28, జూన్ 2024, శుక్రవారం

బహుభాషా కోవిదుడు - రోణంకి

~~ బహుభాషా నిఘంటువు ఆచార్య రోణంకి ~~ ఒకప్పుడు చారిత్రాత్మక మైన విజయనగరం వీథులలో నెత్తిపైన దొరలటోపీ,ఇన్ షర్టు,కాలికి బూట్లు ధరించి ముంజేతికి చేతికర్ర తగిలించి,మరో చేతిలో ఏ విదేశీ భాషాసాహిత్యగ్రంథమో,.దేశీయ సాహిత్య గ్రంథమో అపురూపంగా గుండెలకు హత్తుకొని శరీరం బక్కచిక్కినట్లున్నా కళ్ళజోడు లోంచి విజ్ణానతేజం పరిసరాలను కాంతివంతంచేసే కళ్ళతో తిరిగే వ్యక్తిని గుర్తుపట్టి భయభక్తులతో తప్పుకొంటూ వెళ్తారే తప్ప ఎదిరించి నిలిచేవారుండరు. కళాశాలలో ఆంగ్లోపన్యాసం చేసినప్పుడు కవిత్వాన్ని గానం చేస్తూ అభినయిస్తుంటే సాహిత్యం,సంగీతం,నృత్యం ముప్పేటలుగా అల్లుకొని విద్యార్ధులకు ఆంగ్లభాష పట్ల అభిమానం పెల్లుబికేది.పాఠం చెప్తున్నంత సేపు ఆయన పాఠానికి పరవశించే నాగులా ఆయన మెడలోని టై నాట్యం చేస్తుండేది. ఆయన పాండిత్యానికి మోహితులై ఆనాటి యువతరం ఆయన చుట్టూ తిరిగేవారు. ఆయనే బహుభాషావేత్త రోణంకి అప్పలస్వామి గారు.నగరం నడిబొడ్డున ఎవరింట్లోనో,తోటలోనో ప్రపంచ కవితాగానం చేస్తుంటే వింటున్న పక్షులు కూడా వంతపాడతాయేమోననిపించేదట.తోటలోని పూలు తన్మయంతో విచ్చుకునేవని ఆచార్యరోణంకి శిష్యులను కలిసి అడుగుతే చెప్తారు.ఆయన శిష్యులు వారిని ఆత్మీయంగా "బాటసారి "అని పిలుచుకునేవారు. మేధావులు,అభిమానులు, విద్యావేత్త వలతోనూ ఆప్యాయంగా నడిచే బహుభాషా నిఘంటువు గానో,ఆచార్యునిగానో పిలువబడిన రోణంకి అప్పలస్వామి గారు1909 సెప్టెంబర్15 వతేదీన శ్రీకాకుళం జిల్లా టెక్కలిమండలం సమీపాన ఇజ్జవరం గ్రామంలో జన్మించారు.రోణంకి వ్యవసాయ కుటుంబంలో పుట్టారు, తాత పశువుల కాపరి.కానీ తండ్రి రోణంకి నారాయణకి విద్య అబ్బింది. రైల్వే గుమస్తా గా ఉండి కూడా వైద్య గ్రంథాలు చదివారు, స్వయంగా బడి ఏర్పరిచి ప్రభుత్వ గుర్తింపు సంపాదించారు. తండ్రి ప్రోత్సాహంతో రోణంకి అప్పలస్వామి ఎమ్మే వరకూ చదువుకోవటమే కాకుండా గ్రామఫోన్ ప్లేట్లు పెట్టుకుని జర్మన్,లాటిన్, జపాన్ , స్పానిష్ , గ్రీకు,హీబ్రూ, ఫ్రెంచ్,ఇటాలియన్ వంటి విదేశీ భాషలు నేర్చుకొని అనువాదాలు చేయడంతో సరిపుచ్చుకోక కవిత్వం రాసేటంతటి నైపుణ్యం సాధించిన గొప్ప పండితులు రోణంకి.అదేవిధంగా హిందీ,ఒరియా,కన్నడం,బెంగాలీ వంటి దేశీయ భాషల్లో సైతం అనర్గళంగా ఉపన్యసించేటంతటి నైపుణ్యం సాధించారు.బహుభాషల్లో అంతటి పాండిత్యం సాధించటంతో పాటూ ఆంగ్లభాషలో అంతర్జాతీయ ఖ్యాతి పొందారు.ఇంతటి పండితుడైనా సరే మాట్లాడేటప్పుడు మాత్రం ఉత్తరాంధ్ర మాండలిక సొబగుతోనే మాట్లాడటం రోణంకి వారికి తన జన్మభూమి,మాతృభాష పట్ల గల అనురక్తి తెలుస్తుంది. విజయనగరం మహారాజా కళాశాలలో ఆంగ్ల ఆచార్యులు గా పని చేసారు. రోణంకి సాంగత్యం లో ఆరుద్ర, శ్రీశ్రీ, నారాయణబాబువంటి ప్రముఖులు యూరోపియన్ సాహిత్యపు లోతులు తెలుసుకుని స్పూర్తి పొందారు. రోణంకి వారింటికి ఆనాటి ప్రముఖ కవులూ,రచయితలు అందరి రాకపోకలు జరిగేవి.వారందరూ సాహిత్య చర్చలూ, సాహిత్య గోష్టులూ జరిపేవారు. శ్రీశ్రీ తర్వాత అంతా శూన్యం అని అజంతా, శ్రీశ్రీ ని father of modern poetry అని వేగుంట మోహన ప్రసాద్ అన్నప్పుడు రోణంకి వ్యతిరేకించారు.ఐతే శ్రీశ్రీ అంటే రోణంకి వారికి అపారగౌరవం.అందుకే' "నోటికి పట్టే ఛందస్సులతో శ్రీశ్రీ పరుగులు తీస్తాడు.తన లక్ష్యాన్ని,ప్రత్యక్ష పద్ధతిలోనే వ్యక్తం చేస్తాడం"టారు శ్రీశ్రీ కవిత్వం గురించి రోణంకి. కవిత్వపు విలువలు ఎక్కడ ఉన్నా పులకించిపోయే హృదయం ఆయనది.అందుకే ఆత్మాశ్రయకవులలో కూడా ఒక విశిష్టత లేకపోలేదంటారు.కృష్ణశాస్త్రి కావచ్చు, నారాయణబాబు కావచ్చు ఉత్తమ కవిత్వం కాలాతీతమైనదిగా భావిస్తారు రోణంకి . ఆయన అరసం తొలితరం ప్రముఖులు, రాష్ట్రశాఖ అధ్యక్షవర్గ సభ్యులుగా కూడా ఉన్నారు. తొలిరోజుల్లో " SONGS AND LYRICS " పేరిట 1935లో తొలి సంపుటిని వెలువరించారు. అల్లసాని పెద్దన, భట్టుమూర్తి, క్షేత్రయ్య మొదలూ శ్రీశ్రీ, నారాయణబాబు కవితల్నే కాక నండూరి సుబ్బారావు,విశ్వ సుందరమ్మ,చావలి బంగారమ్మ , చాసో మొదలగు వారి రచనల్ని సైతం ఆంగ్లంలోకి అనువాదం చేసినవి కూడా దేశవిదేశీి పత్రికల్లో ప్రచురితమయ్యాయి. గురజాడ " పూర్ణమ్మ గేయం, తోకచుక్కలు "ఆంగ్లీకరించారు రోణంకి . మేకియవెల్లీ ఇటాలియన్ భాషలో రాసిన "ప్రిన్స్" గ్రంధాన్ని "రాజనీతి" పేరిట సరళమైన తెలుగులో అనువదించారు.ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తో రోణంకిని సత్కరించి భారతీయ భాషలన్నింటిలోకి అనువదింప జేసింది. ఆరుద్ర తన తొలి కావ్యం ‘త్వమేవాహం’నూ, మానేపల్లి తన తొలి కవితా సంపుటి " వెలిగించే దీపాలు" నూ రోణంకి వారికి అంకితం చేసారు. నారాయణ బాబు గ్రంథం " రుధిర జ్యోతి" కి ముందుమాట గా రోణంకి రాసిన ప్రస్తావన విమర్శనారంగానికి ఒక కొత్తదారిని చూపిందని చెప్పవచ్చు. మానేపల్లి, చిత్రభాను, వేగుంట మోహనప్రసాద్‌,అరుణ కిరణ్ ,రంధి సోమరాజు మొదలగు వారి పుస్తకాలకు రోణంకి రాసిన ముందుమాటలు ప్రశంసా పత్రాలుగా చెప్పవచ్చును. ఆంధ్రజ్యోతి , ఆంధ్రపత్రిక,భారతి, అభ్యుదయ ,ఆంధ్రప్రదేశ్,కళాకేళి,ప్రజారథం,సృజన తదితర పలు పత్రికల్లో ప్రత్యేక సంచికలు రోణంకి గారు రాసిన అనేక విమర్శనాత్మకమైన సాహిత్య వ్యాసాలు ప్రచురించారు. ప్రముఖ క్రీడాకారుడు కోడిరామ్మూర్తి పై ఒక పుస్తకాన్ని రాశారు. ,1972-77 లమధ్య ఆచార్య రోణంకిని జాతీయ ఉపన్యాసకులుగా భారతప్రభుత్వం నియమించింది.ఈ హోదాతో దేశవ్యాప్తంగా ఒకే విద్యావిధానం ఉండాలని, కేంద్రమే విద్యాబాధ్యత తీసుకోవాలని ప్రచారం చేసారు. 1974-78 మధ్యకాలంలో రోణంకి ఆంధ్రా విశ్వవిద్యాలయం లో గౌరవప్రొఫెసర్ గా UGC చే నియమితులయ్యారు. చివరి రోజుల్లో " ది నావ్ అండ్ అదర్ పోయెమ్స్ " పేరిట కవితాసంపుటి 1985 లో వెలువడింది. చివరిరోజుల్లో అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నప్పుడు నాటి ఆంధ్రభూమి దినపత్రిక ' రోణంకి కన్నుమూత ' అని వార్త ప్రచురిస్తే రోణంకి అదిచూసి తన వార్త తానే చూసుకునే అవకాశం దొరికింది అని నవ్వుకున్న ఆశావాది రోణంకి అప్పలస్వామి. 1987 మార్చి 28 న టెక్కలి స్వగృహంలో బహుభాషా కోవిదుడు అయిన ఆచార్య రోణంకి అప్పలస్వామి గారు తుది శ్వాస తీసుకున్నారు. కళింగాంధ్ర ఆణిముత్యం అని చెప్పదగిన మహోన్నత వ్యక్తి రోణంకి . ఆయన కృషి గుర్తింపుకు రాలేదు. అందుకే చాసో 'ఆంధ్ర దేశం దౌర్భాగ్యం ఈజ్ ఈక్వల్ టు రోణంకి' అన్నారు. ఏ విధమైన పురస్కారాలు పొందకపోయినా చివరి రోజుల్లో రోణంకి అప్పలస్వామి గారు నివసించిన ప్రదేశమైన టెక్కలి ప్రజలు అక్కడ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో రోణంకి గారి విగ్రహం ప్రతిష్టించటమే కాక ఒక వీథికి రోణంకి అప్పలస్వామి వీథిగా నామకరణం చేసి వారిపై తమ గౌరవాన్ని చాటుకున్నారు. ( సెప్టెంబర్ 15 రోణంకి గారి 114వ జయంతి సందర్భంగా)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి