12, జూన్ 2020, శుక్రవారం

తెలుగు భాష ఆడవాళ్ళకు ప్రత్యేకం గా ఇచ్చిన వరాలు ఏవి

స్త్రీల నోముల పాటలు, పెండ్లిపాటలూ, బతుకమ్మపాటలూ, జోలపాటలూ, పండుగపాటలూ, వేడుకపాటలూ మొదలగునవి తెలుగుభాష ఆడవాళ్ళకు ఇచ్చిన ప్రత్యేక వరం..ఇది మామనవరాలు 7 వ తరగతి ప్రధమ భాష తెలుగు పరీక్షకోసం చదువుతుంటేవిని తెల్లబోయాను. 7 వ తరగతి పుస్తకం లోని 12 వ పాఠం ‘తెలుగు వెలుగు” లో తెలుగు భాషగొప్పదనాన్ని తెలియజేసేందుకు ఉద్దేశించి పెట్టినది కావచ్చు.ఇది మాత్రమే తెలుగు భాష వల్ల స్త్రీలకు లభించినది అని మన తెలుగు చదివే మన పిల్లలు నేర్చుకొంటున్నారు….
తెలుగుభాషకి చెందిన సాహిత్యం చదివే కదా? మన ఆలోచనలు వికసించాయి.అవి చదివేకదా మనం మన అస్తిత్వం కోసం కల గంటున్నది.అవి చదివేకదా మనం కూడా ఇంత సాహిత్యాన్ని పండిస్తున్నది.మరి పసితనం లోనే ఆలోచనలు కత్తిరించేలా ఆ పాఠాన్ని చేర్చినవాళ్ళు ఆలోచించలేదేమిటీ చెప్మా?
ఇంకా ఘోరం ఏమిటంటే పాప 5వ తరగతి లో వున్నప్పుడు పిసినారి అని ఒక పాఠం వుండేది.అందులో పిసినారి పాయసం తినాలనిపించి చేయించుకొని తీరా బంధువు ఒకడు వస్తే వానికి భోజనం పెట్టాల్సి వస్తుందని చనిపోయినట్లు నటిస్తాడు. అప్పుడు అతని భార్య తన పసుపు కుంకుమలు పోయాయని ఏడుస్తుంది.
ఆ పాఠం లో ప్రశ్న పిసినారి భార్య ఏమని ఏడుస్తుంది? తన పసుపుకుంకుమలు పోయాయని ఏడుస్తుంది అనేది సమాధానం. ఏడ‌వ‌త‌ర‌గ‌తి చదువుతున్న పిల్లలకి పసుపు కుంకుమలు పోవటమంటే అని సందేహం వస్తే ఏమని చెప్పాలి! కుంకుమా పసుపు ధ‌రించ‌డం అందరికి పుట్టుకతో వచ్చే హక్కు. ఇది ఆ వయసు పిల్లలకేకాక ప్రతీ పిల్లల గురించీ ఆలోచించాల్సిన పరిస్థితి వుంది. పిల్లలకి చిన్ననాటీనుండీ మూఢ విశ్వాసాల్ని నింపుతోన్న సిలబస్ని మార్చాల్సిన అవసరం ఎంతో వుంది. అందుకోసం అభ్యుదయ భావాలున్న సాహితీవేత్తలు వుద్యమించాల్సివుందని అనుకుంటున్నాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి