28, ఏప్రిల్ 2026, మంగళవారం

ఆదూరి-సాహిత్యపు దారి

ఆదూరి.. సాహిత్యపు దారి గత నాలుగు దశాబ్దాల సాహిత్య చరిత్ర పరి శీలిస్తే కథాంశంలోను, కథనంలోను, భాషలోను, శైలి, వైచిత్రిలోను అనేక రకాల పరిణామాలు చెందింది. అంతేకాక ఈ క్రమంలో సాహిత్యంలో అనేక వాదాలు చోటుచేసుకోవటం ఒక విశేషం. పరిణామ క్రమంలో కొందరు సాహిత్యరంగంలో ఒక ముద్రని ఏర్పరుచుకుని పదేపదే వ్యాసాలలో ఉటంకించ బడుతున్నారు. మరికొందరు వాదాల జోలికి పోకుం డా తమదృష్టికి వచ్చిన కథాంశాలతో రాసుకునే వారు, విమర్శకుల దృష్టికి దూరంగా ఉండిపోతు న్నారు. ఆ కోవకు చెందిన రచయిత ఆదూరి వెంకట సీతారామ్మూర్తిగారు. 1969లో రచనా వ్యాసాంగాల్లో అడుగు పెట్టిన ఆదూరి సీతారామ్మూర్తి దాదాపు అయిదు దశాబ్దాలుగా నవలలూ, కథలూ రాస్తూ అదుగోపులి, వెన్నెల్లో పావురాళ్లు, వర్ణచిత్రం. ఆత్మధృతి, ఉత్సవ కానుక, అందని జాబిల్లి పేర్లతో ఆరు కథా సంపుటాలే కాక నవలలూ వెలువరించారు. స్థూలంగా పరిశీలిం చితే శైలినిబట్టి, కథాంశాన్ని బట్టి కథనాన్ని నడిపే విధానాన్ని బట్టి మూడు విధాలుగా వీరి కథలు విభజించవచ్చు. ఆ తేడా కూడా రచయిత రచనారంగంలోకి అడుగుపెట్టినప్పటి నుంచీ సాహిత్య ధోరణిలో వచ్చిన మార్పుకు వయస్సు రీత్యా తన ఆలోచనా రీతిలోనూ, జీవన విధానం లోనూ వచ్చిన మార్పులకు అనుగుణంగా రూపాంతరం చెందుతూ ఉండడం ఆ కథలలో గమనించవచ్చు. రచన మొదలు పెట్టిన నాటి నుంచి ఎనభయ్యవ దశకం వరకూ రాసిన కథలు ఆనాటి సాహిత్యంలో వెల్లువెత్తిన విప్లవ ధోరణులూ, శ్రీశ్రీ, కారా, రావిశాస్త్రి వంటి సాహితీవేత్తల్ని చదువుకున్న యువ ఆవేశం రచయిత కథలలో కనిపిస్తుంది. తన చేతులతో పునాది రాయి అందించిన అసిరయ్య భవన నిర్మాణ పనుల్లో ప్రమాదవశత్తూ అవిటివాడైతే, మరోవైపు భవన కంట్రాక్టరు అంత కంతకూ ఎదిగి మంత్రి అయి భవన ప్రారంభోత్సవానికి రావటం చూసిన అసిరయ్య తానెందుకు అంతకంతకూ నేలబారయ్యానని అబ్బుర పడతాడు. "రాళ్ళెత్తిన కూలి" (1984)కథాంశానికి తగినట్లు కథాకథనం రచయిత ఆసక్తికరంగా నడుపుతారు. ఇటువంటిదే మరో కథ "శిల్పి". కొడుకు గణపతిని చదువు మాన్పించి తనతో వడ్రంగి పనికి తీసుకుపోతాడు తండ్రి. పనికి రావని పడేసిన చెక్క ముక్కల్ని సాధనతో బొమ్మలుగా మార్చుతాడు గణపతి. తనకు బొమ్మలు వేయటంనేర్పిన డ్రాయింగు మాష్టారికి బొమ్మ చెక్కి ఇవ్వాలనుకుంటాడు. కానీ టింబర్ డిపో యజమాని గణపతి పనితనాన్ని గుర్తించి, చెక్కముక్కల్ని ఇచ్చి బొమ్మలు చేయించి లాభపడతాడు . ఒకసారి గణపతి చెక్కిన ప్లానెల్ శిల్పాన్ని విదేశీయుడు కొని పోటీకి పంపుతాడు. అది బహుమతికి ఎంపికౌతుంది. దాన్ని తయారు చేసింది తానేనని టింబర్ యజమాని ప్రచారం చేసుకొని సన్మానం పొందుతున్న సందర్భంలో దూరంగా నిల్చున్న గణపతిని చూసి తన నేరానికి సిగ్గుపడి గణపతిని చేరదీస్తాడు. ఈ శిల్పికథ గూర్చి ఒక సందర్భంలో వాకాటి పాండురంగారావు గారు " అసాధారణమైన విషయాన్ని అలతిపదాలతో అల్లిన శక్తివంతమైన రచన"అన్నారు. డాక్ యార్డులోని పేదరాలి పెన్షను కోసం పడే యాతనైనా, కార్పరేటు వైద్యనీతిని ఎత్తి చూపడమైనా, నిస్వార్థ సంస్కారం గల అన్నమ్మ కథ అయినా, బాలమోటారుమెకానిక్క్ వెంకటేషు జీవన పోరాటమైనా, పల్లె పాట స్వార్థపరుల చేత చిక్కి వ్యాపార వస్తువుగా మారిన వైనమైనా ఆదూరి సీతారామ్మూర్తి చేతిలో చెక్కబడిన కథనంలో పరిమాణంలో చిన్నగా వున్నా గాఢత సంతరించుకొని స్పష్టమైన పరిపూర్ణతని సాధించటంలో విజయ వంతమయ్యాయి. సాహిత్యం వలన సమాజం మారినా మారక పోయినా అప్పట్లో వచ్చిన సాహిత్య పరంపరకు శిల్పంలోగాని, కథనంలో గాని ఏమాత్రం తీసిపోకుండా రచయితకు తనదైన గుర్తింపును ఇచ్చేటి కథలు యివి . ఎనభై దశకం నుండి తొంభైయ్యవ దశకం వరకూ రాసిన కథలు ఎక్కువగా దిగువ మధ్యతరగతికి చెందిన చిరుద్యోగుల జీవితాలలోని సంక్లిష్టతని, ఆర్థిక, సామాజిక రాజకీయపరంగా, కుటుంబపరంగా భిన్న దృక్కోణాలలో బహుముఖాలుగా రచయిత అనేక కథలలో వ్యక్తీకరించారు .మరికొన్ని కథలలో ముఖ్య కారణాన్ని కథాత్మకం చేసి, జీవితాన్ని తనదైన పద్ధతిలో వ్యాఖ్యానించటం మరొక విశేషం. చదువు కొని ఉద్యోగం చేయాలని కన్న కల సుగుణకు ఇటు పుట్టింటా, అటు మెట్టినింటా వ్యతి రేకించిన నేపథ్యంలో వెలిసి పోతుంది. ఆ దశలో భర్త అనుకోకుండా మరణించటంతో కారుణ్య నియామకం వల్ల ఉద్యోగం వస్తుంది. ఆనాడు వ్యతిరేకించిన వారే నేడు సమర్ధించటంలోని పరమార్థం కేవలం ఆర్థికమే అన్న ఆలోచనలో పడుతుంది సుగుణ. ఈ కథలో మొదటినుండి చివరివరకూ సుగుణ మానసిక సంఘర్షణ, ఆలోచనల వైవిధ్యం అంతటినీ సుగుణ ఆలోచనా కథనం గా చెప్పటం కథకు మరింత బలాన్ని యిచ్చింది . 1989 లో రాసిన ' ఆవిష్కరణ' కథలో ప్రతీ కథకుడూ మమేకం ఔతాడు. రచనల్ని పుస్తక రూపంలోకి తేవటంలోని కష్ట, నష్టాలు, ఆర్థిక పరిస్థితులూ, అన్నింటినీ అధిగమించి పిల్లలసహకారంతో పుస్తకం వెలుగు చూసినా ఆవిష్కరణ, అట్టహాసాలు సామాన్య రచయితకి ఎంత భారమో తెలుపుతుంది. అంతే కాక అధికారుల, రాజకీయ ప్రాపకాలతో అంచెలంచెలుగా ఎదిగి ప్రతిభావంతులుగా పరిగణించబడి సన్మానాలు అందుకునే కుహనా రచయితలూ, కవుల్ని ఎత్తి చూపు వ్యంగ్యరచన యిది. నోరు లేని జీవాలు, స్వేచ్ఛ కోసం తెగువనీ, ధైర్యాన్ని ప్రదర్శిస్తే తమపై ఆధారపడి బతికే మనుషులంతా ఏమై పోతారో అని అనుకునే ఎద్దు స్వగతంలో సాగే కథ 'ఓ మహితాత్మకథ ' (1988) ఇటీవల ఇదే పద్ధతిలా దున్నపోతుల స్వగతంగా మరొకరి కథ ఒకపత్రికలో ప్రచురితమయ్యింది .. 90 లనుండి 2000 సం. వరకూ వచ్చిన నిరికథలలో చాలా వరకూ చిరుద్యోగులు, మధ్యతరగతి వారి జీవితాలలోని ఆర్థిక ఒడుదుడుకులతో కథలు నడుస్తాయి. అటు బడుగువర్గాలవారిలా ఇంటాల్లిపాదీ ఏపనైనా చేయటానికి వెళ్ళలేక పోవటం, ఇటు ఉన్నత వర్గాల వారిలా ఆర్థికతోడ్పాటులేక కేవలం ఇంటి పెద్ద సంపాదనే ఆధారమై సతమతమయ్యే సంక్షుభిత జీవితాల్ని అక్షరీకరించారు . మధ్యతరగతి జీవితాల్ని ఆర్థికావసరాలు ఎలా చిన్నా భిన్నం చేస్తాయో, వీటిని అధిగమించి మాన వత్వ పరిమళాల్ని ఎలా అందుకున్నారో చెబుతాయి. పల్లెల్లోను, పట్టణాల్లోనూ కడుపు చేతపట్టుకొని బతికే చిరుద్యోగుల వెతల్నే కాక, ఛిద్రమై పోతున్న మానవ సంబంధాలనూ భిన్న దృక్కోణంతో వ్యక్తీకరించటం వీరి కథల్లోని మౌలికాంశం. ఇరవయ్యవ శతాబ్దం తర్వాత రాసిన కథల్లో రచయిత జీవితానుభవం, ఆలోచనల్లో పరిణత, జీవన విధానం ఇలా అన్నింటిలోనూ పరిణామక్రమంలో మార్పు రావటం సహజం. మొదట్లోని ఆవేశం తగ్గి నిలకడగా ఆలోచించడం అలవడుతుంది. వయస్సుతో వచ్చే వేదాంత ధోరణి కొంత వుంటుంది. మొదట్లో చిన్న కథలుగా గాఢత, స్పష్టతతో కూడి ఒకింత ఆవేశం, ఆవేదన, ఆర్తితో నడిచిన కథన నిర్మాణం ఆతర్వాత కొంత వివరణాత్మకంగా, ఆచితూచి కథని నడపడమే కాక కథా పరిమాణం కూడా విస్తృతం చేసి రాయటం కనిపిస్తుంది. దేవుడంటూ వుంటే ఈ తేడాలు, ఈ దరిద్రాలూ, అన్యాయాలూ ఆక్రమాలు ఉండేవా అనుకునే పరిస్థితికి రావడానికైనా, ఎవరో దయతో ఇచ్చే ప్రసాదాలు దేవుడే ఇచ్చాడని నమ్మిన పిల్లవాడు సింహాచలంకి ఒక కథలోనూ, అందరికీ ఉన్న డబ్బు తనకెందుకు లేదనే సందేహంతో సతమతమయ్యే బుజ్జికి మరోకథలోను తెలియనిది సమాజాన్ని పట్టి పీడించే వ్యవస్థే అనేది ఈ రెండు కథల్లోను రెండు వర్గాల, రెండు వర్గాల ప్రతినిధులతో సమర్ధవంతంగా నిరూపించారు రచయిత. ముళ్లపూడినీ, మునిమాణిక్యాన్ని అభిమానించే ఆదూరి సీరియస్ కథలతో సమాంతరంగా హాస్య కథల్ని ఇష్టపడతారు. "ఎదుటి మనిషిని సంతోషపెట్టగలగటం అదీ రచనలద్వారా ఒక వరమనే భావిస్తాను అంటారు. అందుకేనేమో మొదట్లో అన్ని సీరియస్ కథలు రాసిన అదూరి 2000తర్వాత ఎక్కువగా హాస్యరచనలు చేయడం గమనార్హం. ఆకోవలో రాసిన కథలు హాస్య, వ్యంగ్య ధోరణిగా అనిపించినా కొన్నింటిలో అంతర్లీనంగా ఆవేదన సూచింపబడుతుంది. 1971 నాటికి టెస్ట్ ట్యూబ్ బేబీ గురించి చర్చింపబడుతున్న రోజుల్లోనే అదే అంశంపై ఆర్థికావసరాలకై అందుకు ఒప్పుకున్న పెళ్లికాని యువతి చివరలో బాబుని వదలలేక తానే తీసుకెళ్లిపోతుంది. సమకాలీన అంశంపై తక్షణ స్పందన. ఈ వాస్తవ సంఘటనల్నీ వేదాంతాన్ని సమపాళ్లలో మేళవించి, హృదయాన్ని కదిలించే కథ(1990) 'ఆత్మధృతి' వైదిక కర్మలు వేస్తూ దానాలు తీసుకుని జీవనం సాగించే పేదబ్రాహ్మణుడు, వాటిలోనూ చొచ్చుకువచ్చిన వ్యాపారధోరణితో విస్తుపోయి, ఆపరకర్మలపై విశ్వాసం సడలి చరమదశలో తనను తానే దానం చేసుకుని తన జీవితాన్ని పరిపూర్ణ జ్ఞానిగా ముగించడంతో రచయిత కథని ఏవిధమైన భావోద్వేగాలకూ లోను కాకుండా సంయమనంతో కథని నడిపించడం విశేషం. విభిన్న కథాంశాలలతో సాధారణమైన వాక్యనిర్మాణంతో కథని నడిపించే తీరు ఒక ఎత్తైతే కథ ముగించడం ఒక ప్రత్యేకతని సంతరిం చుకోవడం చాలా కథల్లో ఉంటుంది. కొంతమంది రచయితల్లా గంభీర సమాసాల సంభాషణల్తో సమా జాన్ని ఉద్దరిస్తున్న రీతితో పేరాలకు పేరాలు ఉండవు. మరికొంతమందిలా పాఠకులు తెలివి తక్కువవారిగా పరిగణిస్తూ మొదటినుండి పండువలిచినట్టు చెప్పరు. ఇంకొంతమందిలా కథలోకి రచయిత ప్రవేశించి తన అభిప్రాయాల్ని, పాండిత్యాన్ని గుప్పించరు. ఒక స్నేహితుడిలా ముందు ఒక వాతావరణాన్ని కల్పించి పాఠకుడిని కథలో ప్రవేశపెట్టే ఒక అనుభవాన్ని కథా రూపకంగా చెప్పినట్లుగా ఉంటాయి. ఆ తర్వాత పాఠకుడు తేలికైన సంభాషణలోనికి మమేకమౌ తాడు. ఇక ముగింపు కూడా అతి తెలివిగా పాఠకుడికే వదిలేస్తాడు రచయిత. నిజానికి రామ్మూర్తిగారి కథల్లో సింహభాగం కూటికీ, గుడ్డకీ, గూడుకీ ప్రతిదినం వెతుక్కునే చిరుద్యోగుల జీవన ప్రయాణమే దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి, ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాల కథలూ తన అవగాహన, పరిశీలనతో రచయిత, తనని తాను ఆ పాత్రల్లోకి ఆవాహన చేసుకొని కరుణారసాత్మకంగా చెప్పటమే కాకుండా, పాఠకుడికి కూడా అనుభవాన్ని దృశ్యమానం చేస్తారు. కొన్ని కథల్లో ఒక సామాజిక వర్గం వారి ఆర్థిక పరిస్థితుల పట్ల కాస్తంత పక్షపాత వైఖరీ, సానుభూతి కనబరిచినా పాఠకుడు అందులోని మానవీయ దృక్కోణాన్ని దర్శించగలుగుతాడు. మనసుకి అర్ద్రత కలిగించడమే కాకుండా పాఠకుణ్ణి నేలమీదనే నడిపించి మానవత్వానికి అద్దంపడతాయి. మానవీయవిలువల పట్ల రచయితకు గల గాఢ అనురక్తి చాలా కథల్లో ప్రస్ఫుటమౌతుంది. ఉద్యమ ధోరణికి లోను కాకుండా సమాజంలో జరిగే అన్యాయాలపట్ల సానుభూతితో సామరస్య పూర్వకంగా పరిష్కారం దిశగా ఆశావాదిలా ప్రతిస్పందిస్తాడు రచయిత. భార్య భర్తలిద్దరూ సాహిత్యరంగంలో వున్నప్పుడు ఒకరిపేరు ఎక్కువగా ప్రస్పుటమై రెండవవారు ఛాయామాత్రంగా గుర్తింపు పొందుతారు. ఈ ఛాయగా మిగలటం ఎక్కువగా భార్యల వంతు ఔతుంది కానీ ఆదూరి దంపతుల్లో సత్యవతీదేవిగారి కవయిత్రిగా వినబడినంతగా సీతారామ్మూర్తి గారి పేరు వినబడలేదేమో. సత్యవతిదేవి భౌతికంగా దూరమయ్యాక ఆమె రచనల్నీ, ఆమె సాహిత్యంపై ప్రముఖుల ప్రశంస పూర్వక వ్యాసాల్ని ఏరి కూర్చుతూ ప్రచురించి ఆదూరి సత్యవతీదేవి పేరుని సాహిత్య రంగంలో శాశ్వతత్వం కలిగించే ప్రయత్నం నిరంతరం చేస్తున్న గొప్ప ప్రేమికుడిగా రామ్మూర్తిగారు కనిపించుతారు. కానీ తన రచనల్నీ, తన ప్రతిభని చాటుకునే ప్రయత్నం చేయలేదు. బహుశ అందువల్లే అనేక కథాసంపుటాలు, నవలలూ ఇంత కాలంగా రాసి ప్రచురిస్తున్న ఆదూరి సీతారామ్మూర్తి గారి పేరుని సాహిత్యలోకం అంతగా పట్టించుకోలేదేమో. (లీడర్ ,ఆదివారం 7-4-2019) శీలా సుభద్రాదేవి,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి