19, జూన్ 2022, ఆదివారం

మాతృ దినోత్సవం

       మాతృ దినోత్సవం 


ఈరోజు

 ఎక్కడచూసినా అమ్మలచిత్రాలూ

 కవిత్వంగా మారిన అమ్మలూ

 

అక్షరకథనాల్లోంచి అమ్మలూ

 కాసింత సేపు రంగులపెట్టి ముందుకు చేరాను

 ఒకదాని తర్వాత మరొకటి అమ్మమీద చిత్రాలే

దాని నోరుమూసి కళ్ళుమూసుకున్నాను

ఎక్కడో తరంగాలు తరంగాలుగా 

గాలి లోనుంచి అమ్మ ప్రేమో

అమ్మ మీద ప్రేమో వైనాలువైనాలుగా

రాగం తీగలు సాగుతూ చెవిసోకింది..


సామాజిక మాధ్యమాలన్నీ

అమ్మపాలరుచిని ఆస్వాదిస్తున్నాయ్

సరే నేనూ ఓ ఫోటో పెట్టేద్దాం అనుకున్నా

ప్ఛ్.చిత్రం

ఒక్కటంటే ఒక్క చిత్రం కూడా దొరకలేదు

అమ్మ ఉన్న ఒకట్రెండు ఫొటోల్లో చూద్దామా అంటే

 మా ఇద్దరిమధ్యా మరికొందరు

 ఏంచేయను.

 దిగులుగా ఒకసారి అద్దంలోకి తొంగిచూసాను

 అదే దిగులు ముఖంతో అమ్మ

అంతలో

అమ్మా అని పిలుపు

వెనక్కి తిరిగి చూస్తే నాముఖంతో అమ్మాయి

ఆ వెనుకే అమ్మాయి ముఖంతో పాపాయి.

ఇంకా ఫొటో అక్కర్లేదు

దిగులూ అక్కర్లేదు.

ముగ్గురమ్మలూ ఇంట్లోనే ఉంటే

ఇంకా అమ్మకోసం వెతుకులాట ఎందుకు

మూడువందల అరవై అయిదు రోజులూ

మా ఇంట మాతృదినోత్సవాలే.

19, ఏప్రిల్ 2022, మంగళవారం

నడక దారిలో --15

 నడక దారిలో-15


 నా ఉత్తరం అందగానే ఆఘమేఘాల మీద ఆ వారాంతం వస్తున్నానని రాసారు.

         అలాగే అప్పట్లో హైదరాబాద్ నుండి విజయనగరానికి  ఇరవైనాలుగు గంటల రైలుప్రయాణం . ముందురోజు సాయంత్రం రైలు ఎక్కితే మర్నాడు సాయంత్రం ఆరున్నరకి చేరారు.అన్నయ్య స్టేషనుకు వెళ్ళి తీసుకువచ్చాడు.

         ఇంటికి వచ్చి స్నానపానాదులు,భోజనం అయ్యేసరికే రాత్రి పడుకునే సమయం అయ్యింది.

           మర్నాడు టిఫిన్లు చేసి అన్నయ్యలు ఇద్దరూ బయటకు వెళ్ళారు.అమ్మ ఇచ్చిన కాఫీ తీసుకుని అన్నయ్య గదిలో ఉన్న వీర్రాజు గారికి ఇవ్వటానికి వెళ్ళాను. నాకు మొదటినుంచీ చొచ్చుకు పోయి మాట్లాడే స్వభావం లేకపోవటం వలన మనసులో ఉన్నది పేపర్ మీద పెట్టగలను. మాట మాత్రం గొంతులోంచి పెగల్లేదు. ఎప్పుడూ లేనిది గుండె కొట్టుకుంటున్న చప్పుడు నాకే వినిపిస్తుంది.

               నేను మాట్లాడలేదు సరే ఆయనా చాలా సేపు మాట్లాడలేదు. ‘స్త్రీ మనస్తత్వ విశ్లేషణతో ఇన్ని ప్రేమకథలు ఎలా రాసారబ్బా’ అని మనసులోనే అనుకున్నాను. కొన్ని నిముషాల తర్వాత “నువ్వు రాసిన కథలు తీసుకురా చదువుతాను” గోడతో అన్నట్లు అన్నారు.

                మాట్లాడకుండా వెళ్ళి తీసుకు వచ్చి ఇచ్చాను. ఎందుకో నాకు అసంతృప్తిగా అనిపించింది. నా మనసు చదివినట్లు ఆయన మళ్ళా ఎందుకనో “తర్వాత చదువుతానులే” అని అవి పక్కన పెట్టి నా ముఖంలోకి చూసి ” నువ్వని తెలిసి భలే ఆశ్చర్యపోయాను తెలుసా. నువ్వు మరీ ఇంత చిన్నపిల్లలా ఉంటావనుకోలేదు” అన్నారు.

            నేను చిన్నగా నవ్వి ఊరుకున్నాను.

             “మనం సభా వివాహం చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాను. నువ్వేమంటావు?”

             మాటలతో కాకుండా తల ఊపి “నా చదువు పూర్తయ్యాక” మెల్లగా అన్నాను.              

             “పెళ్ళయ్యాక ఇక్కడే ఉండి చదువుకోవచ్చులే. మా అమ్మ సంవత్సరీకాలకు ముందే చేసుకోవాలని  అనుకుంటున్నాను. అందుకే ఏప్రిల్ లోపున చేసుకుందామని. “అంటూ నా ముఖంలోకి చూసారు.

              ‘ఆధునికంగా చేసుకోవాలనే ఉద్దేశంతో మంత్రాలపెళ్ళి వద్దు అని, మళ్ళీ ఈ సెంటిమెంట్ ఏమిటి. నమ్మకం, సెంటిమెంట్ వేర్వేరేనా’ ఆలోచనలో పడ్డాను. నా నా చదువు సక్రమంగా కొనసాగుతుందా అనే సందిగ్ధంలో కూరుకుపోయి ఏమీ  సమాధానం చెప్పలేకపోయాను. మొదటిసారి కలిసిన సందర్భం ఇలా మరీ ఇంత పొడిగా ఉండటం నాకేమీ బాగా అనిపించలేదు.

                ఆరోజు సాయంత్రం పెద్దమామయ్య వచ్చారు.అన్నయ్యలూ, వీర్రాజు గారూ అమ్మ అందరు కలిసి సంప్రదించుకున్నారు. ఆ సందర్భంలోనే వీర్రాజు గారు తన చెల్లెల్ని చిన్నన్నయ్య కిచ్చి పెళ్ళి చేయటాన్ని ప్రస్తావించారు.

                పక్కగదిలో కూర్చుని వారి మాటలు వింటున్న నాకు ఒక్కసారి మనసుకి ముల్లు గుచ్చుకున్నట్లు అయ్యింది. ‘ ఈయన నాకోసం వచ్చారా? చెల్లెలి పెళ్ళి సంబంధం స్థిరపరచుకోటం కోసం వచ్చారా?  ఇప్పుడే ఈ ప్రస్తావన తేవాల్సిన అవసరం ఉందా? మా పెళ్ళి తర్వాతైనా అడగొచ్చు కదా?’ మొదట్లోనే అసంతృప్తి మనసులోకి వస్తుంటే నన్ను నేను సరి చేసుకోటానికి ప్రయత్నించాను.

               అంతలో చిన్నన్నయ్య “చేసుకుంటాను గానీ అన్నయ్యకీ, చెల్లెలికీ  అయ్యే వరకూ ఎన్నాళ్ళు అయినాసరే  చేసుకోను. అది మీకు ఇష్టమైతేనే.”అన్నాడు.

                  తర్వాత వివాహ విధానం గురించి చర్చ జరిగింది. మామయ్య అందరూ కలిసి మాఘమాసం లో తేదిని నిర్ణయించుకుందాం అనుకున్నారు. రెండుమూడు రోజుల్లో తేదీ చెప్తానని మామయ్య అన్నారు.

           అందరి అంగీకారంతో చర్చముగించారు.

              ఆ మర్నాడు నేను రాసిన నా కథలలో మూడు కథల్ని ఎంపిక చేసి ఒకటి తాను తీసుకు వెళ్ళి ఎమ్. రాజేంద్ర సంపాదకత్వం తో వస్తున్న పొలికేక వారపత్రిక కు ఇస్తాననీ, మిగతా రెండు నన్నే జ్యోతి మాసపత్రిక కు పంపమన్నారు.         

              తర్వాతి రోజు నా చెంపల పై ఒక తీపి సంతకం వేసి తిరుగు ప్రయాణమయ్యారు.        

           మళ్ళీ మర్నాటి నుంచి కాలేజీ కి వెళ్ళటం కొనసాగించాను. ఉషా వలనా, కుమారి వలనా విషయం తెలుసుకున్న మిత్రులు నన్ను ఆట పట్టించారు. “చదువూ, ఉద్యోగం అని అప్పుడే పెళ్ళి చేసేసుకుంటున్నావేంటోయ్ ” అంటూ.            

              “నిజమే ఎందుకు తొందరపడ్డాను. పరీక్షలు అయ్యాకే చేసుకుంటే బాగుండేది. అదేమిటీ మనసులోని మాట ఎందుకు చెప్పలేకపోయాను.”          

              అప్పుడప్పుడు మనసు నన్ను ప్రశ్నిస్తూనే ఉంది.         

             ఎదురుగా చెప్పలేక మూగపోయాను. కానీ మళ్ళీ ఉత్తరంలో ఈ విషయం ప్రస్తావించాను. “పెళ్ళయినా చదువుకుందూగానిలే. మళ్ళీ అనుమానమెందుకు” అన్నారు.    

             మాటిమాటికీ అదే విషయాన్ని ప్రస్తావించటం బాగుండదని ఊరుకున్నాను.                                                 

           అక్టోబర్ నెలలో ఒకవారం పొలికేక సంచిక లో నామొట్టమొదటి కథ కొడవంటి సుభద్రా దేవి పేరుతో  “పరాజిత” ప్రచురితం అయ్యింది. నాకు ఒక రెండు సంచికలు పంపారు. అందులో ఒకటి కాలేజీకి తీసుకువెళ్ళి నామిత్రులకీ, మాతెలుగు లెక్చరర్ సుందరీమేడం కి చూపించాను. అందరూ సంతోషంగా అభినందించారు. అంతకు ముందు కాలేజీ మాగజైన్ల లో తప్పని సరిగా ఒక రచన ప్రచురితం అవుతున్నా ఇలా ఒక వారపత్రికలో నాపేరు చూసుకోవటం భలే సంతోషం కలిగింది. 

          ఈకథకూ ఒక నేపధ్యం ఉంది. కొడవటిగంటి కుటుంబరావు గారి కురూపి నవలలో కథానాయిక అందంగా ఉండదు. కాని ఎమ్మే చదివిందని రాసారు. అది చదివాక నిజమే కదా! కథానాయిక తప్పని సరిగా సకల సద్గణవంతురాలూ, సౌందర్యరాశి అయి ఉండాలా? ఈ ఆలోచనలతో మాకాలేజీలో నా సహాధ్యాయి అయిన ఒక మరుగుజ్జు అమ్మాయిని దృష్టిలో పెట్టుకుని పరాజిత కథని రాసాను.                                                       మొత్తంమీద మా కాలేజీ లో రచయిత్రిని ఐపోయాను. మిగిలిన రెండు కథల్నికూడా జ్యోతి పత్రికకి పోస్ట్ చేసాను. అవి నా వివాహం అయ్యాకే ప్రచురితం అయ్యాయి.

             మా మధ్య ఉత్తరాలు కొనసాగుతున్నాయి అయితే ఆయన రాసే ఉత్తరాల థోరణి కొంత మారింది. నేను చదువు ఒత్తిడి వల్లా వెంటనే రాయలేక పోయాను. అయినా యథా ప్రకారం నేను చదివిన పుస్తకాల గురించి, నేను విన్నా నేర్చుకున్న పాటలు గురించి కాలేజీ విషయాలూ, స్నేహితులు విషయాలూ రాస్తూనే ఉన్నాను. ఒక రోజు ఆయననుండి చాలా చాలా పెద్ద ఉత్తరం వచ్చింది అది చదువుతూ చదువుతూంటే భయకంపితురాలిని ఐపోయాను. చివరకు వచ్చేసరికి ఒక పెద్ద నిట్టూర్పుతో తేలిక పడ్డాను. ఇంతకీ అదేమిటంటే సెప్టెంబర్ 24 వతేదీ గురువారం రోజు సాయంత్రం ఆరు గంటల సమయం అకస్మాత్తుగా రోడ్లమీద  ఒగురుస్తూ, ఒకరినొకరు తోసుకుంటూ ప్రజలంతా పరుగులు తీస్తూ “గండిపేట తెగింది, పానీ ఆ రహా హై” అంటూ లక్షల సంఖ్యలో పరుగులు తీస్తూ జంటనగరాల్లోని అందరూ ఎత్తైన ప్రదేశాలకూ, ఇళ్ళపైకీ, డాబాలమీదకీ ప్రాణాల్ని పిడికిట్లో పట్టుకుని పైపైకి పల్లపు ప్రాంతం నుండేకాక అన్ని ప్రాంతాల నుండీ పరుగులు తీసారు. ఆ తోపులాటలో తొక్కిసలాట లో పరిగెత్తటం లో వాహనాలకింద పడి గాయాలపాలయ్యారు. ఏవీథిలో చూసినా జనప్రవాహాలే. చార్మీనారు పై శిఖరం వరకూ నీరు వచ్చేసిందని సుల్తాన్ బజార్ కొట్లు మునిగిపోయాయనీ చెప్పుకుంటూ పరుగులు తీస్తున్నారు. అంతకుముందు మూడురోజుల పాటు ఎడతెరిపి లేని వర్షాలతో హుస్సేన్ సాగర్, గండిపేట నిండిపోవటం ఒక భవనం కూలటం వలన వర్ధిల్లాలని చాలామంది చనిపోవటం వల్ల ఈ పుకారు ప్రజల్ని భయకంపితులను చేసింది.

             వీర్రాజుగారూ వాళ్ళు కూడా వాళ్ళింటి పైన డాబా పైకి ముఖ్యమైన వస్తువులతో చేరుకున్నారట.హైదరాబాద్ అంతటా సందట్లో సడేమియా అని లూటీలూ, దొంగతనాలూ, దోపిడీలతో అల్లకల్లోలం అయిపోయింది. నలభై నిముషాలు తర్వాత పోలీసులూ, ఆతర్వాత రేడియోలద్వారా అదంతా పుకార్లేనని పదేపదే ప్రకటనలు చేస్తే అందరూ ఊపిరి పీల్చుకున్నారట. అప్పట్లో వార్తల కి రేడియోనే ఆధారం. మాకు విజయవాడ రేడియో ప్రసారాలు వస్తాయి కనుక ఈ విషయాలు మాకు తెలియలేదు.        

             అప్పట్లోనే ఈసంఘటన ఆధారంగా వాసిరెడ్డి సీతాదేవి “పానీ ఆ రహా హై” అని మంచికథ  రాసింది. డిసెంబర్లో నా పుట్టినరోజు మరో వారం రోజులు ఉందనగా అనుకోకుండా నాకు వీర్రాజు గారినుండి పార్సిల్ ద్వారా లేత నిమ్మపండు రంగు ఫుల్ వాయిల్ చీర అందుకున్నాను. ఏదో తప్పనిసరి బాధ్యతగా ఇంట్లో ఏడాదికొకసారిి కొనే చీర  కాకుండా ఆత్మీయంగా అచ్చంగా నాకోసం అందుకున్న ఆ చీరతో ఆ ఏడాది నాపుట్టిన రోజు నాకు చాలా ప్రత్యేకం గా అనిపించింది. ఆ సంతోషాన్ని అక్షరాల్లో నింపి  రాజధాని నగరానికి ఓ లేఖని  పావురంలా ఎగరేసాను.


*****



నడక దారిలో --16

 నడక దారిలో-16-శీలా సుభద్రా దేవి


          ఇద్దరి మధ్యా లేఖలు పావురాలై ఎగరటం మొదలై ఆరునెలల పైనే అయ్యింది. కొత్త ఏడాది కొత్త ఊహలను ప్రోది చేసుకుంటూ అడుగు పెట్టింది. ఈ కొత్త సంవత్సరం నా జీవితంలో ఎన్నెన్ని మార్పులనో తీసుకువచ్చేలానే అనిపించింది. ఎన్నెన్ని  కొత్త అనుభవాలనో తొలి అడుగులోనే రుచి చూపిస్తూ కొంగ్రొత్త మలుపులను తీసుకు వచ్చేలానే ఉంది. అవి నాకు శుభసంతోషాలనే ఇస్తుందో , కష్టాల కడగండ్లు పాదాల ముందు పరుస్తుందో. అన్నింటినీ ఎదుర్కోగలిగే మనోబలాన్ని ఎప్పటికప్పుడు సమకూర్చుకుంటూనే ఉన్నాను.                   మామయ్య, అన్నయ్య ‘ఒకసారి విజయనగరం రమ్మని పెళ్ళి ఎప్పుడు ఎలా చేయాలో నిర్ణయించు కుందామని’ ఆయనకు ఉత్తరం రాసారు. ఉత్తరం అందగానే సంక్రాంతి, శని, ఆది వారాలు కలిసివచ్చేలా చూసుకుని రెక్కలు కట్టుకుని వచ్చారు.

          ఫిబ్రవరి 14 వ తేదీ ఆదివారం ఉదయం 8-30 గంటలకు మంచి ముహూర్తం ఉందని మామయ్య చెప్పారు. ముందు రోజు రెండవ శనివారము కనుక పెళ్ళికి వచ్చే వారికి వీలుగా ఉంటుంది కనుక అదేరోజు నిర్ణయించారు. పెళ్ళి విజయనగరంలోని ప్రముఖ బహుభాషావేత్త, పండితుడు, మా కుటుంబానికి సన్నిహితులు అయిన రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభా వివాహం చేసుకుని బంధుమిత్రులకు విందు ఇచ్చేలా నిర్ణయం చేసారు.పెళ్ళి తర్వాత హైదరాబాద్ కు నన్ను తీసుకువెళ్ళి అక్కడ  సాహితీ మిత్రులకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నానని ఆయన చెప్పారు

          ఇవన్నీ చాలావరకూ నాతో ఉత్తరాల్లో సంప్రదించినవే. అయితే మాత్రం ఉత్తరాల్లో అన్ని కబుర్లు చెప్పేసరికి  ఇంకేమీ చెప్పేందుకు ఏమీ లేదో ఏమిటో అన్నీ పొడిపొడి మాటలే. మా దగ్గరలో  ఏమనిషి గాలి అయినా ఉందనుకుంటే అత్తిపత్తి లా ముడుచుకు పోయే ఈ వ్యక్తి తర్వాత్తర్వాత నా మనసులోకి  రాకుండానే బయటే నిలబడిపోతారో ఏమిటో అని నా లోలోపల సంశయం మొలకెత్తింది. అలా అని సినీమాల్లోలా హత్తుకొనే వుండాలని కాదు గానీ నాకోసం నాదైన మనిషిగా  నాకు అవసరమైనప్పుడు భరోసాగా ఉండాలని కోరుకోవటం తప్పు కాదు. సంసారం అంటేనే ఒకరిమీద ఒకరికి గాఢమైన నమ్మకం అనీ ఆ నమ్మకం సడలకుండా చూసుకోవాల్సిన బాధ్యత దాంపత్య ముడితో ఒక్కటైన భార్యాభర్తలదే అని  నా ఉద్దేశ్యం.

        ఇంక అప్పుడప్పుడు ఒంటరిగా ఉన్న సమయంలో నాతో  పెళ్ళికి ఏమేమి కొనాలో, తర్వాత సంసారం లో ఏమిటి సమకూర్చుకోవాలో సంప్రదించారు.

          ఒకరోజు చిన్నన్నయ్య మా ఇద్దరినీ ఫస్ట్ షో సినిమాకు తీసుకువెళ్ళాడు. పుత్సల వీధిలో నడిచి వెళ్తున్నప్పుడు బహుశా ఆ వీధిలో ఉన్న బంధువుల చూపులన్నీ మా వెంట వెంటనే నడిచి శల్యపరీక్ష చేసే ఉంటాయి. సినీమా అయిపోయాక ఇద్దరం ఎత్తుగా ఉండే అక్కడి రిక్షాలో ప్రయాణం ఒక కొత్త అనుభవం కలిగించింది. తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి పది దాటింది. అన్నయ్యా, అమ్మా నిద్రపోయారు. గేటు తలుపు కొట్టినా లేవలేదు.ఆయన చటుక్కున గేటు ఎక్కి గోడ దూకి గేటు తీసారు. నేనూ, చిన్నన్నయ్య ఆశ్చర్యపోయాము. నా దగ్గర తన హీరోయిజం చూపించటానికి ఇలా చేసారా అని ముసిముసిగా నవ్వు కున్నాను.

          ఎవరూ దగ్గర్లో లేనప్పుడు అంటే అన్నయ్యలు సాయంత్రం బైటకు వెళ్ళినప్పుడు మాత్రం డాబా మీద సూర్యుడు చీకటి దుప్పటి కప్పుకునేవరకూ, చిరువెన్నెల తుప్పర్లలో తడుస్తూ కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళం. నేను పాడిన లలిత గీతాలు వినేవారు. పండుగ మూడురోజులూ నిముషాలలాగే గడిచిపోయాయి.

          ‘డిగ్రీ మూడవ సంవత్సరంకి హైదరాబాద్ లో ఏదైనా కాలేజీ లో చదవటానికి కుదురుతుందేమో స్నేహితులను  కనుక్కుంటాను’ అన్నారు కానీ ‘రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రెండుగా విభజన జరిగేలాగే కనిపిస్తుంది. అలా జరుగుతే మా ఆఫీసులో కూడా మార్పు వస్తుందేమో. అప్పుడు ఎక్కడ చదవాలనేది ఆలోచిద్దాం. అయితే నా దగ్గరే ఉండి చదువు కుంటేనే బాగుంటుంది.” అనే అభిప్రాయం వెలిబుచ్చారు..

          డిగ్రీ మూడవ సంవత్సరం హైదరాబాద్ లో చదవటానికి కుదురుతుందా’ అని మాకు ఫిజిక్స్ చెప్పే మా ప్రిన్సిపాల్ సీతాకుమారి గారిని అడిగాను. యూనివర్సిటీలు వేర్వేరు  కనుక అది కుదరదని, అందులోనూ హైదరాబాద్ లోని ఉద్యమం నేపధ్యంలో  అసలు కుదరదనీ, ఈ ఒక్క ఏడాది ఇక్కడే చదవటమే మంచిదని అన్నారు ఆమె.

        హైదరాబాద్ లో తెలంగాణా ఉద్యమం తీవ్రంగానే ఉందని,ప్రత్యేక తెలంగాణ ఉద్యమం హైదరాబాద్ నుండి గ్రామాలకు విస్తరిస్తున్న వైనం కొంత, కొంతగా తెలుసు కుంటున్న కొద్దీ మనసును దిగులు కమ్ముకుంది.

          ఆంధ్రాలోనూ విశ్వవిద్యాలయాల పరిధిలో అసహనాలూ ఆందోళనలూ అప్పుడప్పుడు రాజుకుంటున్నా ఎక్కువగా తీవ్రతరం కాలేదు.

          ఈ పరిస్థితుల్లో యూనివర్సిటీ మారటం మంచిది కాదనే మిత్రులు అభిప్రాయం వెలిబుచ్చారు. ఆయనతో’ ‘ ఒక యూనివర్సిటీ కాలేజీలో చదువుతూ మరో యూనివర్సిటీ కాలేజీలో తర్వాతి సంవత్సరం చదవటానికి వీల్లేదట’ అన్నాను. అది నిజమేనని అందరూ చెప్పారు. ఇక మూడవ సంవత్సరం విజయనగరం లోనే చదవటం తప్పదేమో. అయితే పెళ్ళయ్యాక కూడా అన్నయ్యల మీద నా చదువు భారం పడకూడదని భావించాను. అందుకు ఆయనకూడా అవసరమైన డబ్బు పంపుతానని అన్నారు కానీ పెళ్ళయ్యాక కూడా మరో ఏడాది దూరంగా ఉండటానికి నా మాట తీసేయలేక ఆయన అతి కష్టం మీద ఒప్పుకున్నారు

          ఫస్ట్ ఇయర్ లోనే పెళ్ళిచేసుకుని చదువు మానేసిన నా సహాధ్యాయి సూర్యకాంతం పరిస్థితి నాకు రాకుంటే చాలు అనుకున్నాను.

          రెండు సంవత్సరాల క్రితం ఏర్పడిన ‘తెలుగు అకాడమీ’ మెంబర్లు ఆ ఏడాది నుండి కొత్తగా మొదలైన  తెలుగు మాధ్యమం కి అవసరమైన ఇంటర్ పుస్తకాలు తెలుగులో ప్రచురించాలని వాటికి చిత్రాలు వేయాలని ఆయనని అడిగారట. అవి వేస్తే డబ్బులు వస్తాయని,పెళ్ళి ఖర్చులకు ఉపయోగ పడుతుందని సంబరంగా అన్నారు. అందుకని ఇంకా ఉండాలని ఉన్నా వెళ్ళక తప్పదని తిరిగి హైదరాబాద్ బయల్దేరారు. వెళ్ళేటప్పుడు యథాప్రకారం నేను రాయటానికి అశ్రద్ధ చేస్తానేమోనని ప్రతీ వారం ఉత్తరం రాయమని చెప్పి కవర్లు కూడా కొని ఇచ్చారు.

          మళ్ళా యథాప్రకారం నేనూ, నా కాలేజీ చదువు మొదలైంది.పెళ్ళి సమయంలోనూ, ఆతర్వాత హైదరాబాద్ కి వెళ్తే చదువు కుదరదని ఈలోపునే నోట్స్, రికార్డులు పూర్తి చేయటం హడావుడిలో పడిపోయాను.

          హైదరాబాద్ నుండీ పెద్దపెద్ద రెక్కలతో ఎగిరొచ్చిన పావురాలు ప్రతీ వారం ఒలకబోసిన అనురాగాల మూటలు నా దోసిట్లో తొణికిసలాడుతూనే ఉన్నాయి.

        అన్నింటికీ సమయం సమకూర్చుకోలేక సంగీత కళాశాలకు వెళ్ళటం మానేసాను. ఒకరోజు అక్కయ్య దగ్గర నుండి వచ్చిన ఉత్తరం నాకు మరింత కంగారు తెచ్చిపెట్టింది.

“నువ్వు చదువు మధ్యలో పెళ్ళి చేసుకుంటున్నావు. చదువు మానేసే ఉద్దేశం ఉందా? ఒకవేళ గర్భం వేస్తే అప్పుడైనా మానేయాల్సి ఉంటుంది. చదువు పూర్తి అయ్యేవరకూ పిల్లలు వద్దనుకుంటే సూర్యారావు మామయ్య కూతురు డాక్టర్ కదా ఆమె సలహా ముందుగానే తీసుకో. వీర్రాజుతో ఈ విషయం సంప్రదించి నిర్ణయించుకో” అని రాసింది అక్కయ్య. ఈ విషయం ఇంతకు ముందు ఆలోచించనే లేదే అనుకున్నాను. వెంటనే ఆయనకి ఈవిషయం రాస్తే ఆయనకూడా నా ఆలోచనను సమర్థించారు. నేను మామయ్య కూతురు కి ఉత్తరం రాసాను.ఆమె వెంటనే సమాధానం రాసింది. బహిష్టు తర్వాత ఆరవరోజు రాత్రి  నుండి ఇరవైఒక్క రోజులు రోజుకొక మాత్ర చొప్పున వాడి ఆపేయాలనీ, తర్వాత రెండోరోజు మామూలుగా బహిష్టు వస్తుందనీ, ఈ రకంగా అవసరమైనంత కాలం వాడవచ్చని చెప్పింది. వివాహం తర్వాత విజయనగరం వచ్చేస్తే మరి వాడఖ్ఖరలేదని, నీభర్త వచ్చిన నెల మాత్రం మళ్ళా వాడమని చెప్పి ప్రిస్క్రిప్షన్ రాసి పంపింది. ఆ మాత్రలు వాడుతున్నప్పుడు కడుపులో తిప్పినట్లుగా ఉండొచ్చు అటువంటప్పుడు చప్పరించే సి-విటమిన్ మాత్రలు కూడా వాడమని రాసింది. ఆ ప్రిస్క్రిప్షన్ ను వీర్రాజుగారికి పంపాను. వెంటనే కొని పార్సిల్ లో పంపారు.

          అటు హైదరాబాద్ లోనూ,ఇటు విజయనగరం లోనూ నిముషాలు గంటలుగా, గంటలు రోజులుగా  పొడవుగా సాగిపోయాయో ఏమిటో  ఎదురు చూస్తున్న రోజు ఎంతకీ రానట్లే అనిపించింది.

*****



17, ఏప్రిల్ 2022, ఆదివారం

సహృదయ విమర్శకులు రామమోహనరాయ్

 ~ సహృదయ విమర్శకులు రామ్మోహన రాయ్ ~


       కడియాల రామ్మోహన రాయ్ 1944, ఏప్రిల్ 11న గుంటూరు జిల్లా, మేడికొండూరు మండలం, సిరిపురం గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి కడియాల భద్రయ్య నాస్తికుడు, హేతువాది, సాహిత్యాభిలాషి, కమ్యూనిస్టు పార్టీ అభిమాని కావటంతో ఆయన ప్రభావం వలన హేతువాదం, నాస్తికత్వం, మార్క్సిజం దృక్పథం గల రామ్మోహన రాయ్ సాహిత్యమూ,రచనలూ కూడా అదే పంథాలో సాగాయి.

           రామ్మోహన రాయ్ మృదుస్వభావి కావటాన ఎప్పుడూ కఠినంగా, పరుషంగా మాట్లాడరు.తాను చదివిన రచన నచ్చినప్పుడు ఆ రచయితగా నీ,కవిగానీ వయస్సులనూ,పాతకొత్తలను ఎంచకుండా ఫోన్ చేసి అభినందించే నైజం ఆయనది.

      యువ కవులకు ఆధునిక సాహిత్యం పట్ల అవగాహన కల్పించే పెద్ద బాలశిక్ష గా 'తెలుగు కవితా వికాసం' గ్రంథాన్ని చెప్పుకోవచ్చు.

వర్తమాన కవిత్వంపై గల అభిమానంతో ప్రచురితమైన కవిత్వాన్ని, కవితా సంపుటాలను ప్రతీ ఏడాదీ శ్రధ్ధగా చదవటమే కాకుండా విశ్లేషణ చేస్తూ చాలా కాలంపాటు వ్యాసాలు రాశారు.

         కవులూ,రచయితల పట్ల నిష్పక్షపాతంగా రచనలను ఆసాంతం చదివి తన అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేసేలా వ్యాసాలు రాసే సహృదయ విమర్శకులు రామమోహనరాయ్.

         సాహిత్యం పట్ల చక్కని అభిరుచి కలిగేలా పన్నెండు విమర్శగ్రంధాలను సాహిత్య లోకానికి అందించిన ప్రముఖ సాహితీవేత్త.అంతే కాక అనేక అముద్రిత సాహిత్య వ్యాసగ్రంథాలు కూడా ఉన్నాయి.అవికూడా గ్రంథం రూపంలో వస్తే విమర్శకులకు మార్గదర్శకంగా ఉంటుంది.

     సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీ ప్రచురించిన ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ లిటరేచర్ లో రామ్మోహన రాయ్ గారు రాసిన 28 వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

         కడియాల రామ్మోహన రాయ్ ప్రాచీన, ఆధునిక సాహిత్యాలలో లోని సాహిత్యవిమర్శను పరామర్శిస్తూ సుదీర్ఘమైన,సవివరణాత్మకంగా రాసిన "మానసోల్లాసం"కవిత్వం,నవలా,నాటకం, వ్యాసం మొదలైన సాహిత్యప్రక్రియలపై విమర్శ చేయాలంటే విమర్శకులకు గురుతరమైన బాధ్యతను తెలియజేసే విధంగా రాసిన గ్రంథం.450 పేజీలు గల ఈ గ్రంథంలో 1966-2016 వరకూ అనగా అర్థశతాబ్ది తెలుగు సాహిత్యవిమర్శకు చెందిన అమూల్యమైన వ్యాసాలు తెలుగును ప్రధాన భాషగా అభ్యసించే విద్యార్ధులకూ, పరిశోధకులకు మాత్రమే కాకుండా విమర్శకులకు కూడా రిసోర్స్ పుస్తకంగా ఉపయుక్తంగా ఉంటుంది.సాహిత్యవిమర్శ ఒక కళ అని ప్రతిపాదించిన ఈ గ్రంథాన్ని ద్రావిడ విశ్వవిద్యాలయం ప్రచురించి సాహితీవిమర్శకు ఒక దారిదీపంగా అందించింది.అందుకే ఆచార్య ఈడిగ సత్యనారాయణ గారు " పద సౌష్టవం,అర్థగాంభీర్యం కలిగి మానసోల్లాసానికి అద్దం పడుతున్న ఈ వ్యాస సంపుటి సాహిత్యలోకానికి కడియాల రామ్మోహన్ రాయ్ గారు అందించిన అపురూపమైన కానుక గా అభినందించారు.

            తెలుగు నవలశతజయంతి సందర్భంగా1972 లో విజయనగరం మహారాజావారి సంస్కృతాంధ్ర కళాశాలలో "నూరేళ్ళ తెలుగు నవల తీరుతెన్నులు" అనే అంశం గురించి ప్రసంగించమని గూడపాటి సాంబశివరావు గారు కోరగా రామ్మోహన రాయ్ అప్పట్లో వచ్చిన గ్రంథాలను అధ్యయనం చేసారు.తెలుగు నవల లక్షణాలూ,స్వరూపస్వభావాలే కాక భాషా పరిశీలనలో భాగంగా వివిధ మాండలీకాలను,వర్గ మాండలికాలనూ పరిశీలించటమే కాకుండా వివిధ ప్రాంతాల సాహిత్య మిత్రులతో కూడా సుదీర్ఘ చర్చలు జరిపారు.

         తెలుగు నవలలు(1872-2010) వరకూ నవలా ప్రారంభం, పరిణామక్రమం,సమాజంపై ఆయా నవలలు కలిగించిన ప్రభావం ప్రాతిపదికన తెలుగు లోని అత్యుత్తమమైన వంద నవలల గురించి అధ్యయనం చేసి రచించిన గొప్ప పుస్తకం " మన తెలుగు నవలలు"

          ఒక జాతి సంస్కృతి నీ, తెలుగు ప్రజలజీవనవిధానం, తెలుగు జాతి చరిత్ర,సమాజం, పరిణామక్రమంలో ప్రజల ఆలోచనల్లో వచ్చిన మార్పులు,సమాజంలో సమూలమైన మార్పులకు కారణమైన సామాజిక సంఘటనలను సాహిత్యం ఏవిధంగా ఒడిసిపట్టి ప్రతిబింబించింది మొదలైనవన్నీ ఈ నవలల ద్వారా తెలుస్తాయని రామ్మోహన రాయ్ ఈ వ్యాసాల్లో ప్రస్తావించారు.

               వివిధ తెలుగు ప్రాంతాల్లోని ప్రజలభాషలోని జాతీయాలూ,సామెతలూ,పలుకుబళ్ళూ రచయితలు వ్యక్తీకరించిన విధానాన్ని వివిధ రాజకీయ, ఆర్థిక,సామాజిక పరిస్థితులకు రచయితల ప్రతిస్పందన సాహిత్యం ద్వారా తెలియజేయడాన్ని రామ్మోహన రాయ్ గారు ఇందులో చూపించారు.

                సాహిత్యం లో 1872 నుండివ2010 వరకు వచ్చిన వివిధ వాదాలను ఆయా కాలంలో రచయితలు ప్రస్తావించిన విధానాన్ని ప్రశంసించారు.

                కర్నూలు లో డిప్యూటీ కలెక్టర్ గా ఉన్న నరహరి గోపాలకృష్ణమ సెట్టి రచించి ప్రచురించిన "శ్రీ రంగరాజు చరిత్ర (క్రీ.శ. 1872) " నే మొదటి నవలగా వీరు ప్రస్తావించారు.అయితే అప్పటికి నవల అని కాక నవీన ప్రబంధం అన్నారని పేర్కొన్నారు. వీరేశలింగం గారు తన స్వీయచరిత్ర ము లోకూడా శ్రీ రంగరాజు చరిత్ర గురించి చెప్పక పోయినా ఈ రెండింటిలో గల పోలికలు ఈ గ్రంథాన్నిి వీరేశలింగం గారు చదివారనేది తెలుస్తుందని శ్రీ కొత్తపల్లి వీరభద్రరావు గారు తెలిపారనేవిషయాన్ని రామ్మోహన్ రాయ్ తో వ్యాసం లో ప్రముఖంగా పేర్కోన్నారు.

                ఈ విధంగా తెలుగులోన ఆణిముత్యాలు లాంటిి వంద ప్రముఖ నవలల గురించి రామ్మోహన్ రాయ్ గారు రాసిన వ్యాసాలు మన నవలా సాహిత్యం ప్రాముఖ్యత,ఆయా నవలాకారుల ప్రతిభా పాటవాలను తెలియజేసేలా ఉన్నాయి.138 ఏళ్ల తెలుగు ప్రజల సాహిత్యం, సంస్కృతినీ తెలుసు కోవటానికి ఒక గొప్పగ్రంథంగా రామ్మోహన రాయ్ గారి " మన తెలుగు నవలలు"ఉపయోగ పడుతుంది.

                ఇటీవల రామ్మోహన రాయ్ గారు ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడి మీ కవిత్వం మీద సమగ్రమైన వ్యాసం రాయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను" అన్నారు. కానీ నేనే ఈ విధంగా వారికి శ్రద్ధాంజలిగా రాయవలసి వచ్చినందుకు బాధపడుతున్నాను.

3, మార్చి 2022, గురువారం

నడక దారిలో --14

 నడక దారిలో—14

       జూన్ నెల 1970 లో ఒకరోజు మాచిన్నన్నయ్య కొత్తగా విడుదల అయిన స్వాతి మాసపత్రిక ప్రారంభ సంచిక తీసుకు వచ్చాడు.అంతకు ముందు, జ్యోతి,యువ మాసపత్రిక లో మాదిరిగా అదే సైజు లో అందమైన బాపు ముఖచిత్రంతో ఆకర్షణీయంగా ఉంది. తర్వాత ఆ చిత్రాన్నే స్వాతి లోగో లా వాడుతున్నారు.అందులో అప్పట్లోని సాహితీ ప్రముఖులరచనలతో సాహిత్యం పట్ల ఇష్టం ఉన్న వారికి ఆనందం కలిగించి హృదయానికి హత్తుకునేలా రచనలు ఉన్నాయి.

     కుమారీ వాళ్ళఅన్నయ్య ఇంటింటి గ్రంథాలయం కోసం తెచ్చిన పుస్తకాల్లో శీలా వీర్రాజు గారు రాసిన “ కాంతిపూలు” నవల కనిపెంచితే తీసుకు వచ్చి ఏకబిగిన చదివేసాననీ ఆ నవలపై అభిప్రాయం రాసుకున్నానని ఒకసారి చెప్పాను కదా. .అక్కయ్య ఇంట్లో మబ్బుతెరలూ, సమాధి పుస్తకాలు చదివినప్పటి నోట్స్ ఒకసారి తీసాను.

స్వాతిలో గౌరవసంపాదకునిగా శీలా వీర్రాజు పేరు చూసి ఆయన రచనలపై నా అభిప్రాయం రాస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాను.మర్నాడు కాలేజీకీ వెళ్ళినప్పుడు ఉషని సలహా అడిగాను”పాఠకురాలిగా రాయటంలో తప్పేముంది?” అంది.

“తప్పులేదు కానీ శీలా వీర్రాజు నా మేనత్త కొడుకు.నేనని తెలుస్తే బాగుండదేమో”అన్నాను ఆలోచిస్తూనే.

     “అలాగా ఐతే వేరే పేరుతో రాయు” ఆశ్చర్యపోతూనే అంది.

    “ అన్నయ్య పేరు ,ఊరూ చూసి గుర్తు పట్టొచ్చుకదా”

    “మా ఇంటి అడ్రస్ ఇవ్వు” .

    “సరే చాలా చాలా థేంక్స్ ఉషా “అని సంతోషంతో పొంగిపోతూ KS దేవి పేరు తో ఉత్తరం రాసి పోస్టు చేసాను.అంతకు ముందు ఎందరివో ఎన్నో రచనలు చదివాను.చదివిన వాటికి నోట్స్ రాసుకున్నాను.కానీ ఎప్పుడూ ఎవరికీ ఉత్తరం రాయలేదు.ఇప్పుడే ఎందుకు రాయాలనిపించిందో కూడా చెప్పలేను.

       నేను కాలేజీలో చదువుతున్నరోజుల్లోనే యద్దనపూడి సులోచనారాణి నవలలు జ్యోతి మాసపత్రిక లోనూ , ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్స్ గా వచ్చేవి.గురువారం వచ్చే వారపత్రికలో సులోచనారాణి జీవన తరంగాలు కోసం లైబ్రరీ కి అమ్మాయిలంతా క్యూ కట్టేవారు.గార్డెన్ లోనో,హాస్టల్ రూమ్స్ లోనో అంతకుముందే చదివినవారిదగ్గర చేరి కథ వినేవారు.ఆరోజుల్లో కాలేజీ అమ్మాయిలు సులోచనారాణిని ఆరాధించేవారు.ఆనాటి అమ్మాయిల కలలరాణి సులోచనారాణి తో నేను తర్వాత రోజుల్లో కలిసి సమావేశాల్లో పాల్గొన్నాను.

      ఒకరోజు కాలేజీ నుండివచ్చి పుస్తకం చదువుకుంటుంటే ఉషా వచ్చింది”రోజంతా కాలేజీలో కలిసే ఉంటారు.మళ్ళా కబుర్లు ఏమిటో” అన్నయ్య బైటికి వెళ్తూ అన్నాడు.

ఎప్పటి లాగె ఉషాని తీసుకుని డాబా మీదకి దారితీసాను.

        శీలా వీర్రాజు గారి “హృదయం దొరికింది” అందుకున్నాను.దాంతో బాటు సమాధానం కూడా.

ఎంత ఆశ్చర్యం కలిగిందో! కాసేపు ఆవిషయమే మాట్లాడుకున్నాం.”నా ఉత్తరాలు మీ అడ్రస్ కి రావటం నీకేమీ ఇబ్బంది లేదుకదా”అని అడిగాను.ఉషాఅన్నయ్య వేరే ఊర్లో చదువుతున్నాడు.వాళ్ళనాన్న ఇల్లుపట్టించుకోడు.వాళ్ళమ్మకి నా విషయం చెప్పిందట.అందుకే ఉత్తరాన్నిఆమె తీసి జాగ్రత్తచేసి ఉష కాలేజీ నుండి రాగానే ఇచ్చింది.

   ఆ రాత్రి లోపున హృదయం దొరికింది పూర్తి చేసాను.కవిత్వం లో కథ రాయటం వింతగా ఆసక్తికరంగా అనిపించింది.అంతకుముందు గురజాడ కన్యకా,పూర్ణమ్మ,లవణరాజు కాలం గేయకథలు తెలుసు. శ్రీశ్రీ ముసలమ్మ మరణం కథాత్మక శైలిలో రాసినకవితా చదివాను.కానీ ఆధునిక జీవితాన్ని ఇలా వచనకవితా కథగా రాసినది చదవటం కొత్తగా అనిపించింది.

మాస్కూలు లిఖిత పత్రికకు పది ద్విపద ఛందస్సుపద్యాలతో ‘ నాబొమ్మే నా చెల్లి” అని రాసినది కూడా కథాత్మక పద్యమే అన్నమాట అని నాలో నేను భుజాన్ని తట్టుకున్నాను.

బహుశా అప్పుడే నాకు తెలియకుండానే నా మెదడులో దీర్ఘ కవితలు రాయాలనే బీజం పడిందేమో మరి.

వెంటనే నామనసులో కదిలిన ఈ ఆలోచనలనన్నింటినీ వీర్రాజు గారికి ఉత్తరంగా రాసాను. మళ్ళా ఓవారానికే ఉత్తరం తో పాటూ” కొడిగట్టిన సూర్యుడు”నాదోసిట్లో ఉదయించాడు.

నేను చదివిన పుస్తకాలు గురించి,నాకు ఇష్టమైన లలిత సంగీతం గురించి,నేను వేసే బాపూ బొమ్మల గురించి కూడా రాసేదాన్ని.సాహిత్యం గురించి నా ఆలోచనలు పంచుకునే మిత్రునిగా ఎంచి రాస్తుండే దాన్ని.నా ‘ఉత్తరాలు తన స్నేహితులు చదివి చాలా బాగా రాస్తుంది ఆ అమ్మాయి అని మెచ్చుకున్నారు' అని రాస్తే నాకు కోపం వచ్చింది.పర్సనల్ గా వచ్చిన ఉత్తరాలు ఎంత ఆత్మీయ మిత్రులు అయినావాళ్ళు ఎలా చదువుతున్నారు అని.

ఒక సారి “వైజాగ్ వైపు రావాల్సిన పని ఉందని’’ రాసారు.

“ఇక్కడ బంధువులు ఉన్నారా,”అన్న నా ప్రశ్నకు “ఉన్నారు కానీ వాళ్ళకీ మాకూ సంబంధాలు లేవు”అని రాసారు. “అప్పుడు నేను ఇంకా ఊరుకోలేక నేను “ లీలా మోహనరావు చెల్లెల్ని” అని బయట పెట్టాను.

“ నిజమా.ఇంత చిన్న చెల్లెలు ఉందని నాకు తెలియదు” అని బోల్డంత ఆశ్చర్యం వెల్లడించారు.

తర్వాత తన ఫొటో పంపి “నీకు ఇష్టమైతే వివాహం చేసుకుందాం”అని రాసారు.

నేను వెంటనే సమాధానం రాయలేదు.నాకు వివాహం కన్నా చదువు ముఖ్యం అని. అనుకున్నాను.

ఆయన మళ్ళీ మరో ఉత్తరం రాసారు.నేను అదే చెప్పాను”వివాహం అయినా నువ్వు అక్కడే ఉండి చదువు పూర్తి చేసుకుని హైదరాబాద్ రావచ్చు” అన్నారు.

నేను ఆలోచనలో పడ్డాను.

అమ్మకు మెల్లగా విషయం చెప్పాను.

అమ్మ “నీకు చెప్పలేదు కానీ ఆ మధ్య వాళ్ళమ్మ పోయినప్పుడు పెద్ద మామయ్య వాళ్ళని పరామర్శించడానికి హైదరాబాద్ కి వెళ్ళినప్పుడు అతని పెద్దచెల్లెలితో నీవిషయం ప్రస్తావించారు.అయితే ఆమె సానుకూలంగా మాట్లాడక పోవటమే కాక తన చెల్లెలిని చిన్నన్నయ్యకి చేసుకోమని అడిగిందట.నేను ఒకటి ఆడుగుతే దాని గురించి మాట్లాడక మరొకటి అడుగుతుందని మామయ్యకి కోపం వచ్చి మాట్లాడకుండా వచ్చేసాడు.నువ్వు ఆలోచించుకుని మరీ ముందుకి వెళ్ళు” అంది.

పెద్దక్కయ్యకు ఉత్తరం రాసి సలహా అడిగాను.

“సాహిత్యం మీద మోజుతో మాత్రం నిర్ణయం తీసుకోకు.అతని తోబుట్టువులంతా నీకంటే పెద్దవాళ్ళే.వాళ్ళందరినీ మెప్పించి సమర్థవంతంగా నీ వ్యక్తిత్వం నిలుపుకోగలవా ఆలోచించి అడుగెయ్యు.మీ ఇద్దరికీ పది పదకొండేళ్ళ వయసు తేడా ఉంటుందనుకుఃటాను.చూచి అన్ని విధాలుగా ఆలోచించుకుని చేసుకోవాలనే అనుకుంటే అతన్ని ఒకసారి రమ్మను. , ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకోకుండా మాత్రం నిర్ణయించు కోవద్దు. ” అని ఉత్తరం రాసింది అక్కయ్య.

ఈ లోగా అమ్మ అన్నయ్య లకు కూడా చెప్పింది.

నాకు ఏంచెయ్యాలో తోచలేదు.పెళ్ళి జరిగాక చదువు కొనసాగించేదెలా?చదువూ,ఉద్యోగం,నా కాళ్ళమీద నేను నిలబడాలి అని మిత్రులతో అన్ని కబుర్లు చెప్పినదాన్ని ఇలా తొందరపడుతున్నానా?అక్కయ్య అన్నట్లు ఆ యింట్లో నా ఆశలూ,ఆశయాలూ సాకారంచేసుకోగలనా? సాహిత్యం మీద నాకున్న ఆసక్తి నన్ను ఈవిధంగా బలహీనపరుస్తుందా?అన్నయ్యలు మీద నా బరువు బాధ్యతలు ఎన్నాళ్ళు మోపాలి? ఆయనే నన్ను చేసుకుంటానంటే ఒప్పుకోవటం మంచీదేకదా.ఎడతెగని ప్రశ్నలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.రోజులు గడిచి పోతున్నాయి.నేను సమాధానం ఇవ్వలేదు.

అమ్మ ఒకరోజు మళ్ళా ప్రశ్నించింది.”రమ్మని రాస్తున్నావా,ఏమిటి నిర్ణయించుకున్నావు అని.

మర్నాడు కాలేజీలో ఉషకి ఈ విషయాలన్నీ చెప్పి తనని కూడా సలహా అడిగాను.కాలేజీనుండి వస్తున్నప్పుడు దార్లో పోస్టాఫీసు కు వెళ్ళి ఒక కవరు కొనుక్కున్నా


25, ఫిబ్రవరి 2022, శుక్రవారం

నడక దారిలో--12

 నడక దారిలో--12


           నేను పీయూసి చదువుతున్న రోజుల్లోనే ఒక రోజు అకస్మాత్తుగా మా చిన్నక్కని హాస్పిటల్ లో చేర్పించినట్లు కబురు వచ్చి అమ్మ కంగారుపడి హడావుడి గా వెళ్ళింది.అందరం ఏమైందో నని గాభరా పడ్డాం.తీరా అమ్మ బొజ్జలో హాయిగా బజ్జోకుండా తొందరపడి రెండునెలలు ముందుగానే ప్రపంచాన్ని చూసేయాలని బుజ్జిబాబు బయటకు వచ్చేసాడని తెలిసింది.ఐతే మరికొంత కాలం డాక్టర్లు పర్యవేక్షణలోనే ఉంచి డిశ్చార్జి చేసాక కోరుకొండ సైనిక స్కూల్ లోని వాళ్ళింటికి తీసుకు వెళ్ళిపోయారు.అమ్మ కొన్నిరోజులు అక్కడకి వెళ్ళవలసి వచ్చింది.కోరుకొండలోని స్వచ్ఛమైన గాలి, పచ్చని వాతావరణం,ఫార్మ్ లో పండిన కూరగాయలు, పండ్లు, అక్కడి డైరీ పాలూ వీటన్నింటి వలన తొందరగానే బాబు ఆరోగ్యాన్ని పుంజుకొన్నాడు.

           నాకు కాలేజీ లేకపోవటాన అప్పుడప్పుడు నేను అక్కకి సాయంగా వెళ్ళేదాన్ని.అక్కడికి వెళ్ళినప్పుడు అక్కమిత్రుల ఇంటికి తీసుకు వెళ్తే వాళ్ళ కుట్టు మిషను పై బాబుకి చిన్న చిన్న జుబ్బాలు చిన్న బొంతలు వంటివి కుట్టేదాన్ని.

           మా ఇంట్లో రెండు గదుల్లో అన్నయ్యలు చదువుకోవటమో రాసుకోవటమో చేసుకుంటుండగా, వరండాలో అమ్మ ఏదో పనిచేసుకుంటూ ఉండేది.అమ్మకి సాయం చేయాల్సినవి చేసి తర్వాత నేను డాబా మీదగానీ డాబామెట్లమీద గానీ కూర్చుని పుస్తకాలు చదువుకుంటూనో, బొమ్మలు వేసుకుంటూనో,లేదా రాగాలు తీస్తూనో ఉండే దాన్ని. అందువల్ల మాఇంట్లో అందరూ ఎవరి అరల్లో వాళ్ళు ఉండటంవలన ఎప్పుడూ నిశ్శబ్దం మౌనంగా తపస్సు చేస్తున్నట్లుగా ఉండేది.ఎప్పుడైనా చిన్నక్క వచ్చినప్పుడు మాత్రం బుజ్జిబాబు కేరింతలతో ఇల్లంతా చిలుకలు వాలిన చెట్టై నాకెంతో సంబరంగా ఉండేది.        

     నాకు దొరికిన విరామసమయంలో ఇష్టమైన మరో అభిరుచి బొమ్మలు వేయటం .చిన్నన్నయ్యని ఇండియన్ ఇంక్ కొనమని అడిగి చిన్నప్పటి నుంచి నాకు ఖాళీ సమయం దొరికితే స్నేహితుల పుట్టినరోజులకో పండుగలకు ఇవ్వటానికో గ్రీటింగ్ కార్డులు తయారుచేసి ఉంచేదాన్ని.

         నాకు పత్రికలలో సీరియల్స్ కి బాపు వేసిన చిత్రాలు చూసి వేయటం చాలా ఇష్టంగా ఉండేది.అలా వేసినవి పోయినవి పోగా కొన్ని మాత్రం ఇప్పటికీ మిగిలాయి.

          అన్నయ్య లైబ్రరీ నుండి పుస్తకాలు తీసుకువచ్చేవాడు.అన్నయ్య గది శుభ్రం చేయటానికి వెళ్ళి ఆ పుస్తకాలు తీసుకుని చదివి అన్నయ్య వచ్చే సమయానికి యథాస్థానంలో పెట్టేసే దాన్ని.ఒకసారి అలా తీసుకు వచ్చిన జయదేవుని గీతగోవిందం టీకా తాత్పర్య సహితము గా ఉన్నది చదివాను. అందులోని అష్టపదులన్నీ ఒక పుస్తకం లో రాసుకున్నాను.అవి చదివినప్పుడు అష్టపదులన్నీ శృంగార భావనతోనే ఉంటాయి కదా అటువంటప్పుడు వాటిని భక్తి పాటలుగా ఎలా పరిగణిస్తారు అని అనుకున్నాను.

     అందులోని ఒక అష్టపదిలో నాయిక ప్రియుని కొరకు ముస్తాబై ఎదురుచూస్తూ అతడు ఎంతకు రాకపోవటంతో దుఃఖోద్వేగంతో అలంకరించుకున్న ఆభరణాలన్నీ తీసి విసిరికొడుతుందనీ,అప్పుడు ప్రియుడు వచ్చి ఒక్కొక్క ఆభరణాన్నీ తిరిగి అలంకరించటాన్నీ ఒక్కో చరణంలో జయదేవుడు వర్ణించాడు.అది నాకు చాలా నచ్చి అష్టపది లోని ఎనిమిది చరణాలకూ ఎనిమిది చిత్రాలు వేసాను.అప్పటివరకూ బాపూ చిత్రాలు చూసి వేసినా ఇవి మాత్రం స్వంతంగానే వేసేంతగా ఆ అష్టపది నామనసులో అంతగాఢంగానూ రూపు కట్టింది.కానీ అందులో కొన్ని చిత్రాలు ఎందువల్లనో అసంపూర్తిగా వదిలేసాను.ఈ లోపున పరీక్ష పాసవటం తిరిగి కాలేజీ లో చేరటం ఒకకారణం అయ్యుండొచ్చు.ఇంతకీ ఆ అష్టపది ఏమిటో మాత్రం ఇప్పటికీ అసలు గుర్తు రావటం లేదు.

                    బాపూ బొమ్మలే కాక కొన్ని వడ్డాది పాపయ్య చిత్రాలు కూడా వేసాను. బాపూ చిత్రాలు కేవలం రేఖా చిత్రాలు గా వేసేందుకు వీలుగా ఉంటాయి.కానీ వపా చిత్రాలు రంగులమేళవింపుతోనే అందగిస్తాయి.రేఖాచిత్రం గా వేసి ఆపితే బాగుండవు.అందుకే వడ్డాది పాపయ్య చిత్రాలు తక్కువగా వేసాను.

               తర్వాత్తర్వాత చిత్రాలు వేసే తీరిక లేకపోయింది.వివాహానంతరం వీర్రాజు గారు వేస్తుంటే ఉత్సాహం వచ్చేది కానీ తీరికగా కూచుని వేసేంత వెసులుబాటు నాకు ఉమ్మడి సంసారంలో కలగలేదు.

                  నా బాల్య స్నేహితురాలు కుమారీ ఆడబడుచు బియీడీ చదువు తున్నప్పుడు మాయింటికి వచ్చి "నువ్వు బొమ్మలు బాగా వేస్తావని వదిన చెప్పింది.నాకు చార్టులు వేయవా" అని అడిగింది.సరే అని వప్పుకుని తీరిక చేసుకుని వేసాను.ఆమెకు వేసిన చార్టులు చూసి బియీడీ ట్రైనింగు అవుతున్న విద్యా ర్థినులు మరికొంత మంది వచ్చి డబ్బులు ఇస్తాం వేసిపెట్టమని బతిమాలారు.

                       ఇంటి పనులయ్యాక తీరిక చేసుకుని ఆ ఏడాదేకాక రెండేళ్ళపాటూ చాలా మందికి చార్టులే కాక వాళ్ళు చెప్పే పాఠాలికి మోడల్స్ కూడా చేసి నా చేతి ఖర్చు కి కాసిన్ని డబ్బులు సంపాదించాను.అదే నా మొదటి సంపాదన.తర్వాత కుటుంబ బాధ్యతలు,పిల్లలు అనారోగ్యం ,చికాకులు తో అదీ ఆగిపోయింది.

                  ఇంక పేపర్లమీద మానేసి ఎప్పుడైనా చీరల మీదో,పాప ఫ్రాకులమీదో ఫేబ్రిక్ డిజైన్లు కి పరిమితమైపోయింది నా చిత్రలేఖనం.

                   నా బాల్య మిత్రులు ఎవరైనా ఫోన్ చేస్తే మొదటిగా అడిగే. ప్రశ్న " చిన్నప్పుడు చిత్రాలు వేసేదానివి.ఇప్పడూ వేస్తున్నావా"అనే.ఇటీవల ఒక బాల్య మిత్రుడు తన దగ్గర ఎప్పుడో నేను వేసిన గ్రీటింగ్ కార్డులు వాట్సప్ లో షేర్ చేసేడు సుమారు నలభై ఏళ్ళకు పైగా భద్రంగా అతను దాచినందుకు ఎంత ఆశ్చర్యం వేసిందో.            

               చిత్రలేఖనం వంటి కళలను జీవితాంతం కొనసాగించటం మహిళలకు కష్టమే.అందుకు తగిన ప్రోత్సాహం,సమయం ,వాతావరణం అన్నీ అనుకూలించాలికదా.            

               అందుకేనేమో మన తెలుగుపత్రికల్లో కథలకి చిత్రాలు వేసేవాళ్ళల్లో మహిళలు లేరు.ఒక్క రాగతిపండరి మాత్రం కార్టూనిస్ట్ గా పత్రికల్లో కనిపించేది. టీచర్ గా పనిచేసే రోజులలో పిల్లలచేత పాఠశాలకు సంబంధించిన చార్టులు వేయించటం అప్పుడప్పుడు నేను వేయటం తప్ప మనషుల చిత్రాలు వేయనేలేదు.ఉద్యోగ విరమణ తర్వాతమళ్ళా మొదలెట్టాలని స్కెచ్ పుస్తకం కొనుక్కొన్నాను.కానీ ఒక మూడు పెన్సిల్ చిత్రాలతో అదీ ఆగిపోయింది.

                 నా విరామసమయంలోనే నా స్నేహితురాలు కుమారీ వాళ్ళఅన్నయ్య, అతని మిత్రుడు కలిసి ఎమెస్కో ఇంటింటి గ్రంథాలయం స్కీం లో చేరి బోలెడు పుస్తకాలు తెప్పించారు.అది తెలిసిన తర్వాత ఇంక నాకు పండగే.నేను అప్పుడప్పుడు ఏ వారానికో వెళ్ళి ఒక అరడజను పుస్తకాలు తెచ్చుకొని చదివి తిరిగి ఇచ్చేదాన్ని. అప్పుడప్పుడు నా ఆలోచనల్ని కథలరూపంలో రాయటం కూడా మొదలు పెట్టాను.కానీ అన్నయ్యలు చూసి ఇవి రాస్తూ చదువు పాడుచేసుకుంటున్నానని కోప్పడతారని క్లాసు పుస్తకాలు కింద దాచేసేదాన్ని.    

                బళ్ళో చదువుతున్నప్పుడు లిఖిత పత్రిక కోసం పద్యాలు రాసినా మళ్ళా వాటి జోలికి పోలేదు.కథలూ,నవలలూ తప్ప కవిత్వం మాత్రం ఇంట్లో లేకపోవటాన చదవలేదు. అప్పటికే చిన్నన్నయ్య విరివిగా కథలు రాసేవాడు.అతను రావిశాస్త్రికి ఏకలవ్యశిష్యుడు.రావిశాస్త్రీ,బీనాదేవి, కాళీపట్నం రామారావు,చాసో కథల పుస్తకాలు కొంటూ ఉండేవాడు.అవి చదువుతుండటం,అన్నయ్య కూడా రాసే కథలూ అదే విధమైన అభ్యుదయ దృక్పథం కనుక అటువంటి సాహిత్యమే ఎక్కువగా చదవటం అలవాటైంది.                                                                                                

                 చిన్నన్నయ్య తన స్నేహబృందం తలా ఒక పత్రికకొని అందరికీ సర్క్యులేట్ చేసే ఏర్పాటు చేసాడు.అందువల్ల తెలుగు వారమాసపత్రికలన్నీ చదివేదాన్ని.పత్రికలలో అన్ని సీరియల్స్ చదువుతున్నా,రంగనాయకమ్మ సీరియల్స్ ఎక్కువగా ఇష్ట పడేదాన్ని.ఇతర వచన సాహిత్యం లోని సరళమైన వాక్యనిర్మాణం, శైలీ,కథన శిల్పం నచ్చినా వామపక్ష దృక్పథంతో వచ్చే రచనల్ని చదవటమే నాకు నచ్చేది. నా ఆలోచనా విధానం లో అలా క్రమంగా వస్తున్న మార్పు నాకు తెలుస్తూనే ఉంది. ఒక మామయ్య కమ్యూనిస్టులతో తిరిగేవాడనీ,స్వాతంత్రానంతరం వారిమీద నిషేధం ఉండేదనీ,అప్పుడు ఉద్యోగం నుండి సస్పెండ్ అయ్యాడని కథలుగా చిన్నప్పుడు విన్నాను.మామామయ్యలు ఒకరిద్దరూ, అన్నయ్యలు,మా పెద్దక్కా వాళ్ళూ పూజలవీ చేయగా చూసిన గుర్తు లేదు.మా అమ్మ మాత్రమే దేవుడి దగ్గర దీపం పెట్టేది.అందుచేతనో,మరెందుకో ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం కనిపించేది కాదు.నాకు లలిత సంగీతం ఇష్టం కనుక భక్తి పాటలు కూడా పాడేదాన్ని.లలిత కళలన్నీ దైవంతోనూ, ఆధ్యాత్మిక చింతన తోనూ ముడిపడే ఉంటాయి కదా? అన్నట్లు మా కాలేజీ మాగజైన్ కి నేను కృష్ణుడు,రాథల ప్రణయగాధని అనేక లలిత గీతాలతో కదంబంగా అల్లి సంగీత రూపకంలా రాసాను.ఎందుకంటే రావు బాలసరస్వతి పాటల్లో అనేకం కృష్ణుడి గీతాలే కదా? ఆమె పాటలంటే నాకు ప్రాణం అప్పుడూ ఇప్పుడూ కూడా.      

ఇదీ ఆ ఏడాదంతా నా రాతలూ, గీతాలు,                

 

13, ఫిబ్రవరి 2022, ఆదివారం

నడక దారిలో--13

 నడక దారిలో--13


      మళ్లీ యథావిధిగా ఏ ఆటంకాలూ లేకుండా కాలేజీలో బీయస్సీలో చేరాను.నాతో పీయూసీ చదివిన ఎమ్పీసీ వాళ్ళెవరూ కనిపించలేదు.చదువు ఆపేసారేమో మరి.ఈ సారి కూడా నా సహాధ్యాయులు ఎనిమిది ముందే.అయితే వీళ్ళందరూ మహారాజా మల్టీ పర్పస్ స్కూల్ లో పన్నెండో తరగతి చదివి వచ్చినవాళ్ళు.వారిలో ఉషాకుమారి మా ఇంటివైపు కొత్తపేటలో ఉండేది.అందుచేత నాకు చాలా సన్నిహితురాలైంది.ఉషా కూడా కుటుంబపరంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఉన్నదే. మేమిద్దరం మంచి స్నేహితులం కావటానికి అదీ ఒకకారణమే
      రోజూ నేను పుత్సల వీథినుండీ,ఉషా కొత్తపేట నుండి బయలుదేరి పాతబస్టాండు దగ్గర కలుసుకొని కాలేజీ కి నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళం.దారి పొడవునా ఎన్నెన్నో కబుర్లు కలబోసుకునేవాళ్ళం.
      రెక్కలు విదిలించుకుని ఎగిరే రంగులసీతాకోకచిలుకలా కలలూ,ఊహలూ ఎగరాల్సిన వయసులోని ఉన్న మామధ్య దొర్లే కబుర్లలో రంగుల కలలు గురించి కాదు జీవితంలోని కారుమబ్బులు గురించి, కన్నీటివ్యథల్నీ తలబోసుకునేవాళ్ళం.
      అంతకుముందు మనసు విప్పి నా ఆలోచనలు ఎవరితోనైనా  పంచుకునే అవకాశాలు లేక నాలోనే నివురు కప్పినట్లుగా ఉండిపోయాయి.
      ఒకరోజు కాలేజీలో హాస్టల్ అమ్మాయి వచ్చి "సుభద్రా నీకు ఉత్తరం వచ్చింది.ఆఫీసు రూంలో ఉంది తీసుకో " అంది.కాలేజీకి నాకు ఉత్తరం రావటమేంటని ఆశ్చర్యం తో వెళ్ళి తీసుకున్నాను.నిజమే నాకే ఆ ఉత్తరం.కాలేజీ వాళ్ళు విప్పి చదివి మరీ ఇచ్చారు.
      కోటబొమ్మాళిలో నా సహాధ్యాయి రాసాడు.చిన్నక్క వాళ్ళు కోటబొమ్మాళి లోని అత్తగారింటికి వెళ్ళినప్పుడు కలిసాడట.నేను కాలేజీ లో చదువుతున్నారని తెలిసి రాస్తున్నానని అందులో రాసాడు.ఒకసారి తరగతిలో పిల్లలంతా అల్లరి చేస్తూన్నారని మాష్టారు అందరిని బెత్తంతో కొడుతుంటే అతను అల్లరి చేయలేదని చెప్పి మాష్టారుచేతి బెత్తం దెబ్బలు తప్పించానని రాసాడు.నాతోబాటూఆ ఉత్తరాన్ని చదివిన నామిత్రులూ, నేనూ సినీమాకథ  చెప్తున్నాడని నవ్వు కున్నాం.తర్వాత అది చింపి పడేసాను.
         మరో పదిరోజులకు మరోఉత్తరం.ఈసారి అతని ఫొటో కూడా పంపి నా ఫోటో పంపమని రాసాడు.దాంతో నాకు ఒళ్ళు మండి అతని ఫొటో కవర్లో పెట్టి ఏ ఆడపిల్ల ఇలా ఎవరడిగితే వాడికి ఫొటోలు పంపదు అని రాసి తిప్పి పంపేసాను.
         తర్వాత కొన్ని రోజులకు కాలేజీ విడిచి పెట్టాక ఇంటికి వెళ్తున్నప్పుడు కాలేజీ ముందు నన్ను ఎలా గుర్తు పట్టాడో కలిసి పలకరించాడు.అతని ఫ్రెండు MRకాలేజీలో చదువుతున్నాడని,అతను కూడా మాసహాధ్యాయేనని తనతో ఉన్న అబ్బాయిని పరిచయం చేసాడు.మాఅన్నయ్యల గురించి అడిగాడు. ముక్తసరిగా అడిగినదానికి చెప్పి ఉషాతో కలిసి వెళ్ళిపోయాను.
         మరోసారి కలిసినప్పుడు "పెళ్ళి గురించి నీ అభిప్రాయం ఏమిటి?" అని అడిగాడు.నేను ఇంతవరకూ పెళ్ళి గురించి ఆలోచించలేదు."ముందు చదువు పూర్తి చేసి నా కాళ్ల మీద నేను నిలబడాలి.తర్వాతే ఆలోచించాలి.నేను కట్నం తీసుకునే వాళ్ళని చేసుకోను."అని చెప్పి 'నన్ను ఇలా మాటిమాటికీ కలవద్దు' అని చెప్పి వెళ్ళి పోయాను.ఇంకెప్పుడూ కాలేజీకి రాలేదు.కానీ జనవరి ఫస్ట్ కి గ్రీటింగ్ కార్డ్ పంపేవాడు.తర్వాత అతను మా వివాహానికి, అనంతరం ఇంటికి రావటమే కాదు ఇప్పటికీ మంచి స్నేహితుడు గా ఉన్నాడు.
         కాలేజీలో చదువు ఒత్తిడి వల్ల సంగీతకళాశాలకు కూడా వెళ్ళటం మానేసాను.సాహిత్యం మాత్రం చదవటం, ఆలోచనలు పేపర్లమీద పెట్టటం మాత్రం మానలేదు.
         అప్పట్లోనే మాచిన్నన్నయ్య సంస్కృత కళాశాలలో చదువుతున్న సాహిత్యాభిరుచి గల కుర్రాళ్ళు జగన్నాథశర్మా,దాట్ల నారాయణమూర్తి రాజు,వివిఎస్ సూర్యనారాయణ మొదలైన వారితో కలసి సాహిత్యసమావేశాలూ ఏర్పాటుచేసి కథకులుగా ఉత్సాహపరిచేవాడు.బరంపురంలో ఉప్పల లక్ష్మణరావు గారి ఆధ్వర్యం లో నడిచే వికాసం నిర్వహించే సాహిత్య సమావేశాలు కు వెళ్ళేవాడు.విజయనగరంలో ప్రముఖ కథకుడు చాసో తో చర్చలు సాగించేవారు.నేనుమాత్రం ఇంట్లోనే పుస్తకాల్ని ఆవపోసనపడ్తూనే ఉండేదాన్ని.
         కుమారి వాళ్ళ అన్నయ్య,మరో మిత్రుడు కలిసి ఇంటింటి గ్రంథాలయం కోసం తెప్పించిన పుస్తకాల్లో శీలా వీర్రాజు గారి నవల కాంతి పూలు తెచ్చుకొని ఒకసారి చదివాను.పుస్తకాలు చదివాక వాటిగురించి చర్చించేందుకు నా స్నేహితులకు సాహిత్యాభిరుచి ఉన్నవాళ్ళెవ్వరూ లేనందున  నాకు నేనే ఒక పేపర్లో నా అభిప్రాయం రాసుకునే దాన్ని.
         ఆ వేసవి సెలవుల్లో కుమారి వాళ్ళ అన్నయ్య కి అన్నవరంలో వడుగును చేయాలనుకుని వెళ్ళేటప్పుడు నన్ను కూడా రమ్మన్నారు.అమ్మ కూడా వెళ్ళటానికి ఒప్పుకుంది.మొదటిసారి ఇంట్లో వాళ్ళతో కాకుండా నా ప్రయాణం అది.అన్నవరంలో వాళ్ళ ఫంక్షన్ అయ్యాక నన్ను వాళ్ళు బాపట్ల కు వెళ్ళే బస్ ఎక్కించారు.పెద్దక్కయ్య వాళ్ళూ అప్పుడు బాపట్లలో ఉండేవారు.బస్టాపుకు వచ్చి నన్ను ఇంటికి తీసుకు వెళ్ళారు.
         పగలంతా పిల్లలిద్దరితో ఆటలతో సరిపోయేది.మధ్యాహ్నం పిల్లలు పడుకున్నాక కొత్త పుస్తకాలు ఏవైనా వచ్చాయేమోనని అల్మారాలో వెతికాను.కొన్ని శరత్ నవలల అనువాదాలు, శీలా వీర్రాజు కథలు కనిపించాయి.రెండురోజుల్లో అవి చదివేసాను.శరత్ నవలల్లో సంభాషణ లాగే శీలా వీర్రాజు కథల్లోని సంభాషణలు కూడా భావుకత్వం తో నిండిఉన్నాయి.బహుశా శరత్ ప్రభావం ఎక్కువే మో అనుకున్నాను.చిన్నప్పటిలా కాకుండా పుస్తకం చదివిన తర్వాత ఆ పుస్తకం గురించి నచ్చినవో,నచ్చనివో నా అభిప్రాయం రాసుకోవటం అలవాటైందని చెప్పాను కదా అదే విధంగా రాసుకున్నాను.
         ఒకరోజు సాయంత్రం నన్ను తన స్నేహితురాలి ఇంటికి తీసుకెళ్ళింది అక్కయ్య.'మా చెల్లాయి వచ్చిందండీ' అని నన్ను చూపించింది ఆమెకు.ఆమె రోడ్డు మీద వాళ్ళని చూసినట్లు ఓ చూపు విసిరి,తెలుగు, సంస్కృతాలలో తనకు గల పాండిత్య ప్రతిభ గురించి అనర్గళంగా మాట్లాడుతూ అన్నింటితో నవల రాయబోతున్నట్లు చెప్పారామె.అక్కయ్య ,నేనూ మౌన శ్రోతలం అయ్యాము.
         ఇంటికి వస్తున్నప్పుడు 'ఆమె నవలలు రాస్తారా' అని అడిగాను ‌ఆ రోజుల్లో వచ్చే అన్ని పత్రికలూ చదువుతాను కదా ఒకటీ నాకు గుర్తు రాకపోవటం ఆ రచనలు ఎలా ఉండి ఉంటాయో అర్థమయ్యింది.
         అక్కయ్య ఒకరోజు భోజనం చేస్తున్నప్పుడు "ఇరవై ఏళ్ళు నిండుతున్నాయి.పెళ్ళి గురించి ఆలోచించు.నీ దృష్టిలో ఎవరైనా ఉంటే చెప్పు " అంది.
         నేను ఏమీ మాట్లాడకుండా తల ఊపి మౌనం వహించాను.నా మనసు మాత్రం 'నా చదువు నా చదువు' అంటూ లోలోన గొణిగింది.
        వారం పదిరోజులు అయ్యాక విజయనగరం తిరిగి వచ్చేసాను.యథాప్రకారం చదువులో పడ్డాను.
        అప్పుడప్పుడే తెలంగాణా ఉద్యమం ఊపందుకుందని వార్తల్లో విన్నాము.కాలేజీలో అది కొంత సంచలనం కలిగించింది.ఉపాధి లేక పల్లెలనుండి పట్టణాలకు వస్తున్నట్లే పట్టణాల్లో డిగ్రీ చదువు పూర్తి చేసుకుని రాజధాని బాట పట్టేవారు ఎక్కువే.ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయాలూ, మంచి విద్యాసంస్థలన్నీ అక్కడే ఉన్నాయి. చదువుకున్న వారికి తగిన ఉద్యోగాలు ఇచ్చే ఆఫీసులు ఇంకే నగరాల్లోనూ లేవు.మన రాజధాని అనుకుంటూ ఇళ్ళూ,పొలాలూ అమ్ముకొని హైదరాబాద్ కు వలస పోయేవారు ఎక్కువగానే ఉండేవారు.ఇప్పుడు  చదువులూ , ఉపాధికోసం విదేశాలకు వలసపోతున్నట్లే అనాది నుండి ఎక్కడ ఉపాధి దొరుకుతే అక్కడికి  పోవటం అతిమామూలే కదా.
        రోజూ వార్తలు రేడియోలో వినో,వార్తాపత్రికల్లో చదివో దిగులు పడిపోతూ ఉండే వాళ్ళం.'ప్రత్యేక తెలంగాణా వచ్చేస్తే  అప్పుడు మనకి రాజధాని ఏదవుతుంది చెప్మా?' అని కాలేజీ లో చర్చించుకునే వాళ్ళం. తమాషా ఏమిటంటే ఇప్పటికీ ఆ చర్చా తెగలేదూ,యాభై ఏళ్ళైనా ఆప్రశ్నకి సమాధానం దొరకలేదు!!!