5, మార్చి 2011, శనివారం

కోలా రాజ్యలక్ష్మిగారు

శ్రీమతి కోలా రాజ్యలక్ష్మిగారు మరణించారని విన్నప్పుడు ఆమెతో కలసిన జ్ఞాపకాలు మనస్సులో మెదిలాయి.సుమారు ఇరవై సంవత్సరాల క్రితం కొలారాజ్యలక్ష్మి గారు ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో రచయిత్రుల సమావేశం ఏర్పాటు చేసానని రమ్మని వాళ్ళ ఇంటికి దారి వివరిస్తూ ఆహ్వానించారు. ఆమె ఎవరో నాకు తెలియదు,పరిచయంలేదు,ఆమె ఇంటికి ఆహ్వానించానని చెప్పిన ఇతర రచయిత్రులు అప్పటికే లబ్ద ప్రతిష్టులైన వారు.అందుకని నేను వెళ్ళటానికి మొగమాటపడి వెళ్ళలేదు. ఆతర్వాత నెల యశోదారేడ్డిగారి నుండి వారి ఇంటికి సమావేశానికి రమ్మని ఫోను వచ్చింది.ఆసారి వాసిరెడ్డి సీతాదేవిగారు కూడా ఫోను చేసి తప్పక రమ్మని చెప్పటం తో వెళ్లాను.ఆ సమావేశానికి కుముద్ బెన్ జోషి కూడా వచ్చారు.అప్పుఉడే చాలామంది రచయిత్రులతో మొదటిసారి పరిచయం అయ్యింది. ఆ సమావేశం లోనే సఖ్యసాహితి పేరున రచయిత్రుల సంస్థ ఏర్పడింది. సఖ్య సాహితి కి మొదటి అధ్యక్షురాలు కోలా రాజ్యలక్ష్మి గారు.
1996 లో నా కవితా సంకలనం "ఆవిష్కారం " సఖ్య సాహితి తరపున ఆవిష్కరణ జరిపాను.ఆ సభ లో కోలా రాజ్యలక్ష్మి గారు,వాసిరెడ్డి గారు ,రావి భారతి గారు వాసా ప్రభావతి గారు పాల్గొన్నారు. కోలా రాజ్యలక్ష్మి గారు ఉన్నతపదవులు అలంకరించిన వారైన అప్పటికి చిన్నవారమైన మాలాంటి వారి తో కూడా ఎటువంటి భేషజం లేకుండా మాట్లాడే వారు.ఇటీవల కూడా ఆమె ఒక సమావేశం లో కలసి మాట్లాడారు.ఆమెకు నా నివాళి అందజేస్తున్నాను..