27, మే 2024, సోమవారం

నడక దారిలో -40

నడక దారిలో --40 నిమ్స్ లో వీర్రాజు గారికి గుండెకి సంబంధించిన పరీక్షలన్నీ వరుసగా చేయటం మొదలుపెట్టారు.బీపీ క్రమ క్రమంగా కంట్రోల్ లోకి వచ్చింది.ఆంజియోగ్రామ్ చేసారు.రెండు నాళాల్లో 60-70 వరకూ మూసుకుపోయాయన్నారు. "ఆంజియో ప్లాష్టీ చేయాలి" అని నిమ్స్ లో అప్పటి కార్డయాలజిష్ట్ సోమరాజు గారు బొమ్మలు వేసి మరీ వివరించారు.అప్పటికి హాస్పిటల్ లో చేరి వాడు రం రోజులు అయ్యింది.పగలంతా నేను ఉంటున్నాను.అప్పట్లో కాంటీన్ ,పేషెంట్లకు కి ఆహారం ఇవ్వటం అనేది లేదు నేనే నాకూ ,ఆయనకు భోజనం ఇంటి దగ్గర చేసి తీసుకు వచ్చేదాన్ని.పల్లవి సాయంత్రం వచ్చినప్పుడు ప్లాస్టిక్ లో పాలు ,జావా ఇటువంటివి చేసి తీసుకు వచ్చేది.రాత్రి మాత్రం నాళేశ్వరం శంకరం,ఆశారాజు,వారాల కృష్ణమూర్తిగారు, మా పెద్దమరిది రామకృష్ణ వంతులు వేసుకుని ఉండేవారు.వారు ఆ వారం రోజులూ స్వంత సోదరులుగా సహకరించారు. సాయంత్రం పూట శివారెడ్డిగారో,గోపీగారో, కందుకూరి శ్రీరాములు గారో ఇలా కవిమిత్రులు అందరూ వచ్చి కబుర్లు చెప్పేవారు.కానీ వీర్రాజు గారికి మనసునిండా భయం నిండిపోయి ఎంతగా డైవర్ట్ చేయబోయి నా దిగులు ముఖంతో వుండేవారు. ఇంకా ఆంజీయో ప్లాష్టీ ఆపరేషన్ అనేసరికి సుమారుగా పాతిక ముప్పై వేల వరకూ అవుతుందనే సరికి డబ్బు గురించి ఆలోచన మొదలైంది.అందరూ జీతాలు మీద బతికేవారే.అందుకని "డబ్బు త్వరలో సర్దుబాటు చేసుకుని అప్పుడు మళ్ళా చేరి చేసుకోవచ్చా" అని డాక్టర్ ని అడిగారు.జాగ్రత్తగా మందులు వేసుకుని, కొలెస్ట్రాల్ ని పెంచే ఆహారం తినకుండా డైట్ ప్లాన్ ఇచ్చారు.ఇక సరే నని డిస్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాము.కాని థ్రెడ్ మీల్,ఈకో వంటి కొన్ని టెస్ట్ లు వచ్చి చేయించుకోమన్నారు. హాస్పిటల్ లో టెస్టులకు కొనుక్కొని ఆ సమయానికి వెళ్ళేవాళ్ళం.మాతోపాటు వారాల కృష్ణమూర్తిగారు, ఆశారాజు గారూ కూడా వచ్చేవారు.తీరా టెస్ట్ చేయబోయేసరికి వీర్రాజు గారికి భయంతో బీపీ పెరిగి పోవటం,టెస్ట్ చేయకుండానే పంపించేయటం రెండు మూడు సార్లు జరిగింది.ఆఖరుకు ఎలాఅయితేనేం టెస్టులు జరిగాయి. సెకెండ్ ఒపీనియన్ తీసుకుంటే మంచిది అని కృష్ణమూర్తి గారు, ఆశారాజు గారూ ఆంధ్రమహిళాసభ హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తే ఆయన మరింత భయపెట్టి "ఆపరేషన్ జరిగినా మళ్ళా మళ్ళా బ్లాక్స్ వస్తూనే వుంటాయి "అనేసరికి అప్పటికే ఒకసారి ఆంజియోప్లాస్టీ చేయించుకున్న కృష్ణమూర్తిగారి ముఖం నెత్తురు చుక్క లేనట్లుగా పాలిపోయింది.ముగ్గురూ ముఖం నిండా భయం పూసుకొని ఇంటికి వచ్చారు. ఇంకా ఆ తర్వాత ఆపరేషన్ చేయించుకోవాలంటే డబ్బుకావాలి.చేయించుకున్నా మళ్ళా బ్లాక్స్ వస్తాయంటే ఎలా తర్జన భర్జనలు జరిగాయి. అంతకు నెలరోజుల ముందే నా స్నేహితురాలు ఉమారాణి చౌకలో కొనటానికి స్థలం ఎవరి ద్వారానో తీసుకుంటుంటే మేము కూడా అక్కడ కొనటానికి పదివేలు ఇచ్చాము .అది రద్దు చేసుకుని డబ్బు తీసుకున్నాం.అయితే వీర్రాజు గారు చాలా భయపడుతున్నారు.ఏం చెయ్యాలో అర్థంకాలేదు. మా క్రింద అపార్ట్మెంట్ లో ఉంటున్న సంగీతం టీచరు యజ్ణప్రభ గారు వారి కుటుంబ మిత్రులు హోమియో & అల్లోపతి డాక్టర్ రమణారావు దగ్గరకు పంపారు.రమణ్రావు గారు రిపోర్టులు చూసి " ఏం పరవాలేదు రాజుగారూ.నేను మందు ఇస్తాను.అంతా తగ్గిపోతుంది.ఆరునెలల్లో ఎవరెస్ట్ ఎక్కేయగలరు" అంటూ సరదాగా మాట్లాడేసరికి ఆయన ముఖం తేటపడింది.ఆయన మందు వాడుతూనే నిమ్స్ డాక్టర్ చెప్పిన డైట్ ప్లాను తో ఇంగ్లీష్ మందులు కూడా వాడటం మొదలెట్టారు.క్రమంగా యథావిధిగా తన కార్యక్రమాలు కొనసాగించారు. 1989-94 మధ్యకాలం ఎన్టీఆర్ రాజకీయ చరిత్రలో అత్యంత చరమదశగా చెప్పవచ్చు. ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో అధికార కాంగ్రెసు పార్టీచేతిలో అవమానాలు పొందాడు. ఈ కాలంలో కూడా నాలుగు సినిమాలలో నటించడం విశేషం. తన జీవితకథ రాస్తున్న లక్ష్మీపార్వతిని 1993 లో పెళ్ళి చేసుకోవడంఆయన వ్యక్తిగత జీవితంలోని కీలకమైన మలుపు. అప్పటినుండి నీడలు కమ్ముకున్నట్లుగా అంతా భావించారు. 1994 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి ఎన్‌టీఆర్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అదే రోజున ఆంధ్రప్రదేశ్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు పై సంతకం చేయటం విశేషం. ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు 1995 కుట్రదారుల నుండి పతనం కాకుండా తెలుగుదేశం పార్టీని కాపాడినవాడుగా పరిగణించబడటం జరిగింది.తదనంతరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయ్యాడు. ఎనభైలనుండి తెలుగు సాహిత్యంలో విరసం తో అనుబంధంగా ఒక స్త్రీ చైతన్యంతో అంతకుముందు ఎవరూ తీసుకోని ప్రతీకలతో కవిత్వం రావటం మొదలైంది.అంతకుముందే ఓల్గాతన రచనలతో కొంత సంచలనం,కొంత ఆలోచనా కల్పించటం వలన సాహిత్య రంగం ఉలికి పడింది.ఆంధ్రజ్యోతి ఆదివారం పేపరులో చేరాం శీర్షిక " చేరాతలు "లో రాస్తున్న వ్యాసాలు స్త్రీవాదం కి వెన్నుదన్నుగా ఉండటమే కాక అందులో ప్రస్తావించిన కవులూ,కవయిత్రులూ తమ కవిత్వానికి తాతాచారి ముద్ర పడినట్లు పరమానందభరితులయ్యేవారు. అప్పట్లోనే జయప్రభ, కొండవీటి సత్యవతి కలిసి లోహిత అనే పేరిట ఒక స్త్రీ వాద బులిటెన్ కొంతకాలం తీసుకు వచ్చారు.మరి ఎందుచేతనో అది ఆగిపోయింది.తర్వాత కొండవీటి సత్యవతి " భూమిక" స్త్రీవాద మాసపత్రిక ప్రారంభించింది.భూమిక ఆఫీస్ బాగ్ లింగంపల్లి లొ మా స్కూల్ కి దగ్గరగా ఉండటం వలన భూమిలో పనిచేస్తున్న సజయ స్కూల్ కి వచ్చి భూమిక కోసం నేను రాసిన రచనలు తీసుకొని వెళ్ళేది. ఓల్గా సంపాదకత్వంలో స్త్రీ వాద కవయిత్రుల కవితలు " నీలిమేఘాలు" సంకలనంగా వచ్చాయి.ఆ సంకలనం తెలుగు కవిత్వం రంగాన్ని ఒక్కసారిగా కుదుపు కుదిపేసింది.కవులూ,రచయితలూ కూడా సంఘీభావంగా రచనలు రాస్తే మరికొందరు ఆ కవితల్ని తీవ్రంగా విమర్శిస్తూ రాయటం జరిగింది. అప్పట్నుంచి కొందరు కవిమిత్రులు మీ కవిత నీలిమేఘాలు లో ఉందా అని అడుగుతూనే ఉన్నారు.అప్పటికే నా కవితాసంపుటాలు మూడు వచ్చినా బహుశా నా కవితలు అతివాదకవితలు కానందుకు తీసుకొని ఉండరులే అనుకుని మరి పట్టించుకోలేదు.అదిగాక నాకు స్కూల్ పనేకాక ఎమ్మెస్సీ చదువు, ఇంట్లో తరుచూ వచ్చిపోయే అతిథులు , ఇవికాక సాహిత్యపఠనం,రచనలూవీటన్నిటితో తలమునకలుగా సతమతమయ్యే దాన్ని.అప్పట్లో సాహిత్య సమావేశాలకు కూడా ఎక్కువగా వెళ్ళటానికి కుదిరేది కాదు. నా పరీక్షలు సాధారణంగా స్కూల్ ఆఖరిపనిదినమో,లేదా స్కూల్ తెరిచిన రోజుకో వచ్చేది.నన్ను ఇబ్బంది పెట్టటానికి క్యాజువల్ లీవులు ఉన్నాసరే ఎర్న్డ్ లీవులు కట్ చేయటం చేసేవారు.అయినాసరే నేను వాదనలకు దిగి పరీక్ష మూడ్ పాడుజేసుకోవటమెందుకని మౌనంగా ఊరుకునేదాన్ని.అయినా మొదటి ఏడాది ఒక పేపర్ ఫెయిల్ అయ్యాను. స్కూల్లో సైన్స్ టీచర్ హెచ్చెమ్ అయ్యాక ఆవిడ పోష్టులో లెక్కల టీచర్ కి స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ వచ్చింది.ఆమె కి ఇంకా ఒక్క ఏడాదిలో రిటైర్ అవుతారు హమ్మయ్య ఇంక నాకు ప్రమోషన్ కి లైన్ క్లియర్ అయినట్లే అనుకున్నాను. మా పెద్దాడబడుచు రెండో కూతురు సంగీత అత్తగారింట్లో తగువు పెట్టుకొని వచ్చేసిందట.మా పెదనాన్న కొడుకు లక్ష్మణరావు గారు వీర్రాజు గారికి పెద్ద ఉత్తరం రాస్తూ ఆ అమ్మాయి రాసిన కొన్ని ఉత్తరాన్ని జత చేసి పంపించాడు.ఆ అమ్మాయి తన తండ్రిని కూడా అగౌరవంగా పేర్కొంటూ రాయటం ఆశ్చర్యం అనిపించింది.కళ్ళసమస్య ఉన్నా పెద్ద ఉద్యోగంలో కొనసాగుతూ వీళ్ళని అభివృద్ధి కి కారణమైన తండ్రినే గౌరవించని సంగీతం తన అత్తగారింట్లో వాళ్ళని ఎంత గౌరవించి ఉంటుందా అనుకున్నాము. " ఆ పిల్లని పెంచిన విధానమే బాగులేదు.మీ యింటికి పంపుతాను.సమస్య ఏమిటో కనుక్కోండి" అని చివరకు రాసి,ఆ సంగీతని మా యింటికి పంపారు. వీర్రాజు గారు ఆ సంగీతతో మాట్లాడి విషయం తెలుసుకో అని నామీద బాధ్యత పెట్టేసి ఆయన తప్పుకున్నారు. మామూలుగా మాట్లాడుతూనే ఏవో సినిమాలు చూస్తూ సందర్భంగా యథాలాపంగా అడిగినట్లుగా అడిగాను. సంగీత టాలెంట్స్ వాళ్ళెవరూ పట్టించుకుని పొగడటం లేదట.అది విని నువ్వు వచ్చింది.ఆ పిల్ల వున్నప్పుడే వీర్రాజు గారి మిత్రులు చాలాకాలం తర్వాత వచ్చారు.ఆయనమంచి గాయకులు.ఆయన తన పాట వినిపించటం మే కాకుండా,"సుభద్రగారూ మీ పాట ఎప్పుడో మీ పెళ్ళయిన కొత్తలో విన్నాను.పాడండి" అని అడిగాడు.నేను పాటలు పాడి చాలా కాలమే అయ్యింది.అయినా గొంతు సవరించుకుని పాట పాడాను. ఆ తర్వాత "నీకు పాటలు వచ్చునని నాకు అసలు తెలియదు " అంది సంగీత. అప్పుడు "నువ్వు ఇరవై ఏళ్ళుగా వచ్చి వెళ్తున్నావు. కానీ నీకే నేను సంగీతం నేర్చుకున్నానని తెలియదు.ఎవరూ పాడమని అడగరు. మన అభిరుచులు ఆగిపోకూడదనుకుంటే ఇలా ఎప్పుడో ఒకప్పుడు తడుముకుంటుండాలి.నీలో నువ్వు సమయం దొరికినప్పుడల్లా పాడుకోవటమో,బొమ్మలు వేసుకోవటమో చేయొచ్చు కదా! వాళ్ళకి అది తెలియక పోవచ్చును. ఎప్పుడో ఒకప్పుడు గుర్తిస్తారు"అన్నాను.ఆమె ఏమీ మాట్లాడలేదు. సంగీతఆడపడుచు వీళ్ళ ఎదురు అపార్ట్మెంట్ లోనే నివసిస్తుంది.ఆమె ఉద్యోగిని కావటాన వచ్చేసరికి ఆరు దాటుతుందిట.ఆమె పిల్లలు స్కూల్ నుంచి సరాసరి సంగీతా వాళ్ళు యింటికి వస్తారట.వాళ్ళకి తినేందుకు అక్కడే ఏమైనా తయారు చేసినవి తిని,పాలు తాగి ఆడుకుంటారుట.అది సంగీతకు నచ్చలేదు.ఆడపడుచు పిల్లలకు ఆ సేవలన్నీ నేనెందుకు చేయాలి అంటుంటే నాకు ఆశ్చర్యం వేసింది. రెండేళ్ళకోసారి కుటుంబ సహితంగా నెలరోజులపాటు మా యింటికి వచ్చేసే వారు.నేను నిండునెలలతో అందరికీ వంటలేకాక బట్టలు కుడుతున్నా ఏనాడూ వాళ్ళమ్మ సాయం చేయలేదు.దానికి తోడూ ఆర్థిక పరిస్థితి బాగు లేకపోయినా బట్టలుపెట్టి మర్యాదలు చేసేదాన్ని.అప్పుడు నేను కూడా 'వీళ్ళందరికీ నేనెందుకు చాకిరీ చేయాలని అనుకొనుంటే...' అవన్నీ వీళ్ళకు గుర్తురాలేదా అనుకున్నాను. సంగీతకు డైరెక్ట్ గా కాకపోయినా సున్నితంగా చెప్పాను. రెండు నెలలు మాయింట్లోనే ఉండి మధ్యలో ఓ రెండు రోజులు మా మరిది ఇంటికి వెళ్ళి ఆ తర్వాత భువనేశ్వర్ పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మరి ఏమయిందో తెలియదు కానీ ఢిల్లీ వెళ్ళిపోయింది.అయితే వేరింటి కాపురం పెట్టారనుకుంటాను.తర్వాత సంగీతం కూడా టీచర్ గా ఉద్యోగంలో చేరింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి