6, ఫిబ్రవరి 2024, మంగళవారం

నడక దారిలో -36

నడక దారిలో - 36 రాజమండ్రిలో పిత్రార్జితమైన ఇల్లు ఉంది.అది అమ్మేస్తే ఇక్కడ ఇల్లు సమకూర్చు కోవచ్చు అనే ఆలోచన అన్నదమ్ములకు ఉంది.ఆఖరుకు ఆ సమయం రానే వచ్చింది. ఇల్లు అమ్మకంలో రాతకోతలకోసం ముగ్గురు అన్నదమ్ములు రాజమండ్రి బయలుదేరి ఆ పని పూర్తి చేసుకుని వచ్చారు. వీర్రాజు గారు ఆడపిల్లలకు కూడా పంచాలని అనుకుంటే మా మరుదులు పడనీయలేదు.సరికదా 'వదినకు వాళ్ళన్నయ్యలు పొలం అమ్మినప్పుడు ఇవ్వలేదు కదా' అంటూ లాపాయంట్లు లాగారు.పోనీ అందరం అయిదు వేల చొప్పున వేసుకుని ఇద్దరికీ ఏడున్నర చొప్పున ఆ ఇద్దామన్నారు.దానికి కూడా గొణుక్కుంటూ,సణుక్కుంటూ ఇద్దరూ కలిసి అయిదు వేలిచ్చారు వీర్రాజు గారు పది కలిపి ఇద్దరు ఆడబడుచులకూ ఏడున్నర వేల చొప్పున ఇచ్చారు. పెద్దమరిది కృష్ణతో "నీ వాటా సొమ్ము ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తాను.ఇల్లుఏదైనా కొనుక్కుందూ గానీ,లేకపోతే విలాసాలకు ఖర్చుపెట్టేస్తావని "అన్నారు.దాంతో అతనికి కోపం వచ్చి అన్నగారి మీద "నన్ను చాతకాని వెధవలా మీరంతా చూస్తున్నారు"అంటూ మీద మీదకి వచ్చి ఫైర్ అయ్యాడు.దాంతో కోపం వచ్చి అతని వాటా డబ్బు అతనికి ఇచ్చేసారు. చిన్నమరిది అంతకు ముందు ఎప్పుడో కొన్న స్థలంలో ఇల్లు కట్టుకోవటం మొదలు పెట్టాడు.పెద్దమరిది ఇంట్లోకి కావలసిన ఫర్నీచర్ కొనేసి మిగిలినదంతా ఖర్చు పెట్టేసాడు. అక్కయ్య వాళ్ళ పక్కనే ఉన్న అపార్ట్మెంట్ అంతకు ముందు ఎప్పుడో అమ్మకానికి ఉందంటే డబ్బు లేక వదిలేసాము.అది ఇంకా ఉందా అమ్మకం అయిపోయిందా అని కనుక్కోమని అక్కయ్యతో చెప్పాము. వాళ్ళు మంచి బేరం కోసం చూస్తూ ఇంకా అమ్మలేదని తెలిసింది.వెంటనే ఇవ్వవలసినది యాభైఅయిదువేలనీ మిగతాది కోపరేటివ్ సొసైటీకి ప్రతీ ఏడాదీ కట్టాలని తెలిసింది.ఇల్లమ్మగా వచ్చిన దాంట్లో ఆడబడుచులకూ పదివేలు తీయగా మిగిలిన దానికి ఇంకా మరో ఇరవైవేలకు పైనే కావాలి,మా పేరుకి సేల్ డీడ్ డాక్యుమెంట్ లకు మరికొంతకావాలి.మిగతా డబ్బుకి ఏంచెయ్యాలని తర్జనభర్జన లో పడ్డాము. అనుకోకుండా అప్పుడే నా ఉద్యోగం అప్రూవల్ అయ్యి పదినెలల జీతం ఒకేసారి వచ్చింది.నా బంగారం ఎక్కడో పెట్టి కొంత తెచ్చారు.మా మామయ్య కొంత ఇస్తానన్నాడు.స్వాతి బలరాంకి ఈ విషయం తెలిసి అతనూ ఇస్తానని చెప్పాడు.కానీ వీర్రాజు గారు బలరాంతో "మీరు అప్పుగా ఇస్తేనే తీసుకుంటాన"ని తన షరతుని ఖచ్చితంగా చెప్పారు. అన్నీ కలిసి వచ్చి ఎలా అయితేనేం మలక్ పేట బ్రహ్మానందం నగర్ కాలనీలో మా కొరకు గూడు ఏర్పాటు చేసుకోగలిగాము.అదే 2/C అపార్ట్మెంట్. వేసవి సెలవులు రావటంతో పక్కనే అక్కయ్య వాళ్ళు ఉండటం,వాళ్ళ పనిఅమ్మాయి సాయంతో ఇల్లు శుభ్రం చేయించి,కడిగించాము. మామరుదుల కుటుంబాలు ,అక్కయ్య కుటుంబం మాత్రమే పిలిచాము. అంతకు ముందు ఎప్పుడూ మా ఇంట్లో పూజలు చేసేవాళ్ళం కాదు కనుక పూజాసామగ్రీ,దేవుడి బొమ్మలు లేవు. వీర్రాజు గారికి గల కళాకృతుల సేకరణ అభిలాష వల్ల ఏవో చిన్న చిన్న విగ్రహాలు ఉండేవి.కానీ మేమున్న ఇంట్లోనుంచి సామాను మార్చినట్లుగా ఏదయినా బొమ్మని తీసుకొని వెళ్ళి పాలు పొంగించుదాం అనుకున్నాం.ఏది తీసుకు వెళ్దామా అని ఆలోచించి బుద్దుడు విగ్రహం తీసుకు వెళ్ళి అక్కయ్య ఇంట్లోంచి కిరోసిన్ స్టౌ తీసుకొచ్చి పాలు పొంగించి కాఫీ చేసి ,బిస్కెట్లుతో పాటు ఇచ్చాము.ఆరోజు మేము నిలిచినది మా పెద్దక్క కుటుంబాన్ని,మా మరుదులు కుటుంబాల్ని మాత్రమే. వాళ్ళంతా వెళ్ళాక ఆ రాత్రి అక్కడే పడుకున్నాము. రెండు రోజుల తర్వాత బయలుదేరి విజయనగరం వెళ్ళాము,అక్కడ ఓ వారం ఉండి భువనేశ్వర్ పెద్దాడబడుచు ఇంటికి వెళ్ళాము.భువనేశ్వర్ లో ఒకవారం పాటు పర్యాటక ప్రాంతాలన్నీ తిరిగి చూసాము. మా ఇద్దరు ఆడబడుచులకు మేము ఇల్లు కొనుక్కున్న సందర్భంగా బట్టలు పెట్టాము. హైదరాబాద్ తిరిగి వచ్చాక కొత్త ఇంటికి సామాను షిఫ్ట్ చేసి వచ్చేసాము.సామాన్ల షిఫ్ట్ చేయటంలో పెద్దమరిది కృష్ణ,మల్లేష్,బాలాజీ ప్రెస్ బాలప్రసాద్,శంకరం మొదలైనవారు సహకారం అందించారు. అనుకోనివిధంగా వీర్రాజు గారికి ఒక ప్రభుత్వ సంస్థకు వేసిన చిత్రాలు తాలూకు సొమ్ము అందటంతో చాలా తొందరగానే మా మామయ్యకు, బలరాంకూ అప్పులు తీర్చేయగలిగాము.అప్పుడు మాకు ప్రశాంతత లభించింది. అక్కయ్య చిన్నమ్మాయి శర్వాణి డిగ్రీ చదువుతుంది, పెద్దమ్మాయి శ్రీదేవి డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది.పక్కనే అక్కయ్య వాళ్ళు ఉన్నారని ఎంత సంతోషించింది ,అంతా బాధా కలిగింది.ఎందుకంటే అక్కయ్యకు గత రెండు మూడేళ్ళుగా కొంత న్యూరో సమస్యతో బాధపడుతుంది.సరియైన సమయంలో చికిత్స మొదలుపెట్టటం వలన తొందరగానే కోలుకుంది. మా ఇంటికి ఎదురు లైను నుండి బీబ్లాక్స్ అంతా గవర్నమెంట్ క్వార్టర్లు.1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల కోసం కట్టిన ఇళ్ళు.కాలనీ లోని ఆఫీసు సమయంలో ఉద్యోగులకోసం రెండు మూడు బస్సులు వస్తాయి.వీర్రాజుగారు ఆఫీసు బస్సులో వెళ్ళేవారు. బీబ్లాక్స్ లోకి రావటానికి ముందు మెయిన్ రోడ్డుకు దగ్గరలోనే కుందుర్తి గారి క్వార్టర్ ఉంది.కుందుర్తి గారి అబ్బాయి సత్యమూర్తి అదే ఇంట్లో ఉండేవాడు.అందువలన ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారాల ఎంపిక ,పుస్తక ప్రచురణ మొదలైన చర్చల గురించి సెలవు రోజుల్లో ఇంటికి వచ్చేవారు ఆయనతో బాటు అతని పిల్లలు సమతా,కవితా , ఒక్కొక్కసారి సత్యమూర్తి మేనకోడళ్ళు వచ్చేవారు.ఆవిధంగా సమతా,కవితా మా ఇంట్లో పిల్లల్లాగే అయిపోయారు. పల్లవికి స్కూలుమార్చలేదు.తిలక్ నగర్ లోని శ్రీవిద్యా సెకెండరీ స్కూల్ కే ముసారాం బాగ్ వరకూ వెళ్ళి అక్కడనుంచి బస్సులో వెళ్తుంది.మా పైకి బిల్డింగ్ లో సంగీతం టీచర్ ఉందని తెలిసి పల్లవిని సంగీతం క్లాసులకు పంపేదాన్ని.మరో రెండేళ్లకే వాళ్ళు మా కింద అపార్ట్మెంట్ కొనుక్కుని వచ్చేసారు.ఆమెపేరు యజ్ణప్రభ.యజ్ణప్రభగారి అన్నయ్య శ్రీపాద పట్టాభి రాజమండ్రిలో బాగానే పేరున్న నాటకనటుడు.ఆమెతమ్ముడు జిత్ మోహన్ మిత్ర విశ్వనాథ,బాపూ మొదలగువారి చిత్రాల్లో తరుచుగా నటిస్తాడు.యజ్ణప్రభగారికి ఇద్దరూ మగపిల్లలు కావటం వలన కావచ్చు పల్లవిని స్వంతకూతురులాగే ప్రేమించేవారు.పల్లవి చేత ఢిల్లీ గంధర్వ విద్యాలయం సంగీతకాలేజీ సర్టిఫికేషన్ చేయించారు.పాటలపోటీలకు కూడా తీసుకువెళ్తాడు ఉండేవారు. ఆ తర్వాత ఆకాశవాణి లో బిగ్రేడ్ లో కూడా ఎంపిక అయ్యి పల్లవి రేడియో లో లలితసంగీతం కార్యక్రమాల్లో పాల్గొనేది. మళ్ళీ నాకబుర్లకు వస్తే నేను పనిచేస్తున్న స్కూల్ ఆర్టీసి హైస్కూల్ కనుక నాకు స్టాఫ్ బస్ పాసు ఇచ్చారు.వేసవి సెలవులు అనంతరం స్కూలు మొదలైంది.స్కూల్లో మరో ముగ్గురు కొత్త టీచర్లు వచ్చారు.అందులో ఉమారాణి నాకన్నా ఏడేళ్ళు చిన్నది.తర్వాత్తర్వాత నాకు మంచి స్నేహితురాలు అయ్యింది.మరొకరు గంటి వెంకటరమణ అప్పటికే పేరున్న రచయిత్రి.వాళ్ళిద్దరూ సంతోష్ నగర్ లో నివాసం కనుక ముగ్గురం కలిసే స్కూల్ కి వెళ్ళి వస్తూ ఉండటం తో మాకు స్నేహం పెరిగింది. మా స్కూలు ఆర్టీసీ మేనేజ్మెంట్ లో నడుస్తున్నది కావటాన గతంలో ప్రతీ ఏడాదీ ఎక్సకర్షన్ కోసం బస్సులు, డ్రైవర్లు ఎరేంజ్ చేసేవారట.అది కొంతకాలంగా ఆగిపోయింది.మళ్ళా ఆ ఏడాది పునరుద్ధరించారు.దాంతో ఆ ఏడాది అజంతా, ఎల్లోరా, ఔరంగాబాద్ మొదలగు ప్రాంతాలకు విజ్ణానయాత్ర దసరా సెలవులకు నిర్ణయించారు. హైస్కూల్ టీచర్లు అందరూ వారివారి కుటుంబసమస్యలతో ప్రయాణానికి ఇష్టపడలేదు.మా మేడం నన్ను వెళ్ళమన్నారు.పల్లవి ఇంకా తొమ్మిదో తరగతి పిల్ల వదిలి వెళ్ళటానికి నేను ఇష్టపడలేదు.కానీ మేడం "మీ అమ్మాయికి కూడా పెర్మిషన్ ఇస్తాను.తీసుకొని వెళ్ళు . హైస్కూల్ టీచర్లు ఒకరైనా ఉండక పోతే వాళ్ళని కంట్రోల్ చేయటం కష్టం"అన్నారు.కానీ మిగతా టీచర్లు ఏమనుకుంటారో అనీ,బాగుండదని పల్లవిని తీసుకు వెళ్ళలేదు. నాకు చిన్నప్పటి నుంచి ఊళ్ళు తిరిగి అన్నీ చూడటం ఇష్టం.కానీ విజయనగరం చుట్టు పట్లవఏ చూడలేదు.కృష్ణశాస్త్రి పాట ' పుడమినల్లా లవలేశము విడువక తిరగాలి ' అని ఎన్ని సార్లు పాడుకునే దాన్నో. సరే ఎలా అయితేనేం అయిదు రోజులు ఇల్లువదిలి ,పల్లవిని వదిలి బయలు దేరాను. వీర్రాజు గారికి ఫోటోగ్రఫీ అంటే గల ఇష్టంతో కెమేరా కొంటూ ఉండేవారు.అటువంటి ఒక చిన్న కెమేరాలో అజంతా శిల్పాలను, ఎల్లోరా చిత్రాలన్నీ బంధించాను.నన్ను మగపిల్లల బస్సుకు ఇంఛార్జిగా డ్యూటీ వేయటం వలన నావెనుక తొమ్మిది,పది తరగతుల పిల్లలు తిరిగేవారు.వాళ్ళు కూడా ఫొటోలకు ఫోజులు పెట్టేవారు.ఆ విధంగా కుటుంబాన్ని మర్చిపోయి పిల్లలతో ఆరురోజులూ గడిచిపోయాయి.ఆరోజులలో ఫోన్లు లేనందున కాంటాక్ట్స్ కూడా ఉండదు.ఏమైతేనేం అందరం క్షేమంగా వచ్చేసాము. ఇన్నాళ్ళూ అద్దెయిల్లు ఉండటం వలననే ఇంటిని మా అభిరుచి మేరకు అలంకరించుకుని అవకాశం లేదు.ఇప్పుడు మాకంటూ ఇల్లు ఉండటం ఎంతో ఆనందం కలిగింది.ఇంటికి అవసరమైన ఫర్నీచర్ ఒకటొకటిగా అమర్చుకున్నాము.వీర్రాజుగారు అవార్డులు వచ్చినా,ముఖచిత్రాలకు ఏవైనా ఎక్కువ సొమ్ము వచ్చినా కళాకృతులు కొనటం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ పాలనలో వారసత్వం మీద ఆధారపడిన పటేల్-పట్వారీ వ్యవస్థను రామారావు రద్దు చేయటం, హైదరాబాద్‌లో ఆసియాలోనే అతిపెద్ద బస్ స్టేషన్‌గా మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నిర్మించటం, బౌద్ధ వారసత్వాన్ని, చరిత్రను హైలైట్ చేయడానికి హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద బుద్ధ విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ లో ఏర్పాటు చేయటం, హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై తెలుగువారిలో మహనీయుల విగ్రహాలతో అలంకరించటం, విద్యావ్యవస్థలో మేలైన మార్పులు చేయటం జరిగింది. కానీ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుండి 55కి తగ్గించారు. దాంతో ఇంకా బాధ్యతలు తీరని ఉద్యోగులకు మనస్థాపంతో గుండెలు పగిలాయి. దీని ప్రభావం మామయ్య (పెద్దక్కయ్య భర్త)పై కూడా పడింది.యాభైఅయిదు నిండి పదవీవిరమణ చేయకతప్పలేదు.రెండోఅమ్మాయి శర్వాణి హెచ్.సి.యు లో తెలుగు ఎమ్మే లో చేరింది.పెద్దమ్మాయి శ్రీదేవికి సంబంధాలు చూస్తున్నారు.విజయనగరంలో వాళ్ళ ఇల్లు పూర్తిచేసుకొని వెళ్ళిపోవాలని నిర్ణయించుకుని సామాను పంపించేసారు.తీరా అప్పుడే పెళ్ళివారు శ్రీదేవిని చూడటానికి వస్తానంటే మా ఇంట్లోనే ఎరేంజ్ చేసాము.పెళ్ళి హైదరాబాద్ లోనే చేయాలని కోరటంతో అక్కయ్యవాళ్ళున్నఇల్లు ఓనర్స్ కి ఇవ్వకుండా అట్టే పెట్టుకోవాలను కుంటే ఇంటివాళ్ళు ఒప్పుకోక తాళాలు తీసుకోవటం కొంతబాధ,కోపం కలిగించింది.ఎందుకంటే ఏడేళ్ళుగా అద్దెకి ఉన్నవాళ్ళు అవసరం కోసం అడుగుతే మొండిగా అర్జంటుగా తాళాలు తీసుకు వెళ్ళిపోవటం ఒకటైతే,ఆ ఇంటివాళ్ళు అక్కయ్యకు స్నేహితులమని చెప్పుకునే సాహితీ దంపతులుకావటం మరోకారణం. పక్కనే అక్కయ్య వాళ్ళు ఉంటారన్న సంబరం తీరకుండానే ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.మళ్ళా పెళ్ళికి ముందు వస్తాం అని వెళ్ళిపోయారు.మొత్తం మీద అక్కయ్యకూతురు శ్రీదేవి పెళ్ళికి అన్నదమ్ములు,అక్కచెల్లెళ్ళం అందరం మా ఇంట్లోనే కలవటం చాలా ఆనందంగా ఉంది అక్కయ్య వాళ్ళు ఉన్న ఆ ఇంట్లోకి పల్లవి క్లాస్మేట్ సుధ వాళ్ళు రావటం కొంత మేలైంది‌.వాళ్ళతో మాకు మంచి స్నేహసంబంధాలు ఏర్పడ్డాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి