20, సెప్టెంబర్ 2025, శనివారం
అంత తొందర ఎందుకు రజితా
~ అంత తొందర ఎందుకు రజితా??? ~
ఒక రోజు స్కూల్ నుండి వచ్చి ఇంట్లో అడుగు పెట్టేసరికి " హల్లో" అంటూ హాల్లో కూర్చొని వున్న కుటుంబ స్నేహితురాలు డా.భార్గవీరావు పలకరించారు.
నేను పలకరింపుగా నవ్వి ఫ్రెష్ అప్ అయి వస్తానని లోపలికి వెళ్ళి అయిదు నిముషాలలో వచ్చి మాట్లాడటానికి కుర్చీలో కూర్చుంటూ భార్గవి రావు పక్కనే సోఫాలో కూర్చున్న అమ్మాయి వైపు ప్రశ్నార్థకంగా చూసాను.
చుడీదార్ వేసుకుని చున్నీని మెడ నుండి కండువాలా ముందుకే వేసుకొని బాయ్ కట్ క్రాప్ తో
చిన్నగా మా స్కూల్ లో పదోతరగతి అమ్మాయిలా వుంది.
భార్గవి ఆమెని పరిచయం చేసింది."అనిశెట్టి వరంగల్ లో వుంటుంది.కవితాసంపుటికి ముఖచిత్రం వీర్రాజు గారితో వేయించుకోవాలని అనుకుంటుంటే నాకు తెలుసు అని రజితను మీ ఇంటికి తీసుకొని వచ్చాను" అంది.
అనిశెట్టి రజిత పేరు పత్రికల్లో అప్పుడప్పుడు చూసినదే.1994 లో "నేనొక నల్లమబ్బునౌతా" మొదటి కవితాసంపుటి కి ముఖచిత్రం కోసం వచ్చి నాకు అలా పరిచయం అయ్యింది.
ఆ పుస్తకానికి వేసిన ముఖచిత్రం బాగా వచ్చిందని వీర్రాజుగారు ఆతర్వాత దానినే తైలవర్ణ చిత్రంగా 3×4అడుగుల సైజులో వేసారు.
కాకతీయ విశ్వవిద్యాలయంలో సదస్సుకు హాజరైనప్పుడూ, హైదరాబాద్ లో కొన్ని సభల్లోనూ రజిత ఆ తర్వాత ఎప్పుడు కలిసినా చాలా ఆత్మీయంగా మాట్లాడేది.
చిన్నగా ముఖమంతా నవ్వుతో పలకరించే ఈ అమ్మాయి 1969 నుండే వుద్యమస్ఫూర్తి కలిగి వుందని తెలిసి మొదట్లో ఆశ్చర్యపోయాను.ఆత్మీయంగా మెత్తగా మాట్లాడే రజిత అవసరసమయంలో ఎంత దృఢచిత్తంతో వ్యవహరిస్తుందో కాలక్రమేణా తెలుసుకున్నాను.నిజాయితీ,నిబద్ధత కలిగిన రజిత జీవితం, సాహిత్యం,ఉద్యమం ఏవీ వేర్వేరు కాదని
అన్నీ తన వూపిరిగానే బతికిన ధీరగానే గుర్తించాను.
నేను నా ముందుతరం రచయిత్రుల కథలు గురించి రాసిన వ్యాససంపుటి చూసి దాని గురించి ఆ తరం రచయిత్రుల గురించి ఫోన్ లో చాలా సేపు మాట్లాడటమే కాక తానే అరడజను పుస్తకాలు కొనటం ఆశ్చర్యం కలిగించింది.
కుందుర్తి శతజయంతి సందర్భంగా ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రతిభా పురస్కారానికి రజితను ఎంపిక చేసినట్లు వీర్రాజుగారు ఫోన్ చేసి చెప్తే చిన్నపిల్లలా సంబరపడింది.ఆ సమయంలో కరోనా కారణాన సమావేశం వాయిదా పడటంతో ఫ్రీవర్స్ ఫ్రంట్ వాట్సాప్ సమూహం ఏర్పాటు చేసి కవులను అందులో చేర్చాము.ప్రతిభాపురస్కారానికి ఎంపిక చేసిన ఆరుగురు కవులనూ పరిచయం చేస్తూ నేను సమూహంలో రాసేదాన్ని.
అదే విధంగా రజితను గూర్చి కూడా రాసింది చదివి "క్లుప్తంగానే కాక సమగ్రత కూడా వుండేలా నా గురించి ఎంతబాగా రాసారు " అంటూ మురిసిపోయి
ఫోన్ చేసిన అల్పసంతోషి రజిత.అంతేకాక నేను రాసిన పరిచయాన్ని అన్ని వాట్సాప్ సమూహాలలో నూ ఎంతో సంతోషంగా షేర్ చేసుకున్న పసిమనసు రజితది.
వీర్రాజుగారి మరణానంతరం పలుమార్లు ఫోన్ చేసి సాంత్వనగా మాట్లాడిన స్నేహిత ఆమె.
తర్వాత మాయింటికి వచ్చి ఒక సోదరిగా నాకు చీర యిచ్చి " ధైర్యంగా నిలదొక్కుకుని సాహిత్యంలో గడుపుతున్నందుకు ఆత్మీయంగా అభినందించిన
ఆత్మీయ బంధువు రజిత.
తర్వాత రజిత వీర్రాజుగారి గురించి వ్యాసం రాయటమే కాక వీర్రాజు గారి ప్రథమ వర్థంతి సమావేశానికి స్వయంగా వరంగల్ నుండి శ్రమతీసుకుని వచ్చి నాకు అండగా నిలబడటంతో స్నేహితులు కన్నా ఆత్మీయ బంధువులు ఇటువంటి వారుకాక ఇంకెవరు అనిపించింది.
ఆ తర్వాత ప్రరవే సమావేశాల్లో తప్ప తరుచూ కలవకపోయినా మానసికంగా మరింత దగ్గిరైంది.సమాజంలో వితంతువుల స్థితిగతులమీద పుస్తకం వేస్తున్నానని ఫోన్ చేసి నా రచనలను అడిగి తీసుకుంది.ఆ విషయాలమీద ఫోన్లు చేసి చాలాసేపు మాట్లాడేది.అంతేకాకుండా మా అమ్మాయి పల్లవిని ఆ పుస్తకానికి ముఖచిత్రం వేయమని అడిగింది.పల్లవి చాలా చిత్రాలను డిజైన్ చేసి ఇస్తే వాటినన్నింటినీ పుస్తకంలో అక్కడక్కడా వేసి పల్లవిని ప్రోత్సహించింది.
ఆగష్టు 10 న వరంగల్ లో సింగరాజు రమాదేవి " ఔను..నాకు నచ్చలేదు"
కథలసంపుటి ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించింది. అప్పుడు రజిత నాకు ఫోను చేసి వరంగల్లో కలుద్దాం అంటూ మాట్లాడింది.రజిత ఎప్పుడు ఫోన్ చేసినా చాలాసేపు సాహిత్యం గురించి,తాను చేయదలచిన ప్రాజెక్టుల గురించి,తన ఆరోగ్యం గురించి చాలా సేపు కబుర్లు చెబుతుంది.నేను కూడా అలాగే మాట్లాడతాను.
నేను మా అమ్మాయి,మనవరాలితో కలిసి వరంగల్ వెళ్ళాను.సభని ఆద్యంతం ఆసక్తికరంగా ఆహ్లాదభరితంగా ఛలోక్తులతో రజిత అధ్యక్షత బాధ్యతను నిర్వహించింది.అంతేకాదు సభ మధ్యలో తన సంపాదకత్వంలో వితంతువ్యవస్థపై తెచ్చిన పుస్తకాన్ని చూపించి పల్లవిని కూడా సభకు పరిచయం చేయటం మా కుటుంబం పట్ల రజితకు గల గాఢ అనురక్తికి తార్కాణం.
సభానంతరం కలిసి భోజనం చేస్తూ కూడా కబుర్లు కొనసాగాయి.అప్పటికే అలసిపోవడం వలన కొంత అనారోగ్యం రజితను వెనక్కి లాగుతోన్నా నవ్వుతూ ఫొటోలు తీయించుకుంటూ సందడి చేస్తూనే వుంది.తాను హైదరాబాద్ వచ్చినపుడు కలుద్దాం అని అంది.
మధ్యాహ్నానికి మళ్ళా వర్షసూచనలు మొదలయ్యే సరికి మేము తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాం.వర్షాలు తగ్గాక మళ్ళీ వస్తే వరంగల్ చుట్టుపట్ల అన్నీ చూడటానికి కలిసి వెళ్దాం
అని మాతో చెప్పిన రజిత మాకు వరంగల్ అంతా చూపించకుండానే తొందరపడి హడావుడిగా ఆత్మీయులను అందరినీ వదిలి అనంత దూరాలకు వెళ్ళిపోయింది.
వరంగల్ ముచ్చట్లు చెప్పుకోకుండానే ఉరమని పిడుగులా వార్త .వారం రోజుల వరకూ
మామూలు కాలేక పోయాను.ఒక విధమైన వైరాగ్యం నన్ను ఆవహించింది.
నడక దారిలో -56
నడక దారిలో -56
కొత్త ఇంట్లో ఫర్నిచర్ కోసం కార్పెంటరీ వర్క్ ప్రారంభించాడు చారి.రోజూ నేను గానీ , వీర్రాజుగారు గానీ ఆషీస్కూలుకీ,పల్లవి ఆఫీసుకీ వెళ్ళాక పదింటికి బయలు దేరి వెళ్ళేవాళ్ళం.పదింటికి భోజనం చేసేసి, బాక్స్ లో టిఫిన్ తీసుకొని వెళ్ళి తిరిగి సాయంత్రం నాలుగింటికి తిరిగి వచ్చేవాళ్ళం.
వీర్రాజుగారు తాను ముచ్చటపడి కొనుక్కున్న కళాకృతులకు సరిగ్గా అమరిక వుండేలా పదేపదే డిజైన్లు తయారు చేసుకొంటూ దగ్గరుండి మరీ హాల్ లోని షెల్పులు ఎలా చేయాలో తన కోరిక మేరకు చేయించారు.వార్డరోబ్ లను మాత్రం మా ఇష్టానికి వదిలేసారు.
వీర్రాజుగారు 1961 లో హైదరాబాద్ వచ్చిన దగ్గర్నుంచి ఉన్న మిత్రులలో శ్రీరామారావు గారు ఒకరు.ఆయన ఇల్లు మా కొత్త ఇంటికి పదినిముషాల నడక దూరంలోనే ఉంటుంది.వీర్రాజుగారు అక్కడకు వెళ్ళినప్పుడు శ్రీ రామారావుగారిని కలిసి ఆయనకి మా కొత్తింటిని చూపించారు.ఇక్కడకు షిఫ్ట్ అయ్యాక మనం తరుచూ తెలుసుకోవచ్చని ఇద్దరూ సంబరపడ్డారు.
అయితే మేము షిఫ్ట్ కాకముందే అనుకోకుండా మాసివ్ హార్ట్ ఎటాక్ తో శ్రీరామారావుగారు అనంతలోకాలకు షిఫ్ట్ కావటం వీర్రాజుగారిని దుఃఖంలో ముంచెత్తింది.వీరిద్దరి పాత స్నేహితులైన రామడుగు రాధాకృష్ణ మూర్తి గారు,శ్రీపతిగారూ అందరూ శ్రీరామారావువాళ్ళింటికి వచ్చి శోకతప్తులయ్యారు.
కొత్త ఇంటికి వచ్చాక వీర్రాజుగారికి మంచి కాలక్షేపం అనుకున్నాం పల్లవీ,నేనూ.కానీ ఇలా జరగటం బాధ కలిగింది.
పల్లవికి ప్రోజెక్ట్ మేనేజర్ గా ప్రమోషన్ రావటంతో చాలా బిజీగా అయిపోయింది.ఇంట్లో జరుగుతోన్న పనిని సూపర్వైజ్ చెయ్యటానికి కూడా కుదరలేదు.
అక్కడ పని జరుగుతోన్న రోజుల్లోనే బిల్డర్ ఇస్తానన్న ఏసీలు,ఫేన్లూ ఇంట్లో ఫిక్సింగ్ జరిగాయి.
ఒకరోజు నేను అక్కడికి వెళ్ళి కార్పెంటర్ పని చేస్తుంటే ఏదో పుస్తకం పట్టుకొని కూర్చునే దాన్ని.
ఒకరోజు ఇంటినుండి వీర్రాజుగారు అక్బరుద్దీన్ ఒవైసీ పై హత్యాయత్నం జరిగిందంట గొడవలుజరుగుతాయేమో వచ్చేయమని ఫోన్ చేసారు.నేను వెళ్ళే దారి అటువంటిది.అందుకని సాయంత్రం వరకు వుండకుండానే ఇంటికి వచ్చేసాను.కానీ అది రెండు మతాల మధ్య జరిగిన సంఘటన కాదు కనుక సమసిపోయింది.
అప్పట్లోనే జరిగిన మరో సంచలన సంఘటన పుట్టపర్తి సాయిబాబా చాలా కాలం అనారోగ్యంగా వుండి మరణించటం.ఆ నెలంతా దీనిపై అనేకానేక వూహలూ,పుకారులూ వ్యాపించటమే కాక పుట్టపర్తిలో వరుసగా జరిగిన అనూహ్య పరిణామాలు అవి కేవలం పుకార్లేకాదనిపించింది.ప్రపంచదేశాలన్నింటా సాయిబాబా భక్తులు వున్నారు.ఆ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలు నిగ్గు తీసే వారెవ్వరు.
అయిదారేళ్ళ క్రితం వీర్రాజు గారి బాల్య మిత్రుడు సత్యనారాయణ కొడుకు పెళ్ళి అక్కడే జరిగినప్పుడు వీర్రాజుగారూ నేనూ పుట్టపర్తి వెళ్ళాము.వీర్రాజుగారు రూములోనే వుండిపోతానన్నారు.నేను కుతూహలం కొద్దీ పెళ్ళి వారితో ప్రార్థనా మందిరం లోనికి వెళ్ళాను.అక్కడ సాయిబాబాని అతి దగ్గరగా చూసాను.అక్కడున్న మ్యూజియం చూసాము.ఎందుకో అక్కడంతా ఏదో అసహజంగా వుండి నాకు వూపిరాడనట్లుగా అనిపించింది.ఇప్పుడు సాయిబాబా మరణం ఎన్నో ప్రశ్నలకు తెరతీసింది.
మొత్తంమీద మూడు నెలలకు పైగా సమయంలో కార్పెంటర్ ఈ వర్క్ చాలావరకు పూర్తి చేసాడు.ఏప్రెల్ లో ఆషీకి నాలుగో తరగతి సంవత్సరాంత పరీక్షలు పూర్తి అయ్యాయి.మే నెలలో కొత్తంటికి షిఫ్ట్ కావాలనుకున్నాము.సామాన్లు కొంచెంకొంచెంగా సర్దటం మొదలుపెట్టాం.
కళ్యాణ్ వచ్చి షిప్టింగ్ కి సహాయం చేస్తానన్నాడు.మా మరిదికి కారు వుంది.అది తీసుకొచ్చి విలువైన వస్తువులనూ, జాగ్రత్తగా షిఫ్ట్ చెయ్యాల్సిన వాటినీ కారులో అయిదారు ట్రిప్పులు వేసి కొత్తంట్లోకి చేర్చాడు.పేకింగ్ & మువర్స్ వాళ్ళని మాట్లాడాము.మూడు ట్రిప్పులలో సామాన్యంగా షిఫ్ట్ చేయొచ్చు అనుకున్నాము.కానీ అయిదారు ట్రిప్పులు వేస్తే గానీ పూర్తికాలేదు.అప్పటికీ నాలుగైదు ట్రంక్ పెట్టెలూ,టీవీ స్టాండు లాంటివి వాళ్ళకే ఇచ్చెసాము డైనింగు టేబుల్ కొత్త ఇంట్లో బిల్డర్స్ ఇస్తారు కదా అనీ అదీ వదిలేసాము.షెల్ఫ్ లు ఓ రెండింటిని వదిలేసాము.కేవలం పుస్తకాలకే మూడు ట్రిప్పులు అయ్యాయి.తీసుకోచ్చి ప్రతీ గదిలో దుప్పటిలో మూటకట్టిన పుస్తకాలని కుప్పపోసారు.
" అర్జంటుగా సర్దేయకండి.తాపీగా సర్దుకోవచ్చు " అన్నాసరే వినకుండా వీర్రాజుగారు ఆఘమేఘాలమీద సర్దేసారు.మొత్తంమీద సరూర్ నగర్ ఇంటికి వచ్చేసాము. ఈ ఏడాది వేరే స్కూల్ లో చేర్చాలనుకుంటే ఆషీ ఒప్పుకోలేదు.అదేస్కూల్ లో చదువుతానని అంది.ఇంక రానూ,పోనూ స్కూల్ బస్ నే కుదిర్చాము.
ఇంతకాలం అమ్మానాన్నల ఇంట్లో వున్నాననే భావం పల్లవికి వుండేవుంటుంది.ఇప్పుడు తనదైన ఇంట్లో వుండటం అనేది తనకి తృప్తినిస్తుందని నేను భావించాను. అంతకుముందు ఆఫీసుకు మాట్లాడుకొని సలీం ఆటోలోనే పల్లవి ఆఫీస్ కు వెళ్ళేది.
ఈ ఇంటికి వచ్చేక పల్లవిగానీ,ఆషీగానీ అక్కడ నలుగురి ప్రశ్నలూ ఎదుర్కొనే పరిస్థితి ఉండకూడదని భావించి నేనూ , వీర్రాజుగారూ ఒకరోజు ఆషీని పక్కన కూర్చో బెట్టుకుని తన తండ్రి ఎలా పోయాడో,ఆ పరిస్థితులేమిటో అన్నీ వివరంగా చెప్పాము.ఇంత వరకూ ఆషీకూడా అందరు పిల్లలూ తల్లిదండ్రులతో తిరుగుతారు కదా తన తండ్రి ఎవరూఅని ఎప్పుడూ అడగకపోవటం కూడా మాకు ఆశ్చర్యమే.చిన్నప్పుడు ఒకరిద్దరు మీ నాన్న పేరేమిటి అని అడుగుతుంటే వీర్రాజు అనే చెప్పేది.మేము చెప్పిన విషయమంతా విని ఏమీ కామెంటు చేయకుండా ముఖం కూడా అభావంగా పెట్టి నిశ్శబ్దంగా వూరుకుంది ఆషీ.అంత చిన్న వయస్సులోనే అంత గుంభనంగా వుండటం ఆశ్చర్యం కలిగించింది.తర్వాత కూడా ఆ పిల్ల ఎప్పుడూ ఆ ప్రసక్తే తీసుకుని రాలేదు.
మేము ఇంట్లో అన్ని సర్దుకున్న తర్వాత బంధువులకూ,మిత్రులకూ,పల్లవి సహోద్యోగులకూ ఒక ఆదివారం విందుకు పిలిచాము.అందరూ వచ్చి ఇల్లు చాలా బాగుందని అభినందనలు తెలియజేశారు.
మరొక రోజు లేఖిని మిత్రుల్ని ఆహ్వానించాను.వాసాప్రభావతి,డి.కామేశ్వరి, అబ్బూరి ఛాయాదేవి, తురగా జానకీరాణి, ఇంద్రగంటి జానకీ బాల,శారదాఅశోకవర్థన్,తమరిశ జానకి మొదలైన రచయిత్రులు ఒక పాతికమంది వరకూ మా ఇంట్లో విందుకు హాజరయ్యారు.
మెల్లమెల్లగా కొత్త ఇంటికి అలవాటు పడ్డాం.బ్రహ్మానందనగర్ ఇంటికి కలర్స్ వేయించాము.ఆ పనిమీద ఆ ఇంటికి వెళ్ళినప్పుడు కొంత దిగులు వేసింది.కష్టార్జితాన్ని కూడబెట్టి కొన్ని ఇల్లది.ముప్ఫై ఏళ్ళు ఎన్నో కష్టసుఖాలను అనుభవించిన ఇల్లు.అవన్నీ గుర్తొచ్చి ' కొత్త మజిలీ' అనే కవిత రాసాను.ఆ ఇంటిని అద్దెకు ఇచ్చాము.
ఒక రోజు అనుకోని ఫోన్ వచ్చింది.ఫోన్ చేసినవారు ఆవంత్స సోమసుందర్ గారు .నాకు దీర్ఘ కవిత్వ విభాగంలో దేవులపల్లి రాజహంసా కృష్ణశాస్త్రి పురస్కారం ఆయన జన్మదినం అయిన నవంబర్ పదిహేడున పిఠాపురం లో ఇస్తానని తెలియజేసేరు.నాకు పట్టలేనంత సంతోషంతో నోట మాట రాలేదు.ఆయనే తిరిగి కవిత్వం విభాగంలో మహెజబీన్ కి ఇస్తున్నట్లు తెలియజేసి కలిసి రమ్మని సలహా కూడా ఇచ్చారు.
చాలా ఏళ్ళ క్రితం వీర్రాజుగారికి కూడా దీర్ఘ కవిత్వ విభాగంలోనే ఇదే పురస్కారం వచ్చినప్పుడు పిఠాపురం వెళ్ళాను.మళ్ళా నేను అందుకోవటం చేత పురస్కారం ఇప్పటికీ నాకు అపురూపమైనది.
మహెజబీన్ తో సంప్రదిస్తే తాను ట్రైన్ టికెట్లను బుక్ చేస్తానని తర్వాత డబ్బు తనకు ఇమ్మనటంతో సరేనన్నాను.అనుకున్నట్లుగా ఆమెతో కలిసి బయలుదేరాను.సామర్లకోట జంక్షన్ లో దిగేసరికి అక్కడకు ట్రస్ట్ సభ్యులు మన్మధ రావుగారూ,మరొక ఆయనా మమ్మల్ని రిసీవ్ చేసుకొని ముందుగా హొటల్ లో టిఫిన్ ఇప్పించి కారులో పిఠాపురంలో మాకు కేటాయించిన రూమ్ కు తీసుకు వెళ్ళారు.మేము స్నానపానాదులు పూర్తి చేసుకొని పురస్కార సమావేశం జరిగే గ్రంథాలయానికి తీసుకువెళ్ళాము.మాతోపాటు కథలకు వి.ప్రతిమ,విమర్శకు విజయలక్ష్మీ బక్ష్ అందుకున్నారు.
తర్వాత మరికొన్ని రోజులకే కడప కవితా సాంస్కృతిక సంస్థ వారిచ్చే గురజాడ పురస్కారం నా రెక్కల చూపు కథలసంపుటికి రావటం మరింత సంతోషకరం.ఈ పురస్కారసమావేశానికి యువభారతి మిత్రురాలు కె.బి.లక్ష్మితో కలిసి ప్రయాణించాను.కొత్త ఇంట్లో దిగగానే రెండు పురస్కారాలు అందుకోవటం చాలా సంతోషం కలిగింది.
బిల్డింగ్ లో ఇంకా అన్ని ఇళ్ళల్లోకీ కుటుంబాలు లేదు.ఎక్కువగా కబుర్లు చెప్పే అలవాటు లేనందున నాకు పెద్దగా స్నేహాలు పెరగలేదు.పల్లవికి ఆఫీసుకు వెళ్ళిరావటం వలన ,సమయం కుదరకపోవటం చేత బిల్డింగ్ లో ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో ఏ కార్యక్రమాలు జరిగినా నేనే వెళ్ళక తప్పేది కాదు.నేను పూజలూ,వ్రతాలూ చేయక పోయినా పిలిచినప్పుడు వెళ్ళకపోవటం, వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళ మనోభావాలను గాయపరచటం ఇష్టం లేదు.ఇది ఒక కమ్యూనిటీ బిల్డింగ్.అందుచేత ఎవరైనా పిలుస్తుంటే కాస్త ఆలస్యంగా వెళ్ళి వాళ్ళు ఇచ్చినదేదో పుచ్చుకొని వస్తే పోయేదేముంది.ఇక్కడే కలకాలం వుండే పల్లవీ,ఆషీలను అందరికీ దూరంచేసి ఉలిపికట్టెలుగా చేసే అధికారం నాకు లేదుకదా.
ఇదిలావుండగా తెలంగాణా ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది. 2011 సెప్టెంబరు 13 నుండి ప్రారంభమై 42 రోజులపాటు జరిగిన సమ్మెలో తెలంగాణాలోని ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, సింగరేణి కార్మీకులు, ఉపాధ్యాయులు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు, విద్యుత్ సంస్థ ఉద్యోగులు 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. ప తెలంగాణ ప్రాంతంలో ప్రజాజీవనం స్థంభించకపోయింది.
అయితే ముందుగా రవాణా సంస్థ ఉద్యోగులు సమ్మె విరమించగా ఇతర సంఘాలు కూడా సమ్మె విరమించాయి.ఉద్యమనాయకులు మాత్రం ఈ సమ్మె ఫలితంగా కేంద్రం ఆలోచన మార్చగలిగిందనీ,కానీ ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు.
న్యాయమూర్తి శ్రీకృష్ణ అధ్యక్షతన ఐదుగురు సభ్యుల సమితి ఆంధ్రప్రదేశ్ విభజన వలన కలిగే లాభనష్టాలు గురించి అధ్యయనం చేసి ఇరుప్రాంతాల నాయకులూ,మేధావులతో చర్చించి నివేదిక 2011 జనవరి 6న విడుదల చేసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచి తెలంగాణా అభివృద్ధికి తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయాలనేది ఒకటి అయితే తెలంగాణ, సీమాంధ్రలను వేరుచేయడం రెండవ పరిష్కారంగా సిఫారస్ చేసింది. కానీ ఇవి వ్యతిరేకించబడ్డాయి.ఉద్యమం కొనసాగుతూనే వుంది.
దసరాల్లో చిన్నక్క కుటుంబం వచ్చారు.ఇక్కడనుండి షిర్డీ వెళ్ళి తిరిగి హైదరాబాద్ వచ్చి విజయనగరం వెళ్ళటానికి ప్రోగ్రాం వేసారు.వాళ్ళతో బాటూ నన్నూ,ఆషీనీ కూడా ప్రయాణం కట్టించారు.అప్పుడే కళ్యాణ్ సహాయంతో పల్లవి కారు కొనింది.
ఒకరోజు నాకు వచ్చిన ఉత్తరం నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది.కేంద్రసాహిత్య అకాడమీ నుండి భారతీయసాహిత్యనిర్మాతలు పేరిట డా.పి శ్రీదేవి గురించి మోనోగ్రాఫ్ గురించి రాయమని ఆ వుత్తరం వచ్చింది.అప్పుడు కన్వీనర్ గా అక్కిరాజు రమాపతిరావు (మంజుశ్రీ)గారు ఉన్నారు.
వీర్రాజుగారికి ఆ వుత్తరం చూపిస్తే " పరిశోధకులు రాయగలరు కానీ నువ్వు రాయలేవు " అని నిరుత్సాహ పరిచారు.కేంద్రసాహిత్య అకాడమీ ప్రాజెక్టు కదా ఏంచేయాలో అర్థం కాలేదు.ఏవో కొన్ని వ్యాసాలు రాసాను కానీ పూర్తిగా ఒక రచయిత్రి సాహిత్యాన్ని పుస్తకానికి సరిపడేంత రాయగలనా అని నేను కూడా దానికి ఏమీ సమాధానం చెప్పకుండా వెనుకంజ వేసాను.రెండునెలల తర్వాత మళ్ళా మరో ఉత్తరం వచ్చింది.
అంతలో వాసా ప్రభావతి గారూ,డా.ఆలూరు విజయలక్ష్మి గారు
కలిసి కాకినాడలో కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వహణలో రచయిత్రుల ఒకరోజు సదస్సు ఏర్పాటు చేసారు.కవిత్వసదస్సుకు నేను అధ్యక్షురాలిగా నిర్ణయించారు.హైదరాబాద్ నుండి వాసా ప్రభావతి, ఇంద్రగంటి జానకీ బాల, గంటి భానుమతి,నేను ఇలా కొంతమంది కలిసి ట్రైన్ కి టిక్కెట్లు బుక్ చేసుకున్నాము.
ఎట్లాగూ కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళదే కావటాన అక్కడ మంజుశ్రీగారిని కలుస్తాను కనుక పి.శ్రీదేవి మోనోగ్రాఫ్ నేను రాయలేనని ఉత్తరం రాసి ఇచ్చేద్దామని నిర్ణయించుకొని ఉత్తరం తయారుచేసుకొని కవర్లో పెట్టుకొని బయలుదేరాను.
కాకినాడ స్టేషన్లో దిగి మాకోసం బుక్ చేసిన హొటల్ లో రిఫ్రెష్ అయిన తర్వాత హొటల్ కిందనే వున్న రెస్టారెంట్ లో బ్రేక్ ఫాస్ట్ కోసం వెళ్ళాం.అక్కడ కుప్పిలిపద్మ,పి.సత్యవతి, కాత్యాయిని విద్మహే తదితరులు కలిసారు.ఏదో సందర్భంలో కాత్యాయనీ తో శ్రీదేవి మోనోగ్రాఫ్ రాయమని వుత్తరం వచ్చిన విషయం చెప్పి ,నేను రాయలేనని వుత్తరం రాస్తున్నానని చెప్పాను.
కాత్యాయని "మీరు రాయలేకపోవటమేంటండి.తప్పక రాయగలరు.నేను శ్రీదేవి గురించి పి.హెచ్డీ చేయించాలనుకుంటే ఎవరూ ముందుకు రావటం లేదు.నా దగ్గర శ్రీదేవి రాసిన ' ఉరుములు- మెరుపులు' కథలపుస్తకం వుంది.దానినీ,నా దగ్గర వున్న కొంత మెటీరియల్ ఇస్తాను" అని కాత్యాయని ప్రోత్సహించటంతో కేంద్ర సాహిత్య అకాడమీ కన్వీనర్ మంజుశ్రీ గారికి నేను తీసుకు వెళ్ళిన ఉత్తరం అందజేయకుండా వూరుకున్నాను.
ఆరోజు మధ్యాహ్నం కవిత్వం సదస్సులో నేను ఆనాటినుండి ఇప్పటివరకూ కవిత్వంలో మార్పు చేర్పులు గురించి చేసిన అధ్యక్షోపన్యాసాన్ని తదనంతరం "సాహిత్య ప్రాంగణంలో కవయిత్రులు" అనే వ్యాసంగా ప్రచురించాను.ఆ సదస్సులో మందరపు హైమవతి, శరత్ జ్యోత్స్నారాణి పాత్ర సమర్పణ చేసారు.శరత్ జ్యోత్స్నారాణి ఎప్పుడో ఇరవై ఏళ్ళక్రితం రాసిన వ్యాసాన్నే అప్డేట్ చేసుకోకుండానే ప్రసంగించింది.ఎందుకంటే ఆమె ప్రసంగంలో నా మొదటి పుస్తకంలో కవితనే ఉటంకించింది.దాని తర్వాత ఏడు సంపుటాలు వచ్చిన విషయం ఆమెకు తెలియదు.హైమవతి కూడా కేవలం నీలిమేఘాలులోని కవితలలోని స్త్రీవాదం గురించి ప్రసంగించింది.
మొత్తంమీద ఒక్కరోజు సదస్సులు విజయవంతంగా జరిగాయి.
ఆ రాత్రి అందరం హొటల్ లో చాలా సేపు కబుర్లు చెప్పుకున్నాం.మర్నాడు కారు ఏర్పాటు చేసి సామర్లకోటలో వున్న ఒక ప్రాచీనదేవాలయం,మొదలగు ప్రాంతాలు చూపించారు.అనంతరం ఆలూరు విజయలక్ష్మి గారి ఇంట్లో కాసేపు అందరం సరదాగా గడిపాము
తర్వాత రోజు ఇంద్రగంటి జానకీ బాలకు,ప్రభావతి గారికీ మరో సభలో పాల్గొనాల్సి వుందని కాకినాడలో ఆగిపోయారు.మిగిలిన వాళ్ళం తిరిగి హైదరాబాద్ ట్రైన్ ఎక్కాము.
9, సెప్టెంబర్ 2025, మంగళవారం
1.శరసంధానం
శరసంధానం
- శీలా సుభద్రాదేవి
ఒకసారి ప్రశ్నించాలి
అని అనుకుంటూ అనుకుంటూనే
ఏళ్ళకి ఏళ్ళు నడుచుకుంటూ వచ్చేసాను
ఏమని ప్రశ్నించాలా అని ఆలోచిస్తే
సమాధానాలెట్లా రాయాలో నేర్పించారు కానీ
బళ్ళో పదేళ్ళ చదువు కాలంలో
తదనంతర చదువుల్లోనూ
ఏ ఒక్క మాష్టారూ కూడా
ప్రశ్నించటం మాత్రం నేర్పలేదు.
ఎక్కడో ఏదో పురుగు దొలిచి
అడగాలనుకునే ప్రశ్న
ఎర్రని చూపు తాకి మసై రాలిపోయేది
మాటిమాటికీ ప్రశ్నే కొక్కెంలా
నావెనుక ఎప్పుడు తగులుకొందో గానీ
నా అడుగులు ముందుకుపడకుండా
నిత్యమూ వెనక్కి లాగుతూనే వుంది
అయినాసరే
ఎప్పుడు ఏ అక్షరం
నా మనో క్షేత్రంలో నాటుకుందో
నా వంటిమీదే కాదు
నా అంతరాంతరాల నిండా
ప్రశ్నలు మొలకెత్తుతూనే వున్నాయి.
అటువంటప్పుడు అంపశయ్య మీద భీష్మలా
ప్రశ్నల పరుపుపై నిద్రపట్టక దొర్లతాను
ఇకపై ఇన్ని ప్రశ్నలు
మనసునిండా ఎందుకు నాటావని
మీనమేషాలు లెక్కబెట్టే పనేలేదు
ప్రశ్నించనీయకుండా చేసిన
నీ మీదా,ఈ సమాజం మీదా
ఈ సాంప్రదాయాల లక్ష్మణ రేఖల్లో
నన్ను బంధించిన ప్రతీ ఒక్కరి మీదా
శరసంధానం చేయటానికి నాదే ఆలస్యం
ఇకపై ప్రశ్నించి నిలదీయాల్సిందే
5, సెప్టెంబర్ 2025, శుక్రవారం
నడక దారిలో -55
నడక దారిలో -55
ఆప్తమిత్రుడు కె.కె.మీనన్ భౌతికంగా దూరం కావటం వీర్రాజుగారు చాలా దిగులు పడ్డారు. తాను పెయింటింగ్స్ వేయటమేకాక కవితా సంపుటి కూడా ప్రచురించుకోవాలనే వుద్దేశ్యంతో కవిత్వరచనలో పడి మిత్రుని మృతి వలన కలిగిన దుఃఖాన్ని అధిగమించడానికి ప్రయత్నించారు.
మేముంటున్న ఇంటి పరిసరాలకు పల్లవి విసిగి పోవటంతో కొనటానికి ఇళ్ళకోసం గట్టిగానే ప్రయత్నం మొదలెట్టాము.
మల్లయ్య శాస్త్రిగారికి మియాపూర్ లో ఇల్లు ఎలాట్ అయ్యిందట.ఆ పనిమీదనో మరెందుకో గుర్తులేదు.హైదరాబాద్ వచ్చి మా ఇంటికి వచ్చారు.భోజనం అయ్యాక వీర్రాజుగారితో చాలా సేపు కబుర్లు చెప్పి సాయంత్రానికి తిరిగి వెళ్ళారు.ఆయన వెళ్ళాక వీర్రాజుగారు నాతో చెప్పిన విషయం నన్ను అవాక్కు అయ్యేలా చేసింది.
" ఒంటరిగా వుండటం కష్టంగా వుంది వీర్రాజు గారూ.నేను వివాహం చేసుకుందామనుకుంటున్నాను.ఏమంటారు?" అన్నారట ఆయన డెభ్భై ఏళ్ళు దాటిన వ్యక్తి.
ఆయన తాతో,ముత్తాతోగానీ బాలవితంతువైన తన కూతురికి పునర్వివాహం చేసారు.అన్ని కులాల వారితో పంక్తి భోజనం చేసిన బ్రహ్మ సమాజదీక్షగల మహనీయ వ్యక్తిగా ఆయనకి పేరు.
అయితే అంత ఆశ్చర్యపడటానికేముంది? భరాగో,పెద్దిభొట్లవంటివారు కూడా ఆ వయసులో వివాహాలు చేసుకున్నారు కదా.పురుషులకు ఏ వయసులోనైనా పునర్వివాహం చేసుకునే జన్మహక్కు ఈ సమాజం ఇచ్చింది.అందుకే ఆశ్చర్యం అక్కర్లేదు.
కానీ అకస్మాత్తుగా భర్త చనిపోవడంతో పాతికేళ్ళవయస్సులోనే ఇద్దరు పసిపిల్లలతో అసహాయంగా మిగిలిన తమ్ముడి భార్యని అత్తింటి వాళ్ళంతా దిక్కులేనిదానిగా వదిలేసినప్పుడు ఆమె ఒంటరితనం ఆయనకి గుర్తు రాలేదా? అది గుర్తు వచ్చి నేను కొంత డిస్టర్బ్ అయ్యాను.
ఈ విషయం ఎవరితోనూ చెప్పలేదు.కానీ
ఆ తర్వాత గుండెల్లో గాయం అనే కథని రాసాను.
మరిది కృష్ణ చిన్నకూతురు పెళ్ళి ఒరియా అబ్బాయితో పూరీలో నిశ్చయం అయ్యింది.ముగ్గురు అమ్మాయిలూ మూడుప్రాంతాలవారిని ఎంపిక చేసుకుని వివాహం చేసుకోవటం ఆశ్చర్యమే.కట్నాలబాధ అయితే తప్పిందనుకోవాలి.కృష్ణ మరణానంతరం ఆ కుటుంబబాధ్యత మాదే అని భావించి రెండు పెళ్ళిళ్ళు జరిగాయి. ఈ పెళ్ళికి మాత్రం పెద్దమ్మాయి కవితే చెల్లెలిపెళ్ళికి ఎక్కువ బాధ్యత వహించింది.
మా కుటుంబంతో పాటు చిన్నమరిది బయలుదేరాడు.వివాహం ఒరియా పద్ధతిలో జరిగిన ఈ వివాహానికి కూడా మేమే కన్యాదానం చేయటం జరిగింది.ఆ వివాహానంతరం భువనేశ్వర్ లో చూడవలసిన ప్రదేశాలు,కోణార్క్ సూర్య దేవాలయం ధవళగిరి మొదలైనవి చూసి తిరిగి హైదరాబాద్ వచ్చేసాం.
కొనటానికి ఇండిపెండెంట్ ఇళ్ళు చాలా
చూసాం.కానీ ఏవీ మాకు అందుబాటులో లేవు.ఒకరోజు సరూర్ నగర్లో వున్న మరిది నుండి పల్లవికి ఫోన్ వచ్చింది."ఇక్కడ సరూర్ నగర్ మెయిన్ రోడ్డు లో ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ మొదలయ్యింది.కె.విశ్వనాధ్ ప్రారంభించారు.ఒకవేళ నచ్చుతుందేమో చూడు."అని.
నాలుగురోజులుగా సెలవులకని వచ్చిన చిన్నక్క కుటుంబానికి అదే రోజు తిరుగు ప్రయాణం.వాళ్ళు మమ్మల్ని స్టేషన్ కు రానక్కరలేదనీ సలీమ్ ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోతాం.మీరు వెళ్ళి ఇల్లు చూడండని అన్నారు.అంతే కాక ఇండిపెండెంట్ ఇల్లు కన్నా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అయితేనే భద్రత వుంటుంది.నచ్చితే తీసుకోవటం మంచిది అన్నారు.
వీర్రాజుగారు కూడా తన తమ్ముడూ,చెల్లెల కుటుంబాలు దగ్గరగా వుంటాయి అని తీసుకుంటే బాగానే వుంటుందన్నారు.
వీర్రాజుగారు తాను రాననీ చూడటానికి మా ఇద్దరినీ వెళ్ళమన్నారు.సరేనని వచ్చి SVRS వారి ఒక మోడల్ హౌస్ చూసాము.వాళ్ళు చెప్పినవన్ని నచ్చాయి.మా బడ్జెట్ లోనే త్రీబెడ్ రూమ్ ఇల్లు వస్తుంది.అయితే మళ్ళా అపార్ట్మెంటేనా అనిపించింది.ముందు రెండువేలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.ముందు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి రెండున్నర లక్షలు ఖరీదు చేసే ఫర్నీచర్ ,మాడర్న్ కిచెన్ ఉచితం అన్నారు.
సరే ముందు కట్టేద్దాం.తర్వాత ఆలోచించుకుందాం అనుకున్నాం.
మర్నాడు మళ్ళా వీర్రాజుగారితో కలిసి వచ్చి చూసాం.SVRS బృందావనం పేరిట మూడు బ్లాకులు కడుతున్నామని బిల్డర్స్ చెప్పారు.మొదటగా నారాయణాద్రి బ్లాక్ మొదలు పెడతామని చెప్పి అయిదు ఫ్లోర్ లు,ఒక్కోఫ్లోరులో పదహారు ఇళ్ళు వుంటాయని ఇళ్ళు ప్లానులు ఉన్న పేపరు ఇచ్చి ఎంపిక చేసుకోమని చెప్పి ఏ రకంగా ఎన్ని వాయిదా ల్లో డబ్బు కట్టాలో,ఎప్పుడు నిర్మాణం మొదలెడతారో, ఎప్పుడు ఇల్లు ఇస్తారో వివరాలు చెప్పారు.
ఇళ్ళ ప్లాను చూసి ఫస్ట్ ఫ్లోర్ వద్దనుకున్నాము.థర్డ్ ఫ్లోర్ లో ఇళ్ళు బుక్ అయిపోయాయి.కరెంటు పోతే కష్టం పైన రెండు ఫ్లోరులు వద్దని వీర్రాజుగారు అన్నారు.ఆఖరుకు రెండవ ఫ్లోరులో ఇల్లు సెలెక్ట్ చేసుకున్నాము.అప్పుడప్పుడు అటువైపు వెళ్ళి ఎంతవరకూ అయ్యిందో చూసుకునే వాళ్ళం.
2010 లో ఆధునిక తెలుగు కథ వచ్చి 100 ఏళ్ళు అయిన సందర్భంగా వేదగిరి రాంబాబుగారు కొందరు కథకులను తీసుకుని విజయనగరం ప్రయాణం కట్టారు.విజయనగరంలో ఆ సందర్భంగా గురజాడ ఇంటిలోనూ, గురజాడ వీధిలోనూ కథకుల పాదయాత్ర తలపెట్టారు.
నేను విజయనగరంలో పుట్టిపెరిగిన దానిని.విజయనగరంలో సమావేశాలకు గానీ,సదస్సులకు గానీ ఎందుకు గుర్తు రానో మరి ఎప్పుడూ ఎవరూ ఆహ్వానించలేదు. విజయనగరంలో ఒక సంస్థ అనేకమంది రచయిత్రులు పిలిచి పురస్కారాలు ఇవ్వటం కూడా తెలుసు. నన్ను పిలవాలని కాదు కానీ అక్కడే వున్న మా పెద్దక్కనీ గానీ,
చిన్నన్నయ్యనీ గానీ ఏనాడూ ఏ సభలకూ ఆహ్వానించరు .ఇందులో కొంత వరకూ కుల రాజకీయాలు కూడా వున్నాయని మాకు చూచాయగా తెలుసు.అందుకనే మేము పట్టించుకోం.కానీ అప్పుడప్పుడు కొంత బాధ కలగటం సహజమే కదా.
సరే .మళ్ళా వందేళ్ళ కథ దగ్గరకు వస్తే -
విజయనగరం కథకులు బయలు దేరే రోజు వచ్చింది.మాకు తెలిసిన చాలా మంది వెళ్తున్నారనేది కూడా తెలిసింది.సాయంత్రం నాలుగు గంటలకు రాంబాబుగారు ఫోన్ చేసారు.ఆ సమయంలో వీర్రాజుగారు ఇంట్లో లేకపోవటంతో నేనే ఫోన్ తీసి మాట్లాడాను.'వందేళ్ళకథోత్సవాలకు విజయనగరం వెళ్తున్నామని,మీరు విజయనగరం వారు కదా మీరు కూడా వస్తే బాగుంటుంది' అన్నారు.
ఎప్పుడు వెళ్తున్నారని అడుగుతే అదేరోజు ఆరుగంటల ట్రైనుకు వెళ్తున్నామని, ఆ మర్నాడే కార్యక్రమమని చెప్పారు.నాకు చాలా కోపం వచ్చింది.కాని చాలాతాపీగా " ఇప్పటికిప్పుడు టిక్కెట్లు ఎలా అంటే "అది నేను చూసుకుంటాను" అన్నారు.బహుశా ఎవరో రావటం లేదేమో ఆ ఎవరో నా పేరు చెప్పి వుంటారు.ఆ టికెట్ లో నన్ను తీసుకెళ్దామని అడిగి వుంటారు అనిపించింది.
వీర్రాజుగారు ఇంట్లో లేరని, ఇప్పటికిప్పుడు ఒక్క గంటలో నేను తయారై రాలేనని చెప్పేసాను.
వీర్రాజుగారు వచ్చాక ఈ విషయం చెప్తే " కులాలు,మతాలూ ప్రాంతాలుగా సాహిత్య రంగం గ్రూపులుగా విడిపోతోంది.ఇటువంటి
ఏ గ్రూపులోనూ చేరకుండా మనమట్టుకు మనం రాసుకుంటూ వున్న వాళ్ళం అంతే అట్టడుగుకు వెళ్ళిపోతాం.అందుకే రాసినవన్నీ పుస్తకం రూపంలో లైబ్రరీలలో వుంటే ఎప్పటికైనా ఎవరో ఒకరు తీస్తే గుర్తింపులోకి వస్తాం . బండారు అచ్చమాంబ వంటి వారు అలాగే ఇన్నాళ్ళకు గుర్తింపులోకి వచ్చారు కదా" అన్నారు బహుశా చిన్నబుచ్చుకున్న నన్ను మరలించటానికే కావచ్చు.
2010లో వందేళ్ళ కథాప్రస్థానం సందర్భంగా తెలుగు రాష్ట్రంలోనే కాక బయటున్న తెలుగు కథకులందరితో ఎన్నో సమావేశాలూ, ఎన్నో ఇంటర్వ్యూలూ, వ్యాసాలూ, అభిప్రాయాలు పత్రికల్లో వెలువడ్డాయి. మొదటి కథారచయిత్రిగా భండారు అచ్చమాంబను పేర్కొని, ఆపైన 1980 తర్వాత రాసిన రచయిత్రులనే అనేకమంది పేర్కొన్నారు.
హెచ్ఎంటీవీ తెలుగు టీవీ ఛానల్ వందేళ్ల కథ పేరిట కార్యక్రమంలో భాగంగా 2012 లో గొల్లపూడి మారుతీరావు "వందేళ్ల కథకు వందనాలు" అంటూ ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. 118 మంది కథకుల కథలను పరిచయం చేసిన గొల్లపూడి మారుతీరావు కేవలం పన్నెండుమంది రచయిత్రుల కథలనే స్వీకరించటంకూడా గమనించాల్సిన విషయమే అనిపించింది.
అవన్నీ గమనించిన తరువాత 1910కి-1980కి మధ్య ఒకరిద్దరు తప్ప కథారచయిత్రులు లేరా అనే ఆశ్చర్యం కలిగింది. అరవయ్యో దశకంలో పత్రికలన్నింటిలో ప్రభంజనం సృష్టించిన రచయిత్రులంతా ఏమయ్యారు? వారు నవలలు తప్ప చెప్పుకోదగిన కథలేమీ రాయలేదా? రాసినా విమర్శకులు, చాలామంది పేర్కొన్నట్లు, ప్రేమలూ-పెళ్ళిళ్ళూ, కుటుంబాలూ, అపార్థాలూ, కలహాలతో నిండిన వంటింటి సాహిత్యమేనా? - ఇలా అనేక సందేహాలు నన్ను చుట్టుముట్టాయి
కాకతీయ విశ్వవిద్యాలయంలో "రచయిత్రుల వెనుకబాటు తనం " గురించి ఒకసారి నేను సమర్పించిన ప్రసంగవ్యాసం, తర్వాత ప్రభుత్వ సాంస్కృతిక,భాషా సంస్థ తో లేఖిని సంస్థ కలిసి నిర్వహించిన సదస్సులో రామలక్ష్మి కథలగురించి చేసిన ప్రసంగవ్యాసం గుర్తు వచ్చి
1950కి ముందు రచయిత్రులనీ, వారి కథల్నీ గురించి పరిశోధనాత్మక వ్యాసాలు రాయాలనే దృడమైన సంకల్పం కలిగింది.
ముందుగా ఎవరెవరి గురించి రాయాలనేది ఒక జాబితా తయారు చేసుకుని ముందుగా రచయిత్రుల కథలసంపుటాల సేకరణ మొదలు పెట్టాను.
కొన్న అపార్ట్మెంట్ పూర్తి అయ్యింది.అక్కడ ఒకరోజు పూజ చేయించేసి ఇంట్లో చేయించాల్సిన వుడ్ వర్క్ మొదలుపెట్టించాలని నిర్ణయించాము.
పూజ చేసే పంతులుగారి నెంబర్ మరిది దగ్గర తీసుకుని తేదీ నిర్ణయించాము.
ఫిబ్రవరి 13తేదీన సాయింత్రం ముహూర్తం నిర్ణయించారు.ముందు రెండు రోజులూ అవసరమైన వస్తువులు కొనటం ప్రారంభించాము.ఎవరినీ పిలవదలచుకోలేదు.దగ్గరలోనే వుంటారు కనుక మా పెద్ద ఆడబడుచునీ,మా చిన్న మరిదినీ మాత్రమే పిలిచాము.పూర్తిగా ఇల్లు మారిన తర్వాత స్నేహితులనూ, బంధువులనూ పిలిచి పార్టీ ఇవ్వాలని మా వుద్దేశ్యం.
13వతేదీ వుదయం దిల్ షుక్ నగర్ లో పళ్ళు మొదలైనవి కొంటున్నప్పుడు షాకింగ్ వార్త తో ఫోన్ వచ్చింది.
కుందుర్తి సత్యమూర్తి మాసివ్ హార్ట్ ఎటాక్ తో చనిపోయారని తెలిసింది.వీర్రాజుగారు విని ఎలా తట్టుకుంటారోనని భయం వేసింది.వెంటనే నాళేశ్వరం శంకరంగారికి ఫోన్ చేసి ఇలా ఆరోజు రాత్రి గృహప్రవేశం పూజ పెట్టుకున్న విషయం కూడా చెప్పాను.వెంటనే మలక్ పేట ఇంటికి ఆయన బయలుదేరి వెళ్ళారు.
మేము కొన్న వస్తువులను కొత్త ఇంట్లో పెట్టేసి మలక్ పేట వెళ్దామని సరూర్ నగర్ వచ్చాం.
ఇంట్లోకి రాగానే అంతవరకూ దుఃఖాన్ని వుగ్గ బెట్టుకుందేమో పల్లవి ఒక్కసారిగా ఏడుపు మొదలుపెట్టింది." పెట్టుకోక పెట్టుకోక ఒక శుభకార్యం తలపెడితే ఇలా జరిగిందేమిటి " అని వెక్కిళ్లు పెట్టింది. ఆమెను సముదాయించటం నాకూ కష్టమే అయ్యింది.నాకూ మనసులో కొండంత భయం గూడు కట్టుకుంది.అయినా బయటకు బింకంగా వుండి ఓదార్చాను
ఫ్రీవర్స్ ఫ్రంట్ నిర్వహణ అనుబంధం వల్ల కుందుర్తిగారి మరణానంతరం సత్యమూర్తి కుటుంబం ఇంట్లో మనుషుల్లా మాకు చాలా దగ్గర అయ్యారు.ఇప్పుడు ఈ పూజ చేయించటమా మానటమా ఒక సందిగ్ధం అయింది.
మలక్ పేట ఇంటికి వచ్చేక వీర్రాజు గారూ,శంకరంగారూ నేనూ కలిసి సత్యమూర్తి గారి ఇంటికి వెళ్ళాము.
సింగపూర్ లో వున్న చిన్న కూతురు కవితకు ఉదయం ఎప్పటిలాగే కాల్ చేసి కట్ చేసారట సత్యమూర్తి.ఆ తర్వాత కవిత తిరిగి తానే కాల్ చేస్తే అప్పుడు మాట్లాడటం ఆనవాయితీ అట.అదే విధంగా కాల్ కట్ చేసిన వెంటనే కుప్పకూలిపోవటం,ప్రాణం పోవటం నిముషాలమీద జరిగిందని తెలిసింది.కవిత చేసిన ఫోన్ ఎత్తడానికి ఆయన లేకుండా పోయారట.ఎంత విషాదం అనిపించింది.దగ్గరలో సత్యమూర్తి షష్ఠి పూర్తి చేయాలని సమత,కవిత అనుకున్నారు .ఈ లోపున ఇలా జరిగింది.కుందుర్తిగారు కూడా అలాగే షష్ఠి పూర్తి ఏర్పాట్లు జరుగుతుండగానే పోయారనేది గుర్తొచ్చింది.
నేను కొంత సేపు కుందుర్తి శాంతతోనూ,సమతతోనూ మాట్లాడి ఇంటికి వచ్చేసాను. " అక్కడి కార్యక్రమం పూర్తికాగానే వీర్రాజుగారిని తీసుకువచ్చేస్తాను.సాయంత్రం మీ కొత్త ఇంట్లో పూజ యథాతధంగా చేసుకోండి"అని శంకరం భరోసా ఇచ్చారు.
సాయంత్రం సరూర్ నగర్ కొత్త ఇంట్లో కార్యక్రమం కోసం ఇంట్లోనే కొంచెం పులిహోర, దద్దోజనం చేసుకుని తీసుకొని వెళ్ళాం.ఆడబడుచు ఇంటినుండి పాలు పొంగించటానికి గాస్ సిలిండర్ తీసుకు వచ్చాము.
పంతులుగారు సరియైన సమయానికే వచ్చి పూజ ప్రారంభించారు.హోమాలూ,వాస్తుపూజలవీ మాకు అక్కర్లేదు.సింపుల్గా వినాయక పూజ, వ్రతం
చేయమన్నాం.పల్లవీ,ఆషీ చేత పూజ చేయించమన్నాం.ఆయన అలాగే చేసారు.చిన్నమరిది దంపతులు,ఆడబడుచు దంపతులు వచ్చారు.వాళ్ళకి పల్లవి బట్టలు పెట్టింది.
పాలు పొంగించి చేసిన పరమాన్నం,మేము ఇంటినుండి తెచ్చిన పులిహోర,దద్దోజనం అందరం
తినేసి తిరిగి ఇంటికి వచ్చేసాం.మొత్తం మీద ఒక ప్రహసనం నిర్విఘ్నంగానే పూర్తి కావటంతో వూపిరి పీల్చుకున్నాము.
ఒక వారం పదిరోజులు అయ్యాక కార్పెంటర్ ను వెతుకుదాములే అనుకున్నాము.
అనుకోకుండా కందుకూరి శ్రీరాములుగారు ఒక కార్పెంటర్ గురించి తెలియజేసారు.శంకరం,శ్రీరాములుగారూ కార్పెంటర్ చారిని తీసుకుని వచ్చారు.అందరూ కలిసి సరూర్ నగర్ ఇంటికి కార్పెంటర్ ను తీసుకుని వెళ్ళి ఇల్లు చూపించారు.
కొన్ని ఫర్నీచర్ మోడల్స్ ఆల్బంలు కార్పెంటర్ చారి తీసుకొని వచ్చాక మార్పుచేర్పులు తో మనకు నచ్చే విధంగా చేయించుకోవచ్చు అనుకున్నాం.వార్డు రోబ్ లకు వేయాల్సిన డెకలమ్ డిజైన్లు పల్లవే ఎంపిక చేసుకుంటానంది.పూర్తి చేయటానికి మూడునెలలు పడుతుందని చారి చెప్పాడు.అదంతా అయ్యాకే ఆ ఇంట్లోకి మారుదామని మేము నిర్ణయించుకున్నాము.అప్పటికి ఆషీకి కూడా పరీక్షలు పూర్తయ్యాకే సెలవుల్లో మారవచ్చులే అనుకున్నాం.
నడక దారిలో -54
నడక దారిలో -54.
నా సమగ్ర కవిత్వం పుస్తకావిష్కరణ జరిగిన తర్వాత వీర్రాజుగారి సప్తతి సందర్భంగా దగ్గరి బంధువులతో,ఓ అయిదారుగురు ఆత్మీయ మిత్రులతో హొటల్లో చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసాము పల్లవీ ,నేనూ.
రోజు రోజుకూ తెలంగాణా ఉద్యమం ఊపందుకుంది.ఉద్యమ భావావేశం వలన చాలా మంది ఆత్మీయులైన సాహితీ మిత్రులు దూరం అయిపోయారు.తరుచూ కలవటానికి వచ్చేవారు కూడా రావటం మానేసారు.అది వీర్రాజుగారికి తీవ్ర మనస్తాపం కలిగించింది.
"ఎప్పుడో 1961 లో కడుపు చేతపట్టుకొని మనరాజధాని కదా అని వచ్చి శక్తిసామర్థ్యాలు,వయస్సూ అంతా ఈ గడ్డమీదే కరిగించుకున్నాము.నన్ను కన్నవారినీ,మనం కన్న పిల్లాడిని ఈ మట్టిలోనే కలిపాము.ఇప్పుడు ఇక్కడ పరాయి వాళ్ళమైపోయామా" అని తరచూ బాధ పడేవారు.
అదీగాక 2010 సంవత్సరానికి వచ్చేసరికి ముఖచిత్రాలు చిత్రకారులు తో వేయించే పద్ధతి తగ్గిపోయి ఫొటోలు,డిజిటల్ చిత్రాల వైపు సాహితీవేత్తలు ఆకర్షితులు కావటంతో ముఖచిత్రం కోసం వచ్చేవారూ తగ్గిపోయారు.ఇకపై ముఖచిత్రాలు చేయించుకునేవారు లేరు కనుక వీర్రాజుగారికి తైలవర్ణచిత్రాలు వేయాలనే ఆలోచన వచ్చింది.స్వంతంగా కట్టెఫ్రేములు చేయించి కేన్వాసుబట్ట కొని వాటికి బిగించి తయారు చేసుకుని ఒక చిత్రయజ్ఞాన్ని మొదలు పెట్టారు.
ఉదయం ఎనిమిదికే తయారై టిఫిన్ పూర్తి చేసి ఒక పొట్టి స్టూల్ మీద తాను కూర్చొని ముందు ఇంకో కుర్చీ మీద కాన్వాస్ ఫ్రేమ్ అమర్చుకొని చిత్రం వేయటం మొదలుపెట్టేవారు .తైలవర్ణాలు ఆరటానికి సమయం పడుతుంది కనుక ఒకేసారి రెండుమూడు కేన్వాసులపై చిత్రాలు తయారుగా వుంచుకునేవారు.
చుట్టూ రంగులు పరుచుకొని వర్ణచిత్రాలు వేస్తున్నప్పుడు రంగుల సరస్సులో ఇహాపరాలు మరచి ఈదులాడుతున్న అమాయకపు పసిబాలుడిలా కన్పించేవారు.భోజనసమయానికి పిలువగా పిలువగా కలుపుకున్న రంగు ఎండిపోతుంది అని పూర్తి అయ్యాక గానీ లేచేవారు కాదు.భోజనానంతరం ఒక్క అరగంట ఆగి మళ్ళా కాన్వాస్ ముందు కూర్చునేవారు.ఒక్కోసారి తాగటానికి ఇచ్చిన మంచినీళ్ళగ్లాసులోనో,కాఫీకప్పులోనో చిత్ర ధ్యానంలో పొరపాటున కుంచెను ముంచేసే వారు.
కంటిన్యూగా పది పన్నెండు గంటలు లేవకుండా పొట్టి కుర్చీ మీద కూర్చొని కూర్చొని ఆయనకు మోకాళ్ళ నొప్పులు ప్రారంభమయ్యాయి.ఒక్కొక్కప్పుడు ఉదయపు నడక చేస్తున్నా ఇబ్బంది పడేవారు.అలా కంటిన్యూగా చేయకుండా ఒక పూట మాత్రం పెయింటింగ్స్ వేసి మధ్యాహ్నం వేరే పని చేయమని కోపగించేదాన్ని.కానీ చిత్రం పూర్తి చేసేవరకూ ఆయనకి మనసు ఆగేదికాదు. రాజకీయ రంగు పులుముకున్న సాహిత్య మీటింగులకు మాకు ఆహ్వానాలు లేకపోవటంతో సభలకు వెళ్ళటం తగ్గిపోయింది.
మా ఇంటిప్రక్క మసీదు పెద్దగా కట్టేయటమే కాకుండా ఆ చుట్టూ చిన్న చిన్న ఇళ్ళన్నీ మూడు,నాలుగు అంతస్తులుగా పెరిగిపోయాయి.ఆ పై అంతస్తుల్లో ఎక్కువగా నైజీరియన్లు చేరారు.రోజు తెల్లవారుజామున ముఫ్ఫై నలభై మంది టీవీ టవర్ ఆస్మాన్ ఘడ్ నుండి మసీదు వైపు వస్తూ కనబడుతుండేవారు.దాంతో మా బిల్డింగ్ టెర్రస్ మీదకి వెళ్ళాలంటే ఇబ్బందికరం అయిపోయింది.రాత్రిపూట అర్థరాత్రి దాటే దాకా మా బిల్డింగ్ ముందు గట్ల మీద కూర్చొని రణగొణధ్వనిగా మాట్లాడుకొంటూ వుండేవారు.రాత్రి పెట్రోలింగ్ చేసే పోలీసులు కోప్పడి ఇళ్ళకి పంపేవారు.రోడ్డువైపుకే మా బెడ్రూం వుండటంతో ఈ గొడవలకి నిద్రపట్టేదికాదు.
నగరంలో ఏ మతఘర్షణ జరిగినా,మాదకద్రవ్యాల కేసులకైనా మూలాలు మా ఏరియా లోనే వుండేవి.అందుకే కాబోలు మా పైన వుండే సింథీవాళ్ళు అపార్ట్మెంట్స్ అమ్ముకొని వెళ్ళిపోయారు.
పల్లవి గచ్చిబౌలి నుండి బస్సులు పట్టుకొని రెండుగంటలు ప్రయాణం చేసి వచ్చేసరికి ఒక్కొక్కసారి తొమ్మిది దాటేది.ఆ ప్రాంతంలో తిరిగే ఆవారాలు అరుగుల మీద కూర్చొని " ఈ ఆంధ్రావాళ్ళు,ఈ ఆడోళ్ళు వచ్చి మన వుద్యోగాలు మనకి కాకుండా చేసారు" అంటూ రాజకీయనాయకుల్లా ఏదో ఒకటి వాగుతూ వుండేవారు. ' నేను ఇక్కడే పుట్టి పెరిగి చదువుకుని వుద్యోగం చేసుకుంటుంటే ఇలా అంటారేమిటని' అసలే అలసి పోయి వచ్చిన పల్లవి చిరాకు పడిపోయేది.
ఇంకా రానురానూ విసుగెత్తి పోయి వేరేచోట ఇల్లు కొనుక్కుని ఈ ప్రాంతం నుంచి వెళ్ళి పోదామని నిర్ణయానికి వచ్చింది.ఆషీ కూడా పెద్దదవుతోంది కనుక మూడు బెడ్ రూముల ఇల్లు చూడాలని నిశ్చయించుకున్నాం.
మొదట్లో ఇండిపెండెంట్ ఇళ్ళకోసమే చూసాం.తన స్నేహితులూ, బంధువులూ దగ్గర్లో వున్నారు కనుక మలక్ పేట,వనస్థలిపురం మధ్య లోనే చూస్తే బాగుంటుందని వీర్రాజుగారు
అభిప్రాయపడ్డారు.కానీ మా ఆర్థిక లిమిటేషన్ కి మించి ధరలు వున్నాయి.పల్లవికి ఆఫీసుకి దగ్గరగా వుండేలా ఇల్లు తీసుకుంటే రానూపోనూ నాలుగు గంటల శ్రమ తగ్గుతుందనే ఆలోచన వున్నా వీర్రాజు గారు ఇటువైపే చూద్దాం అనటంతో తండ్రి మాటల్ని తోసిపుచ్చలేక పోయింది.
డిసెంబరు 9వ తేదీన కేంద్రం ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా హోం శాఖ మంత్రి చిదంబరం స్వయంగా ప్రకటన చేశారు. ఈ ప్రకటన తర్వాత తెలంగాణా అంతటా పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి.
ఆ మర్నాడు తెల్లారిన తరువాత ఆంధ్రలో సమైక్యాంధ్రకు అనుకూలంగా రాజీనామాలు, ఆందోళనలు మొదలయ్యాయి.అన్ని ముఖ్యమైన కేంద్రరాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు,ముఖ్యమైన విద్యాసంస్థలు, ఐటీ కారిడార్ మొదలైన వన్నీ హైదరాబాద్ లోనే ఉండటం ,ఆంధ్రాకు చెందిన అనేక
మంది తమ పెట్టుబడులను ఇక్కడే పెట్టడం,ఇక్కడే ఇల్లూ వాకిలి పిల్లల చదువులతో స్థిర పడిన వారంతా ఏమీ తోచని స్థితికి వచ్చారు. వీటి వలన హైదరాబాద్ తో సహా తెలంగాణా విడిపోతే మంచి విద్యా సంస్థలుగానీ ప్రభుత్వ రంగ సంస్థలు గాని లేని మిగిలిన ఆంధ్రప్రదేశ్ మనుగడ భయంకరంగా కనిపించింది.
హైదరాబాద్ లో ఆఫీసుల్లో పనిచేసే వుద్యోగులలో చీలిక వచ్చేసింది.
ఆ ఆందోళనల ప్రభావంతో డిసెంబరు 23న తెలంగాణ ప్రకటన నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్టు ప్రకటించారు చిదంబరం.దాంతో మళ్ళా తెలంగాణ భగ్గుమంది. ప్రాంతీయ వివక్షలు అన్ని రంగాలలో మొదలయ్యాయి. సాహిత్య రంగంలో మరింత స్పష్టంగా కనిపించింది.ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా అనేక ధూం ధాం లు నార్వహించటం అందులో భాగంగా కవితా గానాలు ఎక్కడికక్కడ జరిగాయి.
ఎప్పుడో వచ్చి ఇక్కడే స్థిర పడిన మాలాంటి
వాళ్ళం ప్రత్యేక తెలంగాణా వుద్యమానికి సానుకూలంగా వున్నా కూడా శత్రువులుగా పరిగణించడంతో ఆత్మీయులైన సాహితీ మిత్రులకు మాకు మధ్య కనిపించని గోడ వున్నట్లుగా దుఃఖం కలిగేది.మనసువిప్పి ఎవరితో కూడా బాధని పంచుకునే పరిస్థితి మృగ్యం అయిపోయింది.ఈ ప్రభావం నాకన్నా వీర్రాజుగారి మీద ఎక్కువగా వున్నట్లుగా వుంది.సభలూ సమావేశాలకు కూడా ఎప్పుడో తప్ప వెళ్ళటం తగ్గి పోయింది.అదీకాక అన్ని సమావేశం మందిరాల్లోనూ ఉద్యమం సమావేశాలూ,కవితాగానాలూ ఎక్కువగా జరుగుతుండేవి.థూమ్ థామ్ లోనూ,జాగృతి బతుకమ్మ సంబురాలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి.
మా కింద అపార్ట్మెంట్ లో యజ్ణప్రభగారు సంగీతం టీచర్.పల్లవికి ఆమే సంగీతం నేర్పించి,ఢిల్లీ గంధర్వమహావిద్యాలయం సర్టిఫికెట్ పరీక్ష కూడా రాయించారు.ఆతర్వాత పల్లవి రేడియోలో బిగ్రేడ్ సెలెక్షన్ పాసై లలిత సంగీతం పాడేది.ఇదంతా పల్లవి పెళ్ళి కాకముందటి విషయం.పల్లవి వివాహా ఏర్పాట్లకు కూడా అప్పుడుచాలా అండదండగా వున్నారు.బ్రహ్మలే అయినా పల్లవిని దత్త పుత్రిక లా ప్రేమించేవారు.పల్లవికి జరిగిన దుర్ఘటన నాకు ఆమె చాలా కలత పడ్డారు.ఒక జ్యోతిష్కుడి దగ్గర మళ్ళీ పెళ్ళి గురించి కూడా కనుక్కుని చాలా ఉత్సాహంగా నాకు చెప్పారు.నాకు వాటిమీద నమ్మకం లేక పోయినా పిల్ల జీవితం చక్కబడి ఒక తీరం చేరుతుందనే మాట సంతోషమే కలిగించింది.అంతగా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి యజ్ణప్రభగారు.ఆమె పెద్దన్న రాజమండ్రిలో శ్రీపాద పట్టాభి నాటకరంగంలో వుండేవారు.తమ్మీడు జిత్ మోహన్ మిత్ర నటుడు.ఆ విధంగా ఆమె కుటుంబం సాంస్కృతిక వారసత్వం కలిగిన వాళ్ళు.
అయితే ఆమెకు రానురాను అనారోగ్యపు ఛాయలు పెరిగాయి.మొదట్లో చెప్పటం మర్చిపోతానేమో అన్నట్లు గబగబా మాట్లాడే ఆమె తదనంతరం డిమెన్షియా బారిన పడ్డారు.అది అర్థం కాక వాళ్ళాయన చెడ తిట్టటం,అరవటం,కొట్టటం చేసేవాడు.కిందనుండి వచ్చే ఆ కేకలూ,తిట్లూ,గోల చికాకే కాక ఆమె భర్త మీద కోపం వచ్చేది.గృహహింస కింద అతనిమీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనిపించేది.ఇస్తే అతన్ని అరెష్టు చేస్తారుసరే.కొడుకులిద్దరూ విదేశాల్లో వున్నారు.అటువంటప్పుడు ఆమె గతి ఏమిటి అనిపించింది.ఏ సమస్యకైనా రెండువైపులా ఆలోచించాలని అంటారందుకే.
ఈమె సంగతి ఇలా అయితే మా కుటుంబ మిత్రులు, వీర్రాజు గారి ఆప్తమిత్రుడు రచయిత అయిన వ్యక్తి ఇదే విధంగా డిమెన్షియా రావటానికి తొలి స్టేజిలో వున్నాడు.ఆయన్ని చూసుకోలేక భార్యా పిల్లలు మా ఇంటికి దగ్గరలోనే వృద్ధాశ్రమంలో చేర్చారు.ఆయన తన భార్యాపిల్లలు వృద్ధికి ఎంతగా శ్రమ పడేవారో తొలి నుంచీ కళ్ళారా చూసిన వాళ్ళం.ఆయన తన మనవరాలిని చూసేందుకు చుట్టూ వెతుక్కునే వారు.ఆయన తపన చూస్తే మనసు ద్రవించి పోయేది.అటువంటి భార్యా పిల్లలూ ఎప్పుడో వారానికో,రెండు వారాల్లో వచ్చి చూసేవారు.
కానీ వీర్రాజు గారు రోజు విడిచి రోజు పెయింటింగ్స్ వేయటం పని ఆపేసి స్నేహితునికి ఇష్టమైన వంటకం చేయించి తీసుకుని వెళ్ళేవారు.ఒక్కొక్కప్పుడు నేను కూడా వెళ్ళే దాన్ని.
ఆశ్చర్యం ఏమిటంటే చివరి రోజుల వరకూ ఆయన వీర్రాజు గారిని గుర్తుపట్టేవారు.
ఇంతకీ అతనెవరంటే కె.కె.మీనన్ పేరు గల కథకుడు.తొంభైలలోనే సరోగసీమీద నవల రాసిన వైజ్ఞానిక రచయిత.ముఖ్యంగా ఏజీ ఆఫీస్ లో రంజని పేరుతో సాహిత్య సంస్థకు అధ్యక్షుడుగా వున్న కాలంలో అనేకమంది ప్రముఖ రచయితలను ఆహ్వానించి మంచి కార్యక్రమాలను నిర్వహించి రంజనికి ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి.కానీ ఆయన చివరిదశలో పలకరించి సాంత్వన పలికిన వారూ లేరు.తర్వాత కూడా ఆయన విస్తృత రచయితగా మిగిలిపోవడం కన్నా విషాదం ఏముంది?
ఈ ఇద్దరూ వారికే తెలియని జీవితాన్ని పసివారిలా జీవించిన రోజులూ మర్చిపోలేను.వారు భౌతికంగా లేకుండా వెళ్ళిపోయిన నాటి విషాదపు రోజులనూ మరచిపోలేక తలచుకున్నప్పుడల్లా సలుపు పెడుతూనే వుండటంతో ఆ తర్వాత " నిజానికీ అబద్ధానికీ మధ్య" అనే కథ రాసాను.
వృద్ధాప్యం ఒకశాపమా? లేకుంటే డిమెన్షియా వలన శాపమౌతోందా అనే ఆలోచన వెంటాడింది.
నన్నే కాదు వీర్రాజుగారి మనసునీ అతలాకుతలం చేసింది.
- శ
26, జూన్ 2025, గురువారం
అసీతినెలబాలుడు విహారి
అశీతి నెలబాలుడు-విహారి
ఒక సాహితీవేత్త జీవితాన్నీ, సాహిత్యాన్నీ పరామర్శించాలంటే వారి సమగ్ర సృజన అధ్యయనం చేయాలి. కానీ విహారి అనే పేరుతో సాహిత్య రంగంలో నమోదు అయిన జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తిగారు చేసిన కృషి అనన్య సామాన్యం, 1962లో 'చుక్కాని' పత్రికలో ప్రచురితమైన 'రాగజ్యోతి' కథతో మొదలుపెట్టి పద్నాలుగు కథా సంపుటాలు వెలువరించారు. ఆరు నవలలు సాహిత్య రంగానికి అందించారు. ప్రముఖుల సాహిత్యం గురించే కాక యువతరం వారిని కూడా వెన్నుతట్టి ప్రోత్సాహం ఇస్తూ సాహిత్య పరామర్శ చేయటం గుర్తించదగినది. గురజాడ మొదలుకొని నేటితరం కథకుల వరకు కుల, మత, ప్రాంత భేదం లేకుండా అన్ని సాహిత్య వాదాలనూ, ఆయా కథకుల కథలన్నింటినీ చదివి సమగ్రమైన వ్యాసాలు రాశారు. నొప్పింపక తానొవ్వక అన్నట్లుగా కథకుని కథలలోని వస్తు రూపాల్ని శైలి శిల్పాలనూ, భాషా విషైక విశేషాలను విశ్లేషిస్తూ సుమారు 300 మంది కథకులపై రాసిన ఈ విశేషవ్యాసాల్ని పదిహేను సంపుటాలుగా ప్రచురించారు. ఇవి ఒక వ్యక్తి చేయలేని ఈ సంపుటాలు విశ్వవిద్యాలయాలలో పరిశోధకులకు ఉపయుక్తంగా ఉన్నాయి.
2013లో 'ఆనాటి కథలు- ఆణిముత్యాలు' శీర్షికతో అపురూపమైన శ్రీపాద, వట్టికోట ఆళ్వారుస్వామి, చలం, కనపర్తి వరలక్ష్మమ్మ మొదలైన ప్రముఖుల ఆణిముత్యం వంటి కథలను వారి గుణ విశేషములను కొత్తతరం: రచయితలకు ఉపయోగపడేలా పరిచయం చేశారు.
సుమారు అరవై ఏళ్లుగా చేస్తున్న సాహిత్య వ్యవసాయంలో 300కు పైగా రాసిన కథలన్నీ కూడా సమాజాన్ని పరిశీలించినవే. చదువు విలువని తెలియజెప్పి 'అక్షరం', రాజకీయ మోహంతో పట్టని వ్యక్తుల కథ 'అమ్మ వెనక చీకటి', 'ఆ తల్లికేం కావాలి' వంటి తల్లి వేదననీ, వాత్సల్యాన్ని, వృద్ధాప్యాన్ని సమస్యల్ని తెరిచి చూపే కథలు, డబ్బు వెనక పరుగులు తీసే పిల్లలు, కథలన్నింటా జీవితాన్ని ప్రవహింప చేసేలా సున్నితమైన భావ ప్రకటన వీరి సొంతం. సరళ సంభాషణలు మానవీయ విలువలు, కుటుంబ, ఆర్ధిక సంబంధాలు ఇలా అపారమైన కథా వాహినిలోని కథల గురించి చెప్పుకుంటే ఒక పుస్తకాన్నే రాయొచ్చు. ఇప్పటికీ కూడా కొత్తవారితో సమానంగా విహారి గారి కలం తాజాగా పోటీలలో కూడా కథలను రాస్తుందంటే విహారి గారి సృజన ఎంత నవనవోష్మంగా ఉందో అర్థమవుతుంది.
మరో ముఖ్య విషయమేమంటే, చాలామంది కథకులలాగా విహారిగారు తన కథలలో సమాజంలోని అవకతవకలపై కత్తి ఝుళిపించరు. చాలా సహనంతో ఒక్కొక్క పొరనే విప్పుతూ సమాజాన్ని చూపుతారు. సమాజంలోని వ్యక్తుల బాధ్యతల్ని ఎత్తి చూపి గుర్తు చేస్తారు. చెప్పదలచుకున్న సిద్ధాంతాల్ని సహృదయంతో పాఠకులు స్వీకరించే పంధాలో ఒప్పిస్తూ కథనీకరించడం వీరి రచనా విధానం, విహారి గారు చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు ఆఖరికి 6500 పద్యాలతో 'శ్రీ పదచిత్ర రామాయణం' రచించి బృహత్ గ్రంథ రూపంలోకి తీసుకువచ్చారు.
విహారి గారి అపార సాహితీ సంపదని విశ్లేషించటం అసాధ్యం, అందువలన నేను కవిత్వానికే పరిమితమై నాకు అత్యంత ప్రీతిపాత్రమైన దీర్ఘ కవిత 'చేవ్రాలు' గూర్చి పరామర్శించే దలిచారు.
విహారి గారు ఇప్పటికీ వెలువరించిన చలనమ్ కలం కన్ను, మనం మనం.. 'మధ్య మా గతి' అనే సంపుటాలు కాక 'చీకటి నాణెం' అనే దీర్ఘ కవిత అంతకుముందు వెలువరించిన కవిత్వ గ్రంథాలు ఇటీవల వెలువరించిన దీర్ఘకవిత చేవ్రాలు, దీనికి టాగ్ లైన్ గా 'వ్యక్తిత్వం' -"వికసనం' అని పేరు పెట్టటంలోనే ఒక ప్రత్యేకత చూపారు.
''గుండె గొంతులోన కొట్లాడినట్లు విహారి గారిని ఒక చోట నిలకడగా కూర్చోనీయకుండా పదేళ్ల మధనంగా బయటపడింది ఈ చేవ్రాలు దీర్ఘకవిత. ఇందులో ప్రవేశిక, ప్రారంభిక, లోనారసి,ఋణరేఖ,వికసనం అని అయిదు అధ్యాయాలుగా విభజించినా, అతిపెద్ద అధ్యాయంగా, ముఖ్యమైనదిగా మూడవది ఉన్నా ఇంకా పాఠకులకు మరింత హృదయంగమంగా ఉండటానికి కావచ్చు.. లేదా పాఠకులు రచనలోకి మమేకం కావాలనే ఉద్దేశ్యం కావచ్చు.. కవి మధ్య మధ్య హెడ్డింగులు పెట్టి సులభ గ్రాహ్యం చేసేరు.
ఒక వ్యక్తి మానసిక వికననం అతడు పెరిగిన వాతావరణంపైనా, ప్రభావితం చేసే మిత్రుల పైనా,చదువు నేర్పిన గురువుల పైనా, చదివిన చదువులపైనా ఆధారపడి ఉంటుంది. ఆ మానవ వికసన సమగ్ర పరిణామ రూపాన్ని 'చేవ్రాలు'లో అక్షరీకరించాడు విహారి గారు.
మొదటి అధ్యాయంలో కవితని ఎత్తుకోవటమే. జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నది' అని మొదలు పెట్టడంతో సమాజంలోని వివిధ కోణాలను చూపించారు. బతుకును ముంజేతి కంకణంగా అభివర్ణిస్తూనే-'ఎవరి బతుకు వారికి/వారే కుట్టించుకున్న వలువ/ఎవరి వేలిముద్ర వారివే' అంటారు. ఎందుకంటే ఒకరి జీవితం మరొకరి చేతిలో ఆటబొమ్మ కాదు అని నిర్ధారిస్తూనే 'ఒకరి జీవితం వేరొకరి చేతిలో తెల్ల కాగితం అంటారు. తెల్ల కాగితం మీద ఎవరికి వారు రాసుకోవాలి కానీ మరొకరి ఆధీనంలో ఉంటే జీవితం ఎట్లా పరిణమిస్తుందో ఊహించుకోవాలనే అభిప్రాయాన్ని కవి ప్రకటిస్తారు..
రెండో ఆధ్యాయం ప్రారంభికలో శిరశోదయమై మాయని ఛేదించుకొని వచ్చిన శిశువుల బుడి బుడి అడుగులు వేయటం, తల్లి గోరు ముద్దలు, చదువుల పరుగుపందేలు,వచ్చీరాని కౌమార ప్రాయంలో వారిపై ప్రభావం చూపించే మాయాజాలాల కారణంగా- మెదడు పంజరంలో కోర్కెల చిలుకలు గుప్త విజ్ఞానంపై మోహం గురించి కవిత్వీకరిస్తూనే 'నడక కాదిది పోరాట జారుడుమెట్లపై ఆట' అంటూ సందిగ్ధప్రాయవు చంచల స్వభావాన్ని అక్షరాలతో గుది గుచ్చారు.
ఇక ముఖ్యమైన పెద్ద అధ్యాయం 'లోనారసి' లో దాని కొనసాగింపు గానే 'గుండె మట్టిని కుల్లగించే/ కోరికల వానపాములు 'గురించి జాగరూకత చెప్తాడు కవి. ఆలోచనాశూన్యులకు ప్రతి అంశాన్ని భూతద్దంలో చూపి భయభ్రాంతులకు లోనుచేసి మానసిక రోగులుగా మార్చే వైనాన్ని విశదీకరిస్తారు కవి. ఆత్మ న్యూనతకి చోటిస్తే గుండె సాగదీయక తప్పని కమ్మెచ్చుతీగ 'అవుతుందంటారు. నడిగ్గా అటువంటప్పుడే-' నిత్యానిత్య వివేకం -వ్యక్తిత్వం'-ని నిలబెడుతుందని ముక్తాయింపునిస్తారు.
'క్రియా శూన్యత గట్టు మీది పిచ్చిమొక్క వరి చేలో కలుపు మొక్క/ అచంచల విశ్వాసం/అదే దారి దీపం' అదే చేతి కర్ర' అంటూ మన భావోద్వేగాలకు మనమే బాధ్యులం అనేది ఉపదేశిస్తారు. కలలు కన వద్దంటారు. ఎందుకంటే అనుకున్నది జరగకపోతే వచ్చే అనర్థాలు తెలియజేస్తారు.
''డాలర్ల రోగగ్రస్తుడికి చికిత్స లేదని ఖచ్చితంగా ప్రకటిస్తారు. ఏ విషయానికి నా వల్ల కాదని వదిలేయొద్దంటారు. అవినీతి మేత, క్షణికోద్రేకం, ఆహం వీటన్నిటి వలన జరిగే కష్టనష్టాలను పంక్తులు పంక్తులుగా బోధిస్తూ మానసిక వికశనం కావాలంటే సందేహం, పరిశీలన, సమాచారం, విశ్లేషణ మనిషికి అత్యవసరం అంటారు కవి విహారి.
నాలుగవ అధ్యాయం నుంచి యవ్వనానికి 'ఋజు రేఖలు లక్ష్య నిర్దేశానికి గమ్యం నీది -నడక నీది- మిట్ట పల్లాలని సహనమే ఏకైక దీవంగా గమనిస్తూ ముందుకు నడవమంటారు. ఈ అధ్యాయం అంతా ఎన్నైన్నో సామెతల్ని కవితాత్మకంగా ఉటంకించుతూ సుబోధకంగా ఆసాంతం సాగుతుంది.
'స్వీయావిష్కరణం/ వేకువ రేకుల స్పాటిక సాధనం!! /గతం గాయాలు సలుపుతాయి/ రాతి మీద ఉలి దెబ్బలు అవి/ అవి నిట్టాడి గూడులు కాకూడదు/రూపాంతరం చెందిన కర్తవ్యాన్నివ్వాలి'- అని ధైర్యాన్ని, అత్మవిశ్వాసాన్ని పురిగొల్పుతాడు కవి.' క్రమశిక్షణ అంటే/ కఠినత్వమూ కాదు, నిరంకుశత్వమూ కాదు అదొక జీవన విధానం' గా చెప్పటమే కాక నిబద్ధత బద్ధకానికి శత్రువుగా చూపుతారు. కార్యదక్షత కట్టుబడి- పెట్టుబడిగా అభివర్ణించుతారు.'నీ బొమ్మని నీవే చిత్రించుకోగలగాలి' అనటంలో ఎవరి వ్యక్తిత్వాన్ని వారి నిర్మించుకోవాలనే సందేశం ఇస్తారు.
'సృజనకు ఆధార భూమికలు-మేధ విలువలు' అని నిర్ధారిస్తూనే నైతికత అంతస్సూత్రం ఎప్పుడూ తెగిపోకుండా కాపాడుకోవలసిన బాధ్యత వ్యక్తిదే అనేది నర్మగర్భంగా తెలియజేస్తారు కవివిహారి.
"మానవ సంబంధాలంటే/మనం మనంగా వుండటం/మానవసంబంధాలంటే / సమాజ సమన్వయ శక్తి!! 'వ్యక్తి''త్వం' వికసనం అంటే ఎత్తుపల్లాలను చూసి ఆ ప్రక్రియ అదే వ్యక్తి నిర్మాణం' అంటారు కవి
అయిదవ అధ్యాయం వికసనం అంటే విశ్వ దీర్ఘ కవితారాగానికి శృతి కూర్చటం అంటూ ముక్తాయింపుగా ఒక వ్యక్తి సంపూర్ణ మానవుడిగా రూపొందటానికి అలవర్చుకోవాల్సిన, జీవితాంతం పాటించవలసిన నిర్మాణ ప్రక్రియల రూపకల్పనలని ముగిస్తారు.
నేటి యువతరానికి వ్యక్తిత్వ వికాసచిత్రాలను దీర్ఘ కవితారూపంలో లక్ష్యాన్ని నిర్దేశిస్తూ, లక్ష్యాన్ని దినచర్యలో భాగంగా చేసుకొని సమయ నిర్దేశాన్ని చుక్కానిగా చేసుకొని ప్రయాణిస్తే రూపెత్తిన మనిషిగా మారగలడనే ఆశయంతో తన చేవ్రాలు' లు వ్యక్తిత్వ వికాస గ్రంథంగా తీర్చారు విహారి గారు.
కేవలం మాటల మనిషిగా, రాతల మనిషిగా కాక తాను ఆచరించి చూపే స్నేహశీలి, సౌజన్య మూర్తి, నిర్విరామ, నిరంతర సృజనశీలి అయిన 'విహారి గారికి ఎనిమిది పదులు దాటిన వయసులోనూ వారి కలం ఇంకా పదునెక్కాలని అభిలషిస్తూ వారికి సహస్రాధిక జన్మదిన శుభాకాంక్షలు
(అక్టోబర్ 15-విహారి గారి 81వ జన్మదినం సందర్భంగా సృజన క్రాంతి ఈ ప్రత్యేక వ్యాసం)
నడక దారిలో -53
నడక దారిలో -53
మా ఇంటికి దగ్గరలోనే ఆస్మాన్ ఘడ్ మీద సాయికృప అపార్ట్ మెంట్స్ లో కొంతకాలంగా కె.రామలక్ష్మిగారూ,వారి అక్క వుంటున్నారని తెలిసింది.వారి క్రింద అపార్ట్మెంట్ లోనే వారి అక్క కూతురు నివాసం వుంటుంది.అందుకని ఆరుద్ర మరణానంతరం మద్రాసు నుంచి వచ్చేసారు.వాసా ప్రభావతి గారితో మొదటి సారి వెళ్ళాను.ఆతర్వాత తరుచూ వెళ్ళేదాన్ని.రామలక్ష్మి గారితో కబుర్లకు కూచుంటే సమయం తెలియదు.ఒక ప్రవాహంలా అనర్గళంగా ఎప్పడెప్పటి అనుభవాలనో చెప్పుకొంటూ పోతారు.మొదట్లో మాట్లాడుతోన్నప్పుడు 'అలా అనేవారు మీ నాన్న' అని చెప్తుంటే అర్థం అయ్యేది కాదు తర్వాత ఆరుద్ర గారని తెలిసింది.చాలా సన్నిహితంగా నాతో మాట్లాడేవారు.నడవటానికి కాళ్ళు సహకరించక పోయినా వుప్పొంగే వుత్సాహంతో వుండటాన ఆమెతో మాట్లాడుతుంటే మనకీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయనిపించేది.
ఒక సారి వాళ్ళింటికి ఒక పదిహేను మంది రచయిత్రులను ఆహ్వానించి రామలక్ష్మి గారు ఆరుద్ర పుస్తకాన్ని ఆవిష్కరణ చేసారు. వరూధినిగారూ,శాంతసుందరీ,గోవిందరాజుల సీతాదేవి, శారదా అశోక్ వర్థన్,హేమలతా భీమన్న,ముక్తేవిభారతి, కొండవీటి సత్యవతి,కె.బి.లక్ష్మి,పోలాప్రగడ రాజ్యలక్ష్మి మొదలైన వాళ్ళం హాజరయ్యాము.కొంతసేపు ఆరుద్ర లలితా గీతాలు, సినీగీతాలు ఆలపించాము.పుస్తకం ఆవిష్కరించి ఫొటొలు తీసుకొని తర్వాత రామలక్ష్మిగారి మాటలవిందుతో పాటూ వాళ్ళ అక్క కూతురు ఏర్పాటు చేసిన విందు కూడా ఆస్వాదించాము.
రామలక్ష్మి గారి ఇంటి కింద అపార్ట్మెంట్ లో అబాకస్ నేర్పించే టీచర్ వున్నారు.ఆమె దగ్గర ఆషీని అబాకస్ నేర్చుకోవటానికి చేర్చాను.రోజూ ఆషీని తీసుకు వెళ్ళి వాళ్ళింట్లో దిగబెట్టి ఆ క్లాస్ అయ్యేవరకూ నేను ఒక్కొక్కప్పుడు రామలక్ష్మి గారింట్లో కూర్చొని కబుర్లు చెప్పేదాన్ని.ఆషీకి అబాకస్ చాలా నచ్చింది.ఉత్సాహంగా నేర్చుకునేది.
ఆ సందర్భంలో రామలక్ష్మి గారితో నేను తరుచూ కలిసేదాన్ని. అబాకస్ క్లాసు అయ్యేవరకూ రామలక్ష్మిగారి దగ్గరకి వెళ్ళటంతో, ఎన్నెన్ని కబుర్లో చెప్పేవారు. ఒక గంట ఎంత తొందరగా గడచిపోయేదో! ఆమె అనర్గళంగా ఎన్నో విషయాలు చెప్తుంటే సమయం తెలిసేది కాదు.
ఆమె నాకు ఎంతో ఇష్టమైన కవి శ్రీశ్రీ గురించి తాగుబోతుగా చెప్తుంటే బాధకలిగించింది కాని నిజాల్ని ఒప్పుకోవాలి కదా!
ఒకసారి రామలక్ష్మిగారికి పొట్ట ఆపరేషన్ అయ్యిందట. ఆపరేషన్ చేసిన తర్వాత ఆ డాక్టర్ " మీ పొట్టనిండా అక్షరాలే ఉన్నాయని ఆరుద్ర గారు అన్నారు. ఒక్క అక్షరం ముక్కా లేదు మీ పొట్టలో రామలక్ష్మిగారూ'అన్నాడు" అని చెప్తూ నవ్వారు. అదివిన్నాక ఎప్పుడు తలచుకున్నా నవ్వొస్తూ ఉంటుంది
ఆమెకు పత్రికా రంగంలోనూ, సినిమారంగంలో ను, సామాజిక సేవారంగంలోను, సాహిత్య రంగంలోనూ, రాజకీయరంగంలోను ఇలా అనేక అనుభవాలు ఉండటంవలన వాటిల్లోని లొసుగుల్ని విమర్శనాత్మకంగా చెప్పేవారు. ఎదురుగా ఉన్నవారికి కొన్ని విషయాలు నచ్చినా నచ్చకపోయినా ఆమె తన మనసులో మాటను, తన అభిప్రాయాన్ని చెప్పటానికి జంకరు. తనని తానే అందరూ గయ్యాళి నని అంటారని కూడా నవ్వుతూ చెప్పుకుంటారు. నిర్భయంగా ఉన్నది ఉన్నట్లు నిష్కర్షగా చెప్పకమానరు. అందుచేత కొంతమంది ఆమెకు దూరమయ్యారు. నిజానికి వారు రచనలు చేసే ఆకాలంలో ఆయారంగాలలో పురుషాధిక్యత మరింత ఎక్కువ . వాటిని తట్టుకొని నిలదొక్కుకోవాలంటే ధిక్కార స్వరం ఉండక తప్పదేమో.
ప్రతీ ఒక్కరి గురించి అందులోనూ సినీ, సాహిత్య రంగంలో లోని వారి మంచికన్నా వాళ్ళ ప్రవర్తనలోని దుర్గుణాలను వాళ్ళరెండుముఖాలను వేరు చేసి నిర్భయంగా చూపించేవారు. ఆవిడ నెగెటివ్ గానే మాట్లాడుతున్నట్లు అనిపించినా ఆవిడ లోని పాజిటివ్ నెస్ మనం స్పష్టంగా గుర్తించగలం, కదలడానికి కాళ్ళు సహకరించకపోవటంవలన చాలా కాలంగా వీల్ చైర్ కే పరిమితం అయినా అన్నింటికీ ఒకరిపై ఆధారపడాల్సి వచ్చినా సాహిత్యం, సినీరంగం పత్రికలూ వీటి గురించి తప్ప తన శారీరక అసహాయత్వం గురించి గానీ, అనారోగ్యాల గురించి గానీ ఒక్కసారి తలంచరు. ఆ వయసులో కూడా హాస్యంగా, చమత్కారాలతో సానుకూల
దృక్పథంలో మాట్లాడటం వలన ఆమెతో మాట్లాడుతున్నంతసేపూ హాయిగా ఆహ్లాదంగా ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా నిజం.
మొత్తంమీద ఆషీ అబాకస్ క్లాసులు రామలక్ష్మి గారితో సాన్నిహిత్యాన్ని పెంచాయి.
ఎందువలనో గుర్తులేదు.కానీ మలకపేట దిల్షుక్ నగర్ ప్రాంతం అంతా కొన్నాళ్ళు కర్ఫ్యూ పెట్టిన తర్వాత సడలింపు ఇచ్చి రాత్రి ఎనిమిది నుండి రాత్రి కర్ఫ్యూ వుంచారు.
ఆరోజు పల్లవి మధ్యాహ్నం కాలేజీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది.సాయంత్రం ఎప్పటిలాగే ఆషీని అబాకస్ క్లాసులో దించి ఏడుగంటలకు వస్తానని ఇంటికి వచ్చేసాను.ఏడుగంటలకు ఇంటినుండి బయలుదేరి వెళ్తుంటే స్ట్రీట్ లైట్లు ఆరిపోయాయి.నేను ఆ చీకట్లో చిన్న స్పీడ్ బ్రేకర్ని చూసుకోక తట్టుకుని పడిపోయాను.కుడిచేతిమీద ఆపుకోవాలనుకోవటంలో చెయ్యి మణికట్టు దగ్గర విరిగింది.బేగ్ లోని ఫోన్ తీసి చెయ్యాలన్నా వీలుకాలేదు.ఎడమచేతితో కుడిచేతికి సపోర్ట్ ఇచ్చి బాధ అణచుకొని ఆషీ దగ్గరకు వెళ్ళాను.
ఆషీకి ఫోన్ ఇచ్చి మా వారికి రింగ్ చేయమని విషయం చెప్పి మా రెగ్యులర్ ఆటో సలీమ్ కి హాస్పిటల్ కి వెళ్ళటానికి ఫోన్ చేయమన్నాను.పల్లవికీ ఫోన్ చేయించాను.
ఆషీ సాయంతో ఇంటికి వెళ్ళి సలీమ్ ఆటోలో మలక్ పేటలోని సుస్రుతా నర్సింగ్ హోం కు వెళ్ళాము.ఈలోగా పల్లవి డైరెక్ట్ గా అక్కడికే వచ్చింది.
కర్ఫ్యూ అని డాక్టర్ వెళ్ళిపోయాడట.ఒకనర్సు,మరొకరిద్దరు అటెండర్లు వున్నారు.అక్కడ రాత్రికి జాయినైపోమనీ,ఉదయం డాక్టరు వచ్చాక చూస్తారని అన్నారు.నాకునొప్పి అంతకంతకూ పెరిగిపోతోంది.
ఈ లోగా ఫోన్ అందుకుని కారు తీసుకుని పొనుగోటి కృష్ణారెడ్డి వచ్చి దిల్షుక్ నగర్ లోని ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరకు వెళ్దామన్నారు.పల్లవినీ ఆషీని ఇంటికి సలీమ్ ఆటోలో వెళ్ళిపోమన్నాము.
ఆర్థోపెడిక్ డాక్టర్ ఎక్స్ రే తీయించాక, మర్నాడు ఆపరేషన్ చేసి వైర్ వేస్తాము.హైబీపీ వుంది కనుక ఇసీజీ తీయించి రిపోర్ట్ తీసుకు రమ్మన్నారు. వెంటనే నొప్పి తగ్గటానికి ఇంజెక్షన్ ఇచ్చారు.అప్పటికే పది దాటింది.కర్ఫ్యూ వలన అంతటా నిర్మానుష్యం.ఏ హాస్పిటల్ లోనూ డాక్టర్లు లేరు.కారులో అలా వెతుక్కుంటూ కనిపించిన ప్రతీ హాస్పిటల్ మెట్టు ఎక్కాము.ఆఖరికి ఒక దగ్గర ఇసీజి చేయించుకోవడానికి కుదిరింది.రిపోర్టు తీసుకుని మళ్ళీ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే సన్నని వెదురు బద్దలతో తాత్కాలికంగా కట్టు కట్టేరు.అంతవరకూ వేలాడిపోతోన్న కుడి చేతిని ఎడమ చేత్తో పట్టుకునే వున్నాను.ఇవన్ని అయ్యి ఇంటికి వెళ్ళేసరికి సుమారు పన్నెండు అయ్యింది.కాస్త పెరుగన్నం తిని టాబ్లెట్ వేసుకుని పడుకున్నాను.
" పడిపోయానని ఫోన్ చేస్తే తరుచూ కళ్ళు తిరిగి పడిపోతావు కదా అలాగే అనుకున్నాను.ఇంత దెబ్బ తగిలిందను కోలేదు."అన్నారు బిత్తరపోతూ వీర్రాజుగారు.
మర్నాడు ఉదయమే హాస్పిటల్ కి పల్లవి నేనూ వెళ్ళాము.వీర్రాజుగారు ఆషీని చూసుకోడానికి ఆగిపోయారు.అంతేకాక ఆయనకి హాస్పిటల్ వాతావరణంలో బీపీ పెరిగిపోతుంది.అందుకే ఇంట్లోనే వుండమన్నాం.చేతికి రాడ్ వేసి సమ్మెంటుకట్టు కట్టి ఆరు వారాల తర్వాత రమ్మన్నారు.
పల్లవి రెండు వారాలు సెలవు పెట్టింది.ఆ తర్వాత కూరా పప్పు చేసేస్తే వీర్రాజు గారు కుక్కర్ పెట్టేవారు.నేను మామూలుగా రాసుకోవటం చెయగలనా అని నాకు కొంచెం దిగులు మొదలైంది.పల్లవి కోప్పడుతున్నా ఎడమ చేత్తోటే కొంచెం పనులు సాయం చేయటానికి ప్రయత్నించే దాన్ని. ఎడమ చేత్తో రాయటానికి చూసేదాన్ని.ఆ ప్రయత్నంలోనే ఒక కవిత కూడా రాసాను.
ఆరు వారాల తర్వాత సిమ్మెంటు కట్టు తీసేసినా క్లాత్ తో కట్టు కట్టుకోమని డాక్టర్ చెప్పి గోరు వెచ్చని వేడినీళ్లలో చేతిని పెట్టి వేళ్ళు కదుపుతూ ఎక్సర్సైజులు చేయమన్నారు డాక్టర్.నాకు కుడిచేయి ముఖ్యమైనది కదా చాలా శ్రద్ధగా చేసి తొందరగా నొప్పి తగ్గించుకున్నాను.కానీ ఆ చేత్తో కొద్ది బరువు పట్టుకున్నా నొప్పి పెట్టేది.
2009 అసెంబ్లీ ఎన్నికలు మొదలయ్యాయి.వై ఏస్సార్ కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా ముందుకు నడిపించి , అసెంబ్లీలో కాంగ్రెసు 156 సీట్లు గెలుచుకునేలా చేసాడు. వై ఎస్.ఆర్ ముఖ్యమంత్రి గా 20 మే 2009న రెండవసారి ఆంధ్రప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.ఈ సారి కూడా టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా మారింది.విద్యార్థులకు రీయింబర్స్మెంట్ ఇవ్వటంతో ఇబ్బడిముబ్బడిగా వెలిసిన ఇంజనీరింగ్ కాలేజీలు కాంగ్రెస్ కు ప్లస్ పాయింట్ అవుతుంది.గ్రామీణ పిల్లలు,బడుగు వర్గాల పిల్లలు వీటివలన వున్నత విద్యకు చేరువయ్యారు.
ఉద్యోగం చేసినంతకాలమే కాక తర్వాత కూడా మా స్కూల్ విద్యార్థులకు మొదటి రేంక్ వచ్చినవారికి ఆగష్టులో నగదు
బహుమతులు ఇవ్వటం నిలిపివేయలేదు.కవర్లలో డబ్బుపెట్టి కొన్ని ఏళ్ళ పాటు అందజేస్తూనే వున్నాను.కానీ ఆ డబ్బు సక్రమంగా నేను కోరిన విధంగా వుపయోగించటం లేదని తెలిసింది.దాంతో నేను రిటైర్ అయిన నాలుగేళ్ళ తర్వాత ఇవ్వటం మానేసాను.
నా రెండో దీర్ఘ కవిత బతుకు పాటలో అస్తిత్వ రాగం" పూర్తి చేసాను. జీవితంలోని వివిధ దశలైన శైశవం,బాల్యం,కౌమారం, యవ్వనం , ప్రౌడత్వం, వృద్ధాప్యం, ముగింపు తో ఏడు చాప్టర్ లుగా విభజించి స్త్రీ జీవితాన్ని సంపూర్ణంగా కవిత్వంలో అక్షరీకరించాను. తొలిసారిగా పల్లవి డిజిటల్ పద్ధతిలో తయారు చేసిన ముఖచిత్రంతో
ఈ పుస్తకం వెలుగులోకి వచ్చింది.
ఈ పుస్తకం ప్రింటింగ్ సమయంలో వీర్రాజు గారికి ఒక ఆలోచన వచ్చింది."ఈ ఏడాది డిసెంబర్ లో నీ అరవై ఏళ్ళు పుట్టినరోజు వస్తుంది కదా అసందర్భంగా ఇప్పటికి వచ్చిన నీ ఎనిమిది కవిత్వం పుస్తకాలూ కలిపి సమగ్ర సంపుటి గా ప్రచురించుతే బాగుంటుంది " అన్నారు.ఖర్చు ఎక్కువే అవుతుందని నేను ఆలోచించాను.
కానీ వీర్రాజు గారు "ఇంతవరకూ ఇలా ఎవరూ సమగ్ర సంపుటాలుగా వేసుకోలేదు.అందులోనూ ఇంత కవిత్వం రాసిన కవయిత్రులూ తక్కువే.వేస్తేనే బాగుంటుంది." అని గట్టిగా నిర్ణయించుకోవడమే కాకుండా నాళేశ్వరం శంకరంగారితో కూడా ప్రస్తావించారు.శంకరంగారు కూడా మంచి ఆలోచన అని ప్రశంసించి ప్రత్యేక సందర్భంగా ఎవరి చేతనైనా ముందుమాట కూడా రాయించండి అన్నారు.
1980 లో వచ్చిన తొలి కవితా సంపుటికి శివారెడ్డిగారితో ముందుమాట రాయించాను.తర్వాత ఏ సంపుటికీ ఎవరిచేతా రాయించ లేదు.శంకరంగారి సూచన అనుసరించి ఎవరిచేత రాయించుదామా అని ఆలోచించి కాత్యాయనీ విద్మహే ఎగిరేగారితో రాయిస్తే బాగుంటుంది అని నిర్ణయించుకున్నాము.
కాత్యాయనీ విద్మహేగారికి ఫోన్ చేసి విషయం చెప్పాము.ఇంకా అయిదారు నెలలు పైనే వుంది కనుక సమయం తీసుకోమని చెప్పాను.ఆమె సంతోషంగా అంగీకరించారు.నా విడివిడి సంపుటాలన్నీ ఆమెకు పంపించాము.
డిటీపీ చేయించటానికి కూడా ఇచ్చాము.పుస్తకం 500 పేజీలు కన్నా ఎక్కువే వచ్చేలా వుంది.
దేశమంతా వినాయక చవితి సంబరాల్లో మునిగింది.ఎప్పుడూ కోలాహాలంగా వైభవంగా జరిగే వినాయక నిమజ్జనోత్సవాలు చాలా గంభీరంగా,భయంభయంగా జరిగాయి.ఆ తర్వాత
చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరగా ఉదయం గం.9.35 నిమిషాలకు హెలికాప్టరుతో సంబంధాలు తెగిపోయాయనే వార్తలు నాలుగురోజులుగా వస్తున్నాయి.ఒకరెండుమూడు రోజుల పాటూ ఆచూకి తెలియలేదు. ముఖ్యమంత్రి ఆచూకీ కోసం గాలించగా 25 గంటల తరువాత సెప్టెంబర్ 2 వ తేదీ 2009 రోజునాటికి ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్ళు లభించాయి. వై.ఎస్.తో సహా మొత్తం ఐదుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని నిర్థారించారు.
ఉగ్రదాడేమోనని ఒక్కసారిగా రాష్ట్రమే కాకుండా దేశమంతా వులికిపడింది.కానీ చాలాకాలం అన్ని కోణాల నుండి శోధించి హెలికాప్టర్ లోని యాంత్రిక లోపంగా ప్రకటించారు.రోశయ్యగారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధిష్టానం ప్రకటించింది.
కాంగ్రెస్ లో జరిగిన అనూహ్య పరిణామాలు తెరాసా నాయకులకు కలిసి వచ్చింది.అప్పటికే చాలా కాలంగా ఏకీకృతం అవుతున్న వారికి బలం పుంజుకోవడానికి ఇది ఒక అవకాశంగా మారింది.
తెరాసా అక్టోబరు 21న సిద్ధిపేటలో ఉద్యోగ గర్జన పేరుతో భారీ సభ నిర్వహించారు.ఉద్యోగులు , విద్యార్థులు,ప్రజలు ఏకమయ్యారు.జయశంకర్, హరగోపాల్, కోదండరాం, చుక్కా రామయ్య, విద్యాసాగరరావు వంటి మేధావులు సంఘటితం కావటం ఉద్యమం వూపు అందుకుంది.
2009 నవంబర్ 29న సిద్ధిపేట కేంద్రంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఇది తెలంగాణ ఉద్యమానికి కీలక మలుపై తెలంగాణను నిప్పుల కొలిమిగా మార్చింది.
విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావటంతో తెలంగాణ వచ్చే వరకూ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉద్యమానికి కేంద్రబిందువు అయ్యింది . ప్రభుత్వం కేసీఆర్ను దీక్ష చేయకుండా ప్రభుత్వం అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించింది ఆయన జైల్లోనే దీక్ష కొనసాగించారు. తరవాత నిమ్స్ కి తరలించినా దీక్ష కొనసాగింది.
''తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ చచ్చుడో'' అనే నినాదం ఇచ్చారు కేసీఆర్. తెలంగాణా అంతటా భగ్గుమనడంతో కేంద్రపీఠం కదిలింది.
చిదంబరం తెలంగాణ ప్రకటన
డిసెంబరు 9వ తేదీన కేంద్రం తెలంగాణాకు అనుకూలంగా హోం శాఖ మంత్రి చిదంబరం ప్రకటన చేశారు. ఈ ప్రకటన తరువాత సంబరాలు జరిగాయి. కేసీఆర్ దీక్ష విరమించారు.
నా సమగ్ర కవిత్వం చదివి ఒకరోజు కాత్యాయనీ విద్మహే నాకు ఫోన్ చేసి " మీ కవిత స్త్రీ వాద సంకలనం నీలిమేఘాలులో చేరలేదనుకుంటాను.ఎందుచేత " అని అడిగారు ." బహుశా నేను మితవాద స్త్రీ వాదిగా భావించి చేర్చలేదేమో" అన్నాను.ఆమె సుమారు అరగంటసేపు నాకవిత్వం గురించి నాతో ఫోనులో చర్చించారు.అంతేకాదు సుమారు పదహారు పేజీల సుదీర్ఘ ముందుమాట రాసి అందించటం నాకు చాలా సంతోషం కలిగించింది.
అయితే నా పుట్టిన రోజు నాటికి ప్రచురణ పూర్తికాలేదు.అందుకని ఒక డమ్మీ కాపీ తయారుచేసారు వీర్రాజు గారు.
మా కుటుంబానికి బాగా దగ్గరైన ఆత్మీయ మిత్రులు ఒక పదిహేనుమందిని ఆహ్వానించి మా ఆషీతో పుస్తకాన్ని ఆవిష్కరింపజేసి మా ఇంటికి దగ్గరలోనే ఒక హొటలులో కలిసి భోజనాలు చేసాము.ఆ రకంగా నా షష్ఠిపూర్తి అయింది.
పుస్తకం ప్రింటింగ్ పూర్తయ్యాక బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో గోపీ గారి అధ్యక్షతన రత్నమాల , నాళేశ్వరం శంకరం నా పుస్తకంపై ప్రసంగించగా ఎనిమిది సంపుటాలతో కూడిన నా సమగ్ర కవిత్వ సంపుటి ఆవిష్కృతం అయ్యింది.ఆ విధంగా నాకు వీర్రాజుగారు గొప్ప బహుమతి అందించారు.
-- శీలా సుభద్రాదేవి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)