17, ఏప్రిల్ 2022, ఆదివారం

సహృదయ విమర్శకులు రామమోహనరాయ్

 ~ సహృదయ విమర్శకులు రామ్మోహన రాయ్ ~


       కడియాల రామ్మోహన రాయ్ 1944, ఏప్రిల్ 11న గుంటూరు జిల్లా, మేడికొండూరు మండలం, సిరిపురం గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి కడియాల భద్రయ్య నాస్తికుడు, హేతువాది, సాహిత్యాభిలాషి, కమ్యూనిస్టు పార్టీ అభిమాని కావటంతో ఆయన ప్రభావం వలన హేతువాదం, నాస్తికత్వం, మార్క్సిజం దృక్పథం గల రామ్మోహన రాయ్ సాహిత్యమూ,రచనలూ కూడా అదే పంథాలో సాగాయి.

           రామ్మోహన రాయ్ మృదుస్వభావి కావటాన ఎప్పుడూ కఠినంగా, పరుషంగా మాట్లాడరు.తాను చదివిన రచన నచ్చినప్పుడు ఆ రచయితగా నీ,కవిగానీ వయస్సులనూ,పాతకొత్తలను ఎంచకుండా ఫోన్ చేసి అభినందించే నైజం ఆయనది.

      యువ కవులకు ఆధునిక సాహిత్యం పట్ల అవగాహన కల్పించే పెద్ద బాలశిక్ష గా 'తెలుగు కవితా వికాసం' గ్రంథాన్ని చెప్పుకోవచ్చు.

వర్తమాన కవిత్వంపై గల అభిమానంతో ప్రచురితమైన కవిత్వాన్ని, కవితా సంపుటాలను ప్రతీ ఏడాదీ శ్రధ్ధగా చదవటమే కాకుండా విశ్లేషణ చేస్తూ చాలా కాలంపాటు వ్యాసాలు రాశారు.

         కవులూ,రచయితల పట్ల నిష్పక్షపాతంగా రచనలను ఆసాంతం చదివి తన అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేసేలా వ్యాసాలు రాసే సహృదయ విమర్శకులు రామమోహనరాయ్.

         సాహిత్యం పట్ల చక్కని అభిరుచి కలిగేలా పన్నెండు విమర్శగ్రంధాలను సాహిత్య లోకానికి అందించిన ప్రముఖ సాహితీవేత్త.అంతే కాక అనేక అముద్రిత సాహిత్య వ్యాసగ్రంథాలు కూడా ఉన్నాయి.అవికూడా గ్రంథం రూపంలో వస్తే విమర్శకులకు మార్గదర్శకంగా ఉంటుంది.

     సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీ ప్రచురించిన ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ లిటరేచర్ లో రామ్మోహన రాయ్ గారు రాసిన 28 వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

         కడియాల రామ్మోహన రాయ్ ప్రాచీన, ఆధునిక సాహిత్యాలలో లోని సాహిత్యవిమర్శను పరామర్శిస్తూ సుదీర్ఘమైన,సవివరణాత్మకంగా రాసిన "మానసోల్లాసం"కవిత్వం,నవలా,నాటకం, వ్యాసం మొదలైన సాహిత్యప్రక్రియలపై విమర్శ చేయాలంటే విమర్శకులకు గురుతరమైన బాధ్యతను తెలియజేసే విధంగా రాసిన గ్రంథం.450 పేజీలు గల ఈ గ్రంథంలో 1966-2016 వరకూ అనగా అర్థశతాబ్ది తెలుగు సాహిత్యవిమర్శకు చెందిన అమూల్యమైన వ్యాసాలు తెలుగును ప్రధాన భాషగా అభ్యసించే విద్యార్ధులకూ, పరిశోధకులకు మాత్రమే కాకుండా విమర్శకులకు కూడా రిసోర్స్ పుస్తకంగా ఉపయుక్తంగా ఉంటుంది.సాహిత్యవిమర్శ ఒక కళ అని ప్రతిపాదించిన ఈ గ్రంథాన్ని ద్రావిడ విశ్వవిద్యాలయం ప్రచురించి సాహితీవిమర్శకు ఒక దారిదీపంగా అందించింది.అందుకే ఆచార్య ఈడిగ సత్యనారాయణ గారు " పద సౌష్టవం,అర్థగాంభీర్యం కలిగి మానసోల్లాసానికి అద్దం పడుతున్న ఈ వ్యాస సంపుటి సాహిత్యలోకానికి కడియాల రామ్మోహన్ రాయ్ గారు అందించిన అపురూపమైన కానుక గా అభినందించారు.

            తెలుగు నవలశతజయంతి సందర్భంగా1972 లో విజయనగరం మహారాజావారి సంస్కృతాంధ్ర కళాశాలలో "నూరేళ్ళ తెలుగు నవల తీరుతెన్నులు" అనే అంశం గురించి ప్రసంగించమని గూడపాటి సాంబశివరావు గారు కోరగా రామ్మోహన రాయ్ అప్పట్లో వచ్చిన గ్రంథాలను అధ్యయనం చేసారు.తెలుగు నవల లక్షణాలూ,స్వరూపస్వభావాలే కాక భాషా పరిశీలనలో భాగంగా వివిధ మాండలీకాలను,వర్గ మాండలికాలనూ పరిశీలించటమే కాకుండా వివిధ ప్రాంతాల సాహిత్య మిత్రులతో కూడా సుదీర్ఘ చర్చలు జరిపారు.

         తెలుగు నవలలు(1872-2010) వరకూ నవలా ప్రారంభం, పరిణామక్రమం,సమాజంపై ఆయా నవలలు కలిగించిన ప్రభావం ప్రాతిపదికన తెలుగు లోని అత్యుత్తమమైన వంద నవలల గురించి అధ్యయనం చేసి రచించిన గొప్ప పుస్తకం " మన తెలుగు నవలలు"

          ఒక జాతి సంస్కృతి నీ, తెలుగు ప్రజలజీవనవిధానం, తెలుగు జాతి చరిత్ర,సమాజం, పరిణామక్రమంలో ప్రజల ఆలోచనల్లో వచ్చిన మార్పులు,సమాజంలో సమూలమైన మార్పులకు కారణమైన సామాజిక సంఘటనలను సాహిత్యం ఏవిధంగా ఒడిసిపట్టి ప్రతిబింబించింది మొదలైనవన్నీ ఈ నవలల ద్వారా తెలుస్తాయని రామ్మోహన రాయ్ ఈ వ్యాసాల్లో ప్రస్తావించారు.

               వివిధ తెలుగు ప్రాంతాల్లోని ప్రజలభాషలోని జాతీయాలూ,సామెతలూ,పలుకుబళ్ళూ రచయితలు వ్యక్తీకరించిన విధానాన్ని వివిధ రాజకీయ, ఆర్థిక,సామాజిక పరిస్థితులకు రచయితల ప్రతిస్పందన సాహిత్యం ద్వారా తెలియజేయడాన్ని రామ్మోహన రాయ్ గారు ఇందులో చూపించారు.

                సాహిత్యం లో 1872 నుండివ2010 వరకు వచ్చిన వివిధ వాదాలను ఆయా కాలంలో రచయితలు ప్రస్తావించిన విధానాన్ని ప్రశంసించారు.

                కర్నూలు లో డిప్యూటీ కలెక్టర్ గా ఉన్న నరహరి గోపాలకృష్ణమ సెట్టి రచించి ప్రచురించిన "శ్రీ రంగరాజు చరిత్ర (క్రీ.శ. 1872) " నే మొదటి నవలగా వీరు ప్రస్తావించారు.అయితే అప్పటికి నవల అని కాక నవీన ప్రబంధం అన్నారని పేర్కొన్నారు. వీరేశలింగం గారు తన స్వీయచరిత్ర ము లోకూడా శ్రీ రంగరాజు చరిత్ర గురించి చెప్పక పోయినా ఈ రెండింటిలో గల పోలికలు ఈ గ్రంథాన్నిి వీరేశలింగం గారు చదివారనేది తెలుస్తుందని శ్రీ కొత్తపల్లి వీరభద్రరావు గారు తెలిపారనేవిషయాన్ని రామ్మోహన్ రాయ్ తో వ్యాసం లో ప్రముఖంగా పేర్కోన్నారు.

                ఈ విధంగా తెలుగులోన ఆణిముత్యాలు లాంటిి వంద ప్రముఖ నవలల గురించి రామ్మోహన్ రాయ్ గారు రాసిన వ్యాసాలు మన నవలా సాహిత్యం ప్రాముఖ్యత,ఆయా నవలాకారుల ప్రతిభా పాటవాలను తెలియజేసేలా ఉన్నాయి.138 ఏళ్ల తెలుగు ప్రజల సాహిత్యం, సంస్కృతినీ తెలుసు కోవటానికి ఒక గొప్పగ్రంథంగా రామ్మోహన రాయ్ గారి " మన తెలుగు నవలలు"ఉపయోగ పడుతుంది.

                ఇటీవల రామ్మోహన రాయ్ గారు ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడి మీ కవిత్వం మీద సమగ్రమైన వ్యాసం రాయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను" అన్నారు. కానీ నేనే ఈ విధంగా వారికి శ్రద్ధాంజలిగా రాయవలసి వచ్చినందుకు బాధపడుతున్నాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి