13, ఫిబ్రవరి 2022, ఆదివారం

అతడు-ఆమె -- ఉప్పల లక్ష్మణరావు

 నాకు నచ్చిన రచన ఉప్పల లక్ష్మణరావు గారు రాసిన  నవల "అతడు-ఆమె"

          ఈ నవల 70 లలో ఒకసారి చదివాను.మళ్ళా ఒక రెండు మూడునెలలక్రితం మళ్ళీ చదివాను.ఆప్పుడే ఫేస్బుక్ లో పెట్టడానికి రాసాను. లక్ష్మణరావు గారు బరంపురం లో వికాసం అనే సాహిత్య సంస్థ ద్వారా జరుపు సమావేశాలకు మా చిన్నన్నయ్య, వీర్రాజు గారు తరుచూ వెళ్ళేవారు.
తెలుగు సాహిత్యం లో తప్పక చదవాల్సిన ముఖ్యమైన పది నవలల్లో లక్ష్మణరావుగారు రాసిన "అతడు -ఆమె" ఒకటి.
         మూడు భాగాలుగా ఉండే ఈ నవల భారతస్వాతంత్ర్య పోరాటాన్ని చిత్రీకరించే చారిత్రక నవల. ఈ నవలను ఇద్దరు వ్యక్తుల మధ్య డైరీలో నడిచినట్లుగా రాసారు రచయిత
        మొదటిభాగం లోని కథ శాస్త్రీ ,శాంతం ల మధ్య జరుగుతుంది.
       శాస్త్రి విదేశంలో బారిష్టరు చదివి చెన్నపట్నంలో లా ప్రాక్టీసు పెట్టిన లాయరు. శాంతం ఆధునిక భావాలున్న మహిళ. శాస్త్రి పాతకాలం మనిషి. చాలా విషయాల్లో వారిద్దరి అభిప్రాయాలు కలవవు. డబ్బే అన్నిటికన్నా ప్రధానమైనది, దాని కోసం విలువలు, ఆదర్శాలూ పక్కన పెట్టొచ్చూ అన్నది అతని వాదన. మనం సంపాదించే డబ్బును ఇతరులకు ఖర్చు పెట్టడంతో వచ్చే తృప్తి తెలుసుకోమంటుంది ఆమె.  ఈ పాత్రలు తమ మధ్య జరిగిన సంఘటనలను డైరీగా రాసుకుంటారు.ఒకే సంఘటనకు ఇద్దరు స్పందించే తీరు ద్వారా పాత్ర చిత్రణ జరుగుతుంది ఈ నవలలో ఈ ప్రక్రియ ఒక ప్రయోగమనే చెప్పుకోవాలి.
  శాంతం మనస్ఫూర్తిగా స్వాతంత్ర్యోద్యమంలోకి దిగితే, శాస్త్రి పేరు ప్రతిష్ఠల కోసం రాజకీయాల్లోకి రావటానికి ఉద్యమంలో కొస్తాడు. ప్రతి విషయాన్నీ డబ్బు రూపంగానే చూసే అతని మనస్తత్తత్వం నచ్చని శాంతం అతనిని వదిలి ఇద్దరి కూతుళ్ళతో కాశ్మీరం వెళ్ళి తిరిగి అతన్ని చేరడంతో వారిద్దరి కథ ముగుస్తుంది.
      అతడు ఆమె రెండవ భాగం శుభ, జనార్ధనరావుల కథ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మొదలవుతుంది. శాంతానికి కూతురు పుట్టిన సమయంలో ఒకరోజు ఒక పదహారేళ్ళ పిల్ల శాంతం ఇంటికి వచ్చి అన్నం పెట్టమంటుంది. ఆమె తెలంగాణావాసి అని, ఆమె తల్లిదండ్రులు 100 రూపాయల కోసం తమిళనాడు వాళ్ళకి అమ్మేయగా, వాళ్ళు ఈమెని వేశ్యగా అమ్మబోతుండగా ఆమె తప్పించుకువచ్చానని చెప్పడంతో ఆమెను చేరదీస్తుంది శాంతం. ఆ అమ్మాయే శుభ. శాంతం ఆమెని తన కూతురు లక్ష్మితో సమానంగా పెంచుతుంది. జనార్ధనరావు శుభ స్నేహితుడు. అతను ఆర్మీలో ఇంజినీరుగా పనిచేస్తుంటాడు. వీరిద్దరూ తమ మనసులోని ఇష్టాన్ని బయటపెట్టలేకపోతారు. చివరకి ఇద్దరూ తమ ప్రేమను వ్యక్తం చేయడంతో కథ ముగుస్తుంది. కథ నడుస్తున్నంత సేపూ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భారతదేశ ప్రజల పరిస్థితుల్ని వర్ణిస్తూనే ఉంటారు రచయిత.
        తరువాత మూడవ భాగం కథ శాంతం-శాస్త్రిల కూతురైన  కమ్యూనిస్టు భావనలు కల లక్ష్మిది,ఆమె స్నేహితుడు, సహాధ్యాయి ఐన భాస్కరరావుది. వీరిద్దరి మధ్య స్నేహం తప్ప మరేమీ చూపించరు రచయిత. నిజానికి లక్ష్మికి పెళ్ళి, పితృస్వామ్య కుటుంబ వ్యవస్థ అంటే వ్యతిరేక భావాలు ఉండటమే కారణం. ఇద్దరూ ఇంజినీర్లే. భాస్కరం ఒకసారి చిన్న అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు. ఆమెను బలవంతంగాస్వాధీనపరచుకుంటాడు. ఈ విషయం లక్ష్మికి ఉత్తరం రాసి పశ్చాత్తాపపడతాడు. అలా పితృస్వామిక మనస్తత్వం నుంచి లక్ష్మి ద్వారా బయట పడతాడు. స్వతంత్రం వచ్చినా ప్రభుత్వ విధానాల్లో మార్పులు రాకపోవడంతో లక్ష్మి ఉద్యోగానికి రాజీనామా ఇవ్వడంతో మొత్తం నవల ముగుస్తుంది. నవల  ఆసాంతం స్వాతంత్రోద్యమం ,విదేశీ వస్త్రాలను, భూస్వాములు,జమిందార్ లు, రైతులు మధ్య సంఘర్షణను,కార్మికచట్టం,గోవా విమోచనోద్యమం,ఆంధ్రసమాజ తీరుతెన్నులూ అన్నింటినీ సమయానుకూలంగా చిత్రిస్తారు రచయిత.
           ముగ్గురు ఆడవాళ్ళు, మూడు మనస్తత్త్వాలు, మూడు రకాల అభ్యుదయ భావాలను రచయిత ఈ నవలలో చిత్రిస్తారు. వారి భావాలకు రకరకాలుగా స్పందించే మగవాళ్ళు, వారి మనస్తత్వాలూ కూడా ఈ నవల్లో గమనించ వలసిన విషయాలు.
        పాత్ర చిత్రణ అంతా సహజంగా కాల్పనిక సాహిత్యంలో ఉండేలా ఆయా పాత్రల భావోద్వేగాలకనుగుణంగానే కథ నడుస్తుంటుంది. కానీ ఈ నవలలో ప్రత్యేకత ఆ పాత్రలు తాము రాసుకునే డైరీ ద్వారా తమని తాము తీర్చిదిద్దుకుంటుంటాయి. పాత్రలు రాసేది డైరీ కనుక ఎదుటి వారిని ప్రశంసించడానికో, విమర్శించడానికో అన్నట్టుగా కాక నిజాయితీగా మనసులో భావాలను డైరీలో వ్యక్తీకరిస్తుంటాయి. ఈ నవలలోని పాత్రలు సామాజిక స్పృహ కలిగినవి. తమ చుట్టూ సమాజంలో జరిగే విషయాలకు స్పందిస్తూ ఉండటంతో కథ సజీవంగా నడుస్తుంటుంది.  
         ఉప్పల లక్ష్మణరావు కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని వ్యక్తిగతంగా నమ్మి తదనుగుణమైన కృషి సాగించిన రచయిత. మాస్కోలో ప్రగతి ప్రచురణాలయంలో రష్యన్ సాహిత్యాన్ని అనువదించారు. రష్యన్-తెలుగు నిఘంటువు తయారుచేశారు. వీరు స్విట్జర్లాండ్ కు చెందిన మహిళ మెల్లీని వివాహం చేసుకున్నారు. రష్యా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చాకా బరంపురంలో "వికాసం" అనే సాహిత్యసంస్థతో అనుబంధాన్ని కొనసాగిస్తూ 1985లో మరణించారు.

7, ఫిబ్రవరి 2022, సోమవారం

శీలా సుభద్రా దేవి --బయోడాటా

 శీలా సుభద్రా దేవి---బయోడాటా

                         
జననం:: విజయనగరంలో డిసెంబర్19,1949
విద్య:.   ఎమ్.ఎ.( తెలుగు)ఎమ్.ఎస్సీ(గణితం)బి ఇడీ
ఉద్యోగం: ఆర్టీసీ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయిని, ప్రధానోపాధ్యాయినిగా పదవీవిరమణ.

ప్రచురించిన పుస్తకాలు::-
కవితా సంపుటాలు:
     1.ఆకలినృత్యం( 1980,
     2. మోళీ (1984)
     3.తెగినపేగు(1992) 
     4.ఆవిష్కారం(1994)
      5.ఒప్పులకుప్ప( 1999)
      6.యుధ్ధం ఒక గుండెకోత (2001)
      7.ఏకాంతసమూహాలు( 2004)
       8. బతుకు బాటలో అస్తిత్వరాగం(2009)
        9.నా ఆకాశం నాదే(2016)
        10. శీలా సుభద్రాదేవి కవిత్వం(2009)
        11 .war,A Heart' Ravege( 2003)
           యుధ్ధం ఒక గుండెకోత దీర్ఘ కవితకు ఆంగ్లానువాదం
        12.Yuddh A Dil ki vyadha (2017)
          యుధ్ధం ఒక గుండెకోత దీర్ఘకవితకు హిందీ అనువాదం.     
         13. Ullak kumural (2021)
         యుద్ధం ఒక గుండెకోతకు తమిళ అనువాదం    
      
    కథాసంపుటాలు:
           1.దేవుడిబండ(1990)
            2.రెక్కలచూపు(2008)
             3.ఇస్కూలు కథలు(2018)   
వ్యాస సంపుటి::
               1.కథారామంలో పూలతావులు(రచయిత్రుల కథలపై వ్యాసాలు.           ఇతరములు.    :
             1. గీటురాయి పై అక్షర దర్శనం(2017)
                 ( రచయిత్రి రచనలపై సమీక్షావ్యాసాలు)
              2.డా.పి.శ్రీదేవి మోనోగ్రాఫ్ (2018)
                  ( కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురణ.)
              3. ముద్ర _ వందమంది కవయిత్రుల సంకలనానికి 
                   సహసంపాదకత్వం.(2001)
              4. నీడల చెట్టు నవలిక.(2016)
    పురస్కారాలు:::
   
           1.తెలుగువిశ్వవిద్యాలయంనుండి97 లో సృజనాత్మక సాహిత్యాని కి                        పట్టాభిరామిరెడ్డి ఎండొమెంట్ అవార్డ్
            2. శ్రీపొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం  నుండే 99 లో                 ఉత్తమరచయిత్రి అవార్డ్
            3.కడప సాంస్కృతిక సంస్థ నుండి 2011 లోగురజాడ అవార్డ్
            4.ఆవంత్స సోమసుందర్ గారి నుండి 2011 లో దీర్ఘకవిత్వానికి       రాజహంస కృష్ణశాస్త్రి  పురస్కారం.
             5.ఉమ్మిడిసెట్టి రాధేయ త్రిదశాబ్ది ప్రతిభా పురస్కారం.2018
              6.కవిత్వానికి అమృతలత అపురూప పురస్కారం 2018
              7.నా ఆకాశం నాదే కవితా సంపుటి కి గంగిశెట్టి లక్ష్మినారాయణ గారి        మాతృపురస్కారం 2018

25, జనవరి 2022, మంగళవారం

లేఖ

ప్రియమైన రాజీ ఎలా ఉన్నావు? ఈమధ్య ఫోనుల్లోనో, చాటింగ్ లోనో మనం ఎప్పటికప్పుడు కబుర్లు చెప్పేసుకుంటున్నాము కదా ఈ ఉత్తరం ఏమిటి అని ఆశ్చర్య పోతున్నావా? నిజమే కానీ నిన్న చూసిన ఒక సంఘటన నన్ను నిలవనీయటంలేదు.నా బాధను అక్షరాల్లో పొదిగే వరకూ మనసుకు ప్రశాంతత చేకూరదనిపించి నీతో మనసు విప్పి పంచుకుందామని మనమధ్య యంత్రం మధ్యవర్తీత్వం లేకుండా ఉత్తరమే రాస్తున్నాను. నిన్న ఉదయం నా కజిన్ సంధ్య భర్త మాసివ్ హార్ట్ ఎటాక్ తో చనిపోయారు.సంధ్య స్వంత చెల్లెలు ఉషా క్రితంనెల పిల్లల దగ్గరికి యూఎస్ వెళ్ళింది.సంధ్యచిన్నకూతురు ఇటీవలే యూఎస్ లో ఉద్యోగంలో జాయిన్ కావటంతో రావటానికి పర్మిషన్ లేక రాలేక పోయింది.దానికి తోడు కరోనా పరిస్థితులు.పెద్ద అల్లుడూ,కూతురు అదృష్టవశాత్తూ బదిలీ మీద ఢిల్లీ నుండి హైదరాబాద్ కి ఇటీవలే వచ్చారు.అందువల్ల వాళ్ళే అన్నీ చూసుకున్నారు. అయితే ఫోనులో అంతా ప్రత్యక్షంగా చూడటానికి వీలుగా వీడియో ఆన్ చేసి ఒక అమ్మాయి పట్టుకుని కూర్చుంది.అందులోనే విదేశాల్లో ఉన్న సంధ్యచిన్నమ్మాయి,సంధ్య చెల్లెలు కళ్ళనీళ్ళతో చూస్తున్నారు.మనిషికి మనిషికీ మధ్య ఒక యంత్రమే ఈనాడు అనుసంధానం అవుతోంది. ఇటువంటి సంఘటనే కరోనా సెకెండ్ వేవ్ లో మా అపార్ట్మెంట్ లోనూ జరిగింది.ఒకామె విజయవాడ నుండి కూతురు డెలివరీ కోసం వచ్చింది.ఆమె కొడుకులు ఇద్దరూ విదేశాల్లో ఉన్నారు.కూతురు ఉద్యోగస్తురాలు కావటం వలన డెలివరి అయ్యాక మరికొన్నాళ్లు సాయంకోసం ఇక్కడే ఉండి పోవాల్సివచ్చింది.అంతలో తల్లీ కూతురూ కరోనా బారిన పడ్డారు.తల్లికి సీరియస్ అయ్యి దురదృష్టవశాత్తు మృతి చెందింది.కొడుకులకు రావటానికి కుదరలేదు.కూతురు కోవిడ్ పేషెంట్.ఆమె అనాధప్రేతంలా అయ్యింది.ఆ కార్యక్రమం కూడా అలాగే వీడియో తీసి పంపారట.ఇటీవల ఈ కరోనా పరిస్థితుల్లో ఇటువంటి దృశ్యాలు ఎన్నో.ఆత్మీయులైనవారిని దగ్గరకు తీసుకుని ఓదార్చటానికి కరోనా స్పర్శకు దూరం చేసింది.దూరంగా ఉన్నవారు రావటానికి లేకుండా పోయింది. చివరి రోజుల్లో సంతానం రాల్చే రెండు కన్నీటి బొట్లను కూడా నోచుకోని స్థితి. దాపురించింది. పూర్వం ఉమ్మడి కుటుంబాల వలన ఒకరికొకరు సాయం ఉండేవారేమో.ఇప్పుడు న్యూక్లియర్ కుటుంబాలు కావటం రెక్కలొచ్చిన పిల్లలు వారి భవిష్యత్తు దిశగా ఎగిరిపోవటంతో తల్లిదండ్రులు ఒంటరి వాళ్ళయిపోతున్నారు. పిల్లలకోసం ,వాళ్ళు అభివృద్ధి కోసం తల్లిదండ్రులు తమ జీవితమంతా వెచ్చిస్తారు. పిల్లలంతా చదువులకోసమో,ఉద్యోగాలకోసమో విదేశీ బాట పడుతున్నారు.అందులో వాళ్ళనీ తప్పు పట్టటానికి లేదు.వారి భవిష్యత్తు వారిదే కదా.వాళ్ళ అభివృద్ధికి పెద్దలు అవరోధం కాకూడదు కదా. ఎటొచ్చీ ముఖ్యంగా తెలుగు ప్రాంతాలలోని చాలాఇళ్ళు వృధ్ధాశ్రమాలలా వృధ్ధులతో మిగిలిపోతున్నాయి.ఎంత దురదృష్టం కదా?మాటిమాటికీ పిల్లలు లేరని చివరి రోజులు ఎలా గడుస్తాయోనని నువ్వు బాధ పడుతుంటావు. ఉన్నవాళ్ళపరిస్థితి చూస్తున్నావు కదా రాజీ. మనచుట్టూ వున్నవారు,మనం ప్రేమించిన వాళ్ళు, మనని ప్రేమించినవాళ్ళే మనవాళ్ళు. రాజీ ఇప్పటి ఈ కరోనా కాలంలో ఈ స్థితి మరింత దారుణంగా అనిపిస్తోంది.మనుషులమధ్య భౌతికంగానే కాదు రానురాను మానసికంగానూ దూరం పెరిగి పోతుందేమో అనిపిస్తుంది. నువ్వు కూడా ఇటువంటి దృశ్యాల్ని మరెన్నో చూసే ఉంటావు.నీ అభిప్రాయం కూడా తెలియజేస్తావు కదూ. మరిక ఉండనా ప్రేమతో సుభద్ర.

3, డిసెంబర్ 2021, శుక్రవారం

అలకలకొలికి

అలకల కొలికి ఎందుకో మరి నామీద అలిగింది. ఉదయం లేచిన దగ్గర నుంచి డమ ఢమ లాడే డక్కుల బండికి దారం కట్టి చప్పుడు చేసుకుంటూ నా వెనకెనకే తిరిగి నాకు తోచనీకుండా వెంట బడేది ఆ దారాన్ని నా కొంగు కు తగిలించి తాను పక్కకు తొలిగేసరికి చప్పుడు చేయని డక్కులబండి ఏమూలో ఉందో కానీ బండి లేని దారం నాకు భారం అయ్యింది ఇలా నిశ్శబ్ధం నా కొంగు కి మూటగట్టి మరి ఎందుకో నామీద అలిగింది స్నానానికి వెళ్తే తలుపు దగ్గర నిలబడి తొందరగా జలకాలాడి రమ్మని కాపలా కాసి వేధించేది అటువంటిది స్నానాలగది తలుపుకి నిశ్శబ్దాన్ని తగిలించి నామీద అలిగి ఎక్కడికి వెళ్ళిందో మరి ఎంత వెతికినా కనిపించలేదు భోజనం చేస్తున్నప్పుడు కూడా అన్నం ముద్ద పెట్టుకున్న నా వేళ్ళను పట్టి బలవంతంగా లాక్కెళ్ళి చేతులు కడుక్కునేవరకూ సతాయించి కలం కాగితం అందించేది ఇప్పుడెందుకో నామీద అలిగి మూతి ముడుచుకు కూర్చుంది కాసేపు ఏపుస్తకమో పట్టుకుని మంచి రసపట్టు లో సాహిత్యం లో మునిగి తేలుతుంటే చాలులే చదివింది అని మధ్యలో నన్ను వేధించేది కాస్తా ఎక్కడో నిశ్శబ్దంగా దాక్కుండిపోయింది కాసేపు విశ్రాంతి గా కూచోనీకుండా వీపుమీద వాలి గూగూలు ఊగుతూ జుట్టును జడలల్లుతూ ఆలోచనల్లోకి చొరబడి తలపుల్ని అల్లుకోమని అల్లరి చేసేది ఎందుకో మరి అలిగి కూచుంది. రోజంతా అలసిసొలసి పక్కమీద వాలి గాఢనిద్రలోకి వెళ్ళిపోతానా నెమ్మదిగా పక్కన చేరి బలవంతాన కనురెప్పలు విప్పి కలల్ని దోచుకొన్నదే కాక చాలులే నిద్ర రారమ్మని కథలూ కవితలూ చెప్పుకునే సమయమైందని చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళే అక్షరం ఏమైందో ఏమో మరి నామీద అలిగి ఏ మూలో నక్కీంది. ఇప్పుడు ఎలాగైనా నా అక్షరాల్ని వెతికి పట్టుకుని లాలించి హృదయానికి హత్తుకుని అలకతీర్చి కవితతో ముద్దాడాలి.

నడక దారిలో-- 9

* నడక దారిలో--9 * నా స్కూల్ ఫైనల్ చదువు పూర్తిఅయ్యేలోపున మా అన్నయ్య ఎమ్మే ఎమ్ ఫిల్ పూర్తి చేసి మహారాజా కాలేజీ లో ఇంగ్లీష్ లెక్చరర్ గా ఉద్యోగం లో చేరాడు.మా స్కూల్ లోనే పనిచేసే మా అన్నయ్య సహోద్యోగి ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తి గారు కూడా పై చదువు పూర్తి చేసుకుని కాలేజీలో తెలుగు లెక్చరర్ గా చేరారు.మా చిన్నన్నయ్య కూడా బీయిడీ పూర్తిచేసుకుని హైస్కూల్ లోనికి ప్రమోట్ అయ్యాడు. ఇంత దూరం లో ఎందుకని పుత్సలవీధి చివర తూర్పు బలిజ వీథిలో ఇల్లు చూసుకుని మారిపోయాము. మా తాత గారి ఇంటి పేరైన పుత్సలవీథి ఆ చివర నుండి ఈ చివరివరకూ దగ్గరా, దూరపు బంధువులే.మా అయిదుగురు మేనమామలూ,మా పెద్ద నాన్నగారు,వారి అమ్మాయి ఉండేది ఆ వీథి లోనే,ఆ వీథిలో రోడ్డుకి ఇరువైపులా నేత పని చేసేందుకు సరి అమర్చబడి ఉంటుండేది.కొన్ని ఇళ్ళల్లోంచి మగ్గం నేస్తున్న శబ్దం వినిపించేది. నేను స్కూల్ ఫైనల్ పాసయ్యానని తెలిసి మా పెదనాన్న గారు మా చిన్నన్నయ్య తో "మా మనవరాలు వచ్చింది.ఇక్కడ ఆంధ్రా మెట్రిక్ పరీక్ష కట్టింది.మీచెల్లిని రేపు మా ఇంటికి ఒకసారి రమ్మని చెప్పు." అన్నారు. ఇంతవరకూ ఆయనను ముఖాముఖి కలిసింది లేదు.మర్నాడు మొదటిసారి వెళ్ళాను.కుశల ప్రశ్నలు, నా అభిరుచులు,కాలేజీలో చేరిన విషయాలు అడిగారు ఆయన.అడిగిన వాటికి స్పష్టం గానూ, ముక్తసరిగా సమాధానం చెప్పి ఆయన మనవరాలి తో కాసేపు కబుర్లు చెప్పి, భోజనం చేసాను. తిరిగి ఇంటికి వెళ్తానని చెప్పి బయలుదేరుతుంటే నాకు వాళ్ళు అమ్మాయి చేత చీర ఇప్పించారు.నాకు చాలా ఆశ్చర్యం కలిగింది.ఎందుకంటే ఏనాడూ ఏ సందర్భం లోనూ ఇలా ఎవరి నుండీ బట్టలు తీసుకోలేదు."ఎందుకండీ"అని వెనుకంజ వేస్తే "పరీక్షపాసయ్యావుకదా"అన్నారు పెద్దనాన్న గారు.పెద్దవారి మాటను కాదనలేక మరి మాట్లాడకుండా తీసుకుని ఇంటికి వచ్చేసాను. అంతకు ముందు ఉన్న కంటోన్మెంట్ లోని ఇల్లయితే కుమారీ తో కలిసి కబుర్లు చెప్పుకుంటూ కాలేజీ కి వెళ్ళే దాన్ని.ఇప్పుడు నేనొక్కదాన్నే పుత్సలవీథిలో రోజూ నా వెనకే శల్యపరీక్ష చేస్తున్న ఎన్నెన్నో చూపులబాణాలు నిలువెల్లా నన్ను గాయాలు చేస్తుంటే రోజూ అగ్నిప్రవేశం చేస్తున్న సీతలా అయిపోయేదాన్ని. అదే వీథి లో ఉన్న ఒక మామయ్య కూతురు ఆ ఏడాది బాలికల పాఠశాల లో ఆరో తరగతి లో చేరింది.ఆ స్కూలు మా కాలేజీ ఉన్న మాన్సాస్ ఆవరణలోనే ఉండేది.మరి ఆ పిల్ల కి తోడు కోసమేమో నన్ను పిలిచి మా రిక్షా లోనే కాలేజీకి వెళ్ళమని అన్నారు.సరే అని రోజూ వాళ్ళింటికి వెళ్ళి ఇద్దరం కలిసి రిక్షాలో వెళ్ళే వాళ్ళం. తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఆ అమ్మాయి వెళ్ళిపోయేది.నాకు ప్రాక్టికల్స్ ఉంటాయి కనుక ఒక సమయం అంటూ ఉండదు.అదీ గాక కాలేజీ అయిపోయిన తర్వాత మహారాజా సంగీత కళాశాలలో కర్నాటక గాత్ర సంగీతం క్లాసులో చేరాను.అందువలన నేను ఇంటికి వెళ్ళటానికి ఆలస్యం అయ్యేది. ఒకరోజు ఎప్పటి లాగే మామయ్య వాళ్ళింటికి వెళ్ళి మామయ్య కూతురు నేనూ వాళ్ళ రిక్షాలో కాలేజీకి బయలుదేరాము.దారిలో "నువ్వు ఇంకా ఎన్నాళ్ళు చదువుతావు వదినా" అని ప్రశ్నించింది ఆపిల్ల. "పీయూసి అయ్యాక ఇంకా చాలా ఏళ్ళు చదవాలి.మూడేళ్ళ డిగ్రీ చేయాలి. టీచర్ అయ్యేటట్లైతే ట్రైనింగ్ చేయాలి. తర్వాత ఉద్యోగం చేయాలి".కలలో తేలి పోతూనే అన్నాను. " ఆడపిల్లలు ఎక్కువ చదువుకుంటే పెళ్ళిళ్ళు అవ్వటం కష్టం అంట కదా?"అన్న ఆ పిల్ల మాట వినగానే దబ్బున కలలలోంచి ఇల పైకి పడినట్లైంది. "ఎవరన్నారు?"కొంచెం తీవ్రం గానే నాగొంతు ధ్వనించి నట్లుంది.ఆరవతరగతి చదువుతున్న ఆ అమ్మాయి "ఏమో అందరంటున్నారు "బిక్కమొఖం తో నెమ్మదిగా అంది. ఇంట్లో బహుశా నా చదువు గురించి జరిగిన చర్చ లో పెద్దవాళ్ళ మాటల్ని చిలకలా పలికిన ఆ పిల్ల వైపు జాలిగా చూసాను." నీతో వస్తుంటే నాకు కాలేజీ లో క్లాసుకు లేటవుతుంది.రేపటి నుండి నేను విడిగా ముందు వెళ్ళిపోతాను.నీతో రాను "అన్నాను.మరి వాళ్ళింటికి వెళ్ళలేదు. ఆ అమ్మాయి పదోతరగతి వరకైనా చదివిందో లేదో తెలియదు.తొందరగానే ఒక పనికిరాని వెధవకిచ్చి పెళ్ళిచేసారనీ,నలుగురినో ఐదుగురినో కని పిల్లలతో ఆర్థికంగా చాలా అవస్థలు పడిందనీ, ఇప్పుడు చిన్నచిన్న ఉద్యోగాలతో ఆడపిల్లలే కుటుంబాన్ని అందుకుంటున్నారని విన్నాను. ఆ రోజుల్లోనే మా ఇంకో పెదనాన్న కొడుకు వివాహానికి మా పెద్ద మామయ్య సుందరరావు గారితో కలిసి మానాన్నగారి జన్మస్థలం అయిన ధర్మవరం గ్రామానికి వెళ్ళాను.అక్కడే ఉన్న కొంత పొలం ఇంటిలో చిన్నపాటి భాగం మా నాన్నగారి ఆస్తి ఉందట. పెళ్ళికి వచ్చిన మరో బంధువు నుండి కూడా మళ్ళీ ప్రశ్న ఎదుర్కొన్నాను." కాలేజీలో చేరావట కదా? ఇంతకీ ఏం గ్రూప్ తీసుకున్నావు?" అని.నా సమాధానం విన్నాక " ఏం లెక్కలు నీకు అంత బాగా వచ్చేమిటి?" అని వెటకారంగా మరో ప్రశ్న. అంటే ఆడవాళ్ళు సైన్స్, లెక్కలు చదవకూడదా? లేకపోతే అవి చదివేటంత తెలివి తేటలు ఆడవాళ్ళకి ఉండవనా? నాకు అర్థం కాలేదు.బహుశా అందుకేనేమో కాలేజీలో MPC క్లాస్ లో పది లోపునే విద్యార్ధినులు ఉండేవాళ్ళం.ఇప్పుడు ఆలోచిస్తుంటే నేను హైస్కూల్లో చదివేటప్పుడు ఒక్క మహిళా టీచరూ లేరు.ఇక మా మహిళా కాలేజీ లో లెక్చరర్లు కూడా చాలావరకూ అగ్రవర్ణాలకు చెందిన వారూ,లేదా తమిళ, మళయాళీ వాళ్ళే.లెక్చరర్లే కాదు విద్యార్ధినులు కూడా అంతే.అప్పట్లోదళిత,బహుజన బాలికలకు రిజర్వేషన్లు లేవా? ఏమో తెలియదు.కుటుంబ కట్టుబాట్లు వల్లనే ఉన్నత విద్య చదువుకునే వారు కాదేమో.నిజానికి ఇప్పటికీ అటువంటి పరిస్థితులవలనే కొన్ని ప్రాంతాల్లో,కొన్ని దళిత, ఆదివాసీ కుటుంబాల్లో బాలికలకు విద్య ఎండమావి గానే ఉంది. అరవై ఏళ్ళ క్రితం పరిస్థితి అది అనుకోవాలేమో.ఈనాడు చాలా మంది ఆడపిల్లలు టెక్నికల్ చదువులు ఇక్కడే కాక దేశవిదేశాల్లోకి కూడా వెళ్ళి చదవటం చూస్తుంటే నాకు ఎంత అబ్బురంగా ఉంటుందో! తమాషా ఏమిటంటే అరవై ఏళ్ళ క్రితం లెక్కలు నీకు అంత బాగా వచ్చేమిటి అని వెటకారంగా అన్న వ్యక్తే ముఫ్ఫై ఏళ్ళకిందట నా కూతురునీ అలాగే ప్రశ్నించటం ఇంకా ఆశ్చర్యం. ఆ గ్రామంలో మరొక అనుభవం ఏమిటంటే పెళ్ళికి వచ్చినవారు చుట్టు పక్కల వాళ్ళూ నన్ను ఉమా అని పిలవటం నేను ఉమని కానంటే బుగ్గలు నొక్కుకుంటూ అచ్చం ఉమ లాగే ఉన్నావే అని బోల్డంత ఆశ్చర్యపోవటం ఇప్పటికీ గుర్తు. ఆ ఉమ అన్న అమ్మాయి మా నాన్నగారి దూరపు బంధువుల అమ్మాయి అచ్చంగా నా వయసే.ఆ అమ్మాయి కూడా ఈ విషయం తెలిసి నన్ను చూడటానికి కుతూహలంగా వచ్చింది.మా ఇద్దరినీ చూసిన వాళ్ళు కూడా ఎంత పోలిక ఉందో అంటూ ఆశ్చర్యపోయారు.డబుల్ ఏక్షన్ సినిమాలోలా మన లాంటి వ్యక్తి ని దగ్గర గా చూడటం గొప్ప అనుభవం కదా! పెళ్ళినుండి తిరిగి వచ్చాక కొంతకాలం మా ఇద్దరి మధ్యా ఉత్తరాలు నడిచి ఆగిపోయాయి.ఇప్పుడు ఆ ఉమా ఎక్కడ ఉందో ఏమో తెలియదు.ఒక్కొక్కప్పుడు గుర్తు వేస్తే ఈ వయసులో కూడా నాలాగే ఉందా,మారిందా అనుకుంటాను. --- శీలా సుభద్రాదేవి.

నడక దారిలో-- 11

నడక దారిలో-- 11 ఒక్కసారిగా మళ్ళా నా చదువుకు విరామం వచ్చింది.సెప్టెంబర్ లో గానీ తిరిగి సప్లిమెంటరీ పరీక్ష ఉండదు.ఒకవేళ చదివిస్తే మే-జూన్ లో గానీ కాలేజీ ఉండదు. నా అభిరుచులను సానపెట్టటానికి మళ్ళీ పూనుకున్నాను.లేకపోతే మానసికంగా కుంగిపోతానుకదా! ఆ అవకాశాన్ని నా మనసుకీ,నా మెదడుకీ ఎప్పుడూ ఇవ్వటం నాకు ఇష్టం లేదు. ఈరోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకూ , నిరక్షరాస్యులు, విద్యావంతులు కూడా అనేకమంది అతి చిన్న విషయాలకు కూడా కుంగిపోయి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు.అలా ఐతే నేను ఎన్నిసార్లు కుంగిపోవాలో ఎన్నిసార్లు అవాంఛిత నిర్ణయాలు తీసుకోవాల్సివచ్చేదో.ఎప్పటికప్పుడు నాకు నేనే ,నన్ను నేనే స్పూర్తి కలిగించుకోవటం నావిధానం. ఇప్పుడు మళ్ళా కథలోకి వెళ్తాను. సాయంత్రం సంగీతం కాలేజీకి నాలుగుగంటలకి వెళ్తే ఆరువరకూ నా క్లాస్ సమయం. మా కాలేజీ ప్రిన్సిపాల్ గా అప్పట్లో ద్వారం భావనారాయణ గారుఉన్నారు.మా గాత్రం గురువు గారు బురిడి లక్ష్మీనారాయణ గారు.ద్వారం మంగతాయారు గారు వయోలీన్ గురువు గారు గా ఉండే వాళ్ళు. సంగీత కళాశాలకు గొప్ప చరిత్ర ఉంది.విజయనగరం సంస్థానాథిపతి పూసపాటి విజయరామ గజపతిరాజు తన ఆస్థానంలోని ఉద్యోగి చాగంటి జోగారావుగారి అంధ కుమారుడు బాబు కోసం 1919 ఫిబ్రవరి 5న గాన పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆనాడు ఈ పాఠశాలకు హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు అధ్యక్షులు. అనంతరం వయోలిన్‌ వాద్యంలో మేటి అయిన పద్మశ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు విద్యార్థిగా చేరటానికి రాగా ఆయననే అధ్యక్షులుగా నియమించారు. ఈ కళాశాలలో వీణ, గాత్రం, వయోలిన్‌, మృదంగం, సన్నాయి, డోలు వాద్యాలతో బాటూ నృత్యంలో కూడా శిక్షణ ఇస్తారు. మా గురువు గారు నా గ్రూప్ వాళ్ళకి పాఠం చెప్పి బయట చెట్లు కింద ప్రాక్టీస్ చేసుకోమనేవారు.మేము సరీగా పాడుతున్నామోలేదో చూడటానికి మాచేత ప్రాక్టీస్ చేయించటానికి మాకు సీనియర్ విద్యార్థినులైన ద్వారం లక్ష్మీ, ద్వారం పద్మ లకు అప్పగించేవారు.అప్పటికి లక్ష్మీ,పద్మా పది,పన్నెండేళ్ళ పిల్లలు.వాళ్ళు తమ కన్నా వయసులో పెద్దవారిమైన మాచేత ప్రాక్టీస్ చేయిస్తుంటే తమాషాగానే కాక ముద్దుగా ఉండేది.వాళ్ళు మా చేత పాడించటమే కాక వాళ్ళూ తమ పాఠాన్నీ ప్రాక్టీస్ చేస్తుంటే వినటం నాకు ఇష్టం గా ఉండేది. సంగీతకళాశాల ఆవరణలో చెట్లకింద ఒకచోట వీణమీద కృతులు ప్రాక్టీస్ చేస్తున్నవాళ్ళూ,మరోచోట ఫిఢేలురాగాలూ, ఇంకోచోట మృదంగ దరువులూ వినిపిస్తుంటే మనసంతా రాగమయం అయిపోతుండేది.ఏమూలో సన్నగా వినిపించే మువ్వలసవ్వడి మరోలోకంలోకి తీసుకుపోతుండేది.నాకు ఎప్పుడోఏదో పుస్తకంలో కలకత్తా లోని శాంతినికేతన్ గురించి చదివిన దగ్గర నుండి అక్కడ చదవకపోయినా పర్వాలేదు కానీ ఒకసారి చూడాలని చాలా కోరికగా ఉండేది.సంగీత కళాశాలలో సంగీతం నేర్చుకున్నంతకాలం అది గుర్తు వచ్చేది.అందుకే పాఠం నేర్చుకున్న తరువాత కూడా చాలా సేపు అక్కడే ఉండేదాన్ని. 1969లోనే సంగీత కళాశాల స్వర్ణోత్సవాలు జరగటం ఒక మరువలేని జ్ణాపకం.వారం పదిరోజుల పాటు కళాశాల పూర్వ విద్యార్ధులు అయిన శ్రీరంగం గోపాలరత్నం,మంగళంపల్లి, ఘంటశాల, సుశీల,నూకల చిన సత్యనారాయణ,నేదునూరి కృష్ణమూర్తి వంటి మహామహుల కచ్చేరీలు ప్రత్యక్షంగా వినటం ఎంతో అపురూపమైన గొప్ప జ్ణాపకం. నిజానికి నేను సంగీతం కళాశాల లో చేరింది.సంగీతం పూర్తిగా నేర్చుకొని కచ్చేరీలు చేసేందుకు కాదు.నాకు లలిత సంగీతం పాడటం ఇష్టం.అపశృతులు రాకుండా పాడటానికి స్వరజ్ణానం ఉంటే కంఠం ఒకే పిచ్ లో సాగి శృతిపక్వంగా ఉంటుంది.మరొకటి కళాశాల ఆవరణలోని సంగీత సాగరంలో ఓలలాడుతూ మానసికంగా సేదతీర్చకోటానికి. అంతేకాకుండా అమ్మకు సంగీతం అంటే ఇష్టం.అమ్మ చిన్నప్పుడు వాళ్ళ బంధువు అమ్మవయసుదే హార్మొనీ తో పాడుతుంటే అమ్మ వెళ్ళి వినేదట‌.ఒకసారి పని చేసుకుంటూ ఉత్సాహం తో స్వరాలు కూనిరాగాలు తీస్తుంటే మాతాతగారు "ఆ సాని పాటలు పాడేవంటే నాలుగు వాయిస్తాను"అని తిట్టాడని చెప్పింది అమ్మ ఓ సందర్భంలో. అమ్మ పనులు చేసుకుంటూ భూకైలాస్ సినిమాలోని ' దేవదేవ ధవళాచల మందిర గంగాధరా' భీష్మ లోని 'మహాదేవ శంభో' పాటల్ని సన్నటి కంఠంతో పాడటం చాలా సార్లు విన్నాను.అందుకేనేమో ఇంట్లో ఎవరూ లేనప్పుడు నేను గొంతెత్తి చిన్నప్పటి నుండి పాటల్ని పాడుతుంటే సంభ్రమం గా వినేది. నేను సంగీత కళాశాల లో చేరటానికి వెనకదన్ను అమ్మే.పగలంతా సంగీతం పాఠాలే కాక ఎప్పటిలా లలిత సంగీతం కూడా పాడుకునే దాన్ని. నాకున్న సంగీతం అభిరుచి గుర్తించో మరేమో తెలియదు కానీ అన్నయ్య విజయనగరంలోని న్యూపూర్ణా థియేటర్ లో ఇంగ్లీష్ సినీమా " సౌండ్ ఆఫ్ మ్యూజిక్" కు తీసుకు వెళ్ళాడు.అదే కాక ఎవరో ఒకర్ని సాయంగా పంపి జూలియస్ సీజర్, క్లియోపాత్రా,గన్స్ ఆఫ్ నౌరోన్,బెన్ హర్ ఇలా చాలా సినిమాలకు పంపించాడు.ఆంతమాత్రాన నాతో ఆత్మీయంగా మాట్లాడాడని కాదు.తన చుట్టూ పరిధి చుట్టుకునే ఉండేవాడు. అంత ఇష్టంగా సంగీత కళాశాల లో చేరినా డిగ్రీ రెండవ సంవత్సరం లో చదువు ఒత్తిడీ,ఇతర ఆసక్తులు వైపు మనసు పరిగెత్తటం తో సంగీతానికి స్వస్తి చెప్పేసాను.రోజూ గంటలు గంటలు పాటలు పాడుకోవడమే కాకుండా అమ్మకి సాయం చేస్తున్నా, ఎంబ్రాయిడరీ చేస్తున్నా,, బొమ్మలు వేస్తున్నా నా కంఠం నుండి రాగం తీగలు తీగలు గా సాగుతూనే ఉండేది. అటువంటిది వివాహానంతరం హైదరాబాద్ వచ్చాక ఉమ్మడి కుటుంబం లో అలవాటు ప్రకారం రాగాల తీగలు గొంతులు లోంచి సాగబోయి వెక్కిరింతని తాకి ముడుచుకుని తిరిగి కంఠం చుట్టూ బిగుసుకున్నాయి.అంతే మళ్ళీ ఎప్పుడు అందరూ ఉన్న ఆ ఇంట్లో గొంతు విప్పలేదు.ఏ రాత్రి పూటో పాపాయిని నిద్రపుచ్చటానికి సన్నటి జోలపాటగా మిగిలి పోయింది.అప్పుడే రంగనాయకమ్మ రాసిన నవల "కళ ఎందుకు" గుర్తొచ్చి కళ్ళు చెమ్మగిల్లేవి. తిరిగి పదేళ్ళకి బియిడీ చదివేటప్పుడు జాతీయ పండుగ ప్రోగ్రాము కోసం కొంతమంది తో ప్రాక్టీస్ చేయిస్తుంటే అక్కడే వింటున్న నా కంఠం నుండి అనుకోకుండా ఆ పాట వెలువడింది.నా సహవిద్యార్థినులతో పాడిస్తున్న మేడం ఆశ్చర్యం గా చూసి మంచి కంఠం అని పొగిడి ఏదైనా దేశభక్తి పాట నన్ను పాడమన్నారు.ఆరోజు గొంతెత్తి పాడాను.కానీ ప్రాక్టీస్ లేని కంఠం పొడిబారి పోవటం తో పాటు సరిగా రాలేదనిపించి దిగులు వేసింది. తర్వాత ఉద్యోగంలో చేరాక స్కూల్లో జాతీయ కార్యక్రమాలకోసం పిల్లలకు పాటలు,డాన్సులూ నేర్పించటమే కాక మా ప్రధానోపాధ్యాయురాలు బడిలో ఉపాధ్యాయ సమావేశాలు జరిగినప్పుడల్లా నాచేత లలిత గీతాలు పాడించేవారు. రేడియోలో వింటూ నేను సేకరించి రికార్డ్ చేసుకున్న కృష్ణశాస్త్రిగేయాలూ,సాలూరూ, బాలసరస్వతి పాడినగీతాలూ వందలాది పాటలు కేసెట్లు ప్రాక్టీస్ చేయటం లేదేమని నావైపు జాలిగా చూస్తున్నట్లనిపిస్తుంటుంది.పాట పాడాలనిపించి పాట ఎత్తకుంటే గొంతు సాగక రాగం విరిగి పోతుంటే దిగులు వేసింది.ఆ దిగులు నాలో సుడులు తిరిగి కొన్నాళ్ళు తర్వాత 2002లో "ఎగిరిపోయిన కోయిల"అనే కవిత రాసాను. అందుకే మా అమ్మాయికి చిన్నప్పట్నుంచీ సంగీతం నేర్పించాను. ‌ రేడియో ఆడిషన్ లో కూడా ఎంపికై యువవాణిలో కొన్ని లలిత గీతాలు కూడా పాడింది.ఆమెకూడా ఉద్యోగం వల్లా బాధ్యతలవల్లా సంగీతాన్ని అశ్రద్ధ చేస్తుంటే నాలాగే ఆమెకంఠం కూడా ఎక్కడ మూగపోతుందోనని విలవిలలాడిపోతాను.ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తుంటాను.సంగీతం, నృత్యం వంటివి జీవితాంతం కొనసాగించటానికి, ప్రోత్సాహం అందటానికి కేవలం ఆసక్తీ, అభిరుచి మాత్రమే చాలదు.తగిన వారసత్వం కూడా ఉండాలేమో. మూడుతరాలుగా ముందుకు అడుగువేయని సంగీత కథా కమామీషు ఇది.

6, నవంబర్ 2021, శనివారం

నడక దారిలో--1

నడక దారిలో-1 -శీలా సుభద్రా దేవి -నా నుండి బాల్యం ఎప్పుడు జారిపోయిందో తెలియదు.అందరూ బాల్యం జ్ణాపకాలు అపురూపంగా చెప్పుకుంటుంటే నేను గుర్తు తెచ్చుకోటానికి మెదడు పొరల్ని తిరగేస్తూ వెతుక్కుంటాను. -నేను ప్రాధమిక పాఠశాలకి వెళ్ళానో లేదో తెలియదు.నాకన్నా పెద్దవాళ్ళైన తోబుట్టువులను అడగాలన్న ఆలోచన వాళ్ళున్నపుడు గుర్తు రాలేదు .అయిదో క్లాసు మాత్రం విజయనగరంలోని పాతబస్టేండుకు దగ్గర ఉన్న ఆశపువీథి లోని పాఠశాలకు వెళ్ళిన గుర్తు.. - వినాయక చవితి కి స్కూల్లో పిల్లలచేత పూజ చేయించిన జ్ణాపకం.అలాగే దసరాకి బడిపిల్లలు అందరికీ విల్లూ, బాణాలు,ధరింప జేసి - ” సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు - సిరిమల్లె చెట్టేమో విరగ బూసింది - కొమ్మ విరగా కుండా పూలు కోయండి.” - ” పావలా ఇస్తే ను పట్టేది లేదు - అర్థ రూపాయిస్తే అంటేది లేదు - ఇచ్చురూపాయిస్తే పుచ్చుకుంటాము” - అని పాడుతూ విద్యార్థుల ఇళ్ళకు వెళ్తే వారివారి స్థోమత ను బట్టి పిల్లలకు పప్పు బెల్లాలు,గురువులకు తాంబూలాలు దక్షిణ ఇచ్చేవారు. ఆవిధంగా కొత్తపేట లోని మా ఇంటికి కూడా తీసుకువెళ్ళి పిల్లలకు పప్పు బెల్లాలు, మాష్టారు కి దక్షిణ ఇచ్చిిన గుర్తు మసకగా మనసులో మెదిలింది.ఇంతకన్నా  బడి ముచ్చట్లు గుర్తు లేదు. 
            నేను అమ్మ పొట్టలో ఉన్నప్పుడు మా ఇంట్లో మా చిన్నాన్న టీబీ జబ్బుతో బాధపడి చనిపోయాడట.మరణించిన సమయం మంచిది కాదని ఇల్లు విడిచి  సూర్యారావు మామయ్యా ఇంట్లో ఆరునెలలు ఉన్నారట.అక్కడే నేను పుట్టానని అమ్మ చెప్పేది.తర్వాత మళ్ళీ ఆశపువీథి ఇంటికి వచ్చేసాము. ఆవిధంగానేను మరీ చిన్నగా ఉన్నప్పుడు విజయనగరం లోని ఆశపువీథిలోనే రోణంకి అప్పలస్వామి గారి పొరుగింటి లో ఉండే వాళ్ళము.
     నేను  రోణంకి గారి గురించి నేను పెద్దగా అయిన తర్వాతే చాలా తెలుసు కున్నాను.    ఆయన బహుభాషా వేత్త.ఆరు విదేశీ భాషల్లో సైతం అనువాదాలు చేయడమే కాకుండా కవిత్వం రాసేటంతటి గొప్ప పండితులు.కేంద్ర సాహిత్య అకాడమీ తరుపున మాకియవల్లీ ప్రిన్స్ రాజనీతి గ్రంధాన్ని ఇటాలియన్ భాష నుండి ఆంధ్రీకరించారు.మన ప్రాచీన ప్రబంధాలలో సొంపయిన పద్యాలు ఎన్నిటినో బహురమ్యంగా రోణంకి వారు ఆంగ్లీకరించారు. వీరి ఆంగ్ల రచనలు “SONGS AND LYRICS, INDIAN LOVE POEMS” అనే రెండు సంపుటాలుగా వెలువడ్డాయి. స్థానిక మహారాజా కళాశాలలో ఆంగ్ల ఆచార్యులు గా పని చేసారు. ఆరుద్ర, శ్రీశ్రీ, నారాయణబాబులకు స్పూర్తి ఇచ్చినవారు. - మానేపల్లి, చిత్రభాను, మోహనప్రసాద్‌, చాగంటి తులసి – మొ||వారి పుస్తకాలకు ముందుమాటలు రాశారు. ఆరుద్ర తన తొలి కావ్యం -‘త్వమేవాహం’నూ, మానేపల్లి తన తొలి కవితా సంపుటినీ రోణంకి వారికి అంకితం చేసారు. - రోణంకి వారింటికి ఆనాటి ప్రముఖ కవులూ,రచయితలు అందరి రాకపోకలు ఉండేవట.వారందరూ సాహిత్య చర్చలూ, సాహిత్య గోష్టులూ జరిపేవారని విన్నాను.అల్లసాని పెద్దన, భట్టుమూర్తి,క్షేత్రయ్య మొదలూ శ్రీశ్రీ, నారాయణబాబు కవితల్నే కాక చావలి బంగారమ్మ , చాసో రచనల్ని సైతం ఆంగ్లం లోకి అనువాదం చేసినవి కూడా దేశవిదేశీి పత్రికల్లో ప్రచురితమయ్యాయి.ఇలా ఎన్నో ఆసక్తి కరమైన విషయాలు కర్ణాకర్ణిగా విన్నాను.  వారి గురించి చెబుతుంటే అదో పెద్ద వ్యాసం ఔతుంది.
          ఆరోజుల్లో పోలియో ప్రభావం ఎంత ఎక్కువ గా ఉండేదో అనేది రోణంకి వారి కుటుంబం చూస్తే తెలుస్తుంది.అప్పలస్వామి గారి చెల్లెలు బాలవితంతువు వీరింట్లోనే ఉండేది ఆమె,అప్పల స్వామి గారి పిల్లలు ముగ్గురు పోలియో బాధితులు. - నా తోబుట్టువులు అందరకూ కూడా రోణంకి వారింటిలోని సమ వయస్కులైన పిల్లలతో మంచి స్నేహం ఉండేది.వారి ఆఖరు అబ్బాయి నా క్లాసుమేట్ అయిన రోణంకి నారాయణరావు నాకన్న కాస్త చిన్నవాడు కావటం మొగపిల్లాడు కావటం వలన వారి నాలుగో అమ్మాయి, అతని కన్నా పెద్దదైన లలిత తో నాకు స్నేహం . - లలిత అప్పట్లో డాన్స్ నేర్చుకునేదనుకుంటాను. సాయంత్రం నేను వాళ్ళింటికి లలితతో ఆడుకోవటానికి వెళ్ళినప్పుడు డాబా మీద లలిత డేన్స్ ముద్రలు నేర్పించేది. ఒక్కొక్కరోజు లలితా వాళ్ళ అమ్మా,మేనత్తా నన్ను పాటలు పాడమనేవారు.పెద్దక్కయ్య దగ్గర నేర్చుకున్న పాటలు,ఆ రోజులనాటి సినీమా పాటలూ పాడేదాన్ని.ఒకరోజు అలా పాటలు పాడుతుంటే అప్పుడే వచ్చిన రోణంకి వారు ” ఏం పిల్లా నీకు పుత్తడి బొమ్మా పూర్ణమ్మ పాట వచ్చా?” అన్నారు. నేర్చుకుని ఈ సారి వచ్చినప్పుడు పాడతానన్నాను.ఆ తర్వాత పంతంగా నేర్చుకుని మరీ పాడితే ఆయన మెచ్చుకుంటూ తలపంకించటం మరువలేని జ్ణాపకం.తర్వాత మాత్రం మళ్ళీ ఏం పాడమంటారో అని ఆయనకు కనపడకుండా దాక్కుంటూ డాబా పైకి పరిగెత్తే దాన్ని. -
        రోణంకి అప్పలస్వామి గారు అంత విద్యావంతులు.మేథావి అయినా ఇతరభాష పండితులతో అనర్గళంగా మాట్లాడినా తెలుగు లో మాట్లాడినప్పుడు అచ్చమైన శ్రీకాకుళం పల్లె మాండలికం లోనే మాట్లాడేవారు.అదీ మర్చిపోలేను.వారికి వారి ప్రాంత మాండలికం పైన ఎంత మమకారం ఉందో తలచుకున్నప్పుడల్లా గుర్తు వస్తూనే ఉంటుంది.అందుకే పదవీ విరమణ అనంతరం వారి స్వగ్రామం టెక్కలి వెళ్ళి స్థిరపడ్డారు. 
      నేటి తరానికి ఆయనెవరో తెలియక పోయినా, ముంజేతిలో చేతికర్ర వేలాడ దీసి, దొర టోపీ పెట్టుకొని తిరిగే రోణంకి అప్పలస్వామి గారు టెక్కలిని అంతర్జాతీయ సాహితీ ప్రపంచానికి పరిచయం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. అందుకే వారి మరణానంతరం టెక్కలిలో వారి విగ్రహాన్ని కూడా స్థాపించి వారిని గౌరవించుకున్నారు అక్కడి ప్రజలు. 
        నేను హైస్కూల్లో చదువుతున్న రోజుల్లో ఒక సారి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు.అప్పలస్వామి గారి చిన్న తమ్ముడు లక్ష్మణ రావు అనే ఆయన జర్మనీ నుంచి వచ్చాడని లలిత చెప్పింది.లోపలి గదిలోకి వెళ్ళి ఒక షర్ట్ తీసుకొచ్చి ” చిన్నా ( నన్ను చిన్న అని పిలిచేవారు)ఇది చూడు.ఎంత బాగుందో.చిన్నాయన జర్మనీ నుండి తెచ్చాడు .ఈ చొక్కాని ఉతికి ఆరేసేయటమే.నిముషంలో ఆరిపోతుంది.ఇస్త్రీ కూడా అక్కర్లేదు తెలుసా.దీనిని వాష్ ఎండ్ వేర్ అంటారట.”అబ్బురంగా చూపించింది.నేను కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంగా చూసాను.ఆ రోజుల్లో చేనేత తప్ప మరొకటి ఎరుగని రోజులు.పేదవారు, మధ్యతరగత వారు చీటీ గుడ్డలు అని ముతకబట్ట తానులుగా వచ్చేది దానినే కొని పిల్లలకు లంగాలు కుట్టించేవారు.నైలాన్ మధ్యతరగతి వారికి తెలియని రోజులవి. 
       రోణంకివారి భార్య మహాలక్ష్మీ గారూ మా అమ్మ స్నేహితులు.సినీమాలకు కూడా కలిసి వెళ్ళేవారు.వారివెంట నేనూ,లలితబయలు దేరేవారం. మేము వారి పొరుగిల్లు ఖాళీ చేసినా నేను పెద్దయ్యేవరకూ ఆ కుటుంబంతో స్నేహాలు కొనసాగాయి..  వీర్రాజు గారి తో నా వివాహం రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యం లోనే చప్పట్ల తాళాలతో సభావివాహం గా జరిగింది. - నేను వివాహానంతరం హైదరాబాద్ వచ్చేక ఆ కుటుంబం తో కాంటాక్ట్ ఆగిపోయింది. .రోణంకి నారాయణరావు ఆంధ్రా యూనివర్సిటీ మెడికల్ కాలేజీ లో ప్రొఫెసర్ గా చేసారని విన్నాను.అతని దగ్గరకే డాక్టర్ సలహాకి వెళ్ళే మా పెదనాన్న కొడుకుని మా గురించి క్షేమసమాచారం కనుక్కునే వాడని చెప్పేవారు.నారాయణరావు పెళ్ళి చేసుకోలేదనీ ఇటీవలే చనిపోయాడని తెలిసి చాలా బాధపడ్డాను.
       పదేళ్ళ తర్వాత నేను ఎమ్మే తెలుగు చేసినప్పుడు ఫైనల్ పరీక్ష కోసం వెళ్ళినప్పుడు లలిత కూడా పరీక్ష రాయటానికి వచ్చింది.కొత్తగూడెంలో స్కూలు లో టీచర్ గా పని చేస్తున్నట్లు చెప్పింది.అడ్రస్ ఇస్తే ఒకటి రెండు ఉత్తరాలు మా మధ్య నడిచాయి.తర్వాత మెంటల్లీ డిజేబుల్ అయిన మా అబ్బాయి చనిపోవటం .నేను కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళి నన్ను నేను సముదాయించుకునే దిశలో బియ్యీడీ ఎంట్రెన్స్ రాసి మళ్ళా చదువులోపడటం,ఉద్యోగం, సాహిత్యం వీటితో లలితకు దూరమయ్యాను.అంతే మళ్ళీ కలవలేదు. - విజయనగరం వెళ్ళినప్పుడో, శ్రీకాకుళం జిల్లా కు చెందినవారు కలిసినప్పుడో రోణంకి కుటుంబం వారెవరైనా తెలుసేమోనని అడుగుతుంటాను. - అంతటి నిరాడంబర మేథావి కుటుంబంతో మాకున్న ఆత్మీయబంధం మరువరానిది.
       కానీ ఇది రాసిన అనంతరం అనుకోకుండా అప్పలస్వామి గారి మనవరాలు అంతర్జాలంలో నేను రాసినది చదివి తన గురించి తెలిపింది.వెంటనే ఆమెను సంప్రదించి లలిత చిరునామా తెలుసుకొని ఫోన్ ద్వారా కలిసాను.ఇప్పుడు లలిత,ఆమెకన్నా పెద్దవాళ్ళైన శారదా, కళావతి ని కూడా ముఖాముఖి కలుసుకో లేక పోయినా ఫోను ద్వారా స్నేహం కొనసాగటం సంతోషం కలిగించింది. నన్ను