27, అక్టోబర్ 2023, శుక్రవారం

పరికరాలు (నచ్చని కవిత)

~~ పరికరాలు~~ ప్రపంచంలోకి తలుపులు తెరిచామనో మానవ సంబంధాలను అర్థం చేసుకున్నామనో ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటాం ఆలోచనా దృక్పథం ఉన్నంత మాత్రాన అన్నీ సులువుగా అర్థమైపోతాయనీకాదు దేనికైనా పరికరాలు మాత్రమే దొరుకుతాయ్. అవగాహనకై వాటితో పనిచేయించటం ముఖ్యం ఎప్పటికప్పుడు ఆలోచనల్ని పదును పెడుతూనే ఉండాలి మన కార్యరంగం సమాజమే కదా ఎంత మంది మనుషులను కలిస్తే ఎన్ని సమూహహృదయాలను హత్తుకుంటే ఎంతదూరం ప్రయాణాలు చేస్తే అంతగా చూపు విశాలమవుతుంది ఆలోచన నిశితమవుతుంది. ఎప్పటికప్పుడు ఆలోచనల్లోని ఖాళీలను పూరించాలంటే మనోప్రపంచాన్నీశుధ్ధి చేసుకుంటూ ఆలోచనా పరిధి విస్తరించుకుంటూ జీవితపరిమితి తెలుసుకొంటూ మనిషి ఎదలోతుల్లోకి నిరంతరం ప్రయాణిస్తూనే ఉండాలి ఎప్పటికప్పుడు మనుషుల మధ్యా సమూహాల మధ్యాతిరుగుతూ వారి వారి భౌతిక, సామాజిక అనుభవాలు మనవికూడా అనుకున్నప్పుడే మనసులోకి నింపుకునే ప్రయత్నం చేసినపుడే సరిగ్గా అప్పుడు కదా ఆలోచనాపరికరాలకు గుర్తింపు.

25, అక్టోబర్ 2023, బుధవారం

నీడలచెట్టు నవలకు నామాట

కాలం మింగిన కాలం పుస్తకానికి ముందుమాట

~ఎం.ఎన్. రాయ్ అడుగుజాడల్లో ఎ.ఎల్.ఎన్.రావు~ ముప్పై- నలభై ఏళ్ళ క్రితం అనుకుంటాను అత్తలూరి విజయలక్ష్మి మా ఇంటికి మా స్నేహితులు భార్గవి రావుతో తన తొలి కథలపుస్తకం తో కలిసి వచ్చింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత వీర్రాజు గారు 'ఆమె అత్తలూరి లక్ష్మీనరసింహారావుగారి కూతురనుకుంటాను' అన్నారు. నాముఖంలోని ప్రశ్నను గమనించి " ఆయన ఎమ్.ఎన్ రాయ్ అనుయాయి.వ్యాసాలు రాస్తారు."అన్నారు. ఎమ్.ఎన్.రాయ్ గురించి అడుగుతే " ఎం.ఎన్.హేతువాది, మానవవాది. రాజకీయ సిద్ధాంతకర్త, రచయిత.అప్పట్లో రాయ్ ఒకసారి విశాఖ వచ్చారు.ఆయన ప్రతిపాదించిన మానవవాద ఉద్యమం గూడవల్లి, రావిశాస్త్రి ,అబ్బూరి రామకృష్ణారావు వంటి మేధావులను ఆకర్షించింది.నిజానికి మన దేశానికి ప్రత్యేక రాజ్యాంగం ఉండాలనే భావనను కూడా ప్రతిపాదించిన మొట్టమొదటి వాడు యం.ఎన్.రాయ్. రాయ్ వ్యాసాలు వారి అనుయాయులు చాలామంది అనువాదం చేసి ప్రజలకు అందించారు.ఆ అనువాదకులలో ఒకరు అత్తలూరి లక్ష్మీనరసింహా రావు గారు' అని ఆయన గురించి కూడా చెప్పారు. తెలుగులో రాయ్ ప్రభావంతో వచ్చిన పత్రికలు రాడికల్, రాడికల్ హ్యూమనిస్ట్, సమీక్ష, హేతువాది, ప్రసారిత, చార్వాక గురించి కూడా చెప్పారు.మా ఇంట్లో కూడా సమీక్షా, చార్వాక పత్రికలు ఉండేవి.మేము ఇళ్ళు మారటంలో ఎవరికో ఇచ్చేసారు. అవి ఉండి ఉంటే ఏ.ఎల్.నరసింహారావు గారి రచనలు ఏమైనా దొరికి ఉండేవేమో. తన తండ్రి జ్ణాపకాల్ని వారి సమకాలీనులనుండి సేకరించి వారిని సాహిత్య రంగంలో శాస్వత పరచాలనే విజయలక్ష్మి సంకల్పం చాలా నచ్చింది.కానీ చాలా ఆలస్యంగా మొదలుపెట్టింది.ఇప్పుడు నరసింహారావు గారి సహచరులు,సమకాలీనులు అందరూ వెళ్ళిపోయారు.కనీసం వీర్రాజుగారు ఉన్నప్పుడు సంకల్పిస్తే మరికొన్ని విషయాలు ఏవైనా తెలిసేవేమో. ఏదేమైనా కానీ రచయిత కావచ్చు కళాకారులు కావచ్చు వారి వారసులు సంకల్పిస్తే తప్ప వారంతా విస్మృతులుగా మిగిలిపోతారు. ఎం.ఎన్. రాయ్ జీవనవిధానాన్నే జీవితాంతం అనుసరించిన తన తండ్రి అత్తలూరి లక్ష్మీనరసింహారావు గారిని అలా విస్మృతులు కానీకుండా శాశ్వత్వం కల్పించే సంకల్పానికి అత్తలూరి విజయలక్ష్మి పూనుకున్నందుకు మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను.ఎ.ఎల్.నరసింహారావుగారికి స్మృత్యంజలులు.

కుమారస్వామి గారి గురించి

మా పెద్దక్కయ్య సరళాదేవి భర్త పి.కుమారస్వామి గోపన్నపాలెం లో ఉద్యోగం చేస్తున్నప్పుడు 1964-65 లో ఒక ఏడాది పాటు యూఎస్ లో ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ సంస్థ నిర్వహించిన టెక్నికల్ కో-ఆపరేషన్ కార్యక్రమం లో వ్యవసాయ విస్తరణ విద్యలో వరి వంగడాలు,సస్యరక్షణ మొదలైన వాటి గురించి పరిశోధనాత్మక శిక్షణ పొందటం కోసం వెళ్ళారు.వెళ్ళి వచ్చాక పొట్టి వంగడం తైచుంగ్ నేటివ్- 1 వరిని రాష్ట్రంలో ప్రధమంగా సామర్లకోట శిక్షణ కేంద్రంలోని ఫారంలో నాటించారు. ఆయన నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి వ్యవసాయదారులకు ఉపయోగ పడేలా 1968లో ఆధునిక వ్యవసాయ పద్ధతులు,1974లో సస్యరక్షణ, 1989లో వరిసాగు పుస్తకాలు రాసి ముద్రించారు. కుమారస్వామి ( మామయ్య) గారికి బాపట్ల వ్యవసాయ శిక్షణాలయం లో అధ్యాపకులుగా ఉద్యోగం వచ్చింది. ఆయన వరిసాగు గురించి తెలుగులో రాసిన ఆ పుస్తకాలు అన్నదాత మాసపత్రిక లో ధారావాహికగా ప్రచురితం అయ్యాయి.ఆ పుస్తకం పబ్లిసిటీ, మార్కెటింగ్ అన్నదాత వాళ్ళే చేసారు.ముఖచిత్రం రూపకల్పన వీర్రాజు గారే చేసారు. 1978కి అనుకుంటాను హైదరాబాద్ విత్తనాభివృధ్ధి సంస్థలో డెప్యూటీ డైరెక్టర్ గా బదిలీ మీద వచ్చారు. మా మామయ్య విత్తనాభివృధ్ధి సంస్థలో ఉద్యోగం చేసి ప్రభుత్వం పదవీవిరమణ వయస్సు తగ్గించినప్పుడు 1985 లో 55 ఏళ్ళకే రిటైర్ అయ్యాడు.తర్వాత స్వగ్రామమైన విజయనగరం వెళ్ళి స్థిరపడ్డారు. మామయ్య వరి వంగడం మీద రాసిన ఆ పుస్తకాలు రెండుమూడు సార్లు రీప్రింట్ చేసిన అన్నదాత పత్రిక ఆ పుస్తకం అమ్మకాల్లో ఎంత భాగం ఆయనకి ఇచ్చిందో తెలియదు. అలాగే ఒక కొత్త వంగడం రాష్ట్రంలో నాటిన మా మామయ్య పి.కుమారస్వామిని గురించి కూడా ఎవరికీ తెలియదు.

13, అక్టోబర్ 2023, శుక్రవారం

తరిమెల అమర్నాథ్ రెడ్డి

తరిమెల అమర్నాథరెడ్డిగారూ నమస్తే. మీరు ఇచ్చిన పుస్తకాలన్నీ చదివాను.అమర్ హార్ట్,అమీర్ టాక్స్ మీ మమత సంస్థ ద్వారా జరిగిన మానవీయ సేవా కార్యక్రమాలు అనుభవాలను,కథలలోనూ రాసినవే అయినా ఒకింత వ్యంగ్యాన్నీ , హాస్యాన్ని మేళవించి రాసినవే కావటాన ఆసక్తి దాయకంగానే ఉన్నాయి.మూడు పుస్తకాలు ఒకేసారి చదివినప్పుడు కొంత చర్వితచర్వణంగా అనిపించినా మీదైన పద్ధతిలో రాయటం బాగా అనిపించింది. ఉత్తమపురుషలో రాసిన రచన చదివినప్పుడు పాఠకులు సాధారణంగా అందులో మమేకం కావటం కద్దు.కానీ మీ ప్రసంగం ప్రత్యక్షంగా విన్నవారికి మాత్రం పాఠకుడి ముందు మీరు కూర్చుని ఆ కథలూ, కబుర్లు చెప్పిన అనుభూతి కల్గుతుంది.నేను మొన్ననే మీ ప్రసంగం ప్రత్యక్షంగా వినటం వలన నాకు అలానే అనిపించింది.అది మీ రచనా శైలీ విన్యాసం వలనే అని చెప్పొచ్చు. గతంలో ఎస్వీ రంగారావు రాసిన వేట కథలు చదివినప్పుడు సినిమాల్లో ఎస్వీఆర్ నటన చూసినవాళ్ళం కనుక ఆ కథలు చదువుతుంటే అలాగే ఆయన ఎదురుగా కూర్చొని కథ చెప్పినట్లు గా అనిపిస్తాయి. మంచి పఠన శైలిని కూడా మీరు ఒడిసి పట్టుకున్నందుకు అభినందనలు. ఏ అర్థరాత్రి లేపినా విసుగు లేకుండా ( మీ శ్రీమతి కూడా)హాస్పిటల్ కి పరిగెత్తటం,కుల,మత వివక్ష లేకుండా రక్తం ఇచ్చేలా వారిని ఒప్పించిన విధానం చాలా బాగుంది.రోడ్డు పక్కన వెలిసిన దేవుళ్ళకు మొక్కి ఆక్సిడెంట్స్ చేసుకున్న కుర్రాళ్ళకు ఇంటి దగ్గరే మొక్కుకుని బయల్దేరండి అని వ్యంగ్యాత్మకంగా చెప్పటం బాగుంది. డాక్టర్లు అలసత్వంతో రక్తాన్ని ఎక్కించటం ఆలస్యం చేయటంతో రక్తం దొరికి కూడా ప్రాణం నిలపలేకపోవటం గుండె చెమ్మగిల్లజేసాయి. అనేక చ‌మ‌త్కారాలు, ర‌క్త‌దాన అనుభ‌వాలు, ప్రెస్ నిర్వ‌హ‌ణ‌లో హాస్యం, మూఢ‌న‌మ్మ‌కాల‌పై విసుర్లు, అరుదైన ర‌క్తం కోసం అగ‌చాట్లు, ప్రొసీజ‌ర్స్ పేరుతో డాక్ట‌ర్ల నిర్ల‌క్ష్యం అన్నీ వాటిల్లో క‌నిపించాయి. సామాజిక స్థితులు, నిస్స‌హాయ‌మైన పేద‌రికం మొదలైనవి ఉన్నాయి. అమ‌ర్ టాక్స్‌ కథనాల్లో అనంతపురం జిల్లాలోని ఫ్యాక్ష‌న్ స్వ‌భావం, తీరుతెన్నులు ,పేద‌ల్లోని మూఢ న‌మ్మ‌కాలు, స‌మాజంలోని అనేకానేక విష‌యాల‌పై ప్ర‌త్య‌క్ష క‌థ‌నం, లేదా వ్యాఖ్యానం చదివించేలా మీదైన పద్ధతిలో వ్యంగ్య హాస్య స్పోరకంగా ఉన్నాయి. అమర్ హ్యూమ‌ర్‌తో ఎలా న‌వ్వులు విర‌జిమ్మాయో అదే విధంగా అమ‌ర్ హార్ట్ చ‌దువుతుంటే కొన్నికొన్ని సందర్భాల్లో బాధ‌గా కూడా అనిపించింది. క‌నీస వైద్యం అందుకోలేని పేద‌రికం, ఆస్ప‌త్రుల్లోని నిరాద‌ర‌ణ క‌ళ్లు త‌డి చేసాయి. ఆఖరుకు అమీర్ హ్యూమర్ లో కొన్ని తెలిసినవే అయినా కాపీయింగ్ లాంటి అనేక జరిగిన బాల్యచేష్టలు,అమాయకఅల్లరి ఇప్పటి వయసులో బాల్యమిత్రులతో పంచుకోవటం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా! మొత్తంగా ఒకవైపు మమతద్వారా మీరు చేస్తున్న కృషి చాలా గొప్పది.ఒకవైపు సమాజసేవ ,మరోవైపు అనుభవాల్ని అక్షరబద్ధం చేసి పుస్తకం ప్రచురణ చేస్తున్న మీ అంకితభావానికి నమస్సులు.

నాకు నచ్చిన కథ- వానావానా కన్నీరు

నాకు నచ్చిన నాకథ -- వానా వానా కన్నీరు. ఈ కథ రాయాలని కొద్దిగా సినాప్సిస్ రాసి పెట్టుకున్నది కాలేజీ రోజుల్లోనే ‌ ‌. 71 లో అనుకుంటాను ఎన్నికలు జరిగాయి. కాలేజీకి వెళ్ళేదారిలో ఊరంతా ఎత్తుగా రోడ్డుకు అటూఇటూ కరెంటు స్తంభాలకు పెద్ద పెద్ద బట్టలమీద నాయకుల పేర్లు ముద్రించిన బేనర్లు కట్టి ఉండటం, అప్పట్లో రోడ్లపక్కనే వినాయకచవితి పందిళ్ళు లా తడకలతో కట్టి దాని చుట్టూరా కూడా బేనర్లు కట్టి అక్కడే కార్యకర్తలు ఉండి మైకుల్లో ఎన్నికలపాటలువేస్తూ పేకాటలాడుకుంటూ కూర్చునేవారు ,అక్కడక్కడే గోచీగుడ్డలు కట్టుకుని ఆడుకుంటున్న పేద పిల్లల్నీ కూడా చూసి దీని నేపధ్యంలో కథ రాయాలని పాయింట్స్ రాసుకున్నాను. కానీ చదువుమధ్య లో వివాహం మళ్ళీ చదువు ఉమ్మడి కుటుంబం పిల్లలూ అనారోగ్యాలూ వీటితో రాయలేక పోయాను. ఇటీవల ముంగారుమొలకలు సందర్భంలో ఆడవాళ్ళు రచనలు ఎక్కువగా చేయకపోవటానికి కారణాలు ఆలోచించినప్పుడు నా స్థితి కూడా మనసులోకి వచ్చింది .చదువుకునే రోజుల్లో 1970 లో రాసినదే మొదటికథ అప్పట్లోనే ఒక నాలుగు కథలు ప్రచురింపబడినా తర్వాత 76వరకూ నేను కథలు రాసేటంత సమయం సమకూర్చుకోలేక కవిత్వంలోకి వచ్చేసాను 84లో తిరిగి ఎన్నికల ప్రచారసంరంభాలు చూసి దీనికి సంబంధించిన కథ ఎన్నికల సమయంలో రాయాలనుకున్నది గుర్తొచ్చి అదే సినాప్సిస్ ని ఉత్తరాంధ్ర మాండలికం లో కథగా రాసాను. ఈ కథలో వంటిమీద సరిగా బట్టలు కూడా లేని బడుగు జీవులు వెతలు,తానులు తానుల బట్టలను ఎన్నికల ప్రచారం బేనర్ల కోసం జండాలకోసం వృధా చేస్తూ ప్రజా జీవితాలని పట్టించుకోని నాయకులూ,వారికోసం జండాలు మోసే కార్యకర్తలు,మొదలైన ఎన్నికల సంరంభాలనీ కథలో వ్యక్తపరచడానికి ప్రయత్నం చేసాను..ఈ కథ 1987లో ప్రచురితం అయ్యింది. ఈ కథ జ్యోతి మాసపత్రికలో చదివి మా అక్క పి.సరళాదేవి పెద్ద ఉత్తరం రాసింది."కుటుంబచట్రం లో ఇరుక్కొని వాటినే కథలుగా రాయకుండా విశాలదృక్పధం తో అట్టడుగు ప్రజల జీవిత సమస్యలను తీసుకుని నువ్వు కథ రాయటం సంతోషంగా ఉంది.ఇకపై కూడా ఈవిధంగా ఇతరసమస్యలపై దృష్టి సారించి రాస్తుండమని" సలహా ఇచ్చింది. స్త్రీవాదానికి కట్టుబడి ఉండి పోకుండా సమాజంలోని అనేక సమస్యలు తీసుకునే నేను రచనలు చేయటానికి ఇదొక కారణం. నేను ఉత్తరాంధ్ర లో పుట్టిపెరిగినా రెండు కథలు మాత్రమే అక్కడి మాండలికం లో రాసాను.బహుశా నాకు ఈ కథ నచ్చాటానికి అదొక కారణమేమో. తర్వాత్తర్వాత ఉద్యోగం నా చుట్టూ విద్యార్ధులతో కలగలిసి పోవటంతో చాలా కథలను తెలంగాణ మాండలికంలో రాసాను.

8, అక్టోబర్ 2023, ఆదివారం

రంగు వెలిసిన సిత్రాలు -3

ఇప్పుడిప్పుడే వైకుంఠపాళి ఆట మొదలైంది గవ్వల్ని గలగలమనిపించే చేతులు దొంగ పందేలకు సన్నద్ధం అయ్యాయి పాముల నోటికి చిక్కకుండా ధనప్రవాహాలు పారాలి కదా నిచ్చెన మెట్లని దొరకపుచ్చుకోవాలంటే ఎన్ని సర్పయాగాలు చేయాలో ఏపందెం ఎట్లా వేయాలన్నా వెయ్యి కళ్ళ పహారాలు తప్పించుకోవాలి కదా ఏ నిచ్చెన ఎగబాకాలన్నా ఏ గెంతులు గెంతాలన్నా ఆటగాళ్ళ ఆలోచన ఒకటే ఈ పందెం బరిలో నెగ్గాలంటే ఏ పందెం కోడికి ఎంత బేరం పెట్టాలా అని ఏ బస్తీనేతని ఏ మొత్తంతో కొనాలా అని ఒక్కసారిగా చైతన్యం చిచ్చుబుడ్డై ఊరంతా వెలుగువెన్నెల వానౌతుంది సంతరించుకున్న పెళ్ళికళతో రహదారులన్నీ పెళ్ళిమంటపాలౌతాయి వాహనాలన్నీ రంగులద్దుకొని నీటిలో వదిలిన కార్తీక దీపాలౌతాయి గొంతు సవరించుకొన్న మైకులన్నీ మంటల్ని పిడుగులా వర్షించే క్యుములోనింబస్ మేఘాలౌతాయి జనంలో అలసట ఎరగని ఉత్సాహం జనసేకరణ బేరసారాల్తో గల్లీలీడర్ల ఆర్భాటాలు పండుగ ముస్తాబుతో కూడళ్ళంతటా భజనకీర్తనలు వాహనాలు పూలరథాలై వీథుల్నిండా కరపత్రాలజల్లులు విపక్షనాయకుల డొంకల్ని కదిలించి తీగల్నిలాగుతూ అవాకులూ చవాకుల్ని బాటకిరుపక్కలా గులకరాళ్ళుగా విసుర్తుంటే ఎవరు నీతిమంతులో అర్థం కాక పక్కకు తిరిగి నవ్వుల్ని బుగ్గల్లో దాచుకుంటున్న జనం రాజకీయతంత్రంలో మిత్రులెవ్వరో చిత్తుగా పడిపోయె శత్రువులెవ్వరో పెర్ముటేషన్ కాంబినేషన్ లలో క్షణక్షణానికీ మారిపోయే ఎత్తులో రకరకాలుగా రూపొందే సమీకరణాల్తో ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో అర్థంకాని అయోమయంలో జనం అంతటా ఒకటే గందరగోళం ఎన్నికలల్లో ఎన్ని కళలో! • *. *

రంగు వెలిసిన సిత్రాలు -2

*. *. * ఎప్పుడో అకస్మాత్తుగా ఎన్నికలకోడి మీడియా గూట్లోంచి కూస్తుంది అంతే అంతవరకూ నిశ్చింతగా నిద్రమత్తులో జోగుతున్న బంగారుకోడిపుంజులన్నీ ఒక్కసారిగా లేచి బద్దకపురెక్కల్ని టపటపలాడించుకుంటూ మత్తువదిలించుకుని గొంతు సవరించుకుంటూ కొక్కొరొకో మంటూ కూతలు మొదలెడ్తాయ్ ఎగరటం చేతకాని పక్షులన్నీ గెంతులేస్తుంటాయ్ ఎటుగెంతాలో తెలియని వన్నీ ఆలోచించి ఆలోచించి నెమ్మదిగా గోడమీదకి ఎగబాకుతాయ్ దేనికి తోచిన కూతల్ని అదికూస్తూ అందమైన రాగాలాపాల్ని సాధన చేస్తూ జనాల్ని ఆకర్షించటానికి విశ్వప్రయత్నాలు చేస్తాయి * . * * ముందస్తుగానే అశరీరవాణో ఆకాశవాణో శృతిపేయంగా ప్రచారగీతాల్ని గాలిలోకి పావురాల్లా ఎగరేస్తుంటే నట్టింట్లో కూచుని అచ్చక్క బుచ్చక్క కబుర్లు చెప్పే ముద్దుల ప్రియదర్శిని రంగుల పరదాలు సవరించుకుంటూ అందమైన సీతాకోకచిలుకలు ఎంచక్కని చిలకపలుకుల్తో? అభివృద్ధి పథకాలు ఫలాల్ని ముక్కున కరిచి తెచ్చిచ్చినంత సంబరంగా పాటల్తో మాటల్తో మెస్మరిజం చేస్తూ నృత్యాలతో కళ్ళకు పొరలు కప్పుతూ విశ్వరూప అభినయచాతుర్యాలతో ప్రజాస్వామ్య రంజక ప్రచారరథసారథులై జనాల్ని ఆలోచనల్ని కొల్లగొట్టి ఓటర్లుగా మార్చటానికి పాములూ నిచ్చెనల వైకుంఠపాళీ ఆటలు ఒకవైపు ! ఆవేశకావేషాల నిప్పులు కురిపిస్తూ ఎదుటివారి అభిప్రాయాలకు బ్రేకులు వేస్తూ ఒకరి సంభాషణల్లోకి ఇంకొకరు చొచ్చుకుపోయి కలగాపులగంగా అర్థరహితంగా శ్రోతలు చెవుల్ని చిల్లులు పొడుస్తూ చర్చోపచర్చలు మరోవైపు! ఎవరికెన్ని గెలుపు గుర్రాలో ఎవరికెన్ని పందెంకోళ్ళో ఏ కోటకు ఎవరు రాజో ఏప్రాంతానికి ఎవరు మంత్రో ఏరాజును ఎలా పడగొట్టాలో ఏమంత్రిని ఎలా మాటెయ్యాలో వెనకనడిచే భక్తులెందరో చేజారే బంటులెవ్వరో ఏగెలుపుకు ఎన్ని ఎత్తులో ఏనాటకానికి ఎలా తెరదించాలో ఎత్తులూ పైఎత్తులు తో చదరంగపు జిత్తులు ఇంకోవైపు !