28, మే 2026, గురువారం

నడక దారిలో -65

నడక దారిలో -65 కేంద్ర సాహిత్య అకాడమీ వారు కవులకు కవిసంధి,రచయితలకు కథాసంధి అనే పరిచయం కార్యక్రమాల నిర్వహణ ఎప్పటినుండో కొనసాగుతూ వుంటుంది .ఎనభైరెండేళ్ళ వయసులో వీర్రాజుగార్ని రచయితగా గుర్తించారు కాబోలు కరోనాకాలంలో జూమ్ సమావేశంలో కథాసంధి కార్యక్రమం జరిగింది. "పోనీలే ఇప్పుడైనా గుర్తొచ్చాను" అని అల్ప సంతోషి అయిన వీర్రాజుగారు సంబరపడ్డారు. కరోనా పరిస్థితులు చూస్తుండేసరికి వీర్రాజుగారికీ ఇంటినిండా నిండిపోయిన పుస్తకాలూ, వీర్రాజుగారి పెయింటింగ్స్,నాలుగైదు దశాబ్దాలకు పైగా సేకరించిన కళాకృతులు పిల్లలకు భారమోతుందేమో అనే భయం, బెంగా మా మనసుల్లో నిండిపోయింది. గ్యాలరీ ఏర్పాటు చేయాలంటే ఇండిపెండెంట్ ఇల్లు కాదు. మాది అపార్ట్మెంట్. వీర్రాజుగారు రాజమండ్రి లోని మాదేటి రాజాజీ అన్న కొడుకు రవిప్రకాష్ ని సంప్రదించారు." మా చిన్నాన్న పెయింటింగ్స్ కూడా పెట్టే వుద్దేశ్యం వుంది.మీ పెయింటింగ్స్ కూడా కుదురితే అలా చేద్దాం " అన్నాడు.మా పుస్తకాలని విశ్వవిద్యాలయాల లైబ్రరీలకు పంపాలని వాటి చిరునామాలు గూగుల్ లో వెతికి తెలుగు శాఖా అధ్యక్షులు ఫోన్ నెంబర్లు వుంటే వాళ్ళకి మెసేజ్ పెట్టాను.వాళ్ళ అంగీకారం తెలిపిన తర్వాత కేవలం మా రచనలను పార్సిల్ చేసి పంపించాము.అందుకున్నట్లు తిరిగి మెసేజ్ లు పెట్టారుకానీ ఏ విశ్వవిద్యాలయం శాఖా కూడా అక్నాలెడ్జ్ వుత్తరం మాత్రం ఇవ్వలేదు.రచయితలను గౌరవించే సంస్కృతి లేదనిపించింది.అయితే విశ్వవిద్యాలయం లైబ్రరీలో కొన్నైనా పుస్తకాలు వెళ్ళాయన్న ఒక తృప్తి అంతే. ఇప్పుడిప్పుడే ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కార సభ పెట్టే అవకాశం లేదనిపించి వీర్రాజుగారు జూమ్ సమావేశం ఏర్పాటు చేసి ,వాళ్ళ అక్కౌంటుకు పురస్కార నగదు పంపించేద్దాం, హైదరాబాద్ వచ్చినప్పుడు జ్ణాపిక అందజేద్దాం అని నిర్ణయించి కుందుర్తి కుటుంబంతో సంప్రదించారు.వాళ్ళు కూడా అవార్డులు ఇచ్చేస్తే ఇంకా బాధ్యత తీరిపోతుంది అని అన్నారు. సింగపూర్ లో వున్న కుందుర్తి కవిత ఆగష్టు 11 వతేదీన ఫ్రీవర్స్ ఫ్రంట్ వాట్సాప్ సమూహం ఏర్పాటు చేసింది.అంతకు ముందు ఈ పురస్కారం అందుకున్న వారినే కాకుండా సమకాలీన కవులను సమూహంలో చేర్చాము.అయితే నలుగురైదుగురు అంతకు ముందు పురస్కారం అందుకున్న వారే ఇష్టం లేక కావచ్చు సమూహం నుండి బయటకు వెళ్ళిపోయారు. సమూహం స్తబ్దుగా లేకుండా ,కొత్త వాళ్ళకు ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు గురించి పరిచయం చేసినట్లు ఉండాలని కుందుర్తిగారి గురించి , ఫ్రీవర్స్ ఫ్రంట్ స్థాపన,అవార్డు మొదలుపెట్టటం మొదలైనవన్నీ ఒక క్రమ పద్ధతిలో రోజూ అందులో పోష్టు చేసేదాన్ని.తర్వాత రోజుకు ఒకరిద్దరు పురస్కారగ్రహీతల పరిచయం చేసాను.దానికి వారు కూడా ప్రతిస్పందించి ఆనాటి ముచ్చట్లు,సభల ఫొటోలు షేర్ చేయటంతో సమూహం ఉత్సాహవంతంగా,ఆసక్తికరంగా కొనసాగింది.ఆ గ్రూపులో దీనికి సంబంధించిన సమాచారం తప్ప మరేదీ పోష్టు చెయ్యకుండా చూసుకున్నాను. ఆగష్టు 22 వతేదీన గుంటూరు లక్ష్మీనరసయ్యగారి అధ్యక్షతన 49,50 వ ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారాల జూమ్ సమావేశం జరిగింది .సిరికి స్వామినాయుడి"మట్టిరంగు బొమ్మలు" మీద మేడిపల్లి రవికుమార్, ఇబ్రహిమ్ నిర్గుణ్ "ఇది " మీద డా.సీతారాం మాట్లాడారు.తర్వాత కూడా శివారెడ్డి గారూ తదితరులు ఫ్రీవర్స్ ఫ్రంట్ కొనసాగించుతేనే బాగుంటుంది అనే మాట్లాడారు.అప్పుడు కూడా వీర్రాజుగారు స్పష్టంగా ఖండిస్తూ మాట్లాడారు. ఫ్రీవర్స్ ఫ్రంట్ సంస్థ గురించి అనిల్ డ్యాని చేసిన ముఖాముఖి సారంగలో ప్రచురితమైంది. ఫ్రీవర్స్ ఫ్రంట్ వాట్సాప్ సమూహంలో డిసెంబర్ 22 వతేదీ కుందుర్తి ఆంజనేయులు గారి శతజయంతి కనుక అప్పటి వరకూ ఈ సమూహం కేవలం వచన కవిత్వం కోసమే కొనసాగుతుంది.సమూహ కవులు తమ కవితల్ని ఇందులో పోష్టు చేసుకోవచ్చునని సమూహం అడ్మిన్ గా నేను ప్రకటించాను.దానికి సభ్యులందరూ హర్షం వ్యక్తంచేశారు. నేను రచయిత్రుల కథల గురించి రాసిన వ్యాసాల పుస్తకానికి " కథారామంలో పూలతావులు " అనే శీర్షిక అనుకున్నాము.వ్యాసాల తర్వాత గోదావరి పత్రికలో కాత్యాయనీ విద్మహే చేసిన ముఖాముఖిని కూడా చేర్చాను.పల్లవి చక్కటి ముఖచిత్రం వేసింది.పుస్తకం చాలా బాగా వచ్చింది.చాలామంది సాహితీ వేత్తలకు పోష్టు చేసాను.మంచిస్పందన వచ్చింది.ఈ పుస్తకం మీద చక్కని సమీక్షలు కూడా వచ్చాయి.పుస్తకం పీడీఎఫ్ నిడదవోలు మాలతిగారికి ఈమెయిల్ ద్వారా పంపాను.ఆమె మొత్తం చదివి ఒక విశ్వవిద్యాలయం విద్యార్థి చేసిన పరిశోధన గ్రంథంలా వుందని ప్రశంసించటమే కాకుండా పుస్తకానికి నేను రాసిన ముందుమాట అర్థవంతంగా వుందని అన్నారు.ఆ పుస్తకానికి ఆమె కూడా సమీక్ష రాసి తన వెబ్సైట్ లో ప్రచురించారు. మాకు తెలియని మా బంధువు ఒకాయన మా ఫోన్ నెంబర్, ఇల్లూ వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చారు.బంధుత్వం కలుపుకుని వీర్రాజు గారు ఆయనకు మామయ్య అవుతారనీ,ఆయన నన్ను అక్క అని వరస కలిపాడు.వీర్రాజుగారివీ, నావీ పుస్తకాలు తీసుకున్నారు.ఆయన హిందీలో పీహెచ్డీ చేసారు కానీ బేంక్ లో ఆఫీసర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు.వీర్రాజుగారు రచించిన మైనానవలని హిందీలోకి అనువాదం చేస్తానని అంగీకారం కోరారు.ఆయన డా.కాలేపు గణేశ్ రామ్ గారు.రాజమండ్రి వాస్తవ్యులు.వీర్రాజుగారు చాలా సంతోషంగా అంగీకారం తెలియజేసారు. తర్వాత మైనా హిందీ అనువాదమే కాక తదనంతరం నా ఇస్కూలు కథల్ని అనువాదం చేసి పుస్తకం రూపంలో తీసుకువచ్చారు.నా కవితల్ని కూడా అనువాదం చేసారు.నేను నిర్వహిస్తున్న ఫ్రీవర్స్ ఫ్రంట్ సమూహం లోనికి ఆయనను చేర్చాను.దాంతో చాలామంది కవులు పరిచయం కావటంతో గణేష్ రామ్ గారు అనువాద కార్యక్రమాలు ఉధృతం చేసారు తప్పక చదవాల్సిన వంద నవలలలో వున్న మైనా నవల్ని,1969 లోనే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన నవలని ప్రచారం చేసుకునే శ్రద్ధగానీ, చొరవగానీ వీర్రాజుగారికి లేకపోవటం వలన అనువాదాలు చేయించుకోలేకపోయారు. కె.బి.గోపాలంగారు ఆంగ్లానువాదం చేసినా దాన్ని ప్రచురించే ప్రయత్నం కూడా చేయలేదు.కానీ రాజేశ్వరీ కోథండం తమిళానువాదం చేయడమే కాక పుస్తకరూపంలోకి కూడా ఆమె ప్రచురణ బాధ్యత తీసుకుని వేయించారు. అదే సమయంలో వరంగల్ నుంచి అనుకుంటాను దామోదరాచారి అనే ఆయన తాను చాలా మంది రచనల్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేసానని అవి అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందాయని నా కవిత్వాన్నీ అనువాదం చేస్తానని ఫోన్ చేసారు.ఇంట గెలవకుండా అంతర్జాతీయ స్థాయి నాకు అక్కరలేదులే అని నాకు అంతగా ఇష్టంలేక మొహమాటం కొద్దీ చెప్పలేక వీర్రాజు గారు ఖచ్చితంగా చెప్తారేమోనని ఆయనకు ఫోన్ అందించాను.వీర్రాజుగారికి నాకన్నా మొగమాటం కనుక అంగీకారం తెలియజేసారు. ఇంక ఆయన నా పుస్తకాల పీడీఎఫ్ పంపమని రోజూ ఫోన్ చేసేవారు.ఇక తప్పక శీలా సుభద్రా దేవి కవిత్వం పీడీఎఫ్ పంపించాను. దామోదరాచారిగారు ఆగమేఘాల మీద అనువాదం చేయడమే కాకుండా పుస్తకం ప్రచురించడానికి పబ్లిషర్ని కూడా మాట్లాడేసి డబ్బు పంపమని ఒత్తిడి చేసాడు.అయిదువందలు వేసుకోమని అన్నా సరే నేను అంగీకరించ లేదు.వంద కాపీలు చాలని అనువాదం చేసిన ఆయన్ని పాతిక కాపీలు తీసుకుని నాకు డెబ్భైఅయిదు పంపమన్నాను. వీర్రాజుగారి మొహమాటం వలన ఆ పుస్తకం ప్రచురణ కోసం ఇరవైమూడు వేలు పంపాల్సివచ్చింది.ఆ తర్వాత ఇంకా ఏవో అనువాదం చేస్తానని ఫోన్లు చేసినా వద్దని చెప్పి నేను స్పందించలేదు. వీర్రాజు గారి పెయింటింగ్సునీ, మాదేటి రాజాజీ పెయింటింగ్సునీ రాజమండ్రిలోని దామెర్ల రామారావు చిత్రకళా పరిషత్ లో మొదటి అంతస్తులో ఏర్పాటు చేయటానికి రవిప్రకాష్ గ్యాలరీ ఇన్చార్జి గారితో మాట్లాడానని చెప్పాడు.మొదటి అంతస్తులో పెయింటింగ్స్ పెట్టటానికి వీలుగా ఫ్రేములూ,బీములు తయారు చేయించటానికీ ,ఫోకస్ లైట్లు ఏర్పాటు చేయటానికి అతనికి కొంత సొమ్ము పంపించాము. చిన్నమరిది,తోటి కోడలు ప్రతి ఏడాది ఒక ఆరునెలలు యూఎస్ లో వున్న పిల్లల దగ్గరకు వెళ్తుంటారు.పెయింటింగ్స్ రాజమండ్రి గ్యాలరీకి ఇచ్చేయాలనుకుంటున్నామని తెలిసి పిల్లలు ఇద్దరికీ రెండు పెయింటింగ్స్ ఇమ్మని అడిగాడు.వాళ్ళు ఎంపిక చేసుకున్న పెయింటింగ్స్ రెండు ఇచ్చేసాము. మా కోసం ఇంట్లో పెట్టుకోవటానికి పల్లవి,ఆషీ నాలుగు పెయింటింగ్స్ ఎంపిక చేసారు.ఒకటి రెండు పెయింటింగ్స్ పాడైనవి వుంచేసాము.వీర్రాజుగారు తనకి అంతగా నచ్చనివి చిన్నవి పంపవద్దనుకున్నారు.మరో రెండు చిన్న సైజు ఆయిల్ చిత్రాలు కూడా మా కోసమనే దాచుకున్నాను. గ్యాలరీలో పెయింటింగ్స్ అమర్చటానికి ఏర్పాటు అంతా ముగిసాక మాదేటి రవిప్రకాష్, రవికాంత్ కలిసి వచ్చి డెభ్భై ఎనిమిది పెయింటింగ్సునీ చక్కగా పేక్ చేసి తీసుకు వెళ్ళారు. అయితే అన్నింటినీ అటకమీద నుండి దించేసరికి ఖాళీ అయిన అరల్ని చూసి దిగులు వేసింది.వీర్రాజుగారు నెలలూ సంవత్సరాల తరబడి గంటలు గంటలు కూర్చుని ఒక తపస్సుగా వేసిన చిత్రాలు అవి.అమ్మితే డబ్బు చేసుకోవచ్చును.కానీ అమ్మితే అవి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి.చిత్రకారుడి ప్రతిభ మరుగున పడి పోతుంది.ఒక దగ్గరే వుంటే అది నిలిచి పోతాయనీ భావించాము.అదీకాక వీర్రాజుగారికి రాజమండ్రి అంటే అమితమైన ప్రేమ.అక్కడే ఆ దామెర్ల రామారావు చిత్రకళా పరిషత్ లోనే తన కళకు మెరుగులు దిద్దుకున్నారు.అందువలన అక్కడ చేర్చడమే సమంజసం అనిపించింది. నిజానికి వాటిని మేము కలకాలం భద్రపరచడం కష్టమే.పల్లవీ,ఆశ్లేషాలకు కూడా భారమౌతాయేమో,గ్యాలరీలో అయితే అనేక మంది చూస్తారు.అంతేకాక కలకాలం భద్రంగా వుంటాయని భావించాము. వాళ్ళు ఆ పెయింటింగ్స్ తీసుకు వెళ్తుంటే కన్నబిడ్డని పంపినంతగా బాధతో కళ్ళు చెమ్మగిల్లాయి. అదేవిధంగా వీర్రాజుగారు దశాబ్దాల కాలంగా ప్రతి ఆదివారం సెకెండ్ హ్యాండ్ పుస్తకాల షాపులు తిరిగి చిత్రకళకు చెందిన వివిధ దేశాల పుస్తకాలు సేకరించి పెట్టుకున్నారు.అవికూడా ఆర్ట్ గ్యాలరీకి పంపించేస్తే అక్కడ చిత్రకారులకు పనికి వస్తాయని భావించి తర్వాత వాటిని కూడా పంపించేయటానికే నిశ్చయించారు.వాటిలో పల్లవి తనకు నచ్చిన కొన్ని పుస్తకాలను తనకోసం ఉంచుకుంది. ఒకరోజు తెలంగాణా సారస్వత పరిషత్తు నుండి చెన్నయ్య గారు నాకు ఫోన్ చేసి " మిమ్మల్ని ఈ ఏడాది శ్రీమతి సుశీలానారాయణరెడ్డి పురస్కారానికి ఎంపిక చేసాము.యాభైవేల నగదు ,సన్మాన పత్రం, జ్ణాపిక ప్రదానం వుంటుంది" అన్నారు. నేను వింటున్నది నిజమేనా అని అనుమానంతో మరోసారి ప్రశ్నించి అడిగాను.ఆయన మరోసారి అదే చెప్పారు." నేను నిజమేనా" అని ప్రశ్నించాను. " మీరు అవార్డులు వెంట పరిగెత్తరు.మీ దగ్గరకే అవార్డులు వెతుక్కుంటూ వస్తాయి.అందుకే ఎంపిక జరిగింది." అన్నారు చెన్నయ్యగారు.ఆ మాటకంటే పెద్ద అవార్డు ఏముంది. తర్వాత సి.నారాయణరెడ్డిగారి పెద్ద అమ్మాయి గంగ ఫోన్ చేసి ఫిబ్రవరిలో అవార్డు సభ వుంటుందని తెలియజేసి చాలా సేపు మాట్లాడారు. బయోడేటా పంపించమని చెప్పారు. సారస్వత పరిషత్తు నుండి ఒక అతన్ని పంపిస్తాననీ నా పుస్తకాలన్నిటినీ పంపమని చెన్నయ్యగారు ఫోన్ చేసి చెప్పారు.అన్నట్లుగానే పరిషత్తు నుండి వచ్చిన ఆయనకి నా పుస్తకాలు ఇచ్చి పంపించాను. సుశీలా నారాయణరెడ్డి అవార్డు కోసం ప్రయత్నాలు,పైరవీలు చేసే వారి గురించి నాకు తెలుసు.నేను ఇంతకుముందు రామలక్ష్మికి ఇచ్చినప్పుడు మాత్రమే ఆ సభకి వెళ్ళాను.తర్వాత వెళ్తే అవార్డు కోసం ప్రయత్నాలు చేసుకోటానికి వెళ్ళినట్లు ఉంటుందని ఇంతకాలంగా ఎప్పుడూ వెళ్ళలేదు. ఎప్పుడో కుందుర్తి సత్యమూర్తి, వీర్రాజు గారితో కలిపి సైదాబాద్ కో ఆపరేటివ్ బ్యాంక్ లో ఫ్రీవర్స్ ఫ్రంట్ పేరిట కొంత కొంత చొప్పున డబ్బు వేస్తుంటే అవార్డు లకు,సభకూ ఉపయోగం పడుతుందన్న ఆలోచనతో జాయెంట్అక్కౌంటు ఓపెన్ చేసారు.ఆ విషయం ఇద్దరూ మర్చిపోయినట్లున్నారు.సమత వాళ్ళ నాన్న ఫైల్స్ ఏవో వెతుకుతున్నప్పుడు పాస్ బుక్ కనిపించిందట.కరోనా కాలంలోనే సమత బేంక్ కి వెళ్ళి కనుక్కుంటే జాయింట్ అక్కౌంట్ లో ఎవరైనా జీవించినవారు సంతకం పెడితే సరిపోతుంది అని చెప్పారుట.వీలున్నప్పుడు వెళ్ళి క్లోజ్ చేయమని అవసరమైన ఫామ్స్ నింపి తీసుకు వచ్చి ఇచ్చింది. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది.జనజీవితం పూర్తిగా యథావిధిగా మారింది. ప్రపంచం అంతా వూపిరి పీల్చుకుంది. -- శీలా సుభద్రాదేవి

నడక దారిలో -64

నడక దారిలో -64 నెచ్చెలి అంతర్జాల పత్రికని నడుపుతోన్న కె.గీత "నాకు మీ జ్ణాపకాలు రెగ్యులర్ గా రాస్తారా సుభద్రగారూ"అంటూ మెసేజ్ పెట్టింది.రెగ్యులర్ రాస్తానో లేదో అనుకొంటూనే మొదట రోణంకి అప్పలస్వామి గారి కుటుంబంతో నాకు గుల సాన్నిహిత్యం తో మొదలుపెట్టి, తర్వాత, అమ్మ గురించి,తదనంతరం అక్కయ్య గురించి రాసాను.ఇంక ఆ తర్వాత జీవితంతో ముడిపడిన సంఘటనలతో జీవితకథగానే కొనసాగటం జరిగింది. కోవిడ్ పరిస్థితులు కారణంగా ఇంటికి వచ్చేవారూ,మేము వెళ్ళేది లేదు. ఎనిమిదో తరగతి తర్వాత అక్కయ్య ఇంట్లో ఉంటున్నప్పటినుండీ చిన్న పుస్తకం కుట్టుకొని మనసు నొచ్చినప్పుడూ,ఆనందం కలిగినప్పుడు అందులో నా ఆలోచనలు రాసుకునే అలవాటు మొదలై తర్వాత డైరీ బుక్ కొనుక్కుని ఉమ్మడి కుటుంబంలో సంఘటనలు వరకూ డైరీ రాయటం అలవాటైంది.అవన్నీ వివాహానంతరం తెచ్చుకున్నాను. నెచ్చెలిలో జ్ణాపకాలు రాసే నేపధ్యంలో నా పాత డైరీలన్నీ తీసి చదవటం మొదలుపెట్టాను.నా రచనకి వీర్రాజుగారే నడక దారిలో అనే శీర్షిక నిర్ణయించారు.నాకూ ఆ పేరు నచ్చింది.నడకదారిలో నా పాదాలను గుచ్చినముళ్ళూ రాళ్ళే కాకుండా తాకిన పూలూ,పరిమళాలూ కూడా రాయాలని నిర్ణయించుకున్నాను. నా డైరీలో కొన్ని సంఘటనలు చదువుతున్నప్పుడు ఎన్ని దుర్ఘటనలు ఎదుర్కొన్నాను, ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలన్నంత దుఃఖాన్ని తట్టుకుని ఈ నాడు ఇలా ఎదిగాను అని నాకే ఆశ్చర్యం కలిగించింది.కొన్ని పేజీలు అప్పుడప్పుడు వీర్రాజు గారికి కూడా చదవమని చూపించాను.తన తోబుట్టువుల ప్రవర్తనలో ,వారి మాటల్లో తప్పువుందని తెలిసినా వారిని ఏమీ అనలేక "నువ్వు చదువుకున్న దానినీ,రచయిత్రివి కనుక సహనం వహించాలని,ఎప్పుడో వాళ్ళకే తమ తప్పు తెలుస్తుందని " వీర్రాజు గారు సర్ది చెప్పినప్పుడు నేనెలా బాధ పడ్డానో డైరీలో చూపాను. నా జ్ణాపకాల్ని ఎదలోతుల్లోంచి తవ్వి తవ్వి ,తడిమి చూసుకుంటున్నప్పుడు దెబ్బలు తగిలి తగిలి నా హృదయం ఇప్పుడు ఎంత రాటుతేలిందో నాకు కూడా అర్థమైంది. అదే సమయంలో ఇంటికి స్నేహితులు ఎవరూ రాకపోవటం, ప్రపంచమంతా కోవిడ్ ప్రభావంతో మరణమృదంగం వినిపించటంతో వీర్రాజు గారు తర్వాత్తర్వాత పుస్తకాలు చదవటం కూడా మానేసి తరుచూ ఆలోచనల్లో మునిగిపోయి గదిలో కుర్చీలో చీకటిలో వుండి పోవటంతో ఆయన్ని తిరిగి ఏక్టివ్ గా చేయటానికి తొలిరోజుల్లో మేము రాసుకున్న ప్రేమ లేఖలు ఇచ్చాను.నేనూ చదివి ఆయనకీ ఇచ్చేదాన్ని.వాటవలన కూడా ఎన్నో సంఘటనలు నాకు గుర్తు వచ్చేవి. కోవిడ్ ప్రభావం కొంత తగ్గిందేమో అనిపించింది.కానీ మరో వెరియంట్ గా మారుతోంది.బయటకు వెళ్ళటానికి జనం భయపడుతూనే వున్నారు. మాడభూషి స్మారక కథలు అవార్డులు రెండు ప్రకటించినా వీర్రాజుగారు ఈ ఏడాది కూడా మీటింగ్ పెట్ట వద్దని అన్నారు.ఈ ఏడాది కూడా అవార్డు ప్రకటించి,వచ్చే ఏడాది మూడూ కలిపి ఇద్దాం అనిచెప్పి ఆ ఏడాదికి అయోధ్యా రెడ్డిగారి " అక్కన్న పేట రైల్వే స్టేషన్" కథలసంపుటిని ఎంపిక చేసారు. అదేవిధంగా ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు 2018 కి సిరికి స్వామినాయుడి 'మట్టి రంగు బొమ్మలు ' కవితా సంపుటికీ, ఇబ్రహిమ్ నిర్గుణ్ ' ఇప్పడేదీ రహస్యం కాదు' కవితా సంపుటికీ ప్రకటించడమే కాకుండా వీటితో ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు నిలుపుచేయాలనే విషయం కూడా వీర్రాజు గారు ప్రకటించారు. అయితే వాసిరెడ్డి నవీన్, శివారెడ్డి గారూ ఇంటికి వచ్చి ఫ్రీవర్స్ ఫ్రంట్ ను ఆపుచేయొద్దనీ వీర్రాజు గారి సలహా మేరకే తాము కొనసాగిస్తామనీ అని ఆయన్ని ఒప్పించాలని ప్రయత్నించారు.శంకరంగారు కూడా అదే అన్నారు.కానీ ససేమిరా వీర్రాజు గారు వొప్పుకోలేదు.కుందుర్తి, సత్యమూర్తి గార్ల అభీష్టం ప్రకారం నిబద్ధతతో పారదర్శకంగా కొనసాగించాము.దాన్ని ఇంకొకరి చేతికి అందించటానికి అంగీకరించలేదు. కోవిడ్ ప్రభావం కొంత తగ్గిందేమో అనిపించింది.కానీ మరో వెరియంట్ డెల్టాగా రెట్టింపు తీవ్రతతో విజృంభించింది.బయటకు వెళ్ళటానికి జనం భయపడుతూనే వున్నారు. ఒకవైపు కోవిడ్ అతలాకుతలం చేస్తుంటే అటు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చీదర పుట్టిస్తున్నాయి.రాజకీయ దాడులు ఒకవైపు,కేసులు మరోవైపూ.నాయకుల తిట్లతో రాజకీయాలను బురద బురద చేశాయి. తెలంగాణా లో కోవిడ్ తీవ్రత యథాస్థితిలోవున్నా రామాప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం గుర్తింపు లభించటం ఉపసమనం కలిగించింది. పెద్దాడబడుచుకు ఒంట్లో బాగుండటం లేదనీ,తరుచూ హాస్పటలైజ్ అవుతున్నట్లు తెలిసింది.వాళ్ళ ఇల్లు మా ఇంటికి అయిదు నిమిషాల నడక దూరం.కానీ కోవిడ్ సమయంలో హాస్పిటల్ నుండి వచ్చిన వాళ్ళని వెళ్ళి చూడాలంటే కొంచెం మా వయసులదృష్ట్యా జంకాము. అందులోనూ ఏప్రిల్-మే నెలల్లో డెల్టా వేరియంట్‌తో కరోనా సెకండ్ వేవ్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది.స్నేహితుల బంధువులూ,తెలిసిన వారూ చాలా మంది కోవిడ్ డెల్టా వెరియంట్ తో కన్నుమూసారు.ఆర్టిష్ట్ చంద్ర కూడా అలాగే వెళ్ళిపోయారు.రాజకీయనాయకుడు, విశ్లేషకుడు సబ్బం హరిని డెల్టా వేరియంట్ కబళించింది.అన్నింటికన్నా మమ్మల్ని షాక్ గురి చేసింది ప్రస్తుతం మా స్కూల్ హెచ్చెమ్ గా వున్న నివేదిత నెలరోజులుగా కోవిడ్ తో హాస్పిటల్ లో వుండి చనిపోవటం చాలా బాధ కలిగించింది. వీర్రాజుగారు అటువంటి పరిస్థితుల్లో ఆడపడుచును చూడటానికి వెళ్దామన్నారు.తప్పక ఆయనను తీసుకొని వాళ్ళింటికి వెళ్ళాము.ఆడబడుచు చాలా బలహీనంగానే వుంది.కొంతసేపు కూర్చుని వచ్చేసాము. డెల్టా వేరియంట్ వలన ప్రపంచమంతా భీతావహంగావుంది.హాస్పటల్సే కాకుండా రోగుల్ని క్వారంటైన్ లో వుంచి చికిత్స చేసేందుకు ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేస్తూనే వుంది.భౌతిక దేహాన్ని బంధువులకు అప్పగించకుండా నిబంధనల ప్రకారం డాక్టర్లే అంత్యక్రియలు ముగించే పరిస్థితులతో ప్రపంచమంతా భయం గుప్పిట్లో వుండిపోయింది. కరోనా రెండో దశ సమయంలో కరోనా రోగులకు ఆక్సిజన్ అవసరం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఆసుపత్రుల్లో పడకలు, ప్రాణవాయువు కొరత ఏర్పడింది. కొన్ని ఆసుపత్రుల్లో ఒక బెడ్ మీద ఇద్దరు, ముగ్గురు రోగులను ఉంచి చికిత్స అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వార్తలు. ఆక్సిజన్ సిలిండర్ల కోసం రోగుల బంధువులు పడిన అవస్థలు అంతా ఇంతా కాదు. ఏడాది పాటు రైతులు సాగు చట్టాలపై సాగించిన ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి సాగు చట్టాలను రద్దు చేసింది. అక్కయ్యకూతురు రంజన కూడా కోవిడ్ బారిన పడింది.శ్వాసతీసుకోవటమే కష్టమైన పరిస్థితిలో అర్థరాత్రి పూట ఏ హాస్పిటల్ లోనూ చేర్చటానికి ఖాళీలు లేక తిరిగి తిరిగి ఒక దాంట్లో చేర్చారని ఫోను వచ్చింది.దాంతో మాకు కూడా బెంగగా అయిపోయింది. మరికొన్ని రోజులకే ఉదయమే మా ఆడపడుచు చనిపోయిందని ఫోన్ వచ్చింది.వాళ్ళఇంటికి తీసుకు వస్తున్నామని చెప్పారు.ఇటువంటి పరిస్థితుల్లో పదిహేను రోజులకు పైగా హాస్పిటల్లో వుండి వచ్చినపుడు అంత్యక్రియలకు వెళ్ళాలంటే భయపడ్డాము.అందులోనూ ఎనభై ఏళ్ళు దాటిన వీర్రాజుగారిని ఎలా తీసుకు వెళ్ళాలని ఆలోచించాము.నేనూ, పల్లవీ వెళ్దామనుకున్నాము. ఎలాగో వీర్రాజుగారిని వప్పించి ఆయన్ని ఆషీకి అప్పగించి వెళ్ళాము.కానీ వీర్రాజుగారు తానూ వస్తానని పేచీ పెట్టటంతో ఎంతైనా రక్తసంబంధం కదా ఎవరినో ఆయన్ని తీసుకు రావటానికి పంపించాము. కార్యక్రమం ముగిసేవరకూ వుండి ఇంటికి వచ్చేసాము. మూడోరోజు దినాలు వెళ్ళటానికి ఆడపడుచు ఫొటో దగ్గర పెట్టటానికి పల్లవి మెయిన్ రోడ్డు వరకూ స్వీట్ గానీ పళ్ళుగానీ దొరుకుతాయేమోనని వెళ్ళింది. తీరా వాళ్ళింటికి వెళ్ళాలనుకునేసరికి వాళ్ళు బిల్డింగ్ కి కరెంటు లేదు.కాగలకార్యం గంధర్వులు తీర్చారన్నట్లు రెండింతస్తులు మెట్లు ఎక్కడం కష్టమని వీర్రాజుగారిని రావద్దని,కరెంటు వస్తే తీసుకు రావటానికి ఎవరినైనా పంపిస్తామని చెప్పి పల్లవీ,నేనూ వెళ్ళాం.చిన్నమరిదీ,తోటికోడలూ వచ్చారు.కుకట్పల్లిలో వున్న అన్నయ్య కొడుకులూ జ్వరాలని రాలేదు .,పెద్దమరిది ముగ్గురు పిల్లల్లో పెద్దమ్మాయి వచ్చింది. కార్యక్రమం పూర్తిచేసుకుని ఇంటికి వచ్చాము. పల్లవికి వాళ్ళు ఇంట్లో మొదలైన తలనొప్పి అంతకంతకూ ఎక్కువై సాయంత్రానికి జ్వరం వచ్చేసింది.పారాసెటమల్ టేబ్లెట్ వేసుకుని ఎందుకైనా మంచిదని చివరి రూములో పడుకుంది.అందరియిల్లు డా.వింజమూరి సూర్యప్రకాష్ గారికి ఫోన్ చేస్తే ఆయన వెంటనే క్వారంటైన్ అయిపోమని మర్నాడు బ్లడ్ టెస్ట్ చేయటానికి లేస్ అసిస్టెంట్ ను పంపుతానని అన్నారు. డా.సూర్యప్రకాష్ దంపతులు కోవిడ్ కాలానికి ప్రభుత్వం తరపున ఆన్లైన్ లో ఆరోగ్యం సలహాదారులుగా నే పనిచేస్తున్నారు. పల్లవికి టెష్టులు చేయిస్తే కోవిడ్ డెల్టా వేరియంట్ అని నిర్థారణ అయ్యింది.సూర్యప్రకాష్ గారు మేము పెద్దవాళ్ళు,ఆషీ చిన్నది కనుక హాస్పిటల్ లో చేయవద్దని ట్రీట్మెంట్ మొదలుపెట్టారు.దానికి సంబంధించిన మందులు పంపించి ఆహారనియమాలన్నీ తెలియజేసారు.రోజూ తప్పని సరిగా పప్పు ,నిమ్మరసం తీసుకోమన్నారు. పల్లవి తలుపులు వేసుకొని రూములోనే వుండిపోయింది.భోజనం, టిఫిన్ ద్వారం దగ్గర పెడితే తీసుకునేది.లక్ష్మిని తిరిగి పిలిచేవరకూ పనికి రావద్దని చెప్పాను.ఆషీ సాయంతో ఇంటి పనీ,వంటపనీ చేసుకునేదాన్ని.వారం వారం కోలివుడ్ టెష్టులు డాక్టర్ గారు చేయించారు. పల్లవికి కోవిడ్ వచ్చేసరికి వీర్రాజు గారు మరింత భయపడ్డారు.వైజాగ్ లో రంజనాకు కూడా తగ్గిపోవటం మాకు బెంగగా అయిపోయింది. బిల్డింగ్ లో వున్న స్వాతిగారు ,సరిత కూడా కూరలవీ ఒకటి రెండు సార్లు పంపించారు. ఆడపడుచు దశదినకర్మకి వాళ్ళు అమ్మాయి సంగీత పిలిచింది.కానీ పల్లవికి జ్వరతీవ్రత వుంది.అందులోనూ ఇంట్లో కోవిడ్ బాధితురాలు వుంటే ఎలా వెళ్తాము.అందుకని రాలేదని చెప్పాము.కుకటపల్లిలోనూ మారింది పిల్లలూ అందరికీ జ్వరాలు.దాంతో వాళ్ళూ ఎవరూ రాలేక పోయారు.చిన్నమరిదీ,అంతులేని భార్యా,దీప,వాళ్ళాయన మాత్రమే హాజరయ్యారు. పరిస్థితి అర్థం చేసుకోకుండా సంగీత కావాలనే అందరూ, ముఖ్యంగా మేము ఈ వంక పెట్టి రాలేదని మనసులో కక్ష పెట్టుకుంది.ఆడబడుచు ముత్తైదువులు ఆ పోవటం వలన చేట వాయినాలు అయిదుగురికి ఏర్పాటు చేసిందిట.దగ్గరే కనుక పెద్దత్తకి ఇంటికి వెళ్ళి ఇవ్వు అని మా తోటి కోడలు చెప్పటంతో మా ఇంటికి వచ్చి కవరులో ఆ చేటవాయినాన్ని తీసుకు వచ్చి మాడుముఖంతో టీపాయ్ మీద పెట్టి వెళ్ళిపోయింది.ఆమె ఇచ్చిన విధానం,ఆ ముఖం చూసాక నాకు అది ముట్టుకో బుద్ది కాలేదు.కానీ వీర్రాజుగారు బాధ పెడతారని తీసుకుని లోపల పెట్టాను. డెల్టా వేరియంట్ తీవ్రతతో జనం పిట్టల్లా రాలిపోయారు.సీతారామశాస్త్రి, రోశయ్య వంటి ప్రముఖులని తెలుగు ప్రజలు కోల్పోయారు.తెలిసిన వారూ మిత్రులూ, పరిచయస్తుల మరణాలు ఉక్కిరిబిక్కిరి చేసాయి. మూడో వారానికి పల్లవికి ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పట్టింది.కానీ డాక్టర్ గారు మేము పెద్దవాళ్ళు కనుక మరో రెండు వారాలు క్వారంటైన్ లోనే వుండమన్నారు. ఇంచుమించు రెండునెలలు అందరం చాలా టెన్షన్ లోనే వున్నాము.మళ్ళా పల్లవి మామూలుగా అయ్యేక వూపిరి పీల్చుకున్నాం.వైజాగ్ లో రంజనాకి కూడా గండం తప్పి ఆరోగ్యం కుదుటపడి ఇంటికి వచ్చింది. నడక దారిలో తప్ప రెండు నెలలుగా రాయటం చదవటం కొంచెం తగ్గింది.డైరీలు,ఉత్తరాలు వలన రాయటం ఏమంత కష్టంగా లేదు.రాయటం మొదలు పెడితే ఒకదాని తర్వాత సంఘటనలు గుర్తు వచ్చి ఎక్కడా తడబడి కూడా రాయగలుగుతున్నాను.వీర్రాజుగారు కూడా బాగా రాస్తున్నానని ప్రశంసించారు. రచయిత్రుల కథల గురించి నేను రాస్తున్న వ్యాసాలు ప్రచురితమైనవి ఇరవై మూడు అయ్యాయి.జంట రచయిత్రులు మందిరపు పద్మ,లలితల కథల గురించి రాసిన వ్యాసం చదివి రచన సాయి గారు ఫోన్ చేసారు.పద్మ,లలితలను గురించి అప్పటి వారికి తప్ప ఎవరికీ తెలియదు అటువంటి రచయిత్రులు గురించి రాయటం సంతోషంగా వుంది అని ప్రశంసించారు.అయితే 'వాళ్ళు వైజాగ్ కి చెందిన వారు. మా ఇంటికి దగ్గరలోనే ఉండేవారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు ' అన్నారు వ్యాసం పత్రికలో ప్రచురితమైనపుడు కథానిలయం లో చూసిన దానిని బట్టి తెలంగాణాలోని ఒక గ్రామానికి చెందిన వారని రాసాను.పుస్తకంగా చేయాలనుకున్నప్పుడు ఆ వాక్యం తీసేసాను. నేను రాసిన ఇరవై మూడు వ్యాసాలకు రచయిత్రులు చెందినవే సదస్సులలో ప్రసంగవ్యాసాలు రెండింటిని కలిపి " కథారామంలో పూలతావులు" గా నా వ్యాససంపుటిని ప్రచురణకు ఇచ్చాను. నేను వ్యాసాలు రాసే సందర్భంలో నిడదవోలు మాలతి కథలు గురించి రాసినప్పుడు ఆమె బ్లాగులో ఆరు కథలపుస్తకాలు ,ఎన్నెమ్మకతలు పేరిట మరో అయిదు పుస్తకాలు,రెండు నవలలు, ఆరేడు వ్యాస సంపుటాలు కాకుండా వందకు పైగా గురజాడ నుండి ఆమెతరం వరకూ కథకుల కథల్ని ఆంగ్లానువాదం చేసినట్లుగా తెలిసింది.1973లోనే యూఎస్ వెళ్ళిపోవటం తో ఆమె రచనలు చేసినా తాను బ్లాగులోనే పొందుపరిచుకోవటంతో ఇక్కడ తెలుగు వారికి ఆమె ఇంత సాహిత్య సృజన చేసినట్లు తెలియకుండా అయిందని బాధకలిగించింది. ఫేస్బుక్ లో మాలతి గారికి మెసేజ్ పెట్టి నేను ఆమె రచనలమీద సమగ్రంగా పుస్తకం రాయాలనుకున్నట్లు తెలియజేసి భఅవసరమైనప్పుడు సంప్రదించడానికి ఈ మెయిల్ ఐడి కోరాను.మాలతిగారు చాలా సంతోషంగా స్పందించారు. - శీలా సుభద్రాదేవి

1, మే 2026, శుక్రవారం

గుత్తికొండ సుబ్బారావుగారి గురించి వ్యాసం

~ సాహితీవేత్తలకు అండ- సుబ్బారావు గుత్తికొండ ~ 1970 లో వీర్రాజు గారితో కలం స్నేహానికి మూలకారణమైన స్వాతి మాసపత్రికకి వ్యవస్థాపకులైన వేమూరి బలరామ్, వేమూరి సత్యనారాయణ,వేమూరి గోపాలకృష్ణగార్లతో వీర్రాజుగారు గౌరవసంపాదకుడుగా ప్రారంభమైంది. ఆ తర్వాత 1971లో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నప్పుడే శీలా వీర్రాజు గారితో వివాహానంతరం వేసవి సెలవుల్లో భాగ్యనగరంలో అడుగుపెట్టాను. అప్పట్లో యువభారతి సంస్థ అధ్వర్యంలో ప్రతి ఆదివారం సారస్వత పరిషత్తులో దివాకర్ల వెంకటావధానిగారి వంటి ప్రముఖ పండితులచే ప్రసంగం కార్యక్రమాలు జరుగుతూ వుండేవి.వీర్రాజుగారితో ఆ సంస్థకు గల అనుబంధం వల్ల ఆయనతో పాటూ నేను వెళ్ళేదాన్ని.అక్కడే మొట్టమొదటిసారి గుత్తికొండ సుబ్బారావుగారితో తొలి పరిచయం జరిగిన జ్ణాపకం. జనవరి 1971లో వేకువ సాహిత్య త్రైమాస పత్రిక వీర్రాజుగారి అక్షరాల ముఖచిత్రంతో, కె. శివారెడ్డి సంపాదకత్వంలో,గుత్తికొండ సుబ్బారావు నిర్వహణలో,శీలా వీర్రాజు,వి. సీతారామరెడ్డి,ఏ. సుబ్బారావుగార్ల సలహామండలితో వెలువడి అనేకమంది ప్రముఖుల కవులూ,రచయితలతో గ్రంథాలయాల్లో దాచుకోదగిన పత్రికగా ప్రారంభమై కొంతకాలం కొనసాగింది. సుబ్బారావుగారి అమ్మాయి స్పందన,మా అమ్మాయి పల్లవి ఒకే వయసువారు కావటం పిల్లలగురించి మా సంభాషణలో తరుచూ వస్తుండేది.స్పందన పేరుతో స్పందన వాణి మాసపత్రిక కొన్నాళ్ళు తీసుకు వచ్చారు.స్పందనవాణిలో నా కథలూ,కవితలూ వస్తుండేవి. వీర్రాజుగారి ప్రోత్సాహంతో వారు వేసిన ముఖచిత్రంతో కుందుర్తి పీఠికతో "మనిషికోసం" అనే కవితా సంపుటిని 1974లో వెలువరించి సుబ్బారావుగారు కవిత్వరంగంలో కవిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.కాని సభలూ,సదస్సుల నిర్వహణ బాధ్యతలతో సుబ్బారావుగారు సాహిత్య సృజన పూర్తిగా మానేయటం నచ్చక "మంచి కవిత్వం రాయగలిగీ కూడా కార్యకర్తగా సుబ్బారావు అయిపోయాడ"ని పలుమార్లు వీర్రాజుగారు నా దగ్గర వాపోయే వారు. అప్పుడప్పుడే సాహిత్యంలో బుడిబుడి అడుగులు వేస్తూ కథా సంపుటి వేయాలనే ప్రయత్నంలో వుండగా నా పేరు ఎవరు ప్రస్తావించారో గానీ మచిలీపట్నంలో జరిగే రచయిత్రుల మహాసభల్లో కవిసమ్మేళనం లో పాల్గొనమని ఉత్తరం వచ్చింది. ఆశ్చర్యం, ఆనందం కలిగించింది. కానీ మానసిక అనారోగ్యంతో వున్న బాబును తీసుకుని ఎలా వెళ్ళాలి అనేదే పెద్దప్రశ్న. మచిలీపట్నం వాస్తవ్యులు వీర్రాజుగారికి మంచిమిత్రుడైన గుత్తికొండ సుబ్బారావుగారు తమ స్పందన సాహితీ సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీతో కలిసి రచయిత్రుల మహాసభలు నిర్వహిస్తుందని తెలియజేసి, కుటుంబ సమేతంగా రమ్మనీ, మిగతా విషయాలు నేను చూసుకుంటానని అన్నారు. ఉత్సాహంగా అందరం బయలుదేరాము. సుబ్బారావుగారు మమ్మల్ని రిసీవ్ చేసుకొని హొటల్ రూమ్ లో దించారు. బాబును,పల్లవిని తయారు చేసి వీర్రాజుగారికి బాబు బాధ్యత అప్పజెప్పి నేను తయారయ్యాను. అంతలో సుబ్బారావు గారు వచ్చి సభలు జరిగే వేదికకు తీసుకువెళ్ళారు. అప్పుడే ప్రారంభ సభ మొదలైంది. జస్టిస్ అమరేశ్వరి ప్రారంభించారు. దేవులపల్లి రామానుజరావు గారు పుస్తకప్రదర్శన ప్రారంభించారు. నేను చిన్నప్పటి నుండి చదివిన రచయిత్రులు వసుంధరా దేవి, కె.రామలక్ష్మీ, లత, ద్వివేదుల విశాలాక్షి, ఆనందారామం, ఐవీఎస్ అచ్యుత వల్లీ ఇలా ఎందరో ఉన్న ఆ సభామందిరంలో నేను కూడా ప్రత్యేక ఆహ్వానితురాలిగా కూర్చున్నాను. ఒక ఉద్వేగం నన్ను ఆవరించింది. అప్పుడు సాహిత్య అకాడమీ చైర్మన్ బెజవాడ గోపాలరెడ్డిగారు. సాయంత్రం సెషన్ కవిసమ్మేళనంలో వేదిక మీద ఆనాటి ప్రముఖ కవయిత్రులు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, నాయని కృష్ణకుమారి, యశోదా రెడ్డి, సి.వేదవతితో పాటు నేను వేదిక పంచుకొని కవిత్వం చదవటం నాకు గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది. నా కవిత ఆ వేదిక పై కొత్తదనాన్ని ఇచ్చిందని అధ్యక్షురాలు ప్రశంసించారు. మనసంతా హర్షాతిరేకాలుతో నిండి ఉప్పొంగిపోతున్న నన్ను గుత్తికొండసుబ్బారావు గారు తిరిగి హోటలు రూముకి దింపారు. ఆ రాత్రి బాబుకు అనారోగ్యం తీవ్రం అయింది.సుబ్బారావుగారు డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళటానికి సాయం చేసారు. డాక్టరు మందు పడ్డాక పిల్లాడు మర్నాడు ఉదయానికి తేరుకున్నా డు. మేము కూడా కుదుట పడ్డాము. ఆనాడు సుబ్బారావుగారి సహాయం మరువలేనిది . వీర్రాజుగారికి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్ గారు బాపురమణల పురస్కారం అందజేసినపుడు సుబ్బారావుగారి ఇంట్లోనే వారి శ్రీమతి ప్రేమ పూర్వక ఆతిధ్యంతో పుట్టింటికి వచ్చిన అనుభూతి కలిగించారు .మా ఇద్దరినీ చుట్టుపట్ల విహారస్థలాలు దగ్గరుండి చూపించారు. నేను పదవీ విరమణ పొందిన తర్వాత ప్రతీ ఏడాదీ ఒకరికి బహుమతిగా పుస్తకం వేయాలి అనుకుని మొదటగా డి.సుజాతాదేవి రాసిన " ఆటలో అరటిపండు" పిల్లల పుస్తకం వేసాము.ఆ పుస్తకం ఆవిష్కరణ బందరులో సుబ్బారావుగారు ఏర్పాటు చేసారు.పుస్తకావిష్కరణకు నన్ను,వక్తగా ఇంద్రగంటి జానకీ బాలని ఆహ్వానించారు.మొదటినుండి ఆత్మీయ మిత్రులమైన మేము ముగ్గురం సుబ్బారావుగారి ఇంట్లోనే సోదర వాత్సల్యం పొందాము.అప్పటికే కొంత అనారోగ్యం ఉన్నా కూడా వారి శ్రీమతి రామరత్నం మాతో కలిసి కబుర్లు చెప్పారు. తర్వాత్తర్వాత కొన్ని కుటుంబ బాధ్యతలు సమస్యలతో సుబ్బారావుగారికి దూరం అయ్యాము.చివరికి వారి శ్రీమతి కాలం చేసినపుడు కూడా కలుసుకోలేకపోయాము.అదేవిధంగా మా కుటుంబ దుర్ఘటనలకూ వారూ రాలేక పోయారు . సుబ్బారావుగారు చిరకాల సహచరి దూరమైనా ఆమె జ్ణాపకాలు పదిల పరచుకొని ఆమెకు నివాళిగా అపురూప చిత్రాలతో చక్కని పుస్తకాన్ని వెలువరించటమే కాకుండా ఆమె పేరిట ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేసి అంతకుముందు శ్రీమతి చేసిన సేవాకార్యక్రమాలు కొనసాగించారు.ఆ విధంగా రామరత్నంగారిని చిరంజీవులుగా చేయటం అపురూపమైన విషయం. ఆ కోవలోనే గుత్తికొండ రామరత్నం ట్రస్ట్ తరపున పురస్కారాలు ప్రదానం చేస్తున్నారు.మూడేళ్ళ క్రితం నేనుకూడా జీవన సాఫల్య పురస్కారం సుబ్బారావుగారి చేతులమీదుగా అందుకునే అవకాశం కలిగించారు.సుబ్బారావుగారి కుటుంబం ద్వారా ఇలా అనేక సార్లు వాత్సల్యపూర్వక గౌరవాలు అందుకున్నాను. ఈ విధంగా సుబ్బారావుగారు ఆయురారోగ్యాలతో సంతానంతో కలిసి సుఖసంతోషాలు పంచుకుంటూ రామరత్నంగారికి నచ్చిన కార్యక్రమాలు నిర్వహిస్తూనే వుండాలని ఆకాంక్షిస్తూ సోదరులు గుత్తికొండ సుబ్బారావుగారికి హృదయపూర్వక అశీతి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. - శీలా సుభద్రాదేవి