22, ఏప్రిల్ 2020, బుధవారం

కలుగుల్లో ప్రపంచం

కలుగుల్లో ప్రపంచం

అంతటా
ఘనీభవించిన నిశ్శబ్దం
గునగునా గంతులేస్తూ
ఆవరణంతా కలయతిరిగే
చిట్టిపొట్టి కుందేలు పిల్లలన్నీ
ఏబొరియలో బంధింపబడ్డాయో!

సూర్యుడు కిరణాలరెక్కలుసాచేవేళనుండీ
చీకటి దుప్పటి ముసుగేసుకునే వరకూ
రంగులు విరజిమ్ముతూ ఎగిరే
సీతాకోకచిలుకలన్నీ
తిరిగి ప్యూపాలలోఒదిగి పోయాయేమో!!

పించాన్ని విప్పుకుంటూ వయ్యారంగా
కొమ్మలకారిడార్లలో తిరిగే
తొలియవ్వనపు నెమలికన్నెలు
పింఛాలకొంగుల్ని ముడుచుకొని
ఏ గుబురు నీడల్లో దాక్కున్నాయో!!!

వానాకాలం ను వానచినుకుల్ని
రెక్కలతో ఒడిసిపట్టి
చంఢప్రచండుడిఉష్ణకాసారాల్లో
ఒంపుతున్నట్లు
కిలకిల నవ్వులు రాగాలతో
చిట్టిపలుకుల చిలకపాపలు
ఏ కొమ్మ గూటిలో ముక్కుల్ని కట్టేసుకున్నాయో!!!

అంతస్తుల కొమ్మలనిండా
మిణుగురుపూవుల్ని అద్దినట్లు
నవ్వుల్ని ఒంపుకుంటూ
చెణుకుల్ని విసురుకుంటూ
కలయతిరిగే వయ్యారి ఒప్పులకుప్పలు
ఏ రంగులపెట్టె లో ఒదిగిపోయారో!!!

ఏమో మరి
అంతటా గడ్డకట్టిన నిశ్శబ్దం
చిరుగాలితరగలకే సందడించే
సజీవచైతన్యంతో తలెత్తి నిలిచే
అయిదు నిలువుల మహావృక్షం
మా బిల్డింగు
నేడు ఇప్పుడు
భయంవైరస్సు కమ్ముకున్న వాల్మీకం లో
ఘోరతపస్సుతో స్తంభించిన
మౌనమునిలా వుంది.
ఇలా
ఊరూ వాడా యే కాదు
ప్రపంచమంతా....!!!?

__శీలా సుభద్రాదేవి
సంబంధ బాంధవ్యాల "సమాలోచన"లే
కొడవంటి కాశీపతిరావు కధలు..

కొడవంటి కాశీపతిరావు ... విజయనగరం కూడా మర్చిపోయిన ఒక గొప్ప కధకుడు.
సూటిగా...స్పస్టంగా...తను చెప్పదలచుకుంది తన కధల్లో చెప్పే ఒక విలక్షణ కధకుడు.
మానవీయ సంబంధాలు, మనుషుల మధ్య అనుబంధాలు ఆయన కధా వస్తువులు.
ఆయన రాసిన ప్రతీ కధా ఒక ఆణిముత్యమే. కధా సాహిత్యానికి వన్నె తెచ్చేవే.క్లుప్తత, గాఢతతో కూడిన కధా శైలి, పదునైన వాక్య నిర్మాణంతో సాగే కాశీపతిరావు గారి కధలు పాఠకుడ్ని  ఇట్టే ఆకట్టుకుంటాయి.  సుమారు వందకు పైగా కధలు రాసారు.1964 నుంచి పాతికేళ్ళపాటు ఆనాటి మాస, వార పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా రచనలు సాగించిన వ్యక్తి. ఉత్తరాంధ్ర యాస, తెలుగు భాషపై పట్టు ఆయన కధల్లో మనకు కనిపిస్తాయి. ఎన్ని కధలు రాసినా, ఎంతో మందిని కధకులుగా తీర్చిదిద్దినా కాశీపతిరావు గారికి తగిన గుర్తింపు రాలేదన్నది వాస్తవం.  విజయనగరం లోనే పుట్టి, ఇక్కడే పెరిగిన కాశీపతిరావు గారు ఉపాధ్యాయునిగా పనిచేసేవారు. విజయనగరం అలకానంద కాలనీలో వుండేవారు. మాయింటికి రెండు లైన్ల తర్వాతే ఆయన ఇల్లు. ఎప్పుడు ఎదురుపడినా ఈ మధ్య ఏం రాసారు, మీలాంటి కుర్రాల్లు రాయాలి, రాయండి అనే వారు. రాత ఆయనికి ప్రాణం. కధ ఆయన శ్వాస. రాయించడం ఆయన నైజం.

చాసో, రోణంకి అప్పలస్వామి వంటివారితో సాంగత్యం. రావిశాస్త్రి ఏకలవ్య శిష్యరికం..కధా రచన లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొనేందుకు దోహద పడ్డాయి. నమ్మిన సిద్ధంతాన్ని తన కధల్లో కుండ బద్దలుకొట్టినట్టు చెప్పేవారు. కధలు రాయడంలోనే కాదు, రాయించడానికి కూడా ఎంతో తపన పడిన వ్యక్తి. యువకులు కధలు రాయాలని, వారిని కధకులుగా తీర్చి దిద్దేందుకు "సమాలోచన"అనే ఒక వేదిక ను స్థాపించారు. అప్పట్లో కధలు, కవితలు రాస్తున్న ఓ పదిమంది కుర్రాళ్ళు ను పోగు చేసి ప్రతీ వారం వారందరిని  ఒక దగ్గరకు చేర్చిఆ వారం లో వారు రాసిన రచనలను కూలంకుషంగా చర్చించే వారు. సమాలోచన సమావేశా లకు వెల్లాలంటే ఏదో ఒకటి రాయాలి. అదే కట్టుబాటు. కధో, కవితో రాయాలి. ఆ సమావేశంలో చదవాలి. వాటిపై తోటి వారి అభిప్రాయాలను తెలుసుకొని దాన్ని మరింత పదును పెట్టలి. ఒక కార్యశాల లా వుండేది "సమాలోచన". ఈ విధంగా ఒక రూపు దాల్చిన రచనలను విశాఖ ఆకాశవాణి కి పంపించి ఆకాశవాణి ద్వారా ప్రచారం కల్పించేవారు. వారిచ్చిన పారితోషకంతో ఆ రచనలన్నీ పుస్తక రూపంలో వెలువరించే వారు. ఆ విధంగా వెలుగు చూసిన ఒక పుస్తకం "సమాలోచన" ఒక పదిమంది యువకుల కవితా వేదిక ఆ పుస్తకం. ఈ పుస్తకం లో నా రచన కూ డా  ఒకటుండడంతో  మాష్టారుకు నాకు మధ్య వున్న అవినాభావ సంభంధం మరింత బలపడింది. ఈ వేదికలో అక్షరాలు దిద్దినవారు ఎంతో మంది మంచి కధకులుగా కవులుగా పేరు సంపాదించుకున్నారు. 

కాశీపతిరావు గారి  కధలు  మూడు పుస్తకాలుగా వెలుగు చూసాయి."ముగ్ధ", "వెలుగు తుప్పర్లు" "బొంకులదిబ్బ కధలు" గా మూడు సంపుటాలని ప్రచురించారు. ఇవికాక మాష్టారి సంపాదకత్వంలో మరో మూడు సంపుటాలు కూడా వెలువరించారు. విజయనగరం లో వున్న తొలి తరం కధా రచయితల రచనలు, అప్పటికే లబ్ధ ప్రతిస్టులైన కధకుల రచనలతో కధల వాకిలి, కధల నగరం వంటి మూడు కధా సంకలనాలను ప్రచురించారు.  మాస్టారుకి "ముగ్ద""బొంకులదిబ్బ కధలు"బాగా పేరును తెచ్చాయి. బార్యా, భర్త ల అనుబంధానికి ఒక నిర్వచనాన్నిచ్చిన కధ "చుక్కాని". "నన్నెందుకు పెల్లడతానంటావే సుక్కా: అట్టాంటి ఆసెలెట్టుకోకే. కుంటోడితో కాపురం సెయ్యలేవు. పనీ పాటా సేసుకోలేనోణ్ణీ. కట్టుకునేటి సుకబడతావు?నేనడుక్కోని బతకాలే... అడుక్కోని బతకాలి. ఈ ఎదవ బతుకంతే...."
సుక్క బోరునేడిసింది. "మావా! అట్టాగనమాక మావా: నీ మనసు కావాల గాని కాలూ సెయ్యిలో నేటున్నాది? నివ్వు కుంటోడివయితే నీ మనసు కుంటిదవుద్దా? నాకోసమే నువ్వు కాలు పోగొట్టుకున్నావు, నిన్నిడిసిపెట్టి మరొకణ్ణి మనువాడితే బగమంతుడూరుకోడుమావా... మనువు జరగాల్సింది కట్టెలక్కాదు మావా మనసులకి. మనకెప్పు డో  మనువు అయిపోనాది...సెప్పుమావా...సుక్కానిలాగా దారిసూపించడానికి నాన్నీకొద్దా... సెప్పుమావా...ఒద్దంటే నాను సచ్చిపోతాను మావా.... ఇలా సాగే ఈకధనం  పాఠకుడ్ని కంట తడిపెట్టుస్తింది.గుండెను పిండేస్తుంది..
తను చెప్పదలచుకొన్నది సరళంగా, కధా రూపంలో ఇమడ్చి చెప్పడం అంటే ఇష్టం.  సీరియస్ యితివృత్తాన్ని కూడా హాస్యంగా చెప్పి పాఠకుడ్ని  ఊపిరి బిగ పెట్టుకొని కూర్చోనివ్వకుండా గబాగబా చదివించి అదే లక్ష్యాన్ని సాధించడానికి చేసే ప్రయత్నం ప్రతీ కధ లోను కనిపిస్తాయి. సాధారణంగా సున్నితమైన హృదయస్పందనల్ని కధలుగా రికార్డ్ చేసి మనకు అందిస్తారు.
కధలలో మాండలికం రాయటం అంతగా లేని రోజుల్లో ఈయన ప్రతీ కధలో మాండలికం కనిపిస్తుంది. ఈయన రచనలపై రావిశాస్త్రి ప్రభావం కనిపిస్తుంది. వ్యంగ్యం తో కూడిన మాండలికం మాష్టారి కధల్లో   మనం చూస్తాం. ఆయన ప్రతీ కధకీ విజయనగరమే వేదిక. ఇక్కటి ఆచార వ్యవహారాలు,  సాంప్రదాయాలు, ఈ ప్రాంత వెనకబాటుతనం, ఇక్కడి మనుషల అనుబంధాలు మాష్టారి కధలకు ముడిసరుకు. విజయనగరాన్ని ఎంతగానో ప్రేమించారు. విజయనగరం అంటే ఆయినికి  గాఢమైన అనురక్తి. విజయనగరం అంటే మోహం. రచయిత గా ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొన్నారు.  సాహిత్యం లో వస్తున్న వ్యాపార ధోరణిని అసహ్యించుకొనేవారు.
 రచయిత్రి పి.సరళాదేవి, కవియిత్రి శీలా సుభద్రాదేవి వీరి సోదరీమ ణులు.   
కాశీపతిరావు గారి గురించి ఆయన సోదరి శీలా సుభద్రా దేవి ఒక పరిచయం లో ఈవిధంగా రాస్తారు " సాహిత్య రంగంలో పెల్లుబుకుతున్న అనేకానేక వివక్షతలకు నివ్ఫ్వెరపోయి, స్వార్ధ ప్రయోజనాల్ని ఆశించే విధానాల్ని  చూసి అసహ్యంచుకొని తాను సేకరించిన అమూల్యమైన కధకుల సంపుతాల్ని కధానిలయానికి అందజేసి, అస్త్ర సన్యాసం చేసి సాహిత్య సంస్థలకు, సాహిత్య రంగానికి, పత్రికలకు దూరంగా వుండిపోయాడు"
విజయనగరాన్ని శ్వాసిస్తూ వుండే మాష్టారు విజయనగరానికి దూరంగా హైదరాబాద్ లో కుమారుల ఇంట తన 72 వ ఏట 2017  ఏప్రిల్ 19 న తుది శ్వాస విడిచారు.

( నేడు కాశీపతిరావు గారి తృతీయ వర్ధంతి. నివాళిగా) 

Photo Courtesy  : మిత్రుడు జి.ఎస్. చలం

శీలా వీర్రాజు పరిచయం

*చిత్ర, సాహిత్య కళల సృజనశీలి శీలా వీర్రాజు*
---------------- ------------ ---------- ------

*నేడు ఆయన పుట్టినరోజు (ఏప్రిల్ 22 ) సందర్భంగా... శుభాకాంక్షలతో....💐 రాశే మాట*
----------------------------------------------

*చిత్ర, సాహిత్య కళల్లో...* సమానంగా మెప్పించిన సృజనకారులు శీలా వీర్రాజు గారు . నేడు ఆయన పుట్టినరోజు  (22.04.2020). ఈ సందర్భంగా ... శీలా వీర్రాజు గారి సాహిత్య పరాపర్శకు సిద్ధపడింది ' రాశే' కలం. సాహిత్యంలో కథ, కవిత్వం, నవలలను రాసి వినుతికెక్కారాయన. అసలు రెండు దశాబ్దాల కాలం ఏ రచయిత పుస్తకమైనా శీలా వీర్రాజు ముఖచిత్రంతో రావాల్సిందే. అంటే చిత్రకళను, సాహిత్య కళను సవ్యసాచిలా తెలుగు సమాజంపై ప్రయోగించి, మెప్పు పొందిన కళాకారులు శీలా వీర్రాజు గారు. ఏప్రిల్ 22, 1939న రాజమండ్రిలో జన్మించారు. ప్రాథమిక విద్య అక్కడే సాగింది.  తర్వాత రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో బి.ఎ. వరకూ చదువుకున్నారు. చదువుకునే రోజుల్లోనే రచనా వ్యాసంగాన్ని ప్రారంభించి- కథలు, నవలలు, కవిత్వం రాసేవారు. 1961 నుండి సుమారు మూడు సంవత్సరాలు పాటు హైదరాబాదులోని కృష్ణాపత్రికలో చిత్రకారునిగా, రచనాకారునిగా పనిచేశారు. 1963లో సమాచార పౌర సంబంధాల శాఖలో ఉద్యోగంలో చేరారు. దామెర్ల రామారావు, వరద వెంకటరత్నం దగ్గర చిత్రకళను నేర్చుకున్నారు. వీరి రచనలు ఎక్కువగా మధ్యతరగతి జీవితాల చుట్టూ తిరుగుతుంటాయి. కథ రాసినా, కవిత్వం రాసినా, నవల అల్లినా అన్నింటిలోనూ సౌందర్యంతో పాటు, సామాజిక అంశం కూడా మిళితమై ఉంటుంది.
నవలలు - వెలుగురేఖలు, కాంతిపూలు, మైనా, కరుణించని దేవత.
కవిత్వం - కొడగట్టిన సూర్యుడు, హృదయం దొరికింది, మళ్లీ వెలుగు, కిటికీ కన్ను, ఎర్రడబ్బా రైలు, పడుగు పేకల మధ్య జీవితం, శీలా వీర్రాజు కవిత్వం (6 కవితా సంపుటాల గ్రంథం)
కథలు - వీరి కథలు పలు సంపుటాలుగా వచ్చాయి. సమాధి, మబ్బు, శీలా వీర్రాజు కథలు, బండి చక్రం, రంగుటద్దాలు, పగా మైనస్ ద్వేషం, మనసులోని కుంచె, వాళ్ల మధ్య వంతెన, ఊరు వీడ్కోలు చెప్పింది, శీలా వీర్రాజు కథలు (మరో సంపుటం)... లాంటివి.
ఇతర రచనలు - కలానికి అటు ఇటూ (వ్యాససంపుటి), శిల్పరేఖ
(రేఖాచిత్రాలు), శీలా వీర్రాజు చిత్రకారీయం (వర్ణచిత్రాల ఆల్బమ్) వీటితో పాటు కొన్ని అనువాదాలు కూడా వీర్రాజు చేశారు. చాలా పత్రికల్లో వీరి రచనలు ధారావాహికలుగా వచ్చాయి.
శీలా వీర్రాజు కథలు ఏకబిగిన చదివిస్తాయి. మనసుకు అనుభూతినిస్తాయి. సంస్కారవంతమైన జీవితాన్ని పాఠకులు అలవర్చుకొనేలా చేస్తాయి. వీరి కవిత్వం రమణీయతతో కూడిన భావుకతతో ఉంటుంది. మొత్తంగా వీర్రాజు రచనలు ప్రకృతిని, మనుషుల్ని సమపాళ్ళలో ప్రేమించడం నేర్పిస్తాయి. జీవితాన్ని, తోటి మనుషుల్ని నిస్వార్థంగా ఇష్టపడమని చెప్తాయి.  సమాజానికి తాత్వికమైన అర్థాన్ని అందిస్తాయి శీలా వీర్రాజు రచనలు.
"నిజాయితీ లేనివాళ్లం కవితలో-
          మాట మాటకీ మనమే గుర్తొస్తుంటాం
          ప్రజలు గుర్తురారు, సమూహాలు గుర్తురావు
          మనం వొట్టి స్వార్థపరులం
          మనకు కావల్సింది ప్రజలు కాదు, మనమే
          మన కీర్తి ప్రతిష్టలు, మన సుఖ సంతోషాలు,
          మన హోదాలు 
          ఆ తర్వాతే మనకు ప్రజలు....
         అంతస్సూత్రంగా వీరి రచనల్లో ఇదే కనిపిస్తుంది.శీలా వీర్రాజు వ్యక్తిత్వం సాత్వికం. కోపతాపాలకు అతీతం. కొత్త రచయితలకు ప్రోత్సాహం. ఇతరుల పుస్తకాలను సైతం అందమైన ముఖచిత్రాలతో గుండెలకు చంటిపాపలా హత్తుకునే తత్త్వం. కవుల్ని, రచయితల్ని ప్రోత్సహిస్తారు. చిత్ర కారునిగా కూడా శీలా వీర్రాజుది ప్రత్యేకమైన శైలి. వీరి చిత్రాలు మోడ్రన్ ఆర్టుకు దూరంగా మన గ్రామ సీమల్ని గుర్తుకు తెస్తాయి. ఊళ్లల్లో కనిపించే జీవితాలు, వృత్తులు, పనిపాటలు, పండగలు, శ్రమజీవుల కష్టాలు... ఇలా వీరి బొమ్మలు మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిబింబాలుగా ఉంటాయి. ఇప్పటి వరకు అనేక ప్రదర్శనలు ఇచ్చారు. మనదేశంలోనే కాకుండా పశ్చిమ జర్మనీ గోటింజన్ నగరంలో కూడా వీరి చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. పడుగు పేకల మధ్య జీవితం అని తన స్వీయకథను కవితా రూపంలో రాసుకున్నారు. ఇది ఆయన జీవితమే అయినా అందరి జీవితాల్లా కనిపిస్తుంది.
వీరికి 1967లో కొడగట్టిన సూరీడు కవితా సంపుటానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ వారి మొదటి అవార్డు వచ్చింది. 1969లో మైనా నవల ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ నవలగా గుర్తించింది. 1991లో వీరి కథల సంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ బహుమతి లభించింది. 2014లో బోయి భీమన్న కవితా పురస్కారం శీలా వీర్రాజును వరించింది. ఇలా అటు కథలు, కవిత్వం, నవలలు...  ఇటు చిత్రకళను తనదైన ప్రత్యేకమార్గంలో సృజించిన ప్రతిభ శీలావీర్రాజుగారిది. అందుకే నేటితరం రచయితలకు. కవులకు, చిత్రకళాకారులకు ఓ పుస్తకం లాంటి వారు శీలా వీర్రాజుగారు. ఆయన పుట్టినరోజున ఇలా సాహిత్య పరామర్శను చేసుకునే అవకాశం లభించిన తృప్తితో....ఆయన కలం నించీ... కంచె నించీ... మరెన్నో... సృజనలను స్వాగతిస్తూ.....

*-సన్నశెట్టి రాజశేఖర్, 94404 36703*
(ఎడిటర్, ఉత్తరాంధ్ర )

14, ఏప్రిల్ 2020, మంగళవారం

పాట తెచ్చిన తంటా గల్పిక

    పాట తెచ్చిన తంటా
    గల్పిక

" అమ్మా ఈ రోజుకి నేను వంట చేసేస్తాలే." బీటెక్ చదువుతోన్న లాస్య తనతల్లి  దేవి చేతిలోని అట్లకాడ అందుకోబోయింది.
  పాడుతోన్న కూనిరాగం ఆపి" ఎందుకే.నువ్వుకూర్చో వంటంతా ఐపోవచ్చింది.కూరముక్కలు మరికాస్తావేగుతే కూర పొడి వేసి కలిపి దింపేయటమే" అంటున్నా వినకుండా" నువ్వెళ్లి ముందుగదిలో కూర్చుని రెష్ట్ తీసుకో" అంటూ దేవిని పక్కకు జరిపి అట్లకాడ సింక్ లో పడేసి చెయ్యి కడుక్కుని మరో గరిట తీసింది లాస్య.
  ' సర్లే చేయని తనకి కూడా వంట అలవాటవ్వాలి కదా' అనుకుని ముందుగదిలో టీవీ ఛానల్స్ తిప్పుతూ మళ్ళా కూనిరాగం అందుకుంది దేవి.
  అంతలో కొడుకు వంశీ వచ్చి దేవి చేతిలోని రిమోట్ ని కర్ఛిఫ్ తో లాక్కుని దీన్ని శుభ్రం గా తుడిచి మరో కర్ఛిప్ తల్లికి ఇచ్చి " కాస్త రెష్ట్ తీసుకో అమ్మా" అన్నాడు.
   "అదేమిట్రా నన్ను టీవి చూడనివ్వవా"  అని చిరుకోపం తో విసుక్కుని' సర్లే వాడు డిస్కవరీ ఛానల్ చూసుకుంటాడు కాబోలు'అని అక్కడనుంచి లేచి బెడ్ రూం కి వెళ్లి మళ్లా కూని రాగం అందుకుందిదేవి.
  అంతసేపూ శేషశయనం లో పడుకుని సెల్ ఫోన్ లో వీడియోలు చూస్తున్న రవి ఉలిక్కిపడిలేచి ' నేను వంశీరూం లో పడుకుంటాను"అన్నాడు.
   తన సెల్ ఫోన్ కి ఇయర్ ప్లగ్ తగిలించి తలూపుతూ చెవికి పెట్టుకుంది దేవి.
   అందులో తనకి ఇష్టమైన  పాట వింటూ కూనిరాగం దాంతోపాటూ తీస్తూతీస్తూనే రాగాన్ని మరికాస్తా తారస్థాయికి తీసుకెళ్లింది.
  అంతలో మాస్క్ పట్టుకుని సుపుత్రుడూ,సానిటైజర్ తో సుపుత్రికా గుమ్మం దగ్గర ప్రత్యక్షమయ్యారు.వాళ్లవెనక రవి నిక్కినిక్కి చూస్తున్నాడు.
  దేవి ఆశ్చర్యం చూస్తూ "ఏమిటిలా ఆంతా వచ్చేసారు'అంది.
  "నువ్వు తుమ్ముతావేమోనని" నసిగారు.
అర్ధం కాని దేవి గభాలున లేవటంతో చేతిలోని సెల్ ఫోన్ లో స్పీకర్ ఆనై పోయి దేవికి ఇష్టమైన సాలూరు రాజేశ్వర్రావు గొంతులో పాట గట్టిగా వినిపించింది.
  " తుమ్మెదా....ఒకసారి
    మోమెత్తిచూడమని చెప్పవే
    ఒకసారి ......తుమ్మెదా
    తుమ్మె..దా.......".

  ( కీర్తి శేషులు సాలూరి వారికి క్షమాపణలతో)

11, ఏప్రిల్ 2020, శనివారం

పి.శ్రీదేవి రాసిన కాలాతీతకథ - వాళ్ళు పాడిన భూపాలరాగం

     
డా. పి. శ్రీదేవి రాసిన ‘కాలాతీతకథ’ – వాళ్ళు పాడిన భూపాలరాగం

డా. పి. శ్రీదేవి రాసిన ‘కాలాతీతకథ’ – వాళ్ళు పాడిన భూపాలరాగం

డా. పి. శ్రీదేవి పేరు చెప్పగానే ‘కాలాతీత వ్యక్తులు’ నవల గుర్తుకు రానివారు అరుదు. అయితే ఆమె కథలు కూడా రాసినట్లు  తెలిసినా ఆ కథల్ని తెలిసినవారు తక్కువే. పి. శ్రీదేవి రాసిన కథలు రాశిలో తక్కువే అయినా వాసిలో ‘కాలాతీత వ్యక్తులు’కు దీటుగా ఉన్న కథలు ఉన్నాయి. నవలలో పాత్రల లాగే మరపురాని పాత్రలతో ఉన్న కథగా చటుక్కున చెప్పదగినది – ‘వాళ్ళు పాడిన భూపాలరాగం’. ఇది 1959లో జయంతి (జులై) సంచికలో ప్రచురితం. 1966లో ‘ఏరినపూలు’ సంకలనంలో చేర్చబడింది. అనేక భిన్న మనస్తత్వాలు గల పాత్రలలో, అనేక సంఘటనలతో, ఆనాటి సమజానికి ప్రతిబింబంగా ఉండి, కథావిస్తృతి కలిగి ఉండటం చేత దీనిని నవలికగా కూడా చెప్పుకోవచ్చు. కాలాతీతవ్యక్తులు నవల రాసిన తర్వాత రాసిన కథ కావటాన కథాసంవిధానంలో, పాత్రల చిత్రణలో ఈ కథపై కూడా దాని ప్రభావం ఉంటుంది.
ఇందులోని కథంతా చెప్పకుండా పాత్రల్ని, పాత్రల స్వభావాల్నీ, మాత్రమే చెపుతాను. ఎందుకంటే ఇందులోని పాత్రలు కూడా సమాజంలో ఎప్పటికీ ఉండే పాత్రలే.  పాత్రని సృష్టించేటప్పుడు పాత్రల యొక్క మూలస్వభావాన్ని కూడా పాఠకులకు అవగాహన అయ్యేలా సంఘటనల్నీ, సంభాషణల్నీ కూర్చే శైలి శ్రీదేవికే స్వంతం. అందుకనే వీరి పాత్రలు ఎప్పటికీ సజీవంగా వుంటాయి.
  1. రామచంద్రయ్య: శుద్ధ మాష్టరీ ఉద్యోగం. లేమికి గానీ, అశుచికిగానీ బాధపడడు. అనారోగ్యం ఎరగడు. జీవితావసరాలు సమపాళ్ళలో వుండే కుదురైన సంసారం. రేడియోలూ, సినీమాలూ, గ్రామఫోన్ల వంటి అధునాతనమైన వాటిని నమ్మడు. ఇంట్లో ఏ కార్యం చేసినా పొదుపుగా, శాస్త్రోక్తంగా చేస్తాడు. ఒకరి మీద ఆధారపడకుండా బతకాలనే మధ్యతరగతి సగటు మనిషి మనస్తత్వం, జీవన విధానం కలవాడు. తిండి, బట్ట బతకటానికి చాలనే అతని ఉద్దేశ్యం. అందుకే తెలివైనవాడైనాసరే కొడుకు రామారావుని పై చదువులకు ప్రోత్సహించకుండా పట్నం పంపి ఏ ఆఫీసులో ఏయే ఖాళీలు ఉన్నాయో కనుక్కొని దరఖాస్తు చేయమని పరీక్షలు పూర్తి చేయగానే పంపించేస్తాడు. కూతురు మీనాక్షిని పదహారు ఏళ్ళు నిండగానే సుఖపడ్తుందని భావించి, ఆస్థిపరుడైన రెండో సంబంధం వాడికిచ్చి పెళ్ళి చేసి చేతులు దులుపుకుంటాడు.
  2. సూర్యం: రామారావుకి బాబాయి. మొదటి భార్య పోతే మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడు. మొదటి భార్య కూతుర్ని శ్రీనివాసులు అనే ఆస్థిపరుడికి ఇచ్చి పెళ్ళి చేసి అందరూ కలిసి ఉంటారు. సూర్యం రెండో భార్య ఏటా బాలింత, చూలింతగా ఉండటంతో, పండుగలూ, పబ్బాలుతో ఇల్లు ఒక ధర్మసత్రంలా ఉంటుంది. ఇంట్లో ఇద్దరు పెద్దవాళ్ళు ఏడుగురు పిల్లలతో శుచీ, శుభ్రతలే కాదు, పట్టించుకునేవారూ లేక భాషా, ప్రవర్తన, అలవాట్లు భరించలేనివిగా ఉంటాయి. మామగారి కుటుంబ పోషణకు తన ఆస్థి హరించుకుపోగానే అల్లుడు శ్రీనివాసులు వేరు కాపురం పెడతాడు. ఇంట్లో ఏ వస్తువూ సరీగా లేక వాళ్ళింటికి వచ్చిన కుర్రాడు రామారావునే కాదు, శ్రీనివాసులు తెచ్చిపెట్టుకున్న ఆమెని పరోక్షంలో శాపనార్థాలు పెడ్తూ కూడా తిరిగి ఆమె దగ్గర కూడా చేయి చాపటానికి సిగ్గుపడరు సూర్యం, అతని భార్య. ఇంకా పైపెచ్చు తమ లేమినీ, తమ అవసరాల్నీ తమ నిర్లజ్జనీ కప్పిపుచ్చుకుంటూ భార్య చాతకానిదని సూర్యం, భర్త మతిమరపుతనాన్ని అతని భార్యా ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు.
  3. వెంకటేశ్వర్లు: రామారావుకు మరోబంధువు. డెబ్భయి రూపాయల జీతం వచ్చే ఉద్యోగం, ఇంటద్దెకు ఇరవైపోగా భార్యాభర్తలిద్దరూ, పక్కవాళ్ళింటిలో పిల్లలిద్దర్నీ వదిలేసి వారానికి మూడు సినీమాలైనా చూసే సినీమా పిచ్చి కలవాళ్ళు. డబ్బులు లేకపోతే తాము భోజనం మానేసి పిల్లలకి పకోడీ పొట్లాం కొనిచ్చి మంచినీళ్ళు తాగిస్తారు కానీ సినిమా మానరు. ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టలేదని కనెక్షన్ తీసేసినా బాధ వుండదు. కానీ పరోక్షంలో శ్రీనివాసుల్ని ఎత్తి పొడుపు మాటలంటూనే సినిమా కోసం మళ్ళీ అతని ముందే చెయ్యి చాచటానికి ఏమాత్రం సంకోచించడు. ఆఖరికి ఉద్యోగార్థియై వచ్చిన పిల్లవాడు రామారావుచేత సినిమాకి డబ్బు ఖర్చు చేయించటానికి కూడా సిగ్గుగానీ మొగమాటంగానీ లేదు.
  4. సుబ్బారావు: లక్షాధికారి కొడుకు కావడంతో చదువు అబ్బలేదు. కృత్రిమ రాజసంతో తగిన వధువు దొరకక ఆలస్యంగా పెళ్ళి చేసుకుంటాడు. ఉద్యోగం చేయటానికి నామోషీ. ఆస్థి అంతా కరిగిపోయి అప్పులు చేసేందుకు మాత్రం నామోషీ లేదు. తండ్రి పంపే డబ్బుతో కొత్త భార్యతో సినిమాలూ, షికార్లు, హోటళ్ళుతో జల్సా చేస్తుంటాడు. పూర్వ వైభవం చాటే రోజ్ వుడ్ కుర్చీలు, వెండి ఏనుగుల అగరొత్తి స్టాండు, పెద్ద పట్టిమంచాలుతో రెండు గదుల ఇల్లు పాత కొత్తల మేలు కలయికతో కృత్రిమ రాజసాన్నీ, హిపోక్రసీని ప్రదర్శిస్తూ ఖరీదైన జీవితం గడుపుతుంటాడు. కానీ ఎవరినెత్తినైనా చేయి పెట్టి భార్యతోపాటు సినిమాలకీ షికార్లకీ ఖర్చు చేయించటానికి వెనుదీయడు.
  5. శ్రీనివాసులు: ఈ కథకి నిజానికి హీరోగా చెప్పబడే వ్యక్తి. పదహారు ఏళ్ళకే సూర్యం మొదటి భార్య కూతురు సుశీలని పెళ్ళి చేసుకొని మామగారి బహుసంతానాన్ని పోషించే బాధ్యత నెత్తికెత్తుకొని ఆస్థి హరించిపోతుంటే, భార్య సలహాతో వేరు కాపురం పెట్టి ఒక్కటొక్కటే తిరిగి ఇంట్లో హంగులు అమర్చుకుంటాడు. అయిదుగురు పిల్లలున్నా పొందికగా సంసారాన్ని గడుపుతుంటాడు. పెద్దకూతురు బాగా చదువుతుందని డాక్టర్ని చేయాలనుకుంటాడు. ఇతను చేసిన గొప్ప సాహసం ఆస్తిపరురాలైన బాలవితంతువు వరలక్ష్మిని చేరదీయడం. బహుభార్యత్వం నిషేధం కనుక సహజీవనం సాగిస్తుంటాడు. బతికి చెడిన వాడే కాకుండా బతకడం ఎలాగో తెలిసినవాడు శ్రీనివాసులు. అందుకే నేనొక లాటరీ గెలిచాను. నా సమస్తం వరలక్ష్మి అధీనంలో పెట్టాను. తెల్లవారితే ఉప్పుకో, పప్పుకో నాలుగు కుటుంబాల వాళ్ళు నా యింటికి రాక తప్పటం లేదు. ఆ ‘ఎవర్తో’ అనే సంగతి తెలిసి కూడా ఆమె దగ్గర మాటిమాటికీ చెయ్యి చాపుతారు. మొన్నపుట్టిన పిల్లాడితో సహా మేమంతా ఆమె పెంపుడు చిలకలం’’ అని ప్రశాంతంగా చెప్పగలిగేవాడు శ్రీనివాసులు.
స్వభావంలోనూ, ప్రవర్తనలోను, తన భావాలను స్పష్టంగా చెప్పేతీరులోనూ కాలాతీత వ్యక్తులులోని ఇందిర ఛాయలు శ్రీనివాసులలో వ్యక్తమౌతుంటాయి.
చస్తూ బతికే కన్నా చెడి బతికే మార్గం చూసుకోవాలనే సిద్దాంతంతో తానూ, తన భార్యాపిల్లల్నే కాక తమతో సహజీవనం చేస్తున్న వరలక్ష్మికి ఏ బాధలు, నిరాశానిస్పృహలు లేకుండా నిశ్చింతగా బతకటం బతికించటం ఎలాగో ప్రయోగాత్మకంగా చూపిస్తూ బాగుపడినవాడు శ్రీనివాసులు.
తాను సమాజానికి ఆదర్శం అని చెప్పుకోలేదు. సమాజానికి పరాన్న జీవుల్లా బతికే వారికన్నా మరొకరికి నష్టం కలిగించని జీవితం ఇతనిది. శ్రీనివాసులు వరలక్ష్మిని చేరదీయటం వలన భార్య సుశీల ఏమాత్రం అభ్యంతరపెట్టలేదు. ఇద్దరూ కలిసి మెలిసే బతుకుతుంటారు. ఎందుకంటే ఇద్దరికి ఒకరి అవసరం ఒకరికి ఉంది. ఈ విషయాన్ని రచయిత్రి చాలా పాజిటివ్ దృక్పథంతో పాఠకులని ఒప్పించే రీతిలో కథనం సాగించటం విశేషం.
  1. రామారావు: కథలో ఆసాంతమూ విస్తరించిన పాత్ర. కథాగమనంలో ప్రేక్షకుడిలా ఒక్కొక్క తరహా పాత్రల్నీ వారి కుటుంబ జీవన విధానాల్నీ చూస్తూ, వాళ్ళతో నడుస్తూ, పరిశీలిస్తూ, అనేకానేక జీవన సత్యాలు అనుభవం ద్వారా తెలుసుకుంటాడు.
ఉద్యోగార్థియై తిరుగుతున్నప్పుడు దారిలో శ్రీనివాసనులు ఎదురై ఇంటికి తీసుకెళ్ళి తన కూతురు తెలివైందనీ, డాక్టరీ చదివిస్తానని చెప్పినప్పుడు రామారావు మొదటిసారి చిన్నబోతాడు. ఫస్టు మార్కులు తెచ్చుకొని కూడా పై చదువులు చదవలేకపోతున్నందుకు తన తోటి వాళ్ళైన వెంకటస్వామి చిన్న కొడుకు, మిల్లు మేనేజర్ పెద్ద కొడుకూ హాయిగా గోళీలాడుకుంటుంటే తానిట్లా ఉద్యోగం కోసం తిరిగే పరిస్థితికి భయపడ్తాడు, బాధ కూడా పడ్తాడు.
ఇక ఆ తర్వాత కథాప్రయాణంలో రామారావుని ఏ సంఘటనలు ఎలాటి అనుభూతులకు లోనుచేసాయో చెప్పే విధానంలో రచయిత్రి ముద్ర గమనించవచ్చును. కౌమారదశలోని అభం శుభం తెలియని రామారావు ఆయా కుటుంబాలతో గడిపి ఎలాంటి సంఘర్షణలకు లోనయ్యాడో, ఏ విధంగా మానసిక పరిణితి సాధించాడో పి. శ్రీదేవి తనదైన శైలిలో కొంత వ్యంగ్యంగా, కొంత హాస్యంగా, కొంత నిరసనగా కథ నడుపుతుంది. ఇక్కడ అనేకచోట కాలాతీతవ్యక్తులులోని ప్రకాశం, ఇందిర, కళ్యాణి, కృష్ణమూర్తుల జీవితాల్ని పరిచయం చేసిన ధోరణులు, ఛాయలూ ఈ కథలో కూడా తొంగిచూస్తాయి.
సూర్యం బాబాయి కూతురు టైఫాయిడ్ తో అస్థి పంజరంలా ఉండటం, యమకూపంలాంటి ఇల్లు, యమకింకరుల్లాంటి సంతానం, చస్తూ బతుకుతోన్న ఆ కుటుంబాన్ని చూస్తే రామారావుకి భయం కలుగుతుంది. స్కూలు ఫైనల్ పాసై కౌమారదశలోని అభం శుభం తెలియని రామారావుకు సూర్యం కుటుంబం వరలక్ష్మిని వెటకారం చేస్తూనే అవసరం కోసం నిర్లజ్జగా ఆమె ముందు చెయ్యి చాపటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఇంటి అవసరాలకన్నా సినీమాలు చూడటమే ముఖ్యమనుకునే వెంకటేశ్వర్లుకి వచ్చే 70 రూపాయల జీతం నెలంతా ఎలా సరిపోతుందో స్కూలు ఫైనల్ మెదడు లెక్కకట్టలేకపోతుందని చమత్కారంగా అంటుంది రచయిత్రి.
కృత్రిమ రాజసంతో హిపోక్రసీతో బతికే నిరుద్యోగి సుబ్బారావుకి సినీమాలకీ, షికార్లకీ డబ్బు ఎక్కడ నుండి వస్తుందో, తర్వాత ఎలాగ గడుస్తుందో అనే ప్రశ్న రామారావుని వేధిస్తుందని రచయిత్రి చెప్తుంది.
వరలక్ష్మి, సుశీల ఒకరికొకరు ఆదరంతోనూ, ఆప్యాయతలతో ప్రశాంతంగా గడపటం చూసి రామారావు ఆశ్చర్యపోతాడు. శ్రీనివాసులు తన కథ అంతటినీ తనతో విడమరిచి చెప్పేసరికి తనకు పెద్దరికాన్ని ఇచ్చినట్లుగా, ఆత్మీయునిగా సంబోధించినట్లు ఉక్కిరి బిక్కిరి అవుతాడు అంటూ కథనం చేయటంలో రామారావు తానింకా స్కూలు పిల్లాడిగానే భావిస్తూన్న వయసులోని మనస్తత్వాన్ని చూపుతుంది డా. పి. శ్రీదేవి.
పుస్తక జ్ఞానం తప్ప మరొకటి తెలియని రామారావుకి ప్రపంచం అంతా తేటతెల్లమైనట్లు తోచింది, మంచి వాతావరణంలో పెడితే వీడీవిడని మొగ్గ సహజసిద్ధంగా విచ్చుకున్ననట్లు. మానసిక పరిణితి వచ్చింది అనేది చెప్పటానికి కాయాపండూ కాని మెదడు మెల్లమెల్లగా పలకబారినట్లు అయ్యింది అంటూ ఉపమానించటం రచయిత్రి శైలిలోని కొత్తదనం. రచయిత్రి తాను దృశ్యమానం చేసిన సంఘటనల వలన, దృశ్యాల వలన ఒక్కొక్కపాత్ర మనస్తత్వం జీవన విధానం విడమరచటం వలన రామారావుకి మానసిక పరవర్తన ఎలా కలిగిందో తెలియజేసింది తప్ప నీతిబోధ చేయలేదు. ఏది మంచి ఏది చెడు అని డా. పి. శ్రీదేవి ఎప్పుడూ చెప్పదు. కథని బట్టి పాఠకుడు అర్థం చేసుకోవాలి.
‘‘ఇప్పుడు నీ తండ్రి చెప్పినట్లే రేపు పెళ్ళి చేసుకోమంటే చేసుకుంటావు. తర్వాత నీ చదువుకి నీకు వచ్చే జీతంతో సూర్యం కుటుంబంలా చస్తూ బతుకుతావో, వెంకటేశ్వర్లూ, సుబ్బారావుల్లా అయిదూ పదికీ మీ నాన్న మీద ఆధారపడతావో నిర్ణయం చేసుకో. వాళ్ళందరిలా పవిత్రంగా చచ్చిపోకు. శ్రీనివాసులా చెడిపోయి బతికేమార్గం చూసుకో’’ అని శ్రీనివాసులు చేసిన దిశానిర్దేశం రామారావుకి మార్గం నిర్ణయించుకోటానికి బీజం వేసింది అంటుంది రచయిత్రి. అంటే ఏది చేయకూడదో తెలుసుకోటానికే కాని చెడిపోమని రచయిత్రి ఉద్దేశం కాదు. అందుకే తిరిగి వెళ్ళిన రామారావు తండ్రికి తన నిర్ణయం తెలియజేసి, తల్లి వత్తాసుతో చదువులో చేరుతాడు.
కానీ రామారావు మనసు చల్లబడలేదు. ఎవరినో ఉద్ధరించాలనో, ఘనకార్యం చేయాలనో చదవబోవటం లేదు. బురదగుంటలో కప్పలా ఒకరినొకరు కబళిస్తూ బతికేకన్నా కొన్నాళ్ళు ఆకాశంలో పక్షిలా స్వేచ్ఛగా బతకటానికి వ్యవధి కోసమే నా చదువు’’ అని అనుకుంటాడని కథ ముగిస్తారు. రామారావు పూర్తిగా పరిణితి చెందటానికి కావలసిన వ్యవధిని తెలియజేస్తున్న ముగింపుగా ఉంటుంది.
భారత స్వాతంత్ర్యానంతరం తొలి పదేళ్ళలో సమాజంలోని ఆర్థికసంక్షోభం. మధ్య తరగతి కుటుంబాలలో మానవ సంబంధాలపై ప్రభావం చూపించి ఆర్థిక సంబంధాలుగా మాత్రమే మార్చేసిన సామాజిక పరిస్థితులు కథలో ప్రతీదృశ్యంలోనూ ప్రతిబింబిస్తుంటాయి.
కథకి కేంద్ర బిందువు అయిన వరలక్ష్మి గురించి చెప్పినపుడు రచయిత్రి తన సహజమైన కథన పద్ధతి వ్యక్తమౌతుంది. వరలక్ష్మి 11వ ఏటనో, 12వ ఏటనో పెళ్ళి జరిగింది. ఏడాదికి భర్త చనిపోవటంతో భర్త విలువా, డబ్బు విలువా తెలియకుండా పెరిగింది. ఆమె తండ్రి వియ్యాల వారి ముక్కుపిండి పాతికవేల రూపాయిన ఆస్థిలాగితే అది వడ్డీలకు వడ్డీలై పెరిగింది. తెలివైన వరలక్ష్మి స్కూల్లో చేరి స్కూలు ఫైనల్ వరకూ చదివింది. ఇంకా చదివిస్తే ఎక్కడికైనా ఎగిరిపోతే ఆస్థి దూరమౌతుందని మానిపించుతారు. కానీ వయసు పెరుగుతున్నా వరలక్ష్మికి కోరికలూ పెరిగాయి. ఆమె అన్న శేషగిరి ద్వారా పరిచయం అయిన శ్రీనివాసులు తన ఆస్థినీ, తననీ కాపాడతాడని నమ్మి అతని నీడన చేరి, బహుభార్యా నిషేధం వలన సహజీవనం సాగిస్తుంది. ఆమె వలన శ్రీనివాసులు కుటుంబానికి  ఆర్థికావసరాలూ, అతని వలన వరలక్ష్మి అవసరాలూ తీరాలని, అతని కుటుంబాన్ని ఆదరంగా చేరదీసింది వరలక్ష్మి. శ్రీనివాసులు భార్య సుశీల కూడా తెలివిగా తన కుటుంబంతో సహా వరలక్ష్మి అధీనంలోకి చేరింది అంటుంది రచయిత్రి. అద్భుతమైన పదునైన వాక్యం నిర్మాణం శ్రీదేవి స్వంతం. చిన్న చిన్న వాక్యాలలోనే ఎంతో అర్థాన్ని నిబిడీకృతం చేసిన వాక్యాలు శ్రీదేవి రచనలకు మంచి గాఢతని ఇస్తాయి.
ఈ కథలోని ప్రతీ పాత్ర కూడా విచిత్రమైన విభిన్న వ్యక్తిత్వం కలవే. ఒక పాత్రని మరొక పాత్రతో పోల్చటానికి లేదు. ఇది కూడా డా. పి. శ్రీదేవి రచనలలోని పాత్రల ప్రత్యేకతగానే చెప్పాలి. ఇందులో పట్టణ జీవితానికీ, నగర జీవితానికి గల వ్యత్యాసం కనిపిస్తుంది. సమాజంలోని సాధారణ మధ్యతరగతి జీవులు నగర జీవితాలలో ప్రలోభపెట్టే అలవాట్లకి ఆకర్షితులు కావటం తమ తాహతును గుర్తించకుండా అనేకానేక ప్రలోభాలకు బలై అప్పులపాలై జీవితాలను అస్తవ్యస్తం చేసుకోవటం వలన అంతకంతకూ లేమిలో కూరుకుపోయి చస్తూ బతికే బతుకులను అద్దంలా ప్రస్ఫుటంగా చూపిస్తుంది. ఆ ప్రలోభాలకు చిక్కకుండా ఉండటానికి కావలసిన తెలివి తేటలు లేకపోతే శ్లేష్మంలో ఈగల్లా, బురద గుంటలో పందుల్లాగా బతకాల్సిందే. ఈ నిజాల్ని తెలియపరచటానికి ఒక్కొక్క కుటుంబాన్ని పరిచయం చేస్తుంది రచయిత్రి.
శ్రీనివాసులు తమ జీవితాల్ని విప్పి చెప్పి ‘‘ఇలా బతకటానికి స్కూలు ఫైనల్ ఫస్టు రానవసరం లేదు. ఆ అవకాశాన్ని విదేశీ చదువులు చదివి, ఉన్నత విద్యలు చదివేవారికి వదిలేస్తే బావుండేది’’ అనటంలో ఎలా బతకాలో తెలియచేయటానికి, జీవితాన్ని సఫలీకృతంగా మలచుకోవటానికి ఉపయోగించని చదువులు అనవసరమని, చదివిన చదువు వల్ల మానసిక వికాసం కలగాల్సిన అవసరాన్ని వ్యక్తపరిచారు రచయిత్రి. ఇది ఈనాటికీ కూడా విద్యార్థులు, తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన సత్యం.
అరవై ఏళ్ళ క్రిందట ఆడపిల్లల మనస్థితి, ముఖ్యంగా బాలవితంతువుల దుస్థితి, ఆర్థికావసరాలు ఏ విదంగా మధ్య తరగతి కుటుంబాలలోని మానవ సంబంధాన్ని ఛిద్రం చేస్తాయో దృశ్యమానం చేశారు రచయిత్రి. విభిన్న దృక్పథాలు కలిగిన వ్యక్తులతో గడిపిన అనుభవాలు రామారావుని స్వంతగా నిర్ణయం తీసుకోగలిగేలా చైతన్యం కలిగించటం వలన ఈ కథ శీర్షిక ‘‘వాళ్ళు పాడిన భూపాల రాగం’’ అర్థవంతంగా ఉంది. భూపాలరాగాన్ని తెల్లవారుజామున మేల్కొల్పుగా పాడే పాటలకు వాడుతారు.
పుస్తక జ్ఞానం కన్నా మానసిక వికాసం కోసం జీవితాల్ని చదవాల్సిన అవసరాన్ని ఈ కథ ఆసాంతం వ్యక్తం చేస్తుంది. కథ పరిమాణం కూడా విస్తృతంగా ఉండటం వలన నవలికగా అనిపిస్తుంది. కథానిర్మాణశైలిలోనూ, సంభాషణల్లోనూ, పాత్రల రూపచిత్రణలోనూ, రచయిత్రి వ్యాఖ్యానంలోనూ కాలాతీతవ్యక్తులు నవలకు ఏమాత్రం తీసిపోనిది కావటాన డా. పి. శ్రీదేవి రాసిన ‘కాలాతీత కథ’గా ఈ కథని గుర్తించవచ్చును.

10, ఏప్రిల్ 2020, శుక్రవారం

ఊతకర్ర

క్కసారి..కాదు..కాదు
అనేకానేక సార్లు
ఎన్నింటినో లెక్కలు వేస్తుంటాం
కానీ
దువ్వెనలో మెరిసే  వెండితీగ
ఏనాడూ కళ్ళకు జిగేల్ మనిపించిందిలేదు
గుండెలో గుభేల్ మనిపించిందీలెదు
వేసుకున్న చీకటితెరని చీల్చి
ఏ చంద్రకిరణం నుండి తెలుపును అరువుతెచ్చిందో
ఇప్పుడు నాజడ నిండా మెరుపుతీగలే!
అద్దం చూసుకుంటానా
సముద్రం నాలో నిండిపోయిందో ఏమో
అమావాస్యనాడు పోటుమీదున్నట్లుగా
ముఖం నిండా చేతుల నిండా
అలలు అలలుగాముడతలు!
చిన్నప్పుడు అమ్మ ఎంత కాటుక పెట్టిందో
నేటికీ కళ్ళచుట్టూ పరచుకొన్న
వలయాలు చూపుకి అడ్డం వస్తున్నాయ్
ప్రతీ పుట్టినరోజునాడూ
తర్జని చూపి వయస్సు బెదిరిస్తూనే ఉంటుంది
ఐనా అదేం చేయగలదు?
కళ్ళల్లో స్వప్నాలు
ప్రతీరాత్రీ గుబాళిస్తూనే ఉంటాయ్
మనసు ఛైతన్య జీవస్రవంతై
శరీరమంతటా ప్రవహిస్తూనే ఉంటుంది
ఆలోచనలునాకన్నా ముందే పరుగులు తీస్తూ
కథలవలువలు చుట్టుకుంటూ
కవనరాగాల్ని శృతి చేస్తూ
కాగితాలవేదికల్ని వెతుక్కుంటూనే ఉంటాయ్
ఇంక నాకేం భయం!!
పుస్తకాలబరువులతో ఆత్మవిశ్వాసం సడలి
నడుం వంగిన పిల్లలకి చేతిసాయం చేస్తూ
కళ్ళని విప్పార్చి ఆతృతగా అరచేతియంత్రం లోకి
తలదూర్చి మాటలు మర్చిపోయి
చాట్లను చేసుకుంటున్న యువతరాన్ని
జాలిగా చూస్తూ
ఆధ్యాత్మికతనే వ్యాపకం గా మార్చుకుని
అన్నింటికీ కర్మసిద్ధంతాన్నె ముడిపెట్టి
నలభై ఏళ్ళకే ముసలమ్మలౌతోన్న తరాన్ని
నిరసనగా పరికిస్తూ
కులాసాగా కూనిరాగాల్ని తీస్తూ
ఎంతదూరమైన పరుగులు తీస్తాను
చైతన్యం నా జీవలక్షణం కదా మరి!
అక్షరం నా ఊతకర్ర
మనోబలం నాకలం
అలసట ఎరగని నిరంతర బాటసారిని
వయోభారం నాకు లేదు
అది శరీరానికేకాని మనసుకి కాదుకదా!!!

వామపక్ష భావజాల రచయిత్రి_ వాసిరెడ్డి సీతాదేవి కథలు

సుమారు ఆరేడు దశాబ్దాల కిందట సాహిత్యరంగంలో ఉన్న వారిలో ముఖ్యంగా రచయిత్రులలో సింహభాగం ఒకే సామాజిక వర్గానికి చెందినవారు అనేది జగమెరిగిన సత్యం. అందుకు వారి కుటుంబాలు కొన్ని తరాలుగా సాంస్కృతికంగా ఎదిగినవారు కావటమే. ఇంట్లోనే అయినా చదువుకునే అవకాశాలు ఉండటం, సారస్వత సాహిత్యాలలో అభిరుచి ఆసక్తీ పెంచుకునే అవకాశాలు, ప్రోత్సాహం ఉండడం, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా దానికోసం ఇంటిల్లిపాదీ శ్రామిక జీవనం చేయాల్సిన అవసరం లేకపోవటం ఇవన్నీ కూడా వారికి రచనలు చేసే సౌలభ్యం, సావకాశం కుదిరేలా చేశాయి. ఇతర సామాజిక వర్గాలలో కొన్ని అగ్రకులాలలో మాత్రమే కొందరైనా చదువుకునే వెసులుబాటు కలిగింది. ఆ కారణాల వలనే 60-70 ఏళ్ళ కిందట దళిత, బహుజన కులాల రచయిత్రులు ఒకటీ అరా మాత్రమే ఉన్నారు.
అటువంటి పరిస్థితులలో బ్రాహ్మణేతర కులాల నుండి సాహిత్యరంగంలోకి అడుగుపెట్టిన ఒకరిద్దరు రచయిత్రులలో తనకంటూ ఒక ముద్రని సాధించుకొని నిలబడిన వారిలో చెప్పుకోదగినవారు వాసిరెడ్డి సీతాదేవి ఒకరు.
అప్పటివరకూ వస్తున్న రచనలలో వస్తుపరంగానే కాక భాషాపరంగానూ, ఒకే సామాజిక వర్గ కుటుంబ జీవనం, సంస్కృతీ సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలూ కావాలని కథలో చొప్పించకపోయినా కూడా – ప్రస్ఫుటంగానే వ్యక్తమయ్యేరీతిలోనే ఉండేవి. సంభాషణలూ, మానవ సంబంధాలూ, కుటుంబ జీవన విధానం, అన్నీ ఒక పద్ధతిలోనే సాహిత్యమంతా పరచుకుంటున్న రోజుల్లో బ్రాహ్మణేతర రచయితలు కూడా అదే ధోరణిలోనే అదే ప్రామాణికమన్నట్లుగా రచనలు చేసేవారు. అటువంటి పరిస్థితుల్లో సీతాదేవి ఒక కొత్తరీతినీ సమాజంలోని మరో కోణాన్నీ, ఇతరేతర కుటుంబ జీవనాల్నీ పరిచయం చేస్తూ రచనలు చేశారు.
అంతవరకూ ఉన్న ధోరణికి భిన్నంగా ఉన్నందువలన పాఠకలోకం కూడా ఆసక్తి కనబరిచారు. అప్పుడప్పుడే సమాజంలోని అన్ని వర్గాల మహిళలూ పాఠకులుగా మారటం వీరి రచనలలోని భిన్న ధోరణితో మమేకం కావటం వల్ల కావచ్చు సీతాదేవి రచనలు ఆదరణ పొందాయి.
ఆ రోజుల్లో రచయిత్రులలో మూడొంతులకుపైగా కీర్తీ, ధనం అందించే ధారావాహికలే పుంఖానుపుంఖాలుగా రాస్తున్న సందర్భంలో సీతాదేవి నవలలతోబాటు అంతే ఏకాగ్రతతో కథలు కూడా విరివిగా రాసారు. అందుకే నలభై రెండు నవలలే కాక పదకొండు కథల సంపుటాలు- అంటే వందకుపైగా కథలు రాసారు. వీరి కథలు చాలావరకూ దీపావళీ, సంక్రాంతికీ వెలువడే యువ, జ్యోతి, ఆంధ్రపత్రిక మొదలైన పత్రికల ప్రత్యేక సంచికలలోనే ప్రచురితమవ్వటం కూడ ఒక విశేషం.
ఒక్కగానొక్క పిల్లవాడు గోపాలం పుష్కరాలలో తప్పిపోతే దుఃఖపూరితులైన దంపతులను ‘సానుభూతి’ పేరిట ఇంటికి వచ్చిన వారంతా వైనాలువైనాలుగా తప్పిపోయిన పిల్లల దుస్థితులను గురించి చెప్పేసరికి భయంతో మతిభ్రమణంకు లోనౌతారు ఆ దంపతులు. తీరా పిల్లవాడు తిరిగి క్షేమంగా దొరికినా గుర్తించలేని ఆ తల్లిదండ్రుల పరిస్థితిని ఆద్యంతం ఆర్ర్దతతో కూడిన కథనంతో సాగిన సానుభూతి కథలో మానవ స్వభావాలను తెలియజేస్తుంది సీతాదేవి.
ఎన్నికలలోని లొసుగులూ, స్వార్థ రాజకీయాలను ఎండగడుతూ రాసిన కథ ‘మీ ఓటు నాకే’ (1979) ఇందులోని పాత్రలన్నిటినీ మిసెస్ కైలాసం, మిసెస్ పరాంకుశం, శ్రీమతి ముకుందం, మిసెస్ వైకుంఠం, శ్రీమతి శిఖండి లాంటి మహిళల్ని చెప్పటంలో భర్తల పేర్లతో తప్ప స్వంత వ్యక్తిత్వంలేని మహిళామణుల పట్ల రచయిత్రికి గల వ్యతిరేకత వ్యక్తమౌతుంది.
సర్కారు బస్సుల్లో ఇరుకిరుగ్గా కూర్చోబెట్టి, రైలులో జనతా బోగీలో ప్రయాణం చేయించి, పేదవాడి గుడిసెలలో జీవన దృశ్యాల్ని ఆవిష్కరించి పాఠకుల్ని భద్ర కుటుంబం నుండి బయటకు తెచ్చి బయట ప్రపంచం ఎలా వుంటుందో చూపించే కథలు సీతాదేవివి.
ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా కూడా భార్య వేన్నీళ్ళకు చన్నీళ్ళుగా ఆర్థికంగా తోడుపడడానికి సిద్ధపడితే భార్య సంపాదించటం తన భర్తృత్వాన్ని కించపరచటంగా భావించే ఆనాటి సామాజిక సాంప్రదాయాల్ని నిలదీసే కథ 1956లో రాసిన ‘పారిపోయిన మనిషి’ రామసుబ్బమ్మ తాను ఇంట్లోనే ఇడ్లీలు చేసి అమ్ముతానని అంటే ఆమెపై నిప్పులు చెరుగుతాడు శేషయ్య. అయినాసరే ఆమె తన నల్లపూసల గొలుసు 800 రూపాయలకు అమ్మి ఇంట్లో పెట్టిలో దాస్తే అది తీసుకొని శేషయ్య భార్య సంపాదన తినే కన్నా ఆత్మహత్య మేలని ఇల్లు వదిలి కాశీకి పారిపోతాడు అక్కడ అనుకోని పరిస్థితుల్లో మూడేళ్ళు జైలు పాలై తిరిగి పశ్చాత్తాపంతో ఊరికి తిరిగి వచ్చిన శేషయ్య స్టేషను దగ్గర హోటలులో టిఫిన్ తిని డబ్బు చెల్లించకుండా పారిపోబోతే హోటలు వాళ్ళకి పట్టుబడతాడు. తీరా ఆ హోటలు నడుపుతున్నది తన భార్య, కూతురూ, అల్లుడే అని శేషయ్య తెలుసుకుంటాడు. చివర ముగింపులో నాటకీయత ఉన్నా కథని నడిపిన విధానం, శేషయ్యలోని మగతనపు అహంకారాన్ని ఎత్తి చూపటం, ఆడవారి సంపాదన పట్ల ఆ పాత్ర వ్యక్తపరచిన చులకనభావం ఆనాటి సమాజంలో స్త్రీల పట్ల గల చిన్నచూపుని తెలియజేస్తుంది.
‘ఆమె లోకం’ అనే కథలో కూడా బీదరికం వల్ల ఆడవారికి కలిగే అనర్థాలని అక్షరీకరించింది రచయిత్రి.
సీతాదేవి కథలలో కొన్ని ఒకే దృశ్యంలో ఒక పాత్ర యొక్క ఆత్మగత స్వగతంగా కథనంతా చెప్పటం ఉంటుంది. అందులో ఒకటి ‘ఎత్తుకు పైఎత్తు’ గోల్కొండ ఎక్స్ ప్రెస్ లోని బోగీలో ఎక్కిన విశ్వనాథం స్వగతంగా ఒక క్రైం థ్రిల్లర్ కథగా నడుస్తుంది. అదేవిధంగా విజయవాడ వెళ్ళే బస్సులోనే బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యం మిన్న అని తెలిపే కథ ఏది సౌందర్యం కథ. ఇది ‘రేఖ’ పాత్ర స్వగతంగా సాగింది. ఇవి రెండూ 1978-79లో రాసినవే.
‘ఆమె’ కథ, ‘మిసెస్ కైలాసం’ కథలు ఒకటి, బస్సులోనూ, రెండవది ట్రైనులోనూ జరుగుతాయి. కానీ రెండూ ఒకే అంశంతో ఒకటే సంభాషణలతో ఉన్న రెండు కథలు కానీ రెండూ విభిన్న కథలుగా రాసి మెప్పించింది రచయిత్రి. అందులో ఒక పాత్ర తాను చాలా గొప్పదాన్ని అనే అహంభావం ప్రదర్శించటం, చివరిలో అదంతా డొల్లతనంగా రూపొందేలా చక్కని చమత్కారాలతో రచయిత్రి రాసింది.
సీతాదేవి కథలు రాసే సమయంలోగానీ, అంతకుముందుగానీ రచయిత్రులు బీద బడుగు శ్రామిక జనుల కథలు ఒకరిద్దరు రచయిత్రులు రాసినా, పాత్రోచితంగా గ్రామ్యభాషలోనే సంభాషణ నెరపినా సంస్కారబద్ధంగానే రాయటం జరిగింది. సీతాదేవి తన కథలో శ్రామిక జన కష్టాలూ, సంఘర్షణలూ, బాధలు, ఆక్రోశాలూ రాసినప్పుడు సహజసిద్ధంగా ఉండేలా సందర్భానికి తగు విధంగా ‘కడుపాత్రపు వెధవ’, ‘దొంగముండా’ వంటి తిట్లు సైతం అలవోకగా ప్రయోగించారు. అందుచేత ఆ పాత్రకు గల కోపాన్నీ, ఆవేశాన్నీ ప్రకటించటంలో సహజత్వం ఉట్టిపడింది. బహుశా అందువలనే కావచ్చు వాసిరెడ్డి సీతాదేవికి అప్పటి రచయిత్రులలో ఫైర్ బ్రాండుగా పేరు రాతలలోనేకాక వ్యక్తిత్వంలో కూడా నిర్భయంగా, నిక్కచ్చిగా ఉన్నదున్నట్లుగా మాట్లాడే స్వభావం ఆమె రచనలలో కూడా వ్యక్తమౌతుంది.
‘అభినవ దుష్యంతుడు (72)’ కథలో శంకరం తన భార్యకు పెళ్ళైన తర్వాత ఎనిమిదవ నెలలోనే కొడుకు పుట్టాడని తెలిసి అనుమానించి భార్య బట్టల అల్మారా వెతుకుతాడు. అది చూసిన భార్య తనని అవమానించడంగా భావించి బిడ్డని అతనికే అప్పగించి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది.
అరవయ్యో దశకంలో కుటుంబ నియంత్రణ ప్రచార సందర్భంలో రాసినది కావచ్చు. ‘ఇంక ఏం చెప్పాలి?’ కథ. కానీ ప్రచార కథలా నినాద ప్రాయంగా మాత్రం లేనిది. ఒక అతి సంతాన కుటుంబీకుడి జీవనదృశ్యానికి సజీవరూప కల్పనగా ఉంటుంది. దైవభక్తుడైన సంతానరావు దేవుడిచ్చిన దాన్ని ఇచ్చినట్లుగా స్వీకరించాలనే మనస్తత్వం కలవాడు కావటాన పునరుత్పత్తిని ఆపే ప్రయత్నం చేయలేదనే విషయాన్ని పాత్ర పరిచయంగా మొదట్లోనే చెప్పటం విశేషం. కుటుంబంలోకి అతిథిగా వచ్చిన అరుణ అనుభవంగా కథంతా నడుస్తుంది. ఎక్కడా ‘చిన్న కుటుంబం చింతల్లేని కుటుంబం’ అని చెప్పదు. అతి సంతానంతో ఆర్థికపరమైన ఈతిబాధలు, దాని కోసం పరువు కోసం, అతిథి మర్యాదల కోసం ఆఫీసు డబ్బు వాడుకుని జైలుపాలవ్వటం, మొదట్లో ఒకింత హాస్యస్ఫోరకంగా మొదలై చివరలో ఆర్ద్రంగా ముగుస్తుంది.
1970లో గండిపేట తెగిందన్న పుకారు హైదరాబాదు ప్రజల్ని అతలాకుతలం చేసిన సంఘటన నేపథ్యంలో రాసిన ‘పానీ ఆ రహా హై’ కథ సీతాదేవి కథల్లో చెప్పుకోదగినది. శంకరమఠంలో గంగావతరణం కథని పురాణ శ్రవణంగా చెప్తోన్న శంకరశాస్త్రి, ‘పానీ ఆ రహా హై’ అనే అరుపులతో మనవడిని కూడా మర్చిపోయి జనంతో పాటూ పరుగులు తీస్తూ అతని అంతర్గత ఆలాపనగానే కథ సాగుతుంది. పరుగులు తీస్తూ అనేక సందర్భాల్ని మననం చేసుకుంటూ చివరికి శంకరశాస్త్రి కుప్పకూలిపోతాడు. అతనితో పాటూ చివరికి ఏమౌతుందో అని పాఠకుల్ని కూడా పరుగులు తీయించే పఠనీయత గల కథ ఇది.
1969లో రాసిన ‘తరాలూ-అంతరాలూ’ కథలో నాయనమ్మా మనవరాలు మధ్య నాల్గు తరాల స్త్రీల మారుతున్న జీవన విధానం గురించిన చర్చగా కథనం సాగుతుంది. కథ ఆసాంతం తరాల జీవన సరళిని గురించి చక్కని వివరణాత్మక విశ్లేషణలతో పాఠకులకు చాలా అంశాల్ని విశదపరుస్తుంది.
నవలల్లోనే కాక కథల్లో కూడా అనేకానేక వైవిధ్యభరితమైన కథాంశాల్ని తీసుకొని సీతాదేవి రాసింది. కొన్ని కథలు మానవ స్వభావంలోని మంచి చెడులను చెప్పితే, మరికొన్ని సమాజంలోనూ, కుటుంబ వ్యవస్థలోనూ స్త్రీలను కించపరిచే, అణచివేసే మూఢాచారాల్నీ సంప్రదాయాల్నీ బట్టబయలు చేసింది. రాజకీయాలలోని లొసుగుల్నీ చూపించింది. మానవ మనస్తత్వాన్ని ఛిద్రంచేసే ఆర్థికాంశాలను అక్షరీకరించింది. ఒంటరి స్త్రీలను కూడా ధైర్యంగా జీవితంలో నిలదొక్కుకొని బతికేలా, గౌరవప్రదంగా ఒకరిపై ఆధారపడకుండా నిలిచే పాత్రల్ని సృష్టించింది.
మనస్తత్వ శాస్త్ర నేపథ్యంలో 84లో రాసిన ‘విభ్రమ’ ఎప్పుడో జరిగిన విషయాలను తన కుటుంబ సభ్యులకు అన్వయించుకుంటూ తన నీడకి తానే భయపడుతూ అనేక భ్రమలతో సతమతమై పిచ్చెక్కబోతుందనుకున్న అనూరాధను సరియైన సమయంలో సైకాలజీ చదువుకున్న భర్త అర్థం చేసుకొని సమస్యని చేధించి ఆమెకు సాంత్వన కలిగించిన కథ.
‘సీసా పాతదే’ మధ్య తరగతి మందహాసం అయితే, ‘హసీనా’ కథ భాగ్యనగరంలోని చీకటి కోణాల కథ. చాలా కథల్లో కథానేపథ్యం హైదరాబాదే.
81లో రాసిన ‘గాలికథ’ ఒక దశాబ్దంలో వారపత్రికల్ని ఒక ఊపు ఊపిన ‘బ్లాక్ మేజిక్’ నేపథ్యంలో కాష్మోరాలూ, తాంత్రిక సిద్ధులూ ఆధారంగా నవలల్ని రాసి పాఠకుల్ని మూర్ఖుల్ని చేసిన రచయితల్ని తూర్పారపడుతూ రాసిన కథ. నేరాలు చేసిన వారికన్నా, కల్తీమద్యం వ్యాపారస్తుల కన్నా లేతమనసుల్ని కల్తీ చేసే స్లో పాయిజన్ లాంటి రచనలు మరింత ప్రమాదకరం అని ఈ కథలో ఘంటాపథంగా చాటిచెప్పింది రచయిత్రి.
68లో జయశ్రీలో ప్రచురితమైన ‘తమసోమా జ్యోతిర్గమయా’ కథని సీతాదేవి తనకు నచ్చిన కథగా చెప్పుకుంటారు. ఈ కథ యువ దీపావళి సంచికలో పునఃప్రచురణ అయ్యింది. ఇది చాలా మంచి కథ. ఇందులో గోపాలం, సిద్ధాంతి మధ్య అస్తిత్వం, నాస్తికత్వం మీద, మూఢనమ్మకా లమీద చర్చతోనే మూడొంతులు కథ నడుస్తుంది. గోపాలాన్ని నాస్తికుడుగా మార్చాలని సిద్ధాంతి అనేక శ్లోకాలతో అనేక విషయాలను విశ్లేషిస్తుంటాడు. అతని విశ్లేషణల్ని హేతువాద దృక్పథంతో గోపాలం ఖండిస్తుంటాడు. హైదరాబాదు ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో ఒంటిమీద పెట్రోలు జల్లుకుని మంటలతో పై నుండి క్రింద నీళ్ళలోకి దూకే ప్రదర్శనని చూడడానికి వెళ్తున్నానని సిద్ధాంతి అంటే కొంత కుతూహలంతోనూ, మరికొంత అంతటి హేయమైన ప్రదర్శనని చూడాలనే సిద్ధాంతి కుతూహలాన్ని చూసి తాను కూడా విమర్శిస్తూనే వెళ్తాడు గోపాలం. అక్కడ ముక్కుపచ్చలారని పదహారేళ్ళ నాగేష్ ఆ ఫీటు చేయబోతున్నాడని తెలిసి గోపాలం ఆ పిల్లాడిని మాటల్లో పెడతాడు. డబ్బు సంపాదించి చదువుకోవాలనుకుంటున్న నాగేష్ కలలు సాకారమవుతాయా అని సిద్ధాంతిని ప్రశ్నిస్తాడు. కలెక్టరు అవుతాడని చాలా ఆయుష్షు ఉందన్న సిద్ధాంతి మాటలు గోపాలానికి నమ్మశక్యం కాదు. గోపాలం భయపడుతున్నట్లుగానే ఆ పిల్లాడు మంటలతో నీళ్ళల్లోకాక జనం మీద పడటం జనం కకావికలవ్వటం గోపాలాన్ని కలచి వేస్తుంది. భారమైన గుండెలతో తిరుగు ముఖం పట్టిన గోపాలం గుడిలోకి అడుగుపెడితే, సిద్ధాంతి తన జ్యోతిష గ్రంథాన్ని మురుగుకాలవలోకి విసిరేయటంతో కథ ముగుస్తుంది. కథ అంతా ఒక ఉద్వేగం, ఒక మీమాంసలతో నిండి ఉంటుంది. ఈ కథ ప్రచురితమైన మరుచటి ఏడాదే నిజంగా ఆ ప్రదర్శన చేసిన మనిషి అదే విధంగా మరణించటం కాకతాళీయమే.
సీతాదేవి మూఢనమ్మకాల మీదా, గ్రహబలాన్ని విశ్వసించటం మీదా, దెయ్యాలూ, భూతాలూ, తాంత్రిక శక్తుల మీదా, అస్తిత్వం మీదా అనేక విధాలుగా తన నిరసనను తెలియజేస్తూ హేతువాద దృక్పథంతో వామపక్ష భావాలతో రాసిన కథలు అనేకం ఉన్నాయి.
అదేవిధంగా ‘నీతోనే ఉంటా’ కథని ప్రేమించిన యువకుడు ఆత్మహత్య చేసుకొని దయ్యమై తనపై ఉన్నాడని నమ్మి భ్రమలో ఉన్న కల్పనను సైకియాట్రిస్టు మంత్రగాడిలా వచ్చి ట్రీట్ మెంట్ చేయటం మూఢనమ్మకాల్ని వ్యతిరేకిస్తూ రాసిన కథే. తనని కాపరానికి రానివ్వని గయ్యాళి అత్తని దారిలో పెట్టేందుకు పోలేరమ్మ పూనినట్లుగా నాటకం వేసి తన కాపరాన్ని చక్కదిద్దుకున్న గంగాభవాని తనకు ఆ యుక్తి వచ్చేలా చేసిన ఆ వూరి గణాచారికి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. తనకి దేవత పూనటం నాటకమేనన్న విషయం బైటపడినందుకు గణాచారి కూడా తేలు కుట్టిన దొంగలా గమ్మున ఉండడం కొసమెరుపు. సీతాదేవి మొదటిరోజుల్లో రాసిన కథలోనే భర్త మరణించిన స్త్రీని చీకటి ఉదయాన చెరువుకు తీసుకువెళ్ళి సుమంగళి చిహ్నాలుగా చెప్పబడే బొట్టు, గాజులు, పూలు తీసివేసి వితంతువుగా చేయడాన్ని ఖండిస్తూ రాసారు. ఇది హేయమైన చర్యగా ఒక పాత్ర ద్వారా చెప్పించటం రచయిత్రి దృక్పథాన్ని వెల్లడిస్తుంది.
మధ్య తరగతి మందభాగ్యుల దినచర్య ‘నేలవిడిచిన పాము’. ఇందులో కొన్ని వర్ణనలు అరవైల నాటి సగటు జీవుల బతుకు చిత్రాలు కళ్ళముందు కదుల్తాయి.
‘‘కుళాయి చుట్టూ పాతిక ముప్ఫై ఖాళీ బిందెలు అడ్డదిడ్డంగా ఉన్నాయి. మానవ విలువల్ని వెక్కిరిస్తున్నట్లు నీళ్ళ ధార నల్లగా బీదవాని శరీరం మీద గుడ్డపీలికలా కారుతుంది. చుట్టూ ఖాళీ బిందెలు ఆకాశం కేసి నోళ్ళు తెరుచుకొని చూస్తున్నాయి’’ వంటి వాక్యాలు స్వల్పమైన మానవ జీవితావసరాలు కూడా మానవుల్ని మానవత్వం నుండి తోసేస్తాయేమో అనిపించే కథలు.
‘‘రేషను షాపు దగ్గర క్యూ లో నుంచున్న వ్యక్తికి తన వెనక పెరుగుతోన్న క్యూ ధనవంతుడి బొజ్జలా ఉందనుకుంటాడు. ఇటువంటి ప్రాసంగికత గల వాక్యాల్తో ఆనాటి బడుగు చిరుద్యోగుల జీవితాలని మనముందుపరుస్తుంది రచయిత్రి.
‘కొండవెనుక కనిపిస్తున్న తూర్పు ఆకాశం అరుణరేఖలు పులుముకొని పులి చంపిన లేడి నెత్తుర్ని ఆత్రంగా తాగిన తోడేలు మూతిలా ఉంది’తో మొదలైన కథాంశాన్ని మనం ఊహించుకోవచ్చు.
వనిత మాసపత్రికలో ‘వాస్తవగాథలు’ శీర్షికన ఆనాటి సమాజంలో జరిగిన సంఘటనల ఆధారంగా కొన్నాళ్ళు కథలు రాసింది సీతాదేవి.
సాహిత్యంలో ప్రధానంగా సృజనాత్మక రచనలు చేసే క్రమంలో రచయితలతో రచయిత్రులు పోటీపడడమే కాకుండా రచనాపరంగా వివక్షకి గురికాకూడదనే దృష్టితో చారిత్రక, సామాజిక, రాజకీయ సమస్యల్ని కథాంశాలుగా స్వీకరిస్తూ సాటిలేని వారిగా తమని తాము నిలబెట్టుకుంటూ సాహితీప్రపంచంలో తనకంటూ ఒక ముద్రని సాధించిన రచయిత్రులలో మొట్టమొదట చెప్పదగినవారు వాసిరెడ్డి సీతాదేవి. 1952లో ‘సాంబయ్య పెళ్ళి’తో కథాప్రపంచంలోకి అడుగుపెట్టి, విభిన్న కథాంశాల్ని స్వీకరించటమేకాక తనదైన శైలిలో కొత్త పుంతలు తొక్కే విధంగా వందకి పైగా కథల్ని సీతాదేవి రాసింది. ఈమెను సాహితీవిమర్శకులు నవలా రచయిత్రిగానే గుర్తించటం ఆశ్చర్యకరమే. ఇన్ని కథల్లో ఏ ఒక్కటి విమర్శకుల దృష్టికి రాకపోవటం మరింత ఆశ్చర్యం.