26, సెప్టెంబర్ 2023, మంగళవారం

శ్రీదేవి కవిత్వ చిరునామా (వివిధలో)

~ శ్రీదేవి కవిత్వచిరునామా "మధుకలశమ్"~ ఆలోచన మనిషిని నిలవనీయనప్పుడు వ్యక్తిగత అనుభూతి పరిధిని అధిగమించి విశ్వవ్యాప్తమైన ఆత్మగతానుభూత సమకాలీన సామాజిక అంశాల్ని జోడించి కవిత్వీకరణం చేసి మానవ జీవితాన్ని పరిపూర్ణంగా చూపించటానికి ఉపకరించేది కవిత్వమే. 19 లో శతాబ్దానికి ముందు గేయం,పద్యకవిత్వమే తప్ప మరో సాహిత్య ప్రక్రియ లేదనే చెప్పాలి. స్వాతంత్రోద్యమ,సంస్కరణోద్యమ ప్రభావం వలన కొన్ని వర్గాల స్త్రీలకు విద్య అందుబాటులోకి రావటంతో చైతన్యవంతమైన స్త్రీలు సాహిత్య రంగం లోకి అడుగు పెట్టి హిందూసుందరి, గృహలక్ష్మి వంటి స్త్రీలపత్రికల్లో పద్యాలు,గేయాల రూపంలో వారి భావాలు వెలువరించారు . అయితే అప్పటి దేశకాల పరిస్థితిలను బట్టి దేశభక్తి, దైవభక్తి పూరిత రచనలు మాత్రమే చేసేవారు. 2001 లో మొల్ల మొదలుకొని అప్పటి కవయిత్రులను వందమంది కవితల్ని నేనూ,డా.పి.భార్గవీరావు కలిసి సంపాదకత్వంలో "ముద్ర " పేరిట సంకలనం చేసాము.దీనికోసమై ఊటుకూరి లక్ష్మీ కాంతమ్మ గారి ఆధునిక తెలుగు కవయిత్రులను కూడా పరిశీలించటం జరిగింది. మా పరిశీలనలో 1956 లోనే తెలుగు స్వతంత్ర సంపాదకబాధ్యత వహిస్తున్న డా.పి.శ్రీదేవి కవిత్వం రాసిందనే విషయం మాసంకలనానికి పి.సరళాదేవి అందించిన కవిత్వఖండికల ద్వారా తెలిసింది. 2010 లో కేంద్ర సాహిత్య అకాడమీ నుండి భారతీయసాహిత్య నిర్మాతలు పేరిట డా.పి.శ్రీదేవి మోనోగ్రాఫ్ రాయమని లేఖ రావటంతో డా.పి.శ్రీదేవి సాహిత్యం కొరకు వెతుకులాట మొదలుపెట్టాను. అంతవరకూ పి.శ్రీదేవి అంటే కాలాతీతవ్యక్తులు నవల, ఒకటి రెండు కథలు మాత్రమే అనుకున్నాను.ఆశ్చర్యకరంగా శ్రీదేవి కథలే కాక తెలుగు స్వతంత్ర లో ధారావాహికగా ప్రచురితం అయిన దీర్ఘకావ్యం,ఒక పదివరకూ కవిత్వఖండికలూ దొరికాయి. అంతకుముందు కొటికలపూడి సీతమ్మ,జూలూరి తులసమ్మ,చావలి బంగారమ్మ, కనుపర్తి వరలక్ష్మమ్మ మొదలైన అనేక మంది కవయిత్రులు కేవలం భక్తి పూరిత రచనలు, దేశభక్తిని ప్రేరేపించే రచనలు మాత్రమే చేసారు. అరవయ్యో దశకం వచ్చేసరికి ధనం,కీర్తి లభించే నవలా రచన వైపు రచయిత్రులు అందరూ మొగ్గు చూపారు.నాయని కృష్ణకుమారి, యశోదా రెడ్డి వంటివారు కవిసమ్మేళనాలలో జాతీయ పండుగలు, సంక్రాంతి , ఉగాది కవితలే రాసారు. అప్పట్లోనే సమాజంలోని అనేక సమస్యల్ని ఆధునిక భావజాలంతో స్త్రీ దృష్టి కోణంలో రాసిన మొట్టమొదటి కవయిత్రిగా డా.పి.శ్రీదేవినే చెప్పాల్సిఉంది. 1956 సెప్టెంబర్ 14 తెలుగు స్వతంత్ర లో వైదేహి పేరు తో రాసిన "సౌదామిని" కవితతో పి.శ్రీదేవి కవిత్వం రంగంలోకి అడుగు పెట్టింది.ఇందులో స్త్రీని తటిల్లత పోలికతో మొదలుపెట్టి స్త్రీ పరంగా నడిపించి తటిల్లత మాయం కాగా స్త్రీ మాత్రమే మిగిలిపోవటాన్ని ఒక కథాత్మకంగా కవిత్వీకరించింది.తర్వాత వరుసగా నాలుగు వారాలు శ్రీ పేరుతో కవితలు రాసినా తదనంతరం మాత్రం పి.శ్రీదేవిగానే రచనలు చేసింది. శ్రీదేవి కవిత్వం రాసే నాటికి కవిత్వరంగాన భావకవిత్వోద్యమం ఉధృతంగానే వుంది.అందుకే శ్రీదేవి కవిత్వంలో కూడా అక్కడక్కడ ఈ పోకడలు కన్పిస్తాయి.కొన్నింటిలో మాత్రా ఛందస్సు తో ఊహలలో తేలే ప్రణయం,విరహం నిండిన కవితలు రాసినా,సామాన్యులు నేతల్ని,ఆర్తిని, వెతుకులాటనీ కూడా కవిత్వం లోకి తీసుకు వచ్చింది. సాహిత్య ప్రజానీకం పట్ల సానుభూతితో "అంటారా!" రాసినా , "ప్రకృతి విలయం" లో ప్రణయిని అయిన యువతి విరహానల బాధని వర్ణించినా శ్రీదేవి సహజసిధ్ధమైన శైలి విన్యాసం వ్యక్తమౌతుంది.కృష్ణశాస్త్రి ప్రభావంతో కావచ్చు వాడిన పూలు,పూల బ్రతుకు కవితల్లో శ్రీదేవి భావప్రకటన ఒక కొత్త దృక్కోణంలో మృదుమధురంగా సంభాషణాత్మకంగా నడుస్తుంది. వైదేహి పేరుతో రాసిన మరో కవిత " కిణాంకస్మృతులు " పేదయువకుని హృదయవేదన సున్నితమైన భావచిత్రాలతో సాగుతుంది." కేవల స్వగతం" లో భగ్నప్రేమిక హృదయార్తిని కవయిత్రి వ్యక్తీకరించింది. ఈ విధంగా కవితా ఖండికలలో ఆ నాటి కవయిత్రులకు భిన్నంగా విభిన్న కవితాంశాల్ని తీసుకుని తనదైన శైలిలో హృదయినిగా,మనస్వినిగా,స్నేహితగా కవయిత్రి శ్రీదేవి కనిపిస్తుంది. ప్రత్యేకంగా చెప్పాల్సింది 4-4- 1959 నుండి 6-6--59 వరకూ ఎనిమిది వారాల పాటు ధారావాహికగా తెలుగు స్వతంత్ర లో ప్రచురితం అయిన " మధుకలశమ్ " దీర్ఘకావ్యం. కుందుర్తి - తెలంగాణా,ఆంవత్ససోమసుందర్-మేఘరంజని 1958 ప్రాంతంలోనే వచ్చినట్లుగా తెలుస్తోంది.కాని కవయిత్రులలో ఆధునిక కవిత్వంలోకి వచ్చినవాళ్ళే అతి తక్కువ కావటమే కాక అప్పట్లో దీర్ఘకావ్యం రాసిన దాఖలా లేదు. శ్రీదేవి తన నవల కాలాతీతవ్యక్తులలో ఆమెకు ఇష్టమైన గ్రంథం దువ్వూరి రామిరెడ్డి గారి పానశాల గురించి రెండు ‌సార్లు ప్రస్తావించింది.ఉమర్ ఖయ్యాం రుబాయీల ఆధారంగా రామిరెడ్డి గారు పద్యకావ్యం గా పానశాల రాసారు. శ్రీదేవి రుబాయీలలోని సారాంశాన్ని, రామిరెడ్డి గారి పద్య సారాన్ని, పానశాల ముందుమాట లోని ఖయ్యాం జీవనవిధానాన్ని ,వివిధాంశాలపట్ల ఖయ్యాం అభిప్రాయాల్నీ పరిగణలోనికి తీసుకొంది. అనుసృజనే ఐనా స్వేఛ్ఛారీతిలో తనదైన భావనా పటిమను జోడించి ప్రేమతత్వంలో తాత్విక నేపధ్యాన్ని ఒదిగేలా అద్భుతమైన భాషా స్వాధీనత తో పాఠకుల హృదయాలను రసప్లావితంచేసేలా " మధుకలశమ్" పేరిట కావ్యం గా తీర్చింది. ' కట్టుకోడానికి మనము కనులుమూయుట స్థిరము బిచ్చగాడైననూ/ పిచ్చివాడైననూ భక్తి వత్సలఉడైన/ శక్తిమంతుడైన పుట్టినప్పుడొక్కడే/ గిట్టినప్పుడొక్కడే,--తాత్వికంగా చెప్తుంది. 'ప్రకృతి -నువ్వూ-నేనూ' అనే అధ్యాయంలో ప్రకృతి అందాల్ని పరమళభరిత పూలను వర్ణించేటప్పుడు పాపనవ్వులతోటీ,నిండుచూలాలి సిగ్గుల తోటీ పోలిక చెప్తూ అత్యంత సహజమైన స్త్రీ అనుభూతులను వర్ణించింది. రుతువర్ణనల్ని క్లుప్తంగా అయినా సఖీసౌందర్యాన్ని తాత్విక దృక్పథం తో కవిత్వీకరించటం గమనించదగ్గ అంశం. ' నీ చకిత వీక్షణలు / నిర్మలత్వం కనిన ఎందులోనో బాధలే/ తరలిపోవును గాదే' ప్రణయిని గా -- ఒక వర్షానికే ఉబికి ప్రవహించేది కొండవాగును నేను ' విరహిణిగా-- మట్టిలో చేరునది/మానవులే కాదురా' అంటూ విరాగిగా-- మతము గితమంటూను/హితము చెప్పుదుమనుచు మతబోధ చేసేవి/ మతిమంతులందరూ మనుదురా లోకమున/ మట్టిలో కలియకనే' అంటూ హేతువాదినిగా-- అనేక రూపాల్లో పాఠకులు కవయిత్రి ని మధుకలశమ్ లో దర్శించగలరు. ' ఒకసారైనాను/ రెప్పపాటు ఐనను చుక్కవలె మెరిసిపోయే/ నిక్కము బతుకదే' అనే వాక్యాలు చదివినప్పుడు కవిత్వంలో తనకొక చెరగని ముద్రని వేసుకొంది. " పండుటాకున వలెనే మెలమెల్లగా జారీ నిండు జీవితమెపుడో" ఇంత తాత్విక చింతనను వెలిబుచ్చుతూ ,1959 నుండి అద్భుతశైలితో ఆరేళ్ళ సాహిత్య జీవితంలో నవలా,కథలే కాక కవిత్వంలో కూడా తనదైన చిరునామాని ప్రతిష్టించుకుంది శ్రీదేవి. కాలాతీతవ్యక్తులతో సహృదయపాఠకుల హృదయాలను కొల్లగొట్టిన శ్రీదేవి రాసిన కవిత్వాన్ని కూడా వారికి రుచి చూపించాలనీ, లేకపోతే ఆమె కవిత్వం కాలగర్భంలో మాయమౌతుందేమోనని ఆరాటపడ్డాను. మంచి సాహిత్యం ఎక్కడ దొరికినా హత్తుకునే అనల్ప బలరాం గారు శ్రీదేవి సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకు రావాలని సంకల్పించి "మధుకలశమ్" పేరిట శ్రీదేవి కవిత్వాన్ని గ్రంథరూపంలో ప్రచురించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి