27, ఏప్రిల్ 2025, ఆదివారం
స్త్రీ లపాలిటి కల్పవృక్షం సామవేదం వెంకట కామేశ్వరి
~ స్త్రీల పాలిటి వైద్య కల్పవృక్షం డా.సామవేదం వెంకట కామేశ్వరి ~
జన్మ రీత్యా మంచి సాంస్కృతిక నేపధ్యం గల కుటుంబంలో 1972 జనవరి 23వ తేదీన వెంకట కామేశ్వరి ఆ ఛాయలన్నిటినీ పిడికిట్లో ఒడిసి పట్టుకునే పాలకొల్లులో కన్నువిప్పింది
కామేశ్వరి పితామహులు డా.సామవేదం సత్యనారాయణగారు పాలకొల్లులో మంచి హస్తవాసి గల వైద్యులుగానే కాక స్థానిక లైన్స్ క్లబ్ లో ప్రతీ నెలా మొదటి ఆదివారం చక్కటి సంగీతకచేరీలు ఏర్పాటు చేసేవారు.అప్పట్లో పోలియో వ్యాధి వ్యాప్తి ఎక్కువగా వుండేది.ఈ వ్యాధిని తొలిదశలోనే గుర్తించి మెరుగైన వైద్యం కోసం రాయవెల్లూరు పంపే ఏర్పాటు చేసేవారు.కామేశ్వరి గారి నాన్నమ్మ ఆ రోజుల్లోనే మహిళా సాధికారతకల వ్యక్తి, మంచి సాహిత్యాభిలాష కలిగినవారు.మొదటి మనవరాలైన కామేశ్వరికి వీరే మొదటగా స్ఫూర్తి అందించిన వారు.
తండ్రి సామవేదం వేంకట సూర్యనారాయణ రసాయన శాస్త్రంలో మాష్టారు పట్టా అందుకున్న తొలిరోజుల్లో రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో లెక్చరర్ గానూ తర్వాత ఎస్.బి.ఐ లో ఆఫీసర్ గా ఉద్యోగం చేసి పదవి విరమణ అయినా కొద్దికాలానికే తీవ్ర గుండెనొప్పికి బలైపోయారు.తల్లి మీనాక్షి పెద్దగా చదువుకోక పోయినా తల్లిదండ్రులు ఇద్దరూ తమ ఆడపిల్లలిద్దరికీ మంచి చదువుల్నే కాక,సాహిత్య పఠనానికి కూడా ప్రోత్సహించిన రెండవ స్ఫూర్తి దాతలు.
పాలకొల్లుకు పద్నాలుగు మైళ్ళ దూరంలోని లంక గ్రామమైన భీమలాపురంలో నివాసితులైన మాతామహులు వేదపండితులు. ఇరవైనాలుగు వేల రామాయణం శ్లోకాలు కంఠోపాఠంగా నేర్చిన ఆధ్యాత్మికురాలు అమ్మమ్మ.వరదకాలంలో ముంపుకు గురైన గ్రామ ప్రజలను ఆదరించి స్వయంగా ఆహారాన్ని అందించిన సహృదయులు.
ఇటువంటి నేపధ్యంలో పెరిగింది కనకే కామేశ్వరి విద్యా, వైద్యం,సమాజం పట్లా అంకితభావం కలిగిన సహృదయురాలు కావటంలో ఆశ్చర్యం లేదు.తర్వాత్తర్వాత ఆమె తన చేయి అందుకున్న డా.వింజమూరి సూర్యప్రకాష్ సాహచర్యంలో కామేశ్వరి మరింత లక్ష్యసాధనకు మునుముందుకు అడుగులు వేసింది..వేస్తూనే వుంది.
కామేశ్వరి వైజాగ్ లోని ఆంధ్రా మెడికల్ కాలేజిలో MBBS చదివినప్పుడే కాలేజీలో ఎనాటమీ లో మొదటిస్థానంలోనూ,మైక్రోబయాలజీలో రెండవ స్థానంలోను రావటం విశేషం.తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజీ ,నయాపూల్ లోని ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్ లో Gynecologicy and obstetrics లో డిప్లొమా చేసారు.
డాక్టర్ ఎస్.వి. కామేశ్వరి తెలంగాణ రాష్ట్ర వైద్య మండలిలో సభ్యత్వం పొందారు.
ఇంకా అప్పటినుండి కామేశ్వరి కార్యరంగంలోకి దూకారు.దేశంలోని అన్ని విపత్తులలోనూ వైద్యసహాయం అందించేందుకు భర్త వింజమూరి సూర్యప్రకాష్ గారితో కలిసి ముందడుగు వేశారు.సునామీ సమయంలో ట్యూబెక్టమీ అయిన మహిళలు మళ్ళా సంతానోత్పత్తికి రీకానలైజేషన్ చేసుకోవటంతో వారిపై అధ్యయనం చేసి అది సరిగా జరగలేదనేది ప్రకటించారు.
డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సహాయంతో హిస్టరెక్టమీ మీద సీరియస్ గా పనిచేసి 2012లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి రోశయ్యగారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం నుంచి హిసెరెక్టమీ సేవలను తొలగించటం వీరు చేసిన వైద్యసేవాకృషికి తొలి విజయంగా చెప్పవచ్చు.
ఎందుకంటే భారతదేశంలో ఎంతమందికి హిస్టరెక్టమీ జరిగిందో డేటా లేదు.అవసరం వున్నా లేకపోయినా ఇబ్బడిముబ్బడిగా పేద శ్రామిక వర్గం స్త్రీలకు హిస్టరెక్టమీ చేయటంతో వారు తదనంతరం అనేక విధాలుగా రోగగ్రస్తులు కావటం జరుగుతుందనేది వీరి అధ్యయనంలో బయటకు వచ్చింది.
2013 లో ఢిల్లీలో ఒక NGO సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో కామేశ్వరిగారు తమ అధ్యయనంలో తెలుసుకున్న ఫలితాలను ప్రదర్శించారు.ఆ తర్వాతే National Family health survey -4 ( NFHS-4)- 2015-16 వారు హిస్టెరెక్టమీ గణాంకాలను నాటికి తయారుచేసారు.
కానీ తర్వాత కూడా ఈ గణాంకాలు పెరుగుతూనే వున్నాయని చింతిస్తారు కామేశ్వరి.
"గర్భసంచి కాపాడుకుందాం సమాజాన్ని బలపరుద్దాం “అనే పుస్తకాన్ని మొదట 2017 సంవత్సరంలో ప్రచురించారు. తెలంగాణా ప్రభుత్వ సహకారంతో 2018 సంవత్సరం జనవరి నుండి ఆగస్టు వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరోగ్యసిబ్బందికి,ఆశా వర్కర్లకు, మహిళాసమాఖ్య సభ్యులకు,81 గ్రామాలలో 16000 మందికి పైగా స్త్రీలకు పెద్ద ఎత్తున గర్భసంచి ప్రాధాన్యత పై అవగాహన కల్పించారు.అంతే గాక రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక పాఠశాలల్లో, కాలేజీలలో విద్యార్థినులకు గర్భసంచి ప్రాధాన్యత గూర్చి వివరించారు.
డా.కామేశ్వరి స్వభావం ఎప్పటికప్పుడు స్త్రీల ఆరోగ్యసమస్యల్ని పరిశోధనాత్మక దృక్పధంతో నిరంతరం పరిష్కరించటానికే కాకుండా ఆ సమస్యలపట్ల అవగాహన కల్పించి జాగృతం చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు.అప్పటినుండి తన దగ్గరకు చికిత్సకోసం వచ్చిన మహిళలను కేవలం చికిత్స చేసి పంపేయటం కాకుండా తల్లిలా అక్కున చేర్చుకుని శారీరకంగానే కాక మానసికంగా, కుటుంబపరంగా తగిన సహకారం అందిస్తున్నారు. వారి ఆరోగ్య సమస్యలనన్నింటినీ నమోదు చేసుకుని ఎక్కువ మందికి అందాలనే వుద్దేశ్యంతో పుస్తకరూపంలో తీసుకు రావటానికి కలంపట్టారు .
సంతానసాఫల్యం గురించి.ఇటీవల కుప్పలు తెప్పలుగా సంతానసాఫల్యకేంద్రాలు వెలుస్తూ , కుటుంబాల్లో పెళ్ళైన ఏడాది నుండీ గర్భం రానందుకు వేలెత్తి చూపటంతో అవమానపాలౌతున్న వారిని ఆకర్షించి మూలకారణాలు అన్వేషించకుండానే చికిత్స మొదలు పెట్టేస్తుండటం, దానితో తదనంతరం ఆర్థికపరమైన ఇబ్బందులేకాక ఆ చిన్నితల్లులు అనేక అనారోగ్యాలకు పాల్పడటం కామేశ్వరిని కలచివేసింది.
"సంతానం కానివారిలో 92 శాతం మందికి చిన్నచిన్న ప్రక్రియలతోనే ప్రాధమిక స్థాయి,మధ్యమస్థాయి క్లినిక్ లోనే ఫలితాలు లభిస్తాయి" అంటారు కామేశ్వరి.
ముఖ్యంగా కొన్నిదిగువ, మధ్యతరగతి కుటుంబాలలో సంతానం కలగకపోవటాన్ని దోషంగా పరిగణిస్తారు.కుటుంబంలోవారంతా ఆ స్త్రీని దోషిగా పనికిరాని వస్తువులా చూస్తారు.అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారిని కామేశ్వరి గారు ఆత్మీయంగా అక్కున చేర్చుకుని వారికి తగిన వైద్యం చేసి వారి ఒడిని పసిపాపతో నింపిన సందర్భాలు ఎన్నో.సంతానాభిలాషతో వచ్చిన దంపతులను నాలుగు రకాల కేసులుగా విభజించి తగిన విధంగా అవగాహన కల్పిస్తుంటారు.
అందుకే కామేశ్వరి తనదైన పధ్దతిలో దంపతులను కూర్చోబెట్టుకుని వారిని మానసికంగా, శారీరకంగా తన వైద్యానికి సానుకూలంగా తయారుచేసి వేలసంఖ్యలో దంపతులకు సంతానం కలిగేలా చేసారు.తన అనుభవాలూ తన పరిశోధనలనూ,తన పరిశీలనలనూ అన్ని కోణాల్లో క్రోడీకరించి "మధుమాలతి " అనే పుస్తకాన్ని రాసారు డా.కామేశ్వరి.
గ్రామాలనుండి వచ్చినవారిని,చాలాకాలం తర్వాత గర్భం నిలిచిన వారినీ తమ కేంద్రమైన 'అందరియిల్లు'లో ఆశ్రయం కల్పించి తగిన విశ్రాంతి గా ఉండేలా ఆరోగ్యకర ఆహారం అందజేస్తారు.
"సంతానం కలగని వందమందిలో ముగ్గురికి మాత్రమే సంతానం కలగకుండా చేసే కారణాలను ఐవీఎఫ్ సహాయంతో పరిష్కరించుకోవచ్చు.అంతేకానీ ఏదో వస్తువు కొనుక్కున్నట్లుగా తొందరపాటుతో ఐవిఎఫ్ చేయించుకోటానికి వెళ్ళవద్దు" అంటారు కామేశ్వరి .ఐవీఎఫ్ చేయించుకోవటం అనేది ఒకరి వ్యక్తిగత నిర్ణయంగా కాకూడదు . స్త్రీల గర్భంపై, ఆరోగ్యంపై దాడిగా మారుతోన్న పునరుత్పత్తి సమస్యలపైగాని,అనవసరంగా హిస్టెరెక్టమీ చేసేస్తూ స్త్రీల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటున్న దోపిడికేంద్రాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాల్లో,బస్తీల్లో పర్యటిస్తూ అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
కామేశ్వరీ, సూర్యప్రకాష్ గార్లు కలిసి చేసే మానవవైద్యసేవే కాక అందరి యిల్లు పేరిట చేస్తున్న సమాజానికి కూడా చేస్తున్న వైద్యాన్ని పరిగణలోకి తీసుకొని first hundred doctors from Andhra medical College గా 2023లో ఆంధ్రా మెడికల్ కాలేజీ శతవార్షికోత్సవాలలో AMC లో సీనియర్ డాక్టరైన శేషు శర్మగారు తన పుస్తకంలో నమోదు చేసారు.ఇది వీరు జీవితంలో సాధించిన మరో గొప్ప గుర్తింపు.
ఉత్తరాలతో మానవ సంబంధాలను ఎలా బలపరచుకోవచ్చో ' art of letter writing 'ని ఒక ఉద్యమం ద్వారా తెలియజేసారు ఈ వైద్య దంపతులు.
అంతటితో ఆగిపోలేదు అన్ని విధాలా రోగగ్రస్తమైపోతున్న సమాజాన్ని ప్రేమా నిజాయితీ అనే వైద్యంతో పునరుజ్జీవింప చేయటానికి నడుం బిగించారు. అందరం మనమందరం అంటూ మందార పూవును చిహ్నంగా ఎంచుకొని వారితో సహకరించే వారినందరిని ఒకే కుటుంబం గా కలుపుకుంటూ సమాజంలో 'అందమైన జీవితాల్ని ' కలగనే స్వాప్నికులు డా.కామేశ్వరీ,డా.సూర్యప్రకాష్ దంపతులు.అందుకే వీరు అందరికీ పూలనూ,పూలమొక్కల్నీ పంచుతారు.
అందరికీ ఆహారం, ఆరోగ్యం, మానసిక వికాసానికి పుస్తకం అందినపుడు సమాజమే మారుతుందన్న విశ్వాసంతో అడుగులు వేస్తారు.
తల్లిదండ్రుల సామాజిక సేవను బాల్యం నుంచి చూస్తూ పెరిగిన కుమార్తె గాయత్రి డాక్టర్ గా, కుమారుడు భరత్ శాస్త్రవేత్తగా విదేశాల్లో తమ రంగాల్లో నైపుణ్యం పొందారు.
డా.సామవేదం వెంకట కామేశ్వరి , డా.వింజమూరి సూర్యప్రకాష్ తో కలిసి తలపెట్టే ప్రతి పనిలో ఒకరి నీడ మరొకరిదిగా ,ఇరువురి అడుగుజాడలు ఒకటిగానే ప్రతీ కార్యక్రమం నిర్వహించటం అపురూపమైనదిగా
ఉంటుంది.
డా.సామవేదం వెంకట కామేశ్వరి గారు అపురూప పురస్కారం అందుకుంటున్న సందర్భంగా మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి