13, జులై 2024, శనివారం

నడక దారిలో -43

నడక దారిలో -43 ఒకరోజు చిన్నన్నయ్య ఫోన్ చేసి ఒక సంబంధం గురించి చెప్పాడు.పెద్దనాన్న మనవడు ప్రకాశరావు మా అన్నయ్య స్నేహితులు.వాళ్ళకి బంధువులు,మానాన్న వుంటారు ధర్మవరానికి చెందినవారు.అయితే ఉద్యోగరీత్యా భిలైలో ఉంటూ ఇప్పుడు విజయనగరం వచ్చి స్థిరపడ్డారు.వాళ్ళ రెండో అబ్బాయి.రూర్ఖెలాస్టీల్ ఫాక్టరీ లో పనిచేస్తున్నాడని చెప్పేడు. అన్నయ్యకి తెలిసిన వాళ్ళు కదా పరవాలేదనుకున్నాము.పల్లవి ఫొటో జాతకం పంపమని,ఆ అబ్బాయి ఫొటో కూడా పంపారు.ఫొటో చూసి మెము కొంచెం అసంతృప్తి చెందారు.కానీ మా మరిది చూసి "అందరికీ ఏవో వంకలు చెప్తుంటే ఎలా? బాగానే ఉన్నాడు.మంచి వుద్యోగం" అనేసరికి నిజమేలే ఇక్కడే ఉంటారు.అనుకున్నాము. అబ్బాయి వాళ్ళ అత్త హైదరాబాద్ లోనే ఉంటుందట.ఒకరోజు సాయంత్రం వస్తున్నానని ఫోన్ చేసి వచ్చేసాడు.మేము కాసేపు మాట్లాడి కాఫీ తీసుకు రావటానికి వంకతో లోపలికి వచ్చాను.పల్లవితో కాసేపు మాట్లాడాడు. తర్వాత అతను యూఎస్ రావటానికి ఇష్టమేనా అని అడిగాడట.పల్లవి తనకి ఇష్టం లేదందిట."ఒక్కతే అమ్మాయివనా?అక్కడ కొన్నాళ్ళు వుండి తిరిగి వచ్చేద్దాం.ప్రస్థుతం నేను వుద్యోగం మానేసాను.యూఎస్ వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నాను " అన్నాడని చెప్పింది.మళ్ళా మేము ఆలోచనలో పడ్డాం.పల్లవిని" నీకు ఇష్టమేనా " అని అడుగుతే మీ ఇద్దరికి నచ్చుతే నాకేమీ అభ్యంతరం లేదు అంది. కానీ వీర్రాజు గారికి కొంత అసంతృప్తి గానే వుంది.కానీ రోజూ ఏ విషయమూ చెప్పమని అబ్బాయి మేనమామ నుండి ఫోన్లు.వీర్రాజు గారు ఏదో ఒకటి చెప్పాలన్నట్లుగా " మాకు కట్నాలు అవీ ఇవ్వటం ఇష్టం లేదు.ఆ విషయం వాళ్ళకి చెప్పండి"అన్నారు.మరో రెండురోజులకు "కట్నకానుకల ఆశ లేదనీ,అమ్మాయికి బంగారంకూడా మీ ఇష్టమే మాకేమీ అభ్యంతరాలు లేవని " అబ్బాయి తండ్రి నుండి పెద్ద ఉత్తరం వచ్చింది. మళ్ళీ వాళ్ళ నుండి ఫోను వస్తే " మేము సింపుల్ గా సభావివాహం చేసుకున్నాము.మాది కమ్యూనిస్టు ఐడియాలజీ" అన్నారు.దీనికి మాత్రం వాళ్ళు అభ్యంతరం చెప్పారు."మా పెద్దబ్బాయి వర్ణాంతర వివాహం చేసుకున్నాడు.వాళ్ళు సింగపూర్ లో ఉన్నారు.చిన్నబ్బాయికి సాంప్రదాయంగా చెయ్యాలనిమాకోరిక.దీనికి అంగీకరించమని " అన్నారు.ఆలోచించి చెప్తానని వీర్రాజుగారు అని పెట్టేసారు. ఓ వారం పదిరోజులపాటు ఇంకేమీ మాటలు లేవు.