23, అక్టోబర్ 2025, గురువారం
నడక దారిలో -58
నడక దారిలో -58
పరీక్ష కోసం చదువుతున్నట్లుగా శ్రీదేవి రచనలు ఒకటికి రెండుసార్లు చదివి నోట్స్ తయారు చేసుకుని స్వతంత్ర బౌండ్లు కృష్ణదేవరాయ భాషా నిలయానికి తిరిగి అందజేసాను.
కథానిలయంలోని కథలు గురించి వివినమూర్తిగారిని మెయిల్ ద్వారా సంప్రదించాను.ఆయన అక్కడి కథలు పీడీఎఫ్ లు పంపించారు.ముందుగా కథలకు,కవిత్వానికి సంబంధించిన నోట్స్ పూర్తి చేసుకున్నాక " కాలాతీతవ్యక్తులు" నవలను చదవటం మొదలు చిన్నప్పుడు చదివినదే అయినా ఇప్పుడు చదువుతుంటే ఎన్నో కోణాల్లో నవల విశిష్టతని గుర్తించి రాయటం మొదలు పెట్టే సరికి నవల విశ్లేషణే 40 పేజీలకు పైగా వచ్చింది.రాయటం స్పీడ్ అందుకుంది.
అయితే నాకు ఈ ప్రోజెక్ట్ అప్పగించిన నాటికి అక్కిరాజు రమాపతిరావు( మంజుశ్రీ)గారు కేంద్ర సాహిత్య అకాడెమీ కన్వీనర్.నేను సబ్మిట్ చేసేనాటికి కమిటీ మారిపోయింది.ఎన్.గోపీగారు కన్వీనర్ అయ్యారు.ఇతరసభ్యులలో ఒకరుగా వీర్రాజుగారు కూడా వున్నారు.అది నన్ను కొంచెం ఇబ్బంది పెట్టింది.నేను రాసినది స్క్రూటినీకి కూడా వెళ్ళి తొందరగానే అంగీకారం అయ్యి ప్రింటింగ్ కు వెళ్ళింది.
సాధారణంగా కమిటీలో వున్నవాళ్ళు సాధ్యమైనంతవరకూ అకాడమీ సభ్యులు కూడా కొన్ని ప్రోజెక్టులు తీసుకుంటారు.వీర్రాజుగారు మాత్రం కమిటీ సమావేశాలకు వెళ్ళటం తప్ప ఏవిధమైన ప్రయోజనం పొందలేదు.
నాకు ఒక విషయంలో ఆయనపై చాలాకోపం కూడా వచ్చింది.ప్రతీ సభ్యుడూ జ్యూరీ సభ్యులుగా వుండటానికి ప్రతీ కేటగిరి కిందా సుమారు ముప్పై మంది పేర్లు వారి చిరునామాలతో సహా ఇవ్వాలి.నాస్నేహితులైన రచయిత్రులతో సహా తెలిసిన వారిపేర్లు రాసి ఇచ్చారు.కానీ నా పేరు రాయలేదు."మీ భార్యగా కాకుండా ఇంతకాలంగా రాస్తున్న రచయిత్రిగా నా పేరు రాయొచ్చు కదా "అని గొడవ పెట్టుకున్నాను.కానీ ఆయన నిబద్ధతకి మరి మౌనం వహించాను.
అదే సమయంలో కేంద్ర సాహిత్య అకాడమీ తో కలిసి వాసా ప్రభావతిగారు లేఖిని సంస్థ ద్వారా సదస్సును నిర్వహించ తలపెట్టారు.ఆరుగురు మాత్రమే పత్ర సమర్పకులు.లేఖిని సభ్యులు ప్రసంగకర్తలుగా పేర్లు ఇచ్చారు.వాటిని కన్వీనర్ అయిన గోపిగారికి పంపుతే అందరూ ఒకే సామాజికవర్గానికి చెందినవారున్నారు.అకాడమీ నిబంధనకు కుదరదన్నారు.ప్రభావతిగారు నాకు ఫోన్ చేసి నన్ను ఒక పేపర్ ప్రజెంట్ చేయమన్నారు.వీర్రాజుగారు అకాడమీ సభ్యులు కనుక నేను ఇవ్వడానికి అంగీకరించలేదు.అప్పుడు పుట్లహేమలతని సంప్రదించారు.
వందేళ్ళ కథకు వందనాలు కార్యక్రమం కోసం వీర్రాజుగారి కథను రికార్డు చేయటానికి గొల్లపూడి మారుతీరావుగారు మాయింటికి వచ్చారు.
అప్పుడు మా బిల్డింగ్ లో కొందరికి వీర్రాజుగారు రచయిత అనే విషయం తెలిసింది.తర్వాత్తర్వాత నేనుకూడా రచయిత్రినని తెలిసింది కాని ఇక్కడ ఎవరికీ సాహిత్య వాసనలు లేనందునా,మేము ప్రచారం చేసుకోనందున అంతకన్నా మా గురించి తెలియదు.
శ్రీదేవి మోనోగ్రాఫ్ రాసిన తర్వాత వ్యాసాలు రాయాలనే వుత్సాహం వచ్చింది.అందులోనూ వందేళ్ళ కథను వందనాలు కార్యక్రమంలో ప్రత్యేకంగా కథలను గురించి చెప్పదగిన రచయిత్రులైన జలంధర,జానకీరాణి, శివరాజు సుబ్బలక్ష్మి వాళ్ళంతా మరొకరి పరిచయం చేయటానికి వుపయోగ పడ్డారు.దాంతో 118 కథకుల్లో కేవలం 12 మంది కథయిత్రులకథలను మాత్రమే పరిచయం చేయటం నాకు బాధకలిగించింది.అరవయ్యో దశకం రచయిత్రుల స్వర్ణయుగం అనేవారు కదా.వారెవ్వరూ నవలలు తప్ప కథలు రాలేదా అని పరిశోధన చేసాను.నమ్మలేనంత ఆశ్చర్యం కలిగింది.
స్వాతంత్య్రానంతరం రచయిత్రులలో బాగా రాస్తారు అనుకున్న వాళ్ళు పేర్లు జాబితా వేసుకుని
నా దగ్గర కథా సంపుటాలే కాకుండా కెపి అశోక్ కుమార్ , అనిశెట్టి రజిత, కాత్యాయనీ విద్మహే , రామడుగు రాధాకృష్ణ మూర్తి గారు వంటి వారినుండి పుస్తకాలు సేకరించాను.కథానిలయంనుండి వేల కొద్ది కథలు డౌన్లోడ్ చేసుకుని.ఒకరి తర్వాత ఒకరికి తలమీద వ్యాసాలు రాయటమే కాక వివిధ పత్రికలకు పంపించగా అన్నీ ప్రచురణ కాసాగాయి.
దాంతో రెట్టించిన వుత్సాసం వచ్చింది.
వీర్రాజుగారు కథలూ,కవిత్వం మానేసి వ్యాసాలు రాస్తున్నందుకు 'వ్యాసాలలో పడితే మరి సృజనాత్మక సాహిత్యం రాయలేవు' అని మందలించేవారు.
ఆయన మాటల్ని పట్టించుకోకుండా ' కవితలు కూడా ఇంచుమించు ప్రతీ నెలా పత్రికల్లో వస్తూనే వున్నాయిగా' అన్నాను.
డిసెంబర్,జనవరి మా ఇంట్లో హడావుడి వుంటుంది.జనవరిలో సంక్రాతికి బొమ్మలకొలువు పెడతాము.నాకు చిన్నప్పటి నుంచి బొమ్మలకొలువు పెట్టటం ఇష్టం.చిన్నప్పుడు తీరని కోరిక పల్లవి పుట్టిన తర్వాత తీర్చుకో సాగాను.ఒక్కొక్కసారి ఒక థీమ్ అనుకొని ఆ థీమ్ కి అనుగుణంగా బొమ్మలు,బేక్ గ్రౌండ్ లో అలంకరణ మేమే తయారుచేసి పెడతాము.అందుచేత డిసెంబర్ నుంచి ఈ పని కొనసాగుతుంది.మా నైపుణ్యాలు న్నీ అందు లో ప్రదర్శిస్తాం.
ఆ హడావుడిలో వుండగా ఒక రోజు మా మేనల్లుడు ఫోన్ చేసి వాళ్ళమ్మ కు అనారోగ్యం గా వుందని తెలియజేసాడు.వీర్రాజుగారికి చెప్తే చూడటానికి వెళ్దామన్నారు. సుమారు పది పదిహేనేళ్ళుగా మా అన్నయ్యగానీ,ఆడపడుచుగానీ
మాకు కాంటాక్ట్ లో లేరు.అన్నయ్యకి చాలా కాలం క్రితం బ్రైన్ ఆపరేషన్ అవుతే స్కూల్ నుండి డైరెక్ట్ గా చూడడానికి వెళ్ళినప్పడు ఎవరో పరాయిదానిలా చూసిన అనుభవం ఇంకా మర్చిపోలేదు.కానీ రక్తసంబంధం వదిలేయలేక ప్రయాణం అయ్యాము.మాతో మా మరిది,పెద్దాడబడుచు భర్త కూడా వచ్చారు.ఆమె పరిస్థితి అంతా బాలేదు.తిరిగి వచ్చేటప్పుడు ' అవసరమైతే చెప్పు నేను సాయానికి వస్తాను' అని మేనల్లుడితో చెప్పాను.
ఎప్పుడు అక్కడికి వెళ్ళవలసి వస్తుందో నని బొమ్మలకొలువు కొంచెం సింపుల్ గా పెట్టాము.
సంక్రాంతి వెళ్ళిన నాలుగో రోజున సీరియస్ గా వుందని ఫోన్ వేస్తె ఓ రెండు చీరలు,డబ్బు సంచిలో వేసుకొని వాళ్ళింటికి వెళ్ళాను.ఆ రాత్రి ఆమె బాధ భరించలేక కోమాలోనే భయంకరంగా మూలుగుతుంటే శరీరం వదలటానికి ప్రాణం ఇంత కొట్టుకులాడుతుందా అని భయం వేసింది.ఇంటి ఓనరు కొడుకు పెళ్ళి వుందని ఇంట్లో ప్రాణం పోతుందేమోనని గొడవ పెట్టారు.దాంతో మర్నాడు ఉదయమే దగ్గరలోని ఓ ఆశ్రమంకి తీసుకు వెళ్ళాం.
మా చిన్నన్నయ్య ఇంతకాలం తర్వాత తన మనసులోని మాటలన్నీ అతని పిల్లలు ఆపాలనుకున్నా నాతో చెప్పటం మొదలుపెట్టాడు.
నేను మౌనంగా విన్నాను.మర్నాడు ఆమె పోవటంతో వీర్రాజు గారి తరపు వాళ్ళు వచ్చారు.ఆమెకు పుట్టింటి వాళ్ళే చీర పెట్టాలి మా దగ్గర వున్నదే పెట్టేయమని అన్నయ్య,అతని వియ్యంకులు అంటే వాళ్ళది వద్దని పల్లవికి ఫోన్ చేసి నాదే ఒక కొత్త చీర తీసుకురమ్మని మా చిన్నాబడుచును సాగనంపాము.ఆ పని అయ్యాక మా ఇంటికి తిరిగి వచ్చాము.అయితే ఆ తర్వాత చిన్నన్నయ్య పలఃరించటానికి ఊరుకోలేక అప్పుడప్పుడు నేను వాళ్ళింటికి వెళ్ళే దాన్ని.ఒకసారి అతను రాసిన కథలు ఫైల్ తీసుకు వచ్చి నా చేతిలో పెట్టి వాటిని డీటీపీ చేయించి కొడుకుకి ఒక కాపీ ఇచ్చి నా దగ్గర ఒకటి పెట్టుకోమని ఈ,డీటీపీ ఖర్చు ఇస్తానన్నాడు.
ఇంటికి వచ్చాక చూస్తే వంద కథలు వున్నాయి.నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది.
ఆర్థికంగా ఇబ్బందుల్లో వున్నా విజయనగరంలో రావిశాస్త్రి , కారా మాస్టారు,చాసోల కోవలోనే సమాజానికి దర్పణంగా వుండే మంచి కథలు రాసి , అనేకమందిని రచయితలుగా ప్రోత్సహించి ప్రచారపటాటోపం లేకుండా అనామకంగా అయిపోయాడే అని బాధ కలిగింది."విజయనగరంలో నేను రాజును ఇప్పుడు ఇక్కడ బంటును" అంటున్న చిన్నన్నయ్యను ఉన్నంతమేరకు దొరబాబులా బతికిన వాడిని ఈ నాడు ఇలా కుంగిపోయిన స్థితిలో చూడలేక పోయాను.అతనుకోరినట్లుగా కాపీలు తీయించి ఇచ్చాను.
మరో రెండుమూడు ఏళ్ళకే అనేక డిప్రెషన్ లతో ఆరోగ్యం క్షీణించడంతో చిన్నన్నయ్య కూడా చనిపోయాడు.
వీళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు పోవటం తెలిసాక కోరుకొండ లో వున్న చిన్నక్క కూడా బెంగ పెట్టుకున్నట్లుగా అయిపోయింది.
తెలంగాణా వచ్చిన తర్వాత బతుకమ్మ సంబురాలు అంగరంగవైభవంగా జరిగాయి.ఆ సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయంలో అప్పటి వీసీ ఎస్వీ సత్యనారాయణగారు ఆ పదిరోజులూ కవిసమ్మేళనాలూ ,బతుకమ్మ ఆటలూ,పాటలతో సంబురాలు జరిపించారు.
ఒకరోజు ఉదయం నాకు ఫోన్ చేసి మధ్యాహ్నం సెషన్ కవి సమ్మేళనానికి ఆత్మీయ అతిథిగా ఆహ్వానించారు.సరే అని నేను వెళ్ళాను.
కవి సమ్మేళనానికి అధ్యక్షురాలు సూర్య ధనుంజయ్
పూనా,చెన్నై,ముంబై మొదలగు ప్రాంతాలనుఔడి వచ్చిన కవయిత్రులు వారు బాల్యంలో బతుకమ్మ ఎట్లా ఆడేవారో వాటిని కవిత్వంలో చెప్పారు.నేను
పరిమళ ప్రస్తారం కవిత చదివాను.అందులో--
" అక్షరాల్ని ఒడిబియ్యంలా మోసుకొచ్చింది అక్షరాలా అక్కడినుండే
వాటికి సాహిత్య సొబగులు అద్ది
పుస్తకపళ్ళేల్ని నింపి
వాయినాలు యిచ్చిందిమాత్రం ఇక్కడే
మరి నేను ఎక్కడిదాన్నని అనుకోను?"
అంటూ కవిత చదివాను.
అధ్యక్షురాలు "మీరు హైదరాబాదీయే మేడం"అంది.ధన్యవాదాలు చెప్పి కూర్చున్నాను.
మర్నాడు " ప్రవాస తెలుగు కవయిత్రుల సమ్మేళనం జరిగింది"అని వచ్చిన పేపర్ల నివేదికలో ఏ ప్రాంతం నుండి ఎవరు వచ్చారో రాస్తూ ఆంధ్రా నుంచి శీలా సుభద్రాదేవి అని నాపేరు వచ్చింది.నాకు చాలా బాధ కలిగింది.అప్పటికి నలభై అయిదేళ్ళ క్రితం ఇక్కడికి వచ్చి ఇక్కడే ఓయూ నుండి నాలుగు డిగ్రీలు పొంది పాతికేళ్ళు ఇక్కడి పేద పిల్లల బడిలో గొంతు పోయేలా చదువు చెప్పి బతుకుతున్న , ఆంధ్రాలో సూదిమొన అంతన్నా ఆస్తులు లేని నన్ను ఆంధ్ర క్రింద పరిగణించడం బాధే కలిగింది.ఇక్కడ వీళ్ళు ఆంధ్రా అన్నారు.ఆంధ్రాలో వారికి మేము ఏమి రాసారో కూడా అనేక సాహితీ సంస్థలకూ తెలియదు,సాహితీవేత్తలకూ తెలియదు.ప్రచార పటాటోపాలు ,ఆర్భాటం చేయగలిగేవాళ్ళకు పర్వాలేదు.కానీ మాలాంటి వాళ్ళం సాహిత్యం ఇలా త్రిశంకు స్వర్గంలో ఉండటమే అనుకుంటాను.
మైండ్ ట్రీలో ప్రాజెక్టు మేనేజర్ గా పనిచేస్తున్న
పల్లవికి ఉద్యోగం ఒత్తిడి రానురాను ఎక్కువ అయ్యింది.ఉదయం ఎనిమిది నాన్నగారికి బయలుదేరితే గచ్చిబౌలికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేసరికి తొమ్మిది అయ్యేది మళ్ళీ వచ్చాక రాత్రిపూట కాన్ఫరెన్స్ మీటింగ్ లు ఉండేవి ఆఫీసుకు వెళ్ళిరావటానికే మూడుగంటలవరకూ ప్రయాణమే అయిపోయేది.దాంతో మానసికంగా,శారీరకంగా అలసిపోయేది.బీపీ ఎక్కువ కావటం చేత మెడిటేషన్ కూడా మొదలు పెట్టాల్సి వచ్చింది.మైంట్రీ వాళ్ళు దానికి తోడూ ఇక్కడ కాకుండా అమెరికా, బెంగుళూరు,పూనా ఈ మూడింటిలో ఎక్కడైనా ఎంపిక చేసుకుంటే అక్కడే బ్రాంచ్ లో జాబ్ కి పంపుతామని అన్నారు.
ఇప్పటికి పదిహేను ఏళ్ళు పనిచేసాను.ఇక పరుగులుచాలనీ, ఉద్యోగం మానేసి తనకి ఇష్టమైన వ్యాపకాలు కల్పించుకుని,ఆషీ చదువుమీద దృష్టి పెట్టుకుంటాను అని పల్లవి నిర్ణయించుకుని రిజైన్ చేసేసింది.
ఒక నెలో రెండు నెలలో విశ్రాంతి తీసుకుని రామకృష్ణా మిషన్ లో జర్మన్ భాష నేర్చుకునేందుకు జాయిన్ అయింది.ఉద్యోగంలో వున్నప్పుడు ఒక సెమిష్టర్ భాష నేర్చుకుంది.అందుకని అక్కడే చేరింది.
క్లాసులు సాయంత్రం 5.30 నుండి 7-30 వరకూ వుంటాయి.అందుచేత పగలు అప్పుడప్పుడు సంగీతాన్ని సాధన చేయాలనుకుంది.ఇప్పటికే నా పుస్తకాలకు ముఖచిత్రాలు పల్లవే వేస్తుంది .నాకే కాకుండా ఇంద్రగంటి జానకీ బాలగారికీ నాలుగు పుస్తకాలకు,మరొక కవికీ కూడా ముఖచిత్రాలు డిజైన్ చేయటం మొదలుపెట్టింది .ఉద్యోగం వత్తిడి లేకుండా తనకి ఇష్టమైన వ్యాపకాలతో పల్లవికి రానురాను కొంత ఆరోగ్యం కుదుట పడింది.
ఒకరోజు తెలుగు విద్యార్థి మాసపత్రిక సంపాదకుడు రమణగారు వచ్చారు.వాళ్ళపత్రికకు ఏదైనా రెగ్యులర్ గా రాయమని అడిగారు.నేను రిటైర్ అయిన దగ్గర నుండి మా స్కూల్ అనుభవాలను ఏదో ఒక రూపంలో రాయాలనే ఆలోచన వుంది.సరే రాస్తానని చెప్పాను.ముందు ఒక పదో పదిహేనో ఇస్కూలు కతలు పేరిట రాయాలనుకున్నాను. కానీ రాస్తున్న కొద్దీ అనేక విషయాలు మనసులో మెదిలి రాయటం కొనసాగించాను.వాటికి మంచి స్పందన వచ్చింది.ఎక్కడెక్కడ నుంచో స్కూల్ టీచర్లు ఫోన్లు చేసేవారు.కొంతమంది వాళ్ళు విద్యార్థులతో మాట్లాడించేవారు.నాకు భలే సంతోషం కలిగించేది.ఈ ఇస్కూలూ కథలు రెండున్నర ఏళ్ళ పాటు తెలుగు విద్యార్థి మాసపత్రికలో ధారావాహికంగా ప్రచురితమయ్యాయి.
ఇంకా రాస్తూ వుంటుండగానే మహారాష్ట్ర పాఠ్య ప్రణాళిక కమిటీ నుండి ఫోన్ వచ్చింది.మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో రెండవ భాష తెలుగు పాఠ్యాంశంగా నేను రాసిన ఇస్కూలు కథల్లోని " ఒకే తాను ముక్కలం" కథని ఎంపిక చేసుకున్నట్లు అంగీకారం కోరారు.మరో రాష్ట్రంలో విద్యార్థులు నా కథని పాఠంగా చదువుతారు అంటే అంతకన్నా ఆనందం ఇంకేముంది? ఆ కథలకు వచ్చిన గుర్తింపు వలన ఇస్కూలు కతలు ముఫ్ఫై కథలు పూర్తికాగానే ఉపాధ్యాయ రచయిత అయిన గంటేడ గౌరు నాయుడు గారి ముందు మాటతో ఉపాధ్యాయుడే అయిన చిన్నన్నయ్యకు అంకితం ఇస్తూ పుస్తకంగా వేసుకున్నాను.
వీర్రాజుగారు నా రచనలమీద ప్రముఖులు రాసిన మంచి వ్యాసాలు వున్నాయనీ వాటిని పుస్తకం రూపంలో తెస్తే బాగుంటుందని ఆలోచన చేసారు.వాటినన్నింటిని తీసీ క్రమపద్దతిలో చేస్తున్నప్పుడు ఒక కవి వచ్చారు.ఆయనతో ఆ వ్యాసాలు చూపించి పుస్తకంగా వేయాలనుకుంటున్నట్లు చెప్పారు.ఇంతవరకూ కవయిత్రుల సమీక్షావ్యాసాలసంకలనం రాలేదని ఆయన అభినందనలు తెలియజేశారు.కానీ ఇంకా నా పుస్తకం డీటీపీ అవుతుండగానే మరొకరిది ఆఘమేఘాల మీద అటువంటి పుస్తకం వెలువడటానికి కారణం కూడా తెలిసి మానవ స్వభావం గురించి వీర్రాజు గారూ నేనూ అనుకున్నాము.
అక్క కూతురు రంజనావాళ్ళూ అబ్బాయి అనురాగ్ ని హైదరాబాద్ లోని లో ఎంబిఎ లో జాయిన్ చేయటానికి వచ్చారు.కాలేజీ హాస్టల్ లో చేర్చారు.సెలవుల్లో మా ఇంటికి వచ్చేవాడు.అన్నరాకతో ఆషీకి సందడి వచ్చింది.ఎప్పుడైనా సెలవురోజున వేస్తే అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ హొటల్ కో సినీమాలో వెళ్ళేవారు
అనురాగ్ అలా ఇంట్లో తాత గారూ,అమ్మమ్మా అని తిరుగుతుంటే మాకూ సందడిగా అనిపించేది
పుస్తక ప్రదర్శనలో ఇంద్రగంటి జానకీబాలగారి
"నవలా ద్వయం "పుస్తకాన్ని,నా రచనలపై సమీక్షలు సంకలనం " గీటురాయి పై అక్షరదర్శనం"లను ప్రమదాక్షరి స్టాల్ లో ఆవిష్కరణ జరిగింది.శ్రీకాంతశర్మగారూ, వీర్రాజు గారూ,జగన్నాథ శర్మగారూ పాల్గొన్నారు.అదే సందర్భంలో జగన్నాథశర్మ "నవ్యకి ఓ మంచికథరాయకూడదూ" అన్నారు.
అదే మాటతో మొదలుపెట్టి "నిజానికీ అబద్ధానికీ మధ్య" కథ రాసి నవ్యకి పంపించగా ప్రచురించారు.
నడక దారిలో -57
నడక దారిలో -57
కాకినాడ నుంచి వచ్చాక విశేషాలన్నీ వీర్రాజు గారికి చెప్పి శ్రీదేవి మోనోగ్రాఫ్ రాయటానికి ఏ నిర్ణయించుకున్నట్లు చెప్పాను.
కాత్యాయని విద్మహే తన దగ్గర వున్న ఉరుములూ- మెరుపులు సంపుటి జిరాక్స్ కాపీ, కొంత సమాచారం పంపించారు.
ఈ విషయం రామడుగు రాధాకృష్ణ మూర్తి గారికి చెప్పాను. శ్రీకృష్ణదేవరాయ గ్రంథాలయంలో తెలిసిన అతను వున్నాడు ఈ అక్కడకు వెళ్ళి చూద్దాం అన్నారు.సరేనని శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం కి వెళ్ళాను.రాధాకృష్ణమూర్తిగారు కూడా వచ్చారు.
అక్కడ తెలుగు స్వతంత్రలు ఎక్కడ వుంటాయో తెలుసుకుని పాత పత్రికల అల్మారాలు చూపించారు.
అక్కడ అంతా దుమ్ము కొట్టుకుని వున్నాయి.ఆ అల్మారాలు వెతుకుతుంటే పది పన్నెండు తెలుగు స్వతంత్రపత్రికలు కలిపిన బౌండు పుస్తకాలు వున్నాయి.అటువంటి బౌండ్లు ఒకపదిపదిహేను వరకూ వున్నాయి.అయితే అప్పట్లో కెమేరా ఫోన్లు లేవు.అవి జిరాక్స్ చేయించడానికి వీలుగానూ లేవు.
వాటిని ఇంటికి ఇవ్వటానికి కుదరదు.అన్నారు.నాకు ఏంచెయ్యాలో తోచలేదు.దిగులుగా రాధాకృష్ణ మూర్తి గారి వైపు చూసాను.ఆయన అర్థం చేసుకుని భాషానిలయం ఇంఛార్జి ఎమ్.వి.ఎల్. నరసింహామూర్తిగారితో మాట్లాడి పూచీకత్తు మీద
సాధ్యమైనంత త్వరగా అవి తిరిగి జాగ్రత్తగా అప్పగించేలా ఉత్తరం రాసి నేనూ,అయినా సంతకాలు పెట్టి ఇచ్చాము.
నా అదృష్టం కొద్దీ పుస్తకాలు బౌండ్లు ఇచ్చారు.అవన్నీ సంచులలొ వేసుకొని ఆటోలో ఇంటికి వచ్చాను.అవి చూసి వీర్రాజు గారు ఆశ్చర్యపోయారు.
ఆ పుస్తకాలను తొందరగా ఇచ్చేయవలసి వుంది కనుక వాటిలోని శ్రీదేవి రచనలు ఎన్ని వున్నాయో నోట్ చేసుకున్నాను.ఒక్కొక్క బౌండులో శ్రీదేవి కథ, వ్యాసం చదివి కథాంశం,కథలోని విశేషాంశాలు,పాత్రలు వీటి గురించి వివరంగా నోట్స్ రాసుకున్నాను.
తెలుగు స్వతంత్రలలో ధారావాహికంగా వచ్చిన శ్రీదేవి రాసిన మధుకలశమ్ దీర్ఘ కావ్యం నన్ను అబ్బుర పరచింది.ఆమె రాసిన కాలాతీతవ్యక్తులు నవల తప్ప ఇంకే రచనా గురించీ ఎవరూ చెప్పలేదు.
వీర్రాజుగారి సంపాదకత్వంలో అరవైలలో ఏరినపూలు పేరుతో ఒక సంకలనం తీసుకువచ్చారు.అందులో ఒక కథ దొరికింది.నేను వందమంది కవయిత్రుల సంకలనం" ముద్ర" తీసుకు వచ్చినప్పుడు శ్రీదేవి కవితలను అక్కయ్య పంపింది.అవి తెలుసు.ఇప్పుడు ఈ పుస్తకాలు వెతుకుతుంటే 20 కథలు,20కవితలు ,వ్యాసాలూ కూడా దొరికాయి.నాకు భలే ఉత్సాహం కలిగింది.పరీక్షలకీ ప్రిపేరయ్యే విద్యార్ధినిలా పూర్తి సమయాన్ని ఈ నోట్స్ తయారు చేయటంలో కేటాయించాను.
ఆ సమయంలోనే మధుకలశమ్ ని పుస్తకంగా వేయాలనే ఆలోచన మాకు వచ్చి జిరాక్స్ చేయటం కుదరదు కనుక దానిని కాపీ చెయ్యమని వీర్రాజుగారిని కోరగా ఆయన అదంతా ఒక పుస్తకంలో కాపీ చేసి ఇచ్చారు.
కవితా ఖండికలు నేనే కాపీ చేసాను.అందుకని కవిత్వం నోట్స్ తర్వాత రాసుకోవచ్చని ఊరుకున్నాను.
ముందుగా కథలన్నింటికీ, సాహిత్య వ్యాసాలకు మాత్రమే నోట్స్ రాసాను.ఇవేకాక గోరాశాస్త్రి రాసిన నడుస్తున్న చరిత్ర పేరిట రాజకీయ వ్యాసాల్ని ఆసక్తి కొద్దీ చదివాను.ఆవీ బాగున్నాయి.మరొక విశేషం తెలుగు స్వతంత్రల్లో అక్కయ్య కథలు కూడా చాలా దొరికాయి.వాటినికూడా కాపీ రాసుకున్నాను.అంతకుముందు అక్కయ్యవి అంతకు ముందు రెండు కథలు సంపుటాలు వచ్చాయి.వాటిలో చేర్చని కథలు కూడా పుస్తకంగా వేయాలనే ఆలోచన వచ్చింది.ఆ విధంగానే ఆ కథలను తర్వాత " నాకుగాదులు లేవు" పేరిట అక్కయ్యకు నివాళిగా సంపుటిని ప్రచురించాము.
ఆ సందర్భంలోనే నాకు బాగా నచ్చిన శ్రీదేవి పెద్దకథ వాళ్ళు పాడిన భూపాలరాగం కథమీదే ప్రత్యేకంగా ఒక వ్యాసం రాసాను.ఆ వ్యాసం సారంగపత్రికలో ప్రచురితమైంది.
శ్రీదేవి జీవితం గురించి ఏ వివరాలు తెలియవు .అక్కయ్య వున్నట్లైతే కొంత రాయగలిగేదాన్ని.మామయ్యని అడిగాను కానీ పెద్ద వయసు వల్ల ఏమి గుర్తు లేదన్నాడు.శ్రీదేవికి స్నేహితురాలైన నాయని కృష్ణకుమారిగారు కూడా లేరు.
కె.రామలక్ష్మికూడా మద్రాసులో తెలుగు స్వతంత్రకు కొంతకాలం ఉపసంపాదకత్వం వహించారు కనుక ఏమైనా చెప్పగలరేమో అని ఆమె దగ్గరకు ఒకసారి వెళ్ళి అడిగాను." నన్ను అడుగుతే నెగిటివ్ గానే చెప్తాను.మరి చెప్పమంటావా"అన్నారు.వద్దులెండి అని మాట మార్చేసాను.
ఇక ఆ తర్వాత నాకు తెలిసినంతవరకూ శ్రీదేవి జీవితం గురించి రాసి తర్వాత ఆమె రచనల ఆధారంగా ఆమె స్వభావం,వ్యక్తిత్వాన్ని చిత్రించాలని నిర్ణయించుకున్నాను.
వీర్రాజుగారు తాను వేసిన చిత్రాలను ఎక్కడైనా ప్రదర్శనకు పెట్టాలని అభిలషించారు.ముందు మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీ లో అనుకున్నారు కానీ అంతదూరం రోజూ వెళ్ళటం కష్టం అనుకున్నారు. ఆఖరుకు రవీంద్రభారతి ఆవరణలోనే వున్న కళాభవన్ లో నిర్ణయించారు.జనవరి 24 ( 2013)న బి.ఎ.రెడ్డి గారితో శీలా వీర్రాజు చిత్రకళా ప్రదర్శన ప్రారంభోత్సవం చేయించారు.జనసాహితి మిత్రులు ఈ కార్యక్రమంలో చాలా సహకారం అందించారు.జనసాహితి మిత్రుడు రాజూ ముందుగా వచ్చి అక్కడ కూర్చునేవారు.నాలుగింటికి మేమంతా వెళ్ళి తొమ్మిది వరకూ వుండేవాళ్ళం.అయిదు రోజుల పాటూ జరిగిన చిత్రప్రదర్శనకు చాలా మంచి స్పందన వచ్చింది.ఆ సందర్భంలో వీర్రాజుగారి పెయింటింగ్స్ పుస్తకాలు కూడా కొన్ని అమ్మకం కావటం సంతోషం కలిగించింది.వీర్రాజుగారికి తాను వేసిన చిత్రాలకు వచ్చిన స్పందన చాలా సంతృప్తి కలిగించింది.
ఆ సమయంలోనే ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు ఒకేసారి రెండు సంవత్సరాలకు ప్రకటించి,అవార్డు సభ కూడా జరిగింది.నేను అప్పుడే కొత్తగా ఫేస్బుక్ అకౌంట్ తెరిచాను.ఒకరోజు ఫేస్బుక్ లో ఒక కవి పెట్టిన పోస్ట్ కనిపించింది.
"ఫ్రీవర్స్ ఫ్రంట్ కి ఆంధ్రా ఫ్రీవర్స్ ఫ్రంట్ అని పేరు మార్చుకుంటే సరిపోతుంది."అని రాసి ఒక ఏడెనిమిది మంది తెలంగాణా కవుల పేర్లు రాసి వీళ్ళకు అవార్డు తీసుకునే అర్హత లేదా అని ప్రశ్నసంధించాడు.
అది చదివేసరికి చాలా చికాకు వచ్చింది.అతను రాసిన పేర్లలో ఒకరిద్దరికి ముఫ్ఫైనలభైఏళ్ళక్రితమే ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు వచ్చింది.ఆయన రాసిన జాబితాలో ఇంచుమించుగా అందరూ ఫ్రీవర్స్ ఫ్రంట్ అందుకున్నవారే.ఒకరికి మాత్రమే అనుకుంటాను ఈ అవార్డు రాలేదు.తెలిసీ తెలియకుండా నిందమోపుతూ రాయటం మాకు కోపం వచ్చింది.
వీర్రాజు గారు చెప్పిన వివరాలతో ఆయన గోడమీదే ఘాటుగా స్పందించాను.దాంతో ఆ పోస్ట్ ను తీసివేసాడు ఆయన.నిజానికి ఒక ఆంధ్రాకవి కవిత్వం మీద ఆయనే పుస్తకాలు రాసాడు.
ఈ రకమైన విద్వేషాల వలన సాహిత్యం సార్వజనీనం అనేది పొరపాటేమో అనే సందేహం నాకు కలిగింది.ఎక్కడో విదేశీ కవులను,ఇతర భారతీయ సాహితీవేత్తలను గూర్చి గొప్పగా మాట్లాడేవాళ్ళు మరో ప్రాంతం తెలుగు కవిని ద్వేషించటంలో అర్థం లేదనిపిస్తుంది.
ఆరోజు ఫిబ్రవరి 21(2013)వతేదీ పల్లవి ఆఫీసునుండి బయలుదేరి గంట దాటింది.ఇంకా రాలేదు.ఆ సమయంలో కోణార్క్ థియేటర్ ఎదురుగా ఉన్న ఆనంద్ టిఫిన్స్ ప్రాంతంలో ఒకటి రెండవ బాంబు వెంకటాద్రి థియేటర్ , దిల్సుఖ్నగర్ బస్టాండ్ ప్రాంతంలో మరొకటి బాంబు పేలుళ్ళు జరిగాయని టీవీలో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది.మాకు భయం వేసింది.పల్లవికి వెంటనే ఫోన్ చేసాను.సరిగ్గా ప్రేలుడు జరిగిన పది పదిహేను నిముషాలకే పల్లవి ఎక్కిన బస్ ఆ ప్రాంతాన్ని దాటిందట.ఏమిటొ అంతా గందరగోళంగా వుంది బస్ ఆపకుండా దాటేసాడు అని అంది. మరో అరగంటకి ఇంటికి చేరింది.మేము గాఢంగా వూపిరి తీసుకున్నాము.పెద్ద ప్రమాదం తప్పింది.
హైదరాబాద్ పోలీసుల చెప్పినదాని ప్రకారం , బాంబులను సైకిళ్లపై ఉంచారనీ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ (IEDలు) ఉపయోగించారని అన్నారు. ఈ ప్రమాదంలో 18 మంది పైగా మరణించగా అందులో నలుగురు వరకూ విద్యార్థులే నట. ఆ ప్రాంతంలో చాలా స్టూడెంట్ హాస్టల్స్ వున్నాయి.చాలామంది గాయపడ్డారని తెలిసింది.
కొంతకాలం వరకూ హైదరాబాద్ అంతా భయంతో వణికి పోయింది.చాలాకాలం వరకూ ఆ ప్రభావం జన జీవనంలో కనిపించింది.
వీర్రాజుగారు కుందుర్తి సత్యమూర్తికి అంకితంగా " ఒక అసంబద్ధనిజం "అనే కవితా సంపుటి ప్రచురించుకొన్నారు.వీర్రాజుగారి డెబ్భై అయిదవ పుట్టినరోజు పురస్కరించుకుని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేసారు.వేదికమీద సాహితి వేత్తలు లేకుండా ప్రత్యేకంగా జరిగింది.కవితాసంపుటిని చిన్ననాటి స్నేహితుడు కుందుం ప్రకాశరావుగారితో ఆవిష్కరింపజేసారు.చెక్కుచెదరని అరవై ఏళ్ళ స్నేహాన్ని ప్రకటించుకుంటూ మిత్రులు రామడుగు రాధాకృష్ణ మూర్తిగారికి,మల్లేష్ కు, బాలాజీ ప్రెస్ బాల ప్రసాద్ కు పదిహేను వేల నగదు ,వస్త్రాలతో గౌరవించారు.కవితాసంపుటి అంకితం కుందుర్తి సత్యమూర్తిగారి శ్రీమతి కుందుర్తి శాంతకు అందజేసారు.తర్వాత ఆవిష్కృతసంపుటిలో నుండి కొన్ని కవితలు వీర్రాజుగారు చదివారు.వినూత్నంగా జరిగిన ఆ సమావేశానికి చాలామంది కవులు,రచయితలూ హాజరయ్యారు.
ఆ విధంగా వీర్రాజు గారి డెబ్భై అయిదవ పుట్టినరోజు ,యాభై ఎనిమిదేళ్ళ సాహిత్య జీవన సందర్భం విజయవంతంగా జరిగింది.
దశాబ్దాల తెలంగాణా పోరాటం సాకారమైంది.
2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించగా,లోక్సభలో ఎన్నో నాటకీయ పరిణామాలు అనంతరం 2014 జూన్ 2వ తేదీన దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణా రాష్ట్రం నూతనంగా అవతరించింది.రాష్ట్రం అంతటా పండుగ వాతావరణం నెలకొంది.దేశస్వాతంత్రంవచ్చిన నాటికి నేను పుట్టలేదు.ఆంధ్రరాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికి చిన్నదాన్ని. సుదీర్ఘ పోరాట ఫలితంగా రాష్ట్రం సాధించుకోవటాన్ని ఈ నాడు చూసాను.
పోనీలే తెలంగాణ వారు కోరుకుంటున్నట్లు రాష్ట్రం ఏర్పడింది.ఇంక వైషమ్యాలు ,ద్వేషాలు తగ్గుతాయి.ఎవరి రాష్ట్రం వాళ్ళకు వచ్చింది. అనుకున్నాం .
జనరల్ ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో గెలిచినవి రెండే పార్టీలు.విభజన ప్రక్రియలో భాగస్వామ్యం వున్న కాంగ్రెస్ ,బీజేపీలను మట్టిగరిపించారు. దాంతో కాంగ్రెస్ పెద్దలు కండువాలు మార్చేసారు.
తెలంగాణాలో 119 సీట్లకు63 సీట్లవిజయం సాధించి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది.ప్రతిపక్షపార్టీగా కాంగ్రెస్ నిలిచింది.టిడీపీ15 సీట్లతో మూడో స్థానం లో నిలిచింది.బీజేపి, వైకాపా, కమ్యూనిస్టు పార్టీల నుండి కూడా బాగానే గెలిచారు. కానీ తర్వాత్తర్వాత ఒకరొకరే ఆపరేషన్ ఆకర్ష్ లో సమిధలై అధికార పార్టీలోకి దూకేసారు.
15వ లోక్సభ ఎన్నికలు 2014 మే 31న పూర్తి చేసి మే 16న ఫలితాలు ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ (BJP) 282 సీట్లను గెలుచుకోగా, (NDA) మొత్తం 336 సీట్లను గెలుచుకుంది. 1984 తర్వాత ఒక పార్టీ ఇతర పార్టీల మద్దతు లేకుండా పరిపాలించడానికి తగినంత సీట్లు గెలుచుకోవడం ఇదే మొదటిసారి.కాంగ్రెస్ కేవలం 44 సీట్లను మాత్రమే గెలుచుకుంది,
ఆవిధంగా మిగులుఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు, తెలంగాణా రాష్ట్రానికి కేసీఆర్ తొలి ముఖ్యమంత్రులుగా,ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ తొలిసారి ప్రమాణస్వీకారం జరిగింది.
ఒకరోజు హైమవతీ భీమన్న గారి నుండి వీర్రాజు గారికి ఫోను వచ్చింది.
" పద్మభూషణ్ బోయి భీమన్న సాహితీ పురస్కారానికి వీర్రాజుగారిని ఎంపిక చేసినట్లు చెప్పారు. సెప్టెంబర్ 19వ తేదీన తెలుగు విశ్వవిద్యాలయంలోని బోయి భీమన్న సాహితీ పీఠం ఆధ్వర్యంలో జరిగే భీమన్న 104వ జయంతి ఉత్సవంలో డాక్టర్ సి.నారాయణరెడ్డికి బోయి భీమన్న జీవన సాఫల్య పురస్కారం క్రింద రెండు లక్షలూ, పద్య కవితా పురస్కారానికి రసరాజు, గేయ కవితకు గూడ అంజయ్య, వచన కవితకు శీలా వీర్రాజు, నాటకానికి పాటిబండ్ల ఆనందరావు, కథ,నవలకు కేశవరెడ్డి, అనువాదానికి నలిమెల భాస్కర్, ఉత్తమ రచయిత్రి పురస్కారానికి పి. సత్యవతి లకు లక్ష రూపాయలు చొప్పున అందజేసారు.
వీర్రాజుగారి సంతోషానికి అవధులు లేవు.తొలిసారి బహుమతిగా లక్ష అందుకోవటం అంటే మాటలు కాదు కదా.
తర్వాత దగ్గరలోనే చలసాని వసుమతిగారి అవార్డు కూడా వీర్రాజు గారికి వచ్చింది.కారులో అందరం బయలుదేరాం.మంచిహొటల్లో మాకోసం రెండు రూములు బుక్ చేసారు.ఆ రోజు సాయంత్రమే సభ.వీర్రాజుగారితో పాటూ విహారిగారికి కూడా మరో ఏడాదికి ఇచ్చారు.పురస్కారసమావేశం,భోజనాలు పూర్తై వచ్చేసరికి ఆలస్యం అయ్యింది.వచ్చి పడుకున్నాం.మర్నాడు విజయవాడ పరిసరాలు చూసేందుకు బయలుదేరాం.దుర్గగుడికి ముందు వెళ్ళాం.చాలా రెష్ గా వుంది .నేనూ,పిల్లలూ లోపలికి వెళ్ళాం.వీర్రాజుగారు లోపలికి రాలేదు.దారిలో భోంచేసి మంగళగిరి, అమరావతి వెళ్ళాము.దారిలో తుళ్ళూరు,తాడేపల్లి మొదలైన తోవలలో చేలల్లో నిలువెత్తు కంకులతో పైర్లను చూసి కారును ఆపించి
ఫొటోలు తీసుకున్నాము.ఎప్పుడూ అలా చేలూ, పైర్లు చూడలేదేమో ఆ పచ్చదనానికి సరదాపడి మైమరచిపోయాము.
ఇక ఆ మర్నాడు వసుమతి గారి ఇంటికి వెళ్ళి అక్కడే భోజనం చేసి హైదరాబాద్ కి తిరుగుముఖం పట్టాము.
ఇంటికి చేరిన మరురోజు వార్తలు వింటున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తుళ్ళూరు,అమరావతి ప్రాంతాన్ని నిర్ణయించినట్లు చెప్పేసరికి నిన్న ఆ ప్రాంతాల్లోనే తిరిగాము కదా అని థ్రిల్లింగ్ గా అనుకున్నాము.
మళ్ళా అనుకోకుండా దగ్గరలోనే ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్ గారు తమ సంస్థ ద్వారా బాపురమణల పురస్కారం వీర్రాజుగారికి ఇవ్వాలనుకుంటున్నామని ఆహ్వానించారు. ఈ సారి నేనూ, వీర్రాజు గారు విజయవాడ వరకూ ట్రైన్లో వెళ్ళాము.స్టేషనుకు గుత్తికొండ సుబ్బారావుగారు వచ్చి కారులో మచిలిపట్నం వాళ్ళింటికి తీసుకు వెళ్ళారు.సాయంత్రం ఉయ్యూరు సభా సమావేశానికి తీసుకు వెళ్ళారు.దుర్గాప్రసాద్ గారు చాలా ఆత్మీయంగా సత్కరించారు.దుర్గాప్రసాద్ గారికి మా పుస్తకాలు ఇచ్చాము. ఆశ్చర్యకరంగా కొన్ని రోజులకే దుర్గాప్రసాద్ గారు మా పుస్తకాలపై సుదీర్ఘ విశ్లేషణలు రాసి వారి బ్లాగ్ లో పోస్ట్ చేసారు.
మర్నాడు సుబ్బారావు గారు మమ్మల్ని పరిసర ప్రాంతాలైన ఘంటశాల, శ్రీకాకుళం తీసుకు వెళ్ళి అన్ని చూపించారు.
అనంతరం సాయంత్రం ట్రైనుకు మమ్మల్ని
తిరుగు ప్రయాణానికి స్టేషన్లో బండి ఎక్కించారు.
ఛాయా రాజ్ నవల" కారువాకి"
పూర్వ కళింగుల జీవన అద్భుతం "కారువాకి" నవల
"ఛాయరాజ్ విశిష్ట కవిత్వవ్యక్తిత్వానికి అద్దంపట్టే రచన 'కారువాకి' నవల. పూర్వ కళింగుల మహత్తర జీవన ప్రస్థానం మనకు అద్భుతంగా సాక్షాత్కారమై అనుభూతి కావడమే కారువాకి నవల సాధించిన విజయానికి సాక్ష్యం. కావ్య ఇతివృత్తం ఒక చారిత్రక వాస్తవం . "అంటారు బి.సూర్యసాగర్ గారు కారువాకి ముందు మాటలో.
ఒకచారిత్రక నవలని పరిచయం చేయడం కష్ట సాధ్యమైన పని. ఎందుకంటే కథాకాలం నాటి చరిత్రలతో మమేకమౌతే గాని ఆ నవలని ఆస్వా దించలేము.
ఛాయారాజ్ గారి కళింగ యుద్ధకాలం నాటి పూర్వ కళింగుల జీవన అద్భుతాన్ని ఒక ప్రవాహసదృశంగా చిత్రించిన " కారువాకి " నవలని చదివిన తర్వాత దాని గురించి కొంతైనా చెప్పాలనిపించింది.
నవల ఆసాంతం కవితాత్మకంగా సాగుతుంది. అనేక చోట్ల గొప్పప్రకృతి వర్ణనలు పాఠకులను ఆకట్టుకుంటాయి .
క్రీపూ నాటి శిలాశాసనాల నుండి సేకరించిన సమాచారాన్ని, స్కంద పురాణం,మత్స్యపురాణం
మొదలైన ఐతిహాసిక గ్రంధాల నుండే సేకరించిన ఉపకథలతో, ఉటంకింపులతో ఈ నవల సాగుతుంది
వంశధార, నాగావళి,జంఝూవతీ నదులు ,సరయూ, తమసా, గోమతీ ఇలా అనేక నదుల పరివాహక ప్రదేశముల గురించి నదుల నడకలతో గలగల జల జలా ప్రవాహసదృశంగా నవల ఆసాంతం నడుస్తుంది.
మహాభారతం లోని భీష్మపర్వం ఆధారంగా కురుక్షేత్రంలో కళింగులు అర్జునునితో, కృష్ణునితో పోరాడి క్షత్రియులయ్యారనే ఉటంకింపును తెల్పారు. జాతక కథల నుండి ,మహావంశము నుండి ఉపోద్ఘాతము, కళింగ బోధి, ఎఫ్.కొరోవ్కిన్ ' ప్రాచీన ప్రపంచ చరిత్ర'నుండి,రాహుల్ సాంకృత్యాయన్ రచనలే కాక రామాయణం సందర్భాలను ఆయా గ్రంధాలనుండి అవసరమైనంత మేరకు రచయిత ప్రస్థావన చేసారు.
ప్రధానంగా 'కారువాకి' నవలలో ఇతివృత్తం పూర్వకళింగుల జీవితచిత్రణ.
సూర్యసాగర్ గారు నవలకు ముందుమాటలో
అనేక విషయాలు ప్రస్తావించారు."గురజాడ 'కళింగదేశ చరిత్ర'ను రాయటానికి సంకల్పించగా దాన్ని ప్రచురించబోతున్నట్లు కొమర్రాజు లక్ష్మణరావు ప్రకటించారనీ ,అయితే గ్రాంధికభాషలో రాయాలనే కొమర్రాజు షరతుని గురజాడ నిరాకరించి, కళింగ చరిత్ర రాయటమే విరమించుకున్నారనీ తెలియజేసారు.
తర్వాత రాళ్ళబండి సుబ్బారావు రచించిన 'కళింగదేశ చరిత్ర' మూలాధారంగా 'కారువాకి' నవలను రాసినట్లు ఛాయరాజ్ చెప్పుకున్నారు.
కళింగ దేశ చరిత్ర ఆధారంగా కళింగ (కలిగంగ) ప్రజలలో ఎన్ని రకాల జాతులున్నాయి, వారి జీవన విధానం ఏమిటి అది నవలకు అవసరమైనంత వరకూ ఛాయారాజ్ గ్రహించి నవలలో పొందుపరచారు. కళింగులు అనేది సార్వజనీనంగా వూహించుకుంటాం. కానీ అందులోనే అనేక గిరిజనజాతులే కాక కోమట్లు , బ్రాహ్మలు కూడా వుంటారనేది తెలిసింది . బహుశా వివిధవృత్తులను అనుసరించి విభిన్నజాతులుగా గుర్తించే వారేమో.
అనార్యజాతిగా పరిగణించబడిన కళింగ ప్రజలు ఆర్యులపై తిరుగుబాటులు చేసి, ఆర్యసంస్కృతిని వ్యతిరేకించి, ఆదిమవాసుల జీవనవిధానాన్ని, సంస్కృతిని అనుసరించే స్వతంత్ర ప్రజలుగా రచయిత కధనం చేసేటప్పుడు పలుమార్లు అక్షరీకరిస్తారు.
హిమాలయాల పుట్టుకంత ప్రాచీనచరిత్ర గల ప్రజలనీ, భూమిమీదేకాక జల సంపదలతో పెనవేసుకున్న వారైన కళింగ ప్రజలు అమిత సాహసికులనీ పాఠకులకు తెలుస్తుంది
కళింగ స్త్రీలు(కారువాకులు) కూడా ధైర్యసాహసులు. పురుషులతో సమానంగా ప్రతీ పనిలోనూ, పోరాటాలలోను యుద్ధాలలోను పాల్గొంటారు. స్త్రీలపై దుర్మార్గాలను సహించరు .స్వాతంత్య్రప్రియులైన కళింగులు
అధికారాన్ని కోరుకోరు . అధిపత్యాన్ని అంగీకరించక పోవటమేకాక రక్తతర్పణలు చేయడానికైనా సిద్ధపడతారంటారు రచయిత .
క్రీపూ268 నాటికి అశోకుడు విజయకాంక్షతో. సోదరులను అడ్డుతొలగించుకొని కారునలుపుతోనున్న స్వచ్ఛమైన కళిగంగానది నీళ్ళలో కాళ్ళు కడుక్కుంటూ "కారువాకి" అనే మత్య్సకన్యని చూసి ఆమె సౌందర్యానికి విస్మయుడై ఆమెని ఎత్తుకుని వెళ్తాడు. మొదట అతనిని ప్రతిఘటించినా తుదకు అతని సౌందర్యానికి ,ప్రేమకి లొంగిపోతుంది ఆ నదీకన్య..
అనటంలో కారువాకి ప్రసక్తి వచ్చినప్పుడలా నవలలో నదిప్రవాహ సౌందర్యంతో రచయిత పోల్చుతూ రాయటం వలన నవల ఆ సాంతం పాఠకులకు ప్రవాహ అలల గలగలలు వినిపిస్తుంది.
నిజానికి పచ్చని ప్రకృతి,నదీప్రవాహం మీదుగా వీచే స్వచ్ఛమైన మందపవనాలూ,అలల గలగలలూ నవల చదువుతున్నంతసేపూ పాఠకుల హృదయాన్ని తాకుతూనే వుంటాయి.కళింగయుద్ధ దండయాత్ర నుండి నవలలో కళింగుల ఆత్మవిశ్వాసం,పోరాటపటిమ ,ఆ నాటి యుద్ధ తంత్రాలు ఆశ్చర్యం గొలుపుతాయి.
బ్రాహ్మణుడి వద్ద విద్యనభ్యసించి, గ్రంధాలను అధ్యయనం చేసిన కారువాకి ప్రేమతత్త్వం మాత్రం అశోకునితో అనుబంధం వల్లనే తెలుసుకోగలిగింది.
ప్రకృతికి, సమాజానికి మనిషి అవసరమెందుకో అశోకుడు చెప్పినప్పుడే అర్థమైంది.
అటువంటి అశోకుడు సామ్రాజ్య కాంక్షతో సోదరులను చంపటంగానీ,కళింగులపై దండయాత్రలు గానీ ఎందుకు చేస్తున్నాడో మాత్రం ఆమెకు అర్థం కాలేదు.
కారువాకి రాణివాసం నుండి బయలుదేరి
రాజభవనాల్ని చూస్తుంది. చక్రవర్తి ఖజానాని ఇతర గిడ్డంగులనూ దర్శిస్తుంది. రాజ్యసంబంధిత విషయాలను రక్షణసిబ్బంది నడిగి తెలుసుకుంటుంది .కళింగులపై దండ యాత్ర గురించిన సమాచారం తెలుసుకుంటున్న సమయంలో అశోకుడు వస్తాడు. "నాపై ప్రేమ బహుజన ప్రయోజనకారి కావాలి కదా ఈ దండయాత్రలు ఏమిట"ని ప్రశ్నిస్తుంది
చక్రవర్తి సామ్రాజ్యా కాంక్షకు, కళింగుల స్వేచ్ఛకు వైరుధ్యం వుందని తెలుసుకున్న కారువాకి తన శరీరానికి ఆలోచనలకూ మధ్య సంఘర్షణలో నలిగి పోయి అశోకుని సామ్రాజ్యకాంక్షని కళింగులు తుదముట్టించగలరా అనే ఆవేదనతో అశోకుని వక్షస్థలం పై సొమ్మసిల్లి పోతుంది.
" కళింగ దేశానికి ఉత్తరాన మహానది, లేక వైతరణి, దక్షిణమున నాగావళి, తూర్పున సముద్రం, పశ్చిమాన తూర్పుకనుమలు ఎల్లలుగా ఉంటాయి.
కళింగదేశం పశ్చిమం నుండి తూర్పునకు ఏటవాలు గా వుండటం వలన సువర్ణరేఖ, వైతరణి, బ్రాహ్మణీ, తెలివాహ, మహానది, ఋషికుల్య, వంశధార, నాగావళి నదులు తూర్పు సముద్రం వైపు ప్రవహిస్తాయి " అన్నది చదివాక ఆనాడు ఆ ప్రాంతం ఇన్ని నదీప్రవాహాలతో ఎంత సస్య శ్యామలంగా వుండేదో అనిపించింది.
అదికూడా నవలలో చెప్పారు రచయిత.
ధాన్యము, మెట్టపంటలు, పత్తి పంటలు ,తీయని పండ్లు ,సన్న నూలు ఎగుమతి చేసేవారని రచయిత చెప్తూ ఈజిప్టు, గ్రీసు, రోము దేశాలతో వాణిజ్య సంబంధాలు ఉండేవనేది పాఠకులకు అబ్బురం కలిగిస్తుంది..
ఇక కళింగ యుద్ధసన్నాహం చూద్దాం,--
కళింగ దేశానికి గల సైనిక బలాన్ని, యుద్ధానికి తగు సమయాన్ని శీతాకాలం అనుకూలమని అశోకుడు నిర్ణయించుకున్నాడు.
మౌర్యసైన్యాలన్నీ దండయాత్రలో నలువైపుల నుండి కళింగ వైపునడిపించి మోహరిస్తున్నాయి. వాటిని ప్రతి ఘటించేందుకు ప్రజా సమూహలు దూసుకు వెళ్తుంటాయి.
" రంకెలు వేసి సైన్యాన్ని కొమ్ములతో కుమ్మేందుకు ఎద్దులకు కళింగ ప్రజలు తర్ఫీదు ఇస్తారు. బొంగులతో పిచికారు యంత్రాలు తయారు చేస్తున్నారు, కారంతో నింపిన కర్ర గొట్టాలను, దురద గొండ నుసిని మూటలు కడుతూ ఆయుధాలుగా తయారు చేస్తున్నారు కళింగ మహిళలు .. రెల్లుదూది పింజలను కళ్ళలోనికే కొట్టే ఈటల్ని బాల కాళింగులు. " అంటూ ప్రజాసమూహాలు యుద్ధానికి సన్నద్ధమయే తీరును రచయిత వివరిస్తారు.
కళింగ దేశం దిశగా యుద్ధసన్నద్ధమై సామ్రాజ్య కాంక్షతో తరలివెళ్తున్న అశోకుడు మార్గమధ్యంలో ఒక బౌద్ధ భిక్షువుని సందర్శిస్తాడు.
భిక్షువుకి ప్రణమిల్లి తిరిగి లేచి అశ్వాన్ని అధిరోహించి, ముఖాన్ని తాకుతున్న సూర్యకిరణాల్ని తుడుచుకుంటూ, సైన్యం వెంటరాగా, తూర్పుదిక్కుగా బయలుదేరుతాడు అశోక చక్రవర్తి.
కళింగ ప్రజలు ఆత్మాహుతి కైనా సిద్ధపడుతున్నారుకానీ యుద్ధభూమిని వదలకపోవటం చక్రవర్తికి విస్తుగొలుపుతుంది.మౌర్యసైన్యాలపై కళింగులకంత ద్వేషమెందుకో చక్రవర్తికి అర్థం కాలేదు.తన సైన్యం చేసే అకృత్యాలు గమనించినప్పుడే కదా అటువంటివి అర్థమయ్యేది.
కళింగదేశం నేలంతా నెత్తురు బురదగా మారిపోయింది. కళింగ, మౌర్యసైనికుల నెత్తురులతో కళింగ దేశమంతా రక్తపుమరకలతో నిండిపోయింది .
కళింగ తీర ఇసుకదిబ్బలలో తుపాను రేగి కళింగతీర ప్రజల కళేబరాలను భూమిలో కప్పివేసింది.
కళింగ శరీరనాడులను గాలి శ్రుతిచేసి విప్లవగీతాలాలపించింది.
తుళ్ళిన నెత్తురుతో తడిసిన కళింగ ఆకాశం లో మేఘం తాటికాయలంత ఎర్రనిచినుకులను కురిసి మెరిసి నేలపై రక్తాన్ని ముద్దాడింది.
కళింగ రక్తం ఎదుట తలదించుకుని, కళింగ దేశానికి చక్రవర్తిగా ప్రకటించబడి, అశోకుడు అన్యమనస్కుడై నయనాలను బలంగా మూసుకున్నాడు.
సూర్యుడు మధ్యభారత కళింగనేలనే అస్తమిస్తున్నట్టు భావించాడు అశోకుడు.చీకట్లు కమ్ముతున్నాయి,మూర్చిల్లిన అశోకుడి శరీరాన్ని శ్వేతాశ్వం జాగ్రత్తగా మోసుకుపోతోంది.-- రచయిత
ఈ విధంగా కళింగయుద్ధ విధ్వంసాన్ని వర్ణించటం ఎలా వుందంటే --
సూర్య సాగర్ అన్నట్లుగా " విశాల ప్రదేశంలో జరిగిన కళింగయుద్ధ బీభత్సాన్ని పరిమిత పేజీల ఆవరణలో దృశ్యమానం చేశాడు ఛాయరాజ్. వెండితెరపై కూడా యిమడలేని దృశ్యాలను అక్షరాలలో బంధించాడు."
అనేది నవల చదువుతున్నంతసేపూ పాఠకులు కూడా అనుభూతి చెందుతారు.
నవల ముగింపులో "ప్రజలే నిజవీరులు. ప్రజలే నిర్మాతలు. ప్రజలు ఎన్నడూ దుర్మార్గులు కారు. వ్యవస్థలలోని ప్రజల పక్షం, వారి శ్రమపక్షంగా రచయిత చూడాలి. 'కళింగుల' పాత్రను అలా చూసాను నేను. "అని ఛాయరాజ్ గొప్ప ఆశావహ దృక్పధాన్ని వ్యక్తం చేశాడు.
ఛాయా రాజ్ యుద్ధంతో కేవలం కథాంశాన్ని ముగించి వూరుకోలేదు.తర్వాత వారసులు ఎంతకాలం పరిపాలించారో తదితరవిషయాలన్నీ
వెల్లడించారు.
చివరగా "ఈ నవల రాస్తున్నప్పుడు ఒక్కొక్కసారి భావం ప్రధానమైపోయి భాష ముద్దకట్టుకు పోయింది.ఒక సామాజిక చరిత్రను రాయటానికి భాషతో చిత్రలేఖనం చేయవలసి వచ్చింది" అని ఆయన చెప్పుకున్నమాట అక్షరాలా నిజం.
వెలిసి పోయిన మహాకావ్యం -2
~ వెలిసిపోయిన మహాకావ్యం ~
పొద్దున్నే నిదురను రెప్పలతో విసిరికొట్టి
కళ్ళకు భూపాలరాగాన్ని హత్తుకొని
నీకు మేల్కొలుపు పాడేది ఎవరనీ
వంటింట్లో కచ్చేరీని "కాఫీ" రాగంతో ప్రారంభించి
చిరునవ్వు మేళవింపుతో కప్పు అందించేది ఆమెనే
డాబా పైన నిలుచుని నీదైన సమయాన్ని
యోగాసనాల్తో కరిగించుకుంటూ
దూరాన కొండల్ని చూస్తుంటే
నీతోడి జీవితం నల్లేరుపై నడకేనని
నున్నటి రాజమార్గం మీద జీవితాన్ని కలల్నికంటూ
నీ చేయి అందుకున్నదెవరనీ తలచేవా
ఆ పైన విశాలాకాశంలో
మబ్బులతో పోటీ పడుతోన్న
ఆశల్నీ,ఆకాంక్షల్నీ అలంకరించిన
అందమైన గాలిపటాలేనాడైనా
నువ్వు ఎగరేసిన చూపుల కొసకు చిక్కుకుని
ఆమె గుండెవూసుల్ని గుసగుసలుగా చెప్పలేదా
నదీ పాయవెంబడి ఏనాడైనా నడిచావా
ఒద్దికగా నడిచే సెలయేరు బండరాయి తగిలి
చెంగున గెంతినప్పుడు నెచ్చెలి కాలిమువ్వ
నీ గుండెలో గిలిగింతలతో సన్నగా శబ్దించలేదా
సముద్రతీరంలో విహరించినప్పుడు
బడబానలాన్ని దాచుకుని లోలోన జ్వలిస్తూనే
నిగూఢమైన నిర్మలమైన గాంభీర్యంతో
అలల చిరునవ్వుల్ని విరజిమ్మే సముద్రం
నీ నట్టింటే నడయాడుతోందని ఏనాడైనా గుర్తించావా
నీ ఇంటినిండా వెన్నెల కళ్ళాపి చల్లి
పూలగంధాలతో రంగవల్లులు దిద్దిననాడు గానీ
నీ దేహార్తిని చల్లార్చి నీ వంశాన్ని తీర్చి
చాకిరీతో కొవ్వొత్తై కరిగి పోయిననాడు గానీ
నీ జీవితావరణం అంతటా నిండి వున్నది కాస్తా
అకస్మాత్తుగా అదృశ్యమైనప్పుడు గానీ
ఆమె విలువ గుర్తింపు లోనికి రాదు
ఇంక అప్పుడు ఎంతగా కుళ్ళి కుళ్ళి ఏడ్చి
అక్షరంగా ప్రవహిస్తే మాత్రం ఏం లాభం
ఆమె జీవించి వున్నప్పుడే
నీవు లేని చోటేదీ లేదని హత్తుకొని వుంటే
జీవితం అందమైన మహాకావ్యమయ్యేది కాదా
21, అక్టోబర్ 2025, మంగళవారం
సామాజిక సంబంధాల దృశ్యాలే జయంతి కథలు
~సామాజిక సంబంధాల దృశ్యాలే జయంతి కథలు ~
కథ కేవలం కాలక్షేపానికి చదువుకునేలా మాత్రం ఉండకూడదు. కథానిక పుట్టిన గతవందేళ్ళకాలంలో ప్రముఖులకథల్ని పరిశీలిస్తే సింహభాగం కథలన్నీ ఆయాకాలపు సమాజం యొక్క తీరుతెన్నుల్నీ, జీవనవిధానాల్నీ ప్రతిబింబించేవి గానే ఉన్నాయి.
కాలక్రమేణా సమాజంలో వచ్చే మార్పుల్ని,ప్రజలజీవనవిధానాల్నీ,మనిషి మనస్తత్వంలో మారిపోతోన్న స్వార్థాన్నీ,అహంకారాల్నీ అన్నింటినీ ఆయాకాలాలలో వచ్చే సాహిత్యం ఎప్పటికప్పుడు ఒడిసి పట్టి చూపింది.
జయంతి రాసిన అటువంటి కథలన్నీ ఎక్కువగా సంభాషణాత్మకంగానే నడుస్తాయి.కథాగమనంలో ఎక్కడా ఉపన్యాసాలు,నీతి బోధలు,సాగతీతలూ ఉండవు.తీసుకున్న అంశాన్ని చెప్పదలచుకున్న విధంగా సంభాషణలతోనే నడపటం వలన పాఠకులకు ఉత్సుకతతో సెలయేటి ప్రవాహంగా కథనం సాగుతుంది.
ఒకప్పుడు కథకులు చాలా పెద్ద కథలు సుమారుగా పదిహేను పేజీలకు పైగా నవలికలే అనిపించేలా ఉండేవి.రానురాను పత్రికలు పెద్దకథలు ప్రచురించేందుకు ఇష్టపడక పోవటం,ప్రింటులో రెండు పేజీలు మించని కథల్ని ఆహ్వానించటం ,పదాల నియమం విధించటం వలన కథలపరిమాణం తగ్గిపోయింది. ఆ ప్రభావం జయంతి కథలపై కూడా పడింది.
మంచి కథకు ఉండవలసిన లక్షణాలు క్లుప్తత, అనుభూతి ఐక్యత,సంఘర్షణ,నిర్మాణం సౌష్టవం అని నిర్వచించారు ప్రముఖ విమర్శకులు.
ఇందులో కొన్ని కథలు కథాంశం రీత్యా పెద్దకాన్వాసు కలిగినవి.వాటిని కుదించే ప్రయత్నంలో అకస్మాత్తుగా దృశ్యం ,సంఘటన మారిపోవడం జరిగింది.ఒకచిన్న పరిధిలో జీవితాన్ని చిత్రించే క్రమంలో హటాత్తుగా పరిమితికి లోబడి కథను ముగించినట్లుగా కొన్ని కథలు ఉన్నాయి.
సరోగసీ కథాంశంతో ఇటీవల చాలా కథలు వస్తున్నాయి.జయంతి రాసిన "మాతృస్పర్శ" కథాంశం
పోలికతో సుమారు ఇరవై ఏళ్ళ క్రితం ఒక సినిమా కూడా వచ్చింది.అంతమాత్రాన ఇది కాపీ అనటానికి వీల్లేదు.జయంతి కథను ఎత్తుగడ దగ్గర నుంచి సమర్థవంతంగా తనదైన శైలితో కథ ఆసాంతం ఆర్ద్రంగా నడిపించి చివరకు ఆశావహ దృక్పథంతో ముగించడం అభినందనీయం.
కథలు చాలా వరకూ గ్రామీణ ఉత్పత్తి కులాలకు చెందిన కథలు కావటం వలన వృత్తి పనులకు సంబంధించిన వివరాలను కథాక్రమంలో తెలియజేసింది రచయిత్రి.
కొడిగట్టిన దీపం,కబ్జా కథలు రెండూ ఇంచుమించుగా కథాంశంతో సారూప్యంగా ఉండి కుటుంబసంబంధాలు ఏవిధంగా ఆర్ధిక ప్రాతిపదికన ఛిద్రమైపోతున్నయో దృశ్యమానం చేసాయి.ఈ రచయిత్రి చాలా కథల్లో మానవ సంబంధాలు విచ్చిన్నం కావటాన్నే అక్షరీకరించటం గమనార్హం.
ఇద్దరు పిల్లలతల్లి శ్రీనిథి భర్త మరణానంతరం వ్యాపారాన్ని, పిల్లల్ని అభివృద్ధి లోకి తేవటానికి తన యవ్వన జీవితాన్ని వదులుకున్న శ్రీనిథికి పెద్ద చదువులలో ఉన్న పిల్లలు పెళ్ళి చేయాలనుకోవడం కథాంశం.కథగా చదవటానికి సరళ సంభాషణలతో హాయిగా ఉంది.అయితే నిజజీవితంలో అది ఎంతవరకూ ఆచరణ సాధ్యం అనిపించింది.
వృద్ధాశ్రమం నేపథ్యంలో రాసిన మరో మార్గం,కరోనా సంక్షోభం నేపధ్యంలో రాసిన రెండు కథలు చక్కని సరళ సంభాషణలతో బాగున్నాయి.
పేద కుటుంబాల్లో ఆడపిల్లలు చదువులు ఆగిపోవటం అనేది సర్వసాధారణం. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయాలనే కలని సాకారం చేసుకోవాలంటే వారికి బలమైన ఆకాంక్ష మాత్రమే వుంటే సరిపోదు.ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకొని నిలవగలిగే ఆత్మస్థైర్యం కూడా వుండాలి.అదిగో అటువంటి ఆత్మస్థైర్యం గల నైమిష కథే నింగికి మొలిచిన రెక్కలు.
ఇంచుమించుగా సందర్భాలూ,సన్నివేశాలూ వెరైటీగా జీవితంలో ఎదురీది అనుకున్న స్థాయికి వచ్చిన ప్రశాంతి ( ప్రశ్నాపత్రం),నవీన( తోడు వీడి వెళ్ళాక) పాత్రల్ని చిత్రించింది రచయిత్రి.
నవలలుగా రాయదగినంత కథాంశాన్ని కుదించి రాసిన కథలు కొన్ని వున్నాయి అటువంటి వాటిలో ' ఎండమావి 'కథ వొకటి.రచయిత్రి వీలు వెంట తాను రాసిన కథనే తిరిగి రాసి నవలగా మార్చవచ్చును.
మంచి కథాంశాల్ని స్వీకరించి అవసరమైన చోట్ల పాత్రకు అనుగుణమైన ప్రాంతీయభాషతో కూడిన సంభాషణలతో మంచి పఠనీయతతో కథల్ని రాస్తోంది జయంతి.చాలా కథల్లో సాధికారత కలిగిన స్త్రీ పాత్రలు కూడా వుండటం రచయిత్రి యొక్క అభ్యుదయభావాలు, దృక్కోణం వ్యక్తం అవుతున్నాయి.
కథానిర్మాణంలో మరికాస్త జాగరూకత ఉండాలని నా భావన.అందుకు సమకాలీన కథాసాహిత్యాన్ని మాత్రమే కాక పాతతరం ప్రముఖుల రచనల్ని బాగా చదవాల్సిన అవసరం ఉంది.
కథానిర్మాణంలో తనదైన గొంతు బలంగా రచయిత్రి వినిపించగల్గినప్పుడు ఆ కథ ప్రయోజనం సిద్ధిస్తుంది.చాలా కథల్లో జయంతి బలంగా చెప్పటం తెలుస్తోంది.
మరిన్ని మంచి రచనలతో సంపుటాలు వెలువరించాలని అభిలషిస్తూ జయంతి వెలువరించిన కథాసంపుటి "శర్వమ్మ మరణం"కథాసంపుటిని నా మనసారా స్వాగతిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను.
20, సెప్టెంబర్ 2025, శనివారం
అంత తొందర ఎందుకు రజితా
~ అంత తొందర ఎందుకు రజితా??? ~
ఒక రోజు స్కూల్ నుండి వచ్చి ఇంట్లో అడుగు పెట్టేసరికి " హల్లో" అంటూ హాల్లో కూర్చొని వున్న కుటుంబ స్నేహితురాలు డా.భార్గవీరావు పలకరించారు.
నేను పలకరింపుగా నవ్వి ఫ్రెష్ అప్ అయి వస్తానని లోపలికి వెళ్ళి అయిదు నిముషాలలో వచ్చి మాట్లాడటానికి కుర్చీలో కూర్చుంటూ భార్గవి రావు పక్కనే సోఫాలో కూర్చున్న అమ్మాయి వైపు ప్రశ్నార్థకంగా చూసాను.
చుడీదార్ వేసుకుని చున్నీని మెడ నుండి కండువాలా ముందుకే వేసుకొని బాయ్ కట్ క్రాప్ తో
చిన్నగా మా స్కూల్ లో పదోతరగతి అమ్మాయిలా వుంది.
భార్గవి ఆమెని పరిచయం చేసింది."అనిశెట్టి వరంగల్ లో వుంటుంది.కవితాసంపుటికి ముఖచిత్రం వీర్రాజు గారితో వేయించుకోవాలని అనుకుంటుంటే నాకు తెలుసు అని రజితను మీ ఇంటికి తీసుకొని వచ్చాను" అంది.
అనిశెట్టి రజిత పేరు పత్రికల్లో అప్పుడప్పుడు చూసినదే.1994 లో "నేనొక నల్లమబ్బునౌతా" మొదటి కవితాసంపుటి కి ముఖచిత్రం కోసం వచ్చి నాకు అలా పరిచయం అయ్యింది.
ఆ పుస్తకానికి వేసిన ముఖచిత్రం బాగా వచ్చిందని వీర్రాజుగారు ఆతర్వాత దానినే తైలవర్ణ చిత్రంగా 3×4అడుగుల సైజులో వేసారు.
కాకతీయ విశ్వవిద్యాలయంలో సదస్సుకు హాజరైనప్పుడూ, హైదరాబాద్ లో కొన్ని సభల్లోనూ రజిత ఆ తర్వాత ఎప్పుడు కలిసినా చాలా ఆత్మీయంగా మాట్లాడేది.
చిన్నగా ముఖమంతా నవ్వుతో పలకరించే ఈ అమ్మాయి 1969 నుండే వుద్యమస్ఫూర్తి కలిగి వుందని తెలిసి మొదట్లో ఆశ్చర్యపోయాను.ఆత్మీయంగా మెత్తగా మాట్లాడే రజిత అవసరసమయంలో ఎంత దృఢచిత్తంతో వ్యవహరిస్తుందో కాలక్రమేణా తెలుసుకున్నాను.నిజాయితీ,నిబద్ధత కలిగిన రజిత జీవితం, సాహిత్యం,ఉద్యమం ఏవీ వేర్వేరు కాదని
అన్నీ తన వూపిరిగానే బతికిన ధీరగానే గుర్తించాను.
నేను నా ముందుతరం రచయిత్రుల కథలు గురించి రాసిన వ్యాససంపుటి చూసి దాని గురించి ఆ తరం రచయిత్రుల గురించి ఫోన్ లో చాలా సేపు మాట్లాడటమే కాక తానే అరడజను పుస్తకాలు కొనటం ఆశ్చర్యం కలిగించింది.
కుందుర్తి శతజయంతి సందర్భంగా ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రతిభా పురస్కారానికి రజితను ఎంపిక చేసినట్లు వీర్రాజుగారు ఫోన్ చేసి చెప్తే చిన్నపిల్లలా సంబరపడింది.ఆ సమయంలో కరోనా కారణాన సమావేశం వాయిదా పడటంతో ఫ్రీవర్స్ ఫ్రంట్ వాట్సాప్ సమూహం ఏర్పాటు చేసి కవులను అందులో చేర్చాము.ప్రతిభాపురస్కారానికి ఎంపిక చేసిన ఆరుగురు కవులనూ పరిచయం చేస్తూ నేను సమూహంలో రాసేదాన్ని.
అదే విధంగా రజితను గూర్చి కూడా రాసింది చదివి "క్లుప్తంగానే కాక సమగ్రత కూడా వుండేలా నా గురించి ఎంతబాగా రాసారు " అంటూ మురిసిపోయి
ఫోన్ చేసిన అల్పసంతోషి రజిత.అంతేకాక నేను రాసిన పరిచయాన్ని అన్ని వాట్సాప్ సమూహాలలో నూ ఎంతో సంతోషంగా షేర్ చేసుకున్న పసిమనసు రజితది.
వీర్రాజుగారి మరణానంతరం పలుమార్లు ఫోన్ చేసి సాంత్వనగా మాట్లాడిన స్నేహిత ఆమె.
తర్వాత మాయింటికి వచ్చి ఒక సోదరిగా నాకు చీర యిచ్చి " ధైర్యంగా నిలదొక్కుకుని సాహిత్యంలో గడుపుతున్నందుకు ఆత్మీయంగా అభినందించిన
ఆత్మీయ బంధువు రజిత.
తర్వాత రజిత వీర్రాజుగారి గురించి వ్యాసం రాయటమే కాక వీర్రాజు గారి ప్రథమ వర్థంతి సమావేశానికి స్వయంగా వరంగల్ నుండి శ్రమతీసుకుని వచ్చి నాకు అండగా నిలబడటంతో స్నేహితులు కన్నా ఆత్మీయ బంధువులు ఇటువంటి వారుకాక ఇంకెవరు అనిపించింది.
ఆ తర్వాత ప్రరవే సమావేశాల్లో తప్ప తరుచూ కలవకపోయినా మానసికంగా మరింత దగ్గిరైంది.సమాజంలో వితంతువుల స్థితిగతులమీద పుస్తకం వేస్తున్నానని ఫోన్ చేసి నా రచనలను అడిగి తీసుకుంది.ఆ విషయాలమీద ఫోన్లు చేసి చాలాసేపు మాట్లాడేది.అంతేకాకుండా మా అమ్మాయి పల్లవిని ఆ పుస్తకానికి ముఖచిత్రం వేయమని అడిగింది.పల్లవి చాలా చిత్రాలను డిజైన్ చేసి ఇస్తే వాటినన్నింటినీ పుస్తకంలో అక్కడక్కడా వేసి పల్లవిని ప్రోత్సహించింది.
ఆగష్టు 10 న వరంగల్ లో సింగరాజు రమాదేవి " ఔను..నాకు నచ్చలేదు"
కథలసంపుటి ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించింది. అప్పుడు రజిత నాకు ఫోను చేసి వరంగల్లో కలుద్దాం అంటూ మాట్లాడింది.రజిత ఎప్పుడు ఫోన్ చేసినా చాలాసేపు సాహిత్యం గురించి,తాను చేయదలచిన ప్రాజెక్టుల గురించి,తన ఆరోగ్యం గురించి చాలా సేపు కబుర్లు చెబుతుంది.నేను కూడా అలాగే మాట్లాడతాను.
నేను మా అమ్మాయి,మనవరాలితో కలిసి వరంగల్ వెళ్ళాను.సభని ఆద్యంతం ఆసక్తికరంగా ఆహ్లాదభరితంగా ఛలోక్తులతో రజిత అధ్యక్షత బాధ్యతను నిర్వహించింది.అంతేకాదు సభ మధ్యలో తన సంపాదకత్వంలో వితంతువ్యవస్థపై తెచ్చిన పుస్తకాన్ని చూపించి పల్లవిని కూడా సభకు పరిచయం చేయటం మా కుటుంబం పట్ల రజితకు గల గాఢ అనురక్తికి తార్కాణం.
సభానంతరం కలిసి భోజనం చేస్తూ కూడా కబుర్లు కొనసాగాయి.అప్పటికే అలసిపోవడం వలన కొంత అనారోగ్యం రజితను వెనక్కి లాగుతోన్నా నవ్వుతూ ఫొటోలు తీయించుకుంటూ సందడి చేస్తూనే వుంది.తాను హైదరాబాద్ వచ్చినపుడు కలుద్దాం అని అంది.
మధ్యాహ్నానికి మళ్ళా వర్షసూచనలు మొదలయ్యే సరికి మేము తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాం.వర్షాలు తగ్గాక మళ్ళీ వస్తే వరంగల్ చుట్టుపట్ల అన్నీ చూడటానికి కలిసి వెళ్దాం
అని మాతో చెప్పిన రజిత మాకు వరంగల్ అంతా చూపించకుండానే తొందరపడి హడావుడిగా ఆత్మీయులను అందరినీ వదిలి అనంత దూరాలకు వెళ్ళిపోయింది.
వరంగల్ ముచ్చట్లు చెప్పుకోకుండానే ఉరమని పిడుగులా వార్త .వారం రోజుల వరకూ
మామూలు కాలేక పోయాను.ఒక విధమైన వైరాగ్యం నన్ను ఆవహించింది.
నడక దారిలో -56
నడక దారిలో -56
కొత్త ఇంట్లో ఫర్నిచర్ కోసం కార్పెంటరీ వర్క్ ప్రారంభించాడు చారి.రోజూ నేను గానీ , వీర్రాజుగారు గానీ ఆషీస్కూలుకీ,పల్లవి ఆఫీసుకీ వెళ్ళాక పదింటికి బయలు దేరి వెళ్ళేవాళ్ళం.పదింటికి భోజనం చేసేసి, బాక్స్ లో టిఫిన్ తీసుకొని వెళ్ళి తిరిగి సాయంత్రం నాలుగింటికి తిరిగి వచ్చేవాళ్ళం.
వీర్రాజుగారు తాను ముచ్చటపడి కొనుక్కున్న కళాకృతులకు సరిగ్గా అమరిక వుండేలా పదేపదే డిజైన్లు తయారు చేసుకొంటూ దగ్గరుండి మరీ హాల్ లోని షెల్పులు ఎలా చేయాలో తన కోరిక మేరకు చేయించారు.వార్డరోబ్ లను మాత్రం మా ఇష్టానికి వదిలేసారు.
వీర్రాజుగారు 1961 లో హైదరాబాద్ వచ్చిన దగ్గర్నుంచి ఉన్న మిత్రులలో శ్రీరామారావు గారు ఒకరు.ఆయన ఇల్లు మా కొత్త ఇంటికి పదినిముషాల నడక దూరంలోనే ఉంటుంది.వీర్రాజుగారు అక్కడకు వెళ్ళినప్పుడు శ్రీ రామారావుగారిని కలిసి ఆయనకి మా కొత్తింటిని చూపించారు.ఇక్కడకు షిఫ్ట్ అయ్యాక మనం తరుచూ తెలుసుకోవచ్చని ఇద్దరూ సంబరపడ్డారు.
అయితే మేము షిఫ్ట్ కాకముందే అనుకోకుండా మాసివ్ హార్ట్ ఎటాక్ తో శ్రీరామారావుగారు అనంతలోకాలకు షిఫ్ట్ కావటం వీర్రాజుగారిని దుఃఖంలో ముంచెత్తింది.వీరిద్దరి పాత స్నేహితులైన రామడుగు రాధాకృష్ణ మూర్తి గారు,శ్రీపతిగారూ అందరూ శ్రీరామారావువాళ్ళింటికి వచ్చి శోకతప్తులయ్యారు.
కొత్త ఇంటికి వచ్చాక వీర్రాజుగారికి మంచి కాలక్షేపం అనుకున్నాం పల్లవీ,నేనూ.కానీ ఇలా జరగటం బాధ కలిగింది.
పల్లవికి ప్రోజెక్ట్ మేనేజర్ గా ప్రమోషన్ రావటంతో చాలా బిజీగా అయిపోయింది.ఇంట్లో జరుగుతోన్న పనిని సూపర్వైజ్ చెయ్యటానికి కూడా కుదరలేదు.
అక్కడ పని జరుగుతోన్న రోజుల్లోనే బిల్డర్ ఇస్తానన్న ఏసీలు,ఫేన్లూ ఇంట్లో ఫిక్సింగ్ జరిగాయి.
ఒకరోజు నేను అక్కడికి వెళ్ళి కార్పెంటర్ పని చేస్తుంటే ఏదో పుస్తకం పట్టుకొని కూర్చునే దాన్ని.
ఒకరోజు ఇంటినుండి వీర్రాజుగారు అక్బరుద్దీన్ ఒవైసీ పై హత్యాయత్నం జరిగిందంట గొడవలుజరుగుతాయేమో వచ్చేయమని ఫోన్ చేసారు.నేను వెళ్ళే దారి అటువంటిది.అందుకని సాయంత్రం వరకు వుండకుండానే ఇంటికి వచ్చేసాను.కానీ అది రెండు మతాల మధ్య జరిగిన సంఘటన కాదు కనుక సమసిపోయింది.
అప్పట్లోనే జరిగిన మరో సంచలన సంఘటన పుట్టపర్తి సాయిబాబా చాలా కాలం అనారోగ్యంగా వుండి మరణించటం.ఆ నెలంతా దీనిపై అనేకానేక వూహలూ,పుకారులూ వ్యాపించటమే కాక పుట్టపర్తిలో వరుసగా జరిగిన అనూహ్య పరిణామాలు అవి కేవలం పుకార్లేకాదనిపించింది.ప్రపంచదేశాలన్నింటా సాయిబాబా భక్తులు వున్నారు.ఆ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలు నిగ్గు తీసే వారెవ్వరు.
అయిదారేళ్ళ క్రితం వీర్రాజు గారి బాల్య మిత్రుడు సత్యనారాయణ కొడుకు పెళ్ళి అక్కడే జరిగినప్పుడు వీర్రాజుగారూ నేనూ పుట్టపర్తి వెళ్ళాము.వీర్రాజుగారు రూములోనే వుండిపోతానన్నారు.నేను కుతూహలం కొద్దీ పెళ్ళి వారితో ప్రార్థనా మందిరం లోనికి వెళ్ళాను.అక్కడ సాయిబాబాని అతి దగ్గరగా చూసాను.అక్కడున్న మ్యూజియం చూసాము.ఎందుకో అక్కడంతా ఏదో అసహజంగా వుండి నాకు వూపిరాడనట్లుగా అనిపించింది.ఇప్పుడు సాయిబాబా మరణం ఎన్నో ప్రశ్నలకు తెరతీసింది.
మొత్తంమీద మూడు నెలలకు పైగా సమయంలో కార్పెంటర్ ఈ వర్క్ చాలావరకు పూర్తి చేసాడు.ఏప్రెల్ లో ఆషీకి నాలుగో తరగతి సంవత్సరాంత పరీక్షలు పూర్తి అయ్యాయి.మే నెలలో కొత్తంటికి షిఫ్ట్ కావాలనుకున్నాము.సామాన్లు కొంచెంకొంచెంగా సర్దటం మొదలుపెట్టాం.
కళ్యాణ్ వచ్చి షిప్టింగ్ కి సహాయం చేస్తానన్నాడు.మా మరిదికి కారు వుంది.అది తీసుకొచ్చి విలువైన వస్తువులనూ, జాగ్రత్తగా షిఫ్ట్ చెయ్యాల్సిన వాటినీ కారులో అయిదారు ట్రిప్పులు వేసి కొత్తంట్లోకి చేర్చాడు.పేకింగ్ & మువర్స్ వాళ్ళని మాట్లాడాము.మూడు ట్రిప్పులలో సామాన్యంగా షిఫ్ట్ చేయొచ్చు అనుకున్నాము.కానీ అయిదారు ట్రిప్పులు వేస్తే గానీ పూర్తికాలేదు.అప్పటికీ నాలుగైదు ట్రంక్ పెట్టెలూ,టీవీ స్టాండు లాంటివి వాళ్ళకే ఇచ్చెసాము డైనింగు టేబుల్ కొత్త ఇంట్లో బిల్డర్స్ ఇస్తారు కదా అనీ అదీ వదిలేసాము.షెల్ఫ్ లు ఓ రెండింటిని వదిలేసాము.కేవలం పుస్తకాలకే మూడు ట్రిప్పులు అయ్యాయి.తీసుకోచ్చి ప్రతీ గదిలో దుప్పటిలో మూటకట్టిన పుస్తకాలని కుప్పపోసారు.
" అర్జంటుగా సర్దేయకండి.తాపీగా సర్దుకోవచ్చు " అన్నాసరే వినకుండా వీర్రాజుగారు ఆఘమేఘాలమీద సర్దేసారు.మొత్తంమీద సరూర్ నగర్ ఇంటికి వచ్చేసాము. ఈ ఏడాది వేరే స్కూల్ లో చేర్చాలనుకుంటే ఆషీ ఒప్పుకోలేదు.అదేస్కూల్ లో చదువుతానని అంది.ఇంక రానూ,పోనూ స్కూల్ బస్ నే కుదిర్చాము.
ఇంతకాలం అమ్మానాన్నల ఇంట్లో వున్నాననే భావం పల్లవికి వుండేవుంటుంది.ఇప్పుడు తనదైన ఇంట్లో వుండటం అనేది తనకి తృప్తినిస్తుందని నేను భావించాను. అంతకుముందు ఆఫీసుకు మాట్లాడుకొని సలీం ఆటోలోనే పల్లవి ఆఫీస్ కు వెళ్ళేది.
ఈ ఇంటికి వచ్చేక పల్లవిగానీ,ఆషీగానీ అక్కడ నలుగురి ప్రశ్నలూ ఎదుర్కొనే పరిస్థితి ఉండకూడదని భావించి నేనూ , వీర్రాజుగారూ ఒకరోజు ఆషీని పక్కన కూర్చో బెట్టుకుని తన తండ్రి ఎలా పోయాడో,ఆ పరిస్థితులేమిటో అన్నీ వివరంగా చెప్పాము.ఇంత వరకూ ఆషీకూడా అందరు పిల్లలూ తల్లిదండ్రులతో తిరుగుతారు కదా తన తండ్రి ఎవరూఅని ఎప్పుడూ అడగకపోవటం కూడా మాకు ఆశ్చర్యమే.చిన్నప్పుడు ఒకరిద్దరు మీ నాన్న పేరేమిటి అని అడుగుతుంటే వీర్రాజు అనే చెప్పేది.మేము చెప్పిన విషయమంతా విని ఏమీ కామెంటు చేయకుండా ముఖం కూడా అభావంగా పెట్టి నిశ్శబ్దంగా వూరుకుంది ఆషీ.అంత చిన్న వయస్సులోనే అంత గుంభనంగా వుండటం ఆశ్చర్యం కలిగించింది.తర్వాత కూడా ఆ పిల్ల ఎప్పుడూ ఆ ప్రసక్తే తీసుకుని రాలేదు.
మేము ఇంట్లో అన్ని సర్దుకున్న తర్వాత బంధువులకూ,మిత్రులకూ,పల్లవి సహోద్యోగులకూ ఒక ఆదివారం విందుకు పిలిచాము.అందరూ వచ్చి ఇల్లు చాలా బాగుందని అభినందనలు తెలియజేశారు.
మరొక రోజు లేఖిని మిత్రుల్ని ఆహ్వానించాను.వాసాప్రభావతి,డి.కామేశ్వరి, అబ్బూరి ఛాయాదేవి, తురగా జానకీరాణి, ఇంద్రగంటి జానకీ బాల,శారదాఅశోకవర్థన్,తమరిశ జానకి మొదలైన రచయిత్రులు ఒక పాతికమంది వరకూ మా ఇంట్లో విందుకు హాజరయ్యారు.
మెల్లమెల్లగా కొత్త ఇంటికి అలవాటు పడ్డాం.బ్రహ్మానందనగర్ ఇంటికి కలర్స్ వేయించాము.ఆ పనిమీద ఆ ఇంటికి వెళ్ళినప్పుడు కొంత దిగులు వేసింది.కష్టార్జితాన్ని కూడబెట్టి కొన్ని ఇల్లది.ముప్ఫై ఏళ్ళు ఎన్నో కష్టసుఖాలను అనుభవించిన ఇల్లు.అవన్నీ గుర్తొచ్చి ' కొత్త మజిలీ' అనే కవిత రాసాను.ఆ ఇంటిని అద్దెకు ఇచ్చాము.
ఒక రోజు అనుకోని ఫోన్ వచ్చింది.ఫోన్ చేసినవారు ఆవంత్స సోమసుందర్ గారు .నాకు దీర్ఘ కవిత్వ విభాగంలో దేవులపల్లి రాజహంసా కృష్ణశాస్త్రి పురస్కారం ఆయన జన్మదినం అయిన నవంబర్ పదిహేడున పిఠాపురం లో ఇస్తానని తెలియజేసేరు.నాకు పట్టలేనంత సంతోషంతో నోట మాట రాలేదు.ఆయనే తిరిగి కవిత్వం విభాగంలో మహెజబీన్ కి ఇస్తున్నట్లు తెలియజేసి కలిసి రమ్మని సలహా కూడా ఇచ్చారు.
చాలా ఏళ్ళ క్రితం వీర్రాజుగారికి కూడా దీర్ఘ కవిత్వ విభాగంలోనే ఇదే పురస్కారం వచ్చినప్పుడు పిఠాపురం వెళ్ళాను.మళ్ళా నేను అందుకోవటం చేత పురస్కారం ఇప్పటికీ నాకు అపురూపమైనది.
మహెజబీన్ తో సంప్రదిస్తే తాను ట్రైన్ టికెట్లను బుక్ చేస్తానని తర్వాత డబ్బు తనకు ఇమ్మనటంతో సరేనన్నాను.అనుకున్నట్లుగా ఆమెతో కలిసి బయలుదేరాను.సామర్లకోట జంక్షన్ లో దిగేసరికి అక్కడకు ట్రస్ట్ సభ్యులు మన్మధ రావుగారూ,మరొక ఆయనా మమ్మల్ని రిసీవ్ చేసుకొని ముందుగా హొటల్ లో టిఫిన్ ఇప్పించి కారులో పిఠాపురంలో మాకు కేటాయించిన రూమ్ కు తీసుకు వెళ్ళారు.మేము స్నానపానాదులు పూర్తి చేసుకొని పురస్కార సమావేశం జరిగే గ్రంథాలయానికి తీసుకువెళ్ళాము.మాతోపాటు కథలకు వి.ప్రతిమ,విమర్శకు విజయలక్ష్మీ బక్ష్ అందుకున్నారు.
తర్వాత మరికొన్ని రోజులకే కడప కవితా సాంస్కృతిక సంస్థ వారిచ్చే గురజాడ పురస్కారం నా రెక్కల చూపు కథలసంపుటికి రావటం మరింత సంతోషకరం.ఈ పురస్కారసమావేశానికి యువభారతి మిత్రురాలు కె.బి.లక్ష్మితో కలిసి ప్రయాణించాను.కొత్త ఇంట్లో దిగగానే రెండు పురస్కారాలు అందుకోవటం చాలా సంతోషం కలిగింది.
బిల్డింగ్ లో ఇంకా అన్ని ఇళ్ళల్లోకీ కుటుంబాలు లేదు.ఎక్కువగా కబుర్లు చెప్పే అలవాటు లేనందున నాకు పెద్దగా స్నేహాలు పెరగలేదు.పల్లవికి ఆఫీసుకు వెళ్ళిరావటం వలన ,సమయం కుదరకపోవటం చేత బిల్డింగ్ లో ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో ఏ కార్యక్రమాలు జరిగినా నేనే వెళ్ళక తప్పేది కాదు.నేను పూజలూ,వ్రతాలూ చేయక పోయినా పిలిచినప్పుడు వెళ్ళకపోవటం, వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళ మనోభావాలను గాయపరచటం ఇష్టం లేదు.ఇది ఒక కమ్యూనిటీ బిల్డింగ్.అందుచేత ఎవరైనా పిలుస్తుంటే కాస్త ఆలస్యంగా వెళ్ళి వాళ్ళు ఇచ్చినదేదో పుచ్చుకొని వస్తే పోయేదేముంది.ఇక్కడే కలకాలం వుండే పల్లవీ,ఆషీలను అందరికీ దూరంచేసి ఉలిపికట్టెలుగా చేసే అధికారం నాకు లేదుకదా.
ఇదిలావుండగా తెలంగాణా ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది. 2011 సెప్టెంబరు 13 నుండి ప్రారంభమై 42 రోజులపాటు జరిగిన సమ్మెలో తెలంగాణాలోని ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, సింగరేణి కార్మీకులు, ఉపాధ్యాయులు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు, విద్యుత్ సంస్థ ఉద్యోగులు 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. ప తెలంగాణ ప్రాంతంలో ప్రజాజీవనం స్థంభించకపోయింది.
అయితే ముందుగా రవాణా సంస్థ ఉద్యోగులు సమ్మె విరమించగా ఇతర సంఘాలు కూడా సమ్మె విరమించాయి.ఉద్యమనాయకులు మాత్రం ఈ సమ్మె ఫలితంగా కేంద్రం ఆలోచన మార్చగలిగిందనీ,కానీ ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు.
న్యాయమూర్తి శ్రీకృష్ణ అధ్యక్షతన ఐదుగురు సభ్యుల సమితి ఆంధ్రప్రదేశ్ విభజన వలన కలిగే లాభనష్టాలు గురించి అధ్యయనం చేసి ఇరుప్రాంతాల నాయకులూ,మేధావులతో చర్చించి నివేదిక 2011 జనవరి 6న విడుదల చేసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచి తెలంగాణా అభివృద్ధికి తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయాలనేది ఒకటి అయితే తెలంగాణ, సీమాంధ్రలను వేరుచేయడం రెండవ పరిష్కారంగా సిఫారస్ చేసింది. కానీ ఇవి వ్యతిరేకించబడ్డాయి.ఉద్యమం కొనసాగుతూనే వుంది.
దసరాల్లో చిన్నక్క కుటుంబం వచ్చారు.ఇక్కడనుండి షిర్డీ వెళ్ళి తిరిగి హైదరాబాద్ వచ్చి విజయనగరం వెళ్ళటానికి ప్రోగ్రాం వేసారు.వాళ్ళతో బాటూ నన్నూ,ఆషీనీ కూడా ప్రయాణం కట్టించారు.అప్పుడే కళ్యాణ్ సహాయంతో పల్లవి కారు కొనింది.
ఒకరోజు నాకు వచ్చిన ఉత్తరం నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది.కేంద్రసాహిత్య అకాడమీ నుండి భారతీయసాహిత్యనిర్మాతలు పేరిట డా.పి శ్రీదేవి గురించి మోనోగ్రాఫ్ గురించి రాయమని ఆ వుత్తరం వచ్చింది.అప్పుడు కన్వీనర్ గా అక్కిరాజు రమాపతిరావు (మంజుశ్రీ)గారు ఉన్నారు.
వీర్రాజుగారికి ఆ వుత్తరం చూపిస్తే " పరిశోధకులు రాయగలరు కానీ నువ్వు రాయలేవు " అని నిరుత్సాహ పరిచారు.కేంద్రసాహిత్య అకాడమీ ప్రాజెక్టు కదా ఏంచేయాలో అర్థం కాలేదు.ఏవో కొన్ని వ్యాసాలు రాసాను కానీ పూర్తిగా ఒక రచయిత్రి సాహిత్యాన్ని పుస్తకానికి సరిపడేంత రాయగలనా అని నేను కూడా దానికి ఏమీ సమాధానం చెప్పకుండా వెనుకంజ వేసాను.రెండునెలల తర్వాత మళ్ళా మరో ఉత్తరం వచ్చింది.
అంతలో వాసా ప్రభావతి గారూ,డా.ఆలూరు విజయలక్ష్మి గారు
కలిసి కాకినాడలో కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వహణలో రచయిత్రుల ఒకరోజు సదస్సు ఏర్పాటు చేసారు.కవిత్వసదస్సుకు నేను అధ్యక్షురాలిగా నిర్ణయించారు.హైదరాబాద్ నుండి వాసా ప్రభావతి, ఇంద్రగంటి జానకీ బాల, గంటి భానుమతి,నేను ఇలా కొంతమంది కలిసి ట్రైన్ కి టిక్కెట్లు బుక్ చేసుకున్నాము.
ఎట్లాగూ కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళదే కావటాన అక్కడ మంజుశ్రీగారిని కలుస్తాను కనుక పి.శ్రీదేవి మోనోగ్రాఫ్ నేను రాయలేనని ఉత్తరం రాసి ఇచ్చేద్దామని నిర్ణయించుకొని ఉత్తరం తయారుచేసుకొని కవర్లో పెట్టుకొని బయలుదేరాను.
కాకినాడ స్టేషన్లో దిగి మాకోసం బుక్ చేసిన హొటల్ లో రిఫ్రెష్ అయిన తర్వాత హొటల్ కిందనే వున్న రెస్టారెంట్ లో బ్రేక్ ఫాస్ట్ కోసం వెళ్ళాం.అక్కడ కుప్పిలిపద్మ,పి.సత్యవతి, కాత్యాయిని విద్మహే తదితరులు కలిసారు.ఏదో సందర్భంలో కాత్యాయనీ తో శ్రీదేవి మోనోగ్రాఫ్ రాయమని వుత్తరం వచ్చిన విషయం చెప్పి ,నేను రాయలేనని వుత్తరం రాస్తున్నానని చెప్పాను.
కాత్యాయని "మీరు రాయలేకపోవటమేంటండి.తప్పక రాయగలరు.నేను శ్రీదేవి గురించి పి.హెచ్డీ చేయించాలనుకుంటే ఎవరూ ముందుకు రావటం లేదు.నా దగ్గర శ్రీదేవి రాసిన ' ఉరుములు- మెరుపులు' కథలపుస్తకం వుంది.దానినీ,నా దగ్గర వున్న కొంత మెటీరియల్ ఇస్తాను" అని కాత్యాయని ప్రోత్సహించటంతో కేంద్ర సాహిత్య అకాడమీ కన్వీనర్ మంజుశ్రీ గారికి నేను తీసుకు వెళ్ళిన ఉత్తరం అందజేయకుండా వూరుకున్నాను.
ఆరోజు మధ్యాహ్నం కవిత్వం సదస్సులో నేను ఆనాటినుండి ఇప్పటివరకూ కవిత్వంలో మార్పు చేర్పులు గురించి చేసిన అధ్యక్షోపన్యాసాన్ని తదనంతరం "సాహిత్య ప్రాంగణంలో కవయిత్రులు" అనే వ్యాసంగా ప్రచురించాను.ఆ సదస్సులో మందరపు హైమవతి, శరత్ జ్యోత్స్నారాణి పాత్ర సమర్పణ చేసారు.శరత్ జ్యోత్స్నారాణి ఎప్పుడో ఇరవై ఏళ్ళక్రితం రాసిన వ్యాసాన్నే అప్డేట్ చేసుకోకుండానే ప్రసంగించింది.ఎందుకంటే ఆమె ప్రసంగంలో నా మొదటి పుస్తకంలో కవితనే ఉటంకించింది.దాని తర్వాత ఏడు సంపుటాలు వచ్చిన విషయం ఆమెకు తెలియదు.హైమవతి కూడా కేవలం నీలిమేఘాలులోని కవితలలోని స్త్రీవాదం గురించి ప్రసంగించింది.
మొత్తంమీద ఒక్కరోజు సదస్సులు విజయవంతంగా జరిగాయి.
ఆ రాత్రి అందరం హొటల్ లో చాలా సేపు కబుర్లు చెప్పుకున్నాం.మర్నాడు కారు ఏర్పాటు చేసి సామర్లకోటలో వున్న ఒక ప్రాచీనదేవాలయం,మొదలగు ప్రాంతాలు చూపించారు.అనంతరం ఆలూరు విజయలక్ష్మి గారి ఇంట్లో కాసేపు అందరం సరదాగా గడిపాము
తర్వాత రోజు ఇంద్రగంటి జానకీ బాలకు,ప్రభావతి గారికీ మరో సభలో పాల్గొనాల్సి వుందని కాకినాడలో ఆగిపోయారు.మిగిలిన వాళ్ళం తిరిగి హైదరాబాద్ ట్రైన్ ఎక్కాము.
9, సెప్టెంబర్ 2025, మంగళవారం
స్నేహపు రంగు విషం
~ స్నేహపు రంగు విషం ~
ఇరవై ఏళ్ల క్రితం
ఒక స్నేహకలయికలో
స్నేహపు పూతతో ఓ పలకరింపు
పలకరింపు కాదది
మానని గాయానికి సలుపరింపు
కళ్ళలో సుళ్ళుతిరిగిన సుడిగుండాలు
పదేళ్ళక్రితం
ఒక వివాహ మంటపంలో
పెళ్ళి సందడి పెదాల నవ్వైనపుడు
స్నేహపునవ్వుతో ఓ పలకరింపు
పలకరింపు కాదది
మానిన పుండుపై కారపు జల్లు
ఐదేళ్ళ క్రితం బజారులో
కబుర్ల పతంగాల్ని ఎగరేస్తున్నప్పుడు
గాలివాటున ఓ పలకరింపు
పలకరింపు కాదది
పుటుక్కున మాంజాని తెంపి
మెడకి చుట్టిన విషపు నవ్వు.
నిన్నగాక మొన్న రాత్రి
కలల్లోనైనా రెప్ప వాల్చబోతే
కాల్ చేసి మరీ
కునుకుతున్న కలల్ని
నిలువునా కాల్చేసింది
ఆమె ఎవరైతేనేం గానీ
స్నేహాపుపూత పూసిన కరుకుముల్లుతో
నా గుండెల్లో మానుతోన్న గాయాన్ని కెలికితే
ఆ కళ్ళల్లో ఎంతమెరుపో
ఆమె ఎవరైతేనేం
మనచుట్టూ అటువంటి ఎంతమందో
1.శరసంధానం
శరసంధానం
- శీలా సుభద్రాదేవి
ఒకసారి ప్రశ్నించాలి
అని అనుకుంటూ అనుకుంటూనే
ఏళ్ళకి ఏళ్ళు నడుచుకుంటూ వచ్చేసాను
ఏమని ప్రశ్నించాలా అని ఆలోచిస్తే
సమాధానాలెట్లా రాయాలో నేర్పించారు కానీ
బళ్ళో పదేళ్ళ చదువు కాలంలో
తదనంతర చదువుల్లోనూ
ఏ ఒక్క మాష్టారూ కూడా
ప్రశ్నించటం మాత్రం నేర్పలేదు.
ఎక్కడో ఏదో పురుగు దొలిచి
అడగాలనుకునే ప్రశ్న
ఎర్రని చూపు తాకి మసై రాలిపోయేది
మాటిమాటికీ ప్రశ్నే కొక్కెంలా
నావెనుక ఎప్పుడు తగులుకొందో గానీ
నా అడుగులు ముందుకుపడకుండా
నిత్యమూ వెనక్కి లాగుతూనే వుంది
అయినాసరే
ఎప్పుడు ఏ అక్షరం
నా మనో క్షేత్రంలో నాటుకుందో
నా వంటిమీదే కాదు
నా అంతరాంతరాల నిండా
ప్రశ్నలు మొలకెత్తుతూనే వున్నాయి.
అటువంటప్పుడు అంపశయ్య మీద భీష్మలా
ప్రశ్నల పరుపుపై నిద్రపట్టక దొర్లతాను
ఇకపై ఇన్ని ప్రశ్నలు
మనసునిండా ఎందుకు నాటావని
మీనమేషాలు లెక్కబెట్టే పనేలేదు
ప్రశ్నించనీయకుండా చేసిన
నీ మీదా,ఈ సమాజం మీదా
ఈ సాంప్రదాయాల లక్ష్మణ రేఖల్లో
నన్ను బంధించిన ప్రతీ ఒక్కరి మీదా
శరసంధానం చేయటానికి నాదే ఆలస్యం
ఇకపై ప్రశ్నించి నిలదీయాల్సిందే
5, సెప్టెంబర్ 2025, శుక్రవారం
నడక దారిలో -55
నడక దారిలో -55
ఆప్తమిత్రుడు కె.కె.మీనన్ భౌతికంగా దూరం కావటం వీర్రాజుగారు చాలా దిగులు పడ్డారు. తాను పెయింటింగ్స్ వేయటమేకాక కవితా సంపుటి కూడా ప్రచురించుకోవాలనే వుద్దేశ్యంతో కవిత్వరచనలో పడి మిత్రుని మృతి వలన కలిగిన దుఃఖాన్ని అధిగమించడానికి ప్రయత్నించారు.
మేముంటున్న ఇంటి పరిసరాలకు పల్లవి విసిగి పోవటంతో కొనటానికి ఇళ్ళకోసం గట్టిగానే ప్రయత్నం మొదలెట్టాము.
మల్లయ్య శాస్త్రిగారికి మియాపూర్ లో ఇల్లు ఎలాట్ అయ్యిందట.ఆ పనిమీదనో మరెందుకో గుర్తులేదు.హైదరాబాద్ వచ్చి మా ఇంటికి వచ్చారు.భోజనం అయ్యాక వీర్రాజుగారితో చాలా సేపు కబుర్లు చెప్పి సాయంత్రానికి తిరిగి వెళ్ళారు.ఆయన వెళ్ళాక వీర్రాజుగారు నాతో చెప్పిన విషయం నన్ను అవాక్కు అయ్యేలా చేసింది.
" ఒంటరిగా వుండటం కష్టంగా వుంది వీర్రాజు గారూ.నేను వివాహం చేసుకుందామనుకుంటున్నాను.ఏమంటారు?" అన్నారట ఆయన డెభ్భై ఏళ్ళు దాటిన వ్యక్తి.
ఆయన తాతో,ముత్తాతోగానీ బాలవితంతువైన తన కూతురికి పునర్వివాహం చేసారు.అన్ని కులాల వారితో పంక్తి భోజనం చేసిన బ్రహ్మ సమాజదీక్షగల మహనీయ వ్యక్తిగా ఆయనకి పేరు.
అయితే అంత ఆశ్చర్యపడటానికేముంది? భరాగో,పెద్దిభొట్లవంటివారు కూడా ఆ వయసులో వివాహాలు చేసుకున్నారు కదా.పురుషులకు ఏ వయసులోనైనా పునర్వివాహం చేసుకునే జన్మహక్కు ఈ సమాజం ఇచ్చింది.అందుకే ఆశ్చర్యం అక్కర్లేదు.
కానీ అకస్మాత్తుగా భర్త చనిపోవడంతో పాతికేళ్ళవయస్సులోనే ఇద్దరు పసిపిల్లలతో అసహాయంగా మిగిలిన తమ్ముడి భార్యని అత్తింటి వాళ్ళంతా దిక్కులేనిదానిగా వదిలేసినప్పుడు ఆమె ఒంటరితనం ఆయనకి గుర్తు రాలేదా? అది గుర్తు వచ్చి నేను కొంత డిస్టర్బ్ అయ్యాను.
ఈ విషయం ఎవరితోనూ చెప్పలేదు.కానీ
ఆ తర్వాత గుండెల్లో గాయం అనే కథని రాసాను.
మరిది కృష్ణ చిన్నకూతురు పెళ్ళి ఒరియా అబ్బాయితో పూరీలో నిశ్చయం అయ్యింది.ముగ్గురు అమ్మాయిలూ మూడుప్రాంతాలవారిని ఎంపిక చేసుకుని వివాహం చేసుకోవటం ఆశ్చర్యమే.కట్నాలబాధ అయితే తప్పిందనుకోవాలి.కృష్ణ మరణానంతరం ఆ కుటుంబబాధ్యత మాదే అని భావించి రెండు పెళ్ళిళ్ళు జరిగాయి. ఈ పెళ్ళికి మాత్రం పెద్దమ్మాయి కవితే చెల్లెలిపెళ్ళికి ఎక్కువ బాధ్యత వహించింది.
మా కుటుంబంతో పాటు చిన్నమరిది బయలుదేరాడు.వివాహం ఒరియా పద్ధతిలో జరిగిన ఈ వివాహానికి కూడా మేమే కన్యాదానం చేయటం జరిగింది.ఆ వివాహానంతరం భువనేశ్వర్ లో చూడవలసిన ప్రదేశాలు,కోణార్క్ సూర్య దేవాలయం ధవళగిరి మొదలైనవి చూసి తిరిగి హైదరాబాద్ వచ్చేసాం.
కొనటానికి ఇండిపెండెంట్ ఇళ్ళు చాలా
చూసాం.కానీ ఏవీ మాకు అందుబాటులో లేవు.ఒకరోజు సరూర్ నగర్లో వున్న మరిది నుండి పల్లవికి ఫోన్ వచ్చింది."ఇక్కడ సరూర్ నగర్ మెయిన్ రోడ్డు లో ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ మొదలయ్యింది.కె.విశ్వనాధ్ ప్రారంభించారు.ఒకవేళ నచ్చుతుందేమో చూడు."అని.
నాలుగురోజులుగా సెలవులకని వచ్చిన చిన్నక్క కుటుంబానికి అదే రోజు తిరుగు ప్రయాణం.వాళ్ళు మమ్మల్ని స్టేషన్ కు రానక్కరలేదనీ సలీమ్ ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోతాం.మీరు వెళ్ళి ఇల్లు చూడండని అన్నారు.అంతే కాక ఇండిపెండెంట్ ఇల్లు కన్నా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అయితేనే భద్రత వుంటుంది.నచ్చితే తీసుకోవటం మంచిది అన్నారు.
వీర్రాజుగారు కూడా తన తమ్ముడూ,చెల్లెల కుటుంబాలు దగ్గరగా వుంటాయి అని తీసుకుంటే బాగానే వుంటుందన్నారు.
వీర్రాజుగారు తాను రాననీ చూడటానికి మా ఇద్దరినీ వెళ్ళమన్నారు.సరేనని వచ్చి SVRS వారి ఒక మోడల్ హౌస్ చూసాము.వాళ్ళు చెప్పినవన్ని నచ్చాయి.మా బడ్జెట్ లోనే త్రీబెడ్ రూమ్ ఇల్లు వస్తుంది.అయితే మళ్ళా అపార్ట్మెంటేనా అనిపించింది.ముందు రెండువేలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.ముందు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి రెండున్నర లక్షలు ఖరీదు చేసే ఫర్నీచర్ ,మాడర్న్ కిచెన్ ఉచితం అన్నారు.
సరే ముందు కట్టేద్దాం.తర్వాత ఆలోచించుకుందాం అనుకున్నాం.
మర్నాడు మళ్ళా వీర్రాజుగారితో కలిసి వచ్చి చూసాం.SVRS బృందావనం పేరిట మూడు బ్లాకులు కడుతున్నామని బిల్డర్స్ చెప్పారు.మొదటగా నారాయణాద్రి బ్లాక్ మొదలు పెడతామని చెప్పి అయిదు ఫ్లోర్ లు,ఒక్కోఫ్లోరులో పదహారు ఇళ్ళు వుంటాయని ఇళ్ళు ప్లానులు ఉన్న పేపరు ఇచ్చి ఎంపిక చేసుకోమని చెప్పి ఏ రకంగా ఎన్ని వాయిదా ల్లో డబ్బు కట్టాలో,ఎప్పుడు నిర్మాణం మొదలెడతారో, ఎప్పుడు ఇల్లు ఇస్తారో వివరాలు చెప్పారు.
ఇళ్ళ ప్లాను చూసి ఫస్ట్ ఫ్లోర్ వద్దనుకున్నాము.థర్డ్ ఫ్లోర్ లో ఇళ్ళు బుక్ అయిపోయాయి.కరెంటు పోతే కష్టం పైన రెండు ఫ్లోరులు వద్దని వీర్రాజుగారు అన్నారు.ఆఖరుకు రెండవ ఫ్లోరులో ఇల్లు సెలెక్ట్ చేసుకున్నాము.అప్పుడప్పుడు అటువైపు వెళ్ళి ఎంతవరకూ అయ్యిందో చూసుకునే వాళ్ళం.
2010 లో ఆధునిక తెలుగు కథ వచ్చి 100 ఏళ్ళు అయిన సందర్భంగా వేదగిరి రాంబాబుగారు కొందరు కథకులను తీసుకుని విజయనగరం ప్రయాణం కట్టారు.విజయనగరంలో ఆ సందర్భంగా గురజాడ ఇంటిలోనూ, గురజాడ వీధిలోనూ కథకుల పాదయాత్ర తలపెట్టారు.
నేను విజయనగరంలో పుట్టిపెరిగిన దానిని.విజయనగరంలో సమావేశాలకు గానీ,సదస్సులకు గానీ ఎందుకు గుర్తు రానో మరి ఎప్పుడూ ఎవరూ ఆహ్వానించలేదు. విజయనగరంలో ఒక సంస్థ అనేకమంది రచయిత్రులు పిలిచి పురస్కారాలు ఇవ్వటం కూడా తెలుసు. నన్ను పిలవాలని కాదు కానీ అక్కడే వున్న మా పెద్దక్కనీ గానీ,
చిన్నన్నయ్యనీ గానీ ఏనాడూ ఏ సభలకూ ఆహ్వానించరు .ఇందులో కొంత వరకూ కుల రాజకీయాలు కూడా వున్నాయని మాకు చూచాయగా తెలుసు.అందుకనే మేము పట్టించుకోం.కానీ అప్పుడప్పుడు కొంత బాధ కలగటం సహజమే కదా.
సరే .మళ్ళా వందేళ్ళ కథ దగ్గరకు వస్తే -
విజయనగరం కథకులు బయలు దేరే రోజు వచ్చింది.మాకు తెలిసిన చాలా మంది వెళ్తున్నారనేది కూడా తెలిసింది.సాయంత్రం నాలుగు గంటలకు రాంబాబుగారు ఫోన్ చేసారు.ఆ సమయంలో వీర్రాజుగారు ఇంట్లో లేకపోవటంతో నేనే ఫోన్ తీసి మాట్లాడాను.'వందేళ్ళకథోత్సవాలకు విజయనగరం వెళ్తున్నామని,మీరు విజయనగరం వారు కదా మీరు కూడా వస్తే బాగుంటుంది' అన్నారు.
ఎప్పుడు వెళ్తున్నారని అడుగుతే అదేరోజు ఆరుగంటల ట్రైనుకు వెళ్తున్నామని, ఆ మర్నాడే కార్యక్రమమని చెప్పారు.నాకు చాలా కోపం వచ్చింది.కాని చాలాతాపీగా " ఇప్పటికిప్పుడు టిక్కెట్లు ఎలా అంటే "అది నేను చూసుకుంటాను" అన్నారు.బహుశా ఎవరో రావటం లేదేమో ఆ ఎవరో నా పేరు చెప్పి వుంటారు.ఆ టికెట్ లో నన్ను తీసుకెళ్దామని అడిగి వుంటారు అనిపించింది.
వీర్రాజుగారు ఇంట్లో లేరని, ఇప్పటికిప్పుడు ఒక్క గంటలో నేను తయారై రాలేనని చెప్పేసాను.
వీర్రాజుగారు వచ్చాక ఈ విషయం చెప్తే " కులాలు,మతాలూ ప్రాంతాలుగా సాహిత్య రంగం గ్రూపులుగా విడిపోతోంది.ఇటువంటి
ఏ గ్రూపులోనూ చేరకుండా మనమట్టుకు మనం రాసుకుంటూ వున్న వాళ్ళం అంతే అట్టడుగుకు వెళ్ళిపోతాం.అందుకే రాసినవన్నీ పుస్తకం రూపంలో లైబ్రరీలలో వుంటే ఎప్పటికైనా ఎవరో ఒకరు తీస్తే గుర్తింపులోకి వస్తాం . బండారు అచ్చమాంబ వంటి వారు అలాగే ఇన్నాళ్ళకు గుర్తింపులోకి వచ్చారు కదా" అన్నారు బహుశా చిన్నబుచ్చుకున్న నన్ను మరలించటానికే కావచ్చు.
2010లో వందేళ్ళ కథాప్రస్థానం సందర్భంగా తెలుగు రాష్ట్రంలోనే కాక బయటున్న తెలుగు కథకులందరితో ఎన్నో సమావేశాలూ, ఎన్నో ఇంటర్వ్యూలూ, వ్యాసాలూ, అభిప్రాయాలు పత్రికల్లో వెలువడ్డాయి. మొదటి కథారచయిత్రిగా భండారు అచ్చమాంబను పేర్కొని, ఆపైన 1980 తర్వాత రాసిన రచయిత్రులనే అనేకమంది పేర్కొన్నారు.
హెచ్ఎంటీవీ తెలుగు టీవీ ఛానల్ వందేళ్ల కథ పేరిట కార్యక్రమంలో భాగంగా 2012 లో గొల్లపూడి మారుతీరావు "వందేళ్ల కథకు వందనాలు" అంటూ ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. 118 మంది కథకుల కథలను పరిచయం చేసిన గొల్లపూడి మారుతీరావు కేవలం పన్నెండుమంది రచయిత్రుల కథలనే స్వీకరించటంకూడా గమనించాల్సిన విషయమే అనిపించింది.
అవన్నీ గమనించిన తరువాత 1910కి-1980కి మధ్య ఒకరిద్దరు తప్ప కథారచయిత్రులు లేరా అనే ఆశ్చర్యం కలిగింది. అరవయ్యో దశకంలో పత్రికలన్నింటిలో ప్రభంజనం సృష్టించిన రచయిత్రులంతా ఏమయ్యారు? వారు నవలలు తప్ప చెప్పుకోదగిన కథలేమీ రాయలేదా? రాసినా విమర్శకులు, చాలామంది పేర్కొన్నట్లు, ప్రేమలూ-పెళ్ళిళ్ళూ, కుటుంబాలూ, అపార్థాలూ, కలహాలతో నిండిన వంటింటి సాహిత్యమేనా? - ఇలా అనేక సందేహాలు నన్ను చుట్టుముట్టాయి
కాకతీయ విశ్వవిద్యాలయంలో "రచయిత్రుల వెనుకబాటు తనం " గురించి ఒకసారి నేను సమర్పించిన ప్రసంగవ్యాసం, తర్వాత ప్రభుత్వ సాంస్కృతిక,భాషా సంస్థ తో లేఖిని సంస్థ కలిసి నిర్వహించిన సదస్సులో రామలక్ష్మి కథలగురించి చేసిన ప్రసంగవ్యాసం గుర్తు వచ్చి
1950కి ముందు రచయిత్రులనీ, వారి కథల్నీ గురించి పరిశోధనాత్మక వ్యాసాలు రాయాలనే దృడమైన సంకల్పం కలిగింది.
ముందుగా ఎవరెవరి గురించి రాయాలనేది ఒక జాబితా తయారు చేసుకుని ముందుగా రచయిత్రుల కథలసంపుటాల సేకరణ మొదలు పెట్టాను.
కొన్న అపార్ట్మెంట్ పూర్తి అయ్యింది.అక్కడ ఒకరోజు పూజ చేయించేసి ఇంట్లో చేయించాల్సిన వుడ్ వర్క్ మొదలుపెట్టించాలని నిర్ణయించాము.
పూజ చేసే పంతులుగారి నెంబర్ మరిది దగ్గర తీసుకుని తేదీ నిర్ణయించాము.
ఫిబ్రవరి 13తేదీన సాయింత్రం ముహూర్తం నిర్ణయించారు.ముందు రెండు రోజులూ అవసరమైన వస్తువులు కొనటం ప్రారంభించాము.ఎవరినీ పిలవదలచుకోలేదు.దగ్గరలోనే వుంటారు కనుక మా పెద్ద ఆడబడుచునీ,మా చిన్న మరిదినీ మాత్రమే పిలిచాము.పూర్తిగా ఇల్లు మారిన తర్వాత స్నేహితులనూ, బంధువులనూ పిలిచి పార్టీ ఇవ్వాలని మా వుద్దేశ్యం.
13వతేదీ వుదయం దిల్ షుక్ నగర్ లో పళ్ళు మొదలైనవి కొంటున్నప్పుడు షాకింగ్ వార్త తో ఫోన్ వచ్చింది.
కుందుర్తి సత్యమూర్తి మాసివ్ హార్ట్ ఎటాక్ తో చనిపోయారని తెలిసింది.వీర్రాజుగారు విని ఎలా తట్టుకుంటారోనని భయం వేసింది.వెంటనే నాళేశ్వరం శంకరంగారికి ఫోన్ చేసి ఇలా ఆరోజు రాత్రి గృహప్రవేశం పూజ పెట్టుకున్న విషయం కూడా చెప్పాను.వెంటనే మలక్ పేట ఇంటికి ఆయన బయలుదేరి వెళ్ళారు.
మేము కొన్న వస్తువులను కొత్త ఇంట్లో పెట్టేసి మలక్ పేట వెళ్దామని సరూర్ నగర్ వచ్చాం.
ఇంట్లోకి రాగానే అంతవరకూ దుఃఖాన్ని వుగ్గ బెట్టుకుందేమో పల్లవి ఒక్కసారిగా ఏడుపు మొదలుపెట్టింది." పెట్టుకోక పెట్టుకోక ఒక శుభకార్యం తలపెడితే ఇలా జరిగిందేమిటి " అని వెక్కిళ్లు పెట్టింది. ఆమెను సముదాయించటం నాకూ కష్టమే అయ్యింది.నాకూ మనసులో కొండంత భయం గూడు కట్టుకుంది.అయినా బయటకు బింకంగా వుండి ఓదార్చాను
ఫ్రీవర్స్ ఫ్రంట్ నిర్వహణ అనుబంధం వల్ల కుందుర్తిగారి మరణానంతరం సత్యమూర్తి కుటుంబం ఇంట్లో మనుషుల్లా మాకు చాలా దగ్గర అయ్యారు.ఇప్పుడు ఈ పూజ చేయించటమా మానటమా ఒక సందిగ్ధం అయింది.
మలక్ పేట ఇంటికి వచ్చేక వీర్రాజు గారూ,శంకరంగారూ నేనూ కలిసి సత్యమూర్తి గారి ఇంటికి వెళ్ళాము.
సింగపూర్ లో వున్న చిన్న కూతురు కవితకు ఉదయం ఎప్పటిలాగే కాల్ చేసి కట్ చేసారట సత్యమూర్తి.ఆ తర్వాత కవిత తిరిగి తానే కాల్ చేస్తే అప్పుడు మాట్లాడటం ఆనవాయితీ అట.అదే విధంగా కాల్ కట్ చేసిన వెంటనే కుప్పకూలిపోవటం,ప్రాణం పోవటం నిముషాలమీద జరిగిందని తెలిసింది.కవిత చేసిన ఫోన్ ఎత్తడానికి ఆయన లేకుండా పోయారట.ఎంత విషాదం అనిపించింది.దగ్గరలో సత్యమూర్తి షష్ఠి పూర్తి చేయాలని సమత,కవిత అనుకున్నారు .ఈ లోపున ఇలా జరిగింది.కుందుర్తిగారు కూడా అలాగే షష్ఠి పూర్తి ఏర్పాట్లు జరుగుతుండగానే పోయారనేది గుర్తొచ్చింది.
నేను కొంత సేపు కుందుర్తి శాంతతోనూ,సమతతోనూ మాట్లాడి ఇంటికి వచ్చేసాను. " అక్కడి కార్యక్రమం పూర్తికాగానే వీర్రాజుగారిని తీసుకువచ్చేస్తాను.సాయంత్రం మీ కొత్త ఇంట్లో పూజ యథాతధంగా చేసుకోండి"అని శంకరం భరోసా ఇచ్చారు.
సాయంత్రం సరూర్ నగర్ కొత్త ఇంట్లో కార్యక్రమం కోసం ఇంట్లోనే కొంచెం పులిహోర, దద్దోజనం చేసుకుని తీసుకొని వెళ్ళాం.ఆడబడుచు ఇంటినుండి పాలు పొంగించటానికి గాస్ సిలిండర్ తీసుకు వచ్చాము.
పంతులుగారు సరియైన సమయానికే వచ్చి పూజ ప్రారంభించారు.హోమాలూ,వాస్తుపూజలవీ మాకు అక్కర్లేదు.సింపుల్గా వినాయక పూజ, వ్రతం
చేయమన్నాం.పల్లవీ,ఆషీ చేత పూజ చేయించమన్నాం.ఆయన అలాగే చేసారు.చిన్నమరిది దంపతులు,ఆడబడుచు దంపతులు వచ్చారు.వాళ్ళకి పల్లవి బట్టలు పెట్టింది.
పాలు పొంగించి చేసిన పరమాన్నం,మేము ఇంటినుండి తెచ్చిన పులిహోర,దద్దోజనం అందరం
తినేసి తిరిగి ఇంటికి వచ్చేసాం.మొత్తం మీద ఒక ప్రహసనం నిర్విఘ్నంగానే పూర్తి కావటంతో వూపిరి పీల్చుకున్నాము.
ఒక వారం పదిరోజులు అయ్యాక కార్పెంటర్ ను వెతుకుదాములే అనుకున్నాము.
అనుకోకుండా కందుకూరి శ్రీరాములుగారు ఒక కార్పెంటర్ గురించి తెలియజేసారు.శంకరం,శ్రీరాములుగారూ కార్పెంటర్ చారిని తీసుకుని వచ్చారు.అందరూ కలిసి సరూర్ నగర్ ఇంటికి కార్పెంటర్ ను తీసుకుని వెళ్ళి ఇల్లు చూపించారు.
కొన్ని ఫర్నీచర్ మోడల్స్ ఆల్బంలు కార్పెంటర్ చారి తీసుకొని వచ్చాక మార్పుచేర్పులు తో మనకు నచ్చే విధంగా చేయించుకోవచ్చు అనుకున్నాం.వార్డు రోబ్ లకు వేయాల్సిన డెకలమ్ డిజైన్లు పల్లవే ఎంపిక చేసుకుంటానంది.పూర్తి చేయటానికి మూడునెలలు పడుతుందని చారి చెప్పాడు.అదంతా అయ్యాకే ఆ ఇంట్లోకి మారుదామని మేము నిర్ణయించుకున్నాము.అప్పటికి ఆషీకి కూడా పరీక్షలు పూర్తయ్యాకే సెలవుల్లో మారవచ్చులే అనుకున్నాం.
నడక దారిలో -54
నడక దారిలో -54.
నా సమగ్ర కవిత్వం పుస్తకావిష్కరణ జరిగిన తర్వాత వీర్రాజుగారి సప్తతి సందర్భంగా దగ్గరి బంధువులతో,ఓ అయిదారుగురు ఆత్మీయ మిత్రులతో హొటల్లో చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసాము పల్లవీ ,నేనూ.
రోజు రోజుకూ తెలంగాణా ఉద్యమం ఊపందుకుంది.ఉద్యమ భావావేశం వలన చాలా మంది ఆత్మీయులైన సాహితీ మిత్రులు దూరం అయిపోయారు.తరుచూ కలవటానికి వచ్చేవారు కూడా రావటం మానేసారు.అది వీర్రాజుగారికి తీవ్ర మనస్తాపం కలిగించింది.
"ఎప్పుడో 1961 లో కడుపు చేతపట్టుకొని మనరాజధాని కదా అని వచ్చి శక్తిసామర్థ్యాలు,వయస్సూ అంతా ఈ గడ్డమీదే కరిగించుకున్నాము.నన్ను కన్నవారినీ,మనం కన్న పిల్లాడిని ఈ మట్టిలోనే కలిపాము.ఇప్పుడు ఇక్కడ పరాయి వాళ్ళమైపోయామా" అని తరచూ బాధ పడేవారు.
అదీగాక 2010 సంవత్సరానికి వచ్చేసరికి ముఖచిత్రాలు చిత్రకారులు తో వేయించే పద్ధతి తగ్గిపోయి ఫొటోలు,డిజిటల్ చిత్రాల వైపు సాహితీవేత్తలు ఆకర్షితులు కావటంతో ముఖచిత్రం కోసం వచ్చేవారూ తగ్గిపోయారు.ఇకపై ముఖచిత్రాలు చేయించుకునేవారు లేరు కనుక వీర్రాజుగారికి తైలవర్ణచిత్రాలు వేయాలనే ఆలోచన వచ్చింది.స్వంతంగా కట్టెఫ్రేములు చేయించి కేన్వాసుబట్ట కొని వాటికి బిగించి తయారు చేసుకుని ఒక చిత్రయజ్ఞాన్ని మొదలు పెట్టారు.
ఉదయం ఎనిమిదికే తయారై టిఫిన్ పూర్తి చేసి ఒక పొట్టి స్టూల్ మీద తాను కూర్చొని ముందు ఇంకో కుర్చీ మీద కాన్వాస్ ఫ్రేమ్ అమర్చుకొని చిత్రం వేయటం మొదలుపెట్టేవారు .తైలవర్ణాలు ఆరటానికి సమయం పడుతుంది కనుక ఒకేసారి రెండుమూడు కేన్వాసులపై చిత్రాలు తయారుగా వుంచుకునేవారు.
చుట్టూ రంగులు పరుచుకొని వర్ణచిత్రాలు వేస్తున్నప్పుడు రంగుల సరస్సులో ఇహాపరాలు మరచి ఈదులాడుతున్న అమాయకపు పసిబాలుడిలా కన్పించేవారు.భోజనసమయానికి పిలువగా పిలువగా కలుపుకున్న రంగు ఎండిపోతుంది అని పూర్తి అయ్యాక గానీ లేచేవారు కాదు.భోజనానంతరం ఒక్క అరగంట ఆగి మళ్ళా కాన్వాస్ ముందు కూర్చునేవారు.ఒక్కోసారి తాగటానికి ఇచ్చిన మంచినీళ్ళగ్లాసులోనో,కాఫీకప్పులోనో చిత్ర ధ్యానంలో పొరపాటున కుంచెను ముంచేసే వారు.
కంటిన్యూగా పది పన్నెండు గంటలు లేవకుండా పొట్టి కుర్చీ మీద కూర్చొని కూర్చొని ఆయనకు మోకాళ్ళ నొప్పులు ప్రారంభమయ్యాయి.ఒక్కొక్కప్పుడు ఉదయపు నడక చేస్తున్నా ఇబ్బంది పడేవారు.అలా కంటిన్యూగా చేయకుండా ఒక పూట మాత్రం పెయింటింగ్స్ వేసి మధ్యాహ్నం వేరే పని చేయమని కోపగించేదాన్ని.కానీ చిత్రం పూర్తి చేసేవరకూ ఆయనకి మనసు ఆగేదికాదు. రాజకీయ రంగు పులుముకున్న సాహిత్య మీటింగులకు మాకు ఆహ్వానాలు లేకపోవటంతో సభలకు వెళ్ళటం తగ్గిపోయింది.
మా ఇంటిప్రక్క మసీదు పెద్దగా కట్టేయటమే కాకుండా ఆ చుట్టూ చిన్న చిన్న ఇళ్ళన్నీ మూడు,నాలుగు అంతస్తులుగా పెరిగిపోయాయి.ఆ పై అంతస్తుల్లో ఎక్కువగా నైజీరియన్లు చేరారు.రోజు తెల్లవారుజామున ముఫ్ఫై నలభై మంది టీవీ టవర్ ఆస్మాన్ ఘడ్ నుండి మసీదు వైపు వస్తూ కనబడుతుండేవారు.దాంతో మా బిల్డింగ్ టెర్రస్ మీదకి వెళ్ళాలంటే ఇబ్బందికరం అయిపోయింది.రాత్రిపూట అర్థరాత్రి దాటే దాకా మా బిల్డింగ్ ముందు గట్ల మీద కూర్చొని రణగొణధ్వనిగా మాట్లాడుకొంటూ వుండేవారు.రాత్రి పెట్రోలింగ్ చేసే పోలీసులు కోప్పడి ఇళ్ళకి పంపేవారు.రోడ్డువైపుకే మా బెడ్రూం వుండటంతో ఈ గొడవలకి నిద్రపట్టేదికాదు.
నగరంలో ఏ మతఘర్షణ జరిగినా,మాదకద్రవ్యాల కేసులకైనా మూలాలు మా ఏరియా లోనే వుండేవి.అందుకే కాబోలు మా పైన వుండే సింథీవాళ్ళు అపార్ట్మెంట్స్ అమ్ముకొని వెళ్ళిపోయారు.
పల్లవి గచ్చిబౌలి నుండి బస్సులు పట్టుకొని రెండుగంటలు ప్రయాణం చేసి వచ్చేసరికి ఒక్కొక్కసారి తొమ్మిది దాటేది.ఆ ప్రాంతంలో తిరిగే ఆవారాలు అరుగుల మీద కూర్చొని " ఈ ఆంధ్రావాళ్ళు,ఈ ఆడోళ్ళు వచ్చి మన వుద్యోగాలు మనకి కాకుండా చేసారు" అంటూ రాజకీయనాయకుల్లా ఏదో ఒకటి వాగుతూ వుండేవారు. ' నేను ఇక్కడే పుట్టి పెరిగి చదువుకుని వుద్యోగం చేసుకుంటుంటే ఇలా అంటారేమిటని' అసలే అలసి పోయి వచ్చిన పల్లవి చిరాకు పడిపోయేది.
ఇంకా రానురానూ విసుగెత్తి పోయి వేరేచోట ఇల్లు కొనుక్కుని ఈ ప్రాంతం నుంచి వెళ్ళి పోదామని నిర్ణయానికి వచ్చింది.ఆషీ కూడా పెద్దదవుతోంది కనుక మూడు బెడ్ రూముల ఇల్లు చూడాలని నిశ్చయించుకున్నాం.
మొదట్లో ఇండిపెండెంట్ ఇళ్ళకోసమే చూసాం.తన స్నేహితులూ, బంధువులూ దగ్గర్లో వున్నారు కనుక మలక్ పేట,వనస్థలిపురం మధ్య లోనే చూస్తే బాగుంటుందని వీర్రాజుగారు
అభిప్రాయపడ్డారు.కానీ మా ఆర్థిక లిమిటేషన్ కి మించి ధరలు వున్నాయి.పల్లవికి ఆఫీసుకి దగ్గరగా వుండేలా ఇల్లు తీసుకుంటే రానూపోనూ నాలుగు గంటల శ్రమ తగ్గుతుందనే ఆలోచన వున్నా వీర్రాజు గారు ఇటువైపే చూద్దాం అనటంతో తండ్రి మాటల్ని తోసిపుచ్చలేక పోయింది.
డిసెంబరు 9వ తేదీన కేంద్రం ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా హోం శాఖ మంత్రి చిదంబరం స్వయంగా ప్రకటన చేశారు. ఈ ప్రకటన తర్వాత తెలంగాణా అంతటా పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి.
ఆ మర్నాడు తెల్లారిన తరువాత ఆంధ్రలో సమైక్యాంధ్రకు అనుకూలంగా రాజీనామాలు, ఆందోళనలు మొదలయ్యాయి.అన్ని ముఖ్యమైన కేంద్రరాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు,ముఖ్యమైన విద్యాసంస్థలు, ఐటీ కారిడార్ మొదలైన వన్నీ హైదరాబాద్ లోనే ఉండటం ,ఆంధ్రాకు చెందిన అనేక
మంది తమ పెట్టుబడులను ఇక్కడే పెట్టడం,ఇక్కడే ఇల్లూ వాకిలి పిల్లల చదువులతో స్థిర పడిన వారంతా ఏమీ తోచని స్థితికి వచ్చారు. వీటి వలన హైదరాబాద్ తో సహా తెలంగాణా విడిపోతే మంచి విద్యా సంస్థలుగానీ ప్రభుత్వ రంగ సంస్థలు గాని లేని మిగిలిన ఆంధ్రప్రదేశ్ మనుగడ భయంకరంగా కనిపించింది.
హైదరాబాద్ లో ఆఫీసుల్లో పనిచేసే వుద్యోగులలో చీలిక వచ్చేసింది.
ఆ ఆందోళనల ప్రభావంతో డిసెంబరు 23న తెలంగాణ ప్రకటన నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్టు ప్రకటించారు చిదంబరం.దాంతో మళ్ళా తెలంగాణ భగ్గుమంది. ప్రాంతీయ వివక్షలు అన్ని రంగాలలో మొదలయ్యాయి. సాహిత్య రంగంలో మరింత స్పష్టంగా కనిపించింది.ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా అనేక ధూం ధాం లు నార్వహించటం అందులో భాగంగా కవితా గానాలు ఎక్కడికక్కడ జరిగాయి.
ఎప్పుడో వచ్చి ఇక్కడే స్థిర పడిన మాలాంటి
వాళ్ళం ప్రత్యేక తెలంగాణా వుద్యమానికి సానుకూలంగా వున్నా కూడా శత్రువులుగా పరిగణించడంతో ఆత్మీయులైన సాహితీ మిత్రులకు మాకు మధ్య కనిపించని గోడ వున్నట్లుగా దుఃఖం కలిగేది.మనసువిప్పి ఎవరితో కూడా బాధని పంచుకునే పరిస్థితి మృగ్యం అయిపోయింది.ఈ ప్రభావం నాకన్నా వీర్రాజుగారి మీద ఎక్కువగా వున్నట్లుగా వుంది.సభలూ సమావేశాలకు కూడా ఎప్పుడో తప్ప వెళ్ళటం తగ్గి పోయింది.అదీకాక అన్ని సమావేశం మందిరాల్లోనూ ఉద్యమం సమావేశాలూ,కవితాగానాలూ ఎక్కువగా జరుగుతుండేవి.థూమ్ థామ్ లోనూ,జాగృతి బతుకమ్మ సంబురాలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి.
మా కింద అపార్ట్మెంట్ లో యజ్ణప్రభగారు సంగీతం టీచర్.పల్లవికి ఆమే సంగీతం నేర్పించి,ఢిల్లీ గంధర్వమహావిద్యాలయం సర్టిఫికెట్ పరీక్ష కూడా రాయించారు.ఆతర్వాత పల్లవి రేడియోలో బిగ్రేడ్ సెలెక్షన్ పాసై లలిత సంగీతం పాడేది.ఇదంతా పల్లవి పెళ్ళి కాకముందటి విషయం.పల్లవి వివాహా ఏర్పాట్లకు కూడా అప్పుడుచాలా అండదండగా వున్నారు.బ్రహ్మలే అయినా పల్లవిని దత్త పుత్రిక లా ప్రేమించేవారు.పల్లవికి జరిగిన దుర్ఘటన నాకు ఆమె చాలా కలత పడ్డారు.ఒక జ్యోతిష్కుడి దగ్గర మళ్ళీ పెళ్ళి గురించి కూడా కనుక్కుని చాలా ఉత్సాహంగా నాకు చెప్పారు.నాకు వాటిమీద నమ్మకం లేక పోయినా పిల్ల జీవితం చక్కబడి ఒక తీరం చేరుతుందనే మాట సంతోషమే కలిగించింది.అంతగా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి యజ్ణప్రభగారు.ఆమె పెద్దన్న రాజమండ్రిలో శ్రీపాద పట్టాభి నాటకరంగంలో వుండేవారు.తమ్మీడు జిత్ మోహన్ మిత్ర నటుడు.ఆ విధంగా ఆమె కుటుంబం సాంస్కృతిక వారసత్వం కలిగిన వాళ్ళు.
అయితే ఆమెకు రానురాను అనారోగ్యపు ఛాయలు పెరిగాయి.మొదట్లో చెప్పటం మర్చిపోతానేమో అన్నట్లు గబగబా మాట్లాడే ఆమె తదనంతరం డిమెన్షియా బారిన పడ్డారు.అది అర్థం కాక వాళ్ళాయన చెడ తిట్టటం,అరవటం,కొట్టటం చేసేవాడు.కిందనుండి వచ్చే ఆ కేకలూ,తిట్లూ,గోల చికాకే కాక ఆమె భర్త మీద కోపం వచ్చేది.గృహహింస కింద అతనిమీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనిపించేది.ఇస్తే అతన్ని అరెష్టు చేస్తారుసరే.కొడుకులిద్దరూ విదేశాల్లో వున్నారు.అటువంటప్పుడు ఆమె గతి ఏమిటి అనిపించింది.ఏ సమస్యకైనా రెండువైపులా ఆలోచించాలని అంటారందుకే.
ఈమె సంగతి ఇలా అయితే మా కుటుంబ మిత్రులు, వీర్రాజు గారి ఆప్తమిత్రుడు రచయిత అయిన వ్యక్తి ఇదే విధంగా డిమెన్షియా రావటానికి తొలి స్టేజిలో వున్నాడు.ఆయన్ని చూసుకోలేక భార్యా పిల్లలు మా ఇంటికి దగ్గరలోనే వృద్ధాశ్రమంలో చేర్చారు.ఆయన తన భార్యాపిల్లలు వృద్ధికి ఎంతగా శ్రమ పడేవారో తొలి నుంచీ కళ్ళారా చూసిన వాళ్ళం.ఆయన తన మనవరాలిని చూసేందుకు చుట్టూ వెతుక్కునే వారు.ఆయన తపన చూస్తే మనసు ద్రవించి పోయేది.అటువంటి భార్యా పిల్లలూ ఎప్పుడో వారానికో,రెండు వారాల్లో వచ్చి చూసేవారు.
కానీ వీర్రాజు గారు రోజు విడిచి రోజు పెయింటింగ్స్ వేయటం పని ఆపేసి స్నేహితునికి ఇష్టమైన వంటకం చేయించి తీసుకుని వెళ్ళేవారు.ఒక్కొక్కప్పుడు నేను కూడా వెళ్ళే దాన్ని.
ఆశ్చర్యం ఏమిటంటే చివరి రోజుల వరకూ ఆయన వీర్రాజు గారిని గుర్తుపట్టేవారు.
ఇంతకీ అతనెవరంటే కె.కె.మీనన్ పేరు గల కథకుడు.తొంభైలలోనే సరోగసీమీద నవల రాసిన వైజ్ఞానిక రచయిత.ముఖ్యంగా ఏజీ ఆఫీస్ లో రంజని పేరుతో సాహిత్య సంస్థకు అధ్యక్షుడుగా వున్న కాలంలో అనేకమంది ప్రముఖ రచయితలను ఆహ్వానించి మంచి కార్యక్రమాలను నిర్వహించి రంజనికి ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి.కానీ ఆయన చివరిదశలో పలకరించి సాంత్వన పలికిన వారూ లేరు.తర్వాత కూడా ఆయన విస్తృత రచయితగా మిగిలిపోవడం కన్నా విషాదం ఏముంది?
ఈ ఇద్దరూ వారికే తెలియని జీవితాన్ని పసివారిలా జీవించిన రోజులూ మర్చిపోలేను.వారు భౌతికంగా లేకుండా వెళ్ళిపోయిన నాటి విషాదపు రోజులనూ మరచిపోలేక తలచుకున్నప్పుడల్లా సలుపు పెడుతూనే వుండటంతో ఆ తర్వాత " నిజానికీ అబద్ధానికీ మధ్య" అనే కథ రాసాను.
వృద్ధాప్యం ఒకశాపమా? లేకుంటే డిమెన్షియా వలన శాపమౌతోందా అనే ఆలోచన వెంటాడింది.
నన్నే కాదు వీర్రాజుగారి మనసునీ అతలాకుతలం చేసింది.
- శ
26, జూన్ 2025, గురువారం
అసీతినెలబాలుడు విహారి
అశీతి నెలబాలుడు-విహారి
ఒక సాహితీవేత్త జీవితాన్నీ, సాహిత్యాన్నీ పరామర్శించాలంటే వారి సమగ్ర సృజన అధ్యయనం చేయాలి. కానీ విహారి అనే పేరుతో సాహిత్య రంగంలో నమోదు అయిన జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తిగారు చేసిన కృషి అనన్య సామాన్యం, 1962లో 'చుక్కాని' పత్రికలో ప్రచురితమైన 'రాగజ్యోతి' కథతో మొదలుపెట్టి పద్నాలుగు కథా సంపుటాలు వెలువరించారు. ఆరు నవలలు సాహిత్య రంగానికి అందించారు. ప్రముఖుల సాహిత్యం గురించే కాక యువతరం వారిని కూడా వెన్నుతట్టి ప్రోత్సాహం ఇస్తూ సాహిత్య పరామర్శ చేయటం గుర్తించదగినది. గురజాడ మొదలుకొని నేటితరం కథకుల వరకు కుల, మత, ప్రాంత భేదం లేకుండా అన్ని సాహిత్య వాదాలనూ, ఆయా కథకుల కథలన్నింటినీ చదివి సమగ్రమైన వ్యాసాలు రాశారు. నొప్పింపక తానొవ్వక అన్నట్లుగా కథకుని కథలలోని వస్తు రూపాల్ని శైలి శిల్పాలనూ, భాషా విషైక విశేషాలను విశ్లేషిస్తూ సుమారు 300 మంది కథకులపై రాసిన ఈ విశేషవ్యాసాల్ని పదిహేను సంపుటాలుగా ప్రచురించారు. ఇవి ఒక వ్యక్తి చేయలేని ఈ సంపుటాలు విశ్వవిద్యాలయాలలో పరిశోధకులకు ఉపయుక్తంగా ఉన్నాయి.
2013లో 'ఆనాటి కథలు- ఆణిముత్యాలు' శీర్షికతో అపురూపమైన శ్రీపాద, వట్టికోట ఆళ్వారుస్వామి, చలం, కనపర్తి వరలక్ష్మమ్మ మొదలైన ప్రముఖుల ఆణిముత్యం వంటి కథలను వారి గుణ విశేషములను కొత్తతరం: రచయితలకు ఉపయోగపడేలా పరిచయం చేశారు.
సుమారు అరవై ఏళ్లుగా చేస్తున్న సాహిత్య వ్యవసాయంలో 300కు పైగా రాసిన కథలన్నీ కూడా సమాజాన్ని పరిశీలించినవే. చదువు విలువని తెలియజెప్పి 'అక్షరం', రాజకీయ మోహంతో పట్టని వ్యక్తుల కథ 'అమ్మ వెనక చీకటి', 'ఆ తల్లికేం కావాలి' వంటి తల్లి వేదననీ, వాత్సల్యాన్ని, వృద్ధాప్యాన్ని సమస్యల్ని తెరిచి చూపే కథలు, డబ్బు వెనక పరుగులు తీసే పిల్లలు, కథలన్నింటా జీవితాన్ని ప్రవహింప చేసేలా సున్నితమైన భావ ప్రకటన వీరి సొంతం. సరళ సంభాషణలు మానవీయ విలువలు, కుటుంబ, ఆర్ధిక సంబంధాలు ఇలా అపారమైన కథా వాహినిలోని కథల గురించి చెప్పుకుంటే ఒక పుస్తకాన్నే రాయొచ్చు. ఇప్పటికీ కూడా కొత్తవారితో సమానంగా విహారి గారి కలం తాజాగా పోటీలలో కూడా కథలను రాస్తుందంటే విహారి గారి సృజన ఎంత నవనవోష్మంగా ఉందో అర్థమవుతుంది.
మరో ముఖ్య విషయమేమంటే, చాలామంది కథకులలాగా విహారిగారు తన కథలలో సమాజంలోని అవకతవకలపై కత్తి ఝుళిపించరు. చాలా సహనంతో ఒక్కొక్క పొరనే విప్పుతూ సమాజాన్ని చూపుతారు. సమాజంలోని వ్యక్తుల బాధ్యతల్ని ఎత్తి చూపి గుర్తు చేస్తారు. చెప్పదలచుకున్న సిద్ధాంతాల్ని సహృదయంతో పాఠకులు స్వీకరించే పంధాలో ఒప్పిస్తూ కథనీకరించడం వీరి రచనా విధానం, విహారి గారు చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు ఆఖరికి 6500 పద్యాలతో 'శ్రీ పదచిత్ర రామాయణం' రచించి బృహత్ గ్రంథ రూపంలోకి తీసుకువచ్చారు.
విహారి గారి అపార సాహితీ సంపదని విశ్లేషించటం అసాధ్యం, అందువలన నేను కవిత్వానికే పరిమితమై నాకు అత్యంత ప్రీతిపాత్రమైన దీర్ఘ కవిత 'చేవ్రాలు' గూర్చి పరామర్శించే దలిచారు.
విహారి గారు ఇప్పటికీ వెలువరించిన చలనమ్ కలం కన్ను, మనం మనం.. 'మధ్య మా గతి' అనే సంపుటాలు కాక 'చీకటి నాణెం' అనే దీర్ఘ కవిత అంతకుముందు వెలువరించిన కవిత్వ గ్రంథాలు ఇటీవల వెలువరించిన దీర్ఘకవిత చేవ్రాలు, దీనికి టాగ్ లైన్ గా 'వ్యక్తిత్వం' -"వికసనం' అని పేరు పెట్టటంలోనే ఒక ప్రత్యేకత చూపారు.
''గుండె గొంతులోన కొట్లాడినట్లు విహారి గారిని ఒక చోట నిలకడగా కూర్చోనీయకుండా పదేళ్ల మధనంగా బయటపడింది ఈ చేవ్రాలు దీర్ఘకవిత. ఇందులో ప్రవేశిక, ప్రారంభిక, లోనారసి,ఋణరేఖ,వికసనం అని అయిదు అధ్యాయాలుగా విభజించినా, అతిపెద్ద అధ్యాయంగా, ముఖ్యమైనదిగా మూడవది ఉన్నా ఇంకా పాఠకులకు మరింత హృదయంగమంగా ఉండటానికి కావచ్చు.. లేదా పాఠకులు రచనలోకి మమేకం కావాలనే ఉద్దేశ్యం కావచ్చు.. కవి మధ్య మధ్య హెడ్డింగులు పెట్టి సులభ గ్రాహ్యం చేసేరు.
ఒక వ్యక్తి మానసిక వికననం అతడు పెరిగిన వాతావరణంపైనా, ప్రభావితం చేసే మిత్రుల పైనా,చదువు నేర్పిన గురువుల పైనా, చదివిన చదువులపైనా ఆధారపడి ఉంటుంది. ఆ మానవ వికసన సమగ్ర పరిణామ రూపాన్ని 'చేవ్రాలు'లో అక్షరీకరించాడు విహారి గారు.
మొదటి అధ్యాయంలో కవితని ఎత్తుకోవటమే. జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నది' అని మొదలు పెట్టడంతో సమాజంలోని వివిధ కోణాలను చూపించారు. బతుకును ముంజేతి కంకణంగా అభివర్ణిస్తూనే-'ఎవరి బతుకు వారికి/వారే కుట్టించుకున్న వలువ/ఎవరి వేలిముద్ర వారివే' అంటారు. ఎందుకంటే ఒకరి జీవితం మరొకరి చేతిలో ఆటబొమ్మ కాదు అని నిర్ధారిస్తూనే 'ఒకరి జీవితం వేరొకరి చేతిలో తెల్ల కాగితం అంటారు. తెల్ల కాగితం మీద ఎవరికి వారు రాసుకోవాలి కానీ మరొకరి ఆధీనంలో ఉంటే జీవితం ఎట్లా పరిణమిస్తుందో ఊహించుకోవాలనే అభిప్రాయాన్ని కవి ప్రకటిస్తారు..
రెండో ఆధ్యాయం ప్రారంభికలో శిరశోదయమై మాయని ఛేదించుకొని వచ్చిన శిశువుల బుడి బుడి అడుగులు వేయటం, తల్లి గోరు ముద్దలు, చదువుల పరుగుపందేలు,వచ్చీరాని కౌమార ప్రాయంలో వారిపై ప్రభావం చూపించే మాయాజాలాల కారణంగా- మెదడు పంజరంలో కోర్కెల చిలుకలు గుప్త విజ్ఞానంపై మోహం గురించి కవిత్వీకరిస్తూనే 'నడక కాదిది పోరాట జారుడుమెట్లపై ఆట' అంటూ సందిగ్ధప్రాయవు చంచల స్వభావాన్ని అక్షరాలతో గుది గుచ్చారు.
ఇక ముఖ్యమైన పెద్ద అధ్యాయం 'లోనారసి' లో దాని కొనసాగింపు గానే 'గుండె మట్టిని కుల్లగించే/ కోరికల వానపాములు 'గురించి జాగరూకత చెప్తాడు కవి. ఆలోచనాశూన్యులకు ప్రతి అంశాన్ని భూతద్దంలో చూపి భయభ్రాంతులకు లోనుచేసి మానసిక రోగులుగా మార్చే వైనాన్ని విశదీకరిస్తారు కవి. ఆత్మ న్యూనతకి చోటిస్తే గుండె సాగదీయక తప్పని కమ్మెచ్చుతీగ 'అవుతుందంటారు. నడిగ్గా అటువంటప్పుడే-' నిత్యానిత్య వివేకం -వ్యక్తిత్వం'-ని నిలబెడుతుందని ముక్తాయింపునిస్తారు.
'క్రియా శూన్యత గట్టు మీది పిచ్చిమొక్క వరి చేలో కలుపు మొక్క/ అచంచల విశ్వాసం/అదే దారి దీపం' అదే చేతి కర్ర' అంటూ మన భావోద్వేగాలకు మనమే బాధ్యులం అనేది ఉపదేశిస్తారు. కలలు కన వద్దంటారు. ఎందుకంటే అనుకున్నది జరగకపోతే వచ్చే అనర్థాలు తెలియజేస్తారు.
''డాలర్ల రోగగ్రస్తుడికి చికిత్స లేదని ఖచ్చితంగా ప్రకటిస్తారు. ఏ విషయానికి నా వల్ల కాదని వదిలేయొద్దంటారు. అవినీతి మేత, క్షణికోద్రేకం, ఆహం వీటన్నిటి వలన జరిగే కష్టనష్టాలను పంక్తులు పంక్తులుగా బోధిస్తూ మానసిక వికశనం కావాలంటే సందేహం, పరిశీలన, సమాచారం, విశ్లేషణ మనిషికి అత్యవసరం అంటారు కవి విహారి.
నాలుగవ అధ్యాయం నుంచి యవ్వనానికి 'ఋజు రేఖలు లక్ష్య నిర్దేశానికి గమ్యం నీది -నడక నీది- మిట్ట పల్లాలని సహనమే ఏకైక దీవంగా గమనిస్తూ ముందుకు నడవమంటారు. ఈ అధ్యాయం అంతా ఎన్నైన్నో సామెతల్ని కవితాత్మకంగా ఉటంకించుతూ సుబోధకంగా ఆసాంతం సాగుతుంది.
'స్వీయావిష్కరణం/ వేకువ రేకుల స్పాటిక సాధనం!! /గతం గాయాలు సలుపుతాయి/ రాతి మీద ఉలి దెబ్బలు అవి/ అవి నిట్టాడి గూడులు కాకూడదు/రూపాంతరం చెందిన కర్తవ్యాన్నివ్వాలి'- అని ధైర్యాన్ని, అత్మవిశ్వాసాన్ని పురిగొల్పుతాడు కవి.' క్రమశిక్షణ అంటే/ కఠినత్వమూ కాదు, నిరంకుశత్వమూ కాదు అదొక జీవన విధానం' గా చెప్పటమే కాక నిబద్ధత బద్ధకానికి శత్రువుగా చూపుతారు. కార్యదక్షత కట్టుబడి- పెట్టుబడిగా అభివర్ణించుతారు.'నీ బొమ్మని నీవే చిత్రించుకోగలగాలి' అనటంలో ఎవరి వ్యక్తిత్వాన్ని వారి నిర్మించుకోవాలనే సందేశం ఇస్తారు.
'సృజనకు ఆధార భూమికలు-మేధ విలువలు' అని నిర్ధారిస్తూనే నైతికత అంతస్సూత్రం ఎప్పుడూ తెగిపోకుండా కాపాడుకోవలసిన బాధ్యత వ్యక్తిదే అనేది నర్మగర్భంగా తెలియజేస్తారు కవివిహారి.
"మానవ సంబంధాలంటే/మనం మనంగా వుండటం/మానవసంబంధాలంటే / సమాజ సమన్వయ శక్తి!! 'వ్యక్తి''త్వం' వికసనం అంటే ఎత్తుపల్లాలను చూసి ఆ ప్రక్రియ అదే వ్యక్తి నిర్మాణం' అంటారు కవి
అయిదవ అధ్యాయం వికసనం అంటే విశ్వ దీర్ఘ కవితారాగానికి శృతి కూర్చటం అంటూ ముక్తాయింపుగా ఒక వ్యక్తి సంపూర్ణ మానవుడిగా రూపొందటానికి అలవర్చుకోవాల్సిన, జీవితాంతం పాటించవలసిన నిర్మాణ ప్రక్రియల రూపకల్పనలని ముగిస్తారు.
నేటి యువతరానికి వ్యక్తిత్వ వికాసచిత్రాలను దీర్ఘ కవితారూపంలో లక్ష్యాన్ని నిర్దేశిస్తూ, లక్ష్యాన్ని దినచర్యలో భాగంగా చేసుకొని సమయ నిర్దేశాన్ని చుక్కానిగా చేసుకొని ప్రయాణిస్తే రూపెత్తిన మనిషిగా మారగలడనే ఆశయంతో తన చేవ్రాలు' లు వ్యక్తిత్వ వికాస గ్రంథంగా తీర్చారు విహారి గారు.
కేవలం మాటల మనిషిగా, రాతల మనిషిగా కాక తాను ఆచరించి చూపే స్నేహశీలి, సౌజన్య మూర్తి, నిర్విరామ, నిరంతర సృజనశీలి అయిన 'విహారి గారికి ఎనిమిది పదులు దాటిన వయసులోనూ వారి కలం ఇంకా పదునెక్కాలని అభిలషిస్తూ వారికి సహస్రాధిక జన్మదిన శుభాకాంక్షలు
(అక్టోబర్ 15-విహారి గారి 81వ జన్మదినం సందర్భంగా సృజన క్రాంతి ఈ ప్రత్యేక వ్యాసం)
నడక దారిలో -53
నడక దారిలో -53
మా ఇంటికి దగ్గరలోనే ఆస్మాన్ ఘడ్ మీద సాయికృప అపార్ట్ మెంట్స్ లో కొంతకాలంగా కె.రామలక్ష్మిగారూ,వారి అక్క వుంటున్నారని తెలిసింది.వారి క్రింద అపార్ట్మెంట్ లోనే వారి అక్క కూతురు నివాసం వుంటుంది.అందుకని ఆరుద్ర మరణానంతరం మద్రాసు నుంచి వచ్చేసారు.వాసా ప్రభావతి గారితో మొదటి సారి వెళ్ళాను.ఆతర్వాత తరుచూ వెళ్ళేదాన్ని.రామలక్ష్మి గారితో కబుర్లకు కూచుంటే సమయం తెలియదు.ఒక ప్రవాహంలా అనర్గళంగా ఎప్పడెప్పటి అనుభవాలనో చెప్పుకొంటూ పోతారు.మొదట్లో మాట్లాడుతోన్నప్పుడు 'అలా అనేవారు మీ నాన్న' అని చెప్తుంటే అర్థం అయ్యేది కాదు తర్వాత ఆరుద్ర గారని తెలిసింది.చాలా సన్నిహితంగా నాతో మాట్లాడేవారు.నడవటానికి కాళ్ళు సహకరించక పోయినా వుప్పొంగే వుత్సాహంతో వుండటాన ఆమెతో మాట్లాడుతుంటే మనకీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయనిపించేది.
ఒక సారి వాళ్ళింటికి ఒక పదిహేను మంది రచయిత్రులను ఆహ్వానించి రామలక్ష్మి గారు ఆరుద్ర పుస్తకాన్ని ఆవిష్కరణ చేసారు. వరూధినిగారూ,శాంతసుందరీ,గోవిందరాజుల సీతాదేవి, శారదా అశోక్ వర్థన్,హేమలతా భీమన్న,ముక్తేవిభారతి, కొండవీటి సత్యవతి,కె.బి.లక్ష్మి,పోలాప్రగడ రాజ్యలక్ష్మి మొదలైన వాళ్ళం హాజరయ్యాము.కొంతసేపు ఆరుద్ర లలితా గీతాలు, సినీగీతాలు ఆలపించాము.పుస్తకం ఆవిష్కరించి ఫొటొలు తీసుకొని తర్వాత రామలక్ష్మిగారి మాటలవిందుతో పాటూ వాళ్ళ అక్క కూతురు ఏర్పాటు చేసిన విందు కూడా ఆస్వాదించాము.
రామలక్ష్మి గారి ఇంటి కింద అపార్ట్మెంట్ లో అబాకస్ నేర్పించే టీచర్ వున్నారు.ఆమె దగ్గర ఆషీని అబాకస్ నేర్చుకోవటానికి చేర్చాను.రోజూ ఆషీని తీసుకు వెళ్ళి వాళ్ళింట్లో దిగబెట్టి ఆ క్లాస్ అయ్యేవరకూ నేను ఒక్కొక్కప్పుడు రామలక్ష్మి గారింట్లో కూర్చొని కబుర్లు చెప్పేదాన్ని.ఆషీకి అబాకస్ చాలా నచ్చింది.ఉత్సాహంగా నేర్చుకునేది.
ఆ సందర్భంలో రామలక్ష్మి గారితో నేను తరుచూ కలిసేదాన్ని. అబాకస్ క్లాసు అయ్యేవరకూ రామలక్ష్మిగారి దగ్గరకి వెళ్ళటంతో, ఎన్నెన్ని కబుర్లో చెప్పేవారు. ఒక గంట ఎంత తొందరగా గడచిపోయేదో! ఆమె అనర్గళంగా ఎన్నో విషయాలు చెప్తుంటే సమయం తెలిసేది కాదు.
ఆమె నాకు ఎంతో ఇష్టమైన కవి శ్రీశ్రీ గురించి తాగుబోతుగా చెప్తుంటే బాధకలిగించింది కాని నిజాల్ని ఒప్పుకోవాలి కదా!
ఒకసారి రామలక్ష్మిగారికి పొట్ట ఆపరేషన్ అయ్యిందట. ఆపరేషన్ చేసిన తర్వాత ఆ డాక్టర్ " మీ పొట్టనిండా అక్షరాలే ఉన్నాయని ఆరుద్ర గారు అన్నారు. ఒక్క అక్షరం ముక్కా లేదు మీ పొట్టలో రామలక్ష్మిగారూ'అన్నాడు" అని చెప్తూ నవ్వారు. అదివిన్నాక ఎప్పుడు తలచుకున్నా నవ్వొస్తూ ఉంటుంది
ఆమెకు పత్రికా రంగంలోనూ, సినిమారంగంలో ను, సామాజిక సేవారంగంలోను, సాహిత్య రంగంలోనూ, రాజకీయరంగంలోను ఇలా అనేక అనుభవాలు ఉండటంవలన వాటిల్లోని లొసుగుల్ని విమర్శనాత్మకంగా చెప్పేవారు. ఎదురుగా ఉన్నవారికి కొన్ని విషయాలు నచ్చినా నచ్చకపోయినా ఆమె తన మనసులో మాటను, తన అభిప్రాయాన్ని చెప్పటానికి జంకరు. తనని తానే అందరూ గయ్యాళి నని అంటారని కూడా నవ్వుతూ చెప్పుకుంటారు. నిర్భయంగా ఉన్నది ఉన్నట్లు నిష్కర్షగా చెప్పకమానరు. అందుచేత కొంతమంది ఆమెకు దూరమయ్యారు. నిజానికి వారు రచనలు చేసే ఆకాలంలో ఆయారంగాలలో పురుషాధిక్యత మరింత ఎక్కువ . వాటిని తట్టుకొని నిలదొక్కుకోవాలంటే ధిక్కార స్వరం ఉండక తప్పదేమో.
ప్రతీ ఒక్కరి గురించి అందులోనూ సినీ, సాహిత్య రంగంలో లోని వారి మంచికన్నా వాళ్ళ ప్రవర్తనలోని దుర్గుణాలను వాళ్ళరెండుముఖాలను వేరు చేసి నిర్భయంగా చూపించేవారు. ఆవిడ నెగెటివ్ గానే మాట్లాడుతున్నట్లు అనిపించినా ఆవిడ లోని పాజిటివ్ నెస్ మనం స్పష్టంగా గుర్తించగలం, కదలడానికి కాళ్ళు సహకరించకపోవటంవలన చాలా కాలంగా వీల్ చైర్ కే పరిమితం అయినా అన్నింటికీ ఒకరిపై ఆధారపడాల్సి వచ్చినా సాహిత్యం, సినీరంగం పత్రికలూ వీటి గురించి తప్ప తన శారీరక అసహాయత్వం గురించి గానీ, అనారోగ్యాల గురించి గానీ ఒక్కసారి తలంచరు. ఆ వయసులో కూడా హాస్యంగా, చమత్కారాలతో సానుకూల
దృక్పథంలో మాట్లాడటం వలన ఆమెతో మాట్లాడుతున్నంతసేపూ హాయిగా ఆహ్లాదంగా ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా నిజం.
మొత్తంమీద ఆషీ అబాకస్ క్లాసులు రామలక్ష్మి గారితో సాన్నిహిత్యాన్ని పెంచాయి.
ఎందువలనో గుర్తులేదు.కానీ మలకపేట దిల్షుక్ నగర్ ప్రాంతం అంతా కొన్నాళ్ళు కర్ఫ్యూ పెట్టిన తర్వాత సడలింపు ఇచ్చి రాత్రి ఎనిమిది నుండి రాత్రి కర్ఫ్యూ వుంచారు.
ఆరోజు పల్లవి మధ్యాహ్నం కాలేజీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది.సాయంత్రం ఎప్పటిలాగే ఆషీని అబాకస్ క్లాసులో దించి ఏడుగంటలకు వస్తానని ఇంటికి వచ్చేసాను.ఏడుగంటలకు ఇంటినుండి బయలుదేరి వెళ్తుంటే స్ట్రీట్ లైట్లు ఆరిపోయాయి.నేను ఆ చీకట్లో చిన్న స్పీడ్ బ్రేకర్ని చూసుకోక తట్టుకుని పడిపోయాను.కుడిచేతిమీద ఆపుకోవాలనుకోవటంలో చెయ్యి మణికట్టు దగ్గర విరిగింది.బేగ్ లోని ఫోన్ తీసి చెయ్యాలన్నా వీలుకాలేదు.ఎడమచేతితో కుడిచేతికి సపోర్ట్ ఇచ్చి బాధ అణచుకొని ఆషీ దగ్గరకు వెళ్ళాను.
ఆషీకి ఫోన్ ఇచ్చి మా వారికి రింగ్ చేయమని విషయం చెప్పి మా రెగ్యులర్ ఆటో సలీమ్ కి హాస్పిటల్ కి వెళ్ళటానికి ఫోన్ చేయమన్నాను.పల్లవికీ ఫోన్ చేయించాను.
ఆషీ సాయంతో ఇంటికి వెళ్ళి సలీమ్ ఆటోలో మలక్ పేటలోని సుస్రుతా నర్సింగ్ హోం కు వెళ్ళాము.ఈలోగా పల్లవి డైరెక్ట్ గా అక్కడికే వచ్చింది.
కర్ఫ్యూ అని డాక్టర్ వెళ్ళిపోయాడట.ఒకనర్సు,మరొకరిద్దరు అటెండర్లు వున్నారు.అక్కడ రాత్రికి జాయినైపోమనీ,ఉదయం డాక్టరు వచ్చాక చూస్తారని అన్నారు.నాకునొప్పి అంతకంతకూ పెరిగిపోతోంది.
ఈ లోగా ఫోన్ అందుకుని కారు తీసుకుని పొనుగోటి కృష్ణారెడ్డి వచ్చి దిల్షుక్ నగర్ లోని ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరకు వెళ్దామన్నారు.పల్లవినీ ఆషీని ఇంటికి సలీమ్ ఆటోలో వెళ్ళిపోమన్నాము.
ఆర్థోపెడిక్ డాక్టర్ ఎక్స్ రే తీయించాక, మర్నాడు ఆపరేషన్ చేసి వైర్ వేస్తాము.హైబీపీ వుంది కనుక ఇసీజీ తీయించి రిపోర్ట్ తీసుకు రమ్మన్నారు. వెంటనే నొప్పి తగ్గటానికి ఇంజెక్షన్ ఇచ్చారు.అప్పటికే పది దాటింది.కర్ఫ్యూ వలన అంతటా నిర్మానుష్యం.ఏ హాస్పిటల్ లోనూ డాక్టర్లు లేరు.కారులో అలా వెతుక్కుంటూ కనిపించిన ప్రతీ హాస్పిటల్ మెట్టు ఎక్కాము.ఆఖరికి ఒక దగ్గర ఇసీజి చేయించుకోవడానికి కుదిరింది.రిపోర్టు తీసుకుని మళ్ళీ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే సన్నని వెదురు బద్దలతో తాత్కాలికంగా కట్టు కట్టేరు.అంతవరకూ వేలాడిపోతోన్న కుడి చేతిని ఎడమ చేత్తో పట్టుకునే వున్నాను.ఇవన్ని అయ్యి ఇంటికి వెళ్ళేసరికి సుమారు పన్నెండు అయ్యింది.కాస్త పెరుగన్నం తిని టాబ్లెట్ వేసుకుని పడుకున్నాను.
" పడిపోయానని ఫోన్ చేస్తే తరుచూ కళ్ళు తిరిగి పడిపోతావు కదా అలాగే అనుకున్నాను.ఇంత దెబ్బ తగిలిందను కోలేదు."అన్నారు బిత్తరపోతూ వీర్రాజుగారు.
మర్నాడు ఉదయమే హాస్పిటల్ కి పల్లవి నేనూ వెళ్ళాము.వీర్రాజుగారు ఆషీని చూసుకోడానికి ఆగిపోయారు.అంతేకాక ఆయనకి హాస్పిటల్ వాతావరణంలో బీపీ పెరిగిపోతుంది.అందుకే ఇంట్లోనే వుండమన్నాం.చేతికి రాడ్ వేసి సమ్మెంటుకట్టు కట్టి ఆరు వారాల తర్వాత రమ్మన్నారు.
పల్లవి రెండు వారాలు సెలవు పెట్టింది.ఆ తర్వాత కూరా పప్పు చేసేస్తే వీర్రాజు గారు కుక్కర్ పెట్టేవారు.నేను మామూలుగా రాసుకోవటం చెయగలనా అని నాకు కొంచెం దిగులు మొదలైంది.పల్లవి కోప్పడుతున్నా ఎడమ చేత్తోటే కొంచెం పనులు సాయం చేయటానికి ప్రయత్నించే దాన్ని. ఎడమ చేత్తో రాయటానికి చూసేదాన్ని.ఆ ప్రయత్నంలోనే ఒక కవిత కూడా రాసాను.
ఆరు వారాల తర్వాత సిమ్మెంటు కట్టు తీసేసినా క్లాత్ తో కట్టు కట్టుకోమని డాక్టర్ చెప్పి గోరు వెచ్చని వేడినీళ్లలో చేతిని పెట్టి వేళ్ళు కదుపుతూ ఎక్సర్సైజులు చేయమన్నారు డాక్టర్.నాకు కుడిచేయి ముఖ్యమైనది కదా చాలా శ్రద్ధగా చేసి తొందరగా నొప్పి తగ్గించుకున్నాను.కానీ ఆ చేత్తో కొద్ది బరువు పట్టుకున్నా నొప్పి పెట్టేది.
2009 అసెంబ్లీ ఎన్నికలు మొదలయ్యాయి.వై ఏస్సార్ కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా ముందుకు నడిపించి , అసెంబ్లీలో కాంగ్రెసు 156 సీట్లు గెలుచుకునేలా చేసాడు. వై ఎస్.ఆర్ ముఖ్యమంత్రి గా 20 మే 2009న రెండవసారి ఆంధ్రప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.ఈ సారి కూడా టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా మారింది.విద్యార్థులకు రీయింబర్స్మెంట్ ఇవ్వటంతో ఇబ్బడిముబ్బడిగా వెలిసిన ఇంజనీరింగ్ కాలేజీలు కాంగ్రెస్ కు ప్లస్ పాయింట్ అవుతుంది.గ్రామీణ పిల్లలు,బడుగు వర్గాల పిల్లలు వీటివలన వున్నత విద్యకు చేరువయ్యారు.
ఉద్యోగం చేసినంతకాలమే కాక తర్వాత కూడా మా స్కూల్ విద్యార్థులకు మొదటి రేంక్ వచ్చినవారికి ఆగష్టులో నగదు
బహుమతులు ఇవ్వటం నిలిపివేయలేదు.కవర్లలో డబ్బుపెట్టి కొన్ని ఏళ్ళ పాటు అందజేస్తూనే వున్నాను.కానీ ఆ డబ్బు సక్రమంగా నేను కోరిన విధంగా వుపయోగించటం లేదని తెలిసింది.దాంతో నేను రిటైర్ అయిన నాలుగేళ్ళ తర్వాత ఇవ్వటం మానేసాను.
నా రెండో దీర్ఘ కవిత బతుకు పాటలో అస్తిత్వ రాగం" పూర్తి చేసాను. జీవితంలోని వివిధ దశలైన శైశవం,బాల్యం,కౌమారం, యవ్వనం , ప్రౌడత్వం, వృద్ధాప్యం, ముగింపు తో ఏడు చాప్టర్ లుగా విభజించి స్త్రీ జీవితాన్ని సంపూర్ణంగా కవిత్వంలో అక్షరీకరించాను. తొలిసారిగా పల్లవి డిజిటల్ పద్ధతిలో తయారు చేసిన ముఖచిత్రంతో
ఈ పుస్తకం వెలుగులోకి వచ్చింది.
ఈ పుస్తకం ప్రింటింగ్ సమయంలో వీర్రాజు గారికి ఒక ఆలోచన వచ్చింది."ఈ ఏడాది డిసెంబర్ లో నీ అరవై ఏళ్ళు పుట్టినరోజు వస్తుంది కదా అసందర్భంగా ఇప్పటికి వచ్చిన నీ ఎనిమిది కవిత్వం పుస్తకాలూ కలిపి సమగ్ర సంపుటి గా ప్రచురించుతే బాగుంటుంది " అన్నారు.ఖర్చు ఎక్కువే అవుతుందని నేను ఆలోచించాను.
కానీ వీర్రాజు గారు "ఇంతవరకూ ఇలా ఎవరూ సమగ్ర సంపుటాలుగా వేసుకోలేదు.అందులోనూ ఇంత కవిత్వం రాసిన కవయిత్రులూ తక్కువే.వేస్తేనే బాగుంటుంది." అని గట్టిగా నిర్ణయించుకోవడమే కాకుండా నాళేశ్వరం శంకరంగారితో కూడా ప్రస్తావించారు.శంకరంగారు కూడా మంచి ఆలోచన అని ప్రశంసించి ప్రత్యేక సందర్భంగా ఎవరి చేతనైనా ముందుమాట కూడా రాయించండి అన్నారు.
1980 లో వచ్చిన తొలి కవితా సంపుటికి శివారెడ్డిగారితో ముందుమాట రాయించాను.తర్వాత ఏ సంపుటికీ ఎవరిచేతా రాయించ లేదు.శంకరంగారి సూచన అనుసరించి ఎవరిచేత రాయించుదామా అని ఆలోచించి కాత్యాయనీ విద్మహే ఎగిరేగారితో రాయిస్తే బాగుంటుంది అని నిర్ణయించుకున్నాము.
కాత్యాయనీ విద్మహేగారికి ఫోన్ చేసి విషయం చెప్పాము.ఇంకా అయిదారు నెలలు పైనే వుంది కనుక సమయం తీసుకోమని చెప్పాను.ఆమె సంతోషంగా అంగీకరించారు.నా విడివిడి సంపుటాలన్నీ ఆమెకు పంపించాము.
డిటీపీ చేయించటానికి కూడా ఇచ్చాము.పుస్తకం 500 పేజీలు కన్నా ఎక్కువే వచ్చేలా వుంది.
దేశమంతా వినాయక చవితి సంబరాల్లో మునిగింది.ఎప్పుడూ కోలాహాలంగా వైభవంగా జరిగే వినాయక నిమజ్జనోత్సవాలు చాలా గంభీరంగా,భయంభయంగా జరిగాయి.ఆ తర్వాత
చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరగా ఉదయం గం.9.35 నిమిషాలకు హెలికాప్టరుతో సంబంధాలు తెగిపోయాయనే వార్తలు నాలుగురోజులుగా వస్తున్నాయి.ఒకరెండుమూడు రోజుల పాటూ ఆచూకి తెలియలేదు. ముఖ్యమంత్రి ఆచూకీ కోసం గాలించగా 25 గంటల తరువాత సెప్టెంబర్ 2 వ తేదీ 2009 రోజునాటికి ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్ళు లభించాయి. వై.ఎస్.తో సహా మొత్తం ఐదుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని నిర్థారించారు.
ఉగ్రదాడేమోనని ఒక్కసారిగా రాష్ట్రమే కాకుండా దేశమంతా వులికిపడింది.కానీ చాలాకాలం అన్ని కోణాల నుండి శోధించి హెలికాప్టర్ లోని యాంత్రిక లోపంగా ప్రకటించారు.రోశయ్యగారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధిష్టానం ప్రకటించింది.
కాంగ్రెస్ లో జరిగిన అనూహ్య పరిణామాలు తెరాసా నాయకులకు కలిసి వచ్చింది.అప్పటికే చాలా కాలంగా ఏకీకృతం అవుతున్న వారికి బలం పుంజుకోవడానికి ఇది ఒక అవకాశంగా మారింది.
తెరాసా అక్టోబరు 21న సిద్ధిపేటలో ఉద్యోగ గర్జన పేరుతో భారీ సభ నిర్వహించారు.ఉద్యోగులు , విద్యార్థులు,ప్రజలు ఏకమయ్యారు.జయశంకర్, హరగోపాల్, కోదండరాం, చుక్కా రామయ్య, విద్యాసాగరరావు వంటి మేధావులు సంఘటితం కావటం ఉద్యమం వూపు అందుకుంది.
2009 నవంబర్ 29న సిద్ధిపేట కేంద్రంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఇది తెలంగాణ ఉద్యమానికి కీలక మలుపై తెలంగాణను నిప్పుల కొలిమిగా మార్చింది.
విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావటంతో తెలంగాణ వచ్చే వరకూ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉద్యమానికి కేంద్రబిందువు అయ్యింది . ప్రభుత్వం కేసీఆర్ను దీక్ష చేయకుండా ప్రభుత్వం అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించింది ఆయన జైల్లోనే దీక్ష కొనసాగించారు. తరవాత నిమ్స్ కి తరలించినా దీక్ష కొనసాగింది.
''తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ చచ్చుడో'' అనే నినాదం ఇచ్చారు కేసీఆర్. తెలంగాణా అంతటా భగ్గుమనడంతో కేంద్రపీఠం కదిలింది.
చిదంబరం తెలంగాణ ప్రకటన
డిసెంబరు 9వ తేదీన కేంద్రం తెలంగాణాకు అనుకూలంగా హోం శాఖ మంత్రి చిదంబరం ప్రకటన చేశారు. ఈ ప్రకటన తరువాత సంబరాలు జరిగాయి. కేసీఆర్ దీక్ష విరమించారు.
నా సమగ్ర కవిత్వం చదివి ఒకరోజు కాత్యాయనీ విద్మహే నాకు ఫోన్ చేసి " మీ కవిత స్త్రీ వాద సంకలనం నీలిమేఘాలులో చేరలేదనుకుంటాను.ఎందుచేత " అని అడిగారు ." బహుశా నేను మితవాద స్త్రీ వాదిగా భావించి చేర్చలేదేమో" అన్నాను.ఆమె సుమారు అరగంటసేపు నాకవిత్వం గురించి నాతో ఫోనులో చర్చించారు.అంతేకాదు సుమారు పదహారు పేజీల సుదీర్ఘ ముందుమాట రాసి అందించటం నాకు చాలా సంతోషం కలిగించింది.
అయితే నా పుట్టిన రోజు నాటికి ప్రచురణ పూర్తికాలేదు.అందుకని ఒక డమ్మీ కాపీ తయారుచేసారు వీర్రాజు గారు.
మా కుటుంబానికి బాగా దగ్గరైన ఆత్మీయ మిత్రులు ఒక పదిహేనుమందిని ఆహ్వానించి మా ఆషీతో పుస్తకాన్ని ఆవిష్కరింపజేసి మా ఇంటికి దగ్గరలోనే ఒక హొటలులో కలిసి భోజనాలు చేసాము.ఆ రకంగా నా షష్ఠిపూర్తి అయింది.
పుస్తకం ప్రింటింగ్ పూర్తయ్యాక బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో గోపీ గారి అధ్యక్షతన రత్నమాల , నాళేశ్వరం శంకరం నా పుస్తకంపై ప్రసంగించగా ఎనిమిది సంపుటాలతో కూడిన నా సమగ్ర కవిత్వ సంపుటి ఆవిష్కృతం అయ్యింది.ఆ విధంగా నాకు వీర్రాజుగారు గొప్ప బహుమతి అందించారు.
-- శీలా సుభద్రాదేవి
13, మే 2025, మంగళవారం
నడక దారిలో -52
నడక దారిలో -52
హైదరాబాద్ నగరంలోనే కాదు దేశమంతటినీ ఉలికి పడేలా చేసిన జంట పేలుళ్ళ సంఘటనలు 2007 ఆగష్టు 25 న జరిగాయి.
కోఠి ప్రాంతంలో మూడు దశాబ్దాలుగా పేరున్న గోకుల్ చాట్ షాపులో సాయంత్రంపూట విపరీతమైన జనం కూడివుంటారు.అక్కడి చాట్,పానీపూరీ వంటి వాటికి చాలా డిమాండ్ వుంది.అటువంటి చోట సాయంత్రం 7:40 ప్రాంతంలో బాగా రద్దీగా ఉన్న సమయంలో గోకుల్ చాట్ సెంటరులో బాంబు పేలింది. పదిమందికి పైనే అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 23 మందికి పైగా ఆసుపత్రుల్లో మరణించారు. 50 మందికిపైగా గాయపడ్డారు.మా మారింది కూతురు క్లాస్ మేట్ ఎమ్మెస్ కోసం యూఎస్ వెళ్ళటానికి సిద్ధపడుతూ స్నేహితులతో గోకుల్ చాట్ కి వెళ్ళి గాయపడి పద్దెనిమిది యేళ్ళు దాటినా ఇప్పటికీ వీల్ చైర్ కే అంకితమై శారిరకంగానే కాదు మానసికంగా కూడా వైకల్యంతో వున్నాడు.మానవత్వంలేని రాక్షసులు జనసమ్మర్థ ప్రాంతాలలో ఈ విధంగా చేయటం వలన ఎంతమందికి కడుపు కోత అయిందో కదా
అదే సమయంలో సచివాలయానికి ఎదురుగా ఉన్న లుంబినీ పార్కులో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో మొత్తం 44 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. బాంబుల్లో ఇనుప ముక్కలు వుపయోగించటం వలనే చాలామంది శరీర అవయవాలు కోల్పోయారని తెలిసింది.ఈ సంఘటనలతో ఒక్క సారిగా నగరం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయింది.తలచుకున్నప్పుడల్లా గుండె భారమై పోతుంది.
పల్లవి సాధారణంగా అదేసమయంలో ఇల్లు చేరేది.హైటెక్ సిటీలో బస్సెక్కి లక్డికాపూల్ లో దిగి వనస్థలిపురం బస్ ఎక్కుతుంది.ఇలా ఇంటికి రాగానే ఈ పేలుళ్ళ ఘటన టీవీలో చూసి హమ్మయ్య పిల్ల ఇంటికి చేరిందని వూపిరి తీసుకున్నాం.
మా ఇంట్లో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది వరకూ రేడియోలోంచి గానీ టేప్ రికార్డర్ లోంచి గానీ పాటలు ఇల్లంతా వ్యాపిస్తూనే వుంటాయి.స్వర్ణకమలం,తాల్ పాటలే కాకుండా ఒక చిన్నపిల్లల ఇంగ్లీష్ పాటలు కేసట్ కూడా వేస్తూ వుంటాం.అవి వేసినప్పుడు ఆషి భలే బాగా ఆపకుండా కేసెట్ పూర్తి అయ్యేవరకూ చక్కగా రిథం కి తగినట్లుగా డాన్స్ చేసేది.
నాకు సరేసరి పల్లవికి కూడా క్లాసికల్ డాన్స్ నేర్పించలేక పోయాము.పల్లవి చదివే స్కూల్ లో కో కరిక్యులర్ యాక్టివిటీ క్రింద డాన్స్ క్లాస్ కూడా వుండేది.పల్లవి భరతనాట్యం తీసుకుందామనుకుంటే అందులో ఎక్కువమంది వున్నారని కథక్ లో చేర్చారు.అదికూడా పల్లవి బాగానే నేర్చుకుంది.పదో తరగతి అయ్యాక వదిలేసింది.
ఆషీ బాగా చేస్తుంది కదా నేర్పించుతే బాగుండును అనుకున్నాను.పల్లవి ఉదయం ఎనిమిదిన్నరకి హైటెక్ సిటీ వుద్యోగానికి వెళ్తే తిరిగి వచ్చేసరికి ఏడో ఎనిమిదో అయ్యేది.అందుచేత నాకూ ఆషీకీ దోస్తానీ పెరిగింది.సూపర్ బజార్ వెళ్ళాలన్నా,కూరలకైనా మేమిద్దరమే.వెళ్ళినప్పుడల్లా నన్ను కబుర్లతో మెప్పించి తనకు కావలసిన రకరకాల పెన్నులు,రకరకాల సెంట్ రబ్బర్లూ కొనిపించుకునేది
ఒక రోజు మోర్ సూపర్ బజార్ వెళ్ళి వస్తుంటే ఎల్.ఐ.సి కాలనీ పార్కులో పిల్లలు డాన్స్ చేస్తుండటం చూసి ఆషీని డాన్స్ నేర్చుకుంటావా అని అడిగాను.నేర్చుకుంటాను అనేసరికి పార్క్ లోకి వెళ్ళాను.
పదిమంది వరకు అన్ని వయసుల పిల్లలకూ ఒక అమ్మాయి డాన్స్ నేర్పుతోంది.ఆషీని చూపించి డాన్స్ లో చేర్చాలనుకుంటున్నట్లు చెప్పాను.వారానికి మూడురోజులు క్లాసులు ఉంటాయనీ తెల్లని పంజాబీ డ్రెస్ వేసుకొని రావాలని చెప్పింది.
సరే నని మర్నాటి సాయంత్రానికి నేను ఇంట్లో వున్న క్లాత్ తో తెల్ల పంజాబీ డ్రెస్ కుట్టేసి రెడీ చేసాను.
ఆషీ స్కూల్ నుంచి రాగానే కొత్త డ్రెస్ వేసుకొని తనకోసం తయారు చేసిన అప్పచ్చులు తిని పాలు తాగిన తర్వాత అయిదు గంటలకు పార్కులో డాన్స్ క్లాస్ కి తీసుకు వెళ్ళాను.దారిపొడవునా హుషారుగా కబుర్లు చెప్తూ నడిచింది.
డాన్స్ టీచర్ తీసుకువచ్చిన పండుతాంబూలం తీసుకుని ముందు చేయాల్సిన వందనం నేర్పింది.తర్వాత హస్తముద్రలూ లాంటి వేవో నేర్పింది.ద్వితీయవిఘ్నం వుండొద్దు రేపు కూడా తీసుకుని రమ్మంది.
మర్నాడు కూడా తీసుకు వెళ్ళాను.డాన్స్ పాఠం అయ్యేవరకూ అక్కడే వుండి తిరిగి రోజూ ఇంటికి వస్తున్నాము.ఒక నెల రోజుల పాటూ ఆసక్తి తో ఆషీ క్లాసు ఇష్టపడింది.ఆ డాన్స్ టీచరు పాఠం కన్నా రోజూ ఎవరినో ఒకరిని తిట్టటం ఎక్కువ.దాంతో ఆషీ డాన్స్ క్లాస్ కి బయలు దేరిన దగ్గర నుండి ఇంటికి తిరిగి వచ్చే వరకూ స్వర్ణకమలంలో భానుప్రియలా ముఖంలో "ఎందుకొచ్చిన డాన్స్ రా బాబూ " అన్నట్లు ఎక్స్ ప్రెషన్స్ పెట్టేది.అప్పటికీ దారిపొడవునా నేను కబుర్లు చెప్తున్నా మూడీగా వుండేది.కావాలని క్లాస్ లో తప్పులుగా చేసేది.
డాన్స్ క్లాస్ మానేస్తావా అని అడిగితే వెళ్తాననే అనేది.అంతలో వినాయకచవితి దగ్గర పడింది.డాన్స్ టీచర్ " మీకు గణపతి మీద ఒక డాన్స్ నేర్పిస్తాను.గణపతి మంటపంలో చేయిస్తాను." అని పిల్లలను అందరినీ ఒక ఆర్డర్ లో నిలబెట్టి పాట తన టేబ్ లో ఆన్ చేసింది. ఎలా చేయాలో నేర్పటం మొదలెట్టింది.
"ఏకదంతాయ వక్రతుండాయ ...." అంటూ మొదలైన శంకర్ మహదేవన్ పాట,ఆ రాగమాధుర్యం అప్పటినుండి ఇప్పటికీ విన్నప్పుడల్లా వెంటాడుతునే వుంటుంది.అంత గొప్పగా వుంటుందా పాట.
సరే మళ్ళా డాన్స్ కి వద్దాం .ఒక బొద్దుగా వున్న అమ్మాయిని గణపతిగా ఎంపిక చేసింది.ఆ పిల్ల మర్నాటి నుంచి రావటం మానేసింది.ఈ డాన్స్ కూడా ఆషీ ఆసక్తిగా చేయటం లేదనిపించింది.
ఆ ప్రోగ్రాం ఎక్కడో అర్థరాత్రి జరుగుతుందంటే మా పాప అంత దూరం రాలేదని చెప్పేసాను.
ఆ తర్వాత నెలరోజులన్నా తిరగలేదు.కెనడాలో వున్న భర్త దగ్గరకు వెళ్ళటానికి వీసా వచ్చిందని ఆ అమ్మాయి డాన్స్ పాఠాలకు మంగళం చెప్పేసింది.
మా ఆషీకి డాన్స్ పాఠాలు తప్పిపోయాయి.ఇప్పటికీ స్వర్ణకమలం సినీమా చూస్తే డాన్స్ క్లాసులోని ఆషీ ముఖం గుర్తువచ్చి నవ్వుకుంటాం.
నేను,మా క్రింద ఇంటిలోని సరోజిని గారూ కలసి రోజూ మా యింటికి దగ్గరలోని పార్క్ లో వాకింగ్ కి వెళ్తాం.ఆషీ కూడా మాతో వచ్చి అక్కడే ఆడుకుంటుంది.పార్కు ఎదురుగా ఒక ఇంట్లో అమ్మాయి కీబోర్డు నేర్పుతుంది తెలిసి ఆషీని నేర్చుకుంటావా అని అడిగి అక్కడ చేర్చాను.
ఆ అమ్మాయి సినీ గాయకుడు హేమచంద్ర బంధువట.పాడుతా తీయగా లో పాల్గొన్నానని చెప్పింది. ఆషీ కోసం కీ బోర్డు పల్లవి కొన్నది.వారానికి మూడు రోజులు ఆషీని వాళ్ళింట్లో దింపి నేను నా వాకింగ్ పూర్తిచేసుకుని తిరిగి ఇంటికి తీసుకు వచ్చేదాన్ని.
కీబోర్డు చాలా ఆసక్తిగా ఆషీ నేర్చుకుంది.సరళీస్వరాలు,జంట స్వరాలు,పిళ్ళారి గీతాలేకాక జనగణమన,హేపీ బర్త్ డే పాట కూడా చక్కగా వాయించటం నేర్చుకుంది.బాగా వాయించటం చూసి పల్లవి సినిమా పాటలకు కీబోర్డ్ నొటేషన్లు ఎవరి దగ్గరో డౌన్ లోడ్ చేసి తీసుకు వస్తే అందులోంచి ' చిన్నిచిన్ని ఆశ ' కూడా నేర్చుకుంది.
ఆషీ కీబోర్డు నేర్చుకుంటుందని తెలిసి కృష్ణారెడ్డిగారు కూడా తన పిల్లలిద్దరికీ కీ బోర్డు కొని క్లాస్ లో చేర్పించారు.
ఆషీ ఆసక్తిగా నేర్చుకుంటుందని సంతోషించే లోగానే కొన్ని నెలలు గడిచాక ఆషీ కీబోర్డునేర్పించే టీచరు భర్తని సాఫ్ట్వేర్ ఉద్యోగం ద్వారా కంపెనీ వాళ్ళు అమెరికాకి పంపుతున్నారట.అతనితో పాటు ఆమె కూడా వెళ్తున్నానని చెప్పటం తో ఆషి సంగీతపాఠాలకీ మంగళం పాడేయాల్సి వచ్చింది.
కానీ తర్వాత కూడా ఆషీ చాలాకాలం కీ బోర్డు ప్రాక్టీస్ చేస్తూనే వుండేది.
మొత్తం మీద ఆషీకి సంగీతం, డాన్స్ నేర్పించాలన్న నా కోరిక మొదట్లోనే గండి కొట్టింది.కానీ పుస్తకం పఠనాభిరుచి మాత్రం రోజురోజుకూ,ఏడాదిఏడాదికీ పెరిగింది.అది సంతోషం.
ఇంకా చదవటం రాక ముందు నిద్రపుచ్చే సమయంలో తప్పని సరిగా నేనో,పల్లవో కథలు చెప్పేవాళ్ళం.ఒకొక్కప్పుడు మేము కథ చదువుతూ చెప్పేవాళ్ళు.చదవటం వచ్చాక ఆషీ చేతే చదివించి వివరించే వాళ్ళం.ఆ అలవాటు ఆషీ నేటికీ మానలేదు.పరీక్షల సమయంలో కూడా తానే ఒకటో రెండో కథలు చదివి నిద్రకి ఉపక్రమించటం ఆషీకి అలవాటైపోయింది.తెలుగు పుస్తకాలు తక్కువే కానీ ఇంగ్లీషులో మాత్రం పెద్దపెద్ద పుస్తకాలు చదివేస్తూవుంటుంది.తన ఫోన్ లో కూడా కొన్ని పుస్తకాలు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటుంది.అయితే ఆ వయసు పిల్లలు చదివే రొమాంటిక్ నవలలు కాకుండా కాన్స్పిరసీ నవలలు,చారిత్రక నవలలూ,బయోగ్రఫీలు అటువంటి పుస్తకాలే చదువుతుంది.ఏమైతేనేం పుస్తకాలు చదివే అలవాటు మంచిదే.
ఒకరోజు వార్తాపత్రికలో గుజరాత్ లోని ఆనందనగరం అనే వూరికి పిల్లలు లేని విదేశీ దంపతులు క్యూ కడుతున్నారనీ,సరోగసీ పద్ధతిలో పేద మహిళలను ధనాన్ని ఆశ చూపి ఒప్పిస్తున్నారనే కథనాన్ని చదివి ఒక రాత్రంతా నిద్రపట్టలేదు.అంతకు ముందు పాలమూరు కార్మికులు మధ్యదళారీలను నమ్ముకొని అరబ్ దేశాలకు వెళ్ళి పడరాని కష్టాలు పడుతున్నారనే వార్త చదివి ఎలా అయినా వీరిమీద కథ రాయాలనుకున్నాను.కానీ వివరాలు సేకరించ లేక మానేసాను . ఇప్పుడు అద్దెకు గర్భం విషయం చదివిన తర్వాత ఈ రెండింటినీ కలిపి రాయాలనే ఆలోచన వచ్చి "గోవు మాలచ్చిమి " కథ రాసాను.
అప్పడే అనుకోకుండా బ్రౌన్ అకాడమి నవ్య వార పత్రికతో కలిసి నిర్వహిస్తున్న కథలపోటీ ప్రకటన చూసి పోటీకి కథ పంపించాను.ప్రత్యేక బహుమతి వచ్చింది.
ఈ కథ నవ్య వార పత్రికలో ప్రచురితం అయినప్పుడు చాలా మంచి స్పందన నాకు వచ్చింది.ప్రముఖ రచయిత విహారి గారు ప్రతీ సమావేశంలోనూ ఈ కథ గురించి ప్రస్తావిస్తూ ఈ ఏడాది మేటికథ అని ప్రశంసించేవారు.
బ్రౌన్ అకాడమివారు బహుమతికి ఎంపికైన కథలన్నీ కలిపి "బహుమతి కథలు" పేరిట పుస్తకంగా ప్రచురించారు . కేంద్ర సాహిత్య అకాడమీ వారికి పి.సత్యవతి గారు తన సంపాదకత్వంలో కూర్చిన ఆంగ్లానువాద కథల సంకలనంలో పాపూరి జయలక్ష్మిగారు చేసిన నా గోవు మాలచ్చిమి కథ ఆంగ్లానువాదం కూడా చేర్చారు.
నా మొదటి కథలసంపుటి 1990 లో వచ్చింది.పద్ధెనిమిదేళ్ళ తర్వాత రాసిన కథలన్నీ కలిపి నా రెండవ కథల్ని ఆషీ క్రయాన్స్ తో వేసిన చిత్రాన్ని ముఖచిత్రం గా వేసుకుని కొత్తకథాసంపుటిని రెక్కల చూపు పేరుతో ప్రచురించాము.కానేటి మధుసూదన్ గారూ ,జి.ఎస్.చలం గారూ ఈ పుస్తకావిష్కరణ విజయనగరంలో గానీ,వైజాగ్ లో గానీ పెడతామని అన్నారు.నేను సాధారణంగా ఆవిష్కరణ సభలు పెట్టుకోను.కాని పుట్టిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆవిష్కరణ జరగటం ఒక అనుభూతి కదా.
పెద్దక్కయ్య సంవత్సరీకాలకి ఎలాగూ వెళ్తాం కనుక అప్పుడు ఏర్పాటు చేయమని వీర్రాజు గారు వాళ్ళతో చెప్పారు.
అదేవిధంగా మేము వైజాగ్ రాగానే యూనివర్సిటీ కేంపస్ లోనే రూం కేటాయించారు.ఉత్తరాంధ్ర రచయితలు వచ్చి అక్కడ కలిసారు.
ఆ సాయంత్రం వైజాగ్ లో ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో తెలుగుశాఖాధిపతి సత్యనారాయణ గారి అధ్యక్షతన, తెలుగు ప్రొఫెసర్ డా.సజ్జా మోహనరావుగారు నా "రెక్కల చూపు" కథా సంపుటి ఆవిష్కరణ జరిగింది.వి.ప్రతిమ నా పుస్తకాన్ని పరిచయం చేసింది.ఆవిష్కరణ అద్భుతంగా జరిగింది.
ఆ మర్నాడు వీర్రాజు గారి బాల్యమిత్రుడి ఇంటికి వెళ్ళి సాయంత్రానికి విజయనగరం వెళ్ళిపోయాం.సంవత్సరీకాల కార్యక్రమం అయ్యాక హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం కట్టాము.
లేఖిని రచయిత్రులసంస్థ అధ్యక్షురాలు వాసా ప్రభావతి తెలుగు భాషా సాంస్కృతిక శాఖ కె.వి.రమణాచారి గారి సహకారంతో
ఒక రోజు సదస్సు నిర్వహణ తలపెట్టారు.రాష్ట్రేతర రచయిత్రుల్ని కూడా ఆహ్వానించి,వయోధికులైన ఆరుగురు రచయిత్రులను ఘనంగా సత్కరించారు.ఒక సదస్సులో నేను కె.రామలక్ష్మి గారి కథల గురించి ప్రసంగ వ్యాసం చదివాను.
లేఖిని సంస్థ కనుక అందులోని సభ్యులచేతే వాసా ప్రభావతి గారు ప్రసంగ పత్ర సమర్పణ చేయించారు.
కె.రామలక్ష్మి గారు మా ఇంటికి దగ్గరలోనే పది నిమిషాల నడక దూరంలో ఒక అపార్ట్మెంట్ లో తన సోదరితో పాటు వుంటున్నారు.అందువలన తరుచూ కలిసే దాన్ని.నేను ఆమె కథలగురించి వ్యాసం రాసానని తెలిసి చాలా సంతోషించారు.
ఎప్పటినుంచో స్త్రీ జీవితాన్ని పుట్టిన దగ్గర నుండి వృద్ధాప్యం వరకూ చాప్టర్లుగా విడదీసి దీర్ఘకవిత రాయాలనే ఆలోచన వుంది.దానిని రాయటం మొదలు పెట్టాను.శైశవం, బాల్యం, కౌమారం,యవ్వనం, ప్రౌడత్వం,వృద్ధాప్యం, ముగింపుగా ఏడు చాప్టర్లుచేసి రాయటం ప్రారంభించాను.స్త్రీ జీవితంతో పోలుస్తూ విత్తనం మొలకేసిన దగ్గర నుండి మోడుగా కావటం వరకు,సూర్యోదయం నుండి సంధ్యాసమయంవరకూ ప్రతీ చాప్టర్ నీ మొదలు పెడుతూ స్త్రీ జీవితాన్ని సాదృశ్యం చేస్తూ రాస్తున్నాను.బాగానే వస్తోందనిపించింది.
ఒకరోజు ఇద్దరు అమ్మాయిలు ఫోన్ చేసి నా కవితా సంపుటాలమీద ఎమ్.ఫిల్ చేసామని అందుకని కలవాలనుకుంటున్నామని ఇంటి చిరునామా అడిగారు.నాకు భలే ఆశ్చర్యం అంతులేని సంతోషం కలిగింది.తమ రచనలమీద పరిశోధన జరిగిందంటే ఎవరికి మాత్రం ఆనందం కలుగదూ?
మర్నాడు ఆ ఇద్దరూ వచ్చారు.నా యుద్ధం ఒక గుండె కోత దీర్ఘ కవిత మీద కె.భాగ్యలక్ష్మీ,నా మొదటి సంపుటి ఆకలి నృత్యం మీద బి.నాగలక్ష్మి మధుర కామరాజ్ విశ్వవిద్యాలయంలో చేసిన ఎమ్.ఫిల్ పరిశోధనల కాపి తీసుకుని వచ్చి ఇచ్చారు.అది చదివి నా అభిప్రాయం తెలుపుతూ ఒక ఉత్తరం రాసి ఇవ్వమన్నారు.ప్రాచ్యకళాశాలలో లెక్చరర్ పి.జగన్నాథరావుగారు వారికి గైడ్ అని చెప్పారు.
చాలా ఏళ్ళ క్రితం ఏదో సందర్భంలో కేబి లక్ష్మీ నాతో " సదస్సులలో పాత్ర సమర్పణ చేయటానికి అకడమీషియన్లనే తీసుకుంటారు. అందుకే తాను పీహెచ్డీ చేయాలని రిజిస్టర్ చేయించుకున్నానని" చెప్పటమేకాక "నువ్వు కూడా చెయ్యవోయ్" అని సలహా యిచ్చింది.ఆలోచిస్తుంటే లక్ష్మి అన్నది నిజమే అనిపించింది.
అకాడమీలు గానీ,యూనివర్శిటీలు గానీ అకడమీషియన్లకే పత్రసమర్పణ అవకాశాలు కల్పిస్తాయి.
అప్పట్లోనే ఒక రోజు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి పి హెచ్ డి అప్లికేషన్ ఫాం కూడా తెచ్చుకున్నాను.వీర్రాజుగారితో చెప్తే "నీ రచనలమీద పరిశోధనలు చేయగల స్థాయి రచయిత్రిగా ఈ నాడు నువ్వు వున్నావు.నువ్వు చేయటం ఏమిటి" అన్నారు.ఆయన మాట నచ్చక పోయినా,పేరు ముందు డాక్టర్ తగిలించుకోవాలనే కోరిక వున్నా, అప్పటికే ఎమ్మెస్సీ చేయటానికి చాలా శ్రమ పడి వున్నానేమో.మళ్ళా చదువులోకి దిగే సాహసం చేయలేక పోయాను.
ఈ నాడు నా రచనలమీద ఇద్దరు విద్యార్థులు ఇచ్చిన ఎమ్ ఫిల్ పరిశోధన గ్రంథాలు చూస్తుంటే నా మనసు ఉప్పొంగి పోయింది.
- శీలా సుభద్రాదేవి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)