30, మే 2020, శనివారం

దూదుంపుల్ల

దూదుం పుల్ల

ఇసుకలో పుల్లదూర్చి
ఆడుకునే దూదుం పుల్లాట
ఎప్పుడు ఆడానో గుర్తులేదు
కానీ
రాత్రీపగలూ 
పోగొట్టుకున్న నా దూదుం పుల్లని
కలలో,ఇసుకలో నడచి నడచి
దొరుకుతుందేమోనని వెతుక్కుంటూనే ఉన్నాను

ఒకవేళ ఏ అలైనా బిరబిరా
లాక్కేళ్ళిపోయిందో ఏంటో

ఏతుపాను వర్షమో దూకుడుగావచ్చే 
ఆవలితీరాలకు దొర్లించుకు పోయిందో
నా వెతుకులాటైతే ఆగనేలేదు

ఉదయపునడకో
సాయంత్రపు నడకో
అడుగులోఅడుగులు లెక్కపెడ్తూ
నడుస్తూ నడుస్తూ
ఏ పావురమో గూడు కట్టేందుకు
ముక్కున కరుచుకు ఎత్తుకు పోయిందేమోనని దిగులు పడ్తాను.
కిటికీ అంచుమీదో
ఏసీ బాక్స్ మీదో
నిలవని గూడులోని పుల్లలు
జారి కింద రాలుతుంటే
చూపులచేతుల్తో నాకు కావాల్సిన
నేను పోగొట్టుకున్న  దూదుంపుల్ల కోసం
ఆత్రం గా తడుం కుంటాను

బడిముందునుండో
గుడిమెట్లమీద నుండో పోతూపోతూ
చెత్తకుప్పల పైనో
గుడిమెట్ల పక్కనో
గాలివాటుకు వచ్చి వాలిందేమోనని
మనసు విప్పార్చుకు వెతుకుతూనే ఉన్నాను

నా అమాయకత్వం గానీ
ఎక్కడో ఏనాడో జార్చుకున్న నా బాల్యం
నానుండి తెలియకుండానే
కుబుసం లా జారిపోయిన బాల్యం
ఎంత వెతికితే మాత్రం
ఎప్పుడెక్కడ దొరుకుతుంది
వడలిన శరీరం ఫై ఎలా వాలుతుంది?!

_ శీలా సుభద్రాదేవి

8, మే 2020, శుక్రవారం

1, మే 2020, శుక్రవారం

కథావరణం లో గుండెల్లో గాయం కథ

ఆలోచనల్లో మార్పు వస్తేనే స్త్రీల జీవితాలు మారుతాయoటున్న శీలా సుభద్రాదేవి

- పలమనేరు బాలాజీ | 01.05.2020 01:38:05am


మారుతున్నకాలంతోబాటూ మారుతున్న మానవసంబంధాలకు , మారుతున్న స్త్రీ ఆలోచనలకూ ఒకచక్కటి ఉదాహరణగా శీలా సుభద్రాదేవి గారి ʹ గుండెల్లో గాయం ʹ కథను చెప్పవచ్చు. ఏ పరిస్థితిలో ఉన్నా స్త్రీ, పురుషులకు ఒకరి తోడు ఒకరికి అవసరం. యుక్తవయస్సులో భర్తను కోల్పోయిన భార్య , తన కోసమో. పిల్లల కోసమో ఇంకో పెళ్లి చేసుకోవడానికి ఎన్ని అడ్డoకులు ఎదురవతాయో, ఎంతమంది ఎంతగా ఇబ్బంది పెడతారో-సమాజం ఎన్ని ఆటంకాలను కలిగిస్తుందో, ఎంతగా చిన్నచూపు చూస్తుందో అదంతా ఒక కథ.! అదే సమయంలో ఏ వయస్సులోని మగవాడికైనా , రెండోసారి, లేదా మూడోసారైనా పెళ్ళి చేసుకోవడానికైతే అందరూ ఎట్లా సహకరిస్తారో, ఇది ఎంత సులభ సాధ్యమో, స్త్రీలకు చాల కష్టమైన రెండోపెళ్లి వ్యవహారం పురుషుడికి ఎంత సులభమో ʹ గుండెల్లో గాయం ʹ కథలో శీలాసుభద్రాదేవి గారు తెలియచేసారు. ఈ కథ సాహితీ గోదావరి (జూలై-డిసెంబర్ 2016) కథల ప్రత్యేక సంచికలోప్రచురించబడింది. కవయిత్రిగా, కథకురాలిగా, నవలా రచయిత్రిగా, ఆమె సాహిత్యలోకానికి సుపరిచితులే.!
1970 లో శీలాసుభద్రాదేవి రాసిన తొలి కథ ʹ పరాజిత ʹ పొలికేక వారపత్రికలో అచ్చయ్యింది. శీలాసుభద్రాదేవి కవయిత్రిగా, రచయిత్రిగా అందరికీ సుపరిచితులే ! 1988లో ʹ దేవుడు బండ ʹ , 2006లో ʹ రెక్కల చూపు ʹ రెండుకథా సంపుటాలను ఆమె వెలువరించారు. తెలుగు విద్యార్ధి మాసపత్రికలో రెండున్నర సంవత్సరాల పాటూ ఆమె రాసిన ʹ ఇస్కూలు కథలు ʹ ఈ మధ్యే కథాసంపుటంగా వచ్చింది.ఆమె రాసిన ʹనీడల చెట్టు ʹ చతురలో (2017 ఫిబ్రవరి ) వచ్చింది. సమగ్ర – కవితా సంపుటి (ఎనిమిది కవితా సంపుటాలు ) ʹశీలాసుభద్రాదేవి కవిత్వం ʹ 2009 లో వెలువడింది.
ʹ మామగారు రాసిన ఉత్తరం చేత్తోపట్టుకొని ఆ తర్వాత మరి చదవలేక దిగ్రమతో అట్లాగే ఆమె కూర్చుండి పోతుంది పార్వతి. ఎందుకో ఎన్నాళ్ళుగానో గడ్డకట్టిన దుఃఖం కరిగిపోయి ఉబికి,ఉబికి వస్తుంది.ʹ అంటూ కథ ప్రారంభం అవుతుంది.

ఎప్పుడో పన్నెండేళ్ళ క్రితం మంచుపర్వతంలా గుండెలనిండా పేరుకుపోయిన కన్నీళ్ళు ఇంత కాలంగా చవిచూసిన అవమానాల గాయాలూ, అణుచుకొన్న కోర్కెలు, ఇంటాబయటా ఎదుర్కోన్న ఆకలిచూపుల కోతలు గుండెల్లోనే భూస్థాపితం చేసినవి. ఇప్పుడు రగుల్చుతోన్న జ్వాలలకు కరిగి సలసలా మరిగినట్లు వేడిగా చెంపల మీదుగా జారిపోతున్నాయి. అనాదిగా సంఘం చూపించే సామాజికన్యాయానికి మనుషుల మనస్తత్వానికో, తరతరాలుగా మగవాళ్ళ హక్కుల తార్కాణమో పార్వతికి అర్థం కాలేదు-అంటుంది రచయిత్రి. స్త్రీ తాలూకు వేదన, ఘర్షణ కథనంలో రచయిత్రి చెపుతుంది. ప్రతి సందర్భంలో ఈ కథలోని ప్రశ్నలు కలవరపెడతాయి. మగవాడ్ని, సమాజాన్ని , లోకరీతిని స్త్రీలందరి తరపునా పార్వతి పాత్ర ద్వారా రచయిత్రి ప్రశ్నిస్తుంది.
ఫోను వస్తుంది. అటువైపు హాస్టల్ నుండి ఒకరితర్వాత ఒకరుగా సంబరంగా కబుర్లు చెప్తోన్న ఆమె పిల్లలు అశ్విని, హాసినీ పలకరింపులతో అన్నీ మరచి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతుంది.భర్త గుండె జబ్బుతో తమని ఒంటరివాళ్ళని చేసిపోయిననాటికి అభం శుభం తెలియని మూడేళ్ళ పసిపాపలు చూస్తుండగానే పెరిగిపోయారు. ఇప్పుడు వాళ్ళ చదువు, తర్వాత్తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ కుటుంబాలు అప్పుడిక తాను ఒంటరిగా ఈ యింట్లోతన గూట్లో తానుఒక్కతే అనుకుంటుంది పార్వతి!.
ʹ లేచి వాష్ జేసిన్ దగ్గర చల్లని నీళ్ళని దోసిట్లోకి తీసుకొని దుఃఖాన్ని కడుక్కోవటానికి ముఖంపై చల్లుకుంది. మెత్తని టవల్తో ముఖం మీద మిగిలిన దుఃఖపు తడిని అద్దుకుని పెదాలపై చిరునవ్వుని అతికించుకుని వెళ్ళింది.
కథలో పాత్ర తాలూకు మూడ్ పాఠకులకు అందించడానికి రచయితలు కథలో చేసే వాతావరణ చిత్రణ, సన్నివేశాల కల్పన, కథా కథనం, పాత్రల ప్రవర్తన, రచయిత కంఠస్వరం పాఠకులకు కథ పట్ల నమ్మకాన్ని తెప్పించడం తో బాటు కథకు సంభందించిన వాతావరణంలోకి నేరుగా తీసుకు వెడతాయి. కథలో రచయిత సూచనాప్రాయంగా చెప్పిన విషయాలను జాగ్రత్తగా చదువుతున్న పాఠకులే కథలోని వేగాన్ని , అంతరార్థాన్ని అందుకోగలుగుతారు .
అక్కడికి వృద్ధురాలు,యువకుడు వచ్చి వుంటారు. తను ఉద్యోగరీత్యా ఏడాదిపాటూ యు,ఎస్ వెళ్ళాల్సి వుందని, ఏడాదిపాటు వాళ్ళ అమ్మమ్మని ఇక్కడ ఉంచాలనుకుంటున్నాడని, తన స్నేహితుని ద్వారా హోం గురించి విన్నానని , ఆశ్రమంలో ఒకటి,రెండు సంవత్సరాలు ఉంచే ఏర్పాటు ఉందని తెల్సిందని, తను తిరిగి రాగానే అమ్మమ్మని తీసుకెళ్తానని చెపుతాడు.
"మా అమ్మమ్మకు మా అమ్మ ఒక్కతే సంతానం. అమ్మ పురిట్లోనే ధనుర్వాతంతో చనిపోయింది. నాన్న మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. నేను అమ్మమ్మ దగ్గరే పెరిగాను తాతగారు కూడా పోయి అయిదేళ్ళయింది. చూసేవాళ్ళు లేరు. అమ్మమ్మఆరోగ్యం అంతంత మాత్రమే.ఒక్కరైనా ఒంటరిగా వదలలేక ఇక్కడ వుంచితే బాగుంటుందని అనుకొంటున్నాను" అంటాడు ఆ కుర్రవాడు. ఆ ఆమ్మమ్మది ఒక విషాదగాధ.
పార్వతి దగ్గర హోంలో పని చేస్తున్న ఎస్తేరుది మరొక విషాద గాధ . ఎస్తేరు పెళ్లయిన రెండేళ్ళకే భర్తతో మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకుంటుoది, ఏడాది పిల్లలకు తల్లిదండ్రులు ఒక సంబంధం చూసి తిరిగి ఎస్తేరుకి వివాహం చేసారు. అయితే ఎస్తేరు కొడుకుని రెండవ భర్త స్వీకరించలేదు. దాంతో పిల్లాడిని తల్లికే అప్పజెప్పింది. స్వంత కొడుకును వదిలి భర్త పిల్లల్నే తన పిల్లలు ప్రేమిస్తున్నా ఆమె భర్త సంతృప్తిపడక ఏదోరకంగా మొదటి భర్తను గుర్తుచేసి, ఆమె బాధపడుతోంటే, ఆమెచిన్న బుచ్చుకుంటే మానసికంగా సంతోషపడేవాడు. రోజు రోజుకీ శాడిస్టుగా మారి మానసిక హింసకి గురిచేసేవాడు. ఎస్తేరు మళ్ళీ పెళ్ళి చేసుకుందని తెలిసి మొదటి భర్త వచ్చి గొడవ పెట్టుకొని తన కొడుకును తీసుకుని వెళ్ళిపోయాడు. క్రమంగా పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లయింది ఎస్తేరు జీవితం.
పరిస్థితి అంతకంతకూ శృతిమించటంతో భరించలేక, భర్తలను వదిలిపెట్టి తల్లిదండ్రులకీ,అన్నదమ్ములకీ భారం కావటం ఇష్టంలేక ఊరు వదిలి వెళ్ళిపోయింది ఎస్తేరు. జీవచ్చవంలా బ్రతకలేక ప్రాణాల మీద ఆశవదులుకున్న దశలో అనుకోని పరిస్థితిలో పార్వతీ హెూoకు చేరి ఆశ్రయం పొందింది. ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని పార్వతీ తనదగ్గరే హెమ్ నిర్వహణలో రిసెప్షనిస్ట్ గానే కాక క్లర్కుగా బాధ్యత అప్పగించింది. అప్పటినుంచీ తనకో జీవితాన్నిచ్చిన ఆ హోం కి అంకితమైపోయింది ఎస్తేరు.
పార్వతి భర్త చంద్రశేఖర్ మరణానంతరం కవల పిల్లలిద్దర్నీ తీసుకొని పుట్టింటికి వచ్చేసింది. తల్లిదండ్రులకు పార్వతి ఒక్కతే సంతానం కావటంతో, నిండు నూరేళ్ళు పచ్చగా సాగుతుందనుకున్న కూతురు జీవితం ఈ విధంగా మోడుకావటం ఆ దంపతులకు పిడుగుపాటుగా తోచినా, కూతురుతో బాటూ అన్నెంపున్నెం ఎరుగని పసిపాపల్ని చూస్తూ మనసు గట్టిపరచుకొని కాలంగడిపారు. బిజినెస్ మేనేజిమెంటు చేసిన పార్వతి తన దుఃఖాన్ని గుండెలోనే దాచుకొని ఉద్యోగంపట్ల దృష్టి కేంద్రీకరించింది.
తల్లిదండ్రులు మళ్ళీ పార్వతీకి వివాహప్రయత్నం చేయబోయినా ఆ ప్రయత్నం కొనసాగలేదు. కన్యలకే అన్ని విధాలా అనుకూలురైన భర్త లభించే పరిస్థితులు కరువైన ఈ రోజుల్లో, స్వార్థమే జీవిత పరమావధిగా భావించుతోన్న ఈ రోజుల్లో, ఇద్దరు పిల్లల తల్లిని చేసుకోవటానికి ముందుకొచ్చేవారు ఎటువంటి వారౌతారోనన్న భయం వెంటాడింది. పార్వతికి ఏవైనా అవాంఛనీయ పరిస్థితుల్ని చేతులారా ఆహ్వానించటానికి ఆమెకి ధైర్యం చాలలేదు.
లోలోపలి జ్ఞాపకాల్ని రేపుతోన్న ఆలోచనల్ని వదిలించుకోవడానికి పార్వతి లేచి హోమ్ వైపు, దారితీసింది. సాయంత్రం జరిగే ధ్యానం, తదనంతర సంగీత, సాహిత్యాది కార్యక్రమాలు పూర్తిచేసి అల్పాహారం తీసుకుంటున్నారు ఆశ్రమవాసులు, కొందరు తోటలో చెట్ల కిందరాలిన ఆకుల్ని వాడినపూలనీ ఏరుతూ తోటపని చేస్తున్నారు. కొంత మంది పుస్తకాలు తిరగేస్తూ మధ్య మధ్యలో ముచ్చట్లలో పాలు పంచుకుంటున్నారు.
ఎవరికి చాతనైన పనుల్లో వారు నిమగ్నమై వున్నవాళ్ళoదరి గురించి, వారి ఆరోగ్య విశేషాల గురించి పరామర్శించాక , కొత్తగా వచ్చిన వృద్ధురాలి పక్కనే కూర్చొని ధైర్యం చెపుతుంది పార్వతి. పార్వతిని చూస్తే చనిపోయిన తన కూతురు గుర్తువచ్చి చెమ్మగిల్లిన కళ్ళని కొంగుతో వత్తుకుంటుoది ఆ వృద్ధురాలు. ఆమె మనవడు అమ్మమ్మని ఆమెకి అప్పగించి, తరుచూ ఫోనుచేస్తాననీ చెప్పి యు.ఎస్. వెళ్ళిపోతాడు.
ఆ హోంలో ఉండేవారిలో ఆడవాళ్లు ఎక్కువ. అందుకు అనేక కారణాలు. జీవితాంతం ఒంట్లో ఓపిక ఉన్నంతవరకూ ఇంటిచాకిరీకి ఆడవాళ్ళు ఉపయోగపడతారు. ఇంక వాళ్ళ అవసరం లేదనుకున్న ఒట్టిపోయిన గొడ్డుని కబేళాకు పంపినట్లు వాళ్ళని ఆశ్రమాలపాలు చేస్తున్నారు. ఈరోజుల్లో పిల్లలు దూరప్రాంతాలలో ఉండటంతో చరమాంకంలో సైతం ఒంటరిగా జీవితం గడుపుతున్నారు. ఆ వయసులో భర్తని కోల్పోతే తల్లిని తమతో తీసుకెళ్ళలేక ఆశ్రమాలు వెతుకునే వాళ్ళు ఇంకొందరు.చిన్నతనంలోనే వైధవ్యం సంభవించి ఏదో ఉద్యోగం చేసుకుంటూ గడిపినంతకాలం గడిపి తర్వాత ఆశ్రమబాటపట్టేవారు కొందరైతే అవివాహితలుగానే జీవితాంతం బతికి వయసు మళ్ళాక చూసేవారులేక ఆశ్రయం పొందేవారు మరికొందరు. అక్కడకు ఓ ఫర్లాంగు దూరoలోనే పార్వతి ఇల్లు.
తల్లిదండ్రులు ఎంత ప్రోత్సహించినా, ఎంత ఒత్తిడి చేసినా పునర్వివాహానికి అంగీకరించని పార్వతి తన ఒంటరిజీవితానికి ఆలంబనగా ఈ వృద్ధాశ్రమాన్ని ప్రారంభించి, తొలి రోజుల్లో తాను ఉద్యోగం చేస్తూనే తల్లి దండ్రుల సహాయసహకారాలతో నడిపించి, వారి మరణానంతరం ఉద్యోగం వదిలి పెట్టి పూర్తిస్థాయిలో దీనికే అంకితమైపోతుంది.

ʹ అసహాయులైన వీరితో గడుపుతోంటే ఆమె మనసుకు ఊరట కలిగింది. ʹ అంటుంది రచయిత్రి.
ఆమె చిన్ననాటి స్నేహితురాలు కమల ఫోను చేసి ʹ నీకు తెలిసిందా పార్వతీ ! మీ మామ గారు చేసిన పనిʹ అని అడుతుంది. ʹ ఊʹ అంటుంది నిర్లిప్తంగా పార్వతి
ʹ ఈ వయసులో అదీగాక భార్యపోయి ఆర్నెల్లు కాలేదు,ఎవరో దూరపు బంధువు, ఆమెని గుళ్ళో పెళ్ళి చేసుకున్నారు. నువ్వు మీ అత్త పోయిన తర్వాత నీ ఆశ్రమానికి ఆహ్వానించినా రానని చెప్పిన పెద్దమనిషి ఇప్పుడు ఈ వయసులో ఒంటరిగా ఉండటం చాలా కష్టమనీ, తోడు కోసం చేసుకుంటున్నానని అందరితో చెప్తున్నాడట.
రోజూ కొత్త పెళ్ళంతో షికార్లంట బుద్ధిలేక పోతే సరి, విషయం తెలియగానే భలేకోపం వచ్చిందనుకో. అతను చేసుకున్నందుకు కాదు, పాతికేళ్ళకే మోడైపోయిన కోడలి జీవితానికి ఒకతోడుని సమకూర్చటానికి సంఘం, సంప్రదాయాలు, చట్టుబండలంటూ అడ్డుగా చూపిన ఆ ముసలాడికి ఈ లేటు వయసులో తోడు కావాల్సివచ్చిందంట. ఏమిటే మాట్లాడవు?ʹ – అని అడుగుతుంది స్నేహితురాలు కమల సందేహంగా.
ʹ .. నాకు కూడా ఉత్తరం రాశారు ". బదులిస్తుంది పార్వతి
ʹ నీకేం బాధ అనిపించలేదా? " ఆశ్చర్యంగా అడుగుతుంది కమల.
ʹ ఏమంటాను? మగాడి వయసులో తోడును వెతుక్కోవటం కాక, అతని అధికారాన్ని పెత్తనాన్ని కుటుంబంలో నిలుపుకోగల హక్కుని సమాజం అతనికి ఇచ్చింది. స్త్రీ మొదటిసారి కూడా తన ఆలోచనల్నీ తన మాటనీ, తనిష్టాల్ని కొనసాగించగల హక్కు ఎప్పటికీ లభించటం లేదు.తరతరాలుగా వైవాహిక వ్యవస్థలో స్త్రీ పట్ల వివక్ష చూపిస్తున్న ఈ సమాజం లో అందుకే మళ్ళీ మరో కుటుంబం కోసం తలవంచే సాహసం చాలా మంది స్త్రీలు చేయలేకపోతున్నారు. ʹ అంటుంది పార్వతి.
సరైన నిర్ణయం తీసుకోవడానికి, తీసుకోకపోవడానికి మధ్య నలిగిపోతున్న స్త్రీల వ్యధలు ఒకవైపు చెపుతూనే, అసలు అనవసరమైన రిస్క్ వద్దు అనే ఆలోచనతో – ముసలి తల్లిదండ్రులకు తానే కొడుకై పూర్తిస్థాయిలో అసరాగా ఇమిడిపోయి, తల్లితండ్రుల సహకారంతో ఇద్దరు పిల్లలతో ధైర్యంగా తన కాళ్ళపై తను ఒంటరిగా నిలబడటమే కాకుండా , ఇంకెదరికో ఆశ్రయం కల్పించి, ఎస్తేరు లాంటి వాళ్లకు ఉపాధి ఇవ్వడం ద్వారా, పార్వతి తన వ్యకిత్వాన్ని మెరుగుపరచుకున్న తీరు గమనార్హం. జీవితం పట్ల తనకొక స్పష్టత వుందని, జీవితాన్ని తాను అర్థం చేసుకుంటూ వున్నదని చెప్పటానికి , తనలోని పరిణితికి చిహ్నమే ఆమె జీవిత విధానం.
కథలోని కథాంశం బలంగా సూటిగా స్పష్టంగా పాఠకులకు అందినప్పుడే కథా లక్ష్యం నెరవేరుతుంది. పార్వతి మాటల్లో రచయిత్రి చెప్పదలచుకున్న కథాంశం నిక్షిప్తమైవుంది .ఈ కథ లోని బలమైన పాయింట్ కూడా అదే.!వైధవ్యం కారణంగా ఒంటరితనం లోంచి బయటపడి భద్రత కోరుకునే క్రమంలో పునర్ వివాహం స్త్రీకి నిజంగా భద్రత కలిగిస్తున్నదా అన్నదొక ప్రశ్న?. జీవితంలోని కష్టాలను తట్టుకుని, నిలబడాలని ప్రయత్నిస్తున్న స్త్రీలకు ఎంతమంది తల్లితండ్రులు, అత్తామామలు, కుటుంభ సభ్యులు తోడుగా నిలుస్తున్నారు ? అన్నది మరొక ప్రశ్న.
ఈ కథలో రచయిత్రి ఉద్దేశ్యాలను కథాంశాన్ని అర్థం చేసుకోవడానికి- కథలోని మూడు అంశాలను అర్థం చేసుకోవడం పాఠకులకు అవసరం.
అనేక పరిస్థితుల కారణంగా ద్వితీయ వివాహం చేసుకోవాల్సి వచ్చినప్పుడు స్త్రీలు ఎందుకు సాహసించలేక పోతున్నారో పార్వతి మాటల్లోమరోసారి విందాం. – ʹ తరతరాలుగా వైవాహిక వ్యవస్థలో స్త్రీ పట్ల వివక్ష చూపిస్తున్న ఈ సమాజంలో అందుకే మళ్ళీ మరో కుటుంబం కోసం తలవంచే సాహసం చాలా మంది స్త్రీలు చేయలేకపోతున్నారు.ʹ ఇది మొదటి అంశం. అందుకు అనుగుణంగా ఎస్తేరు జీవితాన్ని రచయిత్రి కథలో అంతర్భాగంగా అమర్చడంవల్ల ఈ కథకు నిండుదనం తీసుకురావడం రెండో అంశం.
కూతురు కొడుకుగా మారడాన్ని కూడా రచయిత్రి కథ మధ్యలో క్లుప్తంగా ఒక్క మాటలో చెపుతుంది. ʹ కోటిఆశలతో వైవాహిక జీవితంలోనికి అడుగు పెట్టిన తర్వాత భర్త అనారోగ్యం, మరణానంతరం అత్తింట ఎదురైన సంఘటనలు మనసుని అనుక్షణం సలుపుతూ ఉండటంతో మనిషి, మనసులను శిలగా మార్చుకొని ముసలి తల్లిదండ్రులకు తానే కొడుకై పూర్తిస్థాయిలో ఆసరాగా ఇమిడిపోయిందిʹ – అన్నది మూడో అంశం.
ఈ మూడు అంశాలను అన్వయం చేసుకుoటూ కథ చదివినప్పుడు ,ఈ కథ పాఠకులకు మరింత బాగా చేరుతుంది.
భర్తను పోగొట్టుకున్న కోడలు కొత్త జీవితాన్ని మొదలుపెట్టేందుకు ఆమెకు కనీసం ధైర్యం చెప్పలేని ఆమెకి ఆసరాగా నిలబడలేని మామ , తన భార్య చనిపోగానే ఆ వయస్సులో కొత్త తోడు వెదుక్కోవడం, అటువైపు ఆమె అవివాహితురాలే కావడం, తనకన్నా వయస్సులో ఎంతో పెద్ద అయినప్పటికీ అతడ్ని వివాహం చేసుకున్న ఆమె కథ ఈ కథలో చెప్పని మరొక కథ. కథలో కొన్ని లోపలి, లోతైన అంశాలు కొన్నిసార్లు పాఠకుల వివేచనకు పరీక్షలు పెడతాయి.
రచయిత్రి చెప్పదలచుకున్న సంగతులన్నీ కథ చివరిలో స్నేహితురాలితో జరిపే సంభాషణలో గమనించవచ్చు. ఎక్కడా తలవంచకుండా, తనకోసం తన జీవితం,తన పిల్లల కోసం ఒంటరిగా ధైర్యంగా నిలబడ్డంలోని ఆమె వ్యక్తిత్వం, పెద్ద వయస్సులో మామ గారు రెండవ పెళ్లి చేసుకున్నప్పటికీ , అతడిని తప్పు పట్టని ఆమె స్వభావం, అతడ్ని ఆమె అర్థం చేసుకున్న తీరు, సమాజం పోకడల్ని , మనుషుల మనస్తత్వాన్ని విశ్లేషించుకుని , అన్నిరకాల సమస్యలను ఆమె పరిష్కరించుకుంటూ , ఎక్కడా సంయమనం కోల్పోని ఆమె తత్త్వం, అబ్బురం అనిపిస్తాయి. వర్తమాన పరిస్థితులలో స్త్రీకి విద్య, ఉపాధి - వివేకంతో నిర్ణయాలు తీసుకోవడంలో, మరొకరికి ఆసరా కల్పించి ఆదుకోవడంలో ఎంతటి ధైర్యాన్నిస్తాయో ఈ కథ చెపుతుంది.
కవిత్వంలోలాగే మంచి కథలో కూడా ఒక అంతర్లయ ఉంటుంది. ప్రవాహ వేగంతో సాగే ఈ కథలోని అనేక స్త్రీల వేదనలను , అంతులేని దుఃఖాలను, గొప్ప జీవశక్తితో నిరంతరం పరిస్థితులతో పోరాడే శక్తివంతమైన మహిళలను ,వాళ్ళ ఉద్వేగాలను, చైతన్యాలను అర్థం చేసుకున్నప్పుడే ఈ కథలోని అంతర్లయ పాఠకులకు అందుతుంది .