయి"అని రాయటం వలన కావచ్చు,నాకు ఇచ్చిన మాట వలన కావచ్చు  నాకు విజయనగరానికి రిజర్వేషన్ చేయించారు.
         చదువు మీద మోహంతో విజయనగరానికి బయల్దేరినా ఒంటరిగా రైలెక్కి ఫ్లాట్ ఫాం మీద దిగులు పరుచుకున్న ముఖంతో ఉన్న వీర్రాజును చూసి దుఃఖం పొంగుకు వచ్చింది.రైలు బయల్దేరటంవలనో చూపుకు అడ్డంగా ఉన్న కన్నీటి పొరవలనో ఆయన రూపం మసకబారింది.చదువు పూర్తి చేయాలనే నా కోరిక కన్నీటి పొరను తుడిచేసింది.

నడక దారిలో -18

 నడక దారిలో –18

  1971లో ఆంధ్రా ఉద్యోగులు తెలంగాణ నుండి వెళ్ళిపోవాలని డిమాండ్ వలన NGO బందు మొదలైందనీ,అది చాలా తీవ్రంగా జరుగుతుండటం వలన ఎప్పటి వరకూ సాగుతుందో తెలియదనీ,పరీక్షలు అయిపోయినట్లైతే వస్తాననీ, వివాహం తర్వాత వచ్చిన తన తొలి పుట్టినరోజు కలిసి జరుపుకోవాలని ఉందని రాసారు వీర్రాజు. అలాగే పరీక్షలు పూర్తి అయ్యాయని తెలిసి రెక్కలు కట్టుకునిి విజయనగరం ఏప్రిల్ 21 సాయంత్రానికి వచ్చేసారు.

       అనుకోకుండా ప్రాక్టికల్ పరీక్షలు పోష్ట్ ఫోన్ కావటంతో శ్రీకాకుళం లో పనిచేస్తున్న బాల్యమిత్రుడి దగ్గరకు వెళ్దామని బయల్దేరదీసారు.చిన్నన్నయ్యకి ఎలక్షన్ డ్యూటీ పడింది.మేమిద్దరమే వెళ్ళాము.ఆరాత్రి ఆ మిత్రుడు వెళ్ళనివ్వక వెళ్లకపోవడం తో రాత్రికి ఆగి ఉదయం విజయనగరం వచ్చేసాము. 

      ఆ వెంటనే మా పెద్ద ఆడబడుచు వాళ్ళు ఉన్న భువనేశ్వర్ కి వెళ్ళాము.ఎండలకో ఎక్కడో భోజనం పడకపోవటం వలనో వీర్రాజు కి కొద్దిగా అనారోగ్యం కలిగే సరికి తల్లడిల్లి పోయాను.ఆ రోజు పూర్తిగా విశ్రాంతి తీసుకోగానే కోలుకున్నారు.

         భువనేశ్వర్ లో 8-12 శతాబ్దాలమధ్య నిర్మించబడి అద్భుతమైన శిల్పాలతో అలరారే ఆలయాలు ఉండటంవలన దాన్ని టెంపుల్ సిటీ అని కూడా అంటారుట .ఆ ప్రాంతంలో ఉన్న కోణార్క్ సూర్య దేవాలయం, పూరీ జగన్నాథ్ ఆలయం, లింగరాజు టెంపుల్,రాజారాణీ టెంపుల్, ఖండగిరీ,దేవగిరీ గుహలూ, ధవళగిరి మొదలైన విహార ప్రదేశాలన్నీ చెట్టాపట్టాలేసుకుని ప్రేమ పక్షుల్లా విహరించాం.శిల్పాల స్కెచ్ వేస్తుండగా ఒక బెంగాలీ బాబు చూసి heavens gift అని వీర్రాజును పొగిడేసరికి ఏకాగ్రతతో వేస్తున్న ఆయన్ని చూసి నేను పొంగిపోయాను. ఏ శిల్పం చాటునో నా చెంపలపై కూడా చటుక్కున కొత్త స్కెచ్ వచ్చి చేరేది.

    కొత్త దంపతులకు గిలిగింతలు పెట్టే కోణార్క్ శిల్ప సౌందర్యం చూస్తుంటే తాపీ ధర్మారావు గారు రాసిన “దేవాలయాలలో బూతు బొమ్మలు ఎందుకు?” అనే పుస్తకం గుర్తు వచ్చింది. విజయనగరానికి దగ్గర్లో ఉన్న విశాఖలో సముద్రాన్ని కూడా అంతవరకూ చూడనేలేదేమో పూరీలో అనంతజలరాశిని చూసి అబ్బుర పడ్డాను.పాలనురుగుల అలలు సముద్రగర్భంనుండి తీసుకు వచ్చిన గవ్వల్ని, నున్నని రాళ్ళని ఆత్మీయంగా అందుకుని మురిసిపోయాను.ధవళగిరి స్తూపం చుట్టూ బుధ్ధుని కథలోని ముఖ్యఘట్టాలని చూసి ధ్యానాంతరంగంతో మౌనిని అయ్యాను. వారంరోజులపాటూ తిరిగి తిరిగి ఆనందాలనూ,పరిమళభరిత అనుభవాలూ మూటగట్టుకుని విజయనగరం వచ్చేసాము.

       వచ్చిన నాలుగు రోజుల తర్వాత ప్రాక్టికల్ పరీక్షలు పూర్తి చేసుకుని హైదరాబాద్ కి ఇద్దరం బయల్దేరాం.అమ్మ తీపి ఆవకాయ, మిఠాయిలు తయారు చేసి ఇచ్చింది.నేను పత్రికల్లో కట్ చేసి కుట్టించిన రంగనాయకమ్మ,ద్వివేదుల విశాలాక్షి లాంటి రచయిత్రుల సీరియల్సే కాక, మాలతీ చందూర్ రాసిన వంటలూ పిండివంటలు పుస్తకం కొనుక్కొని తీసుకు వెళ్ళటానికి సర్దుకున్నాను.

          అప్పట్లో హౌరా సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణం విజయనగరం నుంచి హైదరాబాద్ కు ఇరవై నాలుగు గంటలు పట్టేది.హైదరాబాద్ లో సాయంత్రం ఎక్కుతే విజయనగరంకి మర్నాడు సాయంత్రం చేరుతుంది.. విజయనగరంలో ఉదయం ఎక్కితే హైదరాబాద్ కి మర్నాడు ఉదయంచేరుతుంది.స్టేషన్ కు కుమారీ,తన చెల్లెలూ వచ్చారు.నేను వెళ్ళిపోతున్నానని వాళ్లు ఏడుస్తుంటే నాకు కూడా నా వాళ్ళందర్నీ విడిచివెళ్తున్నందుకు దుఃఖం ముంచుకొచ్చింది.ఇది ప్రతీ ఆడపిల్ల కూ అనుభవైకవేద్యమే కదా  

       ఇద్దరమే ఇరవైనాలుగు గంటలపాటూ చేసిన ప్రయాణం కూడా ఒక కొత్త అనుభవమే.

      మేము ఇల్లు చేరేసరికి వీర్రాజు గారి బాల్యమిత్రుడు, భార్య,రెండేళ్ళకొడుకుతో ఢిల్లీ నుండి వచ్చిఉన్నారు. హైమ నావయసుదే కావటాన నాకు కుమారీతో ఉన్న స్నేహం లాగే ఆమెతో కంఫర్టుగా అనిపించింది.ఆ కుటుంబం తో హైదరాబాద్ లోని విహార ప్రదేశాలు మళ్ళా తిరిగాము.

     హైదరాబాద్ రామకోటిలో ఉన్న మా ఇంట్లో పేద్ద వంటగది.దానికి మూడింతలు పెద్దదైన మరోగది ఉంటుంది .ఆ పెద్దగా ఉన్నగదిని శిల్పాలచిత్రాలు ఉన్న పెద్దకర్టెన్ తో పార్టిషన్ చేసారు.ఆ పార్టిషన్ కి ఒకవైపు ఒకపుస్తకాలషేల్ప్, వీర్రాజు గారు చిత్రాలు వేసుకోవడానికి వీలుగా టేబుల్, కుర్చీఉంటుంది, టేబుల్ మీద వాజ్ లో రకరకాల బ్రెష్ లు,కలాలు, టేబుల్ మీద రంగులూ ఉంటాయి.మరోపక్క ఇటీవలే కొన్న వైర్ అల్లిక సోఫా సెట్ ఉంటుంది.

     పార్టిషన్ రెండో భాగం లో కొత్తగా కొన్న డబుల్ కాట్ పైన ఓపక్క వీణ పెట్టగా మిగిలిన స్థలంలో చిన్న ఆడబడుచు పడుకుంటుంది.ఇద్దరు మరుదులు, బేంక్ లో పనిచేస్తూన్న బంధువుల అబ్బాయి కింద బొంతలు వేసుకు పడుకునే వారు.మా ఆడబడుచు నా వయసుదే కానీ మిగతావాళ్ళు నాకన్నా పెద్దవాళ్ళు కావటాన, కొత్తదనం వల్ల చనువుగా మాట్లాడటం తిరగటం చేయ లేకపోయేదాన్ని.

   వీర్రాజు గారు ఒక్కోసారి సినిమాకో హొటల్ కో వెళ్దామంటూ ప్రోగ్రాం వేసి ఇంట్లో వాళ్ళందరినీ బయల్దేరదీసేవారు.వాళ్ళైనా "మీరిద్దరూ వెళ్ళండి" అని అనేవారు కాదు.అన్నగారితో మాట్లాడటం తక్కువ.ఎదురు మాట్లాడటమూ తక్కువే.ఆ రోజుల్లో కుటుంబం లో మొదటి సంతానం కి సుప్రీం పవర్లు ఉండేవనుకుంటాను.ఇక అందరం సంతాపసభకి వెళ్ళినట్లు ఒకరితో ఒకరం మాట్లాడకుండా నిశ్శబ్దంగా సినీమా చూసుకొనో, బుధ్ధిగా హొటల్లో తినో ఇంటికి వచ్చేసే వాళ్ళం. దాంతో నాకు ఆయనతో సినిమా చూడాలనే ఆసక్తి , ఉత్సాహం ఎగిరిపోయింది.అందుచేత మేమిద్దరమే వెళ్ళి చూసిన సినిమాలే లేవు.

అటువంటప్పుడు చాలా కోపం వచ్చేది.హొటల్ లో సర్వర్ లా ఆర్డర్ ఇస్తే తెచ్చినట్లుగానో అవమానంచేసినట్లుగానో బాధ పడేదాన్ని.ఆ తర్వాత ఆయనతో తగువు పెట్టుకోవాలనుకున్నాను.పెళ్ళయిన కొత్తలోనే మా మధ్య తగువు రావటం ఇష్టం లేక బయటపడలేకా మనసు కలచి వేసింది.తర్వాత్తర్వాత నా అభ్యంతరాన్ని అర్థం చేసుకుని పిలిచి చెప్పటమో,లోపలకి వచ్చి చెప్పటమో అలవాటైంది.

          ఆ మధ్య వీర్రాజు గారి రచనలమీద వచ్చిన వ్యాసాల్ని సంకలనం చేసినప్పుడు కొందరు ఆత్మీయ కవుల్ని కూడా వ్యాసం రాసి ఇమ్మని కోరితే సాహిత్యం మీద కాకుండా స్నేహం మీదే రాసీ నాచేతి టీ చాలాసార్లు తాగిన విషయాన్ని కూడా ఉటంకించటం విశేషం.

          వచ్చినవాళ్ళు వెళ్ళేసరికి తొమ్మిదో పదో అయ్యేది.ఇక అప్పుడు చప్పగా చల్లారిపోయిన వంటకాల్ని ఇద్దరం భోంచేసేవాళ్ళం.

ఆతర్వాత అందరూ నిద్రపోయేవరకూ మళ్ళా ఆయన చిత్రాలు వేసుకుంటూ కూర్చునేవారు. నేను పంపు స్టౌ మీద వండే అలవాటు లేని వంటపనీ, ఇంటిపనులు చేసి అలసటకు కళ్ళు మూతలు పడుతుంటే బలవంతంగా నిద్రని తోలుకుంటూ రెప్పలు ఎత్తిపట్టుకుని సోఫాలో ఏదో ఒక పుస్తకం పట్టుకుని కూర్చునే దాన్ని.ఒక్కొక్కప్పుడు అదేసమయంలో బాపూ బొమ్మలు చూసి వేస్తూఉండేదాన్ని‌.

    పెళ్ళి అయ్యాక వచ్చినప్పుడు స్వాతి ఆఫీసు లో మా పడక ఉండేది.వీర్రాజుగారు ప్రభుత్వఉద్యోగి కనుక పత్రిక సంపాదకుడిగా పేరు ఉండరాదని అభ్యంతరం రావటంతో స్వాతి నుండి బయటకు వచ్చేసారు. అందువలన స్వాతి ఆఫీసు తాళం అడగటం బాగోదు కదా.అదీగాక ఇక్కడ ఖాళీ చేసి స్వాతి ఆఫీసును విజయవాడ కి మార్చేందుకు ఆలోచనలో వాళ్ళు ఉన్నారు.       

       అందుకని అందరూ నిద్రపోయేవరకూ గడిపి అప్పుడు నవారు మంచాన్ని వంటింట్లోకి తీసుకువెళ్ళి వాల్చి పక్క సర్దుకుని దానిమీద వాలేసరికి ముందుగా నిద్రే శరీరాన్ని ఆక్రమించేది.నిద్ర తీరకుండానే తెల్లవారుజాము నాలుగు గంటలు అయ్యేసరికి మంచినీళ్ళు వస్తున్నాయనే సూచనగా గొట్టంలోని గాలివల్ల కొళాయి ఈల వేసేసరికి ఒక్క గెంతుతో మంచం దిగి నేను ముఖం కడుక్కుని మంచినీళ్ళను పట్టేందుకు, ఆయన బొమ్మలు వేసుకునేందుకు పరుగు పెట్టేవాళ్ళం.

     అప్పట్లోనే బసు చటర్జీ తీసిన జయాబాధురీ నటించిన " పియా కా ఘర్" సినిమా విడుదల అయితే ఇంట్లో అందరం కలిసే చూసాం. ఆ డైరెక్టర్ మా ఇంట్లో మా సంసారాన్ని తొంగిచూసే ఆ సినిమా తీసాడేమో అనిపించింది.

            పేజీలకు పేజీలు ఉత్తరాల్లో ఒలికించిన కబుర్లన్నీ పావురాలే ఎగరేసుకు పోయాయా? మొగమాటాలతో,భయాలతో మేము మాటలను కలబోసుకోకుండానే, మనసులను పంచుకోకుండానే మా దాంపత్యం ఇలానే దేహభాషతో మాత్రమే కలకాలం నడుస్తుందా? ఈ వ్యక్తి నా మనసులోకి రాకుండా బయటే నిలబడిపోతారా? నాలో ఏమూలో ‌ఒకసంశయం,ఒక అసంతృప్తి మొలకెత్తింది.దానిని వృక్షంగా ఎదగకుండా అభిమానంతో కత్తిరించేసాను.    

    మే30 నుండి ప్రారంభమైన అఖిలభారత రచయితల సభలు కొంత ఊరట కలిగించాయి‌ ఆ సభల్లోనే వాసిరెడ్డి సీతాదేవి,ఆనందారామం,డి.కామేశ్వరీ ,రామలక్ష్మీ మొదలైన రచయిత్రులను పరిచయం చేసారు.ఆ తర్వాత్తర్వాత వారితోనే వేదికలు పంచుకునేలా నేను రచయిత్రి గా ఎదిగాను.

            అప్పుడప్పుడు ఇంటిమీద,అమ్మ మీద దిగులు అనిపించేది.వేెసవిలో నా పొడుగాటి జడకి చుట్టూ మాలచుట్టుకునేటన్ని పూలను ఇచ్చే సన్నజాజి పందిరి ఎంత చిన్నబోయిందో అని తలంచుకొనే దాన్ని.

         రాజధాని నగరంలో కిటికీలోంచి తొంగిచూసే అవకాశం లేక చందమామ నాకోసం అక్కడ డాబా మీద వెతుక్కొని నేను కనిపించక పోవటం తో కురిసే వెన్నెల్ని పొదువుకొని మేఘాలదుప్పట్లో ముఖం దాచుకున్నాడేమో.నేను పాడుకునే లలిత గీతాలు గొంతులో కొట్టుకు లాడేవి.

      హైదరాబాద్ వచ్చి నెల కావస్తుంది.నా చదువు సంగతి ఏమీ తెలియటం లేదు.కాలేజీలు తెరిచారోలేదో నా స్నేహితురాలు కూడా ఉత్తరం రాయలేదు.నేనైనా ఉత్తరం రాయాలి.

     వీర్రాజు ఉదయమే లేచి స్నాన పానాదులు చేసి ఆఫీస్ కి బందు కనుక వేయాల్సిన ముఖచిత్రాలకు బొమ్మలు వేసుకుంటూకూర్చునేవారు. అంతలో మిత్రులు వస్తేనో, స్వాతి పత్రిక పని ఉంటే బయటకు వెళ్ళేవారు.తిరిగి వచ్చేటప్పుడు ఆయనతో పాటు ఒకరో ఇద్దరో సాహితీ మిత్రులు ముఖచిత్రాలు వేయించుకునేందుకు కలిసి వచ్చేవారు.వాళ్ళు పని పూర్తి చేసుకుని వెళ్ళేలోపల ఓ రెండు సార్లయినా టీ ఇవ్వమని గోడకో లేకపోతే అటువైపు వచ్చిన మరుదులకో చెప్పేవారు.ప్రేమపూర్వకంగా దేవీ అనో లేదా సుభా అనో పిలవకపోయినా సుభద్రా అని పిలవడానికి కూడా అందరి ముందు ఆయనకి మొగమాటమే.నేను టీ తీసుకొని ఇవ్వటానికి వెళ్తే వచ్చిన వాళ్ళని నాకు పరిచయంచేయటం గానీ లేదా నాకు

వాళ్ళని పరిచయం చేయటం గానీ చేసేవారు కాదు.
అటువంటప్పుడు చాలా కోపం వచ్చేది.హొటల్ లో సర్వర్ లా ఆర్డర్ ఇస్తే తెచ్చినట్లుగానో అవమానంచేసినట్లుగానో బాధ పడేదాన్ని.ఆ తర్వాత ఆయనతో తగువు పెట్టుకోవాలనుకున్నాను.పెళ్ళయిన కొత్తలోనే మా మధ్య తగువు రావటం ఇష్టం లేక బయటపడలేకా మనసు కలచి వేసింది.తర్వాత్తర్వాత నా అభ్యంతరాన్ని అర్థం చేసుకుని పిలిచి చెప్పటమో,లోపలకి వచ్చి చెప్పటమో అలవాటైంది.
          ఆ మధ్య వీర్రాజు గారి రచనలమీద వచ్చిన వ్యాసాల్ని సంకలనం చేసినప్పుడు కొందరు ఆత్మీయ కవుల్ని కూడా వ్యాసం రాసి ఇమ్మని కోరితే సాహిత్యం మీద కాకుండా స్నేహం మీదే రాసీ నాచేతి టీ చాలాసార్లు తాగిన విషయాన్ని కూడా ఉటంకించటం విశేషం.
          వచ్చినవాళ్ళు వెళ్ళేసరికి తొమ్మిదో పదో అయ్యేది.ఇక అప్పుడు చప్పగా చల్లారిపోయిన వంటకాల్ని ఇద్దరం భోంచేసేవాళ్ళం.
ఆతర్వాత అందరూ నిద్రపోయేవరకూ మళ్ళా ఆయన చిత్రాలు వేసుకుంటూ కూర్చునేవారు. నేను పంపు స్టౌ మీద వండే అలవాటు లేని వంటపనీ, ఇంటిపనులు చేసి అలసటకు కళ్ళు మూతలు పడుతుంటే బలవంతంగా నిద్రని తోలుకుంటూ రెప్పలు ఎత్తిపట్టుకుని సోఫాలో ఏదో ఒక పుస్తకం పట్టుకుని కూర్చునే దాన్ని.ఒక్కొక్కప్పుడు అదేసమయంలో బాపూ బొమ్మలు చూసి వేస్తూఉండేదాన్ని‌.
    పెళ్ళి అయ్యాక వచ్చినప్పుడు స్వాతి ఆఫీసు లో మా పడక ఉండేది.వీర్రాజుగారు ప్రభుత్వఉద్యోగి కనుక పత్రిక సంపాదకుడిగా పేరు ఉండరాదని అభ్యంతరం రావటంతో స్వాతి నుండి బయటకు వచ్చేసారు. అందువలన స్వాతి ఆఫీసు తాళం అడగటం బాగోదు కదా.అదీగాక ఇక్కడ ఖాళీ చేసి స్వాతి ఆఫీసును విజయవాడ కి మార్చేందుకు ఆలోచనలో వాళ్ళు ఉన్నారు.       
       అందుకని అందరూ నిద్రపోయేవరకూ గడిపి అప్పుడు నవారు మంచాన్ని వంటింట్లోకి తీసుకువెళ్ళి వాల్చి పక్క సర్దుకుని దానిమీద వాలేసరికి ముందుగా నిద్రే శరీరాన్ని ఆక్రమించేది.నిద్ర తీరకుండానే తెల్లవారుజాము నాలుగు గంటలు అయ్యేసరికి  మంచినీళ్ళు వస్తున్నాయనే సూచనగా  గొట్టంలోని గాలివల్ల కొళాయి  ఈల వేసేసరికి ఒక్క గెంతుతో మంచం దిగి నేను ముఖం కడుక్కుని మంచినీళ్ళను పట్టేందుకు, ఆయన బొమ్మలు వేసుకునేందుకు పరుగు పెట్టేవాళ్ళం.
     అప్పట్లోనే బసు చటర్జీ తీసిన జయాబాధురీ నటించిన   " పియా కా ఘర్" సినిమా విడుదల అయితే ఇంట్లో అందరం కలిసే చూసాం. ఆ డైరెక్టర్ మా ఇంట్లో మా సంసారాన్ని తొంగిచూసే ఆ సినిమా తీసాడేమో అనిపించింది.
            పేజీలకు పేజీలు ఉత్తరాల్లో ఒలికించిన కబుర్లన్నీ  పావురాలే ఎగరేసుకు పోయాయా? మొగమాటాలతో,భయాలతో మేము మాటలను కలబోసుకోకుండానే, మనసులను పంచుకోకుండానే మా దాంపత్యం ఇలానే   దేహభాషతో మాత్రమే కలకాలం  నడుస్తుందా? ఈ వ్యక్తి నా మనసులోకి రాకుండా బయటే నిలబడిపోతారా? నాలో ఏమూలో ‌ఒకసంశయం,ఒక అసంతృప్తి మొలకెత్తింది.దానిని వృక్షంగా ఎదగకుండా  అభిమానంతో కత్తిరించేసాను.    
    మే30 నుండి ప్రారంభమైన అఖిలభారత రచయితల సభలు కొంత ఊరట కలిగించాయి‌ ఆ సభల్లోనే    వాసిరెడ్డి సీతాదేవి,ఆనందారామం,డి.కామేశ్వరీ  ,రామలక్ష్మీ మొదలైన రచయిత్రులను పరిచయం చేసారు.ఆ తర్వాత్తర్వాత వారితోనే వేదికలు పంచుకునేలా నేను రచయిత్రి గా ఎదిగాను.
            అప్పుడప్పుడు ఇంటిమీద,అమ్మ మీద దిగులు అనిపించేది.వేెసవిలో నా పొడుగాటి జడకి చుట్టూ మాలచుట్టుకునేటన్ని పూలను ఇచ్చే సన్నజాజి పందిరి ఎంత చిన్నబోయిందో అని తలంచుకొనే దాన్ని.

         రాజధాని నగరంలో కిటికీలోంచి  తొంగిచూసే అవకాశం లేక చందమామ నాకోసం అక్కడ   డాబా మీద వెతుక్కొని నేను కనిపించక పోవటం తో  కురిసే వెన్నెల్ని పొదువుకొని మేఘాలదుప్పట్లో ముఖం దాచుకున్నాడేమో.నేను  పాడుకునే లలిత గీతాలు గొంతులో కొట్టుకు లాడేవి.

      హైదరాబాద్ వచ్చి నెల కావస్తుంది.నా చదువు సంగతి ఏమీ తెలియటం లేదు.కాలేజీలు తెరిచారోలేదో నా స్నేహితురాలు కూడా ఉత్తరం రాయలేదు.నేనైనా ఉత్తరం రాయాలి.


12, ఆగస్టు 2022, శుక్రవారం

శీలా వీర్రాజు తో నా ప్రయాణం

 ~~ శీలా వీర్రాజు గారితో నా ప్రయాణం ~~


       మా అక్కయ్య పి.సరళాదేవి ప్రభావం వలన అతి చిన్నప్పుడే అఆలతో పాటే సోవియట్ లాండ్ ప్రచురణల బొమ్మల పుస్తకాల్ని చూస్తూ కథలు ఊహించటం నేర్చుకున్నాను.బొమ్మలువేయటం నేర్చుకున్నాను
  1970 లో స్వాతి ప్రారంభసంచికలో గౌరవసంపాదకునిగా శీలా వీర్రాజు పేరు చూసి "దేవి"పేరుతో ఆయన రచనలపై నా అభిప్రాయం వెల్లడిస్తూ ఉత్తరాలు రాయటంతో మొదలైన మా కలంస్నేహం అతి తొందరలోనే మా వివాహానికి దారితీసింది.ఆవిధంగా సాహిత్యమే మమ్మల్ని కలిపింది.
          నేను రాసిన అముద్రిత కథలు చదివి మూడు కథల్ని ఎంపిక చేసి పత్రికలకి పంపించమని చెప్పటంతో వివాహానికి ముందే 1970 లో తొలి కథ ప్రచురితమైంది.మా వివాహానికి ముందే  కాబోయే      భార్య రచయిత్రి అని మిత్రులకు చెప్పుకుని మురిసి పోయేవారు.
       1971 లో వీర్రాజు గారి చేయిపట్టినా చదువు పూర్తి చేసుకుని 1972 లో భాగ్యనగరంలో అడుగుపెట్టాను.అప్పుడప్పుడు కథలే రాస్తున్న దాన్ని ఇంట్లో కవితా సంపుటాలు,కవులరాక పోకలూ నన్ను కవిత్వం వైపు ఆకర్షించాయి.
         వివాహం లోగా ఒక దీర్ఘ కావ్యం రాస్తానని నాకు మాట యిచ్చినా అనేకపనులమధ్యదానిని ఆలస్యంగా పూర్తిచేసి మా అమ్మాయి జన్మించినప్పుడు "మళ్ళీ వెలుగు "కావ్యాన్ని గ్రంథరూపంలో తీసుకు వచ్చి నాకు అంకితం చేశారు. అప్పటికి అతి తక్కువ మంది మాత్రమే దీర్ఘ కవితలు రాసారు.కానీ దీర్ఘకావ్యాలమీద పత్రికల్లో వ్యాసాలు వచ్చినప్పుడు అందులో మళ్ళీ వెలుగును ప్రస్తావించనప్పుడు కాస్త చిన్నబుచ్చుకునే వారు.
        ఒకరోజు సినిమా పాటకి నృత్యం చేస్తూ అడుక్కోటానికి వచ్చిన ఎనిమిదేళ్ళ పాపని చూసి మనసు కలతపడి నేను రాసిన ఆకలినృత్యం కవిత చదివి వీర్రాజు గారు చాలా మెచ్చుకుని నా చూపును,ఆలోచనలనూ కవిత్వం వైపు మళ్ళించారు.
        1980 లో కథలపుస్తకం ప్రచురించాలని అనుకున్న నాఆలోచనని వెనక్కి నెట్టి వీర్రాజు గారు ఆకలినృత్యం పేరిట నా తొలి కవితా సంపుటిని ప్రచురించి నాకు అందించారు.
     రచన చేయటం పత్రికలకు పంపటం వరకూ నావంతు కానీ ఆతర్వాత  వాటిని ఒకదగ్గరకు చేర్చి ప్రతి రెండు మూడేళ్ళకూ ఒకటి చొప్పున తొమ్మిది కవితా సంపుటాలూ,మూడుకథల సంపుటాలూ వెలుగులోకి రావటం వెనుక ముఖపత్ర అలంకరణ దగ్గరనుండి పుస్తకాన్ని అందంగా తీర్చిదిద్దడం వరకూ వీర్రాజు గారి కృషి వెలకట్టలేనిది.
     మా అమ్మాయి యూఎస్ లో ఉన్నప్పుడు జరిగిన జంటటవర్లు ఉగ్రవాద దాడిలో కూలిన సంఘటన నన్ను కలవరపరచటంతో నేను రాసిన కవిత చదివి వీర్రాజు గారు అద్భుతంగా వచ్చిందనీ,దీనిని దీర్ఘకవితగా పెంచి రాయగలవేమో ప్రయత్నించమని ప్రోత్సహించారు.యుధ్ధనేపధ్యంలో రాసిన" యుధ్ధం ఒక గుండె కోత "ఆ విధంగా వెలుగులోకి వచ్చింది.ఇది మరో మూడు భాషల్లోకి అనువాదం కావటాన్ని చూసి వీర్రాజు గారు చాలా ముచ్చట పడి స్నేహితులకు చెప్పుకునే వారు. "మనరచనలను ప్రమోట్ చేసుకోవడం మనకి చేతకాదు సుభద్రా పుస్తకరూపంలో ఉంటే ఎప్పటికైనా ఎవరో ఒకరు గుర్తించకపోరు" అంటూ ఉండేవారు.
      ఎప్పటికప్పుడు మా జీవితంలో ఎదురైన ఆటుపోట్లతో కుంగి పోతున్నప్పుడు తనదో,నాదో  పుస్తకం ఒకటి ప్రచురించి ఆ పని లో తాను గాయాన్ని మాన్పుకోవటమే కాక డిప్రషన్ లోకి పోకుండా నన్ను రచనలవైపు మరలించేలా చేసినదీ ఆయనే.
      పుస్తకం ప్రచురించటం వీర్రాజు గారికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్యం.డీటీపీ చేయించిన దగ్గరనుండి,ప్రూఫులు దిద్దటంతో బాటు, ముఖచిత్రాన్ని వేయటం, ప్రచురణ పనిపూర్తి అయ్యి పుస్తకం చేతిలోకి వచ్చేవరకూ విశ్రమించకుండా ఒక తపస్సులా తాను నిమగ్నమైపోతూవుంటారు.ఆ పుస్తకం మాదైనా ,మిత్రులదైనా,కేవలం పరిచయస్తులదైనా అదే అంకితభావం తో చేసేవారు..ఈ విషయం అనేకమంది సాహితీ మిత్రులకు తెలిసినదే.
   కొందరు పుస్తకం పని ఉన్నంతకాలం ఆయన చుట్టూ తిరిగి పని పూర్తయ్యాక ముఖం చాటు చేసేవారు. ఒక్కొక్కప్పుడు ఆయన తన వయసూ, ఆరోగ్యం పట్టించుకోకుండా శ్రమపడుతుంటే నేను విసుక్కోవటం కూడా జరిగేది‌.కానీ కొత్త పుస్తకాన్ని  కొత్తగా జన్మించిన పసిపాపని చేతుల్లోకి తీసుకొన్నంతగా తన్మయులైపోతారు.
      అందుకేనేమో తన కథల్నీ,కవితలన్నీ,నవలల్నీ మళ్ళీ మళ్ళీ ప్రచురించుకున్నారు.అయితే ఒకేసారి పుస్తకప్రచురణకి పెట్టుబడి పెట్టటం ఆర్థికంగా భారం ఔతుందని ముఖచిత్రాలు వేయించుకుని ఎవరైనా ఇచ్చిన డబ్బు, మాపుస్తకం ఎవరైనా కొనుక్కోగా వచ్చిన డబ్బు, మాకు వచ్చిన పురస్కారాల డబ్బే కాకుండా పెన్షన్ అందుకోగానే ప్రతీ నెలా ఆయనది ఒక రెండువేలూ,నాది ఒకరెండువేలూ ఒకకవర్లో పెట్టి వాటినే అంచెలంచెలుగా పుస్తక ప్రచురణలకు ఉపయోగిస్తూ ఉండేవారు.అంతేతప్ప ఎక్కడనుండీ,ఎవరినుండీ ఆర్థిక సహాయం పొందకుండానే మా ఇద్దరి పుస్తకాలు ప్రచురించటానికి ఉపయోగించేవాళ్ళం.
        తన పుస్తకాలు కట్టలని రోజుకు ఒక్కసారైనా తన చేతులతో తడుముకుంటూనో , సర్దుతూనో ఉండేవారు.
         అదేవిధంగా ముఖచిత్రం వేయించుకుని ఊహించని విధంగా పెద్దమొత్తం ఎవరైనా ఇస్తే  వెళ్ళి ఒక బొమ్మ కొనుక్కొని వచ్చేవారు.ఆ విధంగా మా ఇంటిని బొమ్మలకొలువుగా, మ్యూజియం గా చేసారు.ఇదిఅయిదారేళ్ళక్రితం వరకూ కొనసాగింది. ఇంక కళాఖండాలు పేర్చుకోడానికి స్థలం లేక కొనటం మానేసారు.అంతేకాక మా పుస్తకాలు అమ్మకం చేసుకోలేక ఇంటినిండా పేరుకుపోయి ఉండటంతో కొత్తగా రాసిన రచనలు ప్రచురించుకోవటానికి మాయిద్దరిలో  భయం మొదలైంది.అవికాకుండా వీర్రాజు గారు వేసిన వర్ణచిత్రాలు కూడా చాలా ఉన్నాయి.
      మా తదనంతరం మా అమ్మాయికి  భారం కాకూడదనే ఆలోచనతో  పెయింటింగ్స్ ని ఎక్కడైనా భద్రపరచాలనే నిర్ణయానికి వచ్చి వీర్రాజు గారు తాను జన్మించిన రాజమహేంద్రవరం లో  చిత్రకళను అభ్యసించిన దామెర్ల చిత్రకళా పరిషత్తు కు వారు తన జీవిత కాలంలో వేసిన 78 తైలవర్ణ చిత్రాల్ని చిత్రకళాభిమానులకు మార్చినెలలో అంకితోత్సవం చేసాము.వీర్రాజుగారు ఎన్నో ఏళ్ళుగా సేకరించిన వివిధ దేశాలకు చెందిన చిత్రకళకు సంబంధించిన అమూల్యమైన గ్రంధాలు కూడా అక్కడే అందజేసాము.
      కీర్తిప్రతిష్టలకోసమో , పురస్కారాల కోసమో తాపత్రయం పడకుండా తాను ఎలా జీవించాలనుకున్నారో అలానే నిబద్ధత తో, నిజాయితీగా జీవించి తాను చేయాలనుకున్న
కార్యక్రమాలన్నీ నెరవేర్చుకుని నిష్క్రమించారు.
      అదే దారిలోనే గత యాభై ఏళ్ళకు పైగా వీర్రాజు గారితో పాటు సాహిత్యాన్నే శ్వాసిస్తూ నడిచాను.ఇంతకాలం భౌతికంగా ఇద్దరంగా ఉన్నాము.నేను కలాన్ని ముడిచేయనంతకాలం నా సాహిత్య ప్రయాణంలో వీర్రాజు గారు నిరంతరం నాతోనే ఉంటూనే ఉంటారు.

( ఆగష్టు కవిసంధ్య పత్రికలో ప్రచురితం)

28, జూన్ 2022, మంగళవారం

లోపలి మనిషి చిరునామా కోసం

 లోపలి మనిషి చిరునామా కోసం ~


నాతో మాట్లాడాలనుకుంటే

నేల చూపులు చూడకు

నాకళ్ళలోకీ

కంటిపాప లోతుల్లో ప్రవహించే

సజల సముద్రాల్ని చూడు

అక్కడ నీకోసమో నాకోసమో కాక

చుట్టూ ఉండే వారికోసం

తడి ఆరని చెమ్మని హత్తుకో


నాతో మాట్లాడాలనుకుంటే

నా హృదయం నిరంతరంగా

శబ్దించే సానుకూల స్పందనల్ని విను

అంతకన్నా ముందు

హృదయభాషని అధ్యయనంచేయు

అప్పుడే

నీ ఆవరణలోని జనఘోషని

నీలోకి అనువదించుకోగలుగుతావు.


నాతో మాట్లాడాలనుకుంటే

నామెదడులోకి ప్రవేశించు

అక్కడినుండి మెదడు పొరలమధ్య

అల్లిబిల్లిగా అల్లుకున్న ఆలోచనల తీగల్ని మీటు

ఎందరెందరో స్త్రీల అస్తిత్వ రాగాల్ని

వెతుక్కుంటూ ప్రయాణించు

ఎక్కడో ఒక దగ్గర నీవాళ్ళు కూడా కనిపించొచ్చు.


  నాతో మాట్లాడాలనుకుంటే

  నేను పరిచిన కాగితం మీద చూపు సారించు

  పంక్తులదారంట అక్షరాలను ఏరుకుంటూ

  ముందుగా నీలోకి ఇంకించుకో

  నీ అభిప్రాయాలు నువ్వు సంతరించుకో

  సషబిషలు లేకుండా

  నువ్వేమనుకుంటున్నావో

  రెండు నాలికలతో కాకుండా

  నిజాయితీగా నీమాటలు గానే చెప్పు

  మంచైనా చెడైనా అరువు మాటలు కాక

  మనసు విప్పి మాట్లాడు.


  పోనీలే అలా కాదనుకుంటావా

  నీలోని నువ్వును వెతుక్కుంటూ

  నీలోకి నువ్వే ప్రవహించి

  మౌనలిపిని హృదయంపై చెక్కుకుంటూ

  నీతో నువ్వే సంభాషించుకో

  అప్పుడైనా

   నీ లోపలి మనిషి నీకు చిక్కుతాడేమో.

(కవిసంధ్య మే- జూన్2022)

మర కవిత

 ~ మర ~


నేను ఎప్పుడు ఇలా మారిపోయాను

అప్పట్లో చినుకులు పడుతుంటే

వానా వానా వల్లప్ప అని తిరిగి

అరచేతులు చాచి దోసిలి నింపుకుని.

ఎగరేస్తే ముత్యాలై వాకిట్లో దొర్లేవి

నాలికతో అందుకునే చాతకపక్షిని అయ్యేదాన్ని

మరి

ఎప్పుడు ఇలా మారిపోయానో


అప్పట్లో వెన్నెల డాబా నిండా కురుస్తుంటే

చాపమీద వెల్లకిలా పడుకుని

చెవిలో గుసగుసలు చెప్తున్న

గాలి సందేశాన్ని వింటూ

మనసులో రేగే మధురోహలతో

రెప్పల మాటున కలల్ని దాచుకునేదాన్ని

మరి

ఇప్పుడుపొరలు కప్పుకున్న కంటిపాప

ఎప్పుడు ఇలా తడి ఎరుగని

పొడి చూపుగా మారిపోయిందో!


అప్పట్లో పెరటి లోని సన్నజాజి పందిరి

అకస్మాత్తుగా తీగని జార్చి పూలకొనగోటితో

అటుగా వచ్చినప్పుడు నా బుగ్గని మీటితే

మంచు బిందువు చెంపలకి

కెంపు ములాము పూసేది

మరి

ఇప్పుడు బీటలు వారిన బీడై

ఎప్పుడు ఇలా మారిపోయానో


చైత్రమాస వసంతాగమనంలో

ఏ రెమ్మచాటు నో దాగిన కోయిల

నిరంతరాయంగా కుహూమంటూ పిలుస్తుంటే

గొంతు కలిపి ఎన్ని రాగాలు

మలయమారుతం తో పాటూ

పరిసరాల్ని సంగీతమయం చేసేదాన్నో

మరి

ఇప్పుడేంటి గొంతునిండా కరకు ముళ్ళు

రాగాల్ని ముక్కలుగా కోసేస్తున్నాయి.


కాలయంత్రమా

నువ్వెంత కఠినాత్ముడివి

బాధ్యతల పళ్ళసంకెళ్ళు తగిలించి

నీ చక్రాల మధ్య ఇరికించి

నన్ను నుజ్జునుజ్జు ను చేసి

నీలాగే స్పందన లేని యంత్రాన్ని చేసావు. 

(విశాలాక్షి జూన్2022)


యుధ్ధం

~~ యుధ్ధం ~~

అవును
నేను యుద్ధం చేస్తున్నాను
ఇప్పుడే కాదు
తొలిసారి అమ్మ పొట్టలోంచి
వచ్చినప్పటినుంచే మొదలైంది
అందుకే కదా ఏడుస్తూనే వచ్చాను.

అవును
నేను యుద్ధం చేస్తూనే ఉన్నాను
అన్నయ్యకి వేసిన మీగడ పెరుగు కోసమో
సెకెండ్ హేండ్ పుస్తకాలు వద్దనో
వెలిసి పోయిన అక్కకి బిగువైన ప్రాక్ తొడగననో
నాదైన నల్లని పలక కావాలనో
కొంగు చాటున దుఃఖాన్ని దాచుకున్న అమ్మతో
చేస్తున్నది యుద్ధం అని తెలియకుండానే చేసాను.

నేను యుద్ధం చేస్తూనే ఉన్నాను
అక్షరాలు ఏరుకునే క్రమంలో
నేనంటే ఏమిటో తెలుసుకోటానికో
నాకాళ్ళు బలంగా నేలమీద నిలబడటానికో
నాచేతులు పైకిసాగి ఆత్మవిశ్వాసాన్ని పతాకగా ఎగరేయటానికో
ఇంటా బయటా
వయసుతోనో మనసుతోనో
నాతో నేను నిత్యం యుద్ధం చేస్తూనే ఉన్నాను.

ఆశ్చర్యం
నా అడుగుజాడలు నా ఒక్కదానివే కావు
అడుగులో అడుగు కలుపుతూ
కవాతుగా వేనవేల పాదాలు నావెనకే
సగం ఆకాశాన్ని వెలిగిస్తున్న పతాకాలు
అయినా ఇప్పుడు కూడా
సమాజంతోనో సంప్రదాయాలతోనో
మాకోసం మేము
నిత్యమూ  యుద్ధం చేయక తప్పటం లేదు
ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో?
(పాలపిట్ట జూన్2022)

19, జూన్ 2022, ఆదివారం

 నడక దారిలో --17

        సంక్రాంతి మూడు రోజులూ కొంగ్రొత్త సంబరాలతో హృదయానికి రెక్కలు తొడిగి భవిష్యత్తు మీద కొత్త ఆశల్ని ప్రోది చేస్తూ వెళ్ళింది.

            ఇంట్లో పెళ్ళి సందడి మొదలయ్యింది.అద్దెఇల్లే అయినా సున్నాలు వేయించారు.ద్వారబంధాలకు వార్నీషు రంగులు వేయించారు.గుమ్మాలకు రంగుల వార్నీషులతో నేను డిజైన్లు వేసాను.నాపెళ్ళికి ఇంటి అలంకరణలు నేనే చేసుకున్నాను.

          వీర్రాజు గారు సంక్రాంతికి వచ్చినప్పుడు తెచ్చిన గోరింటాకుపొడితో రెండు చేతులకూ గోరింటాకు పలుచగా కలిపి చీపురుపుల్లతో డిజైన్లు పెట్టుకున్నాను.నేను హైస్కూల్ లో చదివే రోజుల్లో రాజీ వాళ్ళనాన్న హైదరాబాద్ నుండి తెచ్చారని చిన్న గోరింటాకు పొడి పేకెట్ నాకూ, కుమారీకీ ఇస్తే ఎలా పెట్టుకోవాలో తెలియక ముద్దగా కలిపి దాన్ని చందమామ పెట్టుకున్నది గుర్తువచ్చి నవ్వుకున్నాను.ఆ రోజుల్లో మెహంది పొడి హైదరాబాద్ లో మాత్రమే దొరికేది. 

           చిన్నక్కకు చంటిపిల్లాడు.పెద్దక్క వాళ్ళు కొత్తగా అనంతపురం బదిలీ కావటంతో సామానుతో,పిల్లలతో మరోఊరు చేరటం కొత్తింట్లో సర్దుకోవటం ఈ హడావుడి వలన ముందుగా రాలేకపోతున్నాననీ,తర్వాత నాతో హైదరాబాద్ వస్తాననీ అంది పెద్దక్కయ్య.నీపెళ్ళికి ఏర్పాట్లూ, ఆలోచనలూ నువ్వే చేసుకోవాల్సి వచ్చింది.ఇంట్లో ఇవన్నీ పట్టించుకునే శ్రధ్ధ లేనివాళ్ళు కావటంవలన నీకు నువ్వే పెళ్ళిపెద్దవి కావాల్సివచ్చింది.నిన్ను తప్పు పట్టని విధంగా జాగ్రత్తగా మసలుకో.సమయానికి నేనూ రాలేక పోతున్నానుఅని రాసింది.

          సభావివాహమే కనుక కట్నాలూ,కానుకలూ,పెళ్ళిఖర్చులూ పెద్దగా లేవు.వీర్కిరాజుగారి ఉంగరం చేయించారు.బట్టలు ఆయన వద్దన్నారు,కానీ ఒక జత తీసారు. అమ్మ ఎప్పటిదో ముక్కలుగా తెగిన గొలుసును నేను డిగ్రీలో చేరినప్పుడు చిన్న ఆఠీన్ షేపులోని సేండ్ స్టోన్ లాకెట్ తో సన్నని గొలుసు చేయించింది.అది చేయగా మిగులు ముక్కలుతో ఇప్పుడు ఒక తాళి చేయించింది.అత్త మూడుపేటల చంద్రహారాన్ని నాకు ,చిన్న ఆడపడుచుకు చెరిసగంగా రెండు నెక్లెసులుచేయించమని వీర్రాజు గారు ఇచ్చారు.నాకు నెక్లెస్ వద్దని దానితో ఒక చైను,ఒకజత సన్నని గాజులు చేయించు కున్నాను . అంతేకాకుండా తమ తరఫున ఒక తాళి చేయించమని అన్నయ్య కు డబ్బు పంపించారు.

           అందువల్ల నాకు కొనాల్సినవి లేవు కానీ అన్నయ్యవాళ్ళకు పెళ్ళి రోజు విందు భోజనం ఖర్చు మాత్రం తప్పలేదు.

          మా ఇల్లు చిన్నది కనుక తోటలో లక్ష్మీరావు మామయ్య ఇల్లు పెళ్ళికి వేదిక అయ్యింది.

          వీర్రాజు గారు పెళ్ళికార్డులు ప్రింట్ చేయించి పంపారు.కాలేజీలో కొందరులెక్చరర్లకు,నా మిత్రులకు ఇచ్చాను.నా బాల్యస్నేహితుడు దూర్వాసరావుకు,లతకు పోస్ట్ చేసాను.మా లెక్చరర్లు అందరూ అభినందనలు తెలిపారు.చదువుమానవద్దని సలహా ఇచ్చారు.

          చూస్తూ చూస్తూనే ఫిబ్రవరి 13 వచ్చేసింది.హైదరాబాద్ నుండి వీర్రాజు గారి కుటుంబం, మిత్రులు ఆరోజు సాయంత్రానికి వచ్చేసారు.    

       మగవారిని మా ఇంట్లో ఉండమని ఆడవాళ్ళం అందరం తోటలోని మామయ్య ఇంటికి వచ్చేసాము.

       ఆ రాత్రి అంతా ఒక విధమైన ఉద్వేగంతో ఆ రాత్రి రెప్ప వాలని రాత్రే అయ్యింది.

        పద్నాలుగు ఉదయమే తలకి స్నానం చేసి అక్కయ్య ఇచ్చిన ఆరణి సిల్క్ చీర కట్టుకున్నాను.అంతలోనే నా స్నేహితురాళ్ళు అందరూ వచ్చేసారు.మా ఇద్దరినీ కుర్చీల్లో కూర్చోబెట్టి కాళ్ళకు పారాణి ,కళ్యాణతిలకం పెట్టమని సభా వివాహం కదా అని మానేయొద్దని ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు.

               అది కూడా యథాప్రకారం చేసారు.కొత్తచీర,చుట్టూ జనసమూహం.నాకు ఊపిరి ఆడనట్టై అక్కడే టేబుల్ మీద ఉన్న టేబుల్ ఫాన్ ప్లగ్ కి పెట్టబోయాను.చేతికి పట్టిన చెమట వల్లనేమో ఒక్కసారి ఝిగ్గున షాక్ కొట్టింది.కళ్ళు బైర్లు కమ్మి తూలేను.ఇదేమిటి ఈ శుభవేళ ఇలా జరిగింది అని కలవర పడ్డాను.నా స్నేహితులు చేస్తున్న వేళాకోళాలు చెవిలోకి వెళ్ళలేదు.కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి.

       అపశకునాలు ,ఛాదస్తాలూ ఇలాంటి వాటిపై నాకు నమ్మకం లేకపోయినా నా మనసంతా కలత పడింది.ఈ శుభసమయంలో ఇలా జరగటం ఎందుకో కొద్దిసేపు నా భవిష్యత్తు మీద భయం కలిగింది. ఎవరికి చెప్పుకోలేని దిగులు కమ్మింది.పక్కనే కూర్చున్న ఆయన ఇవేవీ గమనించనే లేదు.అంతలోనే మనసును స్వాధీనం లోకి తెచ్చుకున్నాను.

     నా డాబా మీద షామియానా వేసారు.నాసహాధ్యాయులు,నా లెక్చరర్లు సీతాలక్ష్మి గారూ,చాగంటి కృష్ణకుమారి గారు,ఉమాకుమారిగారూ,పంకజగారూ, విజయలక్ష్మి గారు వచ్చారు.

       వివాహానికి అక్కయ్య ఇచ్చిన చీర మార్చుకుని వీర్రాజు గారు తెచ్చిన నేరేడు పండు రంగు జరీ అంచు తో ఉన్న తెల్లని కంచి పట్టుచీర కట్టుకున్నాను.ఆ చీర చూసి మా కాలేజీ మిత్రులు "ఏమిటి సుభద్రా రోజూ కాలేజీకి కట్టుకుంటూనే ఉంటాం. పెళ్ళికి కూడా తెల్లచీరేనా వేరే రంగుల్లో కొనిపించుకోలేకపోయావా" అన్నారు.అంతలో డాబామీద ఏర్పాటు చేసిన వివాహ వేదికకు మమ్మల్ని తీసుకువెళ్ళారు.మా లెక్చరర్లు”ఇంకా పురోహితులు రాలేదు.వేదికమీద ఏర్పాట్లు లేవు.ముహూర్తం దగ్గర పడింది కదా” అక్కయ్యని అడిగారట.బాజాలూ, భజంత్రీలు,మంత్రాలు, పురోహితులు, కట్నాలు,కానుకలూ లేవండి.వాళ్ళిద్దరి కోరిక మేరకు ఇలా జరుగుతుంది,” అని చెప్పేసరికి ఆశ్చర్యపోయారు.

      విజయనగరంలోని ప్రముఖ సాహితీవేత్త, బహుభాషావేత్త,మాకుటుంబానికి అత్యంత సన్నిహితులైన రోణంకి అప్పలస్వామి గారు ముందుగా పెళ్ళీ దాని పూర్వోత్తరాలు వివరించిన తర్వాత వారి ఆధ్వర్యంలో బంధుమిత్రుల కరతాళ ధ్వనులతో మాఇద్దరిచేతా దండలు మార్పించారు.అమ్మ చేయించినదే కాక అత్తవారి తరపున చేయించిన తాళి కలిపి సూత్రధారణ కూడా జరిగింది.

       వీర్రాజు గారి మిత్రులు కథక్ మిత్ర పేరుతో కథలు రాసే వేమూరి నరసింహారావు రెండు బంగారు ఉంగరాలు బహుమతిగా తీసుకువచ్చి ఒకరివేలుకు ఒకరిచేత ధరింపజేయించారు.మిత్రబృందం, బంధువుల కోలాహలం మధ్య మా వివాహం జరిగింది.నా సహచరుడు నామీద నమ్మకం ఉంచి,నా ఆలోచనలనూ,ఆచరణనూ గౌరవిస్తారని నమ్మి అపారమైన నమ్మకంతో,భరోసాతో నేను ధైర్యంగా తీసుకున్న నానిర్ణయం సరియైనదే అని మనస్ఫూర్తిగా విశ్వసించాను.

        ఇంతకాలం మా అభిరుచులు,ఆలోచనలూ,ఆశలూ కలబోసుకున్న మేమిద్దరం నాకెంతో ఇష్టమైన విశాఖ సంపంగి పరిమళాలను మనసునిండా నింపుకుంటూ ఆ రాత్రి ఏకశరీరులమయ్యాము.

     ఆ సాయంత్రమే చాలామంది మిత్రులు, బంధువులు,మరుదులూ, ఆడబడుచులూ తిరుగు ప్రయాణం కట్టారు.

      మూడురోజుల తర్వాత మేమిద్దరం,అక్కయ్య,అన్నయ్యలతో కలిసి హైదరాబాద్ బయలుదేరాం.   

        ఆరోజుల్లో విజయనగరం నుంచి హైదరాబాద్ కు హౌరా సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ప్రయాణం ఇరవైనాలుగు గంటలూ పట్టేది.ఉదయం విజయనగరం నుండి బయ లుదేరితే మర్నాడు ఉదయం కి హైదరాబాద్ లో దిగేవారం.

       హైదరాబాద్ లో అందరం కలిసి చూడాల్సిన ప్రదేశాలన్నీ తిరిగాము.హైదరాబాద్ అనగానే గుర్తొచ్చే చార్మీనార్ పైవరకూ ఎక్కి అక్కడినుండి ఊరును చూడటం ఎంతబాగుందో!నౌబత్ పహాడ్ పైన ఏర్పాటు చేసిన టెలీస్కోపులో ఆకాశంలోని నక్షత్రాలను చూసి ఆకాశాన్ని అందుకున్నంతగా సంబరపడిపోయాను.సాలార్జంగ్ మ్యూజియం లోని కళాఖండాలు కళ్ళువిప్పార్చుకు చూసాను.అలసిసొలసి గోల్కొండ కోట పైవరకూ చేరి ఎందరు స్త్రీలు ఈ జనానాలో మగ్గిపోయారో అని బాధగా అనుకున్నాను.నెహ్రూజూలాజికల్ పార్క్ లో జంతువులను చూస్తూ పసిపిల్లనైపోయాను. 

         ఊళ్ళు తిరగటం,అక్కడి విశేషాలు , విహారస్థలాలు చూడటం నాకెంతో ఇష్టం,కాని విజయనగరం దాటి ఇంతకాలం ఏవీ చూడలేదు.అందుకే పగలంతా తిరిగి అలసిపోయినా సంతోషంతో మనసు నిండిపోయింది.మా ఇల్లు రెండే రూములు,చుట్టాలు వలన మాకు పడక పక్కనే ఉన్న స్వాతిపత్రిక ఆఫీస్ లో ఏర్పాటు చేసారు.ఆ గది రోడ్డు వైపు మడిగి లా ఉండి చెక్క తలుపులు ఉండేవి. వాటిని ఆఫీసు వాళ్ళే తాళాలువేసుకునేవారు.మాఇంటి గుమ్మం ఎదురుగా మరో ద్వారం ఉండేది. ఆ తాళాలు మాకు ఇచ్చారు. 

        రాత్రి నవారుమంచం పక్కా తీసుకొనివెళ్ళి పడుకున్నాం.మా మనసులు కలవటానికి కారణమైనది స్వాతి మాసపత్రిక అయితే మా తొలిరాత్రులకు వేదిక అదే స్వాతి ఆఫీసు కావటం ఒక తీపిజ్ణాపకం.

           ఆదివారం రోజున సాహితీ మిత్రులు అందరికి విందు ఏర్పాటు చేసారు.దిగంబరకవులైనజ్వాలాముఖి, నగ్నముని,నిఖిలేశ్వర్, వరవరరావు గార్లు వచ్చారు.శివారెడ్డి, కుందుర్తి గారు మొదలైన సాహితీ మిత్రులు,యువభారతి సభ్యులు శ్రీపతి,ఆనందారామం తదితర రచయితలూ స్వాతి బలరాం,వేమూరి గోపాలకృష్ణ మొదలైన వారంతా వచ్చారు.కుటుంబమిత్రులు శిష్ట్లా శకుంతల, రామడుగు రాధాకృష్ణ మూర్తి ఇలా అంతా సాహితీ బంధువులే వచ్చారు.ఎవరో "మీరు లలితగీతాలు పాడుతారటకదా" అని నాచేత పాటపాడించుకున్నారు.

         తర్వాత రోజు అక్కయ్య వాళ్ళు అట్నుంచి అటే అనంతపురం వెళ్ళిపోయారు.ఆ మర్నాడు సాయంత్రం నేనూ అన్నయ్య విజయనగరం కి తిరుగు ప్రయాణం కట్టాము. అంతవరకూ,అమ్మా అన్నయ్యలతోడి బంధం.కొత్తగా ఏర్పడిన బంధమే అయినా వీర్రాజు గారిని వదలివెళ్తున్నందుకు కళ్ళనీళ్ళు పర్యంతం అయ్యాను.ఆయనాఅంతే.వివాహబంధం అంతచిత్రమైనదా అనుకున్నాను.

         అప్పటికే పదిరోజులు పైన కాలేజీకి డుమ్మా కొట్టాను కనుక మరి విశ్రాంతి తీసుకుందామని అనుకోకుండా కాలేజీకి వెళ్ళిపోయాను.నా క్లాస్ మేట్స్ అందరూ నన్ను చుట్టేసి పెళ్ళికబుర్లూ, హైదరాబాద్ లో నేను తిరిగిన స్థలాలు గురించి అడిగారు.మా లెక్చరర్లు అందరూ నావివాహవిధానాన్ని ప్రశంసించారు.యువతరం ఈవిధంగా ఆలోచిస్తే వరకట్నం మనసమాజంలో ఇంతసమస్యగా మారేది కాదు అన్నారా.నాకు క్లాసుకు వచ్చే లెక్చరర్లు లో ముగ్గురు అవివాహితలే.

. పదిరోజులుగా జరిగిన పాఠాలనోట్స్ ఉష దగ్గర తీసుకుని కాపీచేసుకున్నాను.

         1971 మార్చి 27న అప్పటి భారతదేశ ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీ బంగ్లాదేశ్ స్వాతంత్ర్యపోరాటానికి పూర్తి మద్దతు తెలిపి బంగ్లా శరణార్థులకోసం భారత సరిహద్దులను తెరిపించారు. పలురాష్ట్రాల్లోనికి ప్రవేశించిన శరణార్థులకు అవసరమయిన సౌకర్యాలు కలిపించడానికి వేలకోట్ల రూపాయలు ఖర్చు పెట్టసాగింది భారత ప్రభుత్వం.ఒకవైపు యుద్ధపరిస్థితులుతో కొంత ఆర్ధిక సంక్షోభం ఏర్పడింది.అన్నీ ధరలు పెరిగాయి.

      ఆ క్రమంలో తపాలా శాఖ కూడా కవర్ల ధర పెంచేసింది.తపాలాశాఖని పోషిస్తున్నది మేమే కదా అని నవ్వుకున్నాను.

         యథాప్రకారం వారానికి ఒకనాడు శుక్రవారం సాయంత్రానికి హైదరాబాద్ నుండి పావురం ఎగిరివచ్చి తీపి కబుర్లు మోసుకొస్తూనేఉంది.అలాగే విజయనగరం నుండి హైదరాబాద్ కూ ముచ్చట్లు మూటకట్టి తీసుకువెళుతూనే ఉంది.


 


మాతృ దినోత్సవం

       మాతృ దినోత్సవం 


ఈరోజు

 ఎక్కడచూసినా అమ్మలచిత్రాలూ

 కవిత్వంగా మారిన అమ్మలూ

 

అక్షరకథనాల్లోంచి అమ్మలూ

 కాసింత సేపు రంగులపెట్టి ముందుకు చేరాను

 ఒకదాని తర్వాత మరొకటి అమ్మమీద చిత్రాలే

దాని నోరుమూసి కళ్ళుమూసుకున్నాను

ఎక్కడో తరంగాలు తరంగాలుగా 

గాలి లోనుంచి అమ్మ ప్రేమో

అమ్మ మీద ప్రేమో వైనాలువైనాలుగా

రాగం తీగలు సాగుతూ చెవిసోకింది..


సామాజిక మాధ్యమాలన్నీ

అమ్మపాలరుచిని ఆస్వాదిస్తున్నాయ్

సరే నేనూ ఓ ఫోటో పెట్టేద్దాం అనుకున్నా

ప్ఛ్.చిత్రం

ఒక్కటంటే ఒక్క చిత్రం కూడా దొరకలేదు

అమ్మ ఉన్న ఒకట్రెండు ఫొటోల్లో చూద్దామా అంటే

 మా ఇద్దరిమధ్యా మరికొందరు

 ఏంచేయను.

 దిగులుగా ఒకసారి అద్దంలోకి తొంగిచూసాను

 అదే దిగులు ముఖంతో అమ్మ

అంతలో

అమ్మా అని పిలుపు

వెనక్కి తిరిగి చూస్తే నాముఖంతో అమ్మాయి

ఆ వెనుకే అమ్మాయి ముఖంతో పాపాయి.

ఇంకా ఫొటో అక్కర్లేదు

దిగులూ అక్కర్లేదు.

ముగ్గురమ్మలూ ఇంట్లోనే ఉంటే

ఇంకా అమ్మకోసం వెతుకులాట ఎందుకు

మూడువందల అరవై అయిదు రోజులూ

మా ఇంట మాతృదినోత్సవాలే.

19, ఏప్రిల్ 2022, మంగళవారం

నడక దారిలో --15

 నడక దారిలో-15


 నా ఉత్తరం అందగానే ఆఘమేఘాల మీద ఆ వారాంతం వస్తున్నానని రాసారు.

         అలాగే అప్పట్లో హైదరాబాద్ నుండి విజయనగరానికి  ఇరవైనాలుగు గంటల రైలుప్రయాణం . ముందురోజు సాయంత్రం రైలు ఎక్కితే మర్నాడు సాయంత్రం ఆరున్నరకి చేరారు.అన్నయ్య స్టేషనుకు వెళ్ళి తీసుకువచ్చాడు.

         ఇంటికి వచ్చి స్నానపానాదులు,భోజనం అయ్యేసరికే రాత్రి పడుకునే సమయం అయ్యింది.

           మర్నాడు టిఫిన్లు చేసి అన్నయ్యలు ఇద్దరూ బయటకు వెళ్ళారు.అమ్మ ఇచ్చిన కాఫీ తీసుకుని అన్నయ్య గదిలో ఉన్న వీర్రాజు గారికి ఇవ్వటానికి వెళ్ళాను. నాకు మొదటినుంచీ చొచ్చుకు పోయి మాట్లాడే స్వభావం లేకపోవటం వలన మనసులో ఉన్నది పేపర్ మీద పెట్టగలను. మాట మాత్రం గొంతులోంచి పెగల్లేదు. ఎప్పుడూ లేనిది గుండె కొట్టుకుంటున్న చప్పుడు నాకే వినిపిస్తుంది.

               నేను మాట్లాడలేదు సరే ఆయనా చాలా సేపు మాట్లాడలేదు. ‘స్త్రీ మనస్తత్వ విశ్లేషణతో ఇన్ని ప్రేమకథలు ఎలా రాసారబ్బా’ అని మనసులోనే అనుకున్నాను. కొన్ని నిముషాల తర్వాత “నువ్వు రాసిన కథలు తీసుకురా చదువుతాను” గోడతో అన్నట్లు అన్నారు.

                మాట్లాడకుండా వెళ్ళి తీసుకు వచ్చి ఇచ్చాను. ఎందుకో నాకు అసంతృప్తిగా అనిపించింది. నా మనసు చదివినట్లు ఆయన మళ్ళా ఎందుకనో “తర్వాత చదువుతానులే” అని అవి పక్కన పెట్టి నా ముఖంలోకి చూసి ” నువ్వని తెలిసి భలే ఆశ్చర్యపోయాను తెలుసా. నువ్వు మరీ ఇంత చిన్నపిల్లలా ఉంటావనుకోలేదు” అన్నారు.

            నేను చిన్నగా నవ్వి ఊరుకున్నాను.

             “మనం సభా వివాహం చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాను. నువ్వేమంటావు?”

             మాటలతో కాకుండా తల ఊపి “నా చదువు పూర్తయ్యాక” మెల్లగా అన్నాను.              

             “పెళ్ళయ్యాక ఇక్కడే ఉండి చదువుకోవచ్చులే. మా అమ్మ సంవత్సరీకాలకు ముందే చేసుకోవాలని  అనుకుంటున్నాను. అందుకే ఏప్రిల్ లోపున చేసుకుందామని. “అంటూ నా ముఖంలోకి చూసారు.

              ‘ఆధునికంగా చేసుకోవాలనే ఉద్దేశంతో మంత్రాలపెళ్ళి వద్దు అని, మళ్ళీ ఈ సెంటిమెంట్ ఏమిటి. నమ్మకం, సెంటిమెంట్ వేర్వేరేనా’ ఆలోచనలో పడ్డాను. నా నా చదువు సక్రమంగా కొనసాగుతుందా అనే సందిగ్ధంలో కూరుకుపోయి ఏమీ  సమాధానం చెప్పలేకపోయాను. మొదటిసారి కలిసిన సందర్భం ఇలా మరీ ఇంత పొడిగా ఉండటం నాకేమీ బాగా అనిపించలేదు.

                ఆరోజు సాయంత్రం పెద్దమామయ్య వచ్చారు.అన్నయ్యలూ, వీర్రాజు గారూ అమ్మ అందరు కలిసి సంప్రదించుకున్నారు. ఆ సందర్భంలోనే వీర్రాజు గారు తన చెల్లెల్ని చిన్నన్నయ్య కిచ్చి పెళ్ళి చేయటాన్ని ప్రస్తావించారు.

                పక్కగదిలో కూర్చుని వారి మాటలు వింటున్న నాకు ఒక్కసారి మనసుకి ముల్లు గుచ్చుకున్నట్లు అయ్యింది. ‘ ఈయన నాకోసం వచ్చారా? చెల్లెలి పెళ్ళి సంబంధం స్థిరపరచుకోటం కోసం వచ్చారా?  ఇప్పుడే ఈ ప్రస్తావన తేవాల్సిన అవసరం ఉందా? మా పెళ్ళి తర్వాతైనా అడగొచ్చు కదా?’ మొదట్లోనే అసంతృప్తి మనసులోకి వస్తుంటే నన్ను నేను సరి చేసుకోటానికి ప్రయత్నించాను.

               అంతలో చిన్నన్నయ్య “చేసుకుంటాను గానీ అన్నయ్యకీ, చెల్లెలికీ  అయ్యే వరకూ ఎన్నాళ్ళు అయినాసరే  చేసుకోను. అది మీకు ఇష్టమైతేనే.”అన్నాడు.

                  తర్వాత వివాహ విధానం గురించి చర్చ జరిగింది. మామయ్య అందరూ కలిసి మాఘమాసం లో తేదిని నిర్ణయించుకుందాం అనుకున్నారు. రెండుమూడు రోజుల్లో తేదీ చెప్తానని మామయ్య అన్నారు.

           అందరి అంగీకారంతో చర్చముగించారు.

              ఆ మర్నాడు నేను రాసిన నా కథలలో మూడు కథల్ని ఎంపిక చేసి ఒకటి తాను తీసుకు వెళ్ళి ఎమ్. రాజేంద్ర సంపాదకత్వం తో వస్తున్న పొలికేక వారపత్రిక కు ఇస్తాననీ, మిగతా రెండు నన్నే జ్యోతి మాసపత్రిక కు పంపమన్నారు.         

              తర్వాతి రోజు నా చెంపల పై ఒక తీపి సంతకం వేసి తిరుగు ప్రయాణమయ్యారు.        

           మళ్ళీ మర్నాటి నుంచి కాలేజీ కి వెళ్ళటం కొనసాగించాను. ఉషా వలనా, కుమారి వలనా విషయం తెలుసుకున్న మిత్రులు నన్ను ఆట పట్టించారు. “చదువూ, ఉద్యోగం అని అప్పుడే పెళ్ళి చేసేసుకుంటున్నావేంటోయ్ ” అంటూ.            

              “నిజమే ఎందుకు తొందరపడ్డాను. పరీక్షలు అయ్యాకే చేసుకుంటే బాగుండేది. అదేమిటీ మనసులోని మాట ఎందుకు చెప్పలేకపోయాను.”          

              అప్పుడప్పుడు మనసు నన్ను ప్రశ్నిస్తూనే ఉంది.         

             ఎదురుగా చెప్పలేక మూగపోయాను. కానీ మళ్ళీ ఉత్తరంలో ఈ విషయం ప్రస్తావించాను. “పెళ్ళయినా చదువుకుందూగానిలే. మళ్ళీ అనుమానమెందుకు” అన్నారు.    

             మాటిమాటికీ అదే విషయాన్ని ప్రస్తావించటం బాగుండదని ఊరుకున్నాను.                                                 

           అక్టోబర్ నెలలో ఒకవారం పొలికేక సంచిక లో నామొట్టమొదటి కథ కొడవంటి సుభద్రా దేవి పేరుతో  “పరాజిత” ప్రచురితం అయ్యింది. నాకు ఒక రెండు సంచికలు పంపారు. అందులో ఒకటి కాలేజీకి తీసుకువెళ్ళి నామిత్రులకీ, మాతెలుగు లెక్చరర్ సుందరీమేడం కి చూపించాను. అందరూ సంతోషంగా అభినందించారు. అంతకు ముందు కాలేజీ మాగజైన్ల లో తప్పని సరిగా ఒక రచన ప్రచురితం అవుతున్నా ఇలా ఒక వారపత్రికలో నాపేరు చూసుకోవటం భలే సంతోషం కలిగింది. 

          ఈకథకూ ఒక నేపధ్యం ఉంది. కొడవటిగంటి కుటుంబరావు గారి కురూపి నవలలో కథానాయిక అందంగా ఉండదు. కాని ఎమ్మే చదివిందని రాసారు. అది చదివాక నిజమే కదా! కథానాయిక తప్పని సరిగా సకల సద్గణవంతురాలూ, సౌందర్యరాశి అయి ఉండాలా? ఈ ఆలోచనలతో మాకాలేజీలో నా సహాధ్యాయి అయిన ఒక మరుగుజ్జు అమ్మాయిని దృష్టిలో పెట్టుకుని పరాజిత కథని రాసాను.                                                       మొత్తంమీద మా కాలేజీ లో రచయిత్రిని ఐపోయాను. మిగిలిన రెండు కథల్నికూడా జ్యోతి పత్రికకి పోస్ట్ చేసాను. అవి నా వివాహం అయ్యాకే ప్రచురితం అయ్యాయి.

             మా మధ్య ఉత్తరాలు కొనసాగుతున్నాయి అయితే ఆయన రాసే ఉత్తరాల థోరణి కొంత మారింది. నేను చదువు ఒత్తిడి వల్లా వెంటనే రాయలేక పోయాను. అయినా యథా ప్రకారం నేను చదివిన పుస్తకాల గురించి, నేను విన్నా నేర్చుకున్న పాటలు గురించి కాలేజీ విషయాలూ, స్నేహితులు విషయాలూ రాస్తూనే ఉన్నాను. ఒక రోజు ఆయననుండి చాలా చాలా పెద్ద ఉత్తరం వచ్చింది అది చదువుతూ చదువుతూంటే భయకంపితురాలిని ఐపోయాను. చివరకు వచ్చేసరికి ఒక పెద్ద నిట్టూర్పుతో తేలిక పడ్డాను. ఇంతకీ అదేమిటంటే సెప్టెంబర్ 24 వతేదీ గురువారం రోజు సాయంత్రం ఆరు గంటల సమయం అకస్మాత్తుగా రోడ్లమీద  ఒగురుస్తూ, ఒకరినొకరు తోసుకుంటూ ప్రజలంతా పరుగులు తీస్తూ “గండిపేట తెగింది, పానీ ఆ రహా హై” అంటూ లక్షల సంఖ్యలో పరుగులు తీస్తూ జంటనగరాల్లోని అందరూ ఎత్తైన ప్రదేశాలకూ, ఇళ్ళపైకీ, డాబాలమీదకీ ప్రాణాల్ని పిడికిట్లో పట్టుకుని పైపైకి పల్లపు ప్రాంతం నుండేకాక అన్ని ప్రాంతాల నుండీ పరుగులు తీసారు. ఆ తోపులాటలో తొక్కిసలాట లో పరిగెత్తటం లో వాహనాలకింద పడి గాయాలపాలయ్యారు. ఏవీథిలో చూసినా జనప్రవాహాలే. చార్మీనారు పై శిఖరం వరకూ నీరు వచ్చేసిందని సుల్తాన్ బజార్ కొట్లు మునిగిపోయాయనీ చెప్పుకుంటూ పరుగులు తీస్తున్నారు. అంతకుముందు మూడురోజుల పాటు ఎడతెరిపి లేని వర్షాలతో హుస్సేన్ సాగర్, గండిపేట నిండిపోవటం ఒక భవనం కూలటం వలన వర్ధిల్లాలని చాలామంది చనిపోవటం వల్ల ఈ పుకారు ప్రజల్ని భయకంపితులను చేసింది.

             వీర్రాజుగారూ వాళ్ళు కూడా వాళ్ళింటి పైన డాబా పైకి ముఖ్యమైన వస్తువులతో చేరుకున్నారట.హైదరాబాద్ అంతటా సందట్లో సడేమియా అని లూటీలూ, దొంగతనాలూ, దోపిడీలతో అల్లకల్లోలం అయిపోయింది. నలభై నిముషాలు తర్వాత పోలీసులూ, ఆతర్వాత రేడియోలద్వారా అదంతా పుకార్లేనని పదేపదే ప్రకటనలు చేస్తే అందరూ ఊపిరి పీల్చుకున్నారట. అప్పట్లో వార్తల కి రేడియోనే ఆధారం. మాకు విజయవాడ రేడియో ప్రసారాలు వస్తాయి కనుక ఈ విషయాలు మాకు తెలియలేదు.        

             అప్పట్లోనే ఈసంఘటన ఆధారంగా వాసిరెడ్డి సీతాదేవి “పానీ ఆ రహా హై” అని మంచికథ  రాసింది. డిసెంబర్లో నా పుట్టినరోజు మరో వారం రోజులు ఉందనగా అనుకోకుండా నాకు వీర్రాజు గారినుండి పార్సిల్ ద్వారా లేత నిమ్మపండు రంగు ఫుల్ వాయిల్ చీర అందుకున్నాను. ఏదో తప్పనిసరి బాధ్యతగా ఇంట్లో ఏడాదికొకసారిి కొనే చీర  కాకుండా ఆత్మీయంగా అచ్చంగా నాకోసం అందుకున్న ఆ చీరతో ఆ ఏడాది నాపుట్టిన రోజు నాకు చాలా ప్రత్యేకం గా అనిపించింది. ఆ సంతోషాన్ని అక్షరాల్లో నింపి  రాజధాని నగరానికి ఓ లేఖని  పావురంలా ఎగరేసాను.


*****



నడక దారిలో --16

 నడక దారిలో-16-శీలా సుభద్రా దేవి


          ఇద్దరి మధ్యా లేఖలు పావురాలై ఎగరటం మొదలై ఆరునెలల పైనే అయ్యింది. కొత్త ఏడాది కొత్త ఊహలను ప్రోది చేసుకుంటూ అడుగు పెట్టింది. ఈ కొత్త సంవత్సరం నా జీవితంలో ఎన్నెన్ని మార్పులనో తీసుకువచ్చేలానే అనిపించింది. ఎన్నెన్ని  కొత్త అనుభవాలనో తొలి అడుగులోనే రుచి చూపిస్తూ కొంగ్రొత్త మలుపులను తీసుకు వచ్చేలానే ఉంది. అవి నాకు శుభసంతోషాలనే ఇస్తుందో , కష్టాల కడగండ్లు పాదాల ముందు పరుస్తుందో. అన్నింటినీ ఎదుర్కోగలిగే మనోబలాన్ని ఎప్పటికప్పుడు సమకూర్చుకుంటూనే ఉన్నాను.                   మామయ్య, అన్నయ్య ‘ఒకసారి విజయనగరం రమ్మని పెళ్ళి ఎప్పుడు ఎలా చేయాలో నిర్ణయించు కుందామని’ ఆయనకు ఉత్తరం రాసారు. ఉత్తరం అందగానే సంక్రాంతి, శని, ఆది వారాలు కలిసివచ్చేలా చూసుకుని రెక్కలు కట్టుకుని వచ్చారు.

          ఫిబ్రవరి 14 వ తేదీ ఆదివారం ఉదయం 8-30 గంటలకు మంచి ముహూర్తం ఉందని మామయ్య చెప్పారు. ముందు రోజు రెండవ శనివారము కనుక పెళ్ళికి వచ్చే వారికి వీలుగా ఉంటుంది కనుక అదేరోజు నిర్ణయించారు. పెళ్ళి విజయనగరంలోని ప్రముఖ బహుభాషావేత్త, పండితుడు, మా కుటుంబానికి సన్నిహితులు అయిన రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభా వివాహం చేసుకుని బంధుమిత్రులకు విందు ఇచ్చేలా నిర్ణయం చేసారు.పెళ్ళి తర్వాత హైదరాబాద్ కు నన్ను తీసుకువెళ్ళి అక్కడ  సాహితీ మిత్రులకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నానని ఆయన చెప్పారు

          ఇవన్నీ చాలావరకూ నాతో ఉత్తరాల్లో సంప్రదించినవే. అయితే మాత్రం ఉత్తరాల్లో అన్ని కబుర్లు చెప్పేసరికి  ఇంకేమీ చెప్పేందుకు ఏమీ లేదో ఏమిటో అన్నీ పొడిపొడి మాటలే. మా దగ్గరలో  ఏమనిషి గాలి అయినా ఉందనుకుంటే అత్తిపత్తి లా ముడుచుకు పోయే ఈ వ్యక్తి తర్వాత్తర్వాత నా మనసులోకి  రాకుండానే బయటే నిలబడిపోతారో ఏమిటో అని నా లోలోపల సంశయం మొలకెత్తింది. అలా అని సినీమాల్లోలా హత్తుకొనే వుండాలని కాదు గానీ నాకోసం నాదైన మనిషిగా  నాకు అవసరమైనప్పుడు భరోసాగా ఉండాలని కోరుకోవటం తప్పు కాదు. సంసారం అంటేనే ఒకరిమీద ఒకరికి గాఢమైన నమ్మకం అనీ ఆ నమ్మకం సడలకుండా చూసుకోవాల్సిన బాధ్యత దాంపత్య ముడితో ఒక్కటైన భార్యాభర్తలదే అని  నా ఉద్దేశ్యం.

        ఇంక అప్పుడప్పుడు ఒంటరిగా ఉన్న సమయంలో నాతో  పెళ్ళికి ఏమేమి కొనాలో, తర్వాత సంసారం లో ఏమిటి సమకూర్చుకోవాలో సంప్రదించారు.

          ఒకరోజు చిన్నన్నయ్య మా ఇద్దరినీ ఫస్ట్ షో సినిమాకు తీసుకువెళ్ళాడు. పుత్సల వీధిలో నడిచి వెళ్తున్నప్పుడు బహుశా ఆ వీధిలో ఉన్న బంధువుల చూపులన్నీ మా వెంట వెంటనే నడిచి శల్యపరీక్ష చేసే ఉంటాయి. సినీమా అయిపోయాక ఇద్దరం ఎత్తుగా ఉండే అక్కడి రిక్షాలో ప్రయాణం ఒక కొత్త అనుభవం కలిగించింది. తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి పది దాటింది. అన్నయ్యా, అమ్మా నిద్రపోయారు. గేటు తలుపు కొట్టినా లేవలేదు.ఆయన చటుక్కున గేటు ఎక్కి గోడ దూకి గేటు తీసారు. నేనూ, చిన్నన్నయ్య ఆశ్చర్యపోయాము. నా దగ్గర తన హీరోయిజం చూపించటానికి ఇలా చేసారా అని ముసిముసిగా నవ్వు కున్నాను.

          ఎవరూ దగ్గర్లో లేనప్పుడు అంటే అన్నయ్యలు సాయంత్రం బైటకు వెళ్ళినప్పుడు మాత్రం డాబా మీద సూర్యుడు చీకటి దుప్పటి కప్పుకునేవరకూ, చిరువెన్నెల తుప్పర్లలో తడుస్తూ కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళం. నేను పాడిన లలిత గీతాలు వినేవారు. పండుగ మూడురోజులూ నిముషాలలాగే గడిచిపోయాయి.

          ‘డిగ్రీ మూడవ సంవత్సరంకి హైదరాబాద్ లో ఏదైనా కాలేజీ లో చదవటానికి కుదురుతుందేమో స్నేహితులను  కనుక్కుంటాను’ అన్నారు కానీ ‘రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రెండుగా విభజన జరిగేలాగే కనిపిస్తుంది. అలా జరుగుతే మా ఆఫీసులో కూడా మార్పు వస్తుందేమో. అప్పుడు ఎక్కడ చదవాలనేది ఆలోచిద్దాం. అయితే నా దగ్గరే ఉండి చదువు కుంటేనే బాగుంటుంది.” అనే అభిప్రాయం వెలిబుచ్చారు..

          డిగ్రీ మూడవ సంవత్సరం హైదరాబాద్ లో చదవటానికి కుదురుతుందా’ అని మాకు ఫిజిక్స్ చెప్పే మా ప్రిన్సిపాల్ సీతాకుమారి గారిని అడిగాను. యూనివర్సిటీలు వేర్వేరు  కనుక అది కుదరదని, అందులోనూ హైదరాబాద్ లోని ఉద్యమం నేపధ్యంలో  అసలు కుదరదనీ, ఈ ఒక్క ఏడాది ఇక్కడే చదవటమే మంచిదని అన్నారు ఆమె.

        హైదరాబాద్ లో తెలంగాణా ఉద్యమం తీవ్రంగానే ఉందని,ప్రత్యేక తెలంగాణ ఉద్యమం హైదరాబాద్ నుండి గ్రామాలకు విస్తరిస్తున్న వైనం కొంత, కొంతగా తెలుసు కుంటున్న కొద్దీ మనసును దిగులు కమ్ముకుంది.

          ఆంధ్రాలోనూ విశ్వవిద్యాలయాల పరిధిలో అసహనాలూ ఆందోళనలూ అప్పుడప్పుడు రాజుకుంటున్నా ఎక్కువగా తీవ్రతరం కాలేదు.

          ఈ పరిస్థితుల్లో యూనివర్సిటీ మారటం మంచిది కాదనే మిత్రులు అభిప్రాయం వెలిబుచ్చారు. ఆయనతో’ ‘ ఒక యూనివర్సిటీ కాలేజీలో చదువుతూ మరో యూనివర్సిటీ కాలేజీలో తర్వాతి సంవత్సరం చదవటానికి వీల్లేదట’ అన్నాను. అది నిజమేనని అందరూ చెప్పారు. ఇక మూడవ సంవత్సరం విజయనగరం లోనే చదవటం తప్పదేమో. అయితే పెళ్ళయ్యాక కూడా అన్నయ్యల మీద నా చదువు భారం పడకూడదని భావించాను. అందుకు ఆయనకూడా అవసరమైన డబ్బు పంపుతానని అన్నారు కానీ పెళ్ళయ్యాక కూడా మరో ఏడాది దూరంగా ఉండటానికి నా మాట తీసేయలేక ఆయన అతి కష్టం మీద ఒప్పుకున్నారు

          ఫస్ట్ ఇయర్ లోనే పెళ్ళిచేసుకుని చదువు మానేసిన నా సహాధ్యాయి సూర్యకాంతం పరిస్థితి నాకు రాకుంటే చాలు అనుకున్నాను.

          రెండు సంవత్సరాల క్రితం ఏర్పడిన ‘తెలుగు అకాడమీ’ మెంబర్లు ఆ ఏడాది నుండి కొత్తగా మొదలైన  తెలుగు మాధ్యమం కి అవసరమైన ఇంటర్ పుస్తకాలు తెలుగులో ప్రచురించాలని వాటికి చిత్రాలు వేయాలని ఆయనని అడిగారట. అవి వేస్తే డబ్బులు వస్తాయని,పెళ్ళి ఖర్చులకు ఉపయోగ పడుతుందని సంబరంగా అన్నారు. అందుకని ఇంకా ఉండాలని ఉన్నా వెళ్ళక తప్పదని తిరిగి హైదరాబాద్ బయల్దేరారు. వెళ్ళేటప్పుడు యథాప్రకారం నేను రాయటానికి అశ్రద్ధ చేస్తానేమోనని ప్రతీ వారం ఉత్తరం రాయమని చెప్పి కవర్లు కూడా కొని ఇచ్చారు.

          మళ్ళా యథాప్రకారం నేనూ, నా కాలేజీ చదువు మొదలైంది.పెళ్ళి సమయంలోనూ, ఆతర్వాత హైదరాబాద్ కి వెళ్తే చదువు కుదరదని ఈలోపునే నోట్స్, రికార్డులు పూర్తి చేయటం హడావుడిలో పడిపోయాను.

          హైదరాబాద్ నుండీ పెద్దపెద్ద రెక్కలతో ఎగిరొచ్చిన పావురాలు ప్రతీ వారం ఒలకబోసిన అనురాగాల మూటలు నా దోసిట్లో తొణికిసలాడుతూనే ఉన్నాయి.

        అన్నింటికీ సమయం సమకూర్చుకోలేక సంగీత కళాశాలకు వెళ్ళటం మానేసాను. ఒకరోజు అక్కయ్య దగ్గర నుండి వచ్చిన ఉత్తరం నాకు మరింత కంగారు తెచ్చిపెట్టింది.

“నువ్వు చదువు మధ్యలో పెళ్ళి చేసుకుంటున్నావు. చదువు మానేసే ఉద్దేశం ఉందా? ఒకవేళ గర్భం వేస్తే అప్పుడైనా మానేయాల్సి ఉంటుంది. చదువు పూర్తి అయ్యేవరకూ పిల్లలు వద్దనుకుంటే సూర్యారావు మామయ్య కూతురు డాక్టర్ కదా ఆమె సలహా ముందుగానే తీసుకో. వీర్రాజుతో ఈ విషయం సంప్రదించి నిర్ణయించుకో” అని రాసింది అక్కయ్య. ఈ విషయం ఇంతకు ముందు ఆలోచించనే లేదే అనుకున్నాను. వెంటనే ఆయనకి ఈవిషయం రాస్తే ఆయనకూడా నా ఆలోచనను సమర్థించారు. నేను మామయ్య కూతురు కి ఉత్తరం రాసాను.ఆమె వెంటనే సమాధానం రాసింది. బహిష్టు తర్వాత ఆరవరోజు రాత్రి  నుండి ఇరవైఒక్క రోజులు రోజుకొక మాత్ర చొప్పున వాడి ఆపేయాలనీ, తర్వాత రెండోరోజు మామూలుగా బహిష్టు వస్తుందనీ, ఈ రకంగా అవసరమైనంత కాలం వాడవచ్చని చెప్పింది. వివాహం తర్వాత విజయనగరం వచ్చేస్తే మరి వాడఖ్ఖరలేదని, నీభర్త వచ్చిన నెల మాత్రం మళ్ళా వాడమని చెప్పి ప్రిస్క్రిప్షన్ రాసి పంపింది. ఆ మాత్రలు వాడుతున్నప్పుడు కడుపులో తిప్పినట్లుగా ఉండొచ్చు అటువంటప్పుడు చప్పరించే సి-విటమిన్ మాత్రలు కూడా వాడమని రాసింది. ఆ ప్రిస్క్రిప్షన్ ను వీర్రాజుగారికి పంపాను. వెంటనే కొని పార్సిల్ లో పంపారు.

          అటు హైదరాబాద్ లోనూ,ఇటు విజయనగరం లోనూ నిముషాలు గంటలుగా, గంటలు రోజులుగా  పొడవుగా సాగిపోయాయో ఏమిటో  ఎదురు చూస్తున్న రోజు ఎంతకీ రానట్లే అనిపించింది.

*****



17, ఏప్రిల్ 2022, ఆదివారం

సహృదయ విమర్శకులు రామమోహనరాయ్

 ~ సహృదయ విమర్శకులు రామ్మోహన రాయ్ ~


       కడియాల రామ్మోహన రాయ్ 1944, ఏప్రిల్ 11న గుంటూరు జిల్లా, మేడికొండూరు మండలం, సిరిపురం గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి కడియాల భద్రయ్య నాస్తికుడు, హేతువాది, సాహిత్యాభిలాషి, కమ్యూనిస్టు పార్టీ అభిమాని కావటంతో ఆయన ప్రభావం వలన హేతువాదం, నాస్తికత్వం, మార్క్సిజం దృక్పథం గల రామ్మోహన రాయ్ సాహిత్యమూ,రచనలూ కూడా అదే పంథాలో సాగాయి.

           రామ్మోహన రాయ్ మృదుస్వభావి కావటాన ఎప్పుడూ కఠినంగా, పరుషంగా మాట్లాడరు.తాను చదివిన రచన నచ్చినప్పుడు ఆ రచయితగా నీ,కవిగానీ వయస్సులనూ,పాతకొత్తలను ఎంచకుండా ఫోన్ చేసి అభినందించే నైజం ఆయనది.

      యువ కవులకు ఆధునిక సాహిత్యం పట్ల అవగాహన కల్పించే పెద్ద బాలశిక్ష గా 'తెలుగు కవితా వికాసం' గ్రంథాన్ని చెప్పుకోవచ్చు.

వర్తమాన కవిత్వంపై గల అభిమానంతో ప్రచురితమైన కవిత్వాన్ని, కవితా సంపుటాలను ప్రతీ ఏడాదీ శ్రధ్ధగా చదవటమే కాకుండా విశ్లేషణ చేస్తూ చాలా కాలంపాటు వ్యాసాలు రాశారు.

         కవులూ,రచయితల పట్ల నిష్పక్షపాతంగా రచనలను ఆసాంతం చదివి తన అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేసేలా వ్యాసాలు రాసే సహృదయ విమర్శకులు రామమోహనరాయ్.

         సాహిత్యం పట్ల చక్కని అభిరుచి కలిగేలా పన్నెండు విమర్శగ్రంధాలను సాహిత్య లోకానికి అందించిన ప్రముఖ సాహితీవేత్త.అంతే కాక అనేక అముద్రిత సాహిత్య వ్యాసగ్రంథాలు కూడా ఉన్నాయి.అవికూడా గ్రంథం రూపంలో వస్తే విమర్శకులకు మార్గదర్శకంగా ఉంటుంది.

     సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీ ప్రచురించిన ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ లిటరేచర్ లో రామ్మోహన రాయ్ గారు రాసిన 28 వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

         కడియాల రామ్మోహన రాయ్ ప్రాచీన, ఆధునిక సాహిత్యాలలో లోని సాహిత్యవిమర్శను పరామర్శిస్తూ సుదీర్ఘమైన,సవివరణాత్మకంగా రాసిన "మానసోల్లాసం"కవిత్వం,నవలా,నాటకం, వ్యాసం మొదలైన సాహిత్యప్రక్రియలపై విమర్శ చేయాలంటే విమర్శకులకు గురుతరమైన బాధ్యతను తెలియజేసే విధంగా రాసిన గ్రంథం.450 పేజీలు గల ఈ గ్రంథంలో 1966-2016 వరకూ అనగా అర్థశతాబ్ది తెలుగు సాహిత్యవిమర్శకు చెందిన అమూల్యమైన వ్యాసాలు తెలుగును ప్రధాన భాషగా అభ్యసించే విద్యార్ధులకూ, పరిశోధకులకు మాత్రమే కాకుండా విమర్శకులకు కూడా రిసోర్స్ పుస్తకంగా ఉపయుక్తంగా ఉంటుంది.సాహిత్యవిమర్శ ఒక కళ అని ప్రతిపాదించిన ఈ గ్రంథాన్ని ద్రావిడ విశ్వవిద్యాలయం ప్రచురించి సాహితీవిమర్శకు ఒక దారిదీపంగా అందించింది.అందుకే ఆచార్య ఈడిగ సత్యనారాయణ గారు " పద సౌష్టవం,అర్థగాంభీర్యం కలిగి మానసోల్లాసానికి అద్దం పడుతున్న ఈ వ్యాస సంపుటి సాహిత్యలోకానికి కడియాల రామ్మోహన్ రాయ్ గారు అందించిన అపురూపమైన కానుక గా అభినందించారు.

            తెలుగు నవలశతజయంతి సందర్భంగా1972 లో విజయనగరం మహారాజావారి సంస్కృతాంధ్ర కళాశాలలో "నూరేళ్ళ తెలుగు నవల తీరుతెన్నులు" అనే అంశం గురించి ప్రసంగించమని గూడపాటి సాంబశివరావు గారు కోరగా రామ్మోహన రాయ్ అప్పట్లో వచ్చిన గ్రంథాలను అధ్యయనం చేసారు.తెలుగు నవల లక్షణాలూ,స్వరూపస్వభావాలే కాక భాషా పరిశీలనలో భాగంగా వివిధ మాండలీకాలను,వర్గ మాండలికాలనూ పరిశీలించటమే కాకుండా వివిధ ప్రాంతాల సాహిత్య మిత్రులతో కూడా సుదీర్ఘ చర్చలు జరిపారు.

         తెలుగు నవలలు(1872-2010) వరకూ నవలా ప్రారంభం, పరిణామక్రమం,సమాజంపై ఆయా నవలలు కలిగించిన ప్రభావం ప్రాతిపదికన తెలుగు లోని అత్యుత్తమమైన వంద నవలల గురించి అధ్యయనం చేసి రచించిన గొప్ప పుస్తకం " మన తెలుగు నవలలు"

          ఒక జాతి సంస్కృతి నీ, తెలుగు ప్రజలజీవనవిధానం, తెలుగు జాతి చరిత్ర,సమాజం, పరిణామక్రమంలో ప్రజల ఆలోచనల్లో వచ్చిన మార్పులు,సమాజంలో సమూలమైన మార్పులకు కారణమైన సామాజిక సంఘటనలను సాహిత్యం ఏవిధంగా ఒడిసిపట్టి ప్రతిబింబించింది మొదలైనవన్నీ ఈ నవలల ద్వారా తెలుస్తాయని రామ్మోహన రాయ్ ఈ వ్యాసాల్లో ప్రస్తావించారు.

               వివిధ తెలుగు ప్రాంతాల్లోని ప్రజలభాషలోని జాతీయాలూ,సామెతలూ,పలుకుబళ్ళూ రచయితలు వ్యక్తీకరించిన విధానాన్ని వివిధ రాజకీయ, ఆర్థిక,సామాజిక పరిస్థితులకు రచయితల ప్రతిస్పందన సాహిత్యం ద్వారా తెలియజేయడాన్ని రామ్మోహన రాయ్ గారు ఇందులో చూపించారు.

                సాహిత్యం లో 1872 నుండివ2010 వరకు వచ్చిన వివిధ వాదాలను ఆయా కాలంలో రచయితలు ప్రస్తావించిన విధానాన్ని ప్రశంసించారు.

                కర్నూలు లో డిప్యూటీ కలెక్టర్ గా ఉన్న నరహరి గోపాలకృష్ణమ సెట్టి రచించి ప్రచురించిన "శ్రీ రంగరాజు చరిత్ర (క్రీ.శ. 1872) " నే మొదటి నవలగా వీరు ప్రస్తావించారు.అయితే అప్పటికి నవల అని కాక నవీన ప్రబంధం అన్నారని పేర్కొన్నారు. వీరేశలింగం గారు తన స్వీయచరిత్ర ము లోకూడా శ్రీ రంగరాజు చరిత్ర గురించి చెప్పక పోయినా ఈ రెండింటిలో గల పోలికలు ఈ గ్రంథాన్నిి వీరేశలింగం గారు చదివారనేది తెలుస్తుందని శ్రీ కొత్తపల్లి వీరభద్రరావు గారు తెలిపారనేవిషయాన్ని రామ్మోహన్ రాయ్ తో వ్యాసం లో ప్రముఖంగా పేర్కోన్నారు.

                ఈ విధంగా తెలుగులోన ఆణిముత్యాలు లాంటిి వంద ప్రముఖ నవలల గురించి రామ్మోహన్ రాయ్ గారు రాసిన వ్యాసాలు మన నవలా సాహిత్యం ప్రాముఖ్యత,ఆయా నవలాకారుల ప్రతిభా పాటవాలను తెలియజేసేలా ఉన్నాయి.138 ఏళ్ల తెలుగు ప్రజల సాహిత్యం, సంస్కృతినీ తెలుసు కోవటానికి ఒక గొప్పగ్రంథంగా రామ్మోహన రాయ్ గారి " మన తెలుగు నవలలు"ఉపయోగ పడుతుంది.

                ఇటీవల రామ్మోహన రాయ్ గారు ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడి మీ కవిత్వం మీద సమగ్రమైన వ్యాసం రాయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను" అన్నారు. కానీ నేనే ఈ విధంగా వారికి శ్రద్ధాంజలిగా రాయవలసి వచ్చినందుకు బాధపడుతున్నాను.

3, మార్చి 2022, గురువారం

నడక దారిలో --14

 నడక దారిలో—14

       జూన్ నెల 1970 లో ఒకరోజు మాచిన్నన్నయ్య కొత్తగా విడుదల అయిన స్వాతి మాసపత్రిక ప్రారంభ సంచిక తీసుకు వచ్చాడు.అంతకు ముందు, జ్యోతి,యువ మాసపత్రిక లో మాదిరిగా అదే సైజు లో అందమైన బాపు ముఖచిత్రంతో ఆకర్షణీయంగా ఉంది. తర్వాత ఆ చిత్రాన్నే స్వాతి లోగో లా వాడుతున్నారు.అందులో అప్పట్లోని సాహితీ ప్రముఖులరచనలతో సాహిత్యం పట్ల ఇష్టం ఉన్న వారికి ఆనందం కలిగించి హృదయానికి హత్తుకునేలా రచనలు ఉన్నాయి.

     కుమారీ వాళ్ళఅన్నయ్య ఇంటింటి గ్రంథాలయం కోసం తెచ్చిన పుస్తకాల్లో శీలా వీర్రాజు గారు రాసిన “ కాంతిపూలు” నవల కనిపెంచితే తీసుకు వచ్చి ఏకబిగిన చదివేసాననీ ఆ నవలపై అభిప్రాయం రాసుకున్నానని ఒకసారి చెప్పాను కదా. .అక్కయ్య ఇంట్లో మబ్బుతెరలూ, సమాధి పుస్తకాలు చదివినప్పటి నోట్స్ ఒకసారి తీసాను.

స్వాతిలో గౌరవసంపాదకునిగా శీలా వీర్రాజు పేరు చూసి ఆయన రచనలపై నా అభిప్రాయం రాస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాను.మర్నాడు కాలేజీకీ వెళ్ళినప్పుడు ఉషని సలహా అడిగాను”పాఠకురాలిగా రాయటంలో తప్పేముంది?” అంది.

“తప్పులేదు కానీ శీలా వీర్రాజు నా మేనత్త కొడుకు.నేనని తెలుస్తే బాగుండదేమో”అన్నాను ఆలోచిస్తూనే.

     “అలాగా ఐతే వేరే పేరుతో రాయు” ఆశ్చర్యపోతూనే అంది.

    “ అన్నయ్య పేరు ,ఊరూ చూసి గుర్తు పట్టొచ్చుకదా”

    “మా ఇంటి అడ్రస్ ఇవ్వు” .

    “సరే చాలా చాలా థేంక్స్ ఉషా “అని సంతోషంతో పొంగిపోతూ KS దేవి పేరు తో ఉత్తరం రాసి పోస్టు చేసాను.అంతకు ముందు ఎందరివో ఎన్నో రచనలు చదివాను.చదివిన వాటికి నోట్స్ రాసుకున్నాను.కానీ ఎప్పుడూ ఎవరికీ ఉత్తరం రాయలేదు.ఇప్పుడే ఎందుకు రాయాలనిపించిందో కూడా చెప్పలేను.

       నేను కాలేజీలో చదువుతున్నరోజుల్లోనే యద్దనపూడి సులోచనారాణి నవలలు జ్యోతి మాసపత్రిక లోనూ , ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్స్ గా వచ్చేవి.గురువారం వచ్చే వారపత్రికలో సులోచనారాణి జీవన తరంగాలు కోసం లైబ్రరీ కి అమ్మాయిలంతా క్యూ కట్టేవారు.గార్డెన్ లోనో,హాస్టల్ రూమ్స్ లోనో అంతకుముందే చదివినవారిదగ్గర చేరి కథ వినేవారు.ఆరోజుల్లో కాలేజీ అమ్మాయిలు సులోచనారాణిని ఆరాధించేవారు.ఆనాటి అమ్మాయిల కలలరాణి సులోచనారాణి తో నేను తర్వాత రోజుల్లో కలిసి సమావేశాల్లో పాల్గొన్నాను.

      ఒకరోజు కాలేజీ నుండివచ్చి పుస్తకం చదువుకుంటుంటే ఉషా వచ్చింది”రోజంతా కాలేజీలో కలిసే ఉంటారు.మళ్ళా కబుర్లు ఏమిటో” అన్నయ్య బైటికి వెళ్తూ అన్నాడు.

ఎప్పటి లాగె ఉషాని తీసుకుని డాబా మీదకి దారితీసాను.

        శీలా వీర్రాజు గారి “హృదయం దొరికింది” అందుకున్నాను.దాంతో బాటు సమాధానం కూడా.

ఎంత ఆశ్చర్యం కలిగిందో! కాసేపు ఆవిషయమే మాట్లాడుకున్నాం.”నా ఉత్తరాలు మీ అడ్రస్ కి రావటం నీకేమీ ఇబ్బంది లేదుకదా”అని అడిగాను.ఉషాఅన్నయ్య వేరే ఊర్లో చదువుతున్నాడు.వాళ్ళనాన్న ఇల్లుపట్టించుకోడు.వాళ్ళమ్మకి నా విషయం చెప్పిందట.అందుకే ఉత్తరాన్నిఆమె తీసి జాగ్రత్తచేసి ఉష కాలేజీ నుండి రాగానే ఇచ్చింది.

   ఆ రాత్రి లోపున హృదయం దొరికింది పూర్తి చేసాను.కవిత్వం లో కథ రాయటం వింతగా ఆసక్తికరంగా అనిపించింది.అంతకుముందు గురజాడ కన్యకా,పూర్ణమ్మ,లవణరాజు కాలం గేయకథలు తెలుసు. శ్రీశ్రీ ముసలమ్మ మరణం కథాత్మక శైలిలో రాసినకవితా చదివాను.కానీ ఆధునిక జీవితాన్ని ఇలా వచనకవితా కథగా రాసినది చదవటం కొత్తగా అనిపించింది.

మాస్కూలు లిఖిత పత్రికకు పది ద్విపద ఛందస్సుపద్యాలతో ‘ నాబొమ్మే నా చెల్లి” అని రాసినది కూడా కథాత్మక పద్యమే అన్నమాట అని నాలో నేను భుజాన్ని తట్టుకున్నాను.

బహుశా అప్పుడే నాకు తెలియకుండానే నా మెదడులో దీర్ఘ కవితలు రాయాలనే బీజం పడిందేమో మరి.

వెంటనే నామనసులో కదిలిన ఈ ఆలోచనలనన్నింటినీ వీర్రాజు గారికి ఉత్తరంగా రాసాను. మళ్ళా ఓవారానికే ఉత్తరం తో పాటూ” కొడిగట్టిన సూర్యుడు”నాదోసిట్లో ఉదయించాడు.

నేను చదివిన పుస్తకాలు గురించి,నాకు ఇష్టమైన లలిత సంగీతం గురించి,నేను వేసే బాపూ బొమ్మల గురించి కూడా రాసేదాన్ని.సాహిత్యం గురించి నా ఆలోచనలు పంచుకునే మిత్రునిగా ఎంచి రాస్తుండే దాన్ని.నా ‘ఉత్తరాలు తన స్నేహితులు చదివి చాలా బాగా రాస్తుంది ఆ అమ్మాయి అని మెచ్చుకున్నారు' అని రాస్తే నాకు కోపం వచ్చింది.పర్సనల్ గా వచ్చిన ఉత్తరాలు ఎంత ఆత్మీయ మిత్రులు అయినావాళ్ళు ఎలా చదువుతున్నారు అని.

ఒక సారి “వైజాగ్ వైపు రావాల్సిన పని ఉందని’’ రాసారు.

“ఇక్కడ బంధువులు ఉన్నారా,”అన్న నా ప్రశ్నకు “ఉన్నారు కానీ వాళ్ళకీ మాకూ సంబంధాలు లేవు”అని రాసారు. “అప్పుడు నేను ఇంకా ఊరుకోలేక నేను “ లీలా మోహనరావు చెల్లెల్ని” అని బయట పెట్టాను.

“ నిజమా.ఇంత చిన్న చెల్లెలు ఉందని నాకు తెలియదు” అని బోల్డంత ఆశ్చర్యం వెల్లడించారు.

తర్వాత తన ఫొటో పంపి “నీకు ఇష్టమైతే వివాహం చేసుకుందాం”అని రాసారు.

నేను వెంటనే సమాధానం రాయలేదు.నాకు వివాహం కన్నా చదువు ముఖ్యం అని. అనుకున్నాను.

ఆయన మళ్ళీ మరో ఉత్తరం రాసారు.నేను అదే చెప్పాను”వివాహం అయినా నువ్వు అక్కడే ఉండి చదువు పూర్తి చేసుకుని హైదరాబాద్ రావచ్చు” అన్నారు.

నేను ఆలోచనలో పడ్డాను.

అమ్మకు మెల్లగా విషయం చెప్పాను.

అమ్మ “నీకు చెప్పలేదు కానీ ఆ మధ్య వాళ్ళమ్మ పోయినప్పుడు పెద్ద మామయ్య వాళ్ళని పరామర్శించడానికి హైదరాబాద్ కి వెళ్ళినప్పుడు అతని పెద్దచెల్లెలితో నీవిషయం ప్రస్తావించారు.అయితే ఆమె సానుకూలంగా మాట్లాడక పోవటమే కాక తన చెల్లెలిని చిన్నన్నయ్యకి చేసుకోమని అడిగిందట.నేను ఒకటి ఆడుగుతే దాని గురించి మాట్లాడక మరొకటి అడుగుతుందని మామయ్యకి కోపం వచ్చి మాట్లాడకుండా వచ్చేసాడు.నువ్వు ఆలోచించుకుని మరీ ముందుకి వెళ్ళు” అంది.

పెద్దక్కయ్యకు ఉత్తరం రాసి సలహా అడిగాను.

“సాహిత్యం మీద మోజుతో మాత్రం నిర్ణయం తీసుకోకు.అతని తోబుట్టువులంతా నీకంటే పెద్దవాళ్ళే.వాళ్ళందరినీ మెప్పించి సమర్థవంతంగా నీ వ్యక్తిత్వం నిలుపుకోగలవా ఆలోచించి అడుగెయ్యు.మీ ఇద్దరికీ పది పదకొండేళ్ళ వయసు తేడా ఉంటుందనుకుఃటాను.చూచి అన్ని విధాలుగా ఆలోచించుకుని చేసుకోవాలనే అనుకుంటే అతన్ని ఒకసారి రమ్మను. , ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకోకుండా మాత్రం నిర్ణయించు కోవద్దు. ” అని ఉత్తరం రాసింది అక్కయ్య.

ఈ లోగా అమ్మ అన్నయ్య లకు కూడా చెప్పింది.

నాకు ఏంచెయ్యాలో తోచలేదు.పెళ్ళి జరిగాక చదువు కొనసాగించేదెలా?చదువూ,ఉద్యోగం,నా కాళ్ళమీద నేను నిలబడాలి అని మిత్రులతో అన్ని కబుర్లు చెప్పినదాన్ని ఇలా తొందరపడుతున్నానా?అక్కయ్య అన్నట్లు ఆ యింట్లో నా ఆశలూ,ఆశయాలూ సాకారంచేసుకోగలనా? సాహిత్యం మీద నాకున్న ఆసక్తి నన్ను ఈవిధంగా బలహీనపరుస్తుందా?అన్నయ్యలు మీద నా బరువు బాధ్యతలు ఎన్నాళ్ళు మోపాలి? ఆయనే నన్ను చేసుకుంటానంటే ఒప్పుకోవటం మంచీదేకదా.ఎడతెగని ప్రశ్నలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.రోజులు గడిచి పోతున్నాయి.నేను సమాధానం ఇవ్వలేదు.

అమ్మ ఒకరోజు మళ్ళా ప్రశ్నించింది.”రమ్మని రాస్తున్నావా,ఏమిటి నిర్ణయించుకున్నావు అని.

మర్నాడు కాలేజీలో ఉషకి ఈ విషయాలన్నీ చెప్పి తనని కూడా సలహా అడిగాను.కాలేజీనుండి వస్తున్నప్పుడు దార్లో పోస్టాఫీసు కు వెళ్ళి ఒక కవరు కొనుక్కున్నా