3, జులై 2021, శనివారం

సిరికోనభారతి లో ప్రచురితం

 వచన కవితా ప్రక్రియ లోకి అడుగు పెట్టి క్లిష్టమైన సంస్కృత పదబంధాలూ భాషాడంబరాలతో రాస్తేనే కావ్య రూపం పొందుతుందని భావించిన ఆధునిక కవులేకాక సీనియర్ కవులు సైతం నిజాయితీగా నిర్భీతిగా చెప్పిన కుందుర్తి సరళవచనా శైలికి లొంగిపోయారు.

 ఇక తిలక్ కవిత్వంలో భావకవుల సౌందర్యకాంక్ష, అభ్యుదయ కవుల సామాజిక కర్తవ్యం రెండూ కలసి నడుస్తాయి. అందుకనే ఆయన కవిత కళాత్మకమే కాదు, కరవాలమంత పదునైనది అనే భావన పాఠకులకు కలుగుతుంది.తిలక్ నిజాయితీగా చెప్పిన

'నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు

నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు

నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు'

మూడు పంక్తులు ఆయన కవిత్వ తత్వాన్ని తెలిజేసే మూడు సిద్ధాంతాలు.

 శ్రీ శ్రీ తొలి రోజుల్లో రాసిన కొన్ని కవితలలో సంస్కృత భాషాడంబరం,సమాసాలూ కనిపించినా "మెట్లు" కవిత సభలో చదవగా విన్న ఒక పిల్లవాడు "ఇంతేనా కవిత్వమంటే నేనూ రాయగలను " అన్నాడని , సామాన్యుడికీ అర్థమయ్యేలా కవిత ఉండాలని శ్రీశ్రీ ఓ సందర్భంలో చెప్పాడు.

    నిజానికి ఏ సాహిత్య ప్రక్రియ ఐనా సరే దానికి తగిన భాష అదే సమకూర్చుకుంటుంది.

    సామాజిక స్పృహ కవిత్వాన్ని మింగేసిందనటం,సామాజిక స్పృహ ఒక జాడ్యం గా భావించటం అనటం నేను ఒప్పుకోను.

    ఇంకా వెన్నెలా,పూవులూ,ఆమనీ,ప్రేమా,ప్రేయసీ అంటూ కవిత్వం రాయటం ప్రపంచంలో జరుగుతోన్న అనేకానేక సందర్భాలూ, సంఘటనలూ,సంక్షోభాలనుండి పలాయనవాదంగా భావించాలి.

    కవిత్వం ఎప్పుడూ ఆత్మాశ్రయంగా మొదలైనా నేను నుండి మనం లోకీ మనం నుండి జనంలోకీ మమేకం కావాలి.

    పదచిత్రాల్ని ఇబ్బడి ముబ్బడిగా ప్రయోగించితే ఒక్కొక్కసారి వ్యతిరేకార్థం లో కి వచ్చే ప్రమాదం కూడా ఉంది.అందుకని రాసిన వెంటనే మాధ్యమాల్లోనో పత్రికలకో పంపకుండా ఎవరికి వారు తిరిగి సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది.

    ఏ సాహితీవేత్త కైనా వారి సాహిత్యమే వారి వ్యక్తిత్వం కావాలి,వారి వ్యక్తిత్వమే వారి జీవితం కావాలని నేను నమ్ముతాను.

    

21, జూన్ 2021, సోమవారం

బొమ్మ జెముళ్ళు

   బొమ్మజెముళ్ళు


వాకిట్లో అందం కోసం వేసిన బొమ్మజెముళ్ళు

ఎప్పుడు వ్యాపించేసాయో

ఎలా ఆక్రమించేసాయో

చడీ చప్పుడూ లేకుండా ఇల్లంతా అల్లుకుపోయాయి


అంతటా ఇరుకుతనం

మూలమూలల్లోనూ రక్కసిపొదలే

రాగాలు ప్రసరించనీయని రక్కసిపొదలే

ఏ ముళ్ళకో తగులుకొని ఊహ చీరుకు పోతోంది

ఏ పొదల్లోనో చిక్కుకుని మాట ఆగిపోతుంది

మనసు నిశ్శబ్దంగా ఆవిరైపోయి

గుండె అవయవంగా మాత్రమే మిగిలి పోతోంది

మౌనం యాంత్రికంగా రాజ్యమేలుతోంది


ఆత్మీయగాలి కూడా చొరబడలేని ఇరుకు తనం

గాలాడ్డానికి మైదానాల్లోకి

పారిపోవాలనిపించేంత ఇరుకుతనం


మైదానాల్లో మాత్రం ఏముంది

స్నేహాన్ని పరిమళించుతూ

తలలుపుతూ పిలిచే పూలచెట్లేవీ

ఆప్యాయంగా తీగలు చాస్తూ

ఒళ్ళో చేర్చుకొనే పొదరిళ్ళేవీ


సమస్త ప్రపంచాన్నీ గడ్డిపోచలా చూస్తూ

నెత్తిన కళ్ళు పెట్టుకొని ఆకాశంలోకి చేతులు చాచే

అశోకచెట్లో టేకు చెట్లో తప్ప

పచ్చికలో దొర్లి దొర్లి

మనసారా ఏడవాలనుకుంటే

కాళ్ళలోనే కాదు కళ్ళల్లోనూ పుళ్ళు చేసే పల్లేర్లే


మైదానాల్నిండా జనమే

నగరాల్ని సైతం నట్టడవుల్ని చేసేస్తూ

స్పర్శకి కూడా ఇష్టపడనితనంతో

ముళ్ళు మొలిపించుకున్న దేహాల్తో

నిలువెల్లా బొమ్మజెముళ్ళైన జనాలే

ఇంటా బయటా గాలాడని ఇరుకు తనం

ఊహాడని పరాయి తనం

జీవం లేని ఇసుకపర్రల జీవితాలు

కాలుచాచి పారిపోవాలని చూస్తాం

ఆశ్చర్యంగా కాళ్ళూవేళ్ళూ కదల్చలేం

మనల్ని మనం చూసుకొంటే

ఆసాంతం మనమే బొమ్మజెముళ్ళం!!


9, జూన్ 2021, బుధవారం

నడక దారిలో--3

 ఇంటి పెద్దదిక్కు నాన్నగారు వెళ్ళిపోయాక కుటుంబం లో మార్పు వచ్చింది.వీథివరండా లో ఉన్న బల్ల ఖాళీ ఐపోయింది.బల్లే కాదు ఇల్లంతా కూడా ఖాళీయే.పెద్ద మామయ్య అమ్మచేతిలో పెట్టిన కొద్ది పాటి సొమ్ము కూడా ఖాళీయే.

     ఆరో తరగతి చదువుతున్న నేను మళ్ళీ బడికి వెళ్ళలేదు.  ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం ఐనప్పుడో, కుటుంబం సంక్షోభంలో ఉన్నప్పుడో ముందుగా మాన్పించేది ఆడపిల్లల చదువులే కదా.ఇంక నాకు అన్నీ సెలవులే.

     అప్పట్లో పెళ్ళో, పేరంటమో ఏవి జరిగినా లౌడ్ స్పీకర్లు పెట్టి పాటలు వేసేవారు.ఉదయమే ' నమోవేంకటేశా' అంటూ స్పీకర్లో ఘంటశాల కంఠం నుండి రాగం వినిపించే సరికే నాకు ఎంత సంబరంగా ఉండేదో! వీధి వరండా లో తాడు తో ఉయ్యాల ఉండేది అందులో ఒక తలగడా వేసుకొని ఊగుతూ లౌడ్ స్పీకర్లు లోంచి గాలి తరంగాల మీదుగా నా దగ్గరికి చేరిన చెంచులక్ష్మి సినిమా లో 'పాలకడలిపై' మొదలుకొని, భలేరాముడు,భూకైలాస్, సువర్ణ సుందరి ఒకటేమిటి ఆనాటి  పాటలతో గొంతు కలుపుతూ పాడుకుంటుండేదాన్ని .పాట ఆగుతే చేతిలోని బొమ్మల కథల పుస్తకాలను చేతిలోకి తీసుకుని చదవడం రోజంతా అదేపని.

           మా ఇంటి ఎదురుగా గుప్తావారి ఎర్ర పళ్ళపొడి తయారు చేసి అమ్మే కుటుంబం ఉండేది.వాళ్ళింట్లో అమ్మాయి కూడా నన్ను చూసి ఉయ్యాల కట్టించుకుని రాగాలు తీసేది.

           మా ఇంటికి దగ్గర్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి ఇల్లు ఉండేది.వాళ్ళకి నలుగురు ఆడపిల్లలు.ఇద్దరు అమ్మాయిలు నా తోటి వాళ్ళు. వాళ్ళు ఎక్కడికి ఎవరింటికీ  వచ్చేవారు కాదు.నన్ను వాళ్ళ ఇంటికి రమ్మని జవాన్ ని పంపి పిలిచేవారు.బొమ్మలపెళ్ళిళ్ళు చేసేవారు.వాళ్ళురాకుండా నన్ను రమ్మని మాటిమాటికీ పిలుస్తూ ఉండటం తో అమ్మ నన్ను కూడా మాటిమాటికీ వెళ్ళొద్దని కోప్పడింది.అంతే ఇక వెళ్ళటం మానేసాను.

            ఒకరోజు మధ్యాహ్నం మూడో నాలుగో అయ్యుంటుంది,  యథావిధిగా కథల పుస్తకం చదువుతుంటుంటే అకస్మాత్తుగా చిమ్మచీకటి ఏర్పడి హోరున పెద్దగా చప్పుడు. వర్షం పడుతుందేమో అని బయటికి వస్తే  ఏమిలేదు.చుట్టుపట్ల అందరూ ఆ శబ్దానికి ఇళ్ళల్లో నుండి బయటకు వచ్చారు.ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. ఒక్కసారిగా నేను కెవ్వున కేక వేసాను నామీద ఏదో పడిందని అన్నాను.అంతలో చూస్తూ చూస్తుండగానే ఆ  నల్లని మేఘం జారుకుంటూ వెళ్ళి పోతే 

      తెలతెల్లని వెలుగు తెరలు తొలగించుకున్నట్లు మెలమెల్లగా వచ్చింది.నామీదపడిన దాన్ని చిన్నన్నయ్య తీసుకు వచ్చాడు అరచేయి అంత ఉన్న మిడత.అంటే అంత హోరు తో నల్లమేఘం లా వచ్చినది మిడతలదండు అన్నమాట.ఇటీవల మిడతలదండు రాష్ట్రాలలోకి వచ్చిందని మీడియా లో ఊదరగొడుతుంటే ఆనాటి అనుభవం గుర్తు వచ్చి అందరికీ చెప్పాను.మరి తర్వాత ఈ అరవై ఏళ్ళలో మిడతలదండు ఎప్పుడైనా వచ్చిందో లేదో గుర్తు లేదు.

          ఆ రోజుల్లోనే ఒకరోజు మా ఇంట్లో అప్పుడప్పుడు ఇంట్లో సాయానికి వచ్చే అన్నపూర్ణ ని నాకు తోడుగా బియ్యం పిండి పట్టించటానికి నన్ను అమ్మ కొత్తపేట లోని పిండిమరకు పంపింది.పలుమార్లు జాగ్రత్తలు చెప్పి పంపింది.అన్నపూర్ణ మేదకురాలు.బండ పనిచేయడమే తప్ప ఏమీ రాదు ఏమీ తెలియదు.సరే పిండి పట్టించి తిరిగి మా ఇంటి బాటకు వచ్చే టప్పటికి ఒక ఆమె పలకరించి ' ఇక్కడే పూల్ బాగ్ రోడ్లో  బాలపేరంటాలు గుడికి వెళ్దాం.రా పాపా.అంతా మంచి జరుగుతుందని" అంది . అన్నపూర్ణ ఆవిడ వెనకే వెళ్ళిపోవటం మొదలు పెట్టింది.అన్నపూర్ణని పిలుస్తూ నేనూ వెంటబడ్డాను.

        "భయపడకు పాపా  మీ గురించి తెలుసు మీ నాన్న గారు పోయారు కదా.డబ్బుకి ఇబ్బంది పడుతున్నారు కదా.మీ అన్నయ్య కి వచ్చే ఏడాది కల్లా  ఉద్యోగం వస్తుంది. మీకష్టాలన్నీతీరి పోతాయి.నువ్వు కూడా బాగా చదువు కుంటావు.

     శ్రీ వీర బాల పార్వతమ్మ పేరంటాలు నీలాంటి పాపే.రెండేళ్ళ కిందట కుక్క కాటుకుగురై  చనిపోయింది.తర్వాత అమ్మానాన్నలకు కలలో కనబడి రోడ్డు పక్కన గుడి కట్టించమంది.అలాగే 1958 లో పూల్ బాగ్ రోడ్ లోగుడి కట్టి పూజలు చేస్తున్నారు.ఆ దారెంట రాజాం పోయే వాహనాల వారంతా తప్పకుండా ఆ గుడికి వెళ్ళి మొక్కుబడులు చెల్లిస్తుంటారు.ప్రతీ ఏడాది ఫిబ్రవరి లో అయిదు రోజుల పాటు ఉత్సవాలు కూడా జరుగుతాయి.గుడికి దగ్గర లోనే మన విజయనగరం రాజు లైన పూసపాటి రాజులభవనం ఉంది తెలుసా." ఈ విధంగా నా చెయ్యి పట్టుకుని  స్థల పురాణం  చెప్తూ నడుస్తుందామె.

        మధ్యమధ్యలో భయపడకు "మీ అమ్మ ఏమీ అనదులే" అంటోంది ఆమె.పళ్ళికిలించుకుంటూ ఆవిడ వెనకే నడుస్తున్న అన్నపూర్ణని చూస్తుంటే ఒకవైపు కోపం, ముసురు కుంటున్న చీకటిని చూస్తుంటే భయం.ఇంటికి వెళ్ళాక అమ్మ ఏమంటుందో అని దుఃఖం ముప్పిరిగొన్నాయి.ఆమె చెప్తున్న దేదీ నాచెవికి ఎక్కడం లేదు.

        చిన్న పందిరి మాత్రమే ఉన్న ఆ గుడిని చూస్తే నాకు గుడిలా అనిపించలేదు.కనీసం నమస్కారం ఐనా చేసానో లేదో తెలియదు.తిరుగు ముఖం పట్టి మా వీథి మొగలో ఎక్కడైతే ఆవిడ కలిసిందో అక్కడ వరకూ వచ్చి ఎటో వెళ్ళి పోయింది.

        ఇంటి దగ్గర వాకిట్లో అమ్మా, చిన్నక్క , అన్నయ్యా ఆందోళన నిండిన ముఖాలతో నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.అన్నపూర్ణ నుండి పిండి పట్టించిన  గిన్నే తీసుకుని పంపించేసింది అమ్మ.

        లోపలికి వెళ్ళాక ఏడుస్తూనే నేను చెప్పిన  విషయం అంతా విని ఎవరు పిలిస్తే వాళ్ళ వెంట వెళ్ళి పోవటమేనా అని అందరి చేతా చీవాట్లే కాక,చెంపలు బూరెలు అయ్యాయని వేరే చెప్పక్కర్లేదు అనుకుంటా.

        అంతే కాక ఆ సంఘటన నన్ను ఈ నాటికీ వెంటాడుతూనే ఉంది.

        చిన్నప్పుడు చూసిన శ్రీ వీర బాల పార్వతమ్మ పేరంటాలు గుడి ఈ అరవై ఏళ్ళలో బహుశా బాగా బ్రహ్మాండం గా విస్తరించే ఉంటుంది.ప్రభుత్వ బడులు ఏన్నేళ్ళైనా అభివృద్ధి లోకి రావు కానీ గుడులు అంతకంతకూ పెరుగుతూనే ఉంటాయి కదా.అందుకే ఆ  జ్ణాపకాన్ని ఈ సారి విజయనగరం  వెళ్ళినప్పుడు కొంతైనా వెతుక్కోవాలి.  ఒకసారి వెళ్ళి తప్పక చూసి రావాలి. 

-- శీలా సుభద్రా దేవి.

    

11, మే 2021, మంగళవారం

నడక దారిలో--5

 నడక దారిలో--5


    కోటబొమ్మాళిలో ఒకసారి స్నేహితులతోఅన్నయ్య ఊరి పొలిమేరలో సరదాగా వెళ్ళినప్పుడు  ఒక ఎలుగుబంటిని దగ్గర లో చూసి అందరూ పుంతల్లోంచి పరిగెత్తటం లో ఒళ్ళంతా ముళ్ళు గీరుకున్నాయి  .దాంతో కోటబొమ్మాళి లో నచ్చకపోవడంతో   అన్నయ్య బదిలీకి ప్రయత్నాలు చేయటంతో  విజయనగరం కి తిరిగి వచ్చేసాం.కానీ వేరే ఇల్లు తీసుకోకుండా ఒక మేనమామ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది.వాళ్ళు పదే పదే అన్నయ్య తో బాధ్యతలన్నీ మోయాల్సివచ్చిందని అనటంతో అతను మా మీద ద్వేషం పెంచుకున్నాడు.ఫలితం అమ్మ,చిన్నక్క ఆ ఇంట్లో జీతం బత్తెం లేని పనిమనుషులు అయ్యారు.రోజురోజు కీ దాష్టికం భరించలేక అమ్మ చిన్నక్క నీ , నన్ను తీసుకుని రోడ్డున పడింది.

    చిన్నన్నయ్య అందరి దయాదాక్షిణ్యాలతో మాటలు పడుతూ యూనివర్సిటీ చదువు చదవటం ఇష్టం లేక వదిలిపెట్టి ఎవరికీ చెప్పకుండా శ్రీకాకుళం లో టీచర్ ట్రైనింగ్ లో జాయిన్ అయిపోయాడు.అతని దగ్గర కు మేము వెళ్తే మమ్మల్ని ఏలూరు దగ్గర గోపన్న పాలెం లో ఉన్న పెద్దక్కదగ్గరకు చేర్చాడు.ఆ విధంగా ఆ ఏడాది మళ్ళా చదువు ఆగిపోయి అక్క ఇంటికి చేరాను.

               మా పెద్దక్కయ్య పి.సరళాదేవి .ఆమె 

డా. పి.శ్రీదేవి స్నేహప్రభావంతో 1955 నుండీ తెలుగు స్వతంత్ర లో విస్తృతంగా కథలు రాసేది.వాళ్ళు పుంగనూరు లో ఉన్నప్పటి నుండి  ఎమ్.రాజేంద్ర( జర్నలిస్టు),మధురాంతకం రాజారాం గార్లు  కుటుంబ స్నేహితులు.అక్కయ్యవి మూడు కథల సంపుటాలు,రెండు నవలికలు, తెలుగు వారి సామెతలు పై విశ్లేషణాత్మక గ్రంథం ' సామెత' ప్రచురింపబడ్డాయి.1975 తర్వాత రచనలు చేయటం మానేసింది.

                నాకు ఊహ తెలియక ముందే అక్కకి పెళ్ళి ఐపోయింది.ఆమె ఎప్పుడు విజయనగరం వచ్చినా నాకోసం బొమ్మలో మిఠాయి లో కాకుండా చిన్న చిన్న రష్యన్ బొమ్మల పుస్తకాలు తెచ్చేది.అందువలన కూడబలుక్కుని చదివే దాన్ని . సోవియట్ లేండ్ వాళ్ళ పిల్లల బొమ్మల పుస్తకాల తెలుగు అనువాదాలు ఇచ్చేది.ఆ విధంగా చాలా చిన్నతనం నుండి కథలపుస్తకాలు చదవటం అలవాటైంది.

            అక్క భర్త మా చిన్నమామయ్యే. వాళ్ళు ఉద్యోగరీత్యా ఏ వూరు వెళ్ళినా అక్కడ పిల్లలందరినీ చేర్చి బాలానందం నడిపేది.వాళ్ళకి పాటలు, డేన్స్ లే కాకుండా కథలు చదివించే ది.సెలవుల్లో వెళ్ళినప్పుడు నేను కూడా వాళ్ళ జత చేరేదాన్ని.

  1963_64లో ఈ విధంగా బడిచదువు ఆగిపోవటంతో అక్కయ్య ఇంట్లో ఉండక తప్పలేదు.

       మామయ్య సహఉద్యోగుల పిల్లలు లత,సుభ  నా వయసు వాళ్ళు.వాళ్ళతో నాకు స్నేహం కలిసింది.మా కన్నా చిన్నపిల్ల షహనాజ్ మాతో చేరేది.వాళ్ళు స్కూలు నుంచి వచ్చాక సాయంత్రం కలిసి కబుర్లు చెప్పుకునే వాళ్ళం. లతతో నా స్నేహం నేను హైదరాబాద్ వచ్చేక కూడా చాలా కాలం కొనసాగింది.లత నాన్నగారు రిటైర్మెంట్ అయ్యాక హైదరాబాద్ వారాసిగుడాలో సెటిల్ అయ్యారు.కానీ ఇప్పుడు లత ఎక్కడుందో తెలియదు.

          పగలంతా అక్కయ్య వాళ్ళింట్లో లైబ్రరీ లోనివే కాక దగ్గర లోని లైబ్రరీ కి వెళ్ళి కొంతసేపు చదువుకొని మరి రెండు పుస్తకాలు తెచ్చుకునేదాన్ని.అలా ఒక్క ఏడాది లో ఎంతోమంది ప్రముఖరచయితల రచనలే కాక శరత్  అనువాదగ్రంథాలు కూడా చదివాను.బడికి వెళ్ళి చదువుకునే అవకాశం కోల్పోయిన బాధని పుస్తకాలు చదవటం లో మర్చిపోయేదాన్ని. అప్పటినుండీ నాకు ప్రాణ మిత్రులు పుస్తకాలే.

           ఒకసారి ఏలూరులో ఆవంత్స సోమసుందర్ గారికి పెద్ద ఎత్తున ఘనసన్మానం జరుగుతుంటే  నన్ను అక్క ఆ సభకు తీసుకెళ్ళింది.సభానంతరం ఒక సాహిత్య మిత్రుని ఇంటిడాబా మీద రాత్రివెన్నెల్లో కవితా గోష్ఠి జరిగింది.ఎంతమందో కవులు కావ్యగానం చేస్తుంటే అద్భుతంగా అనిపించింది.అంతవరకూ కథలూ నవల్లే  చదివే దాన్ని.మర్నాడు అక్కని కవిత్వం పుస్తకాలు అడుగుతే వైతాళికులు, మహాప్రస్థానం, కృష్ణపక్షం, ముత్యాల సరాలు ఇచ్చింది.అందులోని నాకు నచ్చిన వన్నీ ఒక పాతడైరీలో రాసుకున్నాను.అది ఇప్పటికీ నా దగ్గరే  ఉంది.అప్పటి నుండి కృష్ణశాస్త్రి కవితలోని లాలిత్యం ఎంత ఇష్టమో, శ్రీ శ్రీ కవిత్వం లోని లయ, పదును అంతే ఇష్టం.

           పుస్తకపఠనమే  కాకుండా అక్క ఎంబ్రైయిడరీ,పూసల బొమ్మలు తయారు చేయటం, లలిత సంగీతం నేర్పించేది.నేను బొమ్మలు బాగా వేస్తున్నానని నా చేత  మంచి చిత్రం వేయించీ ఢిల్లీ శంకర్స్ వీక్లీ వారు కండక్ట్ చేసే బాలల చిత్రలేఖనం పోటీ కి పంపింది.బహుమతి రాలేదు కానీ సర్టిఫికెట్ వచ్చింది.

           గోపన్న పాలెంలో మామయ్య వాళ్ళ ఇన్స్టిట్యూట్ లో ఒకసారి యువజనోత్సవాలు జరిగాయి.అందులో చిన్నక్క కూడా పాల్గొంది.ఒక గ్రూపువాళ్ళు గురజాడ కన్యక గేయ కథని నాటకం గా ప్రదర్శించారు.అందులో కన్యక పాత్ర షహనాజ్ వేసింది.ఆ మేకప్ లో షహనాజ్ ఎంత బాగుందో!కానీ కొన్ని ఏళ్ళకు ఆ అమ్మాయి కాల్చుకుని చనిపోయిందని లత ద్వారా విని చాలా బాధ పడ్డాను.నేను టీచర్ గా పని చేస్తున్న సమయంలో నా తరగతి పిల్లలతో కన్యక నాటకం వేయించాను.అందులో కన్యక గా వేసిన అమ్మాయి వివాహం అయ్యాక కాల్చుకుని చనిపోయింది.ఈ రెండు సంఘటనలూ కాకతాళీయం కావచ్చు కానీ గురజాడ కన్యక లో ఆత్మాహుతి చేసుకున్నట్లు రాయటం ఆ పాత్ర వేసిన వాళ్ళ మనసు పై ప్రభావం చూపిందేమో అని నా భావన.

           1964 మే 24 న జవహర్ లాల్ నెహ్రూ దివంగతులు ఐతే సంతాపం సభ కూడా పెట్టారు. సోవియట్‌ యూనియన్‌తో స్నేహం, ఆపత్కాలంలో అమెరికా వైఖరితో కుంగిపోయిన నెహ్రూ ఆ దిగులుతోనే మంచానపడ్డారని చెప్పారు.యుద్ధం తర్వాతి కాలంలో శత్రువు శత్రువు మిత్రులంటూ పాక్‌, చైనా మధ్య మైత్రి నెహ్రూను కలవరపెట్టింది. ఫలితంగా యుద్ధం ముగిసిన రెండేళ్లకే అకాలం మరణం పాలయ్యారని వక్తలు మాట్లాడారు.మర్నాడు వార్తా పత్రికలో వచ్చిన బాల్యం నుండి  నెహ్రూ ఫొటోలన్నిటినీ కత్తిరించి ఆల్బం లా తయారు చేసాను.

           కొన్నిరోజుల కి అనుకోకుండా నాన్న ఆఫీసునుండి డబ్బు లేవో వస్తాయని ఉత్తరం వస్తే అమ్మ, అక్కయ్య వెళ్ళారు.ఆ డబ్బు తో చిన్నక్కకు రెండో మూడో చీరలు,నాకు ఒక మూడు వోణీలు కొని తెచ్చారు.అక్కయ్య తన దగ్గరి ఒక చీర కత్తిరించి పరికిణీలు కుట్టింది.విజయనగరం వెళ్ళినప్పుడు అన్నయ్య తో మాట్లాడి కుటుంబ పరిస్థితులు చక్కబరచి అక్కయ్య వాళ్ళు వచ్చారు.మామయ్యకి యూఎస్ లో ఒక ఏడాది పరిశోధన కు వెళ్ళవలసి రావటం  వలన అందరం విజయనగరం బయలుదేరాం.అప్పుడు మొట్టమొదటిసారిగా లంగా వోణి వేసుకొని బయలుదేరాను.కొత్త లంగా వోణీలో నన్ను చూసుకొని  నాలో నేను ఎంత మురిసి పోయానో.అక్కడితో అక్కయ్యతో కలిసి నా ఏడాది జీవనప్రయాణమైతే  ముగిసింది.కాని నేను ఈనాడు రచయిత్రిగా, కవయిత్రి గా ఎదగటానికి గల కారణం అక్క దగ్గర ఉన్న ఏడాది కాలమే అని నా అభిప్రాయం.

          అందుకే సాహిత్యం_బాల్యం-ప్రేరణ అంటూ ఇంటర్వ్యూ లలో ఎవరు ప్రశ్నించినా ఆ ఏడాది జీవితాన్ని తడుముకోకుండా ఉండలేను.నా రచనల్లో అక్కయ్యను చూసుకుంటూనే ఉంటాను. సాహిత్య పరంగా  నేను రాసిన రచనలకి అక్కయ్య స్పందించి ఉత్తరం రాసేది.

          ఎలక్షన్స్ బేనర్ల పై రాసిన ' వానా వానా కన్నీరు' కథ చదివి అక్కయ్య పెద్ద ఉత్తరం రాసింది."కుటుంబ పరిథి లోనే రాయకుండా సమాజం లోని  ఇతర సమస్యలతో రాయటం బాగుంది.ఆలోచనా పరిధి విస్తృతంచేసుకుంటున్నావు.ఇలానే రాస్తుండు"అన్న తర్వాత నా రచనా పరిథి పెంచుకున్నాను.

       1996 లో కేవలం స్త్రీ చైతన్యంతో రాసిన కవితా సంపుటి" ఆవిష్కారం" అక్కయ్యకి అంకితం ఇచ్చాను.

  కేంద్ర సాహిత్య అకాడమీ వారు డా.శ్రీదేవి గురించి మోనోగ్రాఫ్ రాయమన్నప్పుడు పాత తెలుగు స్వతంత్రలు వెతుకు తుంటే  అక్కరాసిన సంపుటీకరింపబడని  కథలు  కొన్ని దొరుకుతే వాటిని నేను అక్కయ్యకి ప్రేమ పూర్వక నివాళి గా పుస్తకరూపంలో తెచ్చాను.

  అందుకే  నేను అక్కయ్య కి సాహితీ వారసురాలినని ఎప్పుడూ చెప్తునే ఉంటాను. మొదటినుంచీ నన్ను సాహిత్యం వైపు మళ్ళించిన మా పెద్దక్కయ్య పి.సరళాదేవి నాకు సాహిత్యస్పూర్తిని ఇచ్చిన వ్యక్తిగా భావిస్తాను.

20, ఏప్రిల్ 2021, మంగళవారం

నడక దారిలో-4

  నడక దారిలో--4


   మా నాన్నగారు పోయిన తర్వాత ఏడాదికి 1961 లో మా పెద్ద అన్నయ్య కు శ్రీకాకుళం జిల్లా లోని కోటబొమ్మాళి అనే ఊరు లోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లో టీచర్ గా ఉద్యోగం వచ్చింది.మా రెండో అన్నయ్య  వైజాగ్ లో  హాస్టల్ లో ఉండి చదువుకునే వాడు.

           అమ్మా,మా రెండో అక్కా నేను విజయనగరం నుండీ రైల్లో బయలుదేరి రామచంద్రాపురమో, హరిశ్చంద్రాపురమో గుర్తు లేదు,అక్కడ దిగి ఎడ్లబండి లో కోటబొమ్మాళికి బయలుదేరి వెళ్ళాం.అప్పటికి కోటబొమ్మాళి కి బస్సు కూడా లేదు.దారంతా గతుకుల రోడ్డు మీద ప్రయాణించి వెళ్ళాం.ఊర్లోకి అడుగు పెట్టగానే ఎడ్లబండి తిరగబడి నాకు పెదవి చిట్లి రక్తం ముఖం అంతా అలుక్కుపోయింది.నన్ను రెండు చేతులమీదుగా ఎత్తుకుని ఆ పక్కనే డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళారు.నొప్పి తగ్గటానికి డాక్టరుగారు ఇంజెక్షన్ ఇవ్వబోతే కళ్ళు తిరిగి పడిపోయాను.ఆ  డాక్టరుగారి అబ్బాయి నా క్లాస్ మేట్.అతని అక్క నాకు పాటలమేట్.అందువల్ల అప్పుడప్పుడు ఆ అమ్మాయి దగ్గర కు పాటలసాధనకు వెళ్ళేదాన్ని.నన్ను చూసి డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇవ్వాలా అంటూ వేళాకోళం చేసేవారు.

           ఆ ఊరులో అప్పట్లో రెండే సమాంతరంగా ఉండే వీధులు.ఒకటి బ్రాహ్మణ వీథి.రెండోది కోమట్లవీథి.ఇతర కులాల వారు మరి ఎక్కడ నివసించేవారో నాకు తెలియదు.బ్రాహ్మణ వీథిలో మాకు ఇల్లు అద్దెకి  ఇవ్వరు కనుక కోమట్లవీధీ లోనే మరి మాకు ఎలా ఇచ్చారో తెలియదు గానీ ఒకేగది ఇల్లు అద్దెకు తీసుకుని అందులో ఉండే వాళ్ళం.గది వెనుక ఒక వసారా ఉండేది అక్కడే వంట చేసుకునే వాళ్ళం.తర్వాత పెద్ద తోట అందులో పంపర పనాస,జామ వంటి పళ్ళ చెట్లు ఉండేవి కానీ వాటి మీద చెయ్యి వెయ్యటానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చారు ఇంటి వాళ్ళు.ఆ యింటి వీధి తలుపు నిండా ఇత్తడి గుండ్లు అలంకారంగా పొదిగి ఉండి రాజులకోట గుమ్మంలా బహు దర్జాగా అందంగా ఉండేది.

              ఇంటి గది పైన సరంబీ ఉండేది.దానికి చిన్న తలుపు ఉండేది.ఇంటివాళ్ళసామాన్లు ఇత్తడి అండాలూ,పెద్ద పెద్ద గిన్నెలు వంటివి అందులో ఉంచేవారు.అవసరమైనప్పుడు నిచ్చెన సాయంతో సామాను దించేవారు.

        నాన్నగారు పోయిన తర్వాత నన్ను ఆరో తరగతి తో చదువు మానిపించారు కదా ఇక్కడ అన్నయ్య పని చేసే జిల్లా పరిషత్ స్కూలు లో ఏడో తరగతి లో జాయిన్ చేశారు.

        కోటబొమ్మాళి ఊరులో ఎవరింట్లోనూ  మరుగుదొడ్లు లేవు.దూరంగా ప్రహారీ కట్టిన బహిరంగ ప్రదేశం మహిళల కోసం ఉండేది.చిన్నబకెట్ తో నీళ్ళు పట్టుకుని వెళ్ళాల్సిందే.స్నానం మాత్రం పెరట్లోనే చేసేవాళ్ళం.ఇప్పటి కైనా ఆ వూర్లో అందరి ఇళ్ళకీ మరుగు దొడ్లు వచ్చాయో లేదో మరి.

       ఊరికి చుట్టూ కొండలు ఉండటంవల్ల ఎలుగు బంట్లు రాత్రిపూట ఊర్లోకి వచ్చేసేవి. అందుకని రాత్రంతా డప్పులు వాయిస్తూ కాగడాలతో కాపలా ఉండేవారు.పాములు సరేసరి రాత్రీ పగలూ తిరుగు తూనే ఉండేవి.ఒక్కొక్కప్పుడు సరంబీ లోకి కూడా ఎలుకలు కోసం పాములు కూడా  వచ్చేవి.

       ఊరులోని ఆడవాళ్ళు రోజంతా రకరకాల అప్పడాలు, వడియాలు, సకినాలు వంటివి తయారుచేయటం, (శ్రీకాకుళం జిల్లాలో రకరకాల అప్పడాలు ముఖ్యంగా పేలాలు అప్పడాలకు ప్రసిద్ధి) వంటి ఇంటిపనులు చేస్తూ ఉండే వారు.పెద్దగా బయటకు కనిపించే వారు కూడా కాదు.బడిలో ఏ క్లాసులోనూ అయిదారు మందికన్నా ఆడపిల్లలు ఉండేవారు కాదు.వారు కూడా అగ్ర వర్ణాల పిల్లలే.

           కొన్నాళ్ళ క్రితం  HJ దొర అనే ఐ.పీ.ఎస్ ఉండే వారు కదా.అతను నాకు జూనియర్  క్లాసులోనూ, అతని సోదరి నాకు సీనియర్ క్లాసులో ఉండేవారు.బడికి రోజూ టాంగా మీద వచ్చే వారు.దొరగారి అమ్మాయి అంటూ ఆమెని స్కూల్ లో అందరూ అపురూపంగా చూసేవారు.

        ఒకసారి బళ్ళో పాటలు పోటీ  పెట్టారు. పాటల పోటీలో నాకు ఫస్ట్,ఆమెకు సెకెండ్ అని అనౌన్స్ చేసి , తర్వాత స్కూలు డే రోజున ప్రైజులు తారుమారు చేసారు.

       ఒకే గది ఇల్లు కావటాన   మా అన్నయ్య రాత్రి భోజనం చేసి బడి లోనే పడుకోటానికి వెళ్ళిపోయే వాడు.అప్పుడప్పుడు స్కూలు లైబ్రరీ నుంచి మునిమాణిక్యం కాంతం కథలు, శ్రీపాద కథలు వంటివి కాక ప్రభ, పత్రిక తీసుకువచ్చే వాడు.అప్పటికే పుస్తకాలు చదవటం అలవాటు కనుక చదువుతూ ఉండేదాన్ని ప్రభలోని రంగనాయకమ్మ గారి కూలిన గోడలు సీరియల్ వచ్చేది అది అమ్మకి చదివి వినిపించే దాన్ని.అందులోని కొన్ని సంఘటనలు మా జీవితానికి దగ్గరగా అనిపించేవి.అది చదువు తున్నప్పుడు అమ్మ కూడా మా కుటుంబాలలో జరిగిన ఎన్నెన్నో సంఘటనలు చెప్పేది.

     1962 లో అమ్మ పెద్దక్కయ్య పురిటి కోసం సాయానికి అనకాపల్లి వెళ్ళింది.

     మా చిన్నక్కకూ, నాకూ సాయంగా షణ్ముఖ రావు అనే అబ్బాయిని రాత్రి పూట అన్నయ్య ఏర్పాటు చేసాడు షణ్ముఖ రావు తొమ్మిదో,పదో తరగతి చదివేవాడు.భోజనం అయ్యాక కిరోసిన్ దీపం చుట్టూ చిన్నక్క, షణ్ముఖ రావు, నేను చదువు కునేవాళ్ళం.చదువయ్యాక షణ్ముఖ రావు రాజు-పేదా సినీమా కథ సీరియల్ లా చెప్పే వాడు.రాత్రి అయ్యింది పడుకోమని చిన్నక్క కోప్పడితే పడుకునే వాళ్ళం.ఆ రోజుల్లో కనుక ఒక అబ్బాయి ని ఇద్దరు ఆడపిల్లలకు సాయంగా రాత్రి పూట పంపించ గలిగారు.ఈ రోజుల్లో అది సాధ్యమా.తలంచుకుంటే ఆశ్చర్యం కలిగిస్తుంది.

     అప్పట్లోనే అష్టగ్రహకూటమి ఏర్పడి భూగోళం అంతమౌతుందని ఒక పెద్ద సంచలనం.తేదీ గుర్తు లేదు కానీ స్కూలు కూడా రెండురోజులు సెలవు ఇచ్చేసారు.షణ్ముఖరావు మా ఇంటికి ఆరెండు రోజులూ సాయానికి రాననీ పోతే మాయింట్లోనే పోతాననీ ఏమీ జరగకపోతే ఆ తర్వాత నుండీ వస్తానన్నాడు.ఆ రెండు రోజులుగడిచాక అంతా మామూలే.అష్టగ్రహ కూటమీ లేదు ఏమీ లేదు. ఇప్పుడు షణ్ముఖ రావు ఎక్కడ ఉన్నాడో. 

     1962 లో చైనా భారత్ పై యుద్ధానికి దిగింది.ఆ సందర్భం లో రేడియోలో ప్రజల్ని ఉద్దేశించి ప్రధాని నెహ్రూ గారు గద్గద కంఠంతో మాట్లాడారని చెప్పుకునేవారు.  స్కూలు లో మాష్టార్లు రోజూ దినపత్రిక లో యుద్ధం విశేషాలు ప్రార్థన సమావేశంలో చెప్పేవారు.ఆ యుద్ధంలో చైనా ఆక్సాస్ చిన్ అనే ప్రాంతాన్ని ఆక్రమించిందట.చైనాకూ భారత్ సరిహద్దు ప్రాంతాలైన సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లలో చాలాకాలం పాటూ ఘర్షణలు చెలరేగేయని రోజూ చెప్పేవారు. దేశభక్తిని రగుల్కొల్పే ఎన్నో పాటలు నేర్చుకున్న జ్ణాపకం.

          శ్రీకాకుళం ప్రాంతాలలో మాత్రమే "నేస్తం కట్టడం" అనేది పధ్ధతో,సాంప్రదాయమో మరి చూసాను.మా తరగతిలోని నా స్నేహితురాలు ఒకరోజు మనం నేస్తం కడదామా అని అడిగింది.అంటే స్నేహం గా ఉందామని అడిగింది అనుకుని సరే అన్నాను.నన్ను ఆ పక్కనే ఉన్న చిన్న గుడి కి తీసుకెళ్ళి నాకు ఇప్పుడు గుర్తు లేదు కానీ  ప్రమాణం వంటిది చేయించింది.నేస్తం కట్టిన వాళ్ళు ఒకరినొకరు జీవితాంతం స్నేహబంధం కి కట్టుబడి ఉండాలి.ఒకరినొకరు మీరు అని మన్నించు కోవాలి.ఒకరిపేరు ఒకరు ఉఛ్ఛరించకూడదు.ఇలా ఏవో చాలా నిబంధనలు ఉన్నాయి.ఐతే  రెండేళ్ళు మాత్రమే అనుబంధం ఉన్న కోటబొమ్మాళి వదిలిన తర్వాత   కుటుంబంలో వచ్చిన ఆటుపోట్లతో ఆ విషయమే మర్చిపోయాను.

       ఇటీవల వ్యాసం రాయటానికి నిడదవోలు మాలతి గారి కథలూ చదువుతుంటే ఒక కథలో ఈ ప్రస్తావన ఉంది.దాంతో అవన్నీ గుర్తు వచ్చాయి .ఇంతకీ నా నేస్తం ఎలా ఉందో!!? మళ్ళీ ఒకసారి కోటబొమ్మాళి వెళ్ళి రావాలని ఉంది.


---- శీలా సుభద్రాదేవి


2, మార్చి 2021, మంగళవారం

భద్రం తల్లీ కవిత - నా విశ్లేషణ

నా కవిత " భద్రం తల్లీ" నేపధ్యం నా విశ్లేషణ

         గత కొంతకాలంగా పదో తరగతి,ఇంటర్ ఫలితాలు వెలువడుతున్నాయంటే ఆ మర్నాడు వార్తా పేపర్లలో  ఆత్మహత్యల వార్తలు కూడా ఎక్కువగాఉండటం ఆందోళన కలిగించే అంశంగా మారుతుంది.

         అందుకు కారణం విశ్లేషించాల్సిన అవసరం ఉంది.

 14 -20 ఏళ్ళ కౌమార దశలో  పిల్లలపై అనేక విషయాలపట్ల ఆకర్షణలు ఉంటాయి.ఆవేశం ఉంటుంది.పెద్దవాళ్ళం అయిపోయాము మాకు తెలుసు అనే మొండితనం ఉంటుంది.ఈ వయసులో ఆడపిల్లల పట్ల తల్లి కి చాలా జాగరూకత అవసరం.

         స్కూలు లో టీచర్లు, ఇంట్లో తల్లి తండ్రులు పిల్లల ఆలోచనలు, ఆసక్తులు గమనించకుండా పందెంకోళ్ళలా రేంకులు వెంట పరిగెత్తిస్తున్నారు.అది గమనించిన కొందరు  పిల్లలు వాళ్ళ కోరికలూ, జల్సాలూ ,అవసరాలూ కోసం తల్లి తండ్రులను ఏటీఎం కార్డులు గా ఉపయోగించుకుంటున్నారు.

       మరోపక్క ప్రభుత్వవిద్యా సంస్థల్లో చదివే పేద వర్గాల్లో పిల్లలు చాలామంది పేపర్లూ,పాలపేకెట్లు వేస్తూ డబ్బు సంపాదించే వాళ్ళలో కొందరు జల్సాలకు అలవాటు పడుతున్నారు.

       వీరందరికి అరచేతిలోకి మొబైల్స్ వచ్చేసాయి.దాంతో అశ్లీల చిత్రాలు వీడియోలు అప్పుడప్పుడే వికసిస్తున్న వయసును ఆకర్షిస్తూ రెచ్చగొడుతున్నాయి.మంచి చెప్పే టీచర్లూ, తల్లి దండ్రులమాటలు వారికి విసుగ్గా ఉంటున్నాయి రహస్య స్నేహితుల మాటలే రుచించి వారే తమ శ్రేయోభిలాషులనీ నమ్ముతారు.

       సమస్య తీవ్రతరం అయ్యే సరికి జీవితం విలువ నేర్చుకోని ఆ పిల్లలికి ఆత్మహత్య ఒక్కటే పరిష్కారం గా కనిపిస్తుంది.అందుకే ఆ వయసు పిల్లలు అందులోని ఆడపిల్లల చుట్టూ బిగుసుకుంటున్న ఈ సందర్భాలను చూసి ఆందోళనతో రాసిన కవిత ఇది.

       విద్యాసంస్థల్లో పిల్లలకు, ముఖ్యంగా ఆడపిల్లలకు ఇలా మోహపరిచే విషయాలను టీచర్లూ, తల్లిదండ్రులూ వారి ప్రవర్తనను ఒక కంట కనిపెడుతూ అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.పిల్లలకు ఎన్ని ఆవరోధాలు వచ్చినా జీవితాన్ని ఎదుర్కోగలిగే సంయమనమూ,జీవితం విలువ తాము చేసే అనాలోచిత నిర్ణయాల వలన తల్లి తండ్రులకు ఎంత మనస్తాపం కలుగు తుందో అవగాహన కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనుకుంటున్నాను.మీరేమంటారు?

       

మున్నుడి లేఖ

 ప్రియమైన లేఖావరణానికి 

           నమస్తే.

        సుమారు   పది,ఇరవై ఏళ్ళ క్రితం పది దాటిన దగ్గర నుండి పోస్టు మేన్ సంచినిండా నింపుకొని తెచ్చే ఉత్తరాలకబుర్ల కోసం చూపులు వీథిి గుమ్మం దగ్గరే కాపలా కాసేవి.రాను రానూ ఉత్తరాలు రాసే ఓపికలూ తగ్గిపోయాయి.

        ఫోన్ కనెక్షన్లు వచ్చి విశేషాలు ఫోన్లో చెప్పుకోవటం అలవాటైంది.అరచేతిలోని మొబైల్ ఫోన్ వచ్చేక అదికూడా తగ్గిపోయి మాట్లాడే అవసరం కూడా లేకుండా వివిధ మనోభావాలను అనేక రకాల ఎమోజీలతో సందేశాలను పంపించుకుంటూ జనాలు మాట్లాడటం మర్చిపోతున్నారు.

        నిజానికి  అప్పట్లోని ఆత్మీయ స్నేహితులతో బంధువులో భౌతికంగా లేకపోయినా  వారు రాసిన లేఖలు జ్ణాపకాల పేటిక నుండి ఎప్పుడు తీసి చదువుకున్నా మళ్ళీ మళ్ళీ ఆ జ్ణాపకాల లోతుల్లోకి ప్రయాణిస్తునే ఉంటాం.ఇప్పుడు మరేమీ ఆలోచించనీయకుండా  చేతిలోసర్దుకు కూర్చున్న యంత్రాల్ని ఏకార్యము చేతనైనా మార్చు కున్నప్పుడల్లా భద్రపరచుకున్నవీ వెలిసిపోవటమో కరిగి పోవటమో జరుగుతాయి.అయినా ఆ మోహప్రపంచం లో మునుగీతలు కొడుతూనే వున్నాం.

        మళ్ళీ ఇన్నాళ్ళకు నువ్వు ఈ విధంగా సంచి నిండా ---కుమార్తెలకు భద్రతలేని సమాజంలో తమను తాము కాపాడుకోవటానికి జాగ్రత్తలు తెలియజేస్తున్న మాతృమూర్తుల ఆందోళనలనూ, అభిమానాన్ని చూరగొన్న శిష్యులకు జీవన విలువలను బోధించే గురువుల ఆత్మీయతలనూ, కబుర్లు కలబోసుకుంటూ స్నేహసంబంధాల్ని పటిష్టం చేస్తున్న మిత్రబాంధవ్యాల్నీ,కన్నబిడ్డల ప్రేమామృతాల్నీ, తోబుట్టువుల అనురాగాల్నీ మోసుకుంటూ తెచ్చావు.  

            మన మనసు విప్పి గుండెలో గూడు కట్టిన దుఃఖాన్ని చెప్పుకోగలిగేది ఆత్మీయ మితృలదగ్గరే.అందుకే అన్నింటి కన్నా ఎక్కువ గా ఆ మిత్రులు స్త్రీ కావచ్చు,పురుషులు కావచ్చు,అజ్ణాతం లో ఉన్న మిత్రులకి కావచ్చు,ఇద్దరు అజ్ణాత  మిత్రులతో కలిపి అత్యధికంగా   వచ్చిన పదహారు  లేఖలు ఆత్మీయ మిత్రులకే.సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ అన్నారు కవి. అందుకేనేమో మిత్రలేఖలే ఎక్కువ తెచ్చావు.

        నిజమే మనసులోని బాధలన్నీ,భావాలన్నీ చెప్పుకుని సాంత్వన పొందేది అమ్మదగ్గరే కదా. నాన్నతో కలగలిపి పది లేఖల్లో అమ్మ దగ్గరే ఆడపిల్లలపై జరుగుతోన్న దాడులనూ హింసనూ వెళ్ళబోసుకుని అమ్మ ప్రేమ కోసం తహతహలాడారు.

          దగ్గర బంధువులకే కాకుండా దేవతలకీ,కాలానికీ,FB కీ,గురువుకీ లేఖల్ని తెచ్చావు.ఇంకా కాలానికీ, వెళ్ళిపోయిన సంవత్సరం కి వీడ్కోలూ, కొత్తగా వచ్చిన ఏడాదికి స్వాగతలేఖలూ తెచ్చావే నువ్వు భలే దానివి.మాలాంటి ఆడవాళ్ళందరూ చదువుకోవటానికి తొలి అడుగు వేయించిన మొట్టమొదటి ఉపాధ్యాయులు సావిత్రీబాయి పూలే కి కూడా ఉత్తరం తీసుకు వచ్చేవు .నిజమే మాకో గొంతు ఇచ్చినది,బహుజన,దళిత మహిళలకు అక్షరాన్ని అందించినది ఆమేకదా.

          అయినా నువ్వు ఇంతమంది గుండె బరువులను మోసుకుంటూ వచ్చి నీ ఆవరణాన్నంతటినీ దుఃఖం తో నింపీ మరింతగా అందర్నీ ఆలోచనల్లోకి నెట్టేసావు.మనం ఈ తాగుబోతులు నుండి, మదమెక్కిన మృగాళ్ళ నుండి,రంగులవలలనుండి,మీడియానుండి,కుళ్ళిపోతున్న సమాజం నుండి మన ఆడపిల్లలను ఎలా కాపాడుకోవాలి?  అందుకు అక్షరయోధలందరూ కలాల్ని సాన పెట్టి జాగృత పరచవలసిన కర్తవ్యాన్ని నింపిన యాభై అయిదులేఖల్ని నీ సంచి నిండా నింపుకుని మరీ ఈసారి వచ్చేటప్పుడు తీసుకునివచ్చావు.     

          అందర్నీ కూడగట్టి    జ్వలించే అంశాన్ని అందించి లేఖలను  రాయించి  నీ ఆవరణాన్నంత నింపే ఇన్నిన్ని లేఖల్ని మూట కట్టి నా దగ్గరికి పంపించిన  జ్వలితకు నా అభినందనలు   అందజేస్తావు కదూ  

           వచ్చేసారైనా నీ ఆవరణాన్నంతటినీ  కోకిలల కలస్వరాలతో, సీతాకోకచిలుకల రంగుల హరివిల్లుతో,వన్నెవన్నె పూల పరిమళభరిత మలయపవనాలతో పోటీపడుతూ కలకలనవ్వుతూ సాధికారత తో  స్వావలంబన తో నిర్భయంగా తిరగగలిగే ఆడపిల్లల సంపూర్ణ జీవన వాస్తవచిత్రాల్ని  మోసుకొస్తావని ఎదురు చూస్తుంటాను.

                                                 ఇక ఉంటాను.

                                                శీలా సుభద్రా దేవి