9, అక్టోబర్ 2015, శుక్రవారం

menOpasijam

    క్రిందటి నెల అంటె 27 వతేదీ న విజయవాడ ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక కవితా సంధర్భం సమావేశాల్లొ రజని కవిత విని 90 లలోనే మెనోపాస్ పై కవిత వచ్చుంటే బాగుండేదీ అని ఆమె అదే ఆ విషయం పై రాసిన మొదటి కవిత గా చెప్పినప్పుడు నేను చాలా కాలం క్రితమే అదే అంశం  పై రాసానని నా తర్వాత ఎన్.అరుణ ,హిమజ కూడా రాసారని తెలియజేసాను 
ఆ కవిత నేను1999 లో రాసాను .బహుసా భూమికలో అనుకుంటాను ప్రచురితమైంది.
    మెనోపాసిజం
పదాలన్నింటినీ డబ్బాలో వేసి కలగలిపి
తోచిన పదాన్నో తీసినపదాన్నో 
పేర్చి కూర్చిన సర్రియలిష్టు కవితలా
ఆలోచనలన్ని చిందరవందరై
చిక్కుముళ్ళై పోతుంటాయి
కళ్ళూ ముక్కూ చెవులూ అన్నీ ముద్దగా మెదడై పోయి
మెదడు జారి గుండె స్థానం లోకి వచ్చేసి
ముక్కలు ముక్కలైన గుండె కళ్ళుచెవులూ గా మారిపోయి
తయారైన ఆధునిక చిత్రం లా అయి పోతుంది ఒళ్ళు
పెదాలు రెండూ అంటుకు పోయి
నాలుకని ఎప్పుడో మర్చిపోయి
దుఃఖం తో బాటుగా మింగేసినట్లు
ఒక్క మాటన్నా శబ్దించదు
చాపకింద నీరులా మనకి తెలియకుండానే
శరీర మార్పులకు గురిచేస్తున్న హార్మోన్లలా
చీటికీ మాటికీ కళ్ళు తడి ఐపోతూనే వుంటాయి
వుండుండి ఒళ్ళంతా మండే నిప్పుల కొలిమౌతుంది
వూపిరితో తిత్తి కొడుతున్నట్లు
బుసబుసా కోపంకళ్ళల్లోకి నాలుకలు చాపుకుంటూ దూకుతుంది
మహావిస్ఫోటనానికి సిద్ధంగా
పెను ఒత్తిడికి గురై అతలాకుతలమౌతోన్న మనసుని
ఆర్తిగా సున్నితం గా దోసిట్లోకి తీసుకొని
ఈ కలగాపులగాన్ని జీర్ణించుకొని
నేనున్నానంటూ చేయందిస్తె
బాటలోని ముళ్ళన్నీ తొలగిస్తుంటే
చడీచప్పుడూ లేకుండా నిశ్శబ్దం గా దాన్ని దాటిపోగలం
అలా కానప్పుడు
మన జీవితాల్ని ప్రభంజనం లా ముంచేయకముందే
మనకి మనమే
ఆత్మవిశ్వాసం తో ఎదురీదైనా
గట్టు మీదకి చేరుకోవాలి 
 ( 20-2-1999)    
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి