5, మార్చి 2023, ఆదివారం

ఆధిపత్యాలపై ధిక్కార స్వరం -కె.రామలక్ష్మి

ఆధిపత్యాలపై ధిక్కార స్వరం రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి , ఒకప్పుడు పద్మావతి విశ్వవిద్యాలయం వీసీగా ఉన్న కోలా రాజ్యలక్ష్మి 1980లలో కలిసి జంటనగరాల్లో రచయిత్రులను కూడగట్టి ఒక్కొక్క నెలా ఒకరి ఇంట్లో కలుసుకొని వస్తున్న సాహిత్యాన్ని గురించి చర్చించేవారు.సీతాదేవిగారివలన నేను అప్పటికి చిరురచయిత్రినే అయినా నన్ను అందులో సాహిత్య చర్చలకు ఆహ్వానించేవారు.కొంతకాలం తర్వాత ఆసమావేశాలు సఖ్యసాహితి అనే సంస్థ గా పరిణమించాయి .సఖ్యసాహితిలో యశోదా రెడ్డి,ఆనందారామం,తురగా జానకీరాణి వంటి ఒకతరం సాహితీ దిగ్గజాలు ఉండేవారు.అప్పట్లోనే రామలక్ష్మిగారిని మొదటిసారి చూసాను.రామలక్ష్మి గారి స్నేహితులు డా.శాంతగారిని,కల్పకంగారి(ఏచూరి సీతారాం గారి తల్లి)నీ కూడా కలిసాను. లేఖిని సాహిత్య సంస్థ ఒకసారి తెలుగు విశ్వవిద్యాలయం తో కలిసి రచయిత్రుల రచనల గురించి సదస్సు నిర్వహించాలనుకున్నప్పుడు నేను రామలక్ష్మి గారి కథలగురించి ప్రసంగిస్తానన్నాను. ఆసందర్భంగా రామలక్ష్మి గారితో ఆవిడ కథలమీద వ్యాసం రాయాలనుకున్నానని చెప్తే చాలా సంతోషపడి రెండు కథలపుస్తకాలు ఇచ్చారు.నేను రచయిత్రుల కథలగురించి రాయాలనుకున్నది,రాసిన మొట్టమొదటి వ్యాసం రామలక్ష్మి కథలగురించే.వ్యాసం చూపించితే బాగారాసావోయ్ అని ప్రశంసించారు. ఆ తర్వాత నా ముందుతరం ఇరవైరెండు మంది రచయిత్రుల పై వ్యాసాలు రాసి సంపుటీకరించాను. 1950ల్లో సుప్రసిద్ధ సాహిత్య పత్రిక సంపాదకవర్గంలో రామలక్ష్మి ఉండేవారు. అదేకాలంలో మాపెద్దక్కయ్య పి.సరళాదేవి కథలు ఎక్కువగా ఆ పత్రికలో వెలువడేవి .ఆ కారణంగా రామలక్ష్మి కి నేను సరళాదేవి చెల్లెలుగా తెలుసు. శీలావీర్రాజు భార్యగానూ తెలుసు. మేము మలకపేటలో ఉన్నప్పుడు మాయింటికి దగ్గరలోనే ఉండేవారు.నేను తరుచూ కలిసేదాన్ని.వాళ్ళింటికింద ఇంట్లో అబాకస్ టీచర్ ఉండేవారు.మా మనవరాలిని అక్కడకి తీసుకు వెళ్ళినప్పుడు క్లాసు అయ్యేవరకూ రామలక్ష్మిగారి దగ్గర కి వెళ్ళే దాన్ని.ఎన్నెన్ని కబుర్లో చెప్పేవారు.ఒక గంట ఎంత తొందరగా గడచిపోయేదో!ఆమె తన తరం వారి గురించి అనర్గళంగా ఎన్నో విషయాలు చెప్తుంటే సమయం తెలిసేది కాదు. నాకు ఎంతో ఇష్టమైన కవి శ్రీశ్రీ గురించి తాగుబోతు గా చెప్తుంటే బాధకలిగించింది కాని నిజాల్ని ఒప్పుకోవాలి కదా! ఒకసారి రామలక్ష్మిగారికి పొట్ట ఆపరేషన్ అయ్యిందట.ఆపరేషన్ చేసిన తర్వాత ఆ డాక్టర్ " మీ పొట్టనిండా అక్షరాలే ఉన్నాయని ఆరుద్ర గారు అన్నారు.ఒక్క అక్షరం ముక్కా లేదు రామలక్ష్మిగారూ" అన్నాడు"అని చెప్తూ నవ్వారు.అదివిన్నాక ఎప్పుడు తలచుకున్నా నవ్వొస్తూ ఉంటుంది కేంద్ర సాహిత్య అకాడమీ కోసం డా.పి.శ్రీదేవి మోనోగ్రాఫ్ రాయమని నాకు ఉత్తరం వచ్చినప్పుడు రామలక్ష్మిగారిని కలిసాను.శ్రీదేవి మా పెద్దక్కయ్య కు కుటుంబమిత్రులు.కానీ అక్కయ్యా లేదు కనుక శ్రీదేవి వివరాలు చెప్పగలిగేది రామలక్ష్మి గారే.అదే విషయం ఆమెకు చెప్పి "శ్రీదేవి గురించి మీకు తెలిసిన వివరాలు చెప్తారా" అని అడిగాను.నేను చెప్పేవి నెగెటివ్ గా ఉంటాయి నీకు ఇష్టమేనా అన్నారు.అయితే వద్దులెండి అని వచ్చేసాను. ఆమెకు పత్రికా రంగంలోనూ,సినిమారంగంలో ను, సామాజిక సేవారంగంలో ను, సాహిత్య రంగంలోనూ, రాజకీయరంగంలోను ఇలా అనేక అనుభవాలు ఉండటంవలన వాటిల్లోని లొసుగుల్ని అనర్గళంగా చెప్పేవారు.ఎదురుగా ఉన్నవారికి కొన్ని విషయాలు నచ్చినా నచ్చకపోయినా ఆమె తన మనసులో మాటను,తన అభిప్రాయాన్ని చెప్పటానికి జంకరు.తనని అందరూ గయ్యాళి నని అంటారని కూడా తానే నవ్వుతూ చెప్పుకుంటారు.నిర్భయంగా ఉన్నది ఉన్నట్లు నిష్కర్షగా చెప్పకమానరు.అందుచేత కొంతమంది ఆమెకు దూరమయ్యారు.నిజానికి ఆమె రచనావ్యాసంగంలో చురుగ్గా ఉన్న ఆకాలంలో ఆయారంగాలలో పురుషాధిక్యత మరింత ఎక్కువ .వాటిని తట్టుకొని నిలదొక్కుకోవాలంటే ధిక్కార స్వరం ఉండక తప్పదేమో. ప్రతీ ఒక్కరి గురించి అందులోనూ సినీ, సాహిత్య రంగంలో లోని వారి మంచికన్నా వాళ్ళ ప్రవర్తనలోని దుర్గుణాలను వాళ్ళరెండుముఖాలను వేరు చేసి నిర్భయంగా చూపించేవారు.ఆవిడ నెగెటివ్ గానే మాట్లాడుతున్నట్లు అనిపించినా ఆవిడ లోని పాజిటివ్ నెస్ మనం స్పష్టంగా గుర్తించగలం.కదలడానికి కాళ్ళు సహకరించకపోవటంవలన చాలా కాలంగా వీల్ చైర్ కే పరిమితం అయినా అన్నింటికీ ఒకరిపై ఆధారపడాల్సి వచ్చినా సాహిత్యం,సినీరంగం పత్రికలూ వీటి గురించి తప్ప తన శారీరక అసహాయత్వం గురించి గానీ ,అనారోగ్యాల గురించి గానీ ఒక్కసారి తలంచేవారు కాదు.ఆ వయసులో కూడా అంత హాస్యంగా,చమత్కారాలతో సానుకూల దృక్పథంతో మాట్లాడటం వలన ఆమెతో మాట్లాడుతున్నంతసేపూ హాయిగా ఆహ్లాదంగా ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా నిజం. ఒకసారి జూన్ నాలుగు ఆరుద్ర జన్మదిన సందర్భంగా ఆయన పుస్తకం ఆవిష్కరణ అని నాతో సహా ఒక పదిహేను మంది రచయిత్రులను ఇంటికి పిలిచారు.ఆరుద్రగారి పాటలతో కబుర్లతో సందడిగా గడిపాము. తర్వాత కూడా మరో రెండుసార్లు ఒకరిద్దరు ఆత్మీయులతో కొన్ని గంటలు గడపటం జరిగింది. పదేళ్ళ క్రితం మేము ఇల్లు మారటంతో రామలక్ష్మి గారిని కలవటం కుదరలేదు.నా వ్యాససంపుటిని ఆమెకు ఇవ్వటానికి వెళ్ళలేక మా అమ్మాయితో పంపాను.అదిఅందుకున్నాక ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడారు.తర్వాతైనా వెళ్ళాలను కొని కూడా అశ్రద్ధ చేసాను. ఇప్పుడు ఈ విధంగా రామలక్ష్మి గారితో నా అనుబంధం తలచు కొని ఆమెకు నివాళి సమర్పించ వలసిరావటం బాధాకరం. ఒకతరంలో తన రచనలతో,తన వాగ్ధోరణితో,ఖచ్చితమైన దృక్పథంతో సాహిత్య కళారంగాలలో సంచలనం కలిగించిన సాహితీ దిగ్గజం తరలిపోయింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి