18, అక్టోబర్ 2024, శుక్రవారం

నడక దారిలో -45

నడక దారిలో -45 డా.భార్గవీరావు ఒకసారి మాయింటికి వచ్చినప్పుడు 'వందమంది రచయిత్రుల వందకథలను సంకలనం చేయాలనుకుంటున్నాను ' అన్నారు.సరే ముగ్గురం కూర్చొని జాబితా తయారు చేసాం.అయితే కనీసం ఒక సంపుటి అయినా వచ్చిన రచయిత్రులను తీసుకుంటే బాగుంటుందని వీర్రాజుగారు అన్నారు.ఆ రకంగా కొందరి పేర్లు తొలగించాం.వందకన్నా ఎక్కువ పేర్లువున్నాయి.భార్గవిరావు " వారందరికీ వుత్తరాలు రాస్తాను.స్పందించిన వారి కథలు మాత్రమే తీసుకుంటాను.చనిపోయిన వారి కథల్ని మనమే ఎంపిక చేద్దాం" అన్నారు.ఆ పని మొదలైంది.ఆమె మమ్మల్ని ఒక్కరినే కాక చాలా మందిని సంప్రదించింది.దాంతో మొగమాటాలకి లోబడి ఒక్క కథ రాసిన వారివి కూడా ఆమె తీసుకున్నారు.అది మాకు నచ్చకపోయినా మౌనంగా వూరుకున్నాము.భార్గవీరావు సంపాదకత్వంగానే వందమంది రచయిత్రుల వందకథలతో "నూరేళ్ళ పంట" సంకలనం మిళిందీప్రకాశన్ వాళ్ళ ద్వారా వెలువడింది. నూరేళ్ళపంటకి మంచి గుర్తింపు రావటంతో అదేవిధంగా వందమంది కవయిత్రుల సంకలనం మన ఇద్దరం కలిసి వేద్దాం అంది భార్గవీరావు.మొల్లదగ్గరనుండి మొదలు పెడదాం అంటే సరే అన్నాను.కవయిత్రుల జాబితా తయారుచేసి వాళ్ళందరికీ ఉత్తరాలు రాసి వాళ్ళ కవితా సంపుటాలను పంపించమని కోరాము.అయితే కొందరు కవయిత్రులు వారే తప్ప ఇతరులు కవయిత్రులూ,కథకులు కానేకారని భావించి కవిత ఇవ్వటానికి నిరాకరించారు.ఒకరిద్దరు ఇవ్వనన్నంతలో ఆగదు కదా. కవితా సంపుటాలు చదివి అంతకుముందు సంకలనాలలో రాని మంచి కవితలను ఎంపిక కోసం చదవటం నాకు ఆనందం కలిగించింది.అనుకున్నట్లుగా వందమంది కవయిత్రులు కవితా సంకలనం " ముద్ర" ను కూడా మిళిందీ ప్రకాశన్ వారే ప్రచురించారు.మేము ముందుమాటలో కొందరు వాళ్ళ కవితలను చేర్చటానికి ఇష్టపడలేదనే మాటల్ని స్పష్టంగా రాసినా సమీక్షలు రాసిన వారు ఒకరిద్దరు ఎత్తి చూపటం భార్గవీరావుకు ఆగ్రహం తెప్పించింది. " చిన్నన్నయ్యకి గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఏర్పడ్డాయనీ,ఆపరేషన్ చేయించుకుంటున్నాడనీ,నీకు హిస్ట్రెక్టమి జరిగినప్పుడు సత్యవతి సాయానికి వచ్చింది కనుక నువ్వు వాళ్ళకి సాయం వస్తే బాగుంటుందని " మా పెద్దక్క ఉత్తరం రాసింది.నాకు సంక్రాంతి సెలవులే కనుక రిజర్వేషన్ చేయించుకుని విజయనగరం వెళ్ళాను.నాతో వాళ్ళు సంబంధం తెంచుకున్నా గానీ నేను రావటం ఆశ్చర్యం కలిగింది.నాతో ఎక్కువ మాట్లాడకపోయినా ఆపరేషను అయ్యేవరకూ సాయంగా వుండి తిరిగి వచ్చేసాను. అప్పట్లో జాతీయ ఛానెల్లో చాలా మంచి ధారావాహికలు రావటంతో ఎంతో అలసిపోయినా సరే చూడటం అలవాటైంది.అమరావతికథలుకూడా హిందీలో నాటకాలుగా వచ్చేవి.అలాగే ఒక సంచలనాత్మక సుదీర్ఘ ధారావాహికగా మొట్టమొదటగా సులోచనారాణి రాసిన "రుతురాగాలు" సప్తగిరి ఛానెల్లో టెలీకాష్ట్ అయ్యేది నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో యద్దనపూడి సీరియల్ యువతరానికీ,మహిళాపాఠకులకూ ఎంత క్రేజ్ కలిగించిందో అంత క్రేజ్ రుతురాగాలు కూడా కలిగించిందనే చెప్పాలి.బిందునాయుడు,మంజునాయుడు దీనిని గొప్పగా తీసారు.సాయంత్రం నాలుగున్నర కల్లా అందర్నీ టీవీ ముందుకు తీసుకువచ్చిన మొట్టమొదటి తెలుగు టీవీ సీరియల్ గా చెప్పుకోవచ్చు.కానీ దానిని తర్వాత్తర్వాత మరీ సాగదీసి విసుగెత్తించారు. నాకు తొందరగా బస్సు దొరికితే సీరియల్ టైముకు అందుకునే దాన్ని. దాని తర్వాత ఇక పుంఖానుపుంఖాలుగా వాళ్ళవి వస్తూనే వున్నాయి. ఇంక మా స్కూల్ లో ఎయిడెడ్ స్కూల్లో సీనియారిటీని బట్టి అందులో ప్రమోషన్ ఇవ్వాలి.అంతకుముందు లెక్కలు పోస్టులో సోషల్ టీచర్కి ఇచ్చారు ఆమె హెచ్చెమ్ గా ప్రమోట్ కావటంతో ఖాళీ అయ్యింది.నన్ను అందులో నింపాలి.కానీ ఆమె నాకు ప్రమోషన్ ఇవ్వటం ఇష్టంలేక దానిని అలా ఖాళీగానే వుంచి నా జూనియర్స్ నింపాలన్నట్లుచూసింది.ఇంక నాకు విపరీతమైన కోపం వచ్చి ఎమ్మె, ఎమ్మెస్సీ పీజీ సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలు చించి ఆమెపై విసిరేసి అరిచాను. నా ఆవేశాన్నీ,కోపాన్నీ,ఆవేదననీ పట్టలేక వీర్రాజుగారితో చెప్పాలంటే ఉద్యోగం మానేయమంటారు.అందుకని చెప్పలేదు.క్లాసులు తీసుకోవటం మానేస్తే పిల్లలు నష్టపోతారు.అందుకని పాఠాలు మాత్రం మానేయకుండా ఏంచేయాలో అనే ఆలోచనలో పడ్డాను. నేను స్కూలు లో జాయిన్ అయిన దగ్గర నుండి జరిగిన పరిణామాల్ని,వివక్షతలతో నాకు ప్రమోషన్ ఇవ్వని విషయాల్ని కూలంకుషంగా ఉత్తరం రాసి అయిదు కాపీలను సంబంధిత అధికారులకు రిజిస్టర్ పోష్టులో మూడు నెలలకు ఒకసారి పోష్టు చేయసాగాను.మన ప్రభుత్వఆఫీసుల సంగతి తెలిసినా పంపిపుతూనే ఉన్నాను. అవి బుట్టదాఖలు అవుతూ వచ్చాయి.అయినా నేను మౌనపోరాటం మలా సాధించాలని చూసాను. పల్లవి న్యూజెర్సీ నుండి వచ్చేసి మినియాపోలిస్ లోనే ఉద్యోగంలో చేరింది.కాని అక్కడ నిత్యమూ మంచు కురుస్తుంది.అదీగాక టార్నిడోలు కూడా తరుచూ వస్తుంటాయట. అందుకని నేను పల్లవికి మెయిల్ ద్వారా రోజూ కాంటాక్ట్ లో ఉండాలని నేర్చుకోవటానికి దగ్గర లోని కంప్యూటర్ సెంటర్ లో చేరాను.స్కూలు నుంచి వచ్చి ఆరింటికి వెళ్ళేదాన్ని .అయితే నేర్పించే ముస్లింకుర్రాడికి తెలుగు రాదు, ఇంగ్లీష్ కూడా వచ్చినట్లు లేదు.నాకు ఉర్దూ రాదు.ఇంగ్లీషు పెద్దగా రాదు.ఆ అబ్బాయి ఉర్దూ తప్ప మాట్లాడటం లేదు.దాంతో నెలరోజులు ఎలాగో పూర్తిచేసి మానేసాను.ఆ నెలరోజుల్లో కంప్యూటర్ ఆపరేట్ చేయటం ,PPT లు తయారుచేయటం,కాస్తంత ఎక్సెల్ సీటు నింపడం తప్ప మరేమీ రాలేదు. భారవి ద్వారా ఒక కంప్యూటర్ కొనుక్కున్నాను.అంతకుముందు పక్కింట్లో ఉండే రఘు నాకు rediff mail ఐడీ చేసి మెయిల్ ఎలా ఇవ్వాలో ,ఎలా ఓపెన్ చేసి చూడాలో నేర్పాడు.ఎప్పుడైనా మర్చిపోతానేమోనని ఒక పుస్తకంలో అన్నీ రాసి చెప్పాడు. అంతలో ఒక శుభవార్త.నేను అమ్మమ్మను కాబోతున్నానని.నేను సంతోషంతో పొంగి పోయాను.అయితే అమెరికా ప్రయాణం తప్పదు అనుకున్నాము.పల్లవి అత్తగారూవాళ్ళూ ముందుగా వెళ్తామనీ పల్లవి డెలివరీ అయిన తర్వాత మమ్మల్ని రమ్మన్నారు.తర్వాత వాళ్ళ అమ్మాయి డెలివరీ టైమ్ కి అక్కడికి వెళ్ళిపోతామన్నారు.ఏ ఆడపిల్లకైనా తల్లి కాబోతున్న సమయంలో తల్లి పక్కనే వుండాలనుకుంటుంది.నాకు కూడా పల్లవిని గర్భంతో ఉండగా దగ్గర వుండటం, తనకి ఇష్టమైనవి,తినాలనుకున్నవీ చేసి పెట్టాలనే కోరిక తీరలేదు. నేను ఆసమయంలో అనుభవించిన వెలితి పల్లవికి రాకూడదనుకున్నాను.కానీ నాకు నచ్చక పోయినా అదే నిర్ణయం అయ్యింది. మాకు పాస్పోర్టులు కూడా లేవు.ముందు ఆ ప్రోసెసింగ్ మొదలు పెట్టాము.అంతేకాక డిపార్ట్మెంట్ నుండి నాకు ఆరునెలలు సెలవులకి అంగీకారంకి ప్రయత్నించాలి. డిసెంబర్ మొదటి వారంలో డెలివరీ కావచ్చని అంచనాతో అజయ్ వాళ్ళ అమ్మా నాన్న నవంబర్ మొదటివారంలో వెళ్ళి రెండు నెలలు ఉండి మేము జనవరిలోనో ఫిబ్రవరి లోనో వస్తే వాళ్ళ అమ్మాయి దగ్గరకు వెళ్ళాలని నిర్ణయం అయ్యింది. ప్రతీరోజూ కంప్యూటర్ మెయిల్ చెక్ చేసుకొని పల్లవికి రెండు ముక్కలు రాసే దాన్ని.పల్లవిని కూడా అలానే ఎలా ఉన్నది రాయమనేదాన్ని. ఆరోజు ఎప్పటిలాగే స్కూలు నుండి వచ్చాక మెయిల్ చూస్తే ఆరోజు హాస్పిటల్ కి చెకప్ కి వెళ్తున్నానని వచ్చాక ఏ విషయమూ మెయిల్ చేస్తానని పల్లవి మెయిల్ పెట్టింది.కంప్యూటర్ ఆఫ్ చేసేసాను. త్యాగరాజగానసభలో ఏదో సాహిత్య సమావేశం వుందని,నేనూ పక్కింట్లోనే వున్న పోలాప్రగడ రాజ్యలక్ష్మి గారూ వెళ్దామనుకున్నాము. ఆరుగంటలకు తయారై ఆటో పిలవాలనుకున్నాము.అయితే కరెంట్ పోయింది.ఎప్పటికీ రావటంలేదు.చిక్కడపల్లి ప్రెస్ కి వెళ్ళిన వీర్రాజుగారు అప్పుడే వచ్చి చిక్కడపల్లి అంతా కరెంట్ పోయింది. గ్రిడ్ లోనే సమస్య వచ్చిందని ఎప్పటికి వస్తుందో తెలియదని అంటున్నారనీ చెప్పారు.ఇంక ఈ చీకట్లో వెళ్ళటం ఎందుకని మేము వెళ్ళే కార్యక్రమం మానుకున్నాము. సరిగ్గా ఎనిమిదిన్నరకి కరెంటు వచ్చింది.టీవీ ఆన్ చేసాము అమెరికాలో ఉగ్రదాడి అని బ్రేకింగ్ న్యూస్ వస్తోంది.ముందు మాకేమీ అర్థం కాలేదు.వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంటటవర్లు కూలిపోవడం,పెంటగన్ పై దాడీ టీవీలో చూపిస్తుంటే గుండెల్లోంచి వణుకు మొదలయ్యింది. కంప్యూటర్ తెరిచి పల్లవి మెయిల్ చూడాలనుకుంటే సర్వర్ డౌన్ అయ్యి రావటం లేదు. అంతలో స్నేహితులనుండి ఫోన్లు రావటం మొదలయ్యాయి. "ఉగ్రదాడి గురించి మాట్లాడుతూ పల్లవి వాళ్ళు బాగున్నారా " అని ,అలాగే అక్కడవున్న వాళ్ళ పిల్లలు గురించి క్షేమ సమాచారాలు తెలియజేసారు.క్రింద ఇంటి సరోజినీ గారూ,యజ్ణప్రభ గారూ ఫోన్ చేసి వాళ్ళ పిల్లలు సంగతి చెప్పి పల్లవి గురించి అడిగారు. అందరి కంఠాల్లో భయం.గుండెల్లో దుఃఖం .పల్లవి నుండి ఫోన్ వస్తుందేమోనని ఒళ్ళంతా చెవులు చేసుకుని ఫోన్ దగ్గరే కూర్చున్నాం.అంతలో ఫోన్ వచ్చింది.హాస్పటల్ కి వెళ్ళి వచ్చానని బాగానే వున్నామని,తమకేమీ ఇబ్బంది లేదని చెప్పాక గుండెలనిండా ఊపిరి తీసుకున్నాం.కానీ ..కానీ... ఆందోళన తగ్గలేదు.దేశదేశాలనుండి చదువులూ,ఉద్యోగాలకూ యువతరం అమెరికాకు తరలిపోతోంది.అప్పులు చేసి మరీ తల్లిదండ్రులు ఆశతో పంపుతున్నారు.ఎంతమందికి గుండెకోత అయ్యిందో కదా అనిపించింది. మరి కొన్ని రోజులకే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా అమెరికా ఆఫ్ఘన్ యుధ్ధం మొదలైంది. నాలోని ఆందోళననీ,ఆవేదననీ ఓ కవితగా రాసి వీర్రాజు గారికి చూపించాను.చాలా బాగా రాసావనీ,మరికొంత పెంచి దీర్ఘ కవితగా రాయగలవేమో చూడమని వీర్రాజు గారు అన్నారు. అంతే యుద్ధమూలాలు అన్వేషించటమేకాక, మత విద్వేషాలు యుద్ధానికెలా దోహదమౌతాయో, ఎన్ని కుటుంబాలు, సంక్షోభాలలో ఇరుక్కుంటాయో, యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఎందరు తల్లులు గర్భశోకంలో గుండెకోతను అనుభవిస్తారో,చరిత్ర లోతుల్లోకి వెళ్ళి వీటన్నిటికీ నా దృష్టి కోణంలో కార్యకారణాలను "యుద్ధం ఒక గుండె కోత"ని దీర్ఘ కవిత అక్షరీకరించాను.ఆ వెంటనే పుస్తక రూపంలోకి తీసుకు వచ్చి నాగభైరవ కోటేశ్వరరావు గారి అధ్యక్షతన,అద్దేపల్లి రామమోహనరావు గారు వక్తగా పుస్తకావిష్కరణ జరిపాము. వడలి మందేశ్వరరావు,కోవెల సంపత్కుమారాచార్య,ఆంవత్స సోమసుందర్ గార్లు నా పుస్తకం అందుకోగానే సుదీర్ఘ వ్యాసాలను రాసారు.అనేకమంది ప్రముఖుల ప్రసంశలు ఆ పుస్తకానికి లభించాయి. అమెరికాలోని దాడులు,యుద్ధం ఇవన్నీ పల్లవికి సబ్ కాన్సాస్ లో ఆందోళన కలిగించాయి ఓ రోజున అకస్మాత్తుగా ఏడవనెలలోనే నొప్పులు రావటంతో హాస్పిటల్ లో జాయిన్ అయింది.నెలరోజులకు పైనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది.డిస్ఛార్జి అయి ఇంటికి వచ్చి ఓ వారం రోజుల ఆఫీసుకు వెళ్ళేసరికి మళ్ళా అదే సమస్య రావటంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యేది. రెక్కలు కట్టుకుని నాకు వెళ్ళాలనిపించింది.కానీ ఎలా? పాస్పోర్టులు వచ్చేసాయి వీసాకి ప్రోసెసింగ్ మొదలెట్టాము.జనవరిలో వెళ్తే వేసవి సెలవులు కలిసొస్తాయని ప్లాన్ చేసాను.డిసెంబర్ కి నేను పోర్షన్ పూర్తి చేసేస్తే పిల్లలకి రివిజన్ చేయిస్తే చాలు అనుకున్నాను.కానీ హెచ్చెమ్ గా వున్న ఉషా " నీవి ఇంపార్టెంట్ సబ్జెక్టులు నీకు బదులుగా ఎవరినైనా ఎంపాయెంట్ చేస్తేనే లీవ్ సెంక్షన్ చేస్తానని చైర్మన్ గారు అన్నారు"అని అంది.నిజానికి అవి ఆమె మాటలే.అంతకు ముందు ఆమె కూడా ఆరేసినెలలు సెలవు పెట్టి వెళ్ళింది.అప్పుడు లేని నిబంధన నాకు పెట్టింది. ఏమి చేయాలో అనే ఆలోచనలో స్త్రీ సంఘటన లక్ష్మి కలిసినప్పుడు మాటలు సందర్భంలో అన్నాను.లక్ష్మి చెల్లెలు కల్పన ప్రస్తుతం ఖాళీగా వుందని ఆమెని పంపుతానంది.పెద్దసమస్య తీరింది. మొత్తంమీద నాకు దారి సుగమం అయ్యింది. పల్లవి అత్త,మామలు నవంబరు మొదటి వారంలో వెళ్ళారు. అనుకోకుండా ఒకరోజు వుదయమే పల్లవికి డెలివరీ అయ్యిందనీ,పాపాయి పుట్టిందని ఫోన్ వచ్చింది.మా ప్రయాణం తేదీ ఇంకా రెండునెలలు వుంది ఈ లోపునే తొందరపడి పాపాయి పుట్టేసింది అనుకున్నాము. అప్పుడే నాకు ఎరియర్స్ అందటంతో పాపకీ,పల్లవికీ బంగారు గొలుసులు ,ఇంకా కావలసిన వస్తువులు కొన్నాను. మా ప్రయాణానికి సామాను సర్దుకోవడం ఇవన్నింటికీ రఘు,శంకరం,పొనుగోటి కృష్ణారెడ్డి సహకరించారు.అప్పుడప్పుడు వచ్చి ఇల్లు చూసుకుంటామని, మొక్కలకు నీళ్ళు పోయటం ,పని అమ్మాయితో ఇల్లు శుభ్రం చేయించటం చేయిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 11 సంఘటన జరిగి ఎన్నో రోజులు కాలేదు కనుక ఎయిర్ పోర్ట్ ల్లో తనీఖీలు ఎక్కువగా వుండటం వలన రఘు చెకిన్ అయ్యే వరకూ కూడా లోపలికి రావటానికి కుదరలేదు.లాంజ్ లో కూర్చున్నప్పుడు చంటి పిల్లాడిని ఎత్తుకున్న ఒక అమ్మాయి మమ్మల్ని చూసి తాను కూడా మినియాపొలిస్ కే వస్తున్నట్లు తెలియజేసి తనకి కూడా మా సహాయం కోరింది.మాకు కూడా సహకరించింది. కలలో కూడా ఊహించని విధంగా తొలిసారి విమానం ఎక్కాము.తీరా ఎక్కినా వెంటనే ఏదో సమస్యవచ్చి ఆగి పోయి ఆలస్యంగా బయలుదేరింది.హైదరాబాద్ లో ఆలస్యం కావటంతో లండన్ లో కనెక్టెడ్ ఫ్లైట్ వెళ్ళిపోయింది.దాంతో లండన్ లో ఆ రాత్రికి హొటల్ రూమ్స్ కి పంపారు.పక్క రూమ్ లోనే ఆ అమ్మాయి కూడా వుండటంతో డిన్నర్ కి తీసుకు వెళ్ళింది.బఫే కావటంతో ఏవి తినదగినవో తెలియకపోతే ఆ అమ్మాయే తీసి ఇచ్చింది.పేరు తెలియని ఆ పధార్థాలేవీ తినలేక తిన్నామనిపించాము. ఉదయమే లేచి తయారయ్యాము.ఆ అమ్మాయి తను స్నానం చేసేంతవరకూ బాబుని మాకు అప్పగించింది. హొటలు నుండి బస్సులో ఎయిర్ పోర్ట్ కి తీసుకువెళ్ళి ఫ్లైట్ ఎక్కించారు.ఎలా అయితేనేం మిన్నియాపోలిస్ ఎయిర్ పోర్ట్ లో దిగాం.మా సూట్ కేసులు కూడ తీసుకోటానికి కూడా ఆ అమ్మాయి సాయం చేసింది.ఆ అమ్మాయి సాయంగా వుండటం మాకు ఇబ్బంది కలగలేదు. కానీ అడుగడుగునా మాకు చెకింగులు అవుతూనే వున్నాయి.అదే పెద్ద ఇబ్బందిగా మారింది. ముందురోజు రావాల్సిన వాళ్ళం రాకపోయేసరికి పల్లవీ,అజయ్ కంగారు పడ్డారు.తర్వాత వాళ్ళకి విషయం తెలిసింది.అజయ్ , వాళ్ళ నాన్నగారు ఎయిర్ పోర్ట్ కి వచ్చారు. ఎయిర్ పోర్ట్ నుండి కారులో ఎక్కే సరికే చిలికి వణుకు పుట్టింది.రోడ్లపక్కనంతా మంచు కుప్పలు.ఎట్టకేలకు పల్లవి ఇల్లు చేరాము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి