6, నవంబర్ 2021, శనివారం

నడక దారిలో--1

నడక దారిలో-1 -శీలా సుభద్రా దేవి -నా నుండి బాల్యం ఎప్పుడు జారిపోయిందో తెలియదు.అందరూ బాల్యం జ్ణాపకాలు అపురూపంగా చెప్పుకుంటుంటే నేను గుర్తు తెచ్చుకోటానికి మెదడు పొరల్ని తిరగేస్తూ వెతుక్కుంటాను. -నేను ప్రాధమిక పాఠశాలకి వెళ్ళానో లేదో తెలియదు.నాకన్నా పెద్దవాళ్ళైన తోబుట్టువులను అడగాలన్న ఆలోచన వాళ్ళున్నపుడు గుర్తు రాలేదు .అయిదో క్లాసు మాత్రం విజయనగరంలోని పాతబస్టేండుకు దగ్గర ఉన్న ఆశపువీథి లోని పాఠశాలకు వెళ్ళిన గుర్తు.. - వినాయక చవితి కి స్కూల్లో పిల్లలచేత పూజ చేయించిన జ్ణాపకం.అలాగే దసరాకి బడిపిల్లలు అందరికీ విల్లూ, బాణాలు,ధరింప జేసి - ” సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు - సిరిమల్లె చెట్టేమో విరగ బూసింది - కొమ్మ విరగా కుండా పూలు కోయండి.” - ” పావలా ఇస్తే ను పట్టేది లేదు - అర్థ రూపాయిస్తే అంటేది లేదు - ఇచ్చురూపాయిస్తే పుచ్చుకుంటాము” - అని పాడుతూ విద్యార్థుల ఇళ్ళకు వెళ్తే వారివారి స్థోమత ను బట్టి పిల్లలకు పప్పు బెల్లాలు,గురువులకు తాంబూలాలు దక్షిణ ఇచ్చేవారు. ఆవిధంగా కొత్తపేట లోని మా ఇంటికి కూడా తీసుకువెళ్ళి పిల్లలకు పప్పు బెల్లాలు, మాష్టారు కి దక్షిణ ఇచ్చిిన గుర్తు మసకగా మనసులో మెదిలింది.ఇంతకన్నా  బడి ముచ్చట్లు గుర్తు లేదు. 
            నేను అమ్మ పొట్టలో ఉన్నప్పుడు మా ఇంట్లో మా చిన్నాన్న టీబీ జబ్బుతో బాధపడి చనిపోయాడట.మరణించిన సమయం మంచిది కాదని ఇల్లు విడిచి  సూర్యారావు మామయ్యా ఇంట్లో ఆరునెలలు ఉన్నారట.అక్కడే నేను పుట్టానని అమ్మ చెప్పేది.తర్వాత మళ్ళీ ఆశపువీథి ఇంటికి వచ్చేసాము. ఆవిధంగానేను మరీ చిన్నగా ఉన్నప్పుడు విజయనగరం లోని ఆశపువీథిలోనే రోణంకి అప్పలస్వామి గారి పొరుగింటి లో ఉండే వాళ్ళము.
     నేను  రోణంకి గారి గురించి నేను పెద్దగా అయిన తర్వాతే చాలా తెలుసు కున్నాను.    ఆయన బహుభాషా వేత్త.ఆరు విదేశీ భాషల్లో సైతం అనువాదాలు చేయడమే కాకుండా కవిత్వం రాసేటంతటి గొప్ప పండితులు.కేంద్ర సాహిత్య అకాడమీ తరుపున మాకియవల్లీ ప్రిన్స్ రాజనీతి గ్రంధాన్ని ఇటాలియన్ భాష నుండి ఆంధ్రీకరించారు.మన ప్రాచీన ప్రబంధాలలో సొంపయిన పద్యాలు ఎన్నిటినో బహురమ్యంగా రోణంకి వారు ఆంగ్లీకరించారు. వీరి ఆంగ్ల రచనలు “SONGS AND LYRICS, INDIAN LOVE POEMS” అనే రెండు సంపుటాలుగా వెలువడ్డాయి. స్థానిక మహారాజా కళాశాలలో ఆంగ్ల ఆచార్యులు గా పని చేసారు. ఆరుద్ర, శ్రీశ్రీ, నారాయణబాబులకు స్పూర్తి ఇచ్చినవారు. - మానేపల్లి, చిత్రభాను, మోహనప్రసాద్‌, చాగంటి తులసి – మొ||వారి పుస్తకాలకు ముందుమాటలు రాశారు. ఆరుద్ర తన తొలి కావ్యం -‘త్వమేవాహం’నూ, మానేపల్లి తన తొలి కవితా సంపుటినీ రోణంకి వారికి అంకితం చేసారు. - రోణంకి వారింటికి ఆనాటి ప్రముఖ కవులూ,రచయితలు అందరి రాకపోకలు ఉండేవట.వారందరూ సాహిత్య చర్చలూ, సాహిత్య గోష్టులూ జరిపేవారని విన్నాను.అల్లసాని పెద్దన, భట్టుమూర్తి,క్షేత్రయ్య మొదలూ శ్రీశ్రీ, నారాయణబాబు కవితల్నే కాక చావలి బంగారమ్మ , చాసో రచనల్ని సైతం ఆంగ్లం లోకి అనువాదం చేసినవి కూడా దేశవిదేశీి పత్రికల్లో ప్రచురితమయ్యాయి.ఇలా ఎన్నో ఆసక్తి కరమైన విషయాలు కర్ణాకర్ణిగా విన్నాను.  వారి గురించి చెబుతుంటే అదో పెద్ద వ్యాసం ఔతుంది.
          ఆరోజుల్లో పోలియో ప్రభావం ఎంత ఎక్కువ గా ఉండేదో అనేది రోణంకి వారి కుటుంబం చూస్తే తెలుస్తుంది.అప్పలస్వామి గారి చెల్లెలు బాలవితంతువు వీరింట్లోనే ఉండేది ఆమె,అప్పల స్వామి గారి పిల్లలు ముగ్గురు పోలియో బాధితులు. - నా తోబుట్టువులు అందరకూ కూడా రోణంకి వారింటిలోని సమ వయస్కులైన పిల్లలతో మంచి స్నేహం ఉండేది.వారి ఆఖరు అబ్బాయి నా క్లాసుమేట్ అయిన రోణంకి నారాయణరావు నాకన్న కాస్త చిన్నవాడు కావటం మొగపిల్లాడు కావటం వలన వారి నాలుగో అమ్మాయి, అతని కన్నా పెద్దదైన లలిత తో నాకు స్నేహం . - లలిత అప్పట్లో డాన్స్ నేర్చుకునేదనుకుంటాను. సాయంత్రం నేను వాళ్ళింటికి లలితతో ఆడుకోవటానికి వెళ్ళినప్పుడు డాబా మీద లలిత డేన్స్ ముద్రలు నేర్పించేది. ఒక్కొక్కరోజు లలితా వాళ్ళ అమ్మా,మేనత్తా నన్ను పాటలు పాడమనేవారు.పెద్దక్కయ్య దగ్గర నేర్చుకున్న పాటలు,ఆ రోజులనాటి సినీమా పాటలూ పాడేదాన్ని.ఒకరోజు అలా పాటలు పాడుతుంటే అప్పుడే వచ్చిన రోణంకి వారు ” ఏం పిల్లా నీకు పుత్తడి బొమ్మా పూర్ణమ్మ పాట వచ్చా?” అన్నారు. నేర్చుకుని ఈ సారి వచ్చినప్పుడు పాడతానన్నాను.ఆ తర్వాత పంతంగా నేర్చుకుని మరీ పాడితే ఆయన మెచ్చుకుంటూ తలపంకించటం మరువలేని జ్ణాపకం.తర్వాత మాత్రం మళ్ళీ ఏం పాడమంటారో అని ఆయనకు కనపడకుండా దాక్కుంటూ డాబా పైకి పరిగెత్తే దాన్ని. -
        రోణంకి అప్పలస్వామి గారు అంత విద్యావంతులు.మేథావి అయినా ఇతరభాష పండితులతో అనర్గళంగా మాట్లాడినా తెలుగు లో మాట్లాడినప్పుడు అచ్చమైన శ్రీకాకుళం పల్లె మాండలికం లోనే మాట్లాడేవారు.అదీ మర్చిపోలేను.వారికి వారి ప్రాంత మాండలికం పైన ఎంత మమకారం ఉందో తలచుకున్నప్పుడల్లా గుర్తు వస్తూనే ఉంటుంది.అందుకే పదవీ విరమణ అనంతరం వారి స్వగ్రామం టెక్కలి వెళ్ళి స్థిరపడ్డారు. 
      నేటి తరానికి ఆయనెవరో తెలియక పోయినా, ముంజేతిలో చేతికర్ర వేలాడ దీసి, దొర టోపీ పెట్టుకొని తిరిగే రోణంకి అప్పలస్వామి గారు టెక్కలిని అంతర్జాతీయ సాహితీ ప్రపంచానికి పరిచయం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. అందుకే వారి మరణానంతరం టెక్కలిలో వారి విగ్రహాన్ని కూడా స్థాపించి వారిని గౌరవించుకున్నారు అక్కడి ప్రజలు. 
        నేను హైస్కూల్లో చదువుతున్న రోజుల్లో ఒక సారి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు.అప్పలస్వామి గారి చిన్న తమ్ముడు లక్ష్మణ రావు అనే ఆయన జర్మనీ నుంచి వచ్చాడని లలిత చెప్పింది.లోపలి గదిలోకి వెళ్ళి ఒక షర్ట్ తీసుకొచ్చి ” చిన్నా ( నన్ను చిన్న అని పిలిచేవారు)ఇది చూడు.ఎంత బాగుందో.చిన్నాయన జర్మనీ నుండి తెచ్చాడు .ఈ చొక్కాని ఉతికి ఆరేసేయటమే.నిముషంలో ఆరిపోతుంది.ఇస్త్రీ కూడా అక్కర్లేదు తెలుసా.దీనిని వాష్ ఎండ్ వేర్ అంటారట.”అబ్బురంగా చూపించింది.నేను కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంగా చూసాను.ఆ రోజుల్లో చేనేత తప్ప మరొకటి ఎరుగని రోజులు.పేదవారు, మధ్యతరగత వారు చీటీ గుడ్డలు అని ముతకబట్ట తానులుగా వచ్చేది దానినే కొని పిల్లలకు లంగాలు కుట్టించేవారు.నైలాన్ మధ్యతరగతి వారికి తెలియని రోజులవి. 
       రోణంకివారి భార్య మహాలక్ష్మీ గారూ మా అమ్మ స్నేహితులు.సినీమాలకు కూడా కలిసి వెళ్ళేవారు.వారివెంట నేనూ,లలితబయలు దేరేవారం. మేము వారి పొరుగిల్లు ఖాళీ చేసినా నేను పెద్దయ్యేవరకూ ఆ కుటుంబంతో స్నేహాలు కొనసాగాయి..  వీర్రాజు గారి తో నా వివాహం రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యం లోనే చప్పట్ల తాళాలతో సభావివాహం గా జరిగింది. - నేను వివాహానంతరం హైదరాబాద్ వచ్చేక ఆ కుటుంబం తో కాంటాక్ట్ ఆగిపోయింది. .రోణంకి నారాయణరావు ఆంధ్రా యూనివర్సిటీ మెడికల్ కాలేజీ లో ప్రొఫెసర్ గా చేసారని విన్నాను.అతని దగ్గరకే డాక్టర్ సలహాకి వెళ్ళే మా పెదనాన్న కొడుకుని మా గురించి క్షేమసమాచారం కనుక్కునే వాడని చెప్పేవారు.నారాయణరావు పెళ్ళి చేసుకోలేదనీ ఇటీవలే చనిపోయాడని తెలిసి చాలా బాధపడ్డాను.
       పదేళ్ళ తర్వాత నేను ఎమ్మే తెలుగు చేసినప్పుడు ఫైనల్ పరీక్ష కోసం వెళ్ళినప్పుడు లలిత కూడా పరీక్ష రాయటానికి వచ్చింది.కొత్తగూడెంలో స్కూలు లో టీచర్ గా పని చేస్తున్నట్లు చెప్పింది.అడ్రస్ ఇస్తే ఒకటి రెండు ఉత్తరాలు మా మధ్య నడిచాయి.తర్వాత మెంటల్లీ డిజేబుల్ అయిన మా అబ్బాయి చనిపోవటం .నేను కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళి నన్ను నేను సముదాయించుకునే దిశలో బియ్యీడీ ఎంట్రెన్స్ రాసి మళ్ళా చదువులోపడటం,ఉద్యోగం, సాహిత్యం వీటితో లలితకు దూరమయ్యాను.అంతే మళ్ళీ కలవలేదు. - విజయనగరం వెళ్ళినప్పుడో, శ్రీకాకుళం జిల్లా కు చెందినవారు కలిసినప్పుడో రోణంకి కుటుంబం వారెవరైనా తెలుసేమోనని అడుగుతుంటాను. - అంతటి నిరాడంబర మేథావి కుటుంబంతో మాకున్న ఆత్మీయబంధం మరువరానిది.
       కానీ ఇది రాసిన అనంతరం అనుకోకుండా అప్పలస్వామి గారి మనవరాలు అంతర్జాలంలో నేను రాసినది చదివి తన గురించి తెలిపింది.వెంటనే ఆమెను సంప్రదించి లలిత చిరునామా తెలుసుకొని ఫోన్ ద్వారా కలిసాను.ఇప్పుడు లలిత,ఆమెకన్నా పెద్దవాళ్ళైన శారదా, కళావతి ని కూడా ముఖాముఖి కలుసుకో లేక పోయినా ఫోను ద్వారా స్నేహం కొనసాగటం సంతోషం కలిగించింది. నన్ను 

3, నవంబర్ 2021, బుధవారం

శ్రీదేవి మోనోగ్రాఫ్ పై తెలుగు తూలిక లో ని.మాలతి సమీక్ష

డా. పి. శ్రీదేవి. రచన శీలా సుభద్రాదేవి సాహిత్య ఎకాడమీ ఆధ్వర్యంలో డా. పి. శ్రీదేవిగారి సాహిత్యవ్యాసంగం క్షుణ్ణంగా పరిశీలించి ప్రముఖ కవయిత్రీ రచయిత్రీ శీలా సుభద్రాదేవి రచించిన పుస్తకం ఇది. పి. శ్రీదేవి అంటే కాలాతీతవ్యక్తులు, కాలాతీతవ్యక్తులు అంటే పి. శ్రీదేవి అని తెలుగులోకంలో సుప్రసిద్ధం. కొంతమందికి ఆమె తెలుగు స్వతంత్రలో ఉపసంపాదకులుగా పని చేసేరని తెలిసిఉండొచ్చు. కానీ శ్రీదేవి చిన్నకథలు, కవితలు కూడా రాసేరనీ, విమర్శలు, సమీక్షలు కూడా ప్రచురించేరనీ, ఆమెకి చిత్రలేఖనంలో పరిచయం ఉందనీ తెలిసినవారు లేరేమో. ఉంటే చాలా తక్కువ అనుకోవాలి. ఈ మోనోగ్రాఫ్‌లో లభ్యమైనంతవరకూ శ్రీదేవి జీవితచరిత్ర, తెలుగు సాహిత్యంలో వివిధశాఖలలో ఆమె చేసిన కృషిని సూక్ష్మదృష్టితో పరిశీలించి, విశ్లేషణాత్మకంగా వివరించేరు సుభద్రాదేవి. సుమారు పది సంవత్సరాలలో వృత్తిరీత్యా వైద్యరంగంలో పని చేస్తూనే సాహిత్యంలో ఇంత కృషి చేసేరా అని ఆశ్చర్యం కలుగుతుంది సుభద్రాదేవి సమకూర్చిన సమాచారం చూస్తే. ఒక్క కాలాతీతవ్యక్తులు నవల 38 పేజీలలో విశ్లేషించేరు రచయిత్రి. ఇతివృత్తం, పాత్రచిత్రణ, ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులనేపథ్యంలో శ్రీదేవి ఈనవలను ఎంత సమర్థవంతంగా నిర్వహించేరో గ్రంథస్థం చేయడం ఎంతైనా మెచ్చుకోదగ్గ విషయం. శ్రీదేవిగారి తాత్వికచింతనగురించిన విశ్లేషణ ప్రత్యేకంగా బాగుంది. కవయిత్రి సుభద్రాదేవి శ్రీదేవి కవితలను సాటికవయిత్రిగా విశ్లేషించినతీరు మనసుకి హత్తుకునేలా ఉంది. అలాగే శ్రీదేవి ఉపసంపాదకురాలిగా పని చేస్తున్న రోజులలో చేసిన విమర్శలూ, సమీక్షలూ కూడా ప్రతిభావంతంగా చేసేరంటారు సుభద్రాదేవి. తెలుగు సాహిత్యచరిత్రలో చెప్పుకోదగ్గ రచయిత్రి డా. పి. శ్రీదేవి. స్త్రీల సాహిత్యచరిత్ర, కాల్పనికసాహిత్యచరిత్రలలో ఆసక్తి గలవారు తప్పక చదవవలసిన పుస్తకం.

1, నవంబర్ 2021, సోమవారం

నడక దారిలో-- 10

నడక దారిలో--10 మహారాజా మహిళా కళాశాల మెట్లు ఎక్కిన రోజు ఎవరెస్ట్ ఎక్కినంత ఉద్వేగం పొందాను.అందులో ఒక్కదాన్నే కాలేజీ కి వెళ్ళటం.పెద్దగా వెడల్పాటి కారిడార్.సింహాచలం లోని కప్పస్తంభాల్లాంటి స్తంభాలు.పూసపాటి రాజుల రాజభవనం కావటాన ఎత్తైన సీలింగు.భవనానికి నాలుగు వైపులా మెట్లుఉండేవి.రెండు మూలల్లోని మెట్లు బయటకు పోయేందుకు.రెండు మూలల్లోని మెట్లు బిల్డింగ్ వెనుక ఉన్న హాస్టల్ రూమ్ లకూ,గార్డెన్ లోకీ వెళ్ళేందుకు ఉంటాయి. వెళ్ళగానే ఏ రూం లోకి వెళ్ళాలో తెలియలేదు.దారిలో కనిపించిన అమ్మాయిని పి.యూసి ఎంపీసీ క్లాసులు ఏ రూమ్ లో జరుగుతాయని అడిగాను‌. ఆ అమ్మాయి చెప్పిన వైపు వెళ్తే పెద్ద హాలు ఉంది.గుమ్మందగ్గర నిలబడ్డాను.అదృష్ట వశాత్తూ ఆ క్లాసులో ఉన్న కుమారి లెక్చరర్ నుంచి పర్మిషన్ అడిగి బయట కొచ్చింది.ఆ క్లాస్ లో హిస్టరీ జరుగుతుందిట.ఆ హాలు కి పక్కనే చిన్న పార్టిషన్ గది ఉంది.అక్కడ మేథ్స్ క్లాస్ అని చెప్పింది. ఇక ఆ ప్రక్కనే గది ద్వారం దగ్గర నిలబడితే అప్పటికే పాఠం చెప్తున్న లెక్చరర్ నన్ను చూసి ఇంగ్లీష్ లో ప్రశ్నించారు.అప్పుడు గుర్తు వచ్చింది.ఇప్పటివరకూ తెలుగు మీడియం లో చదివాను.ఇప్పుడు కాలేజీ విద్య తెలుగు మాధ్యమం కాదనీ, ఇంగ్లీష్ లోనే అని.ఒక్కసారి భయం నన్ను అలుముకుంది."న్యూస్టూడెంట్ నండి "అని చెప్తే లోపలికి రమ్మన్నారు.క్లాసులో నాతో కలిపి తొమ్మిది మంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారు సీట్లో కూర్చుంటూ బోర్డు వైపు చూసాను.Radian అని హెడ్డింగ్ రాసి,వృత్తం లో గుర్తించి ఉంది.అంతలోనే బోర్డు చెరిపి రేడియన్ అంటే ఏమిటో వివరించమని పరీక్ష పెట్టారు. పేపరు మీద అంతకుముందు బోర్డు మీద చూసిన పటం వేసి రేడియన్ అని రాసాను.లెక్చరర్ ఉమాకుమారిగారు అందరిదగ్గరా పేపర్లు తీసుకుని దిద్ది ఇచ్చేసారు."క్లాసుకి టైముకి రావాలి.ఇలాచదువుతే లాభం లేదు"అని నావైపు చూసి కోపంగా అన్నారు. మొదటిక్లాసులోనే తిట్లు తిన్నానని దిగులు వేసింది.క్లాసులో అందరూ కొత్త వాళ్ళు నేనేమో తొందరగా స్నేహం చేయలేను.అందులోను ఇంగ్లీష్ లో చదవగలనా అని ఒక భయంవేసింది. పీయూసీ లో గణితం లో కేవలం తొమ్మిది మంది విద్యార్థినులే ఉండేవాళ్ళం కదా .మాకు ఆ చిన్న పార్టిషన్ రూమ్ లోనే క్లాసులు జరిగేవి.ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాసులు ఆయా లేబ్ లను ఆనుకొని ఉన్న రూమ్ లో జరిగేవి. కెమిస్ట్రీ క్లాసులో BZC వాళ్ళుకూడా కలవటం వలన ముప్పై మందివరకూ ఉండేవాళ్ళం.ఇంగ్లీషు, తెలుగు క్లాసులకు అన్ని గ్రూపులు వాళ్ళూ కలుస్తారు కనుక వందకి పైగా ఉండేవాళ్ళం.అదే హాలు లో బియ్యే వాళ్ళకు క్లాసులు జరుగుతాయి.అందువలన మేము ఎంత పరుగున వచ్చినా వెనుక బెంచీలలోనే కూర్చోవలసి వచ్చేది. నా బడి మిత్రులు కుమారీ ,కమలా అదే క్లాసులో ఉన్నా వాళ్ళు ముందు సీట్లో కూర్చోవటం వలన వాళ్ళతో మాట్లాడటానికే కుదిరేది కాదు.అందుచేత సెలవు రోజుల్లోనే ఒకరింటికి ఒకరు వెళ్ళి కబుర్లు చేప్పుకునే వారం. ఒకరోజు NCC లో చేరేవాళ్ళకోసం సర్కులర్ వచ్చింది.చిన్నక్క ఇంటికి కోరుకొండ సైనిక స్కూల్ కి వెళ్ళినప్పుడు అక్కడ విద్యార్థులు మార్చ్ పాష్ట్ ప్రాక్టీస్ చేస్తుంటే చూసి ప్రభావితురాలిని కావటం చేత చేరేందుకు NCC ఇన్చార్జి సంజీవి మేడం కి పేరు ఇచ్చాను.సంజీవిమేడం సన్నగా చిన్నగా ఉన్నా మంచి కమేండింగ్ వాయిస్ కలిగి ఉంటారు. ముఖంలో దృఢమైన ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది.ఒక రెండు రోజులు కాలేజీ ఐన తర్వాత ఫిట్నెస్ టెస్ట్ కోసం నడిపించేసరికి కళ్ళు తిరిగి పడిపోయాను." నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు.NCC కి పనికిరావు" అన్నారు సంజీవి మేడం. తర్వాత కాలేజీలో సంగీతం లో డిగ్రీ చేస్తున్న అమ్మాయి కాలేజీ అయ్యాక మహారాజా సంగీత నృత్య కళాశాల కు వెళ్తుందని తెలిసి ఆ అమ్మాయి తో కలిసి వెళ్ళి కర్నాటక సంగీతం గాత్రం నేర్చుకోడానికి చేరిపోయాను.రోజూ కాలేజీ పూర్తి అయ్యాక అటునుంచి అటే సంగీత కళాశాల కి వెళ్ళి ఇంటికి వచ్చేదాన్ని. అన్నట్లు మా కాలేజీ లో విద్యార్థినులకు యూనిఫాం ఉండేది.తెల్లచీర,తెల్లజాకెట్టు.ఒకరిద్దరు తెల్లవే లంగా వోణి వేసుకునేవారు.ఇక నా సంగతికి వస్తే మా పెద్ద మామయ్య మా నాన్నగారు పోయిన తర్వాత అమ్మకి ఏ రెండేళ్ళకో ఒకసారి అరవై కౌంట్ వో, ఎనభై కౌంట్ వో నేతచీరలు మగ్గం మీద ఒక సరి మీద వచ్చే ఆరు చీరలు నేయించి ఇచ్చేవారు.అందులో రెండు తనకోసం అమ్మ ఉంచుకోగా మిగతా నాలుగు చీరలూ నాకు పెట్టీకోట్లూ, పరికిణీలకూ, గలేబులకూ వాడేవాళ్ళం.కాలేజీకి చీరలు కావాలి కనుక బోర్డర్ లేని ఆ ముతక చీరలకు రకరకాల ఎంబ్రైడరీ బోర్డర్లు కుట్టు కొన్నాను.నాలుగేళ్ళ కాలేజీ చదువూ వాటితోనే గడిచిపోయింది. కాలేజీలో చేరిన తర్వాత పెద్దక్కయ్య ఒకసారి తెల్లని మెత్తని గ్లాస్కో చీర ఇచ్చింది.కానీ ఎంతో ముచ్చటగా కట్టుకున్న రోజునే కెమిస్ట్రీ ప్రాక్టికల్ క్లాసులో ప్రయోగం చేసే సమయంలో నా పక్కనే ప్రయోగం చేస్తున్న అమ్మాయి ఎవరో పిలిచారని గభాలున తిరగటం లో పరీక్షనాళిక లోని సల్ప్యురిక్ ఆమ్లం మొత్తం నాచీర మీద పడింది.వెంటనే నీళ్ళు చల్లుకున్నాను.మా మేడం రిక్షా పిలిపించి ఇంటికి పంపారు.ఇంటికి వెళ్ళగానే చల్లనీళ్ళతో స్నానం చేసి చీర బకెట్టు లో వేసేసరికి అప్పటికే చీర పీలికలు ఐపోయింది.నాకు అక్కడక్కడా చిన్న పొక్కులు వచ్చాయి తప్పా ప్రమాదం జరగలేదు. మొత్తం మీద చిన్న చిన్న అవాంతరాలతో ఏడాది గడచి పోయింది.కాలేజీ వార్షికోత్సవానికి నాకు సాయంగా మామయ్య కూతుర్లను తీసుకొని వెళ్ళాను.మొదట అందరి ఉపన్యాసాలు అనంతరం బహుమతుల ప్రదానం మొదలయ్యింది.ఇంకా సాంస్కృతిక కార్యక్రమాల మొదలు కాకపోవటంతో నా బడి మిత్రులం కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం.అంతలో నాపేరు వినిపించింది.పొరపాటున పిలిచారేమోనని నేను చూస్తుంటే 'సుభద్రా నిన్నే' అని మిత్రులు తోసారు.ఆశ్చర్య పోతూనే వేదిక వైపు వెళ్ళాను. మా మేథ్స్ మేడం ఉమాకుమారి గారు ఆ ఏడాదంతా పెట్టిన మేథ్స్ పరీక్షల్లో అత్యథిక మార్కులు సాధించినందుకు ప్రొఫీషియన్సీ ఇన్ మేథ్స్ అని నాకు ట్రిగొనామెట్రి విదేశీ ఎడిషన్ పుస్తకం ఇచ్చారు.మొదటిక్లాసులో కోప్పడిన లెక్చరర్ చేతిమీదుగా బహుమతి అందుకోవటం నాకు పట్టరాని సంతోషం కలిగించింది.ఇంటికి వెళ్ళాక మా అన్నయ్యలకు చూపిస్తే వాళ్ళ ముఖాల్లో కూడా ఆనందం కనిపించింది. ఉమాకుమారిగారి ప్రభావం వలనే నేను ఉద్యోగం చేసిన పాతికేళ్ళూ ఆరవ తరగతి నుండి పదో తరగతి వరకు మొదటి రేంక్ వచ్చిన పిల్లలకు పుస్తకాలే కాక నగదు బహుమతి కూడా ఇచ్చేదాన్ని. పరీక్షలు పూర్తి చేసాను.రిజల్ట్స్ కూడా వచ్చాయి.పేపర్లో నెంబర్ ఎక్కడా కనబడకపోవడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాను.దుఃఖ సముద్రం నిలువెల్లా ముంచెత్తింది.మధ్యాహ్నం రిజల్ట్ చూసుకుని కుమారి మా ఇంటి కి వచ్చి విషయం తెలిసి "అదేమిటి సుభద్రా నీది పోవటమేంటి ?" అని తెల్లబోయింది.ఏదో పొరపాటై ఉంటుంది.మార్కులు వచ్చాక తెలుస్తాయి అని ఓదార్చింది. మార్కులు కూడా వచ్చాయి.లెక్కలు149/150 వచ్చి మిగతావాటిలో70/ పైనే వచ్చి ఇంగ్లీష్ లో మాత్రం 34/ వచ్చి పరీక్షపోయింది.ఇప్పటిలా ఇన్స్టెంట్ పరీక్షలు లేనందున సెప్టెంబర్ లోనే రాయాలి. ఒక ఏడాది వృథా అయినట్లే. మళ్ళా నేను డిగ్రీ చదవగలనా? మళ్ళీనా చదువు కథ మొదటి కే వచ్చింది .నా చదువుకి ఇన్ని అవాంతరాలు ఏమిటో???