1, నవంబర్ 2020, ఆదివారం

సాంప్రదాయానికి ఆధునికతకూ మధ్య ఐ.వి.ఎస్.అచ్యుతవల్లి కథలు

 

సాంప్రదాయానికీ ఆధునికతకు వారధి – ఐ.వీ.ఎస్. అచ్యుతవల్లి కథలు-శీలా సుభద్రాదేవి

  సాంప్రదాయానికి ఆధునికతకూ మధ్య ఐవిఎస్.అచ్యుతవల్లి కథలు

ఒక రచయిత్రి యొక్క రచనావిధానాన్ని మూల్యాంకనం చేయటం అనేది అంత సులభ సాధ్యం కాదు. వారు వారి రచనాజీవితంలో అనేక ప్రక్రియలు చేపట్టి ఉంటారు. ఆ రచనల మీద విభిన్న సంఘటనల ప్రభావం, మానసిక సంఘర్షణ, కుటుంబంలోని వత్తిడులు, సమాజంలో రాజకీయ, సాంఘిక పరిణామక్రమాలు ఇవన్నీ సాధారణంగా ఒక రచయిత్రి రచనలపై ప్రభావం కలిగించుతాయి. అందుచేత వాళ్ళ సమగ్ర రచనలన్నీ చదివినప్పుడో, లేదా ఒక ప్రక్రియలో చేసిన కృషిని పరిశీలించినప్పుడో కొంతయినా నిర్ధారణకు రాగలము. కనీసం లభ్యమైన కథలన్నీ చదవగలుగుతే కథారచనలో రచయిత్రి రచనా విధానం, కథాంశాల ఎన్నిక, శైలీ శిల్పాల్ని పట్టుకోవచ్చును.

 ఐ.వి.ఎస్. అచ్యుతవల్లిగారి కథలు లభ్యమైన అరవై వరకూ చదివి అందులో, విభిన్న కథల గురించి విశ్లేషించుకున్నప్పుడు రచయిత్రి కథన కౌశల్యాన్ని పాఠకులకు అవగాహన చేసుకోవచ్చును.

1958లో ‘జగతి’ పత్రికలో ప్రచురితమైన ‘వంచిత’ కథతో కథాప్రస్థానం మొదలుపెట్టిన అచ్యుతవల్లి 1989వరకూ ఎనిమిది కథాసంపుటాలు ప్రచురించారు. నాగావళి నవ్వింది (1973) మూగపోయిన ప్రకృతి (1964), మనస్తత్వాలు (1966), బాత్ ఏక్ రాత్ కి, అవ్యక్తాలు, అచ్యుతవల్లి కథలు ప్రత్యేకంగా చెప్పుకోదగిన కథాసంపుటాలు. ఇవే కాక 1961లో పుట్టిల్లు అనే నవలతో మొదలుపెట్టి పద్దెనిమిది నవలలు రాసినట్లుగా తెలుస్తోంది. వివాహానికి ముందు కె.వి.ఎస్. అచ్యుతవల్లి పేరుతోనూ వివాహానంతరం కొన్ని కథలు ‘రాఘవేంద్ర’ పేరుతోను రాశారు.  ‘జయశ్రీ’ మాసపత్రికలో ‘ఆజ్ అవుర్ కల్’ శీర్షికతోనూ, ఆ పత్రికలోనే ‘బాతోఁమే ఖూనీ’ శీర్షికతోనూ కాలమ్ నిర్వహిచారు. వీరు రాసిన నవల ‘ఇదెక్కడి న్యాయం’ నాలుగు భాషలలో వెండితెరకెక్కింది.

హిందీ, సంస్కృత భాషలలోనే కాక సంగీతంలోనూ ప్రవేశం ఉంది అచ్యుతవల్లికి. కేవలం గ్రామీణ జీవితమేకాక, నగర నేపథ్యంలోనూ, నాగరిక జన జీవన విధానమే కాక పేదవారి జీవితాల్ని కూడా ఒడిసిపట్టుకొని, వారి వారి జీవన సంఘర్షణలనూ సమస్యల్నీ వాటికి కారణమైన రాజకీయ, ఆర్థిక సామాజిక పరిస్థితుల్నీ అవగాహన చేసుకుని రచనలు చేశారు. సంస్కృతాంధ్రాలలో మంచి పట్టు వున్న కథలలో స్వచ్ఛమైన, లలితమైన శైలిని ఎంచుకుని పాఠకులు అందరినీ ఆకర్షించేలా రచనలు చేశారు.

‘ఇజ్జత్’ అనే పేరుతో 79-80ల మధ్య మూడు కథలు రచయిత్రి రాయటం విశేషం. 79లో రాసిన కథలో అగ్రకులానికి చెందిన ఈశ్వరయ్య కావడితో మడినీళ్ళు అందరికీ పోసి, అవసరమైనప్పుడు కార్యాలకు వంటలు చేసి పెడతాడు. అతనికి సాయంగా వచ్చిన కేశవ యువకుడు. అన్నం పెట్టని శ్రోత్రీయం సంకెళ్ళు తెంపుకొని, అవకాశాల్ని అందిపుచ్చుకునే చైతన్యం ఆశిస్తాడు. మనిషిని ముందుకు నడిపించలేని సాంప్రదాయం యెందుకని ప్రశ్నిస్తాడు. చైతన్యదీపం కాంతి భరించలేని గుడ్డివాళ్ళే గొంగళి కప్పుకు కూచుంటారు అని నమ్మిన కేశవ పట్టణంలో మిఠాయికొట్టు ప్రారంభించి అతనికి పార్టనర్స్ గా జాకబ్ అతని చెల్లెలు మార్తాని ఏర్పాటు చేసుకుని కుటుంబ పెద్దగా ఈశ్వరయ్యని తీసుకెళ్తాడు. సమాజంలో మనుగడ సాగించి గౌరవం పొందాలంటే బతకనేర్చినతనం ఈ కథలో ప్రతీ పాత్ర ద్వారా నిరూపించింది రచయిత్రి.

80లో మళ్ళీ జ్యోతి పత్రికలోనే రాసిన రెండో ‘ఇజ్జత్’ కథలో బియ్యే చదువుతున్న వాసవిని అందమైన నాగేష్ ఆడంబరంగా పెళ్ళి చేసుకొంటాడు. నాగేష్ తాను ఆర్థికంగా, హోదా మెట్లు ఎక్కటానికి భార్యని పైవాళ్ళకి కుదువపెడతాడు. అది నచ్చని వాసవి పుట్టింటికి ఎన్నిసార్లు వచ్చేసినా వాళ్ళు కూడా ఆమెని అర్థం చేసుకోరు. దాంతో భర్త తీరుకు అలవాటుపడిపోయిన వాసవి, భర్తతో విదేశాలకు వెళ్ళి ఆర్థికంగా అంతస్తులు, ఆస్థులు పెంచుకొని ఆడంబరపు బతుకుతో ఒకసారి పుట్టింటికి వస్తుంది. ధనవంతురాలైన వాసవిని పుట్టింటివాళ్ళు చూపిన ఆదరాభిమానాలు చూసి ‘నేను ఏమి పోగొట్టుకొని ఇవన్నీ పొందానో తెలుసా’ అనుకుంటూ తనని తాను పాలిచ్చే గేదెలాంటి దాన్నని, నాగేష్ దానిని పెంచేవాడు అని తనతో కుమిలిపోతుంది. ఈకథలో స్త్రీ అస్తిత్వ ఆరాటాన్ని వాసవి పాత్ర ద్వారా ప్రతిభావంతంగా చూపుతుంది రచయిత్రి. సమాజం నిర్దేశించిన సాంప్రదాయ ఆంక్షలకు లోబడి తలవంచిన వాసవి, మనసులో మరుగుతోన్న సంక్షోభాన్ని చక్కగా కథనం చేయటం అచ్యుతవల్లి కథన చాతుర్యానికి మచ్చుతునకగా ఉంది.

మూడో ఇజ్జత్ కథలో భార్య వసుమతి ఊరెళ్ళటంతో నడివయస్సులో ఉన్న రామం ఇంటిలో పనిచేసే అమ్ములు రకరకాలుగా రామాన్ని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తుంది. ఎదురింటి కుర్రాళ్ళు తనని అల్లరి పెడుతున్నారంటుంది. ఏం చెప్పినా రామం తన పొందు ఆశించకపోవడంతో రామం తన చెయ్యి పట్టుకు లాగాడని యాగీ చేస్తుంది. ఈ విషయాలు తెలుసుకున్న వసుమతికి తన భర్త స్వభావం తెలుసు కనుక అమ్ములు తమని రోడ్డెక్కించాలనుకుని తానే అగౌరవం పొందిందిలే అనుకుంటుంది.

ఈ మూడు కథల్లో మూడు విభిన్న అంశాలను మూడు దృక్కోణాలతో గౌరవ, అగౌరవాల మధ్య సున్నితరేఖని చర్చించింది.

1966లో ప్రచురితమైన ‘క్షంతవ్యం’ కథ ఆనాటి సమాజంలో ఆడపిల్లల వివాహం ఎంత దుర్భరంగా ఉండేదో, దాని కోసం స్వంత అన్నదమ్ములు, బంధువులే ఇంట్లో అద్దెకున్న అబ్బాయితోపెళ్ళి చేయటానికి నాటకమాడిన కథ. పూర్తిగా నాటకీయతతో నిండినదే అయినా రచయిత్రి కథని మొదటి నుండి చాలా సహజ సంభాషణలతో నడిపించి చివరలో కొసమెరుపులా కథానాయిక అన్న ఆడిన నాటకంగా స్పష్టం చేస్తారు. చివరి వరకూ జరిగిన కథంతా నాటకం అని తెలియనీయకుండా రాయటంలో రచయిత్రి సమర్థతను తెలియజేస్తుంది. అచ్యుతవల్లికి నాటక రచనల పట్ల గల ఆసక్తీ, నైపుణ్యం ఉండడం వల్లనే కాబోలు ఆమె మరికొన్ని నాటకాలు కూడా రాసారు. ఆనాటి తెలుగు సాహిత్యంలో నాటక రచన చేసిన రచయిత్రులు తక్కువగానే ఉన్నారు.

1976లో జ్యోతి పత్రికలో ప్రచురితమైన ‘నేను దేవిని కాను అనే పేరుతో రాసిన కథనే మరింత వివరణలతో విస్తృతపరచి అదే పేరులో 1982 జ్యోతి దీపావళి సంచికలో పెద్ద కథగా రచయిత్రి ఐ.వీ.ఎస్. అచ్యుతవల్లి రాసింది. పేద అర్చక కుటుంబంలోని పదేళ్ళ సావిత్రి అదే వూరు రంగాపురంలోని నారాయణ ఇంట్లో అతని తల్లికి చేదోడు వాదోడుగా ఉంటుంది. నారాయణ తన తల్లి వైద్యం కొరకు ఊళ్ళు తిరుగుతూ, పెళ్ళి అయ్యాక ఒకచోట స్థిరపడతాడు. కొన్నాళ్ళ తరువాత రంగాపురంలో శ్రీదేవి జన్మదిన సంబరాల గురించి పేపర్లో చదివి ఇరవై ఏళ్ళ తరువాత  దేవత సంబరాలకు వెళతారు. ఆ శ్రీదేవి ఎవరో కాదు. సావిత్రే అని తెలుసుకుంటారు. టూకీగా కథ ఇదే అయినా కథలో చాలా విషయాల గురించి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా పేద బ్రాహ్మణుల స్థితి అటు అర్చక వృత్తీ ఇటు శ్రామిక వృత్తీ చేయలేక ఆకలితో విలవిల్లాడటం చిత్రించింది అచ్యుతవల్లి. కులాల వారీగా ఆసరా కల్పించే ప్రభుత్వం ఇటువంటి వారికి తోడ్పడడెందుకనే ప్రశ్నని కూడా యీ కథలో సంధించింది. ప్రాణంతో తమ మధ్య తిరిగే మనిషిని దేవతగా, నమ్మే ప్రజల మూర్ఖత్వాన్ని, మూఢనమ్మకాల్ని విశదపరచిన కథ యిది. డెబ్భైల నాటి గ్రామీణ జీవనం, ఆరోగ్యవసతులు లేకపోవడం, జీవనాధారం లేక పొరుగూర్లకు పోవటం మొదలైన విషయాల్ని పెద్ద కథలో కూలంకుషంగా, సునిశితంగా సంఘటనల్ని జోడిస్తూ రాసింది రచయిత్రి.

సమాజం అట్టడుగున చీకటి నీడలలోని మనోవేదనల్ని మానవీయ దృక్కోణంలోంచి పరిశీలిస్తూ వైష్ణవ సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన అచ్యుతవల్లి, చాలా కథలలో పరంపరగా వచ్చిన ఆచార వ్యవహారాలను సున్నితంగా విమర్శిస్తూనో, సమర్థిస్తూనో ఒకవైపు చెబుతూ మరోవైపు స్త్రీ పాత్రలను వ్యక్తిత్వంగా ఎదిగేలా రూపొందిస్తూ అభ్యుద మార్గంలోకి నడిచేలా తీర్చిదిద్దింది.

‘ఎన్ని తరాలు గడచినా భర్త నవ్వించితే నవ్వటం, ఏడిపించితే ఏడ్వటం తప్ప ఆడవాళ్ళకు స్వయం వ్యక్తిత్వం రావటం లేదు. కొడుకైనా, సోదరుడైనా, తండ్రైనా, భర్తైనా స్త్రీని బాధించి తృప్తి చెందుతారు తప్ప ఆమె ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వరు అని 1972లో రాసిన ‘చర్విత చర్వణం’ కథలోని పాత్రతతో చెప్పించటం రచయిత్రికి గల స్త్రీ చైతన్యం, ఆత్మాభిమానం స్పష్టమౌతుంది.

‘చదువులనో, సంగీతాలనో, కట్నం ఇచ్చుకోలేకో  ఈ రోజుల్లో  ముప్ఫయ్యేళ్ళు దాటాక పెళ్ళి కాని యువతులు బోలెడు మంది ఉన్నారు అని మరొక కథలోని పాత్ర అంటుంది. ఆనాటి సమాజంలో అప్పుడప్పుడే స్త్రీ విద్య ప్రాధాన్యత పెరిగిన రోజులు. చదువుకుంటున్న ఆడపిల్లలు ఒకవైపు స్త్రీ చైతన్య స్ఫూర్తి వల్ల కావచ్చు, అభ్యుదయ భావాల వల్ల కావచ్చు, కట్నాలు ఇవ్వకుండా పెళ్ళిళ్ళు చేసుకోవాలనే ఆశయం వల్ల కావచ్చు, తనకన్నా ఎక్కువ చదువుకున్న వరుని కోసం ఎదురుచూపు కావచ్చు, తల్లిదండ్రులు కట్నాలు ఇవ్వలేక కావచ్చు, తనకన్నా చిన్నవాళ్ళను సాకవలసిన బాధ్యత వారిపై పడడం వల్ల కావచ్చు, కొంతమంది మహిళలు జీవితాంతం కన్యలుగా మిగిలిపోవటం, ముప్పయ్యేళ్ళు దాటే వరకూ పెళ్ళి కాకుండా వుండిపోయినవారు ఎక్కువగానే ఉండేవారు.

పెళ్ళి అనేది స్త్రీ జీవితానికి తప్పనిసరి కాదనీ, పెళ్ళికాకపోయినా ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఉంటే బతుకులో అపశృతులు ఉండవనీ, ‘వ్యక్తిజీవితంలో సెక్సు అనేది చాలా స్వల్పకాల పరిమితికే లోబడి వుండే దాని కోసం పెళ్ళి చేసుకుని జీవితం అంతా అనేక సమస్యలతో మానసిక అశాంతితో కృంగి కృశించాలా’ అనే భావంతో నలుగురు అన్నదమ్ములకు, ముగ్గురు అక్కలకూ భారంకాకుండా బతికిన విమల కథ ‘నిర్ణయం’.

‘ఒకరోజు’ కథలో చిరుద్యోగి జయా వెంకట్రావుల జీవితం, వాళ్ళింట్ల పనిచేసే తవిటమ్మ, నాయుడు జీవితాల్ని సాదృశ్యంగా కథని నడిపించింది రచయిత్రి రెండు కుటుంబాలూ  ఆర్థిక ఆటుపోట్లు ఎదుర్కొంటున్నవాళ్ళే. ఎంత చెట్టుకంతగాలి అన్నట్లు ఉన్నదంట్లోనే తృప్తి పడుతూ తమకు ఉన్నంత కూడా లేక చెట్లు కిందా, అరుగుల మీదా వర్షంలోనూ అవస్థలు పడుతున్న వారి కంటే తామెంతో  అదృష్టవంతులుగా తృప్తిపడడంగా రచయిత్రి ముగిస్తుంది. సంతృప్తి కలిగిన మనిషి కన్నా అదృష్టవంతులు లేరనే సందేశంతో కథని నడిపించింది.

1971లో రాసిన ‘బెటర్ హాఫ్’ కథలో ఆరేళ్ళు నిరుద్యోగిగా ఉండి, బహు సంతానంతో ఎట్టకేలకు ఉద్యోగంలో  చేరిన పురుషోత్తం, తొలి జీతం అందుకొని అన్నాళ్ళుగా అణచుకొన్న కోరికను తీర్చుకోవటానికి జీతం అంతా ఖర్చు పెట్టి భార్యాపిల్లలకు మంచి బట్టలు, బొమ్మలు, స్వీట్లు, వగైరాలన్నీ కొనుక్కొని వెళతాడు. జీతం డబ్బులు ఖర్చయితే మర్నాటి నుండి ఇంట్లో ఖర్చులు, అద్దె మొదలైనవన్నీ ఎలా గడుస్తాయనే బాధ ఉన్నా పురుషోత్తం భార్య మెత్తని మాటలతోనే భర్తకు సర్ది చెప్పి ‘ఆఫీసర్లతో పోలిక పెట్టుకోకుండా మీకన్నా కింద వాళ్ళతో పోల్చుకుంటే ఈ అవస్థలు ఉండవంటూ మర్నాడు ఆ బట్టలు షాపులో నచ్చలేదని తిరిగి ఇచ్చేయమంటుంది. ఈ విధంగా అచ్యుతవల్లి కథలలో ఒకే అంశంతో రెండు విభిన్న కుటుంబాలలో పోలికలు, వైరుధ్యాలు చూపెడుతూ ఆనందకర జీవితానికి కావలసినది సంతృప్తి అంటూ మూల్యాంకనం చేయటం రచయిత్రికి నచ్చిన కథన విధానం.

హీరో తండ్రి తన భార్య మహాయిల్లాలు అని అన్నప్పుడు ఆ రోజుల్లో అందరాడోళ్ళూ మహా యిల్లాళ్ళుగానే ఉండేవారు లెండి’ అన్న డైలాగు అచ్యుతవల్లి రాసిన పరిణీత నాటకంలో ఉంటుంది. నాటకం, నేపథ్యం అంతా ఒక మేడలోనే. అందులో తల్లీ, కూతురు నివసిస్తుంటారు. ఆ ఇంట్లోనే అద్దెకి ఒక తండ్రీ, కొడుకు ఉంటారు.  కూతురికి సంగీతం చెప్పే మాస్టారు, దగ్గర బంధువు, అద్దెకున్న మరో కుర్రాడు, అతని మిత్రుడు, పాత్రధారులు, ఒంటరి ఆడవాళ్ళుగా ఉండడంతో అందరూ  ఆమె పొందుకోసం, తాపత్రయ పడడం, చివరికి ఆ అమ్మాయి తనకు పెళ్ళయిందని భర్త విదేశాల నుండి తీసుకెళ్ళటానికి వస్తాడని చెపుతుంది. దాంతో వాళ్ళంతా ఒకటై ఆ అమ్మాయి మగవాళ్ళని చెప్పుకింద తేలుగా నొక్కి పెట్టే జిత్తులమారి అని తిట్టుకుంటుంటే నొక్కి పెట్టకపోతే కుట్టటానికి తేళ్ళు రడీగా ఉంటాయి కదా అని సమాధానం చెపుతుంది. డబ్బున్న ఒంటరి ఆడవాళ్ళని ఏ విధంగా మోసం చేయాలని చూస్తారో అటువంటి మానవ నైజం, మగవారి తీరుని బట్టబయలు చేస్తుంది రచయిత్రి.

అనారోగ్యంగా ఉన్న శ్రీమంతురాలు సునంద, మొక్కజొన్న పొత్తులు అమ్మే ఎల్లమ్మ, టీ కొట్టు అప్పిగాడు ఇలా విభిన్న వ్యక్తుల మనసులోని ఆలోచనలు, ప్రతీ ఒక్కరూ మిగతా ఇద్దరి అదృష్టానికి అసూయపడటం చెబుతూనే, వారి వారి మనోగతాలు వర్షం వచ్చిన రోజున ఏ విధమైన కల్లోలానికి గురి అవుతారో అద్భుత కథనంతో దృశ్యాల్ని కళ్ళముందు నిలబెట్టేలా రాసింది రచయిత్రి.

‘జీవితానికోతోడు’ను వెతుక్కొని వివాహబంధం ఏర్పరచుకోవడానికి వయసేమీ అడ్డంకి కాబోదని సందేశాన్ని ఇస్తుంది కథలో అచ్యుతవల్లి.

అచ్యుతవల్లి గారి స్త్రీ పాత్రలు వైవిధ్యం కలిగి ఉండడమే కాకుండా స్వంత వ్యక్తిత్వంతో సామాజిక జీవితంలోనూ, కుటుంబ జీవితంలోనూ తమదైన ప్రాతినిధ్యం కలిగినవిగా ఉంటాయి. అందుకే ‘అబల’ కథలో అచల, ‘నాతిచరామి’ కథలో జయవ్రద, ‘ఆజ్ అవుర్ కల్’ కథలో మధుర, ‘సులక్షణ’ కథలో సులక్షణ పరిణీతలో రాజ్యలక్ష్మి, ‘బెటర్ హాఫ్’లో అనసూయ, ‘మూగబోయిన ప్రకృతి’ కథలో శంకరి మొదలైన పాత్రలన్నీ కూడా సమాజంలోను కుటుంబంలోను ఆత్మవిశ్వాసంగల మహిళలకు మచ్చుతునకలుగా ఉంటాయి.

రచయిత్రి కథనురాసేటప్పుడు ఇదే రాయాలని కథకు పరిమితులు విధించుకోకుండానే, సునిశిత పరిశీలనంలో ముఖ్యంగా మధ్య తరగతి మనుషుల జీవన పార్శ్వాలను సాధారణ సరళ గంభీరభాషలోనే రాసే విధానం పాఠకులను ఆకర్షిస్తుంది. అచ్యుతవల్లి కథలలో ఎక్కువగా ప్రేమ, స్నేహం, ఆర్ద్రత, సామాజిక బాధ్యత గల మానవ మనస్తత్వాన్ని ఒడిసిపట్టుకొని రాసేటప్పుడుగానీ, ఆచార వ్యవహారాలు లోకరీతి, సాంప్రదాయాలు స్త్రీకి గల సాధారణ కోరికల్ని కూడా ఏ విధంగా కత్తెర పడతాయో చాలా సౌలభ్యంగా ఒక్కొక్కప్పుడు హాస్యభరితంగా అలవోకగా రాస్తుంది. అయితే ఏదో ఆషామాషీగా చదివేయకుండా అంతర్లీనంగా ఆయా పాత్రల పట్ల పాఠకులకు సానుభూతి కలిగేలా కధలు ఉంటాయి.

గ్రామీణ జీవితాన్ని, పల్లె అందాల్ని, పట్టి చూపే ప్రకృతి హోయల్ని కథకు నేపథ్యంగా రాస్తున్నప్పుడు కొంత భావుకతతో వాక్యాలు వాక్యాలుగా కథలో ఇమిడిపోతాయి.

అచ్యుతవల్లి కథలలో తప్పక పేర్కొనదగిన కథ ‘ముత్యాల చెరువు’ ఇందులో అరమరికలు, ఆర్థిక అసమానతలు, సామాజిక వివక్ష పట్టించుకోని అపురూప స్నేహం ఉంటుంది. గ్రామంలోని కుల వివక్ష, లైంగిక దోపిడికి బలైన స్త్రీగా దళిత స్త్రీ ముత్యాలు కథగా నడుస్తుంది. గ్రామంలోని శ్రామిక జీవులు తమకు నచ్చినచోట కూలి చేసే అవకాశం లేని పరిస్థితులు మోతుబరి కామందు ఆధిపత్య ధోరణిని వివరిస్తుంది. మతాంతర వివాహం చేసుకోదలచినందుకు వర్ణ వివక్షకు గురైన ముత్యాలు ఆవేదనను ఎంతో ఆర్ద్రతతో రాసిందీమె. బూజు పట్టిన చాదస్తపు సాంప్రదాయాలపై నిరసన వ్యక్తపరిచే స్నేహశీలి చిట్టి పాత్రని సృజించిన తీరు కథకి ఉన్నతస్థాయికి కల్పించి చిట్టితో స్నేహాన్ని అభిలషించిన ముత్యాలు చిట్టికి నచ్చిన చెరువులో పూయాల్సిన తామర ఎండిపోయిందని, ఆమె మళ్ళీ వచ్చేనాటికి చెరువు నిండా పూలు నిండేలా చేస్తానని చెప్పిన ముత్యాలు ఈతవచ్చిన ముత్యాలు చెరువులోపడి చావటమేమిటని చిట్టికే కాదు పాఠకులకూ సందేహం కలగకమానదు. ఎవరూ లేనివారు తామర దుంపల్ని చెరువులో వేస్తే చనిపోతారని ఒక పుకారును ప్రచారం చేస్తారు. బూజుపట్టిన భావాల్నీ, తిరోగమన పోకడల్ని నిరసించిన చిట్టి పాత్ర ద్వారా కథంతటినీ దృశ్యాలు, దృశ్యాలుగా చలనచిత్రంలా నడిపించింది రచయిత్రి. ముత్యాలు ప్రేమించిన క్రిస్టియన్‌ను ముత్యాలు వివాహం చేసుకోనివ్వని గ్రామకట్టుబాటు నేపథ్యంగా కథలో కనిపించని ఊహాచిత్రాన్ని పాఠకులకు దృగ్గోచరం చేస్తారు అచ్యుతవల్లి.

కుటుంబ జీవితంలోని భార్యాభర్తల దాంపత్య సంబంధాలు చర్చించిన కథ ‘అభిశంస’. వీరి కథలలో ఉన్నత, మధ్య తరగతులవేకాక అట్టడుగు వర్గాలలోని కుటుంబాలలో ఆర్థికపరమైనవేకాక సంతృప్తి జీవితానికి కావలసిన అనుబంధాలను గూర్చి చెప్పినవి కూడా చాలానే ఉన్నాయి. ఆ కోవలోనిదే పేదరికం కల్పించే ఆశలూ, ఆలోచనలూ, వాస్తవానికి, ఊహాలకి మధ్య సంఘర్షణను తెలిపే కథ ‘సన్నాట’ (1969)

‘ఎందుకోసం’ కథలో ఉద్యోగిని అయిన వేదవతి వంటి స్త్రీలు భర్త చీదరించుకుంటూ ఉన్నా భర్తని వదిలి జీవితాన్ని ధైర్యంగా కొనసాగించలేని పిరికితనాన్నీ, మిధ్యాగౌరవాల మీద అమితలోభత్వాన్నీ నిరసిస్తూ నాటికీ నేటికీ మధ్యతరగతి మహిళ మనస్తత్వంలో మార్పు రాదంటుంది రచయిత్రి.

సమాజంలోని విభిన్న వర్గాల వ్యక్తులనూ, వారి మౌలిక సమస్యలనూ, మానవ మనో విశ్లేషణలనూ అధ్యయనం చేసేలా అచ్యుతవల్లి కథలు ఉంటాయి.

పెద్దవాళ్ళు తమ జీవితానుభవాలు, అవస్థలూ తమ  సంతానం పడకూడదని వారి జీవితానుభవసారాన్ని అందజేయాలనుకుంటే పిల్లలకవి ముసలి కబుర్లలో కనిపిస్తాయంటారు అచ్యుతవల్లి.

చరమ దశలలోని వారు ఎంతటి మహానుభావులైనా నడివయస్సులో ఎంత ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారైనా వాళ్ళని చూసుకుంటూ సేవ చేయాల్సిన వారికి చిన్న చూపే అనేది కొన్ని కథలలో అచ్యుతవల్లి అక్షరబద్ధం చేసింది.

కథలకు తగిన నేపథ్యం గ్రామీణమైనా, నగరమైనా చక్కని భావుకతతో, పరిశీలనాత్మకమైన దృష్టితో వర్ణించడం సమకాలీన జీవితాల్లోని అనేక పార్శ్వాలను నిజాయితీతో తాను నమ్మిన సిద్ధాంతాల మేరకే చక్కని పఠనశీలతతో రచనలు చేయడమే ఐ.వి.ఎస్. అచ్యుతవల్లి కథలలో చూస్తాం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి