23, ఫిబ్రవరి 2023, గురువారం

సంచిక లో శ్రీ కేఎల్వీప్రసాద్ చేసిన ముఖాముఖి

* సుభద్రా దేవి గారూ ..సంచిక అంతర్జాల పత్రిక పక్షాన మీకు స్వాగతం..నమస్కారం . జ:-నమస్కారం ప్రసాద్ గారూ *రచనా వ్యాసంగం పట్ల మీకు దృష్టి ఎప్పుడు,ఎలా మళ్లింది ?దాని నేపద్యం వివరించండి. జ:-మా పెద్దక్క పి.సరళాదేవి తెలుగు స్వతంత్రలో విరివిగా రచనలు చేసేది.మాలతీచందూర్, పి.శ్రీదేవి, రామలక్ష్మిల సమకాలీనురాలు. డా.శ్రీదేవి అక్కకు మంచి మిత్రురాలు.నేను కుటుంబ పరిస్థితులవలన ఎనిమిదవతరగతితో చదువు మానేసి ఏడాది పాటు గోపన్నపాలెం అక్క ఇంట్లో ఉన్నప్పుడు బడికి వెళ్ళకపోవటం వలన అక్క ఇంట్లోని గ్రంథాలయం లో శ్రీపాద, చలం, కొడవటిగంటి కుటుంబరావు వంటి ప్రముఖుల రచనలేకాక అనేక అనువాద గ్రంథాలు కూడా అర్థం అయినా కాకపోయినా విరివిగా చదివాను.నేను రచయిత్రీగా మారటానికి దోహదం చేసింది అక్క వాళ్ళింట్లో ఉన్న సమయమే అనుకుంటాను.ఒకరోజు ఏలురులో ఆంవత్స సోమసుందర్ గారికి జరిగిన సత్కారసమావేశంకి అక్కతో పాటూ వెళ్ళాను.సభానంతరం ఒక సాహితీ మిత్రుడి ఇంటి డాబా పైన వెన్నెల్లో కవితా గోష్ఠి జరిగింది.ప్రముఖకవులకంఠంలో కవిత్వం వినటం నాకు అద్భుతంగా అనిపించింది.అంతవరకూ కథలూ,నవలలూ చదివాను.ఇంటికివెళ్ళాక కవిత్వం పుస్తకాలు అక్కని అడుగుతే శ్రీశ్రీ మహాప్రస్థానం, కృష్ణశాస్త్రి ఊర్వశి,ముద్దుకృష్ణ వైతాళికులు ఇచ్చింది.అందులో నాకు నచ్చినవి ఒక పుస్తకంలో కాపీ చేసుకున్నాను. * మీరు చదువుకునే రోజుల్లొ ,భవిష్యత్తులో మంచి రచయిత్రి కావాలని కోరుకున్నారా ?లేక యాదృశ్చికంగా ఈ నాటిస్థాయికి చేరుకున్నారా ? జ:-అక్క ఇంటినుండి తిరిగి విజయనగరం చేరిన తొమ్మిదవ తరగతి లో చేరాను.మా తెలుగు మాష్టారు ఛందస్సు చెప్తే ఆటవెలది లో మాష్టారు మీద పద్యం రాసి చూపిస్తే ఆయన పొంగిపోయి నువ్వు మంచి కవయిత్రి అవుతావని దీవించారు.మాష్టారు ఒక లిఖిత పత్రికను మొదలు పెడితే అందులో పద్యాలు,కవితలూ రాసేదాన్ని.అందులో ఒకటి "నాబొమ్మే నా చెల్లి" అని పదకొండు ద్విపద పద్యాల్లో రాసాను.బహుశా నా దీర్ఘ కవితా ప్రస్థానానికి అది తొలిమెట్టు కావచ్చు. మా అక్కనీ,అన్నయ్యలనీ రచయితలుగా చూస్తూ ఉండటం వలన మనసులో ఏమూలో రచయిత్రి కావాలనే కోరిక రెక్కవిప్పుకొనే వుంటుంది. * మీ పుట్టినిల్లు ,మెట్టినిల్లు ,సాహిత్య వాతావరణం పుష్కలంగా కలిగి ఉన్న విశయం అందరికి తెలిసి న ,విషయమె !మీరు గొప్ప రచయిత్రిగా ఎదగ డానికి ఎక్కడ వీలయింది ?ఎందు చేత ? జ:-చిన్నప్పుడు అక్క పంపిన బొమ్మలపుస్తకాలూ,అన్నయ్య కొన్న చందమామ,వారపత్రికలూ నేను చాలా చిన్నప్పుడే పఠనాసక్తిని పెంచాయి.అక్కయ్య,అన్నయ్యలకథలు పత్రికల్లో పడినప్పుడు కాలేజీరోజుల్లో నాకూ రాయాలనే కోరిక పెరిగింది.అప్పట్లోనే కొన్ని కథలు రాసాను. వీర్రాజు గారు పరిచయం అయ్యాక పత్రికలకు పంపాను.పెళ్ళికి ముందే 1970 లో మొదటికథ ప్రచురితం అయ్యింది. పంపిన నాలుగైదు కథలు ప్రచురితం అయ్యాయి ఉమ్మడి కుటుంబంలో కథ రాసేంత సమయం సమకూర్చుకోలేక రాయలేక పోయాను.ఆరేడేళ్ళు గడిచాక మళ్ళా రాయటం మొదలుపెట్టాను.తర్వాత మరి వెనక్కి చూడలేదు.రాస్తూనే ఉన్నాను. * మీరు కథలు రాశారు ,కవిత్వం రాశారు ,వ్యాసాలు రాస్తున్నారు .కానీ మీ కలం కవిత్వం వైపు మొగ్గు చూపుతుందని మీ రచనలను గమనిస్తున్న నాబోటి పాఠకులకు అనిపిస్తుంది.ఇది నిజమేనా ?ఎందు చేత ? జ:-పెళ్ళయ్యాక ముఖచిత్రాల కోసం కవులు రావటం, కవితా సంపుటాలు ఎక్కువగా ఉండటంతో కవితలు రాయటానికి మొగ్గుచూపాను.చిన్న స్పందన చాలు కవిత రాయటానికి .కానీ కథరాయాలంటే మంచి అంశం,పాత్రలూ,సంఘటనలూ, సంభాషణలు, ఆకట్టుకునే ముగింపు.ఇవన్నీ ఆలోచించే సావకాశం లేక అరుదుగా కథలు రాసాను. * మీరు " ఇస్కూలు కథలు "అనే కధాసంపుటి వెలువరించారు .ఈ కథలు రాయడానికి మిమ్ము లను ప్రేరేపించిన అంశాలు ఏమిటి ? జ:-మాది ఎయిడెడ్ పాఠశాల కావటం వలన విద్యార్థులందరూ ఆ పరిసరాల్లోని బస్తీలో పిల్లలే.వాళ్ళతో కలిసి మెలిసి ఉండటంలో వాళ్ళకుటుంబనేపధ్యాలు,ఆడపిల్లలచదువులకు కలిగే అవరోధాలూ,వారిపై ప్రభావాలూ, ఉపాధ్యాయులు,ఇతర సిబ్బందుల తీరుతెన్నులు ఇవన్నీ పాఠశాల అభివృద్ధిపై,విద్యపై చూపే ప్రభావాలని కథలుగా రాయాలనుకున్నాను.తెలుగువిద్యార్థి మాసపత్రిక రెండున్నర సంవత్సరాలు నా ఇస్కూలుకతలను ధారావాహికగా ప్రచురించింది.అందులో మొదటి కథ మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ద్వితీయ భాష తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా తీసుకుంది. * దీర్ఘ కవితల ద్వారా మీరు మంచి పేరు సంపాది 0 చారు. అయితే ఈ ప్రక్రియకు భవిశ్యత్తు ఉంటుందంటారా ? ఎందుచేత ? జ:-లఘుకవితలైన హైకూలు, మినీ కవితలు అప్పటి కప్పుడు చమక్మనిపిస్తాయి.కానీ అవి కవితా రంగంలో ఎక్కువకాలం నిలవవని నా అభిప్రాయం.ఒకటిరెండు పేజీల కవితా ఖండికలు ఒక విషయాన్ని,ఒక సందర్భాన్ని గూర్చి పాఠకుల్ని ఆలోచింప చేయగలవు.ఇక మొదటినుంచీ చివరివరకూ ఒక సుదీర్ఘ అంశాన్ని డీవియేట్ కాకుండా దీర్ఘ కవితగా కవిత్వీకరించటంలోనే కవి ప్రతిభ తెలుస్తుంది. *మీరు వీర్రాజు గారి జీవితంలో ప్రవేశించెనాటీకె ఆయన సాహిత్య రంగంలోనే కాక ,చిత్రకారునిగా మంచి పేరు పొందారు .చిత్ర కళలో మీకు అప్పటికె ప్రవేశం ఉన్నప్పటికీ ,ఎందుకో మీరు నిర్లక్ష్యం చేసి నట్టు కనిపిస్తుంది .అలా ఎందుకు జరిగింది ? ఏమైనా ,ప్రత్యేక కారణాలున్నాయా ? జ:- చిన్నప్పటినుంచి బొమ్మలపుస్తకాలలోని చిత్రాలు చూసి వేసేదాన్ని.చిన్నప్పుడు ఢిల్లీ శంకర్స్ వీక్లీ వారి చిత్రలేఖనపోటిలో కూడా పాల్గొన్నాను. తర్వాత వారపత్రికలోని బాపూ బొమ్మల్ని అత్యంత ప్రేమతో వేసేదాన్ని.పెళ్ళయ్యాక వీర్రాజు గారు ప్రోత్సహించారు కానీ ఏకాగ్రతతో దీక్షగా వేయాల్సిన కళ చిత్రలేఖనం.పిల్లలతో ఉమ్మడి సంసారం లో ఎక్కడ కుదురుతుంది? వీర్రాజు గారు తైలవర్ణ చిత్రాలు వేస్తున్నప్పుడు నాకు వేయాలనిపించేది రిటైర్ అయ్యాక వేయాలనుకున్నాను.స్కెచ్ బుక్ కూడా కొనుక్కొని ఒకటి రెండు పెన్సిల్ స్కెచ్ వేసాను.అక్షరాలు రాయటం అలవాటైన వేళ్ళు చిత్రాలవైపు సాగటం లేదు. *ఈ మధ్య అంతర్జాల పత్రికల దే ' హవా' అన్నట్టుగా వుంది.తెలుగు సాహిత్య పురోగతికి ఇవి ఎంత వరకు ఉపయోగ పడుతున్నాయి ?మీ అబిప్రాయం చెప్పండి. జ:- పుస్తకం ప్రచురణ,అమ్మకం కూడా సాహితీవేత్తలకు మోయలేని భారమయ్యింది.వేసిన పుస్తకాల్ని అమ్ముకోవటం కూడా ఒక కళగా మారింది.ప్రింట్ పత్రికలు తగ్గిపోయాయి కనుక సాహిత్య కారులందరూ తమ రచనలకు ఒక వేదిక కావాలి. కనుక అటువైపు చూడటం మొదలు పెట్టారు.టెక్నాలజీ తెలిసినవారు అంతర్జాల పత్రికలు అనుసరిస్తారు. అయితే ఎప్పటిలాగే రకరకాల రచనలు అంతర్జాల పత్రికలలో వస్తున్నాయి.కాలగతిలో ఏవి నిలుస్తాయో కాలమే నిర్ణయించాలి.ప్రతీ వాటికీ వాటి పాఠకులు వారికి ఉంటారు కదా. * వృత్తికి ,ప్రవృత్తికి ,మీరు ఎలా న్యాయం చేయగలిగారు ?ఏవైనా సమస్యలు ఎదుర్కొన్నారా వాటిని ఎలా పరిష్కరించుకోగలిగారు ? జ:-వృత్తీ, ప్రవృత్తి రెండూ వేర్వేరు ఛానల్స్.స్కూల్లో,విద్యార్ధుల్లో, వారి నేపధ్యాల్లో బోధనేతర పనుల్లో( సర్వే),జీవితపోరాటాల్లో నేను ఎప్పటికప్పుడు నాకు రచనలకు కావలసిన అంశాల్ని ఏరుకునే దాన్ని.నాకు సమయం కుదిరినప్పుడు ఎక్కువగా కవితలుగా రాసేను.కొన్నింటిని కథలుగా రాసాను.నాకు ఆ రోజుల్లో ప్రధాన సమస్య సమయమే.అందులోను నేను ఎక్కువగా రాసేది రాత్రి పూటే. * కథకు గాని ,కవిత్వానికి గాని ,ఎలాంటి వస్తువుని తీసుకోవడానికి మక్కువ చూపుతారు ?ఎందు చేత ? జ:-చిన్న స్పందన గాని,ముల్లులా గుచ్చుకునే సన్నని బాధగానీ,మనసుని కల్లోలపరచే సమాజంలోని సంక్షోభసందర్భాలు కానీ నన్ను కవిత రాయకుండా ఉండలేని పరిస్థితిని కల్పిస్తాయి.కథరాయాలంటే వస్తువు సంఘటనలనీ,దృశ్యాల్నీ, పాత్రల్ని సమకూర్చుకునేలా ఉండి ఆకట్టుకునే ముగింపు చేయగలిగినప్పుడే రాస్తాను.అందుకే నేను కథలు తక్కువ రాసాను. * శ్రీ శీలావీ -మీరు ,సాహిత్య రంగంలో మంచి పేరు సంపాదించుకున్నారు.సాహిత్య పరంగా మీకు వారసులున్నారా ?వారి గురించి చెప్పండి. జ:- మా అమ్మాయి పల్లవి తెలుగుకన్నా ఆంగ్ల సాహిత్యం ఎక్కువగా చదువుతుంది.సాఫ్ట్ వేర్ ఉద్యోగంతో రాయటానికి ప్రయత్నించలేదు.ఆరేళ్ళక్రితం ఉద్యోగం మానేసి ఎమ్మే ఇంగ్లీష్,జర్మన్ భాష సర్టిఫికేషన్ చేసింది.గత ఏడాదిగా తెలుగు సాహిత్యం చదువుతూ కవితలూ, ఆర్టికల్స్ రాస్తోంది.అనువాదాలు చేయాలనుకుంటుంది.మా మనవరాలు తెలుగు పుస్తకాలకన్నా ఆంగ్ల సాహిత్యం విపరీతంగా చదువుతుంది. తర్వాత ఎప్పుడో సాహిత్యం లోకి వస్తుందేమోనని చిగురాశ. * అనువాద ప్రక్రియ పై మీ అబిప్రాయం ఏమిటి ? అనువాదంకు నోచుకున్న మీ రచనల గురించి వివరించండి. జ:- వీర్రాజు గారి నవల మైనా,నాదీర్ఘకవిత యుధ్ధం ఒక గుండె కోత ఆంగ్ల,హిందీ,తమిళ భాషల్లోకి అనువాదమై గ్రంధరూపంలోకి వచ్చాయి.వీర్రాజు గారి కథా సంపుటి,నా కవితా సంపుటి ఆంగ్లానువాదపుస్తకాలు వెలువడ్డాయి.మా ఇద్దరి రచనలూ కన్నడ,మైధిలీ వంటి ఇతరభాషలలోకీ అనువాదమయ్యాయి.ఇతరభాషలనుండి తెలుగు లోకి వచ్చినంతగా తెలుగు పుస్తకాలు ఇతరభాషల్లోకి వెళ్ళలేదు.అనువాదం కావటం ఒక ఎత్తైతే వాటిని సమర్థవంతంగా ఇతరరాష్ట్ర సాహితీ వేత్తల దృష్టిలో పడేలా ప్రచారం చేసుకోవటం మరో ఎత్తు. అది మాకైతే చాతకాలేదు. * మీరు ప్రకటించిన పుస్తకాల వివరాలు చెప్పండి జ:-ఆకలినృత్యం (1980) మోళి(1982) తెగినపేగు(1986) ఆవిష్కారం(1986) ఒప్పులకుప్ప1992) యుద్ధం ఒక గుండెకోత(2001) ఏకాంత సమూహాలు(2004) బతుకుపాటలో అస్తిత్వరాగం (2009) నా ఆకాశం నాదే (2016)తొమ్మిది కవితా సంపుటాలు ‌ శీలా సుభద్రాదేవి సమగ్రకవిత్వం (1975-2009) యుద్ధం ఒక గుండె కోత దీర్ఘ కావ్వానికి 1.యుధ్ధం ఏక్ దిల్ కి వ్యధ (హిందీ2018) 2.War,A Heart's ravege(ఆంగ్లానువాదం2001) 3.Ullak kumural(తమిళానువాదం2020) 4. Dance of a Hunger(anthology of poems2021) 1.దేవుడుబండ(1990) 2.రెక్కలచూపు(2007) 3.ఇస్కూలుకతలు(2018)మూడు కథా సంపుటాలు, 4.నీడలచెట్టు నవలిక, ఇతరములు: 1.నాముందుతరం రచయిత్రుల కథల గురించి రాసిన 25 వ్యాసాల సంపుటి " కథారామం లో పూలతావులు" 2.డా.పి.శ్రీదేవి మోనోగ్రాఫ్ ( కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురణ2015) 3.నిడదవోలు మాలతి రచనా సౌరభాలు (2022) 4.గీటురాయిపై అక్షర దర్శనం(నారచనలపై వచ్చిన సమీక్షల సంకలనం) సంపాదకత్వం: 1.ముద్ర (వనితల కవితల సంకలనం భార్గవీరావుతో సంపాదకత్వం2001) 2.వాళ్ళు పాడిన భూపాలరాగం (డా.పి.శ్రీదేవికథలు2022) 3.యాభై ఏళ్ళ ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు(2022) 4.మధుకలశమ్(డా.పి.శ్రీదేవి కవిత్వం) *మీరు పొందిన అవార్డులు వగైరా.... జ:-1.లేఖిని సాహిత్యసంస్థ నుండి వచ్చే కవిత్వానికి కుసుమారామారావు పురస్కారం 2.తెలుగువిశ్వవిద్యాలయంనుండి97 లో సృజనాత్మక సాహిత్యానికి పట్టాభిరామిరెడ్డి ఎండొమెంట్ అవార్డ్ 3. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి1999 లో ఉత్తమరచయిత్రి అవార్డ్ 4.కడప కవితా సాహిత్య సాంస్కృతిక సంస్థ నుండి రెక్కల చూపు కథలసంపుటికి 2011 లోగురజాడ అవార్డ్ 5.ఆవంత్స సోమసుందర్ గారి నుండి 2011 లో దీర్ఘకవిత్వానికి దేవులపల్లి రాజహంస కృష్ణశాస్త్రి పురస్కారం. 6.2018లోఉమ్మడిశెట్టి రాధేయ త్రిదశాబ్ది ప్రతిభా పురస్కారం. 7.2018లోకవిత్వానికి అమృతలత అపురూప పురస్కారం 8.2018లో"నా ఆకాశం నాదే" కవితా సంపుటి కి గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి మాతృపురస్కారం 9.2022లో సుశీలానారాయణరెడ్డి పురస్కారం 10.2022 లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి మాతృపురస్కారం.ఇవి చెప్పుకోదగినవి. ఇంత శ్రధ్ధగా నన్ను పరిచయం చేసినందుకు మీకు, సంచిక అంతర్జాల పత్రిక నిర్వాహకులకు ధన్యవాదాలు. *** * శీలా వీర్రాజు గారి రచనలపైగానీ,మీ రచనలపై గానీ విశ్వవిద్యాలయాలలో పరిశోధనలేమైనా జరిగాయా తెలియజేయగలరు జ:- శీలా వీర్రాజు గారి రచనలపై వివిధ విశ్వవిద్యాలయాల్లో మూడు MPhil పరిశోధనలూ,ఒక PhDపరిశోధన జరిగాయి. నా మొదటి కవితా సంపుటి ఆకలినృత్యంపై,యుధ్ధం ఒక గుండె కోత పై మధురకామరాజు విశ్వవిద్యాలయం లోనూ,రెండు కవితాసంపుటాలపై ఆంధ్రావిశ్వవిద్యాలయంలోనూ మూడు MPhil పరిశోధనలూ,నా సమగ్రకవిత్వంపై నాగార్జున విశ్వవిద్యాలయం నుండి,ఉస్మానియా విశ్వవిద్యాలయంనండీ ఇద్దరు PhD పరిశోధనలూ చేసారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి