2, మార్చి 2021, మంగళవారం

మున్నుడి లేఖ

 ప్రియమైన లేఖావరణానికి 

           నమస్తే.

        సుమారు   పది,ఇరవై ఏళ్ళ క్రితం పది దాటిన దగ్గర నుండి పోస్టు మేన్ సంచినిండా నింపుకొని తెచ్చే ఉత్తరాలకబుర్ల కోసం చూపులు వీథిి గుమ్మం దగ్గరే కాపలా కాసేవి.రాను రానూ ఉత్తరాలు రాసే ఓపికలూ తగ్గిపోయాయి.

        ఫోన్ కనెక్షన్లు వచ్చి విశేషాలు ఫోన్లో చెప్పుకోవటం అలవాటైంది.అరచేతిలోని మొబైల్ ఫోన్ వచ్చేక అదికూడా తగ్గిపోయి మాట్లాడే అవసరం కూడా లేకుండా వివిధ మనోభావాలను అనేక రకాల ఎమోజీలతో సందేశాలను పంపించుకుంటూ జనాలు మాట్లాడటం మర్చిపోతున్నారు.

        నిజానికి  అప్పట్లోని ఆత్మీయ స్నేహితులతో బంధువులో భౌతికంగా లేకపోయినా  వారు రాసిన లేఖలు జ్ణాపకాల పేటిక నుండి ఎప్పుడు తీసి చదువుకున్నా మళ్ళీ మళ్ళీ ఆ జ్ణాపకాల లోతుల్లోకి ప్రయాణిస్తునే ఉంటాం.ఇప్పుడు మరేమీ ఆలోచించనీయకుండా  చేతిలోసర్దుకు కూర్చున్న యంత్రాల్ని ఏకార్యము చేతనైనా మార్చు కున్నప్పుడల్లా భద్రపరచుకున్నవీ వెలిసిపోవటమో కరిగి పోవటమో జరుగుతాయి.అయినా ఆ మోహప్రపంచం లో మునుగీతలు కొడుతూనే వున్నాం.

        మళ్ళీ ఇన్నాళ్ళకు నువ్వు ఈ విధంగా సంచి నిండా ---కుమార్తెలకు భద్రతలేని సమాజంలో తమను తాము కాపాడుకోవటానికి జాగ్రత్తలు తెలియజేస్తున్న మాతృమూర్తుల ఆందోళనలనూ, అభిమానాన్ని చూరగొన్న శిష్యులకు జీవన విలువలను బోధించే గురువుల ఆత్మీయతలనూ, కబుర్లు కలబోసుకుంటూ స్నేహసంబంధాల్ని పటిష్టం చేస్తున్న మిత్రబాంధవ్యాల్నీ,కన్నబిడ్డల ప్రేమామృతాల్నీ, తోబుట్టువుల అనురాగాల్నీ మోసుకుంటూ తెచ్చావు.  

            మన మనసు విప్పి గుండెలో గూడు కట్టిన దుఃఖాన్ని చెప్పుకోగలిగేది ఆత్మీయ మితృలదగ్గరే.అందుకే అన్నింటి కన్నా ఎక్కువ గా ఆ మిత్రులు స్త్రీ కావచ్చు,పురుషులు కావచ్చు,అజ్ణాతం లో ఉన్న మిత్రులకి కావచ్చు,ఇద్దరు అజ్ణాత  మిత్రులతో కలిపి అత్యధికంగా   వచ్చిన పదహారు  లేఖలు ఆత్మీయ మిత్రులకే.సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ అన్నారు కవి. అందుకేనేమో మిత్రలేఖలే ఎక్కువ తెచ్చావు.

        నిజమే మనసులోని బాధలన్నీ,భావాలన్నీ చెప్పుకుని సాంత్వన పొందేది అమ్మదగ్గరే కదా. నాన్నతో కలగలిపి పది లేఖల్లో అమ్మ దగ్గరే ఆడపిల్లలపై జరుగుతోన్న దాడులనూ హింసనూ వెళ్ళబోసుకుని అమ్మ ప్రేమ కోసం తహతహలాడారు.

          దగ్గర బంధువులకే కాకుండా దేవతలకీ,కాలానికీ,FB కీ,గురువుకీ లేఖల్ని తెచ్చావు.ఇంకా కాలానికీ, వెళ్ళిపోయిన సంవత్సరం కి వీడ్కోలూ, కొత్తగా వచ్చిన ఏడాదికి స్వాగతలేఖలూ తెచ్చావే నువ్వు భలే దానివి.మాలాంటి ఆడవాళ్ళందరూ చదువుకోవటానికి తొలి అడుగు వేయించిన మొట్టమొదటి ఉపాధ్యాయులు సావిత్రీబాయి పూలే కి కూడా ఉత్తరం తీసుకు వచ్చేవు .నిజమే మాకో గొంతు ఇచ్చినది,బహుజన,దళిత మహిళలకు అక్షరాన్ని అందించినది ఆమేకదా.

          అయినా నువ్వు ఇంతమంది గుండె బరువులను మోసుకుంటూ వచ్చి నీ ఆవరణాన్నంతటినీ దుఃఖం తో నింపీ మరింతగా అందర్నీ ఆలోచనల్లోకి నెట్టేసావు.మనం ఈ తాగుబోతులు నుండి, మదమెక్కిన మృగాళ్ళ నుండి,రంగులవలలనుండి,మీడియానుండి,కుళ్ళిపోతున్న సమాజం నుండి మన ఆడపిల్లలను ఎలా కాపాడుకోవాలి?  అందుకు అక్షరయోధలందరూ కలాల్ని సాన పెట్టి జాగృత పరచవలసిన కర్తవ్యాన్ని నింపిన యాభై అయిదులేఖల్ని నీ సంచి నిండా నింపుకుని మరీ ఈసారి వచ్చేటప్పుడు తీసుకునివచ్చావు.     

          అందర్నీ కూడగట్టి    జ్వలించే అంశాన్ని అందించి లేఖలను  రాయించి  నీ ఆవరణాన్నంత నింపే ఇన్నిన్ని లేఖల్ని మూట కట్టి నా దగ్గరికి పంపించిన  జ్వలితకు నా అభినందనలు   అందజేస్తావు కదూ  

           వచ్చేసారైనా నీ ఆవరణాన్నంతటినీ  కోకిలల కలస్వరాలతో, సీతాకోకచిలుకల రంగుల హరివిల్లుతో,వన్నెవన్నె పూల పరిమళభరిత మలయపవనాలతో పోటీపడుతూ కలకలనవ్వుతూ సాధికారత తో  స్వావలంబన తో నిర్భయంగా తిరగగలిగే ఆడపిల్లల సంపూర్ణ జీవన వాస్తవచిత్రాల్ని  మోసుకొస్తావని ఎదురు చూస్తుంటాను.

                                                 ఇక ఉంటాను.

                                                శీలా సుభద్రా దేవి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి