9, సెప్టెంబర్ 2025, మంగళవారం
1.శరసంధానం
శరసంధానం
- శీలా సుభద్రాదేవి
ఒకసారి ప్రశ్నించాలి
అని అనుకుంటూ అనుకుంటూనే
ఏళ్ళకి ఏళ్ళు నడుచుకుంటూ వచ్చేసాను
ఏమని ప్రశ్నించాలా అని ఆలోచిస్తే
సమాధానాలెట్లా రాయాలో నేర్పించారు కానీ
బళ్ళో పదేళ్ళ చదువు కాలంలో
తదనంతర చదువుల్లోనూ
ఏ ఒక్క మాష్టారూ కూడా
ప్రశ్నించటం మాత్రం నేర్పలేదు.
ఎక్కడో ఏదో పురుగు దొలిచి
అడగాలనుకునే ప్రశ్న
ఎర్రని చూపు తాకి మసై రాలిపోయేది
మాటిమాటికీ ప్రశ్నే కొక్కెంలా
నావెనుక ఎప్పుడు తగులుకొందో గానీ
నా అడుగులు ముందుకుపడకుండా
నిత్యమూ వెనక్కి లాగుతూనే వుంది
అయినాసరే
ఎప్పుడు ఏ అక్షరం
నా మనో క్షేత్రంలో నాటుకుందో
నా వంటిమీదే కాదు
నా అంతరాంతరాల నిండా
ప్రశ్నలు మొలకెత్తుతూనే వున్నాయి.
అటువంటప్పుడు అంపశయ్య మీద భీష్మలా
ప్రశ్నల పరుపుపై నిద్రపట్టక దొర్లతాను
ఇకపై ఇన్ని ప్రశ్నలు
మనసునిండా ఎందుకు నాటావని
మీనమేషాలు లెక్కబెట్టే పనేలేదు
ప్రశ్నించనీయకుండా చేసిన
నీ మీదా,ఈ సమాజం మీదా
ఈ సాంప్రదాయాల లక్ష్మణ రేఖల్లో
నన్ను బంధించిన ప్రతీ ఒక్కరి మీదా
శరసంధానం చేయటానికి నాదే ఆలస్యం
ఇకపై ప్రశ్నించి నిలదీయాల్సిందే
5, సెప్టెంబర్ 2025, శుక్రవారం
నడక దారిలో -55
నడక దారిలో -55
ఆప్తమిత్రుడు కె.కె.మీనన్ భౌతికంగా దూరం కావటం వీర్రాజుగారు చాలా దిగులు పడ్డారు. తాను పెయింటింగ్స్ వేయటమేకాక కవితా సంపుటి కూడా ప్రచురించుకోవాలనే వుద్దేశ్యంతో కవిత్వరచనలో పడి మిత్రుని మృతి వలన కలిగిన దుఃఖాన్ని అధిగమించడానికి ప్రయత్నించారు.
మేముంటున్న ఇంటి పరిసరాలకు పల్లవి విసిగి పోవటంతో కొనటానికి ఇళ్ళకోసం గట్టిగానే ప్రయత్నం మొదలెట్టాము.
మల్లయ్య శాస్త్రిగారికి మియాపూర్ లో ఇల్లు ఎలాట్ అయ్యిందట.ఆ పనిమీదనో మరెందుకో గుర్తులేదు.హైదరాబాద్ వచ్చి మా ఇంటికి వచ్చారు.భోజనం అయ్యాక వీర్రాజుగారితో చాలా సేపు కబుర్లు చెప్పి సాయంత్రానికి తిరిగి వెళ్ళారు.ఆయన వెళ్ళాక వీర్రాజుగారు నాతో చెప్పిన విషయం నన్ను అవాక్కు అయ్యేలా చేసింది.
" ఒంటరిగా వుండటం కష్టంగా వుంది వీర్రాజు గారూ.నేను వివాహం చేసుకుందామనుకుంటున్నాను.ఏమంటారు?" అన్నారట ఆయన డెభ్భై ఏళ్ళు దాటిన వ్యక్తి.
ఆయన తాతో,ముత్తాతోగానీ బాలవితంతువైన తన కూతురికి పునర్వివాహం చేసారు.అన్ని కులాల వారితో పంక్తి భోజనం చేసిన బ్రహ్మ సమాజదీక్షగల మహనీయ వ్యక్తిగా ఆయనకి పేరు.
అయితే అంత ఆశ్చర్యపడటానికేముంది? భరాగో,పెద్దిభొట్లవంటివారు కూడా ఆ వయసులో వివాహాలు చేసుకున్నారు కదా.పురుషులకు ఏ వయసులోనైనా పునర్వివాహం చేసుకునే జన్మహక్కు ఈ సమాజం ఇచ్చింది.అందుకే ఆశ్చర్యం అక్కర్లేదు.
కానీ అకస్మాత్తుగా భర్త చనిపోవడంతో పాతికేళ్ళవయస్సులోనే ఇద్దరు పసిపిల్లలతో అసహాయంగా మిగిలిన తమ్ముడి భార్యని అత్తింటి వాళ్ళంతా దిక్కులేనిదానిగా వదిలేసినప్పుడు ఆమె ఒంటరితనం ఆయనకి గుర్తు రాలేదా? అది గుర్తు వచ్చి నేను కొంత డిస్టర్బ్ అయ్యాను.
ఈ విషయం ఎవరితోనూ చెప్పలేదు.కానీ
ఆ తర్వాత గుండెల్లో గాయం అనే కథని రాసాను.
మరిది కృష్ణ చిన్నకూతురు పెళ్ళి ఒరియా అబ్బాయితో పూరీలో నిశ్చయం అయ్యింది.ముగ్గురు అమ్మాయిలూ మూడుప్రాంతాలవారిని ఎంపిక చేసుకుని వివాహం చేసుకోవటం ఆశ్చర్యమే.కట్నాలబాధ అయితే తప్పిందనుకోవాలి.కృష్ణ మరణానంతరం ఆ కుటుంబబాధ్యత మాదే అని భావించి రెండు పెళ్ళిళ్ళు జరిగాయి. ఈ పెళ్ళికి మాత్రం పెద్దమ్మాయి కవితే చెల్లెలిపెళ్ళికి ఎక్కువ బాధ్యత వహించింది.
మా కుటుంబంతో పాటు చిన్నమరిది బయలుదేరాడు.వివాహం ఒరియా పద్ధతిలో జరిగిన ఈ వివాహానికి కూడా మేమే కన్యాదానం చేయటం జరిగింది.ఆ వివాహానంతరం భువనేశ్వర్ లో చూడవలసిన ప్రదేశాలు,కోణార్క్ సూర్య దేవాలయం ధవళగిరి మొదలైనవి చూసి తిరిగి హైదరాబాద్ వచ్చేసాం.
కొనటానికి ఇండిపెండెంట్ ఇళ్ళు చాలా
చూసాం.కానీ ఏవీ మాకు అందుబాటులో లేవు.ఒకరోజు సరూర్ నగర్లో వున్న మరిది నుండి పల్లవికి ఫోన్ వచ్చింది."ఇక్కడ సరూర్ నగర్ మెయిన్ రోడ్డు లో ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ మొదలయ్యింది.కె.విశ్వనాధ్ ప్రారంభించారు.ఒకవేళ నచ్చుతుందేమో చూడు."అని.
నాలుగురోజులుగా సెలవులకని వచ్చిన చిన్నక్క కుటుంబానికి అదే రోజు తిరుగు ప్రయాణం.వాళ్ళు మమ్మల్ని స్టేషన్ కు రానక్కరలేదనీ సలీమ్ ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోతాం.మీరు వెళ్ళి ఇల్లు చూడండని అన్నారు.అంతే కాక ఇండిపెండెంట్ ఇల్లు కన్నా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అయితేనే భద్రత వుంటుంది.నచ్చితే తీసుకోవటం మంచిది అన్నారు.
వీర్రాజుగారు కూడా తన తమ్ముడూ,చెల్లెల కుటుంబాలు దగ్గరగా వుంటాయి అని తీసుకుంటే బాగానే వుంటుందన్నారు.
వీర్రాజుగారు తాను రాననీ చూడటానికి మా ఇద్దరినీ వెళ్ళమన్నారు.సరేనని వచ్చి SVRS వారి ఒక మోడల్ హౌస్ చూసాము.వాళ్ళు చెప్పినవన్ని నచ్చాయి.మా బడ్జెట్ లోనే త్రీబెడ్ రూమ్ ఇల్లు వస్తుంది.అయితే మళ్ళా అపార్ట్మెంటేనా అనిపించింది.ముందు రెండువేలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.ముందు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి రెండున్నర లక్షలు ఖరీదు చేసే ఫర్నీచర్ ,మాడర్న్ కిచెన్ ఉచితం అన్నారు.
సరే ముందు కట్టేద్దాం.తర్వాత ఆలోచించుకుందాం అనుకున్నాం.
మర్నాడు మళ్ళా వీర్రాజుగారితో కలిసి వచ్చి చూసాం.SVRS బృందావనం పేరిట మూడు బ్లాకులు కడుతున్నామని బిల్డర్స్ చెప్పారు.మొదటగా నారాయణాద్రి బ్లాక్ మొదలు పెడతామని చెప్పి అయిదు ఫ్లోర్ లు,ఒక్కోఫ్లోరులో పదహారు ఇళ్ళు వుంటాయని ఇళ్ళు ప్లానులు ఉన్న పేపరు ఇచ్చి ఎంపిక చేసుకోమని చెప్పి ఏ రకంగా ఎన్ని వాయిదా ల్లో డబ్బు కట్టాలో,ఎప్పుడు నిర్మాణం మొదలెడతారో, ఎప్పుడు ఇల్లు ఇస్తారో వివరాలు చెప్పారు.
ఇళ్ళ ప్లాను చూసి ఫస్ట్ ఫ్లోర్ వద్దనుకున్నాము.థర్డ్ ఫ్లోర్ లో ఇళ్ళు బుక్ అయిపోయాయి.కరెంటు పోతే కష్టం పైన రెండు ఫ్లోరులు వద్దని వీర్రాజుగారు అన్నారు.ఆఖరుకు రెండవ ఫ్లోరులో ఇల్లు సెలెక్ట్ చేసుకున్నాము.అప్పుడప్పుడు అటువైపు వెళ్ళి ఎంతవరకూ అయ్యిందో చూసుకునే వాళ్ళం.
2010 లో ఆధునిక తెలుగు కథ వచ్చి 100 ఏళ్ళు అయిన సందర్భంగా వేదగిరి రాంబాబుగారు కొందరు కథకులను తీసుకుని విజయనగరం ప్రయాణం కట్టారు.విజయనగరంలో ఆ సందర్భంగా గురజాడ ఇంటిలోనూ, గురజాడ వీధిలోనూ కథకుల పాదయాత్ర తలపెట్టారు.
నేను విజయనగరంలో పుట్టిపెరిగిన దానిని.విజయనగరంలో సమావేశాలకు గానీ,సదస్సులకు గానీ ఎందుకు గుర్తు రానో మరి ఎప్పుడూ ఎవరూ ఆహ్వానించలేదు. విజయనగరంలో ఒక సంస్థ అనేకమంది రచయిత్రులు పిలిచి పురస్కారాలు ఇవ్వటం కూడా తెలుసు. నన్ను పిలవాలని కాదు కానీ అక్కడే వున్న మా పెద్దక్కనీ గానీ,
చిన్నన్నయ్యనీ గానీ ఏనాడూ ఏ సభలకూ ఆహ్వానించరు .ఇందులో కొంత వరకూ కుల రాజకీయాలు కూడా వున్నాయని మాకు చూచాయగా తెలుసు.అందుకనే మేము పట్టించుకోం.కానీ అప్పుడప్పుడు కొంత బాధ కలగటం సహజమే కదా.
సరే .మళ్ళా వందేళ్ళ కథ దగ్గరకు వస్తే -
విజయనగరం కథకులు బయలు దేరే రోజు వచ్చింది.మాకు తెలిసిన చాలా మంది వెళ్తున్నారనేది కూడా తెలిసింది.సాయంత్రం నాలుగు గంటలకు రాంబాబుగారు ఫోన్ చేసారు.ఆ సమయంలో వీర్రాజుగారు ఇంట్లో లేకపోవటంతో నేనే ఫోన్ తీసి మాట్లాడాను.'వందేళ్ళకథోత్సవాలకు విజయనగరం వెళ్తున్నామని,మీరు విజయనగరం వారు కదా మీరు కూడా వస్తే బాగుంటుంది' అన్నారు.
ఎప్పుడు వెళ్తున్నారని అడుగుతే అదేరోజు ఆరుగంటల ట్రైనుకు వెళ్తున్నామని, ఆ మర్నాడే కార్యక్రమమని చెప్పారు.నాకు చాలా కోపం వచ్చింది.కాని చాలాతాపీగా " ఇప్పటికిప్పుడు టిక్కెట్లు ఎలా అంటే "అది నేను చూసుకుంటాను" అన్నారు.బహుశా ఎవరో రావటం లేదేమో ఆ ఎవరో నా పేరు చెప్పి వుంటారు.ఆ టికెట్ లో నన్ను తీసుకెళ్దామని అడిగి వుంటారు అనిపించింది.
వీర్రాజుగారు ఇంట్లో లేరని, ఇప్పటికిప్పుడు ఒక్క గంటలో నేను తయారై రాలేనని చెప్పేసాను.
వీర్రాజుగారు వచ్చాక ఈ విషయం చెప్తే " కులాలు,మతాలూ ప్రాంతాలుగా సాహిత్య రంగం గ్రూపులుగా విడిపోతోంది.ఇటువంటి
ఏ గ్రూపులోనూ చేరకుండా మనమట్టుకు మనం రాసుకుంటూ వున్న వాళ్ళం అంతే అట్టడుగుకు వెళ్ళిపోతాం.అందుకే రాసినవన్నీ పుస్తకం రూపంలో లైబ్రరీలలో వుంటే ఎప్పటికైనా ఎవరో ఒకరు తీస్తే గుర్తింపులోకి వస్తాం . బండారు అచ్చమాంబ వంటి వారు అలాగే ఇన్నాళ్ళకు గుర్తింపులోకి వచ్చారు కదా" అన్నారు బహుశా చిన్నబుచ్చుకున్న నన్ను మరలించటానికే కావచ్చు.
2010లో వందేళ్ళ కథాప్రస్థానం సందర్భంగా తెలుగు రాష్ట్రంలోనే కాక బయటున్న తెలుగు కథకులందరితో ఎన్నో సమావేశాలూ, ఎన్నో ఇంటర్వ్యూలూ, వ్యాసాలూ, అభిప్రాయాలు పత్రికల్లో వెలువడ్డాయి. మొదటి కథారచయిత్రిగా భండారు అచ్చమాంబను పేర్కొని, ఆపైన 1980 తర్వాత రాసిన రచయిత్రులనే అనేకమంది పేర్కొన్నారు.
హెచ్ఎంటీవీ తెలుగు టీవీ ఛానల్ వందేళ్ల కథ పేరిట కార్యక్రమంలో భాగంగా 2012 లో గొల్లపూడి మారుతీరావు "వందేళ్ల కథకు వందనాలు" అంటూ ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. 118 మంది కథకుల కథలను పరిచయం చేసిన గొల్లపూడి మారుతీరావు కేవలం పన్నెండుమంది రచయిత్రుల కథలనే స్వీకరించటంకూడా గమనించాల్సిన విషయమే అనిపించింది.
అవన్నీ గమనించిన తరువాత 1910కి-1980కి మధ్య ఒకరిద్దరు తప్ప కథారచయిత్రులు లేరా అనే ఆశ్చర్యం కలిగింది. అరవయ్యో దశకంలో పత్రికలన్నింటిలో ప్రభంజనం సృష్టించిన రచయిత్రులంతా ఏమయ్యారు? వారు నవలలు తప్ప చెప్పుకోదగిన కథలేమీ రాయలేదా? రాసినా విమర్శకులు, చాలామంది పేర్కొన్నట్లు, ప్రేమలూ-పెళ్ళిళ్ళూ, కుటుంబాలూ, అపార్థాలూ, కలహాలతో నిండిన వంటింటి సాహిత్యమేనా? - ఇలా అనేక సందేహాలు నన్ను చుట్టుముట్టాయి
కాకతీయ విశ్వవిద్యాలయంలో "రచయిత్రుల వెనుకబాటు తనం " గురించి ఒకసారి నేను సమర్పించిన ప్రసంగవ్యాసం, తర్వాత ప్రభుత్వ సాంస్కృతిక,భాషా సంస్థ తో లేఖిని సంస్థ కలిసి నిర్వహించిన సదస్సులో రామలక్ష్మి కథలగురించి చేసిన ప్రసంగవ్యాసం గుర్తు వచ్చి
1950కి ముందు రచయిత్రులనీ, వారి కథల్నీ గురించి పరిశోధనాత్మక వ్యాసాలు రాయాలనే దృడమైన సంకల్పం కలిగింది.
ముందుగా ఎవరెవరి గురించి రాయాలనేది ఒక జాబితా తయారు చేసుకుని ముందుగా రచయిత్రుల కథలసంపుటాల సేకరణ మొదలు పెట్టాను.
కొన్న అపార్ట్మెంట్ పూర్తి అయ్యింది.అక్కడ ఒకరోజు పూజ చేయించేసి ఇంట్లో చేయించాల్సిన వుడ్ వర్క్ మొదలుపెట్టించాలని నిర్ణయించాము.
పూజ చేసే పంతులుగారి నెంబర్ మరిది దగ్గర తీసుకుని తేదీ నిర్ణయించాము.
ఫిబ్రవరి 13తేదీన సాయింత్రం ముహూర్తం నిర్ణయించారు.ముందు రెండు రోజులూ అవసరమైన వస్తువులు కొనటం ప్రారంభించాము.ఎవరినీ పిలవదలచుకోలేదు.దగ్గరలోనే వుంటారు కనుక మా పెద్ద ఆడబడుచునీ,మా చిన్న మరిదినీ మాత్రమే పిలిచాము.పూర్తిగా ఇల్లు మారిన తర్వాత స్నేహితులనూ, బంధువులనూ పిలిచి పార్టీ ఇవ్వాలని మా వుద్దేశ్యం.
13వతేదీ వుదయం దిల్ షుక్ నగర్ లో పళ్ళు మొదలైనవి కొంటున్నప్పుడు షాకింగ్ వార్త తో ఫోన్ వచ్చింది.
కుందుర్తి సత్యమూర్తి మాసివ్ హార్ట్ ఎటాక్ తో చనిపోయారని తెలిసింది.వీర్రాజుగారు విని ఎలా తట్టుకుంటారోనని భయం వేసింది.వెంటనే నాళేశ్వరం శంకరంగారికి ఫోన్ చేసి ఇలా ఆరోజు రాత్రి గృహప్రవేశం పూజ పెట్టుకున్న విషయం కూడా చెప్పాను.వెంటనే మలక్ పేట ఇంటికి ఆయన బయలుదేరి వెళ్ళారు.
మేము కొన్న వస్తువులను కొత్త ఇంట్లో పెట్టేసి మలక్ పేట వెళ్దామని సరూర్ నగర్ వచ్చాం.
ఇంట్లోకి రాగానే అంతవరకూ దుఃఖాన్ని వుగ్గ బెట్టుకుందేమో పల్లవి ఒక్కసారిగా ఏడుపు మొదలుపెట్టింది." పెట్టుకోక పెట్టుకోక ఒక శుభకార్యం తలపెడితే ఇలా జరిగిందేమిటి " అని వెక్కిళ్లు పెట్టింది. ఆమెను సముదాయించటం నాకూ కష్టమే అయ్యింది.నాకూ మనసులో కొండంత భయం గూడు కట్టుకుంది.అయినా బయటకు బింకంగా వుండి ఓదార్చాను
ఫ్రీవర్స్ ఫ్రంట్ నిర్వహణ అనుబంధం వల్ల కుందుర్తిగారి మరణానంతరం సత్యమూర్తి కుటుంబం ఇంట్లో మనుషుల్లా మాకు చాలా దగ్గర అయ్యారు.ఇప్పుడు ఈ పూజ చేయించటమా మానటమా ఒక సందిగ్ధం అయింది.
మలక్ పేట ఇంటికి వచ్చేక వీర్రాజు గారూ,శంకరంగారూ నేనూ కలిసి సత్యమూర్తి గారి ఇంటికి వెళ్ళాము.
సింగపూర్ లో వున్న చిన్న కూతురు కవితకు ఉదయం ఎప్పటిలాగే కాల్ చేసి కట్ చేసారట సత్యమూర్తి.ఆ తర్వాత కవిత తిరిగి తానే కాల్ చేస్తే అప్పుడు మాట్లాడటం ఆనవాయితీ అట.అదే విధంగా కాల్ కట్ చేసిన వెంటనే కుప్పకూలిపోవటం,ప్రాణం పోవటం నిముషాలమీద జరిగిందని తెలిసింది.కవిత చేసిన ఫోన్ ఎత్తడానికి ఆయన లేకుండా పోయారట.ఎంత విషాదం అనిపించింది.దగ్గరలో సత్యమూర్తి షష్ఠి పూర్తి చేయాలని సమత,కవిత అనుకున్నారు .ఈ లోపున ఇలా జరిగింది.కుందుర్తిగారు కూడా అలాగే షష్ఠి పూర్తి ఏర్పాట్లు జరుగుతుండగానే పోయారనేది గుర్తొచ్చింది.
నేను కొంత సేపు కుందుర్తి శాంతతోనూ,సమతతోనూ మాట్లాడి ఇంటికి వచ్చేసాను. " అక్కడి కార్యక్రమం పూర్తికాగానే వీర్రాజుగారిని తీసుకువచ్చేస్తాను.సాయంత్రం మీ కొత్త ఇంట్లో పూజ యథాతధంగా చేసుకోండి"అని శంకరం భరోసా ఇచ్చారు.
సాయంత్రం సరూర్ నగర్ కొత్త ఇంట్లో కార్యక్రమం కోసం ఇంట్లోనే కొంచెం పులిహోర, దద్దోజనం చేసుకుని తీసుకొని వెళ్ళాం.ఆడబడుచు ఇంటినుండి పాలు పొంగించటానికి గాస్ సిలిండర్ తీసుకు వచ్చాము.
పంతులుగారు సరియైన సమయానికే వచ్చి పూజ ప్రారంభించారు.హోమాలూ,వాస్తుపూజలవీ మాకు అక్కర్లేదు.సింపుల్గా వినాయక పూజ, వ్రతం
చేయమన్నాం.పల్లవీ,ఆషీ చేత పూజ చేయించమన్నాం.ఆయన అలాగే చేసారు.చిన్నమరిది దంపతులు,ఆడబడుచు దంపతులు వచ్చారు.వాళ్ళకి పల్లవి బట్టలు పెట్టింది.
పాలు పొంగించి చేసిన పరమాన్నం,మేము ఇంటినుండి తెచ్చిన పులిహోర,దద్దోజనం అందరం
తినేసి తిరిగి ఇంటికి వచ్చేసాం.మొత్తం మీద ఒక ప్రహసనం నిర్విఘ్నంగానే పూర్తి కావటంతో వూపిరి పీల్చుకున్నాము.
ఒక వారం పదిరోజులు అయ్యాక కార్పెంటర్ ను వెతుకుదాములే అనుకున్నాము.
అనుకోకుండా కందుకూరి శ్రీరాములుగారు ఒక కార్పెంటర్ గురించి తెలియజేసారు.శంకరం,శ్రీరాములుగారూ కార్పెంటర్ చారిని తీసుకుని వచ్చారు.అందరూ కలిసి సరూర్ నగర్ ఇంటికి కార్పెంటర్ ను తీసుకుని వెళ్ళి ఇల్లు చూపించారు.
కొన్ని ఫర్నీచర్ మోడల్స్ ఆల్బంలు కార్పెంటర్ చారి తీసుకొని వచ్చాక మార్పుచేర్పులు తో మనకు నచ్చే విధంగా చేయించుకోవచ్చు అనుకున్నాం.వార్డు రోబ్ లకు వేయాల్సిన డెకలమ్ డిజైన్లు పల్లవే ఎంపిక చేసుకుంటానంది.పూర్తి చేయటానికి మూడునెలలు పడుతుందని చారి చెప్పాడు.అదంతా అయ్యాకే ఆ ఇంట్లోకి మారుదామని మేము నిర్ణయించుకున్నాము.అప్పటికి ఆషీకి కూడా పరీక్షలు పూర్తయ్యాకే సెలవుల్లో మారవచ్చులే అనుకున్నాం.
నడక దారిలో -54
నడక దారిలో -54.
నా సమగ్ర కవిత్వం పుస్తకావిష్కరణ జరిగిన తర్వాత వీర్రాజుగారి సప్తతి సందర్భంగా దగ్గరి బంధువులతో,ఓ అయిదారుగురు ఆత్మీయ మిత్రులతో హొటల్లో చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసాము పల్లవీ ,నేనూ.
రోజు రోజుకూ తెలంగాణా ఉద్యమం ఊపందుకుంది.ఉద్యమ భావావేశం వలన చాలా మంది ఆత్మీయులైన సాహితీ మిత్రులు దూరం అయిపోయారు.తరుచూ కలవటానికి వచ్చేవారు కూడా రావటం మానేసారు.అది వీర్రాజుగారికి తీవ్ర మనస్తాపం కలిగించింది.
"ఎప్పుడో 1961 లో కడుపు చేతపట్టుకొని మనరాజధాని కదా అని వచ్చి శక్తిసామర్థ్యాలు,వయస్సూ అంతా ఈ గడ్డమీదే కరిగించుకున్నాము.నన్ను కన్నవారినీ,మనం కన్న పిల్లాడిని ఈ మట్టిలోనే కలిపాము.ఇప్పుడు ఇక్కడ పరాయి వాళ్ళమైపోయామా" అని తరచూ బాధ పడేవారు.
అదీగాక 2010 సంవత్సరానికి వచ్చేసరికి ముఖచిత్రాలు చిత్రకారులు తో వేయించే పద్ధతి తగ్గిపోయి ఫొటోలు,డిజిటల్ చిత్రాల వైపు సాహితీవేత్తలు ఆకర్షితులు కావటంతో ముఖచిత్రం కోసం వచ్చేవారూ తగ్గిపోయారు.ఇకపై ముఖచిత్రాలు చేయించుకునేవారు లేరు కనుక వీర్రాజుగారికి తైలవర్ణచిత్రాలు వేయాలనే ఆలోచన వచ్చింది.స్వంతంగా కట్టెఫ్రేములు చేయించి కేన్వాసుబట్ట కొని వాటికి బిగించి తయారు చేసుకుని ఒక చిత్రయజ్ఞాన్ని మొదలు పెట్టారు.
ఉదయం ఎనిమిదికే తయారై టిఫిన్ పూర్తి చేసి ఒక పొట్టి స్టూల్ మీద తాను కూర్చొని ముందు ఇంకో కుర్చీ మీద కాన్వాస్ ఫ్రేమ్ అమర్చుకొని చిత్రం వేయటం మొదలుపెట్టేవారు .తైలవర్ణాలు ఆరటానికి సమయం పడుతుంది కనుక ఒకేసారి రెండుమూడు కేన్వాసులపై చిత్రాలు తయారుగా వుంచుకునేవారు.
చుట్టూ రంగులు పరుచుకొని వర్ణచిత్రాలు వేస్తున్నప్పుడు రంగుల సరస్సులో ఇహాపరాలు మరచి ఈదులాడుతున్న అమాయకపు పసిబాలుడిలా కన్పించేవారు.భోజనసమయానికి పిలువగా పిలువగా కలుపుకున్న రంగు ఎండిపోతుంది అని పూర్తి అయ్యాక గానీ లేచేవారు కాదు.భోజనానంతరం ఒక్క అరగంట ఆగి మళ్ళా కాన్వాస్ ముందు కూర్చునేవారు.ఒక్కోసారి తాగటానికి ఇచ్చిన మంచినీళ్ళగ్లాసులోనో,కాఫీకప్పులోనో చిత్ర ధ్యానంలో పొరపాటున కుంచెను ముంచేసే వారు.
కంటిన్యూగా పది పన్నెండు గంటలు లేవకుండా పొట్టి కుర్చీ మీద కూర్చొని కూర్చొని ఆయనకు మోకాళ్ళ నొప్పులు ప్రారంభమయ్యాయి.ఒక్కొక్కప్పుడు ఉదయపు నడక చేస్తున్నా ఇబ్బంది పడేవారు.అలా కంటిన్యూగా చేయకుండా ఒక పూట మాత్రం పెయింటింగ్స్ వేసి మధ్యాహ్నం వేరే పని చేయమని కోపగించేదాన్ని.కానీ చిత్రం పూర్తి చేసేవరకూ ఆయనకి మనసు ఆగేదికాదు. రాజకీయ రంగు పులుముకున్న సాహిత్య మీటింగులకు మాకు ఆహ్వానాలు లేకపోవటంతో సభలకు వెళ్ళటం తగ్గిపోయింది.
మా ఇంటిప్రక్క మసీదు పెద్దగా కట్టేయటమే కాకుండా ఆ చుట్టూ చిన్న చిన్న ఇళ్ళన్నీ మూడు,నాలుగు అంతస్తులుగా పెరిగిపోయాయి.ఆ పై అంతస్తుల్లో ఎక్కువగా నైజీరియన్లు చేరారు.రోజు తెల్లవారుజామున ముఫ్ఫై నలభై మంది టీవీ టవర్ ఆస్మాన్ ఘడ్ నుండి మసీదు వైపు వస్తూ కనబడుతుండేవారు.దాంతో మా బిల్డింగ్ టెర్రస్ మీదకి వెళ్ళాలంటే ఇబ్బందికరం అయిపోయింది.రాత్రిపూట అర్థరాత్రి దాటే దాకా మా బిల్డింగ్ ముందు గట్ల మీద కూర్చొని రణగొణధ్వనిగా మాట్లాడుకొంటూ వుండేవారు.రాత్రి పెట్రోలింగ్ చేసే పోలీసులు కోప్పడి ఇళ్ళకి పంపేవారు.రోడ్డువైపుకే మా బెడ్రూం వుండటంతో ఈ గొడవలకి నిద్రపట్టేదికాదు.
నగరంలో ఏ మతఘర్షణ జరిగినా,మాదకద్రవ్యాల కేసులకైనా మూలాలు మా ఏరియా లోనే వుండేవి.అందుకే కాబోలు మా పైన వుండే సింథీవాళ్ళు అపార్ట్మెంట్స్ అమ్ముకొని వెళ్ళిపోయారు.
పల్లవి గచ్చిబౌలి నుండి బస్సులు పట్టుకొని రెండుగంటలు ప్రయాణం చేసి వచ్చేసరికి ఒక్కొక్కసారి తొమ్మిది దాటేది.ఆ ప్రాంతంలో తిరిగే ఆవారాలు అరుగుల మీద కూర్చొని " ఈ ఆంధ్రావాళ్ళు,ఈ ఆడోళ్ళు వచ్చి మన వుద్యోగాలు మనకి కాకుండా చేసారు" అంటూ రాజకీయనాయకుల్లా ఏదో ఒకటి వాగుతూ వుండేవారు. ' నేను ఇక్కడే పుట్టి పెరిగి చదువుకుని వుద్యోగం చేసుకుంటుంటే ఇలా అంటారేమిటని' అసలే అలసి పోయి వచ్చిన పల్లవి చిరాకు పడిపోయేది.
ఇంకా రానురానూ విసుగెత్తి పోయి వేరేచోట ఇల్లు కొనుక్కుని ఈ ప్రాంతం నుంచి వెళ్ళి పోదామని నిర్ణయానికి వచ్చింది.ఆషీ కూడా పెద్దదవుతోంది కనుక మూడు బెడ్ రూముల ఇల్లు చూడాలని నిశ్చయించుకున్నాం.
మొదట్లో ఇండిపెండెంట్ ఇళ్ళకోసమే చూసాం.తన స్నేహితులూ, బంధువులూ దగ్గర్లో వున్నారు కనుక మలక్ పేట,వనస్థలిపురం మధ్య లోనే చూస్తే బాగుంటుందని వీర్రాజుగారు
అభిప్రాయపడ్డారు.కానీ మా ఆర్థిక లిమిటేషన్ కి మించి ధరలు వున్నాయి.పల్లవికి ఆఫీసుకి దగ్గరగా వుండేలా ఇల్లు తీసుకుంటే రానూపోనూ నాలుగు గంటల శ్రమ తగ్గుతుందనే ఆలోచన వున్నా వీర్రాజు గారు ఇటువైపే చూద్దాం అనటంతో తండ్రి మాటల్ని తోసిపుచ్చలేక పోయింది.
డిసెంబరు 9వ తేదీన కేంద్రం ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా హోం శాఖ మంత్రి చిదంబరం స్వయంగా ప్రకటన చేశారు. ఈ ప్రకటన తర్వాత తెలంగాణా అంతటా పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి.
ఆ మర్నాడు తెల్లారిన తరువాత ఆంధ్రలో సమైక్యాంధ్రకు అనుకూలంగా రాజీనామాలు, ఆందోళనలు మొదలయ్యాయి.అన్ని ముఖ్యమైన కేంద్రరాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు,ముఖ్యమైన విద్యాసంస్థలు, ఐటీ కారిడార్ మొదలైన వన్నీ హైదరాబాద్ లోనే ఉండటం ,ఆంధ్రాకు చెందిన అనేక
మంది తమ పెట్టుబడులను ఇక్కడే పెట్టడం,ఇక్కడే ఇల్లూ వాకిలి పిల్లల చదువులతో స్థిర పడిన వారంతా ఏమీ తోచని స్థితికి వచ్చారు. వీటి వలన హైదరాబాద్ తో సహా తెలంగాణా విడిపోతే మంచి విద్యా సంస్థలుగానీ ప్రభుత్వ రంగ సంస్థలు గాని లేని మిగిలిన ఆంధ్రప్రదేశ్ మనుగడ భయంకరంగా కనిపించింది.
హైదరాబాద్ లో ఆఫీసుల్లో పనిచేసే వుద్యోగులలో చీలిక వచ్చేసింది.
ఆ ఆందోళనల ప్రభావంతో డిసెంబరు 23న తెలంగాణ ప్రకటన నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్టు ప్రకటించారు చిదంబరం.దాంతో మళ్ళా తెలంగాణ భగ్గుమంది. ప్రాంతీయ వివక్షలు అన్ని రంగాలలో మొదలయ్యాయి. సాహిత్య రంగంలో మరింత స్పష్టంగా కనిపించింది.ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా అనేక ధూం ధాం లు నార్వహించటం అందులో భాగంగా కవితా గానాలు ఎక్కడికక్కడ జరిగాయి.
ఎప్పుడో వచ్చి ఇక్కడే స్థిర పడిన మాలాంటి
వాళ్ళం ప్రత్యేక తెలంగాణా వుద్యమానికి సానుకూలంగా వున్నా కూడా శత్రువులుగా పరిగణించడంతో ఆత్మీయులైన సాహితీ మిత్రులకు మాకు మధ్య కనిపించని గోడ వున్నట్లుగా దుఃఖం కలిగేది.మనసువిప్పి ఎవరితో కూడా బాధని పంచుకునే పరిస్థితి మృగ్యం అయిపోయింది.ఈ ప్రభావం నాకన్నా వీర్రాజుగారి మీద ఎక్కువగా వున్నట్లుగా వుంది.సభలూ సమావేశాలకు కూడా ఎప్పుడో తప్ప వెళ్ళటం తగ్గి పోయింది.అదీకాక అన్ని సమావేశం మందిరాల్లోనూ ఉద్యమం సమావేశాలూ,కవితాగానాలూ ఎక్కువగా జరుగుతుండేవి.థూమ్ థామ్ లోనూ,జాగృతి బతుకమ్మ సంబురాలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి.
మా కింద అపార్ట్మెంట్ లో యజ్ణప్రభగారు సంగీతం టీచర్.పల్లవికి ఆమే సంగీతం నేర్పించి,ఢిల్లీ గంధర్వమహావిద్యాలయం సర్టిఫికెట్ పరీక్ష కూడా రాయించారు.ఆతర్వాత పల్లవి రేడియోలో బిగ్రేడ్ సెలెక్షన్ పాసై లలిత సంగీతం పాడేది.ఇదంతా పల్లవి పెళ్ళి కాకముందటి విషయం.పల్లవి వివాహా ఏర్పాట్లకు కూడా అప్పుడుచాలా అండదండగా వున్నారు.బ్రహ్మలే అయినా పల్లవిని దత్త పుత్రిక లా ప్రేమించేవారు.పల్లవికి జరిగిన దుర్ఘటన నాకు ఆమె చాలా కలత పడ్డారు.ఒక జ్యోతిష్కుడి దగ్గర మళ్ళీ పెళ్ళి గురించి కూడా కనుక్కుని చాలా ఉత్సాహంగా నాకు చెప్పారు.నాకు వాటిమీద నమ్మకం లేక పోయినా పిల్ల జీవితం చక్కబడి ఒక తీరం చేరుతుందనే మాట సంతోషమే కలిగించింది.అంతగా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి యజ్ణప్రభగారు.ఆమె పెద్దన్న రాజమండ్రిలో శ్రీపాద పట్టాభి నాటకరంగంలో వుండేవారు.తమ్మీడు జిత్ మోహన్ మిత్ర నటుడు.ఆ విధంగా ఆమె కుటుంబం సాంస్కృతిక వారసత్వం కలిగిన వాళ్ళు.
అయితే ఆమెకు రానురాను అనారోగ్యపు ఛాయలు పెరిగాయి.మొదట్లో చెప్పటం మర్చిపోతానేమో అన్నట్లు గబగబా మాట్లాడే ఆమె తదనంతరం డిమెన్షియా బారిన పడ్డారు.అది అర్థం కాక వాళ్ళాయన చెడ తిట్టటం,అరవటం,కొట్టటం చేసేవాడు.కిందనుండి వచ్చే ఆ కేకలూ,తిట్లూ,గోల చికాకే కాక ఆమె భర్త మీద కోపం వచ్చేది.గృహహింస కింద అతనిమీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనిపించేది.ఇస్తే అతన్ని అరెష్టు చేస్తారుసరే.కొడుకులిద్దరూ విదేశాల్లో వున్నారు.అటువంటప్పుడు ఆమె గతి ఏమిటి అనిపించింది.ఏ సమస్యకైనా రెండువైపులా ఆలోచించాలని అంటారందుకే.
ఈమె సంగతి ఇలా అయితే మా కుటుంబ మిత్రులు, వీర్రాజు గారి ఆప్తమిత్రుడు రచయిత అయిన వ్యక్తి ఇదే విధంగా డిమెన్షియా రావటానికి తొలి స్టేజిలో వున్నాడు.ఆయన్ని చూసుకోలేక భార్యా పిల్లలు మా ఇంటికి దగ్గరలోనే వృద్ధాశ్రమంలో చేర్చారు.ఆయన తన భార్యాపిల్లలు వృద్ధికి ఎంతగా శ్రమ పడేవారో తొలి నుంచీ కళ్ళారా చూసిన వాళ్ళం.ఆయన తన మనవరాలిని చూసేందుకు చుట్టూ వెతుక్కునే వారు.ఆయన తపన చూస్తే మనసు ద్రవించి పోయేది.అటువంటి భార్యా పిల్లలూ ఎప్పుడో వారానికో,రెండు వారాల్లో వచ్చి చూసేవారు.
కానీ వీర్రాజు గారు రోజు విడిచి రోజు పెయింటింగ్స్ వేయటం పని ఆపేసి స్నేహితునికి ఇష్టమైన వంటకం చేయించి తీసుకుని వెళ్ళేవారు.ఒక్కొక్కప్పుడు నేను కూడా వెళ్ళే దాన్ని.
ఆశ్చర్యం ఏమిటంటే చివరి రోజుల వరకూ ఆయన వీర్రాజు గారిని గుర్తుపట్టేవారు.
ఇంతకీ అతనెవరంటే కె.కె.మీనన్ పేరు గల కథకుడు.తొంభైలలోనే సరోగసీమీద నవల రాసిన వైజ్ఞానిక రచయిత.ముఖ్యంగా ఏజీ ఆఫీస్ లో రంజని పేరుతో సాహిత్య సంస్థకు అధ్యక్షుడుగా వున్న కాలంలో అనేకమంది ప్రముఖ రచయితలను ఆహ్వానించి మంచి కార్యక్రమాలను నిర్వహించి రంజనికి ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి.కానీ ఆయన చివరిదశలో పలకరించి సాంత్వన పలికిన వారూ లేరు.తర్వాత కూడా ఆయన విస్తృత రచయితగా మిగిలిపోవడం కన్నా విషాదం ఏముంది?
ఈ ఇద్దరూ వారికే తెలియని జీవితాన్ని పసివారిలా జీవించిన రోజులూ మర్చిపోలేను.వారు భౌతికంగా లేకుండా వెళ్ళిపోయిన నాటి విషాదపు రోజులనూ మరచిపోలేక తలచుకున్నప్పుడల్లా సలుపు పెడుతూనే వుండటంతో ఆ తర్వాత " నిజానికీ అబద్ధానికీ మధ్య" అనే కథ రాసాను.
వృద్ధాప్యం ఒకశాపమా? లేకుంటే డిమెన్షియా వలన శాపమౌతోందా అనే ఆలోచన వెంటాడింది.
నన్నే కాదు వీర్రాజుగారి మనసునీ అతలాకుతలం చేసింది.
- శ
26, జూన్ 2025, గురువారం
అసీతినెలబాలుడు విహారి
అశీతి నెలబాలుడు-విహారి
ఒక సాహితీవేత్త జీవితాన్నీ, సాహిత్యాన్నీ పరామర్శించాలంటే వారి సమగ్ర సృజన అధ్యయనం చేయాలి. కానీ విహారి అనే పేరుతో సాహిత్య రంగంలో నమోదు అయిన జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తిగారు చేసిన కృషి అనన్య సామాన్యం, 1962లో 'చుక్కాని' పత్రికలో ప్రచురితమైన 'రాగజ్యోతి' కథతో మొదలుపెట్టి పద్నాలుగు కథా సంపుటాలు వెలువరించారు. ఆరు నవలలు సాహిత్య రంగానికి అందించారు. ప్రముఖుల సాహిత్యం గురించే కాక యువతరం వారిని కూడా వెన్నుతట్టి ప్రోత్సాహం ఇస్తూ సాహిత్య పరామర్శ చేయటం గుర్తించదగినది. గురజాడ మొదలుకొని నేటితరం కథకుల వరకు కుల, మత, ప్రాంత భేదం లేకుండా అన్ని సాహిత్య వాదాలనూ, ఆయా కథకుల కథలన్నింటినీ చదివి సమగ్రమైన వ్యాసాలు రాశారు. నొప్పింపక తానొవ్వక అన్నట్లుగా కథకుని కథలలోని వస్తు రూపాల్ని శైలి శిల్పాలనూ, భాషా విషైక విశేషాలను విశ్లేషిస్తూ సుమారు 300 మంది కథకులపై రాసిన ఈ విశేషవ్యాసాల్ని పదిహేను సంపుటాలుగా ప్రచురించారు. ఇవి ఒక వ్యక్తి చేయలేని ఈ సంపుటాలు విశ్వవిద్యాలయాలలో పరిశోధకులకు ఉపయుక్తంగా ఉన్నాయి.
2013లో 'ఆనాటి కథలు- ఆణిముత్యాలు' శీర్షికతో అపురూపమైన శ్రీపాద, వట్టికోట ఆళ్వారుస్వామి, చలం, కనపర్తి వరలక్ష్మమ్మ మొదలైన ప్రముఖుల ఆణిముత్యం వంటి కథలను వారి గుణ విశేషములను కొత్తతరం: రచయితలకు ఉపయోగపడేలా పరిచయం చేశారు.
సుమారు అరవై ఏళ్లుగా చేస్తున్న సాహిత్య వ్యవసాయంలో 300కు పైగా రాసిన కథలన్నీ కూడా సమాజాన్ని పరిశీలించినవే. చదువు విలువని తెలియజెప్పి 'అక్షరం', రాజకీయ మోహంతో పట్టని వ్యక్తుల కథ 'అమ్మ వెనక చీకటి', 'ఆ తల్లికేం కావాలి' వంటి తల్లి వేదననీ, వాత్సల్యాన్ని, వృద్ధాప్యాన్ని సమస్యల్ని తెరిచి చూపే కథలు, డబ్బు వెనక పరుగులు తీసే పిల్లలు, కథలన్నింటా జీవితాన్ని ప్రవహింప చేసేలా సున్నితమైన భావ ప్రకటన వీరి సొంతం. సరళ సంభాషణలు మానవీయ విలువలు, కుటుంబ, ఆర్ధిక సంబంధాలు ఇలా అపారమైన కథా వాహినిలోని కథల గురించి చెప్పుకుంటే ఒక పుస్తకాన్నే రాయొచ్చు. ఇప్పటికీ కూడా కొత్తవారితో సమానంగా విహారి గారి కలం తాజాగా పోటీలలో కూడా కథలను రాస్తుందంటే విహారి గారి సృజన ఎంత నవనవోష్మంగా ఉందో అర్థమవుతుంది.
మరో ముఖ్య విషయమేమంటే, చాలామంది కథకులలాగా విహారిగారు తన కథలలో సమాజంలోని అవకతవకలపై కత్తి ఝుళిపించరు. చాలా సహనంతో ఒక్కొక్క పొరనే విప్పుతూ సమాజాన్ని చూపుతారు. సమాజంలోని వ్యక్తుల బాధ్యతల్ని ఎత్తి చూపి గుర్తు చేస్తారు. చెప్పదలచుకున్న సిద్ధాంతాల్ని సహృదయంతో పాఠకులు స్వీకరించే పంధాలో ఒప్పిస్తూ కథనీకరించడం వీరి రచనా విధానం, విహారి గారు చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు ఆఖరికి 6500 పద్యాలతో 'శ్రీ పదచిత్ర రామాయణం' రచించి బృహత్ గ్రంథ రూపంలోకి తీసుకువచ్చారు.
విహారి గారి అపార సాహితీ సంపదని విశ్లేషించటం అసాధ్యం, అందువలన నేను కవిత్వానికే పరిమితమై నాకు అత్యంత ప్రీతిపాత్రమైన దీర్ఘ కవిత 'చేవ్రాలు' గూర్చి పరామర్శించే దలిచారు.
విహారి గారు ఇప్పటికీ వెలువరించిన చలనమ్ కలం కన్ను, మనం మనం.. 'మధ్య మా గతి' అనే సంపుటాలు కాక 'చీకటి నాణెం' అనే దీర్ఘ కవిత అంతకుముందు వెలువరించిన కవిత్వ గ్రంథాలు ఇటీవల వెలువరించిన దీర్ఘకవిత చేవ్రాలు, దీనికి టాగ్ లైన్ గా 'వ్యక్తిత్వం' -"వికసనం' అని పేరు పెట్టటంలోనే ఒక ప్రత్యేకత చూపారు.
''గుండె గొంతులోన కొట్లాడినట్లు విహారి గారిని ఒక చోట నిలకడగా కూర్చోనీయకుండా పదేళ్ల మధనంగా బయటపడింది ఈ చేవ్రాలు దీర్ఘకవిత. ఇందులో ప్రవేశిక, ప్రారంభిక, లోనారసి,ఋణరేఖ,వికసనం అని అయిదు అధ్యాయాలుగా విభజించినా, అతిపెద్ద అధ్యాయంగా, ముఖ్యమైనదిగా మూడవది ఉన్నా ఇంకా పాఠకులకు మరింత హృదయంగమంగా ఉండటానికి కావచ్చు.. లేదా పాఠకులు రచనలోకి మమేకం కావాలనే ఉద్దేశ్యం కావచ్చు.. కవి మధ్య మధ్య హెడ్డింగులు పెట్టి సులభ గ్రాహ్యం చేసేరు.
ఒక వ్యక్తి మానసిక వికననం అతడు పెరిగిన వాతావరణంపైనా, ప్రభావితం చేసే మిత్రుల పైనా,చదువు నేర్పిన గురువుల పైనా, చదివిన చదువులపైనా ఆధారపడి ఉంటుంది. ఆ మానవ వికసన సమగ్ర పరిణామ రూపాన్ని 'చేవ్రాలు'లో అక్షరీకరించాడు విహారి గారు.
మొదటి అధ్యాయంలో కవితని ఎత్తుకోవటమే. జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నది' అని మొదలు పెట్టడంతో సమాజంలోని వివిధ కోణాలను చూపించారు. బతుకును ముంజేతి కంకణంగా అభివర్ణిస్తూనే-'ఎవరి బతుకు వారికి/వారే కుట్టించుకున్న వలువ/ఎవరి వేలిముద్ర వారివే' అంటారు. ఎందుకంటే ఒకరి జీవితం మరొకరి చేతిలో ఆటబొమ్మ కాదు అని నిర్ధారిస్తూనే 'ఒకరి జీవితం వేరొకరి చేతిలో తెల్ల కాగితం అంటారు. తెల్ల కాగితం మీద ఎవరికి వారు రాసుకోవాలి కానీ మరొకరి ఆధీనంలో ఉంటే జీవితం ఎట్లా పరిణమిస్తుందో ఊహించుకోవాలనే అభిప్రాయాన్ని కవి ప్రకటిస్తారు..
రెండో ఆధ్యాయం ప్రారంభికలో శిరశోదయమై మాయని ఛేదించుకొని వచ్చిన శిశువుల బుడి బుడి అడుగులు వేయటం, తల్లి గోరు ముద్దలు, చదువుల పరుగుపందేలు,వచ్చీరాని కౌమార ప్రాయంలో వారిపై ప్రభావం చూపించే మాయాజాలాల కారణంగా- మెదడు పంజరంలో కోర్కెల చిలుకలు గుప్త విజ్ఞానంపై మోహం గురించి కవిత్వీకరిస్తూనే 'నడక కాదిది పోరాట జారుడుమెట్లపై ఆట' అంటూ సందిగ్ధప్రాయవు చంచల స్వభావాన్ని అక్షరాలతో గుది గుచ్చారు.
ఇక ముఖ్యమైన పెద్ద అధ్యాయం 'లోనారసి' లో దాని కొనసాగింపు గానే 'గుండె మట్టిని కుల్లగించే/ కోరికల వానపాములు 'గురించి జాగరూకత చెప్తాడు కవి. ఆలోచనాశూన్యులకు ప్రతి అంశాన్ని భూతద్దంలో చూపి భయభ్రాంతులకు లోనుచేసి మానసిక రోగులుగా మార్చే వైనాన్ని విశదీకరిస్తారు కవి. ఆత్మ న్యూనతకి చోటిస్తే గుండె సాగదీయక తప్పని కమ్మెచ్చుతీగ 'అవుతుందంటారు. నడిగ్గా అటువంటప్పుడే-' నిత్యానిత్య వివేకం -వ్యక్తిత్వం'-ని నిలబెడుతుందని ముక్తాయింపునిస్తారు.
'క్రియా శూన్యత గట్టు మీది పిచ్చిమొక్క వరి చేలో కలుపు మొక్క/ అచంచల విశ్వాసం/అదే దారి దీపం' అదే చేతి కర్ర' అంటూ మన భావోద్వేగాలకు మనమే బాధ్యులం అనేది ఉపదేశిస్తారు. కలలు కన వద్దంటారు. ఎందుకంటే అనుకున్నది జరగకపోతే వచ్చే అనర్థాలు తెలియజేస్తారు.
''డాలర్ల రోగగ్రస్తుడికి చికిత్స లేదని ఖచ్చితంగా ప్రకటిస్తారు. ఏ విషయానికి నా వల్ల కాదని వదిలేయొద్దంటారు. అవినీతి మేత, క్షణికోద్రేకం, ఆహం వీటన్నిటి వలన జరిగే కష్టనష్టాలను పంక్తులు పంక్తులుగా బోధిస్తూ మానసిక వికశనం కావాలంటే సందేహం, పరిశీలన, సమాచారం, విశ్లేషణ మనిషికి అత్యవసరం అంటారు కవి విహారి.
నాలుగవ అధ్యాయం నుంచి యవ్వనానికి 'ఋజు రేఖలు లక్ష్య నిర్దేశానికి గమ్యం నీది -నడక నీది- మిట్ట పల్లాలని సహనమే ఏకైక దీవంగా గమనిస్తూ ముందుకు నడవమంటారు. ఈ అధ్యాయం అంతా ఎన్నైన్నో సామెతల్ని కవితాత్మకంగా ఉటంకించుతూ సుబోధకంగా ఆసాంతం సాగుతుంది.
'స్వీయావిష్కరణం/ వేకువ రేకుల స్పాటిక సాధనం!! /గతం గాయాలు సలుపుతాయి/ రాతి మీద ఉలి దెబ్బలు అవి/ అవి నిట్టాడి గూడులు కాకూడదు/రూపాంతరం చెందిన కర్తవ్యాన్నివ్వాలి'- అని ధైర్యాన్ని, అత్మవిశ్వాసాన్ని పురిగొల్పుతాడు కవి.' క్రమశిక్షణ అంటే/ కఠినత్వమూ కాదు, నిరంకుశత్వమూ కాదు అదొక జీవన విధానం' గా చెప్పటమే కాక నిబద్ధత బద్ధకానికి శత్రువుగా చూపుతారు. కార్యదక్షత కట్టుబడి- పెట్టుబడిగా అభివర్ణించుతారు.'నీ బొమ్మని నీవే చిత్రించుకోగలగాలి' అనటంలో ఎవరి వ్యక్తిత్వాన్ని వారి నిర్మించుకోవాలనే సందేశం ఇస్తారు.
'సృజనకు ఆధార భూమికలు-మేధ విలువలు' అని నిర్ధారిస్తూనే నైతికత అంతస్సూత్రం ఎప్పుడూ తెగిపోకుండా కాపాడుకోవలసిన బాధ్యత వ్యక్తిదే అనేది నర్మగర్భంగా తెలియజేస్తారు కవివిహారి.
"మానవ సంబంధాలంటే/మనం మనంగా వుండటం/మానవసంబంధాలంటే / సమాజ సమన్వయ శక్తి!! 'వ్యక్తి''త్వం' వికసనం అంటే ఎత్తుపల్లాలను చూసి ఆ ప్రక్రియ అదే వ్యక్తి నిర్మాణం' అంటారు కవి
అయిదవ అధ్యాయం వికసనం అంటే విశ్వ దీర్ఘ కవితారాగానికి శృతి కూర్చటం అంటూ ముక్తాయింపుగా ఒక వ్యక్తి సంపూర్ణ మానవుడిగా రూపొందటానికి అలవర్చుకోవాల్సిన, జీవితాంతం పాటించవలసిన నిర్మాణ ప్రక్రియల రూపకల్పనలని ముగిస్తారు.
నేటి యువతరానికి వ్యక్తిత్వ వికాసచిత్రాలను దీర్ఘ కవితారూపంలో లక్ష్యాన్ని నిర్దేశిస్తూ, లక్ష్యాన్ని దినచర్యలో భాగంగా చేసుకొని సమయ నిర్దేశాన్ని చుక్కానిగా చేసుకొని ప్రయాణిస్తే రూపెత్తిన మనిషిగా మారగలడనే ఆశయంతో తన చేవ్రాలు' లు వ్యక్తిత్వ వికాస గ్రంథంగా తీర్చారు విహారి గారు.
కేవలం మాటల మనిషిగా, రాతల మనిషిగా కాక తాను ఆచరించి చూపే స్నేహశీలి, సౌజన్య మూర్తి, నిర్విరామ, నిరంతర సృజనశీలి అయిన 'విహారి గారికి ఎనిమిది పదులు దాటిన వయసులోనూ వారి కలం ఇంకా పదునెక్కాలని అభిలషిస్తూ వారికి సహస్రాధిక జన్మదిన శుభాకాంక్షలు
(అక్టోబర్ 15-విహారి గారి 81వ జన్మదినం సందర్భంగా సృజన క్రాంతి ఈ ప్రత్యేక వ్యాసం)
నడక దారిలో -53
నడక దారిలో -53
మా ఇంటికి దగ్గరలోనే ఆస్మాన్ ఘడ్ మీద సాయికృప అపార్ట్ మెంట్స్ లో కొంతకాలంగా కె.రామలక్ష్మిగారూ,వారి అక్క వుంటున్నారని తెలిసింది.వారి క్రింద అపార్ట్మెంట్ లోనే వారి అక్క కూతురు నివాసం వుంటుంది.అందుకని ఆరుద్ర మరణానంతరం మద్రాసు నుంచి వచ్చేసారు.వాసా ప్రభావతి గారితో మొదటి సారి వెళ్ళాను.ఆతర్వాత తరుచూ వెళ్ళేదాన్ని.రామలక్ష్మి గారితో కబుర్లకు కూచుంటే సమయం తెలియదు.ఒక ప్రవాహంలా అనర్గళంగా ఎప్పడెప్పటి అనుభవాలనో చెప్పుకొంటూ పోతారు.మొదట్లో మాట్లాడుతోన్నప్పుడు 'అలా అనేవారు మీ నాన్న' అని చెప్తుంటే అర్థం అయ్యేది కాదు తర్వాత ఆరుద్ర గారని తెలిసింది.చాలా సన్నిహితంగా నాతో మాట్లాడేవారు.నడవటానికి కాళ్ళు సహకరించక పోయినా వుప్పొంగే వుత్సాహంతో వుండటాన ఆమెతో మాట్లాడుతుంటే మనకీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయనిపించేది.
ఒక సారి వాళ్ళింటికి ఒక పదిహేను మంది రచయిత్రులను ఆహ్వానించి రామలక్ష్మి గారు ఆరుద్ర పుస్తకాన్ని ఆవిష్కరణ చేసారు. వరూధినిగారూ,శాంతసుందరీ,గోవిందరాజుల సీతాదేవి, శారదా అశోక్ వర్థన్,హేమలతా భీమన్న,ముక్తేవిభారతి, కొండవీటి సత్యవతి,కె.బి.లక్ష్మి,పోలాప్రగడ రాజ్యలక్ష్మి మొదలైన వాళ్ళం హాజరయ్యాము.కొంతసేపు ఆరుద్ర లలితా గీతాలు, సినీగీతాలు ఆలపించాము.పుస్తకం ఆవిష్కరించి ఫొటొలు తీసుకొని తర్వాత రామలక్ష్మిగారి మాటలవిందుతో పాటూ వాళ్ళ అక్క కూతురు ఏర్పాటు చేసిన విందు కూడా ఆస్వాదించాము.
రామలక్ష్మి గారి ఇంటి కింద అపార్ట్మెంట్ లో అబాకస్ నేర్పించే టీచర్ వున్నారు.ఆమె దగ్గర ఆషీని అబాకస్ నేర్చుకోవటానికి చేర్చాను.రోజూ ఆషీని తీసుకు వెళ్ళి వాళ్ళింట్లో దిగబెట్టి ఆ క్లాస్ అయ్యేవరకూ నేను ఒక్కొక్కప్పుడు రామలక్ష్మి గారింట్లో కూర్చొని కబుర్లు చెప్పేదాన్ని.ఆషీకి అబాకస్ చాలా నచ్చింది.ఉత్సాహంగా నేర్చుకునేది.
ఆ సందర్భంలో రామలక్ష్మి గారితో నేను తరుచూ కలిసేదాన్ని. అబాకస్ క్లాసు అయ్యేవరకూ రామలక్ష్మిగారి దగ్గరకి వెళ్ళటంతో, ఎన్నెన్ని కబుర్లో చెప్పేవారు. ఒక గంట ఎంత తొందరగా గడచిపోయేదో! ఆమె అనర్గళంగా ఎన్నో విషయాలు చెప్తుంటే సమయం తెలిసేది కాదు.
ఆమె నాకు ఎంతో ఇష్టమైన కవి శ్రీశ్రీ గురించి తాగుబోతుగా చెప్తుంటే బాధకలిగించింది కాని నిజాల్ని ఒప్పుకోవాలి కదా!
ఒకసారి రామలక్ష్మిగారికి పొట్ట ఆపరేషన్ అయ్యిందట. ఆపరేషన్ చేసిన తర్వాత ఆ డాక్టర్ " మీ పొట్టనిండా అక్షరాలే ఉన్నాయని ఆరుద్ర గారు అన్నారు. ఒక్క అక్షరం ముక్కా లేదు మీ పొట్టలో రామలక్ష్మిగారూ'అన్నాడు" అని చెప్తూ నవ్వారు. అదివిన్నాక ఎప్పుడు తలచుకున్నా నవ్వొస్తూ ఉంటుంది
ఆమెకు పత్రికా రంగంలోనూ, సినిమారంగంలో ను, సామాజిక సేవారంగంలోను, సాహిత్య రంగంలోనూ, రాజకీయరంగంలోను ఇలా అనేక అనుభవాలు ఉండటంవలన వాటిల్లోని లొసుగుల్ని విమర్శనాత్మకంగా చెప్పేవారు. ఎదురుగా ఉన్నవారికి కొన్ని విషయాలు నచ్చినా నచ్చకపోయినా ఆమె తన మనసులో మాటను, తన అభిప్రాయాన్ని చెప్పటానికి జంకరు. తనని తానే అందరూ గయ్యాళి నని అంటారని కూడా నవ్వుతూ చెప్పుకుంటారు. నిర్భయంగా ఉన్నది ఉన్నట్లు నిష్కర్షగా చెప్పకమానరు. అందుచేత కొంతమంది ఆమెకు దూరమయ్యారు. నిజానికి వారు రచనలు చేసే ఆకాలంలో ఆయారంగాలలో పురుషాధిక్యత మరింత ఎక్కువ . వాటిని తట్టుకొని నిలదొక్కుకోవాలంటే ధిక్కార స్వరం ఉండక తప్పదేమో.
ప్రతీ ఒక్కరి గురించి అందులోనూ సినీ, సాహిత్య రంగంలో లోని వారి మంచికన్నా వాళ్ళ ప్రవర్తనలోని దుర్గుణాలను వాళ్ళరెండుముఖాలను వేరు చేసి నిర్భయంగా చూపించేవారు. ఆవిడ నెగెటివ్ గానే మాట్లాడుతున్నట్లు అనిపించినా ఆవిడ లోని పాజిటివ్ నెస్ మనం స్పష్టంగా గుర్తించగలం, కదలడానికి కాళ్ళు సహకరించకపోవటంవలన చాలా కాలంగా వీల్ చైర్ కే పరిమితం అయినా అన్నింటికీ ఒకరిపై ఆధారపడాల్సి వచ్చినా సాహిత్యం, సినీరంగం పత్రికలూ వీటి గురించి తప్ప తన శారీరక అసహాయత్వం గురించి గానీ, అనారోగ్యాల గురించి గానీ ఒక్కసారి తలంచరు. ఆ వయసులో కూడా హాస్యంగా, చమత్కారాలతో సానుకూల
దృక్పథంలో మాట్లాడటం వలన ఆమెతో మాట్లాడుతున్నంతసేపూ హాయిగా ఆహ్లాదంగా ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా నిజం.
మొత్తంమీద ఆషీ అబాకస్ క్లాసులు రామలక్ష్మి గారితో సాన్నిహిత్యాన్ని పెంచాయి.
ఎందువలనో గుర్తులేదు.కానీ మలకపేట దిల్షుక్ నగర్ ప్రాంతం అంతా కొన్నాళ్ళు కర్ఫ్యూ పెట్టిన తర్వాత సడలింపు ఇచ్చి రాత్రి ఎనిమిది నుండి రాత్రి కర్ఫ్యూ వుంచారు.
ఆరోజు పల్లవి మధ్యాహ్నం కాలేజీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది.సాయంత్రం ఎప్పటిలాగే ఆషీని అబాకస్ క్లాసులో దించి ఏడుగంటలకు వస్తానని ఇంటికి వచ్చేసాను.ఏడుగంటలకు ఇంటినుండి బయలుదేరి వెళ్తుంటే స్ట్రీట్ లైట్లు ఆరిపోయాయి.నేను ఆ చీకట్లో చిన్న స్పీడ్ బ్రేకర్ని చూసుకోక తట్టుకుని పడిపోయాను.కుడిచేతిమీద ఆపుకోవాలనుకోవటంలో చెయ్యి మణికట్టు దగ్గర విరిగింది.బేగ్ లోని ఫోన్ తీసి చెయ్యాలన్నా వీలుకాలేదు.ఎడమచేతితో కుడిచేతికి సపోర్ట్ ఇచ్చి బాధ అణచుకొని ఆషీ దగ్గరకు వెళ్ళాను.
ఆషీకి ఫోన్ ఇచ్చి మా వారికి రింగ్ చేయమని విషయం చెప్పి మా రెగ్యులర్ ఆటో సలీమ్ కి హాస్పిటల్ కి వెళ్ళటానికి ఫోన్ చేయమన్నాను.పల్లవికీ ఫోన్ చేయించాను.
ఆషీ సాయంతో ఇంటికి వెళ్ళి సలీమ్ ఆటోలో మలక్ పేటలోని సుస్రుతా నర్సింగ్ హోం కు వెళ్ళాము.ఈలోగా పల్లవి డైరెక్ట్ గా అక్కడికే వచ్చింది.
కర్ఫ్యూ అని డాక్టర్ వెళ్ళిపోయాడట.ఒకనర్సు,మరొకరిద్దరు అటెండర్లు వున్నారు.అక్కడ రాత్రికి జాయినైపోమనీ,ఉదయం డాక్టరు వచ్చాక చూస్తారని అన్నారు.నాకునొప్పి అంతకంతకూ పెరిగిపోతోంది.
ఈ లోగా ఫోన్ అందుకుని కారు తీసుకుని పొనుగోటి కృష్ణారెడ్డి వచ్చి దిల్షుక్ నగర్ లోని ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరకు వెళ్దామన్నారు.పల్లవినీ ఆషీని ఇంటికి సలీమ్ ఆటోలో వెళ్ళిపోమన్నాము.
ఆర్థోపెడిక్ డాక్టర్ ఎక్స్ రే తీయించాక, మర్నాడు ఆపరేషన్ చేసి వైర్ వేస్తాము.హైబీపీ వుంది కనుక ఇసీజీ తీయించి రిపోర్ట్ తీసుకు రమ్మన్నారు. వెంటనే నొప్పి తగ్గటానికి ఇంజెక్షన్ ఇచ్చారు.అప్పటికే పది దాటింది.కర్ఫ్యూ వలన అంతటా నిర్మానుష్యం.ఏ హాస్పిటల్ లోనూ డాక్టర్లు లేరు.కారులో అలా వెతుక్కుంటూ కనిపించిన ప్రతీ హాస్పిటల్ మెట్టు ఎక్కాము.ఆఖరికి ఒక దగ్గర ఇసీజి చేయించుకోవడానికి కుదిరింది.రిపోర్టు తీసుకుని మళ్ళీ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే సన్నని వెదురు బద్దలతో తాత్కాలికంగా కట్టు కట్టేరు.అంతవరకూ వేలాడిపోతోన్న కుడి చేతిని ఎడమ చేత్తో పట్టుకునే వున్నాను.ఇవన్ని అయ్యి ఇంటికి వెళ్ళేసరికి సుమారు పన్నెండు అయ్యింది.కాస్త పెరుగన్నం తిని టాబ్లెట్ వేసుకుని పడుకున్నాను.
" పడిపోయానని ఫోన్ చేస్తే తరుచూ కళ్ళు తిరిగి పడిపోతావు కదా అలాగే అనుకున్నాను.ఇంత దెబ్బ తగిలిందను కోలేదు."అన్నారు బిత్తరపోతూ వీర్రాజుగారు.
మర్నాడు ఉదయమే హాస్పిటల్ కి పల్లవి నేనూ వెళ్ళాము.వీర్రాజుగారు ఆషీని చూసుకోడానికి ఆగిపోయారు.అంతేకాక ఆయనకి హాస్పిటల్ వాతావరణంలో బీపీ పెరిగిపోతుంది.అందుకే ఇంట్లోనే వుండమన్నాం.చేతికి రాడ్ వేసి సమ్మెంటుకట్టు కట్టి ఆరు వారాల తర్వాత రమ్మన్నారు.
పల్లవి రెండు వారాలు సెలవు పెట్టింది.ఆ తర్వాత కూరా పప్పు చేసేస్తే వీర్రాజు గారు కుక్కర్ పెట్టేవారు.నేను మామూలుగా రాసుకోవటం చెయగలనా అని నాకు కొంచెం దిగులు మొదలైంది.పల్లవి కోప్పడుతున్నా ఎడమ చేత్తోటే కొంచెం పనులు సాయం చేయటానికి ప్రయత్నించే దాన్ని. ఎడమ చేత్తో రాయటానికి చూసేదాన్ని.ఆ ప్రయత్నంలోనే ఒక కవిత కూడా రాసాను.
ఆరు వారాల తర్వాత సిమ్మెంటు కట్టు తీసేసినా క్లాత్ తో కట్టు కట్టుకోమని డాక్టర్ చెప్పి గోరు వెచ్చని వేడినీళ్లలో చేతిని పెట్టి వేళ్ళు కదుపుతూ ఎక్సర్సైజులు చేయమన్నారు డాక్టర్.నాకు కుడిచేయి ముఖ్యమైనది కదా చాలా శ్రద్ధగా చేసి తొందరగా నొప్పి తగ్గించుకున్నాను.కానీ ఆ చేత్తో కొద్ది బరువు పట్టుకున్నా నొప్పి పెట్టేది.
2009 అసెంబ్లీ ఎన్నికలు మొదలయ్యాయి.వై ఏస్సార్ కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా ముందుకు నడిపించి , అసెంబ్లీలో కాంగ్రెసు 156 సీట్లు గెలుచుకునేలా చేసాడు. వై ఎస్.ఆర్ ముఖ్యమంత్రి గా 20 మే 2009న రెండవసారి ఆంధ్రప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.ఈ సారి కూడా టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా మారింది.విద్యార్థులకు రీయింబర్స్మెంట్ ఇవ్వటంతో ఇబ్బడిముబ్బడిగా వెలిసిన ఇంజనీరింగ్ కాలేజీలు కాంగ్రెస్ కు ప్లస్ పాయింట్ అవుతుంది.గ్రామీణ పిల్లలు,బడుగు వర్గాల పిల్లలు వీటివలన వున్నత విద్యకు చేరువయ్యారు.
ఉద్యోగం చేసినంతకాలమే కాక తర్వాత కూడా మా స్కూల్ విద్యార్థులకు మొదటి రేంక్ వచ్చినవారికి ఆగష్టులో నగదు
బహుమతులు ఇవ్వటం నిలిపివేయలేదు.కవర్లలో డబ్బుపెట్టి కొన్ని ఏళ్ళ పాటు అందజేస్తూనే వున్నాను.కానీ ఆ డబ్బు సక్రమంగా నేను కోరిన విధంగా వుపయోగించటం లేదని తెలిసింది.దాంతో నేను రిటైర్ అయిన నాలుగేళ్ళ తర్వాత ఇవ్వటం మానేసాను.
నా రెండో దీర్ఘ కవిత బతుకు పాటలో అస్తిత్వ రాగం" పూర్తి చేసాను. జీవితంలోని వివిధ దశలైన శైశవం,బాల్యం,కౌమారం, యవ్వనం , ప్రౌడత్వం, వృద్ధాప్యం, ముగింపు తో ఏడు చాప్టర్ లుగా విభజించి స్త్రీ జీవితాన్ని సంపూర్ణంగా కవిత్వంలో అక్షరీకరించాను. తొలిసారిగా పల్లవి డిజిటల్ పద్ధతిలో తయారు చేసిన ముఖచిత్రంతో
ఈ పుస్తకం వెలుగులోకి వచ్చింది.
ఈ పుస్తకం ప్రింటింగ్ సమయంలో వీర్రాజు గారికి ఒక ఆలోచన వచ్చింది."ఈ ఏడాది డిసెంబర్ లో నీ అరవై ఏళ్ళు పుట్టినరోజు వస్తుంది కదా అసందర్భంగా ఇప్పటికి వచ్చిన నీ ఎనిమిది కవిత్వం పుస్తకాలూ కలిపి సమగ్ర సంపుటి గా ప్రచురించుతే బాగుంటుంది " అన్నారు.ఖర్చు ఎక్కువే అవుతుందని నేను ఆలోచించాను.
కానీ వీర్రాజు గారు "ఇంతవరకూ ఇలా ఎవరూ సమగ్ర సంపుటాలుగా వేసుకోలేదు.అందులోనూ ఇంత కవిత్వం రాసిన కవయిత్రులూ తక్కువే.వేస్తేనే బాగుంటుంది." అని గట్టిగా నిర్ణయించుకోవడమే కాకుండా నాళేశ్వరం శంకరంగారితో కూడా ప్రస్తావించారు.శంకరంగారు కూడా మంచి ఆలోచన అని ప్రశంసించి ప్రత్యేక సందర్భంగా ఎవరి చేతనైనా ముందుమాట కూడా రాయించండి అన్నారు.
1980 లో వచ్చిన తొలి కవితా సంపుటికి శివారెడ్డిగారితో ముందుమాట రాయించాను.తర్వాత ఏ సంపుటికీ ఎవరిచేతా రాయించ లేదు.శంకరంగారి సూచన అనుసరించి ఎవరిచేత రాయించుదామా అని ఆలోచించి కాత్యాయనీ విద్మహే ఎగిరేగారితో రాయిస్తే బాగుంటుంది అని నిర్ణయించుకున్నాము.
కాత్యాయనీ విద్మహేగారికి ఫోన్ చేసి విషయం చెప్పాము.ఇంకా అయిదారు నెలలు పైనే వుంది కనుక సమయం తీసుకోమని చెప్పాను.ఆమె సంతోషంగా అంగీకరించారు.నా విడివిడి సంపుటాలన్నీ ఆమెకు పంపించాము.
డిటీపీ చేయించటానికి కూడా ఇచ్చాము.పుస్తకం 500 పేజీలు కన్నా ఎక్కువే వచ్చేలా వుంది.
దేశమంతా వినాయక చవితి సంబరాల్లో మునిగింది.ఎప్పుడూ కోలాహాలంగా వైభవంగా జరిగే వినాయక నిమజ్జనోత్సవాలు చాలా గంభీరంగా,భయంభయంగా జరిగాయి.ఆ తర్వాత
చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరగా ఉదయం గం.9.35 నిమిషాలకు హెలికాప్టరుతో సంబంధాలు తెగిపోయాయనే వార్తలు నాలుగురోజులుగా వస్తున్నాయి.ఒకరెండుమూడు రోజుల పాటూ ఆచూకి తెలియలేదు. ముఖ్యమంత్రి ఆచూకీ కోసం గాలించగా 25 గంటల తరువాత సెప్టెంబర్ 2 వ తేదీ 2009 రోజునాటికి ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్ళు లభించాయి. వై.ఎస్.తో సహా మొత్తం ఐదుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని నిర్థారించారు.
ఉగ్రదాడేమోనని ఒక్కసారిగా రాష్ట్రమే కాకుండా దేశమంతా వులికిపడింది.కానీ చాలాకాలం అన్ని కోణాల నుండి శోధించి హెలికాప్టర్ లోని యాంత్రిక లోపంగా ప్రకటించారు.రోశయ్యగారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధిష్టానం ప్రకటించింది.
కాంగ్రెస్ లో జరిగిన అనూహ్య పరిణామాలు తెరాసా నాయకులకు కలిసి వచ్చింది.అప్పటికే చాలా కాలంగా ఏకీకృతం అవుతున్న వారికి బలం పుంజుకోవడానికి ఇది ఒక అవకాశంగా మారింది.
తెరాసా అక్టోబరు 21న సిద్ధిపేటలో ఉద్యోగ గర్జన పేరుతో భారీ సభ నిర్వహించారు.ఉద్యోగులు , విద్యార్థులు,ప్రజలు ఏకమయ్యారు.జయశంకర్, హరగోపాల్, కోదండరాం, చుక్కా రామయ్య, విద్యాసాగరరావు వంటి మేధావులు సంఘటితం కావటం ఉద్యమం వూపు అందుకుంది.
2009 నవంబర్ 29న సిద్ధిపేట కేంద్రంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఇది తెలంగాణ ఉద్యమానికి కీలక మలుపై తెలంగాణను నిప్పుల కొలిమిగా మార్చింది.
విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావటంతో తెలంగాణ వచ్చే వరకూ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉద్యమానికి కేంద్రబిందువు అయ్యింది . ప్రభుత్వం కేసీఆర్ను దీక్ష చేయకుండా ప్రభుత్వం అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించింది ఆయన జైల్లోనే దీక్ష కొనసాగించారు. తరవాత నిమ్స్ కి తరలించినా దీక్ష కొనసాగింది.
''తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ చచ్చుడో'' అనే నినాదం ఇచ్చారు కేసీఆర్. తెలంగాణా అంతటా భగ్గుమనడంతో కేంద్రపీఠం కదిలింది.
చిదంబరం తెలంగాణ ప్రకటన
డిసెంబరు 9వ తేదీన కేంద్రం తెలంగాణాకు అనుకూలంగా హోం శాఖ మంత్రి చిదంబరం ప్రకటన చేశారు. ఈ ప్రకటన తరువాత సంబరాలు జరిగాయి. కేసీఆర్ దీక్ష విరమించారు.
నా సమగ్ర కవిత్వం చదివి ఒకరోజు కాత్యాయనీ విద్మహే నాకు ఫోన్ చేసి " మీ కవిత స్త్రీ వాద సంకలనం నీలిమేఘాలులో చేరలేదనుకుంటాను.ఎందుచేత " అని అడిగారు ." బహుశా నేను మితవాద స్త్రీ వాదిగా భావించి చేర్చలేదేమో" అన్నాను.ఆమె సుమారు అరగంటసేపు నాకవిత్వం గురించి నాతో ఫోనులో చర్చించారు.అంతేకాదు సుమారు పదహారు పేజీల సుదీర్ఘ ముందుమాట రాసి అందించటం నాకు చాలా సంతోషం కలిగించింది.
అయితే నా పుట్టిన రోజు నాటికి ప్రచురణ పూర్తికాలేదు.అందుకని ఒక డమ్మీ కాపీ తయారుచేసారు వీర్రాజు గారు.
మా కుటుంబానికి బాగా దగ్గరైన ఆత్మీయ మిత్రులు ఒక పదిహేనుమందిని ఆహ్వానించి మా ఆషీతో పుస్తకాన్ని ఆవిష్కరింపజేసి మా ఇంటికి దగ్గరలోనే ఒక హొటలులో కలిసి భోజనాలు చేసాము.ఆ రకంగా నా షష్ఠిపూర్తి అయింది.
పుస్తకం ప్రింటింగ్ పూర్తయ్యాక బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో గోపీ గారి అధ్యక్షతన రత్నమాల , నాళేశ్వరం శంకరం నా పుస్తకంపై ప్రసంగించగా ఎనిమిది సంపుటాలతో కూడిన నా సమగ్ర కవిత్వ సంపుటి ఆవిష్కృతం అయ్యింది.ఆ విధంగా నాకు వీర్రాజుగారు గొప్ప బహుమతి అందించారు.
-- శీలా సుభద్రాదేవి
13, మే 2025, మంగళవారం
నడక దారిలో -52
నడక దారిలో -52
హైదరాబాద్ నగరంలోనే కాదు దేశమంతటినీ ఉలికి పడేలా చేసిన జంట పేలుళ్ళ సంఘటనలు 2007 ఆగష్టు 25 న జరిగాయి.
కోఠి ప్రాంతంలో మూడు దశాబ్దాలుగా పేరున్న గోకుల్ చాట్ షాపులో సాయంత్రంపూట విపరీతమైన జనం కూడివుంటారు.అక్కడి చాట్,పానీపూరీ వంటి వాటికి చాలా డిమాండ్ వుంది.అటువంటి చోట సాయంత్రం 7:40 ప్రాంతంలో బాగా రద్దీగా ఉన్న సమయంలో గోకుల్ చాట్ సెంటరులో బాంబు పేలింది. పదిమందికి పైనే అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 23 మందికి పైగా ఆసుపత్రుల్లో మరణించారు. 50 మందికిపైగా గాయపడ్డారు.మా మారింది కూతురు క్లాస్ మేట్ ఎమ్మెస్ కోసం యూఎస్ వెళ్ళటానికి సిద్ధపడుతూ స్నేహితులతో గోకుల్ చాట్ కి వెళ్ళి గాయపడి పద్దెనిమిది యేళ్ళు దాటినా ఇప్పటికీ వీల్ చైర్ కే అంకితమై శారిరకంగానే కాదు మానసికంగా కూడా వైకల్యంతో వున్నాడు.మానవత్వంలేని రాక్షసులు జనసమ్మర్థ ప్రాంతాలలో ఈ విధంగా చేయటం వలన ఎంతమందికి కడుపు కోత అయిందో కదా
అదే సమయంలో సచివాలయానికి ఎదురుగా ఉన్న లుంబినీ పార్కులో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో మొత్తం 44 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. బాంబుల్లో ఇనుప ముక్కలు వుపయోగించటం వలనే చాలామంది శరీర అవయవాలు కోల్పోయారని తెలిసింది.ఈ సంఘటనలతో ఒక్క సారిగా నగరం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయింది.తలచుకున్నప్పుడల్లా గుండె భారమై పోతుంది.
పల్లవి సాధారణంగా అదేసమయంలో ఇల్లు చేరేది.హైటెక్ సిటీలో బస్సెక్కి లక్డికాపూల్ లో దిగి వనస్థలిపురం బస్ ఎక్కుతుంది.ఇలా ఇంటికి రాగానే ఈ పేలుళ్ళ ఘటన టీవీలో చూసి హమ్మయ్య పిల్ల ఇంటికి చేరిందని వూపిరి తీసుకున్నాం.
మా ఇంట్లో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది వరకూ రేడియోలోంచి గానీ టేప్ రికార్డర్ లోంచి గానీ పాటలు ఇల్లంతా వ్యాపిస్తూనే వుంటాయి.స్వర్ణకమలం,తాల్ పాటలే కాకుండా ఒక చిన్నపిల్లల ఇంగ్లీష్ పాటలు కేసట్ కూడా వేస్తూ వుంటాం.అవి వేసినప్పుడు ఆషి భలే బాగా ఆపకుండా కేసెట్ పూర్తి అయ్యేవరకూ చక్కగా రిథం కి తగినట్లుగా డాన్స్ చేసేది.
నాకు సరేసరి పల్లవికి కూడా క్లాసికల్ డాన్స్ నేర్పించలేక పోయాము.పల్లవి చదివే స్కూల్ లో కో కరిక్యులర్ యాక్టివిటీ క్రింద డాన్స్ క్లాస్ కూడా వుండేది.పల్లవి భరతనాట్యం తీసుకుందామనుకుంటే అందులో ఎక్కువమంది వున్నారని కథక్ లో చేర్చారు.అదికూడా పల్లవి బాగానే నేర్చుకుంది.పదో తరగతి అయ్యాక వదిలేసింది.
ఆషీ బాగా చేస్తుంది కదా నేర్పించుతే బాగుండును అనుకున్నాను.పల్లవి ఉదయం ఎనిమిదిన్నరకి హైటెక్ సిటీ వుద్యోగానికి వెళ్తే తిరిగి వచ్చేసరికి ఏడో ఎనిమిదో అయ్యేది.అందుచేత నాకూ ఆషీకీ దోస్తానీ పెరిగింది.సూపర్ బజార్ వెళ్ళాలన్నా,కూరలకైనా మేమిద్దరమే.వెళ్ళినప్పుడల్లా నన్ను కబుర్లతో మెప్పించి తనకు కావలసిన రకరకాల పెన్నులు,రకరకాల సెంట్ రబ్బర్లూ కొనిపించుకునేది
ఒక రోజు మోర్ సూపర్ బజార్ వెళ్ళి వస్తుంటే ఎల్.ఐ.సి కాలనీ పార్కులో పిల్లలు డాన్స్ చేస్తుండటం చూసి ఆషీని డాన్స్ నేర్చుకుంటావా అని అడిగాను.నేర్చుకుంటాను అనేసరికి పార్క్ లోకి వెళ్ళాను.
పదిమంది వరకు అన్ని వయసుల పిల్లలకూ ఒక అమ్మాయి డాన్స్ నేర్పుతోంది.ఆషీని చూపించి డాన్స్ లో చేర్చాలనుకుంటున్నట్లు చెప్పాను.వారానికి మూడురోజులు క్లాసులు ఉంటాయనీ తెల్లని పంజాబీ డ్రెస్ వేసుకొని రావాలని చెప్పింది.
సరే నని మర్నాటి సాయంత్రానికి నేను ఇంట్లో వున్న క్లాత్ తో తెల్ల పంజాబీ డ్రెస్ కుట్టేసి రెడీ చేసాను.
ఆషీ స్కూల్ నుంచి రాగానే కొత్త డ్రెస్ వేసుకొని తనకోసం తయారు చేసిన అప్పచ్చులు తిని పాలు తాగిన తర్వాత అయిదు గంటలకు పార్కులో డాన్స్ క్లాస్ కి తీసుకు వెళ్ళాను.దారిపొడవునా హుషారుగా కబుర్లు చెప్తూ నడిచింది.
డాన్స్ టీచర్ తీసుకువచ్చిన పండుతాంబూలం తీసుకుని ముందు చేయాల్సిన వందనం నేర్పింది.తర్వాత హస్తముద్రలూ లాంటి వేవో నేర్పింది.ద్వితీయవిఘ్నం వుండొద్దు రేపు కూడా తీసుకుని రమ్మంది.
మర్నాడు కూడా తీసుకు వెళ్ళాను.డాన్స్ పాఠం అయ్యేవరకూ అక్కడే వుండి తిరిగి రోజూ ఇంటికి వస్తున్నాము.ఒక నెల రోజుల పాటూ ఆసక్తి తో ఆషీ క్లాసు ఇష్టపడింది.ఆ డాన్స్ టీచరు పాఠం కన్నా రోజూ ఎవరినో ఒకరిని తిట్టటం ఎక్కువ.దాంతో ఆషీ డాన్స్ క్లాస్ కి బయలు దేరిన దగ్గర నుండి ఇంటికి తిరిగి వచ్చే వరకూ స్వర్ణకమలంలో భానుప్రియలా ముఖంలో "ఎందుకొచ్చిన డాన్స్ రా బాబూ " అన్నట్లు ఎక్స్ ప్రెషన్స్ పెట్టేది.అప్పటికీ దారిపొడవునా నేను కబుర్లు చెప్తున్నా మూడీగా వుండేది.కావాలని క్లాస్ లో తప్పులుగా చేసేది.
డాన్స్ క్లాస్ మానేస్తావా అని అడిగితే వెళ్తాననే అనేది.అంతలో వినాయకచవితి దగ్గర పడింది.డాన్స్ టీచర్ " మీకు గణపతి మీద ఒక డాన్స్ నేర్పిస్తాను.గణపతి మంటపంలో చేయిస్తాను." అని పిల్లలను అందరినీ ఒక ఆర్డర్ లో నిలబెట్టి పాట తన టేబ్ లో ఆన్ చేసింది. ఎలా చేయాలో నేర్పటం మొదలెట్టింది.
"ఏకదంతాయ వక్రతుండాయ ...." అంటూ మొదలైన శంకర్ మహదేవన్ పాట,ఆ రాగమాధుర్యం అప్పటినుండి ఇప్పటికీ విన్నప్పుడల్లా వెంటాడుతునే వుంటుంది.అంత గొప్పగా వుంటుందా పాట.
సరే మళ్ళా డాన్స్ కి వద్దాం .ఒక బొద్దుగా వున్న అమ్మాయిని గణపతిగా ఎంపిక చేసింది.ఆ పిల్ల మర్నాటి నుంచి రావటం మానేసింది.ఈ డాన్స్ కూడా ఆషీ ఆసక్తిగా చేయటం లేదనిపించింది.
ఆ ప్రోగ్రాం ఎక్కడో అర్థరాత్రి జరుగుతుందంటే మా పాప అంత దూరం రాలేదని చెప్పేసాను.
ఆ తర్వాత నెలరోజులన్నా తిరగలేదు.కెనడాలో వున్న భర్త దగ్గరకు వెళ్ళటానికి వీసా వచ్చిందని ఆ అమ్మాయి డాన్స్ పాఠాలకు మంగళం చెప్పేసింది.
మా ఆషీకి డాన్స్ పాఠాలు తప్పిపోయాయి.ఇప్పటికీ స్వర్ణకమలం సినీమా చూస్తే డాన్స్ క్లాసులోని ఆషీ ముఖం గుర్తువచ్చి నవ్వుకుంటాం.
నేను,మా క్రింద ఇంటిలోని సరోజిని గారూ కలసి రోజూ మా యింటికి దగ్గరలోని పార్క్ లో వాకింగ్ కి వెళ్తాం.ఆషీ కూడా మాతో వచ్చి అక్కడే ఆడుకుంటుంది.పార్కు ఎదురుగా ఒక ఇంట్లో అమ్మాయి కీబోర్డు నేర్పుతుంది తెలిసి ఆషీని నేర్చుకుంటావా అని అడిగి అక్కడ చేర్చాను.
ఆ అమ్మాయి సినీ గాయకుడు హేమచంద్ర బంధువట.పాడుతా తీయగా లో పాల్గొన్నానని చెప్పింది. ఆషీ కోసం కీ బోర్డు పల్లవి కొన్నది.వారానికి మూడు రోజులు ఆషీని వాళ్ళింట్లో దింపి నేను నా వాకింగ్ పూర్తిచేసుకుని తిరిగి ఇంటికి తీసుకు వచ్చేదాన్ని.
కీబోర్డు చాలా ఆసక్తిగా ఆషీ నేర్చుకుంది.సరళీస్వరాలు,జంట స్వరాలు,పిళ్ళారి గీతాలేకాక జనగణమన,హేపీ బర్త్ డే పాట కూడా చక్కగా వాయించటం నేర్చుకుంది.బాగా వాయించటం చూసి పల్లవి సినిమా పాటలకు కీబోర్డ్ నొటేషన్లు ఎవరి దగ్గరో డౌన్ లోడ్ చేసి తీసుకు వస్తే అందులోంచి ' చిన్నిచిన్ని ఆశ ' కూడా నేర్చుకుంది.
ఆషీ కీబోర్డు నేర్చుకుంటుందని తెలిసి కృష్ణారెడ్డిగారు కూడా తన పిల్లలిద్దరికీ కీ బోర్డు కొని క్లాస్ లో చేర్పించారు.
ఆషీ ఆసక్తిగా నేర్చుకుంటుందని సంతోషించే లోగానే కొన్ని నెలలు గడిచాక ఆషీ కీబోర్డునేర్పించే టీచరు భర్తని సాఫ్ట్వేర్ ఉద్యోగం ద్వారా కంపెనీ వాళ్ళు అమెరికాకి పంపుతున్నారట.అతనితో పాటు ఆమె కూడా వెళ్తున్నానని చెప్పటం తో ఆషి సంగీతపాఠాలకీ మంగళం పాడేయాల్సి వచ్చింది.
కానీ తర్వాత కూడా ఆషీ చాలాకాలం కీ బోర్డు ప్రాక్టీస్ చేస్తూనే వుండేది.
మొత్తం మీద ఆషీకి సంగీతం, డాన్స్ నేర్పించాలన్న నా కోరిక మొదట్లోనే గండి కొట్టింది.కానీ పుస్తకం పఠనాభిరుచి మాత్రం రోజురోజుకూ,ఏడాదిఏడాదికీ పెరిగింది.అది సంతోషం.
ఇంకా చదవటం రాక ముందు నిద్రపుచ్చే సమయంలో తప్పని సరిగా నేనో,పల్లవో కథలు చెప్పేవాళ్ళం.ఒకొక్కప్పుడు మేము కథ చదువుతూ చెప్పేవాళ్ళు.చదవటం వచ్చాక ఆషీ చేతే చదివించి వివరించే వాళ్ళం.ఆ అలవాటు ఆషీ నేటికీ మానలేదు.పరీక్షల సమయంలో కూడా తానే ఒకటో రెండో కథలు చదివి నిద్రకి ఉపక్రమించటం ఆషీకి అలవాటైపోయింది.తెలుగు పుస్తకాలు తక్కువే కానీ ఇంగ్లీషులో మాత్రం పెద్దపెద్ద పుస్తకాలు చదివేస్తూవుంటుంది.తన ఫోన్ లో కూడా కొన్ని పుస్తకాలు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటుంది.అయితే ఆ వయసు పిల్లలు చదివే రొమాంటిక్ నవలలు కాకుండా కాన్స్పిరసీ నవలలు,చారిత్రక నవలలూ,బయోగ్రఫీలు అటువంటి పుస్తకాలే చదువుతుంది.ఏమైతేనేం పుస్తకాలు చదివే అలవాటు మంచిదే.
ఒకరోజు వార్తాపత్రికలో గుజరాత్ లోని ఆనందనగరం అనే వూరికి పిల్లలు లేని విదేశీ దంపతులు క్యూ కడుతున్నారనీ,సరోగసీ పద్ధతిలో పేద మహిళలను ధనాన్ని ఆశ చూపి ఒప్పిస్తున్నారనే కథనాన్ని చదివి ఒక రాత్రంతా నిద్రపట్టలేదు.అంతకు ముందు పాలమూరు కార్మికులు మధ్యదళారీలను నమ్ముకొని అరబ్ దేశాలకు వెళ్ళి పడరాని కష్టాలు పడుతున్నారనే వార్త చదివి ఎలా అయినా వీరిమీద కథ రాయాలనుకున్నాను.కానీ వివరాలు సేకరించ లేక మానేసాను . ఇప్పుడు అద్దెకు గర్భం విషయం చదివిన తర్వాత ఈ రెండింటినీ కలిపి రాయాలనే ఆలోచన వచ్చి "గోవు మాలచ్చిమి " కథ రాసాను.
అప్పడే అనుకోకుండా బ్రౌన్ అకాడమి నవ్య వార పత్రికతో కలిసి నిర్వహిస్తున్న కథలపోటీ ప్రకటన చూసి పోటీకి కథ పంపించాను.ప్రత్యేక బహుమతి వచ్చింది.
ఈ కథ నవ్య వార పత్రికలో ప్రచురితం అయినప్పుడు చాలా మంచి స్పందన నాకు వచ్చింది.ప్రముఖ రచయిత విహారి గారు ప్రతీ సమావేశంలోనూ ఈ కథ గురించి ప్రస్తావిస్తూ ఈ ఏడాది మేటికథ అని ప్రశంసించేవారు.
బ్రౌన్ అకాడమివారు బహుమతికి ఎంపికైన కథలన్నీ కలిపి "బహుమతి కథలు" పేరిట పుస్తకంగా ప్రచురించారు . కేంద్ర సాహిత్య అకాడమీ వారికి పి.సత్యవతి గారు తన సంపాదకత్వంలో కూర్చిన ఆంగ్లానువాద కథల సంకలనంలో పాపూరి జయలక్ష్మిగారు చేసిన నా గోవు మాలచ్చిమి కథ ఆంగ్లానువాదం కూడా చేర్చారు.
నా మొదటి కథలసంపుటి 1990 లో వచ్చింది.పద్ధెనిమిదేళ్ళ తర్వాత రాసిన కథలన్నీ కలిపి నా రెండవ కథల్ని ఆషీ క్రయాన్స్ తో వేసిన చిత్రాన్ని ముఖచిత్రం గా వేసుకుని కొత్తకథాసంపుటిని రెక్కల చూపు పేరుతో ప్రచురించాము.కానేటి మధుసూదన్ గారూ ,జి.ఎస్.చలం గారూ ఈ పుస్తకావిష్కరణ విజయనగరంలో గానీ,వైజాగ్ లో గానీ పెడతామని అన్నారు.నేను సాధారణంగా ఆవిష్కరణ సభలు పెట్టుకోను.కాని పుట్టిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆవిష్కరణ జరగటం ఒక అనుభూతి కదా.
పెద్దక్కయ్య సంవత్సరీకాలకి ఎలాగూ వెళ్తాం కనుక అప్పుడు ఏర్పాటు చేయమని వీర్రాజు గారు వాళ్ళతో చెప్పారు.
అదేవిధంగా మేము వైజాగ్ రాగానే యూనివర్సిటీ కేంపస్ లోనే రూం కేటాయించారు.ఉత్తరాంధ్ర రచయితలు వచ్చి అక్కడ కలిసారు.
ఆ సాయంత్రం వైజాగ్ లో ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో తెలుగుశాఖాధిపతి సత్యనారాయణ గారి అధ్యక్షతన, తెలుగు ప్రొఫెసర్ డా.సజ్జా మోహనరావుగారు నా "రెక్కల చూపు" కథా సంపుటి ఆవిష్కరణ జరిగింది.వి.ప్రతిమ నా పుస్తకాన్ని పరిచయం చేసింది.ఆవిష్కరణ అద్భుతంగా జరిగింది.
ఆ మర్నాడు వీర్రాజు గారి బాల్యమిత్రుడి ఇంటికి వెళ్ళి సాయంత్రానికి విజయనగరం వెళ్ళిపోయాం.సంవత్సరీకాల కార్యక్రమం అయ్యాక హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం కట్టాము.
లేఖిని రచయిత్రులసంస్థ అధ్యక్షురాలు వాసా ప్రభావతి తెలుగు భాషా సాంస్కృతిక శాఖ కె.వి.రమణాచారి గారి సహకారంతో
ఒక రోజు సదస్సు నిర్వహణ తలపెట్టారు.రాష్ట్రేతర రచయిత్రుల్ని కూడా ఆహ్వానించి,వయోధికులైన ఆరుగురు రచయిత్రులను ఘనంగా సత్కరించారు.ఒక సదస్సులో నేను కె.రామలక్ష్మి గారి కథల గురించి ప్రసంగ వ్యాసం చదివాను.
లేఖిని సంస్థ కనుక అందులోని సభ్యులచేతే వాసా ప్రభావతి గారు ప్రసంగ పత్ర సమర్పణ చేయించారు.
కె.రామలక్ష్మి గారు మా ఇంటికి దగ్గరలోనే పది నిమిషాల నడక దూరంలో ఒక అపార్ట్మెంట్ లో తన సోదరితో పాటు వుంటున్నారు.అందువలన తరుచూ కలిసే దాన్ని.నేను ఆమె కథలగురించి వ్యాసం రాసానని తెలిసి చాలా సంతోషించారు.
ఎప్పటినుంచో స్త్రీ జీవితాన్ని పుట్టిన దగ్గర నుండి వృద్ధాప్యం వరకూ చాప్టర్లుగా విడదీసి దీర్ఘకవిత రాయాలనే ఆలోచన వుంది.దానిని రాయటం మొదలు పెట్టాను.శైశవం, బాల్యం, కౌమారం,యవ్వనం, ప్రౌడత్వం,వృద్ధాప్యం, ముగింపుగా ఏడు చాప్టర్లుచేసి రాయటం ప్రారంభించాను.స్త్రీ జీవితంతో పోలుస్తూ విత్తనం మొలకేసిన దగ్గర నుండి మోడుగా కావటం వరకు,సూర్యోదయం నుండి సంధ్యాసమయంవరకూ ప్రతీ చాప్టర్ నీ మొదలు పెడుతూ స్త్రీ జీవితాన్ని సాదృశ్యం చేస్తూ రాస్తున్నాను.బాగానే వస్తోందనిపించింది.
ఒకరోజు ఇద్దరు అమ్మాయిలు ఫోన్ చేసి నా కవితా సంపుటాలమీద ఎమ్.ఫిల్ చేసామని అందుకని కలవాలనుకుంటున్నామని ఇంటి చిరునామా అడిగారు.నాకు భలే ఆశ్చర్యం అంతులేని సంతోషం కలిగింది.తమ రచనలమీద పరిశోధన జరిగిందంటే ఎవరికి మాత్రం ఆనందం కలుగదూ?
మర్నాడు ఆ ఇద్దరూ వచ్చారు.నా యుద్ధం ఒక గుండె కోత దీర్ఘ కవిత మీద కె.భాగ్యలక్ష్మీ,నా మొదటి సంపుటి ఆకలి నృత్యం మీద బి.నాగలక్ష్మి మధుర కామరాజ్ విశ్వవిద్యాలయంలో చేసిన ఎమ్.ఫిల్ పరిశోధనల కాపి తీసుకుని వచ్చి ఇచ్చారు.అది చదివి నా అభిప్రాయం తెలుపుతూ ఒక ఉత్తరం రాసి ఇవ్వమన్నారు.ప్రాచ్యకళాశాలలో లెక్చరర్ పి.జగన్నాథరావుగారు వారికి గైడ్ అని చెప్పారు.
చాలా ఏళ్ళ క్రితం ఏదో సందర్భంలో కేబి లక్ష్మీ నాతో " సదస్సులలో పాత్ర సమర్పణ చేయటానికి అకడమీషియన్లనే తీసుకుంటారు. అందుకే తాను పీహెచ్డీ చేయాలని రిజిస్టర్ చేయించుకున్నానని" చెప్పటమేకాక "నువ్వు కూడా చెయ్యవోయ్" అని సలహా యిచ్చింది.ఆలోచిస్తుంటే లక్ష్మి అన్నది నిజమే అనిపించింది.
అకాడమీలు గానీ,యూనివర్శిటీలు గానీ అకడమీషియన్లకే పత్రసమర్పణ అవకాశాలు కల్పిస్తాయి.
అప్పట్లోనే ఒక రోజు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి పి హెచ్ డి అప్లికేషన్ ఫాం కూడా తెచ్చుకున్నాను.వీర్రాజుగారితో చెప్తే "నీ రచనలమీద పరిశోధనలు చేయగల స్థాయి రచయిత్రిగా ఈ నాడు నువ్వు వున్నావు.నువ్వు చేయటం ఏమిటి" అన్నారు.ఆయన మాట నచ్చక పోయినా,పేరు ముందు డాక్టర్ తగిలించుకోవాలనే కోరిక వున్నా, అప్పటికే ఎమ్మెస్సీ చేయటానికి చాలా శ్రమ పడి వున్నానేమో.మళ్ళా చదువులోకి దిగే సాహసం చేయలేక పోయాను.
ఈ నాడు నా రచనలమీద ఇద్దరు విద్యార్థులు ఇచ్చిన ఎమ్ ఫిల్ పరిశోధన గ్రంథాలు చూస్తుంటే నా మనసు ఉప్పొంగి పోయింది.
- శీలా సుభద్రాదేవి
27, ఏప్రిల్ 2025, ఆదివారం
స్త్రీ లపాలిటి కల్పవృక్షం సామవేదం వెంకట కామేశ్వరి
~ స్త్రీల పాలిటి వైద్య కల్పవృక్షం డా.సామవేదం వెంకట కామేశ్వరి ~
జన్మ రీత్యా మంచి సాంస్కృతిక నేపధ్యం గల కుటుంబంలో 1972 జనవరి 23వ తేదీన వెంకట కామేశ్వరి ఆ ఛాయలన్నిటినీ పిడికిట్లో ఒడిసి పట్టుకునే పాలకొల్లులో కన్నువిప్పింది
కామేశ్వరి పితామహులు డా.సామవేదం సత్యనారాయణగారు పాలకొల్లులో మంచి హస్తవాసి గల వైద్యులుగానే కాక స్థానిక లైన్స్ క్లబ్ లో ప్రతీ నెలా మొదటి ఆదివారం చక్కటి సంగీతకచేరీలు ఏర్పాటు చేసేవారు.అప్పట్లో పోలియో వ్యాధి వ్యాప్తి ఎక్కువగా వుండేది.ఈ వ్యాధిని తొలిదశలోనే గుర్తించి మెరుగైన వైద్యం కోసం రాయవెల్లూరు పంపే ఏర్పాటు చేసేవారు.కామేశ్వరి గారి నాన్నమ్మ ఆ రోజుల్లోనే మహిళా సాధికారతకల వ్యక్తి, మంచి సాహిత్యాభిలాష కలిగినవారు.మొదటి మనవరాలైన కామేశ్వరికి వీరే మొదటగా స్ఫూర్తి అందించిన వారు.
తండ్రి సామవేదం వేంకట సూర్యనారాయణ రసాయన శాస్త్రంలో మాష్టారు పట్టా అందుకున్న తొలిరోజుల్లో రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో లెక్చరర్ గానూ తర్వాత ఎస్.బి.ఐ లో ఆఫీసర్ గా ఉద్యోగం చేసి పదవి విరమణ అయినా కొద్దికాలానికే తీవ్ర గుండెనొప్పికి బలైపోయారు.తల్లి మీనాక్షి పెద్దగా చదువుకోక పోయినా తల్లిదండ్రులు ఇద్దరూ తమ ఆడపిల్లలిద్దరికీ మంచి చదువుల్నే కాక,సాహిత్య పఠనానికి కూడా ప్రోత్సహించిన రెండవ స్ఫూర్తి దాతలు.
పాలకొల్లుకు పద్నాలుగు మైళ్ళ దూరంలోని లంక గ్రామమైన భీమలాపురంలో నివాసితులైన మాతామహులు వేదపండితులు. ఇరవైనాలుగు వేల రామాయణం శ్లోకాలు కంఠోపాఠంగా నేర్చిన ఆధ్యాత్మికురాలు అమ్మమ్మ.వరదకాలంలో ముంపుకు గురైన గ్రామ ప్రజలను ఆదరించి స్వయంగా ఆహారాన్ని అందించిన సహృదయులు.
ఇటువంటి నేపధ్యంలో పెరిగింది కనకే కామేశ్వరి విద్యా, వైద్యం,సమాజం పట్లా అంకితభావం కలిగిన సహృదయురాలు కావటంలో ఆశ్చర్యం లేదు.తర్వాత్తర్వాత ఆమె తన చేయి అందుకున్న డా.వింజమూరి సూర్యప్రకాష్ సాహచర్యంలో కామేశ్వరి మరింత లక్ష్యసాధనకు మునుముందుకు అడుగులు వేసింది..వేస్తూనే వుంది.
కామేశ్వరి వైజాగ్ లోని ఆంధ్రా మెడికల్ కాలేజిలో MBBS చదివినప్పుడే కాలేజీలో ఎనాటమీ లో మొదటిస్థానంలోనూ,మైక్రోబయాలజీలో రెండవ స్థానంలోను రావటం విశేషం.తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజీ ,నయాపూల్ లోని ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్ లో Gynecologicy and obstetrics లో డిప్లొమా చేసారు.
డాక్టర్ ఎస్.వి. కామేశ్వరి తెలంగాణ రాష్ట్ర వైద్య మండలిలో సభ్యత్వం పొందారు.
ఇంకా అప్పటినుండి కామేశ్వరి కార్యరంగంలోకి దూకారు.దేశంలోని అన్ని విపత్తులలోనూ వైద్యసహాయం అందించేందుకు భర్త వింజమూరి సూర్యప్రకాష్ గారితో కలిసి ముందడుగు వేశారు.సునామీ సమయంలో ట్యూబెక్టమీ అయిన మహిళలు మళ్ళా సంతానోత్పత్తికి రీకానలైజేషన్ చేసుకోవటంతో వారిపై అధ్యయనం చేసి అది సరిగా జరగలేదనేది ప్రకటించారు.
డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సహాయంతో హిస్టరెక్టమీ మీద సీరియస్ గా పనిచేసి 2012లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి రోశయ్యగారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం నుంచి హిసెరెక్టమీ సేవలను తొలగించటం వీరు చేసిన వైద్యసేవాకృషికి తొలి విజయంగా చెప్పవచ్చు.
ఎందుకంటే భారతదేశంలో ఎంతమందికి హిస్టరెక్టమీ జరిగిందో డేటా లేదు.అవసరం వున్నా లేకపోయినా ఇబ్బడిముబ్బడిగా పేద శ్రామిక వర్గం స్త్రీలకు హిస్టరెక్టమీ చేయటంతో వారు తదనంతరం అనేక విధాలుగా రోగగ్రస్తులు కావటం జరుగుతుందనేది వీరి అధ్యయనంలో బయటకు వచ్చింది.
2013 లో ఢిల్లీలో ఒక NGO సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో కామేశ్వరిగారు తమ అధ్యయనంలో తెలుసుకున్న ఫలితాలను ప్రదర్శించారు.ఆ తర్వాతే National Family health survey -4 ( NFHS-4)- 2015-16 వారు హిస్టెరెక్టమీ గణాంకాలను నాటికి తయారుచేసారు.
కానీ తర్వాత కూడా ఈ గణాంకాలు పెరుగుతూనే వున్నాయని చింతిస్తారు కామేశ్వరి.
"గర్భసంచి కాపాడుకుందాం సమాజాన్ని బలపరుద్దాం “అనే పుస్తకాన్ని మొదట 2017 సంవత్సరంలో ప్రచురించారు. తెలంగాణా ప్రభుత్వ సహకారంతో 2018 సంవత్సరం జనవరి నుండి ఆగస్టు వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరోగ్యసిబ్బందికి,ఆశా వర్కర్లకు, మహిళాసమాఖ్య సభ్యులకు,81 గ్రామాలలో 16000 మందికి పైగా స్త్రీలకు పెద్ద ఎత్తున గర్భసంచి ప్రాధాన్యత పై అవగాహన కల్పించారు.అంతే గాక రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక పాఠశాలల్లో, కాలేజీలలో విద్యార్థినులకు గర్భసంచి ప్రాధాన్యత గూర్చి వివరించారు.
డా.కామేశ్వరి స్వభావం ఎప్పటికప్పుడు స్త్రీల ఆరోగ్యసమస్యల్ని పరిశోధనాత్మక దృక్పధంతో నిరంతరం పరిష్కరించటానికే కాకుండా ఆ సమస్యలపట్ల అవగాహన కల్పించి జాగృతం చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు.అప్పటినుండి తన దగ్గరకు చికిత్సకోసం వచ్చిన మహిళలను కేవలం చికిత్స చేసి పంపేయటం కాకుండా తల్లిలా అక్కున చేర్చుకుని శారీరకంగానే కాక మానసికంగా, కుటుంబపరంగా తగిన సహకారం అందిస్తున్నారు. వారి ఆరోగ్య సమస్యలనన్నింటినీ నమోదు చేసుకుని ఎక్కువ మందికి అందాలనే వుద్దేశ్యంతో పుస్తకరూపంలో తీసుకు రావటానికి కలంపట్టారు .
సంతానసాఫల్యం గురించి.ఇటీవల కుప్పలు తెప్పలుగా సంతానసాఫల్యకేంద్రాలు వెలుస్తూ , కుటుంబాల్లో పెళ్ళైన ఏడాది నుండీ గర్భం రానందుకు వేలెత్తి చూపటంతో అవమానపాలౌతున్న వారిని ఆకర్షించి మూలకారణాలు అన్వేషించకుండానే చికిత్స మొదలు పెట్టేస్తుండటం, దానితో తదనంతరం ఆర్థికపరమైన ఇబ్బందులేకాక ఆ చిన్నితల్లులు అనేక అనారోగ్యాలకు పాల్పడటం కామేశ్వరిని కలచివేసింది.
"సంతానం కానివారిలో 92 శాతం మందికి చిన్నచిన్న ప్రక్రియలతోనే ప్రాధమిక స్థాయి,మధ్యమస్థాయి క్లినిక్ లోనే ఫలితాలు లభిస్తాయి" అంటారు కామేశ్వరి.
ముఖ్యంగా కొన్నిదిగువ, మధ్యతరగతి కుటుంబాలలో సంతానం కలగకపోవటాన్ని దోషంగా పరిగణిస్తారు.కుటుంబంలోవారంతా ఆ స్త్రీని దోషిగా పనికిరాని వస్తువులా చూస్తారు.అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారిని కామేశ్వరి గారు ఆత్మీయంగా అక్కున చేర్చుకుని వారికి తగిన వైద్యం చేసి వారి ఒడిని పసిపాపతో నింపిన సందర్భాలు ఎన్నో.సంతానాభిలాషతో వచ్చిన దంపతులను నాలుగు రకాల కేసులుగా విభజించి తగిన విధంగా అవగాహన కల్పిస్తుంటారు.
అందుకే కామేశ్వరి తనదైన పధ్దతిలో దంపతులను కూర్చోబెట్టుకుని వారిని మానసికంగా, శారీరకంగా తన వైద్యానికి సానుకూలంగా తయారుచేసి వేలసంఖ్యలో దంపతులకు సంతానం కలిగేలా చేసారు.తన అనుభవాలూ తన పరిశోధనలనూ,తన పరిశీలనలనూ అన్ని కోణాల్లో క్రోడీకరించి "మధుమాలతి " అనే పుస్తకాన్ని రాసారు డా.కామేశ్వరి.
గ్రామాలనుండి వచ్చినవారిని,చాలాకాలం తర్వాత గర్భం నిలిచిన వారినీ తమ కేంద్రమైన 'అందరియిల్లు'లో ఆశ్రయం కల్పించి తగిన విశ్రాంతి గా ఉండేలా ఆరోగ్యకర ఆహారం అందజేస్తారు.
"సంతానం కలగని వందమందిలో ముగ్గురికి మాత్రమే సంతానం కలగకుండా చేసే కారణాలను ఐవీఎఫ్ సహాయంతో పరిష్కరించుకోవచ్చు.అంతేకానీ ఏదో వస్తువు కొనుక్కున్నట్లుగా తొందరపాటుతో ఐవిఎఫ్ చేయించుకోటానికి వెళ్ళవద్దు" అంటారు కామేశ్వరి .ఐవీఎఫ్ చేయించుకోవటం అనేది ఒకరి వ్యక్తిగత నిర్ణయంగా కాకూడదు . స్త్రీల గర్భంపై, ఆరోగ్యంపై దాడిగా మారుతోన్న పునరుత్పత్తి సమస్యలపైగాని,అనవసరంగా హిస్టెరెక్టమీ చేసేస్తూ స్త్రీల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటున్న దోపిడికేంద్రాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాల్లో,బస్తీల్లో పర్యటిస్తూ అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
కామేశ్వరీ, సూర్యప్రకాష్ గార్లు కలిసి చేసే మానవవైద్యసేవే కాక అందరి యిల్లు పేరిట చేస్తున్న సమాజానికి కూడా చేస్తున్న వైద్యాన్ని పరిగణలోకి తీసుకొని first hundred doctors from Andhra medical College గా 2023లో ఆంధ్రా మెడికల్ కాలేజీ శతవార్షికోత్సవాలలో AMC లో సీనియర్ డాక్టరైన శేషు శర్మగారు తన పుస్తకంలో నమోదు చేసారు.ఇది వీరు జీవితంలో సాధించిన మరో గొప్ప గుర్తింపు.
ఉత్తరాలతో మానవ సంబంధాలను ఎలా బలపరచుకోవచ్చో ' art of letter writing 'ని ఒక ఉద్యమం ద్వారా తెలియజేసారు ఈ వైద్య దంపతులు.
అంతటితో ఆగిపోలేదు అన్ని విధాలా రోగగ్రస్తమైపోతున్న సమాజాన్ని ప్రేమా నిజాయితీ అనే వైద్యంతో పునరుజ్జీవింప చేయటానికి నడుం బిగించారు. అందరం మనమందరం అంటూ మందార పూవును చిహ్నంగా ఎంచుకొని వారితో సహకరించే వారినందరిని ఒకే కుటుంబం గా కలుపుకుంటూ సమాజంలో 'అందమైన జీవితాల్ని ' కలగనే స్వాప్నికులు డా.కామేశ్వరీ,డా.సూర్యప్రకాష్ దంపతులు.అందుకే వీరు అందరికీ పూలనూ,పూలమొక్కల్నీ పంచుతారు.
అందరికీ ఆహారం, ఆరోగ్యం, మానసిక వికాసానికి పుస్తకం అందినపుడు సమాజమే మారుతుందన్న విశ్వాసంతో అడుగులు వేస్తారు.
తల్లిదండ్రుల సామాజిక సేవను బాల్యం నుంచి చూస్తూ పెరిగిన కుమార్తె గాయత్రి డాక్టర్ గా, కుమారుడు భరత్ శాస్త్రవేత్తగా విదేశాల్లో తమ రంగాల్లో నైపుణ్యం పొందారు.
డా.సామవేదం వెంకట కామేశ్వరి , డా.వింజమూరి సూర్యప్రకాష్ తో కలిసి తలపెట్టే ప్రతి పనిలో ఒకరి నీడ మరొకరిదిగా ,ఇరువురి అడుగుజాడలు ఒకటిగానే ప్రతీ కార్యక్రమం నిర్వహించటం అపురూపమైనదిగా
ఉంటుంది.
డా.సామవేదం వెంకట కామేశ్వరి గారు అపురూప పురస్కారం అందుకుంటున్న సందర్భంగా మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)