13, మే 2025, మంగళవారం
నడక దారిలో -52
నడక దారిలో -52
హైదరాబాద్ నగరంలోనే కాదు దేశమంతటినీ ఉలికి పడేలా చేసిన జంట పేలుళ్ళ సంఘటనలు 2007 ఆగష్టు 25 న జరిగాయి.
కోఠి ప్రాంతంలో మూడు దశాబ్దాలుగా పేరున్న గోకుల్ చాట్ షాపులో సాయంత్రంపూట విపరీతమైన జనం కూడివుంటారు.అక్కడి చాట్,పానీపూరీ వంటి వాటికి చాలా డిమాండ్ వుంది.అటువంటి చోట సాయంత్రం 7:40 ప్రాంతంలో బాగా రద్దీగా ఉన్న సమయంలో గోకుల్ చాట్ సెంటరులో బాంబు పేలింది. పదిమందికి పైనే అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 23 మందికి పైగా ఆసుపత్రుల్లో మరణించారు. 50 మందికిపైగా గాయపడ్డారు.మా మారింది కూతురు క్లాస్ మేట్ ఎమ్మెస్ కోసం యూఎస్ వెళ్ళటానికి సిద్ధపడుతూ స్నేహితులతో గోకుల్ చాట్ కి వెళ్ళి గాయపడి పద్దెనిమిది యేళ్ళు దాటినా ఇప్పటికీ వీల్ చైర్ కే అంకితమై శారిరకంగానే కాదు మానసికంగా కూడా వైకల్యంతో వున్నాడు.మానవత్వంలేని రాక్షసులు జనసమ్మర్థ ప్రాంతాలలో ఈ విధంగా చేయటం వలన ఎంతమందికి కడుపు కోత అయిందో కదా
అదే సమయంలో సచివాలయానికి ఎదురుగా ఉన్న లుంబినీ పార్కులో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో మొత్తం 44 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. బాంబుల్లో ఇనుప ముక్కలు వుపయోగించటం వలనే చాలామంది శరీర అవయవాలు కోల్పోయారని తెలిసింది.ఈ సంఘటనలతో ఒక్క సారిగా నగరం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయింది.తలచుకున్నప్పుడల్లా గుండె భారమై పోతుంది.
పల్లవి సాధారణంగా అదేసమయంలో ఇల్లు చేరేది.హైటెక్ సిటీలో బస్సెక్కి లక్డికాపూల్ లో దిగి వనస్థలిపురం బస్ ఎక్కుతుంది.ఇలా ఇంటికి రాగానే ఈ పేలుళ్ళ ఘటన టీవీలో చూసి హమ్మయ్య పిల్ల ఇంటికి చేరిందని వూపిరి తీసుకున్నాం.
మా ఇంట్లో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది వరకూ రేడియోలోంచి గానీ టేప్ రికార్డర్ లోంచి గానీ పాటలు ఇల్లంతా వ్యాపిస్తూనే వుంటాయి.స్వర్ణకమలం,తాల్ పాటలే కాకుండా ఒక చిన్నపిల్లల ఇంగ్లీష్ పాటలు కేసట్ కూడా వేస్తూ వుంటాం.అవి వేసినప్పుడు ఆషి భలే బాగా ఆపకుండా కేసెట్ పూర్తి అయ్యేవరకూ చక్కగా రిథం కి తగినట్లుగా డాన్స్ చేసేది.
నాకు సరేసరి పల్లవికి కూడా క్లాసికల్ డాన్స్ నేర్పించలేక పోయాము.పల్లవి చదివే స్కూల్ లో కో కరిక్యులర్ యాక్టివిటీ క్రింద డాన్స్ క్లాస్ కూడా వుండేది.పల్లవి భరతనాట్యం తీసుకుందామనుకుంటే అందులో ఎక్కువమంది వున్నారని కథక్ లో చేర్చారు.అదికూడా పల్లవి బాగానే నేర్చుకుంది.పదో తరగతి అయ్యాక వదిలేసింది.
ఆషీ బాగా చేస్తుంది కదా నేర్పించుతే బాగుండును అనుకున్నాను.పల్లవి ఉదయం ఎనిమిదిన్నరకి హైటెక్ సిటీ వుద్యోగానికి వెళ్తే తిరిగి వచ్చేసరికి ఏడో ఎనిమిదో అయ్యేది.అందుచేత నాకూ ఆషీకీ దోస్తానీ పెరిగింది.సూపర్ బజార్ వెళ్ళాలన్నా,కూరలకైనా మేమిద్దరమే.వెళ్ళినప్పుడల్లా నన్ను కబుర్లతో మెప్పించి తనకు కావలసిన రకరకాల పెన్నులు,రకరకాల సెంట్ రబ్బర్లూ కొనిపించుకునేది
ఒక రోజు మోర్ సూపర్ బజార్ వెళ్ళి వస్తుంటే ఎల్.ఐ.సి కాలనీ పార్కులో పిల్లలు డాన్స్ చేస్తుండటం చూసి ఆషీని డాన్స్ నేర్చుకుంటావా అని అడిగాను.నేర్చుకుంటాను అనేసరికి పార్క్ లోకి వెళ్ళాను.
పదిమంది వరకు అన్ని వయసుల పిల్లలకూ ఒక అమ్మాయి డాన్స్ నేర్పుతోంది.ఆషీని చూపించి డాన్స్ లో చేర్చాలనుకుంటున్నట్లు చెప్పాను.వారానికి మూడురోజులు క్లాసులు ఉంటాయనీ తెల్లని పంజాబీ డ్రెస్ వేసుకొని రావాలని చెప్పింది.
సరే నని మర్నాటి సాయంత్రానికి నేను ఇంట్లో వున్న క్లాత్ తో తెల్ల పంజాబీ డ్రెస్ కుట్టేసి రెడీ చేసాను.
ఆషీ స్కూల్ నుంచి రాగానే కొత్త డ్రెస్ వేసుకొని తనకోసం తయారు చేసిన అప్పచ్చులు తిని పాలు తాగిన తర్వాత అయిదు గంటలకు పార్కులో డాన్స్ క్లాస్ కి తీసుకు వెళ్ళాను.దారిపొడవునా హుషారుగా కబుర్లు చెప్తూ నడిచింది.
డాన్స్ టీచర్ తీసుకువచ్చిన పండుతాంబూలం తీసుకుని ముందు చేయాల్సిన వందనం నేర్పింది.తర్వాత హస్తముద్రలూ లాంటి వేవో నేర్పింది.ద్వితీయవిఘ్నం వుండొద్దు రేపు కూడా తీసుకుని రమ్మంది.
మర్నాడు కూడా తీసుకు వెళ్ళాను.డాన్స్ పాఠం అయ్యేవరకూ అక్కడే వుండి తిరిగి రోజూ ఇంటికి వస్తున్నాము.ఒక నెల రోజుల పాటూ ఆసక్తి తో ఆషీ క్లాసు ఇష్టపడింది.ఆ డాన్స్ టీచరు పాఠం కన్నా రోజూ ఎవరినో ఒకరిని తిట్టటం ఎక్కువ.దాంతో ఆషీ డాన్స్ క్లాస్ కి బయలు దేరిన దగ్గర నుండి ఇంటికి తిరిగి వచ్చే వరకూ స్వర్ణకమలంలో భానుప్రియలా ముఖంలో "ఎందుకొచ్చిన డాన్స్ రా బాబూ " అన్నట్లు ఎక్స్ ప్రెషన్స్ పెట్టేది.అప్పటికీ దారిపొడవునా నేను కబుర్లు చెప్తున్నా మూడీగా వుండేది.కావాలని క్లాస్ లో తప్పులుగా చేసేది.
డాన్స్ క్లాస్ మానేస్తావా అని అడిగితే వెళ్తాననే అనేది.అంతలో వినాయకచవితి దగ్గర పడింది.డాన్స్ టీచర్ " మీకు గణపతి మీద ఒక డాన్స్ నేర్పిస్తాను.గణపతి మంటపంలో చేయిస్తాను." అని పిల్లలను అందరినీ ఒక ఆర్డర్ లో నిలబెట్టి పాట తన టేబ్ లో ఆన్ చేసింది. ఎలా చేయాలో నేర్పటం మొదలెట్టింది.
"ఏకదంతాయ వక్రతుండాయ ...." అంటూ మొదలైన శంకర్ మహదేవన్ పాట,ఆ రాగమాధుర్యం అప్పటినుండి ఇప్పటికీ విన్నప్పుడల్లా వెంటాడుతునే వుంటుంది.అంత గొప్పగా వుంటుందా పాట.
సరే మళ్ళా డాన్స్ కి వద్దాం .ఒక బొద్దుగా వున్న అమ్మాయిని గణపతిగా ఎంపిక చేసింది.ఆ పిల్ల మర్నాటి నుంచి రావటం మానేసింది.ఈ డాన్స్ కూడా ఆషీ ఆసక్తిగా చేయటం లేదనిపించింది.
ఆ ప్రోగ్రాం ఎక్కడో అర్థరాత్రి జరుగుతుందంటే మా పాప అంత దూరం రాలేదని చెప్పేసాను.
ఆ తర్వాత నెలరోజులన్నా తిరగలేదు.కెనడాలో వున్న భర్త దగ్గరకు వెళ్ళటానికి వీసా వచ్చిందని ఆ అమ్మాయి డాన్స్ పాఠాలకు మంగళం చెప్పేసింది.
మా ఆషీకి డాన్స్ పాఠాలు తప్పిపోయాయి.ఇప్పటికీ స్వర్ణకమలం సినీమా చూస్తే డాన్స్ క్లాసులోని ఆషీ ముఖం గుర్తువచ్చి నవ్వుకుంటాం.
నేను,మా క్రింద ఇంటిలోని సరోజిని గారూ కలసి రోజూ మా యింటికి దగ్గరలోని పార్క్ లో వాకింగ్ కి వెళ్తాం.ఆషీ కూడా మాతో వచ్చి అక్కడే ఆడుకుంటుంది.పార్కు ఎదురుగా ఒక ఇంట్లో అమ్మాయి కీబోర్డు నేర్పుతుంది తెలిసి ఆషీని నేర్చుకుంటావా అని అడిగి అక్కడ చేర్చాను.
ఆ అమ్మాయి సినీ గాయకుడు హేమచంద్ర బంధువట.పాడుతా తీయగా లో పాల్గొన్నానని చెప్పింది. ఆషీ కోసం కీ బోర్డు పల్లవి కొన్నది.వారానికి మూడు రోజులు ఆషీని వాళ్ళింట్లో దింపి నేను నా వాకింగ్ పూర్తిచేసుకుని తిరిగి ఇంటికి తీసుకు వచ్చేదాన్ని.
కీబోర్డు చాలా ఆసక్తిగా ఆషీ నేర్చుకుంది.సరళీస్వరాలు,జంట స్వరాలు,పిళ్ళారి గీతాలేకాక జనగణమన,హేపీ బర్త్ డే పాట కూడా చక్కగా వాయించటం నేర్చుకుంది.బాగా వాయించటం చూసి పల్లవి సినిమా పాటలకు కీబోర్డ్ నొటేషన్లు ఎవరి దగ్గరో డౌన్ లోడ్ చేసి తీసుకు వస్తే అందులోంచి ' చిన్నిచిన్ని ఆశ ' కూడా నేర్చుకుంది.
ఆషీ కీబోర్డు నేర్చుకుంటుందని తెలిసి కృష్ణారెడ్డిగారు కూడా తన పిల్లలిద్దరికీ కీ బోర్డు కొని క్లాస్ లో చేర్పించారు.
ఆషీ ఆసక్తిగా నేర్చుకుంటుందని సంతోషించే లోగానే కొన్ని నెలలు గడిచాక ఆషీ కీబోర్డునేర్పించే టీచరు భర్తని సాఫ్ట్వేర్ ఉద్యోగం ద్వారా కంపెనీ వాళ్ళు అమెరికాకి పంపుతున్నారట.అతనితో పాటు ఆమె కూడా వెళ్తున్నానని చెప్పటం తో ఆషి సంగీతపాఠాలకీ మంగళం పాడేయాల్సి వచ్చింది.
కానీ తర్వాత కూడా ఆషీ చాలాకాలం కీ బోర్డు ప్రాక్టీస్ చేస్తూనే వుండేది.
మొత్తం మీద ఆషీకి సంగీతం, డాన్స్ నేర్పించాలన్న నా కోరిక మొదట్లోనే గండి కొట్టింది.కానీ పుస్తకం పఠనాభిరుచి మాత్రం రోజురోజుకూ,ఏడాదిఏడాదికీ పెరిగింది.అది సంతోషం.
ఇంకా చదవటం రాక ముందు నిద్రపుచ్చే సమయంలో తప్పని సరిగా నేనో,పల్లవో కథలు చెప్పేవాళ్ళం.ఒకొక్కప్పుడు మేము కథ చదువుతూ చెప్పేవాళ్ళు.చదవటం వచ్చాక ఆషీ చేతే చదివించి వివరించే వాళ్ళం.ఆ అలవాటు ఆషీ నేటికీ మానలేదు.పరీక్షల సమయంలో కూడా తానే ఒకటో రెండో కథలు చదివి నిద్రకి ఉపక్రమించటం ఆషీకి అలవాటైపోయింది.తెలుగు పుస్తకాలు తక్కువే కానీ ఇంగ్లీషులో మాత్రం పెద్దపెద్ద పుస్తకాలు చదివేస్తూవుంటుంది.తన ఫోన్ లో కూడా కొన్ని పుస్తకాలు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటుంది.అయితే ఆ వయసు పిల్లలు చదివే రొమాంటిక్ నవలలు కాకుండా కాన్స్పిరసీ నవలలు,చారిత్రక నవలలూ,బయోగ్రఫీలు అటువంటి పుస్తకాలే చదువుతుంది.ఏమైతేనేం పుస్తకాలు చదివే అలవాటు మంచిదే.
ఒకరోజు వార్తాపత్రికలో గుజరాత్ లోని ఆనందనగరం అనే వూరికి పిల్లలు లేని విదేశీ దంపతులు క్యూ కడుతున్నారనీ,సరోగసీ పద్ధతిలో పేద మహిళలను ధనాన్ని ఆశ చూపి ఒప్పిస్తున్నారనే కథనాన్ని చదివి ఒక రాత్రంతా నిద్రపట్టలేదు.అంతకు ముందు పాలమూరు కార్మికులు మధ్యదళారీలను నమ్ముకొని అరబ్ దేశాలకు వెళ్ళి పడరాని కష్టాలు పడుతున్నారనే వార్త చదివి ఎలా అయినా వీరిమీద కథ రాయాలనుకున్నాను.కానీ వివరాలు సేకరించ లేక మానేసాను . ఇప్పుడు అద్దెకు గర్భం విషయం చదివిన తర్వాత ఈ రెండింటినీ కలిపి రాయాలనే ఆలోచన వచ్చి "గోవు మాలచ్చిమి " కథ రాసాను.
అప్పడే అనుకోకుండా బ్రౌన్ అకాడమి నవ్య వార పత్రికతో కలిసి నిర్వహిస్తున్న కథలపోటీ ప్రకటన చూసి పోటీకి కథ పంపించాను.ప్రత్యేక బహుమతి వచ్చింది.
ఈ కథ నవ్య వార పత్రికలో ప్రచురితం అయినప్పుడు చాలా మంచి స్పందన నాకు వచ్చింది.ప్రముఖ రచయిత విహారి గారు ప్రతీ సమావేశంలోనూ ఈ కథ గురించి ప్రస్తావిస్తూ ఈ ఏడాది మేటికథ అని ప్రశంసించేవారు.
బ్రౌన్ అకాడమివారు బహుమతికి ఎంపికైన కథలన్నీ కలిపి "బహుమతి కథలు" పేరిట పుస్తకంగా ప్రచురించారు . కేంద్ర సాహిత్య అకాడమీ వారికి పి.సత్యవతి గారు తన సంపాదకత్వంలో కూర్చిన ఆంగ్లానువాద కథల సంకలనంలో పాపూరి జయలక్ష్మిగారు చేసిన నా గోవు మాలచ్చిమి కథ ఆంగ్లానువాదం కూడా చేర్చారు.
నా మొదటి కథలసంపుటి 1990 లో వచ్చింది.పద్ధెనిమిదేళ్ళ తర్వాత రాసిన కథలన్నీ కలిపి నా రెండవ కథల్ని ఆషీ క్రయాన్స్ తో వేసిన చిత్రాన్ని ముఖచిత్రం గా వేసుకుని కొత్తకథాసంపుటిని రెక్కల చూపు పేరుతో ప్రచురించాము.కానేటి మధుసూదన్ గారూ ,జి.ఎస్.చలం గారూ ఈ పుస్తకావిష్కరణ విజయనగరంలో గానీ,వైజాగ్ లో గానీ పెడతామని అన్నారు.నేను సాధారణంగా ఆవిష్కరణ సభలు పెట్టుకోను.కాని పుట్టిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆవిష్కరణ జరగటం ఒక అనుభూతి కదా.
పెద్దక్కయ్య సంవత్సరీకాలకి ఎలాగూ వెళ్తాం కనుక అప్పుడు ఏర్పాటు చేయమని వీర్రాజు గారు వాళ్ళతో చెప్పారు.
అదేవిధంగా మేము వైజాగ్ రాగానే యూనివర్సిటీ కేంపస్ లోనే రూం కేటాయించారు.ఉత్తరాంధ్ర రచయితలు వచ్చి అక్కడ కలిసారు.
ఆ సాయంత్రం వైజాగ్ లో ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో తెలుగుశాఖాధిపతి సత్యనారాయణ గారి అధ్యక్షతన, తెలుగు ప్రొఫెసర్ డా.సజ్జా మోహనరావుగారు నా "రెక్కల చూపు" కథా సంపుటి ఆవిష్కరణ జరిగింది.వి.ప్రతిమ నా పుస్తకాన్ని పరిచయం చేసింది.ఆవిష్కరణ అద్భుతంగా జరిగింది.
ఆ మర్నాడు వీర్రాజు గారి బాల్యమిత్రుడి ఇంటికి వెళ్ళి సాయంత్రానికి విజయనగరం వెళ్ళిపోయాం.సంవత్సరీకాల కార్యక్రమం అయ్యాక హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం కట్టాము.
లేఖిని రచయిత్రులసంస్థ అధ్యక్షురాలు వాసా ప్రభావతి తెలుగు భాషా సాంస్కృతిక శాఖ కె.వి.రమణాచారి గారి సహకారంతో
ఒక రోజు సదస్సు నిర్వహణ తలపెట్టారు.రాష్ట్రేతర రచయిత్రుల్ని కూడా ఆహ్వానించి,వయోధికులైన ఆరుగురు రచయిత్రులను ఘనంగా సత్కరించారు.ఒక సదస్సులో నేను కె.రామలక్ష్మి గారి కథల గురించి ప్రసంగ వ్యాసం చదివాను.
లేఖిని సంస్థ కనుక అందులోని సభ్యులచేతే వాసా ప్రభావతి గారు ప్రసంగ పత్ర సమర్పణ చేయించారు.
కె.రామలక్ష్మి గారు మా ఇంటికి దగ్గరలోనే పది నిమిషాల నడక దూరంలో ఒక అపార్ట్మెంట్ లో తన సోదరితో పాటు వుంటున్నారు.అందువలన తరుచూ కలిసే దాన్ని.నేను ఆమె కథలగురించి వ్యాసం రాసానని తెలిసి చాలా సంతోషించారు.
ఎప్పటినుంచో స్త్రీ జీవితాన్ని పుట్టిన దగ్గర నుండి వృద్ధాప్యం వరకూ చాప్టర్లుగా విడదీసి దీర్ఘకవిత రాయాలనే ఆలోచన వుంది.దానిని రాయటం మొదలు పెట్టాను.శైశవం, బాల్యం, కౌమారం,యవ్వనం, ప్రౌడత్వం,వృద్ధాప్యం, ముగింపుగా ఏడు చాప్టర్లుచేసి రాయటం ప్రారంభించాను.స్త్రీ జీవితంతో పోలుస్తూ విత్తనం మొలకేసిన దగ్గర నుండి మోడుగా కావటం వరకు,సూర్యోదయం నుండి సంధ్యాసమయంవరకూ ప్రతీ చాప్టర్ నీ మొదలు పెడుతూ స్త్రీ జీవితాన్ని సాదృశ్యం చేస్తూ రాస్తున్నాను.బాగానే వస్తోందనిపించింది.
ఒకరోజు ఇద్దరు అమ్మాయిలు ఫోన్ చేసి నా కవితా సంపుటాలమీద ఎమ్.ఫిల్ చేసామని అందుకని కలవాలనుకుంటున్నామని ఇంటి చిరునామా అడిగారు.నాకు భలే ఆశ్చర్యం అంతులేని సంతోషం కలిగింది.తమ రచనలమీద పరిశోధన జరిగిందంటే ఎవరికి మాత్రం ఆనందం కలుగదూ?
మర్నాడు ఆ ఇద్దరూ వచ్చారు.నా యుద్ధం ఒక గుండె కోత దీర్ఘ కవిత మీద కె.భాగ్యలక్ష్మీ,నా మొదటి సంపుటి ఆకలి నృత్యం మీద బి.నాగలక్ష్మి మధుర కామరాజ్ విశ్వవిద్యాలయంలో చేసిన ఎమ్.ఫిల్ పరిశోధనల కాపి తీసుకుని వచ్చి ఇచ్చారు.అది చదివి నా అభిప్రాయం తెలుపుతూ ఒక ఉత్తరం రాసి ఇవ్వమన్నారు.ప్రాచ్యకళాశాలలో లెక్చరర్ పి.జగన్నాథరావుగారు వారికి గైడ్ అని చెప్పారు.
చాలా ఏళ్ళ క్రితం ఏదో సందర్భంలో కేబి లక్ష్మీ నాతో " సదస్సులలో పాత్ర సమర్పణ చేయటానికి అకడమీషియన్లనే తీసుకుంటారు. అందుకే తాను పీహెచ్డీ చేయాలని రిజిస్టర్ చేయించుకున్నానని" చెప్పటమేకాక "నువ్వు కూడా చెయ్యవోయ్" అని సలహా యిచ్చింది.ఆలోచిస్తుంటే లక్ష్మి అన్నది నిజమే అనిపించింది.
అకాడమీలు గానీ,యూనివర్శిటీలు గానీ అకడమీషియన్లకే పత్రసమర్పణ అవకాశాలు కల్పిస్తాయి.
అప్పట్లోనే ఒక రోజు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి పి హెచ్ డి అప్లికేషన్ ఫాం కూడా తెచ్చుకున్నాను.వీర్రాజుగారితో చెప్తే "నీ రచనలమీద పరిశోధనలు చేయగల స్థాయి రచయిత్రిగా ఈ నాడు నువ్వు వున్నావు.నువ్వు చేయటం ఏమిటి" అన్నారు.ఆయన మాట నచ్చక పోయినా,పేరు ముందు డాక్టర్ తగిలించుకోవాలనే కోరిక వున్నా, అప్పటికే ఎమ్మెస్సీ చేయటానికి చాలా శ్రమ పడి వున్నానేమో.మళ్ళా చదువులోకి దిగే సాహసం చేయలేక పోయాను.
ఈ నాడు నా రచనలమీద ఇద్దరు విద్యార్థులు ఇచ్చిన ఎమ్ ఫిల్ పరిశోధన గ్రంథాలు చూస్తుంటే నా మనసు ఉప్పొంగి పోయింది.
- శీలా సుభద్రాదేవి
27, ఏప్రిల్ 2025, ఆదివారం
స్త్రీ లపాలిటి కల్పవృక్షం సామవేదం వెంకట కామేశ్వరి
~ స్త్రీల పాలిటి వైద్య కల్పవృక్షం డా.సామవేదం వెంకట కామేశ్వరి ~
జన్మ రీత్యా మంచి సాంస్కృతిక నేపధ్యం గల కుటుంబంలో 1972 జనవరి 23వ తేదీన వెంకట కామేశ్వరి ఆ ఛాయలన్నిటినీ పిడికిట్లో ఒడిసి పట్టుకునే పాలకొల్లులో కన్నువిప్పింది
కామేశ్వరి పితామహులు డా.సామవేదం సత్యనారాయణగారు పాలకొల్లులో మంచి హస్తవాసి గల వైద్యులుగానే కాక స్థానిక లైన్స్ క్లబ్ లో ప్రతీ నెలా మొదటి ఆదివారం చక్కటి సంగీతకచేరీలు ఏర్పాటు చేసేవారు.అప్పట్లో పోలియో వ్యాధి వ్యాప్తి ఎక్కువగా వుండేది.ఈ వ్యాధిని తొలిదశలోనే గుర్తించి మెరుగైన వైద్యం కోసం రాయవెల్లూరు పంపే ఏర్పాటు చేసేవారు.కామేశ్వరి గారి నాన్నమ్మ ఆ రోజుల్లోనే మహిళా సాధికారతకల వ్యక్తి, మంచి సాహిత్యాభిలాష కలిగినవారు.మొదటి మనవరాలైన కామేశ్వరికి వీరే మొదటగా స్ఫూర్తి అందించిన వారు.
తండ్రి సామవేదం వేంకట సూర్యనారాయణ రసాయన శాస్త్రంలో మాష్టారు పట్టా అందుకున్న తొలిరోజుల్లో రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో లెక్చరర్ గానూ తర్వాత ఎస్.బి.ఐ లో ఆఫీసర్ గా ఉద్యోగం చేసి పదవి విరమణ అయినా కొద్దికాలానికే తీవ్ర గుండెనొప్పికి బలైపోయారు.తల్లి మీనాక్షి పెద్దగా చదువుకోక పోయినా తల్లిదండ్రులు ఇద్దరూ తమ ఆడపిల్లలిద్దరికీ మంచి చదువుల్నే కాక,సాహిత్య పఠనానికి కూడా ప్రోత్సహించిన రెండవ స్ఫూర్తి దాతలు.
పాలకొల్లుకు పద్నాలుగు మైళ్ళ దూరంలోని లంక గ్రామమైన భీమలాపురంలో నివాసితులైన మాతామహులు వేదపండితులు. ఇరవైనాలుగు వేల రామాయణం శ్లోకాలు కంఠోపాఠంగా నేర్చిన ఆధ్యాత్మికురాలు అమ్మమ్మ.వరదకాలంలో ముంపుకు గురైన గ్రామ ప్రజలను ఆదరించి స్వయంగా ఆహారాన్ని అందించిన సహృదయులు.
ఇటువంటి నేపధ్యంలో పెరిగింది కనకే కామేశ్వరి విద్యా, వైద్యం,సమాజం పట్లా అంకితభావం కలిగిన సహృదయురాలు కావటంలో ఆశ్చర్యం లేదు.తర్వాత్తర్వాత ఆమె తన చేయి అందుకున్న డా.వింజమూరి సూర్యప్రకాష్ సాహచర్యంలో కామేశ్వరి మరింత లక్ష్యసాధనకు మునుముందుకు అడుగులు వేసింది..వేస్తూనే వుంది.
కామేశ్వరి వైజాగ్ లోని ఆంధ్రా మెడికల్ కాలేజిలో MBBS చదివినప్పుడే కాలేజీలో ఎనాటమీ లో మొదటిస్థానంలోనూ,మైక్రోబయాలజీలో రెండవ స్థానంలోను రావటం విశేషం.తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజీ ,నయాపూల్ లోని ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్ లో Gynecologicy and obstetrics లో డిప్లొమా చేసారు.
డాక్టర్ ఎస్.వి. కామేశ్వరి తెలంగాణ రాష్ట్ర వైద్య మండలిలో సభ్యత్వం పొందారు.
ఇంకా అప్పటినుండి కామేశ్వరి కార్యరంగంలోకి దూకారు.దేశంలోని అన్ని విపత్తులలోనూ వైద్యసహాయం అందించేందుకు భర్త వింజమూరి సూర్యప్రకాష్ గారితో కలిసి ముందడుగు వేశారు.సునామీ సమయంలో ట్యూబెక్టమీ అయిన మహిళలు మళ్ళా సంతానోత్పత్తికి రీకానలైజేషన్ చేసుకోవటంతో వారిపై అధ్యయనం చేసి అది సరిగా జరగలేదనేది ప్రకటించారు.
డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సహాయంతో హిస్టరెక్టమీ మీద సీరియస్ గా పనిచేసి 2012లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి రోశయ్యగారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం నుంచి హిసెరెక్టమీ సేవలను తొలగించటం వీరు చేసిన వైద్యసేవాకృషికి తొలి విజయంగా చెప్పవచ్చు.
ఎందుకంటే భారతదేశంలో ఎంతమందికి హిస్టరెక్టమీ జరిగిందో డేటా లేదు.అవసరం వున్నా లేకపోయినా ఇబ్బడిముబ్బడిగా పేద శ్రామిక వర్గం స్త్రీలకు హిస్టరెక్టమీ చేయటంతో వారు తదనంతరం అనేక విధాలుగా రోగగ్రస్తులు కావటం జరుగుతుందనేది వీరి అధ్యయనంలో బయటకు వచ్చింది.
2013 లో ఢిల్లీలో ఒక NGO సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో కామేశ్వరిగారు తమ అధ్యయనంలో తెలుసుకున్న ఫలితాలను ప్రదర్శించారు.ఆ తర్వాతే National Family health survey -4 ( NFHS-4)- 2015-16 వారు హిస్టెరెక్టమీ గణాంకాలను నాటికి తయారుచేసారు.
కానీ తర్వాత కూడా ఈ గణాంకాలు పెరుగుతూనే వున్నాయని చింతిస్తారు కామేశ్వరి.
"గర్భసంచి కాపాడుకుందాం సమాజాన్ని బలపరుద్దాం “అనే పుస్తకాన్ని మొదట 2017 సంవత్సరంలో ప్రచురించారు. తెలంగాణా ప్రభుత్వ సహకారంతో 2018 సంవత్సరం జనవరి నుండి ఆగస్టు వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరోగ్యసిబ్బందికి,ఆశా వర్కర్లకు, మహిళాసమాఖ్య సభ్యులకు,81 గ్రామాలలో 16000 మందికి పైగా స్త్రీలకు పెద్ద ఎత్తున గర్భసంచి ప్రాధాన్యత పై అవగాహన కల్పించారు.అంతే గాక రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక పాఠశాలల్లో, కాలేజీలలో విద్యార్థినులకు గర్భసంచి ప్రాధాన్యత గూర్చి వివరించారు.
డా.కామేశ్వరి స్వభావం ఎప్పటికప్పుడు స్త్రీల ఆరోగ్యసమస్యల్ని పరిశోధనాత్మక దృక్పధంతో నిరంతరం పరిష్కరించటానికే కాకుండా ఆ సమస్యలపట్ల అవగాహన కల్పించి జాగృతం చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు.అప్పటినుండి తన దగ్గరకు చికిత్సకోసం వచ్చిన మహిళలను కేవలం చికిత్స చేసి పంపేయటం కాకుండా తల్లిలా అక్కున చేర్చుకుని శారీరకంగానే కాక మానసికంగా, కుటుంబపరంగా తగిన సహకారం అందిస్తున్నారు. వారి ఆరోగ్య సమస్యలనన్నింటినీ నమోదు చేసుకుని ఎక్కువ మందికి అందాలనే వుద్దేశ్యంతో పుస్తకరూపంలో తీసుకు రావటానికి కలంపట్టారు .
సంతానసాఫల్యం గురించి.ఇటీవల కుప్పలు తెప్పలుగా సంతానసాఫల్యకేంద్రాలు వెలుస్తూ , కుటుంబాల్లో పెళ్ళైన ఏడాది నుండీ గర్భం రానందుకు వేలెత్తి చూపటంతో అవమానపాలౌతున్న వారిని ఆకర్షించి మూలకారణాలు అన్వేషించకుండానే చికిత్స మొదలు పెట్టేస్తుండటం, దానితో తదనంతరం ఆర్థికపరమైన ఇబ్బందులేకాక ఆ చిన్నితల్లులు అనేక అనారోగ్యాలకు పాల్పడటం కామేశ్వరిని కలచివేసింది.
"సంతానం కానివారిలో 92 శాతం మందికి చిన్నచిన్న ప్రక్రియలతోనే ప్రాధమిక స్థాయి,మధ్యమస్థాయి క్లినిక్ లోనే ఫలితాలు లభిస్తాయి" అంటారు కామేశ్వరి.
ముఖ్యంగా కొన్నిదిగువ, మధ్యతరగతి కుటుంబాలలో సంతానం కలగకపోవటాన్ని దోషంగా పరిగణిస్తారు.కుటుంబంలోవారంతా ఆ స్త్రీని దోషిగా పనికిరాని వస్తువులా చూస్తారు.అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారిని కామేశ్వరి గారు ఆత్మీయంగా అక్కున చేర్చుకుని వారికి తగిన వైద్యం చేసి వారి ఒడిని పసిపాపతో నింపిన సందర్భాలు ఎన్నో.సంతానాభిలాషతో వచ్చిన దంపతులను నాలుగు రకాల కేసులుగా విభజించి తగిన విధంగా అవగాహన కల్పిస్తుంటారు.
అందుకే కామేశ్వరి తనదైన పధ్దతిలో దంపతులను కూర్చోబెట్టుకుని వారిని మానసికంగా, శారీరకంగా తన వైద్యానికి సానుకూలంగా తయారుచేసి వేలసంఖ్యలో దంపతులకు సంతానం కలిగేలా చేసారు.తన అనుభవాలూ తన పరిశోధనలనూ,తన పరిశీలనలనూ అన్ని కోణాల్లో క్రోడీకరించి "మధుమాలతి " అనే పుస్తకాన్ని రాసారు డా.కామేశ్వరి.
గ్రామాలనుండి వచ్చినవారిని,చాలాకాలం తర్వాత గర్భం నిలిచిన వారినీ తమ కేంద్రమైన 'అందరియిల్లు'లో ఆశ్రయం కల్పించి తగిన విశ్రాంతి గా ఉండేలా ఆరోగ్యకర ఆహారం అందజేస్తారు.
"సంతానం కలగని వందమందిలో ముగ్గురికి మాత్రమే సంతానం కలగకుండా చేసే కారణాలను ఐవీఎఫ్ సహాయంతో పరిష్కరించుకోవచ్చు.అంతేకానీ ఏదో వస్తువు కొనుక్కున్నట్లుగా తొందరపాటుతో ఐవిఎఫ్ చేయించుకోటానికి వెళ్ళవద్దు" అంటారు కామేశ్వరి .ఐవీఎఫ్ చేయించుకోవటం అనేది ఒకరి వ్యక్తిగత నిర్ణయంగా కాకూడదు . స్త్రీల గర్భంపై, ఆరోగ్యంపై దాడిగా మారుతోన్న పునరుత్పత్తి సమస్యలపైగాని,అనవసరంగా హిస్టెరెక్టమీ చేసేస్తూ స్త్రీల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటున్న దోపిడికేంద్రాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాల్లో,బస్తీల్లో పర్యటిస్తూ అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
కామేశ్వరీ, సూర్యప్రకాష్ గార్లు కలిసి చేసే మానవవైద్యసేవే కాక అందరి యిల్లు పేరిట చేస్తున్న సమాజానికి కూడా చేస్తున్న వైద్యాన్ని పరిగణలోకి తీసుకొని first hundred doctors from Andhra medical College గా 2023లో ఆంధ్రా మెడికల్ కాలేజీ శతవార్షికోత్సవాలలో AMC లో సీనియర్ డాక్టరైన శేషు శర్మగారు తన పుస్తకంలో నమోదు చేసారు.ఇది వీరు జీవితంలో సాధించిన మరో గొప్ప గుర్తింపు.
ఉత్తరాలతో మానవ సంబంధాలను ఎలా బలపరచుకోవచ్చో ' art of letter writing 'ని ఒక ఉద్యమం ద్వారా తెలియజేసారు ఈ వైద్య దంపతులు.
అంతటితో ఆగిపోలేదు అన్ని విధాలా రోగగ్రస్తమైపోతున్న సమాజాన్ని ప్రేమా నిజాయితీ అనే వైద్యంతో పునరుజ్జీవింప చేయటానికి నడుం బిగించారు. అందరం మనమందరం అంటూ మందార పూవును చిహ్నంగా ఎంచుకొని వారితో సహకరించే వారినందరిని ఒకే కుటుంబం గా కలుపుకుంటూ సమాజంలో 'అందమైన జీవితాల్ని ' కలగనే స్వాప్నికులు డా.కామేశ్వరీ,డా.సూర్యప్రకాష్ దంపతులు.అందుకే వీరు అందరికీ పూలనూ,పూలమొక్కల్నీ పంచుతారు.
అందరికీ ఆహారం, ఆరోగ్యం, మానసిక వికాసానికి పుస్తకం అందినపుడు సమాజమే మారుతుందన్న విశ్వాసంతో అడుగులు వేస్తారు.
తల్లిదండ్రుల సామాజిక సేవను బాల్యం నుంచి చూస్తూ పెరిగిన కుమార్తె గాయత్రి డాక్టర్ గా, కుమారుడు భరత్ శాస్త్రవేత్తగా విదేశాల్లో తమ రంగాల్లో నైపుణ్యం పొందారు.
డా.సామవేదం వెంకట కామేశ్వరి , డా.వింజమూరి సూర్యప్రకాష్ తో కలిసి తలపెట్టే ప్రతి పనిలో ఒకరి నీడ మరొకరిదిగా ,ఇరువురి అడుగుజాడలు ఒకటిగానే ప్రతీ కార్యక్రమం నిర్వహించటం అపురూపమైనదిగా
ఉంటుంది.
డా.సామవేదం వెంకట కామేశ్వరి గారు అపురూప పురస్కారం అందుకుంటున్న సందర్భంగా మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను.
8, ఏప్రిల్ 2025, మంగళవారం
ఆనందమయదేశంలో నేను
ఆనందమయదేశంలో నేను
"పుడమి నెల్ల లవలేశము విడువక తిరగాలి.
అడుగడుగున ఆగి ఆగి అరసి అరసి చూడాలి"
విన్నప్పటి నుండి, చిన్నప్పటి నుండి పాడుకుంటున్నప్పుడల్లా ఇలానే అనుకునేదాన్ని
ఈ విధంగా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో అన్ని ప్రదేశాలనూ వెళ్ళి చూస్తే ఎంత బాగుంటుందో అని. అదంతా ఎప్పుడైనా వెళ్తానేమోననే ఆశ. తీరా పెళ్ళయ్యి వెళ్ళేలోపున విజయనగరంలో పుట్టిపెరిగిన నేను, విజయనగరం చుట్టుపట్ల ఏప్రాంతం చూడలేదు. ఆఖరికి విశాఖసముద్రాన్ని, బీచిని కూడా నేటికీ చూడలేదు. ఆపక్కగా రోడ్డుమీదుగా వాహనంలో వెళ్తునే చూడటమే తప్ప.
వివాహానంతరం హైదరాబాదు వచ్చాక భువనేశ్వర్ లో వున్న ఆడబడుచు ఇంటి కెళ్ళినపుడు కోణార్క్, తర్వాత మరో పది పదిహేనేళ్ళకి మద్రాస్ చూసాను. కాని ఆ అనుభవాలు రాయనే లేదు..
నేను ఆర్టీసీ హైస్కూలులో ఉపాధ్యాయినిగా చేరిన తర్వాత ఆర్టీసీ యాజమాన్యంగా నడిచే పాఠశాల కనుక ప్రతి ఏడాదీ మా పాఠశాల పిల్లలని టూరుకి తీసుకు వెళ్ళమని రెండు బస్సులు , నలుగురు డ్రైవర్లను ఉచితంగా ఏర్పాటు చేసేవారు.
ఇక అప్పుడు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు స్కూలు పిల్లలతో బాటూ వెళ్ళాను. విద్యార్థులు బాధ్యత వలన చూడటం అయితే చూసాను.ఆ అనుభూతులూ రికార్డు చేసుకోలేదు.
పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మంచి మెడిటేటర్ ఐన స్నేహితురాలు ఉమ తరుచూ దేశ విదేశాల్లోని ప్రధానంగా బౌద్ధ కేంద్రాలకు వాళ్ళకు చెందిన టూర్ నిర్వాహకులతో వెళ్తుంటుంది.ఈ సారి ఎప్పుడైనా కుదిరినప్పుడు నేనూ వస్తానన్నంధుకు
మార్చిలో నిర్ణయించిన భూటాన్ పర్యాటనకు పావులు కదిలాయి.
హైదరాబాద్ నుండి కలకత్తాకు ఉమ మా ఇద్దరికీ ఫ్లైట్ టికెట్లు బుక్ చేయించింది.
అయితే నా పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయ్యింది.ఎట్లా అని ప్రశ్నిస్తే ఓటర్ ఐడీఅయినాపర్వాలేదని ట్రావెల్స్ వారన్నారు.అయినా అది కుదరకపోతే నాకు ఇబ్బంది అవుతుందని మా అమ్మాయి పాస్పోర్ట్ రెన్యువల్ కి అప్లై చేసింది. అనుకోకుండా నెలలోనే నాకు పాస్పోర్ట్ కూడా వచ్చేసరికి హాయిగా వూపిరి పీల్చుకున్నాను.
మార్చి మూడు తెల్లవారుజామున మూడు గంటలకు ఉమా నన్ను పికప్ చేసుకోగా ఎయిర్ పోర్ట్ కి బయల్దేరాను.చెన్నైలో దిగి మరో ఫ్లైట్ ఎక్కి మధ్యాహ్నం రెండింటికి బాగ్ డోగ్రా ఎయిర్పోర్ట్ చేరాము.వేర్వేరు ఫ్లైట్ లలో మొత్తం మా బేచ్ నలభయ్యారు మందినీ కలిసాము.అందులో ఇద్దరు పదిపన్నెండేళ్ళ పిల్లలు.అక్కా ఇద్దరుతమ్ముళ్ళు 18-20 ఏళ్ళ వాళ్ళు.మిగతా అందరూ 40-75 మధ్యవయస్కులే.
ఎయిర్పోర్ట్ దగ్గర బస్ ఏర్పాటు చేసి .ఆరుగంటలకు పైగా ప్రయాణం చేసి భూటాన్ బోర్డర్ టౌన్ ఫుట్షిలోంగ్ తీసుకువచ్చారు. Tara phendeyling hotel లో మా బస. ఈ టౌన్ పశ్చిమ బెంగాల్ లోని జైగాం పట్టణాన్ని ఆనుకొని ఉంటుంది. అక్కడికి వచ్చేటప్పటికే కొంచెం చీకటి పడుతూ ఉంది హోటల్ అయితే చాలా నీట్ గా క్లీన్ గా ఉంది. మేము పెద్దవాళ్ళమని మాకు క్రింద రూములే కేటాయించారు.
భూటాన్ కౌన్సిలేట్ సమయం అయిపోవటం వల్ల మా పాస్పోర్ట్ లు చెక్ చేసి మర్నాడు ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి స్టాంపింగ్ చేసుకోవాలన్నారు.బోర్డర్లో పాస్పోర్ట్ గాని, మన ఇండియన్ ఓటర్ ఐడి గాని చూపిస్తే సరిపోతుంది.
ఆ కౌన్సిలేట్ లోకి అడుగు పెట్టగానే నాకు కళ్ళు చెదిరాయి.స్థంభాలూ,వాసాలూ,ద్వారాలూ అన్నీ చెక్కతో చేసినవి .వాటికి ఎరుపురంగుపై తెలుపు,పసుపూ,నీలి రంగులతో అందంగా చిత్రాతి చిత్రంగా వేసిన డిజైన్లు చూపుల్ని కట్టి పడేసాయి.వాటిని ఫోటోలో బంధించాలని ఆశతో చీకటిలోనే ఫొటోలుతీసాను.ఆ తర్వాత అన్ని హొటల్స్ లోనూ, దారి పొడవునా ఇళ్ళు గోడలమీదా,ఘాట్ రోడ్డులో గల కొండగోడలమీదా భూటాన్ సాంప్రదాయ చిత్రాలు కనువిందు చేస్తూనే వున్నాయి.అవి భూటానీయుల సాంప్రదాయ కళని నేటికీ కాపాడుకోవటం ఆనందం కలిగించింది.
మా యోగీ ట్రావెల్స్ గణేష్,నవకాంత్ డిన్నర్ కీ ముందు పరిచయ సమావేశం ఏర్పాటు చేసారు.అందరూ పిరమిడ్ ధ్యానం పట్ల ఎలా ఆకర్షితులయ్యారో వారివారి అనుభవాలు తెలియజేసారు.
"నాకు సంగీతం, సాహిత్యం మాత్రమే ఒత్తిడి నుండి విశ్రాంతిని ఇస్తాయి.నేనూ ఉమా నలభై ఏళ్ళుగా స్నేహితులం,సహోద్యోగులం. నేను మెడిటేడర్ని కాదు." అని మాత్రమే చెప్పాను. ఉమా నన్ను కోప్పడి నా గురించి వివరాలన్నీ చెప్పి గూగుల్ లో శీలా సుభద్రాదేవి పేరుతో సెర్చ్ చేస్తే ఈమె గురించి తెలుస్తాయి.నిజానికి సుభద్ర నిత్యమూ ధ్యానంలో వున్నట్లు సంగీతం,సాహిత్యాలతోనే వుంటుంది " అని పరిచయం చేసింది.అందరూ నా విశేషాలు తెలుసుకోవాలని నాతో కబుర్లు చెప్పారు.తర్వాత డిన్నర్ చేసి నిద్రకి వుపక్రమించాము.
ఉదయమే తయారై క్రింద హాల్ కి వెళ్ళేసరికి గణేష్ వేణువుతో భూపాల రాగాన్ని ఆలాపన చేసి తర్వాత అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు కీర్తనలు వాయించాడు.
మంచు తెరలని చీల్చుకుంటూ లేత కిరణాలు భూమి తల్లిని ముద్దాడుతోన్న ఆ చలి వుదయాన
శృతి బద్ధమైన భూపాలరాగాన్ని వింటుంటే పారవశ్యంతో మనసు నిండిపోయింది.అందరూ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే నాకు తెలియకుండానే కళ్ళు మూతలుపడి ఆ రాగ జలధిలో ఓలలాడాను.
బ్రేక్ఫాస్ట్ తర్వాత భూటాన్ ఎంబసీ లో అందరివీ స్టాంపింగ్ అయ్యేసరికి పది దాటింది.అందరి స్టాంపింగ్ అయ్యాక ఎంబసీ ఆయన వచ్చి మా నలభై ఆరుమందికీ ఒక్కొక్కరికి భూటాన్ సాంప్రదాయ షాల్ కప్పి భూటాన్ కి స్వాగతించటం ఒక కొత్త సాంప్రదాయంగా, ఆత్మీయంగా అనిపించింది.
ఇక్కడ భూటాన్ కరెన్సీ, ఇండియన్ కరెన్సీ రెండింటి విలువా ఒకటే కావటాన రెండూ నడుస్తాయి. అందుచేత మేము కరెన్సీ మార్చుకోలేదు గానీ నేను దాచుకోటానికని సేకరించుకున్నాను.
మాకు ఏర్పాటు చేసిన మూడు వేనుల్లో నలభై ఆరు ముందే కాక ప్రతీ వేనుకు ఒక గైడ్ ని కేటాయించారు.మా గైడ్ పేరు వాచ్య్సూ అంటే గ్రేట్ రివర్ అని తన పేరుకి అర్థం చెప్పాడు.థింపూలో తన పేరుతో నది వుందని చూపిస్తానని కూడా అన్నాడు.మన దేశంలో నదులపేర్లని ముఖ్యంగా ఆడపిల్లలకే పెడతాం కదా.నాకు ఆశ్చర్యం కలిగింది.
ఆ రాత్రి మా హొటల్ కిటికీలోంచి కనిపిస్తోన్న "వెల్కమ్ థింపూ" అన్న అక్షరాలతో వున్న ఎత్తైన స్వాగతద్వారం ఎంత కళాత్మకంగా వుందో దానిని పగలు వెల్తుర్లోనేకాక రాత్రి దీపాల వెల్తురులో కూడా ఎన్నో ఫొటోలు తీసుకున్నాను.తర్వాత గమనిస్తే ప్రతీ నగరం స్వాగతతోరణాలూ అంత అందంగానే వున్నాయి.భూటానీయులు మంచి కళాహృదయులు అనిపించింది.
హొటల్స్ లో అన్ని రకాల పనులూ చేసే అమ్మాయిలందరూ చాలా అందంగానే కాక చాలా చురుకుగా వున్నారు. ,గైడుల్లా,ఇతరేతర పనులు చేస్తున్న వారందరూ యువకులే.ఇక రోడ్డుమీద ఒక చిన్న కాగితం గాని,ఒక ఆకు గానీ లేకుండా శుభ్రపరుస్తున్న వాళ్ళు కూడా యువకులే.చదువుకుంటున్న పిల్లలే పార్ట్ టైమ్ లో పనులు చేస్తుంటారుట.వాటికి వాళ్ళకు క్రెడిట్ పాయింట్లు వుంటాయని మా గైడ్ చెప్పాడు.
అర్థరాత్రి వరకూ యూట్యూబ్లూ,సినీమాలుచూస్తూ పగలు పొద్దెక్కేదాకా నిద్రపోయే బాధ్యత తెలియని మన పిల్లలు గుర్తు వచ్చారు.
ఎక్కడ చూసినా భూటానీయుల కంటే చూడటానికి వచ్చినవారే ఎక్కువ . భూటాన్ జనాభా మొత్తం కలిపినా ఎనిమిదిన్నర లక్షల కంటే మించరని తెలిసింది.
మరొకటి చిన్నపిల్లల దగ్గరనుండి ప్రజలంతా బయటకు వస్తే వారి సాంప్రదాయ దుస్తులనే ధరించాలట.ఇంట్లో మాత్రమే ఫేంటూ టీషర్ట్ చేసుకుంటామని గైడ్ చెప్పాడు.
విద్యా, వైద్యం వుచితమేనట.మరొకటి మనదేశంలో వీధికి పది రకాల క్లినిక్ లు కనిపిస్తాయి.వారం రోజుల మా ప్రయాణంలో ఎక్కడా మందుల షాపు గానీ,
క్లినిక్స్ గానీ కనిపించలేదు.ఒక దగ్గర మాత్రమే ప్రభుత్వ హాస్పిటల్ కనిపించింది.మరీ సీరియస్ జబ్బులైతే కలకత్తాకి తీసుకు వెళ్తారన్నాడు.
స్వచ్ఛమైన గాలీ,నీరు ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో చాలావరకూ ఆరోగ్యంగా వుంటారేమో.ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు.అందువల్ల ఆనందంగా కూడా వుంటారనుకుంటాను.అందుకేనేమో భూటాన్ ను ఆనందమయదేశం అంటారు.
థింఫూలో ప్రపంచంలోనే అతిపెద్ద బుద్ధ విగ్రహాలలో ఒకటైన బుద్ధ డోడన్మా మందిరాన్ని సందర్శించాం.
మందిరం లోపల బుద్ధుడు, బుద్ధుడికి చెందిన ముఖ్య అనుయాయుల విగ్రహాలు ఉన్నాయి. మరో ముఖ్య విశేషం అందరం లోపలకి అడుగుపెట్టేసరికి అద్భుత స్వర్ణ దృశ్యం కళ్ళు మిరుమిట్లు గొలిపాయి !!!నాలుగు గోడల చుట్టూ లక్షా పాతిక వేలకు పైగా బుద్ధ విగ్రహాలున్నాయి. బంగారు బొమ్మలకొలువులా చిన్నచిన్న బుద్ధ విగ్రహాలు షోకేసుల్లో అమర్చి ఉంచారు. ఎనిమిది ఇంచుల బుద్ధ విగ్రహాలు లక్షా,పన్నెండు ఇంచ్ ల బుద్ధ విగ్రహాలు పాతికవేలు వున్నాయన్నారు.ఇవి మిరుమిట్లు గొలిపే బంగారుపూత పూసిన కాంస్య విగ్రహాలు. కొందరు అక్కడ విగ్రహం పెడతామని మొక్కుకుంటారట.
ఈ మందిరం పైనగల 177 అడుగులు లేదా 54 మీటర్ల ఎత్తు ఉన్న భారీ బుద్ధ విగ్రహం చాలా దూరం నుండి కనిపిస్తూ హృదయాన్ని పట్టి దగ్గరకు ఆకర్షిస్తుంది.ఈ మందిరం భూటాన్ రాజు జిగ్మే సింగే వాంగ్ చుక్ తన 60వ జన్మదినం సందర్భంగా నిర్మించాలని 2006లో మొదలుపెట్టి 2017నాటికి పూర్తిచేసారట. ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ మహా బౌద్ధాలయం సొబగు ప్రత్యక్షంగా చూడవలసిందే తప్ప వర్ణించడం అసాధ్యం.మందిరం చుట్టూ ఆవరణలో కూడా బంగారురంగు నిలువెత్తు విగ్రహాలు కళ్ళు మిరుమిట్లు గొలిపేలా వున్నాయి.ఒకటి రెండు విగ్రహాల దగ్గర నేనూ ఉమా ఫొటొలు దిగాం.మందిరం చుట్టూ తిరిగి అన్ని విగ్రహాలూ ఫొటో తీసుకోవాలనుకున్నాను.కానీ మా గైడ్ తొందరపెట్టటంతో కొన్నింటిని మాత్రమే గబగబా నడుస్తూ వాటిని వీడియోగా తీసాను.
థింపూ నుంచి బయలుదేరి 17వ శతాబ్దంలో కట్టిన పునాఖ కోటకు వెళ్తూ మధ్యలో ఎత్తైన ప్రదేశం దోచులా పాస్ కి వెళ్ళాము.కొండ దారి ఘాట్ రోడ్డుపై ప్రయాణంలో పరిగెత్తే రోడ్డునూ,భయపెట్టే లోయల్ని కెమేరాలో బంధించాను. అక్కడ చాలా స్తూపాలు కట్టారు. పైన ఎత్తుగా మధ్యలో ఉన్న పెద్ద స్థూపం చుట్టూ మూడు అంతస్తులలో 108 స్తూపాల్ని మూడు లేయర్లలో కట్టారు. దాని గురించి మా గైడ్ చెప్పిన కథనం ఏమిటంటే ఆ ప్రాంతం మీదకి పరాయి ప్రాంతం వారు ఎవరో దండయాత్రకు వచ్చేరనీ,పెద్ద ఎత్తున దాడులు జరిగేయనీ చెప్పాడు. వాళ్ళని ఎదుర్కోవటానికి బుద్ధిష్టు సన్యాసులు పోరాటం చేయగా 108 మంది బౌద్ధ భిక్షువులు చనిపోయారట. వాళ్ళ స్మృతి చిహ్నంగా భూటాన్ రాణి ఈ 108 స్తూపాలు కట్టించిందని గైడ్ వివరించాడు.
అక్కడ నుండి దూరంగా కనిపిస్తోన్నకొండలు హిమాలయాలని చెప్పాడు.ఎత్తైన పర్వతాలనో,విశాల సముద్రాన్ని ఓ చూసినప్పుడే మానవుడు ఎంత అల్పజీవో అర్థమౌతుంది .మబ్బుల మేలి ముసుగు వేసుకున్న అమ్మాయిల్లా ఆ కొండల వరుసలు భలేగా అనిపించాయి.చేతులు చాపి తిరగాలనిపించేంత అందంగా వుంది ఆ ప్రదేశమంతా.అది చాలా ఎత్తైన ప్రదేశం కావటం చేత మేము వేసుకున్న స్వెట్టర్, షాల్ చలిని ఆపలేదు.మాబేగ్స్ వేన్ లో వదిలేసాము.దాంతో నేనూ ఉమా చలికి వణికి పోతూ కొంతదూరంలో కనిపించే ఇల్లు లాంటి ప్రదేశానికి కొందరు వెళ్తుంటే మేమూ వెళ్ళాం.అది ఒక చిన్న కేఫిటేరియా.టీ తాగుతుంటే చలిపోతుంది కాని పర్సులు ఆక్షణంలో మా దగ్గర లేవు.అంతలో అక్కడ మా గ్రూపుకు కోఆర్డినేటర్ గా పని చేస్తున్న సప్న కనిపించి మేము చలికి వణుకుతుండటం చూసి మాకు టీ ఇప్పించింది.ఆ క్షణంలో ఆ అమ్మాయి దేవతలా కనిపించింది.తర్వాత మేము డబ్బు ఇవ్వబోతే "అమ్మ దగ్గర డబ్బు తీసుకోకూడదు" అని అంది.తర్వాత రూమ్ కి వెళ్ళాక మేము తెచ్చుకున్న కరాచీ బిస్కెట్లు పేకెట్ ఆమెకి ఇవ్లబోతే సప్న మొగమాటపడుతుంటే ' అమ్మ ఇచ్చినప్పుడు వద్దనకూడదు' అన్నాము.ఆ అమ్మాయి నవ్వి తీసుకుంది .
పునాఖా కోట మధ్యలో ఉన్న బౌద్ధ మందిరాన్ని చూడడానికి లోపలికి వెళ్ళేసరికి అర్థనిమీలితనేత్రుడైన అతి పెద్ద బుద్ధ విగ్రహం అద్భుతంగా నన్ను ఆకట్టుకుంది.మనం ఎటు నుండి చూసినా మనపైనే శాంతి నిండిన దృక్కులను ప్రసరిస్తున్నట్లుగా వున్నాయి. ఆయనకు రెండువైపులా బౌద్ధ ప్రముఖుల విగ్రహాలు, ఆ విగ్రహాలకు ముందు బుద్ధుని ప్రముఖ శిష్యుల విగ్రహాలు ఉన్నాయి.మా గ్రూపులో అందరూ అక్కడ కూర్చొని కాసేపు ధ్యానం చేసారు.కానీ నేను మాత్రం లోపల ఫొటోలు తీయటం నిషేధం కనుక ఆ సౌందర్యమూర్తిని నా కళ్ళ నిండా నింపుకున్నాను .ఇక గోడలచుట్టూ అద్భుతమైన చిత్రాలు వున్నాయి.అయితే లైటింగ్ ఎక్కువగా లేదు.లైట్ వలన ఆ చిత్రాల రంగులు వెలిసి పోతాయని లైట్లు అమర్చలేదన్నారు గైడ్. మా సెల్ఫోన్ లైట్ లో చూసే ఆ నైపుణ్యానికి మైమరచిపోయాను.ఇక్కడ ప్రతీ మందిరంలోనూ బౌద్ధ రూపాలు రెండు మూడు తలలతో భయంకరంగా కనిపిస్తాయి.అవి మనిషిలో నిక్షిప్తంగా వున్న చెడు ఆలోచనలకు ప్రతిరూపమని గైడ్ అన్నాడు. కోట మధ్యలో ఒక విశాలమైన బోధి వృక్షం ఉంది. ఈ Punakha Gzong అనే కోటను 17వ శతాబ్దంలో నిర్మించారుట.
గైడ్ కోటచరిత్ర గురించి చాలా విషయాలు తెలియజేసాడు పునాఖ -వాంగ్ డ్యూ రెండు నదులు కలిసే చోట భూటాన్ లో రెండో అతిపెద్ద కోటగా నిర్మించారట. దీన్నే మేజెస్టిక్ ఫోర్ట్రెస్ అని అంటారనీ, ఇందులో బుద్ధ అవశేషం భద్రపరచారనీ, దానికోసం టిబెటన్లకి.. భూటానీయులకీ మధ్య చాలా యుద్ధాలు జరిగాయని చెప్పాడు. మొదట్లో ఇదే రాజధానిగా వుండేదనీ,ఈ యుద్ధాల వలన సెక్యూరిటీ దృష్ట్యా రాజధానిని థింఫూకి మార్చారట.
ఇప్పుడు ఈ కోటలో ఎక్కడెక్కడ నుంచో బౌద్ధ గురువులు, భిక్షువులు ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంతకాలం ఏకాంత జీవనం సాగిస్తారు. కోట చుట్టూ పై అంతస్తులలో వారికి ప్రత్యేకమైన గదులు ఉన్నాయి.కొందరు పై అంతస్తుకు వెళ్ళబోతుంటే వాళ్ళని గైడ్ మందలించాడు. దగ్గరలో ఏదో ఫెస్టివల్ వుందంట అందుకోసం కొందరు బౌద్ధ భిక్షువులు ప్రాక్టీస్ చేస్తున్న సమూహ నృత్యం కాసేపు అక్కడే కూర్చుని చూసాము.ఆ నృత్యాన్ని వీడియో తీసాను.
ఆ తర్వాత భూటాన్ రాజధాని థెంపు పర్యాటన ముగించుకొని ఆ రాత్రికి మరో నగరం ‘పారో’ చేరాము. పారోలో మరో హోటల్లో వసతి ఏర్పాటైంది.ఆ చలి వాతావరణంలో రెండు రాత్రులు ఉన్నాం.ఒక రాత్రి కేంప్ ఫైర్ ఏర్పాటు చేసి అందరూ వాటి చుట్టూ కేరింతలు కొడుతూ తెలుగు,హింది పాటలకు నృత్యాలు చేసారు.మేమూ వాళ్ళతో కాసేపు అడుగులు కలిపాము.
భూటాన్ జాతీయ జంతువు టాకిన్ ను చూపిస్తామని తీసుకువెళ్ళారు.హిమాలయన్ జంతువు టాకిన్ ముఖం మేకలా వుంటుంది మిగతా శరీరం బర్రెలా వుంటుంది.వాటి సంఖ్య తగ్గిపోతుండటంవలన సంరక్షణ చేస్తున్నారని గైడ్ అన్నాడు.సంరక్షణ స్థలంలో టాకిన్లు పది పదిహేను కన్నా ఎక్కువ లేవు.వీటిని చూడటానికి ఎంట్రెన్స్ ఫీజు మూడు వందలు .దాంతో చాలా మంది విసుక్కున్నారు.ఇక్కడ ప్రతీ టూరిస్ట్ స్థలం దగ్గరా ఎంట్రీ టికెట్ అయిదువందలకు తక్కువ లేదు.భూటాన్ కు ప్రధాన ఆదాయ వనరు టూరిజమే.అదీకాక కొండ,ఘాట్ రోడ్లే కనుక కొన్ని నెలలు మాత్రమే టూరిస్టుల తాకిడి వుంటుంది.
ఇక్కడ చిన్నవిమానాశ్రయం కూడా ఉంది. కానీ ఇది కొండల మధ్య ఉంది కాబట్టి అన్ని ప్రాంతాల నుండీ వచ్చే అవకాశం లేదు కేవలం ఢిల్లీకి మాత్రమే రాకపోకలకు విమానాలు ఉన్నాయిట.
మరో ముఖ్యమైన ప్రదేశం భూటాన్ లో ప్రసిద్ధి చెందిన టైగర్స్ నెస్ట్ మొనాస్టరీ. సుమారు ఐదు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి అక్కడికి చేరుకోవాలి. భూటాన్ లో పారో కి 3 వేల మీటర్లు ఎత్తునఈ టైగర్స్ నెస్ట్ మొనాస్టరీ ప్రత్యేక ఆకర్షణ. ఈ బుద్ధిష్టు మొనాస్టరీని 17వ శతాబ్దంలో కట్టారని చెప్తున్నారు.
బౌద్ధ మొనాస్టరీని ఎంత ఇష్టమైనా ఆ పర్వత శ్రేణులను చేరుకోవడం చాలా కష్టమైన ఇష్టమైన పని. భూటాన్ లో అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఆ బౌద్ధ విహారాన్ని చేరుకోవడానికి ట్రెకింగ్ చేయాలి.
నాకు బీపి వుంది.అందుకని అంత ఎత్తు ట్రెక్కింగ్ చేయటానికి సాహసించలేదు.ఉమాకూడా వద్దంది. అందుకనీ ఆ పర్వతం మొదలు వరకూ వెళ్ళి మిగతావారు పైకి ఎక్కడం కనిపించే వరకూ వున్నాము.అక్కడ చెట్లు పొడవుగా ఆకాశాన్ని ముద్దుపెట్టటానికి సాగుతున్నాయా అనిపించేలా వున్నాయి.
అన్ని బౌద్ధ మొనాస్టరీలు కూడా ఎత్తుగా వుండే పెద్దపెద్ద మెట్లు ఎక్కి వెళ్ళాల్సినవే.అవి కూడా ట్రెక్కింగ్ చేసినంత పని అవుతోంది.గైడ్ గానీ,బౌద్దబిక్షువులుగానీ మాకు చేయందించటానికి చూసేవారు.నాకు యోగా, వాకింగ్ అలవాటు మీద బాగానే మెట్లు ఎక్కిదిగేదాన్ని.నా కన్నా చిన్నదే ఐనా ఉమ కొంచెం ఇబ్బంది పడేది.మరొక విశేషం ఇక్కడ హొటల్స్ లో కానీ,ఇళ్ళల్లోగానీ లిఫ్టులు ఉండవట.గైడ్ చెప్పాడు.అంతేకాదు ఉమా వయసు అడిగి " మా అమ్మకి కూడా డెభ్భై ఏళ్ళు.ఇంటిపని పొలం పనీ అన్ని ఆమే చేస్తుంది.మీ లాగే డెభ్భై ఏళ్ళే కదా మేడం" అన్నాడు మా గైడ్.
మేమిద్దరం ఆశ్చర్యపోయాం.అరవై ఏళ్ళు దాటి రిటైర్ కాగానే ఇంకేమీ చేయలేం అన్నట్లు కొందరు చతికిల పడిపోతారు.ఇతను ఎంత కేజువల్ గా అన్నాడు అనుకున్నాం.
తర్వాత ట్రెక్కింగ్ చేయని వారందరినీ ఒకే వేను ఎక్కించి ఒక మ్యూజియంకి తీసుకువెళ్ళారు.అక్కడ అన్ని మ్యూజియం లాగే భూటాన్ చరిత్ర,వస్తువులూ వున్నాయి.
తర్వాత రోజు మమ్మల్ని వాచ్యూ నది ఒడ్డుకు తీసుకు వెళ్ళారు.ఆసక్తి వున్న వాళ్ళంతా రివర్ రాఫ్టింగ్ చేయటానికి వెళ్ళారు.వాళ్ళంతా వచ్చేవరకూ మేము ఆ చుట్టుపట్ల మెల్లగా నడుస్తూ ఫొటోలు తీసుకుంటూ తిరిగాము. నీటి ప్రవాహం చాలా పారదర్శకంగా సూది పడినా కనిపించేలా వుంది. ఆ నీటి ప్రవాహం వలన నున్నగా అయిన తెల్లని గులకరాళ్ళను ఏరుకున్నాము.తర్వాత నది ఒడ్డునే ఏర్పాటు చేసిన చక్కని విందు చేసాక షాపింగ్ కు తీసుకు వెళ్ళారు.
మా ఇంట్లో నాలుగైదు రకాల బుద్ధ విగ్రహాలున్నా సరే జపానీస్ స్టైల్లో వుండే బుద్ధ విగ్రహం దొరుకుతే కొందామని చూసాను.చాలా పెద్దవే తప్ప చిన్నసైజులో దొరకలేదు.పాలరాతి ధ్యాన బుద్ధవిగ్రహం కొన్నాను.మనవరాలికోసం పూసలు దండలు, ష్టోల్,అమ్మాయికి చిన్న పర్స్ తప్ప ఏమీ తీసుకోలేదు.రూంకి వచ్చాక మా సామానులన్ని సర్దేసుకున్నాం.
ఆ మర్నాడు చీకటిలోనే లేచి తయారై పోయాము.మాకు బ్రేక్ఫాస్ట్ గా పుచ్చకాయ ముక్కలూ, బ్రెడ్ ఫేక్ చేసి ప్రతి ఒక్కరికీ ఇచ్చారు.మేమువున్న హొటల్ నుండి ఫర్లాంగు దూరంలో బోర్డర్ వరకు నడిచాము.భూటాన్కి ఆత్మీయంగా బైబై చెప్పి బోర్డరు దాటి ఒక్కసారిగా వుసూరుమన్నాము.గిల్టీగా ఫీలయ్యాను.ఎందుకో తెలుసా బోర్డరు అవతల అద్దంలా పరిశుభ్రమైన అందమైన భూటాన్.
బోర్డరు దాటగానే వరుసగా టిఫిన్ బండ్లూ, వాటి చుట్టూ తింటున్న మనుషులూ,తిని పడేసే పేపరుప్లేట్లలో మిగిలినవాటికోసం కుక్కలూ,పశువులూ అంతా అపరిశుభ్రమైన వాతావరణం.
బిస్కెట్లుతిని ఖాళీకవరు భద్రంగా హేండు బేగులో దాచుకున్న తోటి ప్రయాణికులు బోర్డర్ దాటగానే రోడ్డుపై విసిరేసారు.
మన దేశం పరిశుభ్రంగా ఎప్పడౌతుందో కదా?
అంతకన్నా ముందుగా మనమెప్పుడు శుభ్రత పాటిస్తామో కదా?ఆలోచనలతోనే బస్సులో బాగ్డోగ్రా చేరి హైదరాబాద్ కి వెళ్ళే ఫ్లైట్ ఎక్కాము.
2, ఏప్రిల్ 2025, బుధవారం
నడక దారిలో -51
నడక దారిలో -51
సంక్రాంతి వెళ్ళాక మూడు వారాల సెలవు పూర్తిచేసి స్కూల్ లో జాయిన్ అయిపోయాను.కేటరాక్ట్ అయినా కంటికి స్కూల్ లోనే డ్రాప్స్ వేసుకుంటూ కోర్సు పూర్తిచేసి కొత్త కళ్ళద్దాలు మార్చుకున్నాను.
కానీ అప్పటికే ఎండలు తీవ్రం కావటం , స్కూల్ లో పరీక్షల సమయం దగ్గర కావటం కొంత వత్తిడికి గురౌతూనే వున్నాను. నేను చేర్చిన కల్పన నా క్లాసుల్ని కొన్ని చూసుకోవటం కొంత నయంగానే వుంది.
ఒకరోజు డా.భార్గవీరావు, ఇంద్రగంటి జానకీ బాల,అత్తలూరి విజయలక్ష్మి అప్పుడప్పుడు డి.సుజాతాదేవి ఇంటిదగ్గరగానీ,మా యింట్లో గానీ,ఇలా ఎవరో ఒకరి ఇంట్లో కలుస్తూ వుండేవాళ్ళం.సుజాత అప్పట్లో ఆంధ్ర మహిళా సభ సాక్షరతాభవన్ లో పనిచేస్తూ వుండేది..
సాహిత్యం గురించి మాట్లాడుకోవటమో ,పాటలు పాడుకోవడమో చేస్తుండే వాళ్ళం.
ఒకసారి అందరం కలిసి పాపికొండలకు వెళ్దామా అని అనుకున్నాం.అయితే నాకు కేటరాక్ట్ జరిగి రెండు నెలలే అయ్యింది.ఎండల్లో తిరిగితే కష్టమేమో అని భయపడినా వెళ్ళటానికే నిశ్చయించుకున్నాను.
గౌతమీ ఎక్స్ ప్రెస్ లో రిజర్వేషన్ చేయించుకుని బయలుదేరాము.మేము అయిదుగురమే కాకుండా మాతో నాటకనటుడే కాక లలితకళాతోరణంలో రేడియో,సినీ,నాటక నటనలో శిక్షణతరగతులు నిర్వహించే దీక్షితులుగారి భార్య చిత్రలేఖ కూడా మాతో బయలు దేరారు.చిత్రలేఖ భార్గవీరావుకీ,విజయలక్ష్మికీ మంచి మిత్రులు.అయినా మా అందరితో కలివిడిగా కలిసిపోయారు.మర్నాడు ఉదయమే రాజమండ్రిలో దిగాము. సుజాతాదేవి కూతురు కమల,అల్లుడు డా.మధు రాజమండ్రిలోనే వుంటారు.స్టేషన్ కు వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుని వాళ్ళింటికి తీసుకు వెళ్ళారు.
కమల తయారు చేసిన పలహారాలు తిని పాపికొండలుకు బయలుదేరాము.లాంచ్ ఎక్కిన తర్వాత కొంతసేపు గోదావరీ తరంగాలలో మైమరచిపోయాము.నేను తెచ్చిన కెమేరాలో గోదావరి అందాలనే కాక మిత్రులం కూడా చాలా ఫొటోలు తీసుకున్నాం.తర్వాత లాంచ్ లో వున్న వారందరినీ పాటలు పాడమని అడుగుతే చాలామంది పాడారు.నేను కూడా ఒకటి రెండు ఎంకి పాటలు పాడాను.
పేరంటాలు పల్లెలో లాంచ్ దిగాము కానీ కచ్చా దారిలో ఇసుక వలన నడవలేక విజయలక్ష్మి తప్ప మేము పైవరకూ వెళ్ళలేదు.
మధ్యలో మరో చోట ఎందువల్లో లాంచ్ ఆగింది.అక్కడేదో గుడి వుందని చెప్పి అందరూ వెళ్తుంటే మేమూ వెళ్ళాము.గుడిచూసి వస్తోంటే ఇసుకలో పాదాలు దిగబడి మెల్లగా నడుస్తున్నాము.అంతలో లాంచ్ బయలు దేరుతోందని కేకలు వినబడి పరుగు నడకతో అడుగులు వేయలేక పోతుంటే ఒక ఎడ్లబండి అబ్బాయి మా ఆరుగురినీ బండెక్కమని
లాంచ్ వరకూ తీసుకు వెళ్ళాడు.ఎడ్లబండి ఎక్కే సరికి కాళ్ళు నొప్పులు మర్చిపోయి మాకందరికీ హుషారు వచ్చి అంతా కలిసి " పరుగులు తీయాలి.గిత్తలు ఉరకలు వేయాలీ"అంటూ మల్లీశ్వరి లోని పాట అందుకున్నాము.
లాంఛ్ దిగి వస్తున్నప్పుడు ఒక కుటుంబంలో అమ్మాయి నన్ను ఆపి నేను పాడిన ఎంకి పాటల గురించి ప్రస్తావిస్తూ ఆమె నాయని సుబ్బారావుగారి దగ్గర బంధువని చెప్పింది.సుబ్బారావుగారి కుటుంబసభ్యులు ఎంకి పాటల కాపీరైట్ గురించిన తగవులు వలన ఆకాశవాణిలో ఆ పాటలు ప్రసారం కాకుండా ఆపివేయడం జరిగింది.దాంతో ఎంకి పాటలు మరుగున పడిపోయాయి.నాయని సుబ్బారావుగారు విస్మృతులు అయిపోయారనే విషయం మా మాటల్లో మరోసారి ప్రస్తావనకి వచ్చింది.
ఆ రాత్రి కమలా వాళ్ళింట్లో భోజనం చేసాక అక్కడికి నడక దూరంలోనే వున్న గోదావరి ఒడ్డున నిలిచివున్న ఒక పడవలో కూర్చుని ఆ వెన్నెల రాత్రి అందరం చాలా సేపు పాటలు పాడుకున్నాము.
కమలవాళ్ళు హాస్పిటల్ కోసం కొత్తగా తీసుకున్న ఇంటిలో వసతి ఏర్పాటు చేసారు.
మా వసతికి వెళ్ళిన తర్వాత కూడా ఆ పాటల మైకం తీరక పోవటంతో ఒక్కొక్కటే గుర్తుచేసుకుంటూ ఏ రెండుగంటలవరకో పాటలు మా ఆవరణ నిండా ఎగరేస్తూ చివరకు నిద్రలోకి జారుకున్నాం.
అలవాటు ప్రకారం ఉదయమే నాకు మెలకువ రావటంతో నా ఆనందాన్ని కవితగా మార్చాను.
మర్నాడు కారు రెంట్ కి తీసుకుని అందరం రాజమండ్రి,కడియం,బిక్కవోలు మొదలైన చుట్టుపట్ల ప్రదేశాలన్నీ చూసాం.ఆ రాత్రి తిరుగు ముఖం పట్టాం.
రెండురోజులూ ఇంటినీ,బాధ్యతల్నీ ఆలోచనల్లోకి రానీయ కుండా ఆనందంగా గడిపేసాము.ఈ ప్రయాణంతో మా అయిదుగురు మధ్య స్నేహబంధం మరింత గట్టిపడింది.
ఈ ఏడాది ఏడవ తరగతి ,పదోతరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ బాధ్యత దగ్గర పడింది.రెగ్యులర్ గా సలీమ్ ఆటోని పెట్టుకోవటం వలన నాకు కొంత సమయం కలిసి వస్తోంది.ఎంత ఆలస్యం అయినా స్కూల్ పనులు అయ్యేవరకూ సలీం కని పెట్టుకొనే వుంటున్నాడు.
పరీక్ష ప్రశ్నపత్రాలను పోలీస్ స్టేషన్ లో భద్రపరిచే రోజు చాలా ఆలస్యం అయ్యింది.అలాగే ప్రతీరోజూ స్టేషన్ నుండి పేపర్లు తీసుకుని రావటం ,తిరిగి పరీక్ష పూర్తి అయ్యాక జవాబు పత్రాలు సీల్ చేసి పోస్టాఫీసుకి పంపించటం ఇవన్నింటికీ సలీం ఆటోనే వాడుకున్నాను.లేకపోతే ట్రాన్స్ పోర్ట్ ఖర్చు అని క్లర్కులూ,అటెండరూ ఇచ్చే బిల్లులు తప్పించుకున్నాను.
ఇంకా మేనేజ్మెంట్ గ్రాంట్లను మింగేయటానికి చూసిన రాబందుల ఆట కట్టించి హైస్కూల్ వాటా వసూలు చేసి ఫీజులు కట్టలేని పిల్లల ఫీజులకూ, స్కూల్ కి అవసరమైన వాటిని కొనటానికి వుపయోగించాను.ముఖ్యంగా ప్రాధమిక పాఠశాలని ఎప్పుడైతే హైస్కూల్ నుండి విడదీసి దానికో హెచ్చెమ్ నీ,వాళ్ళ బిల్లులు వేరని విడదీసి పెట్టారో అప్పుడే దానికి వేరు పురుగు సోకి క్రమంగా చీడ పట్టింది.ఇప్పుడు బాగుచేసే పరిస్థితి కనుచూపు మేరలో పరిష్కారం లేకపోయింది.ముఖ్యంగా గత అయిదారు ఏళ్ళలో స్కూల్ ఆర్థికంగా,విద్యావిషయకంగా మొత్తం నాశనమై పోయింది.
నేను హెచ్చెమ్ గా పనిచేసినది పదిహేను నెలలే అయినా ఇంచుమించు రెండు విద్యాసంవత్సరాలు చూసినట్లు అయింది.అకడమిక్ లోనూ, పాఠశాల నిర్వహణలోనూ గమనించినవి చూస్తుంటే ఈ విధంగా ఎన్ని పాఠశాలలు వున్నాయో
అనిపించింది.రిటైర్ అయిన తర్వాత తప్పకుండా ఇస్కూలు కతలు రాయాలి అని అప్పుడే నిర్ణయించుకున్నాను.
మొత్తం మీద నా సర్వీస్ పూర్తి చేసుకున్నాను.నా రిటైర్మెంట్ సందర్భంగా స్కూల్లో అయిదో తరగతి నుండి పదోతరగతి వరకూ విద్యార్థులు అందరికీ కంపాస్ బాక్సులూ, ఒకటి నుంచి నాలుగో తరగతి వరకూ పెన్సిల్ బాక్స్ లో పెన్సిల్,రబ్బర్,షార్పనర్ పెట్టి ఇచ్చాను.మొత్తం స్టూడెంట్సుకి బిస్కెట్ పేకెట్లు పంచాను.
పిల్లలంతా ముఖ్యంగా హైస్కూల్ పిల్లలు పెళ్లి వేదికలా స్టేజి డెకరేషన్ చేసారు.మా కుటుంబమే కాకుండా మా మరుదులూ,ఆడపడుచు కుటుంబాలు కూడా పదవీవిరమణ సమావేశానికి వచ్చారు.నా చిన్నప్పటి స్నేహితురాళ్ళు కృష్ఢకుమారీ,ఉషా కుమారీ కూడా వచ్చారు.పిల్లలు నృత్యాలు చేసారు.తర్వాత నేను ఏర్పాటు చేసిన విందు భోంచేసాము.చాలా గ్రాండుగా అంతా జరిగింది.మా సహాధ్యాయులందరికీ బహుమతులు ఇచ్చాను.
నా తర్వాత ఇన్చార్జి హెచ్చెమ్ అయిన ఉమారాణీకి అన్ని ఫైల్స్ అప్పగించి ఇన్నేళ్ళుగా నాకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్నీ ఏర్పడేలా ఆర్థిక స్వావలంబన కలిగించిన పాఠశాలను కళ్ళారా చూసుకొని భారమైన హృదయంతో ఇంటికి వెళ్ళాను.
ఇంకా ఆ తర్వాత పెన్షన్ పేపర్లు సబ్మిట్ చేయటం పనులు మొదలయ్యాయి.అయితే పెన్షన్ సాంక్షన్ అయ్యేటప్పటికి ఎన్నినెలలు పడుతుందో తెలియదు.
నేను ఇంట్లోనే వుంటున్నాను కనుక ఆషీని చూసుకోవటం బాధ్యత నేను తీసుకున్నాను.దాంతో వీర్రాజుగారికి కొంత వెసులుబాటు దొరికింది.అప్పటికే వచనకవిత్వంలో నవల రాయటం మొదలుపెట్టారు.1956 లో ప్రచురితమైన వెలుగుబాటలు అనే నవల వచ్చి అరవై ఏళ్ళు అయిన సందర్భంలో ఆ నవలనే బతుకు బాట పేరుతో వచనకవిత్వంలోనికి రాయటం పూర్తి చేసి ప్రచురించారు. నెలనెలా వెన్నెల పేరిట ప్రతీనెలా సాహిత్యకార్యక్రమాన్ని సి.వీ కృష్ణారావు గారి ఇంట్లో జరుగుతాయి.వారి ఇల్లు మా ఇంటికి దగ్గరే అందుకని వాళ్ళింట్లోనే పుస్తక పరిచయం ఏర్పాటు చేసారు.బతుకుబాట పుస్తకం గురించి వీర్రాజు గారు ప్రస్తావించారు.తర్వాత శంకరంగారితో సహా ఓముగ్గురు పుస్తకం గురించి మాట్లాడారు.
చాలా రోజులుగా పెద్దక్కయ్యకు ఒంట్లో బాగుండటం లేదని తెలిసినా స్కూల్ పని ఒత్తిడి వలన వెళ్ళలేక పోయాను.పదిహేనేళ్ళ క్రితం మొదలైన కేన్సర్ క్రమంగా కీమోథెరపీవలన పూర్తిగా తగ్గిపోయింది.కానీ ఇటీవల మళ్ళా తలెత్తినట్లుంది. అది తెలిసి
ఓసారి విజయనగరం వెళ్ళాలనిపించింది.
ఆమెకు ఈ ఏడాది డెభ్భై ఏళ్ళు నిండుతాయి.అమ్మ తర్వాత ఆమె నాకు పెద్దదిక్కుగా భావించాను.అంతేకాక నేను సాహిత్యరంగంలోకి రావటానికి తొలి అడుగు వేయించింది అక్కయ్యే.
అందుకే అక్కయ్యకి కట్టుకోవటానికి తేలికగా వుంటుంది అని లేత గులాబీ రంగులో లక్నో చీర కొని తీసుకు వెళ్ళి ఇచ్చాను.అక్కయ్య ఎంతో సంబరపడి ఆ రోజు వాళ్ళింటికి వచ్చిన బంధువుకి " మా చెల్లెలు నా పుట్టినరోజుకు కొని తెచ్చింది" అని చూపించింది.అది నాకెంతో సంతోషం కలిగించింది.
తిరిగి హైదరాబాద్ వచ్చేసరికి నా పెన్షన్ సేంక్షన్ అయినట్లు వుత్తరం వచ్చింది.పే & అక్కౌంట్స్
ఆఫీసుకు ఉదయం ఎనిమిది గంటలకు వెళ్ళి ఆర్డర్ తీసుకోవాలని ఉత్తరంలో వుంది.ఆ మర్నాడు వీర్రాజుగారిని సాయం తీసుకుని వెళ్ళాను.ప్రభుత్వ ఆఫీసులో సంగతి తెలిసిందే కదా.పదిగంటలకు ఆఫీస్ అయితే ఎనిమిదికే ఎందుకు వెళ్ళాలన్నారో అర్థం కాలేదు.మెల్లిగా పదిన్నర దాటాక ఒక్కొక్కరే రావటం మొదలైంది.నాకు వచ్చిన ఉత్తరం చూపించి అడుగుతే సంబంధిత ఉద్యోగి సెలవు పెట్టారన్నారు.
మర్నాడు మళ్ళా వెళితే అతను సెలవులో వున్నాడు . ఇన్చార్జిని వేసారు.అతను రావాలన్నారు. వీర్రాజుగారిని రావద్దని చెప్పి తర్వాత రోజు నేనే వెళ్ళాను.
ఎనిమిదింటికి టేబుళ్ళు తుడుస్తున్న అటెండర్ తో " ఎన్ని రోజులు ఇట్లా తిప్పుతారు.స్పష్టంగా చెప్పొచ్చు కదా " అన్నాను.
నిజానికి అప్పటికి నాకు కూడా అర్థం అయ్యింది.
ఆ రోజు సంబంధిత ఉద్యోగి వచ్చాడు.కానీ " మీరు ఈ ఏడాదికి ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేస్తేనే అప్రూవల్ వస్తుంది." అని ఒక క్వెరీ వెయ్యబోయాడు.
" నాకు జీతం వచ్చినప్పుడే ఇన్కమ్ టాక్స్ పరిథిలో లేను .పదినెలలై పెన్షన్ లేదు.ఎంత వస్తుందో తెలియదు.ఎలా సబ్మిట్ చేస్తానండీ" అని ప్రశ్నించాను. ఎవరి ద్వారానో డబ్బులు ఇవ్వమని నిస్సిగ్గుగా అడిగించాడు.తప్పదుకదా ఓ వెయ్యి చేతిలో పెడితే కవర్ నా చేతిలోకి వచ్చింది.ఇదీ మన వ్యవస్థ. అది పట్టుకుని బయటకు వచ్చి ఆటో కోసం చూస్తూ ఎదురుగా చూస్తే అవినీతి నిరోధక శాఖ ఆఫీసు బోర్డు కనిపించింది.కానీ నేను అందులోనికి వెళ్ళలేదు.నా పెదాలమీద విషాదపునవ్వు తొంగిచూసింది.
ఆషీ ప్రీస్కూల్ చదువు అయిపోయింది.ఒకటోక్లాస్ లో ఎక్కడా చేర్చటమా అని ఆలోచించి రోజరీ కాన్వెంట్ యాజమాన్యం లో మూడు స్కూల్స్ ఉన్నాయి.అన్నీ మంచివే అని అక్కడ చేర్చాలనుకుంటే సీటు దొరికింది కానీ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేదన్నారు.అలాగే అరవింద్ స్కూల్ లోనూ అదే సమస్య .ఆషీకి బ్రాంకైటిస్ వుంది.అంతదూరం ఒక్కదాన్ని ఆటోల్లో పంపటం సమస్య.లేదా నేనో వీర్రాజు గారో రోజూ వెళ్ళాలి.అదీ కష్టమే.ఆలోచనలో పడ్డాను.
అంతలో వికాస్ భారతి అనే స్కూల్ గురించి తెలిసింది.అందులో ఒత్తిడి లేకుండా.ప్రత్యేకపద్ధతిలో విద్యావిధానం వుంటుందని తెలిసింది.అది ఇంటికి దగ్గరలో వుంది.పొనుగోటి కృష్ణారెడ్డిగారు కూడా వాళ్ళ పిల్లల్ని అక్కడే చేర్చాలనుకున్నారు.సరే అని ఆషీని కూడా చేర్చాము.మొదట్లో వాళ్ళ వేనులోనే పంపాము.కానీ ఆషీకి అలా నచ్చక పేచీ పెట్టింది.అప్పటి నుండి సలీమ్ ఆటోనే మాట్లాడాము.ముందు ఆషీని స్కూల్లో దింపి తర్వాత పల్లవి అదే ఆటోలో ఆఫీస్ కి వెళ్ళిపోయేది.సాయంత్రం నేను ఆటోలో వెళ్ళి ఆషీని తీసుకు వచ్చేదాన్ని.
కానీ తర్వాతి ఏడాది ఆ స్కూల్ ఇక్కడ నుండి తీసేసి హయత్ నగర్ అవతల ఎక్కడికో మార్చారు.దాంతో మళ్ళా ముందు కేంద్రీయ విద్యాలయలో అనుకొనికూడా వెతికి దగ్గరలోని కేంబ్రిడ్జ్ స్కూల్ లో చేర్చాము.కృష్ణారెడ్డిగారు కూడా అదే స్కూల్లో తన పిల్లల్ని చేర్చారు.
ఓం రోజు అక్కయ్య అకస్మాత్తుగా కింద పడిందని వెంటనే ప్రాణం పోయిందనీ వార్త వచ్చింది.వెంటనే టికెట్ల కోసం ప్రయత్నించినా వెంటనే దొరకలేదు.ఆఖరుకు నేను ఒక్క దాన్నే వెళ్ళాను.దినాలరోజుకు పల్లవీ, వీర్రాజుగారూ వచ్చారు.అన్నయ్యలిద్దరూ అక్కయ్య కర్మకాండలకు పుట్టింటి తరపున చేయాలట.వాళ్ళేమీ పట్టించుకోలేదనేది అక్కయ్య కూతుళ్ళిద్దరినీ వాళ్ళ బంధువర్గం ఎత్తిపొడుపులు
చేసేసరికి అందరూ ముఖాలు మార్చుకున్నారు.దానికి తోడూ పునిస్త్రీగా పోయినందుకు ఏవేవో తంతులు మొదలెట్టారు.అవ్వన్నీ నాకు కొంచెం చికాకు కలిగించాయి.నిజానికి అక్కయ్యకి అవన్నీ నచ్చేవి కాదు.అంతకుముందెప్పుడు అక్కయ్య ఇంట్లో పూజలవీ చేసేవారు కాదు.చిన్నకూతురు తిరుపతిలో పిహెచ్డీ చదివి వచ్చాక ఒక గూట్లో వెంకటేశ్వరుడి విగ్రహం పెట్టి దీపం వెలిగించడం మొదలుపెట్టిందని అక్కయ్య ఒకసారి వెళ్ళినప్పుడు చూపించి నాతో చెప్పింది.
ఎలా అయితేనేం కర్మకాండలన్నీ బతికున్న వారి ఇష్టప్రకారం సంప్రదాయ సిద్ధంగా జరిగాయి.
నాకు ఇష్టం వున్నా లేకున్నా చేయి కలపక తప్పలేదు.
పుట్టిన దగ్గర్నుంచి ఆడవాళ్ళకి జరిపే తంతులన్నీ ఇబ్బంది పెట్టేవే.భర్త పోయినా ఆమెకే ఆమె పోయినా ఆమె దేహానికే.అవి నా మనసులో పెట్టిన కలత తర్వాత నేను రాసిన నీడల చెట్టు నవలలో కూడా అక్షరబద్ధం చేసాను.
- శీలా సుభద్రాదేవి
నడక దారిలో -50
నడక దారిలో -50
ఆషీ ఆటలో భాగంగా కూర్చున్నప్పుడు వెనుక చేరి మెడ చూట్టూ చేతులు వేసి గూగూలు ఆడటం వలనేమో సడన్ గా నాకు స్పాండిలైటిస్ వచ్చింది.ఇంక స్కూల్ లోకూడా పేపర్లూ, పుస్తకాలు దిద్దటం వీటన్నిటితో అంతకంతకూ బాగా ఎక్కువైపోయింది.అల్లోపతీ మందులే కాక ఫిజియోథెరపీ చేయించుకున్నా తగ్గలేదు."మెడకి కాలర్ తప్పని సరిగా పెట్టుకోవాలి అది మీ శరీరంలో ఒక పార్ట్ అనుకోవాల్సిందే "అన్నాడు న్యూరోఫిజీషిన్ .
ఆయుర్వేద నూనెలు రాసుకున్నా ఫలితం లేదు.రాత్రిపూట నిద్ర కూడా పట్టేది కాదు.
హోమియో మందులు బాగా పనిచేస్తాయి అంటే అవి మొదలెట్టాను.స్పాట్ వేల్యుయేషన్ లో ఒక మాష్టారు స్పాండిలైటిస్ కి ఎక్సర్సైజెస్ బాగా పనిచేస్తాయని ఎలా చేయాలో కొన్ని చెప్పారు.ఏది పని చేసిందో కాని మొత్తం మీద నాకు చాలా వరకూ ఉపశమనం కలిగింది.
విజయలక్ష్మి తర్వాత నేను హెచ్చమ్ ను అయ్యాను .నాకూ సర్వీసు తక్కువే ఒకటిన్నర సంవత్సరాలు కూడా లేదు.కానీ నేనున్నన్ని రోజులైనా స్కూల్ కి కొంతైనా చేయాలని నా ఆలోచన.కానీ పురుగు పట్టిన చెట్టుని సంరక్షించడం అంత సులభం కాదని నాకీ అనుభవంలో తెలిసి వచ్చింది.
నా దురదృష్టం కొద్దీ నాకు హెచ్చెమ్ అప్రూవల్ కి డ్రాఫ్టింగ్ అయ్యి కరెస్పాండెంట్, చైర్మన్ ల సంతకాలై డిపార్ట్మెంట్ పంపించాము.కానీ అంతకు ఒక్కరోజు ముందే ఎయిడెడ్ పాఠశాలల్లో రిక్రూట్మెంట్,ప్రమోషన్స్ చేయటానికి వీల్లేదని ప్రభుత్వం స్టే ఇచ్చింది.ఇంకేం చేస్తాను.చేసేది టీచర్ గా,హెచ్చెమ్ గా చాకిరీ మాత్రమే మిగిలింది.ఇన్ఛార్జ్ హెచ్చెమ్ గానే సర్వీసు కొనసాగటమే అయ్యింది.
నేను ఛార్జ్ తీసుకున్న వెంటనే మా స్కూల్ సెక్రటరీ విజయలక్ష్మిగారిని కలిసి స్కూల్ పరిస్థితులు వివరించాను.వీలుంటే స్కూలుకి తరచూ వస్తుంటే బాగుంటుంది అని కూడా చెప్పాను.ఈ ఏడాదికి మాస్కూల్ ప్రారంభమై యాభై ఏళ్ళు అయ్యింది కనుక ఏమైనా కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని అన్నాను.అన్నింటికి అంగీకారం తెలియజేసారు.
ఆ ఏడాది ఆగష్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవం కార్యక్రమానికి మా కరెస్పాండెంట్ రామారావుగారినీ, విజయలక్ష్మిగారినీ ఆహ్వానించాను.నేను స్కూల్ లో చేరినది మొదలూ ఆరో తరగతి నుండి పదోతరగతి వరకూ మొదటి స్థానంలో వచ్చినవారికి అవార్డులుగా పుస్తకాలూ,నగదు ఇస్తున్నాను.ఈసారి ఆ కార్యక్రమం మా స్కూల్ అధిపతుల చేతులమీదుగా ఇప్పించాను.
ఈ కార్యక్రమం విజయలక్ష్మిగారిని కదిలించింది.స్కూల్లో ఎంతమంది విద్యార్థులు వున్నారో వాళ్ళకి ఏడాదికి ఎన్ని నోటు పుస్తకాలు కావాల్సి వుంటాయో వివరంగా డాటా తయారుచేసి తనకు పంపమన్నారు. పిల్లలకు కావలసిన నోటుపుస్తకాలు పంపుతానన్నారు.
టీచర్లను సమావేశపరిచి ఏ తరగతిలో ఎంతమంది పిల్లలున్నారో వాళ్ళకు కావలసిన నోటు పుస్తకాలు ఏవి ఎన్ని కావాలో లిస్ట్ చేసి ఇవ్వమన్నాను.అయితే అన్ని పుస్తకాలు ఎక్కడ ఇస్తారులే అని అయిష్టంగానే జాబితాలు చేసి ఇచ్చారు.ఒక ప్రయత్నం చేయటంలో తప్పేముందని మొత్తం స్కూల్ విద్యార్థులకు కావలసిన నోటు పుస్తకాలు జాబితాను విజయలక్ష్మి గారికి పంపాను.
ఆశ్చర్యంగా ఒక వారంరోజుల్లో ఒక ట్రక్కు నిండా నోటుపుస్తకాలు స్కూలుకు చేరాయి.
ఎంత ఆశ్చర్యం వేసిందో ఆ పుస్తకాలన్నిటినీ సైన్స్ రూముకీ లోపలివైపు వుండే రూములో వేయించాము.ఒకే సారి అన్ని పుస్తకాలూ ఇవ్వకుండా సబ్జెక్టులకు ఒకటి చొప్పున పిల్లలకు ఇచ్చి అది నిండిన వెంటనే ఇంకోటి ఇచ్చేలా నిర్ణయించాను.టీచర్లందరికీ టీచింగ్ నోట్స్ రాసేందుకు పొడుగు పుస్తకం ఇచ్చాను.
టీచర్లకు కూడా నేను కోరగానే పుస్తకాలు రావటం ఆశ్చర్యం కలిగించింది.
ఇక పోతే కొందరు టీచర్లూ, ఆఫీసులో ఇద్దరు రికార్డు అసిస్టెంట్స్ స్కూలుకు చాలా ఆలస్యంగా అంటే తొమ్మిది గంటలకు స్కూల్ అయితే సుమారు గంటా,గంటన్నర ఆలస్యంగా వస్తున్నారు.టీచర్ల కొరత వలన వారికి కూడా చిన్న క్లాసులు ఇవ్వటం తప్పలేదు.అందుకని నెలకు మూడు లేట్లు అయితే ఒక సిఎల్ కట్ చేస్తానన్నాను.అయినా సరే అదే పద్ధతిలో లేటుగా రావటం చేస్తుంటే రెండు నెలలు చూసి కరెస్పాండెంట్ కి కంప్లైంట్ ఇచ్చాను.కానీ వాళ్ళు తీరు మారలేదు.వారి వెనుక మా పాత హెచ్చెమ్ మద్దత్తు వుందని తెలుసు.ఎలా అయినా నా మీద పగతీర్చుకోవాలనే స్కూల్ వదిలినా ఆమె కొంతమందికి చీరలూ,బహుమతులూ ఇచ్చి నాకు వ్యతిరేకంగా పనిచేయిస్తోంది.
అదెలా తెలిసిందంటే- స్కూల్ లో రికార్డు అసిస్టెంట్ ఆష వారానికి మూడురోజులు లేటే వస్తోందని సిఎల్స్ కట్ చేసాను.వెంటనే మరి ఎలా వచ్చారో ముగ్గురు అబ్బాయిలు వచ్చి ఈ టీవీ విలేఖర్లమంటూ ఒక ఐడీ కార్డు చూపించారు.అంత తొందరగా వచ్చారంటే అంతా ప్రీ ప్లాన్ అని అర్థమైంది.అంతలో ఉషా కూడా వచ్చింది.ఈ విషయం ఆమెకు ఎలా తెలిసింది?
అందుకే నేను ఎక్కువ ఆర్గ్యూ చెయ్యకుండా "నెలకు పన్నెండు లేట్లు అయితే సిఎల్ కట్ చేయటం తప్పెలా అవుతుంది." అని ఒకే మాట చెప్పి నా పని నేను చూసుకోసాగాను.
" ఆషాకి క్షమాపణ చెప్పు లేకపోతే పేపర్లో వస్తుంది "అని ఉషా,ఇంకో క్లర్క్ అంటున్నా నేను విననట్లు ఊరుకున్నాను.తర్వాత అంతా వెళ్ళిపోయారు.ఆ తర్వాత తెలిసింది.ఆ వచ్చిన కుర్రాళ్ళలో ఒకడు ఆషా అల్లుడని.
హెచ్చెమ్ గా అయిన తర్వాత స్కూల్లో ఆఫీస్ సిబ్బంది చేసే అనేక అవకతవకలు ఒక్కొక్కటే బయటపడుతున్నాయి.అయితే అంతకుముందు హెచ్చెమ్స్ గమనించి కూడా గొడవలెందుకని నిమ్మకు నీరెత్తినట్లు వూరుకున్నారా? గమనించ లేదా?వాళ్ళకు కూడా అందులో హస్తం వుందా? నాకు అర్థం కాలేదు.నా సర్వీసు ఏడాదిన్నర కూడా లేదు.ఈ పాటి దానికి ఇవన్నీ నెత్తినేసుకుని చెడ్డదాన్ని కావటం ఎందుకని అనిపించింది.విద్యకు సంబంధించిన విషయాలు మీదే దృష్టి పెడితే పిల్లలన్నా బాగుపడతారని అనుకున్నాను.
స్టేషనరీకనీ,జిరాక్సులకనీ, విద్యాశాఖలో అటెండర్లకి ,క్లర్కులకూ ఇవ్వాలనీ రోజూ డబ్బులకోసం బిల్లులు పెడుతూనే వుండే వాళ్ళు ఆఫీసు సిబ్బంది.స్కూల్లో పిల్లలు ఫీజులు కట్టలేదు,కట్టరూ కనుక డబ్బు ఏమీ స్కూల్ ఖాతాలో వుండేదికాదు.దాంతో నా జీతం నీళ్ళ ధారలా ఖర్చు అయిపోతూనే వుండేది.సముద్రంలో వున్నప్పుడు మింగేసే తిమింగలాలతో గడపకతప్పదుకదా.కబంధులకు పట్టుకోవటానికి చేతులూ,మింగటానికి నోరూ,నింపుకోవడానికి పొట్టా వున్నప్పుడు ఎంతా సరిపోదు కదా.
ఇది కాదని బాలాజీ ప్రెస్ బాల ప్రసాద్ ద్వారా తెల్లకాగితాలూ,రూళ్ళ కాగితాలు బండిల్స్ హోల్ సేల్ లో తెప్పించి పెట్టాను.అవే పిల్లలకు మూడునెలల పరీక్షలూ, అర్థసంవత్సర పరీక్షలకూ,సంవత్సరాలైంది పరీక్షలూ కూడా సరిపోయాయి.
ఈ ఏడాది కూడా పదోతరగతి పిల్లలను కొందరిని కోచింగ్ సెంటర్ లో చేర్చాను.రెగ్యులర్ గా క్లాసులకు రాకపోతే స్కూల్ కి వచ్చి తెలియజేయమన్నాను.అంతకుముందు వాళ్ళకు ఫీజులకు సహాయం జేసిన కొందరు టీచర్లు ఈసారి కూడా సహకరించటంతో నేను కొంత వూపిరి పీల్చుకోగలిగాను.
స్కూల్ సమస్యలు గురించి చర్చించటానికి మా జోన్ విద్యాశాఖ అధికారి సమావేశం ఏర్పరచినప్పుడు నేను ,ఉమా హాజరై ముఖ్యంగా పదోతరగతికి సబ్జెక్టు టీచర్ల కొరతగురించి మాట్లాడాము.
ప్రభుత్వం ప్రతీ స్కూల్ లోనూ విద్యార్థులు,టీచర్ల శాతాన్ని నమోదు చేసుకుని మాకు మరికొంతమంది టీచర్లను ఇవ్వటానికి బదులుగా ప్రాధమిక తరగతుల్లో టీచర్లు ఎక్కువగా వున్నారన్న మిషతో రేషనలైజేషన్ పేరుతో ప్రైమరీ టీచర్లైన అలివేలు,జయప్రభని మరో స్కూల్ కి ట్రాన్స్ ఫర్ ఆర్డర్లు పంపారు.దాంతో మళ్ళా వుత్పాతం సంభవించింది.అందులో ఒక టీచరైన అలివేలు ఉషకి ఇన్ఫార్మర్ అని నాకు ఒక అనుమానం వుంది.అందుకు ఆమెని ఎగసిన దోసిందేమో.
జయప్రభని వెనకని పెట్టుకొని అలివేలు వచ్చి నామీద ఆగ్రహంతో తగువుకు దిగింది.నేను ఆ విషయాన్ని పరిష్కరిస్తాను కొంచెం ఓపిక పట్టమని సముదాయించాను.ఉపాధ్యాయసంఘం లోని ఒకరిద్దరు నాయకులతో మాట్లాడాను.అఫ్జల్గంజ్ దగ్గర ప్రభుత్వ పాఠశాల ఆవరణలోనే దీనికి సంబంధించిన అడ్వకేట్ వున్నాడని ,అతన్ని సంప్రదించమని నెంబర్ ఇచ్చారు.మర్నాడు ఉదయమే బయల్దేరి ఆ అడ్వకేట్ ను కలిసాను.ఈ విధంగా రేషనలైజేషన్ బారిన పడిన ఇతర వుపాధ్యాయులనూ కలిపి కోర్టులో పిల్ వేస్తానని ఒక్కొక్కరూ వెయ్యి రూపాయలు ఇవ్వాలి అన్నాడు
మళ్ళా స్కూల్ కి వెళ్ళి వాళ్ళిద్దరికీ తెలియజేసాను.దానికి కూడా " మేమెందుకు ఇవ్వాలి ?
మీరే బాధ్యులు కనుక ఏంచేసి చేస్తారో ఆర్డరు కేన్సిల్ చేయించాల్సిందే " అని వితండవాదం మొదలెట్టారు.ముఖ్యంగా అలివేలు,ఆమె భర్త శ్రీనివాసులు( మా స్కూల్లోనే డ్రిల్లు మాష్టారు)
నేను సగం డబ్బు యిస్తానని చెప్తే అప్పటికి ఎలాగో వాళ్ళిద్దరూ శాంతించారు.బహుశా దీని వెనుక కూడా ఉషాటీచరు వుండే వుంటారు.అలివేలునీ,జయప్రభని తీసుకుని సాయంత్రం అడ్వకేట్ ను కలిసి అవసరమైన జిరాక్సులు ఇచ్చి డబ్బు చెల్లించి వచ్చాము.నేను రెగ్యులర్ ఆటోని పెట్టుకోవటం వలన యీ విధంగా స్కూల్ పనులమీద ప్రతీ దగ్గరకు తిరగటానికి సులభం అయ్యింది.
అయితే ఇప్పుడు ఇంఛార్జి హెచ్చెమ్ గా ఉండటం వలన స్కూల్ పిల్లలూ,టీచర్లూ వెళ్ళాక అన్నీ తాళాలు వేసుకుని ఇంటికి తిరిగి వెళ్ళాల్సి రావటంతో ఆషీని స్కూల్ నుంచి సాయంత్రం ఇంటికి తీసుకు వచ్చేభారం పూర్తిగా వీర్రాజుగారికే అయ్యింది.
ఇక రాష్ట్రంలో అనేక సంచలనాలు.తెలంగాణా వుద్యమం కేసీఆర్ నేతృత్వంలో అంతకంతకూ వూపందుకుంది.నక్సల్ సమస్యపై కేసిఆర్ నేతృత్వంలో MLAలు, MPలు సోనియా గాంధి, ప్రధాని మన్మోహన్లను కలిసి చేసిన చర్చలో ముఖ్యమంత్రి తెలంగాణా ఉద్యమంపై చులకనగా చేసిన వ్యాఖ్యలు వలనే కాక నక్సల్స్ సమస్యపై కూడా ఆశించిన స్పందన లభించలేదు. ఇది కేసీఆర్ కి అసంతృప్తి కలిగించింది .
హైదరాబాదులోని చంచల్గూడా జైల్లో నిషేధిత విరసం నేతలను కేసిఆర్ కలిసారు. మావోయిస్టులపైన, విరసంపైన నిషేధం ఎత్తివేయిస్తే, మావోయిస్టులను చర్చలకు తాను ఒప్పిస్తామని విరసం నేతలు అన్నారు.
తెలంగాణా వుద్యమాన్ని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ నుండి విడిపోయి పురపాలక ఎన్నికలలో తీవ్రంగా కృషి చేసినా కాంగ్రెసు విజయం సాధించింది. తెలుగుదేశం, తెరాస ఘోరంగా ఓడిపోయాయి.
తీవ్రవాదులతో ప్రత్యక్షంగా చేసిన ప్రభుత్వ చర్చలు అప్పట్లో మరొక సంచలనం.
ఈ సంచలనాలూ, స్కూల్లో నామీద విరుచుకు పడడాలూ సరే. ఇవే కాక ప్రకృతీ నామీద పగ పట్టినట్లు ఆ ఏడాది విపరీతమైన వానలు.ఒక శనివారం రాత్రి పడిన వానకి వరదనీళ్ళు గొప్ప వుధృతితో వచ్చి మా స్కూల్ వెనుకవైపు గేటును బలంగా తాకేసరికి గేటు విరిగిపడి స్కూల్లోకి నీళ్ళు వచ్చేసాయట.గేటుపక్కనే గదిలో వుండే వాచ్ మెన్ ఇంట్లోకి వచ్చేశాయని గగ్గోలు పెడుతూ ఆదివారం వుదయమే ఫోన్ చేసాడు.
నాకు ఏంచేయాలో తోచక ముందు స్కూల్ యాజమాన్యం వారికి తెలియజేసాను.తొందరగా తయారై మా ఆటో సలీమ్ ని పిలిచి స్కూల్ కి వెళ్ళాను.అంత వర్షం కురిసి తెల్లారేటప్పటికి పూర్తిగా తగ్గిపోయింది.అందుచేత స్కూల్ లోకి వచ్చేసిన నీళ్ళు కూడా క్రమంగా తగ్గిపోయాయి.కానీ భద్రత వుండాలి కదా అందుకని కార్పెంటర్ ను పిలిపించి అర్జెంట్ గా గేటు బాగు చేయించాల్సి వచ్చింది.
ఈ వత్తిళ్ళవల్లో ,ఇంకేం కారణం వల్లనో నాకు చూపులో కొంత ఇబ్బంది కలిగింది.ఎడమకంటిచూపు పూర్తిగా తగ్గినట్లు అనిపించింది.మీనన్ గారి అమ్మాయి అపర్ణ కంటి డాక్టరు.ఆమెని కాంటాక్ట్ చేస్తే నన్ను తీసుకు వెళ్ళి హాస్పిటల్లో పరీక్షలు చేయించింది.రెటీనా మీద సన్న రంధ్రాలు వున్నాయనీ,కాటరాక్ట్ కూడా కంటిపాప మధ్యలో వచ్చిందనీ తెలిసింది.సాధూరామ్ కంటి హాస్పిటల్ లో ఒక గుజరాతీ డాక్టర్ చాలా ఫేమస్ సర్జన్ అని అపర్ణ చెప్పింది.అయితే అక్కడ పరీక్షల కోసం ఒకరోజు,ఆపరేషన్ అయిన రోజు అక్కడే వుండాలి.నా దగ్గర ఒకరు ఉండాలంటే ఆషీ చిన్నపిల్ల, వీర్రాజుగారికీ కష్టమే అందుకని పగలు పల్లవో, వీర్రాజుగారో ఉండేలా రాత్రి మాత్రం వీర్రాజు గారి తమ్ముడి కూతురు కవితని వుండమని అడిగాము.ఆమె ఒప్పుకుంది.
కాటరాక్ట్ విజయవంతంగానే జరిగింది.కానీ ఆ రాత్రి వేసుకున్న టాబ్లెట్ ఏదో పడలేదేమో క్రమక్రమంగా పాదాల నుండి తిమ్మిరి ప్రారంభం అయ్యింది.అప్పటికీ కాసేపు కవితని పట్టుకుని నడిచాను.ఎందుకైనా మంచిదని అపర్ణతో ఫోన్ చేసి మాట్లాడాను.ఆమె డాక్టరుతో సంప్రదించితే డాక్టరు వచ్చి ఇంజెక్షన్ చేసారు అప్పటికే నడుము వరకూ తిమ్మిరిగా అయ్యింది.తర్వాత క్రమంగా తగ్గి నిద్రపట్టింది.మర్నాడు ఇంటికి వచ్చేసాను.
ఒక నాలుగు రోజుల తర్వాత సంక్రాంతి సెలవులే కనుక పదిహేను రోజులు విశ్రాంతి వుంటుంది అని అనుకున్నాను.తీరా ఓ పదిరోజులు అయ్యేసరికి ఆర్టీసీ ఎమ్.డీ ఆఫీస్ నుండి మా స్కూల్ బిల్డింగ్ కి సంబంధించి చర్చల సమావేశానికి రమ్మని పిలుపు వచ్చింది.ఆ సమస్య తెగేదికాదు కానీ తప్పనిసరిగా ఆటో చేసుకుని వెళ్ళక తప్పలేదు.
ఎప్పటిలా ఆ చర్చ అక్కడే ఆగింది.నేను ఇంటికి తిరిగి వచ్చేసాను.ఎటొచ్చీ ఎండలో ఆటోలో వెళ్ళి రావటం కాటరాక్ట్ అయిన కంటికి కొంత శ్రమ కలిగించినట్లు అయింది.
-- శీలా సుభద్రాదేవి
సమాజంలో కౌటుంబిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సరళాదేవి రచనలు
కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంగా పి. సరళాదేవి
'సరళాదేవి రచనలలో ప్రత్యేకమైనదీ, తనదీ అనే దస్తకత్ ఉన్నది. నిండైన తెలుగుదనం ఉన్నది. అనుకరణ ఛాయలకు పోకుండా మౌలికంగా ఆలోచించి చిత్రీకరించే నేర్పు ఉన్నది. నిశితమైన పరిశీలనాసక్తి, కరుణామయమైన హృదయమూ ఉన్నాయి' అంటారు. 'కుంకుమరేఖలు' సంపుటికి రాసిన ముందుమాటలో గోరాశాస్త్రి.
యాభయ్యవ దశకంలో సాహిత్యరంగంలోకి అడుగుపెట్టిన రచయిత్రులు కొద్దికాలం మాత్రమే రచనలు చేసి అస్త్ర సన్యాసం చేసినవాళ్ళుకొందరైతే తదనంతర నవలా ప్రభంజనంలో కొట్టుకుపోతూ కీర్తి, సంపదా లభించే ఆకర్షణలతో కథారచనను దూరంపెట్టినవాళ్ళూమరికొందరు. అతి తక్కువమంది ఒకటీ అరా నవలలు రాసినా కథారచనకే కట్టుబడినవారూ ఉన్నారు. అటువంటి వారిలో పి. సరళాదేవి ఒకరు. ఇతర ప్రక్రియలైన కవితలు కొన్ని రాసినా, రెండు నవలికలు రాసినా మూడు కథల పుస్తకాలతో కథారచయిత్రిగానే గుర్తింపబడ్డారు.
1936ఆగష్ట్ 6 వతేదిన విజయనగరంలో జన్మించింది సరళాదేవి.తండ్రి చిరుద్యోగి.అయిదుగురు తోబుట్టువులలో పెద్దదైన సరళాదేవికి స్కూల్ ఫైనల్ కాగానే మేనమామతో వివాహం జరిగింది.పెళ్ళిసమయంలో తలవంచుకుని కూర్చోలేదు నుండి అమ్మలక్కలు బుగ్గలు నొక్కుకోవటం,ఎత్తపొడవటం చూసి కొంత ఆవేశంతో మరింత ఆవేదనతో ఒక రచనగా రాసి ఆంధ్రప్రభ ప్రమదావనంకి పంపగా వెంటనే ప్రచురితమైంది.
1955లో ప్రజాతంత్ర పత్రికలో 'బావ చూపిన బ్రతుకుబాట' కథతో కథానగరంలోకి అడుగుపెట్టి, మాలతీచందూర్ ప్రోత్సాహంతో ప్రమదావనంలో రచనలు చేసారు. డా|| పి. శ్రీదేవి స్నేహప్రభావంతో తెలుగు స్వతంత్రలో 1955 నుండి 60 వరకూ విరివిగా కథలు రాసారు. ప్రముఖ పాత్రికేయుడు గోరాశాస్త్రి ముందుమాటతో తాను ఎంపిక చేసుకున్న కథల్ని 1962లో 'కుంకుమరేఖలు' పేరున సంపుటీకరించారు. మరికొన్ని కథల్ని 'సరళాదేవి కథలు' పేరుతో 1977లో మరొక సంపుటిని తన స్నేహితురాలు డా॥ పి. శ్రీదేవికి అంకితం యిస్తూ తీసుకువచ్చారు. సరళాదేవి మరణానంతరం ఆమె సోదరి ఆమెకు నివాళిగా, ఇంకా సంపుటీకరింపబడని కథల్ని 'మాకుగాదులు లేవు' పేరుతో ప్రచురించారు. కుంకుమరేఖలు సంపుటిలోని కథలు విజయవాడ ఆకాశవాణి ద్వారా ధారావాహికంగా ప్రసారం అయ్యి విశేషాదరణ పొందాయి.
1977లో 'యువ' మాసపత్రికలో 'కొమ్మా-రెమ్మా' పేరున నవలిక ప్రచురితం కాగా దానితోపాటు 'చిగురు' అనే నవలికని కలిపి పుస్తకంగా వెలువరించారు. 'కొమ్మా-బొమ్మా' నవలిక లో కథానాయిక మంగ పిచ్చివాడు ఐనా భర్త పారిపోగా బెంగతో జబ్బు పడి చనిపోయిన తల్లికి,అవకాశవాది అయినా తమ్ముడు,తనపై ఆధారపడిన అక్క పిల్లలు ఇన్ని ఆటుపోట్లు మధ్య ధైర్యంగా చదువుమొదలుపెట్టి టీచరుగా పనిచేస్తూ సహోద్యోగిని పెళ్ళి చేసుకుందామనుకునేసరికి ఆ పాత పిచ్చిభర్తని తీసుకుని ముసలామె రావటంతో మానసిక సంఘర్షణలో నిలదొక్కుకొని తన గమ్యం నిర్ణయించుకొంటుంది.
యువ లోనే ప్రచురితమైన "చిగురు"నవలికలో పెద్ద పిల్లలిద్దరికీ పెళ్ళికి చేసిన అప్పులే తీర్చలేకపోతున్న తండ్రి మూడో కూతురు విమలను అయిదుగురు పిల్లలున్న జడపదార్థం లాంటి మూడో పెళ్ళి వాడికి కట్టబెడతాడు.పెద్దకొడుకు డాక్టరీచేసి వితంతువైన సహాధ్యాయిని చేసుకున్నా,అదుపు ఆడ్డూలేక పెద్దకూతురు ఎవరితోనో లేచిపోయినా పట్టించుకోని ఆ భర్తతో ఎలా కలిసి వుందో విమలపాత్రని చిత్రించారు రచయిత్రి.
ఈ రెండు నవలలూ ఆనాటి కుటుంబ,ఆర్థిక పరిస్థితుల నేపధ్యంలో స్త్రీ జీవితాలగురించి, వైవాహిక బంధాలగురించి, మానవస్వభావాల గురించి మంచి విశ్లేషణలతో నడుస్తుంది.ఎటువంటి పరిస్థితుల్లోనైనా తట్టుకొని నిలబడేలాగే సరళాదేవి చిత్రించిన స్త్రీ పాత్రలు ఉండటం గమనార్హం.
తెలుగు సామెతలు - సాంఘిక చరిత్ర అనే పుస్తకాన్ని 1986లో పరిశోధనాత్మకంగా రాసారు సరళాదేవి.ఇందులో అంశాల వారీగా తెలుగు వారి జీవన విధానములో ముడిపడిన అసంఖ్యాకమైన సామెతలను వివరించారు.మధ్యమధ్య వాటికి చెందిన పౌరాణిక,చారిత్రక అంశాలను కథాత్మకంగా చెప్పటంలో రచయిత్రి కథనశైలి వ్యక్తమౌతుంది.
1956 నుండి 1960 వరకూ స్వాతంత్య్రానంతరకాలం రెండో ప్రపంచ యుద్ధ ప్రభావంనుండి కోలుకోలేని ఆర్థిక సంక్షోభం, దుర్భిక్షం వంటి అనేకానేక కారణాల వలస - మధ్య తరగతి కుటుంబీకులలో ఇంటిపెద్ద మాత్రమే సంపాదించే చిరుద్యోగి కావడం, బహు కుటుంబీకులు కావటం కారణంగా - ఆడపిల్లలకు చదువు, పెళ్ళి వంటివి పెనుభారాలుగా మారాయి. కొద్దిపాటి చదువుకున్న ఆడపిల్లలు అప్పుడప్పుడే తమ గురించి ఆలోచించడం మొదలెట్టిన కాలం, మధ్యతరగతి కుటుంబాలలో అందులోనూ ఉత్పత్తి కులాలలోని ఆడపిల్లలకు -చదువు, ఉద్యోగం అందుబాటులోకి రాలేదు. వరకట్న సమస్య వలన వారి వివాహం పెనుభారంగా మారింది. దిగువ మధ్య తరగతి కుటుంబాలలో ఆడపిల్లలకు ఒంటినిండా బట్టా, తిండికికూడా కష్టమై వారు కోరుకున్న అతి చిన్న కోరికలుకూడా తీర్చుకోలేని పరిస్థితులు.
బహుశా అందువలనేకావచ్చు సరళాదేవి కథలుకూడా చాలావరకూ ఆడపిల్లల పెళ్ళిళ్ళు, పెళ్ళిచూపులు, కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల్ని పొడుపు మంత్రంతో సమతూకంచేసి ఒక ఒడ్డుకు తీసుకురావడానికి ఎన్నో ఆశలతో మెట్టినింట్లో అడుగుపెట్టిన ఆడపిల్లలు సతమతమవ్వటం వంటి కథాంశాలు కన్పిస్తాయి.
1962లో వచ్చిన మొదటి పుస్తకం కుంకుమరేఖలు'లోని కథలు రచయిత్రి పాతికేళ్ళలోపు వయసులోనే రాసినవి. అందుచేత అందులోని కథలు ఎక్కువగా ఆ వయస్సు మధ్యతరగతి ఆడపిల్లల ఆలోచనలు, ఆత్మాభిమానాలు, ఆశయాలూ, ఆదర్శాలతోసహా ఇంటిని ఉన్నదాంట్లో అప్పులపాలుకాకుండా ఎలా తీర్చిదిద్దు కోవాలనే తపన కొన్ని కథల్లో ఉంటాయి. ఇంటికి అవసరమైనవి సమకూర్చు కోవాలనుకునేవారికి అకస్మాత్తుగా వచ్చే బంధువులు, రోగాలు, రొస్టులూ, ప్రయాణాలు ఆ ఆశని ఆవిరిచేయడం, నిస్పృహతో బొక్కబోర్లాపడకుండా సర్దుకుపోవడం కొన్ని కథల్లో చూడొచ్చు. అయితే సరళాదేవి కథలు అంతటితో ఆగిపోవు. ప్రతిమెట్టుదగ్గరా ఆడపిల్లలు తమ అస్తిత్వం గురించి ఆలోచిస్తూ వెన్నెముక గల వ్యక్తిత్వంతో నిలబడతారు.
బాల్యంలో పూలగౌను తండ్రి కొనితెస్తాడనీ, యవ్వనంలో పూలైనా కనీసం భర్త తీసుకొస్తాడేమోననీ, పిల్లలు పెరిగిన తర్వాత కూతురో, కొడుకో, అమ్మా నీకోసం కొన్నా'నని ఇస్తారని జీవితకాలం ఎదురుచూస్తూనే మరణానంతరం పైన కప్పటానికి కొత్తబట్ట తేవడానికి కొడుకు ముందుకొస్తే పరికించలేని అనంతలోకాలకి వెళ్ళిపోయిన దుర్గ కథ 'ఎదురుచూసిన ముహూర్తం'. ఉద్యోగిని అయినప్పుడుకూడా తనకోసం తాను కొనుక్కోలేకపోయిన పరిస్థితులు ఆమెని చుట్టుముడతాయి. బాల్యంలో ఆర్థికాంశాలు తోడైతే, తర్వాత ప్రేమరాహిత్యంతో దుర్గ నిస్పృహతో ముడిపడడం ఈ కథానేపథ్యం. తనవారని అనుకున్నవారు 'నీకోసం తెచ్చాను' అని ఏ చిన్న వస్తువును తెచ్చినా సున్నిత మనస్కురాలైనా స్త్రీ హృదయం ఉప్పొంగిపోతుందనే విషయాన్ని పురుషులే కాదు, తోటి స్త్రీలుకూడా గుర్తించరు. చిన్న విషయంగా అనిపించే పెద్ద విషయాన్ని కథగా మలచటంలో రచయిత్రి చూపిన శిల్పవిన్యాసం పాఠకులను ఆకర్షిస్తుంది. బహుశా అందుకనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కౌమారదశ అంచుల్లో ఉన్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఎంపికచేశారు ఈ కథని.
పిల్లల్ని కనటం, పెంచటం తల్లిదండ్రుల బాధ్యత అనీ, పిల్లలు కన్నవాళ్ళ రుణం తీర్చుకోకతప్పదనీ భారతీయ సనాతన ధర్మాలన్నీ ఘోషిస్తుంటాయి. అయితే పిల్లలు తమని కనమని అడగరు, కన్నందుకు పెంచకా తప్పదు. అది బాధ్యత కన్నా తమని వృద్ధాప్యంలో ఆదుకుంటారనే ఆశిస్తారు తల్లిదండ్రులు. పిల్లలకూ, తల్లిదండ్రులకూ, భార్యాభర్తలకూ, అన్నాచెల్లెళ్ళకూ, అక్కాచెల్లెళ్ళకూ, అన్నాతమ్ములకూ మధ్యన ఉన్నది ప్రధానంగా ఆర్థిక సంబంధమే అనేది తెలిసినా ఆ విషయాన్ని బయటపెట్టరు. మానవ సంబంధాలలోని లొసుగులు ఆర్థిక పరమైన విషయాలలోనే బైటపడతాయని చెప్పిన కథ 'వాడికొమ్ములు' (1977). ఇటువంటి అంశాన్ని తీసుకుని రచన చేయడం సాహసమే.
'మొగుడు కావాలా కొడుకు కావాలా అన్న ప్రశ్నని అనేక సినిమాల్లోనూ,పుస్తకాల్లోనూ చూపించి, ఆడది మొగుడ్ని ఎంచుకుంటే ఆదర్శ మహిళత్వమని పొగిడి చప్పట్లు కొడతారు. అదే మగవాడి జీవితంలో తల్లి ఎక్కువా, భార్య ఎక్కువా అనే ప్రశ్నకి భార్య ఎక్కువని ఎంచుకుంటే చప్పట్లు కొట్టరెందుకు?" అంటూ సూటి ప్రశ్నని పాఠకులకు సంధిస్తారు. రచయిత్రి. కొడుకు పెళ్ళి జరిగాక అత్తాకోడళ్ళ మధ్య సయోధ్య కుదరకపోవటానికి మూలకారణం ఈ ప్రశ్నల గురించి ఆలోచించినవాళ్ళకి అర్ధమవుతుంది.
దాంపత్య సంబంధాలలోని విచ్ఛిన్నతకు అవకాశం ఉన్న అనేక సమస్యలన్నీ రచయిత్రి తన కథలలో ఎత్తిచూపారు. స్త్రీలకూ, పురుషులకూ సమాజం విధించిన వేర్వేరు లక్షణాలనూ, విధి విధానాలనూ చూపిన రచయిత్రి, వాటివలన వస్తోన్న వివిధ సంఘర్షణలను గ్రహించటం వలన, వాటినే తన కథాంశాలుగా తీసుకుని రాశారు. ముఖ్యంగా చాలా కథలు దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి కుటుంబాల జీవన వైవిధ్యాల్ని ఆనాటి జీవన శైలితో ముడిపెట్టి సరళ సమ్మోహనమైన కథన శిల్పాన్ని ఎంచుకుని కథలు అల్లారు.
మూడు పాత్రల స్వగతంగా చెప్పిన కథ 'పేచీ' ఒక మధ్య తరగతి ఆడపిల్ల వివాహం ఆర్థికాంశాలతో ముడిపడి తండ్రీ, భర్తల మధ్య ఎంతగా నలిగిపోయేలా చేస్తుందో తెలుపుతుంది యీ కథ.
'పెళ్ళైన మర్నాడు శాంత వ్యక్తురాలయ్యింది, శారీరకంగా కాదు మానసికంగా, అన్నమాటతో 'స్త్రీ' కథను మొదలుపెట్టి పాఠకుల్ని కథలోకి లాక్కెళ్ళిపోతుంది రచయిత్రి. శాంతకొడుక్కి పెళ్ళయిన మర్నాడు 'శాంత చచ్చిపోయింది, శారీరకంగా కాదు మానసికంగా' అంటూ కథ ముగించటంలో సరళాదేవి కథన విన్యాసం తారాస్థాయికి చేరిందనిపిస్తుంది. ఈ రెండు వాక్యాల నడుమ నడిచిన కథ ఏమిటనేది నిజానికి వివరించి చెప్పకపోయినా ఫర్వాలేదు. మందబుద్ధి అయిన కొడుకును శాంతకు ఇచ్చి పెళ్ళి చేసిన అత్త 'శారీరక సుఖం కోసం నీ ఏర్పాటు నువ్వు చేసుకోవచ్చు' అని సలహా ఇస్తుంది. 'అటువంటి భర్తని మగవాడిని చేసింది శాంత' అంటారు రచయిత్రి. ఇంతకన్నా విడమరిచి చెప్పక్కర్లేదు. తన నేర్పరితనంతోనే పిల్లల్ని కనిపెంచినప్పుడు 'శాంత మాతృమూర్తి అయ్యింది' అంటారు. కథని ఎంతవరకూ చెప్పాలో ఎక్కడ ఆపాలో తెలిసిన రచయిత్రి యీమె.
1957లోనే రాసిన 'గతాగతాలు', 'వక్రించిన కీర్తికాంక్ష' ఇంచుమించుగా ఒకే రకం అంశంతో ఒకదాని సీక్వెల్ ఇంకొకటిగా అనిపిస్తాయి. కొత్తకాపురం పెట్టిన దయపతులు తన ఇంటిచుట్టుపకులు వాళ్ళంతా అంతకుముందు ఆ యింట్లో ఉన్న యిల్లాలు మంచితనం వేనోళ్ళ కీర్తించటాన్ని చూసి, తానుకూడా అలాగే ఉండి మంచిది అనిపించుకోవాలేమో అనే సందిగ్ధంలో పడుతుంది కథానాయిక. రెండో కథలో వాళ్ళింట్లోని బావిలోని నీళ్ళని తొడుకొని పక్కబస్తీవాళ్ళంతా వెళ్తుంటారు.తమ పక్కింటామె బతిమాలించుకొని రెండురోజులకొకసారి, ఉదారంగా ఇచ్చినట్లుగా నీళ్ళని తోడుకోనిస్తుంది. అయినా ఆపక్కింటామెని వాళ్ళంతా పొగుడుతారేమిటనే అర్థంకాని సందిగ్ధత మరో ఇల్లాలికి. మానవ స్వభావాలలోని విభిన్న కోణాల్ని దర్శింపజేసే కథలు ఇవి.
1977లో ప్రచురితమైన 'సరళాదేవి కథలు' సంపుటిలోని కథానాయికలు పరిణతి పొందిన యువతులు. 'మర్రిచెట్టునీడలో' (1969)లో అయిదుగురు అక్కల తర్వాత పుట్టిన వెంకటేశ్వర్లు తల్లీ అక్కల అపేక్షతో ముద్దుగా పెరిగి తనకేం కావాలో కూడా ఆలోచించనివాడు. అటువంటి కుటుంబంలోకి కోడలుగా వచ్చిన పద్మకి, భర్త మర్రిచెట్టు నీడలో పెరిగిన గడ్డిచెట్టుగా కనిపించటమేకాక క్రమేణా తాను కూడా మరో గడ్డిమొక్కగా మారుతున్నానని తెలుసుకుంటుంది. పద్మ సాహచర్యంతో నీడలో ఉన్నంతకాలం ఎదగలేమని తెలుసుకున్న వెంకటేశ్వర్లు ట్రాన్సఫర్కి పెట్టుకోవటంతో కథ ముగుస్తుంది. కథ ఇంతేనా అనుకుంటే అంతే, కానీ కథలో ఉన్న పాత్రల స్వభావం, యుక్తాయుక్త విచక్షణతో ప్రవర్తించే పాత్రల తీరును అర్థం చేసుకున్నప్పుడు సమాజంలోని కుటుంబ కలహాలకు కారణాలు అవగతమవుతాయి.తరతరాలుగా పిల్లల్ని తప్పనిసరిగా సవతితల్లి ప్రేమించదు అనేది జానపద కథల దగ్గరనుండి సామాజిక సాహిత్యంవరకూ శిలాక్షరాలుగా ఉన్నాయి. పుట్టింట్లో తనకంటూ అస్తిత్వం లేకుండా బతికిన కమల నలుగురు పిల్లలున్న వాడిని పెళ్ళిచేసుకుని పిల్లల్ని ప్రేమించి, కుటుంబాన్ని తనకంటూ ఒక ప్రేమైక ప్రపంచంగా చేసుకున్నా, చుట్టూ వున్న సమాజం విషబిందువుల్ని చిలికించి ఆమెకూడా సవతితల్లిగా మారిపోయే పరిస్థితుల్ని కల్పించటాన్ని 'పిన్నిప్రేమ' (1957)గా కథ రూపెత్తింది.
ఈ రచయిత్రి రచనలలో పాత్రల్ని దుర్మార్గులుగా చిత్రించరు. అలా అని మంచివాళ్ళనీ చెప్పలేదు. నిత్య జీవితంలో మన చుట్టూ ఉన్న సామాన్య వ్యక్తుల మధ్య, విభిన్న మనస్తత్వాలు, మనోభావనలు కలిగిన మనుషుల మధ్య యువతులు అధైర్యపడి కుమిలిపోక కుటుంబంలోని సమస్యల చిక్కుముళ్ళని చాకచక్యంగా, తెలివిగా, సున్నితంగా మానవ సంబంధాలను తెగిపోకుండా విప్పుకోవటం ఎలాగో ఈ కథలు తెలుపుతాయి. సమాజంలో స్త్రీ పురుషుల మధ్య సాంఘిక జీవితం విధించిన వివక్షతలను అర్థంచేసుకుని ఒక కొత్త ఆలోచనావిధానాన్ని ప్రదర్శిస్తూ ఒక కొత్త చూపుని ఈ కథలు పాఠకులకు అందిస్తాయి.
సరళాదేవి రచనలు అతిసామాన్యంగా, మామూలుగా, నిరాడంబరంగా చెప్పుకుపోతున్నట్లే ఉంటాయి. సంభాషణలు మన ఇళ్ళల్లోనో, మన చుట్టూ వున్నవారి మాటల్లాగానో పొరుగింట్లో జరిగిన సంఘటనల్లాగానో ఉంటాయి. కానీ కథల్ని లోతుగా పరిశీలించి చదివితే కథలోని అంతరార్ధం అవగాహనకు వచ్చి, రచయిత్రి రచనలోని లోతులు పాఠకులకు అర్థమవుతాయి. అందుచేత రచయిత్రి కథలు ఎంత సమకాలీనంగా ఉన్నాయో తెలుస్తుంది.
బియ్యే చదువుకున్న విద్యావతి తన భర్త చేత తన్నులుతింటూ బతుకుతుంది కానీ విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్ళి చేసుకో అంటే- 'విడాకులు ఇస్తే జామ్మని ఖుషీ చేస్తాడు. కలలోనైనా తలవడు, కానీ నేనుమాత్రం అవస్థలు పడాలా? ఎక్కడో ఎందుకు ఆ పడేదేదో ఇక్కడే పడతాను. పెళ్ళంటే బొమ్మలాటా....." అని ఆవేశపడుతుంది 'భిన్నత్వం ఏకత్వం' కథలో జమున. అదే కథలో పల్లెటూరి దిగువ తరగతికి చెందిన అమ్మాయి తన భర్తతో నానా చావుదెబ్బలు తింటుంది. శిశు సంక్షేమశాఖలో ఉపాధి కల్పిస్తాం అని చెప్పినా భర్తని విడిచిపెట్టదు. ఇలా రెండు వర్గాల స్త్రీలను సాదృశ్యంగా చూపుతూ 'ఈ నిర్ణయంతో వీళ్ళు సాధించేదేమిటి? వీళ్ళ ప్రయాణం ఏ దిక్కుకి?' అని ప్రశ్నిస్తూ ప్రశ్నలతోనే నాటి సమాజంలో స్త్రీ పురుష జీవన వైరుధ్యాన్ని సమాధానంగా చూపిస్తారు. రచయిత్రి.
కట్నం పుచ్చుకునేవారిని పెళ్ళిచేసుకోనని ప్రతిజ్ఞ చేసి సాధించిన అమ్మాయి కథ ప్రచురించిన పత్రికను మరదలికి అందుబాటులో ఉంచి, ఆమెను జాగృత పరచిన వదిన 'సూత్రకారి'(1958)గా మారుతుంది. మరదలు వసుంధరకు కట్నం తీసుకొని వరుడిని సాధిస్తుంది.
పెళ్ళిచూపుల పేరుతో ఆడపిల్లని శల్యపరీక్ష చేయటం తమ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఆడపిల్ల అందచందాల్ని, రంగుని, అవకారాలనీ ఎత్తిచూపటం వంటి వాటిని రెండు మూడు కథలలో నిరసిస్తూ తీవ్రంగా ఖండిస్తుంది రచయిత్రి.జీవనస్రవంతి విధానంలో బస్సు ఎక్కిన దగ్గరనుండి తిరిగి దిగేవరకూ డ్రైవరు, కండక్టర్, యువకుడు సంభాషణతో కథంతా నడుస్తుంది. యువకుడి పెళ్ళి సంబంధాల గురించి జరిగిన ఆ సంభాషణలో వివాహ వ్యవస్థ, పెళ్ళిచూపుల ప్రహసనాలూ, ఆడపిల్లలకు పెళ్ళిపట్ల గల మనోభావాలు, యువకుల దృక్కోణాలూ అన్నిటినీ ఇతర ప్రయాణీకులైన ముసలివాళ్ళ మాటల్లో వ్యక్తమయ్యే తరాల అంతరాలూ అన్నింటినీ చర్చకు పెడుతూ నడిచిన 'కళ్యాణ కింకిణి' (1956) కథ అరవై ఏళ్ళ కిందటి వివాహ వ్యవస్థకి సంపూర్ణ నిర్వచనంలా రచించింది సరళాదేవి.
చలం, కుటుంబరావుల రచనలను అమితంగా ఇష్టపడే సరళాదేవి, తన కథలలో ఎవరినీ అనుసరించకుండా, తనకంటూ ఒక ప్రత్యేక ముద్రని ఏర్పరచుకుంది. ఏ విషయానికైనా, ఏ సమస్యకైనా మౌలికాంశం ఏమిటన్నది ఆలోచించి ఆ దృశ్యకోణంలోనే కథలను అల్లగలిగే నేర్పును సాధించటమే కాకుండా, అతి సాధారణమైన అచ్చతెనుగు నుడికారంతో కూడిన సంభాషణలతో కథలను రాయటం సరళాదేవి ప్రత్యేకత.
అతి సామాన్యమైన కుటుంబ కథే అనిపించే వాటిలోకూడా కుటుంబ ఆవరణను, పరిస్థితులనూ, పాత్రల మనస్తత్వాలనూ నిశితంగా గమనించే పరిశీలనాశక్తి ఈ రచయిత్రి స్వంతం.
ఏ రచయితకైనా తాను సృష్టించిన ఎటువంటి పాత్రమీద అయినా అసహనం, ద్వేషం ఉండదు. అంతేగాక ఆ పాత్ర ఎటువంటిదైనా సానుభూతి ఉంటుంది. సమాజంలో కనిపించే అహంకారాలూ, అల్పత్వాలూ, అభిమానాలూ,కుత్సితాలూ లాంటి వివిధ రకాల మానవ దౌర్బల్యాలు సంయమనంతో పరిశీలించటం, కథానుగుణంగా ఆయా పాత్రల ప్రవర్తనలనూ, మనోభావాలనూ కథలలో ప్రస్ఫుటించే దశలోకూడా కరుణార్ధ పూరితంగానే పాత్రలను చిత్రీకరించింది సరళాదేవి.
నిజానికి సరళాదేవి కథలలోని పురుష పాత్రలు ఏవీ దుర్మార్గులుగానో, స్త్రీలను అన్యాయం చేసేవారిగానో కనిపించరు. కానీ వివాహ పూర్వవ్యవస్థని కానీ, వివాహ వ్యవస్థని కానీ, కుటుంబ వ్యవస్థనిగానీ కథనం చేసే క్రమంలో స్త్రీలకు ప్రస్ఫుటంగా కనిపించేరీతిలోనే జీవన విధ్వంసంగా లోలోపల జరిగే అన్యాయాలు తెలుస్తుంటాయి. కొన్నింటిలో స్త్రీలు పరిస్థితులకు తలవంచి సర్దుకుపోవటం కనిపిస్తుంది. మరికొన్నింటిలో అమ్మాయిలు తమకు జరుగుతున్న వివక్షతను గ్రహించి ప్రశ్నించి దానిని తెలివిగా సరిచేసుకునే ప్రయత్నంలో సఫలం కావటం ఉంటుంది.
జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలకు ఆశ్చర్యపడుతూ, ఒక్కొక్కసారి చిన్నబుచ్చుకుంటూ, ఆవేశపడ్తూ, అయోమయపడుతూ ఉన్న కథానాయికలు తమ అస్థిత్వం నిలుపుకుంటూనే, తమ సమస్యలకు తామే పరిష్కారం దొరకబుచ్చుకుని తమని తాము పునర్నిర్మించుకోవాల్సిన అవసరం తెలుసుకుని, చుట్టూ ఉన్నవారిని నొప్పించకుండా, తాను నొచ్చుకునే పరిస్థితి తెచ్చుకోకుండా ధృఢమైన వ్యక్తిత్వాన్ని సాధించే కథానాయికలుగా 'తొణికిన స్వప్నం'లో కమలం, 'పురుషుడు'లో కృష్ణకుమారి, 'మర్రిచెట్టు నీడ'లో పద్మ, 'కుంకుమరేఖలు' హేమలత, 'తిరిగిన మలుపు'లో జానకి, 'ఇల్లూ ఇల్లాలు'లో శకుంతలా- ఇలా చాలామంది కథలలో, పాఠకులకు పరిచయం అవుతారు. వీరి సమస్యలు వేర్వేరు కావచ్చు. కాని సునిశితంగా, చాకచక్యంగా దిద్దుకునే నేర్పుని ఈ పాత్రలలో మనం చూడవచ్చు. ఇది రచయిత్రి నైపుణ్యానికి నిదర్శనం.
అంతకుముందు రాసిన కథలకు భిన్నంగా జీవితానుభవంతో మారిన దృక్పథంతో రాసిన కొన్ని కథలనుకూడా పరిశీలించాల్సి ఉంది.
పదవీ విరమణ అనంతరం జీవితం ముగిసిపోయినట్లే అని భావించే భార్యాభర్తలు రామయ్యా, సుందరమ్మల కథ 'నిండా తొంభై ఏళ్ళు బ్రతుకు'.చక్కటి నిర్వచనాలు కథాసందర్భంలో ఆకట్టుకుంటాయి. 'మన వివాహ వ్యవస్థలో పెళ్ళికూతురు ఎంత బొమ్మో పెళ్ళి కొడుకూ అంతే బొమ్మ' అని భిన్నత్వంలో ఏకత్వం కథలో; 'అవమానాలన్నీ ఆడవాళ్ళు ఆవలింతలుగా తీసుకోవాలా' అని దుర్బలుడి వాగ్దానం కథలో, 'ఏ జీవజాలంలోనూ లేని ఆర్థికబంధం, సేవాబంధం, త్యాగబంధం మనుషుల జీవితానందాన్ని తినేస్తుంది అని. వాడి కొమ్ములు కథలో ఆలోచింపజేస్తాయి.
"మాకుగాదులులేవు" కథలో పుట్టినరోజు గురించి టీచర్ వ్యాసం రాయమంటే పుట్టినరోజు పండుగని ఎరుగని ఒక పేద విద్యార్థి రాసిన కన్నీటి గాథను చదివి టీచర్ చలించిపోతుంది.ఈ కథని 2024 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొమ్మిదవ తరగతి తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా చేర్చారు.
1956లో డా.పి.శ్రీదేవి రాసిన కాలాతీతవ్యక్తులు తెలుగు స్వతంత్ర లో ధారావాహికంగా వచ్చినప్పుడు సరళాదేవి చదివి ప్రభావితురాలై " కాలాతీత వ్యక్తులు - ఒక ప్రసక్తి" అని సరళాదేవి రాసిన సుదీర్ఘ సమీక్ష ఆ వెంటనే స్వతంత్ర లో ప్రచురితమైంది.కాలాతీతవ్యక్తులు నవలను అనేకసార్లు ముద్రించిన ఎమెస్కో సంస్థ ప్రతిసారీ సరళాదేవి రాసిన ఈ సమీక్ష ను ముందుమాటగా వేస్తోంది.
సరళాదేవి రాసిన వ్యాసాలు,కొన్ని కవితలూ స్వతంత్రలో ప్రచురితమయ్యాయి.
అందుకే గోరాశాస్త్రి "మొదటిది రచయిత్రి సంస్కృతి, వ్యుత్పత్తి, రెండవది భాషపై వున్న అమోఘమైన స్వాధీనం, మూడవది నిశితమైన మానవ మనస్తత్వ పరిశీలన ముప్పేట జడవలె సమన్వయపరుచుకుని రచనలను అందిస్తున్న సరళాదేవిని అభినందిస్తున్నాను' అంటారు
వివాహ వ్యవస్థ స్త్రీ జీవితంతో ఎలా ఆడుకుంటుందో చూపటమే లక్ష్యంగా, స్త్రీ జీవితంలోని ఇతర పార్శ్వాలనుకూడా చిత్రించే సరళాదేవి మరిన్ని రచనలు చేసి వుంటే బాగుండేదని ప్రశంసించారు మృణాళిని.
అనేక కారణాలతో 1980 తర్వాత పూర్తిగా సాహిత్యానికి దూరమైనా సాహిత్య చరిత్రలో తనకంటూ ప్రత్యేక ముద్రను సాధించిన రచయిత్రి పి.సరళాదేవి.
20, మార్చి 2025, గురువారం
కథలు లోగిలి సంకలనం ముందు మాట
~ కథలలోగిలిలోని రంగవల్లులూ,రంగులూ ~
" ఒక కథకుడికి రచనా సామర్థ్యం లేకపోయినా సరిచేయవచ్చును గాని, జీవితం తెలియకపోతే సరిచెయ్యడం ఎవ్వరి వల్లా కాదు. శిల్పం, భాష, రచనకు ముఖ్యం కావని కాదు; అవి చాలా ముఖ్యం. అవి కథారచనకు మూల పరికరాలు; ముడి పదార్థం మాత్రం జీవితం" అంటారు కొడవటిగంటి కుటుంబరావు
ఆధునిక తెలుగుసాహిత్య ప్రక్రియలలో కథ క్లిష్టమైనది మాత్రమే కాదు, సంక్లిష్ట సామాజిక జీవన పరిస్థితులను కథ ప్రతిబింబించినంత స్పష్టంగా, సూటిగా మరే ప్రక్రియా ప్రతిబింబించలేదనే చెప్పాలి. అందుకే కథారచన ఉన్నతశిఖరాలందుకుందని చెప్పుకోవచ్చును .
సాహిత్యం సమాజహితం కోసం మాత్రమేకాదు. సమాజ మూల మూలాల్ని,లోతుల్నీ,జీవనరీతుల్ని, ప్రతిబింబించేదిగా వుండాలి. సమాజంలోని వ్యక్తుల జీవితాన్ని దృశ్యమానం చేసేదిగా వుండాలి.
కథ పుట్టిన దగ్గర నుండి ఇటీవల కాలం వరకూ ఎక్కువశాతం మధ్యతరగతి జీవిత చిత్రణకే కథ పరిమితమై పోయింది. తర్వాత్తర్వాత ప్రపంచీకరణ నేపథ్యంలో మారుతున్న విలువల వలన కొంత వరకు దిగువ మధ్యతరగతి కథలేకాక, ఉన్నత తరగతుల జీవితం కూడా ఎక్కువగానే కథల లోనికి అక్షరబద్ధమౌతోంది.
కథకు ప్రధానంగా క్లుప్తత, గాఢత ముఖ్యం, పరిమిత పాత్రలతో ఆత్మ సంయమనస్వభావ లక్షణం, వస్తువునకు తగిన కథనాన్ని, పాత్రల జీవన స్వభావానికి తగిన సంభాషణలు ఉండటం మంచి లక్షణం. ఇక శైలి వ్యక్తిగతమైనది ఎవరి ధోరణి వారిదే. వారివారి అభిరుచులు, నమ్మకాలను అనుసరించి కథారచనలో మొదటినుండి చివరివరకూ అంతర్లీనంగా ప్రవాహంలా కలగలిసి అల్లిన అల్లికే వారి రచనా పద్ధతిగా శైలిగా చెప్తాము సార్వజనీనమైన వస్తువుతో ఐక్యతచెంది కథకులు కథని నడిపించాలి.అప్పుడే ఆ కథ మంచి కథగా గుర్తించబడుతుంది.
తెలుగులో కథాసంకలనాలు వందకి పైగానే వెలువడి వుంటాయి. చాలా వరకూ సంపాదకుల అభిరుచికి, కథకులసాహిత్య విలువల కేంద్రకంగా ఏర్చి కూర్చినవి.
అయితే ఆ పద్ధతికి భిన్నంగా జాతి,కుల,మత,ప్రాంతీయ, సమస్యాప్రాధాన్యత, పోరాటం నేపథ్యంగా అనేక సంకలనాలు వెలువడ్డాయి.వెలువడుతూనే వున్నాయి.
కేవలం మహిళా చైతన్యానికి ప్రాధాన్యతనిస్తూ కేవలం రచయిత్రుల సంకలనాలుగా స్త్రీవాద కథలు సంపుటి కాక సఖ్యసాహితి రచయిత్రుల సంస్థ ప్రచురించిన కదంబం (1996), డా. భార్గవీరావు వందమంది రచయిత్రులతో వెలువరించిన నూరేళ్ళ పంట(2001),లేఖిని రచయిత్రుల సంస్థ ద్వారానే వెలువరించిన దీపతోరణం(2013) ప్రధానంగా చెప్పుకోదగినవి.
ఇటీవల రచయిత్రుల సంపాదకత్వంలో కూడా కథాసంకలనాలు విరివిగానే వస్తున్నాయి.
ఆ కోవలోనే లేఖిని రచయిత్రుల సంస్థ ద్వారా ఒకేసారి " కథలలోగిలి " పేరిట కథలసంకలనాలను రెండు భాగాలుగా వెలువరించటం హర్షణీయం.
అందులో ఇది రెండవ సంకలనం.
ఇందులో ముప్పై అయిదుమంది వరకూ రచయిత్రుల కథలు వున్నాయి.
సుమారు నలభై ఏభై ఏళ్ళుగా సాహిత్యసృజన చేస్తున్నరచయిత్రుల కథల నుండి ఇటీవల కొత్తగా రాస్తున్న వారి కథలవరకూ ఇందులో వున్నాయి.
ఇందులో కథలగురించో,రచయిత్రులగురించో చెప్పదలచుకోలేదు.ఈ పుస్తకం అందరూ చదివి విభిన్న రచయిత్రుల రచనలను ఎవరికి వారే తెలుసుకోవాల్సినవి.
చాలాకాలం నుంచీ రాస్తున్న తరం రచయిత్రుల చేయితిరిగిన శైలి, రచనా విధానం ఎప్పటిలా రచనానుభవం వలన అలవోకగా ఒక ప్రవాహంలా సాగిపోయాయి.
వారి తర్వాత తరంగా చెప్పదగిన ఎక్కువగా ఉద్యోగినులైన రచయిత్రుల కథాంశాలలో కొత్తదనం వుంది.కుటుంబాలకు పరిమితం కాకుండా విభిన్న నేపధ్యాలలో జరిగినట్లుగా కథల్ని రాయటం బాగుంది.
గత పదేళ్ళలోపునే కలం పట్టిన ఔత్సాహికులైన వారు కూడా సమాజహితాన్ని గమనింపులోకి తెచ్చుకునే కథాంశం ఎంచుకోవడంలో,కథనం చేయటంలో నేర్పు చూపటం గమనార్హం.
అయితే కథ ఎంత క్లుప్తంగా రాయగలిగితే అంతగాఢత కలిగి వుంటుంది అనేది కథకులు గుర్తించాలి. పాఠకులు కథకుల కంటే తెలివైనవారు. కథని పూర్తిగా విడమరచి చెప్పనవసరం లేదు. ఆలోచింప జేసేదిగా వుండాలి.
కొన్ని కథలు నవల రాయగలిగేంత
విస్తృతమైన వస్తువును తీసుకునిరాయటం వలన కూడా సుదీర్ఘంగా వున్నాయి. 50-70 ల మధ్యనాటి కథకులు చాలా మంది సుదీర్ఘంగా కథలు రాసేవారు. ఈనాడు క్లుప్తకథలకు ప్రాధాన్యత పెరిగింది. దానిని పరిగణలోనికి రచయిత్రులు తీసుకోవాల్సిన అవసరం వుంది.
కథకు ఎత్తుగడ ఎంత ముఖ్యమో కొసమెరుపుతో ముగింపు అంతే ముఖ్యం.కథ చదవటం పూర్తిచేసాక దాని గురించి ఆలోచింపజేయాలి.కథలోని స్టోరీ లైన్ స్పష్టంగా వుండాలి.కొత్తగా రాస్తోన్న కథకులు గ్రహించాల్సిన విషయం ఇది.
ఇంచుమించుగా ఇందులోని చాలావరకూ కథలన్నీ సమకాలీన సమాజంలో జీవితం, కుటుంబ సంబంధాలు, కౌటుంబిక విలువలు, మానవ సంబంధాలు, సమాజహితం చిత్రితమయ్యయి.
నేటికాలంలో పిల్లల పెంపకం, పెద్దల బాధ్యతల్ని చర్చించారు. సగానికి పైగా కథలు మంచి పఠనీయతతో రాసిన కథలే కావటం సంతోషం కలిగించాయి. కథారచనలో అనుభవం వున్న సీనియర్ రచయిత్రులతో పోటీపడుతూ ఔత్సాహికులు కూడా కథలు రాయటం మంచి పరిణామం.
సన్నగా వర్షం పడుతున్నప్పుడు బాల్కనీలో కూర్చొని పక్కన పకోడీలో,బఠాణీలో ప్లేటులో పెట్టుకొని చిరుగాలిలో హాయిగా ఆస్వాదిస్తూ చదువుకునే కథలివి.అందరూ చదవాల్సిన కథలు.
ఈ విధంగా కథలసంకలనం తీసుకురావాలని అత్తలూరి విజయలక్ష్మి అధ్యక్షత లోని లేఖిని రచయిత్రుల సంస్థలోని సభ్యులంతా సంకల్పించి, వెలువరించిన కథలలోగిలిని స్వాగతిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)