23, అక్టోబర్ 2025, గురువారం
నడక దారిలో -58
నడక దారిలో -58
పరీక్ష కోసం చదువుతున్నట్లుగా శ్రీదేవి రచనలు ఒకటికి రెండుసార్లు చదివి నోట్స్ తయారు చేసుకుని స్వతంత్ర బౌండ్లు కృష్ణదేవరాయ భాషా నిలయానికి తిరిగి అందజేసాను.
కథానిలయంలోని కథలు గురించి వివినమూర్తిగారిని మెయిల్ ద్వారా సంప్రదించాను.ఆయన అక్కడి కథలు పీడీఎఫ్ లు పంపించారు.ముందుగా కథలకు,కవిత్వానికి సంబంధించిన నోట్స్ పూర్తి చేసుకున్నాక " కాలాతీతవ్యక్తులు" నవలను చదవటం మొదలు చిన్నప్పుడు చదివినదే అయినా ఇప్పుడు చదువుతుంటే ఎన్నో కోణాల్లో నవల విశిష్టతని గుర్తించి రాయటం మొదలు పెట్టే సరికి నవల విశ్లేషణే 40 పేజీలకు పైగా వచ్చింది.రాయటం స్పీడ్ అందుకుంది.
అయితే నాకు ఈ ప్రోజెక్ట్ అప్పగించిన నాటికి అక్కిరాజు రమాపతిరావు( మంజుశ్రీ)గారు కేంద్ర సాహిత్య అకాడెమీ కన్వీనర్.నేను సబ్మిట్ చేసేనాటికి కమిటీ మారిపోయింది.ఎన్.గోపీగారు కన్వీనర్ అయ్యారు.ఇతరసభ్యులలో ఒకరుగా వీర్రాజుగారు కూడా వున్నారు.అది నన్ను కొంచెం ఇబ్బంది పెట్టింది.నేను రాసినది స్క్రూటినీకి కూడా వెళ్ళి తొందరగానే అంగీకారం అయ్యి ప్రింటింగ్ కు వెళ్ళింది.
సాధారణంగా కమిటీలో వున్నవాళ్ళు సాధ్యమైనంతవరకూ అకాడమీ సభ్యులు కూడా కొన్ని ప్రోజెక్టులు తీసుకుంటారు.వీర్రాజుగారు మాత్రం కమిటీ సమావేశాలకు వెళ్ళటం తప్ప ఏవిధమైన ప్రయోజనం పొందలేదు.
నాకు ఒక విషయంలో ఆయనపై చాలాకోపం కూడా వచ్చింది.ప్రతీ సభ్యుడూ జ్యూరీ సభ్యులుగా వుండటానికి ప్రతీ కేటగిరి కిందా సుమారు ముప్పై మంది పేర్లు వారి చిరునామాలతో సహా ఇవ్వాలి.నాస్నేహితులైన రచయిత్రులతో సహా తెలిసిన వారిపేర్లు రాసి ఇచ్చారు.కానీ నా పేరు రాయలేదు."మీ భార్యగా కాకుండా ఇంతకాలంగా రాస్తున్న రచయిత్రిగా నా పేరు రాయొచ్చు కదా "అని గొడవ పెట్టుకున్నాను.కానీ ఆయన నిబద్ధతకి మరి మౌనం వహించాను.
అదే సమయంలో కేంద్ర సాహిత్య అకాడమీ తో కలిసి వాసా ప్రభావతిగారు లేఖిని సంస్థ ద్వారా సదస్సును నిర్వహించ తలపెట్టారు.ఆరుగురు మాత్రమే పత్ర సమర్పకులు.లేఖిని సభ్యులు ప్రసంగకర్తలుగా పేర్లు ఇచ్చారు.వాటిని కన్వీనర్ అయిన గోపిగారికి పంపుతే అందరూ ఒకే సామాజికవర్గానికి చెందినవారున్నారు.అకాడమీ నిబంధనకు కుదరదన్నారు.ప్రభావతిగారు నాకు ఫోన్ చేసి నన్ను ఒక పేపర్ ప్రజెంట్ చేయమన్నారు.వీర్రాజుగారు అకాడమీ సభ్యులు కనుక నేను ఇవ్వడానికి అంగీకరించలేదు.అప్పుడు పుట్లహేమలతని సంప్రదించారు.
వందేళ్ళ కథకు వందనాలు కార్యక్రమం కోసం వీర్రాజుగారి కథను రికార్డు చేయటానికి గొల్లపూడి మారుతీరావుగారు మాయింటికి వచ్చారు.
అప్పుడు మా బిల్డింగ్ లో కొందరికి వీర్రాజుగారు రచయిత అనే విషయం తెలిసింది.తర్వాత్తర్వాత నేనుకూడా రచయిత్రినని తెలిసింది కాని ఇక్కడ ఎవరికీ సాహిత్య వాసనలు లేనందునా,మేము ప్రచారం చేసుకోనందున అంతకన్నా మా గురించి తెలియదు.
శ్రీదేవి మోనోగ్రాఫ్ రాసిన తర్వాత వ్యాసాలు రాయాలనే వుత్సాహం వచ్చింది.అందులోనూ వందేళ్ళ కథను వందనాలు కార్యక్రమంలో ప్రత్యేకంగా కథలను గురించి చెప్పదగిన రచయిత్రులైన జలంధర,జానకీరాణి, శివరాజు సుబ్బలక్ష్మి వాళ్ళంతా మరొకరి పరిచయం చేయటానికి వుపయోగ పడ్డారు.దాంతో 118 కథకుల్లో కేవలం 12 మంది కథయిత్రులకథలను మాత్రమే పరిచయం చేయటం నాకు బాధకలిగించింది.అరవయ్యో దశకం రచయిత్రుల స్వర్ణయుగం అనేవారు కదా.వారెవ్వరూ నవలలు తప్ప కథలు రాలేదా అని పరిశోధన చేసాను.నమ్మలేనంత ఆశ్చర్యం కలిగింది.
స్వాతంత్య్రానంతరం రచయిత్రులలో బాగా రాస్తారు అనుకున్న వాళ్ళు పేర్లు జాబితా వేసుకుని
నా దగ్గర కథా సంపుటాలే కాకుండా కెపి అశోక్ కుమార్ , అనిశెట్టి రజిత, కాత్యాయనీ విద్మహే , రామడుగు రాధాకృష్ణ మూర్తి గారు వంటి వారినుండి పుస్తకాలు సేకరించాను.కథానిలయంనుండి వేల కొద్ది కథలు డౌన్లోడ్ చేసుకుని.ఒకరి తర్వాత ఒకరికి తలమీద వ్యాసాలు రాయటమే కాక వివిధ పత్రికలకు పంపించగా అన్నీ ప్రచురణ కాసాగాయి.
దాంతో రెట్టించిన వుత్సాసం వచ్చింది.
వీర్రాజుగారు కథలూ,కవిత్వం మానేసి వ్యాసాలు రాస్తున్నందుకు 'వ్యాసాలలో పడితే మరి సృజనాత్మక సాహిత్యం రాయలేవు' అని మందలించేవారు.
ఆయన మాటల్ని పట్టించుకోకుండా ' కవితలు కూడా ఇంచుమించు ప్రతీ నెలా పత్రికల్లో వస్తూనే వున్నాయిగా' అన్నాను.
డిసెంబర్,జనవరి మా ఇంట్లో హడావుడి వుంటుంది.జనవరిలో సంక్రాతికి బొమ్మలకొలువు పెడతాము.నాకు చిన్నప్పటి నుంచి బొమ్మలకొలువు పెట్టటం ఇష్టం.చిన్నప్పుడు తీరని కోరిక పల్లవి పుట్టిన తర్వాత తీర్చుకో సాగాను.ఒక్కొక్కసారి ఒక థీమ్ అనుకొని ఆ థీమ్ కి అనుగుణంగా బొమ్మలు,బేక్ గ్రౌండ్ లో అలంకరణ మేమే తయారుచేసి పెడతాము.అందుచేత డిసెంబర్ నుంచి ఈ పని కొనసాగుతుంది.మా నైపుణ్యాలు న్నీ అందు లో ప్రదర్శిస్తాం.
ఆ హడావుడిలో వుండగా ఒక రోజు మా మేనల్లుడు ఫోన్ చేసి వాళ్ళమ్మ కు అనారోగ్యం గా వుందని తెలియజేసాడు.వీర్రాజుగారికి చెప్తే చూడటానికి వెళ్దామన్నారు. సుమారు పది పదిహేనేళ్ళుగా మా అన్నయ్యగానీ,ఆడపడుచుగానీ
మాకు కాంటాక్ట్ లో లేరు.అన్నయ్యకి చాలా కాలం క్రితం బ్రైన్ ఆపరేషన్ అవుతే స్కూల్ నుండి డైరెక్ట్ గా చూడడానికి వెళ్ళినప్పడు ఎవరో పరాయిదానిలా చూసిన అనుభవం ఇంకా మర్చిపోలేదు.కానీ రక్తసంబంధం వదిలేయలేక ప్రయాణం అయ్యాము.మాతో మా మరిది,పెద్దాడబడుచు భర్త కూడా వచ్చారు.ఆమె పరిస్థితి అంతా బాలేదు.తిరిగి వచ్చేటప్పుడు ' అవసరమైతే చెప్పు నేను సాయానికి వస్తాను' అని మేనల్లుడితో చెప్పాను.
ఎప్పుడు అక్కడికి వెళ్ళవలసి వస్తుందో నని బొమ్మలకొలువు కొంచెం సింపుల్ గా పెట్టాము.
సంక్రాంతి వెళ్ళిన నాలుగో రోజున సీరియస్ గా వుందని ఫోన్ వేస్తె ఓ రెండు చీరలు,డబ్బు సంచిలో వేసుకొని వాళ్ళింటికి వెళ్ళాను.ఆ రాత్రి ఆమె బాధ భరించలేక కోమాలోనే భయంకరంగా మూలుగుతుంటే శరీరం వదలటానికి ప్రాణం ఇంత కొట్టుకులాడుతుందా అని భయం వేసింది.ఇంటి ఓనరు కొడుకు పెళ్ళి వుందని ఇంట్లో ప్రాణం పోతుందేమోనని గొడవ పెట్టారు.దాంతో మర్నాడు ఉదయమే దగ్గరలోని ఓ ఆశ్రమంకి తీసుకు వెళ్ళాం.
మా చిన్నన్నయ్య ఇంతకాలం తర్వాత తన మనసులోని మాటలన్నీ అతని పిల్లలు ఆపాలనుకున్నా నాతో చెప్పటం మొదలుపెట్టాడు.
నేను మౌనంగా విన్నాను.మర్నాడు ఆమె పోవటంతో వీర్రాజు గారి తరపు వాళ్ళు వచ్చారు.ఆమెకు పుట్టింటి వాళ్ళే చీర పెట్టాలి మా దగ్గర వున్నదే పెట్టేయమని అన్నయ్య,అతని వియ్యంకులు అంటే వాళ్ళది వద్దని పల్లవికి ఫోన్ చేసి నాదే ఒక కొత్త చీర తీసుకురమ్మని మా చిన్నాబడుచును సాగనంపాము.ఆ పని అయ్యాక మా ఇంటికి తిరిగి వచ్చాము.అయితే ఆ తర్వాత చిన్నన్నయ్య పలఃరించటానికి ఊరుకోలేక అప్పుడప్పుడు నేను వాళ్ళింటికి వెళ్ళే దాన్ని.ఒకసారి అతను రాసిన కథలు ఫైల్ తీసుకు వచ్చి నా చేతిలో పెట్టి వాటిని డీటీపీ చేయించి కొడుకుకి ఒక కాపీ ఇచ్చి నా దగ్గర ఒకటి పెట్టుకోమని ఈ,డీటీపీ ఖర్చు ఇస్తానన్నాడు.
ఇంటికి వచ్చాక చూస్తే వంద కథలు వున్నాయి.నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది.
ఆర్థికంగా ఇబ్బందుల్లో వున్నా విజయనగరంలో రావిశాస్త్రి , కారా మాస్టారు,చాసోల కోవలోనే సమాజానికి దర్పణంగా వుండే మంచి కథలు రాసి , అనేకమందిని రచయితలుగా ప్రోత్సహించి ప్రచారపటాటోపం లేకుండా అనామకంగా అయిపోయాడే అని బాధ కలిగింది."విజయనగరంలో నేను రాజును ఇప్పుడు ఇక్కడ బంటును" అంటున్న చిన్నన్నయ్యను ఉన్నంతమేరకు దొరబాబులా బతికిన వాడిని ఈ నాడు ఇలా కుంగిపోయిన స్థితిలో చూడలేక పోయాను.అతనుకోరినట్లుగా కాపీలు తీయించి ఇచ్చాను.
మరో రెండుమూడు ఏళ్ళకే అనేక డిప్రెషన్ లతో ఆరోగ్యం క్షీణించడంతో చిన్నన్నయ్య కూడా చనిపోయాడు.
వీళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు పోవటం తెలిసాక కోరుకొండ లో వున్న చిన్నక్క కూడా బెంగ పెట్టుకున్నట్లుగా అయిపోయింది.
తెలంగాణా వచ్చిన తర్వాత బతుకమ్మ సంబురాలు అంగరంగవైభవంగా జరిగాయి.ఆ సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయంలో అప్పటి వీసీ ఎస్వీ సత్యనారాయణగారు ఆ పదిరోజులూ కవిసమ్మేళనాలూ ,బతుకమ్మ ఆటలూ,పాటలతో సంబురాలు జరిపించారు.
ఒకరోజు ఉదయం నాకు ఫోన్ చేసి మధ్యాహ్నం సెషన్ కవి సమ్మేళనానికి ఆత్మీయ అతిథిగా ఆహ్వానించారు.సరే అని నేను వెళ్ళాను.
కవి సమ్మేళనానికి అధ్యక్షురాలు సూర్య ధనుంజయ్
పూనా,చెన్నై,ముంబై మొదలగు ప్రాంతాలనుఔడి వచ్చిన కవయిత్రులు వారు బాల్యంలో బతుకమ్మ ఎట్లా ఆడేవారో వాటిని కవిత్వంలో చెప్పారు.నేను
పరిమళ ప్రస్తారం కవిత చదివాను.అందులో--
" అక్షరాల్ని ఒడిబియ్యంలా మోసుకొచ్చింది అక్షరాలా అక్కడినుండే
వాటికి సాహిత్య సొబగులు అద్ది
పుస్తకపళ్ళేల్ని నింపి
వాయినాలు యిచ్చిందిమాత్రం ఇక్కడే
మరి నేను ఎక్కడిదాన్నని అనుకోను?"
అంటూ కవిత చదివాను.
అధ్యక్షురాలు "మీరు హైదరాబాదీయే మేడం"అంది.ధన్యవాదాలు చెప్పి కూర్చున్నాను.
మర్నాడు " ప్రవాస తెలుగు కవయిత్రుల సమ్మేళనం జరిగింది"అని వచ్చిన పేపర్ల నివేదికలో ఏ ప్రాంతం నుండి ఎవరు వచ్చారో రాస్తూ ఆంధ్రా నుంచి శీలా సుభద్రాదేవి అని నాపేరు వచ్చింది.నాకు చాలా బాధ కలిగింది.అప్పటికి నలభై అయిదేళ్ళ క్రితం ఇక్కడికి వచ్చి ఇక్కడే ఓయూ నుండి నాలుగు డిగ్రీలు పొంది పాతికేళ్ళు ఇక్కడి పేద పిల్లల బడిలో గొంతు పోయేలా చదువు చెప్పి బతుకుతున్న , ఆంధ్రాలో సూదిమొన అంతన్నా ఆస్తులు లేని నన్ను ఆంధ్ర క్రింద పరిగణించడం బాధే కలిగింది.ఇక్కడ వీళ్ళు ఆంధ్రా అన్నారు.ఆంధ్రాలో వారికి మేము ఏమి రాసారో కూడా అనేక సాహితీ సంస్థలకూ తెలియదు,సాహితీవేత్తలకూ తెలియదు.ప్రచార పటాటోపాలు ,ఆర్భాటం చేయగలిగేవాళ్ళకు పర్వాలేదు.కానీ మాలాంటి వాళ్ళం సాహిత్యం ఇలా త్రిశంకు స్వర్గంలో ఉండటమే అనుకుంటాను.
మైండ్ ట్రీలో ప్రాజెక్టు మేనేజర్ గా పనిచేస్తున్న
పల్లవికి ఉద్యోగం ఒత్తిడి రానురాను ఎక్కువ అయ్యింది.ఉదయం ఎనిమిది నాన్నగారికి బయలుదేరితే గచ్చిబౌలికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేసరికి తొమ్మిది అయ్యేది మళ్ళీ వచ్చాక రాత్రిపూట కాన్ఫరెన్స్ మీటింగ్ లు ఉండేవి ఆఫీసుకు వెళ్ళిరావటానికే మూడుగంటలవరకూ ప్రయాణమే అయిపోయేది.దాంతో మానసికంగా,శారీరకంగా అలసిపోయేది.బీపీ ఎక్కువ కావటం చేత మెడిటేషన్ కూడా మొదలు పెట్టాల్సి వచ్చింది.మైంట్రీ వాళ్ళు దానికి తోడూ ఇక్కడ కాకుండా అమెరికా, బెంగుళూరు,పూనా ఈ మూడింటిలో ఎక్కడైనా ఎంపిక చేసుకుంటే అక్కడే బ్రాంచ్ లో జాబ్ కి పంపుతామని అన్నారు.
ఇప్పటికి పదిహేను ఏళ్ళు పనిచేసాను.ఇక పరుగులుచాలనీ, ఉద్యోగం మానేసి తనకి ఇష్టమైన వ్యాపకాలు కల్పించుకుని,ఆషీ చదువుమీద దృష్టి పెట్టుకుంటాను అని పల్లవి నిర్ణయించుకుని రిజైన్ చేసేసింది.
ఒక నెలో రెండు నెలలో విశ్రాంతి తీసుకుని రామకృష్ణా మిషన్ లో జర్మన్ భాష నేర్చుకునేందుకు జాయిన్ అయింది.ఉద్యోగంలో వున్నప్పుడు ఒక సెమిష్టర్ భాష నేర్చుకుంది.అందుకని అక్కడే చేరింది.
క్లాసులు సాయంత్రం 5.30 నుండి 7-30 వరకూ వుంటాయి.అందుచేత పగలు అప్పుడప్పుడు సంగీతాన్ని సాధన చేయాలనుకుంది.ఇప్పటికే నా పుస్తకాలకు ముఖచిత్రాలు పల్లవే వేస్తుంది .నాకే కాకుండా ఇంద్రగంటి జానకీ బాలగారికీ నాలుగు పుస్తకాలకు,మరొక కవికీ కూడా ముఖచిత్రాలు డిజైన్ చేయటం మొదలుపెట్టింది .ఉద్యోగం వత్తిడి లేకుండా తనకి ఇష్టమైన వ్యాపకాలతో పల్లవికి రానురాను కొంత ఆరోగ్యం కుదుట పడింది.
ఒకరోజు తెలుగు విద్యార్థి మాసపత్రిక సంపాదకుడు రమణగారు వచ్చారు.వాళ్ళపత్రికకు ఏదైనా రెగ్యులర్ గా రాయమని అడిగారు.నేను రిటైర్ అయిన దగ్గర నుండి మా స్కూల్ అనుభవాలను ఏదో ఒక రూపంలో రాయాలనే ఆలోచన వుంది.సరే రాస్తానని చెప్పాను.ముందు ఒక పదో పదిహేనో ఇస్కూలు కతలు పేరిట రాయాలనుకున్నాను. కానీ రాస్తున్న కొద్దీ అనేక విషయాలు మనసులో మెదిలి రాయటం కొనసాగించాను.వాటికి మంచి స్పందన వచ్చింది.ఎక్కడెక్కడ నుంచో స్కూల్ టీచర్లు ఫోన్లు చేసేవారు.కొంతమంది వాళ్ళు విద్యార్థులతో మాట్లాడించేవారు.నాకు భలే సంతోషం కలిగించేది.ఈ ఇస్కూలూ కథలు రెండున్నర ఏళ్ళ పాటు తెలుగు విద్యార్థి మాసపత్రికలో ధారావాహికంగా ప్రచురితమయ్యాయి.
ఇంకా రాస్తూ వుంటుండగానే మహారాష్ట్ర పాఠ్య ప్రణాళిక కమిటీ నుండి ఫోన్ వచ్చింది.మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో రెండవ భాష తెలుగు పాఠ్యాంశంగా నేను రాసిన ఇస్కూలు కథల్లోని " ఒకే తాను ముక్కలం" కథని ఎంపిక చేసుకున్నట్లు అంగీకారం కోరారు.మరో రాష్ట్రంలో విద్యార్థులు నా కథని పాఠంగా చదువుతారు అంటే అంతకన్నా ఆనందం ఇంకేముంది? ఆ కథలకు వచ్చిన గుర్తింపు వలన ఇస్కూలు కతలు ముఫ్ఫై కథలు పూర్తికాగానే ఉపాధ్యాయ రచయిత అయిన గంటేడ గౌరు నాయుడు గారి ముందు మాటతో ఉపాధ్యాయుడే అయిన చిన్నన్నయ్యకు అంకితం ఇస్తూ పుస్తకంగా వేసుకున్నాను.
వీర్రాజుగారు నా రచనలమీద ప్రముఖులు రాసిన మంచి వ్యాసాలు వున్నాయనీ వాటిని పుస్తకం రూపంలో తెస్తే బాగుంటుందని ఆలోచన చేసారు.వాటినన్నింటిని తీసీ క్రమపద్దతిలో చేస్తున్నప్పుడు ఒక కవి వచ్చారు.ఆయనతో ఆ వ్యాసాలు చూపించి పుస్తకంగా వేయాలనుకుంటున్నట్లు చెప్పారు.ఇంతవరకూ కవయిత్రుల సమీక్షావ్యాసాలసంకలనం రాలేదని ఆయన అభినందనలు తెలియజేశారు.కానీ ఇంకా నా పుస్తకం డీటీపీ అవుతుండగానే మరొకరిది ఆఘమేఘాల మీద అటువంటి పుస్తకం వెలువడటానికి కారణం కూడా తెలిసి మానవ స్వభావం గురించి వీర్రాజు గారూ నేనూ అనుకున్నాము.
అక్క కూతురు రంజనావాళ్ళూ అబ్బాయి అనురాగ్ ని హైదరాబాద్ లోని లో ఎంబిఎ లో జాయిన్ చేయటానికి వచ్చారు.కాలేజీ హాస్టల్ లో చేర్చారు.సెలవుల్లో మా ఇంటికి వచ్చేవాడు.అన్నరాకతో ఆషీకి సందడి వచ్చింది.ఎప్పుడైనా సెలవురోజున వేస్తే అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ హొటల్ కో సినీమాలో వెళ్ళేవారు
అనురాగ్ అలా ఇంట్లో తాత గారూ,అమ్మమ్మా అని తిరుగుతుంటే మాకూ సందడిగా అనిపించేది
పుస్తక ప్రదర్శనలో ఇంద్రగంటి జానకీబాలగారి
"నవలా ద్వయం "పుస్తకాన్ని,నా రచనలపై సమీక్షలు సంకలనం " గీటురాయి పై అక్షరదర్శనం"లను ప్రమదాక్షరి స్టాల్ లో ఆవిష్కరణ జరిగింది.శ్రీకాంతశర్మగారూ, వీర్రాజు గారూ,జగన్నాథ శర్మగారూ పాల్గొన్నారు.అదే సందర్భంలో జగన్నాథశర్మ "నవ్యకి ఓ మంచికథరాయకూడదూ" అన్నారు.
అదే మాటతో మొదలుపెట్టి "నిజానికీ అబద్ధానికీ మధ్య" కథ రాసి నవ్యకి పంపించగా ప్రచురించారు.
నడక దారిలో -57
నడక దారిలో -57
కాకినాడ నుంచి వచ్చాక విశేషాలన్నీ వీర్రాజు గారికి చెప్పి శ్రీదేవి మోనోగ్రాఫ్ రాయటానికి ఏ నిర్ణయించుకున్నట్లు చెప్పాను.
కాత్యాయని విద్మహే తన దగ్గర వున్న ఉరుములూ- మెరుపులు సంపుటి జిరాక్స్ కాపీ, కొంత సమాచారం పంపించారు.
ఈ విషయం రామడుగు రాధాకృష్ణ మూర్తి గారికి చెప్పాను. శ్రీకృష్ణదేవరాయ గ్రంథాలయంలో తెలిసిన అతను వున్నాడు ఈ అక్కడకు వెళ్ళి చూద్దాం అన్నారు.సరేనని శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం కి వెళ్ళాను.రాధాకృష్ణమూర్తిగారు కూడా వచ్చారు.
అక్కడ తెలుగు స్వతంత్రలు ఎక్కడ వుంటాయో తెలుసుకుని పాత పత్రికల అల్మారాలు చూపించారు.
అక్కడ అంతా దుమ్ము కొట్టుకుని వున్నాయి.ఆ అల్మారాలు వెతుకుతుంటే పది పన్నెండు తెలుగు స్వతంత్రపత్రికలు కలిపిన బౌండు పుస్తకాలు వున్నాయి.అటువంటి బౌండ్లు ఒకపదిపదిహేను వరకూ వున్నాయి.అయితే అప్పట్లో కెమేరా ఫోన్లు లేవు.అవి జిరాక్స్ చేయించడానికి వీలుగానూ లేవు.
వాటిని ఇంటికి ఇవ్వటానికి కుదరదు.అన్నారు.నాకు ఏంచెయ్యాలో తోచలేదు.దిగులుగా రాధాకృష్ణ మూర్తి గారి వైపు చూసాను.ఆయన అర్థం చేసుకుని భాషానిలయం ఇంఛార్జి ఎమ్.వి.ఎల్. నరసింహామూర్తిగారితో మాట్లాడి పూచీకత్తు మీద
సాధ్యమైనంత త్వరగా అవి తిరిగి జాగ్రత్తగా అప్పగించేలా ఉత్తరం రాసి నేనూ,అయినా సంతకాలు పెట్టి ఇచ్చాము.
నా అదృష్టం కొద్దీ పుస్తకాలు బౌండ్లు ఇచ్చారు.అవన్నీ సంచులలొ వేసుకొని ఆటోలో ఇంటికి వచ్చాను.అవి చూసి వీర్రాజు గారు ఆశ్చర్యపోయారు.
ఆ పుస్తకాలను తొందరగా ఇచ్చేయవలసి వుంది కనుక వాటిలోని శ్రీదేవి రచనలు ఎన్ని వున్నాయో నోట్ చేసుకున్నాను.ఒక్కొక్క బౌండులో శ్రీదేవి కథ, వ్యాసం చదివి కథాంశం,కథలోని విశేషాంశాలు,పాత్రలు వీటి గురించి వివరంగా నోట్స్ రాసుకున్నాను.
తెలుగు స్వతంత్రలలో ధారావాహికంగా వచ్చిన శ్రీదేవి రాసిన మధుకలశమ్ దీర్ఘ కావ్యం నన్ను అబ్బుర పరచింది.ఆమె రాసిన కాలాతీతవ్యక్తులు నవల తప్ప ఇంకే రచనా గురించీ ఎవరూ చెప్పలేదు.
వీర్రాజుగారి సంపాదకత్వంలో అరవైలలో ఏరినపూలు పేరుతో ఒక సంకలనం తీసుకువచ్చారు.అందులో ఒక కథ దొరికింది.నేను వందమంది కవయిత్రుల సంకలనం" ముద్ర" తీసుకు వచ్చినప్పుడు శ్రీదేవి కవితలను అక్కయ్య పంపింది.అవి తెలుసు.ఇప్పుడు ఈ పుస్తకాలు వెతుకుతుంటే 20 కథలు,20కవితలు ,వ్యాసాలూ కూడా దొరికాయి.నాకు భలే ఉత్సాహం కలిగింది.పరీక్షలకీ ప్రిపేరయ్యే విద్యార్ధినిలా పూర్తి సమయాన్ని ఈ నోట్స్ తయారు చేయటంలో కేటాయించాను.
ఆ సమయంలోనే మధుకలశమ్ ని పుస్తకంగా వేయాలనే ఆలోచన మాకు వచ్చి జిరాక్స్ చేయటం కుదరదు కనుక దానిని కాపీ చెయ్యమని వీర్రాజుగారిని కోరగా ఆయన అదంతా ఒక పుస్తకంలో కాపీ చేసి ఇచ్చారు.
కవితా ఖండికలు నేనే కాపీ చేసాను.అందుకని కవిత్వం నోట్స్ తర్వాత రాసుకోవచ్చని ఊరుకున్నాను.
ముందుగా కథలన్నింటికీ, సాహిత్య వ్యాసాలకు మాత్రమే నోట్స్ రాసాను.ఇవేకాక గోరాశాస్త్రి రాసిన నడుస్తున్న చరిత్ర పేరిట రాజకీయ వ్యాసాల్ని ఆసక్తి కొద్దీ చదివాను.ఆవీ బాగున్నాయి.మరొక విశేషం తెలుగు స్వతంత్రల్లో అక్కయ్య కథలు కూడా చాలా దొరికాయి.వాటినికూడా కాపీ రాసుకున్నాను.అంతకుముందు అక్కయ్యవి అంతకు ముందు రెండు కథలు సంపుటాలు వచ్చాయి.వాటిలో చేర్చని కథలు కూడా పుస్తకంగా వేయాలనే ఆలోచన వచ్చింది.ఆ విధంగానే ఆ కథలను తర్వాత " నాకుగాదులు లేవు" పేరిట అక్కయ్యకు నివాళిగా సంపుటిని ప్రచురించాము.
ఆ సందర్భంలోనే నాకు బాగా నచ్చిన శ్రీదేవి పెద్దకథ వాళ్ళు పాడిన భూపాలరాగం కథమీదే ప్రత్యేకంగా ఒక వ్యాసం రాసాను.ఆ వ్యాసం సారంగపత్రికలో ప్రచురితమైంది.
శ్రీదేవి జీవితం గురించి ఏ వివరాలు తెలియవు .అక్కయ్య వున్నట్లైతే కొంత రాయగలిగేదాన్ని.మామయ్యని అడిగాను కానీ పెద్ద వయసు వల్ల ఏమి గుర్తు లేదన్నాడు.శ్రీదేవికి స్నేహితురాలైన నాయని కృష్ణకుమారిగారు కూడా లేరు.
కె.రామలక్ష్మికూడా మద్రాసులో తెలుగు స్వతంత్రకు కొంతకాలం ఉపసంపాదకత్వం వహించారు కనుక ఏమైనా చెప్పగలరేమో అని ఆమె దగ్గరకు ఒకసారి వెళ్ళి అడిగాను." నన్ను అడుగుతే నెగిటివ్ గానే చెప్తాను.మరి చెప్పమంటావా"అన్నారు.వద్దులెండి అని మాట మార్చేసాను.
ఇక ఆ తర్వాత నాకు తెలిసినంతవరకూ శ్రీదేవి జీవితం గురించి రాసి తర్వాత ఆమె రచనల ఆధారంగా ఆమె స్వభావం,వ్యక్తిత్వాన్ని చిత్రించాలని నిర్ణయించుకున్నాను.
వీర్రాజుగారు తాను వేసిన చిత్రాలను ఎక్కడైనా ప్రదర్శనకు పెట్టాలని అభిలషించారు.ముందు మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీ లో అనుకున్నారు కానీ అంతదూరం రోజూ వెళ్ళటం కష్టం అనుకున్నారు. ఆఖరుకు రవీంద్రభారతి ఆవరణలోనే వున్న కళాభవన్ లో నిర్ణయించారు.జనవరి 24 ( 2013)న బి.ఎ.రెడ్డి గారితో శీలా వీర్రాజు చిత్రకళా ప్రదర్శన ప్రారంభోత్సవం చేయించారు.జనసాహితి మిత్రులు ఈ కార్యక్రమంలో చాలా సహకారం అందించారు.జనసాహితి మిత్రుడు రాజూ ముందుగా వచ్చి అక్కడ కూర్చునేవారు.నాలుగింటికి మేమంతా వెళ్ళి తొమ్మిది వరకూ వుండేవాళ్ళం.అయిదు రోజుల పాటూ జరిగిన చిత్రప్రదర్శనకు చాలా మంచి స్పందన వచ్చింది.ఆ సందర్భంలో వీర్రాజుగారి పెయింటింగ్స్ పుస్తకాలు కూడా కొన్ని అమ్మకం కావటం సంతోషం కలిగించింది.వీర్రాజుగారికి తాను వేసిన చిత్రాలకు వచ్చిన స్పందన చాలా సంతృప్తి కలిగించింది.
ఆ సమయంలోనే ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు ఒకేసారి రెండు సంవత్సరాలకు ప్రకటించి,అవార్డు సభ కూడా జరిగింది.నేను అప్పుడే కొత్తగా ఫేస్బుక్ అకౌంట్ తెరిచాను.ఒకరోజు ఫేస్బుక్ లో ఒక కవి పెట్టిన పోస్ట్ కనిపించింది.
"ఫ్రీవర్స్ ఫ్రంట్ కి ఆంధ్రా ఫ్రీవర్స్ ఫ్రంట్ అని పేరు మార్చుకుంటే సరిపోతుంది."అని రాసి ఒక ఏడెనిమిది మంది తెలంగాణా కవుల పేర్లు రాసి వీళ్ళకు అవార్డు తీసుకునే అర్హత లేదా అని ప్రశ్నసంధించాడు.
అది చదివేసరికి చాలా చికాకు వచ్చింది.అతను రాసిన పేర్లలో ఒకరిద్దరికి ముఫ్ఫైనలభైఏళ్ళక్రితమే ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు వచ్చింది.ఆయన రాసిన జాబితాలో ఇంచుమించుగా అందరూ ఫ్రీవర్స్ ఫ్రంట్ అందుకున్నవారే.ఒకరికి మాత్రమే అనుకుంటాను ఈ అవార్డు రాలేదు.తెలిసీ తెలియకుండా నిందమోపుతూ రాయటం మాకు కోపం వచ్చింది.
వీర్రాజు గారు చెప్పిన వివరాలతో ఆయన గోడమీదే ఘాటుగా స్పందించాను.దాంతో ఆ పోస్ట్ ను తీసివేసాడు ఆయన.నిజానికి ఒక ఆంధ్రాకవి కవిత్వం మీద ఆయనే పుస్తకాలు రాసాడు.
ఈ రకమైన విద్వేషాల వలన సాహిత్యం సార్వజనీనం అనేది పొరపాటేమో అనే సందేహం నాకు కలిగింది.ఎక్కడో విదేశీ కవులను,ఇతర భారతీయ సాహితీవేత్తలను గూర్చి గొప్పగా మాట్లాడేవాళ్ళు మరో ప్రాంతం తెలుగు కవిని ద్వేషించటంలో అర్థం లేదనిపిస్తుంది.
ఆరోజు ఫిబ్రవరి 21(2013)వతేదీ పల్లవి ఆఫీసునుండి బయలుదేరి గంట దాటింది.ఇంకా రాలేదు.ఆ సమయంలో కోణార్క్ థియేటర్ ఎదురుగా ఉన్న ఆనంద్ టిఫిన్స్ ప్రాంతంలో ఒకటి రెండవ బాంబు వెంకటాద్రి థియేటర్ , దిల్సుఖ్నగర్ బస్టాండ్ ప్రాంతంలో మరొకటి బాంబు పేలుళ్ళు జరిగాయని టీవీలో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది.మాకు భయం వేసింది.పల్లవికి వెంటనే ఫోన్ చేసాను.సరిగ్గా ప్రేలుడు జరిగిన పది పదిహేను నిముషాలకే పల్లవి ఎక్కిన బస్ ఆ ప్రాంతాన్ని దాటిందట.ఏమిటొ అంతా గందరగోళంగా వుంది బస్ ఆపకుండా దాటేసాడు అని అంది. మరో అరగంటకి ఇంటికి చేరింది.మేము గాఢంగా వూపిరి తీసుకున్నాము.పెద్ద ప్రమాదం తప్పింది.
హైదరాబాద్ పోలీసుల చెప్పినదాని ప్రకారం , బాంబులను సైకిళ్లపై ఉంచారనీ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ (IEDలు) ఉపయోగించారని అన్నారు. ఈ ప్రమాదంలో 18 మంది పైగా మరణించగా అందులో నలుగురు వరకూ విద్యార్థులే నట. ఆ ప్రాంతంలో చాలా స్టూడెంట్ హాస్టల్స్ వున్నాయి.చాలామంది గాయపడ్డారని తెలిసింది.
కొంతకాలం వరకూ హైదరాబాద్ అంతా భయంతో వణికి పోయింది.చాలాకాలం వరకూ ఆ ప్రభావం జన జీవనంలో కనిపించింది.
వీర్రాజుగారు కుందుర్తి సత్యమూర్తికి అంకితంగా " ఒక అసంబద్ధనిజం "అనే కవితా సంపుటి ప్రచురించుకొన్నారు.వీర్రాజుగారి డెబ్భై అయిదవ పుట్టినరోజు పురస్కరించుకుని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేసారు.వేదికమీద సాహితి వేత్తలు లేకుండా ప్రత్యేకంగా జరిగింది.కవితాసంపుటిని చిన్ననాటి స్నేహితుడు కుందుం ప్రకాశరావుగారితో ఆవిష్కరింపజేసారు.చెక్కుచెదరని అరవై ఏళ్ళ స్నేహాన్ని ప్రకటించుకుంటూ మిత్రులు రామడుగు రాధాకృష్ణ మూర్తిగారికి,మల్లేష్ కు, బాలాజీ ప్రెస్ బాల ప్రసాద్ కు పదిహేను వేల నగదు ,వస్త్రాలతో గౌరవించారు.కవితాసంపుటి అంకితం కుందుర్తి సత్యమూర్తిగారి శ్రీమతి కుందుర్తి శాంతకు అందజేసారు.తర్వాత ఆవిష్కృతసంపుటిలో నుండి కొన్ని కవితలు వీర్రాజుగారు చదివారు.వినూత్నంగా జరిగిన ఆ సమావేశానికి చాలామంది కవులు,రచయితలూ హాజరయ్యారు.
ఆ విధంగా వీర్రాజు గారి డెబ్భై అయిదవ పుట్టినరోజు ,యాభై ఎనిమిదేళ్ళ సాహిత్య జీవన సందర్భం విజయవంతంగా జరిగింది.
దశాబ్దాల తెలంగాణా పోరాటం సాకారమైంది.
2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించగా,లోక్సభలో ఎన్నో నాటకీయ పరిణామాలు అనంతరం 2014 జూన్ 2వ తేదీన దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణా రాష్ట్రం నూతనంగా అవతరించింది.రాష్ట్రం అంతటా పండుగ వాతావరణం నెలకొంది.దేశస్వాతంత్రంవచ్చిన నాటికి నేను పుట్టలేదు.ఆంధ్రరాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికి చిన్నదాన్ని. సుదీర్ఘ పోరాట ఫలితంగా రాష్ట్రం సాధించుకోవటాన్ని ఈ నాడు చూసాను.
పోనీలే తెలంగాణ వారు కోరుకుంటున్నట్లు రాష్ట్రం ఏర్పడింది.ఇంక వైషమ్యాలు ,ద్వేషాలు తగ్గుతాయి.ఎవరి రాష్ట్రం వాళ్ళకు వచ్చింది. అనుకున్నాం .
జనరల్ ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో గెలిచినవి రెండే పార్టీలు.విభజన ప్రక్రియలో భాగస్వామ్యం వున్న కాంగ్రెస్ ,బీజేపీలను మట్టిగరిపించారు. దాంతో కాంగ్రెస్ పెద్దలు కండువాలు మార్చేసారు.
తెలంగాణాలో 119 సీట్లకు63 సీట్లవిజయం సాధించి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది.ప్రతిపక్షపార్టీగా కాంగ్రెస్ నిలిచింది.టిడీపీ15 సీట్లతో మూడో స్థానం లో నిలిచింది.బీజేపి, వైకాపా, కమ్యూనిస్టు పార్టీల నుండి కూడా బాగానే గెలిచారు. కానీ తర్వాత్తర్వాత ఒకరొకరే ఆపరేషన్ ఆకర్ష్ లో సమిధలై అధికార పార్టీలోకి దూకేసారు.
15వ లోక్సభ ఎన్నికలు 2014 మే 31న పూర్తి చేసి మే 16న ఫలితాలు ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ (BJP) 282 సీట్లను గెలుచుకోగా, (NDA) మొత్తం 336 సీట్లను గెలుచుకుంది. 1984 తర్వాత ఒక పార్టీ ఇతర పార్టీల మద్దతు లేకుండా పరిపాలించడానికి తగినంత సీట్లు గెలుచుకోవడం ఇదే మొదటిసారి.కాంగ్రెస్ కేవలం 44 సీట్లను మాత్రమే గెలుచుకుంది,
ఆవిధంగా మిగులుఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు, తెలంగాణా రాష్ట్రానికి కేసీఆర్ తొలి ముఖ్యమంత్రులుగా,ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ తొలిసారి ప్రమాణస్వీకారం జరిగింది.
ఒకరోజు హైమవతీ భీమన్న గారి నుండి వీర్రాజు గారికి ఫోను వచ్చింది.
" పద్మభూషణ్ బోయి భీమన్న సాహితీ పురస్కారానికి వీర్రాజుగారిని ఎంపిక చేసినట్లు చెప్పారు. సెప్టెంబర్ 19వ తేదీన తెలుగు విశ్వవిద్యాలయంలోని బోయి భీమన్న సాహితీ పీఠం ఆధ్వర్యంలో జరిగే భీమన్న 104వ జయంతి ఉత్సవంలో డాక్టర్ సి.నారాయణరెడ్డికి బోయి భీమన్న జీవన సాఫల్య పురస్కారం క్రింద రెండు లక్షలూ, పద్య కవితా పురస్కారానికి రసరాజు, గేయ కవితకు గూడ అంజయ్య, వచన కవితకు శీలా వీర్రాజు, నాటకానికి పాటిబండ్ల ఆనందరావు, కథ,నవలకు కేశవరెడ్డి, అనువాదానికి నలిమెల భాస్కర్, ఉత్తమ రచయిత్రి పురస్కారానికి పి. సత్యవతి లకు లక్ష రూపాయలు చొప్పున అందజేసారు.
వీర్రాజుగారి సంతోషానికి అవధులు లేవు.తొలిసారి బహుమతిగా లక్ష అందుకోవటం అంటే మాటలు కాదు కదా.
తర్వాత దగ్గరలోనే చలసాని వసుమతిగారి అవార్డు కూడా వీర్రాజు గారికి వచ్చింది.కారులో అందరం బయలుదేరాం.మంచిహొటల్లో మాకోసం రెండు రూములు బుక్ చేసారు.ఆ రోజు సాయంత్రమే సభ.వీర్రాజుగారితో పాటూ విహారిగారికి కూడా మరో ఏడాదికి ఇచ్చారు.పురస్కారసమావేశం,భోజనాలు పూర్తై వచ్చేసరికి ఆలస్యం అయ్యింది.వచ్చి పడుకున్నాం.మర్నాడు విజయవాడ పరిసరాలు చూసేందుకు బయలుదేరాం.దుర్గగుడికి ముందు వెళ్ళాం.చాలా రెష్ గా వుంది .నేనూ,పిల్లలూ లోపలికి వెళ్ళాం.వీర్రాజుగారు లోపలికి రాలేదు.దారిలో భోంచేసి మంగళగిరి, అమరావతి వెళ్ళాము.దారిలో తుళ్ళూరు,తాడేపల్లి మొదలైన తోవలలో చేలల్లో నిలువెత్తు కంకులతో పైర్లను చూసి కారును ఆపించి
ఫొటోలు తీసుకున్నాము.ఎప్పుడూ అలా చేలూ, పైర్లు చూడలేదేమో ఆ పచ్చదనానికి సరదాపడి మైమరచిపోయాము.
ఇక ఆ మర్నాడు వసుమతి గారి ఇంటికి వెళ్ళి అక్కడే భోజనం చేసి హైదరాబాద్ కి తిరుగుముఖం పట్టాము.
ఇంటికి చేరిన మరురోజు వార్తలు వింటున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తుళ్ళూరు,అమరావతి ప్రాంతాన్ని నిర్ణయించినట్లు చెప్పేసరికి నిన్న ఆ ప్రాంతాల్లోనే తిరిగాము కదా అని థ్రిల్లింగ్ గా అనుకున్నాము.
మళ్ళా అనుకోకుండా దగ్గరలోనే ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్ గారు తమ సంస్థ ద్వారా బాపురమణల పురస్కారం వీర్రాజుగారికి ఇవ్వాలనుకుంటున్నామని ఆహ్వానించారు. ఈ సారి నేనూ, వీర్రాజు గారు విజయవాడ వరకూ ట్రైన్లో వెళ్ళాము.స్టేషనుకు గుత్తికొండ సుబ్బారావుగారు వచ్చి కారులో మచిలిపట్నం వాళ్ళింటికి తీసుకు వెళ్ళారు.సాయంత్రం ఉయ్యూరు సభా సమావేశానికి తీసుకు వెళ్ళారు.దుర్గాప్రసాద్ గారు చాలా ఆత్మీయంగా సత్కరించారు.దుర్గాప్రసాద్ గారికి మా పుస్తకాలు ఇచ్చాము. ఆశ్చర్యకరంగా కొన్ని రోజులకే దుర్గాప్రసాద్ గారు మా పుస్తకాలపై సుదీర్ఘ విశ్లేషణలు రాసి వారి బ్లాగ్ లో పోస్ట్ చేసారు.
మర్నాడు సుబ్బారావు గారు మమ్మల్ని పరిసర ప్రాంతాలైన ఘంటశాల, శ్రీకాకుళం తీసుకు వెళ్ళి అన్ని చూపించారు.
అనంతరం సాయంత్రం ట్రైనుకు మమ్మల్ని
తిరుగు ప్రయాణానికి స్టేషన్లో బండి ఎక్కించారు.
ఛాయా రాజ్ నవల" కారువాకి"
పూర్వ కళింగుల జీవన అద్భుతం "కారువాకి" నవల
"ఛాయరాజ్ విశిష్ట కవిత్వవ్యక్తిత్వానికి అద్దంపట్టే రచన 'కారువాకి' నవల. పూర్వ కళింగుల మహత్తర జీవన ప్రస్థానం మనకు అద్భుతంగా సాక్షాత్కారమై అనుభూతి కావడమే కారువాకి నవల సాధించిన విజయానికి సాక్ష్యం. కావ్య ఇతివృత్తం ఒక చారిత్రక వాస్తవం . "అంటారు బి.సూర్యసాగర్ గారు కారువాకి ముందు మాటలో.
ఒకచారిత్రక నవలని పరిచయం చేయడం కష్ట సాధ్యమైన పని. ఎందుకంటే కథాకాలం నాటి చరిత్రలతో మమేకమౌతే గాని ఆ నవలని ఆస్వా దించలేము.
ఛాయారాజ్ గారి కళింగ యుద్ధకాలం నాటి పూర్వ కళింగుల జీవన అద్భుతాన్ని ఒక ప్రవాహసదృశంగా చిత్రించిన " కారువాకి " నవలని చదివిన తర్వాత దాని గురించి కొంతైనా చెప్పాలనిపించింది.
నవల ఆసాంతం కవితాత్మకంగా సాగుతుంది. అనేక చోట్ల గొప్పప్రకృతి వర్ణనలు పాఠకులను ఆకట్టుకుంటాయి .
క్రీపూ నాటి శిలాశాసనాల నుండి సేకరించిన సమాచారాన్ని, స్కంద పురాణం,మత్స్యపురాణం
మొదలైన ఐతిహాసిక గ్రంధాల నుండే సేకరించిన ఉపకథలతో, ఉటంకింపులతో ఈ నవల సాగుతుంది
వంశధార, నాగావళి,జంఝూవతీ నదులు ,సరయూ, తమసా, గోమతీ ఇలా అనేక నదుల పరివాహక ప్రదేశముల గురించి నదుల నడకలతో గలగల జల జలా ప్రవాహసదృశంగా నవల ఆసాంతం నడుస్తుంది.
మహాభారతం లోని భీష్మపర్వం ఆధారంగా కురుక్షేత్రంలో కళింగులు అర్జునునితో, కృష్ణునితో పోరాడి క్షత్రియులయ్యారనే ఉటంకింపును తెల్పారు. జాతక కథల నుండి ,మహావంశము నుండి ఉపోద్ఘాతము, కళింగ బోధి, ఎఫ్.కొరోవ్కిన్ ' ప్రాచీన ప్రపంచ చరిత్ర'నుండి,రాహుల్ సాంకృత్యాయన్ రచనలే కాక రామాయణం సందర్భాలను ఆయా గ్రంధాలనుండి అవసరమైనంత మేరకు రచయిత ప్రస్థావన చేసారు.
ప్రధానంగా 'కారువాకి' నవలలో ఇతివృత్తం పూర్వకళింగుల జీవితచిత్రణ.
సూర్యసాగర్ గారు నవలకు ముందుమాటలో
అనేక విషయాలు ప్రస్తావించారు."గురజాడ 'కళింగదేశ చరిత్ర'ను రాయటానికి సంకల్పించగా దాన్ని ప్రచురించబోతున్నట్లు కొమర్రాజు లక్ష్మణరావు ప్రకటించారనీ ,అయితే గ్రాంధికభాషలో రాయాలనే కొమర్రాజు షరతుని గురజాడ నిరాకరించి, కళింగ చరిత్ర రాయటమే విరమించుకున్నారనీ తెలియజేసారు.
తర్వాత రాళ్ళబండి సుబ్బారావు రచించిన 'కళింగదేశ చరిత్ర' మూలాధారంగా 'కారువాకి' నవలను రాసినట్లు ఛాయరాజ్ చెప్పుకున్నారు.
కళింగ దేశ చరిత్ర ఆధారంగా కళింగ (కలిగంగ) ప్రజలలో ఎన్ని రకాల జాతులున్నాయి, వారి జీవన విధానం ఏమిటి అది నవలకు అవసరమైనంత వరకూ ఛాయారాజ్ గ్రహించి నవలలో పొందుపరచారు. కళింగులు అనేది సార్వజనీనంగా వూహించుకుంటాం. కానీ అందులోనే అనేక గిరిజనజాతులే కాక కోమట్లు , బ్రాహ్మలు కూడా వుంటారనేది తెలిసింది . బహుశా వివిధవృత్తులను అనుసరించి విభిన్నజాతులుగా గుర్తించే వారేమో.
అనార్యజాతిగా పరిగణించబడిన కళింగ ప్రజలు ఆర్యులపై తిరుగుబాటులు చేసి, ఆర్యసంస్కృతిని వ్యతిరేకించి, ఆదిమవాసుల జీవనవిధానాన్ని, సంస్కృతిని అనుసరించే స్వతంత్ర ప్రజలుగా రచయిత కధనం చేసేటప్పుడు పలుమార్లు అక్షరీకరిస్తారు.
హిమాలయాల పుట్టుకంత ప్రాచీనచరిత్ర గల ప్రజలనీ, భూమిమీదేకాక జల సంపదలతో పెనవేసుకున్న వారైన కళింగ ప్రజలు అమిత సాహసికులనీ పాఠకులకు తెలుస్తుంది
కళింగ స్త్రీలు(కారువాకులు) కూడా ధైర్యసాహసులు. పురుషులతో సమానంగా ప్రతీ పనిలోనూ, పోరాటాలలోను యుద్ధాలలోను పాల్గొంటారు. స్త్రీలపై దుర్మార్గాలను సహించరు .స్వాతంత్య్రప్రియులైన కళింగులు
అధికారాన్ని కోరుకోరు . అధిపత్యాన్ని అంగీకరించక పోవటమేకాక రక్తతర్పణలు చేయడానికైనా సిద్ధపడతారంటారు రచయిత .
క్రీపూ268 నాటికి అశోకుడు విజయకాంక్షతో. సోదరులను అడ్డుతొలగించుకొని కారునలుపుతోనున్న స్వచ్ఛమైన కళిగంగానది నీళ్ళలో కాళ్ళు కడుక్కుంటూ "కారువాకి" అనే మత్య్సకన్యని చూసి ఆమె సౌందర్యానికి విస్మయుడై ఆమెని ఎత్తుకుని వెళ్తాడు. మొదట అతనిని ప్రతిఘటించినా తుదకు అతని సౌందర్యానికి ,ప్రేమకి లొంగిపోతుంది ఆ నదీకన్య..
అనటంలో కారువాకి ప్రసక్తి వచ్చినప్పుడలా నవలలో నదిప్రవాహ సౌందర్యంతో రచయిత పోల్చుతూ రాయటం వలన నవల ఆ సాంతం పాఠకులకు ప్రవాహ అలల గలగలలు వినిపిస్తుంది.
నిజానికి పచ్చని ప్రకృతి,నదీప్రవాహం మీదుగా వీచే స్వచ్ఛమైన మందపవనాలూ,అలల గలగలలూ నవల చదువుతున్నంతసేపూ పాఠకుల హృదయాన్ని తాకుతూనే వుంటాయి.కళింగయుద్ధ దండయాత్ర నుండి నవలలో కళింగుల ఆత్మవిశ్వాసం,పోరాటపటిమ ,ఆ నాటి యుద్ధ తంత్రాలు ఆశ్చర్యం గొలుపుతాయి.
బ్రాహ్మణుడి వద్ద విద్యనభ్యసించి, గ్రంధాలను అధ్యయనం చేసిన కారువాకి ప్రేమతత్త్వం మాత్రం అశోకునితో అనుబంధం వల్లనే తెలుసుకోగలిగింది.
ప్రకృతికి, సమాజానికి మనిషి అవసరమెందుకో అశోకుడు చెప్పినప్పుడే అర్థమైంది.
అటువంటి అశోకుడు సామ్రాజ్య కాంక్షతో సోదరులను చంపటంగానీ,కళింగులపై దండయాత్రలు గానీ ఎందుకు చేస్తున్నాడో మాత్రం ఆమెకు అర్థం కాలేదు.
కారువాకి రాణివాసం నుండి బయలుదేరి
రాజభవనాల్ని చూస్తుంది. చక్రవర్తి ఖజానాని ఇతర గిడ్డంగులనూ దర్శిస్తుంది. రాజ్యసంబంధిత విషయాలను రక్షణసిబ్బంది నడిగి తెలుసుకుంటుంది .కళింగులపై దండ యాత్ర గురించిన సమాచారం తెలుసుకుంటున్న సమయంలో అశోకుడు వస్తాడు. "నాపై ప్రేమ బహుజన ప్రయోజనకారి కావాలి కదా ఈ దండయాత్రలు ఏమిట"ని ప్రశ్నిస్తుంది
చక్రవర్తి సామ్రాజ్యా కాంక్షకు, కళింగుల స్వేచ్ఛకు వైరుధ్యం వుందని తెలుసుకున్న కారువాకి తన శరీరానికి ఆలోచనలకూ మధ్య సంఘర్షణలో నలిగి పోయి అశోకుని సామ్రాజ్యకాంక్షని కళింగులు తుదముట్టించగలరా అనే ఆవేదనతో అశోకుని వక్షస్థలం పై సొమ్మసిల్లి పోతుంది.
" కళింగ దేశానికి ఉత్తరాన మహానది, లేక వైతరణి, దక్షిణమున నాగావళి, తూర్పున సముద్రం, పశ్చిమాన తూర్పుకనుమలు ఎల్లలుగా ఉంటాయి.
కళింగదేశం పశ్చిమం నుండి తూర్పునకు ఏటవాలు గా వుండటం వలన సువర్ణరేఖ, వైతరణి, బ్రాహ్మణీ, తెలివాహ, మహానది, ఋషికుల్య, వంశధార, నాగావళి నదులు తూర్పు సముద్రం వైపు ప్రవహిస్తాయి " అన్నది చదివాక ఆనాడు ఆ ప్రాంతం ఇన్ని నదీప్రవాహాలతో ఎంత సస్య శ్యామలంగా వుండేదో అనిపించింది.
అదికూడా నవలలో చెప్పారు రచయిత.
ధాన్యము, మెట్టపంటలు, పత్తి పంటలు ,తీయని పండ్లు ,సన్న నూలు ఎగుమతి చేసేవారని రచయిత చెప్తూ ఈజిప్టు, గ్రీసు, రోము దేశాలతో వాణిజ్య సంబంధాలు ఉండేవనేది పాఠకులకు అబ్బురం కలిగిస్తుంది..
ఇక కళింగ యుద్ధసన్నాహం చూద్దాం,--
కళింగ దేశానికి గల సైనిక బలాన్ని, యుద్ధానికి తగు సమయాన్ని శీతాకాలం అనుకూలమని అశోకుడు నిర్ణయించుకున్నాడు.
మౌర్యసైన్యాలన్నీ దండయాత్రలో నలువైపుల నుండి కళింగ వైపునడిపించి మోహరిస్తున్నాయి. వాటిని ప్రతి ఘటించేందుకు ప్రజా సమూహలు దూసుకు వెళ్తుంటాయి.
" రంకెలు వేసి సైన్యాన్ని కొమ్ములతో కుమ్మేందుకు ఎద్దులకు కళింగ ప్రజలు తర్ఫీదు ఇస్తారు. బొంగులతో పిచికారు యంత్రాలు తయారు చేస్తున్నారు, కారంతో నింపిన కర్ర గొట్టాలను, దురద గొండ నుసిని మూటలు కడుతూ ఆయుధాలుగా తయారు చేస్తున్నారు కళింగ మహిళలు .. రెల్లుదూది పింజలను కళ్ళలోనికే కొట్టే ఈటల్ని బాల కాళింగులు. " అంటూ ప్రజాసమూహాలు యుద్ధానికి సన్నద్ధమయే తీరును రచయిత వివరిస్తారు.
కళింగ దేశం దిశగా యుద్ధసన్నద్ధమై సామ్రాజ్య కాంక్షతో తరలివెళ్తున్న అశోకుడు మార్గమధ్యంలో ఒక బౌద్ధ భిక్షువుని సందర్శిస్తాడు.
భిక్షువుకి ప్రణమిల్లి తిరిగి లేచి అశ్వాన్ని అధిరోహించి, ముఖాన్ని తాకుతున్న సూర్యకిరణాల్ని తుడుచుకుంటూ, సైన్యం వెంటరాగా, తూర్పుదిక్కుగా బయలుదేరుతాడు అశోక చక్రవర్తి.
కళింగ ప్రజలు ఆత్మాహుతి కైనా సిద్ధపడుతున్నారుకానీ యుద్ధభూమిని వదలకపోవటం చక్రవర్తికి విస్తుగొలుపుతుంది.మౌర్యసైన్యాలపై కళింగులకంత ద్వేషమెందుకో చక్రవర్తికి అర్థం కాలేదు.తన సైన్యం చేసే అకృత్యాలు గమనించినప్పుడే కదా అటువంటివి అర్థమయ్యేది.
కళింగదేశం నేలంతా నెత్తురు బురదగా మారిపోయింది. కళింగ, మౌర్యసైనికుల నెత్తురులతో కళింగ దేశమంతా రక్తపుమరకలతో నిండిపోయింది .
కళింగ తీర ఇసుకదిబ్బలలో తుపాను రేగి కళింగతీర ప్రజల కళేబరాలను భూమిలో కప్పివేసింది.
కళింగ శరీరనాడులను గాలి శ్రుతిచేసి విప్లవగీతాలాలపించింది.
తుళ్ళిన నెత్తురుతో తడిసిన కళింగ ఆకాశం లో మేఘం తాటికాయలంత ఎర్రనిచినుకులను కురిసి మెరిసి నేలపై రక్తాన్ని ముద్దాడింది.
కళింగ రక్తం ఎదుట తలదించుకుని, కళింగ దేశానికి చక్రవర్తిగా ప్రకటించబడి, అశోకుడు అన్యమనస్కుడై నయనాలను బలంగా మూసుకున్నాడు.
సూర్యుడు మధ్యభారత కళింగనేలనే అస్తమిస్తున్నట్టు భావించాడు అశోకుడు.చీకట్లు కమ్ముతున్నాయి,మూర్చిల్లిన అశోకుడి శరీరాన్ని శ్వేతాశ్వం జాగ్రత్తగా మోసుకుపోతోంది.-- రచయిత
ఈ విధంగా కళింగయుద్ధ విధ్వంసాన్ని వర్ణించటం ఎలా వుందంటే --
సూర్య సాగర్ అన్నట్లుగా " విశాల ప్రదేశంలో జరిగిన కళింగయుద్ధ బీభత్సాన్ని పరిమిత పేజీల ఆవరణలో దృశ్యమానం చేశాడు ఛాయరాజ్. వెండితెరపై కూడా యిమడలేని దృశ్యాలను అక్షరాలలో బంధించాడు."
అనేది నవల చదువుతున్నంతసేపూ పాఠకులు కూడా అనుభూతి చెందుతారు.
నవల ముగింపులో "ప్రజలే నిజవీరులు. ప్రజలే నిర్మాతలు. ప్రజలు ఎన్నడూ దుర్మార్గులు కారు. వ్యవస్థలలోని ప్రజల పక్షం, వారి శ్రమపక్షంగా రచయిత చూడాలి. 'కళింగుల' పాత్రను అలా చూసాను నేను. "అని ఛాయరాజ్ గొప్ప ఆశావహ దృక్పధాన్ని వ్యక్తం చేశాడు.
ఛాయా రాజ్ యుద్ధంతో కేవలం కథాంశాన్ని ముగించి వూరుకోలేదు.తర్వాత వారసులు ఎంతకాలం పరిపాలించారో తదితరవిషయాలన్నీ
వెల్లడించారు.
చివరగా "ఈ నవల రాస్తున్నప్పుడు ఒక్కొక్కసారి భావం ప్రధానమైపోయి భాష ముద్దకట్టుకు పోయింది.ఒక సామాజిక చరిత్రను రాయటానికి భాషతో చిత్రలేఖనం చేయవలసి వచ్చింది" అని ఆయన చెప్పుకున్నమాట అక్షరాలా నిజం.
వెలిసి పోయిన మహాకావ్యం -2
~ వెలిసిపోయిన మహాకావ్యం ~
పొద్దున్నే నిదురను రెప్పలతో విసిరికొట్టి
కళ్ళకు భూపాలరాగాన్ని హత్తుకొని
నీకు మేల్కొలుపు పాడేది ఎవరనీ
వంటింట్లో కచ్చేరీని "కాఫీ" రాగంతో ప్రారంభించి
చిరునవ్వు మేళవింపుతో కప్పు అందించేది ఆమెనే
డాబా పైన నిలుచుని నీదైన సమయాన్ని
యోగాసనాల్తో కరిగించుకుంటూ
దూరాన కొండల్ని చూస్తుంటే
నీతోడి జీవితం నల్లేరుపై నడకేనని
నున్నటి రాజమార్గం మీద జీవితాన్ని కలల్నికంటూ
నీ చేయి అందుకున్నదెవరనీ తలచేవా
ఆ పైన విశాలాకాశంలో
మబ్బులతో పోటీ పడుతోన్న
ఆశల్నీ,ఆకాంక్షల్నీ అలంకరించిన
అందమైన గాలిపటాలేనాడైనా
నువ్వు ఎగరేసిన చూపుల కొసకు చిక్కుకుని
ఆమె గుండెవూసుల్ని గుసగుసలుగా చెప్పలేదా
నదీ పాయవెంబడి ఏనాడైనా నడిచావా
ఒద్దికగా నడిచే సెలయేరు బండరాయి తగిలి
చెంగున గెంతినప్పుడు నెచ్చెలి కాలిమువ్వ
నీ గుండెలో గిలిగింతలతో సన్నగా శబ్దించలేదా
సముద్రతీరంలో విహరించినప్పుడు
బడబానలాన్ని దాచుకుని లోలోన జ్వలిస్తూనే
నిగూఢమైన నిర్మలమైన గాంభీర్యంతో
అలల చిరునవ్వుల్ని విరజిమ్మే సముద్రం
నీ నట్టింటే నడయాడుతోందని ఏనాడైనా గుర్తించావా
నీ ఇంటినిండా వెన్నెల కళ్ళాపి చల్లి
పూలగంధాలతో రంగవల్లులు దిద్దిననాడు గానీ
నీ దేహార్తిని చల్లార్చి నీ వంశాన్ని తీర్చి
చాకిరీతో కొవ్వొత్తై కరిగి పోయిననాడు గానీ
నీ జీవితావరణం అంతటా నిండి వున్నది కాస్తా
అకస్మాత్తుగా అదృశ్యమైనప్పుడు గానీ
ఆమె విలువ గుర్తింపు లోనికి రాదు
ఇంక అప్పుడు ఎంతగా కుళ్ళి కుళ్ళి ఏడ్చి
అక్షరంగా ప్రవహిస్తే మాత్రం ఏం లాభం
ఆమె జీవించి వున్నప్పుడే
నీవు లేని చోటేదీ లేదని హత్తుకొని వుంటే
జీవితం అందమైన మహాకావ్యమయ్యేది కాదా
21, అక్టోబర్ 2025, మంగళవారం
సామాజిక సంబంధాల దృశ్యాలే జయంతి కథలు
~సామాజిక సంబంధాల దృశ్యాలే జయంతి కథలు ~
కథ కేవలం కాలక్షేపానికి చదువుకునేలా మాత్రం ఉండకూడదు. కథానిక పుట్టిన గతవందేళ్ళకాలంలో ప్రముఖులకథల్ని పరిశీలిస్తే సింహభాగం కథలన్నీ ఆయాకాలపు సమాజం యొక్క తీరుతెన్నుల్నీ, జీవనవిధానాల్నీ ప్రతిబింబించేవి గానే ఉన్నాయి.
కాలక్రమేణా సమాజంలో వచ్చే మార్పుల్ని,ప్రజలజీవనవిధానాల్నీ,మనిషి మనస్తత్వంలో మారిపోతోన్న స్వార్థాన్నీ,అహంకారాల్నీ అన్నింటినీ ఆయాకాలాలలో వచ్చే సాహిత్యం ఎప్పటికప్పుడు ఒడిసి పట్టి చూపింది.
జయంతి రాసిన అటువంటి కథలన్నీ ఎక్కువగా సంభాషణాత్మకంగానే నడుస్తాయి.కథాగమనంలో ఎక్కడా ఉపన్యాసాలు,నీతి బోధలు,సాగతీతలూ ఉండవు.తీసుకున్న అంశాన్ని చెప్పదలచుకున్న విధంగా సంభాషణలతోనే నడపటం వలన పాఠకులకు ఉత్సుకతతో సెలయేటి ప్రవాహంగా కథనం సాగుతుంది.
ఒకప్పుడు కథకులు చాలా పెద్ద కథలు సుమారుగా పదిహేను పేజీలకు పైగా నవలికలే అనిపించేలా ఉండేవి.రానురాను పత్రికలు పెద్దకథలు ప్రచురించేందుకు ఇష్టపడక పోవటం,ప్రింటులో రెండు పేజీలు మించని కథల్ని ఆహ్వానించటం ,పదాల నియమం విధించటం వలన కథలపరిమాణం తగ్గిపోయింది. ఆ ప్రభావం జయంతి కథలపై కూడా పడింది.
మంచి కథకు ఉండవలసిన లక్షణాలు క్లుప్తత, అనుభూతి ఐక్యత,సంఘర్షణ,నిర్మాణం సౌష్టవం అని నిర్వచించారు ప్రముఖ విమర్శకులు.
ఇందులో కొన్ని కథలు కథాంశం రీత్యా పెద్దకాన్వాసు కలిగినవి.వాటిని కుదించే ప్రయత్నంలో అకస్మాత్తుగా దృశ్యం ,సంఘటన మారిపోవడం జరిగింది.ఒకచిన్న పరిధిలో జీవితాన్ని చిత్రించే క్రమంలో హటాత్తుగా పరిమితికి లోబడి కథను ముగించినట్లుగా కొన్ని కథలు ఉన్నాయి.
సరోగసీ కథాంశంతో ఇటీవల చాలా కథలు వస్తున్నాయి.జయంతి రాసిన "మాతృస్పర్శ" కథాంశం
పోలికతో సుమారు ఇరవై ఏళ్ళ క్రితం ఒక సినిమా కూడా వచ్చింది.అంతమాత్రాన ఇది కాపీ అనటానికి వీల్లేదు.జయంతి కథను ఎత్తుగడ దగ్గర నుంచి సమర్థవంతంగా తనదైన శైలితో కథ ఆసాంతం ఆర్ద్రంగా నడిపించి చివరకు ఆశావహ దృక్పథంతో ముగించడం అభినందనీయం.
కథలు చాలా వరకూ గ్రామీణ ఉత్పత్తి కులాలకు చెందిన కథలు కావటం వలన వృత్తి పనులకు సంబంధించిన వివరాలను కథాక్రమంలో తెలియజేసింది రచయిత్రి.
కొడిగట్టిన దీపం,కబ్జా కథలు రెండూ ఇంచుమించుగా కథాంశంతో సారూప్యంగా ఉండి కుటుంబసంబంధాలు ఏవిధంగా ఆర్ధిక ప్రాతిపదికన ఛిద్రమైపోతున్నయో దృశ్యమానం చేసాయి.ఈ రచయిత్రి చాలా కథల్లో మానవ సంబంధాలు విచ్చిన్నం కావటాన్నే అక్షరీకరించటం గమనార్హం.
ఇద్దరు పిల్లలతల్లి శ్రీనిథి భర్త మరణానంతరం వ్యాపారాన్ని, పిల్లల్ని అభివృద్ధి లోకి తేవటానికి తన యవ్వన జీవితాన్ని వదులుకున్న శ్రీనిథికి పెద్ద చదువులలో ఉన్న పిల్లలు పెళ్ళి చేయాలనుకోవడం కథాంశం.కథగా చదవటానికి సరళ సంభాషణలతో హాయిగా ఉంది.అయితే నిజజీవితంలో అది ఎంతవరకూ ఆచరణ సాధ్యం అనిపించింది.
వృద్ధాశ్రమం నేపథ్యంలో రాసిన మరో మార్గం,కరోనా సంక్షోభం నేపధ్యంలో రాసిన రెండు కథలు చక్కని సరళ సంభాషణలతో బాగున్నాయి.
పేద కుటుంబాల్లో ఆడపిల్లలు చదువులు ఆగిపోవటం అనేది సర్వసాధారణం. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయాలనే కలని సాకారం చేసుకోవాలంటే వారికి బలమైన ఆకాంక్ష మాత్రమే వుంటే సరిపోదు.ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకొని నిలవగలిగే ఆత్మస్థైర్యం కూడా వుండాలి.అదిగో అటువంటి ఆత్మస్థైర్యం గల నైమిష కథే నింగికి మొలిచిన రెక్కలు.
ఇంచుమించుగా సందర్భాలూ,సన్నివేశాలూ వెరైటీగా జీవితంలో ఎదురీది అనుకున్న స్థాయికి వచ్చిన ప్రశాంతి ( ప్రశ్నాపత్రం),నవీన( తోడు వీడి వెళ్ళాక) పాత్రల్ని చిత్రించింది రచయిత్రి.
నవలలుగా రాయదగినంత కథాంశాన్ని కుదించి రాసిన కథలు కొన్ని వున్నాయి అటువంటి వాటిలో ' ఎండమావి 'కథ వొకటి.రచయిత్రి వీలు వెంట తాను రాసిన కథనే తిరిగి రాసి నవలగా మార్చవచ్చును.
మంచి కథాంశాల్ని స్వీకరించి అవసరమైన చోట్ల పాత్రకు అనుగుణమైన ప్రాంతీయభాషతో కూడిన సంభాషణలతో మంచి పఠనీయతతో కథల్ని రాస్తోంది జయంతి.చాలా కథల్లో సాధికారత కలిగిన స్త్రీ పాత్రలు కూడా వుండటం రచయిత్రి యొక్క అభ్యుదయభావాలు, దృక్కోణం వ్యక్తం అవుతున్నాయి.
కథానిర్మాణంలో మరికాస్త జాగరూకత ఉండాలని నా భావన.అందుకు సమకాలీన కథాసాహిత్యాన్ని మాత్రమే కాక పాతతరం ప్రముఖుల రచనల్ని బాగా చదవాల్సిన అవసరం ఉంది.
కథానిర్మాణంలో తనదైన గొంతు బలంగా రచయిత్రి వినిపించగల్గినప్పుడు ఆ కథ ప్రయోజనం సిద్ధిస్తుంది.చాలా కథల్లో జయంతి బలంగా చెప్పటం తెలుస్తోంది.
మరిన్ని మంచి రచనలతో సంపుటాలు వెలువరించాలని అభిలషిస్తూ జయంతి వెలువరించిన కథాసంపుటి "శర్వమ్మ మరణం"కథాసంపుటిని నా మనసారా స్వాగతిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను.
20, సెప్టెంబర్ 2025, శనివారం
అంత తొందర ఎందుకు రజితా
~ అంత తొందర ఎందుకు రజితా??? ~
ఒక రోజు స్కూల్ నుండి వచ్చి ఇంట్లో అడుగు పెట్టేసరికి " హల్లో" అంటూ హాల్లో కూర్చొని వున్న కుటుంబ స్నేహితురాలు డా.భార్గవీరావు పలకరించారు.
నేను పలకరింపుగా నవ్వి ఫ్రెష్ అప్ అయి వస్తానని లోపలికి వెళ్ళి అయిదు నిముషాలలో వచ్చి మాట్లాడటానికి కుర్చీలో కూర్చుంటూ భార్గవి రావు పక్కనే సోఫాలో కూర్చున్న అమ్మాయి వైపు ప్రశ్నార్థకంగా చూసాను.
చుడీదార్ వేసుకుని చున్నీని మెడ నుండి కండువాలా ముందుకే వేసుకొని బాయ్ కట్ క్రాప్ తో
చిన్నగా మా స్కూల్ లో పదోతరగతి అమ్మాయిలా వుంది.
భార్గవి ఆమెని పరిచయం చేసింది."అనిశెట్టి వరంగల్ లో వుంటుంది.కవితాసంపుటికి ముఖచిత్రం వీర్రాజు గారితో వేయించుకోవాలని అనుకుంటుంటే నాకు తెలుసు అని రజితను మీ ఇంటికి తీసుకొని వచ్చాను" అంది.
అనిశెట్టి రజిత పేరు పత్రికల్లో అప్పుడప్పుడు చూసినదే.1994 లో "నేనొక నల్లమబ్బునౌతా" మొదటి కవితాసంపుటి కి ముఖచిత్రం కోసం వచ్చి నాకు అలా పరిచయం అయ్యింది.
ఆ పుస్తకానికి వేసిన ముఖచిత్రం బాగా వచ్చిందని వీర్రాజుగారు ఆతర్వాత దానినే తైలవర్ణ చిత్రంగా 3×4అడుగుల సైజులో వేసారు.
కాకతీయ విశ్వవిద్యాలయంలో సదస్సుకు హాజరైనప్పుడూ, హైదరాబాద్ లో కొన్ని సభల్లోనూ రజిత ఆ తర్వాత ఎప్పుడు కలిసినా చాలా ఆత్మీయంగా మాట్లాడేది.
చిన్నగా ముఖమంతా నవ్వుతో పలకరించే ఈ అమ్మాయి 1969 నుండే వుద్యమస్ఫూర్తి కలిగి వుందని తెలిసి మొదట్లో ఆశ్చర్యపోయాను.ఆత్మీయంగా మెత్తగా మాట్లాడే రజిత అవసరసమయంలో ఎంత దృఢచిత్తంతో వ్యవహరిస్తుందో కాలక్రమేణా తెలుసుకున్నాను.నిజాయితీ,నిబద్ధత కలిగిన రజిత జీవితం, సాహిత్యం,ఉద్యమం ఏవీ వేర్వేరు కాదని
అన్నీ తన వూపిరిగానే బతికిన ధీరగానే గుర్తించాను.
నేను నా ముందుతరం రచయిత్రుల కథలు గురించి రాసిన వ్యాససంపుటి చూసి దాని గురించి ఆ తరం రచయిత్రుల గురించి ఫోన్ లో చాలా సేపు మాట్లాడటమే కాక తానే అరడజను పుస్తకాలు కొనటం ఆశ్చర్యం కలిగించింది.
కుందుర్తి శతజయంతి సందర్భంగా ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రతిభా పురస్కారానికి రజితను ఎంపిక చేసినట్లు వీర్రాజుగారు ఫోన్ చేసి చెప్తే చిన్నపిల్లలా సంబరపడింది.ఆ సమయంలో కరోనా కారణాన సమావేశం వాయిదా పడటంతో ఫ్రీవర్స్ ఫ్రంట్ వాట్సాప్ సమూహం ఏర్పాటు చేసి కవులను అందులో చేర్చాము.ప్రతిభాపురస్కారానికి ఎంపిక చేసిన ఆరుగురు కవులనూ పరిచయం చేస్తూ నేను సమూహంలో రాసేదాన్ని.
అదే విధంగా రజితను గూర్చి కూడా రాసింది చదివి "క్లుప్తంగానే కాక సమగ్రత కూడా వుండేలా నా గురించి ఎంతబాగా రాసారు " అంటూ మురిసిపోయి
ఫోన్ చేసిన అల్పసంతోషి రజిత.అంతేకాక నేను రాసిన పరిచయాన్ని అన్ని వాట్సాప్ సమూహాలలో నూ ఎంతో సంతోషంగా షేర్ చేసుకున్న పసిమనసు రజితది.
వీర్రాజుగారి మరణానంతరం పలుమార్లు ఫోన్ చేసి సాంత్వనగా మాట్లాడిన స్నేహిత ఆమె.
తర్వాత మాయింటికి వచ్చి ఒక సోదరిగా నాకు చీర యిచ్చి " ధైర్యంగా నిలదొక్కుకుని సాహిత్యంలో గడుపుతున్నందుకు ఆత్మీయంగా అభినందించిన
ఆత్మీయ బంధువు రజిత.
తర్వాత రజిత వీర్రాజుగారి గురించి వ్యాసం రాయటమే కాక వీర్రాజు గారి ప్రథమ వర్థంతి సమావేశానికి స్వయంగా వరంగల్ నుండి శ్రమతీసుకుని వచ్చి నాకు అండగా నిలబడటంతో స్నేహితులు కన్నా ఆత్మీయ బంధువులు ఇటువంటి వారుకాక ఇంకెవరు అనిపించింది.
ఆ తర్వాత ప్రరవే సమావేశాల్లో తప్ప తరుచూ కలవకపోయినా మానసికంగా మరింత దగ్గిరైంది.సమాజంలో వితంతువుల స్థితిగతులమీద పుస్తకం వేస్తున్నానని ఫోన్ చేసి నా రచనలను అడిగి తీసుకుంది.ఆ విషయాలమీద ఫోన్లు చేసి చాలాసేపు మాట్లాడేది.అంతేకాకుండా మా అమ్మాయి పల్లవిని ఆ పుస్తకానికి ముఖచిత్రం వేయమని అడిగింది.పల్లవి చాలా చిత్రాలను డిజైన్ చేసి ఇస్తే వాటినన్నింటినీ పుస్తకంలో అక్కడక్కడా వేసి పల్లవిని ప్రోత్సహించింది.
ఆగష్టు 10 న వరంగల్ లో సింగరాజు రమాదేవి " ఔను..నాకు నచ్చలేదు"
కథలసంపుటి ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించింది. అప్పుడు రజిత నాకు ఫోను చేసి వరంగల్లో కలుద్దాం అంటూ మాట్లాడింది.రజిత ఎప్పుడు ఫోన్ చేసినా చాలాసేపు సాహిత్యం గురించి,తాను చేయదలచిన ప్రాజెక్టుల గురించి,తన ఆరోగ్యం గురించి చాలా సేపు కబుర్లు చెబుతుంది.నేను కూడా అలాగే మాట్లాడతాను.
నేను మా అమ్మాయి,మనవరాలితో కలిసి వరంగల్ వెళ్ళాను.సభని ఆద్యంతం ఆసక్తికరంగా ఆహ్లాదభరితంగా ఛలోక్తులతో రజిత అధ్యక్షత బాధ్యతను నిర్వహించింది.అంతేకాదు సభ మధ్యలో తన సంపాదకత్వంలో వితంతువ్యవస్థపై తెచ్చిన పుస్తకాన్ని చూపించి పల్లవిని కూడా సభకు పరిచయం చేయటం మా కుటుంబం పట్ల రజితకు గల గాఢ అనురక్తికి తార్కాణం.
సభానంతరం కలిసి భోజనం చేస్తూ కూడా కబుర్లు కొనసాగాయి.అప్పటికే అలసిపోవడం వలన కొంత అనారోగ్యం రజితను వెనక్కి లాగుతోన్నా నవ్వుతూ ఫొటోలు తీయించుకుంటూ సందడి చేస్తూనే వుంది.తాను హైదరాబాద్ వచ్చినపుడు కలుద్దాం అని అంది.
మధ్యాహ్నానికి మళ్ళా వర్షసూచనలు మొదలయ్యే సరికి మేము తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాం.వర్షాలు తగ్గాక మళ్ళీ వస్తే వరంగల్ చుట్టుపట్ల అన్నీ చూడటానికి కలిసి వెళ్దాం
అని మాతో చెప్పిన రజిత మాకు వరంగల్ అంతా చూపించకుండానే తొందరపడి హడావుడిగా ఆత్మీయులను అందరినీ వదిలి అనంత దూరాలకు వెళ్ళిపోయింది.
వరంగల్ ముచ్చట్లు చెప్పుకోకుండానే ఉరమని పిడుగులా వార్త .వారం రోజుల వరకూ
మామూలు కాలేక పోయాను.ఒక విధమైన వైరాగ్యం నన్ను ఆవహించింది.
నడక దారిలో -56
నడక దారిలో -56
కొత్త ఇంట్లో ఫర్నిచర్ కోసం కార్పెంటరీ వర్క్ ప్రారంభించాడు చారి.రోజూ నేను గానీ , వీర్రాజుగారు గానీ ఆషీస్కూలుకీ,పల్లవి ఆఫీసుకీ వెళ్ళాక పదింటికి బయలు దేరి వెళ్ళేవాళ్ళం.పదింటికి భోజనం చేసేసి, బాక్స్ లో టిఫిన్ తీసుకొని వెళ్ళి తిరిగి సాయంత్రం నాలుగింటికి తిరిగి వచ్చేవాళ్ళం.
వీర్రాజుగారు తాను ముచ్చటపడి కొనుక్కున్న కళాకృతులకు సరిగ్గా అమరిక వుండేలా పదేపదే డిజైన్లు తయారు చేసుకొంటూ దగ్గరుండి మరీ హాల్ లోని షెల్పులు ఎలా చేయాలో తన కోరిక మేరకు చేయించారు.వార్డరోబ్ లను మాత్రం మా ఇష్టానికి వదిలేసారు.
వీర్రాజుగారు 1961 లో హైదరాబాద్ వచ్చిన దగ్గర్నుంచి ఉన్న మిత్రులలో శ్రీరామారావు గారు ఒకరు.ఆయన ఇల్లు మా కొత్త ఇంటికి పదినిముషాల నడక దూరంలోనే ఉంటుంది.వీర్రాజుగారు అక్కడకు వెళ్ళినప్పుడు శ్రీ రామారావుగారిని కలిసి ఆయనకి మా కొత్తింటిని చూపించారు.ఇక్కడకు షిఫ్ట్ అయ్యాక మనం తరుచూ తెలుసుకోవచ్చని ఇద్దరూ సంబరపడ్డారు.
అయితే మేము షిఫ్ట్ కాకముందే అనుకోకుండా మాసివ్ హార్ట్ ఎటాక్ తో శ్రీరామారావుగారు అనంతలోకాలకు షిఫ్ట్ కావటం వీర్రాజుగారిని దుఃఖంలో ముంచెత్తింది.వీరిద్దరి పాత స్నేహితులైన రామడుగు రాధాకృష్ణ మూర్తి గారు,శ్రీపతిగారూ అందరూ శ్రీరామారావువాళ్ళింటికి వచ్చి శోకతప్తులయ్యారు.
కొత్త ఇంటికి వచ్చాక వీర్రాజుగారికి మంచి కాలక్షేపం అనుకున్నాం పల్లవీ,నేనూ.కానీ ఇలా జరగటం బాధ కలిగింది.
పల్లవికి ప్రోజెక్ట్ మేనేజర్ గా ప్రమోషన్ రావటంతో చాలా బిజీగా అయిపోయింది.ఇంట్లో జరుగుతోన్న పనిని సూపర్వైజ్ చెయ్యటానికి కూడా కుదరలేదు.
అక్కడ పని జరుగుతోన్న రోజుల్లోనే బిల్డర్ ఇస్తానన్న ఏసీలు,ఫేన్లూ ఇంట్లో ఫిక్సింగ్ జరిగాయి.
ఒకరోజు నేను అక్కడికి వెళ్ళి కార్పెంటర్ పని చేస్తుంటే ఏదో పుస్తకం పట్టుకొని కూర్చునే దాన్ని.
ఒకరోజు ఇంటినుండి వీర్రాజుగారు అక్బరుద్దీన్ ఒవైసీ పై హత్యాయత్నం జరిగిందంట గొడవలుజరుగుతాయేమో వచ్చేయమని ఫోన్ చేసారు.నేను వెళ్ళే దారి అటువంటిది.అందుకని సాయంత్రం వరకు వుండకుండానే ఇంటికి వచ్చేసాను.కానీ అది రెండు మతాల మధ్య జరిగిన సంఘటన కాదు కనుక సమసిపోయింది.
అప్పట్లోనే జరిగిన మరో సంచలన సంఘటన పుట్టపర్తి సాయిబాబా చాలా కాలం అనారోగ్యంగా వుండి మరణించటం.ఆ నెలంతా దీనిపై అనేకానేక వూహలూ,పుకారులూ వ్యాపించటమే కాక పుట్టపర్తిలో వరుసగా జరిగిన అనూహ్య పరిణామాలు అవి కేవలం పుకార్లేకాదనిపించింది.ప్రపంచదేశాలన్నింటా సాయిబాబా భక్తులు వున్నారు.ఆ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలు నిగ్గు తీసే వారెవ్వరు.
అయిదారేళ్ళ క్రితం వీర్రాజు గారి బాల్య మిత్రుడు సత్యనారాయణ కొడుకు పెళ్ళి అక్కడే జరిగినప్పుడు వీర్రాజుగారూ నేనూ పుట్టపర్తి వెళ్ళాము.వీర్రాజుగారు రూములోనే వుండిపోతానన్నారు.నేను కుతూహలం కొద్దీ పెళ్ళి వారితో ప్రార్థనా మందిరం లోనికి వెళ్ళాను.అక్కడ సాయిబాబాని అతి దగ్గరగా చూసాను.అక్కడున్న మ్యూజియం చూసాము.ఎందుకో అక్కడంతా ఏదో అసహజంగా వుండి నాకు వూపిరాడనట్లుగా అనిపించింది.ఇప్పుడు సాయిబాబా మరణం ఎన్నో ప్రశ్నలకు తెరతీసింది.
మొత్తంమీద మూడు నెలలకు పైగా సమయంలో కార్పెంటర్ ఈ వర్క్ చాలావరకు పూర్తి చేసాడు.ఏప్రెల్ లో ఆషీకి నాలుగో తరగతి సంవత్సరాంత పరీక్షలు పూర్తి అయ్యాయి.మే నెలలో కొత్తంటికి షిఫ్ట్ కావాలనుకున్నాము.సామాన్లు కొంచెంకొంచెంగా సర్దటం మొదలుపెట్టాం.
కళ్యాణ్ వచ్చి షిప్టింగ్ కి సహాయం చేస్తానన్నాడు.మా మరిదికి కారు వుంది.అది తీసుకొచ్చి విలువైన వస్తువులనూ, జాగ్రత్తగా షిఫ్ట్ చెయ్యాల్సిన వాటినీ కారులో అయిదారు ట్రిప్పులు వేసి కొత్తంట్లోకి చేర్చాడు.పేకింగ్ & మువర్స్ వాళ్ళని మాట్లాడాము.మూడు ట్రిప్పులలో సామాన్యంగా షిఫ్ట్ చేయొచ్చు అనుకున్నాము.కానీ అయిదారు ట్రిప్పులు వేస్తే గానీ పూర్తికాలేదు.అప్పటికీ నాలుగైదు ట్రంక్ పెట్టెలూ,టీవీ స్టాండు లాంటివి వాళ్ళకే ఇచ్చెసాము డైనింగు టేబుల్ కొత్త ఇంట్లో బిల్డర్స్ ఇస్తారు కదా అనీ అదీ వదిలేసాము.షెల్ఫ్ లు ఓ రెండింటిని వదిలేసాము.కేవలం పుస్తకాలకే మూడు ట్రిప్పులు అయ్యాయి.తీసుకోచ్చి ప్రతీ గదిలో దుప్పటిలో మూటకట్టిన పుస్తకాలని కుప్పపోసారు.
" అర్జంటుగా సర్దేయకండి.తాపీగా సర్దుకోవచ్చు " అన్నాసరే వినకుండా వీర్రాజుగారు ఆఘమేఘాలమీద సర్దేసారు.మొత్తంమీద సరూర్ నగర్ ఇంటికి వచ్చేసాము. ఈ ఏడాది వేరే స్కూల్ లో చేర్చాలనుకుంటే ఆషీ ఒప్పుకోలేదు.అదేస్కూల్ లో చదువుతానని అంది.ఇంక రానూ,పోనూ స్కూల్ బస్ నే కుదిర్చాము.
ఇంతకాలం అమ్మానాన్నల ఇంట్లో వున్నాననే భావం పల్లవికి వుండేవుంటుంది.ఇప్పుడు తనదైన ఇంట్లో వుండటం అనేది తనకి తృప్తినిస్తుందని నేను భావించాను. అంతకుముందు ఆఫీసుకు మాట్లాడుకొని సలీం ఆటోలోనే పల్లవి ఆఫీస్ కు వెళ్ళేది.
ఈ ఇంటికి వచ్చేక పల్లవిగానీ,ఆషీగానీ అక్కడ నలుగురి ప్రశ్నలూ ఎదుర్కొనే పరిస్థితి ఉండకూడదని భావించి నేనూ , వీర్రాజుగారూ ఒకరోజు ఆషీని పక్కన కూర్చో బెట్టుకుని తన తండ్రి ఎలా పోయాడో,ఆ పరిస్థితులేమిటో అన్నీ వివరంగా చెప్పాము.ఇంత వరకూ ఆషీకూడా అందరు పిల్లలూ తల్లిదండ్రులతో తిరుగుతారు కదా తన తండ్రి ఎవరూఅని ఎప్పుడూ అడగకపోవటం కూడా మాకు ఆశ్చర్యమే.చిన్నప్పుడు ఒకరిద్దరు మీ నాన్న పేరేమిటి అని అడుగుతుంటే వీర్రాజు అనే చెప్పేది.మేము చెప్పిన విషయమంతా విని ఏమీ కామెంటు చేయకుండా ముఖం కూడా అభావంగా పెట్టి నిశ్శబ్దంగా వూరుకుంది ఆషీ.అంత చిన్న వయస్సులోనే అంత గుంభనంగా వుండటం ఆశ్చర్యం కలిగించింది.తర్వాత కూడా ఆ పిల్ల ఎప్పుడూ ఆ ప్రసక్తే తీసుకుని రాలేదు.
మేము ఇంట్లో అన్ని సర్దుకున్న తర్వాత బంధువులకూ,మిత్రులకూ,పల్లవి సహోద్యోగులకూ ఒక ఆదివారం విందుకు పిలిచాము.అందరూ వచ్చి ఇల్లు చాలా బాగుందని అభినందనలు తెలియజేశారు.
మరొక రోజు లేఖిని మిత్రుల్ని ఆహ్వానించాను.వాసాప్రభావతి,డి.కామేశ్వరి, అబ్బూరి ఛాయాదేవి, తురగా జానకీరాణి, ఇంద్రగంటి జానకీ బాల,శారదాఅశోకవర్థన్,తమరిశ జానకి మొదలైన రచయిత్రులు ఒక పాతికమంది వరకూ మా ఇంట్లో విందుకు హాజరయ్యారు.
మెల్లమెల్లగా కొత్త ఇంటికి అలవాటు పడ్డాం.బ్రహ్మానందనగర్ ఇంటికి కలర్స్ వేయించాము.ఆ పనిమీద ఆ ఇంటికి వెళ్ళినప్పుడు కొంత దిగులు వేసింది.కష్టార్జితాన్ని కూడబెట్టి కొన్ని ఇల్లది.ముప్ఫై ఏళ్ళు ఎన్నో కష్టసుఖాలను అనుభవించిన ఇల్లు.అవన్నీ గుర్తొచ్చి ' కొత్త మజిలీ' అనే కవిత రాసాను.ఆ ఇంటిని అద్దెకు ఇచ్చాము.
ఒక రోజు అనుకోని ఫోన్ వచ్చింది.ఫోన్ చేసినవారు ఆవంత్స సోమసుందర్ గారు .నాకు దీర్ఘ కవిత్వ విభాగంలో దేవులపల్లి రాజహంసా కృష్ణశాస్త్రి పురస్కారం ఆయన జన్మదినం అయిన నవంబర్ పదిహేడున పిఠాపురం లో ఇస్తానని తెలియజేసేరు.నాకు పట్టలేనంత సంతోషంతో నోట మాట రాలేదు.ఆయనే తిరిగి కవిత్వం విభాగంలో మహెజబీన్ కి ఇస్తున్నట్లు తెలియజేసి కలిసి రమ్మని సలహా కూడా ఇచ్చారు.
చాలా ఏళ్ళ క్రితం వీర్రాజుగారికి కూడా దీర్ఘ కవిత్వ విభాగంలోనే ఇదే పురస్కారం వచ్చినప్పుడు పిఠాపురం వెళ్ళాను.మళ్ళా నేను అందుకోవటం చేత పురస్కారం ఇప్పటికీ నాకు అపురూపమైనది.
మహెజబీన్ తో సంప్రదిస్తే తాను ట్రైన్ టికెట్లను బుక్ చేస్తానని తర్వాత డబ్బు తనకు ఇమ్మనటంతో సరేనన్నాను.అనుకున్నట్లుగా ఆమెతో కలిసి బయలుదేరాను.సామర్లకోట జంక్షన్ లో దిగేసరికి అక్కడకు ట్రస్ట్ సభ్యులు మన్మధ రావుగారూ,మరొక ఆయనా మమ్మల్ని రిసీవ్ చేసుకొని ముందుగా హొటల్ లో టిఫిన్ ఇప్పించి కారులో పిఠాపురంలో మాకు కేటాయించిన రూమ్ కు తీసుకు వెళ్ళారు.మేము స్నానపానాదులు పూర్తి చేసుకొని పురస్కార సమావేశం జరిగే గ్రంథాలయానికి తీసుకువెళ్ళాము.మాతోపాటు కథలకు వి.ప్రతిమ,విమర్శకు విజయలక్ష్మీ బక్ష్ అందుకున్నారు.
తర్వాత మరికొన్ని రోజులకే కడప కవితా సాంస్కృతిక సంస్థ వారిచ్చే గురజాడ పురస్కారం నా రెక్కల చూపు కథలసంపుటికి రావటం మరింత సంతోషకరం.ఈ పురస్కారసమావేశానికి యువభారతి మిత్రురాలు కె.బి.లక్ష్మితో కలిసి ప్రయాణించాను.కొత్త ఇంట్లో దిగగానే రెండు పురస్కారాలు అందుకోవటం చాలా సంతోషం కలిగింది.
బిల్డింగ్ లో ఇంకా అన్ని ఇళ్ళల్లోకీ కుటుంబాలు లేదు.ఎక్కువగా కబుర్లు చెప్పే అలవాటు లేనందున నాకు పెద్దగా స్నేహాలు పెరగలేదు.పల్లవికి ఆఫీసుకు వెళ్ళిరావటం వలన ,సమయం కుదరకపోవటం చేత బిల్డింగ్ లో ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో ఏ కార్యక్రమాలు జరిగినా నేనే వెళ్ళక తప్పేది కాదు.నేను పూజలూ,వ్రతాలూ చేయక పోయినా పిలిచినప్పుడు వెళ్ళకపోవటం, వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళ మనోభావాలను గాయపరచటం ఇష్టం లేదు.ఇది ఒక కమ్యూనిటీ బిల్డింగ్.అందుచేత ఎవరైనా పిలుస్తుంటే కాస్త ఆలస్యంగా వెళ్ళి వాళ్ళు ఇచ్చినదేదో పుచ్చుకొని వస్తే పోయేదేముంది.ఇక్కడే కలకాలం వుండే పల్లవీ,ఆషీలను అందరికీ దూరంచేసి ఉలిపికట్టెలుగా చేసే అధికారం నాకు లేదుకదా.
ఇదిలావుండగా తెలంగాణా ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది. 2011 సెప్టెంబరు 13 నుండి ప్రారంభమై 42 రోజులపాటు జరిగిన సమ్మెలో తెలంగాణాలోని ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, సింగరేణి కార్మీకులు, ఉపాధ్యాయులు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు, విద్యుత్ సంస్థ ఉద్యోగులు 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. ప తెలంగాణ ప్రాంతంలో ప్రజాజీవనం స్థంభించకపోయింది.
అయితే ముందుగా రవాణా సంస్థ ఉద్యోగులు సమ్మె విరమించగా ఇతర సంఘాలు కూడా సమ్మె విరమించాయి.ఉద్యమనాయకులు మాత్రం ఈ సమ్మె ఫలితంగా కేంద్రం ఆలోచన మార్చగలిగిందనీ,కానీ ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు.
న్యాయమూర్తి శ్రీకృష్ణ అధ్యక్షతన ఐదుగురు సభ్యుల సమితి ఆంధ్రప్రదేశ్ విభజన వలన కలిగే లాభనష్టాలు గురించి అధ్యయనం చేసి ఇరుప్రాంతాల నాయకులూ,మేధావులతో చర్చించి నివేదిక 2011 జనవరి 6న విడుదల చేసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచి తెలంగాణా అభివృద్ధికి తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయాలనేది ఒకటి అయితే తెలంగాణ, సీమాంధ్రలను వేరుచేయడం రెండవ పరిష్కారంగా సిఫారస్ చేసింది. కానీ ఇవి వ్యతిరేకించబడ్డాయి.ఉద్యమం కొనసాగుతూనే వుంది.
దసరాల్లో చిన్నక్క కుటుంబం వచ్చారు.ఇక్కడనుండి షిర్డీ వెళ్ళి తిరిగి హైదరాబాద్ వచ్చి విజయనగరం వెళ్ళటానికి ప్రోగ్రాం వేసారు.వాళ్ళతో బాటూ నన్నూ,ఆషీనీ కూడా ప్రయాణం కట్టించారు.అప్పుడే కళ్యాణ్ సహాయంతో పల్లవి కారు కొనింది.
ఒకరోజు నాకు వచ్చిన ఉత్తరం నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది.కేంద్రసాహిత్య అకాడమీ నుండి భారతీయసాహిత్యనిర్మాతలు పేరిట డా.పి శ్రీదేవి గురించి మోనోగ్రాఫ్ గురించి రాయమని ఆ వుత్తరం వచ్చింది.అప్పుడు కన్వీనర్ గా అక్కిరాజు రమాపతిరావు (మంజుశ్రీ)గారు ఉన్నారు.
వీర్రాజుగారికి ఆ వుత్తరం చూపిస్తే " పరిశోధకులు రాయగలరు కానీ నువ్వు రాయలేవు " అని నిరుత్సాహ పరిచారు.కేంద్రసాహిత్య అకాడమీ ప్రాజెక్టు కదా ఏంచేయాలో అర్థం కాలేదు.ఏవో కొన్ని వ్యాసాలు రాసాను కానీ పూర్తిగా ఒక రచయిత్రి సాహిత్యాన్ని పుస్తకానికి సరిపడేంత రాయగలనా అని నేను కూడా దానికి ఏమీ సమాధానం చెప్పకుండా వెనుకంజ వేసాను.రెండునెలల తర్వాత మళ్ళా మరో ఉత్తరం వచ్చింది.
అంతలో వాసా ప్రభావతి గారూ,డా.ఆలూరు విజయలక్ష్మి గారు
కలిసి కాకినాడలో కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వహణలో రచయిత్రుల ఒకరోజు సదస్సు ఏర్పాటు చేసారు.కవిత్వసదస్సుకు నేను అధ్యక్షురాలిగా నిర్ణయించారు.హైదరాబాద్ నుండి వాసా ప్రభావతి, ఇంద్రగంటి జానకీ బాల, గంటి భానుమతి,నేను ఇలా కొంతమంది కలిసి ట్రైన్ కి టిక్కెట్లు బుక్ చేసుకున్నాము.
ఎట్లాగూ కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళదే కావటాన అక్కడ మంజుశ్రీగారిని కలుస్తాను కనుక పి.శ్రీదేవి మోనోగ్రాఫ్ నేను రాయలేనని ఉత్తరం రాసి ఇచ్చేద్దామని నిర్ణయించుకొని ఉత్తరం తయారుచేసుకొని కవర్లో పెట్టుకొని బయలుదేరాను.
కాకినాడ స్టేషన్లో దిగి మాకోసం బుక్ చేసిన హొటల్ లో రిఫ్రెష్ అయిన తర్వాత హొటల్ కిందనే వున్న రెస్టారెంట్ లో బ్రేక్ ఫాస్ట్ కోసం వెళ్ళాం.అక్కడ కుప్పిలిపద్మ,పి.సత్యవతి, కాత్యాయిని విద్మహే తదితరులు కలిసారు.ఏదో సందర్భంలో కాత్యాయనీ తో శ్రీదేవి మోనోగ్రాఫ్ రాయమని వుత్తరం వచ్చిన విషయం చెప్పి ,నేను రాయలేనని వుత్తరం రాస్తున్నానని చెప్పాను.
కాత్యాయని "మీరు రాయలేకపోవటమేంటండి.తప్పక రాయగలరు.నేను శ్రీదేవి గురించి పి.హెచ్డీ చేయించాలనుకుంటే ఎవరూ ముందుకు రావటం లేదు.నా దగ్గర శ్రీదేవి రాసిన ' ఉరుములు- మెరుపులు' కథలపుస్తకం వుంది.దానినీ,నా దగ్గర వున్న కొంత మెటీరియల్ ఇస్తాను" అని కాత్యాయని ప్రోత్సహించటంతో కేంద్ర సాహిత్య అకాడమీ కన్వీనర్ మంజుశ్రీ గారికి నేను తీసుకు వెళ్ళిన ఉత్తరం అందజేయకుండా వూరుకున్నాను.
ఆరోజు మధ్యాహ్నం కవిత్వం సదస్సులో నేను ఆనాటినుండి ఇప్పటివరకూ కవిత్వంలో మార్పు చేర్పులు గురించి చేసిన అధ్యక్షోపన్యాసాన్ని తదనంతరం "సాహిత్య ప్రాంగణంలో కవయిత్రులు" అనే వ్యాసంగా ప్రచురించాను.ఆ సదస్సులో మందరపు హైమవతి, శరత్ జ్యోత్స్నారాణి పాత్ర సమర్పణ చేసారు.శరత్ జ్యోత్స్నారాణి ఎప్పుడో ఇరవై ఏళ్ళక్రితం రాసిన వ్యాసాన్నే అప్డేట్ చేసుకోకుండానే ప్రసంగించింది.ఎందుకంటే ఆమె ప్రసంగంలో నా మొదటి పుస్తకంలో కవితనే ఉటంకించింది.దాని తర్వాత ఏడు సంపుటాలు వచ్చిన విషయం ఆమెకు తెలియదు.హైమవతి కూడా కేవలం నీలిమేఘాలులోని కవితలలోని స్త్రీవాదం గురించి ప్రసంగించింది.
మొత్తంమీద ఒక్కరోజు సదస్సులు విజయవంతంగా జరిగాయి.
ఆ రాత్రి అందరం హొటల్ లో చాలా సేపు కబుర్లు చెప్పుకున్నాం.మర్నాడు కారు ఏర్పాటు చేసి సామర్లకోటలో వున్న ఒక ప్రాచీనదేవాలయం,మొదలగు ప్రాంతాలు చూపించారు.అనంతరం ఆలూరు విజయలక్ష్మి గారి ఇంట్లో కాసేపు అందరం సరదాగా గడిపాము
తర్వాత రోజు ఇంద్రగంటి జానకీ బాలకు,ప్రభావతి గారికీ మరో సభలో పాల్గొనాల్సి వుందని కాకినాడలో ఆగిపోయారు.మిగిలిన వాళ్ళం తిరిగి హైదరాబాద్ ట్రైన్ ఎక్కాము.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)