22, నవంబర్ 2020, ఆదివారం

ఫో

             ఫో!



గుండెవాకిల్ని కాస్తంత ఓరగా తెరచి

ఎదురు చూపుల్ని గుమ్మానికి పూలతోరణాలుగా కట్టి

జీవితపు రాత్రంతా వెలుగు పెంచుకునేలా

కళ్ళదీపాల్ని వెలిగించి

చిగురాశతో ఎగసిన దోస్తూ ఉంటాను

అప్పుడెప్పుడో తోటలోనో తోపులోనో

నన్ను తమచుట్టూ తిప్పుకున్న పూలపాపలు

పరిమళ భరిత స్నేహచందనాల్ని

పాదముద్రలు గా పరుచుకుంటూ వచ్చి

ముంగిట్లో ముత్యాల రంగవల్లుల్ని దిద్దుతాయనో


ఏనాడో గుండెను మీటిన సన్నాయి నాదం

తేనెసోనలా రాగాలు తీసుకుంటూ

సంగతుల్నీ స్వగతాల్ని కలుపుకుంటూ

గమకాల జ్ణాపకాల్ని తట్టిలేపుతూ

మనసుని నాట్యమయూర్ని చేస్తాయోననో


చిన్నప్పుడెప్పుడో కిటికీ తలుపు సందులో

గూడల్లిన గొంగళి పురుగు

కళ్ళెదుటే పంచరంగుల్ని పులుముకుని

పెరటి తోటలో పూలమీదుగా

ఎగురుతూ వచ్చిన సీతాకోకచిలుకై

ఏరాత్రి పూటో నా కలలో

హృదయం మీద అద్దకం పని చేస్తుందనో


ఎదురింటి మామిడి చిగుళ్ళు మేసిన కోయిలమ్మ

మండు వేసవి లోఅలసి సొమ్మసిల్లిన సమయంలో

చెవిలో అమృతబిందువులు కుమ్మరిస్తుందనో


పగలూ రాత్రీ సూర్యచంద్రుల తోడుగా భూఆవరణం నిండా దివిటీలు వెలిగించి

నిశ్చలన చిత్రమై నిలిచాను


ఇంతకాలం నిన్ను మోసుకొని నడుస్తూ నడుస్తూ

భుజాలమీద కదుములు కట్టి అలసి పోయాను

దుఃఖమా!

 ఇకనైనా నన్నూ ఈ జనాన్నీ ఈ భూమినీ విడిచి

 నీదారిని నువ్వు

 ఏ అనంతవిశ్వం లోకో

 ఏ సముద్రగర్భంలోకో ఫో!

 ఇకనైనా మమ్మల్ని

 మాకోసం నవ్వుతూ బతకనీ


_శీలా సుభద్రా దేవి.







   

18, నవంబర్ 2020, బుధవారం

కోటబొమ్మాళి జీవితం

 1961 లో మా నాన్నగారు పోయిన ఏడాది కి  మా అన్నయ్య కు శ్రీకాకుళం జిల్లా లోని కోటబొమ్మాళి అనే ఊరు లోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లో టీచర్ గా ఉద్యోగం వచ్చింది.మా రెండో అన్నయ్య  వైజాగ్ లో హాస్టల్ లో ఉండి చదువుకునే వాడు.

అమ్మా,మా రెండో అక్కా నేను విజయనగరం నుండీ రైల్లో బయలుదేరి రామచంద్రా పురమో, హరిశ్చంద్రాపురమో గుర్తు లేదు,అక్కడ దిగి ఎడ్లబండి లో కోటబొమ్మాళి కి వెళ్ళాం.అప్పటికి కోటబొమ్మాళి కి బస్సు కూడా లేదు.దారంతా గతుకుల రోడ్డు మీద ప్రయాణించి వెళ్ళాం.

ఆ ఊరులో అప్పట్లో రెండే సమాంతరంగా ఉండే వీధులు.ఒకటి బ్రాహ్మణ వీథి.రెండోది కోమట్లవీథి.ఇతర కులాల వారు మరి ఎక్కడ నివసించేవారో నాకు తెలియదు.బ్రాహ్మణ వీథిలో మాకు. అద్దెకి  ఇవ్వరు కనుక కోమట్లవీధీ లోనే మరి మాకు ఎలా ఇచ్చారో గానీ ఒకేగది ఇంట్లో అద్దెకు తీసుకుని అందులో ఉండే వాళ్ళం.గది వెనుక ఒక వసారా ఉండేది అక్కడే వంట చేసుకునే వాళ్ళం.తర్వాత పెద్ద తోట అందులో పంపర పనాస,జామ వంటి పళ్ళ చెట్లు ఉండేవి కానీ వాటి మీద చెయ్యి వెయ్యటానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చారు ఇంటి వాళ్ళు.

నాన్నగారు పోయిన తర్వాత నన్ను ఆరో తరగతి తో చదువు మానిపించారు కదా ఇక్కడ ఏడో తరగతి లో జాయిన్ చేశారు.

ఆ ఊరులో ఎవరింట్లోనూ  మరుగుదొడ్లు లేవు.దూరంగా ప్రహారీ కట్టిన బహిరంగ ప్రదేశం ఉండేది.చిన్నబకెట్ తో నీళ్ళు పట్టుకుని వెళ్ళాల్సిందే.స్నానం మాత్రం పెరట్లో చేసేవాళ్ళం.

ఊరికి చుట్టూ కొండలు ఉండటంవల్ల ఎలుగు బంట్లు రాత్రిపూట ఊర్లోకి వచ్చేసేవి. అందుకని రాత్రంతా డప్పులు వాయిస్తూ కాగడాలతో కాపలా ఉండేవారు.పాములు సరేసరి రాత్రీ పగలూ తిరుగు తూనే ఉండేవి.

ఊరులోని ఆడవాళ్ళు రోజంతా రకరకాల అప్పడాలు సకినాలు వంటివి తయారుచేయటం, (శ్రీకాకుళం జిల్లాలో రకరకాల అప్పడాలు ముఖ్యంగా పేలాలు అప్పడాలకు ప్రసిద్ధి) ఇంటిపనులు చేస్తూ ఉండే వారు.పెద్దగా బయటకు కనిపించే వారు కూడా కాదు.బడిలో ఏ క్లాసులోనూ అయిదారు మందికన్నా ఆడపిల్లలు ఉండేవారు కాదు.వారు కూడా అగ్ర వర్ణాల పిల్లలే.

కొన్నాళ్ళ క్రితం  HJ దొర అనే ఐ.పీ.ఎస్ ఉండే వారు కదా.అతను నాకు జూనియర్  క్లాసులో నూ అతని సోదరి నాకు సీనియర్ క్లాసులో ఉండేవారు.బడికి రోజూ టాంగా మీద వచ్చే వారు.దొరగారి అమ్మాయి అంటూ ఆమెని స్కూల్ లో అందరూ అపురూపంగా చూసేవారు.

ఒకసారి బళ్ళో పాటలు పోటీ  పెట్టారు. పాటల పోటీలో నాకు ఫస్ట్,ఆమెకు సెకెండ్ అని అనౌన్స్ చేసి , తర్వాత స్కూలు డే రోజున ప్రైజులు తారుమారు చేసారు.

శ్రీకాకుళం ప్రాంతాలలో మాత్రమే "నేస్తం కట్టడం" అనేది పధ్ధతో,సాంప్రదాయమో మరి చూసాను.మా తరగతిలోని నా స్నేహితురాలు ఒకరోజు మనం నేస్తం కడదామా అని అడిగింది.అంటే స్నేహం గా ఉందామని అడిగింది అనుకుని సరే అన్నాను.నన్ను ఆ పక్కనే ఉన్న చిన్న గుడి కి తీసుకెళ్ళి నాకు ఇప్పుడు గుర్తు లేదు కానీ  ప్రమాణం వంటిది చేయించింది.నేస్తం కట్టిన వాళ్ళు ఒకరినొకరు జీవితాంతం స్నేహబంధం కి కట్టుబడి ఉండాలి.ఒకరినొకరు మీరు అని మన్నించు కోవాలి.ఒకరిపేరు ఒకరు ఉఛ్ఛరించకూడదు.ఇలా ఏవో చాలా నిబంధనలు ఉన్నాయి.ఐతే నేను ఆ ఊరు వదిలి వచ్చిన తర్వాత  కుటుంబంలో వచ్చిన ఆటుపోట్లతో ఆ విషయమే మర్చిపోయాను.

ఇటీవల వ్యాసం రాయటానికి నిడదవోలు మాలతి గారి కథలూ చదువుతుంటే ఒక కథలో ఈ ప్రస్తావన ఉంది.దాంతో అవన్నీ గుర్తు వచ్చాయి .ఇంతకీ నా నేస్తం ఎలా ఉందో!!? మళ్ళీ ఒకసారి కోటబొమ్మాళి వెళ్ళి రావాలని ఉంది.

15, నవంబర్ 2020, ఆదివారం

నాకు స్పూర్తి నిచ్చిన వ్యక్తి పి.సరళాదేవి

 నాకు స్పూర్తి నిచ్చిన వ్యక్తి మా పెద్దక్కయ్య పి.సరళాదేవి .ఆమె 

డా. పి.శ్రీదేవి స్నేహప్రభావంతో 1955 నుండీ తెలుగు స్వతంత్ర లో విస్తృతంగా కథలు రాసేది.వాళ్ళు పుంగనూరు లో ఉన్నప్పటి నుండి  ఎమ్.రాజేంద్ర( జర్నలిస్టు),మధురాంతకం రాజేంద్ర గార్లు  కుటుంబ స్నేహితులు.అక్కయ్యవి మూడు కథలు సంపుటాలు,రెండు నవలికలు, తెలుగు వారి సామెతలు పై విశ్లేషణాత్మక గ్రంథం ' సామెత' ప్రచురింపబడ్డాయి.1975 తర్వాత రచనలు చేయటం మానేసింది.

  నాకు ఊహ తెలియక ముందే అక్కకి పెళ్ళి ఐపోయింది.ఆమె ఎప్పుడు విజయనగరం వచ్చినా నాకోసం బొమ్మలో మిఠాయి లో కాకుండా చిన్న చిన్న బొమ్మల పుస్తకాలు తెచ్చేది.అందువలన కూడబలుక్కుని చదివే దాన్ని . సోవియట్ లేండ్ వాళ్ళ పిల్లల పుస్తకాలు తెలుగు అనువాదాలు ఇచ్చేది.ఆ విధంగా చాలా చిన్నతనం నుండి కథలపుస్తకాలు చదవటం అలవాటైంది.

అక్క భర్త మా మామయ్యే. వాళ్ళు ఉద్యోగరీత్యా ఏ వూరు వెళ్ళినా అక్కడ పిల్లలందరినీ చేర్చి బాలానందం నడిపేది.వాళ్ళకి పాటలు, డేన్స్ లే కాకుండా కథలు చదివించే ది.సెలవుల్లో వెళ్ళినప్పుడు నేను కూడా వాళ్ళ జత చేరేదాన్ని.

  ఎనిమిదో తరగతి అయ్యాక కుటుంబకారణాల వలన ఒక ఏడాది చదువు మానిపించుతే ఏలూరు దగ్గర గోపన్న పాలెం లో అక్క ఇంట్లో ఒక ఏడాది ఉండాల్సి వచ్చింది. 

  వాళ్ళింట్లో లైబ్రరీ లోనే కాక దగ్గర లోని లైబ్రరీ కి వెళ్ళి కొంతసేపు చదువుకొని మరి రెండు పుస్తకాలు తెచ్చుకునేదాన్ని.అలా ఒక్క ఏడాది లో ఎంతోమంది ప్రముఖుల రచనలే కాక శరత్  అనువాదగ్రంథాలు కూడా చదివాను.నాకు మితృలు పుస్తకాలే.

  ఒకసారి ఏలూరులో ఆవంత్స సోమసుందర్ గారికి పెద్ద ఎత్తున ఘనసన్మానం జరుగుతుంటే  నన్ను తీసుకెళ్ళింది.సభానంతరం ఒక సాహిత్య మితృని డాబా మీద వెన్నెల్లో కవితా గోష్ఠి జరిగింది.ఎంతమందో కవులు కావ్యగానం చేస్తుంటే అద్భుతంగా అనిపించింది.అంతవరకూ కథలూ నవల్లే  చదివే దాన్ని అక్కని కవిత్వం పుస్తకాలు అడుగుతే వైతాళికులు, మహాప్రస్థానం, కృష్ణపక్షం, ముత్యాల సరాలు ఇచ్చింది.అందులోని నాకు నచ్చిన వన్నీ ఒక పాతడైరీలో రాసుకున్నాను.అది ఇప్పటికీ నా దగ్గరే  ఉంది.అప్పటి నుండి కృష్ణశాస్త్రి కవితలోని లాలిత్యం ఎంత ఇష్టమో, శ్రీ శ్రీ కవిత్వం లోని లయ, పదును అంతే ఇష్టం.

  పుస్తకం పఠనమే  కాకుండా అక్క ఎంబ్రైయిడరీ, బొమ్మలు తయారు చేయటం, లలిత సంగీతం నేర్పించేది.నేను బొమ్మలు బాగా వేస్తున్నానని నా చేత  మంచి చిత్రం వేయించీ శంకర్స్ వీక్లీ వారు కండక్ట్ చేసే బాలల చిత్రలేఖనం పోటీ కి పంపింది.బహుమతి రాలేదు కానీ సర్టిఫికెట్ వచ్చింది.నేను ఈనాడు రచయిత్రిగా, కవయిత్రి గా ఎదగటానికి గల కారణం అక్క దగ్గర ఉన్న ఏడాది కాలమే.

  ఆ ఏడాది గడిచాక తిరిగి విజయనగరం లో తొమ్మిదో తరగతిలో చేరాను.

  పుస్తక పఠనం వల్ల నేను చదువులో బాగా రాణించాను.అంతేకాక మా స్కూల్లో లిఖిత పత్రికలో కవితలే కాక

  ఛందస్సు లో కూడా పద్యాలు రాసాను.చిన్నన్నయ్య అప్పటికే కథలు రాసేవాడు.నేనూ రాసినా ఎవరైనా చూస్తే చదవకుండా కథలు రాస్తున్నారని తిడతారని చూపేదాన్నికాదు.

  తర్వాత కాలేజీ లో చేరాక కాలేజీ మేగజైన్ కి రాసే దాన్ని.డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో కొడవంటి సుభద్రా దేవి పేరుతో మూడు కథలు పొలికేక  పత్రికలో ప్రచురింపబడ్డాయి.రెండవ ఏడాది మేనత్త కొడుకు శీలా వీర్రాజు గారి తో వివాహం జరిగినా థర్డ్ ఇయర్ పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చాను.

  మా ఇంటి కి కవులు ఎక్కువగా రావటం ,కవితా సంపుటాలు ఎక్కువ చదవటం తో కవిత్వం వైపు మళ్ళిపోయినా కథలూ రాసే దాన్ని .నేను రాసిన రచనలకి అక్క స్పందించి ఉత్తరం రాసేది.

  ఎలక్షన్స్ బేనర్ల పై రాసిన ' వానా వానా కన్నీరు' కథ చదివి అక్క పెద్ద ఉత్తరం రాసింది."కుటుంబ పరిథి లోనే రాయకుండా సమాజం లోని  ఇతర సమస్యలతో రాయటం బాగుంది.ఆలోచన విస్తృతమౌతోంది.ఇలానే రాస్తుండు"అన్న తర్వాత నా రచనా పరిథి పెంచుకున్నాను.

  1996 లో కేవలం స్త్రీ చైతన్యంతో రాసిన కవితా సంపుటి" ఆవిష్కారం" అక్కకి అంకితం ఇచ్చాను.

  కేంద్ర సాహిత్య అకాడమీ వారు డా.శ్రీదేవి గురించి మోనోగ్రాఫ్ రాయమన్నప్పుడు పాత తెలుగు స్వతంత్రలు వెతుకు తుంటే  అక్కరాసిన సంపుటీకరింప బడని  కథలు  కొన్ని దొరుకుతే వాటిని నేను అక్కకి ప్రేమ పూర్వక నివాళి గా పుస్తకరూపంలో తెచ్చాను.

  అందుకే  నేను అక్కకి సాహితీ వారసురాలినని ఎప్పుడూ చెప్తుంటాను. మొదటినుంచీ నన్ను సాహిత్యం వైపు మళ్ళించిన మా పెద్దక్కయ్య పి.సరళాదేవి నాకు స్పూర్తి నుంచి ఇచ్చిన వ్యక్తి.

8, నవంబర్ 2020, ఆదివారం

 ఇప్పుడు కథలు చూద్దాం.1955 లో దద్దనాల రంగనాయకమ్మ గా  కథాసాహిత్యం తో మొదలుపెట్టినప్పటి కథల్లో ఆమె దృక్పథం .

1957 లో రాసిన " పెళ్ళెందుకు" ఇద్దరు స్నేహితురాళ్ళు   ఉత్తరాల్లో నే కథ అంతా నడుస్తుంది.పద్మ తన పెళ్ళికి రమ్మని ఆహ్వానిస్తూ కుసుమకు రాసిన ఉత్తరం తో కథ మొదలౌతుంది.ధనవంతురాలైన కుసుమ తెలియని వ్యక్తి ని పెళ్ళాడి, స్వేచ్చ ను కోల్పోయి పెళ్ళనే ఊబిలో దిగననీ హాయిగా అమ్మానాన్నలతో,అన్నతో కాలం గడుపుతానంటుంది.కానీ పద్మ మనకంటూ ఒక మనిషి ఉండాలంటే పెళ్ళిచేసుకోమంటుంది. 

 కొన్నాళ్ళకి అకస్మాత్తుగా కుసుమ తండ్రి చనిపోవడంతో అన్నావదినలు కుసుమను విసుక్కోవడం తో బాధపడిన కుసుమ పెళ్ళికి అంగీకారం తెలిపిన లేఖతో కథ ముగుస్తుంది.కథ మొత్తం లేఖలతో నడవటం ఒక విశేషం.ఇందులో వివాహ వ్యవస్థ గురించిన చర్చలో కుసుమ వాదనలో రచయిత్రి భావాలూ, స్ర్తీ చైతన్యం స్పష్టంగా ఉంటుంది.

 1961 లో ప్రభ  లో రెండు వారాలు గా వచ్చిన "విజయ" .15 ఏళ్ళ విజయకి అక్కతో పాటే పెళ్ళి చేయాలనుకుంటే చదువుకుంటానని చాలా మొండి పట్టుదల పడితే అక్క  పెళ్ళి చేసేస్తారు.స్కూల్ ఫైనల్ అయ్యాక తండ్రి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుంటుంది.ప్రైవేటుగా హిందీ పరీక్షలు పాసై,తన విద్యకాంక్ష తీర్చుకోవడానికి లైబ్రరీలో పుస్తకాలు చదవటం, పాటలు సాధన చేసి రెడియోలోపాడటం, రేడియో నాటికలలో నటించటం ఇలా ప్రతీ నిముషాన్నీ ప్రయోజనకరంగా చేసుకుంటుంది విజయ.తన భావాల్ని కథలుగా రాస్తుంది.

 ఆమెను ఇష్టపడిన వ్యక్తి అభిరుచులు ఆశయాలు మాట్లాడుకుందాం అని అడుగుతే, స్పష్టంగా చెప్పి వివాహానికి ఒప్పుకుంటుంది.అప్పుడు మళ్ళీ విజయ పెళ్ళితో పాటే 14 ఏళ్ళ చెల్లెలి కి కూడా చేస్తానంటే విజయ అభ్యంతరం చెప్పి చెల్లెల్ని తాను చదివిస్తానని చెప్పటంతో కథముగిస్తుంది.

 వివాహ బంధంలో భార్యాభర్తల మధ్య ఉండవలసిన నమ్మకం,పరస్పర ఏకీభావం వంటి చర్చలలో రచయిత్రి తదనంతరం రచనల్లో విస్తృత రూపం దాల్చటానికి వెలుగు చూపిన మొలకల్లా భావించవచ్చు.

 1967 లో యువ  లో ప్రచురితమైన"శోభనపు రాత్రి"ఒక ప్రత్యేక మైన కథ.దాంపత్య సంబంధాలలో లైంగిక జీవితం పట్ల జడత్వం ఉన్న సుజాత కారణాన శోభనం ఏవో సాకులతో వాయిదా పడుతుంది.ఆరోజు కోసం కలలుకన్న వాసుదేవరావు ఉత్తరాలు రాస్తుంటాడు.చదువు వంకతో ఏడాది పాటు మళ్ళా వాయిదా పడ్తుంది.తర్వాత తప్పని సరిగా కాపురానికి వచ్చినా రాజీపడదు.దీనినే దృశ్యాలు గా కథనం చేస్తుంది. రచయిత్రి.సుజాత అక్క వితంతువు పట్ల ఆకర్షితుడౌతాడు వాసుదేవరావు.ఆమెని ఇంట్లో వాళ్ళుమందలిస్తారు.చివరికి సుజాత కి స్వేచ్చ కల్పిస్తు వెళ్ళిపోతాడు.

 ఈమూడు కథలూ దాంపత్య సంబంధాలను చెందినవే ఐనా విభిన్న కథాంశంతో, విభిన్న దృక్కోణంలో రాసినవి.సంభాషణలో రచయిత్రి భావసాంద్రతా,స్పష్టతా, ఖచ్చితత్వం,వెల్లడౌతాయి.స్త్రీపాత్రలు మొదటినుంచీ  దృఢత్వం కలిగి ఉంటాయి.రంగనాయకమ్మకి అత్యంత ఇష్టమైన సాహిత్య పఠనానికి సంబంధించిన సంభాషణలు మూడింటిలోనూ ఉంటాయి.ఆమె తొలినాటి కథలే ఐనా ఒక ఖచ్చితమైన, నిర్ణయాత్మక మైన,సంకల్పంతో నే రచనా రంగంలో కి వచ్చినట్లుగా తెలుస్తుంది.ఏదో గాలివాటుగా,నేలవిడిచి సాము చేసే రచనలు కావు.అందుకే మొదటినుండీ రంగనాయకమ్మ గారిపై అత్యంత ఇష్టమైన రచయిత్రి.

 నాకు అప్పుడు ఇప్పుడూ కూడా అభిమాన రచయిత్రి రంగనాయకమ్మ.

 నేను ఏడో తరగతి చదువుతున్న రోజుల్లో ప్రభ  లో సీరియల్ గా వస్తున్న " కూలిన గోడలు" అమ్మకి చదివి వినిపించే దాన్ని.ఎందుకు చదివి వినిపించాలనిపించేదో తెలియదు.మధ్య మధ్య అమ్మ అందులోని సంఘటన లతో పోలిక ఉండే విషయాలూ, అనుభవాలు చెప్పేది.

 బహుషా ఆ ప్రభావమే  ‌నన్ను రచయిత్రి ని  చేసాయేమో.

 రంగనాయకమ్మ గారు 1955 లో తొలికథతో సాహిత్యరంగం లోకి వచ్చి15 కి పైగా నవలలు, ఎనిమిది కథా సంపుటాలు,రామాయణ విషవృక్షం,కేపిటల్ అనువాదం, 20 వ్యాససంపుటాలు,ఇంకా మరెన్నొ రచనలు అవిశ్రాంతంగా రాస్తూనే ఉన్నారు.

 మార్క్స్ మాయలో పడి రచనలో మరింత సూటిదనం,స్పష్టతా వచ్చినా ఒక వైపే చూసే దృష్టికోణం తో నాస్తికవాది,సనాతన వ్యతిరేకిగా వివాదాలను ఎదుర్కొంటున్నారు.

నేను  రంగనాయకమ్మ గారి రచనల్లో ఏది ఎంచుకోవాలో అనే ఆలోచనలో పడి మార్క్స్ ప్రభావానంతరం రాసిన జానకి విముక్తి నవలని పరిచయం చేయాలనుకుంటున్నాను.

 జానకి విముక్తి నవల మూడు భాగాలుగా రాసారు.1100 పేజీలకు పైనే ఉన్న దీని కథంతా చెప్పకుండా చాలా మంది చదివే ఉంటారుకనుక  కేవలం నవలలో రంగనాయకమ్మ దృక్పథాన్ని మాత్రమే  చెప్తాను.

  స్త్రీ కోసం తపన,ఆవేశం,ఆలోచన కలగలిపి, పురుషులతో పాటే స్త్రీ కి కూడా ఆర్థిక, సామాజిక, సాంసారిక,గా తనదైన స్వేచ్చ గురించి పెద్ద కాన్వాస్ తీసుకు ని చర్చించి అద్భుతంగా చిత్రించిన నవలగా జానకి విముక్తి నుంచి చెప్పుకోవచ్చు.

  చదువుకీ, సంస్కారానికి, శాస్త్రీయ దృక్పథానికి సంబంధంలేని  అవగుణాలున్న వెంకట్రావు భార్య జానకి.కాపురంలో అనేక అవమానాలు ఎదుర్కొంటుంటే చూసిన జానకీ అన్ని సత్యం ఆమెను విముక్తి చేయాలని ప్రయత్నించటం స్థూలంగా కథ.

    స్నేహితుడు మూర్తి వలన మార్క్సిస్టు దృక్పథంపెరిగిన సత్యం ఏవిదంగా జానకిని  సంస్కారించి విముక్తి చేసాడన్నది విపులంగా ఇంత పెద్ద నవలగా రాసారు

    ఈ నవలలో

    1.వైవాహిక చిహ్నాలను నిర్వహిస్తారు.

    2.బహిష్టుసమయంలోని అంటరానితనాన్ని బహిష్కరించారు

    3.స్త్రీ సమస్యల్ని స్వంతాస్తి విధానంలోనే నుండి కమ్యూనిస్టు సమాజం మాత్రమే పరిష్కరిస్తుందనే నమ్మికని ప్రకటిస్తారు.

    4.మంచిపుస్తకపఠనం వలన మానసిక వికాసం కలుగుతుందనే భావాన్ని స్పష్టం చేశారు.

    5.నిజమైన మార్క్సిస్టు ఎలా ప్రవర్తిస్తాడో రుజువు చేయడానికి ప్రయత్నించారు.

    6.అణగారిన బానిస స్థితి నుండి గౌరవ ప్రదమైన స్థితి కి ఎదగాలంటే స్త్రీ కి కావలసినది స్వయంగా శక్తి, ఆలోచన అనేది జానకి పాత్ర ద్వారా తెలియజేసారు.

    ఇందులో సుదీర్ఘమైన సిద్ధాంతచర్చలు,కుహనా కమ్యునిస్టు లనుదుయ్యబట్టటం అనేకమంది భుజాలు తడుముకునేలా జరిగిన వాదోపవాదాలు చాలా మంది కి అభ్యంతరకరంగా ఉండొచ్చు.

    మరీ సుదీర్ఘంగా ఉన్నా ఈ నవల చదవటంవల్ల పాఠకులకు ఆలోచనా పరిధి విస్తరిస్తుంది అనటానికి సందేహం అక్కర్లేదు.

    రంగనాయకమ్మ కు నరనరాన జీర్ణించుకుపోయిన మార్క్సిస్టు ఐడియాలజీ ఇందులో స్పష్టమౌతుంది.

1, నవంబర్ 2020, ఆదివారం

సాంప్రదాయానికి ఆధునికతకూ మధ్య ఐ.వి.ఎస్.అచ్యుతవల్లి కథలు

 

సాంప్రదాయానికీ ఆధునికతకు వారధి – ఐ.వీ.ఎస్. అచ్యుతవల్లి కథలు-శీలా సుభద్రాదేవి

  సాంప్రదాయానికి ఆధునికతకూ మధ్య ఐవిఎస్.అచ్యుతవల్లి కథలు

ఒక రచయిత్రి యొక్క రచనావిధానాన్ని మూల్యాంకనం చేయటం అనేది అంత సులభ సాధ్యం కాదు. వారు వారి రచనాజీవితంలో అనేక ప్రక్రియలు చేపట్టి ఉంటారు. ఆ రచనల మీద విభిన్న సంఘటనల ప్రభావం, మానసిక సంఘర్షణ, కుటుంబంలోని వత్తిడులు, సమాజంలో రాజకీయ, సాంఘిక పరిణామక్రమాలు ఇవన్నీ సాధారణంగా ఒక రచయిత్రి రచనలపై ప్రభావం కలిగించుతాయి. అందుచేత వాళ్ళ సమగ్ర రచనలన్నీ చదివినప్పుడో, లేదా ఒక ప్రక్రియలో చేసిన కృషిని పరిశీలించినప్పుడో కొంతయినా నిర్ధారణకు రాగలము. కనీసం లభ్యమైన కథలన్నీ చదవగలుగుతే కథారచనలో రచయిత్రి రచనా విధానం, కథాంశాల ఎన్నిక, శైలీ శిల్పాల్ని పట్టుకోవచ్చును.

 ఐ.వి.ఎస్. అచ్యుతవల్లిగారి కథలు లభ్యమైన అరవై వరకూ చదివి అందులో, విభిన్న కథల గురించి విశ్లేషించుకున్నప్పుడు రచయిత్రి కథన కౌశల్యాన్ని పాఠకులకు అవగాహన చేసుకోవచ్చును.

1958లో ‘జగతి’ పత్రికలో ప్రచురితమైన ‘వంచిత’ కథతో కథాప్రస్థానం మొదలుపెట్టిన అచ్యుతవల్లి 1989వరకూ ఎనిమిది కథాసంపుటాలు ప్రచురించారు. నాగావళి నవ్వింది (1973) మూగపోయిన ప్రకృతి (1964), మనస్తత్వాలు (1966), బాత్ ఏక్ రాత్ కి, అవ్యక్తాలు, అచ్యుతవల్లి కథలు ప్రత్యేకంగా చెప్పుకోదగిన కథాసంపుటాలు. ఇవే కాక 1961లో పుట్టిల్లు అనే నవలతో మొదలుపెట్టి పద్దెనిమిది నవలలు రాసినట్లుగా తెలుస్తోంది. వివాహానికి ముందు కె.వి.ఎస్. అచ్యుతవల్లి పేరుతోనూ వివాహానంతరం కొన్ని కథలు ‘రాఘవేంద్ర’ పేరుతోను రాశారు.  ‘జయశ్రీ’ మాసపత్రికలో ‘ఆజ్ అవుర్ కల్’ శీర్షికతోనూ, ఆ పత్రికలోనే ‘బాతోఁమే ఖూనీ’ శీర్షికతోనూ కాలమ్ నిర్వహిచారు. వీరు రాసిన నవల ‘ఇదెక్కడి న్యాయం’ నాలుగు భాషలలో వెండితెరకెక్కింది.

హిందీ, సంస్కృత భాషలలోనే కాక సంగీతంలోనూ ప్రవేశం ఉంది అచ్యుతవల్లికి. కేవలం గ్రామీణ జీవితమేకాక, నగర నేపథ్యంలోనూ, నాగరిక జన జీవన విధానమే కాక పేదవారి జీవితాల్ని కూడా ఒడిసిపట్టుకొని, వారి వారి జీవన సంఘర్షణలనూ సమస్యల్నీ వాటికి కారణమైన రాజకీయ, ఆర్థిక సామాజిక పరిస్థితుల్నీ అవగాహన చేసుకుని రచనలు చేశారు. సంస్కృతాంధ్రాలలో మంచి పట్టు వున్న కథలలో స్వచ్ఛమైన, లలితమైన శైలిని ఎంచుకుని పాఠకులు అందరినీ ఆకర్షించేలా రచనలు చేశారు.

‘ఇజ్జత్’ అనే పేరుతో 79-80ల మధ్య మూడు కథలు రచయిత్రి రాయటం విశేషం. 79లో రాసిన కథలో అగ్రకులానికి చెందిన ఈశ్వరయ్య కావడితో మడినీళ్ళు అందరికీ పోసి, అవసరమైనప్పుడు కార్యాలకు వంటలు చేసి పెడతాడు. అతనికి సాయంగా వచ్చిన కేశవ యువకుడు. అన్నం పెట్టని శ్రోత్రీయం సంకెళ్ళు తెంపుకొని, అవకాశాల్ని అందిపుచ్చుకునే చైతన్యం ఆశిస్తాడు. మనిషిని ముందుకు నడిపించలేని సాంప్రదాయం యెందుకని ప్రశ్నిస్తాడు. చైతన్యదీపం కాంతి భరించలేని గుడ్డివాళ్ళే గొంగళి కప్పుకు కూచుంటారు అని నమ్మిన కేశవ పట్టణంలో మిఠాయికొట్టు ప్రారంభించి అతనికి పార్టనర్స్ గా జాకబ్ అతని చెల్లెలు మార్తాని ఏర్పాటు చేసుకుని కుటుంబ పెద్దగా ఈశ్వరయ్యని తీసుకెళ్తాడు. సమాజంలో మనుగడ సాగించి గౌరవం పొందాలంటే బతకనేర్చినతనం ఈ కథలో ప్రతీ పాత్ర ద్వారా నిరూపించింది రచయిత్రి.

80లో మళ్ళీ జ్యోతి పత్రికలోనే రాసిన రెండో ‘ఇజ్జత్’ కథలో బియ్యే చదువుతున్న వాసవిని అందమైన నాగేష్ ఆడంబరంగా పెళ్ళి చేసుకొంటాడు. నాగేష్ తాను ఆర్థికంగా, హోదా మెట్లు ఎక్కటానికి భార్యని పైవాళ్ళకి కుదువపెడతాడు. అది నచ్చని వాసవి పుట్టింటికి ఎన్నిసార్లు వచ్చేసినా వాళ్ళు కూడా ఆమెని అర్థం చేసుకోరు. దాంతో భర్త తీరుకు అలవాటుపడిపోయిన వాసవి, భర్తతో విదేశాలకు వెళ్ళి ఆర్థికంగా అంతస్తులు, ఆస్థులు పెంచుకొని ఆడంబరపు బతుకుతో ఒకసారి పుట్టింటికి వస్తుంది. ధనవంతురాలైన వాసవిని పుట్టింటివాళ్ళు చూపిన ఆదరాభిమానాలు చూసి ‘నేను ఏమి పోగొట్టుకొని ఇవన్నీ పొందానో తెలుసా’ అనుకుంటూ తనని తాను పాలిచ్చే గేదెలాంటి దాన్నని, నాగేష్ దానిని పెంచేవాడు అని తనతో కుమిలిపోతుంది. ఈకథలో స్త్రీ అస్తిత్వ ఆరాటాన్ని వాసవి పాత్ర ద్వారా ప్రతిభావంతంగా చూపుతుంది రచయిత్రి. సమాజం నిర్దేశించిన సాంప్రదాయ ఆంక్షలకు లోబడి తలవంచిన వాసవి, మనసులో మరుగుతోన్న సంక్షోభాన్ని చక్కగా కథనం చేయటం అచ్యుతవల్లి కథన చాతుర్యానికి మచ్చుతునకగా ఉంది.

మూడో ఇజ్జత్ కథలో భార్య వసుమతి ఊరెళ్ళటంతో నడివయస్సులో ఉన్న రామం ఇంటిలో పనిచేసే అమ్ములు రకరకాలుగా రామాన్ని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తుంది. ఎదురింటి కుర్రాళ్ళు తనని అల్లరి పెడుతున్నారంటుంది. ఏం చెప్పినా రామం తన పొందు ఆశించకపోవడంతో రామం తన చెయ్యి పట్టుకు లాగాడని యాగీ చేస్తుంది. ఈ విషయాలు తెలుసుకున్న వసుమతికి తన భర్త స్వభావం తెలుసు కనుక అమ్ములు తమని రోడ్డెక్కించాలనుకుని తానే అగౌరవం పొందిందిలే అనుకుంటుంది.

ఈ మూడు కథల్లో మూడు విభిన్న అంశాలను మూడు దృక్కోణాలతో గౌరవ, అగౌరవాల మధ్య సున్నితరేఖని చర్చించింది.

1966లో ప్రచురితమైన ‘క్షంతవ్యం’ కథ ఆనాటి సమాజంలో ఆడపిల్లల వివాహం ఎంత దుర్భరంగా ఉండేదో, దాని కోసం స్వంత అన్నదమ్ములు, బంధువులే ఇంట్లో అద్దెకున్న అబ్బాయితోపెళ్ళి చేయటానికి నాటకమాడిన కథ. పూర్తిగా నాటకీయతతో నిండినదే అయినా రచయిత్రి కథని మొదటి నుండి చాలా సహజ సంభాషణలతో నడిపించి చివరలో కొసమెరుపులా కథానాయిక అన్న ఆడిన నాటకంగా స్పష్టం చేస్తారు. చివరి వరకూ జరిగిన కథంతా నాటకం అని తెలియనీయకుండా రాయటంలో రచయిత్రి సమర్థతను తెలియజేస్తుంది. అచ్యుతవల్లికి నాటక రచనల పట్ల గల ఆసక్తీ, నైపుణ్యం ఉండడం వల్లనే కాబోలు ఆమె మరికొన్ని నాటకాలు కూడా రాసారు. ఆనాటి తెలుగు సాహిత్యంలో నాటక రచన చేసిన రచయిత్రులు తక్కువగానే ఉన్నారు.

1976లో జ్యోతి పత్రికలో ప్రచురితమైన ‘నేను దేవిని కాను అనే పేరుతో రాసిన కథనే మరింత వివరణలతో విస్తృతపరచి అదే పేరులో 1982 జ్యోతి దీపావళి సంచికలో పెద్ద కథగా రచయిత్రి ఐ.వీ.ఎస్. అచ్యుతవల్లి రాసింది. పేద అర్చక కుటుంబంలోని పదేళ్ళ సావిత్రి అదే వూరు రంగాపురంలోని నారాయణ ఇంట్లో అతని తల్లికి చేదోడు వాదోడుగా ఉంటుంది. నారాయణ తన తల్లి వైద్యం కొరకు ఊళ్ళు తిరుగుతూ, పెళ్ళి అయ్యాక ఒకచోట స్థిరపడతాడు. కొన్నాళ్ళ తరువాత రంగాపురంలో శ్రీదేవి జన్మదిన సంబరాల గురించి పేపర్లో చదివి ఇరవై ఏళ్ళ తరువాత  దేవత సంబరాలకు వెళతారు. ఆ శ్రీదేవి ఎవరో కాదు. సావిత్రే అని తెలుసుకుంటారు. టూకీగా కథ ఇదే అయినా కథలో చాలా విషయాల గురించి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా పేద బ్రాహ్మణుల స్థితి అటు అర్చక వృత్తీ ఇటు శ్రామిక వృత్తీ చేయలేక ఆకలితో విలవిల్లాడటం చిత్రించింది అచ్యుతవల్లి. కులాల వారీగా ఆసరా కల్పించే ప్రభుత్వం ఇటువంటి వారికి తోడ్పడడెందుకనే ప్రశ్నని కూడా యీ కథలో సంధించింది. ప్రాణంతో తమ మధ్య తిరిగే మనిషిని దేవతగా, నమ్మే ప్రజల మూర్ఖత్వాన్ని, మూఢనమ్మకాల్ని విశదపరచిన కథ యిది. డెబ్భైల నాటి గ్రామీణ జీవనం, ఆరోగ్యవసతులు లేకపోవడం, జీవనాధారం లేక పొరుగూర్లకు పోవటం మొదలైన విషయాల్ని పెద్ద కథలో కూలంకుషంగా, సునిశితంగా సంఘటనల్ని జోడిస్తూ రాసింది రచయిత్రి.

సమాజం అట్టడుగున చీకటి నీడలలోని మనోవేదనల్ని మానవీయ దృక్కోణంలోంచి పరిశీలిస్తూ వైష్ణవ సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన అచ్యుతవల్లి, చాలా కథలలో పరంపరగా వచ్చిన ఆచార వ్యవహారాలను సున్నితంగా విమర్శిస్తూనో, సమర్థిస్తూనో ఒకవైపు చెబుతూ మరోవైపు స్త్రీ పాత్రలను వ్యక్తిత్వంగా ఎదిగేలా రూపొందిస్తూ అభ్యుద మార్గంలోకి నడిచేలా తీర్చిదిద్దింది.

‘ఎన్ని తరాలు గడచినా భర్త నవ్వించితే నవ్వటం, ఏడిపించితే ఏడ్వటం తప్ప ఆడవాళ్ళకు స్వయం వ్యక్తిత్వం రావటం లేదు. కొడుకైనా, సోదరుడైనా, తండ్రైనా, భర్తైనా స్త్రీని బాధించి తృప్తి చెందుతారు తప్ప ఆమె ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వరు అని 1972లో రాసిన ‘చర్విత చర్వణం’ కథలోని పాత్రతతో చెప్పించటం రచయిత్రికి గల స్త్రీ చైతన్యం, ఆత్మాభిమానం స్పష్టమౌతుంది.

‘చదువులనో, సంగీతాలనో, కట్నం ఇచ్చుకోలేకో  ఈ రోజుల్లో  ముప్ఫయ్యేళ్ళు దాటాక పెళ్ళి కాని యువతులు బోలెడు మంది ఉన్నారు అని మరొక కథలోని పాత్ర అంటుంది. ఆనాటి సమాజంలో అప్పుడప్పుడే స్త్రీ విద్య ప్రాధాన్యత పెరిగిన రోజులు. చదువుకుంటున్న ఆడపిల్లలు ఒకవైపు స్త్రీ చైతన్య స్ఫూర్తి వల్ల కావచ్చు, అభ్యుదయ భావాల వల్ల కావచ్చు, కట్నాలు ఇవ్వకుండా పెళ్ళిళ్ళు చేసుకోవాలనే ఆశయం వల్ల కావచ్చు, తనకన్నా ఎక్కువ చదువుకున్న వరుని కోసం ఎదురుచూపు కావచ్చు, తల్లిదండ్రులు కట్నాలు ఇవ్వలేక కావచ్చు, తనకన్నా చిన్నవాళ్ళను సాకవలసిన బాధ్యత వారిపై పడడం వల్ల కావచ్చు, కొంతమంది మహిళలు జీవితాంతం కన్యలుగా మిగిలిపోవటం, ముప్పయ్యేళ్ళు దాటే వరకూ పెళ్ళి కాకుండా వుండిపోయినవారు ఎక్కువగానే ఉండేవారు.

పెళ్ళి అనేది స్త్రీ జీవితానికి తప్పనిసరి కాదనీ, పెళ్ళికాకపోయినా ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఉంటే బతుకులో అపశృతులు ఉండవనీ, ‘వ్యక్తిజీవితంలో సెక్సు అనేది చాలా స్వల్పకాల పరిమితికే లోబడి వుండే దాని కోసం పెళ్ళి చేసుకుని జీవితం అంతా అనేక సమస్యలతో మానసిక అశాంతితో కృంగి కృశించాలా’ అనే భావంతో నలుగురు అన్నదమ్ములకు, ముగ్గురు అక్కలకూ భారంకాకుండా బతికిన విమల కథ ‘నిర్ణయం’.

‘ఒకరోజు’ కథలో చిరుద్యోగి జయా వెంకట్రావుల జీవితం, వాళ్ళింట్ల పనిచేసే తవిటమ్మ, నాయుడు జీవితాల్ని సాదృశ్యంగా కథని నడిపించింది రచయిత్రి రెండు కుటుంబాలూ  ఆర్థిక ఆటుపోట్లు ఎదుర్కొంటున్నవాళ్ళే. ఎంత చెట్టుకంతగాలి అన్నట్లు ఉన్నదంట్లోనే తృప్తి పడుతూ తమకు ఉన్నంత కూడా లేక చెట్లు కిందా, అరుగుల మీదా వర్షంలోనూ అవస్థలు పడుతున్న వారి కంటే తామెంతో  అదృష్టవంతులుగా తృప్తిపడడంగా రచయిత్రి ముగిస్తుంది. సంతృప్తి కలిగిన మనిషి కన్నా అదృష్టవంతులు లేరనే సందేశంతో కథని నడిపించింది.

1971లో రాసిన ‘బెటర్ హాఫ్’ కథలో ఆరేళ్ళు నిరుద్యోగిగా ఉండి, బహు సంతానంతో ఎట్టకేలకు ఉద్యోగంలో  చేరిన పురుషోత్తం, తొలి జీతం అందుకొని అన్నాళ్ళుగా అణచుకొన్న కోరికను తీర్చుకోవటానికి జీతం అంతా ఖర్చు పెట్టి భార్యాపిల్లలకు మంచి బట్టలు, బొమ్మలు, స్వీట్లు, వగైరాలన్నీ కొనుక్కొని వెళతాడు. జీతం డబ్బులు ఖర్చయితే మర్నాటి నుండి ఇంట్లో ఖర్చులు, అద్దె మొదలైనవన్నీ ఎలా గడుస్తాయనే బాధ ఉన్నా పురుషోత్తం భార్య మెత్తని మాటలతోనే భర్తకు సర్ది చెప్పి ‘ఆఫీసర్లతో పోలిక పెట్టుకోకుండా మీకన్నా కింద వాళ్ళతో పోల్చుకుంటే ఈ అవస్థలు ఉండవంటూ మర్నాడు ఆ బట్టలు షాపులో నచ్చలేదని తిరిగి ఇచ్చేయమంటుంది. ఈ విధంగా అచ్యుతవల్లి కథలలో ఒకే అంశంతో రెండు విభిన్న కుటుంబాలలో పోలికలు, వైరుధ్యాలు చూపెడుతూ ఆనందకర జీవితానికి కావలసినది సంతృప్తి అంటూ మూల్యాంకనం చేయటం రచయిత్రికి నచ్చిన కథన విధానం.

హీరో తండ్రి తన భార్య మహాయిల్లాలు అని అన్నప్పుడు ఆ రోజుల్లో అందరాడోళ్ళూ మహా యిల్లాళ్ళుగానే ఉండేవారు లెండి’ అన్న డైలాగు అచ్యుతవల్లి రాసిన పరిణీత నాటకంలో ఉంటుంది. నాటకం, నేపథ్యం అంతా ఒక మేడలోనే. అందులో తల్లీ, కూతురు నివసిస్తుంటారు. ఆ ఇంట్లోనే అద్దెకి ఒక తండ్రీ, కొడుకు ఉంటారు.  కూతురికి సంగీతం చెప్పే మాస్టారు, దగ్గర బంధువు, అద్దెకున్న మరో కుర్రాడు, అతని మిత్రుడు, పాత్రధారులు, ఒంటరి ఆడవాళ్ళుగా ఉండడంతో అందరూ  ఆమె పొందుకోసం, తాపత్రయ పడడం, చివరికి ఆ అమ్మాయి తనకు పెళ్ళయిందని భర్త విదేశాల నుండి తీసుకెళ్ళటానికి వస్తాడని చెపుతుంది. దాంతో వాళ్ళంతా ఒకటై ఆ అమ్మాయి మగవాళ్ళని చెప్పుకింద తేలుగా నొక్కి పెట్టే జిత్తులమారి అని తిట్టుకుంటుంటే నొక్కి పెట్టకపోతే కుట్టటానికి తేళ్ళు రడీగా ఉంటాయి కదా అని సమాధానం చెపుతుంది. డబ్బున్న ఒంటరి ఆడవాళ్ళని ఏ విధంగా మోసం చేయాలని చూస్తారో అటువంటి మానవ నైజం, మగవారి తీరుని బట్టబయలు చేస్తుంది రచయిత్రి.

అనారోగ్యంగా ఉన్న శ్రీమంతురాలు సునంద, మొక్కజొన్న పొత్తులు అమ్మే ఎల్లమ్మ, టీ కొట్టు అప్పిగాడు ఇలా విభిన్న వ్యక్తుల మనసులోని ఆలోచనలు, ప్రతీ ఒక్కరూ మిగతా ఇద్దరి అదృష్టానికి అసూయపడటం చెబుతూనే, వారి వారి మనోగతాలు వర్షం వచ్చిన రోజున ఏ విధమైన కల్లోలానికి గురి అవుతారో అద్భుత కథనంతో దృశ్యాల్ని కళ్ళముందు నిలబెట్టేలా రాసింది రచయిత్రి.

‘జీవితానికోతోడు’ను వెతుక్కొని వివాహబంధం ఏర్పరచుకోవడానికి వయసేమీ అడ్డంకి కాబోదని సందేశాన్ని ఇస్తుంది కథలో అచ్యుతవల్లి.

అచ్యుతవల్లి గారి స్త్రీ పాత్రలు వైవిధ్యం కలిగి ఉండడమే కాకుండా స్వంత వ్యక్తిత్వంతో సామాజిక జీవితంలోనూ, కుటుంబ జీవితంలోనూ తమదైన ప్రాతినిధ్యం కలిగినవిగా ఉంటాయి. అందుకే ‘అబల’ కథలో అచల, ‘నాతిచరామి’ కథలో జయవ్రద, ‘ఆజ్ అవుర్ కల్’ కథలో మధుర, ‘సులక్షణ’ కథలో సులక్షణ పరిణీతలో రాజ్యలక్ష్మి, ‘బెటర్ హాఫ్’లో అనసూయ, ‘మూగబోయిన ప్రకృతి’ కథలో శంకరి మొదలైన పాత్రలన్నీ కూడా సమాజంలోను కుటుంబంలోను ఆత్మవిశ్వాసంగల మహిళలకు మచ్చుతునకలుగా ఉంటాయి.

రచయిత్రి కథనురాసేటప్పుడు ఇదే రాయాలని కథకు పరిమితులు విధించుకోకుండానే, సునిశిత పరిశీలనంలో ముఖ్యంగా మధ్య తరగతి మనుషుల జీవన పార్శ్వాలను సాధారణ సరళ గంభీరభాషలోనే రాసే విధానం పాఠకులను ఆకర్షిస్తుంది. అచ్యుతవల్లి కథలలో ఎక్కువగా ప్రేమ, స్నేహం, ఆర్ద్రత, సామాజిక బాధ్యత గల మానవ మనస్తత్వాన్ని ఒడిసిపట్టుకొని రాసేటప్పుడుగానీ, ఆచార వ్యవహారాలు లోకరీతి, సాంప్రదాయాలు స్త్రీకి గల సాధారణ కోరికల్ని కూడా ఏ విధంగా కత్తెర పడతాయో చాలా సౌలభ్యంగా ఒక్కొక్కప్పుడు హాస్యభరితంగా అలవోకగా రాస్తుంది. అయితే ఏదో ఆషామాషీగా చదివేయకుండా అంతర్లీనంగా ఆయా పాత్రల పట్ల పాఠకులకు సానుభూతి కలిగేలా కధలు ఉంటాయి.

గ్రామీణ జీవితాన్ని, పల్లె అందాల్ని, పట్టి చూపే ప్రకృతి హోయల్ని కథకు నేపథ్యంగా రాస్తున్నప్పుడు కొంత భావుకతతో వాక్యాలు వాక్యాలుగా కథలో ఇమిడిపోతాయి.

అచ్యుతవల్లి కథలలో తప్పక పేర్కొనదగిన కథ ‘ముత్యాల చెరువు’ ఇందులో అరమరికలు, ఆర్థిక అసమానతలు, సామాజిక వివక్ష పట్టించుకోని అపురూప స్నేహం ఉంటుంది. గ్రామంలోని కుల వివక్ష, లైంగిక దోపిడికి బలైన స్త్రీగా దళిత స్త్రీ ముత్యాలు కథగా నడుస్తుంది. గ్రామంలోని శ్రామిక జీవులు తమకు నచ్చినచోట కూలి చేసే అవకాశం లేని పరిస్థితులు మోతుబరి కామందు ఆధిపత్య ధోరణిని వివరిస్తుంది. మతాంతర వివాహం చేసుకోదలచినందుకు వర్ణ వివక్షకు గురైన ముత్యాలు ఆవేదనను ఎంతో ఆర్ద్రతతో రాసిందీమె. బూజు పట్టిన చాదస్తపు సాంప్రదాయాలపై నిరసన వ్యక్తపరిచే స్నేహశీలి చిట్టి పాత్రని సృజించిన తీరు కథకి ఉన్నతస్థాయికి కల్పించి చిట్టితో స్నేహాన్ని అభిలషించిన ముత్యాలు చిట్టికి నచ్చిన చెరువులో పూయాల్సిన తామర ఎండిపోయిందని, ఆమె మళ్ళీ వచ్చేనాటికి చెరువు నిండా పూలు నిండేలా చేస్తానని చెప్పిన ముత్యాలు ఈతవచ్చిన ముత్యాలు చెరువులోపడి చావటమేమిటని చిట్టికే కాదు పాఠకులకూ సందేహం కలగకమానదు. ఎవరూ లేనివారు తామర దుంపల్ని చెరువులో వేస్తే చనిపోతారని ఒక పుకారును ప్రచారం చేస్తారు. బూజుపట్టిన భావాల్నీ, తిరోగమన పోకడల్ని నిరసించిన చిట్టి పాత్ర ద్వారా కథంతటినీ దృశ్యాలు, దృశ్యాలుగా చలనచిత్రంలా నడిపించింది రచయిత్రి. ముత్యాలు ప్రేమించిన క్రిస్టియన్‌ను ముత్యాలు వివాహం చేసుకోనివ్వని గ్రామకట్టుబాటు నేపథ్యంగా కథలో కనిపించని ఊహాచిత్రాన్ని పాఠకులకు దృగ్గోచరం చేస్తారు అచ్యుతవల్లి.

కుటుంబ జీవితంలోని భార్యాభర్తల దాంపత్య సంబంధాలు చర్చించిన కథ ‘అభిశంస’. వీరి కథలలో ఉన్నత, మధ్య తరగతులవేకాక అట్టడుగు వర్గాలలోని కుటుంబాలలో ఆర్థికపరమైనవేకాక సంతృప్తి జీవితానికి కావలసిన అనుబంధాలను గూర్చి చెప్పినవి కూడా చాలానే ఉన్నాయి. ఆ కోవలోనిదే పేదరికం కల్పించే ఆశలూ, ఆలోచనలూ, వాస్తవానికి, ఊహాలకి మధ్య సంఘర్షణను తెలిపే కథ ‘సన్నాట’ (1969)

‘ఎందుకోసం’ కథలో ఉద్యోగిని అయిన వేదవతి వంటి స్త్రీలు భర్త చీదరించుకుంటూ ఉన్నా భర్తని వదిలి జీవితాన్ని ధైర్యంగా కొనసాగించలేని పిరికితనాన్నీ, మిధ్యాగౌరవాల మీద అమితలోభత్వాన్నీ నిరసిస్తూ నాటికీ నేటికీ మధ్యతరగతి మహిళ మనస్తత్వంలో మార్పు రాదంటుంది రచయిత్రి.

సమాజంలోని విభిన్న వర్గాల వ్యక్తులనూ, వారి మౌలిక సమస్యలనూ, మానవ మనో విశ్లేషణలనూ అధ్యయనం చేసేలా అచ్యుతవల్లి కథలు ఉంటాయి.

పెద్దవాళ్ళు తమ జీవితానుభవాలు, అవస్థలూ తమ  సంతానం పడకూడదని వారి జీవితానుభవసారాన్ని అందజేయాలనుకుంటే పిల్లలకవి ముసలి కబుర్లలో కనిపిస్తాయంటారు అచ్యుతవల్లి.

చరమ దశలలోని వారు ఎంతటి మహానుభావులైనా నడివయస్సులో ఎంత ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారైనా వాళ్ళని చూసుకుంటూ సేవ చేయాల్సిన వారికి చిన్న చూపే అనేది కొన్ని కథలలో అచ్యుతవల్లి అక్షరబద్ధం చేసింది.

కథలకు తగిన నేపథ్యం గ్రామీణమైనా, నగరమైనా చక్కని భావుకతతో, పరిశీలనాత్మకమైన దృష్టితో వర్ణించడం సమకాలీన జీవితాల్లోని అనేక పార్శ్వాలను నిజాయితీతో తాను నమ్మిన సిద్ధాంతాల మేరకే చక్కని పఠనశీలతతో రచనలు చేయడమే ఐ.వి.ఎస్. అచ్యుతవల్లి కథలలో చూస్తాం.