28, జూన్ 2024, శుక్రవారం

కెవిపి అశోక్ కుమార్ సమీక్ష

నిడదవోలు మాలతి రచనా వైభవం కవయిత్రిగా,కథకురాలిగా సుప్రసిద్ధురాలైన శీలా సుభద్రాదేవి మంచి విమర్శకురాలు కూడా.విస్మృతికి గురైన రచయిత్రులను,చివరకు స్త్రీవాదులు కూడా పట్టించుకోని అలాంటి వారిని వెతికి పట్టుకుని వారి కథలను-కథన రీతులను విశ్లేషిస్తూ"కథారామంలో పూలతావులు" పేరిట ఒక విమర్శా గ్రంథాన్ని వెలువరించారు.అందులో భాగంగానే ఇప్పుడు నిడదవోలు మాలతి సాహిత్యాన్ని విశ్లేషిస్తూ ఈ పుస్తకాన్ని తీసుకువచ్చారు. నిడదవోలు మాలతి చేపట్టని ప్రక్రియ లేదు.కథలు,వ్యాసాలు,నవలలు,అనువాదాలు, అప్పుడప్పుడు కవితలే కాక మ్యూజింగ్స్,గల్పికల ధోరణిలో రాసినవి కూడా వున్నాయి.ఆమె కుటుంబ వాతావరణం, ఆనాటి సాంఘిక వాతావరణం వారు సాహిత్యరంగంలో ఎదగడానికి ఎలా దోహదం చేశాయో వివరిస్తూ,వారి సమగ్ర రచనల గురించి తెలియజేశారు. నిడదవోలు మాలతి 1954 నుండి 73 లో అమెరికా వెళ్ళేవరకూ సుమారు రెండు దశాబ్దాల కాలంలో రాసిన కథలు ముప్పయికి పైగా వున్నాయి.మిగతావన్నీ అమెరికా నేపథ్యంలోనే రాసినవి.చాలావరకు కథలలో రెండు జీవితాల మధ్య నలిగిపోతూ స్వదేశాన్ని గుండెల్లో దాచుకుని - అమెరికా జీవితంతో సాదృశ్యాలు,వైరుధ్యాల చింతన కనిపిస్తుంది.మానవ జీవితానికి సంబంధించిన సున్నితమైన కోణాలు,కుటుంబ జీవితంలోని విశ్లేషణాత్మకమైన లోతులు మాలతి రచనల్లోని విశేషణాలు. అలాగే పాత్రల మనోచిత్రణకు,సంఘర్షణకు,సమస్యలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో, పరిసరాల చిత్రణకు కూడా అంతే ప్రాధాన్యత నిస్తారని స్పష్టం చేశారు. తెలుగులోని 150కి పైగా కథలనే కాక అనేకానేక సాహిత్యాంశాలను,సమగ్రమైన వ్యాసాలను అనువదించి తెలుగు సాహిత్యాన్ని ప్రపంచ దేశాలకు అందుబాటులోకి తెచ్చారు.సంస్థలు,విశ్వ విద్యాలయాలు చేయాల్సిన పనిని ఒకవ్యక్తి పూనుకుని స్థాపించిన "తూలిక" వెబ్ సైట్ ద్వారా అందించడం విశేషమనే చెప్పాలి.తన వ్యాసాలతో పాటు ఇతరులు రాసిన వ్యాసాల్ని కూడా కొన్నింటిని తన తూలికా.నెట్ లో ప్రత్యేకించి పొందుపరచడం మాలతిగారి సౌహార్ద్రతకు నిదర్శనం. నిడదవోలుమాలతి రాసిన "మార్పు" నవలలో మానవ భావజాలంలో,జీవన విధానంలో వచ్చిన మార్పుల గురించి తెలియజేశారు. ఇందులో మూడుతరాల్ని తీసుకుని క్రమపరిణామాన్ని చెప్పడం ఒకటైతే,రెండవది భిన్న సంస్కృతులలో వచ్చిన మార్పుల్ని చర్చిస్తూనే, మార్పులకు అనుగుణంగా మారని మానవ నైజాన్ని ఎత్తిచూపించారు."చాతక పక్షులు" నవలలో ప్రధానపాత్ర గీత.ఆమె అనుకోకుండా హరిని వివాహం చేసుకుని అమెరికా రావడంతో నవల ప్రారంభమవుతుంది.ఈ నవల కొత్తగా పెళ్ళిచేసుకుని అమెరికాలో అడుగుపెట్టే మామూలు మధ్యతరగతి అమ్మాయిలకు గైడ్ లా పనికొస్తుంది.గీత ప్రతి అనుభవం ఒక పాఠంలా నేర్చుకోవచ్చు.హేలీ సాంగత్యమూ,తపతి అనారోగ్యమూ,తపతి దూరమవ్వడంతో ఒక్కసారిగా గీత ఒంటరి కావడం,తనలోకి తాను చూసుకున్న విధానం.జీవితాన్ని తలపోసుకోవటన్ని మాలతిగారు చిత్రీకరించిన విధానం బాగుంది. నిడదవోలు మాలతి అనేకమంది తెలుగు రచయితలు,రచయిత్రుల కథలు,నవలలు,యాత్రాచరిత్రలపై అనేక వ్యాసాలు రాశారు.ముఖ్యంగా ఆయా రచనలలోని స్థానికత,సమకాలీనత,భాష,సంస్కృతి వీటన్నింటి గురించి సాధికారికతతో రాయటమే కాకుండా తన అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా,నిర్భయంగా వెల్లడించారు.అలాగే వారు రాసిన వ్యాసాలన్నింటిని నాలుగు సంపుటాలుగా చేసి పీడీఎఫ్ ఫాంలో పొందుపరచి,తన తూలికా వెబ్ సైట్ లో ఆసక్తివున్నవారు చదువుకోవడానికి వీలుగా చేశారు.ఇలా నిడదవోలు మాలతి జీవితాన్ని,వారి విశిష్ట వ్యక్తిత్వాన్ని,ఆమె సాహిత్యాన్ని విశ్లేషించడంలో శీలా సుభద్రాదేవిగారు చేసిన కృషి,చూపిన ప్రతిభ ప్రశంసనీయం. కె.పి.అశోక్ కుమార్ (నిడదవోలు మాలతి రచనాసౌరభాలు"శీలా సుభద్రాదేవి.అస్త్ర పబ్లిషర్స్.,సికింద్రాబాద్., వెల 125 రు. పేజీలు 91.సోల్ డిస్త్రిబ్యూటర్స్: అనల్ప బుక్స్) మీ ఆత్మీయతకు ధన్యవాదాలు మాలతి గారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి