11, సెప్టెంబర్ 2026, శుక్రవారం

నడక దారిలో -68

నడక దారిలో -68 నిడదవోలు మాలతి మోనోగ్రాఫ్ డీటీపీ కూడా పూర్తి చేసాను.అనల్ప బలరాంగారికి పి.శ్రీదేవి కథల్ని " వాళ్ళు పాడిన భూపాలరాగం "పేరుతో పి.శ్రీదేవి కథల్నీ,"మథుకలశమ్" పేరుతో ఆమె కవితల్నీ సంపాదక బాధ్యత వహించాను.ఆ పరిచయంతో నిడదవోలు మాలతి మోనోగ్రాఫ్ ని వాళ్ళ బేనర్ పై ప్రచురిస్తారా అని అడుగుతే తప్పక ప్రచురిస్తానని అన్నారు.అయితే మరికొన్ని ప్రచురణలలో బిజీగా వున్నానని అవి అయిపోయాక చేస్తానన్నారు.ఆ పుస్తకానికి పల్లవి చేతే ముఖచిత్రం వేయించుతానని కూడా చెప్పాను.బలరాం సరేనన్నారు.మాలతి రచనలో విశాఖమాండలిక సొబగులే కాక విశాఖసంపంగి పరిమళాలు మనసుని తాకుతూనే వుంటాయని ముఖచిత్రంగా సంపెంగలతోనే డిజైన్ చెయ్యమని పల్లవితో చెప్పాను. ఆకాశవాణిలో పనిచేసే అయినంపూడి శ్రీలక్ష్మి తెలుగు విశ్వవిద్యాలయంలో డెప్యుటేషన్ లో డెప్యూటీ డైరెక్టర్ గా వచ్చింది.ఆమె అక్షరయాన్ అనే మహిళా రచయితల సంస్థని నిర్వహిస్తూ గత కొంతకాలంగా ఏవో వివిధ కార్యక్రమాలు చేస్తూనే వుంది.ఈ సారి తెలుగు విశ్వవిద్యాలయం సహకారంతో డెభ్భై ఏళ్ళ వయసు దాటిన రచయిత్రుల వివరాలు సేకరించి అందులో ఒక ముప్పై మందికి మాతృ వందనం పేరిట సత్కారం చేసే కార్యక్రమానికి పూనుకుంది. అందులో శారదా శ్రీనివాసన్, శారదా అశోక వర్ధన్,డి.కామేశ్వరి,హైమవతీ భీమన్న, అనంతలక్ష్మి,పోల్కంపల్లి శాంతా దేవి, ఇంద్రగంటి జానకీ బాల మొదలైన ముప్పై మందిలో నేను కూడా వున్నాను. ఎండలు బాగా వుండటంతో వీర్రాజు గారిని ఆ కార్యక్రమానికి రావొద్దని చెప్పి నేనూ పల్లవీ వెళ్ళాము.శ్రీలక్ష్మి రంగరంగవైభవంగా ఒక పండుగ వాతావరణాన్ని తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణానికి తీసుకువచ్చింది.చీర,శాలువా,పళ్ళు,దండలతో ఘనంగా మమ్మల్నందరినీ వైస్ ఛాన్సలర్ చేతులమీదుగా సత్కారకార్యక్రమం నిర్వహించింది.తర్వాత విందుభోజనం ఏర్పాటు కూడా వుంది.అన్నీ అయ్యేసరికి మూడు దాటింది.ఆ సందర్భంగా మరో విషయం కూడా శ్రీలక్ష్మి వెల్లడించింది.ఈ మాతృ వందనం స్వీకరించిన వారినందరినీ వారివారి సౌలభ్యాన్ననుసరించి విశ్వవిద్యాలయం మీడియా థియేటర్లో రచయిత్రుల సాహితీ జీవితాన్ని ముఖాముఖిగా రికార్డు చేస్తామని చెప్పింది .అది చాలా మంచి ప్రయత్నం . చాలామంది పాతతరం రచయిత్రులకు ఇటువంటి అవకాశాలు లేకపోవటం వలన వారిగురించి ఏమీ తెలియని పరిస్థితి ఏర్పడింది. ‌ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విషయాలు విని వీర్రాజుగారు కూడా చాలా సంతోషించారు. రాజమండ్రి దామెర్ల రామారావు చిత్రకళా పరిషత్ లో వీర్రాజు గారి పెయింటింగ్స్ అమర్చటం పూర్తి అయ్యిందని ప్రారంభోత్సవానికి తేదీ నిర్ణయించినట్లు రవిప్రకాష్ ఫోన్ చేసాడు. మేము వెళ్ళటం ఎట్లా అని ఆలోచించాను.ట్రైన్,ఫ్లైట్ అన్నింటిలో ఏదైతే వీర్రాజు గారు ప్రయాణం చేయగలరు అని తర్జనభర్జన చేసాము.ఆయనకి ప్రయాణంలో దారిప్రక్కల చుట్టూ చూసుకుంటూ రాజమండ్రి వెళ్ళాలని వుందని ఒకసారి అన్నారు.అంతేకాక ఇంతవరకూ పాపికొండలు చూడలేదు లాంచిలో వెళ్ళాలనే కోరిక ఎప్పుడో చెప్పింది గుర్తువచ్చి కారులో వెళ్ళాలని నిశ్చయించాం.ఒకసారి కారులో సంగారెడ్డి వెళ్ళి వచ్చాక ఆయనకి అంతసేపు కారులో ప్రయాణం చేయగలననే ధైర్యం వచ్చింది. మార్చి 12 న వుదయమే ఆరు గంటలకి నలుగురం కారులో రాజమండ్రికి బయలుదేరాం.డ్రైవర్ అరుణ్ తో మరీ స్పీడ్ గా కాకుండా నడుపమని చెప్పాము.దారిలో సూర్యాపేటలో టిఫిన్లకని ఆగాము.అరుణ్ దారిలో వీర్రాజుగారిని అవసరమైనపుడు వాష్ రూమ్ కి సహాయం చేసాడు. మధ్యాహ్నం భోజనానికి మరోసారి ఆగి ప్రయాణం కొనసాగించాము.దారిలో కనిపించిన వూర్ల గురించి ప్రత్యేకతలు గురించి వీర్రాజుగారు కబుర్లు చెప్పారు.సాయంత్రం నాలుగింటికల్లా రాజమండ్రి చేరాము. గణేష్ రాం గారు BRK హొటల్ లో రెండు రూములు బుక్ చేసారు.సాయంత్రం రవిప్రకాష్, గణేష్ రాం వాళ్ళూ వచ్చారు.ఆ హొటల్ లో డార్మటరీ లేదంటే గణేష్ రాం వాళ్ళ పెంట్ హౌస్ లో డ్రైవర్ వుంటాడు పర్వాలేదని భరోసా ఇచ్చారు.రాత్రికి పెరుగన్నం హొటల్ నుండి తెప్పించుకుని తిని తొందరగా నిద్ర పోయాము. మర్నాడు ఉదయం పల్లవీ ఆషీ తయారై టిఫిన్ కోసం దగ్గరలో హొటల్స్ చూస్తామని వెళ్ళి వాళ్ళు అక్కడే తినేసి మాకోసం పాక్ చేయించి తీసుకు వచ్చారు. పదింటికి గ్యాలరీకి బయలుదేరి వెళ్ళాము. వాడ్రేవు చిన వీరభద్రుడు గారితో పాటు ఆయన సోదరి వీరలక్ష్మి,వసుధారాణీ వచ్చారు.శ్రీరామ్ పుప్పాల,ఇంద్ర,ఎస్.ఆర్.పృథ్వి మొదలగు స్థానిక రచయితలు వచ్చారు.ప్రభుత్వంలో సాంస్కృతిక శాఖకు చెందిన వాసిరెడ్డి పద్మ వచ్చారు. గ్యాలరీలో వీర్రాజుగారి పెయింటింగ్స్ అమర్చిన విధానం చూసి వీర్రాజుగారే కాదు మేము కూడా సంబరపడ్డాము.వీర్రాజుగారు చిత్రలేఖనం మెళకువలు నేర్చిన చోట,ఆయనకు అత్యంత ప్రియమైన గోదావరీ తీరాన వాటినన్నింటినీ చేర్చటం మంచిపనే చేసామని తృప్తి చెందాము.ఈ ప్రాంత ప్రజలకు,చిత్రకళాభిమానులకు వీర్రాజుగారి పెయింటింగ్స్ అంకితం చేస్తున్నామని మా కుటుంబం సభ్యులం అంతా సంతోషించాము. విజయనగరం నుండి కళ్యాణ్,జయ,వాళ్ళక్క శాంత,బావగారూ కూడా వచ్చారు. గ్యాలరీ ప్రారంభోత్సవం చేసిన వాడ్రేవు చిన వీరభద్రుడుగారు వీర్రాజుగారితో గల పరిచయాన్ని ఆత్మీయంగా తన ప్రసంగంలో చెప్పారు.వీర్రాజుగారు భావోద్వేగం వలన కొంత ,మరపువలన కొంత తడబడుతూ మాట్లాడారు.నా ప్రసంగంలో వీర్రాజుగారు ఒక మౌనమునిలా ధ్యానముద్రలో రోజుకు ఏడెనిమిది గంటలు కూర్చొని చిత్రాలు వేయటాన్ని గుర్తు తెచ్చుకుంటూ, చిత్రాలు పంపించటంతో బోసిపోయిన అల్మారాలు చిన్నబోయాయని చెప్తూ కంటనీరు పెట్టుకున్నాను. మొత్తంమీద గ్యాలరీలో వీర్రాజుగారి పెయింటింగ్స్ అంకితోత్సవం వైభవంగా జరిగింది.వీర్రాజుగారు ఆనందభరితులయ్యారు.భోజనానంతరం రూమ్ కి వెళ్ళి విశ్రాంతి తీసుకుని గోదావరి తీరానికి వెళ్ళి గోదావరి హారతి కార్యక్రమం చూసాము.సంధ్యాసమయంలో తైలవర్ణచిత్రంలా రంగులీనుతోన్న గోదావరి ఉపరితలాన్ని వీర్రాజుగారే కాక మేమంతా కళ్ళ నిండుగా చూసి ఆనందించాము. నేను రాజమండ్రి బయలుదేరటానికి ముందే డి.సుజాతాదేవి కూతురు కమలకి ఫోన్ చేసి మా కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించాను.సుజాతను చూడటానికి వస్తానని చెప్పాను.సాయంత్రం కమలకి ఫోన్ చేసి ఇంటి అడ్రస్ అడుగుతే తామే వస్తామని చెప్పింది .అలాగే కమల వాళ్లమ్మ సుజాతని మేమున్న హోటలుకు తీసుకువచ్చింది.సుజాత బాగా చిక్కిపోయింది.కానీ నన్ను బాగానే గుర్తుపట్టి మాట్లాడింది. కాని మధ్య మధ్యలో మౌనంలోకి జారిపోవటం చూసి నేను దిగులు పడ్డాను. కమల కూతురు గురించి కమలని అడుగుతే కూతురూ, అల్లుడూ ఇక్కడే వున్నారని కమల చెప్తుంటే.సుజాత కల్పించుకుని" మనవరాలికి సంబంధం కుదిరింది.పెళ్ళి చేయాలి " అంది.అంటే ఆ అమ్మాయికి పెళ్ళి జరిగిపోయిందనేది కూడా గుర్తులేక మాట్లాడుతోందని అర్థమై సుజాతను చూస్తుంటే దుఃఖం వచ్చింది.అదే నేను సుజాతను ఆఖరు సారి చూడటం అవుతుందని అప్పుడు వూహించలేదు . మర్నాడు పాపికొండలు ప్రయాణం పెట్టుకున్నాము.మాతో గణేష్ రాం దంపతులను కూడా ఆహ్వానించాము.డ్రైవర్ అరుణ్ మాతో పాటూనే వున్నాడు.చిన్న బల్లకట్టుమీదుగా లాంఛ్ లోకి వీర్రాజుగారిని ఎక్కించడానికి అరుణే సహాయం చేసాడు. లాంచ్ లో ఎంటర్టైన్మెంట్ కోసం ప్రోగ్రాం నిర్వహించారు.కానీ రెండర్థల పాటలు పిచ్చిగెంతులూ చికాకు అనిపించినా వీర్రాజు గారు గోదావరీ వీక్షణంలో మునిగిపోయి నన్నూ,ఆషీనీ తనకి నచ్చిన దృశ్యాల్ని ఫొటోలు తీయమని అడిగి తీయించారు.మొత్తంమీద పాపికొండల ప్రయాణం విజయవంతంగా పూర్తి చేసాము. మర్నాడు గణేష్ రాం పెద్ద కారు అరేంజ్ చేసాడు దానిలో రాజమండ్రి పరిసరప్రదేశాలు చూడటానికి వెళ్ళాం. మధ్యాహ్నం వరకు చూసిన తర్వాత గణేష్ రాం శాంతి వర్ధన్ వికలాంగుల ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు.మానసిక వికలాంగులైన పిల్లలు వాళ్ళు చేసిన కాగితం గులాబీలు మాకు అందించి నమస్సులు చెప్పారు.ఒక్కసారిగా మనసంతా ఒక కుదుపు వచ్చినట్లుగా దుఃఖంతో పచ్చిముద్దలా అయింది.కళ్ళు చెమ్మగిల్లాయి. అక్కడే భోజనం ఏర్పాటు చేసారు.తిన్న తర్వాత మళ్ళా దగ్గరలో సూర్యదేవాలయం వుందంటే అది చూసి హొటల్ కు బయలుదేరాము.గణేష్ రాం వాళ్ళింటికి భోజనానికి పిలిచాడు .కానీ పిల్లలను పంపించి మేము ఎప్పట్లాగే పెరుగన్నం తెప్పించుకొని తిన్నాము . ఆ రాత్రి పడుకున్నాం కానీ ఇద్దరికీ నిద్ర రాలేదు.అకస్మాత్తుగా వీర్రాజుగారు నా గుండెల్లో తలదూర్చి వెక్కివెక్కి ఏడవటం మొదలెట్టారు.నేను గాభరా పడి ఏమిటని అడిగితే ఆ మానసిక వికలాంగులను చూస్తే మన బాబు గుర్తు వచ్చాడని ఏడుస్తూనే అన్నారు . అంతవరకూ వుగ్గబెట్టుకున్న నేనుకూడా దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను. కాసేపు అయ్యాక వీర్రాజుగారు ఆ ఆశ్రమానికి ఉపయోగపడేలా ఒక లక్షన్నర ఇద్దాం అన్నారు.నేనూ అదే అనుకున్నానని అంగీకారం తెలిపాను.ఆ తర్వాత వీర్రాజుగారు పడుకున్నా చాలా సేపు నాకు నిద్ర పట్టలేదు.బాబు బతికుంటే ఈ పాటికి నలభై ఏళ్ళు దాటి వుండేవి.ఆ వయసు మానసిక వికలాంగుడైన పిల్లాడిని సాకగలిగి వుండగలిగేదాన్నా? నిజానికి అలా జరిగి వుంటే నాలోకి నేను ముడుచుకు పోయి ఏమైపోయేదాన్ని.నన్నూ,నా కలల్ని సాకారం చేసుకోమనే బాబు మా జీవితాల నుండి నిష్క్రమించాడా? ఆలోచించి ఆలోచించి అలసిపోయి నిద్రలోకి జారుకున్నాను. మర్నాడు బ్రేక్ ఫాస్ట్ కి గణేష్ రాం ఇంటికి వెళ్ళాము. దగ్గరలోనే వీర్రాజుగారి బాల్య మిత్రుడు చింతపంటి అప్పారావు యిల్లు.అతను బెడ్ రిడన్ అని తెలిసి వెళ్ళి చూసి వద్దామని అన్నారు.బెడ్రిడన్ అంటే ఏ పరిస్థితుల్లో వున్నాడో? వీర్రాజు గారు తట్టుకోగలరో లేదో అని వెళ్ళటానికి భయపడ్డాను.కానీ వీర్రాజుగారు ఇంతవరకూ వచ్చి చూడటానికి వెళ్ళకపోతే ఎలా అని పట్టుపట్టే సరికి వెళ్ళాము.అప్పారావుగారు బాగానే వున్నారు.నన్నూ, పల్లవినీ గుర్తుపట్టి చక్కగా పలకరించారు.కాసేపు మిత్రులు మాట్లాడుకున్నాక బయల్దేరాము. గణేష్ రాం గారి తోటలో పండిన పళ్ళు,కాయలతో కారు డిక్కీ నిండిపోయింది.దారిలో తినటానికి దబ్బకాయ పులిహోర, జున్ను,పెరుగుగారెలు లలిత ఇచ్చింది.దారిలో తినగా ఇంటికి వెళ్ళాక డిన్నర్ కి కూడా అవే సరిపోయాయి.క్షేమంగా మా ప్రయాణం జరిగింది. నాలుగు రోజులకు కళ్యాణ్ విశాలాంధ్ర పేపర్లో చిన్నాన్న గారి పెయింటింగ్స్ గ్యాలరీలో ప్రారంభం గురించి రాసిన వ్యాసం అని పేపర్ కటింగ్ పంపించాడు." గుండె గ్యాలరీలో శీలావీ చిత్రాలు" అనే ఆర్టికల్ వీర్రాజుగారికి చదివి వినిపించాను.చక్రవాకం కాలమ్ లో ముక్కామల చక్రధర్ అనే ఆయన రాసినది.బాగా రాసాడని వీర్రాజుగారు సంబరపడ్డారు.రామోజీమీద పుస్తకం రాసినది అతనేనేమో అన్నారు.ముక్కామల చక్రధర్ పేరు క్రింద ఫోన్ నెంబర్ వుంటే ఫోన్ చేసాను. రామోజీ మీద రాసిన అతను వేరే అని తెలిసింది.ఇతను విశాలాంధ్రలో ప్రతి శనివారం చక్రవాకం పేరుతో కాలమ్ రాస్తానని చెప్పారు.అప్పటినుండీ ముక్కామల చక్రధర్ ఫోన్లో కాంటాక్ట్ లోనే వుండటం, విశాలాంధ్రలో ప్రతీ శనివారం చక్రవాకం కాలమ్ పంపుతుంటే క్రమం తప్పకుండా చదువుతూనే వున్నాను. రాజమండ్రి నుంచి వచ్చిన దగ్గర నుంచి చిన్ననాటి మిత్రుడు సత్యనారాయణను చూడటానికి వెళ్దామని పదేపదే అనటం మొదలు పెట్టారు.వేసవి ఎండలు ముదురుతున్నాయి.సత్యనారాయణ వుండేది ప్రగతి రిసార్ట్ లో కట్టించిన ఇంట్లో.సత్యనారాయణ గత ఆరేడు నెలలుగా తీవ్రఅనారోగ్యం వలన తరుచూ హాస్పిటల్ కీ,ఇంటికీ మధ్య తిరుగుతూ వున్నాడు.తరుచూ స్నేహితులు ఇద్దరూ వీడియో కాల్ ద్వారా మాట్లాడు వుంటూనే వున్నారు.అందుకని ఎండలు తగ్గిన తర్వాత వెళ్దామని నేను సర్ది చెప్పి బోయాను.కానీ వీర్రాజుగారు మొండిపట్టు పట్టారు. ఒకరోజు ధర్మేంద్రకు ఫోన్ చేసి వాళ్ళ నాన్న ఇంట్లోవున్నారా,హాస్పిటల్ లో వున్నారో కనుక్కుని మేము వస్తామని ఫోన్ చేసాను.ఇంట్లోనే వున్నారని తెలిసి నేనూ, వీర్రాజుగారూ ప్రగతి గార్డెన్స్ లో వున్న ధర్మేంద్ర ఇంటికి వీర్రాజుగారి బాల్య మిత్రుడు సత్యనారాయణని చూడటానికి వెళ్ళాము.చాలా సన్నగా అయిపోయి వీల్ ఛైర్ లోనే వున్నాడు. సత్యనారాయణ భార్యా హైమా, ధర్మేంద్ర ఆయన అనారోగ్యం గురించి చెప్తుంటే నాకూ, వీర్రాజు గారికీ కూడా మనసంతా బాధతో నిండిపోయింది.కొంతసేపు కబర్లు అవీ అయ్యాక " వీర్రాజూ మెర్సీ కిల్లింగ్ కు ఎలా సంప్రదించాలో కనుక్కుని చెప్తావా "అని సత్యనారాయణ అనేసరికి వీర్రాజుగారూ,నేనూ దిగ్భ్రమతో అలానే వుండిపోయాము.రెండు నిముషాలకీ నేనే తేరుకుని " అదేం మాటలండీ.శరీరం అన్నాక ఏవో అనారోగ్యాలు వస్తూనేవుంటాయి.అలాంటి నిర్ణయాలు మనసులోకి రానీకండీ"అని సీరియస్ గా అన్నాను.వీర్రాజుగారు కూడ నా మాటలను బలపరుస్తూ సత్యనారాయణ ను సముదాయించారు."ఇలాగేనండీ పదేపదే అంటూ ఆయన బాధపడి మమ్మల్ని బాధిస్తున్నారు" అంది హైమ. " లేదు వీర్రాజు ఎక్కడికక్కడ శరీరంమీద వివిధ చికిత్సల కోసం ట్యూబులు పెట్టి ఇంజెక్షన్లతో ఒళ్ళంతా చిల్లులు పొడి చేస్తున్నారు.భరించలేకపోతున్నాను"అంటూ నిస్పృహతో మాట్లాడారు.హైమకూడ ఇలాగే నిస్పృహతో మాటిమాటికీ అంటున్నారని బాధ పడింది. మరో రెండుగంటలు అక్కడే ధైర్యం చెబుతూ గడిపి వీడ్కోలు చెప్పి ఇంటికి తిరిగి వచ్చాము.సత్యనారాయణ కోడలూ,మనవరాళ్ళూ తాతా నాన్నమ్మలతో అంటీముట్టనట్లు వుండటం గమనించాము.ఇంటికి వచ్చాక కూడా సత్యనారాయణ ,హైమాల జీవన పరిస్థితుల గురించి తలుచుకుంటూ బెంగ పడ్డాము. - శీలా సుభద్రాదేవి

ప్రసాద మూర్తి - సగంపిట్ట కథలు

~ సౌజన్య(ప్రసాద)మూర్తి పలవరింతే " సగంపిట్ట"కథలు~ "జీవిత తత్వాన్నీ దాని కీలకాల్నీ అర్థంచేసుకున్న ఆలోచనాపరుడి కథలివి. ఈ దుర్మార్గ సమాజంలో కుల, మత, లింగ, వర్గ భేదాలతో ముక్కలై గ్లోబలీకరించబడిన ఈనాటి జీవితంలో ఒక్కొక్క బతుకు ముక్క ఒక్కొక్క రూపంలో కనిపించే వాస్తవాన్ని బలంగా పట్టుకున్న కథలివి. జీవితాన్ని ముందుకు నడిపించే చైతన్యాన్ని నిరాడంబరంగా వ్యక్తీకరించిన కథలివి." అంటారు ప్రసాద మూర్తి కథలసంపుటి ' సగంపిట్ట'ముందుమాట లో-జి. లక్ష్మీనరసయ్యగారు. కవిత్వంలో వస్తువేదైనా దానికి అనుగుణమైన భావాన్ని అద్భుతంగా పొదగగల నైపుణ్యం, చదువరులకు హత్తుకునేలా సమకాలీన సమస్యలనూ కవితామయం చెయ్యగల కవిగానే ఇన్నాళ్ళూ ప్రసాదమూర్తి కనిపించారు. తన చిన్నప్పటి ఊరు గురించి రాసినా,కురిసిన వాన గురించి రాసినా పసివాడిలా పలవరిస్తాడు.తర్వాత రోజుల్లో నివసించిన నగరజీవితం అతడిలోని సున్నితత్వాన్ని,భావుకత్వాన్నీ, సౌకుమార్యాన్ని కబళించలేదు అనేది అతడి ప్రతి కవితలోనూ సుస్పష్టమౌతూనే వుంటుంది. ప్రసాద మూర్తికి సమాజం వేరు కవిత్వం వేరు కాదు. కవితా దృష్టి, సామాజిక చైతన్యం రెండూ ఒకదానిలో ఒకటి అంతర్లీనంగా సాగేదే అతని కవిత్వం. ఇలా ఇంతకాలం ఒక కలనేత కవిగానే చూసి,పూలండోయ్ పూలు అంటూ అందించిన అతని బుట్టెడు కవిత్వ పరిమళాల్నీ హత్తుకున్నాను,దాంతో బాటూ కంటిచూపుకి తగిలి చురుక్కుమనిపించిన ఘాటైన పొగలకీ వుక్కిరి బిక్కిరి అయ్యాను. సగంపిట్ట మా లైబ్రరీలోకి వచ్చి ఎప్పుడు దూరిందో కానీ ఇటీవలే నా చేతిలో వాలింది‌.ఇదేమిటండీ బాబూ సగం పిట్ట కాదు మనల్ని పూర్తి పిట్టల్ని చేసి ప్రకృతి ఆవరణాల్లోకో, సమాజం మూలాల్లోకో ,లేకుంటే మనలోకి మనల్నో నెట్టేసి ఆలోచనల్ని,మనజీవితాల్నీ తడుముకునేలా చేసేస్తాడు ఈ రచయిత. అందుకే "పూర్తి పిట్ట రాసిన కథలివి. మరందుకే " ప్రకృతిపట్ల అపారప్రేమతో, ఘనీభవించిన మానవుడిపట్ల తీవ్రనిరసనతో, కవి హృదయంలో మొలకెత్తిన ఈ కథలు చదువరుల గుండెల్లో పుష్పిస్తాయి. భుజాన చెయ్యెయ్యడంతో ప్రారంభమై ధడేల్ ధడేల్మని మన తలుపుల్ని తెరిచి కానీ వదలవు. సరళంగా సూటిగా స్నేహభాషణలా సాగే కథనం- మరచిపోయిన మనలోపలి ప్రాంతంలో మనల్ని సుకుమారంగా వొదిలేసి వీడ్కోలు తీసుకుంటుంది" రమణజీవి అన్నారనుకుంటాను. మొదటి కథ అనామక మరణం చదివేటప్పటికే గుండె పట్టేస్తుంది.నిజమే ప్రతీ మనిషిలోనూ ఒక అనామకుడు దాగే వుంటాడు.ప్రతీరోజూ పసిపిల్లలను రక్తసిక్తల్ని చేస్తున్నవార్తలో,యుద్ధాలలో అమాయకపసిప్రాణాల్ని , గర్భస్థ శిశువుల్ని బలిగొన్న వార్తల్నో, గోధ్రా సంఘటనల్ని కడుపులో పేగుల్ని నులిమేసే వార్తల్నో వింటూనే వుంటాం.అల్జిమీర్స్ వచ్చిన వాళ్ళలా మర్చిపోవటానికి ప్రయత్నాలు చేస్తాం.మర్చిపోలేం మనలోని మనిషి మరణిస్తే తప్ప .అదెప్పుడు జరుగుతుంది ఈద్వైదీ భావాన్నే ప్రసాద మూర్తి తనకథలో రచయిత రాయాలనుకున్న కథలో అద్భుతంగా చిత్రించిన కథ అది. ప్రపంచంలో జరిగే ప్రతీ విషయాన్నీ, తనకు సంబంధించిన దానిగా తనలో ఆవాహన చేసుకుని మానవీయ సంబంధాల్లోంచే చూసే సౌజన్యమూర్తి ప్రసాదమూర్తి.మనిషి సంఘజీవి అని నమ్మిన కథకుడు సమాజంలో జరుగుతోన్న దుర్ఘటనలకు కదిలిపోతాడు.నిజానికి ఈ కథ దీర్ఘ కవిత్వంలా సాగుతుంది పల్లెలో పనుల్లేక నగరబాట పట్టిన "బంగారమ్మ" చాలాకాలానికి సంక్రాంతి పండుగకి పల్లెటూరికి వస్తుంది.తమ అరెకరం పొలాన్ని కళ్ళారా చూసుకోవాలని బయలుదేరిన బంగారమ్మతో పాఠకులు కూడా నడుస్తారు.దారిపొడవునా కలలో నడుస్తున్నట్లు నడుస్తూ గతాన్ని పునశ్చరణ చేసుకుంటున్న బంగారమ్మతో బాటూ పాఠకులూ ఆ దృశ్యాల్ని కలగంటారు.తన అరెకరం పొలంకోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ చేపలు చెరువులోనే అదృశ్యమై మర్నాడు పైకి తేలిన బంగారమ్మ కథగా చెప్పినా పైకి తేలని బతుకులెన్నో ఆ పంక్తులలో పాఠకులకు దర్శనమిస్తాయి.ప్రకృతినిప్రేమించే భావుకుడైన ప్రసాద మూర్తి ప్రతీ వాక్యాన్ని హృదయభాషలో రాసాడనిపిస్తుంది. చేపలూ,రొయ్యల్తో పసరెక్కిపోయి చెరువులైపోయిన పొలాల్నీ ,చేపల కోసం వస్తున్న పిట్టల్ని తరమటానికి పేల్చే తుపాకి శబ్దాల్ని పాఠకులూ వింటారు. పల్లెల్లో సైతం గడ్డిలేక ఎండిపోతోన్న పశువులకు గడ్డి ,చెరువులు లేక మంచినీళ్ళనూ బయటనుండి కొనుక్కొని రావాల్సిన దుస్థితి , విధ్వంసం అయిపోతున్న పల్లెల ముఖచిత్రాన్ని ఈ కథలోని పంక్తులు దృశ్యీకరణచేస్తాయి. పరుగులు తీస్తున్న కాలంతో పాటూ పరుగులు తీస్తున్న మనిషికి పక్కనే వున్నవారిని పట్టించుకునే తీరికాలేదు.మనసూ లేదు.తన చుట్టూ తానే పరిథులు గీసుకుని బతుకుతున్న మనుషుల మధ్య గోడలు పెరిగిపోతున్నాయి.ఆ దృశ్యమే ఈ " పక్కన కూర్చున్న వ్యక్తి" కథ రైల్వే స్టేషన్ లో ఓ మూల రెండు ముసలిబొమ్మలు ఎడమచేతుల్ని చాచి వుండటం కథకుడు ప్రతీరోజూ గమనిస్తాడు.ఆ చాచిన చేతులు అందుకొని పిల్లలు తమని తీసుకు వెళ్తారనేమో అనుకుంటాడు.వాళ్ళకు కొంత డబ్బు సేకరించి ఇచ్చి భరోసా కల్పించాలనుకుంటాడు. కథకుడు నివసించే కమ్యూనిటీలో రామారావు దంపతులు పిల్లల ఫోన్ కాల్స్ కోసం అడుక్కుంటూ ఉన్న ముసలి బొమ్మలు,సుందరం దంపతులు పిల్లల నుంచి కాసింత సమయాన్ని అడుక్కుంటూ ఉన్న ముసలి బొమ్మలు.ఇబ్బడి ముబ్బడిగా డబ్బు వున్నా ఏటిఎమ్ కు పోయి డబ్బు తెచ్చుకోలేని ఎన్నో ముసలి బొమ్మలు.ఇవన్నీ చదువుతుంటే దేశమే ఒక వృద్ధాశ్రమంగా మారిన దుస్థితి గుర్తుకువస్తుంది.అఃదర్నీ సంప్రదించి డబ్బు సేకరించి స్టేషన్లో ముసలిబొమ్మలకీ ఇవ్వాలనే తమ వుద్దేశ్యం చెప్పకుండా వాళ్ళు చూసేందుకు చాలా ముసలి బొమ్మలు రాబోతున్నాయని చెప్పేసరికి స్టేషన్ లోని ముసలి బొమ్మలు తమకు స్థాన భ్రంశం చేస్తారేమోనని ముందే వెళ్ళిపోతారు.అనేకవిధాలుగా ఒంటరివృద్ధాప్యాన్ని రచయిత కవితాత్మకంగా చెప్పాడు. ఆంధ్రా తెలంగాణ విభజన నేపధ్యంలోని కథ జన్మభూమి.ఏ ప్రాంతమైనా దోచుకునేవారు ఎవరైనా దోపిడికి గురైన వారు మాత్రం ఎప్పుడూ ప్రజలే.అందుకే ఒకప్పుడు వలస పక్షుల రాకతో ప్రత్యేకత కలిగిన కొల్లేరు సరస్సు ఈ నాడు నామరూపాలు లేకుండా విధ్వంసానికి గురైంది.వివక్షలూ అలాగే వూరి చివరనే యథాతథంగా వుండిపోతూనే వున్నాయి. వందరెక్కలు వున్నా సరే స్త్రీ తనకు తానుగా ఎగిరిపోవాలనే ఆలోచనే రాకుండా పిల్లలూ,కుటుంబం,బాధ్యతలూ ఆ రెక్కల కిందనే భద్రంగా దాచుకుంటూనే వుంటుంది.మనసు గాయపడినప్పుడో ,ఒంటరిగా మిగిలిపోయినప్పుడో ఒక్కొక్క రెక్కే విరుచుకోవాలనుకుంటుంది. కాలాతీతవ్యక్తులు నవలలో ఇందిర "రెక్కలున్నాయనుకొని ఎగరడానికి ప్రయత్నించుతాం. రెక్కలు లేవు మనకు. ఉన్నా అవి తడిసిపోయాయి. నా రెక్కల్ని బీదరికం తడిపేసింది. నీ రెక్కల్ని మితిమీరిన డబ్బు తడిపేసింది."అంటుంది. ఈ కథలో కూడా ఎగిరిపోతుందేమోనని అనుమానంతో అమ్మకు ఒకతోడుకోసం సహకరించాలనుకున్న పిల్లలకు "ఒకసారి పెళ్ళిచేసుకుని అనుభవించిన దానిని,మళ్ళా ఆ రొంపిలో వెళ్ళాలనుకోవటంలేదు." అంటుంది.స్త్రీ దృష్టి కోణంలో స్త్రీ మనసులోని ఆలోచనలను ఒడిసిపట్టి రాసిన కథ" వందరెక్కల స్త్రీ" బసమ్మ చెవిపోగులే కాదు చెమటతో తడిచిన తాళిబొట్లని సైతం కుదువ పెట్టుకొని బడుగు వర్గాల స్త్రీ పురుషుల జీవితాల్ని మత్తులో ముంచేసే కల్లు కాంపౌండ్ లకు అదుపు ఎక్కడ. గుజరాత్ లో మతకల్లోలపు మారణహోమం సాగిన రోజులవి. గోద్రా రైలు దుర్ఘటన తర్వాత గుజరాత్ లో జరిగిన హింసాత్మక అల్లర్లు కుటుంబంతో "రైలు ప్రయాణం " చేస్తున్న కథకుడికి ఒక్కటొక్కటే గుర్తుకు రావడం ప్రారంభమైంది. చెప్పులూ, సామానేకాదు పిల్లల్ని ఎత్తుకుపోవడంలో ఎత్తుకు పైఎత్తులు వేసేవాళ్ళకి రైలుబళ్ళు నిలయాలు. కంటిమీద కునుకు పట్టని కథకుడికి ఆ పెట్టిలోకి ఎక్కిన ముస్లిం యువజంటని చూసేసరికి ఉగ్రవాదులేమోనని గుండె దడదడ లాడుతుంది.చివరికి ఏమీ జరగకుండా ప్రయాణం పూర్తి అవుతుంది. కుల,మత,జెండర్, ప్రాంతీయ వివక్షలతో పక్కనే వున్న వ్యక్తిని అనుమానిస్తూ భయపడేలా చేసినది ఈ వ్యవస్థే అనే ఎరుక కలిగించేకథ ఇది. ఇలా ప్రసాద మూర్తి రాసిన కథలన్నింటిలో కొన్నిచోట్ల పేరాలకు పేరాలు కవితాత్మకంగా పాఠకుల్ని ఆకట్టుకుంటాయి.కవి సున్నిత హృదయం ప్రతీ కథలోనూ కనిపిస్తుంది. మానవ తప్పిదాలు వలన విధ్వంసం అయిపోతున్న ప్రకృతి దృశ్యాలు,,అనేక విధాలుగా మానవ స్వార్థంతోనే కాలుష్యభరితమైపోతోన్న పర్యావరణం,దాంతో బాటుగా మారిపోతున్న జీవనవిధానాలూ,తప్పని పరిస్థితుల్లో యాంత్రికంగా మారుతోన్న మనిషిని చూసి ఆవేదన చెందుతాడు.ఏమీ చేయలేని అసహాయత తో ఆక్రోశం చెందుతాడు.సమాజంలో పసిపిల్లల మీదా,స్త్రీలమీదా జరుగుతోన్న లైంగిక దాడులకు తల్లడిల్లుతాడు,జాతిమత వివక్షలకు బలి అయిపోతోన్న అసహాయులను చూసి కుంగిపోతాడు. ఇదిగో ఇవన్నింటినీ దృశ్యాలు దృశ్యాలుగా చిత్రించి ఈ కథలన్నింటా పేర్చాడు.ఇవన్నీ చూస్తూ కూడా మనం పరిధులు చుట్టుకుని అల్జిమీర్స్ వచ్చిన వారిలా ఏంకానట్టుగా మర్చిపోయి ఎలా బతకగల్గుతున్నామని వాపోతాడు రచయిత. మరి అందుకే పాఠకులు కూడా ఒక్కొక్క కథా చదువుతూ ఇంకా మనం మనుషులుగానే వున్నామా అని అనుమానపడతారు. పూలండోయ్ పూలు లో మనుషులంతా పూలైపోవాలని కలవరించిన రచయిత కనుకే సువర్ణ గన్నేరు పూలు లాంటి కథ రాయగల్గాడు.ప్రకృతి ఏదీ తిరిగి ఆశించదనే సత్యాన్ని అన్వేషించినవాడై చెట్టే చేతులు పట్టుకొని తీసుకెళ్ళినట్లుగా అనాథాశ్రమంలో ప్రవేశిస్తాడు.ఫాల్గుణమాసంమొదలైందంటే ఆ దంపతులు గుండెల్లోను పూలువిచ్చుకున్న చప్పుళ్ళు వినబడతాయి. కథలన్నింటా కథకుడు ఎలా కలవరించాడో చదివిన తర్వాత వెంటాడుతోన్న ఈ కథలన్నీ ఛానెల్స్ లోను,వార్తా పత్రికలలోనూ తిరిగి తిరిగి కనబడుతోంటే పాఠకులు కూడా కొండలు గుట్టలు అడవులు ధ్వంసం చేసి కట్టిన హై రేంజ్ అంతస్థులలోని కృత్రిమ వనాల్లో పూర్తి పిట్టలై ఎగరలేక సగంపిట్టలై పలవరిస్తారు,తమ అసహాయతకు సిగ్గు పడతారు.మానవ సంబంధాల్నీ, మనిషి బ్రతుకునీ ఉన్నతీకరించడంపై కథకుడికి గల అమితమైన శ్రద్ధ వలనే పూలతోనో,చేలతోనో, చెట్లతోనో,పిట్టలతోనో మనిషికి పాఠం చెప్పిస్తాడు. చాలా వరకూ ఉత్తమ పురుషలోనే రాసిన " సగం పిట్ట "కథలు ప్రసాదమూర్తి సాత్వికుడైన కవి కావటం వలన కావచ్చు సున్నితంగా,సరళమైన శైలిలోనే రాసినా నిజానికి ఆ పాఠాలు పాఠకుల హృదయాలను కూడా పట్టి కుదుపుతాయి. - శీలా సుభద్రాదేవి సృజనక క్రాంతి

26, ఆగస్టు 2026, బుధవారం

నవతరాల మేథోవికాసానికై శ్రీనాథ్ కథలు

~ నవతరాల మేథోవికాసానికై శ్రీనాథ్ కథలు ~ భారతదేశమే కాదు ఏదేశమైనా పిల్లలకు బుద్ధులు నేర్పించటం అమ్మ ఒడి నుండే ప్రారంభం అవుతుంది.పిల్లలకు తల్లిదండ్రులు కాకుండా పరిచయం అయ్యేది జంతువులూ,పక్షిజాతులే. అక్షరం దిద్దకముందే అమ్మా, అమ్మమ్మా ,నాన్నమ్మలు పిల్లల్ని రాత్రి నిద్రపుచ్చుతూ అనగనగా అంటూ చెప్పే తొలికథల అల్లికలు జంతువుల చుట్టూనే. అందుకేనేమో విష్ణుశర్మ కూడా జంతువుల ద్వారానే పంచతంత్రకథలు బోధించారు. ఈ నాడు ప్రపంచీకరణ ప్రభావం వలన ప్రతి వ్యక్తీ జీవితంలో పరుగులు పెడుతున్నాడు.ఒత్తిడి నిండిన చిన్నికుటుంబాలలో తల్లిదండ్రులకు కెరియర్ పరుగుల్లో చిన్నపిల్లలకు కథలు చెప్పేంత తీరిక లేదు.అమ్మమ్మలూ,నాన్నమ్మలకూ దూరమయ్యారు.మరి ఇక పిల్లలకు విద్య కన్నా ముందుగా విలువలు నేర్పించాల్సిన బాధ్యత ఎవరిది? అదిగో అందుకేనేమో శ్రీనాథ్ వాడపల్లి బాలల కోసం ఆలోచించాడు . భారతదేశంలో టీచర్,కవీ ,రచయిత అయిన తండ్రి ఒడిలో అతని బాల్యం గడిచింది .చిన్నప్పటి నుండీ ఇంట్లో ఉన్న పుస్తకాలమధ్య సృజనాత్మక వాతావరణంలో పెరగటం అతనిలో మేధో ఉత్సుకతను పెంపొందించాయి. భారతదేశంలోనే పెయింటింగ్, గ్రాఫిక్స్‌లో శిక్షణ పొందిన శ్రీనాథ్ తదనంతరం ఫ్రాన్స్, లండన్ కళాకేంద్రాల్లో చదువుకున్నాడు. డాక్టరేట్ ,ఫెలోషిప్‌లు, గ్రాంట్లు అందుకున్నాడు. భారతదేశంలోనే కాక ఫ్రాన్స్, UK, ఆఫ్రికా, USA లాంటి విదేశాలలోని యూనివర్సిటీల్లో సైతం విద్యార్థులకు పెయింటింగ్, గ్రాఫిక్స్ నేర్పిస్తున్నాడు.. అంతటితో అతని అంతరంగం శాంతించలేదు. అయిదు నుండి పది ఏళ్ళ వయసు పిల్లలకు కుటుంబసభ్యుల మధ్య బంధాలూ, స్నేహాలూ, సామాజిక అలవాట్లూ ఎలా నేర్పాలి? తోటి పిల్లలు పట్ల ప్రేమా, దయా చూపటం, అవసరసమయంలో సహాయం చేయటం, అన్ని జీవుల పట్ల గౌరవం ప్రదర్శించటం ఏవిధంగా తెలియజేయాలి అనేది శ్రీనాథ్ మనసులో కలిగించిన మధనం ఈ కథలు రాసేలా చేసాయి.ఈ కథలన్నీ చిన్న చిన్నజంతువులూ, పక్షుల సాహసాలూ, ప్రవర్తన ద్వారా మానవీయ విలువలు పిల్లలకు అర్థమయ్యే విధంగా నేర్పే కథలే. ఈ కథలు ప్రపంచబాలలందరికీ వుపయుక్తంగా వుండే అంశాలను కలిగివుండటం ప్రధాన లక్ష్యం గానే వున్నా భారతీయాత్మ అంతరప్రవాహంగా వుందని అనిపించింది.ప్రతీకథా చదివే వయసుగల పిల్లలకి స్పష్టంగా అవగాహన కలిగించేలా వుండటం ఈ కథలకు గల మరో లక్షణం. చదవలేని పిల్లలకు బెడ్ టైమ్ కథలుగా పెద్దలు వినిపించేందుకు అనువుగా వున్నాయి. మొత్తంగా ఈ కథల్ని చదివినప్పుడు పిల్లలకు మానవీయవిలువలు నేర్పటమే కాకుండా పెద్దలమాటల్ని వినడం, మంచి చెడులను గూర్చి ఆలోచించడం,సహనం వంటి గుణాలు వారు తప్పక ప్రోది చేసుకుంటారనే ఆశావహ దృక్పథం కలిగింది. రేపటి రోజున వికసించబోయే పూలకోసం వనాలలో గొప్పులుతవ్వి,నీరుపెట్టి,సంరక్షించే పనిమంతుడైన తోటమాలిలా ఈనాడు శ్రీనాథ్ నా కంటికి కనిపించాడు. ఏదో తనపని తాను చేసుకు పోకుండా శ్రీనాథ్ వాడపల్లి రేపటి తరాన్ని దృష్టిలో పెట్టుకొని బాల సాహిత్యంలో కృషిచేస్తూ పిల్లలకు ఉత్సుకతా,ఊహాశక్తీ , సృజనాత్మకత పెంపొందించి సాహిత్యాభిరుచి రేకెత్తించే విధంగా రచనలు చేయటం,టెక్నాలజీని వుపయోగించి వాటికి తగిన ఆకర్షణీయమైన చిత్రాలతో పుస్తకాలు తీసుకు రావటం హర్షణీయం. ఒకనాటి మా మాష్టారు వాడపల్లి లక్ష్మీ నారాయణాచార్యులుగారి పుత్రుడైన శ్రీనాథ్ యీనాడు ప్రపంచదేశాల్లో ఇంత ఎత్తులకు ఎదిగి కీర్తిమంతుడైనందుకు సంతోషంగా వుంది. అంతేకాదు శ్రీనాథ్ ఆంగ్లంలో రాసిన ఈ బాలల పుస్తకాల్ని భారతీయభాషలన్నింటిలోకీ అనువాదం చేయించి భారతదేశంలోని బాలలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలనుకోవటం ముదావహం.మక్కీకి మక్కీ కాకుండా భారతీయ పరిస్థితులూ,వాతావరణానికి తగినట్లుగా అనువాదకులకు తగుమార్పులు అనుసృజనగా చేసే అవకాశం కల్పించటంతో కథలకు అంతరప్రవాహంగా కాక భారతీయ సహజపరిమళం కల్గింది. శీలా పల్లవి తెలుగులోకి అనువాదం చేసిన శ్రీనాథ్ రాసిన ఈ కథలు తెలుగు తావిని వెదజల్లుతున్నాయి. ఇంకా మరెన్నో మంచి పుస్తకాలతో బాలసాహిత్యంలో తనకంటూ ప్రత్యేక ముద్ర సాధించాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ శ్రీనాథ్ వాడపల్లికి, తెలుగులోకి అనువదించిన శీలా పల్లవికి ఆత్మీయ అభినందనలు. - శీలా సుభద్రాదేవి హైదరాబాద్

13, జులై 2026, సోమవారం

నడక దారిలో -67

నడక దారిలో -67 కరోనా విజృంభణ ఎదుర్కొని అప్పుడప్పుడే వూపిరి తీసుకుంటున్న ప్రజలకి కొత్త సంవత్సరం కొత్త ఆశల్ని మేల్కొల్పుతూ కొత్తవూపిరులూదింది. జనవరిలోబొమ్మలకొలువు హడావుడి వుంటుంది కనుక రచనలు తగ్గిపోతాయి.అయినా కరోనా కాలంలో చాలానే కవితలైతే చేసాను. చదవటం కొనసాగుతూనే వుంటుంది.ఎటొచ్చి ఇప్పుడు నారాయణరెడ్డి ట్రస్ట్ పుస్తకాలు ఎంపిక పని వలన ఇతర పుస్తకాలు చదవటానికి కుదరటం లేదు.ఇంచుమించుగా వాటిని చదవటం పూర్తి అయ్యింది. " ఇన్ని పుస్తకాలు ఉంటాయనుకుంటే ఒప్పుకోకుండా వుండాల్సింది.నీ సమయం అంతా దీనికే అయిపోతుంది కదా! పోనీ రెమ్యునరేషన్ అయినా ఇస్తారో లేదో తెలియదు "అనేవారు వీర్రాజు గారు. ఎప్పటిలాగే బొమ్మలకొలువు పెట్టటం, బిల్డింగ్ లో వాళ్ళూ, బంధుమిత్రులు రావటంతో ఆ వారం అంతా సందడిగా అయిపోయింది. తర్వాత రోజు ఉదయమే చిన్న మరిది తోడల్లుడు చనిపోయాడని ఫోన్ వచ్చింది.చాలాకాలంగా అనారోగ్యంగా వున్నా బాగానే వున్నాడని రెండురోజులముందే బొమ్మలకొలువు చూడటానికి వచ్చిన అతని భార్య సంధ్య చెప్పింది.ఆంతలో ఇలా జరగటం నిజానికి ఒక షాకే.వాళ్ళ చిన్నమ్మాయి యూ ఎస్ లో వుంటుంది.వచ్చే పరిస్థితి లేదు.దగ్గర్లో వుండే మా మరిదీ ,తోటికోడలూకూడా యూ ఎస్ లోనే వున్నారు.హుటాహుటీన పల్లవీ, నేనూ వాళ్ళింటికి వెళ్ళాము. మా మరిదికోసం,వాళ్ళ చిన్నమ్మాయి కోసం మనవరాలు ఫోన్లో వీడియో కాల్ పెట్టి పరిస్థితి అంతటినీ చూపిస్తుంది.అది చూసి నాకు దిగులైంది. చదువుకూ,వుద్యోగాలకూ పిల్లల్ని విదేశాలు పంపించేసి ఇక్కడ తల్లిదండ్రులు దిక్కులేని వారిలా అత్యవసర సమయంలో ఒంటరి వాళ్ళైపోతున్నారు . అందులోనూ ఇంకా కోవిడ్ భయం వెంటాడుతూనే వుంది.వేరియంట్స్ గా మారుతూనే వుంది.మూడోరోజు దినాలు కూడా వెళ్ళి వచ్చాం.అయిదురోజులు అయ్యేటప్పటికి నాకు తలనొప్పి వళ్ళునొప్పి మొదలైంది.డా.సూర్యప్రకాష్ గారు ఇప్పుడు వొమిక్రాన్ వేరియంట్ వూర్లో వుంది. ఐసొలేట్ అయిపోతే మంచిదని చెప్పి వాడాల్సిన మందులు చెప్తే వాడటం మొదలు పెట్టాను.మూడురోజులకే నాకు నార్మల్ కి వచ్చింది.కానీ మరో రెండు రోజులు కి పల్లవికి జ్వరం మొదలైంది.ఇమ్యూనిటి పల్లవికి తగ్గిందనుకుంటాను.అందుకే ఏడాదికే మళ్ళా వచ్చేసింది.ఇక ఈ జ్వరాలతో దినాలకు రాలేమని సంధ్య కూతురు రేఖకి ఫోన్ చేసాము. జ్వరాలవీ తగ్గినా నీరసం చాలా కాలమే వుంటుంది.కోవిడ్ అంతే మరి. మాకు వచ్చిన జ్వరాల అనుభవాలతో మళ్ళా మళ్ళా కొత్త రూపాలతో జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూనే వుందనిపించింది. అందుకే ఈ సారి కూడా మాడభూషి పురస్కారాలు వాయిదా వేసి వచ్చే ఏడాది అన్నీ కలిపి నిర్వహించుకుందామని వీర్రాజు గారు లలితా దేవిని వప్పించారు. రాజమండ్రి దామెర్ల చిత్రకళా పరిషత్ లో వీర్రాజు గారి పెయింటింగ్స్ ఫిక్స్ చేయాలంటే ఇనుప రాడ్స్ తో రెండు స్థంబాల మధ్యా స్క్రీన్ పెట్టాలని ,ఫోకస్ లైట్లు ఏర్పాటు చేయాలని అంటే విడతల వారీగా ఒక ఎనభై వేల వరకూ పంపించాల్సి వచ్చింది.అయితే అక్కడ జరుగుతోన్న పనిని ఫొటోలు తీసి ఎప్పటికప్పుడు రవి పపుతుండటంతో డబ్బు ఏమీ వృధా కావటం లేదులే అనుకున్నాము.గ్యాలరీ ప్రారంభం గురించి సంప్రదిస్తే వీర్రాజుగారు "నేనిప్పుడు రాలేను.వాడ్రేవు చినవీరభద్రుడుగారితో ప్రారంభోత్సవం చేయించు" అని రవిప్రకాష్ కి ఫోన్ చేసారు.అయితే వీరభద్రుడు గారు మాత్రం "వీర్రాజుగారు ఎప్పుడు వస్తే అప్పుడే ప్రారంభోత్సవం చేద్దాం" అన్నారు. ప్రపంచీకరణ ప్రభావంతో ఏ దేశానికి ఆ దేశపు పండుగలతో పాటూ ప్రపంచమంతా చేసుకునే కొత్త పండుగలు వచ్చాయి.అటువంటి వాటిలో ఫిబ్రవరి పధ్నాలుగున యువతరమంతా జరుపుకునే ప్రేమికుల రోజు ఒకటి. ఆ రోజు ప్రేమికుల రోజుని తెలియని కాలంలో ఇద్దరం ఇష్టపడి ఒకటైన రోజు.జీవితంలో ఎన్నో అనుకూలతలు,ప్రతికూలతలు మధ్య ఎన్నో పూలూ,ముళ్ళను దాటుకుంటూ ఈ నాటికి యాభై దాటి మరొక్క ఏడాది కూడా గడిచింది.మేము ఇద్దరం ఒకసారి గుర్తు చేసుకోవటమే తప్ప పెళ్ళిరోజు జరుపుకోవటం మానేసి చాలా ఏళ్ళే అయింది. తెలంగాణా సారస్వత పరిషత్తు నుండి చెన్నయ్యగారు వీర్రాజుగారికి ఫోన్ చేసి తన జీవితం సాహిత్యం గురించి పరిణతి వాణి ప్రసంగం చేయాల్సిందిగా ఆహ్వానించారు.గంటసమయంలో అన్ని విషయాలూ చెప్పలేకపోయినా ప్రసంగం వ్యాసాన్ని సమగ్రంగా రాసి పంపమని తెలియజేసారు. ఇటీవల రాయటం కొంత అలవాటు తప్పిపోవటం వల్లా,వయసు చేత కొంత జ్ణాపకశక్తి తగ్గుతూ వుండటం వల్లా ఒక్కొక్కటే బాల్యం నుండి గుర్తు చేసుకుని రాయటానికి వీర్రాజుగారు కొంచెం కష్టపడటం చూసి మనసులో నాకు బెంగగా అనిపించింది.చెక్కినట్లుగా వుండే అందమైన దస్తూరికూడా చెదిరినట్లైంది.మామూలుగానే రచన ఏదైనా ఒక విడతలో వీర్రాజుగారు రాయరు.పర్ఫెక్టుగా వచ్చేవరకూ రచన పదే పదే రాయటం,రాసినది కొట్టేసి మళ్ళా రాయటం ఆయనకు అలవాటే.అయినా ఇప్పుడు మాత్రం రాతలో తడబాటు అర్థం అవుతూనే వుంది.మొత్తం మీద తన జీవితం, సాహిత్యం పరిణతవాణికోసం రాయటం పూర్తి చేసారు.దానిని స్కాన్ చేసి చెన్నయ్య గారికి పంపించేసాను.ఇక ప్రసంగం చేయాల్సి ఉంది. ఒక ఆదివారం ఉదయం పదిగంటలకు సారస్వత పరిషత్తుకి మేమిద్దరం వెళ్ళాము.కందుకూరి శ్రీరాములు,శంకరం, సిధారెడ్డి మొదలైన ఆత్మీయ మిత్రులు వచ్చారు.ప్రచారం ఎక్కువగా చేయకపోవటం వలనో,ఎందుచేతనో సభలో ఎక్కువ మంది వుండరు. చేతిలో పాయింట్స్ కాగితంమీద రాసుకుని వెళ్ళినా అవి చూడకుండానే వీర్రాజుగారు ప్రసంగించారు. కానీ చాలా వరకూ తడబడుతూనే మాట్లాడారు.వయసువలన ఆయన మర్చిపోతున్నారనేది అర్థమైంది. కె. గీత తన నెచ్చెలి పత్రిక కోసం ఒక రోజు ఫోన్ చేసినన్ను ఇంటర్వ్యూ చేస్తానంది.అదే విధంగా ఒక గంటసేపు సమగ్రమైన ఇంటర్వ్యూ జూమ్ ద్వారా చేసింది.ఇంటర్వ్యూ తర్వాత కాసేపు పర్సనల్ గా మాట్లాడుకున్నాము.నేను మానసికంగా డిసేబుల్డ్ అయిన బాబును పెంచటంలో మూడున్నర సంవత్సరాలు అనుభవించిన బాధ మరువలేనిది. గీతకూడా ఆ పరిస్థితి గురించి చెప్తుంటే మనసంతా బరువెక్కి దుఃఖం కంఠంలో వుండకట్టినట్లయ్యింది.ఒకవైపు వుద్యోగం బాధ్యత నిర్వహిస్తూనే మరోవైపు పత్రికానిర్వహణ, సాహిత్య సృజన ,టోరీ రేడియో, సాహిత్య వీక్షణం ఇలా ఇన్ని బాధ్యతలు ఈ అమ్మాయి ఎలా నిర్వహిస్తూ ఉంది.ఈ గీత మనిషా,రోబోటా అనేది నాకు వూహకి అందలేదు.మనసారా ఆమెకి అభినందనలు తెలియజేసాను. అప్పట్లోనే చెన్నై విశ్వవిద్యాలయంనుండి మాడభూషి సంపత్ కుమార్ గారు కూడా నన్ను ఆన్లైన్ లోనే సమగ్రమైన ఇంటర్వ్యూ చేయడమే కాక నా జీవితం సాహిత్యం మొత్తం వ్యాసంగా రాసి పంపమని కోరటం మరో విశేషమే. ఒకరోజు పి.సత్యవతిగారు నాకు ఫోన్ చేసి "అన్వర్ అని ఒక అబ్బాయి మీకు ఫోన్ చేసి మీ ఇంటికి ఒక పుస్తకం కోసం వస్తాడు.అన్వర్ మంచిఅబ్బాయే. " అన్నారు.సరేనన్నాను.అంతలో అన్వర్ ఫోన్ చేసి "పోలాప్రగడ సత్యనారాయణ మూర్తిగారి "ఆ రోజుల్లో " పుస్తకం కావాలి.సత్యవతిగారు మీ దగ్గర పుస్తకం దొరుకుతుంది అన్నారు.మీ దగ్గర వుందా.ఉంటే వచ్చి తీసుకుని.చదివి మళ్ళా భద్రంగా ఇచ్చేస్తాను " అన్నాడు.ఉందని చెప్పి మా ఇంటి లోకేషన్ షేర్ చేసాను. వీర్రాజుగారు 'అన్వర్ ఎవరు ?' అన్నారు.'కవి అనుకుంటాను .కవితలు పత్రికలలో చూసాను ' అన్నాను. మరొక అతనితో కలిసి అన్వర్ వచ్చాడు.అతను అడిగిన పోలాప్రగడ రాసిన ఆరోజుల్లో పుస్తకం ఇచ్చాము.అతను మొహమాటంగా అతని " ఒక చిత్రకారుని రేఖాయాత్ర" పుస్తకం వీర్రాజుగారికి ఇచ్చాడు.పుస్తకం గెటప్ అది అద్భుతంగా ఉండటంతో ప్రింటింగ్ గురించి సమాచారం అడుగుతే ఇప్పుడు డిజిటల్ ప్రింటింగ్ పద్ధతి వచ్చిందని ఎన్ని కాపీలు అవసరమైతే అన్నే ప్రింట్ చేసుకోవచ్చని చెప్పాడు.అయితే అప్పటికీ అన్వర్ కవేనా,రచయితా,చిత్రకారుడా అనేది మాకింకా అర్థం కాలేదు.సాక్షిలో వుద్యోగం అన్నాడు.అంతే తెలిసింది.అంతకన్నా వివరాలు అడగటానికి మాకూ మొహమాటం. ఓ రెండు రోజుల్లో అన్వర్ ఇచ్చిన పుస్తకం వీర్రాజుగారు చదివి "సుభద్రా ఈ అన్వర్ చిత్రకారుడే కాక మంచి రచయిత కూడా.ఈ పుస్తకం అద్భుతంగా రాసాడు.నువ్వూ చదువు.ఇందులో చిత్రాలు చాలా బాగున్నాయి.చక్కటి లైన్ .బాపూ ఆరాధ్యుడు అనుకుంటా .కానీ బాపూని అనుకరించడం లేదు " అన్నారు.ఆయన అంతగా పొగిడారంటే నాకు వెంటనే చదవాలనిపించింది.అన్వర్ పుస్తకం తీసి మొదలు పెట్టాక ఇంకా వదలలేదు.వాక్యాలతో చిత్రాలు వేసినట్లు మ్యాజిక్ చేస్తూ అద్భుతమైన వాక్య విన్యాసంతో అనేకమంది చిత్రకారుల, సాహితీవేత్తలు గురించీ,సినీమాలగురించీ భలేగా రాసాడు.చదవటం పూర్తిచేసిన వెంటనే నా అభిప్రాయం అన్వర్ కి వాట్సాప్ లో తెలియజేసాను. తర్వాత మళ్ళా అన్వర్ తన కొడుకు మోహన్ ని తీసుకుని వచ్చాడు.అప్పుడు వీర్రాజుగారు తన పెయింటింగ్స్, ముఖచిత్రాలు,చిత్రాలు వేసే రకరకాల కొక్విన్లు అతనికి చూపించారు. మా స్వంతపుస్తకాలకు చీర ముక్కలతో వీర్రాజుగారు స్వంతంగా చేసిన బైండింగ్స్ చూసి అన్వర్ అబ్బురపడ్డాడు. తర్వాత కొన్నిరోజులకే నాకు(2021),పొత్తూరి విజయలక్ష్మి (2022)కు సుశీలానారాయణరెడ్డి పురస్కారం సమావేశం ఎమ్.కే.రాముగారి కిన్నెర సంస్థనిర్వహణలో జరిగింది. నా సాహిత్యం గురించి మూడు వ్యాసాలు రాసిన సి.హెచ్.సుశీలగారు నా సాహిత్యం గురించి కన్నా ఆత్మీయ పరిచయంగా మాట్లాడారు.పొత్తూరు విజయలక్ష్మి గురించి ప్రసంగించిన నెల్లుట్ల రమాదేవి పేపర్ మీద రాసుకొని సాహిత్యం గురించే మాట్లాడింది.తర్వాత స్పందన తెలియజేసినప్పుడు కూడా విజయలక్ష్మి తన సాహిత్యం గురించి చాలా చెప్పుకుంది. నన్ను పురస్కారానికి ఎంపిక చేసేరంటే నా సాహిత్య సృజన చూసేకదా .ఇంకా నేనుకూడా నా గురించి చెప్పుకోవటంలో అర్థం లేదు అనిపించింది. అందుకే నా ప్రసంగంలో కేవలం రచయిత్రులకే పురస్కారాలు ఇవ్వాలనే సంకల్పానికి ధన్యవాదాలు తెలియజేసాను.అంతేకాకుండా "నలభై సంవత్సరాలకు పైగా రచయిత్రులకు పురస్కారాల్తో గౌరవించటం చాలాసంతోషం. ఈ సందర్భంగా మరొక విన్నపం చేస్తున్నాను.రచయితలకూ,కవులకూ శతజయంతులు ప్రభుత్వ,ప్రభుత్వేతర సంస్థలూ అకాడమీలు నిర్వహించటం చూస్తున్నాము.కానీ మహిళాసాహితీవేత్తలకు ఎవరూ చేస్తున్నట్లుగా లేదు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న తొలి రచయిత్రి ఇల్లిందల సరస్వతి దేవిగారికి శతజయంతి సభ జరగలేదు.అలా ఎంతమందో.నలభై ఏళ్ళుగా పురస్కారం ఇస్తున్న శ్రీమతి సుశీలానారాయణరెడ్డి ట్రస్టు వారైనా పూనుకొని పెద్ద ఎత్తున సదస్సులు నిర్వహించనవసరంలేదు కానీ ఆ రచయిత్రి సాహిత్యం గురించి ఒక ప్రసంగం ఏర్పాటు చేసి కొన్ని ప్రసంగాలు అయిన తర్వాత ఒక పుస్తకంగా ప్రచురిస్తే ఇప్పటి తరం వారికి ఆనాటి రచయిత్రులు ఎన్నో అవరోధాలను అధిగమించి రచయిత్రులుగా నిలదొక్కుకున్నారు అనేది తెలుస్తుంది." అని విన్నపం చేసాను.నా ప్రసంగానికి గంగగారు చాలా ప్రభావితులై కార్యక్రమం పూర్తై కిందికి వచ్చాక నన్ను ఆలింగనం చేసుకుని మీరు చెప్పినట్లే మేము నిర్వహించటానికి సిద్ధం గానే ఉంటాము.మీ సహకారం అందించండి అన్నారు.నాకు చాలా సంతోషం కలిగింది. ఆ తర్వాత కలిసిన వారంతా నేను చేసిన ప్రతిపాదన చాలా సమంజసంగా వుందని అభినందనలు తెలియజేసారు. పురస్కారం సందర్భంగా సారస్వత పరిషత్తు కార్యదర్శి డా.చెన్నయ్యగారు అందించిన సన్మాన పత్రం, ఫొటో ఫ్రేమ్ వీర్రాజు గారికి చాలా నచ్చాయి.నేను లోపల ఎక్కడైనా పెట్టాలనుకుంటే వీర్రాజుగారు హాల్ లోనే కొన్నాళ్ళవుంచు అన్నారు.ఇంటికి వచ్చిన మిత్రులు అందరికీ ఆయనే చూపించి పురస్కారం గురించి గొప్పగా చెప్తుండటం నాకే ఆశ్చర్యం వేసింది. నిజానికి ఇంతవరకూ నాకు నగదు రూపంలో కూడా పది పదిహేను వేలకు మించి రాలేదు.నాకు వచ్చిన పురస్కారాలలో ఇదే అత్యధికంగా వచ్చిన నగదు పురస్కారం.నగదుకన్నా గత నలభై ఏళ్ళుగా ఊటుకూరి లక్ష్మీ కాంతం యద్దనపూడి,రామలక్ష్మీ,లేత,సీతాదేవి వంటి వుద్దండులైన రచయిత్రులు అందుకున్న ప్రతిష్టాత్మకమైన పురస్కారం అనేది మాత్రం అక్షరాలా నిజం. ఒకరోజు గంగగారు ఫోన్ చేసి రచయిత్రుల శతజయంతులు దాటిన వారిని లిస్ట్ చేయమని అడిగారు.నేను ముఖ్యంగా సుశీలానారాయణరెడ్డి పురస్కారం అందుకున్న వారితో ప్రారంభించటమే బాగుంటుందనే అభిప్రాయంతో అక్కడినుంచి మొదలుపెట్టి రచయిత్రుల పుట్టిన సంవత్సరాల లిస్ట్ తయారుచేసి పంపించాను. శ్రీమతి సుశీలానారాయణరెడ్డి ట్రష్ట్ ఆర్థిక సహాయానికి పుస్తకాల ఎంపిక పూర్తి చేసాను.కథలు,కవితలు కలిపి సుమారు పదిపన్నెండు పుస్తకాలు ఎంపిక చేసి ఎందుకు బాగున్నాయో నా అభిప్రాయం కూడా రాసి వాళ్ళకు పంపించేసాను.అంత సమగ్రంగా నా అభిప్రాయాలతో ఎంపిక చేసినందుకు గంగగారు చాలా సంతోషం వ్యక్తం చేసారు.అంతేకాదు రెమ్యునరేషన్ గా అయిదువేలు పంపించటం మరింత ఆనందం. నేను ఎంపికచేసిన వాళ్ళు తర్వాత్తర్వాత మంచి కవయిత్రులుగా,రచయిత్రులుగా బహుమతులూ గుర్తింపూ పొందటం కూడా నాకు సంతోషం కలిగించింది. నేను ఒక లలితగీతాల వాట్సాప్ సమూహంలో వుండటం వలన సినారె గేయాలు ఆ సమూహంలో వచ్చినప్పుడు గంగకు షేర్ చేస్తూ వుంటాను.అందువలన ఆమె ఏ పాట కావాల్సినా, ఎవరైనా రచయితలకు చెందిన వివరాలు కావాల్సి వచ్చినా నన్ను సంప్రదించటం వలన తరుచూ మాట్లాడుకొంటూ వుంటాము. ఆ విధంగా ఆమెతో కొంత స్నేహం పెరిగింది. నిడదవోలు మాలతి మోనోగ్రాఫ్ డీటీపీ కూడా పూర్తి చేసాను.అనల్ప బలరాంగారికి పి.శ్రీదేవి కథల్ని " వాళ్ళు పాడిన భూపాలరాగం "పేరుతోనూ,ఆమె కవితల్ని "మథుకలశమ్" పేరుతోనూ సంపాదక బాధ్యతల్ని వహించిన పరిచయంతో నిడదవోలు మాలతి మోనోగ్రాఫ్ ని వాళ్ళ బేనర్ పై ప్రచురిస్తారా అని అడుగుతే తప్పక ప్రచురిస్తానని అన్నారు.అయితే మరికొన్ని ప్రచురణలలో బిజీగా వున్నానని అవి అయిపోయాక చేస్తానన్నారు.ఆ పుస్తకానికి పల్లవి చేతే ముఖచిత్రం వేయించుతానని కూడా చెప్పాను. బలరాం సరేనన్నారు.మాలతి రచనలో విశాఖమాండలిక సొబగులే కాక విశాఖసంపంగి పరిమళాలు మనసుని తాకుతూనే వుంటాయని ముఖచిత్రంగా సంపెంగలతోనే డిజైన్ చెయ్యమని పల్లవితో చెప్పాను. - శీలా సుభద్రాదేవి

నడక దారిలో -66

నడక దారిలో -66 ఈ ఏడాది డిసెంబర్ నెల చాలా విశేషాలతో బిజీగా నడిచింది. ఈ మధ్య కుందుర్తి కవిత తాను రాసిన కవితలు నాకు పంపించింది.బాగారాస్తున్నావని ప్రోత్సహించడమే కాకుండా నెచ్చెలి,కవి సంధ్య ఈ మెయిల్ ఐడీ లు ఇచ్చి పంపించమని చెప్పాను.నేనేమైనా సవరణలు చేస్తే సరిదిద్దుకుంటుంది.వాటిని వీర్రాజుగారికి కూడా వినిపించేదాన్ని. ఇంకో విశేషం ఏమిటంటే నేనూ, పల్లవి కూడా వున్న మనలో మనం వాట్సాప్ సమూహంలో పల్లవి చిన్నచిన్న రచనలూ,కవితలూ రాయటం సంతోషం కలిగించింది.కరోనా సమయంలో సుధామ ప్రారంభించిన" ఒకసారి చూడండి అంతే" అనే వాట్సాప్ పత్రికలో కథలకు చిత్రాలు వేయటమే కాకుండా దాని తరపున సుధామ నిర్వహించిన కవితలపోటీలో పల్లవి కవిత ప్రచురణకు ఎంపిక అయ్యింది.అదేవిధంగా విశాలాక్షి నిర్వహించిన కవితలపోటీలో కన్సొలేషన్ బహుమతి వచ్చింది. వాటిని కూడా ఫోనులో చదవటం వీర్రాజుగారికి తెలియదు కనుక వినిపించాను.అవి విని ఆనందంతో వచ్చే ఏడాదికి పల్లవి రాసిన కవితా సంపుటి ప్రచురించాలి అనేవారు. ఖమ్మంలో డా.సీతారాంగారు తాను పనిచేసే కళాశాలలో కుందుర్తి సాహిత్య సదస్సు నిర్వహించాలనుకుంటున్నానని కుందుర్తి కృతులు పుస్తకం ,ఇతర పుస్తకాలు కావాలని ఫోన్ చేసారు.ఒకరోజు పుస్తకాలు కోసం మా ఇంటికి వచ్చారు.కుందుర్తికృతులు అపురూపమైనది కావటాన మళ్ళా జాగ్రత్తగా అందజేస్తామన్నారు.ఆ పుస్తకాలతో పాటు మాయిద్దరిపుస్తకాలుకూడా ఇచ్చాము.అవే కాకుండా విద్యార్థులకు బహుమతులుగా ఇవ్వమని మావి విడి కవితా సంపుటాలు కూడా అందజేసాము. సీతారాంగారు తన పాఠాలు మాత్రమే చెప్పి పనైపోయింది అనుకోకుండా విద్యార్థులకు సాహిత్యం పట్ల అభిరుచి,ఆసక్తి పెంచేలా పుస్తకాలు చదివించి ప్రోత్సహిస్తారు.ఆ విధంగా ప్రతీ కాలేజీలోనూ జరుగుతూ వుంటే తెలుగుభాష అంతరించి పోతుందనే దిగులు తగ్గుతుందేమో. డిసెంబర్ లో కుందుర్తిగారి శతజయంతి ప్రారంభం ఆవిధంగా ఖమ్మం కాలేజీలో ప్రారంభించటం వీర్రాజుగారికి సంతోషం కలిగించింది.సదస్సు ప్రారంభసభకు మా ఇద్దరినీ ఆహ్వానించారు." రావాలని ఉంది కానీ మూడుగంటలసేపు కారులో ప్రయాణం చేయలేన"ని వీర్రాజుగారు సీతారాంతో చెప్పారు."కుందుర్తిగారితో, ఫ్రీవర్స్ ఫ్రంట్ తో మీ అనుబంధాన్ని వీడియో చేసి పంపించండి.అది ప్రారంభసభలో వేస్తాం " అన్నారు. ఆ విధంగా ఒక వీడియో చేసి పంపించాను.కుందుర్తి కవిత ఆ సదస్సులకోసం సింగపూర్ నుండి వచ్చింది.కుందుర్తి కుటుంబసభ్యులు ఖమ్మంలో జరిగిన కుందుర్తి సాహిత్య సదస్సులకు హాజరయ్యారు. కుందుర్తి కవిత ఇండియా ఎప్పుడు వచ్చినా అక్క సమతతో కలిసి మా యింటికి తప్పక వచ్చి కలుస్తుంది.వచ్చిన 'ప్రతీసారీ సింగపూర్ ఎప్పుడు వస్తారు.తప్పకరండి ' అని పిలుస్తుంది కవిత. " కవితలు బాగా రాస్తున్నావు. వచ్చే ఏడాది చివరికి నీ కవితాసంపుటి వచ్చేలా రాస్తూ వుండు " అన్నారు కవితతో వీర్రాజుగారు.కవిత నవ్వేసి ప్రయత్నిస్తానంది.నవ్వటం కాదు.'పట్టుదలగా రాయాలి ' అని ఖచ్చితంగా చెప్పారు ఆయన. ఒకరోజు చెన్నయ్యగారు ఫోన్ చేసి ప్రతీ ఏడాదీ రచయిత్రుల మొదటి పుస్తకాలకి సుశీలానారాయణ రెడ్డి ట్రస్ట్ ఆర్థిక సహకారం అందిస్తుంది కదా ఆ పుస్తకాలను ఎంపిక చేయగలరా అని కోరారు.నేను అంగీకారం తెలియజేసిన తర్వాత నలభై రెండు కవితాసంపుటాల జిరాక్స్ ఫైళ్ళూ,ఇరవై వరకూ కథలసంపుటాల జిరాక్స్ ఫైళ్ళూ పంపించారు.వాటిలో ఆంధ్రా నుండి వచ్చినవి కూడా వుండటంతో గంగగారికి ఫోన్ చేసి తెలంగాణావారివే ఎంపిక చేయాలా,ఆంధ్రావాళ్ళవి బాగుంటే చేయొచ్చా' అని అడిగాను.ఆమె " బాగుంటే రెండు రాష్ట్రాల నుండి ఏవైనా చేయండి.మాకు తెలంగాణా ఆంధ్రా అనే తేడా లేదు.అంతేకాకుండా ఎన్ని సెలెక్ట్ చేసినా పర్వాలేదు" అని నాకు పూర్తి స్వేచ్చ ఇచ్చారు.అరవైకి పైగా పుస్తకాలు చదవటంతో తీరిక లేకుండా అయింది. మంచి ఉద్యోగంచేసి పదవీవిరమణ అయ్యాక కాలక్షేపంగా కొత్తగా ఇప్పుడు సాహిత్య సృజన మొదలుపెట్టి ఆర్థికంగా మంచి స్థితిలో వున్నవారు సైతం ఆర్థిక సహాయం కోసం పంపటం నాకు ఆశ్చర్యం కలిగించింది.కొందరు ముందు మాటలు కూడా రాయించి ప్రచురణకు సిద్దంగా వున్న ప్రతులే పంపించారు.అటువంటి వాటిని చాలా వరకూ తీసేసాను.యువతరంవారికి ప్రోత్సాహంగా యిస్తే బాగుంటుంది అనిపించింది.అదే విషయాన్ని గంగగారికి తెలియజేసాను. కవిత్వంలోనూ,కథల్లోనూ బాగున్నాయి అనిపించినవి పక్కన పెట్టి రెండోసారి చదవాలనుకున్నాను.మొత్తం పంపిన వాటికి అన్నింటికీ నచ్చనివాటికి కూడా నా అభిప్రాయం రాసి పెట్టుకున్నాను.ఫైనల్ సెలక్షన్ మాత్రం వుంది. సైదాబాద్ కోపరేటివ్ బ్యాంకుకు ఒకరోజు వీర్రాజుగారిని తీసుకుని పల్లవీ, నేనూ వెళ్ళాం.మలక్ పేట ఇంట్లోకి వచ్చిన వెంటనే మొదట దగ్గర కదా అని ఆ బ్యాంకులోనే మేము సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ తెరిచాము.సరూర్ నగర్ వెళ్ళిన తర్వాత అక్కడ నుండి అవసరమైనప్పుడు సైదాబాద్ బ్యాంక్ కు రావటం కష్టంగా వుందని వీర్రాజుగారి అక్కౌంట్ క్లోజ్ చేసేసాను.దానితో పాటూ కుందుర్తి సత్యమూర్తితో కలిసి ఫ్రీవర్స్ ఫ్రంట్ కోసం చేసిన జాయింట్ అకౌంట్ కూడా క్లోజ్ చేసేసాము.ఫ్రీవర్స్ ఫ్రంట్ అక్కౌంట్ లో నలభై అయిదు వేలు ఉందని కుందుర్తి శాంతకు తెలియజేస్తే ' మీరే ఫ్రీవర్స్ ఫ్రంట్ కోసం వాడండి.నాకు పంపొద్దని' అంది. ఆ డబ్బుని ఏం చెయ్యాలా అని ఇద్దరం ఆలోచించాము."ఈ ఏడాది ఎట్లాగూ కుందుర్తి శతజయంతి సంవత్సరం కనుక ఈ నలభై అయిదు వేలకు మనం మరోపదిహేను వేలు కలిపి ఆరుగురికి కుందుర్తి శతజయంతి ప్రతిభా పురస్కారం పేరున పదివేల చొప్పున ఇచ్చేద్దాము.రెండు తెలుగురాష్ట్రాల నుండి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు రాదగిన సీనియర్ కవుల్ని ఎంపిక చేద్దాం" అన్నారు వీర్రాజు గారు.ఎవర్ని తీసుకోవాలని ఒక జాబితా వేసుకుని నిర్విరామంగా సాహిత్య కృషి చేస్తూ సాహిత్యం రాస్తూ వున్నవారినిగా చూసుకుని డా.రాధేయ,దాట్ల దేవదానం రాజు,అడిగోపుల వెంకటరత్నం,దేవరాజు మహారాజు,డా.సీతారాం, అనిశెట్టి రజితలను ఎంపిక చేసి కుందుర్తి కుటుంబసభ్యులకు తెలియజేసాము.వాళ్ళుకూడా చాలా సంతోషించారు.ఎంపిక చేసిన కవులకు వీర్రాజు గారు ఫోన్ చేసి చెప్పగా ఆరుగురూ చాలా ఆనందించారు. ఫ్రీవర్స్ ఫ్రంట్ సమూహంలో కుందుర్తి ఆంజనేయులు శతజయంతి సందర్భంగా ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రతిభా పురస్కారాలు ప్రకటించిన వారిగురించి పరిచయం చేసాను.పురస్కారగ్రహీతలకు ఎప్పుడు హైదరాబాద్ రావటానికి కుదురుతుందో సంప్రదించటంతో కొంత కాలయాపన జరిగింది. దాంతో సభ నిర్వహించి ప్రదానం చేయాలా,లేదా జూమ్ సమావేశం ద్వారానే చేయాలా అనేది కూడా ఆలోచించాము. ఇటీవలే ఖమ్మంలో కుందుర్తి సదస్సులకీ కుందుర్తి కవిత వచ్చి వెళ్ళింది.మళ్ళా దగ్గరలో రావటం కష్టం. అందుకని జూమ్ లోనే అందరి వెసులుబాటూ చూసుకుని నిర్వహించాలని నిర్ణయించాము. చూస్తుండగానే నెచ్చెలి అంతర్జాలపత్రికలో నా నడక దారిలో బాల్యం వివరాలతోనే ఏడాది గడిచిపోయింది. ఎన్నికల సమయంలో జరుగుతోన్న సందర్భాలూ, ప్రజల్ని వెర్రివెధవాయిలుగా చేస్తున్న రాజకీయ నాటకాలూ కొంత అసహ్యం కలిగించి నేను దీర్ఘకవితగా రాసాను.అది వీర్రాజుగారికి చదవమని ఇచ్చాను.బాగా రాసాను అన్నారు‌.కానీ ఏ పత్రికకైనా పంపించటానికి వెనకడుగు వేసాను. కోరుకొండ అక్క మనవరాలు అంటే కళ్యాణ్ పెద్దకూతురు వసుధకు పెళ్ళి సంబంధం కుదిరింది అని తెలిసింది.వసుధ కోరుకొండ సైనిక పాఠశాలలోనే చదువుకుని చెన్నైలో ఇంజనీరింగ్ చేసి ప్రస్తుతం హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.విశేషం ఏమిటంటే సైనిక స్కూల్ లో చదివినప్పటి నుండి సహ విద్యార్ధులు అయిన అభిలాష్,వసుధ ప్రేమించుకుంటున్నారుట.చదువుపూర్తిచేసి ఉద్యోగంలో స్థిరపడే వరకూ ఈ విషయం తల్లిదండ్రులుకు తెలియనీయవద్దనుకున్నట్లున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు సంబంధాలు చూడటం మొదలు పెట్టేసరికి బయట పెట్టింది వసుధ.అభిలాష్ వాళ్ళ కుటుంబం సంగారెడ్డిలో వుంటారు.ఒకసారి అందరూ కలిసి మాట్లాడుకొని నిశ్చయించుకుందామని ఇరు కుటుంబాల వారు నిర్ణయించుకున్నారు. ఆపని మీదే కళ్యాణ్ కుటుంబమే కాక జయ అక్కాచెల్లెళ్ళు కూడా కుటుంబ సహితంగా వచ్చారు. "మాకు వున్న పెద్దదిక్కు మీరే కనుక తప్పక సంగారెడ్డి రావాలని " కళ్యాణ్ అనేసరికి మేమూ బయలు దేరక తప్పలేదు.వీర్రాజుగారు ముందు అన్ని గంటలు కార్లో ప్రయాణం చేయలేనేమో అని వెనకడుగు వేసినా కళ్యాణ్,జయ కోరిక మేరకు బయలుదేరారు. టిఫిన్లు చేసి ఎనిమిది గంటలకు నలుగురం కార్లో సంగారెడ్డి బయలుదేరాము.సుమారు నాలుగు గంటల ప్రయాణం చేసి సంగారెడ్డిలో వసుధ కాబోయే అత్తగారి ఇల్లు చేరాము. అత్తగారి అక్కాచెల్లెళ్ళు,మామగారి అన్నదమ్ములు మొదలైన వారితో వాళ్ళది చాలా పెద్ద కుటుంబం.వాళ్ళందరూ వచ్చారు. పెళ్ళి ఎప్పుడు చేయాలనేది చర్చ జరిగింది.ఇల్లూ,ఇంట్లో వస్తువులూ అన్నీ అమర్చుకున్నాకే చేసుకుంటాం అని పిల్లలు ఇద్దరూ అంటారు.ఇప్పటికే చాలా కాలం వేచి వున్నారు,ఇంకా ఆలస్యం చేయవద్దని అందరం అన్నాము.పెళ్ళి అయ్యాక ఇంట్లోకి మీ సంపాదనతో ఒక్కొక్క వస్తువే అమర్చుకోవటంలో చాలా తృప్తి వుంటుందని మేము అనుభవంతో చెప్పాము.ఆఖరికి అంగీకరించారు.ఎప్పుడు మంచి ముహూర్తం వుంటే అప్పుడు వివాహం చేయాలని అందరూ నిర్ణయించారు. వీర్రాజుగారు ప్రత్యేకంగా వసుధా, అభిలాష్ లతో " పెళ్ళి అంటే ఒకరిపై ఒకరికి గల నమ్మకం.దానిని జీవితాంతం నిలుపుకోండి" అంటూ చాలా సేపు మాట్లాడారు.ఆయన మాటలకు వాళ్ళిద్దరే కాక వాళ్ళు అమ్మా నాన్నలు కూడా ఫిదా అయిపోయారు. అభిలాష్ వాళ్ళూ ఇక్కడే స్థిరపడిన కన్నడిగులు.వాళ్ళ సంప్రదాయం ప్రకారం మగవాళ్ళందరికీ గాంధీటోపీలు పెట్టి అందరికీ బట్టలు పెట్టారు.అదే విధంగా కళ్యాణ్ వాళ్ళు కూడా వాళ్ళకు బట్టలుపెట్టి గౌరవించారు.అవన్నీ పూర్తి చేసుకుని మేము తిరిగి బయలుదేరి ఇంటికి చేరేసరికి పదిగంటలకు దాటింది. మర్నాడు జయా అక్కాచెల్లెళ్ళు ముగ్గురినీ మా ఇంటికి రమ్మన్నాను.' భోంచేసి ఇక్కడనుండే స్టేషనుకు వెళ్ళొచ్చు' అని చెప్పాను. ఉదయమే లేచి రెండు కూరలూ, సాంబారు,ఫ్రైడ్ రైస్ , స్వీట్ చేసి మంచూరియా హొటలునుండి తెప్పించాము.పెద్దక్క సర్వలక్ష్మి కుటుంబం అటునుంచి అటే కార్లో వెళ్ళిపోయారు.మిగతా ఇద్దరూ రంజనా,జయా వాళ్ళంతా వచ్చారు.అందరితో సరదాగా ఇల్లంతా పెళ్ళి సందడిలా గడిచింది.వసుధ రాత్రికి డిన్నర్ పేక్ చేసుకుని హాస్టల్ కి వెళ్ళిపోయింది.మిగతావాళ్ళు ఇటు నుండి స్టేషన్ కు వెళ్ళిపోయారు. "ఇంతదూరం కార్లో బాగానే ప్రయాణం చేయగలిగాను.భయపడ్డాను గానీ ఖమ్మంలో జరిగిన కుందుర్తి సదస్సుకు కూడా వెళ్ళాల్సింది" అని మర్నాడు వీర్రాజుగారు అన్నారు.మీరు ఊరికూరికే ప్రయాణం చెయ్యలేనేమో అని ముందే భయపడతారు అని ఆయనతో అంటూ నేనూ పల్లవీ నవ్వుకున్నాం. ఈ ప్రయాణం ఇచ్చిన ధైర్యంతో ఈ సారి " విజయనగరం వెళ్తే పగలు రైలు ప్రయాణం చేద్దాం కిటికిలోనుండి అంతా చూస్తూ వెళ్ళొచ్చు‌"అన్నారు. ఆలోచిద్దాంలెండని అన్నాను. నిడదవోలు మాలతి సాహిత్యం మీద రాస్తున్న వ్యాసాలు ఒక పరిశోధన గ్రంథం మాదిరిగానే జీవితం,కథలు,ఎన్నెమ్మ కథలు,నవలలు, వ్యాసాలు,అనువాదాలుగా చాప్టర్ లు విడదీసాను.ఒక్కొక్క చాప్టర్నీ పీడీఎఫ్ రూపం లో మాలతి గారికి మెయిల్ ద్వారా పంపించే దాన్ని.ఆమె ఏమైనా సవరణలు చేయమంటే మార్చేను.కొన్ని కథలకి నేపథ్యం గురించి అడిగితే సమాధానాలు చెప్పేవారు.దాంతో ఆమెతో చాలా సాన్నిహిత్యం పెరిగింది."నన్ను మీరు,గారూ అని మన్నించి రాస్తుంటే ఇబ్బందిగా వుంది.మా అక్కయ్య సమకాలీనులు.నన్ను మన్నించనవసరం లేదు. ఏకవచనంలో సుభద్రా అనండి చాలు"అని నేను రాసిన తర్వాత మరింతగా సాన్నిహిత్యం పెరిగింది. ఒక సందర్భంలో "నా జీవితంలో జరిగినవేవీ నువ్వు అడగలేదు.చెప్పమంటావా" అని రాసారు. పి.శ్రీదేవి జీవితం నాకు అంతగా తెలియక పోవటం వలన ఆమె మోనోగ్రాఫ్ రాసేటప్పుడు ఆమె రచనల ఆధారంగానే ఆమె జీవితాన్ని రాసాను.మీకు కూడా అలానే రాస్తాను.అని నేను చెప్తే మాలతిగారు చాలా సంతోషించారు. నిడదవోలు మాలతి మోనోగ్రాఫ్ మొత్తం పూర్తి అయ్యింది.పేజీలు స్కాన్ చేసి డిటీపీ నరసింహారావుకి ఇచ్చాను.కానీ నేను ఫ్రచురించుకుంటే ప్రచారం చేసుకోగలనా అనిపించింది.ఏదో సందర్భంలో మాట్లాడినప్పుడు అనల్ప బలరాంతో అంటే తానే ప్రచురించుతానని అన్నాడు. అప్పటికే పి.శ్రీదేవి సాహిత్యం అంతా తన పబ్లికేషన్ ద్వారా ప్రచురించాలనుకుంటున్నాననీ నన్ను రచనలన్నీ సేకరించి నన్నే సంపాదకత్వం వహించమని బలరాం అడిగాడు.ఆ పని కూడా మొదలు పెట్టాను.నేను కథానిలయం నుండీ,నా దగ్గర వున్నవీ డిటీపీకి ఇచ్చాను.మిగతా కథలు కృష్ణదేవరాయ గ్రంథాలయం నుండి తెలుగు స్వతంత్రలు తెచ్చుకుని అందులో చదువుతూ రాసినవి. అంతకుముందే ఒక అమ్మాయి పి.శ్రీదేవి మీద పరిశోధన చేస్తున్నానని రచనల కోసం అడిగింది.నేను కృష్ణదేవరాయ గ్రంథాలయం నుండి తెచ్చుకున్నానని చెప్తే వెళ్ళింది.తీరా అక్కడకి వెళ్తే చెదలు పట్టాయని అవన్నీ పాడైపోతే పారేసామని చెప్పారని నాతో చెప్పింది.దాంతో మళ్ళా నాకు శ్రీదేవి కథలసేకరణ ఇక్కట్లు మొదలయ్యాయి.అయితే గౌతమీ గ్రంధాలయం, వేటపాలెం లైబ్రరీలో కొన్ని దొరికాయి.మూడోనాలుగో కథలు తప్ప అన్నీ దొరికాయి.వాటిని డిటీపీ చేయించాను.ఆ పుస్తకానికి సమగ్రమైన ముందుమాట రాయమని పబ్లిషర్ చెప్పటంతో మళ్ళా కథలన్నీ చదివి రాయటం మొదలు పెట్టవలసి వచ్చింది. - శీలా సుభద్రాదేవి

28, మే 2026, గురువారం

నడక దారిలో -65

నడక దారిలో -65 కేంద్ర సాహిత్య అకాడమీ వారు కవులకు కవిసంధి,రచయితలకు కథాసంధి అనే పరిచయం కార్యక్రమాల నిర్వహణ ఎప్పటినుండో కొనసాగుతూ వుంటుంది .ఎనభైరెండేళ్ళ వయసులో వీర్రాజుగార్ని రచయితగా గుర్తించారు కాబోలు కరోనాకాలంలో జూమ్ సమావేశంలో కథాసంధి కార్యక్రమం జరిగింది. "పోనీలే ఇప్పుడైనా గుర్తొచ్చాను" అని అల్ప సంతోషి అయిన వీర్రాజుగారు సంబరపడ్డారు. కరోనా పరిస్థితులు చూస్తుండేసరికి వీర్రాజుగారికీ ఇంటినిండా నిండిపోయిన పుస్తకాలూ, వీర్రాజుగారి పెయింటింగ్స్,నాలుగైదు దశాబ్దాలకు పైగా సేకరించిన కళాకృతులు పిల్లలకు భారమోతుందేమో అనే భయం, బెంగా మా మనసుల్లో నిండిపోయింది. గ్యాలరీ ఏర్పాటు చేయాలంటే ఇండిపెండెంట్ ఇల్లు కాదు. మాది అపార్ట్మెంట్. వీర్రాజుగారు రాజమండ్రి లోని మాదేటి రాజాజీ అన్న కొడుకు రవిప్రకాష్ ని సంప్రదించారు." మా చిన్నాన్న పెయింటింగ్స్ కూడా పెట్టే వుద్దేశ్యం వుంది.మీ పెయింటింగ్స్ కూడా కుదురితే అలా చేద్దాం " అన్నాడు.మా పుస్తకాలని విశ్వవిద్యాలయాల లైబ్రరీలకు పంపాలని వాటి చిరునామాలు గూగుల్ లో వెతికి తెలుగు శాఖా అధ్యక్షులు ఫోన్ నెంబర్లు వుంటే వాళ్ళకి మెసేజ్ పెట్టాను.వాళ్ళ అంగీకారం తెలిపిన తర్వాత కేవలం మా రచనలను పార్సిల్ చేసి పంపించాము.అందుకున్నట్లు తిరిగి మెసేజ్ లు పెట్టారుకానీ ఏ విశ్వవిద్యాలయం శాఖా కూడా అక్నాలెడ్జ్ వుత్తరం మాత్రం ఇవ్వలేదు.రచయితలను గౌరవించే సంస్కృతి లేదనిపించింది.అయితే విశ్వవిద్యాలయం లైబ్రరీలో కొన్నైనా పుస్తకాలు వెళ్ళాయన్న ఒక తృప్తి అంతే. ఇప్పుడిప్పుడే ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కార సభ పెట్టే అవకాశం లేదనిపించి వీర్రాజుగారు జూమ్ సమావేశం ఏర్పాటు చేసి ,వాళ్ళ అక్కౌంటుకు పురస్కార నగదు పంపించేద్దాం, హైదరాబాద్ వచ్చినప్పుడు జ్ణాపిక అందజేద్దాం అని నిర్ణయించి కుందుర్తి కుటుంబంతో సంప్రదించారు.వాళ్ళు కూడా అవార్డులు ఇచ్చేస్తే ఇంకా బాధ్యత తీరిపోతుంది అని అన్నారు. సింగపూర్ లో వున్న కుందుర్తి కవిత ఆగష్టు 11 వతేదీన ఫ్రీవర్స్ ఫ్రంట్ వాట్సాప్ సమూహం ఏర్పాటు చేసింది.అంతకు ముందు ఈ పురస్కారం అందుకున్న వారినే కాకుండా సమకాలీన కవులను సమూహంలో చేర్చాము.అయితే నలుగురైదుగురు అంతకు ముందు పురస్కారం అందుకున్న వారే ఇష్టం లేక కావచ్చు సమూహం నుండి బయటకు వెళ్ళిపోయారు. సమూహం స్తబ్దుగా లేకుండా ,కొత్త వాళ్ళకు ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు గురించి పరిచయం చేసినట్లు ఉండాలని కుందుర్తిగారి గురించి , ఫ్రీవర్స్ ఫ్రంట్ స్థాపన,అవార్డు మొదలుపెట్టటం మొదలైనవన్నీ ఒక క్రమ పద్ధతిలో రోజూ అందులో పోష్టు చేసేదాన్ని.తర్వాత రోజుకు ఒకరిద్దరు పురస్కారగ్రహీతల పరిచయం చేసాను.దానికి వారు కూడా ప్రతిస్పందించి ఆనాటి ముచ్చట్లు,సభల ఫొటోలు షేర్ చేయటంతో సమూహం ఉత్సాహవంతంగా,ఆసక్తికరంగా కొనసాగింది.ఆ గ్రూపులో దీనికి సంబంధించిన సమాచారం తప్ప మరేదీ పోష్టు చెయ్యకుండా చూసుకున్నాను. ఆగష్టు 22 వతేదీన గుంటూరు లక్ష్మీనరసయ్యగారి అధ్యక్షతన 49,50 వ ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారాల జూమ్ సమావేశం జరిగింది .సిరికి స్వామినాయుడి"మట్టిరంగు బొమ్మలు" మీద మేడిపల్లి రవికుమార్, ఇబ్రహిమ్ నిర్గుణ్ "ఇది " మీద డా.సీతారాం మాట్లాడారు.తర్వాత కూడా శివారెడ్డి గారూ తదితరులు ఫ్రీవర్స్ ఫ్రంట్ కొనసాగించుతేనే బాగుంటుంది అనే మాట్లాడారు.అప్పుడు కూడా వీర్రాజుగారు స్పష్టంగా ఖండిస్తూ మాట్లాడారు. ఫ్రీవర్స్ ఫ్రంట్ సంస్థ గురించి అనిల్ డ్యాని చేసిన ముఖాముఖి సారంగలో ప్రచురితమైంది. ఫ్రీవర్స్ ఫ్రంట్ వాట్సాప్ సమూహంలో డిసెంబర్ 22 వతేదీ కుందుర్తి ఆంజనేయులు గారి శతజయంతి కనుక అప్పటి వరకూ ఈ సమూహం కేవలం వచన కవిత్వం కోసమే కొనసాగుతుంది.సమూహ కవులు తమ కవితల్ని ఇందులో పోష్టు చేసుకోవచ్చునని సమూహం అడ్మిన్ గా నేను ప్రకటించాను.దానికి సభ్యులందరూ హర్షం వ్యక్తంచేశారు. నేను రచయిత్రుల కథల గురించి రాసిన వ్యాసాల పుస్తకానికి " కథారామంలో పూలతావులు " అనే శీర్షిక అనుకున్నాము.వ్యాసాల తర్వాత గోదావరి పత్రికలో కాత్యాయనీ విద్మహే చేసిన ముఖాముఖిని కూడా చేర్చాను.పల్లవి చక్కటి ముఖచిత్రం వేసింది.పుస్తకం చాలా బాగా వచ్చింది.చాలామంది సాహితీ వేత్తలకు పోష్టు చేసాను.మంచిస్పందన వచ్చింది.ఈ పుస్తకం మీద చక్కని సమీక్షలు కూడా వచ్చాయి.పుస్తకం పీడీఎఫ్ నిడదవోలు మాలతిగారికి ఈమెయిల్ ద్వారా పంపాను.ఆమె మొత్తం చదివి ఒక విశ్వవిద్యాలయం విద్యార్థి చేసిన పరిశోధన గ్రంథంలా వుందని ప్రశంసించటమే కాకుండా పుస్తకానికి నేను రాసిన ముందుమాట అర్థవంతంగా వుందని అన్నారు.ఆ పుస్తకానికి ఆమె కూడా సమీక్ష రాసి తన వెబ్సైట్ లో ప్రచురించారు. మాకు తెలియని మా బంధువు ఒకాయన మా ఫోన్ నెంబర్, ఇల్లూ వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చారు.బంధుత్వం కలుపుకుని వీర్రాజు గారు ఆయనకు మామయ్య అవుతారనీ,ఆయన నన్ను అక్క అని వరస కలిపాడు.వీర్రాజుగారివీ, నావీ పుస్తకాలు తీసుకున్నారు.ఆయన హిందీలో పీహెచ్డీ చేసారు కానీ బేంక్ లో ఆఫీసర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు.వీర్రాజుగారు రచించిన మైనానవలని హిందీలోకి అనువాదం చేస్తానని అంగీకారం కోరారు.ఆయన డా.కాలేపు గణేశ్ రామ్ గారు.రాజమండ్రి వాస్తవ్యులు.వీర్రాజుగారు చాలా సంతోషంగా అంగీకారం తెలియజేసారు. తర్వాత మైనా హిందీ అనువాదమే కాక తదనంతరం నా ఇస్కూలు కథల్ని అనువాదం చేసి పుస్తకం రూపంలో తీసుకువచ్చారు.నా కవితల్ని కూడా అనువాదం చేసారు.నేను నిర్వహిస్తున్న ఫ్రీవర్స్ ఫ్రంట్ సమూహం లోనికి ఆయనను చేర్చాను.దాంతో చాలామంది కవులు పరిచయం కావటంతో గణేష్ రామ్ గారు అనువాద కార్యక్రమాలు ఉధృతం చేసారు తప్పక చదవాల్సిన వంద నవలలలో వున్న మైనా నవల్ని,1969 లోనే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన నవలని ప్రచారం చేసుకునే శ్రద్ధగానీ, చొరవగానీ వీర్రాజుగారికి లేకపోవటం వలన అనువాదాలు చేయించుకోలేకపోయారు. కె.బి.గోపాలంగారు ఆంగ్లానువాదం చేసినా దాన్ని ప్రచురించే ప్రయత్నం కూడా చేయలేదు.కానీ రాజేశ్వరీ కోథండం తమిళానువాదం చేయడమే కాక పుస్తకరూపంలోకి కూడా ఆమె ప్రచురణ బాధ్యత తీసుకుని వేయించారు. అదే సమయంలో వరంగల్ నుంచి అనుకుంటాను దామోదరాచారి అనే ఆయన తాను చాలా మంది రచనల్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేసానని అవి అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందాయని నా కవిత్వాన్నీ అనువాదం చేస్తానని ఫోన్ చేసారు.ఇంట గెలవకుండా అంతర్జాతీయ స్థాయి నాకు అక్కరలేదులే అని నాకు అంతగా ఇష్టంలేక మొహమాటం కొద్దీ చెప్పలేక వీర్రాజు గారు ఖచ్చితంగా చెప్తారేమోనని ఆయనకు ఫోన్ అందించాను.వీర్రాజుగారికి నాకన్నా మొగమాటం కనుక అంగీకారం తెలియజేసారు. ఇంక ఆయన నా పుస్తకాల పీడీఎఫ్ పంపమని రోజూ ఫోన్ చేసేవారు.ఇక తప్పక శీలా సుభద్రా దేవి కవిత్వం పీడీఎఫ్ పంపించాను. దామోదరాచారిగారు ఆగమేఘాల మీద అనువాదం చేయడమే కాకుండా పుస్తకం ప్రచురించడానికి పబ్లిషర్ని కూడా మాట్లాడేసి డబ్బు పంపమని ఒత్తిడి చేసాడు.అయిదువందలు వేసుకోమని అన్నా సరే నేను అంగీకరించ లేదు.వంద కాపీలు చాలని అనువాదం చేసిన ఆయన్ని పాతిక కాపీలు తీసుకుని నాకు డెబ్భైఅయిదు పంపమన్నాను. వీర్రాజుగారి మొహమాటం వలన ఆ పుస్తకం ప్రచురణ కోసం ఇరవైమూడు వేలు పంపాల్సివచ్చింది.ఆ తర్వాత ఇంకా ఏవో అనువాదం చేస్తానని ఫోన్లు చేసినా వద్దని చెప్పి నేను స్పందించలేదు. వీర్రాజు గారి పెయింటింగ్సునీ, మాదేటి రాజాజీ పెయింటింగ్సునీ రాజమండ్రిలోని దామెర్ల రామారావు చిత్రకళా పరిషత్ లో మొదటి అంతస్తులో ఏర్పాటు చేయటానికి రవిప్రకాష్ గ్యాలరీ ఇన్చార్జి గారితో మాట్లాడానని చెప్పాడు.మొదటి అంతస్తులో పెయింటింగ్స్ పెట్టటానికి వీలుగా ఫ్రేములూ,బీములు తయారు చేయించటానికీ ,ఫోకస్ లైట్లు ఏర్పాటు చేయటానికి అతనికి కొంత సొమ్ము పంపించాము. చిన్నమరిది,తోటి కోడలు ప్రతి ఏడాది ఒక ఆరునెలలు యూఎస్ లో వున్న పిల్లల దగ్గరకు వెళ్తుంటారు.పెయింటింగ్స్ రాజమండ్రి గ్యాలరీకి ఇచ్చేయాలనుకుంటున్నామని తెలిసి పిల్లలు ఇద్దరికీ రెండు పెయింటింగ్స్ ఇమ్మని అడిగాడు.వాళ్ళు ఎంపిక చేసుకున్న పెయింటింగ్స్ రెండు ఇచ్చేసాము. మా కోసం ఇంట్లో పెట్టుకోవటానికి పల్లవి,ఆషీ నాలుగు పెయింటింగ్స్ ఎంపిక చేసారు.ఒకటి రెండు పెయింటింగ్స్ పాడైనవి వుంచేసాము.వీర్రాజుగారు తనకి అంతగా నచ్చనివి చిన్నవి పంపవద్దనుకున్నారు.మరో రెండు చిన్న సైజు ఆయిల్ చిత్రాలు కూడా మా కోసమనే దాచుకున్నాను. గ్యాలరీలో పెయింటింగ్స్ అమర్చటానికి ఏర్పాటు అంతా ముగిసాక మాదేటి రవిప్రకాష్, రవికాంత్ కలిసి వచ్చి డెభ్భై ఎనిమిది పెయింటింగ్సునీ చక్కగా పేక్ చేసి తీసుకు వెళ్ళారు. అయితే అన్నింటినీ అటకమీద నుండి దించేసరికి ఖాళీ అయిన అరల్ని చూసి దిగులు వేసింది.వీర్రాజుగారు నెలలూ సంవత్సరాల తరబడి గంటలు గంటలు కూర్చుని ఒక తపస్సుగా వేసిన చిత్రాలు అవి.అమ్మితే డబ్బు చేసుకోవచ్చును.కానీ అమ్మితే అవి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి.చిత్రకారుడి ప్రతిభ మరుగున పడి పోతుంది.ఒక దగ్గరే వుంటే అది నిలిచి పోతాయనీ భావించాము.అదీకాక వీర్రాజుగారికి రాజమండ్రి అంటే అమితమైన ప్రేమ.అక్కడే ఆ దామెర్ల రామారావు చిత్రకళా పరిషత్ లోనే తన కళకు మెరుగులు దిద్దుకున్నారు.అందువలన అక్కడ చేర్చడమే సమంజసం అనిపించింది. నిజానికి వాటిని మేము కలకాలం భద్రపరచడం కష్టమే.పల్లవీ,ఆశ్లేషాలకు కూడా భారమౌతాయేమో,గ్యాలరీలో అయితే అనేక మంది చూస్తారు.అంతేకాక కలకాలం భద్రంగా వుంటాయని భావించాము. వాళ్ళు ఆ పెయింటింగ్స్ తీసుకు వెళ్తుంటే కన్నబిడ్డని పంపినంతగా బాధతో కళ్ళు చెమ్మగిల్లాయి. అదేవిధంగా వీర్రాజుగారు దశాబ్దాల కాలంగా ప్రతి ఆదివారం సెకెండ్ హ్యాండ్ పుస్తకాల షాపులు తిరిగి చిత్రకళకు చెందిన వివిధ దేశాల పుస్తకాలు సేకరించి పెట్టుకున్నారు.అవికూడా ఆర్ట్ గ్యాలరీకి పంపించేస్తే అక్కడ చిత్రకారులకు పనికి వస్తాయని భావించి తర్వాత వాటిని కూడా పంపించేయటానికే నిశ్చయించారు.వాటిలో పల్లవి తనకు నచ్చిన కొన్ని పుస్తకాలను తనకోసం ఉంచుకుంది. ఒకరోజు తెలంగాణా సారస్వత పరిషత్తు నుండి చెన్నయ్య గారు నాకు ఫోన్ చేసి " మిమ్మల్ని ఈ ఏడాది శ్రీమతి సుశీలానారాయణరెడ్డి పురస్కారానికి ఎంపిక చేసాము.యాభైవేల నగదు ,సన్మాన పత్రం, జ్ణాపిక ప్రదానం వుంటుంది" అన్నారు. నేను వింటున్నది నిజమేనా అని అనుమానంతో మరోసారి ప్రశ్నించి అడిగాను.ఆయన మరోసారి అదే చెప్పారు." నేను నిజమేనా" అని ప్రశ్నించాను. " మీరు అవార్డులు వెంట పరిగెత్తరు.మీ దగ్గరకే అవార్డులు వెతుక్కుంటూ వస్తాయి.అందుకే ఎంపిక జరిగింది." అన్నారు చెన్నయ్యగారు.ఆ మాటకంటే పెద్ద అవార్డు ఏముంది. తర్వాత సి.నారాయణరెడ్డిగారి పెద్ద అమ్మాయి గంగ ఫోన్ చేసి ఫిబ్రవరిలో అవార్డు సభ వుంటుందని తెలియజేసి చాలా సేపు మాట్లాడారు. బయోడేటా పంపించమని చెప్పారు. సారస్వత పరిషత్తు నుండి ఒక అతన్ని పంపిస్తాననీ నా పుస్తకాలన్నిటినీ పంపమని చెన్నయ్యగారు ఫోన్ చేసి చెప్పారు.అన్నట్లుగానే పరిషత్తు నుండి వచ్చిన ఆయనకి నా పుస్తకాలు ఇచ్చి పంపించాను. సుశీలా నారాయణరెడ్డి అవార్డు కోసం ప్రయత్నాలు,పైరవీలు చేసే వారి గురించి నాకు తెలుసు.నేను ఇంతకుముందు రామలక్ష్మికి ఇచ్చినప్పుడు మాత్రమే ఆ సభకి వెళ్ళాను.తర్వాత వెళ్తే అవార్డు కోసం ప్రయత్నాలు చేసుకోటానికి వెళ్ళినట్లు ఉంటుందని ఇంతకాలంగా ఎప్పుడూ వెళ్ళలేదు. ఎప్పుడో కుందుర్తి సత్యమూర్తి, వీర్రాజు గారితో కలిపి సైదాబాద్ కో ఆపరేటివ్ బ్యాంక్ లో ఫ్రీవర్స్ ఫ్రంట్ పేరిట కొంత కొంత చొప్పున డబ్బు వేస్తుంటే అవార్డు లకు,సభకూ ఉపయోగం పడుతుందన్న ఆలోచనతో జాయెంట్అక్కౌంటు ఓపెన్ చేసారు.ఆ విషయం ఇద్దరూ మర్చిపోయినట్లున్నారు.సమత వాళ్ళ నాన్న ఫైల్స్ ఏవో వెతుకుతున్నప్పుడు పాస్ బుక్ కనిపించిందట.కరోనా కాలంలోనే సమత బేంక్ కి వెళ్ళి కనుక్కుంటే జాయింట్ అక్కౌంట్ లో ఎవరైనా జీవించినవారు సంతకం పెడితే సరిపోతుంది అని చెప్పారుట.వీలున్నప్పుడు వెళ్ళి క్లోజ్ చేయమని అవసరమైన ఫామ్స్ నింపి తీసుకు వచ్చి ఇచ్చింది. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది.జనజీవితం పూర్తిగా యథావిధిగా మారింది. ప్రపంచం అంతా వూపిరి పీల్చుకుంది. -- శీలా సుభద్రాదేవి

నడక దారిలో -64

నడక దారిలో -64 నెచ్చెలి అంతర్జాల పత్రికని నడుపుతోన్న కె.గీత "నాకు మీ జ్ణాపకాలు రెగ్యులర్ గా రాస్తారా సుభద్రగారూ"అంటూ మెసేజ్ పెట్టింది.రెగ్యులర్ రాస్తానో లేదో అనుకొంటూనే మొదట రోణంకి అప్పలస్వామి గారి కుటుంబంతో నాకు గుల సాన్నిహిత్యం తో మొదలుపెట్టి, తర్వాత, అమ్మ గురించి,తదనంతరం అక్కయ్య గురించి రాసాను.ఇంక ఆ తర్వాత జీవితంతో ముడిపడిన సంఘటనలతో జీవితకథగానే కొనసాగటం జరిగింది. కోవిడ్ పరిస్థితులు కారణంగా ఇంటికి వచ్చేవారూ,మేము వెళ్ళేది లేదు. ఎనిమిదో తరగతి తర్వాత అక్కయ్య ఇంట్లో ఉంటున్నప్పటినుండీ చిన్న పుస్తకం కుట్టుకొని మనసు నొచ్చినప్పుడూ,ఆనందం కలిగినప్పుడు అందులో నా ఆలోచనలు రాసుకునే అలవాటు మొదలై తర్వాత డైరీ బుక్ కొనుక్కుని ఉమ్మడి కుటుంబంలో సంఘటనలు వరకూ డైరీ రాయటం అలవాటైంది.అవన్నీ వివాహానంతరం తెచ్చుకున్నాను. నెచ్చెలిలో జ్ణాపకాలు రాసే నేపధ్యంలో నా పాత డైరీలన్నీ తీసి చదవటం మొదలుపెట్టాను.నా రచనకి వీర్రాజుగారే నడక దారిలో అనే శీర్షిక నిర్ణయించారు.నాకూ ఆ పేరు నచ్చింది.నడకదారిలో నా పాదాలను గుచ్చినముళ్ళూ రాళ్ళే కాకుండా తాకిన పూలూ,పరిమళాలూ కూడా రాయాలని నిర్ణయించుకున్నాను. నా డైరీలో కొన్ని సంఘటనలు చదువుతున్నప్పుడు ఎన్ని దుర్ఘటనలు ఎదుర్కొన్నాను, ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలన్నంత దుఃఖాన్ని తట్టుకుని ఈ నాడు ఇలా ఎదిగాను అని నాకే ఆశ్చర్యం కలిగించింది.కొన్ని పేజీలు అప్పుడప్పుడు వీర్రాజు గారికి కూడా చదవమని చూపించాను.తన తోబుట్టువుల ప్రవర్తనలో ,వారి మాటల్లో తప్పువుందని తెలిసినా వారిని ఏమీ అనలేక "నువ్వు చదువుకున్న దానినీ,రచయిత్రివి కనుక సహనం వహించాలని,ఎప్పుడో వాళ్ళకే తమ తప్పు తెలుస్తుందని " వీర్రాజు గారు సర్ది చెప్పినప్పుడు నేనెలా బాధ పడ్డానో డైరీలో చూపాను. నా జ్ణాపకాల్ని ఎదలోతుల్లోంచి తవ్వి తవ్వి ,తడిమి చూసుకుంటున్నప్పుడు దెబ్బలు తగిలి తగిలి నా హృదయం ఇప్పుడు ఎంత రాటుతేలిందో నాకు కూడా అర్థమైంది. అదే సమయంలో ఇంటికి స్నేహితులు ఎవరూ రాకపోవటం, ప్రపంచమంతా కోవిడ్ ప్రభావంతో మరణమృదంగం వినిపించటంతో వీర్రాజు గారు తర్వాత్తర్వాత పుస్తకాలు చదవటం కూడా మానేసి తరుచూ ఆలోచనల్లో మునిగిపోయి గదిలో కుర్చీలో చీకటిలో వుండి పోవటంతో ఆయన్ని తిరిగి ఏక్టివ్ గా చేయటానికి తొలిరోజుల్లో మేము రాసుకున్న ప్రేమ లేఖలు ఇచ్చాను.నేనూ చదివి ఆయనకీ ఇచ్చేదాన్ని.వాటవలన కూడా ఎన్నో సంఘటనలు నాకు గుర్తు వచ్చేవి. కోవిడ్ ప్రభావం కొంత తగ్గిందేమో అనిపించింది.కానీ మరో వెరియంట్ గా మారుతోంది.బయటకు వెళ్ళటానికి జనం భయపడుతూనే వున్నారు. మాడభూషి స్మారక కథలు అవార్డులు రెండు ప్రకటించినా వీర్రాజుగారు ఈ ఏడాది కూడా మీటింగ్ పెట్ట వద్దని అన్నారు.ఈ ఏడాది కూడా అవార్డు ప్రకటించి,వచ్చే ఏడాది మూడూ కలిపి ఇద్దాం అనిచెప్పి ఆ ఏడాదికి అయోధ్యా రెడ్డిగారి " అక్కన్న పేట రైల్వే స్టేషన్" కథలసంపుటిని ఎంపిక చేసారు. అదేవిధంగా ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు 2018 కి సిరికి స్వామినాయుడి 'మట్టి రంగు బొమ్మలు ' కవితా సంపుటికీ, ఇబ్రహిమ్ నిర్గుణ్ ' ఇప్పడేదీ రహస్యం కాదు' కవితా సంపుటికీ ప్రకటించడమే కాకుండా వీటితో ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు నిలుపుచేయాలనే విషయం కూడా వీర్రాజు గారు ప్రకటించారు. అయితే వాసిరెడ్డి నవీన్, శివారెడ్డి గారూ ఇంటికి వచ్చి ఫ్రీవర్స్ ఫ్రంట్ ను ఆపుచేయొద్దనీ వీర్రాజు గారి సలహా మేరకే తాము కొనసాగిస్తామనీ అని ఆయన్ని ఒప్పించాలని ప్రయత్నించారు.శంకరంగారు కూడా అదే అన్నారు.కానీ ససేమిరా వీర్రాజు గారు వొప్పుకోలేదు.కుందుర్తి, సత్యమూర్తి గార్ల అభీష్టం ప్రకారం నిబద్ధతతో పారదర్శకంగా కొనసాగించాము.దాన్ని ఇంకొకరి చేతికి అందించటానికి అంగీకరించలేదు. కోవిడ్ ప్రభావం కొంత తగ్గిందేమో అనిపించింది.కానీ మరో వెరియంట్ డెల్టాగా రెట్టింపు తీవ్రతతో విజృంభించింది.బయటకు వెళ్ళటానికి జనం భయపడుతూనే వున్నారు. ఒకవైపు కోవిడ్ అతలాకుతలం చేస్తుంటే అటు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చీదర పుట్టిస్తున్నాయి.రాజకీయ దాడులు ఒకవైపు,కేసులు మరోవైపూ.నాయకుల తిట్లతో రాజకీయాలను బురద బురద చేశాయి. తెలంగాణా లో కోవిడ్ తీవ్రత యథాస్థితిలోవున్నా రామాప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం గుర్తింపు లభించటం ఉపసమనం కలిగించింది. పెద్దాడబడుచుకు ఒంట్లో బాగుండటం లేదనీ,తరుచూ హాస్పటలైజ్ అవుతున్నట్లు తెలిసింది.వాళ్ళ ఇల్లు మా ఇంటికి అయిదు నిమిషాల నడక దూరం.కానీ కోవిడ్ సమయంలో హాస్పిటల్ నుండి వచ్చిన వాళ్ళని వెళ్ళి చూడాలంటే కొంచెం మా వయసులదృష్ట్యా జంకాము. అందులోనూ ఏప్రిల్-మే నెలల్లో డెల్టా వేరియంట్‌తో కరోనా సెకండ్ వేవ్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది.స్నేహితుల బంధువులూ,తెలిసిన వారూ చాలా మంది కోవిడ్ డెల్టా వెరియంట్ తో కన్నుమూసారు.ఆర్టిష్ట్ చంద్ర కూడా అలాగే వెళ్ళిపోయారు.రాజకీయనాయకుడు, విశ్లేషకుడు సబ్బం హరిని డెల్టా వేరియంట్ కబళించింది.అన్నింటికన్నా మమ్మల్ని షాక్ గురి చేసింది ప్రస్తుతం మా స్కూల్ హెచ్చెమ్ గా వున్న నివేదిత నెలరోజులుగా కోవిడ్ తో హాస్పిటల్ లో వుండి చనిపోవటం చాలా బాధ కలిగించింది. వీర్రాజుగారు అటువంటి పరిస్థితుల్లో ఆడపడుచును చూడటానికి వెళ్దామన్నారు.తప్పక ఆయనను తీసుకొని వాళ్ళింటికి వెళ్ళాము.ఆడబడుచు చాలా బలహీనంగానే వుంది.కొంతసేపు కూర్చుని వచ్చేసాము. డెల్టా వేరియంట్ వలన ప్రపంచమంతా భీతావహంగావుంది.హాస్పటల్సే కాకుండా రోగుల్ని క్వారంటైన్ లో వుంచి చికిత్స చేసేందుకు ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేస్తూనే వుంది.భౌతిక దేహాన్ని బంధువులకు అప్పగించకుండా నిబంధనల ప్రకారం డాక్టర్లే అంత్యక్రియలు ముగించే పరిస్థితులతో ప్రపంచమంతా భయం గుప్పిట్లో వుండిపోయింది. కరోనా రెండో దశ సమయంలో కరోనా రోగులకు ఆక్సిజన్ అవసరం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఆసుపత్రుల్లో పడకలు, ప్రాణవాయువు కొరత ఏర్పడింది. కొన్ని ఆసుపత్రుల్లో ఒక బెడ్ మీద ఇద్దరు, ముగ్గురు రోగులను ఉంచి చికిత్స అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వార్తలు. ఆక్సిజన్ సిలిండర్ల కోసం రోగుల బంధువులు పడిన అవస్థలు అంతా ఇంతా కాదు. ఏడాది పాటు రైతులు సాగు చట్టాలపై సాగించిన ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి సాగు చట్టాలను రద్దు చేసింది. అక్కయ్యకూతురు రంజన కూడా కోవిడ్ బారిన పడింది.శ్వాసతీసుకోవటమే కష్టమైన పరిస్థితిలో అర్థరాత్రి పూట ఏ హాస్పిటల్ లోనూ చేర్చటానికి ఖాళీలు లేక తిరిగి తిరిగి ఒక దాంట్లో చేర్చారని ఫోను వచ్చింది.దాంతో మాకు కూడా బెంగగా అయిపోయింది. మరికొన్ని రోజులకే ఉదయమే మా ఆడపడుచు చనిపోయిందని ఫోన్ వచ్చింది.వాళ్ళఇంటికి తీసుకు వస్తున్నామని చెప్పారు.ఇటువంటి పరిస్థితుల్లో పదిహేను రోజులకు పైగా హాస్పిటల్లో వుండి వచ్చినపుడు అంత్యక్రియలకు వెళ్ళాలంటే భయపడ్డాము.అందులోనూ ఎనభై ఏళ్ళు దాటిన వీర్రాజుగారిని ఎలా తీసుకు వెళ్ళాలని ఆలోచించాము.నేనూ, పల్లవీ వెళ్దామనుకున్నాము. ఎలాగో వీర్రాజుగారిని వప్పించి ఆయన్ని ఆషీకి అప్పగించి వెళ్ళాము.కానీ వీర్రాజుగారు తానూ వస్తానని పేచీ పెట్టటంతో ఎంతైనా రక్తసంబంధం కదా ఎవరినో ఆయన్ని తీసుకు రావటానికి పంపించాము. కార్యక్రమం ముగిసేవరకూ వుండి ఇంటికి వచ్చేసాము. మూడోరోజు దినాలు వెళ్ళటానికి ఆడపడుచు ఫొటో దగ్గర పెట్టటానికి పల్లవి మెయిన్ రోడ్డు వరకూ స్వీట్ గానీ పళ్ళుగానీ దొరుకుతాయేమోనని వెళ్ళింది. తీరా వాళ్ళింటికి వెళ్ళాలనుకునేసరికి వాళ్ళు బిల్డింగ్ కి కరెంటు లేదు.కాగలకార్యం గంధర్వులు తీర్చారన్నట్లు రెండింతస్తులు మెట్లు ఎక్కడం కష్టమని వీర్రాజుగారిని రావద్దని,కరెంటు వస్తే తీసుకు రావటానికి ఎవరినైనా పంపిస్తామని చెప్పి పల్లవీ,నేనూ వెళ్ళాం.చిన్నమరిదీ,తోటికోడలూ వచ్చారు.కుకట్పల్లిలో వున్న అన్నయ్య కొడుకులూ జ్వరాలని రాలేదు .,పెద్దమరిది ముగ్గురు పిల్లల్లో పెద్దమ్మాయి వచ్చింది. కార్యక్రమం పూర్తిచేసుకుని ఇంటికి వచ్చాము. పల్లవికి వాళ్ళు ఇంట్లో మొదలైన తలనొప్పి అంతకంతకూ ఎక్కువై సాయంత్రానికి జ్వరం వచ్చేసింది.పారాసెటమల్ టేబ్లెట్ వేసుకుని ఎందుకైనా మంచిదని చివరి రూములో పడుకుంది.అందరియిల్లు డా.వింజమూరి సూర్యప్రకాష్ గారికి ఫోన్ చేస్తే ఆయన వెంటనే క్వారంటైన్ అయిపోమని మర్నాడు బ్లడ్ టెస్ట్ చేయటానికి లేస్ అసిస్టెంట్ ను పంపుతానని అన్నారు. డా.సూర్యప్రకాష్ దంపతులు కోవిడ్ కాలానికి ప్రభుత్వం తరపున ఆన్లైన్ లో ఆరోగ్యం సలహాదారులుగా నే పనిచేస్తున్నారు. పల్లవికి టెష్టులు చేయిస్తే కోవిడ్ డెల్టా వేరియంట్ అని నిర్థారణ అయ్యింది.సూర్యప్రకాష్ గారు మేము పెద్దవాళ్ళు,ఆషీ చిన్నది కనుక హాస్పిటల్ లో చేయవద్దని ట్రీట్మెంట్ మొదలుపెట్టారు.దానికి సంబంధించిన మందులు పంపించి ఆహారనియమాలన్నీ తెలియజేసారు.రోజూ తప్పని సరిగా పప్పు ,నిమ్మరసం తీసుకోమన్నారు. పల్లవి తలుపులు వేసుకొని రూములోనే వుండిపోయింది.భోజనం, టిఫిన్ ద్వారం దగ్గర పెడితే తీసుకునేది.లక్ష్మిని తిరిగి పిలిచేవరకూ పనికి రావద్దని చెప్పాను.ఆషీ సాయంతో ఇంటి పనీ,వంటపనీ చేసుకునేదాన్ని.వారం వారం కోలివుడ్ టెష్టులు డాక్టర్ గారు చేయించారు. పల్లవికి కోవిడ్ వచ్చేసరికి వీర్రాజు గారు మరింత భయపడ్డారు.వైజాగ్ లో రంజనాకు కూడా తగ్గిపోవటం మాకు బెంగగా అయిపోయింది. బిల్డింగ్ లో వున్న స్వాతిగారు ,సరిత కూడా కూరలవీ ఒకటి రెండు సార్లు పంపించారు. ఆడపడుచు దశదినకర్మకి వాళ్ళు అమ్మాయి సంగీత పిలిచింది.కానీ పల్లవికి జ్వరతీవ్రత వుంది.అందులోనూ ఇంట్లో కోవిడ్ బాధితురాలు వుంటే ఎలా వెళ్తాము.అందుకని రాలేదని చెప్పాము.కుకటపల్లిలోనూ మారింది పిల్లలూ అందరికీ జ్వరాలు.దాంతో వాళ్ళూ ఎవరూ రాలేక పోయారు.చిన్నమరిదీ,అంతులేని భార్యా,దీప,వాళ్ళాయన మాత్రమే హాజరయ్యారు. పరిస్థితి అర్థం చేసుకోకుండా సంగీత కావాలనే అందరూ, ముఖ్యంగా మేము ఈ వంక పెట్టి రాలేదని మనసులో కక్ష పెట్టుకుంది.ఆడబడుచు ముత్తైదువులు ఆ పోవటం వలన చేట వాయినాలు అయిదుగురికి ఏర్పాటు చేసిందిట.దగ్గరే కనుక పెద్దత్తకి ఇంటికి వెళ్ళి ఇవ్వు అని మా తోటి కోడలు చెప్పటంతో మా ఇంటికి వచ్చి కవరులో ఆ చేటవాయినాన్ని తీసుకు వచ్చి మాడుముఖంతో టీపాయ్ మీద పెట్టి వెళ్ళిపోయింది.ఆమె ఇచ్చిన విధానం,ఆ ముఖం చూసాక నాకు అది ముట్టుకో బుద్ది కాలేదు.కానీ వీర్రాజుగారు బాధ పెడతారని తీసుకుని లోపల పెట్టాను. డెల్టా వేరియంట్ తీవ్రతతో జనం పిట్టల్లా రాలిపోయారు.సీతారామశాస్త్రి, రోశయ్య వంటి ప్రముఖులని తెలుగు ప్రజలు కోల్పోయారు.తెలిసిన వారూ మిత్రులూ, పరిచయస్తుల మరణాలు ఉక్కిరిబిక్కిరి చేసాయి. మూడో వారానికి పల్లవికి ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పట్టింది.కానీ డాక్టర్ గారు మేము పెద్దవాళ్ళు కనుక మరో రెండు వారాలు క్వారంటైన్ లోనే వుండమన్నారు. ఇంచుమించు రెండునెలలు అందరం చాలా టెన్షన్ లోనే వున్నాము.మళ్ళా పల్లవి మామూలుగా అయ్యేక వూపిరి పీల్చుకున్నాం.వైజాగ్ లో రంజనాకి కూడా గండం తప్పి ఆరోగ్యం కుదుటపడి ఇంటికి వచ్చింది. నడక దారిలో తప్ప రెండు నెలలుగా రాయటం చదవటం కొంచెం తగ్గింది.డైరీలు,ఉత్తరాలు వలన రాయటం ఏమంత కష్టంగా లేదు.రాయటం మొదలు పెడితే ఒకదాని తర్వాత సంఘటనలు గుర్తు వచ్చి ఎక్కడా తడబడి కూడా రాయగలుగుతున్నాను.వీర్రాజుగారు కూడా బాగా రాస్తున్నానని ప్రశంసించారు. రచయిత్రుల కథల గురించి నేను రాస్తున్న వ్యాసాలు ప్రచురితమైనవి ఇరవై మూడు అయ్యాయి.జంట రచయిత్రులు మందిరపు పద్మ,లలితల కథల గురించి రాసిన వ్యాసం చదివి రచన సాయి గారు ఫోన్ చేసారు.పద్మ,లలితలను గురించి అప్పటి వారికి తప్ప ఎవరికీ తెలియదు అటువంటి రచయిత్రులు గురించి రాయటం సంతోషంగా వుంది అని ప్రశంసించారు.అయితే 'వాళ్ళు వైజాగ్ కి చెందిన వారు. మా ఇంటికి దగ్గరలోనే ఉండేవారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు ' అన్నారు వ్యాసం పత్రికలో ప్రచురితమైనపుడు కథానిలయం లో చూసిన దానిని బట్టి తెలంగాణాలోని ఒక గ్రామానికి చెందిన వారని రాసాను.పుస్తకంగా చేయాలనుకున్నప్పుడు ఆ వాక్యం తీసేసాను. నేను రాసిన ఇరవై మూడు వ్యాసాలకు రచయిత్రులు చెందినవే సదస్సులలో ప్రసంగవ్యాసాలు రెండింటిని కలిపి " కథారామంలో పూలతావులు" గా నా వ్యాససంపుటిని ప్రచురణకు ఇచ్చాను. నేను వ్యాసాలు రాసే సందర్భంలో నిడదవోలు మాలతి కథలు గురించి రాసినప్పుడు ఆమె బ్లాగులో ఆరు కథలపుస్తకాలు ,ఎన్నెమ్మకతలు పేరిట మరో అయిదు పుస్తకాలు,రెండు నవలలు, ఆరేడు వ్యాస సంపుటాలు కాకుండా వందకు పైగా గురజాడ నుండి ఆమెతరం వరకూ కథకుల కథల్ని ఆంగ్లానువాదం చేసినట్లుగా తెలిసింది.1973లోనే యూఎస్ వెళ్ళిపోవటం తో ఆమె రచనలు చేసినా తాను బ్లాగులోనే పొందుపరిచుకోవటంతో ఇక్కడ తెలుగు వారికి ఆమె ఇంత సాహిత్య సృజన చేసినట్లు తెలియకుండా అయిందని బాధకలిగించింది. ఫేస్బుక్ లో మాలతి గారికి మెసేజ్ పెట్టి నేను ఆమె రచనలమీద సమగ్రంగా పుస్తకం రాయాలనుకున్నట్లు తెలియజేసి భఅవసరమైనప్పుడు సంప్రదించడానికి ఈ మెయిల్ ఐడి కోరాను.మాలతిగారు చాలా సంతోషంగా స్పందించారు. - శీలా సుభద్రాదేవి