10, జనవరి 2023, మంగళవారం

భాషా వారధి కోడూరు ప్రభాకరరెడ్డి

,~~ భాషా వారధి కోడూరు ప్రభాకర రెడ్డి గారు ~~ ఆధునిక యుగంలో ఒక భాషలో చెప్పిన విషయాన్ని మరొక భాషలో చెప్పడం అనే ప్రక్రియ "అనువాదం" గా స్థిరపడింది.అనగా పునఃకథనం గా వ్యవహరించవచ్చు. భారతీయ భాషలనుండి, విదేశీ భాషల విశ్వసాహిత్యం నుండి తెలుగులోనికి ఆదాన ప్రదానాలు చాలా కాలంగా జరుగుతూనే ఉన్నాయి. అయితే తెలుగు భాషలోకి అనువాదాలు అయినట్లుగా, తెలుగు నుండి ఇతర భాషలలోని అనువదింపబడిన రచనలు తక్కువ అనే చెప్పక తప్పదు. అనువాదం అంతసులువైన ప్రక్రియ కాదు.అనువాదాలు రాణించాలంటే అనువాదకునికి ఉభయ భాషా పరిజ్ఞానం తో పాటు జనజీవనవిధానాలూ, సాంస్కృతిక నేపధ్యం,వాతావరణం,ఆచారవ్యవహారాలు కూడా తెలిసిఉండాలి. మూలరచనను యథాతథంగా తెలుగులోనికి తర్జుమా చేయడం ఒక పద్ధతి కాగా ఆ మూల రచన సారం చెడకుండా అనుసృజన చేయడం ఇంకొక పద్ధతి. తెలుగు అనువాద సాహిత్యాన్ని స్థూలంగా రెండు భాగాలుగా విభజించవచ్చు. భారతీయ సాహిత్యం నుండి తెలుగుభాషలోనికి అనువాదాలు ఒక భాగం, విదేశీభాషా సాహిత్యం నుండి తెలుగులోనికి అనువాదాలు మరొక భాగం. ఒకప్పుడు తెలుగునాట పత్రికలు యధేఛ్ఛగా రాజ్యమేలుతున్న కాలంలో అనువాద రచనలతో తెలుగు సాహిత్యం పరిపుష్టమైంది. మనకి పొరుగు భాషలైన తమిళ కన్నడాల నుంచే కాక, బెంగాలీ తదితర భారతీయ భాషలనించీ, ఆంగ్లం, ఫ్రెంచి, రష్యను ఇత్యాది ప్రపంచ భాషలనించీ కూడా తెలుగులోకి సాహిత్యం ప్రవహించి సాహిత్య పాఠకులకు వివిధప్రాంతాల సాహిత్యాన్నీ,సాహితీవేత్తల్నీ పరిచయం చేసింది. జాక్ లండన్ కథలూ, అలెక్జాండర్ డ్యూమా, మార్క్ ట్వైన్, మాక్సిం గోర్కీల నవలలూ కథలూ ఇవి అసలు తెలుగులోనే రాశారేమో అనిపించేంత సహజంగా మనకి దగ్గిరయ్యాయి. శరచ్చంద్ర ఛటర్జీ,ప్రేమ్ చంద్, బంకించటర్జీ లైతే తెలుగువారేనేమో అన్నంత సాన్నిహిత్యం తెలుగు పాఠకులకు ఏర్పడిపోయింది. తెలుగువాళ్లు అనువాదాలను ఎప్పుడూ ఆదరించారు,ఆనందిస్తూనే ఉన్నారు. 1950లలోనే ఆంధ్రపత్రిక వీక్లీ ప్రసిద్ధ ఆంగ్ల, ఫ్రెంచ్‌ నవలలను తెలుగులోకి అనువదింప చేసింది.సోవియట్ లాండ్ ప్రచురణలుగా రష్యన్ రచనలు తెలుగు పాఠకులకు దగ్గరయ్యాయి. అనువాదాల వలనే సాహిత్యం ఆలంబనగా భిన్న మానవ సమాజానికి దగ్గరవుతుంది. తమిళంలో శరత్‌ నవలలు, రవీంద్రుడి నవలలు తప్ప యితర భారతీయ భాషల్లోని రచనలను తమిళులు ఎక్కువగా ఆదరించినట్లులేదు.కానీ తెలుగు వాళ్ల లాగానే కన్నడం వాళ్లు అనువాదాలను ఆమోదిస్తారు. అనువాద కథలే ప్రధానంగా నడిచే ''విపుల'' వంటి తెలుగు పత్రిక కూడా మనకి పలు భాషా రచనల్ని అందుబాటులోకి తెచ్చింది . ఇంగ్లీషు మన మాతృభాష కాదు కనుక, ఇంగ్లీషు వాళ్లు మన భాష నేర్చుకుని అనువాదాలు చేయాలంటే అది ఎప్పటికోగాని సాధ్యంకాదు ఇంగ్లీషులో ఫిక్షన్‌ రాసే తెలుగువారు ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువాదాలు చేస్తే అవి బాగుంటాయి. ఇంగ్లీషు వచ్చినంత మాత్రాన అనువాదానికి ఉపక్రమిస్తే పఠనీయత వుండదు. ఇతర భాషల్లో నుంచి అనువాదం చేసేటప్పుడు నుడికారం గురించి, నేటివిటీ గురించి చాలా జాగ్రత్తగా వుండాల్సి ఉంటుంది.అందులోని భావాన్ని గ్రహించి తెలుగువాడైతే ఎలా రాస్తాడు అనుకుని ఆ ధోరణిలో రాయాల్సి ఉంటుంది. అది ఒక కష్టమైన ప్రక్రియ. ఆంగ్లంలో చదవగలిగే విద్యావంతులు పెరగటం వలన తెలుగులో రానురాను అనువాదాలకు ఆదరణ తగ్గింది. మూలకథాంశం,దాని మూలతత్వం,,పాత్రలస్వభావం వీటినన్నింటినీ,మూలరచనకు భంగం కలగకుండా,మూలరచయిత ఆత్మను పట్టిచూపేలా రాయటం కత్తిమీదసామే. అనేక మంది అనువాదం , అనుసృజన చేసారు.కానీ మూలరచనతో వాటిని పోల్చటానికి వీలు లేకుండా అనువాదకులు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభాకర రెడ్డి గారు వృత్తిరీత్యా శిశువైద్యులు.ప్రవృత్తి రీత్యా సాహిత్యోపాసన చేస్తూ అనేక గ్రంథాలు వెలువరించారు. ఆంధ్ర, ఆంగ్ల,హిందీ,సంస్కృతభాష ల్లో నిష్ణాతులు కావటాన అనువాద ప్రక్రియలో, శైలిలో డా.ప్రభాకరరెడ్డిగారు మెచ్చుకోదగిన ప్రతిభ కనబరుస్తున్నారు. తెలుగు కథల పేర్లు మూల కథల పేర్లకి డైరెక్టు అనువాదాలుగా కాక, కథా వస్తువుని సూచించే విధంగా, సహజంగా, ఆర్ద్రతతో, కొండొకచో చమత్కారంతో పేర్లు పెట్టటంలో రచయిత అభివ్యక్తి తేటతెల్లమౌతోంది. చాలా వరకూ కథనం, సంభాషణలూ సహజమైన భాషలోనే ఉన్నా, అక్కడక్కడా అనువాదకుడు ఆంగ్ల వాక్య నిర్మాణపు మోహంలోకి చిక్కిపోతారు. కాకపోతే, కథా వస్తువులన్నీ సార్వజనీనమైన అనుభవాలే కావటంతో, ప్రత్యేక ప్రాంతీయ విశేషాల్నీ ఆచార వ్యవహారాల్నీ వివరించాల్సిన అదనపు బాధ్యత లేదు అనువాదకుడికి. తనకి అపరిచితమైన సంస్కృతులనించి వచ్చిన కథలనైతే తర్జుమా చెయ్యటంలో అనువాదకుడు కొంత అధిక పరిశ్రమ చెయ్యాల్సి ఉంది. అందులోనూ సాహిత్యరంగంలో అనేకమంది కథకులను ప్రభావితం చేసినటువంటి ప్రపంచ సాహిత్యం లో సుస్థిర స్థానం గల ఓ హెన్రీ కథల్ని అనువదించడం ఒక సాహసమే.ఓహెన్రీ కథలోని సామాన్యమైనవిగానే కనిపించే పాత్రలు పాఠకులను ఆకట్టు కుంటాయి.పాత్రలచిత్రణ,చిరుహాస్యం,పఠనీయత, శైలీ విన్యాసం,సరళమైనపదాల రచనా విధానం, ఊహకందని ఆశ్చర్యం గొలిపే మలుపులు, అన్నింటినీ మించి కొసమెరుపుతో కథలన్నీ కథానికా రంగంలో ఉన్నతస్థానాన్ని అలంకరించాయి.అటువంటి ఓహెన్రీ కథల్ని అంతే స్థాయిలో అంతేశ్రథ్థతో తేలికైన సరళ వచనంలో అనువదించారు రెడ్డి గారు. The last leaf (శేషపత్రం),The Green Door (ఆకుపచ్చ తెలుపు)The Gift of the Magi(క్రిస్మస్ కానుక)వంటి కథలు తెలియని వారు వుండరు. అదేవిధంగా కీట్స్ కవితల్ని పద్యరూపంలో అనువదించారు.పద్యరచన చేయాలంటే పదాలకూర్పు, అలంకారాలు,రమణీయత,శైలి విషయాల్లో ప్రభాకర రెడ్డి గారు మరింత జాగ్రత్త తీసుకొని రాయటం గమనించవలసిన విషయం. కీట్స్ తన ఆలోచనలకు అక్షరరూపం కల్పిస్తాడు. ఆ ఆలోచనలనూ అందులోని అనుభూతులూ అందిపుచ్చుకొని ఛందోబద్ధమైన అనుసృజన చేసారు రెడ్డి గారు. To solitude (ఏకాంతవాసం)కవితలో తన వ్యాకులతని, గ్రామీణ ప్రాంతాలకు పారిపోవాలనే కోరికను,తనతో పాటూ తనని అర్థం చేసుకొనే ఒకతోడుకోసం పడే ఆరాటాన్ని వ్యక్తీకరించారు కీట్స్. " ఒంటిగా నున్న మాతోడ నున్న యెడల ఎంతబాగుండునోయి ఏకాంతవాస-" అంటూ మూలకవి హృదయాన్ని పంచుకున్నారు రెడ్డి గారు.కవిగా కీట్స్ విషయాసక్తిని హృదయంగమమైనదిగా భావించి సరియైన భావచిత్రాలను ఉపయోగించి తనదైన ప్రకృతిసహజశైలిలో అనువదించారు. ప్రపంచ సాహిత్యంలో దారిదీపం వంటి షేక్స్పియర్ కొరుకుడు పడని బ్రహ్మపదార్థం వంటి "ది సానెట్స్" ను రాసాడు.ఆనాటి ఉత్తమ గ్రంథాలులో ఒకటిగా ప్రముఖులచేత ప్రశంసించ బడిన 154 సానెట్స్ ను చిక్కని భావచిత్రాలతో తెలుగు దేశీఛందస్సు అయినా సీసపద్యాలలో అనుసృజన చేయడమే కాకుండా ప్రతీసానెట్ కీ లఘుటీక జోడించడం సాహసమే కాక అత్యంత ప్రయాసతో కూడిన కార్యం. షేక్స్పియర్ సానెట్స్ ( భావచిత్రాలు) గ్రంథరూపం దాల్చడానికి రెడ్డిగారి సోదరుడు కోడూరు పుల్లారెడ్డి గారి ప్రోత్సాహం మే కారణం అంటారు. " మరణమందిన వారలు మరుగు పడిన ఇంపులొల్కు కవితల కీర్తించబడుచు మరల పుట్టిన యంతటి వరకు నాదు ఉత్తమకవితల బ్రతికి యుందురోయి" అంటూ కవిత గొప్పదనాన్ని ఒక సానెట్ లో ప్రస్తుతించారు. ప్రభాకర రెడ్డి గారు అనువాదాలలో అవసరాన్ని బట్టి దేశీయ ఛందస్సు ను ఉపయోగించినా యథాతథంగా మూలరచనలోని పదాల్ని దృష్టిలో వుంచుకుని పదలాలిత్యాన్ని మరుగు పడనీకుండా,అర్థం చెడకుండా ఛందస్సులో బంధించటం అంత సులభమేమీ కాదు.పలుభాషా స్వాధీనత గల ప్రతిభావంతులైన ప్రభాకర రెడ్డి గారి అనువాద గ్రంథాలు చదివిన వారికెవరికైనా వారి భాషా పటిమ అర్థమౌతుంది. ప్రభాకర్ రెడ్డి గారికి ప్రాచీన ఆంగ్ల సాహిత్యం పైమక్కువ, గౌరవం ఉంది,వాటిని తెలుగు ప్రజలకు అందించాలనే ఆతురతా ఉంది,రెండు భాషలపై అభివ్యక్తి ఉంది ఇన్ని భావాలు మధ్య వారి మనసు పెట్టే ఘోష వారిని ఇన్ని అనువాదాలు చేసేలా చేసింది. ఆంగ్ల సాహిత్యం లో ఎన్నదగిన రచయితల సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందుబాటులోకి తెచ్చిన కోడూరి ప్రభాకర రెడ్డి గారికి తెలుగు సాహితీరంగం పక్షాన నమోవాకాలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి