27, మార్చి 2026, శుక్రవారం

జానపదం నుండి ప్రగతి పథంలోకి నాయని కృష్ణకుమారి కవితాప్రస్థానం

~ జానపదం నుండి ప్రగతి పథంలోకి నాయని కృష్ణకుమారి కవితాప్రస్థానం ~ ఒక రచయిత ఎన్ని ప్రక్రియలలో రచనలు చేసినా, పరిశోధనలు చేసినా అతని సాహిత్యంలోని ఒక ప్రక్రియతోనే ఆ రచయిత గుర్తింపు సాధిస్తారు. అదేవిధంగా నాయని కృష్ణకుమారి వ్యాసం, యాత్రాచరిత్ర, కథలు, జానపద గేయ కథలు వంటి అనేక సాహిత్యప్రక్రియలతో అక్షరయాత్ర కొనసాగించినా ఆమెని ప్రధానంగా జానపదసాహిత్య పరిశోధకురాలని విద్యారంగంలోనివారు గుర్తిస్తారు. కానీ సాహిత్యరంగంలోమాత్రం కవయిత్రిగానూ, కాశ్మీరదీపకళిక వంటి యాత్రా చరిత్ర రాసిన తొలి రచయిత్రిగానూ గుర్తిస్తారు. బాల్యంనుండీ తండ్రి నాయని సుబ్బారావుగారి వలన ప్రముఖ సాహితీవేత్తలతో జరిపే చర్చలు వింటూ సాహిత్యాభిలాషే గాక నిర్భయంగా నలుగురిలోనూ మాట్లాడటం నేర్చుకున్నారు నాయని కృష్ణకుమారి. తొలిరోజులనుండీకూడా పరిశోధనాత్మక సాహిత్యరచనపట్ల మక్కువ పెంచుకోవటంవలన 18ఏళ్ళ వయసులోనే ఆంధ్రుల చరిత్రని పరిశీలించి 'ఆంధ్రుల కథ' అనే పుస్తకం వెలువరించారు. తదనంతరం 'తిక్కన కవితావైభవం'పై పరిశోధన మొదలుపెట్టి మధ్యలో ఆపేసి 'జానపద సాహిత్యం'పై పరిశోధించి డాక్టరేటు పట్టా తీసుకున్నారు. అయితే సమాంతరంగా కవిత్వ రచనపట్ల ఆసక్తి ఉన్నా వృత్తిరీత్యా సమయాభావం వల్ల కావచ్చు- అగ్నిపుత్రి (1978), ఏంచెప్పను నేస్తం (1988), సౌభద్ర భద్రరూపం (2006) అనే మూడు కవితాసంపుటాలు మాత్రమే వెలువరించారు. 1960 నుండీ కవిత్వం రాస్తున్న కృష్ణకుమారి ఆనాటి కవయిత్రులకు భిన్నంగా సమాజ పోకడలను గమనిస్తూ, సామాన్య మధ్య తరగతి జీవుల పక్షాన నిలబడుతూ, కవితలు రాయటం గమనించవలసిన విషయం. జానపద పరిశోధన ప్రభావం వలన కావచ్చు అచ్చమైన తెలుగు పారిభాషిక పదాలతోనే వీరి కవితలు సామాజిక స్వభావాన్ని పొదువుకొని వుంటాయి. స్వాతంత్ర్యానంతరం కవిత్వంలో రాజకీయ, సామాజిక పరిస్థితుల ప్రభావం ఎక్కువగా కవులలో ప్రతిబింబించినా, సాహిత్యోద్యమాలలోని భావకవిత్వోద్యమం ఛాయలు ఎక్కువగా కవయిత్రులలో కనిపిస్తున్న సమయంలోనే కృష్ణకుమారి ఆధునిక శైలిలో రాశారు. అంతేకాక అదే సమయంలో సృజనాత్మకత కల మహిళామణులందరూ ధనమూ, కీర్తీ తెచ్చిపెట్టే నవలారచన వైపు మొగ్గుచూపి నవలామణులుగా ప్రఖ్యాతి పొందేరు. అభ్యుదయ రచయితల సంఘం ఆవిర్భావం అనంతరం కవుల కవిత్వ ధోరణిలో మార్పు వచ్చింది. అదేకాలంలో కవిత్వరచన మొదలుపెట్టారు నాయని కృష్ణకుమారి. అంతవరకూ సామాజిక, కౌటుంబిక పరిస్థితులకు కట్టుపడిన కవయిత్రులలో వైవిధ్యమైన, స్పష్టమైన గొంతుకను ప్రదర్శించిన తొలి కవయిత్రిగా కృష్ణకుమారిని పేర్కొనవచ్చు. 1960-78 వరకూ రాసిన కవితలను 'అగ్నిపుత్రి'గా సంపుటీకరించారు. “వర్తమానాన్ని తిట్టుకుంటూ నిస్పృహలో మునిగి తేలే నీరవ మూర్తి కాదు నా కవిత ప్రతి నీటి కణంలో తోచే ప్రభాకర ప్రతిఘటనంలా నా కవిత్వమంతటా నమ్మకం అక్షరమై మెరుస్తుంది" అని ఆత్మ విశ్వాసంతో తన కవిత్వం గురించి చాటిచెపుతారు కవయిత్రి. పాఠకుడి మనసుకి కవితాసౌందర్యం అందాలంటే కవికి సంబంధించిన అనుభూతిపరమైన వివరణను అందుకునేందుకు దోహదపడే ఆర్ద్రతా, మనోభావాలు, కవిత్వంలో ప్రతిఫలించాలి. నాయని కృష్ణకుమారి స్వభావరీత్యా సాధుస్వభావి. అందుకే కాలక్రమేణా వచ్చే సామాజిక మార్పుల్ని ఆహ్వానిస్తారు, దుఃఖిస్తారు. కానీ మార్పుకోసం విప్లవ భావాల్ని కోరుకోరు. చాలా కవితల్లో దేవుడంటూ ఉన్నాడో, లేడో అనే డోలాయమాన స్థితిలో అంతస్చేతనలో రాసిన చాలా కవితలు కనిపిస్తాయి. కానీ మూఢభక్తిని ప్రోత్సహించరు. ఆమె తన ముందుమాటలో కూడా 'దేవుడి విషయంలో ఇదమిద్ధమనే భావన నాకింకా ఏర్పడలేదంటారు. అందుకే ఆమె వెతుకులాట కొన్ని కవితల్లో వ్యక్తమౌతుంది. చాపకింద నీరులా ప్రవహించే కాలప్రవాహంలోని మార్పుల్ని నిబ్బరంగా ఎదుర్కోవాలని అభిలషించే కవిత్వం వీరిది. అందుకే "కాలం చెంగుల్ని పట్టుకొని అతివేగంగా నడుస్తూనే అగమ్యోహాల చిక్కుముళ్ళని అతినేర్పుగా విప్పుకుంటాను”- అంటారు. కవిత్వమంటే జీవితమనీ, అనుభవాల తామరతంపరలనీ కవయిత్రి విశ్వాసం. పాఠకుల మనసులకు అందని సర్కసు ఫీట్ల కవిత్వాన్ని రాసి మెప్పుపొందే కవుల ఆధిపత్యాన్ని నిరసిస్తారు. చెప్పదలచుకున్న విషయాన్ని డొంకతిరుగుడుగా కాక సూటిగా చెప్పటం వీరి కవిత్వ లక్షణం. “నా కవిత్వాన్నిరూపు కట్టించదలచుకున్న భావంగా నేను కూడా రూపాంతరం చెందుతాను. అంతేకానీ భావాలకు ఆశ్రయభూతాలైన శబ్దాల్లోకి పరకాయ ప్రవేశం చేయను. కవిత్వంలో కవి మనస్సే కాక అతని చిత్తవృత్తి, అహంకారమూ, ఆర్ద్రతా, కాఠిన్యమూ వంటి లక్షణాల స్థాయి తెలిసినప్పుడు ఆ కవి కవిత్వము అర్థమయ్యే పద్దతి వేరుగా ఉంటుంది' అంటారు నాయనికృష్ణకుమారి. 'దూరం కొలత' అనే కవితలో కోరికల్ని గుర్రాల్లా పరిగెత్తనీయకు అని పాఠకుడికి బోధించేందుకు అన్నట్లు పలు ఉదాహరణలు ఇచ్చారు. “నీకూ నీ కోరికకూ మధ్య దూరం ఎంత ఎక్కువైతే అంతగా పెరుగుతుంది. అంతరంగంలో రాగం..."అని చెప్తూనే- “కావలసినదానికంటే ఎక్కువగా కామిత ఫలాన్ని ఒడిగట్టచూడకు" అని సలహా యిస్తూ-కొసమెరుపుగా- "ఇది నీకే కాదు నీ పిల్లలకు కూడా పనికొచ్చే నిజం” అని ముక్తాయింపుని ఇస్తూ పిల్లల పట్ల అమితమైన ఆశలు పెట్టుకోవద్దని, అవి నెరవేరకపోతే కుంగిపోవలసి వస్తుందనే అర్థాన్ని ధ్వనింపజేస్తారు. 'రాళ్ళు-పిచ్చివాళ్ళు' అనే కవితలో నేటి సమాజాన్ని వ్యంగ్యంగా చిత్రిస్తూ-- “ఎక్కడ చూసినా ఈ రోజుల్లో పిచ్చివాళ్ళ చేతుల్లో పిడుగుల్లాంటి రాళ్ళు” అంటారు. దైవం గురించి చాలా కవితల్లో ఉన్నాడో లేడో అనే వెతుకులాటతో సంశయాత్మకంగా రాసారు కవయిత్రి. అందులో ఒకటి 'గాలి పిడికిలి'. "గాలి పిడికిళ్ళ వేలంవెర్రికి కొంటె నవ్వులు రువ్వుతూ గుండెగుడిలో దీపంలా నువ్వు" అంటూ ప్రతీ మనిషిలోనూ గుండెల్లోనూ వెలిగే దీపమే దైవమని తీర్మానిస్తారు. కొన్ని కవితల్ని మాత్రాఛందస్సు పద్ధతిలో పంక్తి చివర ప్రాసని పెట్టి ఒక లయతో నడిపారు. అవి ఆనాటి కవులైన శ్రీశ్రీ వంటివాళ్ళు తొలినాళ్ళలో రాసినవిధానాన్ని తలపిస్తాయి. "బ్రతుకు పాట ప్రిదిలి కదులు బాట నొగిలి శృతి చలించి మతి భ్రమించి" అంటూ లయను పొదువుకొని సాగుతాయి. భరతమాతని హిమావృత శైలపంక్తి కిరీటంతో, వింధ్యాచల వడ్డాణంతో, గంగాయమున కంఠహారాలతో అలంకరించి అప్సరసలా ఉన్న దేశం ఈనాడు మామూలు స్త్రీలా పిల్లల చేతికి ఒకముద్ద అందించలేని పేదతల్లిగా మార్చేస్తున్న అదృశ్యహస్తాల్నీ వాటిని పడగొట్టాలని తపన పడ్తూ, మాత ముఖంలో వెలుగు కోసం హారతి కర్పూరమై కరిగిపోవాలనే ఆరాటంతో ఆరు పేజీల సుదీర్ఘ కవిత అర్థవంతంగా మంచి పదచిత్రాలతో అక్షరీకరించారు కవయిత్రి. సముద్రం, అగ్ని, జ్వాలా, శిఖలను కవిత్వ పంక్తులలో పొదుగుకొంటూ కాలాన్ని తన నెచ్చెలిగా భావించి తనలో లయింపచేసుకొంటూ, సర్వ విషయాలూ కాలనెచ్చెలికి అర్థమయ్యేలా ఆమె చేయి పట్టుకుని ముందుకు తన గమనాన్నీ గమ్యాన్నీ నిర్దేశించుకుంటూ పోతుంది అనే విషయాన్ని అనేక కవితల్లో ప్రస్తావిస్తారు. మరొక మంచి కవిత 'మట్టి మనిషి'. బాల్యంనుండి మనిషికి మట్టితోగల అనుబంధాన్నీ, అమ్మకీ మట్టికీ గల సాదృశ్యాన్నీ, అభేధాన్నీ వర్ణిస్తూ "తొలకరింపు తడుపుకు చిలకరించిన మట్టివాసనల చిక్కదనంలో అమ్మవాత్సల్యపు కమ్మదనాన్ని”- చెబుతారు. "నన్ను కన్నతల్లి ఆంతర్యంలో నా నేలతల్లి ఆధిక్యాన్ని కొలిచే నేనింకెవరిని మట్టిమనిషిని” అని సామాజిక జీవనంలోకి మమేకమౌతారు. సాధారణ పదాలతోనే కవితల్ని అల్లే నేర్పు బహుశా జానపద సాహిత్యపరిశోధనలవల్ల అలవోకగా అలవడింది. అలా రాస్తూ రాస్తూనే ఒక్కొక్కప్పుడు అకస్మాత్తుగా భారీ సమాసాల్ని కవితలో చొప్పించేస్తారు. అంతకుముందు చదివిన కావ్యప్రభావం వల్ల అలాంటి పదగుంభనలోకి వెళ్ళిపోతారు. అటువంటి వాటిలో కొన్ని ఉదాహరణలు- 1. శాద్వలాంచల వాః కణాలకు మల్లె 2. దురంత భీషణ క్రుధోద్విగ్న ప్రకృతి 3. తీరస్థ పృధు శిలాగ్ర స్పర్శనం 4. దుష్టచ్ఛేద నోన్ముఖ నిస్త్రింశిక వంటి పంక్తులు వారి కవితల్లో దొర్లడం కనిపిస్తుంది. అయితే అటువంటివి బహు తక్కువే. వవవవఏడున్నర పేజీల ‘ఊడలమర్రి' కవిత కొమ్మల నీడన గూటిలోని పక్షుల గాథను కథాత్మకంగా వర్ణించారు. అటువంటిదే నాలుగున్నర పేజీల 'చౌరస్తా’. మరొకటి ఏడు పేజీల 'అన్నదమ్ములు' కవిత సంభాషణాత్మకంగా నడుస్తుంది. పగలంతా గిల్లికజ్జాలుతో అమ్మని సతాయించిన అన్నదమ్ములు రాత్రి కావలించుకొని పడుకున్నప్పుడు 'స్వప్న వియద్గంగలో సేదతీరుతున్న శ్వేతయుగళంలా' వున్నారంటూ అందమైన పదచిత్రాలతో కథన కవితగా రాసారు కవయిత్రి. మరొక మంచి కవిత 'హుసేన్ సాగర్'లో- “చక్కని హైదరాబాద్ చూపించమని సముద్ర పాప గగ్గోలు" పెడితే "అలల పిడికిళ్ళతో నీటిని విసిరితే తీరిన కడలిముక్కే నగర శరీరాన్ని హత్తుకున్న సొగసైన హుసేన్ సాగర్ పాప” అంటూ హుసేన్ సాగరాన్ని కడలిముక్కగా పోల్చిన తీరు చదువరికి చక్కని దృశ్యాన్ని చూపుతుంది. ఈకవితనిండా మబ్బుపిల్లలు తారట్లాడుతారు. నేలతల్లి తన ఒడిలో అమర్చుకున్న నిర్మలమైన అద్దం బిళ్ళగా హుసేన్ సాగరాన్ని పోల్చేరు. అంతటి నిర్మల కాసారాన్ని ధ్వంసం చేస్తోన్న గుర్రపు డెక్కల మొక్కల్ని గురించీ వాపోయారు కవయిత్రి. సాధారణంగా భావకవిత్వచ్ఛాయలున్న కవులు వెన్నెలతోనో, పూలతోనో, మలయపవనంతోనో మమేకమౌతారు. విప్లవ కవులు సూర్యుని తోనో, జ్వాలలతోనో పోల్చుకుంటారు. కానీ కృష్ణకుమారి గారు మాత్రం- ‘మనిషికీ మనిషికీ మధ్య కనీ కనపడని ఎర్రడాలు మనసు మంటల్నీ దయ్యంలా అసూయని పెంచే మానవత్వం మసిచేసే మంటల్నీ కన్నెర్రని మంటల్నీ ఆర్పే బొగ్గుపులుసు గాలిని” అన్నారు కవయిత్రి. ఎప్పుడూ మనిషి అంతరంగ దర్శనం చేస్తూనే అతని బాహ్య జీవన విధానాన్ని సరిపోల్చుతూ కవిత్వీకరించడం ఈ కవయిత్రి సాహిత్యలక్షణం. అందుకే ఆమె ‘చింతలూ, చికాకులూ, నిరాశలూ, దురాశలూ, కష్టాలూ, కన్నీళ్ళూ, సుఖాలూ, సంతోషాలూ, సంతృప్తి, త్యాగరక్తీ వంటి సమస్త పార్శ్వాలూ రంగరించుకొని రూపెత్తిన సగటు మనిషే నా కవిత్వమంతటా విశ్వరూపావిష్కరణంగా ఉండాలనుకుంటాను” అన్నారు. నాయని కృష్ణకుమారి తమ తల్లిని ఆరోగ్యవంతురాల్ని చేసే క్రమంలో వైద్యురాలిగా పరిచయమై హృదయానికి దగ్గరైన ఆత్మీయ మిత్రురాలైన డా|| పి. శ్రీదేవి మరణవార్త (1962)విని ఆర్ద్రంగానే కాక ఆత్మీయ స్పర్శను నింపుకున్న స్మృతిగీతం “ఏం చెప్పను నేస్తం" కవిత- “నీవు మామధ్యను లేనందున మాకు వెలితి! నీ కలం కథలుగా మారనందున తెలుగు కథలకే వెలితి!” అంటూ ఆద్యంతాలకి అందకుండా ఆవేశకావేశాలు పట్టని ప్రతికూల పరిస్థితుల్ని సైతం అనుకూలంగా మలచుకోగల అంతర్గతంగా శక్తిశాలిని అయిన డా|| పి. శ్రీదేవికి ఆత్మీయంగా 'ఏం చెప్పను నేస్తం' కవితాసంపుటిని అంకితం ఇచ్చారు కృష్ణకుమారి. ఈ సంపుటిలోని కవితలన్నింటా సమాజంలో పెచ్చరిల్లుతున్న హింస, ఆర్థిక అసమానత, విద్యారాహిత్యం, కులమత ప్రాంత విద్వేషాలు- ఇలా సమాజాన్ని కుదిపేసిన పలు సమస్యల్ని గుదిగుచ్చి రాసిన ఆరేడు పేజీల పెద్ద కవితలే ఉన్నాయి. అంతవరకూ ఉగాది సమ్మేళనాల్లో మామిడిపూతలూ, కోయిల పాటలూ, చెరుకు, మామిడుల రుచులూ వీటితో కోమల కవిత్వాన్ని వినిపించే కవి సందర్భాలలో కృష్ణకుమారి సామాజిక సమస్యలవైపు దృష్టి సారించి అరవయ్యో దశాబ్దంలోనే కవిత్వీకరించటంలో రచయిత్రి సామాజిక దృష్టి కోణం తెలుస్తోంది. ఇంద్రధనస్సులోని రంగుల్లా విభిన్న అంతరాలు వున్న జనాల్ని ఈ ఉగాదైనా ఒక్కటిగా చేస్తుందా అనే ఆశావహ దృక్పథాన్ని వ్యక్తపరుస్తూ జనంలో పొడచూపుతున్న అనేకానేక వైరుధ్యాల గురించీ, పెచ్చుపెరుగుతోన్న హింసా ప్రవృత్తుల గురించీ, అంతకంతకూ జీవన ప్రమాణాలు తగ్గిపోతున్న పేదల గురించీ అక్షరాల్లో పొదిగి వాపోయారు కవయిత్రి. దేవుని అస్తిత్వాన్ని నిర్ధారణ చేసుకోలేని సంశయంలో 'మృత్తికాతృష్ణ' కవితలో మట్టికీ మనిషికీ గల అవినాభావ సంబంధాన్ని వివరించే క్రమంలో నగర రోడ్లు విశాలం చేయాలనుకుంటే రాత్రికి రాత్రే పుట్టుకొచ్చే మతాలయాల గురించి నిరసించారు. "సామాన్యుని బతుకుని బాగుచేయమని అడ్డమైన దేవతల్నీ అడుక్కుంటున్న తరుణంలో కనురెప్పలమీది నీలితెరల్ని లాగి వెలుగుసూదుల్ని గుచ్చుతుంది. ఉగాది ఒయ్యారి" అని మూఢభక్తిని నిలదీశారు. 1969లో వచ్చిన ఉద్యమ నేపథ్యం వలన కాబోలు తెలుగు భాష గురించిన కవితల్లో మాతృభాషాభిమానాన్ని వెల్లడించడమే కాక అందరం ఒక భాషామతల్లి బిడ్డలమేనని తెలుగు కవిత్వం సార్వజనీనత్వాన్ని అభిలషిస్తూ కొన్ని కవితలనూ రాసారు. మొదటి కవితాసంపుటి తన తండ్రి నాయని సుబ్బారావుగారికి అంకితమిచ్చిన కృష్ణకుమారి సుమారు పాతికేళ్ళ తర్వాత రాసిన 'సౌభద్ర భద్రరూపం'గా శోభనిచ్చే చిరునవ్వుతో ఆర్తులైన వారినందరినీ, ఆత్మీయంగా అభిమానించే తల్లి భద్ర రూపాన్ని తలచుకుంటూ తల్లికే అంకితమిచ్చారు. ఇందులోని చాలా కవితల్లో తన బాల్యాన్ని తలపోస్తూ, ఆ సమయంలో ప్రేమగా హత్తుకునే తల్లిని గుర్తుచేసుకొన్నారు కవయిత్రి. “పెను ప్రపంచంలోకి నన్ను నిర్దాక్షిణ్యంగా విసిరేసి మూసుకుపోయిన నీ గర్భ ద్వారం" అంటూ తన పుట్టుకని గుర్తు చేసుకుంటూ, చల్లటి స్పర్శలా చాచిన చేతుల మధ్య ఒదిగిపోయి ఆమె గుండెమీద గువ్వపిట్టైనప్పటి దృశ్యాల్నీ; దూదుంపుల్లా, తొక్కుడు బిళ్ళాట నాటి ఉత్సాహాన్నీ అక్షరబద్ధం చేసారు. ఈ క్రమంలో ప్రకృతినంతటినీ తల్లీబిడ్డలుగా వర్ణించటం గమనార్హం. బద్ధకంగా పడుకున్న కొండలు చెట్లచేతులు చాపాయన్నారు. ఆకాశం భూమిపిల్లను సందిట పొదువుకుందన్నారు. రెక్కలు మొలిపించుకున్న పులుగుకూన /శ్రమించి కట్టిన గూడును దాటి ఎగిరిపోయి రాబందుల పాలౌతుందేమోనని దిగులుపడ్డారు. "నేలతల్లి నిర్భర వక్షాన తల్లిని కరచుకున్న పిల్ల పోలిక పల్లవించిన అడవి!”ని దర్శించారు ఈ విధంగా అంతటా మాతృ దర్శనాన్ని వీక్షిస్తున్న కృష్ణకుమారిగారు, తన జీవన సంధ్యలో ముందుకు వేస్తున్నప్రతీ అడుగూ మృత్యువు వైపుకు కాదంటారు. తనవెనక ఘనీభవించిన కాంతి సముద్రం వైపు, దాంట్లో వటపత్రశాయి లాంటి బాల్యంవైపూ, తన పుట్టుకకు కారణమైన గర్భద్వారంవైపు ప్రయాణించి తిరిగి తల్లి గర్భగూడులో గువ్వపిట్టలా ఒదిగిపోవాలని కలగన్నారు కవయిత్రి. తొలి సంపుటిలో దైవం గురించి డోలాయమానంగా ఉన్న కవయిత్రి ఈ సంపుటి చివరి మూడు కవితల్లో దైవాన్ని నిర్ధారించుకున్నారు. తిరునామం కింద కళ్ళకలువల్నీ, విశ్వరూప చమత్కారానికి, ఉక్కిరిబిక్కిరై, ఊపిరందని చేపపిల్లలా ఎగసిపడుతూ తలంచుతున్నానని అన్నారు. ప్రతి కవితనీ ఒక సామాజిక బాధ్యతతో, సమసమాజ భావనతో, మానవీయ దృక్పథంతో రాసారు కవయిత్రి. అనేకచోట్ల మట్టినీ, నేలనీ, దేశాన్నీ, మాతృభాషనీ, తల్లితో పోలుస్తూ మాతృభావనని అనేక కవితల్లో కవిత్వాన్ని అమ్మగా రూపుదిద్దారు నాయని కృష్ణకుమారి. మూడు నాలుగు దశాబ్దాల పాటు అనేక సాహిత్య ప్రక్రియలతో పాటూ కవిత్వానికి నిర్భయాన్ని అద్ది, ఉద్యోగ సంబంధమైన ఒత్తిడులలో సైతం తనదైన శైలిలో కవిత్వాన్ని రాస్తూ విదుషీమణిగా కవిత్వ పతాకాన్ని ఆవిష్కరించిన కవయిత్రి నాయని కృష్ణకుమారి. (సారంగ)

25, మార్చి 2026, బుధవారం

కాలాతీతవ్యక్తులు ఎందుకు చదవాలంటే...~

~ కాలాతీతవ్యక్తులు ఎందుకు చదవాలంటే...~ శ్రీదేవి కాలాతీతవ్యక్తులు ఎన్నిసార్లు చదివినా ఏదో ఒక కొత్త విషయం పాఠకులకు అందుతుంది. రమారమి డెభ్భై ఏళ్ళ నాటి ఈ నవల ఈ విధంగా మూడుతరాల పాఠకులకు ఎందుకు చేరువౌతుంది? ఏమిటి దీని ప్రత్యేకత? ఇందులోని పాత్రలూ,వారి మనస్తత్వాలూ సజీవమే.డెభ్భైఏళ్ళ క్రిందటా అటువంటి వారు జీవించారు .యాభైఏళ్ళ క్రితం సమాజంలోనూ వున్నారు, పాతికేళ్ళ నాడూ చూసాము.ఈనాడు మన మధ్యనే మనతోనే వున్నారు.బహుశా అందుకే ఈ నవల ఏదో ఒకనాటి సమాజానికి చెందినది మాత్రమే అని చెప్పటానికి వీల్లేదు. శ్రీదేవి రచించిన నవల 'కాలాతీత వ్యక్తులు' మొత్తం చదివిన తర్వాత పాఠకులకు అనేక ఆలోచనలూ, సందేహాలూ వస్తాయి. ముఖ్యంగా ఈ నవలలోని ప్రతీ పాత్రకీ మరో పాత్రతో గల సంబంధం ప్రత్యేకంగా ఆర్థికాంశాలమీదే ఆధారపడి ఉంటుంది. అది ప్రధానమైన విషయం. ఇందిరకు ప్రకాశంతో, కృష్ణమూర్తితో ఉన్న స్నేహమైనా,కళ్యాణికి ప్రకాశంతో, కృష్ణమూర్తి తో,డా.చక్రవర్తితో స్నేహమైనా ,ఇందిర తండ్రికి తన మందూ వగైరాల కోసం ప్రకాశం, కృష్ణమూర్తి తోనే కాక ప్రకాశం మేనమామ శేషావతారాన్నీ మాటలతో బురిడీ కొట్టటం మొదలైనవన్నీ ఆర్థిక ప్రాతిపదికగా జరిగినవే. భూస్వామ్య వ్యవస్థ నుండి ప్రారంభమై పెట్టుబడిదారీ వ్యవస్థ వరకూ ఆయా చారిత్రక, భౌగోళిక దశలలోని మార్పులను, వాటి ఫలితంగా సామాజిక సంబంధాలూ, మానవ సంబంధాల మధ్య జరిగే సంఘర్షణలనూ సంక్షోభాలనూ అంతర్లీనంగా ప్రదర్శించే నేర్పు ఆసాంతం ఈ నవలకు ప్రధానంగా వాతావరణ భూమిక అయింది. స్వాతంత్రం వచ్చిన తొలి రోజులు. మొదటి ప్రపంచ యుద్ధానంతరం దేశంలో ఏర్పడిన ఆర్థిక ఛిద్రంవలన తొంభై శాతంకి పైగానే కుటుంబాలు మధ్యతరగతికి దిగువనే ఉండే పరిస్థితి ఏర్పడింది. కష్టపడితేగాని నోట్లోకి ఒకముద్ద వెళ్ళని స్థితి. ఆనాటి రాజకీయ, సామాజిక నేపధ్యంలో అప్పుడప్పుడే విద్యావంతులూ,చిరుద్యోగినులుగా ఎదుగుతోన్న ఆడపిల్లలలో ద్వైదీ భావమనస్తత్వాలు ఏవిధంగా సందిగ్ధతలోకి నెట్టివేస్తున్నాయి.ఇలా ఎన్నో పరిస్థితులు రూపాంతరం చెంది ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుతుంటే వాటికి ఎదురు నిలవటానికి యువతులు తమ ఆత్మవిశ్వాసాన్ని ఎలా కూడగట్టుకోవాలో అర్థం అవుతుంది. ఈ నవల అంతా చెప్పను. ఇందులోని మూడు ప్రధాన స్త్రీ పాత్రలు, వారిని ప్రభావితం చేస్తున్న మూడు పురుష పాత్రలు గురించి మాత్రమే పరిచయం చేస్తాను.నవలలో సమయానుకూలంగా ,ఆయా సందర్భాలలో వచ్చే మరికొన్ని పాత్రలు కూడా వున్నాయి. ఇందులో ఇందిరని తల్చుకుంటే భయం కలుగుతుంది, మరోసారి ధైర్యమూ కలుగుతుంది. ఆ పాత్రని అర్థం చేసుకోవాలంటే గుండె దిటవు కావాలి. అరవై ఏళ్ళ క్రిందట సృష్టింపబడిన ఇందిర పాత్రని ఆ విధంగా తీర్చిదిద్దటానికి శ్రీదేవి చాలా ధైర్యాన్ని కూడగట్టుకునే ఉండాలి. ఎందుకంటే ఇందిర ఒక వ్యక్తికాదు, ఒక పాత్రకాదు, ఒక వ్యవస్థ. కొన్ని కఠిన పరిస్థితులలో జీవితాన్ని కొనసాగించాలంటే ఇందిరలా ప్రవర్తించక తప్పదు అనే వాస్తవాన్ని, జీవనసత్యాన్ని నిర్భయంగా చాటిన రచయిత్రి, తన అభిప్రాయాల్ని బలంగా బలపరుస్తూనే ఆ పాత్ర చిత్రణలో ఎంతో శ్రద్ధ తీసుకుంది రచయిత్రి. "రెక్కలున్నాయనుకొని ఎగరడానికి ప్రయత్నించుతాం. రెక్కలు లేవు మనకు. ఉన్నా అవి తడిసిపోయాయి. నా రెక్కల్ని బీదరికం తడిపేసింది. నీ రెక్కల్ని మితిమీరిన డబ్బు తడిపేసింది. మనిద్దరి పరుగులాటలూ ఒకటే. " కృష్ణమూర్తితో ఇందిర అంటుంది మరో సందర్భంలో ఇందిర మనసులో మాటగా - "త్యాగానికైనా ఒక హద్దుంటుంది. ఎవరికీ పనికిరాని త్యాగాలు చేయటం బుద్ధిహీనం. నాన్నను ఒదిలెయ్య బోవటంలేదు. నాఉద్యోగం, నా స్వతంత్రం అన్నీ అలాగే ఉంటాయి. భావదాస్యం, ఆర్థికదాస్యం రెండూ మనిషిని కుంగదీస్తాయి.” అని స్పష్టంగా చెప్పిస్తుంది రచయిత్రి. స్వతంత్ర వ్యక్తిత్వం గల స్త్రీ కుటుంబ జీవితంలో ఏమి కోరుకుంటుందో నిర్భయంగా ఏమాత్రం తొణుకు బెణుకు లేకుండా చెప్పటంలో ఇందిర చైతన్య స్ఫూర్తి తేటతెల్లమౌతుంది. "ప్రతి మనిషికీ సమస్యలుంటాయి. సమస్యలు లేనిది చచ్చిపోయినవాళ్ళకి మాత్రమే. నీ జీవిత కాలంలో నిండుగా బతుకు. నిర్భయంగా బతుకు. రోజుకి పదిసార్లు చావకు. ఇంకొకళ్ళని చంపకు. నీకు తారసిల్లిన మనుషుల్లో అణగిమణిగి ఎక్కడైనా లోలోపల కొంచెం మానవత్వం ఉంటే దాన్ని బయటకి తీయటానికి ప్రయత్నించి దాన్ని బైటకి రానియ్యి. మానవత్వం ఉండడం సిగ్గుపడవలసిన నేరం ఏమీ కాదు." అంటూ వివిధ సందర్భాలలో ఇందిరచేతనే చెప్పించారు రచయిత్రి. కూర్చుని తినే వ్యసనపరుడైన తండ్రికీ, ఇందిరకీ ఆమె తెచ్చే జీతం డబ్బులు సరిపోవు.యవ్వనంలోని తన ఆశల్ని,కలల్నీ పండించుకొనే అవకాశాలు లేని ఇందిర తన అరకొర జీవితానికి కారణమైన లేమిమీద పగ, కసి వ్యక్తపరచలేక ఒక సాధారణ స్త్రీలా కాకుండా చిత్రాతిచిత్రమైన వ్యక్తిలా ప్రవర్తిస్తుంది. ఆ ప్రవర్తనలో ప్రేమ, కోపం, ఆవేశం, పగ, దుఃఖం, నిరాశ, నిర్లిప్తత, స్వార్థం అన్నీ ఉంటాయి. అన్నీ ఎక్కడనుండో వచ్చిపడినవి కాదు.బాల్యంనుండీ ఎదుర్కొన్న అనేకానేక అనుభవాల కారణంగా జీవితం ప్రసాదించినవే. నవలలో ఇందిరని ఒకచోట సర్కస్ ట్రెపీజ్ మీద ఫీట్లు చేసే అమ్మాయిగా చూపిస్తూ ఆమెలోని బలహీనతలు, లోపాలు తుడిచి పెట్టేసి చివరికివచ్చేసరికి క్రమక్రమంగా పెంపొందిన ఇందిర వ్యక్తిత్వం, మానసిక పరిణత అబ్బురపరిచేలా నవలంతటా ఆమె పాత్రని చిత్రించిన తీరు శ్రీదేవిలోని రచనా పరిణతకి, భావసాంద్రతకీ అద్దం పడుతుంది. కుటుంబ జీవితంలో, సామాజిక జీవితంలో ఎత్తుపల్లాలు, ఎదురు దెబ్బలు, అవమానాలే కాక, వాటిని అధిగమించటానికి జీవితంపై పగ, కసితో వ్యక్తిత్వాన్ని చెక్కుకొంటున్నప్పుడు క్రమంగా సానపడుతూ వెన్నెముకగల స్త్రీగా ఎదిగిన క్రమాన్ని ఇందిర పాత్ర చిత్రణలో స్పష్టంగా చూపుతుంది.ఇందిర కొన్నిసార్లు జీవితం అంటే లక్ష్యం లేనట్లు మాట్లాడుతుంది.మరికొన్నిసార్లు తాత్విక చింతనతో మాట్లాడుతుంది.ఏదిమాట్లాడినా అర్థవంతంగానే మాట్లాడుతుంది.ఆ మాటలన్నీ రచయిత్రి శ్రీదేవివే.నవల రాసే నాటికి ముప్పై ఏళ్ళ లోపునే వయసు వున్న శ్రీదేవి ఇంత పరిణతతో జీవితసారాన్ని అవుపోసన పట్టినట్లుగా రాయటం అబ్బురమే. కళ్యాణి అనేకానేక నవలల్లో లాగానే ఒక మంచి కథానాయికగానే కనిపిస్తుంది. ఇందిర పాత్రకు సమాంతరంగా కళ్యాణి పాత్రను నవల అంతటా శ్రీదేవి ఒకేరకంగా నడిపించింది. ఇందిరలా చొరవలేదు, మాటలతో ఆకట్టుకొనే మనస్తత్వం కాదు. పురుషులతో మాట్లాడేటప్పుడు ఆనాటి పరిస్థితుల కనుగుణంగా బిడియపడుతూనే మాట్లాడుతుంది. స్నేహితుల వద్దకూడాతన అవసరాలు బయటపడకుండా గోప్యంగా నడుచుకుంటుంది. ఎప్పటికప్పుడు పరిస్థితులతో రాజీ పడుతుంది. ఎటువంటి సందర్భంలోనూ తనలోని రాగద్వేషాలు కాని, తన అభిప్రాయాల్ని కానీ వెల్లడించకుండా తనలో తానే మధనపడుతుంది.కళ్యాణిని ఆర్థిక అవసరాలు తెలీనీకుండా పెంచిన తండ్రి మరణించాక ప్రకాశం పట్ల ఆకర్షితురాలైనా, వసుంధర ఆశ్రయం, తనకి గార్డియన్గా ఉన్న మునసబు మరణించడం, ఆ సందర్భంలో ఆదుకొన్న డా॥ చక్రవర్తి స్నేహం పొందడం అన్నీ నాటకీయంగా జరుగుతాయి. అనుకోని పరిస్థితులలో మానసికంగా దగ్గరైన డాక్టరు చక్రవర్తి దగ్గర తన మనసును బయట పెట్టడంతో అది వారిరువురి వివాహానికి దారితీసింది. ఈ నవలలో కథానాయిక ఇందిరా,కళ్యాణా అనే వాదవివాదాలు అనవసరం.ఆనాడేకాదు ఈనాటికీ వస్తోన్న అనేకానేక రచనల్లోని కథానాయికలు కళ్యాణికి సాదృశ్యంగానే ఉంటారు.మనసమాజంలో రాజీపడుతూ బతికేసే సగటు మహిళలు ఎప్పుడూ వుంటారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ కాళ్ళుచాపుకొని ఏడుస్తూ కూర్చుని ఒకరిమీద ఒరిగి పోకుండా నిలదొక్కుకొని ఇందిరలా నిలిచేవారు ఈనాడు స్త్రీవాద వుద్యమం వూపందుకొన్నాక ఎక్కువమందే వుండి వుంటారు. మరో స్త్రీ పాత్ర వసుంధర కళ్యాణికి సహాధ్యాయి మానవత్వం మూర్తీభవించిన మంచి మనిషి.కళ్యాణి కష్టాలకు కరిగిపోయి ఆశ్రయం యిచ్చి తానుకూడా ఈ వలయంలో చిక్కుకు పోతుంది.ఆమె కుటుంబ సభ్యులు అంతా ఆమెని పువ్వుల్లో పెట్టి పెంచారు.ఆమెకు ఏకష్టాలు తెలియవు.అందువలనే వసుంధరను ఆమె కుటుంబ సభ్యులు మందలించటం రచయిత్రి సహజంగా రాసింది. కళ్యాణి వలన కృష్ణమూర్తి,చక్రవర్తుల పట్ల స్నేహం,ఆకర్షణ ఏర్పడినా సహృదయంతో అర్థం చేసుకొని తాను తప్పుకొని వారి వివాహాలకు తిరుపతి వెళ్తుంది వసుంధర.అవసరమైన సంఘటనలను కల్పించి శ్రీదేవి మలుపులతో నవలకు ముగింపు పలకటంలో చాకచక్యం చూపింది. ఎంబిబిఎస్ చదువుతున్న ప్రకాశం ఎవరో ఒకరి అధికారం క్రింద బతకటానికి అలవాటు పడిన సామాన్యుడుగా చిత్రించింది రచయిత్రి.స్వంత అభిప్రాయాలూ, స్వంత ఆలోచనలు లేని చంచలస్వభావుడు.ఆర్థిక అవసరాలు ఎంతటి పిరికితనాన్నీ,లొంగిపోయే మనస్తత్వాన్ని ప్రకాశంలో ఏ విధంగా కలిగించాయో ప్రతీ సందర్భంలోనూ రచయిత్రి నేర్పుగా చిత్రించింది.చదివిస్తున్న మామయ్య ఇనుప పిడికిలిని తప్పించుకునే నేర్పు లేక ప్రకాశం లొంగిపోయి మామయ్య ఇష్టప్రకారం వివాహం చేసుకుంటాడు. ప్రకాశం లాంటి యువకులు బ్రతుకు బాధలను ఎదుర్కోలేక అడుగడుగునా రాజీపడి అణిగిమణిగి ఎలా బతుకుతారో ఈ నవలలో అత్యద్భుతంగా చిత్రించారు శ్రీదేవి. కృష్ణమూర్తి పాత్రని ఆర్థిక ఇబ్బందులులేని విలాసపురుషుడిగా,నైతికవిలువలు లేని వాడిగా ఏవగింపు కలిగించేలా నవలలో ప్రవేశపెడుతుంది.కానీ రానురాను ఒక స్వచ్ఛమైన వ్యక్తిగా ఇందిర కోరుకున్న పెద్ద ఛాతిగల వ్యక్తిగా తీర్చిదిద్దింది రచయిత్రి. కృష్ణమూర్తి ఆదర్శాలు వల్లించడు.పగా కార్పణ్యం లేనివాడు.స్నేహాన్ని ప్రేమించి అవసరాలకు అండగా నిలుస్తాడు.జీవితాన్ని అర్థం చేసుకుని ఎదుగుతాడు అనేలా క్రమక్రమంగా అవసరమైన మేరకు సన్నివేశ కల్పన చేస్తుంది రచయిత్రి. 'ప్రపంచంలోని అందరి ఉగాదులూ మనవే' అనుకునే సార్వజనీన దృక్పథం కలవాడిగా చివరకు కృష్ణమూర్తి పాఠకులకు గోచరిస్తాడు. "దేశంలో ఉన్న దరిద్రం సగం మనుషుల మనసులలో ఉంది. ఇవ్వడానికి చేతిలో దమ్మిడీ లేకపోవచ్చు. కాని మనస్సు ఇవ్వటానికేం ఖర్మ? కాని ఇవ్వరు. నాలుక పీక్కున్నా ఇవ్వరు. ఇవ్వడంలో హాయి ఉందిరా అంటే అర్ధం చేసుకోరు"అంటాడు కృష్ణమూర్తి.కృష్ణమూర్తి అమృత హృదయుడు. మంచిగా తప్ప మరొకలా ఉండలేడు అనేలా రచయిత్రి ఈ పాత్రను నిర్థారించారు. కుటుంబ సమస్యలు, భార్య మరణం వంటి జీవిత సమస్యలతో బాధపడుతున్న డా|| చక్రవర్తీ, ఆర్థిక కారణాలే కాక, మానసికంగా, భౌతికంగా కూడా ఒంటరి అయి ఆలంబనకోసం పరితపిస్తున్న కళ్యాణీ ఒక్కటి కావటంలో పెద్ద ప్రత్యేకత ఏమీలేదు. అటువంటి అనేక సన్నివేశాలు చాలా నవలల్లో చదివే వున్నాం. అవసరమైనప్పుడు లోకాన్ని ధిక్కరించైనా, తనకేం కావాలో దాన్ని సాధించుకున్న ఆధునిక యువతి ఇందిర, కాలానికి అతీతంగా ఆమె నడుచుకున్నట్లనిపించినా నవతరం స్త్రీలో ఆ విధమైన మానసిక స్థైర్యం ఉండాలనేదే శ్రీదేవి ఉద్దేశం. అన్యాయం జరిగినప్పుడు కుంగిపోయి, ఆత్మహత్యకు తలపడటం ఏనాడూ స్త్రీ చేయవలసిన పని కానేకాదని ఇందిర పాత్ర ద్వారా రచయిత్రి శ్రీదేవి ఈ నవలలో ప్రధానంగా చెప్పారు ఇందులోని ప్రతీ పాత్ర ప్రవర్తనకూ ఆ పాత్ర కుటుంబ నేపధ్యం,పెరిగిన విధానమే మూలకారణంగా రచయిత్రి నిరూపిస్తూనే యీ రచన చేసింది.ఆ నిరూపణల్లో రచయిత్రి ఎక్కడా తడబడలేదు.అది గమనించవలసిన విషయం.బహుశా శ్రీదేవి వృత్తిపరంగా వైద్యురాలు కావటం వలన రోగానికి మూలం కనుగొన్న విధంగానే తాను సృజించిన పాత్రల మూలాలను పాఠకులకు కూడా అవగాహన కల్పిస్తూనే కథనం చేసిందని స్పష్టమోతుంది. అందుకే ఒక ఇంటర్వ్యూలో " 'కాలాతీత వ్యక్తులు' అప్పటికే కాదు. ఇప్పటికి ఎప్పటికీ నిలిచిపోయే నవల, ఎంత కఠిన మైన విషయాన్నయినా, మరెంతో జుగుప్సాకరమైన సంఘటమైనా అతి నైపుణ్యంతో రాయగలిగే నేర్పు శ్రీదేవిలో వుంది. ఒక ఇందిర, కళ్యాణి, వసుంధర, ఒక చక్రవర్తి, కృష్ణమూర్తి, ప్రకాశం... ఎప్పుడూ మన మధ్యే వుంటారు."అన్నారు .శ్రీదేవికి ఆత్మీయురాలైన పి.సరళాదేవి. శ్రీదేవి స్వభావరీత్యా మృదుభాషిణి, స్నేహశీలి. వ్యక్తిగాను, రచయిత్రిగానూ స్వతంత్ర ప్రవృత్తి గలది. అందుకే ఈమె సృజించిన పాత్రలుకూడా స్వతంత్ర ప్రవృత్తి కలిగివుండి ఎటువంటి క్లిష్టసందర్భాలలోనైనా సంయమనం కోల్పోక తమ వ్యక్తిత్వం నిలుపుకుంటాయి. తనకి గల స్నేహస్వభావంవలనే ఆమె రచనలలోకూడా స్నేహానికి పెద్దపీట వేసింది. 'కాలాతీతవ్యక్తులు' నవలలో తెలుగునాట రాజకీయ, ఆర్థిక, సామాజిక,కౌటుంబిక పరిస్థితులన్నింటినీ నవలా నేపధ్యంలో స్పష్టీకరించటం వలన పాఠకులకు కాల పరిణామక్రమం చక్కగా అవగాహన అవుతుంది. సాధారణంగా నవలల్లో ఇతర పుస్తకాల ప్రస్థావన ఉండటం అరుదు.కానీ ఈ నవలలో అనేక పుస్తకాలు గురించి అక్కడక్కడా ప్రస్థావించటం వలన రచయిత్రి మంచి చదువరి అనే విషయం తెలుస్తుంది. రచయిత్రి అనేక సందర్భాలలో స్త్రీవాద దృక్పథాన్నే కాక సంపూర్ణ మానవులుగా బతకాల్సిన విధానాన్ని కూడా పాత్రల సంభాషణల ద్వారా నవలలో ప్రకటించింది.సరిగ్గా అందుకోసమనైనా కాలాతీతవ్యక్తులు నవల చదవాలి.

నడక దారిలో -61

నడక దారిలో-61 విభజిత ఆంధ్రప్రదేశ్ లో రాజధాని నిర్మాణానికి అంకురార్పణ పెద్ద ఎత్తున రంగరంగవైభవంగా జరిగింది.ఈ నిర్మాణానికి కొన్ని వేల ఎకరాల పంటపండే భూములను గవర్నమెంట్ సేకరించింది.అది కొంత వివాదాస్పదంగా మారినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా ఆ ప్రాంత ప్రజలు సంతోషం ప్రకటించారు.రాజధానిలేని రాష్ట్రం అభివృద్ది చెందాలంటే విద్య, వ్యాపారరంగాలు పెరగాలి.పన్నులు రావాలంటే పెట్టుబడులు పెట్టే పెద్ద సంస్థలను ఆకర్షించ గలగాలి.చూడాలి అవన్నీ ఎంతవరకూ సాకారమౌతాయో.వీర్రాజుగారూ,నేనూ ఈ విషయం గురించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని చాలా ఆసక్తిగానే గమనించాం. ప్రత్యేక హోదా డిమాండ్తో టీడీపీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది.రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త రాజధాని అమరావతిలో పరిపాలన కార్యకలాపాలు మొదలయ్యాయి.ఇక్కడ స్థిరపడిన ఆంధ్రప్రాంత వుద్యోగులు విజయవాడకు తరలి వెళ్ళాల్సి వచ్చింది.ఆ దృశ్యం చాలా ఉద్వేగంగా కనిపించింది . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి హైదరాబాద్ రాజధాని కావటాన ఇక్కడే కార్యాలయాలన్నీ వుండటాన ఉద్యోగులు ఇక్కడే ఇల్లు కొనుక్కుని పిల్లల చదువులతో స్థిరపడిన వాళ్ళు.చిరకాలంగా స్నేహ సంబంధాలు కలిగిన వాళ్ళని విడిచి వెళ్ళటం బాధాకరమే. వెళ్ళిన వారిలో అల్లూరి గౌరిలక్ష్మి కూడా వుంది.వుద్యోగ రీత్యా విజయవాడ వెళ్ళి పోవటంతో కలవటం తగ్గిపోయింది. రాజమండ్రి,యానాం,విశాఖ, విజయవాడలలో వీర్రాజుగారి చిత్ర ప్రదర్శనల అనంతరం పెయింటింగ్స్ అన్నీ భద్రంగా ఇంటికి చేరాయి.ఆ సందర్భంలో ఒకసారి ఇంటికి వచ్చిన పొనుగోటి కృష్ణారెడ్డిగారు వారి స్వగ్రామం అయిన కావలిలో కూడా ప్రదర్శనకు ఏర్పాటు చేయాలని ఆలోచించారు.అక్కడి వారితో సంప్రదించి పెయింటింగ్స్ నుంచి భద్రంగా తీసుకు వెళ్ళే ఏర్పాటు చేసారు.కృష్ణారెడ్డిగారితో పాటూ వీర్రాజుగారు కావలికి వెళ్ళారు.కావలిలో కూడా రెండు రోజుల పాటు జరిగిన చిత్ర ప్రదర్శనకు మంచి స్పందన వచ్చిందని వీర్రాజుగారు చాలా సంతోషపడ్డారు. సాధారణంగా పోటీలకు నా పుస్తకాలు పంపను.కానీ ఈసారి గంగిశెట్టి గారు ప్రకటించిన పోటీకి నా కవితా సంపుటిని పంపాను. గంగిశెట్టి లక్ష్మీనారాయణగారి మాతృమూర్తి జింకా రుక్మిణమ్మ పురస్కారానికి " నా ఆకాశం నాదే " ఎంపిక అయ్యిందని ఫోన్ చేసి తెలియజేసారు.చాలా సంతోషం కలిగింది. పురస్కార సభలో ముగ్గురు పూర్వ వైస్ ఛాన్సలర్ లు అయిన ప్రొ.గంగిశెట్టి లక్ష్మీనారాయణ ప్రొ. కొలకలూరి ఇనాక్ , ప్రొ.అనుమాండ్ల భూమయ్య గార్ల చేతులమీదుగా పురస్కారం అందుకోవటం చాలా ఆనందం కలిగించింది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ లో ఉన్న తెలుగు సాహితీవేత్తలు ఎప్పటి నుండో నిర్వహించే సిరికోన వాట్సాప్ సమూహంలో నన్ను చేర్చారు.అందులో చాలామంది సంస్కృతాంధ్ర పండితులు కావటాన ఎక్కువగా వాటికి చెందిన రచనలే ఉంటున్నా కొందరు నా లాంటి వారు రాసే ఆధునిక కవిత్వాన్ని కూడా ఆదరించేవారు. అనుకోకుండా లేఖిని అధ్యక్షురాలైన వాసా ప్రభావతి గారు పడిపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.వీర్రాజుగారూ,నేనూ వెళ్ళి చూసి వచ్చాము.నాకు తెలిసి గొప్ప విల్ పవర్ ఉన్న రచయిత్రులలో ప్రభావతిగారు ఒకరు.అటువంటి పరిస్థితుల్లో సైతం ఆమె రాలేకపోయినా లేఖిని కార్యక్రమాలు కొనసాగేలా ఫోన్లు ద్వారానే చేసేవారు. నా ముందుతరం రచయిత్రుల కథలు గురించి వ్యాసాలు రాయటంలో భలే ఆనందం పొందుతున్నాను.పదిహేను మంది రచయిత్రుల గురించి రాస్తే ఇంక చాలనుకున్నాను కానీ విస్తృతంగా కథలు రాసినవారు వున్నారు. చాలా మంది అనేక కథలు రాసినవాళ్ళు దొరికే సరికి ఉత్సాహంగా కొనసాగించాను.కథానిలయం నుండి ఒక్కరివే వందలకథలు డౌన్లోడ్ చేసుకుని చదివి రాయటం, తర్వాత మరొకరివీ ఇలా చాలా సమయం పట్టటంతో నా కవిత్వం,కథలు రాసేందుకు సమయం తక్కువ అయ్యింది.కానీ కనీసం పాతికరచయిత్రుల కథలు గురించి అయినా రాయాలనే పట్టుదలతో కొనసాగిస్తున్నాను. మృణాళిని ఐ డ్రీమ్స్ ఛానల్ లో అక్షరయాత్ర పేరిట వీర్రాజుగారిని ఇంటర్వ్యూ చేయటానికి వచ్చారు.ఆమె మొత్తం రచనలు చదివి చాలా సమగ్రంగా ఇంటర్వ్యూ చేసింది.అదే ఆమె ప్రత్యేకత అనుకుంటాను.అలా వచ్చినప్పుడే మిమ్మల్ని కూడా దగ్గర్లోనే వచ్చి చేస్తాను అని నా రచనల్ని అన్నింటినీ తీసుకుని వెళ్ళింది. చెన్నై నుండి రాజేశ్వరీ కోదండం అనే ఆమె ఫోన్ చేసి వీర్రాజుగారి మైనా నవలను తమిళంలోకి అనువాదం చేయాలనుకుంటున్నానని ఫోన్ చేసింది.మైనా నవలని కెబి గోపాలంగారు ఇంగ్లీష్ లోకి అనువదించారు కానీ పుస్తకంగా వేయలేదు.ఆవిడే ఫోన్ చేసి చేస్తానంటోంది కదా అని అంగీకారం తెలియజేసారు.రాజేశ్వరీ కోథండం తాను అనువాదం చేయడమే కాక తానే పూనుకొని మా దగ్గర ప్రచురణ ఖర్చు తీసుకుని పుస్తకంగా కూడా ప్రచురించింది.ఆ తర్వాత నా యుద్ధం ఒక గుండె కోత కూడా ఆమె తమిళంలోకి అనువాదం చేసి అదే రకంగా ప్రచురణ ఖర్చు తీసుకుని "ఉళ్ళక్ కుమురల్" పేరుతో పుస్తకంగా వేసారు. ఈలోగా అనల్ప బలరాం వీర్రాజుగారి సమగ్ర సంపుటి వేస్తానని అన్నారు.వీర్రాజుగారు అప్పటికే తన ఎనభయ్యో పుట్టినరోజు నాటికి కథలన్నీ కలిపి వేయాలనే ప్రయత్నంలో వున్నారు. మనం వేసే కన్నా పబ్లిషర్ వేస్తే అమ్మకాలు అవుతాయి.ఇంట్లో పుస్తకాలు పేరుకుపోవు.అందుకని అనల్పబుక్ హౌస్ వారికి అంగీకారం తెలియజేసారు. పొనుగోటి కృష్ణారెడ్డిగారు వారి వూరు కావలిలో వీర్రాజుగారి పెయింటింగ్స్ ప్రదర్శన ఏర్పాటు చేస్తానని చెప్పారు.పెయింటింగ్స్ కావలికి చెందిన వారి కారులో పంపించారు.వీర్రాజుగారూ, కృష్ణారెడ్డి గారూ ట్రైనులో బయలుదేరి వెళ్ళారు.కావలిలో ప్రదర్శన చాలా బాగా జరిగిందనీ, చాలా మంది చూడటానికి వచ్చారనీ వీర్రాజుగారు తిరిగి వచ్చాక సంబరంగా చెప్పారు. ఐ డ్రీమ్స్ ద్వారా వీర్రాజుగారిని ఇంటర్వ్యూ చేసిన ఆరేడు నెలలకే మృణాళిని నన్ను ఇంటర్వ్యూ చేయటానికి వచ్చింది.మొత్తం నా పుస్తకాలన్నీ చదివి చేసిన సమగ్రమైన ఇంటర్వ్యూ ఇదే అని చెప్పొచ్చు.ఈ ఇంటర్వ్యూలకు చాలామంది నుండి చక్కటి స్పందన వచ్చింది. ఆషీ అన్ని క్వాంపిటేటివ్ పరీక్షలకూ ప్రిపేర్ కావటంతో పరీక్షలకు తీసుకు వెళ్ళటానికి పల్లవి బిజీ అయిపోయింది.బిల్డింగ్ లో ఆషీతోటి పిల్లలు రిజల్ట్ రాకముందే కాలేజీల ఎంపిక కోసం తిరుగు తున్నారని తెలిసి మేము కూడా కొన్ని కాలేజీలకు వెళ్ళి చూడాలనుకున్నాము.ఆ వరుసలో శంకరపల్లిలో ఆడపిల్లలదే మంచి ఇంజనీరింగ్ కాలేజీ వుందని తెలిసి వెళ్ళాము.వాళ్ళకి అమెరికన్ సిటిజన్ కీ,ఎన్ ఆర్.ఐ కీ తేడా తెలియదనిపించింది. ఆప్లై చేయటం దగ్గర నుండి ఫీజు కట్టటం వరకూ అమెరికాలో వుండేవారే డాలర్ల రూపంలో కట్టాలన్నారు.తల్లి ,పిల్లా ఇండియాలోనే వుంటే అక్కడినుండి అప్లై చేయటం ఏమిటో అర్థం కాలేదు.పేరుకే ప్రవేశపరీక్షలు కానీ అంతా డబ్బు డిమాండే ప్రధానం అని తెలిసింది.పాతిక లక్షలు ముందు కట్టాలంట.ప్రతీఏడాదీ అయిదు లక్షలు కట్టాలన్నారు.విద్య కొనుక్కోలేక ఒక నమస్కారం పెట్టి వచ్చేసాము.అలా రెండుమూడు కాలేజీలు తిరిగి పది,పదిహేను లక్షలంటూ బేరాలదోపిడీ చూసి భయం వేసింది. ప్రవేశపరీక్ష రిజల్ట్ వచ్చాక ఇక్కడ గీతంయూనివర్సిటీలో వచ్చినా అంత దూరం పంపటానికి నచ్చక వద్దనుకున్నాము.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రకటన చూసి అయిదేళ్ళ ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీకి అప్లై చేసింది.అయితే విదేశీ విద్యార్థులు ఎంట్రెన్స్ రాయనక్కరలేదనీ,టోఫెల్ పరీక్ష క్వాలిఫై కావాలని సమాధానం వచ్చింది.వెంటనే టోఫెల్ కు అప్లై చేసి పరీక్ష రాసింది.కానీ రిజల్ట్ సబ్మిట్ చేసే నాటికి సెంట్రల్ యూనివర్సిటీ టైమ్ దాటిపోయింది.ఈ ఏడాది మానేసి వచ్చే ఏడాది అప్లై చేద్దామని ఆషీ నిర్ణయించుకుంది.అంతవరకూ ఖాళీగా వుండటం ఎందుకని కోర్సెరా లో ఆస్ట్రో ఫిజిక్స్ సర్టిఫికెట్ కోర్సు లో చేరింది. అప్పట్లో తెలంగాణా ఉద్యమం వలన కావచ్చు, కుందుర్తి సత్యమూర్తి ఆకస్మిక మరణం వలన కావచ్చు ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతుల ప్రదానం మందగించింది. " ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు ఇప్పటికే నలభై నాలుగు అయ్యాయి.తరువాయి ఆరు బహుమతులు మనమే ఇచ్చేసి యాభై పూర్తిచేసి ఆపేస్తే ఎట్లా వుంటుంది " అని ఒకదశలో వీర్రాజుగారూ నేనూ ఆలోచించాం. కానీ సత్యమూర్తి భార్య కుందుర్తి శాంత " ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు యాభై పూర్తి చేసేవరకూ తానే ఇస్తానని ముందుకు రావటంతో కొనసాగింది.అయితే రెండేళ్ళ కొకసారి రెండేళ్ళవీ రెండేసి బహుమతులు ఇవ్వాలని నిర్ణయించటం జరిగింది. ఆ విధంగా 14,15 సంవత్సరాల బహుమతులు సత్యమూర్తి ఉన్నప్పుడే నిర్ణయించిన ప్రకారం తుల్లిమిల్లి విల్సన్ సుధాకర్ గారికి,ప్రసాదమూర్తికి ప్రకటించి 2015 లోనూ,16,17 సంవత్సరాల ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు డా.భవానీదేవికీ,బాల సుధాకర్ మౌళికీ 2017లోనూ ప్రదానం చేయటం జరిగింది.18,19 లకు కూడా చాలా కవితా సంపుటాలు చదివి సిరికి స్వామినాయుడికీ,ఇబ్రహిమ్ నిర్గుణ్ కీ ఫోన్ చేసి వీర్రాజు గారు ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతికి ఎంపిక చేసినట్లు గా చెప్పి అంగీకారం పంపమన్నారు.వాళ్ళనుండి అంగీకారం ఉత్తరం వచ్చాక సభ ఎప్పుడన్నది నిర్ఢయించుకొని పేపర్ ప్రకటనకు ఇవ్వాలనుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 2 న తెలంగాణ అవతరణ దినోత్సవం నిర్వహిస్తుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాల్లో కృషి చేసినవారికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు పేరిట పురస్కారాలను అందించారు.ఆ క్రమంలో మా ఆత్మీయులైన ఆశారాజు,నాళేశ్వరం శంకరం, కందుకూరి శ్రీరాములు మొదలైనవారంతా ప్రభుత్వ పురస్కారంగా లక్షానూటపదహార్లు అందుకోవటం మాకూ సంతోషం కలిగింది. కానీ ప్రభుత్వం నుండి పొందే పురస్కారాలు అక్షరాలకు ఆనకట్ట వేసే అవకాశం వుండొచ్చు. ఒకరోజు అమృతలతగారు ఫోన్ చేసి కవిత్వానికి అపురూప పురస్కారం నాకు ఇవ్వాలనుకున్నట్లు తెలియజేసారు.సుమారు పది పన్నెండు మంది మహిళలకు ప్రతి ఏడాదీ అందజేసే అమృతలతగారి అపురూప అవార్డులు నిజంగా అపురూపమైనవే.మా దంపతులు ఇద్దరికీ చాలా ఆనందం కలిగింది.నాకు సంబంధించిన ముఖ్య వివరాలూ,ఫొటోలు పంపమన్నారు. అమృతలతగారి అవార్డుల సంబరంలో అతిథులను ఆహ్వానించటం దగ్గర నుండి చివరివరకూ ఆద్యంతం సమయనిబద్ధతమ పాటిస్తూ ఆహ్లాదకరంగా, ఆసక్తికరంగా వైభవోపేతంగా కొనసాగుతుంది‌.అంతేకాదు సభలోని వారిని కూడా అంచెలంచెలుగా వేదిక మీదకు గౌరవపురస్సరంగా ఆహ్వానిస్తారు.మరోవిశేషం అప్పటికప్పుడు సర్ప్రైజింగ్ గా వచ్చిన సభికులకూ బహుమతులు ఇస్తారు.అందుకే రచయిత్రులు అందరూ అమృతలత అపురూప పురస్కారాల సభని ఒకపండుగగా భావిస్తారు.ఈ సారి ముఖ్య అతిథులుగా జలంధరా చంద్రమోహన్,ఎస్.పి.శైలజా వచ్చారు.నాకు పురస్కారం ఇచ్చేటప్పుడు వీర్రాజుగారిని కూడా వేదిక పైకి ఆహ్వానించి ఇద్దరికీ కలిపి సత్కారం చేసారు‌.సభకి మామరిదీచిట్టీ, తోటి కోడలు ఉషా కూడా సభకి వచ్చిఆ సంబరం చూసి ఆశ్చర్య పోయారు. ఆతర్వాత ఎప్పటి నుంచో వాయిదా పడుతోన్న వీర్రాజుగారి కేటరాక్ట్ ఆపరేషనుకు నేత్రాలయ కంటి హాస్పిటల్ లో చూపించాము.ఈయనకి హాస్పిటల్ అంటే చాలు బీపీ పెరిగి పోతుంది.అందుకనే వాయిదాలు వేస్తూనే వున్నారు.ఇటీవల వారాల కృష్ణమూర్తిగారు వారి భార్యకీ,తనకీ నేత్రాలయలోనే కాటరాక్టు కోసమై సంప్రదించి అక్కడే చేయించుకున్నానని చెప్పటమే కాక వారికి ఆపరేషను చేసిన డాక్టర్ పేరుకూడా చెప్పారు.అప్పుడు వీర్రాజుగారు కూడా చేయించుకోవడానికి సమ్మతించారు. ఉదయమే ఏడున్నరకి ఇద్దరం వెళ్ళాము.ఫార్మాలిటీలు అన్నీ పూర్తి చేసాక ఆపరేషనుకోసం లోనికి తీసుకు వెళ్ళారు.పూర్తిఅయ్యాక బయటకు వచ్చేవరకూ నాకు గుండె దడదడ లాడుతూనే వుంది. బీపీ పెరిగి హడావుడి చేస్తారేమోనని భయపడ్డాను.కానీ బయటకు వచ్చాక వీర్రాజుగారు కూడా రిలీఫ్ గానే వున్నారు.నేనుకూడా గుండె నిండా వూపిరి పీల్చి వదిలాను. టైమ్ ప్రకారం కంట్లో చుక్కల మందు వేసే పని వలన కొంచెం బిజీ అయ్యాను.నెలరోజులు అయ్యాక రెండో కన్ను కూడా చేయించుకోవడానికి సిద్ధపడ్డారు.బహుశా ఇది కష్టమైనది కాదనే ధైర్యం వచ్చిందేమో.రెండో కన్ను కూడా చేయించుకు వచ్చేసాము. అయితే మర్నాడు చూపించుకోటానికి వెళ్ళాల్సి వుంది.టిఫిన్ తిని బయలు దేరుదామనుకునేసరికి వీర్రాజుగారికి వెక్కిళ్లు మొదలయ్యాయి.ఏంచేసినా తగ్గలేదు.కాసేపటికి తగ్గుతాయిలే అనుకుని రివ్యూ కోసం నేత్రాలయకు బయలుదేరాము.కన్ను బాగానే వుందని చెప్పి కళ్ళద్దాలకూ నాలుగు వారాలకు రమ్మన్నారు.తిరిగి ఇంటికి వచ్చాము.మధ్యాహ్నం అవుతోన్నా వెక్కిళ్లు తగ్గటం లేదు.అప్పుడే పొనుగోటి కృష్ణారెడ్డిగారు ఆయన్ని పరామర్శించడానికని వచ్చారు.అప్పటికీ వెక్కిళ్లు తగ్గకపోతే సరికి కృష్ణారెడ్డిగారితో చెప్తే ఓమినీహాస్పటల్ కి తీసుకు వెళ్దామన్నారు.పల్లవి వాళ్ళతో వెళ్ళింది.ఏవేవో టెస్టులు చేసి ఊపిరితిత్తుల్లో నెమ్ము పేరుకుపోయింది అది తీయాలని అన్నారు.రేపు చేయించుకోవడానికి వస్తామని వీర్రాజుగారు అంటే తీసుకుని వచ్చేసారు.ఈ లోపున వెక్కిళ్లు ఎప్పుడో తగ్గి పోయాయి.వీర్రాజుగారు మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళననేసారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ఎన్నికలో అత్యధిక సీట్లు పొందిన తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ ఐదు సంవత్సరాల కాలపరిమితి దాటకుండానే తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి ముందుగానే ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించింది.ఇతర పార్టీలన్నీ కూటమిగా ఏర్పడినా ఎన్నికలలో టీఆర్ఎస్‌ దూకుడుని అడ్డుకోలేక పోయాయి. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పడంతో రాష్ట,కేంద్రాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దాంతో 2019 చివరలో జరిగిన ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రజల మధ్యకి వాళ్ళనాన్నలాగే యాత్రలు చేసి ప్రస్తుత ప్రభుత్వాన్ని బూచిగా ప్రజలు కళ్ళముందు చూపటంతో భారీ మెజారిటీతో గెలిచి ప్రభుత్వం మారిపోయింది. వచ్చిన వెంటనే అమరావతి కాకుండా మూడు చోట్ల రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటన చేసారు. అమరావతి రాజధానికి వేలాది ఎకరాలు ఇచ్చిన రైతులు అంతా గగ్గోలుపెట్టి అమరావతినే రాజధానిగా కొనసాగించాలనే ఉద్యమం ప్రారంభమైంది. - శీలా సుభద్రాదేవి

నడక దారిలో -60

నడక దారిలో -60 రాజమండ్రిలో వీర్రాజు గారి పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ పెట్టడానికి మాదేటి రవిప్రకాష్ వీర్రాజు గారిని సంప్రదించాడు.వీర్రాజుగారు చాలా సంతోషంగా అంగీకరించారు.రవిప్రకాష్, రవికాంత్ పెయింటింగ్స్ అన్నీ భద్రంగా పేక్ చేసి రాజమండ్రికి తీసుకెళ్ళారు.ప్రదర్శన తేదీ నాటికి మేమిద్దరం రాజమండ్రికి చేరాము.మాకు హొటల్ లో రూమ్ బుక్ చేసి వుంచారు.రాజమండ్రి టౌన్ హాల్ లో చిత్రప్రదర్శన ఏర్పాటు చేసారు.మేము దిగిన హొటల్ కు టౌన్ హాల్ చాలా దగ్గరగానే వుంది. చిత్ర ప్రదర్శన రాజమండ్రి కమీషనర్ ప్రారంభించారు.ఆ రోజంతా అక్కడే వున్నాం.ఎండ్లూరి సుధాకర్,పుట్ల హేమలతా వచ్చారు.కొందరు చిత్రకారులూ, రచయితలూ కూడా కలిసారు.వీర్రాజుగారి బాల్యమిత్రుడు ప్రకాశరావు గారు కూడా మాతోనే వున్నారు. మర్నాడు టౌన్ హాల్ లోనే వుండి అక్కడకు వచ్చిన వారితో కలిసాము. మూడో రోజు టౌన్ హాల్ లో ప్రదర్శన దగ్గర ఉండటానికి తెలిసిన వారికి అప్పగించి ఒక ప్రదేశానికి చూడటానికి వెళ్ళాము.పోలీస్ డిపార్టమెంట్ లో పనిచేసే ఆయన ఉద్యోగం మానేసి వచ్చిన సొమ్ముతో ఒక ఎత్తైన గుట్టమీద అతిపెద్ద బుద్ధవిగ్రహం ప్రతిష్టించే ఏర్పాట్లు చేస్తున్నాడనీ,ఆ ప్రదేశం చుట్టూ ప్రతిష్టించడానికి బౌద్ధగాథల అమరావతీ తరహా శిల్పపానల్స్ తయారౌతున్నాయనీ తెలిసి అక్కడకు వెళ్ళాము.ఆ ప్రదేశాన్ని ఆయన ఒక బౌద్ధ ధ్యానకేంద్రంగా మార్చుతున్నాడు.అక్కడ కొంతసేపు గడిపి తర్వాత రెండు మూడు దేవాలయాలేవో చూసి గోదావరి గట్టున కొంతసేపు కూర్చున్నాము.మిత్రులు ఇద్దరూ బాల్యజ్ణాపకాల్ని కలబోసుకున్నారు. ఆ సాయంత్రం దేవాంగ సంఘం వాళ్ళు వీర్రాజుగారికి సత్కారం చేస్తామని ఆహ్వానించారు.మాకు ఈ కులపరమైన సత్కారాలు నచ్చవు.కానీ వీర్రాజుగారి మిత్రుడి కారణంగా వెళ్ళక తప్పలేదు.ఆ సందర్భంగా వాళ్ళు ప్లాస్టిక్ ఫైబర్ తో చేసిన సరస్వతి విగ్రహం ఇచ్చారు.అది మాత్రం మాకు భలే నచ్చింది.అక్కడనుండి తిరుగు ప్రయాణానికి స్టేషన్ కి వచ్చాం. విజయవాడ పుస్తక ప్రదర్శనలో ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారి పుస్తకం ఆవిష్కరణ వుందనీ జానకీ బాల మనం వెళ్దామంది.గౌరిలక్ష్మి తన కథల పుస్తకం ఆవిష్కరణ పుస్తకప్రదర్శనలో కృష్ణాజిల్లా రచయితల స్టాల్ లో వుందని రమ్మని ఆహ్వానించింది. .జానకీబాల వెళ్దాం రమ్మని కోరటంతో ఇద్దరం ఇంటర్ సిటీ ట్రైన్లో విజయవాడకి బయలుదేరాం.పల్లవి నన్ను ఉదయమే స్టేషన్ కు తీసుకు వెళ్ళింది.అప్పటికి జానకీ బాల వచ్చేసింది. ఇక ట్రైన్ బయలుదేరిన దగ్గర నుండి మా మధ్య ఎప్పటి మాదిరే ఎన్నెన్నో కబుర్లు.విజయవాడలో వనజా తాతినేని మమ్మల్ని పికప్ చేసుకుని వాళ్ళింటికి తీసుకు వెళ్ళింది.ఆ సాయంత్రం పుస్తక ప్రదర్శనకు వెళ్ళాము.గౌరిలక్ష్మి రాసిన పుస్తకం ఆవిష్కరణ అయిన తర్వాత గుత్తికొండ సుబ్బారావుగారు, పూర్ణచంద్ గారూ, కొలకలూరి ఇనాక్ గారు, ఎమెస్కో లక్ష్మికలిసారు. శ్రీకాంతశర్మగారి " ఇంటిపేరు ఇంద్రగంటి" పుస్తకావిష్కరణ మొదలయ్యే వరకూ కబుర్లు చెప్పుకుని ఆ సభావేదిక దగ్గరకు వెళ్ళాము.సభానంతరం శర్మగారితో బాటూ జానకీ బాల వాళ్ళ తమ్ముడి ఇంటికి వెళ్ళిపోయింది.నేను వనజతో వాళ్ళింటికి వెళ్ళాను. దారిలో ఆ ముందు రోజు పుస్తకం ప్రదర్శన లో పాల్గొనటానికి వచ్చిన స్కైబాబ,షాజహానాలను అడ్డగించి తెలంగాణా ఉద్యమ సమయంలో ఆంధ్రా వాళ్ళని దుర్భాషలాడుతూ రాసిన కవితలు రాసినవారు మళ్ళా ఇక్కడకు ఎందుకు వస్తున్నారని కొందరు ఆందోళన చేసారనీ దాంతో అక్కడ గందరగోళం ఏర్పడినట్లు ,అయితే ఆ గొడవ చేసిన వాళ్ళు నిజానికి సాహితీవేత్తలు కాదని రాజకీయ కార్యకర్తలని చెప్పింది వనజ. రాష్ట్రాలు విడిపోయినా ఇరుప్రాంతాల జనాలలోనూ కొంత ద్వేష భావాలు రగులుతూనే వున్నాయి.అందుకు ప్రధాన కారణం మాత్రం స్వార్థ పూరిత రాజకీయాలే. శిఖామణిగారు తన పుట్టిన రోజున యానాంలో కవితోత్సవం నిర్వహించి శివారెడ్డిగారికి పురస్కారం ఇస్తున్నానని వీర్రాజుగారికి ఫోన్ చేసారు.ఆసందర్భంగా వీర్రాజుగారి పెయింటింగ్స్ ప్రదర్శన కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాననీ.రాజమండ్రిలో వున్న పెయింటింగ్స్ యానాం తీసుకు వెళ్తున్నానని చెప్పారు. దానికి ఇద్దరూ రావాలని కోరుతూ,ఆ సందర్భంలో సుభద్రాదేవిగారిని కూడా కవిత చదవమని చెప్పమని ఫోన్లో చెప్పారు శిఖామణి.ఆ విషయం వీర్రాజుగారు నాకు చెప్పారు.వీర్రాజుగారి చిత్ర ప్రదర్శన యానాంలో ఏర్పాటు చేయటం సంతోషం కలిగించింది.ఆ సందర్భంగా అయినా యానాం ప్రయాణం కూడా సంతోషకరమే.కానీ శిఖామణిగారు వీర్రాజుగారి ద్వారా నన్ను కవి సమ్మేళనంలో పాల్గొనమని చెప్పించడం నాకు నచ్చలేదు.శిఖామణిగారికి ఈ విషయం తెలిసే అనుకుంటా కవి సంధ్యలో నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు దీనిగురించి ప్రత్యేకం ఒక ప్రశ్న వేసారు.నిజానికి శిఖామణి కవిత్వం నాకెంతో ఇష్టం.తర్వాత్తర్వాత శిఖామణిగారు మా కుటుంబానికి అత్యంత ఆత్మీయులు అయ్యారు. అది అలా వుంటే వీర్రాజుగారికి ఫోన్ చేసి నన్ను కవి సమ్మేళనంలో పాల్గొనమనే సందర్భాలు నేను చాలానే ఎదుర్కొన్నాను.ఇటువంటిదే ఒకసారి హైదరాబాద్ పుస్తకప్రదర్శనలో ఒక ప్రముఖ సంస్థ కవి సమ్మేళనం ఏర్పాటు చేసి నాకు ఫోన్ చేసి చెప్పకుండా వీర్రాజుగారితో "సుభద్రాదేవిగారిని ఫలానా రోజు కవిసమ్మేళనంలో కవిత చదవటానికి రమ్మని చెప్పండి.వెయ్యి రూపాయలు కూడా ఇస్తున్నాం" అని నిర్వాహకులు చెప్పారు.అలా కాకుండా "ఫోన్ సుభద్రాదేవికి ఇవ్వండి.కవిసమ్మేళనానికి ఆహ్వానించాలి"అని చెప్పినాకు పర్సనల్ గా చెప్పటం మర్యాద కదా.ఇతర కవయిత్రుల భర్తలకు ఫోన్ చేసి మీ ఆవిడని సభకి పంపండి అని అనగలరా? నాకు భలే కోపం వచ్చి ఆ రోజు వెళ్ళలేదు. సరే అయితే ఇప్పుడు యానాంలో వీర్రాజు గారి చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు.వయసు రీత్యా వీర్రాజుగారికి సాయంగా వెళ్ళక తప్పదు.అందుకని యానాం బయలుదేరాం.కాకినాడలో దిగిన తర్వాత రిసీవ్ చేసుకొని కార్లలో యానాం తీసుకు వెళ్ళారు.మాతోపాటూ, శివారెడ్డి, శ్రీకాంతశర్మగారూ,ఇతర కవి మిత్రులు కూడా వున్నారు.పగలంతా బహుమతి ప్రదానం,కవిసమ్మేళనం జరిగింది.ఆ రాత్రి మేమిద్దరం తప్ప కొందరు కవయిత్రులతో సహా ఇతరులందరితో సభానంతర సమావేశం జరిగింది. మర్నాడు ఉదయమే తయారై నేనూ,రేణుకా అయోలా బయట అలా నడుచుకుంటూ గోదావరి ఒడ్డువరకూ వెళ్ళి వచ్చాము. మిగతా వాళ్ళంతా ఇంకా యానాంలో తనివి తీరక అక్కడే వున్నారు ‌.వీర్రాజుగారూ,నేను తిరుగు ప్రయాణానికి బయలుదేరిపోయాము. ఆ తర్వాత సుంకర చలపతిరావుగారితో సంప్రదించి రవిప్రకాష్ విశాఖ చిత్రకళా పరిషత్ లో కూడా పెయింటింగ్స్ ప్రదర్శనను రెండు రోజులు ఏర్పాటు చేసారు.కానీ మేము వెళ్ళటానికి కుదరలేదు. ఉమ్మడిసెట్టి పురస్కారాలు ఈ ఏడాదితో ముఫ్ఫై అవుతాయనీ,ఆ సందర్భంగా ఇంతవరకూ పురస్కారాలు అందుకున్న వారందరినీ ఆహ్వానించి రోజంతా సభలు నిర్వహించటమే కాక ఒక పది మంది సీనియర్ కవులకు ప్రతిభా పురస్కారాలు అందించాలని తలపెట్టానని రాధేయగారు ఫోన్ చేసి తెలియజేసారు.నాకు చాలా సంతోషం కలిగింది. 1994 లో వచ్చిన "తెగిన పేగు" కవితా సంపుటిని ఉమ్మడి సెట్టి పురస్కారం పరిశీలనకు పంపాను. నాకు పురస్కారం రాలేదు.కానీ నాగభైరవ కోటేశ్వరరావుగారు నా కవితా సంపుటిని ప్రశంసిస్తూ నాకు వుత్తరం రాసారు.నేను ఆయనకు పుస్తకం పంపలేదు కదా అని ఆశ్చర్యపోయాను.తర్వాత బహుశా ఉమ్మడిసెట్టి పురస్కారాల న్యాయనిర్ణేతగా ఉండివుంటారనుకున్నాను.అప్పుడు తప్పిపోయిన పురస్కారం ఈనాడు ప్రతిభా పురస్కారంగా అందుకుంటున్నానని ఆనందించాను. ఆ సభలకోసం కొండేపూడి నిర్మలతో కలిసి అనంతపురం బయలుదేరాను. అక్కడ మా ఇద్దరినీ శశికళ రిసీవ్ చేసుకొని వాళ్ళింట్లోనే ఆతిధ్యం ఇచ్చి మమ్మల్ని సభల అనంతరం తిరిగి ఆ సాయంత్రం ట్రైనుకి అందించేవరకూ మా వెన్నంటే వుంది. "ఇంతవరకూ ముఫ్ఫై పురస్కారాలు ఇచ్చాము.అనేక కారణాలవలన ఇంక ఆపాలని భావిస్తున్నాను" అని రాధేయగారు సభలో మాట్లాడుతూ అన్నారు.కానీ రాధేయగారి శ్రీమతి సత్యాదేవి ఒకింత భావోద్వేగంతో కన్నీళ్ళతో " ఉమ్మడిసెట్టి పురస్కారాలు ఆగవు.ఎప్పటికీ కొనసాగుతాయి" అని ప్రకటించారు.అప్పటికే కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో వున్నారు.ఆమె మాటలకి సభికులంతా ఉద్విగ్నతతోనే హర్షధ్వానాలు చేసారు.కానీ దురదృష్టం ఏమిటంటే తర్వాత కొంతకాలానికే రాధేయగారిని ఒంటరిని చేసి ఆమె మరణించారు. ప్రజా సాహితి దివి కుమార్ గారు జనసాహితితో కలిసి విజయవాడలో వీర్రాజుగారి పెయింటింగ్స్ ప్రదర్శన ఏర్పాటు చేయాలని భావించారు.ఈమని శివనాగిరెడ్డిగారు విజయవాడ లోని మధుమాలక్ష్మి కన్వెన్షన్ లో ప్రదర్శనకు సహకరించారు. యూ.ఎస్ లో వున్న ప్రముఖ నైరూప్య చిత్రకారులు ఎస్వీ రామారావుగారు వూర్లోనే వున్నారని ఆయనతో ప్రదర్శన ఉదయం పదిన్నరకు ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. . ఆరోజు వుదయం ఆరుగంటలకు మాకు ఎప్పుడూ వచ్చే డ్రైవర్ని విజయవాడ వెళ్ళాలని రమ్మన్నాము.తీరా అతనికి అర్జంట్ గా వెళ్ళాల్సిన అవసరం వచ్చిందని వేరే డ్రైవర్ని పంపించాడు.దాంతో బయలుదేరటమే ఆలస్యం అయ్యింది. తీరా ఎనిమిది దాటింది కదాఅని దారిలోనే టిఫిన్ కూడా పూర్తిచేసుకొని బయలుదేరి తర్వాత పెట్రోల్ బంక్ కు వెళ్ళాము. పెట్రోల్ నింపాలని చెప్తే పొరపాటున డ్రైవర్ డీజిల్ నింపుతూ అప్పుడు తన పొరపాటును అబ్జర్వ్ చేసాడు.పెట్రోల్ టేంక్ లో డీజిల్ నింపకూడదట.అక్కడకు దూరంలో వున్న కారుమెకానిక్ షాపుకు డ్రైవర్,బంక్ అతనూ వెళ్ళి మెకానిక్ ని తీసుకు వచ్చి ట్యూబ్ ద్వారా డీజిల్ తీసివేసి కారు టాంక్ శుభ్రం చేసి తిరిగి పెట్రోల్ నింపి బయలు దేరేసరికే పదిన్నర అయ్యింది.మేము దివి కుమార్ గారికి ఫోన్ చేసి ఇదంతా చెప్పి చిత్ర ప్రదర్శన ప్రారంభించేయమని చెప్పాము. ఆ. డ్రైవర్ దారి కూడా సరీగా తెలియదేమో మేము విజయవాడ చేరేసరికే రెండు కావస్తుంటే దివి కుమార్ గారు హొటలు రూమ్ కే తీసుకువెళ్ళారు.అక్కడ భోజనం చేసి మధుమాలక్ష్మి కన్వెన్షన్ కు వెళ్ళాము.అక్కడ ఎస్వీ రామారావుగారితో సహా అందరూ మా కోసం ఎదురు చూస్తున్నారు. వీర్రాజుగారి పెయింటింగ్సేకాక మా ఇద్దరి పుస్తకాలు కూడా ప్రదర్శనకు పేర్చారు.పెయింటింగ్స్ చాలా బాగా స్టాండులకు అమర్చారు.అవి చూసి మాకు చాలా సంతోషం కలిగింది.సాయంత్రం వరకూ వుండి హోటల్ కు వెళ్ళిపోయాము.మర్నాడు ఉదయం తయారై తొమ్మిదింటికల్లా మధుమాలక్ష్మి కన్వెన్షన్ సెంటర్ కు వెళ్ళాము.ఆరోజు చాలా మంది మిత్రులు వచ్చారు.వనజాతాతినేని,అల్లూరి గౌరి లక్ష్మీ,చలసాని వసుమతికాక కుందుం ప్రకాశరావు మొదలైన వీర్రాజుగారి మిత్రులు కూడా వచ్చారు.జనసాహితి తరుపున సాయంత్రం ఆరుగంటలకు ఒక సభా సమావేశం ఏర్పాటు చేసారు.వీర్రాజుగారి చిత్రాలు గురించి కొందరు చిత్రకారులు ప్రసంగించారు.కొందరు ప్రముఖులు డెలిగేట్స్ గా మధుమాలక్ష్మి కన్వెన్షన్ కు వస్తున్నారని ,ఏవో కార్యక్రమాలు వున్నాయని అందుకని తర్వాత మరో మూడురోజులు చిత్ర ప్రదర్శన కొనసాగిస్తామని మధుమాలక్ష్మి నిర్వాహకులైన ఈమని శివనాగిరెడ్డిగారు అన్నారు.అంతేకాక ఒక లక్షన్నరకు అయిదు పెయింటింగ్స్ కొంటానని ,ఒక పెయింటింగ్ మాధుమాలక్ష్మికి బహుమతిగా కూడా ఇవ్వమని కోరారు.చిత్రప్రదర్శన చాలా సంతోషం కలిగించటం వలన ఒక పెయింటింగ్ శివనాగిరెడ్డిగారికి బహుమతిగా ఇచ్చేసారు.వీర్రాజుగారు కానీ అమ్మటానికి మాత్రం ఇష్టపడలేదు. మర్నాడు వసుమతిగారింటికి వెళ్ళాము. వసుమతిగారు ఎప్పటినుంచో కోరుతున్నందున ఒక చిత్రాన్ని బహుమానంగా ఆమెకు ఇచ్చారు వీర్రాజుగారు.తర్వాత మేము ప్రజాసాహితి ఆఫీసుకి వెళ్ళి రవిబాబుగారిని కలిసి,దగ్గరలోని హొటల్ లో భోజనం చేసి హైదరాబాద్ తిరిగి బయలుదేరాము. విజయవాడలో జరిగే కృష్ణారచయిత్రుల మహాసభలో ఒక చిరుసత్కారం చేస్తామని ఫోన్ చేసి ఆహ్వానించారు డా.జివి.పూర్ణచంద్ గారు. అంతేకాక మహిళలకు చెందిన వ్యాసం ఏదైనా రాసి ఇవ్వమని కోరారు.పేదవర్గాల ఆడపిల్లలు చదువులకు కలిగే అవరోధాలు మీద స్టాటిస్టిక్స్ ఆధారాలతో వ్యాసం రాసి పంపించాను.అదే సందర్భంలో జానకీ బాలకు ఒక పురస్కారం కూడా వుండటం వలన ఇద్దరం కలిసి కారులో విజయవాడ బయలుదేరాం.మా ఇద్దరికి ఒకే హొటల్ లో వసతి కల్పించారు. ఒక సమావేశంలో మండలి బుద్ధప్రసాద్ గారి చేతి మీదుగా కొన్ని పుస్తకావిష్కరణలు కూడా జరిగాయి.ఆ సందర్భంలో నా " ఇస్కూలు కతలు" పుస్తకంకూడా బుద్ధప్రసాద్ గారు ఆవిష్కరించారు.ఆయన వీర్రాజుగారి గురించి నాతో ప్రస్తావించారు. నన్ను సన్మానించినపుడు నా గురించి నాలుగు మాటలు కె.బి.లక్ష్మి మాట్లాడింది. నేను నా కార్యక్రమం అయ్యాక సభికులలో కూర్చున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి చిత్తూరులో కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నానంటూ తనను పరిచయం చేసుకుని డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు పాఠ్యాంశంగా వున్న నా కథ " మార్పు వెనుక మనిషి" చెప్తుంటాననీ వాళ్ళకు చూపించటానికంటూ నా గురించి వివరాలడిగి నాతో సెల్ఫీ దిగింది.అది నాకు ఎంతో ఆనందం కలిగించింది. ఒకసారి లేఖిని ద్వారా ఏర్పాటు చేసిన కవిసమ్మేళనానికి తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణగారిని ముఖ్య అతిథిగా పిలిచారు వాసా ప్రభావతిగారు. కవిసమ్మేళన సంధానకర్తగా నేనే వున్నాను.ఆ సభలో గంగిశెట్టిగారు వారి మాతృమూర్తి పేరిట కవితా సంపుటాలకు బహుమతి ఇవ్వాలనుకుంటున్నాననీ, కవితా సంపుటాలు పంపమని ప్రకటన సభాముఖంగా చేసారు.సాధారణంగా నేను పోటీలకు పంపను.కానీ పంపక పోవటం వలన ఎన్నో మంచి బహుమతుల్ని పోగొట్టుకుంటున్నానని చెప్పి పోటీకి అప్పట్లోనే వచ్చిన నా ఆకాశం నాదే సంపుటిని కూడా పంపించాను.

నడక దారిలో,-59

నడక దారిలో -59 ఒకసారి రామలక్ష్మి గారికి ఇచ్చినపుడు అనుకుంటా అమృతలతగారు నిర్వహించే అపురూప పురస్కారాల సభకు హాజరు అయ్యాను. వారి పేరు వచ్చే పాటనే నేపధ్యంలో వేస్తూ అతిథులను ఆహ్వానించటం గమ్మత్తుగా అనిపించింది.రెండుమూడు గంటల సభనీ ఆహ్లాద భరితంగా టీమ్ వర్క్ తో,నిబద్ధతతో, చక్కని క్రమశిక్షణతో చివరకు సభకు హాజరైన సభికుల్ని కూడా పాల్గొనేలా చేస్తూ రంగరంగ వైభవంగా సాగిన విధానం అబ్బుర పరిచింది.అంతే కాకుండా పురస్కారం పొందిన వారిపై పరిచయ వ్యాసాలతో కూర్చ అందంగా ముద్రించిన అభినందనసంచికను ఆవిష్కరించి వచ్చిన వారందరికీ అందజేసారు. అంతకు ముందు ఎన్నోసార్లు అమృతలతగారి ఆహ్వానం అందుకున్నా కూడా 'నాకు కూడా పురస్కారం ఇవ్వండి' అనే ఉద్దేశంతో ఆమె చుట్టూ తిరిగినట్లౌతుందేమోనన్న మొగమాటంతో ఎప్పుడూ వాళ్ళ సభలకు హాజరు కాలేదు. ఇంత ఆహ్లాద వాతావరణంలో జరిగిన ఈ సభ నన్ను ఆకట్టుకుంది.ఇంకెప్పుడు మిస్ కాకూడదు అనిపించింది. మాది గేటెడ్ కమ్యూనిటీ కావటం వలన అక్కడ ఎవరింట్లో పెళ్ళిళ్ళూ, పుట్టినరోజులూ వంటివి ఏవి వచ్చినా అందరూ కలిసి ముస్తాబులై సంబరంగా జరుపుకుంటారు .మా ఫ్లోరులోనే అంతకుముందు అద్దెకు ఇచ్చిన ఇంటిని ఇంటి ఓనర్ ఖాళీ చేయించి ఆ ఇంట్లోనే కొడుకు పెళ్ళి చేయాలనుకుంటున్నారని తెలిసింది. మా ఫ్లోరంతా సందడి నెలకొంది.పెళ్ళికి సంబంధించిన అన్ని కార్యక్రమాలకూ కొన్నింటికి నేను,పెళ్ళికి పల్లవి,ఆషీ వెళ్ళారు.పెళ్ళి హడావుడి తగ్గిన తర్వాత బంధువులంతా ఎక్కడివాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు.అంతవరకు ఆ ఇంటామె గురించి తెలియలేదు.ఆ యింటి ఆమె డా.సుశీలమ్మగారనీ, గుంటూరు డిగ్రీ కాలేజి ప్రిన్సిపల్ గా ఉద్యోగానంతరం పదవీవిరమణ చేసారని తెలిసింది.మా బిల్డింగ్ లో జరిగే కార్యక్రమాలలో కలుస్తున్నా చొచ్చుకు పోయే స్వభావం నాకు లేనందున అంతకన్నా పరిచయం పెరగలేదు. బిల్డింగ్ లో జరిగే గణేష్ వుత్సవాలలో,ఇతరేతర సంబరాల్లో కలిసినప్పుడు పలకరించుకునే వాళ్ళం. ఉద్యోగరీత్యా వూపిరి సలపని పనులతో, పుట్టిన దగ్గర్నుంచి అదే వూర్లో వుండటంతో బిజీగా గడిచిన జీవితం ఆమెది.తర్వాత వున్న వూరు వదిలి రావటం ఒకవంక ,స్నేహితులకూ, పిల్లలకూ దూరంగా వుండటం మరోవంకా,తెలియని పరిసరాలూ,మనుషులూ ఇంకొక వంకా సుశీల గారికి చెరువులో నుండి బయటపడిన చేపలా ఉక్కిరిబిక్కిరి అయ్యారు.ఒక్కసారిగా ఒంటరిగా అయిపోయింది.దాంతో డిప్రెషన్ లోనైనట్లుగా డల్ గా అయిపోయారు. ఆమెకు కూడా మేము రచయితలమని తెలిసి ఒకసారి ఇంటికి వచ్చి మాట్లాడారు.అప్పుడు పూర్తిగా మా గురించి తెలిసింది.మా గురించి చెప్పి ఆమెకు తెలిసిన సాహిత్య మిత్రులను కూడా మా గురించి వాకబు చేసారు.సుశీలగారి సహాధ్యాయి అయిన కవి, విమర్శకుడు పాపినేని శివశంకర్ గారు ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు గ్రహీత కావటం వలన వీర్రాజు గారికి బాగా తెలిసిన వాడే.కడియాల రామ్మోహన్ రాయ్ గారికి మా కుటుంబం పట్ల చాలా గౌరవాభిమానాలు వున్నవారు.అందులోను నా కవిత్వం అంటే ఆయనకు ఇష్టం కూడా వుంది.ఏవో సభల్లో నా కవిత గురించి ప్రస్తావించానని ఫోన్ కూడా చేసి చెప్పేవారు.ఆయన సుశీల గారికి గురువుగారు.ఇలా మా ఇద్దరికీ అభిమానులు అయిన వాళ్ళు ఉండటం వలన కావచ్చు మాకు స్నేహం సులభంగా ఏర్పడింది. అప్పటి నుండి తరుచూ ఆమె మా ఇంటికి వచ్చే వారు.నేను అప్పుడప్పుడు వెళ్ళే దాన్ని.మా మధ్య సాహిత్యం గురించి ఎన్నెన్నో కబుర్లు దొర్లేవి. ఒకసారి ఆమెచేసిన విశ్వనాథ కిన్నెరసాని పై చేసిన ఎమ్ఫిల్, ముళ్ళపూడి వెంకటరమణ సాహిత్యం పై చేసిన పీహెచ్డీ పరిశోధనా ఆమె చూపించారు.అవి చూసి "మీకు పెన్షన్ బాగానే వస్తుంది కదా మీ పరిశోధనల్ని పుస్తకంగా వేసుకోవచ్చు కదా" అని వీర్రాజు గారు అన్నారు.అది సుశీలగారిపై మంత్రంలా పని చేసింది. వీర్రాజుగారినే తన పుస్తకానికి ముఖచిత్రం వేయమని కోరారు.ఈ మధ్య చాలాకాలంగా ముఖచిత్రాలు వేయటం మానేసారు.కాని ఆమె కోరిక కాదనలేక అందులోనూ సలహా యిచ్చింది తానే కనుక చాలా రోజులకు ముఖచిత్రం వేయటానికి కూర్చున్నారు. ఆమె డల్ గావుంటూ బిల్డింగ్ లో కార్యక్రమాలకి కూడా పాలుపంచుకోకుండా ఇంటికే పరిమితం కావటంతో నాతో పాటు నేను వెళ్ళే సాహిత్య కార్యక్రమాలకు రమ్మని పిలిచే దాన్ని.ఆవిధంగా ఆమెకు జంట నగరాల్లోని రచయితలూ,రచయిత్రులూ, కవులు పరిచయం అయ్యారు. మీకు విమర్శ పట్ల మక్కువ కనుక కథలూ కవితలూ కాకపోయినా విమర్శ వ్యాసాలు రాస్తూ వుండొచ్చు కదా.మీకూ కాలక్షేపం, మనసుకు ప్రశాంతత కలుగుతుంది అనేదాన్ని.ఆమెకు అంతకుముందునుండీ సాహిత్య రచన అలవాటు వున్నా నిస్పృహలో వుండటంతో రాయటం తగ్గిపోయింది. పుస్తకాలు ప్రచురణకు నిర్ణయించుకోవడంతో ప్రూఫుల దిద్దుబాటు పనులతో తిరిగి సుశీల గారు డిప్రెషన్ మూడ్ నుండి బయటపడ్డారు. నాకు కూడా సాహిత్యం గురించి మాట్లాడుకోవడానికి ఒక స్నేహితురాలు దొరికింది. కాత్యాయనీ విద్మహే ఫోన్ చేసి పెనుగొండ లో ప్రరవే సభలకు నాకు నచ్చిన నారచన గురించి మాట్లాడటానికి రమ్మని ఆహ్వానించారు.ఇంద్రగంటి జానకీ బాలను కూడా ఆహ్వానించామని చెప్పారు.జానకీబాలా,నేనూ ప్రరవే నిర్వహించే సమావేశాలు ఎక్కడ జరిగినా జంటకవుల్లా కలిసి వెళ్ళటం ఒక ఆనవాయితీ అయిపోయింది.ఇద్దరం ఇక్కడ ట్రైను ఎక్కిన దగ్గర్నుంచి తిరిగి వచ్చేవరకూ ఎన్ని ముచ్చట్లు చెప్పుకునేవారమో .సినీమాలూ,పాటలూ, సాహిత్యం,పత్రికలూ ఇలా ఎన్నో కబుర్లు.మా ప్రపంచమే వేరుగా వుండేది.మా గురించి తెలుసు కనుక ప్రరవే వాళ్ళు మా ఇద్దరికీ ఒకే చోట వసతి కల్పించేవారు. పెనుగొండలో మొదటి రోజు రెండవ సదస్సులో ఒకే వేదికపై ఇద్దరం పాల్గొన్నాం . నాకు నచ్చిన నా రచన కార్యక్రమంలో ఇద్దరం పాల్గొన్నాం .నేను "నాకు నచ్చిన నా రచన - యుద్ధం ఒక గుండె కోత "గురించి ప్రసంగించాను. ఆ రోజు సదస్సులు అయ్యాక అందరం మసకచీకటిలోనే దగ్గరలో వున్న ఒక ఆలయానికి వెళ్ళాం.ఆలయం అంతా గాజుతో కట్టినదానిలాగా దీపకాంతి పడేసరికి రంగులీనుతూ వుంది.నా దగ్గర వున్న చిన్న ఫోన్ తోనే ఫొటోలు తీసాను.అక్కడనుండి తిరిగి వచ్చి భోజనాలు చేసి మాకు ఇచ్చిన హాస్టల్ కి బయట కూర్చొని అందరం పన్నెండు గంటల వరకూ పాటలు పాడుకున్నాము .ఒకరిద్దరు వీథినాటకం వేసారు. పన్నెండు దాటాక నేనూ,జానకీ బాలా మా రూమ్ లోకి వెళ్ళి పడుకున్నాం . మర్నాడు ఉదయం సెషన్ అయ్యాక అందరం బస్ లో పోలవరం ముంపు ప్రాంతాలను చూడటానికి ,అక్కడి ప్రజలకు సంఘీభావం తెలియజేయడానికి వెళ్ళాం.పోలవరం ముంపుప్రజలకు ప్రభుత్వం అందించిన సహాయాలు, రాయితీలు గురించి కొందరు చెప్తున్నారు.కొందరు బాధితులు దిగులు నిండిన కళ్ళతో అలాగే వున్నారు.చాలా మందితో మాట్లాడాము.నాకు అర్థమైనదేమిటంటే అక్కడ కూడా ప్రభుత్వానికి, బాధితులకూ మధ్య బాధితులనుండే కొందరు దళారీలుగా మారి తమ జీవితాల్ని బాగు చేసుకుంటున్నారు.కొందరు బాధితులు అలాగే వుండిపోయారు.కొందరు అన్ని సౌకర్యాలతో పెద్దఇళ్ళను కట్టుకుని సుఖవంతంగా వున్నారు. నాకు గల ఆసక్తి వలన అక్కడ కనిపించిన ఒక స్కూల్ కి వెళ్ళాను.బయట బోర్డు మీద ప్రభుత్వ ఉన్నత పాఠశాల అని వుంది.లోపల ఒకే మాష్టారు, చిన్నచిన్న పిల్లలూ వున్నారు.ఆయన్ని అదే విషయం అడుగుతే బోర్డు తప్పుగా రాసారు అన్నాడు కొంచెం నాపై విసుగు ప్రదర్శిస్తూ.కొన్ని బడులు సంగతి తెలిసిన దాన్ని కదా నవ్వుకున్నాను. బహుశా ప్రభుత్వం నుండి హైస్కూల్ రాయితీలు పొందుతూ నడుస్తున్న ప్రాధమిక స్కూల్ అన్నమాట.ఆ మారుమూలకి సూపర్ విజన్ కి ఎవరూ రాకుండా చూసుకుంటారనుకుంటాను.మనం కట్టే పన్నుల్లో ఎంత శాతం ఇలా దుర్వినియోగం అవుతుందో కదా. దారిలో కొందరు పిల్లలతో కూడా మాట్లాడాను.టాటా బైబై చెప్పి బయలుదేరుతున్నప్పుడు. ఒక చిన్న పిల్లాడు " మేడం మీరు మావూరిని,మమ్మల్ని దత్తత తీసుకుంటున్నారా" అన్నాడు.బహుశా అప్పుడే వచ్చిన శ్రీమంతుడు సినీమా ప్రభావం కావచ్చు.ఆ పిల్లాడి మాటలో, గొంతులో భవిష్యత్తు గురించి తొంగి చూసిన ఆశ నాలో చాలా కాలం వెంటాడింది.ఈ సందర్భాన్ని నేను " రేపటి ప్రతిధ్వని " అనే కథగా రాసాను.అది గోదావరి పత్రికలో ప్రచురితమైంది. అక్కడినుండి నేనూ జానకీ బాల తణుకు వెళ్ళే బస్ ఎక్కాము.తణుకు జానకీ బాల చిన్ననాటి వూరు.అక్కడ ఆమెని ఎన్నాళ్ళ నుండో రమ్మని ఆహ్వానిస్తున్న తెలిసిన మిత్రుని ఇంటికి వెళ్ళాము. ఆ మిత్రుడు నన్ను వూరూ,పేరూ కనుక్కున్నాక "మీదే గోత్రం" అని ప్రశ్నించాడు.నేను కొంచెం ఇబ్బంది పడ్డాను.నేను బ్రాహ్మలంకాదని చెప్పాను.అవునా అన్నాడు.తర్వాత జానకీ బాల స్నానం చేసి రావటంతో సంభాషణ మరోవైపు మరలింది.అతను కూడా రచయితే కానీ అతని సాహిత్య ధోరణి వేరు.పుస్తకాలు కూడా ఇచ్చాడు. స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యాక భోజనాలకు కూర్చున్నాం. నేను వాళ్ళపిన్నిలా వున్నానంటూ అతనిభార్య నాకు ప్రేమగా కొసరి కొసరి వడ్డించింది.కానీ నాకే అతని ప్రశ్న గుర్తు వచ్చి ఇబ్బందిగా అనిపించింది. వారి ఎదురింట్లో మాకు పడకలు ఏర్పాటు చేసారు. పక్క మీద పడుకుని మేమిద్దరం కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు జానకీబాలకి ఈ విషయం చెప్పాను."అయ్యో అవునా సారీ సుభద్రగారూ అలా జరుగుతుందని అనుకుంటే ఇక్కడికి వచ్చే ప్రోగ్రాం పెట్టే దాన్ని కాదు "అని చాలా బాధ పడ్డారు. మర్నాడు ఉదయమే తయారై అలా ఎక్కడైనా కూర్చొని కబుర్లు చెప్పుకుందామని వూర్లోకి బయలుదేరాం.కానీ ఎక్కడా మాకు అనువైన స్థలం దొరకలేదు.కాసేపు అక్కడేదో గుడి కనిపిస్తే అక్కడ కాసేపు కూర్చున్నాం.కానీ ఆ రోజు గుడిలో ఏదో ప్రత్యేక పూజలు ఉన్నట్టున్నాయి.ఒకటే జనం.అక్కడ నుండి తిరిగి వాళ్ళింటికి వెళ్ళి లగేజీ తీసుకుని జానకీ బాల చిన్ననాటి స్నేహితురాలి ఇంటికి వెళ్ళాం.వాళ్ళు ఆరోజుల్లో జమిందారీ కుటుంబమట.జానకీబాల తల్లిగారు వాళ్ళింట్లో అమ్మాయిలకు సంగీతం నేర్పేవారట.వాళ్ళు మా ఇద్దరినీ చాలా ప్రేమగా ఆహ్వానించారు.ఎప్పుడెప్పటి కబుర్లో వాళ్ళు చెప్పుకుంటుంటే వింటూ కూర్చున్నాను.తిరిగి ఆ సాయంత్రం మమ్మల్ని ట్రైనుకు ఎక్కించారు.ట్రైనులో మా కబుర్లు కొనసాగాయి. క్షేమంగా ఇద్దరం ఇంటికి తిరిగి చేరుకున్నాం. ఒకరోజు అమృతలతగారు ఫోన్ చేసి నిజామాబాద్ లోని వాళ్ళ నిర్వహణలో వున్న విజయా హైస్కూల్ టేలెంట్ షో కి గౌరవఅతిథిగా రమ్మని కోరారు. స్కూల్ లో జరిగే కార్యక్రమాలు పట్ల గల ఆసక్తితో సరే అన్నాను.మా ఆషీని కూడా తీసుకు వెళ్ళాలనుకున్నాను.ఉదయమే ఏడుగంటలకు కారు తీసుకుని అమృతలతగారి మేనకోడలు వచ్చింది.అయితే దారిలో సినీతార సంగీతని పికప్ చేసుకోవాల్సి వచ్చింది.ఆమె చాలా ఆలస్యం చేయటంతో మేము చాలా సేపు రోడ్డు మీదే వెయిట్ చేయాల్సి వచ్చింది.నాకు రాజకీయనాయకులు,సినీతారలతో పొత్తులు నచ్చవు‌.అందుచేత ఆమెతో పెద్దగా కలవలేక పోయాను.నిజామాబాద్ చేరేసరికి ఒంటిగంట దాటింది.స్కూల్లోనే భోజనం ఏర్పాటు చేసారు.నాన్ వెజ్ పదార్థాలు ఎక్కువగా పెట్టారు.నేను తిననని తెలిసి అమృతలతగారు ఇబ్బంది పడ్డారు.పరవాలేదని చెప్పి పప్పు, పెరుగులతో కానిచ్చాను.నేను తినలేదని అమృతగారు కూడా నాన్ వెజ్ తినలేదు. తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకున్నాక తయారై కార్యక్రమానికి వెళ్ళాము. విద్యార్థులు చేసే అద్భుతనృత్యాలతో కార్యక్రమం ఆద్యంతం చాలా ఆసక్తికరంగా సాగింది.అమృతలత అపురూప అవార్డులు సభ ఎంత హృద్యంగా జరుగుతుందో అలాగే ఇక్కడకూడా అమృతలతగారి డిసిప్లిన్, అభిరుచీ, పాఠశాల సిబ్బంది టీమ్ వర్క్ ప్రతీది అద్భుతంగా వ్యక్తమయ్యాయి.ఆ రాత్రి వాళ్ళింట్లోనే బస.మర్నాడు ఉదయం టిఫిన్ ల తర్వాత అపురూప దేవాలయానికి తీసుకు వెళ్ళారు.ఇంకా కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి.ఎందుకు నిర్మించారనే విషయాన్ని అమృతగారు వివరించారు. ఆ రోజు ఆర్మూర్ స్కూల్ లో కార్యక్రమం వుంది.ఉండమని అన్నారు కానీ తిరుగు ప్రయాణానికి బయలుదేరి పోయాము. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణా సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి సారథ్యంలో ప్రపంచ తెలుగు మహాసభల కోర్ కమిటీ ఏర్పాటైంది . కేవీ రమణాచారి, అయాచితం శ్రీధర్, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ, దేశపతి శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సభ్యులు.ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యవేక్షణలో 2017, డిసెంబరు 15 నుంచి 19 వరకు ఐదు రోజులపాటు హైదరాబాదులో ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగు సాంస్కృతిక వికాసంలో తెలంగాణ జాతి ఖ్యాతిని ప్రపంచానికి తెలియచేయాలనే సంకల్పంతో నిర్వహించారు. ఈ సమావేశాలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తో ముగింపు చేసారు. ఈ సభల్లో రెండు రాష్ట్రాలకు చెందిన కొందరు ప్రముఖులను సత్కరించారు.బహుశా సిథారెడ్డిగారు తెలంగాణా సాహిత్య అకాడమీ చైర్మన్ కావటం వల్ల కావచ్చు ఈ వీర్రాజుగారిని కూడా గౌరవంగా సత్కరించారు. ఒకరోజు వుదయమే కళ్యాణ్ నుండి ఫోన్ వాళ్ళమ్మ అంటే మా చిన్నక్క చనిపోయిందనే వార్త.రంజనా కొడుకుఅనురాగ్ కు నాన్నమ్మ మీద చేరిక, ప్రేమ ఎక్కువ.ఇక్కడ ఎంబీయే చదువుతున్నాడు.అందుకని అతను లేకుండా కార్యక్రమం చెయ్యటం కష్టమని,అతన్ని తీసుకుని ఫ్లైట్ లో రమ్మని కళ్యాణ్ చెప్పాడు.వెంటనే మా ఇద్దరికీ పల్లవి ఫ్లైట్ బుక్ చేసింది.ఈ లోగా అనురాగ్ హాస్టల్ నుండి వచ్చాడు.గుమ్మంలో అడుగు పెడుతూనే ఏడుపు మొదలెట్టాడు.అనురాగ్ దుఃఖాన్ని ఆపటం కష్టమైంది. చిన్నక్కతో నాకు మానసిక బంధం ఎక్కువే.ఏ కష్టమొచ్చినా,దుఃఖమొచ్చినా ఒకరితో ఒకరం పంచుకునేది మేమిద్దరమే.నాకున్న ఒకే ఒక్క రక్తసంబంధం ఆమెనే.పెద్దన్నయ్య ఉన్నాడు గానీ లేనట్టే.అంతబంధం వున్నా నా కంటి నుండి నీళ్ళు రాక పొందటం నాకే ఆశ్చర్యం అనిపించింది.బహుశా ఎన్నో మరణాలు చూడటం వల్ల కొంతకాలానికి దుఃఖానికి అతీతులం అవుతామేమో. నేనూ, అనురాగ్ ఇద్దరం ఎయిర్ పోర్ట్ కి వెళ్ళి ,వైజాగ్ చేరేసరికి పన్నెండు దాటింది.అక్కడ మిమ్మల్ని పికప్ చేసుకుని కోరుకొండ చేరేసరికి మరో గంటన్నర.అంతవరకూ అనురాగ్ ని మామూలు స్థితికి తీసుకు రావటానికి నేను ఎంతగా కబుర్లు చెబుతున్నా మౌనమునిలా వుండిపోయాడు.అక్కడకు వెళ్ళాక ఎలా పట్టుకోగలుగుతామో అని సందేహించాను. ఎట్టకేలకు ఇల్లు చేరాము.నిశ్తలంగా వున్న అక్కని చూస్తూ ఉంటే ఆమె జీవితమంతా కళ్ళముందు మెదిలింది. నాన్నగారు పోయిన అనంతరం ఆర్థిక ఇబ్బందులూ, కోటబొమ్మాళి వెళ్ళడం,అక్కడ మా మాష్టారుని ఇష్టపడటం,మేమంతా పెద్దక్క ఇంటికి చేరటం,తదనంతరం పరిస్థితులు కొంతవరకూ చక్కబడి,మాష్టారి పట్టుదలతోనూ, పెద్దక్క పూనుకోవటంతోనూ మాష్టారుతో చిన్నక్కకు వర్ణాంతర వివాహం జరగటం బంధువులంతా వాళ్ళిద్దరితోపాటూ మమ్మల్నందరిని దూరం పెట్టడం గుర్తు వచ్చింది.ఆ రోజుల్లోనే పట్టుదలగా వర్ణాంతరం చేసుకొని వారి ప్రేమను సఫలం చేసుకొని పెట్టమని ఆరేడు సంవత్సరాలు కూడా తిరగకుండానే,అక్కనీ,ఇద్దరు పసిపిల్లలనీ వదిలి హార్ట్ ఎటాక్ తో బావగారు పోయారు.ఆ పరిస్థితుల్లో బావగారు ఉద్యోగం చేసిన కోరుకొండ సైనిక్ స్కూల్ లోనే ఉద్యోగంలో చేరి ఒంటరి పోరాటంతో ఇద్దరు పిల్లలను వృద్ధిలోకి తెచ్చింది.జీవితంతో పోరాటం చేసి చిన్నక్క కొడుకూ,అనుకూలవతి ఐన కోడలుజయ ప్రేమలో సేద తీరింది.ఆమెకున్న బెంగంతా కూతురు జీవితం గురించే.నీళ్ళునిండిన కళ్ళతో ఆమెని చూడలేకపోయాను. సైనిక్ స్కూల్ లో ఉద్యోగం చేయటం వలనా,వార్డెన్ గా అంకితభావంతో పనిచేయటం వలనా,సుమారు యాభై ఏళ్ళ పాటు అక్కడే కేంపస్ లో ఉండటం వలన అందరి ప్రేమాభిమానాలు చూరగొంది.అందుకే స్టాఫ్ తో సహా అందరూ కదలి వచ్చి సైనిక లాంఛనాలుతో గాలిలోకి తుపాకులు పేల్చి గౌరవవందనంతో ఆమెకి వీడ్కోలు పలికారు.నిజానికి అందరి అభిమానాన్ని పొందటం కన్నా జీవితంలో అంతకన్నా ఏమి కావాలి. రంజన దుఃఖంతో దిగులు పడిపోయింది.ఆమెను ప్రేమగా ఆలింగనం చేసుకుని ఓదార్చాను. తల్లి భరోసాతో ధైర్యంగా గడుపుతున్న రంజనను తల్లిలా దగ్గరకు తీసుకుంది జయ. మూడురోజులు వుండి నేను తిరిగి వచ్చేసాను.దశదిన కర్మలకు పిల్లలకీ ఆషీ వెళ్ళారు. గడిచిపోయిన బంధాలు తలపోసుకుంటూ నేను .... - శీలా సుభద్రాదేవి

23, అక్టోబర్ 2025, గురువారం

నడక దారిలో -58

నడక దారిలో -58 పరీక్ష కోసం చదువుతున్నట్లుగా శ్రీదేవి రచనలు ఒకటికి రెండుసార్లు చదివి నోట్స్ తయారు చేసుకుని స్వతంత్ర బౌండ్లు కృష్ణదేవరాయ భాషా నిలయానికి తిరిగి అందజేసాను. కథానిలయంలోని కథలు గురించి వివినమూర్తిగారిని మెయిల్ ద్వారా సంప్రదించాను.ఆయన అక్కడి కథలు పీడీఎఫ్ లు పంపించారు.ముందుగా కథలకు,కవిత్వానికి సంబంధించిన నోట్స్ పూర్తి చేసుకున్నాక " కాలాతీతవ్యక్తులు" నవలను చదవటం మొదలు చిన్నప్పుడు చదివినదే అయినా ఇప్పుడు చదువుతుంటే ఎన్నో కోణాల్లో నవల విశిష్టతని గుర్తించి రాయటం మొదలు పెట్టే సరికి నవల విశ్లేషణే 40 పేజీలకు పైగా వచ్చింది.రాయటం స్పీడ్ అందుకుంది. అయితే నాకు ఈ ప్రోజెక్ట్ అప్పగించిన నాటికి అక్కిరాజు రమాపతిరావు( మంజుశ్రీ)గారు కేంద్ర సాహిత్య అకాడెమీ కన్వీనర్.నేను సబ్మిట్ చేసేనాటికి కమిటీ మారిపోయింది.ఎన్.గోపీగారు కన్వీనర్ అయ్యారు.ఇతరసభ్యులలో ఒకరుగా వీర్రాజుగారు కూడా వున్నారు.అది నన్ను కొంచెం ఇబ్బంది పెట్టింది.నేను రాసినది స్క్రూటినీకి కూడా వెళ్ళి తొందరగానే అంగీకారం అయ్యి ప్రింటింగ్ కు వెళ్ళింది. సాధారణంగా కమిటీలో వున్నవాళ్ళు సాధ్యమైనంతవరకూ అకాడమీ సభ్యులు కూడా కొన్ని ప్రోజెక్టులు తీసుకుంటారు.వీర్రాజుగారు మాత్రం కమిటీ సమావేశాలకు వెళ్ళటం తప్ప ఏవిధమైన ప్రయోజనం పొందలేదు. నాకు ఒక విషయంలో ఆయనపై చాలాకోపం కూడా వచ్చింది.ప్రతీ సభ్యుడూ జ్యూరీ సభ్యులుగా వుండటానికి ప్రతీ కేటగిరి కిందా సుమారు ముప్పై మంది పేర్లు వారి చిరునామాలతో సహా ఇవ్వాలి.నాస్నేహితులైన రచయిత్రులతో సహా తెలిసిన వారిపేర్లు రాసి ఇచ్చారు.కానీ నా పేరు రాయలేదు."మీ భార్యగా కాకుండా ఇంతకాలంగా రాస్తున్న రచయిత్రిగా నా పేరు రాయొచ్చు కదా "అని గొడవ పెట్టుకున్నాను.కానీ ఆయన నిబద్ధతకి మరి మౌనం వహించాను. అదే సమయంలో కేంద్ర సాహిత్య అకాడమీ తో కలిసి వాసా ప్రభావతిగారు లేఖిని సంస్థ ద్వారా సదస్సును నిర్వహించ తలపెట్టారు.ఆరుగురు మాత్రమే పత్ర సమర్పకులు.లేఖిని సభ్యులు ప్రసంగకర్తలుగా పేర్లు ఇచ్చారు.వాటిని కన్వీనర్ అయిన గోపిగారికి పంపుతే అందరూ ఒకే సామాజికవర్గానికి చెందినవారున్నారు.అకాడమీ నిబంధనకు కుదరదన్నారు.ప్రభావతిగారు నాకు ఫోన్ చేసి నన్ను ఒక పేపర్ ప్రజెంట్ చేయమన్నారు.వీర్రాజుగారు అకాడమీ సభ్యులు కనుక నేను ఇవ్వడానికి అంగీకరించలేదు.అప్పుడు పుట్లహేమలతని సంప్రదించారు. వందేళ్ళ కథకు వందనాలు కార్యక్రమం కోసం వీర్రాజుగారి కథను రికార్డు చేయటానికి గొల్లపూడి మారుతీరావుగారు మాయింటికి వచ్చారు. అప్పుడు మా బిల్డింగ్ లో కొందరికి వీర్రాజుగారు రచయిత అనే విషయం తెలిసింది.తర్వాత్తర్వాత నేనుకూడా రచయిత్రినని తెలిసింది కాని ఇక్కడ ఎవరికీ సాహిత్య వాసనలు లేనందునా,మేము ప్రచారం చేసుకోనందున అంతకన్నా మా గురించి తెలియదు. శ్రీదేవి మోనోగ్రాఫ్ రాసిన తర్వాత వ్యాసాలు రాయాలనే వుత్సాహం వచ్చింది.అందులోనూ వందేళ్ళ కథను వందనాలు కార్యక్రమంలో ప్రత్యేకంగా కథలను గురించి చెప్పదగిన రచయిత్రులైన జలంధర,జానకీరాణి, శివరాజు సుబ్బలక్ష్మి వాళ్ళంతా మరొకరి పరిచయం చేయటానికి వుపయోగ పడ్డారు.దాంతో 118 కథకుల్లో కేవలం 12 మంది కథయిత్రులకథలను మాత్రమే పరిచయం చేయటం నాకు బాధకలిగించింది.అరవయ్యో దశకం రచయిత్రుల స్వర్ణయుగం అనేవారు కదా.వారెవ్వరూ నవలలు తప్ప కథలు రాలేదా అని పరిశోధన చేసాను.నమ్మలేనంత ఆశ్చర్యం కలిగింది. స్వాతంత్య్రానంతరం రచయిత్రులలో బాగా రాస్తారు అనుకున్న వాళ్ళు పేర్లు జాబితా వేసుకుని నా దగ్గర కథా సంపుటాలే కాకుండా కెపి అశోక్ కుమార్ , అనిశెట్టి రజిత, కాత్యాయనీ విద్మహే , రామడుగు రాధాకృష్ణ మూర్తి గారు వంటి వారినుండి పుస్తకాలు సేకరించాను.కథానిలయంనుండి వేల కొద్ది కథలు డౌన్లోడ్ చేసుకుని.ఒకరి తర్వాత ఒకరికి తలమీద వ్యాసాలు రాయటమే కాక వివిధ పత్రికలకు పంపించగా అన్నీ ప్రచురణ కాసాగాయి. దాంతో రెట్టించిన వుత్సాసం వచ్చింది. వీర్రాజుగారు కథలూ,కవిత్వం మానేసి వ్యాసాలు రాస్తున్నందుకు 'వ్యాసాలలో పడితే మరి సృజనాత్మక సాహిత్యం రాయలేవు' అని మందలించేవారు. ఆయన మాటల్ని పట్టించుకోకుండా ' కవితలు కూడా ఇంచుమించు ప్రతీ నెలా పత్రికల్లో వస్తూనే వున్నాయిగా' అన్నాను. డిసెంబర్,జనవరి మా ఇంట్లో హడావుడి వుంటుంది.జనవరిలో సంక్రాతికి బొమ్మలకొలువు పెడతాము.నాకు చిన్నప్పటి నుంచి బొమ్మలకొలువు పెట్టటం ఇష్టం.చిన్నప్పుడు తీరని కోరిక పల్లవి పుట్టిన తర్వాత తీర్చుకో సాగాను.ఒక్కొక్కసారి ఒక థీమ్ అనుకొని ఆ థీమ్ కి అనుగుణంగా బొమ్మలు,బేక్ గ్రౌండ్ లో అలంకరణ మేమే తయారుచేసి పెడతాము.అందుచేత డిసెంబర్ నుంచి ఈ పని కొనసాగుతుంది.మా నైపుణ్యాలు న్నీ అందు లో ప్రదర్శిస్తాం. ఆ హడావుడిలో వుండగా ఒక రోజు మా మేనల్లుడు ఫోన్ చేసి వాళ్ళమ్మ కు అనారోగ్యం గా వుందని తెలియజేసాడు.వీర్రాజుగారికి చెప్తే చూడటానికి వెళ్దామన్నారు. సుమారు పది పదిహేనేళ్ళుగా మా అన్నయ్యగానీ,ఆడపడుచుగానీ మాకు కాంటాక్ట్ లో లేరు.అన్నయ్యకి చాలా కాలం క్రితం బ్రైన్ ఆపరేషన్ అవుతే స్కూల్ నుండి డైరెక్ట్ గా చూడడానికి వెళ్ళినప్పడు ఎవరో పరాయిదానిలా చూసిన అనుభవం ఇంకా మర్చిపోలేదు.కానీ రక్తసంబంధం వదిలేయలేక ప్రయాణం అయ్యాము.మాతో మా మరిది,పెద్దాడబడుచు భర్త కూడా వచ్చారు.ఆమె పరిస్థితి అంతా బాలేదు.తిరిగి వచ్చేటప్పుడు ' అవసరమైతే చెప్పు నేను సాయానికి వస్తాను' అని మేనల్లుడితో చెప్పాను. ఎప్పుడు అక్కడికి వెళ్ళవలసి వస్తుందో నని బొమ్మలకొలువు కొంచెం సింపుల్ గా పెట్టాము. సంక్రాంతి వెళ్ళిన నాలుగో రోజున సీరియస్ గా వుందని ఫోన్ వేస్తె ఓ రెండు చీరలు,డబ్బు సంచిలో వేసుకొని వాళ్ళింటికి వెళ్ళాను.ఆ రాత్రి ఆమె బాధ భరించలేక కోమాలోనే భయంకరంగా మూలుగుతుంటే శరీరం వదలటానికి ప్రాణం ఇంత కొట్టుకులాడుతుందా అని భయం వేసింది.ఇంటి ఓనరు కొడుకు పెళ్ళి వుందని ఇంట్లో ప్రాణం పోతుందేమోనని గొడవ పెట్టారు.దాంతో మర్నాడు ఉదయమే దగ్గరలోని ఓ ఆశ్రమంకి తీసుకు వెళ్ళాం. మా చిన్నన్నయ్య ఇంతకాలం తర్వాత తన మనసులోని మాటలన్నీ అతని పిల్లలు ఆపాలనుకున్నా నాతో చెప్పటం మొదలుపెట్టాడు. నేను మౌనంగా విన్నాను.మర్నాడు ఆమె పోవటంతో వీర్రాజు గారి తరపు వాళ్ళు వచ్చారు.ఆమెకు పుట్టింటి వాళ్ళే చీర పెట్టాలి మా దగ్గర వున్నదే పెట్టేయమని అన్నయ్య,అతని వియ్యంకులు అంటే వాళ్ళది వద్దని పల్లవికి ఫోన్ చేసి నాదే ఒక కొత్త చీర తీసుకురమ్మని మా చిన్నాబడుచును సాగనంపాము.ఆ పని అయ్యాక మా ఇంటికి తిరిగి వచ్చాము.అయితే ఆ తర్వాత చిన్నన్నయ్య పలఃరించటానికి ఊరుకోలేక అప్పుడప్పుడు నేను వాళ్ళింటికి వెళ్ళే దాన్ని.ఒకసారి అతను రాసిన కథలు ఫైల్ తీసుకు వచ్చి నా చేతిలో పెట్టి వాటిని డీటీపీ చేయించి కొడుకుకి ఒక కాపీ ఇచ్చి నా దగ్గర ఒకటి పెట్టుకోమని ఈ,డీటీపీ ఖర్చు ఇస్తానన్నాడు. ఇంటికి వచ్చాక చూస్తే వంద కథలు వున్నాయి.నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆర్థికంగా ఇబ్బందుల్లో వున్నా విజయనగరంలో రావిశాస్త్రి , కారా మాస్టారు,చాసోల కోవలోనే సమాజానికి దర్పణంగా వుండే మంచి కథలు రాసి , అనేకమందిని రచయితలుగా ప్రోత్సహించి ప్రచారపటాటోపం లేకుండా అనామకంగా అయిపోయాడే అని బాధ కలిగింది."విజయనగరంలో నేను రాజును ఇప్పుడు ఇక్కడ బంటును" అంటున్న చిన్నన్నయ్యను ఉన్నంతమేరకు దొరబాబులా బతికిన వాడిని ఈ నాడు ఇలా కుంగిపోయిన స్థితిలో చూడలేక పోయాను.అతనుకోరినట్లుగా కాపీలు తీయించి ఇచ్చాను. మరో రెండుమూడు ఏళ్ళకే అనేక డిప్రెషన్ లతో ఆరోగ్యం క్షీణించడంతో చిన్నన్నయ్య కూడా చనిపోయాడు. వీళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు పోవటం తెలిసాక కోరుకొండ లో వున్న చిన్నక్క కూడా బెంగ పెట్టుకున్నట్లుగా అయిపోయింది. తెలంగాణా వచ్చిన తర్వాత బతుకమ్మ సంబురాలు అంగరంగవైభవంగా జరిగాయి.ఆ సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయంలో అప్పటి వీసీ ఎస్వీ సత్యనారాయణగారు ఆ పదిరోజులూ కవిసమ్మేళనాలూ ,బతుకమ్మ ఆటలూ,పాటలతో సంబురాలు జరిపించారు. ఒకరోజు ఉదయం నాకు ఫోన్ చేసి మధ్యాహ్నం సెషన్ కవి సమ్మేళనానికి ఆత్మీయ అతిథిగా ఆహ్వానించారు.సరే అని నేను వెళ్ళాను. కవి సమ్మేళనానికి అధ్యక్షురాలు సూర్య ధనుంజయ్ పూనా,చెన్నై,ముంబై మొదలగు ప్రాంతాలనుఔడి వచ్చిన కవయిత్రులు వారు బాల్యంలో బతుకమ్మ ఎట్లా ఆడేవారో వాటిని కవిత్వంలో చెప్పారు.నేను పరిమళ ప్రస్తారం కవిత చదివాను.అందులో-- " అక్షరాల్ని ఒడిబియ్యంలా మోసుకొచ్చింది అక్షరాలా అక్కడినుండే వాటికి సాహిత్య సొబగులు అద్ది పుస్తకపళ్ళేల్ని నింపి వాయినాలు యిచ్చిందిమాత్రం ఇక్కడే మరి నేను ఎక్కడిదాన్నని అనుకోను?" అంటూ కవిత చదివాను. అధ్యక్షురాలు "మీరు హైదరాబాదీయే మేడం"అంది.ధన్యవాదాలు చెప్పి కూర్చున్నాను. మర్నాడు " ప్రవాస తెలుగు కవయిత్రుల సమ్మేళనం జరిగింది"అని వచ్చిన పేపర్ల నివేదికలో ఏ ప్రాంతం నుండి ఎవరు వచ్చారో రాస్తూ ఆంధ్రా నుంచి శీలా సుభద్రాదేవి అని నాపేరు వచ్చింది.నాకు చాలా బాధ కలిగింది.అప్పటికి నలభై అయిదేళ్ళ క్రితం ఇక్కడికి వచ్చి ఇక్కడే ఓయూ నుండి నాలుగు డిగ్రీలు పొంది పాతికేళ్ళు ఇక్కడి పేద పిల్లల బడిలో గొంతు పోయేలా చదువు చెప్పి బతుకుతున్న , ఆంధ్రాలో సూదిమొన అంతన్నా ఆస్తులు లేని నన్ను ఆంధ్ర క్రింద పరిగణించడం బాధే కలిగింది.ఇక్కడ వీళ్ళు ఆంధ్రా అన్నారు.ఆంధ్రాలో వారికి మేము ఏమి రాసారో కూడా అనేక సాహితీ సంస్థలకూ తెలియదు,సాహితీవేత్తలకూ తెలియదు.ప్రచార పటాటోపాలు ,ఆర్భాటం చేయగలిగేవాళ్ళకు పర్వాలేదు.కానీ మాలాంటి వాళ్ళం సాహిత్యం ఇలా త్రిశంకు స్వర్గంలో ఉండటమే అనుకుంటాను. మైండ్ ట్రీలో ప్రాజెక్టు మేనేజర్ గా పనిచేస్తున్న పల్లవికి ఉద్యోగం ఒత్తిడి రానురాను ఎక్కువ అయ్యింది.ఉదయం ఎనిమిది నాన్నగారికి బయలుదేరితే గచ్చిబౌలికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేసరికి తొమ్మిది అయ్యేది మళ్ళీ వచ్చాక రాత్రిపూట కాన్ఫరెన్స్ మీటింగ్ లు ఉండేవి ఆఫీసుకు వెళ్ళిరావటానికే మూడుగంటలవరకూ ప్రయాణమే అయిపోయేది.దాంతో మానసికంగా,శారీరకంగా అలసిపోయేది.బీపీ ఎక్కువ కావటం చేత మెడిటేషన్ కూడా మొదలు పెట్టాల్సి వచ్చింది.మైంట్రీ వాళ్ళు దానికి తోడూ ఇక్కడ కాకుండా అమెరికా, బెంగుళూరు,పూనా ఈ మూడింటిలో ఎక్కడైనా ఎంపిక చేసుకుంటే అక్కడే బ్రాంచ్ లో జాబ్ కి పంపుతామని అన్నారు. ఇప్పటికి పదిహేను ఏళ్ళు పనిచేసాను.ఇక పరుగులుచాలనీ, ఉద్యోగం మానేసి తనకి ఇష్టమైన వ్యాపకాలు కల్పించుకుని,ఆషీ చదువుమీద దృష్టి పెట్టుకుంటాను అని పల్లవి నిర్ణయించుకుని రిజైన్ చేసేసింది. ఒక నెలో రెండు నెలలో విశ్రాంతి తీసుకుని రామకృష్ణా మిషన్ లో జర్మన్ భాష నేర్చుకునేందుకు జాయిన్ అయింది.ఉద్యోగంలో వున్నప్పుడు ఒక సెమిష్టర్ భాష నేర్చుకుంది.అందుకని అక్కడే చేరింది. క్లాసులు సాయంత్రం 5.30 నుండి 7-30 వరకూ వుంటాయి.అందుచేత పగలు అప్పుడప్పుడు సంగీతాన్ని సాధన చేయాలనుకుంది.ఇప్పటికే నా పుస్తకాలకు ముఖచిత్రాలు పల్లవే వేస్తుంది .నాకే కాకుండా ఇంద్రగంటి జానకీ బాలగారికీ నాలుగు పుస్తకాలకు,మరొక కవికీ కూడా ముఖచిత్రాలు డిజైన్ చేయటం మొదలుపెట్టింది .ఉద్యోగం వత్తిడి లేకుండా తనకి ఇష్టమైన వ్యాపకాలతో పల్లవికి రానురాను కొంత ఆరోగ్యం కుదుట పడింది. ఒకరోజు తెలుగు విద్యార్థి మాసపత్రిక సంపాదకుడు రమణగారు వచ్చారు.వాళ్ళపత్రికకు ఏదైనా రెగ్యులర్ గా రాయమని అడిగారు.నేను రిటైర్ అయిన దగ్గర నుండి మా స్కూల్ అనుభవాలను ఏదో ఒక రూపంలో రాయాలనే ఆలోచన వుంది.సరే రాస్తానని చెప్పాను.ముందు ఒక పదో పదిహేనో ఇస్కూలు కతలు పేరిట రాయాలనుకున్నాను. కానీ రాస్తున్న కొద్దీ అనేక విషయాలు మనసులో మెదిలి రాయటం కొనసాగించాను.వాటికి మంచి స్పందన వచ్చింది.ఎక్కడెక్కడ నుంచో స్కూల్ టీచర్లు ఫోన్లు చేసేవారు.కొంతమంది వాళ్ళు విద్యార్థులతో మాట్లాడించేవారు.నాకు భలే సంతోషం కలిగించేది.ఈ ఇస్కూలూ కథలు రెండున్నర ఏళ్ళ పాటు తెలుగు విద్యార్థి మాసపత్రికలో ధారావాహికంగా ప్రచురితమయ్యాయి. ఇంకా రాస్తూ వుంటుండగానే మహారాష్ట్ర పాఠ్య ప్రణాళిక కమిటీ నుండి ఫోన్ వచ్చింది.మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో రెండవ భాష తెలుగు పాఠ్యాంశంగా నేను రాసిన ఇస్కూలు కథల్లోని " ఒకే తాను ముక్కలం" కథని ఎంపిక చేసుకున్నట్లు అంగీకారం కోరారు.మరో రాష్ట్రంలో విద్యార్థులు నా కథని పాఠంగా చదువుతారు అంటే అంతకన్నా ఆనందం ఇంకేముంది? ఆ కథలకు వచ్చిన గుర్తింపు వలన ఇస్కూలు కతలు ముఫ్ఫై కథలు పూర్తికాగానే ఉపాధ్యాయ రచయిత అయిన గంటేడ గౌరు నాయుడు గారి ముందు మాటతో ఉపాధ్యాయుడే అయిన చిన్నన్నయ్యకు అంకితం ఇస్తూ పుస్తకంగా వేసుకున్నాను. వీర్రాజుగారు నా రచనలమీద ప్రముఖులు రాసిన మంచి వ్యాసాలు వున్నాయనీ వాటిని పుస్తకం రూపంలో తెస్తే బాగుంటుందని ఆలోచన చేసారు.వాటినన్నింటిని తీసీ క్రమపద్దతిలో చేస్తున్నప్పుడు ఒక కవి వచ్చారు.ఆయనతో ఆ వ్యాసాలు చూపించి పుస్తకంగా వేయాలనుకుంటున్నట్లు చెప్పారు.ఇంతవరకూ కవయిత్రుల సమీక్షావ్యాసాలసంకలనం రాలేదని ఆయన అభినందనలు తెలియజేశారు.కానీ ఇంకా నా పుస్తకం డీటీపీ అవుతుండగానే మరొకరిది ఆఘమేఘాల మీద అటువంటి పుస్తకం వెలువడటానికి కారణం కూడా తెలిసి మానవ స్వభావం గురించి వీర్రాజు గారూ నేనూ అనుకున్నాము. అక్క కూతురు రంజనావాళ్ళూ అబ్బాయి అనురాగ్ ని హైదరాబాద్ లోని లో ఎంబిఎ లో జాయిన్ చేయటానికి వచ్చారు.కాలేజీ హాస్టల్ లో చేర్చారు.సెలవుల్లో మా ఇంటికి వచ్చేవాడు.అన్నరాకతో ఆషీకి సందడి వచ్చింది.ఎప్పుడైనా సెలవురోజున వేస్తే అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ హొటల్ కో సినీమాలో వెళ్ళేవారు అనురాగ్ అలా ఇంట్లో తాత గారూ,అమ్మమ్మా అని తిరుగుతుంటే మాకూ సందడిగా అనిపించేది పుస్తక ప్రదర్శనలో ఇంద్రగంటి జానకీబాలగారి "నవలా ద్వయం "పుస్తకాన్ని,నా రచనలపై సమీక్షలు సంకలనం " గీటురాయి పై అక్షరదర్శనం"లను ప్రమదాక్షరి స్టాల్ లో ఆవిష్కరణ జరిగింది.శ్రీకాంతశర్మగారూ, వీర్రాజు గారూ,జగన్నాథ శర్మగారూ పాల్గొన్నారు.అదే సందర్భంలో జగన్నాథశర్మ "నవ్యకి ఓ మంచికథరాయకూడదూ" అన్నారు. అదే మాటతో మొదలుపెట్టి "నిజానికీ అబద్ధానికీ మధ్య" కథ రాసి నవ్యకి పంపించగా ప్రచురించారు.

నడక దారిలో -57

నడక దారిలో -57 కాకినాడ నుంచి వచ్చాక విశేషాలన్నీ వీర్రాజు గారికి చెప్పి శ్రీదేవి మోనోగ్రాఫ్ రాయటానికి ఏ నిర్ణయించుకున్నట్లు చెప్పాను. కాత్యాయని విద్మహే తన దగ్గర వున్న ఉరుములూ- మెరుపులు సంపుటి జిరాక్స్ కాపీ, కొంత సమాచారం పంపించారు. ఈ విషయం రామడుగు రాధాకృష్ణ మూర్తి గారికి చెప్పాను. శ్రీకృష్ణదేవరాయ గ్రంథాలయంలో తెలిసిన అతను వున్నాడు ఈ అక్కడకు వెళ్ళి చూద్దాం అన్నారు.సరేనని శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం కి వెళ్ళాను.రాధాకృష్ణమూర్తిగారు కూడా వచ్చారు. అక్కడ తెలుగు స్వతంత్రలు ఎక్కడ వుంటాయో తెలుసుకుని పాత పత్రికల అల్మారాలు చూపించారు. అక్కడ అంతా దుమ్ము కొట్టుకుని వున్నాయి.ఆ అల్మారాలు వెతుకుతుంటే పది పన్నెండు తెలుగు స్వతంత్రపత్రికలు కలిపిన బౌండు పుస్తకాలు వున్నాయి.అటువంటి బౌండ్లు ఒకపదిపదిహేను వరకూ వున్నాయి.అయితే అప్పట్లో కెమేరా ఫోన్లు లేవు.అవి జిరాక్స్ చేయించడానికి వీలుగానూ లేవు. వాటిని ఇంటికి ఇవ్వటానికి కుదరదు.అన్నారు.నాకు ఏంచెయ్యాలో తోచలేదు.దిగులుగా రాధాకృష్ణ మూర్తి గారి వైపు చూసాను.ఆయన అర్థం చేసుకుని భాషానిలయం ఇంఛార్జి ఎమ్.వి.ఎల్. నరసింహామూర్తిగారితో మాట్లాడి పూచీకత్తు మీద సాధ్యమైనంత త్వరగా అవి తిరిగి జాగ్రత్తగా అప్పగించేలా ఉత్తరం రాసి నేనూ,అయినా సంతకాలు పెట్టి ఇచ్చాము. నా అదృష్టం కొద్దీ పుస్తకాలు బౌండ్లు ఇచ్చారు.అవన్నీ సంచులలొ వేసుకొని ఆటోలో ఇంటికి వచ్చాను.అవి చూసి వీర్రాజు గారు ఆశ్చర్యపోయారు. ఆ పుస్తకాలను తొందరగా ఇచ్చేయవలసి వుంది కనుక వాటిలోని శ్రీదేవి రచనలు ఎన్ని వున్నాయో నోట్ చేసుకున్నాను.ఒక్కొక్క బౌండులో శ్రీదేవి కథ, వ్యాసం చదివి కథాంశం,కథలోని విశేషాంశాలు,పాత్రలు వీటి గురించి వివరంగా నోట్స్ రాసుకున్నాను. తెలుగు స్వతంత్రలలో ధారావాహికంగా వచ్చిన శ్రీదేవి రాసిన మధుకలశమ్ దీర్ఘ కావ్యం నన్ను అబ్బుర పరచింది.ఆమె రాసిన కాలాతీతవ్యక్తులు నవల తప్ప ఇంకే రచనా గురించీ ఎవరూ చెప్పలేదు. వీర్రాజుగారి సంపాదకత్వంలో అరవైలలో ఏరినపూలు పేరుతో ఒక సంకలనం తీసుకువచ్చారు.అందులో ఒక కథ దొరికింది‌.నేను వందమంది కవయిత్రుల సంకలనం" ముద్ర" తీసుకు వచ్చినప్పుడు శ్రీదేవి కవితలను అక్కయ్య పంపింది.అవి తెలుసు.ఇప్పుడు ఈ పుస్తకాలు వెతుకుతుంటే 20 కథలు,20కవితలు ,వ్యాసాలూ కూడా దొరికాయి‌.నాకు భలే ఉత్సాహం కలిగింది.పరీక్షలకీ ప్రిపేరయ్యే విద్యార్ధినిలా పూర్తి సమయాన్ని ఈ నోట్స్ తయారు చేయటంలో కేటాయించాను. ఆ సమయంలోనే మధుకలశమ్ ని పుస్తకంగా వేయాలనే ఆలోచన మాకు వచ్చి జిరాక్స్ చేయటం కుదరదు కనుక దానిని కాపీ చెయ్యమని వీర్రాజుగారిని కోరగా ఆయన అదంతా ఒక పుస్తకంలో కాపీ చేసి ఇచ్చారు. కవితా ఖండికలు నేనే కాపీ చేసాను.అందుకని కవిత్వం నోట్స్ తర్వాత రాసుకోవచ్చని ఊరుకున్నాను. ముందుగా కథలన్నింటికీ, సాహిత్య వ్యాసాలకు మాత్రమే నోట్స్ రాసాను.ఇవేకాక గోరాశాస్త్రి రాసిన నడుస్తున్న చరిత్ర పేరిట రాజకీయ వ్యాసాల్ని ఆసక్తి కొద్దీ చదివాను.ఆవీ బాగున్నాయి.మరొక విశేషం తెలుగు స్వతంత్రల్లో అక్కయ్య కథలు కూడా చాలా దొరికాయి.వాటినికూడా కాపీ రాసుకున్నాను.అంతకుముందు అక్కయ్యవి అంతకు ముందు రెండు కథలు సంపుటాలు వచ్చాయి.వాటిలో చేర్చని కథలు కూడా పుస్తకంగా వేయాలనే ఆలోచన వచ్చింది.ఆ విధంగానే ఆ కథలను తర్వాత " నాకుగాదులు లేవు" పేరిట అక్కయ్యకు నివాళిగా సంపుటిని ప్రచురించాము. ఆ సందర్భంలోనే నాకు బాగా నచ్చిన శ్రీదేవి పెద్దకథ వాళ్ళు పాడిన భూపాలరాగం కథమీదే ప్రత్యేకంగా ఒక వ్యాసం రాసాను.ఆ వ్యాసం సారంగపత్రికలో ప్రచురితమైంది. శ్రీదేవి జీవితం గురించి ఏ వివరాలు తెలియవు .అక్కయ్య వున్నట్లైతే కొంత రాయగలిగేదాన్ని.మామయ్యని అడిగాను కానీ పెద్ద వయసు వల్ల ఏమి గుర్తు లేదన్నాడు.శ్రీదేవికి స్నేహితురాలైన నాయని కృష్ణకుమారిగారు కూడా లేరు. కె.రామలక్ష్మికూడా మద్రాసులో తెలుగు స్వతంత్రకు కొంతకాలం ఉపసంపాదకత్వం వహించారు కనుక ఏమైనా చెప్పగలరేమో అని ఆమె దగ్గరకు ఒకసారి వెళ్ళి అడిగాను." నన్ను అడుగుతే నెగిటివ్ గానే చెప్తాను.మరి చెప్పమంటావా"అన్నారు.వద్దులెండి అని మాట మార్చేసాను. ఇక ఆ తర్వాత నాకు తెలిసినంతవరకూ శ్రీదేవి జీవితం గురించి రాసి తర్వాత ఆమె రచనల ఆధారంగా ఆమె స్వభావం,వ్యక్తిత్వాన్ని చిత్రించాలని నిర్ణయించుకున్నాను. వీర్రాజుగారు తాను వేసిన చిత్రాలను ఎక్కడైనా ప్రదర్శనకు పెట్టాలని అభిలషించారు.ముందు మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీ లో అనుకున్నారు కానీ అంతదూరం రోజూ వెళ్ళటం కష్టం అనుకున్నారు. ఆఖరుకు రవీంద్రభారతి ఆవరణలోనే వున్న కళాభవన్ లో నిర్ణయించారు.జనవరి 24 ( 2013)న బి.ఎ.రెడ్డి గారితో శీలా వీర్రాజు చిత్రకళా ప్రదర్శన ప్రారంభోత్సవం చేయించారు.జనసాహితి మిత్రులు ఈ కార్యక్రమంలో చాలా సహకారం అందించారు.జనసాహితి మిత్రుడు రాజూ ముందుగా వచ్చి అక్కడ కూర్చునేవారు.నాలుగింటికి మేమంతా వెళ్ళి తొమ్మిది వరకూ వుండేవాళ్ళం.అయిదు రోజుల పాటూ జరిగిన చిత్రప్రదర్శనకు చాలా మంచి స్పందన వచ్చింది.ఆ సందర్భంలో వీర్రాజుగారి పెయింటింగ్స్ పుస్తకాలు కూడా కొన్ని అమ్మకం కావటం సంతోషం కలిగించింది.వీర్రాజుగారికి తాను వేసిన చిత్రాలకు వచ్చిన స్పందన చాలా సంతృప్తి కలిగించింది. ఆ సమయంలోనే ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు ఒకేసారి రెండు సంవత్సరాలకు ప్రకటించి,అవార్డు సభ కూడా జరిగింది.నేను అప్పుడే కొత్తగా ఫేస్బుక్ అకౌంట్ తెరిచాను.ఒకరోజు ఫేస్బుక్ లో ఒక కవి పెట్టిన పోస్ట్ కనిపించింది. "ఫ్రీవర్స్ ఫ్రంట్ కి ఆంధ్రా ఫ్రీవర్స్ ఫ్రంట్ అని పేరు మార్చుకుంటే సరిపోతుంది."అని రాసి ఒక ఏడెనిమిది మంది తెలంగాణా కవుల పేర్లు రాసి వీళ్ళకు అవార్డు తీసుకునే అర్హత లేదా అని ప్రశ్నసంధించాడు. అది చదివేసరికి చాలా చికాకు వచ్చింది.అతను రాసిన పేర్లలో ఒకరిద్దరికి ముఫ్ఫైనలభైఏళ్ళక్రితమే ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు వచ్చింది.ఆయన రాసిన జాబితాలో ఇంచుమించుగా అందరూ ఫ్రీవర్స్ ఫ్రంట్ అందుకున్నవారే.ఒకరికి మాత్రమే అనుకుంటాను ఈ అవార్డు రాలేదు.తెలిసీ తెలియకుండా నిందమోపుతూ రాయటం మాకు కోపం వచ్చింది. వీర్రాజు గారు చెప్పిన వివరాలతో ఆయన గోడమీదే ఘాటుగా స్పందించాను.దాంతో ఆ పోస్ట్ ను తీసివేసాడు ఆయన.నిజానికి ఒక ఆంధ్రాకవి కవిత్వం మీద ఆయనే పుస్తకాలు రాసాడు. ఈ రకమైన విద్వేషాల వలన సాహిత్యం సార్వజనీనం అనేది పొరపాటేమో అనే సందేహం నాకు కలిగింది.ఎక్కడో విదేశీ కవులను,ఇతర భారతీయ సాహితీవేత్తలను గూర్చి గొప్పగా మాట్లాడేవాళ్ళు మరో ప్రాంతం తెలుగు కవిని ద్వేషించటంలో అర్థం లేదనిపిస్తుంది. ఆరోజు ఫిబ్రవరి 21(2013)వతేదీ పల్లవి ఆఫీసునుండి బయలుదేరి గంట దాటింది.ఇంకా రాలేదు.ఆ సమయంలో కోణార్క్ థియేటర్ ఎదురుగా ఉన్న ఆనంద్ టిఫిన్స్‌ ప్రాంతంలో ఒకటి రెండవ బాంబు వెంకటాద్రి థియేటర్ , దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ ప్రాంతంలో మరొకటి బాంబు పేలుళ్ళు జరిగాయని టీవీలో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది.మాకు భయం వేసింది.పల్లవికి వెంటనే ఫోన్ చేసాను.సరిగ్గా ప్రేలుడు జరిగిన పది పదిహేను నిముషాలకే పల్లవి ఎక్కిన బస్ ఆ ప్రాంతాన్ని దాటిందట.ఏమిటొ అంతా గందరగోళంగా వుంది బస్ ఆపకుండా దాటేసాడు అని అంది. మరో అరగంటకి ఇంటికి చేరింది.మేము గాఢంగా వూపిరి తీసుకున్నాము.పెద్ద ప్రమాదం తప్పింది. హైదరాబాద్ పోలీసుల చెప్పినదాని ప్రకారం , బాంబులను సైకిళ్లపై ఉంచారనీ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజెస్ (IEDలు) ఉపయోగించారని అన్నారు. ఈ ప్రమాదంలో 18 మంది పైగా మరణించగా అందులో నలుగురు వరకూ విద్యార్థులే నట. ఆ ప్రాంతంలో చాలా స్టూడెంట్ హాస్టల్స్ వున్నాయి.చాలామంది గాయపడ్డారని తెలిసింది. కొంతకాలం వరకూ హైదరాబాద్ అంతా భయంతో వణికి పోయింది.చాలాకాలం వరకూ ఆ ప్రభావం జన జీవనంలో కనిపించింది. వీర్రాజుగారు కుందుర్తి సత్యమూర్తికి అంకితంగా " ఒక అసంబద్ధనిజం "అనే కవితా సంపుటి ప్రచురించుకొన్నారు.వీర్రాజుగారి డెబ్భై అయిదవ పుట్టినరోజు పురస్కరించుకుని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేసారు.వేదికమీద సాహితి వేత్తలు లేకుండా ప్రత్యేకంగా జరిగింది.కవితాసంపుటిని చిన్ననాటి స్నేహితుడు కుందుం ప్రకాశరావుగారితో ఆవిష్కరింపజేసారు.చెక్కుచెదరని అరవై ఏళ్ళ స్నేహాన్ని ప్రకటించుకుంటూ మిత్రులు రామడుగు రాధాకృష్ణ మూర్తిగారికి,మల్లేష్ కు, బాలాజీ ప్రెస్ బాల ప్రసాద్ కు పదిహేను వేల నగదు ,వస్త్రాలతో గౌరవించారు.కవితాసంపుటి అంకితం కుందుర్తి సత్యమూర్తిగారి శ్రీమతి కుందుర్తి శాంతకు అందజేసారు.తర్వాత ఆవిష్కృతసంపుటిలో నుండి కొన్ని కవితలు వీర్రాజుగారు చదివారు.వినూత్నంగా జరిగిన ఆ సమావేశానికి చాలామంది కవులు,రచయితలూ హాజరయ్యారు. ఆ విధంగా వీర్రాజు గారి డెబ్భై అయిదవ పుట్టినరోజు ,యాభై ఎనిమిదేళ్ళ సాహిత్య జీవన సందర్భం విజయవంతంగా జరిగింది. దశాబ్దాల తెలంగాణా పోరాటం సాకారమైంది. 2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించగా,లోక్సభలో ఎన్నో నాటకీయ పరిణామాలు అనంతరం 2014 జూన్ 2వ తేదీన దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణా రాష్ట్రం నూతనంగా అవతరించింది.రాష్ట్రం అంతటా పండుగ వాతావరణం నెలకొంది.దేశస్వాతంత్రంవచ్చిన నాటికి నేను పుట్టలేదు.ఆంధ్రరాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికి చిన్నదాన్ని. సుదీర్ఘ పోరాట ఫలితంగా రాష్ట్రం సాధించుకోవటాన్ని ఈ నాడు చూసాను. పోనీలే తెలంగాణ వారు కోరుకుంటున్నట్లు రాష్ట్రం ఏర్పడింది.ఇంక వైషమ్యాలు ,ద్వేషాలు తగ్గుతాయి.ఎవరి రాష్ట్రం వాళ్ళకు వచ్చింది. అనుకున్నాం . జనరల్ ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో గెలిచినవి రెండే పార్టీలు.విభజన ప్రక్రియలో భాగస్వామ్యం వున్న కాంగ్రెస్ ,బీజేపీలను మట్టిగరిపించారు. దాంతో కాంగ్రెస్ పెద్దలు కండువాలు మార్చేసారు. తెలంగాణాలో 119 సీట్లకు63 సీట్లవిజయం సాధించి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది.ప్రతిపక్షపార్టీగా కాంగ్రెస్ నిలిచింది.టిడీపీ15 సీట్లతో మూడో స్థానం లో నిలిచింది.బీజేపి, వైకాపా, కమ్యూనిస్టు పార్టీల నుండి కూడా బాగానే గెలిచారు. కానీ తర్వాత్తర్వాత ఒకరొకరే ఆపరేషన్ ఆకర్ష్ లో సమిధలై అధికార పార్టీలోకి దూకేసారు. 15వ లోక్‌సభ ఎన్నికలు 2014 మే 31న పూర్తి చేసి మే 16న ఫలితాలు ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ (BJP) 282 సీట్లను గెలుచుకోగా, (NDA) మొత్తం 336 సీట్లను గెలుచుకుంది. 1984 తర్వాత ఒక పార్టీ ఇతర పార్టీల మద్దతు లేకుండా పరిపాలించడానికి తగినంత సీట్లు గెలుచుకోవడం ఇదే మొదటిసారి.కాంగ్రెస్ కేవలం 44 సీట్లను మాత్రమే గెలుచుకుంది, ఆవిధంగా మిగులుఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు, తెలంగాణా రాష్ట్రానికి కేసీఆర్ తొలి ముఖ్యమంత్రులుగా,ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ తొలిసారి ప్రమాణస్వీకారం జరిగింది. ఒకరోజు హైమవతీ భీమన్న గారి నుండి వీర్రాజు గారికి ఫోను వచ్చింది. " పద్మభూషణ్ బోయి భీమన్న సాహితీ పురస్కారానికి వీర్రాజుగారిని ఎంపిక చేసినట్లు చెప్పారు. సెప్టెంబర్ 19వ తేదీన తెలుగు విశ్వవిద్యాలయంలోని బోయి భీమన్న సాహితీ పీఠం ఆధ్వర్యంలో జరిగే భీమన్న 104వ జయంతి ఉత్సవంలో డాక్టర్ సి.నారాయణరెడ్డికి బోయి భీమన్న జీవన సాఫల్య పురస్కారం క్రింద రెండు లక్షలూ, పద్య కవితా పురస్కారానికి రసరాజు, గేయ కవితకు గూడ అంజయ్య, వచన కవితకు శీలా వీర్రాజు, నాటకానికి పాటిబండ్ల ఆనందరావు, కథ,నవలకు కేశవరెడ్డి, అనువాదానికి నలిమెల భాస్కర్, ఉత్తమ రచయిత్రి పురస్కారానికి పి. సత్యవతి లకు లక్ష రూపాయలు చొప్పున అందజేసారు‌. వీర్రాజుగారి సంతోషానికి అవధులు లేవు.తొలిసారి బహుమతిగా లక్ష అందుకోవటం అంటే మాటలు కాదు కదా. తర్వాత దగ్గరలోనే చలసాని వసుమతిగారి అవార్డు కూడా వీర్రాజు గారికి వచ్చింది.కారులో అందరం బయలుదేరాం.మంచిహొటల్లో మాకోసం రెండు రూములు బుక్ చేసారు.ఆ రోజు సాయంత్రమే సభ.వీర్రాజుగారితో పాటూ విహారిగారికి కూడా మరో ఏడాదికి ఇచ్చారు.పురస్కారసమావేశం,భోజనాలు పూర్తై వచ్చేసరికి ఆలస్యం అయ్యింది.వచ్చి పడుకున్నాం.మర్నాడు విజయవాడ పరిసరాలు చూసేందుకు బయలుదేరాం.దుర్గగుడికి ముందు వెళ్ళాం.చాలా రెష్ గా వుంది .నేనూ,పిల్లలూ లోపలికి వెళ్ళాం.వీర్రాజుగారు లోపలికి రాలేదు.దారిలో భోంచేసి మంగళగిరి, అమరావతి వెళ్ళాము.దారిలో తుళ్ళూరు,తాడేపల్లి మొదలైన తోవలలో చేలల్లో నిలువెత్తు కంకులతో పైర్లను చూసి కారును ఆపించి ఫొటోలు తీసుకున్నాము.ఎప్పుడూ అలా చేలూ, పైర్లు చూడలేదేమో ఆ పచ్చదనానికి సరదాపడి మైమరచిపోయాము. ఇక ఆ మర్నాడు వసుమతి గారి ఇంటికి వెళ్ళి అక్కడే భోజనం చేసి హైదరాబాద్ కి తిరుగుముఖం పట్టాము. ఇంటికి చేరిన మరురోజు వార్తలు వింటున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తుళ్ళూరు,అమరావతి ప్రాంతాన్ని నిర్ణయించినట్లు చెప్పేసరికి నిన్న ఆ ప్రాంతాల్లోనే తిరిగాము కదా అని థ్రిల్లింగ్ గా అనుకున్నాము. మళ్ళా అనుకోకుండా దగ్గరలోనే ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్ గారు తమ సంస్థ ద్వారా బాపురమణల పురస్కారం వీర్రాజుగారికి ఇవ్వాలనుకుంటున్నామని ఆహ్వానించారు. ఈ సారి నేనూ, వీర్రాజు గారు విజయవాడ వరకూ ట్రైన్లో వెళ్ళాము.స్టేషనుకు గుత్తికొండ సుబ్బారావుగారు వచ్చి కారులో మచిలిపట్నం వాళ్ళింటికి తీసుకు వెళ్ళారు‌.సాయంత్రం ఉయ్యూరు సభా సమావేశానికి తీసుకు వెళ్ళారు.దుర్గాప్రసాద్ గారు చాలా ఆత్మీయంగా సత్కరించారు.దుర్గాప్రసాద్ గారికి మా పుస్తకాలు ఇచ్చాము. ఆశ్చర్యకరంగా కొన్ని రోజులకే దుర్గాప్రసాద్ గారు మా పుస్తకాలపై సుదీర్ఘ విశ్లేషణలు రాసి వారి బ్లాగ్ లో పోస్ట్ చేసారు. మర్నాడు సుబ్బారావు గారు మమ్మల్ని పరిసర ప్రాంతాలైన ఘంటశాల, శ్రీకాకుళం తీసుకు వెళ్ళి అన్ని చూపించారు. అనంతరం సాయంత్రం ట్రైనుకు మమ్మల్ని తిరుగు ప్రయాణానికి స్టేషన్లో బండి ఎక్కించారు.