అయితే మా చిన్నన్నయ్య ఫోన్ చేసి " వాళ్ళు పల్లవిని చూస్తామంటున్నారు.ఒక రెండు రోజులకి విజయనగరం రండి.ముఖాముఖీ మాట్లాడితే ఏదో ఒకటి నిర్ణయానికి రావచ్చు" అన్నాడు. సరే నని విజయనగరానికి ప్రయాణం కట్టారు. మా పెద్దక్క నీ,పెద్దన్నయ్యనీ కూడా పిలిచారు.అబ్బాయి రాలేదు కానీ అతని తండ్రి అన్నదమ్ములంతా వచ్చేసారు.ఆడవాళ్ళం అందరంలోపల గదిలోనూ, ముందు గదిలో మగవాళ్ళంతా కూర్చుని మాట్లాడుకుంటున్నారు.వీర్రాజుగారు అసలే ఖచ్చితంగా మాట్లాడలేరు.ఏం మాట్లాడుతారో నాని నాకు ఒకవైపు భయంగా అనిపించింది.వాళ్ళవాళ్ళంతా పెళ్ళి నిశ్చయం అయిపోయినట్లే మాట్లాడుతున్నారు.కాసేపటికి నన్ను పిలిచారు.అబ్బాయి వచ్చేనెలలో యూఎస్ వెళ్ళిపోవాలనీ,పదిరోజుల్లో ఉన్న ముహూర్తానికి పెళ్ళి అని చెప్పారు.ఇంత ఆఘమెఘాలమీద ఎలా చేస్తాము.నాకు అయోమయంగా అయింది. వాళ్ళంతా వెళ్ళాక నేను ఎస్టీడి బూత్ కి వెళ్ళి కింద యింట్లో వుండే యజ్ణప్రభ గారికి ఫోన్ చేసి విషయం చెప్పాను.తన సంగీతం విద్యార్థి అనే కాక ఆవిడకి పల్లవి అంటే చాలా ప్రేమ.ఆమె చాలా సంబరపడి తాను సహాయసహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు. తిరిగి హైదరాబాద్ రాగానే ఇంటికి కలర్స్ వేయటంతో మొదలుపెట్టి పెళ్ళిపనులు ప్రారంభించాము. యజ్ణప్రభగారు తన ఇంట్లో పెళ్ళి లాగే మూడురోజులకు కేటరింగ్ అతనిని మాట్లాడారు.బాలప్రసాద్ మారేజ్ హాలు,అలంకరణ బుక్ చేయటం మొదలైనవాటిలో సహకరించాడు.ఈ విధంగా బంధువులు అందరి సమక్షంలో అనుకున్న కన్నా వైభవంగా పల్లవి పెళ్ళి జరిగింది.అజయ్ తో " పల్లవి తనకేంకావాలో మనసు విప్పి చెప్పదు.కనిపెట్టి చూసుకో" కళ్ళనీళ్ళతో చెప్పాను. మూడురోజుల తర్వాత పల్లవీ,అజయ్ విజయనగరం వెళ్ళిపోయారు. తర్వాత పదిహేను రోజులకే అజయ్ ప్రయాణం ఈ లోగా మేనేజ్ సర్టిఫికెట్ తీసుకోవటం,పాస్ పోర్ట్ కి అప్లై చేయటం చేసారు. అజయ్ తల్లిదండ్రులు,పల్లవీ మేమూ కూడా అజయ్ కి సెండాఫ్ చేయటానికి బొంబాయి వెళ్ళాము. మళ్ళా వెంటవెంటనే ప్రోసెసింగ్ మొదలై పల్లవికి కూడా వీసా వచ్చేసింది.ఫ్లైట్ టికెట్ కొనటం మొదలైనవన్నీ మా ఇంటి పక్కనే వున్న పల్లవి స్నేహాతురాలు సుధావాళ్ళ అన్న సీతా ట్రావెల్స్ లో వుద్యోగం కావటం వలన రఘునే చూసుకున్నాడు.ఆ అబ్బాయి మా యింట్లో పిల్లాడిలా సహకరించాడు. ఎప్పుడూ వంటరిగా విజయనగరం కూడా పంపలేదు.ఇప్పడు ఏకంగా సప్తసముద్రాలుదాటి ఖంఢాంతర ప్రయాణానికి సిద్ధం అవుతోంది. హైదరాబాద్ నుండే పల్లవి ఫ్లైట్.రఘూ కూడా అక్కడ పని చేయటం వలన పల్లవితో పాటూ లోపలికి వెల్లి చెకిన్ అయ్యేవరకూ ఉండి వచ్చాడు. సెండాఫ్ ఇవ్వటానికి ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాము.ఇప్పటిలా ఆరోజుల్లో సెక్యూరిటీ ఎక్కువగా ఉండేది కాదు.అందుచేత లాంజ్ వరకూ వెళ్ళాము. పల్లవి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఒంటరినై పోయినట్లు అయ్యింది.ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్ళటం మనసులో మాటలు ఒకరికొకరం చెప్పుకోవటం స్నేహితుల్లా వుండేవాళ్ళం. పల్లవి యూఎస్ చేరిన తర్వాత తన ప్రయాణం అనుభవాన్ని సుదీర్ఘంగా ఉత్తరం రాసింది.ఉత్తరాలు రాసినా అవి ఖండాంతరాలు దాటి గమ్యం చేరుకోవటానికి చాలా రోజుల పెట్టేది.అప్పటికి సెల్ ఫోన్లు లేవు ఐ.ఎస్.డీ సౌకర్యం వుంటేనే మాట్లాడుకోవాలి.అందుచేత పల్లవి వాళ్ళు ఫోన్ చేసే వరకూ ఆగాల్సిందే.లేదా ఎస్టీడీ బూత్ కో, కంప్యూటర్ సెంటర్ కో వెళ్ళి మాట్లాడాలి.ప్రతీ ఆదివారం ఉదయమే తొందరగా లేచి తయారై ఫోన్ కోసం ఎదురు చూడటం ఒక ప్రధాన కార్యక్రమం. అప్పట్లోనే నేను రాసిన పడమటి గాలి అనే కవిత ప్రచురణ అయ్యింది.ఆ కవిత పెద్ద సంచలనం.అమెరికాలో పిల్లలున్నవాళ్ళు చాలా మంది ఆ కవితను జిరాక్స్ చేయించుకున్నామని చెప్పటం నాకు భలే సంతోషం కలిగించింది.ఒక కవిత అంతమందికి అనుసంధానం కావటం కన్నా కవికి కావాల్సిందేమిటి? నాకు మెనోపాజ్ సమస్యలు రానురాను ఎక్కువ అవుతున్నాయి.ముఖ్యంగా రక్తస్రావం ప్రతీ నెలా 15-20 రోజులు కావటంతో నీరసం ,తరుచు కళ్ళు తిరిగి పడిపోవటం జరుగుతుంది.ఇంటి దగ్గర్లో వున్న ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడుతున్నా తగ్గటం లేదు. దీనికితోడు పెద్దమరిది తీవ్ర అనారోగ్యం పాలు అయ్యాడు. కొన్నాళ్ళు కామినేనిలో చేర్చారు.కానీ ఫలితం ఏమీలేదు.అన్నిరకాలపరీక్షలూ చేయగా కేన్సర్ అని మూడునెలల కన్నా జీవించటం కష్టమని తెలిసింది.వీర్రాజు గారు రోజు విడిచి రోజైనా వెళ్ళి చూసి వస్తున్నారు.ఒక్కొక్కప్పుడు స్కూల్ నుండే అలా సీతాఫలమండీ వెళ్ళి నేనూ చూసి వస్తున్నాను. ఒకవైపు నా శారీరక ఇబ్బంది, మరోవైపు తమ్ముడి గురించి డీలా పడిపోతున్న వీర్రాజు గారు,స్కూలులో వత్తిడి వీటితో సతమతమై పోతున్నాను. ఒకరోజు స్కూల్ నుండి వచ్చి స్నానం చేసి కాఫీ తాగుతున్నాను.మా మరిది పోయిన వార్త ఫోనులో.వెంటనే ఆఘమేఘాల మీద ఇద్దరం వెళ్ళాం. కేన్సర్ పేషెంట్ ,అంతేకాక ఒళ్ళంతా అనేక అనారోగ్యాలతో పాడైంది.వెంటనే కార్యక్రమం చేయకుండా మర్నాటికి వాయిదా వేసారు.రాత్రంతా జంగమోళ్ళుకాబోలు వైనాలువైనాలుగా వర్ణిస్తూ ఏడుపు పాటలు,మధ్యలో తాగుడు,ఆ పరిసరాలన్నీ కంపుతోనూ, అపరిశుభ్రతతోనూ నిండి పోయింది.అదిగాక మరిది శరీరం నుండి కలుషరక్తం నవరంధ్రాలు నుండీ వెలువడుతుంది.నేను అక్కడ వుండలేని పరిస్థితి.కానీ తప్పలేదు.మాతోటికోడలు పుట్టింటి వాళ్ళు వచ్చాక అంత్యక్రియలు మొదలయ్యాయి.వీర్రాజుగారే చేసారు.ఆ పదిరోజులూ మొత్తం ఖర్చు అంతా మేమే పెట్టుకున్నాం.దశదిన కార్యక్రమంలో చేసేవి నాకు నచ్చక పోయినా మౌనంవహించకతప్పలేదు. చిన్నన్నయ్య పెద్దకొడుకు భార్గవ సివిల్స్ కి ప్రిపేర్ కావటానికి వచ్చాడు.క్రితం సారి విజయనగరం వెళ్ళినప్పుడే అన్నయ్య చెప్పాడు "పరీక్షలు కాగానే నీదగ్గర కు భార్గవి పంపించేస్తాను.ఏంచేయాలనుకుంటున్నాడో కొంచెం కనిపెట్టి చూసుకో "అని. అయితే రోజంతా పుస్తకాలు చదువుతున్నాడు కానీ సివిల్స్ కి పనికొచ్చే వి చదువుతున్నట్లు అనిపించలేదు.కొన్ని రోజులు దిల్ సుఖ్ నగర్లో ఏదో కోచింగ్ సెంటర్ లో ఫేకల్టీగా జాయిన్ అయ్యానని చెప్పాడు.నేను టిఫిన్, కూరా పప్పు చేసి నా మట్టుకు అన్నం వండుకునే దాన్ని.వీర్రాజుగారు తర్వాత వాళ్ళిద్దరికీ అన్నం వండేవారు.పదింటికి టీ కూడా ఇద్దరికీ చేసేవారు.నేను సాయంత్రం స్కూల్ నుండి వచ్చేసరికి ఒక్కొక్కసారి టీ కప్పులు మంచం దగ్గర పుస్తకాలు షెల్ఫ్ మీద ఈగలువాలుతూ ఎండిపోయి వుండేవి.డైనింగ్ టేబుల్ మీద కూడా ఎక్కడివక్కడే వుండేవి.వీర్రాజగారికి భోజనం అయ్యాక మిగిలినవి ఫ్రిజ్ లో పెట్టేసేవారు.భార్గవకి అలవాటు లేక వదిలేసే వాడు.అలసిపోయి వచ్చిన నాకు చికాకూ,కోపం వచ్చేసేది.ఆ పిల్లాడిని అనలేక ఆయనపైనే వెళ్ళగక్కేదాన్ని. " సివిల్స్ కి ప్రిపరేషన్ అన్నాడుకదా వివేకానందుడు, రామకృష్ణ పుస్తకాలు చదువుతున్నాడు.ఒకసారి వాణ్ణి మందలించు " అన్నారు ఒకసారి. "అనకుండా ఆయన మంచివాడనిపించుకోవాలి.అని నేను చెడ్డదాన్ననిపించుకోవాలా" అని మనసులో అనుకుని వూరుకున్నాను. ఆ తర్వాత్తర్వాత నాకు మానసికంగా కూడా ఒత్తిడి,కోపం పెరిగి అవి అణచుకోవటంతో రక్తస్రావం ఎక్కువగా వుండేది.ఇక నా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సివచ్చింది.ఇంటికి దగ్గర్లోనే ఉన్న జయనర్సింగ్ హోం లో చూపించుకున్నాను.చాలా పరీక్షలు చేసి హిస్టరెక్టమీ చేయించుకోవాలన్నారు. అయితే కనీసం ఒకనెల అయినా బరువులవి ఎత్తకూడదు.ఏంచేయాలో అర్థం కాలేదు.వెంటనే పెద్దక్క తాను సాయం వస్తానని చెప్పింది.ఆమెతో పాటూ చిన్నక్క,మా చిన్న ఆడపడుచు కూడా వచ్చారు. మేజర్ ఆపరేషన్ కావటం వలన జనరల్ అనస్థీషియా ఇచ్చారు.ఎందువలనో ఆపరేషన్ తర్వాత సాయంత్రానికి కూడా స్పృహ లోకిరాలేదు.అంతేకాక బీపీ పెరిగి పోయింది.దాంతో అనెస్థీషియన్ కంగారు పడి మెలకువ తేవటానికి ప్రయత్నాలు చేయగా అప్పటికి మామూలుగా తెవిలోకి వచ్చాను.వారంరోజులకి డిస్చార్జ్ చేసారు పెద్దక్క కూతురు శ్రీదేవి కూడా వచ్చి రెండు లరోజు లు సాయంగా వుంది.నేను ఇంటికి వచ్చాక నాలుగైదు రోజులకి అందరూ వెళ్ళిపోయారు. సివిల్స్ పరీక్ష అని పేపర్లో చూసాను.కానీ భార్గవి పరీక్ష రాయటానికి వెళ్ళలేదు.ఏవో పుస్తకాలు చదువుతూ కూర్చున్నాడు.నేను భరించలేక పరీక్ష గురించి అడిగాను.విద్యావ్యవస్థ గురించి కామెంట్ చేసాడు.ఆ ఏడాదే నోబుల్ ప్రైజ్ పొందిన అమార్త్యసేన్ గురించి అతను ఎన్నాళ్ళు ఖాళీగా వుండి తర్వాత ఈ స్థాయికి చేరాడో చెప్పాడు. " వాళ్ళ సంగతి సరే మీ నాన్న ఏ స్థాయినుంచి ఎదిగి ఎంత కష్టపడి మిమ్మల్ని ఇంత మంచి చదువు చెప్పించాడో గుర్తుంచుకో .ముందు మీ నాన్న మీద ఆధారపడకుండా కొంతకాలం బ్రతకటానికి సరిపడా సంపాదించి, తర్వాత నువ్వు ఏం చేయాలనుకున్నావో అది చేసుకో " కొంచెం సీరియస్ గానే అన్నాను. ఏమనుకున్నాడో సాయంత్రం తన సామాను తీసుకుని వెళ్ళిపోయాడు.అయితే ఇంట్లో ఏం చెప్పాడో తెలియదు.అప్పటినుండి చిన్నన్నయ్య నుండి ఉత్తరాలు ఆగిపోయాయి.నేను రాసినా సమాధానం లేదు.వీర్రాజుగారు రాసినా సమాధానం లేదు.ఇంక ఊరుకోలేక నేను వివరంగా అన్ని విషయాలూ రాసి' పిల్లల బాగు కోరుకునే టీచర్ని.నాకు పల్లవి ఎంతో వాడూ అంతే. అందుకే పరీక్ష రాయటానికి వచ్చినవాడు పక్కదారి పడుతున్నాడేమోనని మందలించాను.మన్నించు.' అని వుత్తరం రాసాను.దానికి కూడా సమాధానం లేదు. నాకు మనసు చాలా నొచ్చుకుంది. వీర్రాజు గారి సాయంతో యథావిధిగా పనులు చేసుకున్నాను.పెట్టిన నెలరోజుల సెలవు పూర్తి చేసుకుని లాస్ట్ వర్కింగ్ రోజు తిరిగి స్కూలుకి వెళ్ళాను.తర్వాత ఎలాగూ వేసవిసెలవులే కనుక నేను రెస్ట్ తీసుకోవచ్చును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి