18, మార్చి 2023, శనివారం

బహుళ పత్రిక లో ముఖాముఖి

బహుళ కోసం ముఖాముఖి మీ గురించి పరిచయ వాక్యాలు….. నేను విజయనగరంలో1949, డిసెంబర్ 19 న జన్మించాను.రాజరాజేశ్వరమ్మ,కొడవంటి మల్లిఖార్జున స్వామి నా తల్లిదండ్రులు.నాకు ఇద్దరు అక్కలు.ఇద్దరు అన్నలు.BSc డిగ్రీ విజయనగరంలో. తర్వాత MA(తెలుగు),MSc(గణితం),BEd ఉస్మానియా విశ్వవిద్యాలయం లో చేసి RTC High School లో గణితోపాధ్యాయినిగా పనిచేసి ప్రధానోపాధ్యాయురాలిగా పదవీవిరమణ చేసాను. 1.మీ సాహిత్య నేపథ్యం? నేను బాగా చిన్నగా ఉన్నప్పుడే మా పెద్దక్కయ్య పి.సరళాదేవి కి వివాహం జరిగింది.అక్క సోవియట్ లాండ్ ప్రచురించే పిల్లలబొమ్మలపుస్తకాలు నాకోసం తేవటం వలన వాటిని చదువుతూ బొమ్మలు వేయటం అలవాటైంది. ఆమె తెలుగు స్వతంత్రలో విరివిగా రచనలు చేసేది.మాలతీచందూర్, పి.శ్రీదేవి, రామలక్ష్మిల సమకాలీనురాలు. డా.శ్రీదేవి అక్కకు మంచి మిత్రురాలు.నేను కుటుంబ పరిస్థితులవలన ఎనిమిదవతరగతితో చదువు మానేసి ఏడాది పాటు అక్క ఇంట్లో ఉన్నప్పుడు బడికి వెళ్ళకపోవటం వలన అక్క ఇంట్లోని గ్రంథాలయం లో శ్రీపాద, చలం, కొడవటిగంటి కుటుంబరావు వంటి ప్రముఖుల రచనలేకాక అనేక అనువాద గ్రంథాలు కూడా అర్థం అయినా కాకపోయినా విరివిగా చదివాను.నేను రచయిత్రీగా మారటానికి దోహదం చేసింది అక్క వాళ్ళింట్లో ఉన్న సమయమే అనుకుంటాను. మా పెద్దన్నయ్య కొడవంటి లీలామోహనరావు భారతిలో వ్యాసాలు రాసేవాడు. నా కవితలు కూడా ఆంగ్లం లోకి అనువదించాడు. మా చిన్నన్నయ్య కొడవంటి కాశీపతిరావు కూడా కథకుడు 1965 నుండీ 85 లవరకు అన్ని పత్రికలలో విస్తృతం గా కథలు రాసాడు. చదువుకోకుండా కథలు రాస్తున్నానని మందలిస్తారని నేను కథలూ కవితలు రాసినా పుస్తకాల అడుగున పడేసేదాన్ని. 1970 లో నా మొదటి కథ ప్రచురితమైంది. వివాహనంతరం డిగ్రీ పూర్తిచేసాక 1972 లో హైదరాబాద్ లో అడుగు పెట్టాను. వీర్రాజు గారితో ముఖచిత్రాలు వేయించుకోటానికి కవులెందరో రావటం, ఇంట్లో ఎక్కువగా కవితాసంపుటాలు ఉండటం ,ఇంట్లో తరుచు కుందుర్తి గారి అధ్వర్యం లో కవితగోస్ఠులు జరగటం తో నాకు కవిత్వరచన పట్ల ఆసక్తి పెరిగింది. 2.మీ సాహిత్యంలో ప్రధానాంశాలు?  నా రచనల్లో అంశం సింహభాగం స్త్రీ జీవితచిత్రణ మే.ఎక్కువగా బీద,బలహీనవర్గాల మహిళలు జీవితంలో ఎదుర్కొనే ఆర్థిక,రాజకీయ, సామాజిక సమస్యలే ప్రధానంగా ఉంటాయి.ఆర్ధికకారణాలవలనకానీ ,వివక్ష వలన కానీ ఆడపిల్లలు చదువులకు దూరం కావటం తదితర సమస్యలను అక్షరీకరించాను.ఏది రాసినా నేను ఉద్యోగజీవితంలోగానీ,సమాజంలో గానీ పరిసరాల్లో గమనించినవీ,చూసినవీ ,పరిశీలించినవే నాదైన పద్ధతిలో రాస్తాను తప్ప నేలవిడిచి సాముచేయను. 3.మీరు ఏ ఏ ప్రక్రియల్లో రాశారు?  కవిత్వం,కథలు,నవలిక, వ్యాసాలు, మోనోగ్రాఫ్ లు రాసాను.కవిత్వంలో మూడు దీర్ఘకవితలు రాసాను. 4.మీకు ఇష్టమైన ప్రక్రియ ఏది?  చెప్పాలనుకున్నది సూటిగా, స్పష్టంగా చెప్పటానికి వీలౌతుంది కనుక కవిత్వరచనే నాకు ఇష్టమైన ప్రక్రియ 5.మీకు ఇష్టమైన రచనలేవి?  & 6.మీకు స్ఫూర్తిదాయకమైన రచనలు?  నాకు బాల్యం నుండీ స్పూర్తి ఇచ్చినవి రంగనాయకమ్మ రచనలు, కొడవటిగంటి కుటుంబరావుకవిత్వంలో శ్రీశ్రీ కవిత్వంలోని పదును,కుందుర్తి కవిత్వం లోని సరళత, లలిత సంగీతం ఇష్టం కనుక కృష్ణశాస్త్రి గేయంలోని లాలిత్యం నాకు ఇష్టమైనవి. 7.మీ రచనలకు ప్రేరణ?  ఈరోజుల్లో మనచుట్టూ ఎన్నో సంక్షోభాలూ సంఘర్షణలు,సందిగ్ధాలూ, వివక్షలూ మననీ,సమాజాన్నీ కల్లోలపరిచే సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో అక్షర రూపం కల్పించేవరకూ వెంటాడుతునే ఉన్నాయి కదా.వాటినన్నింటినీ చాలావరకూ అక్షరబద్ధం చేసాను. 8.మీ కుటుంబ నేపథ్యం?  నాది అందమైన బాల్యం కాదండీ.నా పదో ఏట నాన్నగారు చనిపోగా నలుగురు పిల్లలతో అమ్మ తీవ్ర ఆర్ధిక సంక్షోభం తో బతుకు పోరాటం మొదలు పెట్టింది.నా చదువు అంచెలంచెలుగా కొనసాగింది. డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే మేనత్తకొడుకు కవి ,రచయిత,చిత్రకారుడూ ఐన శీలావీర్రాజుతో దేవి పేరు తో సాహిత్య పరమైన ఆసక్తితో కలం స్నేహం కొన్నాళ్ళు నడిచింది.తర్వాత మా ఇష్టప్రకారం,పెద్దల అంగీకారం తో బహుభాషాకోవిదుడు రోణంకి అప్పలస్వామి గారి అధ్వర్యం లో సభావివాహం జరిగింది. బియస్సీ పూర్తి చేసుకున్నాక హైదరాబాద్ లో అడుగుపెట్టాను.చిన్నప్పుడు ఎదుర్కొన్న చదువుకు వచ్చిన అవరోధాల వలన నాకు ఉన్నత చదువులు చదవాలనీ,ఉద్యోగం చేసి ఆర్ధికస్వావలంబన సాధించాలనే కోరిక కుటుంబ ఒత్తిళ్ళలో వెంటనే కుదరక పోయిన తర్వాత్తర్వాత ఎమ్మేతెలుగు,ఎమ్మెస్సీ గణితం పట్టాలతోబాటూ బియిడీ చేసి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయిని గా చేరి పాతికేళ్ళ సర్వీసుచేసి ప్రధానోపాధ్యాయినిగా పదవీ విరమణ చేసాను. నా భర్త శీలా వీర్రాజు కవి,కథకుడు, నవలాకారుడు, చిత్రకారుడు.మా అమ్మాయి పల్లవి సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి కొంతకాలంగా పుస్తకాలకు ముఖచిత్రాలు, అప్పుడప్పుడు కవితలు రాస్తుంది.మా మనవరాలు ఆశ్లేష తెలుగు, ఇంగ్లీష్, సాహిత్యం బాగా చదువుతుంది. 9.మీ వృత్తి నేపథ్యం?  నేను ఆర్టీసి ఉన్నత పాఠశాల లో గణితోపాధ్యాయినిగా పనిచేసి ప్రధానోపాధ్యాయురాలిగా పదవీవిరమణ చేసాను.ఆ అనుభవంతోనే ఇస్కూలుకతలు రాసాను.ఇందులో పేదపిల్లలచదువుల అవరోధాలకు నేపథ్యాలు, కారణాలు ,స్కూల్ జరిగే అవకతవకలు,ఎయిడెడ్ పాఠశాలల పట్ల ప్రభుత్వవివక్ష మొదలైనవన్నీ కథలుగారాసాను‌.ఇవి తెలుగు విద్యార్థి పత్రికలో రెండున్నర సంవత్సరాల పాటు ధారావాహికగా వచ్చాయి.ఇందులోని ఒక కథ మహారాష్ట్ర ప్రభుత్వం ఏడవతరగతికి ద్వితీయభాష తెలుగువాచకం లో పాఠ్యాంశంగా చేర్చింది. 10.కుటుంబము - ఉద్యోగము - సాహిత్యము : వీటిని ఏవిధంగా బ్యాలెన్స్ చేసుకో గలిగారు?  పెళ్ళయ్యాక ఉమ్మడి కుటుంబంలో తీరిక చిక్కినప్పుడే రచనలు చేసేదాన్ని. డిగ్రీ అయిన తర్వాత పదేళ్లకు బియిడీ చేసి ఉద్యోగంలో చేరాను.అప్పటికే రెండు కవితా సంపుటాలు వచ్చాయి.ఇంటిపనుల్లోనూ,ఉద్యోగం బాధ్యతలు లోనూ నా లోలోపల సంఘర్షణలు అక్షరాల్ని అల్లుకోవటం మానలేదు.ఎప్పుడో ,ఏఅర్థరాత్రో పేపరు మీదకు అవి చేరేది.సమయాభావంవల్లే ఎక్కువగా కవితలే రాసాను. 11.మీరు ఎటువంటి వివక్షనైనా ఎదుర్కొన్నారా? నేను చదువుకునే రోజుల్లో కుల,ప్రాంత వివక్షలు అంతగా లేవేమో అనిపిస్తుంది.రాజకీయనాయకులు తమస్వార్థం కోసం మరింతగా జ్వలింపజేసారు.జండర్ వివక్ష పనివిభజనలో,పెంపకాలలోనే ఉండేవి కదా.ఉద్యోగాలలో సరేసరి.అప్పుడప్పుడు మనసు నొచ్చుకున్నా నన్ను నేను ఎప్పటికప్పుడు చెక్కుకుంటూ ఎదగటానికే ప్రయత్నించాను. 12.మీరచనల గురించి చెప్పండి? ఆకలినృత్యం (1980) మోళి(1982) తెగినపేగు(1986) ఆవిష్కారం(1986) ఒప్పులకుప్ప1992) యుద్ధం ఒక గుండెకోత(2001) ఏకాంత సమూహాలు(2004) బతుకుపాటలో అస్తిత్వరాగం (2009) నా ఆకాశం నాదే (2016)తొమ్మిది కవితా సంపుటాలు ‌ శీలా సుభద్రాదేవి సమగ్రకవిత్వం (1975-2009) యుద్ధం ఒక గుండె కోత దీర్ఘ కావ్వానికి 1.యుధ్ధం ఏక్ దిల్ కి వ్యధ (హిందీ2018) 2.War,A Heart's ravege(ఆంగ్లానువాదం2001) 3.Ullak kumural(తమిళానువాదం2020) 4. Dance of a Hunger(anthology of poems2021) 1.దేవుడుబండ(1990) 2.రెక్కలచూపు(2007) 3.ఇస్కూలుకతలు(2018)మూడు కథా సంపుటాలు, 4.నీడలచెట్టు నవలిక, ఇతరములు: 1.నాముందుతరం రచయిత్రుల కథల గురించి రాసిన 25 వ్యాసాల సంపుటి " కథారామం లో పూలతావులు" 2.డా.పి.శ్రీదేవి మోనోగ్రాఫ్ ( కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురణ2015) 3.నిడదవోలు మాలతి రచనా సౌరభాలు (2022) సంపాదకత్వం: 1.ముద్ర (వనితల కవితల సంకలనం భార్గవీరావుతో సంపాదకత్వం2001) 2.వాళ్ళు పాడిన భూపాలరాగం (డా.పి.శ్రీదేవికథలు2022) 3.యాభై ఏళ్ళ ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు(2022) 4.మధుకలశమ్(డా.పి.శ్రీదేవి కవిత్వం) 13.మీకు నచ్చిన మీ రచనలు? నిజానికి మనం కన్న పిల్లలలో ఎవరు ఇష్టం అంటే చెప్పటం ఎంతకష్టమో .ఇష్టమైన రచనల్ని చెప్పటం కూడా అంతేకష్టం. యుధ్ధం ఒక గుండె కోత దీర్ఘ కావ్యం నాకు బాగా నచ్చిన రచన.అమెరికా ఆఫ్ఘన్ యుధ్ధం నేపధ్యం లో మాతృదృక్పధంతో రాసినది.ఇది మూడు భాషల్లో అనువాదమై పుస్తకం రూపంలో వచ్చాయి.దీనిపై MKU లో నాగలక్ష్మి అనే అమ్మాయి MPhil పరిశోధన చేసింది.దీర్ఘకావ్యం రాసిన మొదటి కవయిత్రిగా నన్ను విమర్శకులు పేర్కొన్నారు. 14.రచన వ్యాసాంగంలో ఎదుర్కొన్న సమస్యలు ? ప్రధానంగా తొలిరోజుల్లో ఉమ్మడి కుటుంబం వల్ల, ఆతర్వాత ఉద్యోగం బాధ్యతలో రచనా వ్యాసంగం కొరకు సమయాన్ని సమకూర్చుకోవడం కష్టమయ్యేది.ఇప్పడు అలవాటైపోయింది. 15. మీరు అందుకున్న గౌరవాలు (పురస్కారాలు)? పురస్కారాలు::: 1.తెలుగువిశ్వవిద్యాలయంనుండి97 లో సృజనాత్మక సాహిత్యానికి పట్టాభిరామిరెడ్డి ఎండొమెంట్ అవార్డ్ 2. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి1999 లో ఉత్తమరచయిత్రి అవార్డ్ 3.కడప కవితా సాహిత్య సాంస్కృతిక సంస్థ నుండి రెక్కల చూపు కథలసంపుటికి 2011 లోగురజాడ అవార్డ్ 4.ఆవంత్స సోమసుందర్ గారి నుండి 2011 లో దీర్ఘకవిత్వానికి దేవులపల్లి రాజహంస కృష్ణశాస్త్రి పురస్కారం. 5.2018లోఉమ్మడిశెట్టి రాధేయ త్రిదశాబ్ది ప్రతిభా పురస్కారం. 6.2018లోకవిత్వానికి అమృతలత అపురూప పురస్కారం 7.2018లో"నా ఆకాశం నాదే" కవితా సంపుటి కి గంగిశెట్టి లక్ష్మినారాయణ గారి మాతృపురస్కారం 8.2022లో సుశీలానారాయణరెడ్డి పురస్కారం 9.2022 లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి మాతృపురస్కారం. 10.లేఖిని సాహిత్యసంస్థ నుండి వచ్చే కవిత్వానికి కుసుమారామారావు పురస్కారం చెప్పుకోవాల్సినవి. 16.ప్రస్తుత సాహిత్యంలో రాజకీయాలు ? ప్రతీ రంగంలోనూ సహజంగానే రాజకీయాలు ఉంటూనే ఉంటాయి.అవి సాహిత్యంలో ఇంకా గ్రూపులు గ్రూపులు గా విస్తరించాయి. 17.బహుళ పాఠకులకు, రచయితలకు మీ సలహాలు సూచనలు? కవిత్వం,కథలూ, వ్యాసాలు, సమీక్షలు, ఇంటర్వ్యూ లు ఇలా ఎన్నో శీర్షికలతో చాలారచనల్ని పొందుపరచి బహురచనలతో బహుళంగా ఉంటోంది.పాత, కొత్త రచయిత్రులను కూడగట్టటంవలన విభిన్నమైన అంశాల్ని ఆవిష్కరిస్తున్నారు.అందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. 18.రేపటి రచయితలకు, వర్ధమాన రచయితలకు మీరిచ్చే సలహాలు ఏమిటి?  ఇప్పుడు కొత్తగా రాస్తున్నవారికి గాని,రాయాలనుకున్నవారికి గానీ కొత్తగా చెప్పాల్సింది ఏమీలేదు.ఎందుకంటే వాళ్ళంతా విద్యావంతులు.టెక్నాలజీ తెలిసినవారు కావటాన వివిధ ప్రాంతాల,దేశాలరచనలు చదివే అవకాశం ఉంది.అందువలన దృక్పథం విశాలమౌతుంది.అయితే ముందు వారంతా బాగా సాహిత్యం అధ్యయనం చేయాలి.ఏం రాయాలనుకుంటున్నారో ఒక నిబద్ధతనీ, నిజాయితీనీ అలవరుచుకుని రాస్తే మంచిది. రాసినది అలాగే ప్రచురణకి ఇవ్వకుండా పదేపదే చదువుకుని సవరించుకుంటే సాంద్రమైన రచన వెలువడుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి