26, జూన్ 2025, గురువారం

అసీతినెలబాలుడు విహారి

అశీతి నెలబాలుడు-విహారి ఒక సాహితీవేత్త జీవితాన్నీ, సాహిత్యాన్నీ పరామర్శించాలంటే వారి సమగ్ర సృజన అధ్యయనం చేయాలి. కానీ విహారి అనే పేరుతో సాహిత్య రంగంలో నమోదు అయిన జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తిగారు చేసిన కృషి అనన్య సామాన్యం, 1962లో 'చుక్కాని' పత్రికలో ప్రచురితమైన 'రాగజ్యోతి' కథతో మొదలుపెట్టి పద్నాలుగు కథా సంపుటాలు వెలువరించారు. ఆరు నవలలు సాహిత్య రంగానికి అందించారు. ప్రముఖుల సాహిత్యం గురించే కాక యువతరం వారిని కూడా వెన్నుతట్టి ప్రోత్సాహం ఇస్తూ సాహిత్య పరామర్శ చేయటం గుర్తించదగినది. గురజాడ మొదలుకొని నేటితరం కథకుల వరకు కుల, మత, ప్రాంత భేదం లేకుండా అన్ని సాహిత్య వాదాలనూ, ఆయా కథకుల కథలన్నింటినీ చదివి సమగ్రమైన వ్యాసాలు రాశారు. నొప్పింపక తానొవ్వక అన్నట్లుగా కథకుని కథలలోని వస్తు రూపాల్ని శైలి శిల్పాలనూ, భాషా విషైక విశేషాలను విశ్లేషిస్తూ సుమారు 300 మంది కథకులపై రాసిన ఈ విశేషవ్యాసాల్ని పదిహేను సంపుటాలుగా ప్రచురించారు. ఇవి ఒక వ్యక్తి చేయలేని ఈ సంపుటాలు విశ్వవిద్యాలయాలలో పరిశోధకులకు ఉపయుక్తంగా ఉన్నాయి. 2013లో 'ఆనాటి కథలు- ఆణిముత్యాలు' శీర్షికతో అపురూపమైన శ్రీపాద, వట్టికోట ఆళ్వారుస్వామి, చలం, కనపర్తి వరలక్ష్మమ్మ మొదలైన ప్రముఖుల ఆణిముత్యం వంటి కథలను వారి గుణ విశేషములను కొత్తతరం: రచయితలకు ఉపయోగపడేలా పరిచయం చేశారు. సుమారు అరవై ఏళ్లుగా చేస్తున్న సాహిత్య వ్యవసాయంలో 300కు పైగా రాసిన కథలన్నీ కూడా సమాజాన్ని పరిశీలించినవే. చదువు విలువని తెలియజెప్పి 'అక్షరం', రాజకీయ మోహంతో పట్టని వ్యక్తుల కథ 'అమ్మ వెనక చీకటి', 'ఆ తల్లికేం కావాలి' వంటి తల్లి వేదననీ, వాత్సల్యాన్ని, వృద్ధాప్యాన్ని సమస్యల్ని తెరిచి చూపే కథలు, డబ్బు వెనక పరుగులు తీసే పిల్లలు, కథలన్నింటా జీవితాన్ని ప్రవహింప చేసేలా సున్నితమైన భావ ప్రకటన వీరి సొంతం. సరళ సంభాషణలు మానవీయ విలువలు, కుటుంబ, ఆర్ధిక సంబంధాలు ఇలా అపారమైన కథా వాహినిలోని కథల గురించి చెప్పుకుంటే ఒక పుస్తకాన్నే రాయొచ్చు. ఇప్పటికీ కూడా కొత్తవారితో సమానంగా విహారి గారి కలం తాజాగా పోటీలలో కూడా కథలను రాస్తుందంటే విహారి గారి సృజన ఎంత నవనవోష్మంగా ఉందో అర్థమవుతుంది. మరో ముఖ్య విషయమేమంటే, చాలామంది కథకులలాగా విహారిగారు తన కథలలో సమాజంలోని అవకతవకలపై కత్తి ఝుళిపించరు. చాలా సహనంతో ఒక్కొక్క పొరనే విప్పుతూ సమాజాన్ని చూపుతారు. సమాజంలోని వ్యక్తుల బాధ్యతల్ని ఎత్తి చూపి గుర్తు చేస్తారు. చెప్పదలచుకున్న సిద్ధాంతాల్ని సహృదయంతో పాఠకులు స్వీకరించే పంధాలో ఒప్పిస్తూ కథనీకరించడం వీరి రచనా విధానం, విహారి గారు చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు ఆఖరికి 6500 పద్యాలతో 'శ్రీ పదచిత్ర రామాయణం' రచించి బృహత్ గ్రంథ రూపంలోకి తీసుకువచ్చారు. విహారి గారి అపార సాహితీ సంపదని విశ్లేషించటం అసాధ్యం, అందువలన నేను కవిత్వానికే పరిమితమై నాకు అత్యంత ప్రీతిపాత్రమైన దీర్ఘ కవిత 'చేవ్రాలు' గూర్చి పరామర్శించే దలిచారు. విహారి గారు ఇప్పటికీ వెలువరించిన చలనమ్ కలం కన్ను, మనం మనం.. 'మధ్య మా గతి' అనే సంపుటాలు కాక 'చీకటి నాణెం' అనే దీర్ఘ కవిత అంతకుముందు వెలువరించిన కవిత్వ గ్రంథాలు ఇటీవల వెలువరించిన దీర్ఘకవిత చేవ్రాలు, దీనికి టాగ్ లైన్ గా 'వ్యక్తిత్వం' -"వికసనం' అని పేరు పెట్టటంలోనే ఒక ప్రత్యేకత చూపారు. ''గుండె గొంతులోన కొట్లాడినట్లు విహారి గారిని ఒక చోట నిలకడగా కూర్చోనీయకుండా పదేళ్ల మధనంగా బయటపడింది ఈ చేవ్రాలు దీర్ఘకవిత. ఇందులో ప్రవేశిక, ప్రారంభిక, లోనారసి,ఋణరేఖ,వికసనం అని అయిదు అధ్యాయాలుగా విభజించినా, అతిపెద్ద అధ్యాయంగా, ముఖ్యమైనదిగా మూడవది ఉన్నా ఇంకా పాఠకులకు మరింత హృదయంగమంగా ఉండటానికి కావచ్చు.. లేదా పాఠకులు రచనలోకి మమేకం కావాలనే ఉద్దేశ్యం కావచ్చు.. కవి మధ్య మధ్య హెడ్డింగులు పెట్టి సులభ గ్రాహ్యం చేసేరు. ఒక వ్యక్తి మానసిక వికననం అతడు పెరిగిన వాతావరణంపైనా, ప్రభావితం చేసే మిత్రుల పైనా,చదువు నేర్పిన గురువుల పైనా, చదివిన చదువులపైనా ఆధారపడి ఉంటుంది. ఆ మానవ వికసన సమగ్ర పరిణామ రూపాన్ని 'చేవ్రాలు'లో అక్షరీకరించాడు విహారి గారు. మొదటి అధ్యాయంలో కవితని ఎత్తుకోవటమే. జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నది' అని మొదలు పెట్టడంతో సమాజంలోని వివిధ కోణాలను చూపించారు. బతుకును ముంజేతి కంకణంగా అభివర్ణిస్తూనే-'ఎవరి బతుకు వారికి/వారే కుట్టించుకున్న వలువ/ఎవరి వేలిముద్ర వారివే' అంటారు. ఎందుకంటే ఒకరి జీవితం మరొకరి చేతిలో ఆటబొమ్మ కాదు అని నిర్ధారిస్తూనే 'ఒకరి జీవితం వేరొకరి చేతిలో తెల్ల కాగితం అంటారు. తెల్ల కాగితం మీద ఎవరికి వారు రాసుకోవాలి కానీ మరొకరి ఆధీనంలో ఉంటే జీవితం ఎట్లా పరిణమిస్తుందో ఊహించుకోవాలనే అభిప్రాయాన్ని కవి ప్రకటిస్తారు.. రెండో ఆధ్యాయం ప్రారంభికలో శిరశోదయమై మాయని ఛేదించుకొని వచ్చిన శిశువుల బుడి బుడి అడుగులు వేయటం, తల్లి గోరు ముద్దలు, చదువుల పరుగుపందేలు,వచ్చీరాని కౌమార ప్రాయంలో వారిపై ప్రభావం చూపించే మాయాజాలాల కారణంగా- మెదడు పంజరంలో కోర్కెల చిలుకలు గుప్త విజ్ఞానంపై మోహం గురించి కవిత్వీకరిస్తూనే 'నడక కాదిది పోరాట జారుడుమెట్లపై ఆట' అంటూ సందిగ్ధప్రాయవు చంచల స్వభావాన్ని అక్షరాలతో గుది గుచ్చారు. ఇక ముఖ్యమైన పెద్ద అధ్యాయం 'లోనారసి' లో దాని కొనసాగింపు గానే 'గుండె మట్టిని కుల్లగించే/ కోరికల వానపాములు 'గురించి జాగరూకత చెప్తాడు కవి. ఆలోచనాశూన్యులకు ప్రతి అంశాన్ని భూతద్దంలో చూపి భయభ్రాంతులకు లోనుచేసి మానసిక రోగులుగా మార్చే వైనాన్ని విశదీకరిస్తారు కవి. ఆత్మ న్యూనతకి చోటిస్తే గుండె సాగదీయక తప్పని కమ్మెచ్చుతీగ 'అవుతుందంటారు. నడిగ్గా అటువంటప్పుడే-' నిత్యానిత్య వివేకం -వ్యక్తిత్వం'-ని నిలబెడుతుందని ముక్తాయింపునిస్తారు. 'క్రియా శూన్యత గట్టు మీది పిచ్చిమొక్క వరి చేలో కలుపు మొక్క/ అచంచల విశ్వాసం/అదే దారి దీపం' అదే చేతి కర్ర' అంటూ మన భావోద్వేగాలకు మనమే బాధ్యులం అనేది ఉపదేశిస్తారు. కలలు కన వద్దంటారు. ఎందుకంటే అనుకున్నది జరగకపోతే వచ్చే అనర్థాలు తెలియజేస్తారు. ''డాలర్ల రోగగ్రస్తుడికి చికిత్స లేదని ఖచ్చితంగా ప్రకటిస్తారు. ఏ విషయానికి నా వల్ల కాదని వదిలేయొద్దంటారు. అవినీతి మేత, క్షణికోద్రేకం, ఆహం వీటన్నిటి వలన జరిగే కష్టనష్టాలను పంక్తులు పంక్తులుగా బోధిస్తూ మానసిక వికశనం కావాలంటే సందేహం, పరిశీలన, సమాచారం, విశ్లేషణ మనిషికి అత్యవసరం అంటారు కవి విహారి. నాలుగవ అధ్యాయం నుంచి యవ్వనానికి 'ఋజు రేఖలు లక్ష్య నిర్దేశానికి గమ్యం నీది -నడక నీది- మిట్ట పల్లాలని సహనమే ఏకైక దీవంగా గమనిస్తూ ముందుకు నడవమంటారు. ఈ అధ్యాయం అంతా ఎన్నైన్నో సామెతల్ని కవితాత్మకంగా ఉటంకించుతూ సుబోధకంగా ఆసాంతం సాగుతుంది. 'స్వీయావిష్కరణం/ వేకువ రేకుల స్పాటిక సాధనం!! /గతం గాయాలు సలుపుతాయి/ రాతి మీద ఉలి దెబ్బలు అవి/ అవి నిట్టాడి గూడులు కాకూడదు/రూపాంతరం చెందిన కర్తవ్యాన్నివ్వాలి'- అని ధైర్యాన్ని, అత్మవిశ్వాసాన్ని పురిగొల్పుతాడు కవి.' క్రమశిక్షణ అంటే/ కఠినత్వమూ కాదు, నిరంకుశత్వమూ కాదు అదొక జీవన విధానం' గా చెప్పటమే కాక నిబద్ధత బద్ధకానికి శత్రువుగా చూపుతారు. కార్యదక్షత కట్టుబడి- పెట్టుబడిగా అభివర్ణించుతారు.'నీ బొమ్మని నీవే చిత్రించుకోగలగాలి' అనటంలో ఎవరి వ్యక్తిత్వాన్ని వారి నిర్మించుకోవాలనే సందేశం ఇస్తారు. 'సృజనకు ఆధార భూమికలు-మేధ విలువలు' అని నిర్ధారిస్తూనే నైతికత అంతస్సూత్రం ఎప్పుడూ తెగిపోకుండా కాపాడుకోవలసిన బాధ్యత వ్యక్తిదే అనేది నర్మగర్భంగా తెలియజేస్తారు కవివిహారి. "మానవ సంబంధాలంటే/మనం మనంగా వుండటం/మానవసంబంధాలంటే / సమాజ సమన్వయ శక్తి!! 'వ్యక్తి''త్వం' వికసనం అంటే ఎత్తుపల్లాలను చూసి ఆ ప్రక్రియ అదే వ్యక్తి నిర్మాణం' అంటారు కవి అయిదవ అధ్యాయం వికసనం అంటే విశ్వ దీర్ఘ కవితారాగానికి శృతి కూర్చటం అంటూ ముక్తాయింపుగా ఒక వ్యక్తి సంపూర్ణ మానవుడిగా రూపొందటానికి అలవర్చుకోవాల్సిన, జీవితాంతం పాటించవలసిన నిర్మాణ ప్రక్రియల రూపకల్పనలని ముగిస్తారు. నేటి యువతరానికి వ్యక్తిత్వ వికాసచిత్రాలను దీర్ఘ కవితారూపంలో లక్ష్యాన్ని నిర్దేశిస్తూ, లక్ష్యాన్ని దినచర్యలో భాగంగా చేసుకొని సమయ నిర్దేశాన్ని చుక్కానిగా చేసుకొని ప్రయాణిస్తే రూపెత్తిన మనిషిగా మారగలడనే ఆశయంతో తన చేవ్రాలు' లు వ్యక్తిత్వ వికాస గ్రంథంగా తీర్చారు విహారి గారు. కేవలం మాటల మనిషిగా, రాతల మనిషిగా కాక తాను ఆచరించి చూపే స్నేహశీలి, సౌజన్య మూర్తి, నిర్విరామ, నిరంతర సృజనశీలి అయిన 'విహారి గారికి ఎనిమిది పదులు దాటిన వయసులోనూ వారి కలం ఇంకా పదునెక్కాలని అభిలషిస్తూ వారికి సహస్రాధిక జన్మదిన శుభాకాంక్షలు (అక్టోబర్ 15-విహారి గారి 81వ జన్మదినం సందర్భంగా సృజన క్రాంతి ఈ ప్రత్యేక వ్యాసం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి