21, అక్టోబర్ 2024, సోమవారం

మందార మకరందమైన జీవితం

~ మందార మకరందమైన జీవితం ~ " ప్రేమ, నిజాయితీ,పవిత్రత ఉండేవారిని ఈ ప్రపంచంలో ఏశక్తీ ఓడించలేదు" అంటారు-- స్వామి వివేకానంద. వివేకానందుడిని చదివారో లేదో కానీ ఎదుగుతున్న దశ నుండి తన జీవితంలో చూసిన మరణాలు కావచ్చు,మనుషులు కావచ్చు సూర్యప్రకాష్ మనసుమీద వేసిన ముద్ర మాత్రం అక్షరాలా ఇదే. అందుకే పాతికేళ్ళ క్రితమే అరటిపండుతో ప్రేమను పంచాడు.నృత్యరూపకాలతో ఆహారం ప్రాధాన్యతను చాటి జ్ణానాన్ని పెంచాడు. ఆ కోవలోనే "అందరి ఇల్లు" ప్రారంభం అయ్యింది.అందరి ఇల్లు అనే అంశమే అద్భుతమైనది. ప్రాణాలకు తెగించి నిజాయితీగా సూపర్ సైక్లోన్ లో అయితేనేం, గుజరాత్ రైట్స్ లోనైతేనేం అంకితభావంతో జాతి మతాలకు అతీతంగా వైద్యసేవలు అందించిన వారు ఈ వైద్య దంపతులు. సూర్యప్రకాష్ తో జీవితమే కాదు ఆశయాలతోనూ చేతుల్నీ కలిపి చేదోడు వాదోడుగా డా.కామేశ్వరి జత కలిసి జంటగా చేసిన కార్యక్రమాలలో ఆత్మహత్యలకు వ్యతిరేకంగానే కాక గర్భ సంచిని కాపాడుకుందాం అంటూ వూరూరా తిరిగి చాటిచెప్పారు.అంతేకాదు డా.కామేశ్వరి గర్భసంచిని కాపాడుకుందాం,మథుమాలతి అనే అవసరమైన రెండు పుస్తకాలను సరళమైన భాషలో తన అనుభవాలను క్రోడీకరించి రాయటం చాలా హర్షణీయం. ఉత్తరాలతో మానవ సంబంధాలను ఎలా బలపరచుకోవచ్చో ' art of letter writing ' ద్వారా తెలియజేసారు. అంతటితో ఆగిపోలేదు అన్ని విధాలా రోగగ్రస్తమైపోతున్న సమాజాన్ని ప్రేమా నిజాయితీ అనే వైద్యంతో పునరుజ్జీవింప చేయటానికి నడుం బిగించారు. అందరం మనమందరం అంటూ మందార పూవును చిహ్నంగా ఎంచుకొని వారితో సహకరించే వారినందరిని ఒకే కుటుంబం గా కలుపుకుంటూ సమాజంలో 'అందమైన జీవితాల్ని ' కలగనే స్వాప్నికులు డా.కామేశ్వరీ,డా.సూర్యప్రకాష్ దంపతులు.అందుకే అందరికీ పూలనూ,పూలమొక్కల్నీ పంచుతారు. అందరికీ ఆహారం, ఆరోగ్యం, మానసిక వికాసానికి పుస్తకం అందినపుడు సమాజమే మారుతుందన్న విశ్వాసంతో అడుగులు వేస్తారు ఈ వైద్య దంపతులు. స్వాతంత్రోద్యమంలో భాగంగా ప్రజల్లో అక్షరాస్యత పెంచి పుస్తకాలతో జాగృతి పరచటానికి జరిగిన గ్రంథాలయోద్యమ స్పూర్తి ఆలోచనల్లోకి వచ్చిందేమో జంటనగరాల్లోనే వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వంద చిట్టి గ్రంథాలయాలే కాకుండా ఆనందనిలయంలో సుమారు ఇరవై వేల గ్రంథాలను సేకరించి ఏర్పాటు చేసిన బృహత్ గ్రంథాలయం అపురూపమైనది.దీనిలో భాగంగా వందరోజులు వంద పుస్తకాల పరిచయ సమావేశాలుగానీ, కరోనా కాలంలో డెభ్భైఆరు రోజులు వివిధ రిసోర్స్ పెర్సన్లతో నిర్వహించిన కార్యక్రమాలు గానీ ఏక వ్యక్తి సైన్యంగా( one man army ) జరగటం నభూతో నభవిష్యతి అనే చెప్పాలి.సూర్యప్రకాష్ ధైర్యం డా.కామేశ్వరి అయితే ఆయన సంకల్పానికి విశ్వాసాన్ని ఇచ్చేది మనోబలం . ఏ కార్యక్రమం అయినా అదే డా.సూర్యప్రకాష్ ని నడిపిస్తుందా? ఈయనే ఆయా కార్యక్రమాల్ని మనసుకి హత్తుకుని ఎత్తుకుని నడిపిస్తాడో తెలియదు కానీ డా.సూర్యప్రకాష్ ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవంతమౌతుంది.కారణం నిజాయితీగా అంకితభావంతో మనస్ఫూర్తిగా చేయడమే అనుకుంటాను. డా.కామేశ్వరి , డా.సూర్యప్రకాష్ అనే వైద్యదంపతులు తలపెట్టే ప్రతి పనిలో ఒకరి నీడ మరొకరిదిగా ,ఇరువురి అడుగుజాడలు ఒకటిగానే ప్రతీ కార్యక్రమం నిర్వహించటం అపురూపమైనదిగా ఉంటుంది. ఒక పెద్ద కార్యక్రమం తలపెట్టినప్పుడు చాలా భావోద్రేకం కలగటం సహజం.వాటిని ప్రేక్షకులుగా మనమంతా కూడా అనుభవించుతాం. అటువంటి కార్యక్రమమే జతిన్ గారి మాటలకు ఉత్తేజితులైన కళ్ళముందు ఎదిగిన గాయత్రీ, ఆమెలాంటి మరికొందరు యంగ్ డాక్టర్లను చూస్తుంటే వారికే కాదు మనకు కూడా రేపటి భవిష్యత్తు మీద ఎంతో ఆశ కలుగుతుంది. డా.కామేశ్వరీ,డా.సూర్యప్రకాష్ నమ్మిన ఆశయాలు, అభిరుచులు , అంకితభావం తప్పక వారందరిలో జాగృతి కలిగించే వుంటుంది .అందులో అనుమానం అక్కరలేదు.వారందరిలో ఆ నిజాయితీ,ఆ అంకితభావం,ఆ స్వచ్ఛత కలకాలం వుండాలని ఆశిస్తున్నాను. సామాజిక కోణంలో అందరి పండుగగా జరపటం ఎప్పటిలాగే సమాజంపట్ల ఈ దంపతులకు గల పునరంకితం కావాలనే ఆశయసిద్ధికి తార్కాణం. డా.కామేశ్వరీ& డా.సూర్యప్రకాష్ గార్లు పదవ తేదీన నిర్వహించిన మాతృసంబరం కన్నులపండువగా తల్లుల చేతుల్లో విరిసిన బాలబాలికల సందడితో అందమైన పూలతోటలా ఆ ఆవరణ అంతా కలకలలాడింది. రెండవరోజు జరిగిన అభినందన కార్యక్రమం అంతే కన్నులపండువగా జరిగింది. తర్వాత పదిహేను రోజుల పాటూ యువతరానికి పంపిణీ చేసిన పుస్తకాలు కావచ్చు,యువతరాన్ని జాగృతి పరిచేందుకు వారిలో ప్రేమా,నిజాయితీలను అవగాహన చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు కావచ్చు రేపటి భవిష్యత్తుపై సూర్యప్రకాష్,కామేశ్వరి దంపతులకు గల ఆశా,భరోసాలతోనే అని నమ్ముతున్నాను. పాతికేళ్ళుగా జరిగిన కార్యక్రమాలను పునశ్చరణ చేసుకోవటం డా.కామేశ్వరి, డా. సూర్యప్రకాష్ లకు తిరిగి మరిన్ని కార్యక్రమాలకు పునరంకితం కావలసిన మనోధైర్యాన్ని కలిగించి ఉంటుందని అనుకుంటున్నాను. డా.సూర్యప్రకాష్ & డా కామేశ్వరి దంపతులకు హృదయపూర్వక శుభాభినందనలు. -- శీలా సుభద్రాదేవి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి