2, నవంబర్ 2023, గురువారం

శ్రీసుధమోదుగ- అంతర్హిత

శ్రీసుధామోదుగు నవల- అంతర్హిత నేను నవలలు చదవటానికి కొంచెం బధ్ధకిస్తాను. కానీ జమైకా లో వైద్యవృత్తిలో ఉంటున్న శ్రీసుధామోదుగ రాసిన తొలినవల అంతర్హిత అందుకున్నాక ఊరికే పుస్తకం ఒకపేజీ చదివి తిరగేయాలనుకొన్న దాన్ని ఆపకుండా పూర్తిచేసాను. చదువుతున్నంతసేపూ ఒకింత ఆశ్చర్యం,ఉద్వేగం పొందాను.నేను కథ చెప్పదలచుకోలేదు.ఎందుకంటే ఎవరికి వారు చదువుతుంటేనే అనుభూతి బావుంటుంది. ఒకప్పటి జమైకా వలసజీవితం గురించి- అక్కడే ఉండటం,ఉద్యోగరీత్యా డాక్టర్ కావటం చికిత్స కోసం వచ్చే అనేక మందితో మాట్లాడే అవకాశం వీటి వలన చాలా విషయాలు రచయిత్రికి తెలుసుకోవటానికి అవకాశం ఉండే ఉంటుంది. ఉద్యమాల్లో తిరిగి అడవి దారి పట్టిన వారి గురించి రచనల్లోని, వార్తా విశేషాలు వలన కొంత ఊహించి రాయవచ్చునేమో. కానీ రూట్స్ నవలలోలాగ ఈ నవలలో ఒక అమ్మాయి తనమూలాల్ని తెలుసు కోవటానికి, అనేకానేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ,తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ చేసిన ప్రయాణం కథనం చేయటం అద్భుతంగా ఉంది. ఈ ప్రయాణంలో తగిలిన అనేక పాత్రల్ని చివరకు వచ్చేసరికి ఒకే కుటుంబదారానికి కూర్చిన పూసల్లా అల్లటం సామాన్యమైన విషయం కాదు.ఒక్కొక్కప్పుడు ఎక్కువ పాత్రలవలన కొంత కన్‌ఫ్యూజన్ వచ్చే అవకాశం కూడా ఉంది.కానీ నవలారచనలో రచయిత్రి చాలా మెలకువతో, చాలా సామర్థ్యంతో ఎక్కడా టెంపో సడలకుండా చివరివరకూ కొనసాగించింది. ఈ నవల నడిపించే అనేక అంశాల కూర్పులో సామాజిక సమస్యలైన జోగినివ్యవస్థనీ,గడీలలోని అకృత్యాల్నీ,చెరుకు తోటల్లో పనిచేయటానికి పోయిన వలసకూలీల గాయాల్ని, యూనివర్సిటీల లోని డ్రగ్ కల్చర్ లనీ,వాటిమూలాల్ని తెలుసుకోవాలనుకున్న పరిశోధనాత్మక జర్నలిజాన్నీ, వివాహ వ్యవస్థని,యువతరంపై అనేకానేక ప్రభావాల్నీ గుదిగుచ్చి నవలగా రాయటంలో పాఠకులకు ఆసక్తి సడలనీకుండా మొదటినుంచీ చివరివరకు కొనసాగించటంలో చెయ్యి తిరిగిన రచయిత్రిలాగే రచనా నైపుణ్యం ఈ నవలలోఆసాంతం సంపూర్ణంగా వ్యక్తమౌతుంది. అయితే తెలుగు సినిమాలాగే చివరికి వచ్చేసరికి నాయికానాయకులు ఇద్దరూ మేనత్తామేనమామ పిల్లలుగా ముగింపు చేయకపోయినా కథకు వచ్చే నష్టం ఏమీ ఉండేదికాదనిపించింది. నవలలో కాలనిర్ణయం ఎక్కడికక్కడ నమోదు చేస్తూ ప్రకటించటం కూడా చాలా బాగుంది.వైద్యవృత్తిలో, కుటుంబ బాధ్యతలలో తీరిక సమకూర్చుకొని ఇంత విషయసేకరణ ఏవిధంగా చేసి రాసారనేది ఆశ్చర్యంగానూ,ఆనందంగానూ ఉంది. ఈ నవలను చదవటంలో పాఠకులు నవలలోని అంశాలతో మమేకం అవుతూ సందర్భానుసారంగా ప్రతిస్పందిస్తూ రసానుభూతి పొందుతారన్నది ఖచ్చితంగా చెప్పొచ్చు.ఆ విషయంలో యువరచయిత్రి శ్రీసుధామోదుగ రచయిత్రిగా విజయవంతం అయ్యింది. ఈ నవలలో పాత్ర చే రచయిత్రి రాసిన సంభాషణ లో భాగం తో దీనిని ముగిస్తాను. ".....పక్షుల్లో మౌల్టింగ్ అనేది ఉంటుంది. కాలానుగుణంగా పాత ఈకలు ఊడి కొత్త ఈకలు వస్తాయి. పక్షి ఎగరడానికి కొత్త శక్తి ఇవ్వడానికి అది ఉపయోగపడుతుంది. ఇదంతా సహజంగా జరగాల్సిన విషయం. బలవంతంగా పీకేస్తే ఈకలు రావు. అవి ఇక ఎప్పటికీ ఎగరలేవు. ఏదైనా సాధారణంగా జరిగినప్పుడే వాటికి రెట్టింపు శక్తి వస్తుంది. ఆ సమయం కోసం ఎదురుచూడాలి. దానికి మానసికంగా మనల్ని సిద్ధం చేసుకోవాలి." ఎంత బాగా చెప్పింది శ్రీసుధ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి