26, జూన్ 2025, గురువారం
అసీతినెలబాలుడు విహారి
అశీతి నెలబాలుడు-విహారి
ఒక సాహితీవేత్త జీవితాన్నీ, సాహిత్యాన్నీ పరామర్శించాలంటే వారి సమగ్ర సృజన అధ్యయనం చేయాలి. కానీ విహారి అనే పేరుతో సాహిత్య రంగంలో నమోదు అయిన జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తిగారు చేసిన కృషి అనన్య సామాన్యం, 1962లో 'చుక్కాని' పత్రికలో ప్రచురితమైన 'రాగజ్యోతి' కథతో మొదలుపెట్టి పద్నాలుగు కథా సంపుటాలు వెలువరించారు. ఆరు నవలలు సాహిత్య రంగానికి అందించారు. ప్రముఖుల సాహిత్యం గురించే కాక యువతరం వారిని కూడా వెన్నుతట్టి ప్రోత్సాహం ఇస్తూ సాహిత్య పరామర్శ చేయటం గుర్తించదగినది. గురజాడ మొదలుకొని నేటితరం కథకుల వరకు కుల, మత, ప్రాంత భేదం లేకుండా అన్ని సాహిత్య వాదాలనూ, ఆయా కథకుల కథలన్నింటినీ చదివి సమగ్రమైన వ్యాసాలు రాశారు. నొప్పింపక తానొవ్వక అన్నట్లుగా కథకుని కథలలోని వస్తు రూపాల్ని శైలి శిల్పాలనూ, భాషా విషైక విశేషాలను విశ్లేషిస్తూ సుమారు 300 మంది కథకులపై రాసిన ఈ విశేషవ్యాసాల్ని పదిహేను సంపుటాలుగా ప్రచురించారు. ఇవి ఒక వ్యక్తి చేయలేని ఈ సంపుటాలు విశ్వవిద్యాలయాలలో పరిశోధకులకు ఉపయుక్తంగా ఉన్నాయి.
2013లో 'ఆనాటి కథలు- ఆణిముత్యాలు' శీర్షికతో అపురూపమైన శ్రీపాద, వట్టికోట ఆళ్వారుస్వామి, చలం, కనపర్తి వరలక్ష్మమ్మ మొదలైన ప్రముఖుల ఆణిముత్యం వంటి కథలను వారి గుణ విశేషములను కొత్తతరం: రచయితలకు ఉపయోగపడేలా పరిచయం చేశారు.
సుమారు అరవై ఏళ్లుగా చేస్తున్న సాహిత్య వ్యవసాయంలో 300కు పైగా రాసిన కథలన్నీ కూడా సమాజాన్ని పరిశీలించినవే. చదువు విలువని తెలియజెప్పి 'అక్షరం', రాజకీయ మోహంతో పట్టని వ్యక్తుల కథ 'అమ్మ వెనక చీకటి', 'ఆ తల్లికేం కావాలి' వంటి తల్లి వేదననీ, వాత్సల్యాన్ని, వృద్ధాప్యాన్ని సమస్యల్ని తెరిచి చూపే కథలు, డబ్బు వెనక పరుగులు తీసే పిల్లలు, కథలన్నింటా జీవితాన్ని ప్రవహింప చేసేలా సున్నితమైన భావ ప్రకటన వీరి సొంతం. సరళ సంభాషణలు మానవీయ విలువలు, కుటుంబ, ఆర్ధిక సంబంధాలు ఇలా అపారమైన కథా వాహినిలోని కథల గురించి చెప్పుకుంటే ఒక పుస్తకాన్నే రాయొచ్చు. ఇప్పటికీ కూడా కొత్తవారితో సమానంగా విహారి గారి కలం తాజాగా పోటీలలో కూడా కథలను రాస్తుందంటే విహారి గారి సృజన ఎంత నవనవోష్మంగా ఉందో అర్థమవుతుంది.
మరో ముఖ్య విషయమేమంటే, చాలామంది కథకులలాగా విహారిగారు తన కథలలో సమాజంలోని అవకతవకలపై కత్తి ఝుళిపించరు. చాలా సహనంతో ఒక్కొక్క పొరనే విప్పుతూ సమాజాన్ని చూపుతారు. సమాజంలోని వ్యక్తుల బాధ్యతల్ని ఎత్తి చూపి గుర్తు చేస్తారు. చెప్పదలచుకున్న సిద్ధాంతాల్ని సహృదయంతో పాఠకులు స్వీకరించే పంధాలో ఒప్పిస్తూ కథనీకరించడం వీరి రచనా విధానం, విహారి గారు చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు ఆఖరికి 6500 పద్యాలతో 'శ్రీ పదచిత్ర రామాయణం' రచించి బృహత్ గ్రంథ రూపంలోకి తీసుకువచ్చారు.
విహారి గారి అపార సాహితీ సంపదని విశ్లేషించటం అసాధ్యం, అందువలన నేను కవిత్వానికే పరిమితమై నాకు అత్యంత ప్రీతిపాత్రమైన దీర్ఘ కవిత 'చేవ్రాలు' గూర్చి పరామర్శించే దలిచారు.
విహారి గారు ఇప్పటికీ వెలువరించిన చలనమ్ కలం కన్ను, మనం మనం.. 'మధ్య మా గతి' అనే సంపుటాలు కాక 'చీకటి నాణెం' అనే దీర్ఘ కవిత అంతకుముందు వెలువరించిన కవిత్వ గ్రంథాలు ఇటీవల వెలువరించిన దీర్ఘకవిత చేవ్రాలు, దీనికి టాగ్ లైన్ గా 'వ్యక్తిత్వం' -"వికసనం' అని పేరు పెట్టటంలోనే ఒక ప్రత్యేకత చూపారు.
''గుండె గొంతులోన కొట్లాడినట్లు విహారి గారిని ఒక చోట నిలకడగా కూర్చోనీయకుండా పదేళ్ల మధనంగా బయటపడింది ఈ చేవ్రాలు దీర్ఘకవిత. ఇందులో ప్రవేశిక, ప్రారంభిక, లోనారసి,ఋణరేఖ,వికసనం అని అయిదు అధ్యాయాలుగా విభజించినా, అతిపెద్ద అధ్యాయంగా, ముఖ్యమైనదిగా మూడవది ఉన్నా ఇంకా పాఠకులకు మరింత హృదయంగమంగా ఉండటానికి కావచ్చు.. లేదా పాఠకులు రచనలోకి మమేకం కావాలనే ఉద్దేశ్యం కావచ్చు.. కవి మధ్య మధ్య హెడ్డింగులు పెట్టి సులభ గ్రాహ్యం చేసేరు.
ఒక వ్యక్తి మానసిక వికననం అతడు పెరిగిన వాతావరణంపైనా, ప్రభావితం చేసే మిత్రుల పైనా,చదువు నేర్పిన గురువుల పైనా, చదివిన చదువులపైనా ఆధారపడి ఉంటుంది. ఆ మానవ వికసన సమగ్ర పరిణామ రూపాన్ని 'చేవ్రాలు'లో అక్షరీకరించాడు విహారి గారు.
మొదటి అధ్యాయంలో కవితని ఎత్తుకోవటమే. జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నది' అని మొదలు పెట్టడంతో సమాజంలోని వివిధ కోణాలను చూపించారు. బతుకును ముంజేతి కంకణంగా అభివర్ణిస్తూనే-'ఎవరి బతుకు వారికి/వారే కుట్టించుకున్న వలువ/ఎవరి వేలిముద్ర వారివే' అంటారు. ఎందుకంటే ఒకరి జీవితం మరొకరి చేతిలో ఆటబొమ్మ కాదు అని నిర్ధారిస్తూనే 'ఒకరి జీవితం వేరొకరి చేతిలో తెల్ల కాగితం అంటారు. తెల్ల కాగితం మీద ఎవరికి వారు రాసుకోవాలి కానీ మరొకరి ఆధీనంలో ఉంటే జీవితం ఎట్లా పరిణమిస్తుందో ఊహించుకోవాలనే అభిప్రాయాన్ని కవి ప్రకటిస్తారు..
రెండో ఆధ్యాయం ప్రారంభికలో శిరశోదయమై మాయని ఛేదించుకొని వచ్చిన శిశువుల బుడి బుడి అడుగులు వేయటం, తల్లి గోరు ముద్దలు, చదువుల పరుగుపందేలు,వచ్చీరాని కౌమార ప్రాయంలో వారిపై ప్రభావం చూపించే మాయాజాలాల కారణంగా- మెదడు పంజరంలో కోర్కెల చిలుకలు గుప్త విజ్ఞానంపై మోహం గురించి కవిత్వీకరిస్తూనే 'నడక కాదిది పోరాట జారుడుమెట్లపై ఆట' అంటూ సందిగ్ధప్రాయవు చంచల స్వభావాన్ని అక్షరాలతో గుది గుచ్చారు.
ఇక ముఖ్యమైన పెద్ద అధ్యాయం 'లోనారసి' లో దాని కొనసాగింపు గానే 'గుండె మట్టిని కుల్లగించే/ కోరికల వానపాములు 'గురించి జాగరూకత చెప్తాడు కవి. ఆలోచనాశూన్యులకు ప్రతి అంశాన్ని భూతద్దంలో చూపి భయభ్రాంతులకు లోనుచేసి మానసిక రోగులుగా మార్చే వైనాన్ని విశదీకరిస్తారు కవి. ఆత్మ న్యూనతకి చోటిస్తే గుండె సాగదీయక తప్పని కమ్మెచ్చుతీగ 'అవుతుందంటారు. నడిగ్గా అటువంటప్పుడే-' నిత్యానిత్య వివేకం -వ్యక్తిత్వం'-ని నిలబెడుతుందని ముక్తాయింపునిస్తారు.
'క్రియా శూన్యత గట్టు మీది పిచ్చిమొక్క వరి చేలో కలుపు మొక్క/ అచంచల విశ్వాసం/అదే దారి దీపం' అదే చేతి కర్ర' అంటూ మన భావోద్వేగాలకు మనమే బాధ్యులం అనేది ఉపదేశిస్తారు. కలలు కన వద్దంటారు. ఎందుకంటే అనుకున్నది జరగకపోతే వచ్చే అనర్థాలు తెలియజేస్తారు.
''డాలర్ల రోగగ్రస్తుడికి చికిత్స లేదని ఖచ్చితంగా ప్రకటిస్తారు. ఏ విషయానికి నా వల్ల కాదని వదిలేయొద్దంటారు. అవినీతి మేత, క్షణికోద్రేకం, ఆహం వీటన్నిటి వలన జరిగే కష్టనష్టాలను పంక్తులు పంక్తులుగా బోధిస్తూ మానసిక వికశనం కావాలంటే సందేహం, పరిశీలన, సమాచారం, విశ్లేషణ మనిషికి అత్యవసరం అంటారు కవి విహారి.
నాలుగవ అధ్యాయం నుంచి యవ్వనానికి 'ఋజు రేఖలు లక్ష్య నిర్దేశానికి గమ్యం నీది -నడక నీది- మిట్ట పల్లాలని సహనమే ఏకైక దీవంగా గమనిస్తూ ముందుకు నడవమంటారు. ఈ అధ్యాయం అంతా ఎన్నైన్నో సామెతల్ని కవితాత్మకంగా ఉటంకించుతూ సుబోధకంగా ఆసాంతం సాగుతుంది.
'స్వీయావిష్కరణం/ వేకువ రేకుల స్పాటిక సాధనం!! /గతం గాయాలు సలుపుతాయి/ రాతి మీద ఉలి దెబ్బలు అవి/ అవి నిట్టాడి గూడులు కాకూడదు/రూపాంతరం చెందిన కర్తవ్యాన్నివ్వాలి'- అని ధైర్యాన్ని, అత్మవిశ్వాసాన్ని పురిగొల్పుతాడు కవి.' క్రమశిక్షణ అంటే/ కఠినత్వమూ కాదు, నిరంకుశత్వమూ కాదు అదొక జీవన విధానం' గా చెప్పటమే కాక నిబద్ధత బద్ధకానికి శత్రువుగా చూపుతారు. కార్యదక్షత కట్టుబడి- పెట్టుబడిగా అభివర్ణించుతారు.'నీ బొమ్మని నీవే చిత్రించుకోగలగాలి' అనటంలో ఎవరి వ్యక్తిత్వాన్ని వారి నిర్మించుకోవాలనే సందేశం ఇస్తారు.
'సృజనకు ఆధార భూమికలు-మేధ విలువలు' అని నిర్ధారిస్తూనే నైతికత అంతస్సూత్రం ఎప్పుడూ తెగిపోకుండా కాపాడుకోవలసిన బాధ్యత వ్యక్తిదే అనేది నర్మగర్భంగా తెలియజేస్తారు కవివిహారి.
"మానవ సంబంధాలంటే/మనం మనంగా వుండటం/మానవసంబంధాలంటే / సమాజ సమన్వయ శక్తి!! 'వ్యక్తి''త్వం' వికసనం అంటే ఎత్తుపల్లాలను చూసి ఆ ప్రక్రియ అదే వ్యక్తి నిర్మాణం' అంటారు కవి
అయిదవ అధ్యాయం వికసనం అంటే విశ్వ దీర్ఘ కవితారాగానికి శృతి కూర్చటం అంటూ ముక్తాయింపుగా ఒక వ్యక్తి సంపూర్ణ మానవుడిగా రూపొందటానికి అలవర్చుకోవాల్సిన, జీవితాంతం పాటించవలసిన నిర్మాణ ప్రక్రియల రూపకల్పనలని ముగిస్తారు.
నేటి యువతరానికి వ్యక్తిత్వ వికాసచిత్రాలను దీర్ఘ కవితారూపంలో లక్ష్యాన్ని నిర్దేశిస్తూ, లక్ష్యాన్ని దినచర్యలో భాగంగా చేసుకొని సమయ నిర్దేశాన్ని చుక్కానిగా చేసుకొని ప్రయాణిస్తే రూపెత్తిన మనిషిగా మారగలడనే ఆశయంతో తన చేవ్రాలు' లు వ్యక్తిత్వ వికాస గ్రంథంగా తీర్చారు విహారి గారు.
