19, జూన్ 2024, బుధవారం

తాత్విక వేదనామయగాథ‌‌‌ -రోజీ

~ తాత్విక వేదనామయగాథ -రోజీ ~ సినీతార జీవితాన్ని రావూరి భరద్వాజ వంటి ఎందరో అక్షరబద్ధం చేశారు.అయితే రంథి సోమరాజు బహుశా కుందుర్తి ప్రభావం వలన కావచ్చును వచన కథా కవితగా మలిచారు. పల్లెటూరిలో ఆకలి తెలిసిన బుల్లెమ్మ తన యాసా,భాషా,వాసన కలిగిన బుల్లెమ్మ, ఊర్వసో, మార్లిన్ మన్రో కాక పోవచ్చు,కానీ తన వేదనని ఎవరి ముందూ పరవని బుల్లెమ్మ రోజీగా మారే క్రమంలో తనలోంచి తాను అదృశ్యమై పోతున్నానని గ్రహించింది.ఆమె మనసులో రగుల్తోన్న మంటల్ని వెళ్ళడించింది.ఆమె భాష,రూపం కూడా అదృశ్యం కావడమే రంథి సోమరాజు గారి కలం నుండి రోజీ అనే నవకవితగా రూపొందింది . నిజానికి ఇది చాలా వరకూ అక్కడక్కడా మాత్రా ఛందస్సు పోకడలు పోలి ఉంది. సినీతారల విషాద జీవితం ఎవరు రాసినా ప్రక్రియ ఏదైనా అంతరార్థం ఆవేదనా అంతరప్రవాహంగా సాగినప్పుడు చెమ్మ మనసుకు తగులటం సహజం.పైపైన చదివే వారికు మాత్రం హాట్ హాట్ గానే వుంటుంది. "ఫ్లవరంత వెయింటుండు' అంటూ రోజీ కవితని ప్రారంభించిన సోమరాజు తన జీవన ప్రస్థానాన్ని ఒక ఆత్మకథగా రోజీయే కవితో చెప్తున్నట్లుగా రాసారు. "పూర్వాసి బుల్లెమ్మ/ సుక్కల్లె యెలుగూతు వున్నాది " అని చెప్పినా ఆ తళుకులు ఝరీబుటాల్ సినీమెరుపులే తప్ప మరేమీ లేదనేది తెలిసినదే. " కోట్లాది జనాలు పెదాలు/యీ హొయలు సూసి కంటి యెలుగుల్లూ సూసి/నా సుట్టూతా భజనాలు సేత్తూను వున్నారు" అని ప్రజల్ని చూసి జాలిపడ్తుంది. రా.వి.శాస్త్రిగారు రచనలలో, పాత్రో గారు నాటికలలో,కారామాష్టారు కథలలో ప్రవేశ పెట్టిన శైలిని కవితలలో జొప్పించి,ఉత్తరాంధ్ర ప్రాంతపు మాండలికంలో తొలిసారి కవిత్వం రాసిన ఘనత రంధి సోమరాజుగారికే దక్కింది. రోజీని ప్రగతి పత్రిక (1975)లో ప్రచురించినప్పుడే చదివి 'మంచుకన్నీటి సోయగంగా అభివర్ణించి రంథి సోమరాజుగారు చావులేని రోజీని సాహిత్యలోకానికి అందించార'ని దాశరథి ప్రశంసించారు. " ఎలిజి బెత్ టేలర్ని / కాలికొన గోటితో యిసిరేసిన సౌందర్య వారాసిని"అని మురిసి పోయింది రోజీ. తనని కౄరంగా సప్రస్ చేసిన ఆకలిని," యింత కూలీ కోసం / రూయిన్ చేయబోయిన నియంతను " రోజీ మర్చిపోలేక పోయింది. "ఆకలేసి కేక వెయ్య లేదంటుంది. ఎంత మహిమాన్వితుడికైనా ఆకలి తీరిన మరుక్షణంలోనే విజృంభించేది మాత్రం కామమే. అందుకే "ఆకలికి ఆకలి తీరినా/ ఆకలిగా మిగిలి పోయె ఆకలేర యవ్వనం " అంటూ మొదట్లో తనయవ్వనానికి, తన ఒంపు సొంపులకు మురిసినా అకలికి కారణం తెలిసిన తాత్వికత ఆమెని ఆవరిస్తుంది. తనని కామదృష్టితో చూసి దోచుకో ప్రయత్నించిన లైట్ బాయ్, మేకప్ మేన్, కెమేరామెన్ వీళ్ళందర్నీ చూసి జాలి పడుతుంది . తర్వాత్తర్వాత తనని చూసి మురిసిపోయికూడా దరిచేర లేకపోవటానికి తన సౌందర్యం కాదని తన కన్నుల్లో జ్వలించే జిజ్ఞాసా పూరిత తాత్విక జ్ఞానజ్యోతి వాళ్ళని నిలిపేస్తుంది అని నమ్ముతుంది. "నువ్వు మంత్రించావో గారడీచేసావో నేనిలా నగ్నంగా నామనసుని నీ ముందు పరిచేస్తున్నానేమిట'ని సందేహిస్తుంది. పాలగుమ్మి పద్మరాజుని ముందుమాట రాయమని సోమరాజు ఇస్తే "రోజీ చదువుతుంటే అద్వైతానుభూతి తన్నావరించిందనీ, వానలాగ, చీకటిలాగ, నింగినీ నేలనూ ఏకానుభవం చేయగల లక్షణం ఏదో ఈ రోజీ లో ఉంది" అని రాసారు. "గుడ్డలూ వొల్సీసి / ఒయ్యరి సిట్టిని మాటలూ సిదిమీసి / సిల్పంగ సేసేసినారో " అని రోజీ తనని మనసున్న మనిషిగా చూడలేదని వేదన చెందుతుంది ఈ క్రమంలో తనతో క్రీడించిన మనుషుల రొమాన్టిక్ ఆట 'గెలాక్సీ పరిష్వంగాల ఆట' అంటుంది రోజీ 'నేను జ్వాలాశిఖర చలత్ చలిత లీలా కీల స్నిగ్ధ కిరణ్మయిని'అంటుంది కానీ మనసులో వేదన కవిత అంతటాపరివ్యాప్తం చేస్తుంది. అందుకే 'శోకంలో పునీతమైన మనసు అనంతాన్ని దర్శిస్తుంది. దాని అలజడే రోజీ' అంటారు యం రామకోటి బుల్లెమ్మ నుండి రోజీగా పరిణామం చెందే క్రమంలో పల్లె మాండలిక భాషతో కావ్యాన్ని ప్రారంభించిన సోమరాజు తర్వాత్తర్వాత మధ్య మధ్య ఇబ్బడిముబ్బడిగా మణిప్రవాళ భాషగా ఆంగ్లపదాలను గుప్పించి తదనంతరం సంక్లిష్ట సమాసాలతో రాయటం రోజీ జీవనప్రయాణంగా సహజంగానే ఉంది. ఆంగ్ల పదాలను సాఫ్టీగా, హెవెన్లీగ, రంగూలె స్ప్రేయించి, కారులు స్టార్టించి, స్లోయీగ పొమ్ము అంటూ కొత్త పదాలుగా మార్చారు. "మీ రోజీ బాగుంది. ముళ్ళు పువ్వులైనట్లు, ఎర్రగులాబి తెల్లగా కన్నీళ్ళు చిలికినట్లు ఉంది. ప్లవరంత వెయిటుతో ప్రారంభమైన కావ్యం ప్రాణదీపంగా ప్రకాశించింది " అని ప్రశంసించారు సినారె. 'ఈ రోజున మహోదథిని నేను' అంటూ తన వేదన అంతా వెళ్లగక్కిన తర్వాత ఎంతో రిలీఫ్ గా అనుభూతి చెందుతుంది. 'ఏ అవార్డులు, నోబుల్ ఫ్రైజులూ ఇవ్వలేని ఆనందం కలిగిందంటుంది. విశాల విశ్వం తనలోనే ఉన్నట్లు భావిస్తుంది. 'ఇంతవరకు నాలో నేను చనిపోయి వారిని నిలువు దోపిడి చేస్తున్నానని 'బాధపడింది. తన ఆస్తినంతటినీ ప్రజల పేరిట అందజేసి , "దళితవర్గాల/చీకటి చిదిమి వేయ చలించు. ప్రాణజీవమునై" అని ముగింపుగా రోజీ చిరంజీవిగా ఉంటుందని చెప్తూ కవి రోజీ ఆత్మకథను పూర్తి చేసాడు. 'ఎత్తుగడలో, భావుకతలో సుందరమైన కావ్యం రోజీ.తాత్వికంగా ఇది ఎంతో పరిపుష్టమైన రచన ' ఆర్ ఎస్ సుదర్శనం గారి అభినందన అక్షరాలా నిజం. కనక్ ప్రవాసీ అన్నట్లు వాడీ,వేడీ,శక్తీ,రక్తీ అన్నీ రంథి సోమరాజు " రోజీ " నవ కవితలో గుండె రక్తం నుండే వచ్చి వుంటాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి