20, ఆగస్టు 2015, గురువారం

     1980-90 ల లో ఆంధ్రప్రదేష్ లో దూబగుంట రోశమ్మ పేరు వార్తాపత్రికలలో ముఖ్య అంశం  గా వుండేది. ఎందుకంటే బడుగు బలహీన  వర్గాల లోని సారా బాధిత స్త్రీలని కూడగట్టి నడుం బిగించి సారావ్యతిరేక వుద్యమాన్ని ముందుకు నడిపించి ఆనాటి ప్రభుత్వమూలాల్ని కదిలించిన విషయం మరచిపోలేము. ఈనాడు ఆమె ఎలాంటి దుస్థితిలో వుందో తెలియదు.
  ఆరోజుల్లో ఆమే నడిపించిన వుద్యమం ప్రేరణగా నేను 1993 లొ రాసిన కవిత ఇది .ఇప్పుడు కూడా ప్రభుత్వ ఖజానా నింపేందుకు పేద ప్రజల జీవితాల్ని మత్తులోకి నెట్టి వారిభార్యపిల్లల బతుకుల్ని బుగ్గిపాలు చేయాలని కంకణం కట్టుకుంటున్న నేపధ్యం లో మళ్ళా మరో దుబగుంట రోశమ్మలు గా మారి  చౌకమద్య నిషేదం కోసం వుద్యమంతో ముందుకు  రావాల్సి వుంది.
   ఈ  సందర్భం లో నా కవిత మరో సారి మీ ముందు పెడుతున్నాను.
    విస్ఫోటనం
ఆ చేతులు -
అక్షరాలు దిద్దింది మొదలు పరీక్షల్ని ఎదుర్కొని
పట్టాలు అందుకొన్నవి కావు
జీవితం లో అడుగడుగున కాళ్ళకు అడ్డం పడే
ముళ్ళకంపల్ని తొలగించుకొంటూ కందిన చేతులవి
కాగితాల మిద అక్షరాలు చల్లి
కవిత్వం పండించినవి కావు
అనుభవాలదారం తో కూర్చిన
పాటల పేటీకల్ని మోసుకొంటూ కలగలిసిన చేతులవి
ఒకప్పుడు కొంగు నోట్లో కుక్కుకుంటూ కన్నీళ్ళతో తడిసినవే
ఇప్పుడు నడుముకు కొంగు చెక్కుకొని బిగుసుకున్న చేతులవి
వడ్లు దంచి ,పిడకలు కొట్టి గట్టిపడినవి కనుకే
ఆత్మవిశ్వాసం  పండించుకొన్న పిడికిళ్ళై
భూమి లోపలి పొరల్లొ సైతం భయ ప్రకంపనలు కలిగించాయి
లక్షలాది చేతుల్ని కూడగట్టుకొని
సారాసీసాల్ని పగల గొట్టి విస్ఫోటనం సృష్టించాయి కనుకె
పిడుగులు పడినా చలించని
అధికార పీఠాన్ని సైతం
గజగజ వణికించాయి