కేవలం మాటల మనిషిగా, రాతల మనిషిగా కాక తాను ఆచరించి చూపే స్నేహశీలి, సౌజన్య మూర్తి, నిర్విరామ, నిరంతర సృజనశీలి అయిన 'విహారి గారికి ఎనిమిది పదులు దాటిన వయసులోనూ వారి కలం ఇంకా పదునెక్కాలని అభిలషిస్తూ వారికి సహస్రాధిక జన్మదిన శుభాకాంక్షలు
(అక్టోబర్ 15-విహారి గారి 81వ జన్మదినం సందర్భంగా సృజన క్రాంతి ఈ ప్రత్యేక వ్యాసం)
నడక దారిలో -53
నడక దారిలో -53
మా ఇంటికి దగ్గరలోనే ఆస్మాన్ ఘడ్ మీద సాయికృప అపార్ట్ మెంట్స్ లో కొంతకాలంగా కె.రామలక్ష్మిగారూ,వారి అక్క వుంటున్నారని తెలిసింది.వారి క్రింద అపార్ట్మెంట్ లోనే వారి అక్క కూతురు నివాసం వుంటుంది.అందుకని ఆరుద్ర మరణానంతరం మద్రాసు నుంచి వచ్చేసారు.వాసా ప్రభావతి గారితో మొదటి సారి వెళ్ళాను.ఆతర్వాత తరుచూ వెళ్ళేదాన్ని.రామలక్ష్మి గారితో కబుర్లకు కూచుంటే సమయం తెలియదు.ఒక ప్రవాహంలా అనర్గళంగా ఎప్పడెప్పటి అనుభవాలనో చెప్పుకొంటూ పోతారు.మొదట్లో మాట్లాడుతోన్నప్పుడు 'అలా అనేవారు మీ నాన్న' అని చెప్తుంటే అర్థం అయ్యేది కాదు తర్వాత ఆరుద్ర గారని తెలిసింది.చాలా సన్నిహితంగా నాతో మాట్లాడేవారు.నడవటానికి కాళ్ళు సహకరించక పోయినా వుప్పొంగే వుత్సాహంతో వుండటాన ఆమెతో మాట్లాడుతుంటే మనకీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయనిపించేది.
ఒక సారి వాళ్ళింటికి ఒక పదిహేను మంది రచయిత్రులను ఆహ్వానించి రామలక్ష్మి గారు ఆరుద్ర పుస్తకాన్ని ఆవిష్కరణ చేసారు. వరూధినిగారూ,శాంతసుందరీ,గోవిందరాజుల సీతాదేవి, శారదా అశోక్ వర్థన్,హేమలతా భీమన్న,ముక్తేవిభారతి, కొండవీటి సత్యవతి,కె.బి.లక్ష్మి,పోలాప్రగడ రాజ్యలక్ష్మి మొదలైన వాళ్ళం హాజరయ్యాము.కొంతసేపు ఆరుద్ర లలితా గీతాలు, సినీగీతాలు ఆలపించాము.పుస్తకం ఆవిష్కరించి ఫొటొలు తీసుకొని తర్వాత రామలక్ష్మిగారి మాటలవిందుతో పాటూ వాళ్ళ అక్క కూతురు ఏర్పాటు చేసిన విందు కూడా ఆస్వాదించాము.
రామలక్ష్మి గారి ఇంటి కింద అపార్ట్మెంట్ లో అబాకస్ నేర్పించే టీచర్ వున్నారు.ఆమె దగ్గర ఆషీని అబాకస్ నేర్చుకోవటానికి చేర్చాను.రోజూ ఆషీని తీసుకు వెళ్ళి వాళ్ళింట్లో దిగబెట్టి ఆ క్లాస్ అయ్యేవరకూ నేను ఒక్కొక్కప్పుడు రామలక్ష్మి గారింట్లో కూర్చొని కబుర్లు చెప్పేదాన్ని.ఆషీకి అబాకస్ చాలా నచ్చింది.ఉత్సాహంగా నేర్చుకునేది.
ఆ సందర్భంలో రామలక్ష్మి గారితో నేను తరుచూ కలిసేదాన్ని. అబాకస్ క్లాసు అయ్యేవరకూ రామలక్ష్మిగారి దగ్గరకి వెళ్ళటంతో, ఎన్నెన్ని కబుర్లో చెప్పేవారు. ఒక గంట ఎంత తొందరగా గడచిపోయేదో! ఆమె అనర్గళంగా ఎన్నో విషయాలు చెప్తుంటే సమయం తెలిసేది కాదు.
ఆమె నాకు ఎంతో ఇష్టమైన కవి శ్రీశ్రీ గురించి తాగుబోతుగా చెప్తుంటే బాధకలిగించింది కాని నిజాల్ని ఒప్పుకోవాలి కదా!
ఒకసారి రామలక్ష్మిగారికి పొట్ట ఆపరేషన్ అయ్యిందట. ఆపరేషన్ చేసిన తర్వాత ఆ డాక్టర్ " మీ పొట్టనిండా అక్షరాలే ఉన్నాయని ఆరుద్ర గారు అన్నారు. ఒక్క అక్షరం ముక్కా లేదు మీ పొట్టలో రామలక్ష్మిగారూ'అన్నాడు" అని చెప్తూ నవ్వారు. అదివిన్నాక ఎప్పుడు తలచుకున్నా నవ్వొస్తూ ఉంటుంది
ఆమెకు పత్రికా రంగంలోనూ, సినిమారంగంలో ను, సామాజిక సేవారంగంలోను, సాహిత్య రంగంలోనూ, రాజకీయరంగంలోను ఇలా అనేక అనుభవాలు ఉండటంవలన వాటిల్లోని లొసుగుల్ని విమర్శనాత్మకంగా చెప్పేవారు. ఎదురుగా ఉన్నవారికి కొన్ని విషయాలు నచ్చినా నచ్చకపోయినా ఆమె తన మనసులో మాటను, తన అభిప్రాయాన్ని చెప్పటానికి జంకరు. తనని తానే అందరూ గయ్యాళి నని అంటారని కూడా నవ్వుతూ చెప్పుకుంటారు. నిర్భయంగా ఉన్నది ఉన్నట్లు నిష్కర్షగా చెప్పకమానరు. అందుచేత కొంతమంది ఆమెకు దూరమయ్యారు. నిజానికి వారు రచనలు చేసే ఆకాలంలో ఆయారంగాలలో పురుషాధిక్యత మరింత ఎక్కువ . వాటిని తట్టుకొని నిలదొక్కుకోవాలంటే ధిక్కార స్వరం ఉండక తప్పదేమో.
ప్రతీ ఒక్కరి గురించి అందులోనూ సినీ, సాహిత్య రంగంలో లోని వారి మంచికన్నా వాళ్ళ ప్రవర్తనలోని దుర్గుణాలను వాళ్ళరెండుముఖాలను వేరు చేసి నిర్భయంగా చూపించేవారు. ఆవిడ నెగెటివ్ గానే మాట్లాడుతున్నట్లు అనిపించినా ఆవిడ లోని పాజిటివ్ నెస్ మనం స్పష్టంగా గుర్తించగలం, కదలడానికి కాళ్ళు సహకరించకపోవటంవలన చాలా కాలంగా వీల్ చైర్ కే పరిమితం అయినా అన్నింటికీ ఒకరిపై ఆధారపడాల్సి వచ్చినా సాహిత్యం, సినీరంగం పత్రికలూ వీటి గురించి తప్ప తన శారీరక అసహాయత్వం గురించి గానీ, అనారోగ్యాల గురించి గానీ ఒక్కసారి తలంచరు. ఆ వయసులో కూడా హాస్యంగా, చమత్కారాలతో సానుకూల
దృక్పథంలో మాట్లాడటం వలన ఆమెతో మాట్లాడుతున్నంతసేపూ హాయిగా ఆహ్లాదంగా ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా నిజం.
మొత్తంమీద ఆషీ అబాకస్ క్లాసులు రామలక్ష్మి గారితో సాన్నిహిత్యాన్ని పెంచాయి.
ఎందువలనో గుర్తులేదు.కానీ మలకపేట దిల్షుక్ నగర్ ప్రాంతం అంతా కొన్నాళ్ళు కర్ఫ్యూ పెట్టిన తర్వాత సడలింపు ఇచ్చి రాత్రి ఎనిమిది నుండి రాత్రి కర్ఫ్యూ వుంచారు.
ఆరోజు పల్లవి మధ్యాహ్నం కాలేజీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది.సాయంత్రం ఎప్పటిలాగే ఆషీని అబాకస్ క్లాసులో దించి ఏడుగంటలకు వస్తానని ఇంటికి వచ్చేసాను.ఏడుగంటలకు ఇంటినుండి బయలుదేరి వెళ్తుంటే స్ట్రీట్ లైట్లు ఆరిపోయాయి.నేను ఆ చీకట్లో చిన్న స్పీడ్ బ్రేకర్ని చూసుకోక తట్టుకుని పడిపోయాను.కుడిచేతిమీద ఆపుకోవాలనుకోవటంలో చెయ్యి మణికట్టు దగ్గర విరిగింది.బేగ్ లోని ఫోన్ తీసి చెయ్యాలన్నా వీలుకాలేదు.ఎడమచేతితో కుడిచేతికి సపోర్ట్ ఇచ్చి బాధ అణచుకొని ఆషీ దగ్గరకు వెళ్ళాను.
ఆషీకి ఫోన్ ఇచ్చి మా వారికి రింగ్ చేయమని విషయం చెప్పి మా రెగ్యులర్ ఆటో సలీమ్ కి హాస్పిటల్ కి వెళ్ళటానికి ఫోన్ చేయమన్నాను.పల్లవికీ ఫోన్ చేయించాను.
ఆషీ సాయంతో ఇంటికి వెళ్ళి సలీమ్ ఆటోలో మలక్ పేటలోని సుస్రుతా నర్సింగ్ హోం కు వెళ్ళాము.ఈలోగా పల్లవి డైరెక్ట్ గా అక్కడికే వచ్చింది.
కర్ఫ్యూ అని డాక్టర్ వెళ్ళిపోయాడట.ఒకనర్సు,మరొకరిద్దరు అటెండర్లు వున్నారు.అక్కడ రాత్రికి జాయినైపోమనీ,ఉదయం డాక్టరు వచ్చాక చూస్తారని అన్నారు.నాకునొప్పి అంతకంతకూ పెరిగిపోతోంది.
ఈ లోగా ఫోన్ అందుకుని కారు తీసుకుని పొనుగోటి కృష్ణారెడ్డి వచ్చి దిల్షుక్ నగర్ లోని ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరకు వెళ్దామన్నారు.పల్లవినీ ఆషీని ఇంటికి సలీమ్ ఆటోలో వెళ్ళిపోమన్నాము.
ఆర్థోపెడిక్ డాక్టర్ ఎక్స్ రే తీయించాక, మర్నాడు ఆపరేషన్ చేసి వైర్ వేస్తాము.హైబీపీ వుంది కనుక ఇసీజీ తీయించి రిపోర్ట్ తీసుకు రమ్మన్నారు. వెంటనే నొప్పి తగ్గటానికి ఇంజెక్షన్ ఇచ్చారు.అప్పటికే పది దాటింది.కర్ఫ్యూ వలన అంతటా నిర్మానుష్యం.ఏ హాస్పిటల్ లోనూ డాక్టర్లు లేరు.కారులో అలా వెతుక్కుంటూ కనిపించిన ప్రతీ హాస్పిటల్ మెట్టు ఎక్కాము.ఆఖరికి ఒక దగ్గర ఇసీజి చేయించుకోవడానికి కుదిరింది.రిపోర్టు తీసుకుని మళ్ళీ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే సన్నని వెదురు బద్దలతో తాత్కాలికంగా కట్టు కట్టేరు.అంతవరకూ వేలాడిపోతోన్న కుడి చేతిని ఎడమ చేత్తో పట్టుకునే వున్నాను.ఇవన్ని అయ్యి ఇంటికి వెళ్ళేసరికి సుమారు పన్నెండు అయ్యింది.కాస్త పెరుగన్నం తిని టాబ్లెట్ వేసుకుని పడుకున్నాను.
" పడిపోయానని ఫోన్ చేస్తే తరుచూ కళ్ళు తిరిగి పడిపోతావు కదా అలాగే అనుకున్నాను.ఇంత దెబ్బ తగిలిందను కోలేదు."అన్నారు బిత్తరపోతూ వీర్రాజుగారు.
మర్నాడు ఉదయమే హాస్పిటల్ కి పల్లవి నేనూ వెళ్ళాము.వీర్రాజుగారు ఆషీని చూసుకోడానికి ఆగిపోయారు.అంతేకాక ఆయనకి హాస్పిటల్ వాతావరణంలో బీపీ పెరిగిపోతుంది.అందుకే ఇంట్లోనే వుండమన్నాం.చేతికి రాడ్ వేసి సమ్మెంటుకట్టు కట్టి ఆరు వారాల తర్వాత రమ్మన్నారు.
పల్లవి రెండు వారాలు సెలవు పెట్టింది.ఆ తర్వాత కూరా పప్పు చేసేస్తే వీర్రాజు గారు కుక్కర్ పెట్టేవారు.నేను మామూలుగా రాసుకోవటం చెయగలనా అని నాకు కొంచెం దిగులు మొదలైంది.పల్లవి కోప్పడుతున్నా ఎడమ చేత్తోటే కొంచెం పనులు సాయం చేయటానికి ప్రయత్నించే దాన్ని. ఎడమ చేత్తో రాయటానికి చూసేదాన్ని.ఆ ప్రయత్నంలోనే ఒక కవిత కూడా రాసాను.
ఆరు వారాల తర్వాత సిమ్మెంటు కట్టు తీసేసినా క్లాత్ తో కట్టు కట్టుకోమని డాక్టర్ చెప్పి గోరు వెచ్చని వేడినీళ్లలో చేతిని పెట్టి వేళ్ళు కదుపుతూ ఎక్సర్సైజులు చేయమన్నారు డాక్టర్.నాకు కుడిచేయి ముఖ్యమైనది కదా చాలా శ్రద్ధగా చేసి తొందరగా నొప్పి తగ్గించుకున్నాను.కానీ ఆ చేత్తో కొద్ది బరువు పట్టుకున్నా నొప్పి పెట్టేది.
2009 అసెంబ్లీ ఎన్నికలు మొదలయ్యాయి.వై ఏస్సార్ కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా ముందుకు నడిపించి , అసెంబ్లీలో కాంగ్రెసు 156 సీట్లు గెలుచుకునేలా చేసాడు. వై ఎస్.ఆర్ ముఖ్యమంత్రి గా 20 మే 2009న రెండవసారి ఆంధ్రప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.ఈ సారి కూడా టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా మారింది.విద్యార్థులకు రీయింబర్స్మెంట్ ఇవ్వటంతో ఇబ్బడిముబ్బడిగా వెలిసిన ఇంజనీరింగ్ కాలేజీలు కాంగ్రెస్ కు ప్లస్ పాయింట్ అవుతుంది.గ్రామీణ పిల్లలు,బడుగు వర్గాల పిల్లలు వీటివలన వున్నత విద్యకు చేరువయ్యారు.
ఉద్యోగం చేసినంతకాలమే కాక తర్వాత కూడా మా స్కూల్ విద్యార్థులకు మొదటి రేంక్ వచ్చినవారికి ఆగష్టులో నగదు
బహుమతులు ఇవ్వటం నిలిపివేయలేదు.కవర్లలో డబ్బుపెట్టి కొన్ని ఏళ్ళ పాటు అందజేస్తూనే వున్నాను.కానీ ఆ డబ్బు సక్రమంగా నేను కోరిన విధంగా వుపయోగించటం లేదని తెలిసింది.దాంతో నేను రిటైర్ అయిన నాలుగేళ్ళ తర్వాత ఇవ్వటం మానేసాను.
నా రెండో దీర్ఘ కవిత బతుకు పాటలో అస్తిత్వ రాగం" పూర్తి చేసాను. జీవితంలోని వివిధ దశలైన శైశవం,బాల్యం,కౌమారం, యవ్వనం , ప్రౌడత్వం, వృద్ధాప్యం, ముగింపు తో ఏడు చాప్టర్ లుగా విభజించి స్త్రీ జీవితాన్ని సంపూర్ణంగా కవిత్వంలో అక్షరీకరించాను. తొలిసారిగా పల్లవి డిజిటల్ పద్ధతిలో తయారు చేసిన ముఖచిత్రంతో
ఈ పుస్తకం వెలుగులోకి వచ్చింది.
ఈ పుస్తకం ప్రింటింగ్ సమయంలో వీర్రాజు గారికి ఒక ఆలోచన వచ్చింది."ఈ ఏడాది డిసెంబర్ లో నీ అరవై ఏళ్ళు పుట్టినరోజు వస్తుంది కదా అసందర్భంగా ఇప్పటికి వచ్చిన నీ ఎనిమిది కవిత్వం పుస్తకాలూ కలిపి సమగ్ర సంపుటి గా ప్రచురించుతే బాగుంటుంది " అన్నారు.ఖర్చు ఎక్కువే అవుతుందని నేను ఆలోచించాను.
కానీ వీర్రాజు గారు "ఇంతవరకూ ఇలా ఎవరూ సమగ్ర సంపుటాలుగా వేసుకోలేదు.అందులోనూ ఇంత కవిత్వం రాసిన కవయిత్రులూ తక్కువే.వేస్తేనే బాగుంటుంది." అని గట్టిగా నిర్ణయించుకోవడమే కాకుండా నాళేశ్వరం శంకరంగారితో కూడా ప్రస్తావించారు.శంకరంగారు కూడా మంచి ఆలోచన అని ప్రశంసించి ప్రత్యేక సందర్భంగా ఎవరి చేతనైనా ముందుమాట కూడా రాయించండి అన్నారు.
1980 లో వచ్చిన తొలి కవితా సంపుటికి శివారెడ్డిగారితో ముందుమాట రాయించాను.తర్వాత ఏ సంపుటికీ ఎవరిచేతా రాయించ లేదు.శంకరంగారి సూచన అనుసరించి ఎవరిచేత రాయించుదామా అని ఆలోచించి కాత్యాయనీ విద్మహే ఎగిరేగారితో రాయిస్తే బాగుంటుంది అని నిర్ణయించుకున్నాము.
కాత్యాయనీ విద్మహేగారికి ఫోన్ చేసి విషయం చెప్పాము.ఇంకా అయిదారు నెలలు పైనే వుంది కనుక సమయం తీసుకోమని చెప్పాను.ఆమె సంతోషంగా అంగీకరించారు.నా విడివిడి సంపుటాలన్నీ ఆమెకు పంపించాము.
డిటీపీ చేయించటానికి కూడా ఇచ్చాము.పుస్తకం 500 పేజీలు కన్నా ఎక్కువే వచ్చేలా వుంది.
దేశమంతా వినాయక చవితి సంబరాల్లో మునిగింది.ఎప్పుడూ కోలాహాలంగా వైభవంగా జరిగే వినాయక నిమజ్జనోత్సవాలు చాలా గంభీరంగా,భయంభయంగా జరిగాయి.ఆ తర్వాత
చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరగా ఉదయం గం.9.35 నిమిషాలకు హెలికాప్టరుతో సంబంధాలు తెగిపోయాయనే వార్తలు నాలుగురోజులుగా వస్తున్నాయి.ఒకరెండుమూడు రోజుల పాటూ ఆచూకి తెలియలేదు. ముఖ్యమంత్రి ఆచూకీ కోసం గాలించగా 25 గంటల తరువాత సెప్టెంబర్ 2 వ తేదీ 2009 రోజునాటికి ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్ళు లభించాయి. వై.ఎస్.తో సహా మొత్తం ఐదుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని నిర్థారించారు.
ఉగ్రదాడేమోనని ఒక్కసారిగా రాష్ట్రమే కాకుండా దేశమంతా వులికిపడింది.కానీ చాలాకాలం అన్ని కోణాల నుండి శోధించి హెలికాప్టర్ లోని యాంత్రిక లోపంగా ప్రకటించారు.రోశయ్యగారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధిష్టానం ప్రకటించింది.
కాంగ్రెస్ లో జరిగిన అనూహ్య పరిణామాలు తెరాసా నాయకులకు కలిసి వచ్చింది.అప్పటికే చాలా కాలంగా ఏకీకృతం అవుతున్న వారికి బలం పుంజుకోవడానికి ఇది ఒక అవకాశంగా మారింది.
తెరాసా అక్టోబరు 21న సిద్ధిపేటలో ఉద్యోగ గర్జన పేరుతో భారీ సభ నిర్వహించారు.ఉద్యోగులు , విద్యార్థులు,ప్రజలు ఏకమయ్యారు.జయశంకర్, హరగోపాల్, కోదండరాం, చుక్కా రామయ్య, విద్యాసాగరరావు వంటి మేధావులు సంఘటితం కావటం ఉద్యమం వూపు అందుకుంది.
2009 నవంబర్ 29న సిద్ధిపేట కేంద్రంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఇది తెలంగాణ ఉద్యమానికి కీలక మలుపై తెలంగాణను నిప్పుల కొలిమిగా మార్చింది.
విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావటంతో తెలంగాణ వచ్చే వరకూ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉద్యమానికి కేంద్రబిందువు అయ్యింది . ప్రభుత్వం కేసీఆర్ను దీక్ష చేయకుండా ప్రభుత్వం అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించింది ఆయన జైల్లోనే దీక్ష కొనసాగించారు. తరవాత నిమ్స్ కి తరలించినా దీక్ష కొనసాగింది.
''తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ చచ్చుడో'' అనే నినాదం ఇచ్చారు కేసీఆర్. తెలంగాణా అంతటా భగ్గుమనడంతో కేంద్రపీఠం కదిలింది.
చిదంబరం తెలంగాణ ప్రకటన
డిసెంబరు 9వ తేదీన కేంద్రం తెలంగాణాకు అనుకూలంగా హోం శాఖ మంత్రి చిదంబరం ప్రకటన చేశారు. ఈ ప్రకటన తరువాత సంబరాలు జరిగాయి. కేసీఆర్ దీక్ష విరమించారు.
నా సమగ్ర కవిత్వం చదివి ఒకరోజు కాత్యాయనీ విద్మహే నాకు ఫోన్ చేసి " మీ కవిత స్త్రీ వాద సంకలనం నీలిమేఘాలులో చేరలేదనుకుంటాను.ఎందుచేత " అని అడిగారు ." బహుశా నేను మితవాద స్త్రీ వాదిగా భావించి చేర్చలేదేమో" అన్నాను.ఆమె సుమారు అరగంటసేపు నాకవిత్వం గురించి నాతో ఫోనులో చర్చించారు.అంతేకాదు సుమారు పదహారు పేజీల సుదీర్ఘ ముందుమాట రాసి అందించటం నాకు చాలా సంతోషం కలిగించింది.
అయితే నా పుట్టిన రోజు నాటికి ప్రచురణ పూర్తికాలేదు.అందుకని ఒక డమ్మీ కాపీ తయారుచేసారు వీర్రాజు గారు.
మా కుటుంబానికి బాగా దగ్గరైన ఆత్మీయ మిత్రులు ఒక పదిహేనుమందిని ఆహ్వానించి మా ఆషీతో పుస్తకాన్ని ఆవిష్కరింపజేసి మా ఇంటికి దగ్గరలోనే ఒక హొటలులో కలిసి భోజనాలు చేసాము.ఆ రకంగా నా షష్ఠిపూర్తి అయింది.
పుస్తకం ప్రింటింగ్ పూర్తయ్యాక బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో గోపీ గారి అధ్యక్షతన రత్నమాల , నాళేశ్వరం శంకరం నా పుస్తకంపై ప్రసంగించగా ఎనిమిది సంపుటాలతో కూడిన నా సమగ్ర కవిత్వ సంపుటి ఆవిష్కృతం అయ్యింది.ఆ విధంగా నాకు వీర్రాజుగారు గొప్ప బహుమతి అందించారు.
-- శీలా సుభద్రాదేవి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)