11, జులై 2020, శనివారం

రంగుల వల - శీలా సుభద్రాదేవి

    ఆయన ఆఫీసు పనిమీద వూరికి వెళ్లారు. పిల్లలు స్కూలుకు వెళ్లారు. సెలవులు చాలా ఉండిపోయాయని, సంవత్సరం ఆఖరుకి వచ్చేస్తోందనీ నాలుగు రోజులు వరుసగా సెలవు పెట్టేశాను. రెండ్రోజులు ఇల్లు సర్దుకోవడంతోనే అయిపోయింది. ఒకరోజు పూర్తిగా రెస్టు తీసుకున్నాను. ఇక ఈరోజు పని ఏమీ కనిపించలేదు. మధ్యాహ్నం ఏమీ తోచలేదు. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడటమే తప్ప వనజని చూసి చాలా కాలమైంది అని గుర్తు వచ్చింది.

    'అకస్మాత్తుగా వెళ్లి సర్ప్రయిజ్ చేస్తేనో! ఫోన్లో మాట్లాడినా ఎక్కువసేపు కుదరదు కదా. చక్కగా ఎదురెదురుగా కూర్చొని కబుర్లు కలబోసుకోవటంలో ఉండే తృప్తి ఫోన్లో ఏముంటుంది' అనుకున్నాను. 

    వనజ యింటికి వెళ్లి తలుపు తట్టాను.

    విసుక్కుంటూ తలుపు తీసిన వనజ నన్నుచూసి ఆశ్చర్యపోయింది. 

    "ఇదేమిటి ఇలా దారితప్పి వచ్చేవు?" అంది.

    "దారి వెతుక్కుంటూనే వచ్చాను. సరే, ఏమిటీ ఈ అవతారం" అన్నాను ఆమెని పరిశీలిస్తూ.

    ఇల్లు బూజులు దులుపుతోంది కాబోలు మాసిన చీర కొంగు బిగించి, ఉచ్చెళ్లు పైకి లాక్కొని ఉంది. ముఖం అంతా చెమట్లు దిగజారి చెదిరిన వెంట్రుకలు నుదురంతా అతుక్కున్నాయి.

    "నువ్వైతే ఉద్యోగస్తురాలివి. గంజి పెట్టిన ఇస్త్రీ చీర కట్టి బొమ్మలా ఉంటావు. నాకెట్లా కుదురుతుంది" అంది నన్ను పైనుండి కిందవరకూ ఎగాదిగా చూస్తూ. 

    "మరే, నాకు ఇంట్లో వంటాగింటా ఉండవు. అడ్వర్టయిజుమెంట్లో అమ్మాయిలా ఫలానా గంజిపొడి పెట్టిన చీర కట్టుకుని తిరగటమే పని. ఆ కబుర్లకేం గానీ ఇంకా స్నానం, భోజనం కాలేదా" అన్నాను సోఫాలో చతికిలబడుతూ.

    "పండుగలు వస్తున్నాయికదా అని ఇల్లు శుభ్రంచేసే పని పెట్టుకున్నాను. అయిపోయిందిలే. క్షణంలో స్నానం చేసి వస్తాను. కలిసి భోంచేద్దాం" అంది వనజ.

    "నేను భోంచేసే వచ్చాలే. నువ్వు తొందరగా స్నానం చేసి రా. నేను పుస్తకం తిరగేస్తూ కూర్చుంటాను."

    వనజ అప్పటికే గదులు ఊడ్చడం పూర్తిచేసి, రెండు పత్రికలు నా ముందు పడేసి టీవి ఆన్‌చేసి స్నానానికి వెళ్లింది. 

    ఆ పత్రికలు అంతకుముందు చదివేసినవే. టీవీ కాసేపు చూసి విసుగుపుట్టి గదంతా పరిశీలిస్తూ కూర్చున్నాను.

    అంతలోనే వనజ స్నానం పూర్తిచేసి తయారైవచ్చింది. నా ముందు కూర్చోబోతే, "ముందు నువ్వు భోంచేయి. ఇప్పటికే లేటయింది" అన్నాను.

    నాకు ప్లేటులో కారప్పూసా, స్వీటు, ఆపిల్ ముక్కలు పెట్టి తాను భోజనానికి కూర్చుంది వనజ.

    ఓ కన్ను టీవీ మీద పెట్టి భోంచేస్తూ ఉంది. 

    నాకు మాట్లాడటమో, టీవీ చూడటమో అర్థంకాక ఒక్కొక్కటే కారప్పూస నోట్లో వేసుకుంటూ వనజని చూస్తూ కూర్చున్నాను.

    టీవీలో ఏదో డిటర్జెంటు పౌడరు ప్రకటన వస్తోంది. బట్టలు మురికి చేసుకుని వచ్చిన భర్తనీ కొడుకునీ చూసి విసుక్కోకుండా "ఇవి ఉతకటం ఆరేయటం రోజూ చేసే పనే" అని తేలికగా అంటోంది నవ్వుతూ బొమ్మలా మడత నలగని చీరతో ఉన్న ఆ మోడల్ అమ్మాయి. 

    "నేనూ ఆ పౌడరే వాడతాను. ఏమో ఎంత ఉతికినా తెల్లగా రావు" అంది వనజ అటే చూస్తూ.

    ఏమీ మాట్లాడకుండానే ఆమెనే చూస్తూ... నేను నవ్వి వూరుకున్నాను. 

    "స్వీటు టి.వి.లో ప్రకటన చూసి దుర్గా బ్రాండు నెయ్యితోనే చేసాను. ఎలా ఉందో చెప్పవోయ్" అంది నేను స్వీటు తినకపోవటం చూసి.

    సరే అని చిన్న ముక్క తుంచి నోట్లో వేసుకున్నాను. ఏదో అనాలి కదా అన్నట్లు 'చాలా బాగుంది' అన్నాను. వనజ ముఖంలో సంతోషం కనిపించింది.

    వనజ భోజనం పూర్తిచేసి గిన్నెలు సర్దుతూ "బ్రూ కాఫీ కలపనా? ఆ బ్రాండు కాఫీ చాలా బాగుంటుంది. తాగితే వదలవు" ఊరిస్తున్నట్లుగా అంది.

    "ఇప్పుడే ఎందుకులే. కాసేపు అయ్యాక నువ్వు కూడా తాగే టైము అయితే అప్పుడు కలిసి తాగుదాం" అన్నాను నేను కూడా డైనింగ్ టేబుల్ ముందునుండి లేస్తూ.

    "సరే అయితే. ఆ అన్నట్లు ఈ ఫ్రిజ్ కొత్తగా కొన్నాను చూసావా? దీంట్లో ఐస్‌క్యూబ్స్ క్షణాల్లో తయారు చేసుకోవచ్చు. దీంతోబాటు ఇస్త్రీపెట్టే అదే కంపెనీది ఫ్రీ తెలుసా" కళ్లు గుండ్రంగా తిప్పుతూ చెప్పింది, ఫ్రిజ్ తెరిచి మరీ చూపుతూ. 

    "ఆ మధ్య ఎప్పుడో కొనబోతున్నట్లు ఫోనులో చెప్పినట్లున్నావు కదా" అన్నాను నేను.

    తాను కొన్న వస్తువుల గురించి చెబుతూనే డైనింగ్ టేబుల్ శుభ్రం చేసి ఎలా అయితేనేం మొత్తం మీద వచ్చి డ్రాయింగ్‌రూమ్‌లో నా పక్కన కూర్చుంది వనజ.

    "చాలా కాలమైంది కదూ. మనం ఇలా దగ్గరగా కూర్చుని కబుర్లు చెప్పుకుని ఎంతకాలమైందో. కాలేజీలో చదువుకునే రోజుల్లో తరచూ కలుసుకుని కబుర్లు చెప్పుకునే వాళ్లం. ఇప్పుడు ఒకే ఊళ్ళో ఉన్నా కాస్సేపు ఫోన్లోనే మాట్లాడుకోవటం అవుతోంది" ఆర్తిగా అన్నాను పక్కనే కూర్చున్న వనజ చేతులు నా చేతుల్లోకి తీసుకుంటూ.

    "నీకు ఉద్యోగం, నాకు ఇంట్లో పనితోనే సరిపోతుంది. ఆదివారాలు, సెలవు రోజుల్లో ఇంట్లో పిల్లలూ, మగవాళ్ళూ ఉండటం, ఎవరో ఒకరు రావటంతో కలుసుకోవటమే అరుదైపోయింది" అంటూ వనజకూడా తన చేతిలో ఉన నా చేతిమీద మెత్తగా రాస్తూ అకస్మాత్తుగా నా చేయి పరిశీలించి "ఏమిటీ నీ చేయి ఇంత గరుకుగా ఉంది. ఏదీ నీ పాదాలు చూడనీ" అని నా చీర కుచ్చిళ్లు పాదాలమీంచి పైకిలాగి పాదల్ని కూడా పరిశీలించింది.

    గభాలున లేచి అల్మారాలోంచి ఒక క్రీము తీసుకొచ్చి "ఇదిగో ఈ క్రీము నువ్వు కూడా కొనుక్కుని రాస్తూండు. మృదువుగా అయిపోతాయి. ముఖాన్నే కాదు పాదాల్నీ, చేతుల్నీ కూడా రక్షించుకోవాలి" అంది అడ్వర్టయిజ్‌మెంట్‌లా.

    నేను ఫకాలున నవ్వాను.

    "నా మాటమీద నమ్మకం లేదుకదూ. ఇదుగో ఇప్పుడు ఈ నాటకం మధ్యలో వచ్చే ప్రకటన చూడు. నువ్వే నమ్ముతావు" బుంగమూతి పెట్టుకుని నా చెయ్యి విసిరికొట్టి సోఫాలో దూరంగా జరిగి కూర్చుంది.

    వనజ అన్నట్లుగానే అంతలోనే ఆ ప్రకటన టీవీలో వస్తోంది. కాస్సేపటికే వనజ మామూలుగానే తన్మయంగా టీవీ చూస్తోంది.

    "అన్నట్లు నీకు తాగటానికి ఏమీ ఇవ్వలేదుకదూ. ఏం చెయ్యమంటావు. రంగూ, రుచి, వాసనా మూడు గుణాలున్న టీ ఇవ్వనా! ఉదయాన్నే శుభ ప్రారంభాన్ని యిచ్చే కాఫీ కలపనా. నీదే ఛాయిస్" అంది లేచి నిలబడి.

    "నాకేమీ వద్దు. చల్లని నీళ్లు చాలుకానీ, ఇలా వచ్చి కూర్చొని కబుర్లు చెప్పు" అన్నాను విసుగ్గా ముఖం చిట్లించి.

    "ముఖం ఏమిటి అలా ఉంది. తలనొప్పిగా ఉందా? చిటికలో తగ్గించే టాబ్లెట్ ఇవ్వనా. మళ్లీ నాటకం మొదలు కాకముందే కాఫీ చేసి రెండు నిమిషాల్లో తెస్తాను" అంది హడావుడిగా.

    నేనేమీ మాట్లాడలేదు. మౌనం అర్థాంగీకారం అనుకుందేమో, వంటింట్లోకి వెళ్లి అన్నట్లుగానే రెండు నిమిషాల్లో నూడుల్స్ బౌలు, రెండు టీలు తీసుకుని వచ్చింది. 

    అంతలో టీవీలో మొదలైన నాటకానికి కళ్ళు అతికించి కూర్చుంది. నేను మాట్లాడకుండానే అవి పూర్తిచేసి "ఇంక పిల్లలు స్కూలునుండి వచ్చే వేళయింది. వెళ్తాను" అంటూ లేచాను. 

    ఇబ్బందిగానే నా వెనకే గుమ్మం వరకూ సాగనంపింది. నేను గుమ్మం దాటి నాలుగడుగులు వేయగానే తలుపులు మూసుకున్నాయి. 

    నాకు తెలుసు ఈపాటికి వనజ రంగుల పెట్టెలోకి ప్రవేశించే ఉంటుంది! 

1, జులై 2020, బుధవారం

కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో స్త్రీ - పి. సరళాదేవి కథలు
  శీలా సుభద్రాదేవి

యాభయ్యవ దశకం తర్వాత సాహిత్యరంగంలోకి అడుగుపెట్టిన రచయిత్రులు కొందరు అనేక కారణాల వలన కొద్దికాలం మాత్రమే రచనలు చేసి అస్త్ర సన్యాసం చేసిన వాళ్ళు ఉన్నారు. మరికొందరు తదనంతర నవలాప్రభంజనంలో కొట్టుకుపోతూ కీర్తీ, సంపదా లభించే ఆకర్షణలతో కథారచనను దూరంపెట్టినవాళ్ళూ ఉన్నారు. అతి తక్కువమంది ఒకటీ అరా నవలలు రాసినా కథారచనకే కట్టుబడినవారూ ఉన్నారు. అటువంటి వారిలో పి. సరళాదేవి ఒకరు. ఇతర ప్రక్రియలైన  కవితలు కొన్ని రాసినా, రెండు నవలికలు రాసినా మూడు కథల పుస్తకాలతో కథారచయిత్రిగానే గుర్తింపబడ్డారు.

1955లో ప్రజాతంత్ర పత్రికలో ‘బావ చూపిన బ్రతుకుబాట’ కథతో కథానగరంలోకి అడుగుపెట్టి, మాలతీచందూర్ ప్రోత్సాహంతో  ప్రమదావనంలో రచనలు చేసారు. డా. పి. శ్రీదేవి స్నేహప్రభావంతో తెలుగు స్వతంత్రలో 1955 నుండి 60 వరకూ విరివిగా కథలు రాసారు. ప్రముఖ పాత్రికేయుడు గోరాశాస్త్రి ముందుమాటతో తాను ఎంపిక చేసుకున్న కథల్ని 1962లో ‘కుంకుమరేఖలు’ పేరున సంపుటీకరించారు. మరికొన్ని కథల్ని ‘సరళాదేవి కథలు’ పేరుతో 1977లో మరొక సంపుటిని స్నేహితురాలు డా. పి. శ్రీదేవికి అంకితంగా తీసుకువచ్చారు. సరళాదేవి మరణానంతరం  ఆమె సోదరి ఆమెకు నివాళిగా, ఇంకా సంపుటీకరింపబడని కథల్ని ‘మాకుగాదులు లేవు’ పేరుతో ప్రచురించారు. కుంకుమరేఖలు సంపుటిలోని కథలు విజయవాడ ఆకాశవాణి ద్వారా ధారావాహికంగా ప్రసారం అయ్యి విశేషాదరణ పొందాయి.

1977లో ‘యువ’ మాసపత్రికలో ‘కొమ్మా-రెమ్మా’ పేరున నవలిక ప్రచురితం కాగా దానితోపాటు ‘చిగురు’ అనే నవలికనీ కలిపి గ్రంథస్థమై వచ్చాయి. ‘తెలుగు సామెతలు-సాంఘిక చిత్రణ’ అనే పరిశోధనాత్మక గ్రంథాన్ని కూడా సరళాదేవి ప్రచురించుకున్నారు.

1956 నుండి 1960 వరకూ స్వాతంత్ర్యానంతరకాలం రెండో ప్రపంచ యుద్ధ ప్రభావం నుండి కో��