3, జులై 2023, సోమవారం

సంచిక లో కస్తూరి మురళీకృష్ణ గారు చేసినముఖాముఖి

1)Kasturi murali k: నది ప్రయాణం పుస్తకం తయారుచేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? జ) కొందరు సాహితీవేత్తలు పోయినప్పుడు పత్రికలూ,మీడియా, సామాజిక మాధ్యమాల్లో వారి ప్రతిభని ప్రశంసిస్తూ,సాన్నిహిత్యాలనీ వెల్లడిస్తూ వచ్చే వ్యాసాల్ని చదివినప్పుడు "మనకి శిష్య ప్రశిష్యులూ లేరు,హోదాలు అధికారాలు లేవు,ఎవరితోనూ లేని ప్రేమని ఒలకబోస్తూ మాట్లాడే చాతుర్యం లేదు కనుక మనం పోయినప్పుడు పత్రికల్లో ఏమూలో చిన్న వార్త వస్తుందేమో" అని గత కొంతకాలంగా వీర్రాజు గారు అంటుండేవారు. అటువంటిది ఆయన పోయాక ప్రతీ ప్రింటెడ్, అంతర్జాల పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో,సందేశాలతో పుంఖానుపుంఖాలుగా ఆత్మీయంగా వ్యాసాలు వచ్చేసరికి ఈయనకి ఇంత ఫాలోయింగ్ ఉందా అని నేనూ,మా అమ్మాయి విస్తుపోయాము. నాకు ఆత్మలు,మరోలోకం పట్ల నమ్మకాలు లేవు కానీ ఇంతమంది తనగురించి ఆర్తిగా రాస్తారని ఆయనకు ముందే తెలుస్తే ఎంత బాగుండును అని మనసులో అనుకొన్నాను. యాభై ఏళ్ళకు పైగా అక్షరాలతో కలగలిసి మేమిద్దరం జీవించాము.ఈ నాడు నా మనసులోనే,నా ఆలోచనల్లోనే ఆయన ఉన్నారని అనుకుంటున్నాను.పుస్తక ప్రచురణ అంటే పులకరించి పోయే వీర్రాజు గారికి ఆయన గురించి వచ్చిన ఆత్మీయ వ్యాసాలన్నీ కలిపి వేసే సంకలనం కన్నా మేము అందించే గొప్ప నివాళి ఇంకేమిటి ఉంటుంది.అందుకే నదిలా గుంభనంగా, నదిలా ఆత్మీయంగా ఉంటూ, గోదావరిని ప్రేమించే,గోదావరి పరిసరాలను పదేపదే తలుచుకునే వీర్రాజు గారి కోసం ఇవన్నింటినీ కలిపి నదిప్రయాణంగా నిక్షిప్తం చేయటానికి పూనుకున్నాను 2)Kasturi murali k: పుస్తకం తయారీలో మీ అనుభవాలు? జ) ఆయన పోయిన రోజునుండి ప్రచురితమైన వన్నీ ఎవరో ఒకరు నాకు వాట్సాప్ ద్వారా పంపుతునే ఉన్నారు.వాటినన్నింటినీ ఎప్పటికప్పుడు భద్రపరచుకున్నాను.తర్వాతర్వాత కూడా ఆ పది పన్నెండు రోజుల్లో ఫేస్బుక్ ల్లో దొరుకుతూనే ఉన్నాయి.అందువల్ల ఒక పద్ధతిలో వాటిని సమకూర్చటంతో అనేకసార్లు డీటీపి ఆయన్ని సంప్రదించవలసి వచ్చింది.అంతేకాకుండా వీర్రాజు గారి తోబుట్టువులలో మిగిలిన ఒకేఒక్క తమ్ముడిచేతా,వీర్రాజు గారి బాల్యమిత్రుడిచేతా వారి జ్ణాపకాలు రాయించి చేర్చటం అవసరం అని భావించి రాయమని కోరాను.అంతేకాక మా అమ్మాయి,మనవరాలు ఆయన గురించి తమ మనసులోని మాటని చెప్పుకోదగ్గ సందర్భం ఇదొక్కటే.అందుకే వారినీ రాయమన్నాను.కుందుర్తి ఆంజనేయులు గారి కుటుంబం మాకు అత్యంత సన్నిహితులు.వారి మనవరాలు కుందుర్తి కవిత మా ఇంట్లో పిల్లలాగే బాల్యం నుండీ తిరిగింది.అందుకే ఆ అమ్మాయిని రాయమని అడిగాను.అంతే తప్ప నాకై నేను సాహిత్య లోకంలో ఎవరినీ రాయమని కోరలేదు.అన్నీ ఏదో ఒక మాధ్యమంలో అందరూ వీర్రాజు గారిపై తమ అభిమానాన్ని,ఆత్మీయతను వెల్లడిస్తూ స్వచ్ఛందంగానే రాసారు. 3) Kasturi murali k: వ్యాసాల ఎంపికలో పాటించిన ప్రామాణికాలేమిటి? జ) నిడివి ప్రామాణికంగానే వచ్చిన నివాళి వ్యాసాలను తీసుకున్నాను.చిన్నచిన్న సందేశాలను తీసుకోలేదు. వరుసక్రమంలో కూడా సమగ్రంగా ఉన్న వ్యాసాలను,తర్వాత చిత్రలేఖనం మీదా, సంపాదకీయాలు,సందేశాలు,కుటుంబ సభ్యులు రాసినవిగా కూర్చాను. 4) Kasturi murali k: నిర్మొహమాటంగా చెప్పండి, వీర్రాజుగారు సాహిత్య ప్రపంచానికి ఎంతో సేవ చేశారు. ఎంతమందికో పలు రూపాల సహాయం చేశారు. అజాత శత్రువువారు. అత్యంత గౌరవనీయులు. కానీ, వారికి లభించాల్సినంత గుర్తింపు లభించిందంటారా? లభించకపోతే ఎందుకని లభించలేదు?లభిస్తే ఎలా? జ) నిజమే వీర్రాజు గారు తన ఆరోగ్యాన్ని,తన కుటుంబాన్ని కూడా ఒకదశలో పట్టించుకోకుండా ( బహుశా కుటుంబాన్ని నేను చూసుకుంటాననే ధైర్యం తోటి కావచ్చు) మిత్రుల కోసం ,కేవలం పరిచయస్తులకోసం కూడా సమయాన్ని ,ధనాన్ని వెచ్చించిన రోజులు ఉన్నాయి.ఆయన మంచితనాన్ని,స్నేహధర్మాన్నీ చేతకానితనం గా పరిగణించి ఎక్సప్లాయిట్ చేసినవారూ ఉన్నారు.అవన్నీ నేను గానీ ఆయన గానీ ఏనాడూ పట్టించుకోలేదు. కానీ సాహిత్య వ్యాసాలలో వీర్రాజు గారి కాంట్రిబ్యూషన్ ఉన్న సందర్భాల్లో కూడా ఆయనని పట్టించుకోనప్పుడు,ఆయన సాహిత్యాన్ని ప్రస్థావించని సమయాల్లో నైరాశ్యంలో మునిగిపోయే వారు. తర్వాత్తర్వాత సాహితీవేత్తలు చిత్రకారుడిగా,చిత్రకారులు సాహితీ వేత్తగా భావించటం వలన రావలసినంత గుర్తింపు తనకి రాలేదని పలు సందర్భాల్లో వెల్లడించారు. అంతేకాక కాలం మారిపోతున్న సందర్భాల్లో, ప్రాతినిధ్యాలు మారుతున్న సందర్భాల్లో ఏ వ్యక్తివలన ప్రయోజనం ఉంటుందో,ఎవరివల్ల అవార్డులు,గుర్తింపులు వస్తాయో వారి చుట్టూ ప్రపంచం తిరిగే రోజులివి. డిజిటల్ ముఖచిత్రాలు మొదలు కావటం తో వీరితో ముఖచిత్రాలు వేయించుకోటానికీ రావాల్సిన అవసరం తీరింది. మా వలన ఏ ప్రయోజనం లేనప్పుడు దూరం కావటం సహజమే కదా? అందులోనూ మేము ఇద్దరం కూడా చొచ్చుకుపోయి పరిచయాలు,స్నేహాలు పెంచుకోలేని మొగమాటస్తులం.అందుకే మేము మా మానాన రాసుకుంటూ ఉండటమే గానీ అవార్డులకోసం,గుర్తింపులు కోసం ఏనాడూ పాకులాడ లేదు. రచనలన్నీ పుస్తకం రూపంలో ఉంటే మా సాహిత్య సృజనని ఎవరో ఒకరు ,ఎప్పడో అప్పుడు మనసుకు హత్తుకోకపోరు అనే ఆశావహ దృక్పథం మాది. 5)Kasturi murali k: ఈ సంకలనంలో వున్న వ్యాసాలు వీర్రాజుగారి సాహిత్య వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా ప్రతిబింబించాయా? ఈ వ్యాసాలు స్పృశించని పార్శ్వాలేమిటి? జ) నదిప్రయాణం లోని వ్యాసాలు కేవలం వారి మరణానంతరం వీర్రాజు గారి స్మరణలో రాసినవి కనుక వీటిలో ఎక్కువగా ఆయన వ్యక్తిత్వం,స్నేహధర్మం,మంచితనం,అభిమానం తెలియజేసేవి లాగానే ఉండటం సహజం.వీటిలో సాహిత్య వివేచన ఉంటుందని ఆశించనవసరం లేదనుకుంటాను. సాహిత్యం,చిత్రలేఖనం గురించి స్పర్శించడం మాత్రమే జరిగింది. అయితే ఒకప్పుడు కడియాల రామ్మోహన్ రాయ్,వడలిమందేశ్వరరావు,కోవెల సంపత్కుమారాచార్య,ఆంవత్స సోమసుందర్ గారి వంటి విమర్శకులు ఎవరిదైనా పుస్తకం అందుకోగానే వాళ్ళకు నచ్చితే ఆ కవి పెద్దవాడైనా, యువకవులే ఐనా చక్కటి వ్యాసం రాసి పత్రికలకు పంపేవారు. ఆ విధంగా వీర్రాజు గారి తొలి రచనల నుండి ప్రచురితం అయిన వ్యాసాలను, సుదీర్ఘ సమీక్షలనూ సుమారు డెబ్భైకి పైగా ఏర్చికూర్చి డా.నాళేశ్వరం శంకరంగారి సంపాదకత్వం లో 2007 లో " శీలావీర్రాజు కలంచిత్రాలు" పేరిట సంకలనం వచ్చింది.అందులో వీర్రాజు గారి సాహిత్య విశ్లేషణ సంపూర్ణంగా వచ్చింది. అదే విధంగా నా రచనలపై కూడా ప్రచురితమైన నలభై రెండు వ్యాసాలను, సుదీర్ఘ సమీక్షలనూ " గీటురాయి పై అక్షరదర్శనం" పేరిట 2016 లో వీర్రాజు గారు సంకలనం చేసారు. 6)Kasturi murali k: నిజానికి ఈ సంకలనంలో యాభై నాలుగుపైగా వ్యాసాలున్నా, అనేకం శ్రద్ధాంజలి సమర్పించినవవటంతో వాటి పరిధి పరిమితమయిందనిపిస్తుందన్న విమర్శకు మీ స్పందన ఏమిటి? జ) కొంత వరకూ పై ప్రశ్నకు సమాధానమే దీనికి వర్తిస్తుంది. మీరు అన్నట్లు ఆత్మీయులు, స్నేహితులు, బంధువుల శ్రద్ధాంజలికి పరిమితం అయినదే.ఆయన అనుకున్నట్లు కుల మత ప్రాంతీయవివక్షతలతో అందరూ దూరమయ్యారు అని గత కొంతకాలంగా గా బాధపడిన వీర్రాజు గారికి "మిమ్మల్ని ఎవరు దూరం చేసుకోలేదు సుమా" అని ఇప్పుడు నా ఆలోచనల్లో, నాలో ఉన్న వీర్రాజు గారికి ఉపశమనం గా అందించిన ఆత్మీయ నివాళే ఈ నదిప్రయాణం. 7)Kasturi murali k: ఈ పుస్తకం ద్వారా మీరు అనుకున్న లక్ష్యం నెరవేరిందా? మీ లక్ష్యం ఏమిటి? జ) వీర్రాజు గారు సంపూర్ణ జీవితాన్ని తాను ఎలా జీవించాలని అనుకున్నారో అదే విధంగా జీవించారు. తాను చిత్రకళా అభ్యసించిన జన్మస్థలం రాజమహేంద్రవరంలోని దామెర్ల రామారావు కళానికేతన్ కి తన జీవితకాలంలో వేసిన డెభ్భై ఎనిమిది తైలవర్ణ చిత్రాలను మార్చి 2022లోనే చిత్రకళాభిమానులకోసం అంకితం చేసి, గోదావరి నదిని,పోలవరం పరిసర ప్రాంతాలను కళ్ళనిండా నింపుకొని తర్వాత రెండు నెలలకే సంతృప్తి గా నిష్క్రమించారు. . వీర్రాజు గారి ప్రథమ వర్థంతి సమావేశానికి కేవలం ఫోను ద్వారా పంపిన నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన సుమారు రెండువందలమంది ఆత్మీయుల సమక్షంలో ఈ పుస్తకావిష్కరణలని ఒక సెలబ్రేషన్స్ గా జరపాలని నిశ్చయించుకొన్న నా లక్ష్యం నెరవేరింది. 8)Kasturi murali k: శీలావీర్రాజు గారు ఎప్పుడూ సన్మానాలు, ఆర్భాటాల జోలికి వెళ్ళలేదు. నిశ్శబ్దంగా తన పని చేసుకుంటూ వెళ్ళారు. వారి నిష్క్రమణ తరువాత సాహిత్య ప్రపంచం స్పందన గురించి మీ స్పందన? జ) నాలుగవ ప్రశ్న జవాబే దీనికి సరిపోతుందను కుంటాను. 9)Kasturi murali k: ఇటీవలి కాలంలో ఒక సాహిత్యవేత్త మరణం తరువాత అతని స్మృతిని సజీవంగా వుంచే బాధ్యత సాహిత్య ప్రపంచంకాక, ఆ సాహిత్యవేత్త కుటుంబ సభ్యులే నిర్వహించాల్సివస్తోంది. ఉదాహరణకు ఘండికోట బ్రహ్మాజీరావుగారు.పురాణం సుబ్రహ్మణ్య శర్మ, పురాణం శ్రీనివాస శాస్త్రి తదితరులు. శీలా వీర్రాజు గారి మరణం తరువాత కూడా ఆయన స్మృతి సజీవంగా వుంచే బాధ్యత మీరే స్వీకరించాల్సివస్తోంది. ఇలాంటి పరిస్తితి ఎందుకని నెలకొంటున్నదంటారు? ఈ పరిస్థితి మారి, సాహితీవేత్త స్మృతిని సాహిత్య ప్రపంచమే సజీవంగా నిలిపే పరిస్థితులు నెలకొనాలంటే ఎంచేయాలంటారు? జ) ఎందరో ప్రముఖ సాహితీవేత్తలు మరణించాక వారు కుటుంబ సభ్యులకు సాహిత్య వాసనలు లేకపోతే నెలలోపునే వాళ్ళపుస్తకాలు,ముమెంటోలు తూకానికి అమ్మేయడం కూడా చూస్తునే ఉన్నాము. కుటుంబ సభ్యులకు సాహిత్యం పట్ల అభిరుచి,గౌరవం ఉన్నప్పుడు ఆ సాహితీస్మృతి ఆ యింట సజీవంగా ఉంటుంది.ఎవరి పుస్తకాలు వాళ్ళే మోసుకు తిరగాల్సి వస్తోన్న ఈ రోజుల్లో సాహిత్య ప్రపంచాన్ని ఆశించటం వ్యర్థమేనేమో. నిజానికి సాహితీవేత్తల స్మృతిని,శతజయంతులనూ నిర్వహించి, మోనోగ్రాఫ్ లు రాయించి వారిని సజీవంగా ఉంచగలిగేది కేంద్ర,రాష్ట్ర సాహిత్య అకాడమీలు.అయితే అవన్నీ కమిటీసభ్యుల ఇష్టాయిష్టాల మీద ఆధారపడి జరుగుతాయి. 10)Kasturi murali k: ఒక కవిగా మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? జ) మొదటినుంచీ నా సాహిత్య సృజన విస్తృతంగా నే సాగుతోంది.చాలా ఎక్కువగా చదువుతాను.అలాగే యాభై ఏళ్ళుగా రాస్తూనే ఉన్నాను.గత అయిదారు ఏళ్ళుగా ఇంచుమించు ప్రతీనెలా ఏదో ఒక రచన ప్రచురితమౌతూనేఉంది.రెండున్నర సంవత్సరాలుగా నెచ్చెలి అంతర్జాల పత్రికలో నా ఆత్మకథ రాస్తున్నాను. ఓ నాలుగు పుస్తకాలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి.వీలు వెంట ప్రచురించుకోవాలి. నా ఆలోచన అలసిపోలేదు,నేనూ అలసిపోలేదు,నా కలం అలసి పోలేదు.కొనసాగుతూనే ఉంటుంది. 11)Kasturi murali k: శీలావీర్రాజుగారి రచనలను సజీవంగా నిలిపే ప్రయత్నాలేమైనా చేస్తున్నారా? జ) వీర్రాజు గారు ఉన్నప్పుడే వారి రచనలన్నీ గ్రంథరూపంలోకి వచ్చాయి. ఆయన వేసిన తైలవర్ణ చిత్రాలు కుంచె ముద్రలు,చిత్రకారీయం పేరిట రెండుసంపుటాలుగా వచ్చాయి.లేపాక్షి శిల్పాల స్కెచ్ లు శిల్పరేఖ పేరుతో ప్రచురించారు. వారి చిత్రలేఖనం మీద ప్రముఖులు రాసిన వ్యాసాలు ప్రచురించటానికి రెడీగా ఉన్నాయి.అవి గాక వీర్రాజు గారు వెయ్యికి పైగా ముఖచిత్రాలు వేసారు వాటిని పుస్తకం గా వేయాలని ఉంది.అవి కలర్స్ లోనే వేయాలి కనుక ఆర్థికంగా భారమే కానీ వీలువెంట వేసే ప్రయత్నం చేస్తాను. 12)Kasturi Murali Krishna:ఆయన రచనల గురించి విశ్లేషణలు చేయించి ప్రచురించటం, జ)పైన అయిదవ ప్రశ్నలో తెలియజేసాను 13) అవార్డులివ్వటం లాంటివి...... జ) వీర్రాజు గారు ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు నడిపిన రీతిలో ప్రతిష్టాత్మకంగా ఇవ్వాలని ఉంది.ఏప్రక్రియకు,ఏరంగానికి ఇవ్వాలి అనేది ఇంకా నిర్ణయం కాలేదు. ఈలోగా రాజమహేంద్రవరంలోని చిత్రకళానికేతన్ లో సాయంత్రం పూట పిల్లలు వచ్చి నేర్చుకోవటం చూసాను.అందుకని వాళ్ళని ప్రోత్సహించేందుకు ప్రతీ ఏడాదీ పోటీ పెట్టి మా కుటుంబసభ్యుల పర్యవేక్షణలో బహుమతులు ఇవ్వటానికి నిర్ణయించుకున్నాము. 14)Kasturi murali k: ఈ సంకలనంలోని వ్యాసాల్లో మీకు వ్యక్తిగతంగా నచ్చినవ్యాసం ఏమిటి? జ) సగం వరకూ వ్యాసాలు బాగున్నాయి.అయిదారు వ్యాసాలు నాకు బాగా నచ్చాయి.కొన్నివ్యాసాలు బయోడేటా ఆధారంగానే రాసినట్లు ఉండటంతో విషయం చర్వితచర్వణంగా ఉన్నాయి. అయితే మీరు ఒక్కటే చెప్పమన్నారు కనుక నందిని సిధారెడ్డిగారి వ్యాసం చాలాబాగుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి