25, అక్టోబర్ 2023, బుధవారం

కాలం మింగిన కాలం పుస్తకానికి ముందుమాట

~ఎం.ఎన్. రాయ్ అడుగుజాడల్లో ఎ.ఎల్.ఎన్.రావు~ ముప్పై- నలభై ఏళ్ళ క్రితం అనుకుంటాను అత్తలూరి విజయలక్ష్మి మా ఇంటికి మా స్నేహితులు భార్గవి రావుతో తన తొలి కథలపుస్తకం తో కలిసి వచ్చింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత వీర్రాజు గారు 'ఆమె అత్తలూరి లక్ష్మీనరసింహారావుగారి కూతురనుకుంటాను' అన్నారు. నాముఖంలోని ప్రశ్నను గమనించి " ఆయన ఎమ్.ఎన్ రాయ్ అనుయాయి.వ్యాసాలు రాస్తారు."అన్నారు. ఎమ్.ఎన్.రాయ్ గురించి అడుగుతే " ఎం.ఎన్.హేతువాది, మానవవాది. రాజకీయ సిద్ధాంతకర్త, రచయిత.అప్పట్లో రాయ్ ఒకసారి విశాఖ వచ్చారు.ఆయన ప్రతిపాదించిన మానవవాద ఉద్యమం గూడవల్లి, రావిశాస్త్రి ,అబ్బూరి రామకృష్ణారావు వంటి మేధావులను ఆకర్షించింది.నిజానికి మన దేశానికి ప్రత్యేక రాజ్యాంగం ఉండాలనే భావనను కూడా ప్రతిపాదించిన మొట్టమొదటి వాడు యం.ఎన్.రాయ్. రాయ్ వ్యాసాలు వారి అనుయాయులు చాలామంది అనువాదం చేసి ప్రజలకు అందించారు.ఆ అనువాదకులలో ఒకరు అత్తలూరి లక్ష్మీనరసింహా రావు గారు' అని ఆయన గురించి కూడా చెప్పారు. తెలుగులో రాయ్ ప్రభావంతో వచ్చిన పత్రికలు రాడికల్, రాడికల్ హ్యూమనిస్ట్, సమీక్ష, హేతువాది, ప్రసారిత, చార్వాక గురించి కూడా చెప్పారు.మా ఇంట్లో కూడా సమీక్షా, చార్వాక పత్రికలు ఉండేవి.మేము ఇళ్ళు మారటంలో ఎవరికో ఇచ్చేసారు. అవి ఉండి ఉంటే ఏ.ఎల్.నరసింహారావు గారి రచనలు ఏమైనా దొరికి ఉండేవేమో. తన తండ్రి జ్ణాపకాల్ని వారి సమకాలీనులనుండి సేకరించి వారిని సాహిత్య రంగంలో శాస్వత పరచాలనే విజయలక్ష్మి సంకల్పం చాలా నచ్చింది.కానీ చాలా ఆలస్యంగా మొదలుపెట్టింది.ఇప్పుడు నరసింహారావు గారి సహచరులు,సమకాలీనులు అందరూ వెళ్ళిపోయారు.కనీసం వీర్రాజుగారు ఉన్నప్పుడు సంకల్పిస్తే మరికొన్ని విషయాలు ఏవైనా తెలిసేవేమో. ఏదేమైనా కానీ రచయిత కావచ్చు కళాకారులు కావచ్చు వారి వారసులు సంకల్పిస్తే తప్ప వారంతా విస్మృతులుగా మిగిలిపోతారు. ఎం.ఎన్. రాయ్ జీవనవిధానాన్నే జీవితాంతం అనుసరించిన తన తండ్రి అత్తలూరి లక్ష్మీనరసింహారావు గారిని అలా విస్మృతులు కానీకుండా శాశ్వత్వం కల్పించే సంకల్పానికి అత్తలూరి విజయలక్ష్మి పూనుకున్నందుకు మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను.ఎ.ఎల్.నరసింహారావుగారికి స్మృత్యంజలులు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి