25, అక్టోబర్ 2023, బుధవారం

కుమారస్వామి గారి గురించి

మా పెద్దక్కయ్య సరళాదేవి భర్త పి.కుమారస్వామి గోపన్నపాలెం లో ఉద్యోగం చేస్తున్నప్పుడు 1964-65 లో ఒక ఏడాది పాటు యూఎస్ లో ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ సంస్థ నిర్వహించిన టెక్నికల్ కో-ఆపరేషన్ కార్యక్రమం లో వ్యవసాయ విస్తరణ విద్యలో వరి వంగడాలు,సస్యరక్షణ మొదలైన వాటి గురించి పరిశోధనాత్మక శిక్షణ పొందటం కోసం వెళ్ళారు.వెళ్ళి వచ్చాక పొట్టి వంగడం తైచుంగ్ నేటివ్- 1 వరిని రాష్ట్రంలో ప్రధమంగా సామర్లకోట శిక్షణ కేంద్రంలోని ఫారంలో నాటించారు. ఆయన నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి వ్యవసాయదారులకు ఉపయోగ పడేలా 1968లో ఆధునిక వ్యవసాయ పద్ధతులు,1974లో సస్యరక్షణ, 1989లో వరిసాగు పుస్తకాలు రాసి ముద్రించారు. కుమారస్వామి ( మామయ్య) గారికి బాపట్ల వ్యవసాయ శిక్షణాలయం లో అధ్యాపకులుగా ఉద్యోగం వచ్చింది. ఆయన వరిసాగు గురించి తెలుగులో రాసిన ఆ పుస్తకాలు అన్నదాత మాసపత్రిక లో ధారావాహికగా ప్రచురితం అయ్యాయి.ఆ పుస్తకం పబ్లిసిటీ, మార్కెటింగ్ అన్నదాత వాళ్ళే చేసారు.ముఖచిత్రం రూపకల్పన వీర్రాజు గారే చేసారు. 1978కి అనుకుంటాను హైదరాబాద్ విత్తనాభివృధ్ధి సంస్థలో డెప్యూటీ డైరెక్టర్ గా బదిలీ మీద వచ్చారు. మా మామయ్య విత్తనాభివృధ్ధి సంస్థలో ఉద్యోగం చేసి ప్రభుత్వం పదవీవిరమణ వయస్సు తగ్గించినప్పుడు 1985 లో 55 ఏళ్ళకే రిటైర్ అయ్యాడు.తర్వాత స్వగ్రామమైన విజయనగరం వెళ్ళి స్థిరపడ్డారు. మామయ్య వరి వంగడం మీద రాసిన ఆ పుస్తకాలు రెండుమూడు సార్లు రీప్రింట్ చేసిన అన్నదాత పత్రిక ఆ పుస్తకం అమ్మకాల్లో ఎంత భాగం ఆయనకి ఇచ్చిందో తెలియదు. అలాగే ఒక కొత్త వంగడం రాష్ట్రంలో నాటిన మా మామయ్య పి.కుమారస్వామిని గురించి కూడా ఎవరికీ తెలియదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి