6, ఫిబ్రవరి 2024, మంగళవారం

నడక దారిలో -37

నడక దారిలో -37 స్కూల్ లో జాయిన్ అయ్యాక ఒకరోజు ఆంధ్రవాణి నాతో "నీకు చీరలు లేవా ఈ నాలుగు చీరలే కట్టుకుంటున్నావు" అన్నప్పుడు చీరలు గురించి ఆలోచించాను.నిజమె స్కూల్ కి కట్టుకోవటానికి పనికొచ్చేవి తక్కువే ఉన్నాయి. వీర్రాజు గారికి ఖర్చులు పోను మిగతాది ఆదివారం సెకెండ్ హ్యాండ్ పుస్తకాలు షాపుల్లో ఆర్ట్ కి సంభందించిన పుస్తకాలు కొనటానికో, అప్పటి డబ్బు నిబట్టి కళాకృతులు కొనటానికో,మావేకాక ఇతరుల పుస్తకాలు ప్రచురించు కోటానికో వాడేవారు. అయితే పెళ్ళి అయిన దగ్గర్నుంచి తనకు ఆర్ట్ మీద వచ్చే డబ్బు మీద రెండు శాతం నాకు ఇచ్చేవారు.దానినే నాకోసమో,పల్లవి కోసమో వాడుకునేదాన్ని. మా ఆడబడుచులు వచ్చినప్పుడు వాళ్ళకీ,వాళ్ళు పిల్లలకీ కొనమని నాకు డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రమె మాకు కొనాలని గుర్తుకువచ్చేది ఏమో మాకు కొనుక్కోమని ఇచ్చేవారు.వాళ్ళెవ్వరూ రాని ఏడాది మాకు కొనాలని గుర్తు రాక పోవటం నాకు కోపం వచ్చేది.దాంతో మాకు అక్కర్లేదని వాళ్ళకి మాత్రమె కొనేదాన్ని.అందుచేత నాకు చీరలు తక్కువే ఉండేవి. పల్లవికి పుట్టినరోజుకి ఆయనకి బాధ్యత తెలియడానికి డబ్బులు అడిగి కొనేదాన్ని.నా దగ్గర కూడబెట్టుకున్న డబ్బులతో చవకగా వచ్చే బట్టి కొని ఏవో ఇంగ్లీష్ మాగజైన్స్ లో చూసి రకరకాల డిజైన్లలో నేనే గౌన్లు కుట్టేదాన్ని.నాకు ఉద్యోగం చేసే అవకాశం ఉంటుందనే ఆశ లేక ఒక దశలో నేను కుట్టిన డిజైనర్ గౌన్లు తీసుకొని ఒక రెడీ మేడ్ షాపులో చూపించి ఫ్యాషనబుల్ గా కుడతానని వర్క్ ఇవ్వగలరా అని అడిగాను.కాని వాళ్ళషాపుకి బొంబాయి నుండి వస్తాయని వస్తాయని చెప్పారు.నిస్పృహగా వెనుతిరిగాను. ఇక నేను ఉద్యోగంలో చేరాక ఆంధ్రవాణి మాటలతో చీరలు కొనుక్కోవాల్సిన అవసరం తెల్సింది.అంతకుముందు అప్పట్లో కట్ పీస్ చీరల్ని వచ్చేవి అవే చాలా తక్కువ ధరకు కొనుక్కుని ఇంట్లో వాడే దాన్ని. ఇప్పుడు స్కూలుకు వెళ్ళటానికి అప్పుడప్పుడు ఒకటిరెండు చీరలు కొనుక్కోక తప్పలేదు.అంతే కాకుండా నా సహోద్యోగులతో బాటూ కబళవాయి నగలషాపులో ప్రతినెలా వందరూపాయలు కట్టటం మొదలెట్టాను. రోజు బస్సులో రానూ పోనూ ఓగంటకఉ పైగా ప్రయాణం చేస్తుండటం వలన దారిలో జనాలను పరిశీలించటం అలవాటు అయ్యింది.తరుచుగా నేను చూస్తున్నదృశ్యాలూ,వింటున్న మాటలు నాకు కవితలు రాయటానికి దోహదం చేసేవి.స్కూల్లో పిల్లల్ని కదిపితే వారి నేపథ్యాలు,జీవితాలను ఉండీ ఎన్నోకథలు రాలేవి.ఉద్యోగంలో చేరాక నాకు ఒక కొత్తచూపు వచ్చినట్లయింది.ఒక్కోసారి ఆ పిల్లలో నా బాల్యం దోబూచులాడేది.అందువల్ల తరుచూ రాత్రి పడుకున్నప్పుడో,లేకపోతే మధ్యరాత్రి మెలకువ వచ్చినప్పుడో కాగితం నిండా అక్షరాలు కవితలను తీర్చేవి. అందుచేత తరుచూ కవితలు రాస్తుండేదాన్ని. తొందరలోనే నారెండు కవితాసంపుటి మోళీ పేరుతో ప్రచురితమైంది.నేను దీనికి కూడా ఆవిష్కరణసభ పెట్టలేదు . ఈ సంపుటికి కూడా పత్రికల్లో సమీక్షలు బాగా వచ్చాయి. కడియాల రామ్మోహనరాయ్ గారు ప్రత్యేకంగా అభినందించారు.అంతేకాక ఇంతవరకూ దొమ్మరిఆట చేసేవాళ్ళ గురించి ,సర్కస్ వాళ్ళు గురించి కవితలు రాలేదు అని మోళీ కవిత గురించి తాను చాలా చోట్ల ప్రస్తావించానని తెలియజేసారు. నేను ఎంతగానో సంబరపడ్డాను. ముఖ్యంగా ప్రభలో టి.ఎల్.కాంతారావుగారు కొత్తకలాలు శీర్షికన శీలావీర్రాజు ,కె.శివారెడ్డి,ఎన్.గోపీ,దేవీప్రియల సరసన నన్నూ పరిచయం చేయటం మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ ఏడాది చివర్లో మా మేడంతో " ప్రతీ సంవత్సరం ఆరో తరగతి నుండి పదో తరగతి వరకూ ఫైనల్ పరీక్షలలో మొదటి స్థానంలో వచ్చిన పిల్లలకు బహుమతులు ఇస్తాన"ని చెప్పాను.మా మేడం ఆశ్చర్యంగా చూసారు.నాకు డబ్బు బాగా ఉందేమో అనే అనుమానం మా స్కూల్ లో వాళ్ళందరికీకలిగింది.కానీ నేను చిన్నప్పటినుండి చదువుకోడానికి ఎదుర్కొన్న అవాంతరాలు,తరగతి పుస్తకం లేకుండా స్నేహితులపుస్తకాలు చూసి నోట్సులు తయారుచేసుకొని చదివిన పరిస్థితులు నన్ను వెంటాడుతూ ఉండటం వలనా,వాళ్ళముఖాలలో నా బాల్యం కనబడుతుండటం వలనా ఆ నిర్ణయం తీసుకున్నాననేది తర్వాత్తర్వాత నా స్నేహితులకు మాత్రమే తెలుసు.నేను ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకూ ఫస్ట్ వచ్చినవారికి వాళ్ళ తరగతి పుస్తకాలు ఇచ్చేదాన్ని.తొమ్మిది,పది తరగతుల వారికి నగదు రూపంలో ఇచ్చేదాన్ని.అయితే ఆ తరువాత ప్రభుత్వం పాఠ్యపుస్తకాల పంపిణీ చేస్తుండటంతో అవి కాకుండా తెలుగు, ఇంగ్లీష్, గ్రామర్ పుస్తకాలు, అట్లాస్,పరీక్షలకు అవసరమయ్యే తెలుగు వ్యాసాల పుస్తకాలు ఇవ్వటమే కాకుండా ఆయా క్లాసులకు తగినట్లుగా కథలపుస్తకాలూ బహుమతి గా ఇచ్చేదాన్ని.ఈ కార్యక్రమం ఆగష్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం రోజున జరిపేదాన్ని.దాంతో ఫస్ట్ రావటానికి పోటిపడి చదివేవారు.స్కూలు పిల్లలకే కాక టీచర్ల పిల్లలకు కూడా పిల్లల కథలపుస్తకాలు బహుమతిగా ఇస్తుండటం అలవాటు అయ్యింది .ఈ బహుమతి ప్రధానాలు నేను రిటైర్ అయ్యాక కూడా రెండుమూడు ఏళ్ళకు పైగానే కొనసాగించాను.కానీ తర్వాత అవి సక్రమంగా పిల్లలకు అందటం లేదని తెలిసి మానేసాను. స్కూల్ లో నేను చెప్పాల్సినవి హైస్కూల్ తరగతులే కావటం,పదేళ్ళ తర్వాత పాఠాలు చెప్పటం వీటివలన పని వత్తిడి ఎక్కువ గానే ఉండేది.అంతేగాక ఆ ఏడాదే పదోతరగతి సిలబస్ మారి కొత్తపుస్తకాలు వచ్చాయి.స్టాండర్డు ఎక్కువ కావటం వలన అన్ని స్కూళ్ళకీ సబ్జెక్టు వారీ టీచర్లకు కూడా ట్రైనింగ్ లు ఉండేవి.నాపోష్ట సెకండరీ గ్రేడ్ పోష్టు.నేను పాఠాలు చెప్పేది హైస్కూల్ కు.అందువలన విద్యాశాఖ ఎవరికి ఏ కార్యక్రమాలు ఏర్పాటు చేసినా నేను వెళ్ళాక తప్పని పరిస్థితి. ఒకరోజు మేడం నన్ను పిలిచి వాళ్ళ అమ్మాయి పదోతరగతి చదువుతుందనీ,తెలుగులో ఛందస్సూ,లెక్కల్లో ట్రిగొనోమెట్రి చెప్పటానికి వాళ్ళింటికి రమ్మని కోరారు.స్కూల్లో తెలుగు,లెక్కలకి సీనియర్ టీచర్లు ఉండగా నన్ను రమ్మనడం ఆశ్చర్యం కలిగినా నేనేమీ మాట్లాడలేదు.ఆ అమ్మాయి ఇంగ్లీష్ మీడియం కదా నేను తెలుగు లో చెప్తే అర్థం చేసుకోగలదో లేదో అని సందేహం వెలిబుచ్చినా కూడా మళ్ళీ ఆమే 'స్కూల్ అయ్యాక ఇంటికి వెళ్ళి మీ పాపని కూడా తీసుకొని రమ్మ'నన్నారు. సరే అని ఆ సాయంత్రం పల్లవిని తీసుకుని మేడం ఇంటికి వెళ్ళాను.మాకు టిఫిన్ ,టీ ఇచ్చి పల్లవితో మేడం కబుర్లు చెప్తుంటే నేను వాళ్ళమ్మాయి ప్రేమకు పాఠాలు చెప్పాను. వీర్రాజు గారు ఎప్పట్లా ఉద్యోగం లో బిజీగానే ఉన్నారు.1985లో తిరిగి ముఖ్య మంత్రి అయ్యాక రామారావు కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుండి, 55 సంవత్సరాలకు తగ్గించడం, గ్రామసేవకుల వ్యవస్థ రద్దు, పూజారి వ్యవస్థ రద్దు, శాసనమండలి రద్దు మొదలైనవి. ఇంకొక ముఖ్యమైనది సంగీతం అకాడమీ, సాహిత్యం అకాడమీ,నాటక అకాడమీ రద్దుచేయటం. పొట్టిి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి లో 1985 డిసెంబరు రెండోతేదీని స్థాపించి అకాడమీలన్నింటినీ అందులో కలిపేయటం సంచలనాత్మక నిర్ణయం. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం లో ఆస్థానకవిగా దాశరథి, ఆస్థాన గాయకుడిగా మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఉండేవారు.వాటిని కూడా రద్దు చేయటంతో కోపించి బాలమురళీకృష్ణ ఆంధ్రాలో కచ్చేరీలు చేయనని మద్రాసు వెళ్ళిపోయాడు. ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు తగ్గించడంతో అక్కయ్యవాళ్ళు విజయనగరం వెళ్ళిపోయారు.అయితే సుప్రీం కోర్టు అది చెల్లదని తీర్పు ఇవ్వటంతో ప్రభుత్వం వాళ్ళందరికీ కూర్చోబెట్టి మొత్తం డబ్బు ఇవ్వాల్సి వచ్చింది. ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారాల ఎంపిక ,పుస్తక ప్రచురణ మొదలైన చర్చల గురించి ఆదివారం రోజుల్లో ఇంటికి వచ్చేవారు కుందుర్తి సత్యమూర్తి. వీర్రాజు గారు వారం అంతా ప్రభుత్వ సేవలో ఉండటం చేత సెలవురోజుల్లో ఇంటికి వచ్చే కవులు రచయితల తాకిడి ఎక్కువగా ఉండేది.ఉదయం తొందరగా తయారై కూర్చుంటే రాత్రి పదివేలకు ఎవరో ఒకరు రావటం సాహిత్య చర్చలు జరుగుతూనే ఉండేవి.మాయింటికి తరుచుగా ఇంట్లో మనిషిలా అయిన వ్యక్తి నాళేశ్వరం శంకరం.ఆయన ఒక్క వారం కలవకపఓతఏ వీర్రాజు గారే ఉదయమే వాకింగ్ లా ముసారాం బ్లాగ్ లోని ఆయన ఇంటికి వెళ్ళేవారు.వాళ్ళిద్దరూ కలిసి తిరిగి గోపీగారి ఇంటికో శివారెడ్డి గారింటికో వెళ్ళేవారు.ఆ విధంగా ఇంట్లో వారికి మాత్రం వీర్రాజు గారితో మాట్లాడే అవకాశమే ఒక్కొక్కప్పుడు దొరికేది కాదు.అందుచేత పల్లవి బాధ్యత నాదే కావటంతో మేమిద్దరం స్నేహితుల్లా పాటలు పాడుకోవటం కబుర్లు చెప్పుకోవటమైనా మేమిద్దరమే. ఫ్రీవర్స్ ఫ్రంట్ తరుపున అవార్డు వచ్చిన వారితో బాటు అభ్యుదయ దృక్పథంతో రాస్తున్న కవులతో ఒకసారి కవిసమ్మేళనం నిర్వహించారు.అందులో నేనూ పాల్గొన్నాను.ఆ తర్వాత ఆ కవితలన్నింటినీ "పెన్గన్" పేరుతో ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రచురణ లో పుస్తకం గా ప్రచురించింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి