1, మే 2026, శుక్రవారం

గుత్తికొండ సుబ్బారావుగారి గురించి వ్యాసం

~ సాహితీవేత్తలకు అండ- సుబ్బారావు గుత్తికొండ ~ 1970 లో వీర్రాజు గారితో కలం స్నేహానికి మూలకారణమైన స్వాతి మాసపత్రికకి వ్యవస్థాపకులైన వేమూరి బలరామ్, వేమూరి సత్యనారాయణ,వేమూరి గోపాలకృష్ణగార్లతో వీర్రాజుగారు గౌరవసంపాదకుడుగా ప్రారంభమైంది. ఆ తర్వాత 1971లో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నప్పుడే శీలా వీర్రాజు గారితో వివాహానంతరం వేసవి సెలవుల్లో భాగ్యనగరంలో అడుగుపెట్టాను. అప్పట్లో యువభారతి సంస్థ అధ్వర్యంలో ప్రతి ఆదివారం సారస్వత పరిషత్తులో దివాకర్ల వెంకటావధానిగారి వంటి ప్రముఖ పండితులచే ప్రసంగం కార్యక్రమాలు జరుగుతూ వుండేవి.వీర్రాజుగారితో ఆ సంస్థకు గల అనుబంధం వల్ల ఆయనతో పాటూ నేను వెళ్ళేదాన్ని.అక్కడే మొట్టమొదటిసారి గుత్తికొండ సుబ్బారావుగారితో తొలి పరిచయం జరిగిన జ్ణాపకం. జనవరి 1971లో వేకువ సాహిత్య త్రైమాస పత్రిక వీర్రాజుగారి అక్షరాల ముఖచిత్రంతో, కె. శివారెడ్డి సంపాదకత్వంలో,గుత్తికొండ సుబ్బారావు నిర్వహణలో,శీలా వీర్రాజు,వి. సీతారామరెడ్డి,ఏ. సుబ్బారావుగార్ల సలహామండలితో వెలువడి అనేకమంది ప్రముఖుల కవులూ,రచయితలతో గ్రంథాలయాల్లో దాచుకోదగిన పత్రికగా ప్రారంభమై కొంతకాలం కొనసాగింది. సుబ్బారావుగారి అమ్మాయి స్పందన,మా అమ్మాయి పల్లవి ఒకే వయసువారు కావటం పిల్లలగురించి మా సంభాషణలో తరుచూ వస్తుండేది.స్పందన పేరుతో స్పందన వాణి మాసపత్రిక కొన్నాళ్ళు తీసుకు వచ్చారు.స్పందనవాణిలో నా కథలూ,కవితలూ వస్తుండేవి. వీర్రాజుగారి ప్రోత్సాహంతో వారు వేసిన ముఖచిత్రంతో కుందుర్తి పీఠికతో "మనిషికోసం" అనే కవితా సంపుటిని 1974లో వెలువరించి సుబ్బారావుగారు కవిత్వరంగంలో కవిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.కాని సభలూ,సదస్సుల నిర్వహణ బాధ్యతలతో సుబ్బారావుగారు సాహిత్య సృజన పూర్తిగా మానేయటం నచ్చక "మంచి కవిత్వం రాయగలిగీ కూడా కార్యకర్తగా సుబ్బారావు అయిపోయాడ"ని పలుమార్లు వీర్రాజుగారు నా దగ్గర వాపోయే వారు. అప్పుడప్పుడే సాహిత్యంలో బుడిబుడి అడుగులు వేస్తూ కథా సంపుటి వేయాలనే ప్రయత్నంలో వుండగా నా పేరు ఎవరు ప్రస్తావించారో గానీ మచిలీపట్నంలో జరిగే రచయిత్రుల మహాసభల్లో కవిసమ్మేళనం లో పాల్గొనమని ఉత్తరం వచ్చింది. ఆశ్చర్యం, ఆనందం కలిగించింది. కానీ మానసిక అనారోగ్యంతో వున్న బాబును తీసుకుని ఎలా వెళ్ళాలి అనేదే పెద్దప్రశ్న. మచిలీపట్నం వాస్తవ్యులు వీర్రాజుగారికి మంచిమిత్రుడైన గుత్తికొండ సుబ్బారావుగారు తమ స్పందన సాహితీ సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీతో కలిసి రచయిత్రుల మహాసభలు నిర్వహిస్తుందని తెలియజేసి, కుటుంబ సమేతంగా రమ్మనీ, మిగతా విషయాలు నేను చూసుకుంటానని అన్నారు. ఉత్సాహంగా అందరం బయలుదేరాము. సుబ్బారావుగారు మమ్మల్ని రిసీవ్ చేసుకొని హొటల్ రూమ్ లో దించారు. బాబును,పల్లవిని తయారు చేసి వీర్రాజుగారికి బాబు బాధ్యత అప్పజెప్పి నేను తయారయ్యాను. అంతలో సుబ్బారావు గారు వచ్చి సభలు జరిగే వేదికకు తీసుకువెళ్ళారు. అప్పుడే ప్రారంభ సభ మొదలైంది. జస్టిస్ అమరేశ్వరి ప్రారంభించారు. దేవులపల్లి రామానుజరావు గారు పుస్తకప్రదర్శన ప్రారంభించారు. నేను చిన్నప్పటి నుండి చదివిన రచయిత్రులు వసుంధరా దేవి, కె.రామలక్ష్మీ, లత, ద్వివేదుల విశాలాక్షి, ఆనందారామం, ఐవీఎస్ అచ్యుత వల్లీ ఇలా ఎందరో ఉన్న ఆ సభామందిరంలో నేను కూడా ప్రత్యేక ఆహ్వానితురాలిగా కూర్చున్నాను. ఒక ఉద్వేగం నన్ను ఆవరించింది. అప్పుడు సాహిత్య అకాడమీ చైర్మన్ బెజవాడ గోపాలరెడ్డిగారు. సాయంత్రం సెషన్ కవిసమ్మేళనంలో వేదిక మీద ఆనాటి ప్రముఖ కవయిత్రులు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, నాయని కృష్ణకుమారి, యశోదా రెడ్డి, సి.వేదవతితో పాటు నేను వేదిక పంచుకొని కవిత్వం చదవటం నాకు గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది. నా కవిత ఆ వేదిక పై కొత్తదనాన్ని ఇచ్చిందని అధ్యక్షురాలు ప్రశంసించారు. మనసంతా హర్షాతిరేకాలుతో నిండి ఉప్పొంగిపోతున్న నన్ను గుత్తికొండసుబ్బారావు గారు తిరిగి హోటలు రూముకి దింపారు. ఆ రాత్రి బాబుకు అనారోగ్యం తీవ్రం అయింది.సుబ్బారావుగారు డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళటానికి సాయం చేసారు. డాక్టరు మందు పడ్డాక పిల్లాడు మర్నాడు ఉదయానికి తేరుకున్నా డు. మేము కూడా కుదుట పడ్డాము. ఆనాడు సుబ్బారావుగారి సహాయం మరువలేనిది . వీర్రాజుగారికి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్ గారు బాపురమణల పురస్కారం అందజేసినపుడు సుబ్బారావుగారి ఇంట్లోనే వారి శ్రీమతి ప్రేమ పూర్వక ఆతిధ్యంతో పుట్టింటికి వచ్చిన అనుభూతి కలిగించారు .మా ఇద్దరినీ చుట్టుపట్ల విహారస్థలాలు దగ్గరుండి చూపించారు. నేను పదవీ విరమణ పొందిన తర్వాత ప్రతీ ఏడాదీ ఒకరికి బహుమతిగా పుస్తకం వేయాలి అనుకుని మొదటగా డి.సుజాతాదేవి రాసిన " ఆటలో అరటిపండు" పిల్లల పుస్తకం వేసాము.ఆ పుస్తకం ఆవిష్కరణ బందరులో సుబ్బారావుగారు ఏర్పాటు చేసారు.పుస్తకావిష్కరణకు నన్ను,వక్తగా ఇంద్రగంటి జానకీ బాలని ఆహ్వానించారు.మొదటినుండి ఆత్మీయ మిత్రులమైన మేము ముగ్గురం సుబ్బారావుగారి ఇంట్లోనే సోదర వాత్సల్యం పొందాము.అప్పటికే కొంత అనారోగ్యం ఉన్నా కూడా వారి శ్రీమతి రామరత్నం మాతో కలిసి కబుర్లు చెప్పారు. తర్వాత్తర్వాత కొన్ని కుటుంబ బాధ్యతలు సమస్యలతో సుబ్బారావుగారికి దూరం అయ్యాము.చివరికి వారి శ్రీమతి కాలం చేసినపుడు కూడా కలుసుకోలేకపోయాము.అదేవిధంగా మా కుటుంబ దుర్ఘటనలకూ వారూ రాలేక పోయారు . సుబ్బారావుగారు చిరకాల సహచరి దూరమైనా ఆమె జ్ణాపకాలు పదిల పరచుకొని ఆమెకు నివాళిగా అపురూప చిత్రాలతో చక్కని పుస్తకాన్ని వెలువరించటమే కాకుండా ఆమె పేరిట ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేసి అంతకుముందు శ్రీమతి చేసిన సేవాకార్యక్రమాలు కొనసాగించారు.ఆ విధంగా రామరత్నంగారిని చిరంజీవులుగా చేయటం అపురూపమైన విషయం. ఆ కోవలోనే గుత్తికొండ రామరత్నం ట్రస్ట్ తరపున పురస్కారాలు ప్రదానం చేస్తున్నారు.మూడేళ్ళ క్రితం నేనుకూడా జీవన సాఫల్య పురస్కారం సుబ్బారావుగారి చేతులమీదుగా అందుకునే అవకాశం కలిగించారు.సుబ్బారావుగారి కుటుంబం ద్వారా ఇలా అనేక సార్లు వాత్సల్యపూర్వక గౌరవాలు అందుకున్నాను. ఈ విధంగా సుబ్బారావుగారు ఆయురారోగ్యాలతో సంతానంతో కలిసి సుఖసంతోషాలు పంచుకుంటూ రామరత్నంగారికి నచ్చిన కార్యక్రమాలు నిర్వహిస్తూనే వుండాలని ఆకాంక్షిస్తూ సోదరులు గుత్తికొండ సుబ్బారావుగారికి హృదయపూర్వక అశీతి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. - శీలా సుభద్రాదేవి