1, సెప్టెంబర్ 2024, ఆదివారం

చాగంటి తులసి రచనల్లో రంగులూ రాగాలూ-

~ చాగంటి తులసి రచనల్లో రంగులూరాగాలూ~ విజయనగరం అనగానే గంటస్తంభం గుర్తొచ్చినట్లు, మధురవాణో,గిరీశమో ఎదురైనట్లు,నోట్లోచుట్టతో దీర్ఘంగా చూస్తున్న చాసో కనబడినట్లు ఆలోచనల్లోకి ముఖం నిండా ప్రసరించే నవ్వుతో చాగంటి తులసి కూడా వస్తుంది. ఆమె కొన్నిరచనలు సరదాగా చదువుకునేలా సాధారణ పాఠకుడికి అనిపిస్తాయేమో కాని లోతుగా పరిశీలించినప్పుడు ప్రతీదీ విభిన్నకోణంలో ఆలోచింపజేస్తాయి. 'రంగంటే ఇష్టం" పేరిట సాహితి చింతనలు అనే టాగ్ లైన్ తో ఓనలభై వ్యాసాలతో సంపుటి వెలయించారు తులసి. అందులో తొమ్మిది గురజాడ సాహిత్య చింతనలే. గురుజాడ కవిత్వం గురించి గురజాడ కార్యకారణ సంబంధ జ్ఞానంతో హేతుబద్ధతతో ప్రజల బతుకు గురించి ఆలోచించి జీవిత వాస్తవికతను అవగాహన చేసు కున్నాడంటారు రచయిత్రి. గురజాడ సమకాలీన భారతీయ కథకుల గురించి చెప్పారు. పూర్ణమ్మ కథని ఎత్తుకున్న దగ్గరనుండి. ముగింపు వరకూ ఏకోన్ముఖంగా అనుకున్న అంశాన్ని తీసుకు వెళ్ళడం వలన పూర్ణమ్మ కథాకావ్యాన్ని విశిష్టమైనదిగా ఆలోచన కలిగేటట్లు చేసాడంటారు రచయిత్రి . గురజాడ ప్రతిభావంతుడు కాబట్టి ఆధునిక కధానికా ప్రక్రియను ఆరంభిస్తూనే వాస్తురీత్యా, శిల్ప రీత్యా పరాకాష్ఠకు చేరుకునేలా రాయగలిగాడంటారు. ఆధునిక కావ్యాలైన తృణకంకణం, రామిరెడ్డిగారి నల్లజారమ్మకథ, అబ్బూరివారి మల్లికాంబ, నారాయణబాబు దేశమాత, శ్రీశ్రీ భిక్షువర్షీయసి వంటి అనేక స్త్రీపాత్రలలో గురుజాడ జాడవుందని రచయిత్రి సోదాహరణంగా వివరించారు. కన్యాశుల్కంలో 'ఎత్తడం' పేకాట గురించి, సమాజంలో ఆ ఆట కొనసాగింపు ఆ ఆటకి చెందినవిషయాలన్నీ తెలియజేసారు. తరతమ భేదాలున్నప్పటికీ నిరసనగానో, ధిక్కారంగానో, చాకచక్యంగానో, బుద్ధి కుశలతగానో, చదువూ సంస్కారాల మేళవింపు వలన వచ్చిన తెలివిడిగానో. నిస్సహాయతలోని ఎదురుదాడిగానో, బతుకునేర్పిన విజ్ఞతతో అణిగి మణిగి ఉంటున్నట్టే ఉంటూ సాఫల్యం చేసుకునే కార్యసాధకులుగా గురజాడ రచనలలో స్త్రీల స్వభావాలు ఉంటాయని ఒక పేరా లో గురజాడ సాహిత్యమంతటినీతెలియజేస్తూ ఈ వ్యాసాల్లో విశ్లేషించటం విశేషం. కారా, చాసో, పతంజలి, రావిశాస్త్రి, ఉప్పల లక్ష్మణరావు ,నారాయణబాబు, రామలక్ష్మి రచనల గురించే కాక అనేక మంది భారతీయ రచయిత్రుల సాహిత్య విశ్లేషణలను సుమారు 350 పేజీల యీ గ్రంథంలో ఆనందంగా చదువుకోవచ్చు . విశిష్ట చిత్రకారిణి అయిన మహాదేవివర్మ కవితలను అనువదించి , మహాదేవివర్మ వేసిన వర్ణ చిత్రాలతో పాటుగా తెలుగు సాహితీ లోకానికి చాగంటి తులసి పుస్తకంగా వేసారు. గొప్పదైన ఆత్మ సౌందర్యం, దయాగుణం కల్గిన, సంస్కర్త అయిన మహాదేవివర్మ కవిత్వంలోని మూలభావాల సౌందర్యాన్ని తెలుగులోకి అనువదించటంలో సాఫల్యత సాధించింది తులసి అని డా. బాల గాలిసౌరిరెడ్డి గారు ప్రశంసించారు.తన ముందు మాటలో 'మూలంలోని పదసంయోజనాన్ని అది ఎక్కడెక్కడ సంస్కృత సమంగా ఉందో దాన్నంతా జాగ్రత్తగా అనువదించటంలో సాధారణంగా చాలా అనువాదాలలో కనిపించే శ్రవణ నిష్టూరుత్వం కని పించలేద'నీ ప్రశంసించారు వాడ్రేవు చిన వీరభద్రుడు. అంతేకాక ఒక కవయిత్రి తన కన్నీటితో తుడిచిన వేదన మరకను ఎంతో సున్నితంగా సాహిత్యపిపాసులకు ప్రేమతో అందించారని అన్నారు. అనువాదం చేయటమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. మరో భాషలోని కథనైనా కవితనైనా తెలుగు లోనికి అనువాదం చేసేటప్పుడు మూలరచయిత అంతరంగాన్నే కాక మూల రచనలోని ఎసెన్స్ ను కూడా ఆకళింపు చేసుకొని భావస్పోరకంగా అనువదించడం నిజానికి కత్తిమీద సామే.అది చాగంటి తులసి సునాయాసంగా చేయగలరనేది ఆమె ఒరియా భాష నుండి తెలుగు లోనికి అనువదించిన కథలే తార్కాణం. మహాదేవి వర్మ మూలకవితలను, ఆ వెంటనే తన అనువాదాన్ని రెండింటినీ ప్రచురించి పుస్తకంగా వేశారు చాగంటి తులసి ."మహా కవయిత్రి మహాదేవి వర్మ గీతాలు పేరిట వున్న తెలుగు అనువాద కవితలు కూడా తేలికైన అచ్చతెలుగు పదబంధాలతో వుంటాయి. "బ్రద్దలు కొట్టు క్షితిజాన్ని అవలోకిస్తాను నేనూ అవతలవైపు ఏముందో! ఎందుకని నన్ను చుట్టబెట్టి బంధిస్తోంది ప్రాచీరమై నాశ్వాస ఈవేళ " అంటూ స్వీయకవితలేనేమో అనేలా అనువాదం చేసి తెలుగు పాఠకులకు పరిచయం చేశారు. ఇంక కథలు దగ్గరకు వస్తే స్త్రీవాదం యింకా వేళ్ళూనక ముందే వచ్చిన 'యాష్ ట్రే (1976) 'కథలో స్త్రీని ఆత్మ గౌరవం , ఉన్నత వ్యక్తిత్వానికి కు అద్దం పడుతూ, సమాజంలో ఆలోచనలో కొత్తగా మార్పుచెందుతోన్న స్త్రీ పాత్రగా మలిచారు.ఈ కథ అనేక సంకలనాలు లో చేరటమే కాకుండా అనేక భాషల్లోకీ అనువాదమైంది. సమాజం వలయంలో ఇమడలేని వ్యక్తుల బాధ్యతారాహిత్యం, పలాయనబుద్ధిని ‘వలయం‘ కథ చెబుతుంది. మానవసంబంధాల మధ్య డబ్బునిర్వహిస్తున్న పాత్రను విమర్శనాత్మకంగా అనేక కథలలో స్పష్టం చేశారు.ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో స్త్రీ పురుషుల మధ్య ఆర్థిక సంబంధాల పెత్తనాన్ని స్త్రీ పురుష అసమానత్వాన్ని ,ఆడపిల్లల పెంపకం, చదువు, ఉద్యోగం, పెళ్ళి, ప్రవర్తన మొదలైన అంశాలలో మధ్యతరగతి ఆర్థిక , సామాజిక పరిస్థితుల ప్రభావం, దానిని ధిక్కరించడానికి స్త్రీలు చేసే పోరాటాలు చిన్న దేవేరి,యాష్ ట్రే, వలయం కథలలో గమనించవచ్చు. అమాయకపు ఆడవాళ్లపై జరిగే మగాళ్ళ దాష్టీకాన్నీ,దానికి వంత పాడే కొందరు ఆడవాళ్ళపాత్రనీ ' ఆడదాయికి నోరుండాల్సిందే', శరణ్యం కథలలో రచయిత్రి అక్షరీకరించారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇటీవల అయిదారు నెలలు క్రితం వరకూ యీ మాట అంతర్జాలంలో రాస్తున్న ఊహల ఊట పేరిట అందించిన బాల్య జ్ణాపకాలు ఇంద్రధనుస్సు మీద విహరించేంత ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.ఉత్తరాంధ్ర మాండలికసొబగునీ,సుమారు అరవై ఏళ్ళక్రితం ఇళ్ళల్లో వాడిన వస్తు పరిచయం,ఆటలూ,పాటలూ బ్రాహ్మణ కుటుంబాలలోని వ్యావహారిక పెదాలతో కూడిన కబుర్లనీ చదువుతో న్న పాఠకులు కూడా బాల్యపు తొడుగులోనికి దూరిపోయి తులసితో చేయి కలిపి తిరిగిన అనుభూతిని కలిగిస్తాయి. చివరగా "బతుకు గతుకుల్లో గట్టి దెబ్బ తగిలి నప్పుడు అవి కరిగి బయటకు తేలతాయి. నమ్మిన వాళ్లకు దేవుడు ఒక ఆసరా. ‘‘నాకు నేనే ఆసరా, నాకు నేనే బలం’’ అనుకుంటే, మనసును స్వాధీనపరచుకోగలిగితే, కార్యకారణ సంబంధాలను హేతుబద్ధతతో వివేచించగలిగితే దారి స్పష్టమ వుతుంది." అనే చాగంటి తులసి నవల,కథా, అనువాదం , వ్యాసం యిలా ఏ రచన చేసినా ఆమెదైన శైలీ, దృక్పథం వెల్లడౌతుంది. (ఈమాట - సెప్టెంబర్ 2023)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి